ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సవాల్
హన్మకొండ చౌరస్తా: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కీలక అభివృద్ధి పనులు చేపట్టామని, మరో మూడేళ్లలో చేయనున్న పనులతో ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓలను కరపత్రాల మాదిరిగా జారీ చేశాసిందని, కమీషన్ల కక్కుర్తి కోసం పనుల ఆలస్యం చేసే పరిస్థితి తమ పాలనలో లేదని అన్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి మాదిరిగా ప్రతిపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీ అమల్లో భాగంగానే ట్రైసిటీలో యూజీడీ (అండర్గ్రౌండ్ డ్రెయినేజీ)నిర్మాణానికి రూ.5,257 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులను మంజూరు చేశారన్నారు. ఇది ఏ ఒక్కరి కృషి కాదు ప్రజల ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషి ఫలితమన్నారు. అనంతరం డీసీసీ భవన్ ఎదుట బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.


