హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ తన చాంబర్నుంచి డీఈఓ గిరిరాజ్, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ భువనేశ్వరీలతో కలిసి పరీక్షకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 12,079 మంది రెగ్యులర్ విద్యార్థులకోసం 64 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, శాఖా అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు చెప్పారు. పరీక్షకేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యా న్లు, లైట్లు, వైద్యసేవలు వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్ష హాల్స్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, బాలబాలికలకు వేర్వేరుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.


