కాళోజీ సెంటర్: విద్యార్థులకు పాఠాలు బోధించని ఉపాధ్యాయుడితో పాటు అందుకు సహకరించిన ప్రధానోపాధ్యాయురాలిపై డీఈఓ చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ రంగయ్య నాయుడు, ఏఎంఓ సుజన్ తేజ ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా 9వ తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు ఎం.నర్సయ్య నెల రోజులుగా పాఠాలు చెప్పడం లేదనే విషయాన్ని గ్రహించారు. అందుకు ప్రధానోపాధ్యాయురాలు ఆర్.మాధవి సహకరించినట్లు గుర్తించారు. ఈ మేరకు వారిద్దరికి డీఈఓ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీస్లో పేర్కొన్నారు.
కల్తీ మిరప పొడి స్వాధీనం
వరంగల్: వ్యర్థ పదార్థాలు, మిరపకాయల పొడిని కలిపి కారం కల్తీ చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం మంగళవారం వరంగల్ ఏనుమాముల పీఎస్ పరిధిలోని సాయి సిద్ధార్థ్ ఇండస్ట్రీ (మిరపకాయల పొడి– గ్రైండింగ్ వర్క్స్)పై దాడి చేసింది. ఇందులో నిందితుడి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన మిరపకాయ పొడి స్టాక్ను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు నిందితుడు బీర్తి సురేశ్ను ఏనుమాముల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్, ఎస్సై ఉప్పలయ్య, ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేశ్, ఎస్సై రాజు పాల్గొన్నారు.
పొగాకు ఉత్పత్తుల పట్టివేత
ఖిలా వరంగల్: నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్ తూర్పుకోట చెందిన పోశాల జగదీశ్వర్ నిషేధిత పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను నిల్వ చేసి పాన్షాపులు, కిరాణాషాపుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. బుధవారం ఖిలావరంగల్ తూర్పు హనుమాన్ జంక్షన్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న మిల్స్కాలనీ పోలీసులకు జగదీశ్వర్ అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతడి వద్ద బ్యాగును పరిశీలించగా రూ.44,307 విలువైన పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు.
హసన్పర్తి: కుటుంబ కలహాలతో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని సీతంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తోకల మమత(36) నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. అయితే కొంతకా లంగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో మానసిక వేదనకు గురైన మమత ఈనెల 9న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు బుధవారం తెలిపారు.


