breaking news
Devotion
-
ఈ 4 అలవాట్లుంటే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే..!
హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న గ్రంథాల్లో ఒకటైన గరుడ పురాణం అనగానే.. మనకు సాధారణంగా గుర్తొచ్చేది మరణం, ఆ తర్వాత ఆత్మ ప్రయాణం, యమలోకంలో శిక్షలు మాత్రమే. కానీ, ఇది కేవలం జీవన్మరణ రహస్యాలకే పరిమితమైన గ్రంథం కాదు! మనిషి బతికుండగా భూమిపై ఎలా జీవించాలి? ఎలాంటి ప్రవర్తనను అలవర్చుకోవాలి? ఏ విధమైన క్రమశిక్షణతో మెలగాలి? అనే ఎన్నో జీవన సూత్రాలను గరుడ పురాణంలోని 'ఆచార కాండం' అద్భుతంగా వివరిస్తుంది. ఆ వివరాలను తెలుసుకుందాం..నాలుగు తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన, పరిశుభ్రమైన, సానుకూల జీవనశైలిని ఎవరైతే అనుసరిస్తారో.. వారి జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు వైపు మార్గం సుగమం అవుతుంది. అయితే ఇది పూర్తిగా విశ్వాసాలు, మన పురాతన సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడిన సమాచారం అని ప్రేక్షకులు గమనించాలి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.. -
అమర్నాథ్ యాత్రకు.. ఇలా వెళ్లాలి..!
ప్రకృతి నడిబొడ్డున, హిమాలయాల గుండెల్లో వెలిసిన ఆ పరమశివుని సాక్షాత్కారం.. అమర్నాథ్ యాత్రకు సమయం ఆసన్నమైంది!. మంచు లింగ రూపంలో దర్శనమిచ్చే ఆ జ్యోతిర్లింగాన్ని కళ్లారా చూడాలని, జన్మ ధన్యం చేసుకోవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది యాత్ర జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీ వరకు, అంటే మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డు ప్రకటన ప్రకారం.. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ.. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తున, మైనస్ డిగ్రీల చలిలో, ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని కొండదారుల్లో సాగే ఈ ప్రయాణం.. భక్తితో పాటు ఒక పెద్ద సాహసమే..! ముఖ్యంగా మొదటిసారి వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అమర్నాథ్ యాత్రకు ఉన్న రెండు మార్గాల రహస్యం ఏంటి? వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.పర్మిట్ లేకపోతే నో ఎంట్రీ! అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి సూత్రం.. రిజిస్ట్రేషన్ అండ్ పర్మిట్. చెల్లుబాటు అయ్యే యాత్రా పర్మిట్ లేకుండా.. Shrine బోర్డు ఎవరినీ కూడా ఒక్క అడుగు ముందుకు వేయనివ్వదు. ఆఖరి నిమిషం వరకు ఆగకుండా, కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే మీ స్లాట్లను బుక్ చేసుకోవాలి. మీ పర్మిట్ పత్రాలను ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.ఆరోగ్య పరీక్షఈ యాత్రలో అత్యంత కీలకమైంది ఆరోగ్య పరీక్ష. ఈ యాత్ర సముద్ర మట్టానికి 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో సాగుతుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆథరైజ్డ్ డాక్టర్ల నుంచి కంపల్సరీగా హెల్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, బీపీ ఉన్నవారు వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతే యాత్రకు సిద్ధమవ్వాలి. యాత్రకు రెండు వారాల ముందు నుంచే రోజుకు 40 నిమిషాలు నడక, యోగా అలవాటు చేసుకుంటే కొండల్లో నడవడం చాలా సులభం అవుతుంది.పహల్గాం, బాల్టాల్ మార్గాలు..అమర్నాథ్ గుహను చేరుకోవడానికి భక్తులకు రెండు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. పహల్గాం మార్గం. ఇది కొంచెం దూరంగా ఉన్నప్పటికీ.. ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. ఈ మార్గంలో ఎత్తు అనేది క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి, మన శరీరం అక్కడి వాతావరణానికి, ఆక్సిజన్ స్థాయిలకి దశలవారీగా అలవాటు పడుతుంది. అందుకే మొదటిసారి యాత్రకు వెళ్లేవారికి ఈ మార్గమే బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రెండోది.. బాల్టాల్ మార్గం. తక్కువ సమయంలో, కేవలం ఒకే రోజులో దర్శనం పూర్తి చేసుకొని తిరిగి రావాలనుకునేవారికి ఇది అనుకూలమైనది. కానీ.. ఈ మార్గంలో కొండలు చాలా నిటారుగా, ప్రమాదకరంగా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా వంద శాతం ఫిట్నెస్ ఉన్నవారు మాత్రమే బాల్టాల్ రూట్ను తట్టుకోగలరు.హిమాలయాల వెదర్ హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు మంచు తుఫాన్ వస్తుందో ఊహించడం అసాధ్యం. అందుకే వాతావరణాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. మీ బ్యాగ్లో థర్మల్ ఇన్సల్స్, వెచ్చని జాకెట్, వాటర్ప్రూఫ్ రెయిన్కోట్, ఉన్ని టోపీ, గ్లవుజులు, గట్టి గ్రిప్ ఉండే ట్రెక్కింగ్ షూస్ తప్పనిసరిగా ఉండాలి. ఇక మీ ట్రావెల్ బ్యాగ్ని ఎంత వీలైతే అంత లైట్ వెయిట్గా ఉంచుకోవడం మంచిది. అత్యవసర వస్తువులైన.. ఆధార్ కార్డ్, యాత్రా పర్మిట్, పవర్ బ్యాంక్, టార్చ్ లైట్, వాటర్ బాటిల్, ఇన్స్టంట్ ఎనర్జీని అందజేసే డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, రోజువారీ మందులు, హ్యాండ్ శానిటైజర్ మాత్రమే వెంట తీసుకెళ్లాలి.తొందరపాటు వద్దు.. ప్రాణమే ముఖ్యం!అమర్నాథ్ దారిలో వేగంగా వెళ్లాలనే తొందరపాటు అస్సలు పనికిరాదు. శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినా, తల తిరిగినా, తలనొప్పి వచ్చినా.. ఏమాత్రం మొహమాటపడకుండా దారి పొడవునా ఉండే మెడికల్ క్యాంపుల వద్దకు వెళ్లి వైద్య బృందాన్ని సంప్రదించాలి. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలతో వచ్చేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. నడవలేని భక్తుల కోసం అక్కడ నిర్ణీత రుసుముతో పోనీ, డోలీ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే సమయం లేనివారి కోసం హెలికాప్టర్ సర్వీసులు కూడా ఉన్నాయి. యాత్ర పొడవునా నున్వాన్, బాల్టాల్, శేషనాగ్, పంచతరణి బేస్ క్యాంపుల వద్ద తాత్కాలిక టెంట్లు, లంగర్లలో ఉచిత భోజనం, తాగునీటి సౌకర్యం లభిస్తుంది. మన ఇండియన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలు అడుగడుగునా భక్తులకు రక్షణగా పహారా కాస్తూనే ఉంటాయి.అవును.. అమర్నాథ్ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక సాధన. Shrine Board చెప్పిన నిబంధనలు పాటిస్తూ.. సరైన ప్రణాళిక, ఆరోగ్య జాగ్రత్తలతో ముందడుగు వేస్తే.. ఆ భోలానాథుడి పవిత్ర దర్శనం యాత్రికుల జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోవడం ఖాయం. (చదవండి: 'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! రథయాత్ర ఎప్పుడంటే..) -
'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! ఎప్పుడంటే..
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఆధ్యాత్మిక ఉత్సవం. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవీలకు అంకితమైన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఏటా ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రను శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ఈ ఆధ్యాత్మిక రథ యాత్ర ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి గుండిచా దేవి మందిరం వరకు సాగుతుంది. అలాంటి పరవమ పవిత్రమైన ఈ రథయాత్ర ఎప్పుడు జరగనుందంటే..ఆ రోజు నుంచి ప్రారంభం..ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16, గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు జూలై 24న ముగుస్తాయి. చివరి రోజున స్వామివారు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీనినే బహుదా యాత్ర లేదా తిరుగు రథయాత్ర అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది.ఎందుకింత ప్రాముఖ్యత అంటే..రథయాత్ర దర్శనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. "రథంపై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి, మరణానంతరం మోక్షం లభిస్తుంది," అని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ జగన్నాథుడి రథాన్ని లాగే వారికి అక్షయ పుణ్యం లభిస్తుందనేది భక్తుల నమ్మకం. అలాగే ఆలయానికి రాలేని భక్తులను కలుసుకోవడానికి స్వయంగా స్వామివారే వీధుల్లోకి వస్తారనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో కుల, మత, వర్ణ భేదాలు లేకుండా లక్షలాది మంది భక్తులు పాల్గొని ఈ రథాలను లాగడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.(చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..) -
ఆత్మబోధ – జీవన మార్గం
భారతీయ తత్వశాస్త్రంలో అద్వైత వేదాంతం అత్యంత ప్రభావవంతమైనది. ఈ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఆది శంకరాచార్యులు. ఆయన రచనల్లో అత్యంత లోతైన తాత్విక సందేశాన్ని అందించే కతి నిర్వాణషట్కం. కేవలం ఆరు శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం మనిషి అసలు స్వరూపం, జీవిత పరమార్థం గురించి అద్భుతమైన వివరణ ఇస్తుంది.మనిషి తనను తాను శరీరంగా, మనస్సుగా భావించడం వల్లే అన్ని బాధలు కలుగుతున్నాయని శంకరాచార్యులు బోధించారు. మనం ‘నేను’ అని సంబోధించినప్పుడు పేరు, వత్తి, హోదా వంటి తాత్కాలిక గుర్తింపులనే వాడుతుంటాం. కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఈ మార్పులన్నిటినీ గమనిస్తూ ఉండే సాక్షియే ’ఆత్మ’. అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ శాశ్వతమైన చైతన్యం. నేను మనస్సు, బుద్ధి, అహంకారం కాదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ప్రస్తుత కాలంలో అందం, ఆస్తి, హోదా వంటి బాహ్య ఆకర్షణలే జీవిత లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమని నిర్వాణషట్కం గుర్తుచేస్తుంది.శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే. ఈ అవగాహన మనిషిలో వినయాన్ని పెంచి, బాహ్య ప్రపంచం పట్ల సమతుల్య దక్పథాన్ని కలిగిస్తుంది. మనిషి జీవితాన్ని ఎక్కువగా ఇష్టాయిష్టాలే ప్రభావితం చేస్తాయి. ఈ రాగద్వేషాల వల్లే అసంతృప్తి కలుగుతుంది. కానీ ఆత్మ స్వరూపం చిదానందం(చైతన్యం తో కూడిన ఆనందం). అది వీటికి అతీతమైనది. ఈ తాత్విక దృష్టి వల్ల ఇతరుల పట్ల అసూయ, ద్వేషం తగ్గి సమత్వ భావన పెరుగుతుంది. నేటి సమాజంలో పెరుగుతున్న విభేదాలను అరికట్టడానికి ఈ ఆలోచనా విధానం ఎంతో అవసరం. సాధారణంగా మనిషిని మరణభయం వేధిస్తుంటుంది. కానీ శరీరం నశించినా ఆత్మ నశించదనే సత్యం తెలిసినప్పుడు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది.అలాగే పాపపుణ్యాలకు, కర్మల ప్రభావానికి ఆత్మ అతీతమైనదని గ్రహించడం వల్ల గతాన్ని తలచుకుని బాధపడే మనసుకు విముక్తి లభిస్తుంది. నిర్వాణషట్కం కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక గొప్ప తాత్విక ప్రకటన. జాతి, మత, వర్గ విభజనలకు అతీతంగా అందరం ఒకే చైతన్యానికి ప్రతిరూపాలమనే సామాజిక çస్పృహను ఇది కలిగిస్తుంది. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న మనిషికి తన అంతర్గత ప్రశాంతతను వెతుక్కునేందుకు ఇది ఒక దిక్సూచి. అహంకారాన్ని వీడి తన అసలు స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మనిషికి నిజమైన విముక్తి సాధ్యమవుతుంది. – సత్యశ్రీ బాలాంత్రపు -
సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తున్నారా!
లోకమంతా గాఢనిద్రలో మునిగిపోయిన వేళ. నిశ్శబ్దం అగాధంగా ఆవరించిన ఆ అర్ధరాత్రి సమయంలో, ఎప్పుడైనా అకస్మాత్తుగా మీ కళ్ళు తెరుచుకున్నాయా? చుట్టూ శూన్యం, గుండెపై ఏదో తెలియని భారం. రేపటి జీవన పోరాటం, మోయలేని బాధ్యతలు, తీరని ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ చింతలు... ఒక్కసారిగా మదిని తొలిచేస్తూ, ఈ అనంత విశ్వం లో నేనొక్కడినే ఒంటరినైపోయానా అనే వేదన మిమ్మల్ని చుట్టుముడుతుంది.ఆ ఏకాంత క్షణంలో మీరు అస్సలు ఒంటరి కారు. ఆ నిశ్శబ్దం నిరాశ కాదు... అది విశ్వసృష్టికర్త నుండి మీకు అందిన పరమ పవిత్రమైన ఆహ్వానం! జగమంతా నిద్రిస్తున్న వేళ, ఆ రాజులకే రాజు మీకోసం అంతరంగ ఆత్మీయ సదస్సును సిద్ధం చేశాడు. మీ మనసులోని కల్లోలాన్ని తుడిచేసి, అనంతమైన ప్రశాంతతను అమృతంలా కురిపించడానికి ఆయన వేచి చూస్తున్నాడు. అయితే, దుప్పటి ముసుగులో తాత్కాలిక సుఖాన్ని పొందుతూ ఆ అమృత ఘడియలను జారవిడుచుకుంటారా, లేక ఆ పరమ ప్రభువును దర్శించుకోవడానికి మేల్కొంటారా? నిర్ణయం మీదే!శారీరక బద్ధకంపై ఆధ్యాత్మిక విజయంఎప్పుడైతే నిద్రను జయించి మీరు పరుపు వదులుతారో, అప్పుడే మీ అహంకారం నశిస్తుంది. ‘నా దేహ సుఖం కంటే, నా సృష్టికర్తను ఆరాధించడమే నా ప్రథమ కర్తవ్యం’ అని మీ అంతరాత్మ ఘోషిస్తుంది. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే, ఆ చల్లని నేలపై మీ తలను వంచి, మీ అంతరంగ రహస్యాలను దేవునికి విన్నవించుకున్నప్పుడు లభించే పరమశాంతి ఈ సృష్టిలో మరెక్కడా దొరకదు.ఆరాధనలోని ఆ నిగూఢమైన ప్రేమే దాసుడిని దేవుడికి దగ్గర చేస్తుంది. రాత్రి చివరి మూడవ భాగంలో ప్రకృతిలో ఒక అద్భుతమైన దైవిక సువాసన పరిమళిస్తుంది. అది కారుణ్యపు తలుపులు తెరుచుకునే మహత్తర సమయం. ఆ అల్లాహ్ మొదటి ఆకాశానికి దిగివచ్చి... ‘నన్నుప్రార్థించే దాసులు ఎవరున్నారు, వారి మొర ఆలకించడానికి? నన్ను అడిగేవారు ఎవరున్నారు, వారి కోరికలు తీర్చడానికి? క్షమాపణ కోరేవారు ఎవరున్నారు, వారి ΄ా΄ాలను కడిగేయడానికి?’ అని మధురంగా పలికే దివ్యక్షణాలవి.ఈ సమయంలో ప్రకృతిలోని అదృశ్య శక్తులు, పుణ్య దైవదూతలు ఎంతో చైతన్యవంతంగా సంచరిస్తూ ఉంటారు. రాత్రివేళ విధుల్లో ఉండే దైవదూతలు, పగటివేళ బాధ్యతలు స్వీకరించే దైవదూతలు పరస్పరం కలుసుకునే సంధి కాలం ఈ తెల్లవారుజాము. మీరుప్రార్థనలో నిలబడినప్పుడు, ఆ దైవదూతలు మీ పేరును ధన్యుల జాబితాలో లిఖించి, ఆ వేడుకోలును నేరుగా ఆకాశాలకు తీసుకెళ్తారు. ఆ సర్వశక్తిమంతుడే మీకు రక్షణ కవచంగా మారినప్పుడు, లోకంలో ఎలాంటి తుఫానులు వచ్చినా మీ మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది.జీవితాన్ని మార్చే ‘బరకత్’ (దైవిక అనుగ్రహం)ఉదయాన్నే నిద్రలేవడం వల్ల జీవితంలోకి ‘బరకత్’ అనే దైవిక అనుగ్రహం ప్రవాహంలా వస్తుంది. ఇది మీ సమయాన్ని, శక్తినీ రెట్టింపు చేసే దైవ వరం. ప్రవక్త ముహమ్మద్ (స) తన అనుచరుల కోసం... ‘ఓ అల్లాహ్! నా జాతికి వారి తెల్లవారుజాము సమయాల్లో అమితమైన శుభాలను ప్రసాదించు’ అని మనసారాప్రార్థించారు. ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మీ కాలానికి ఒక అదృశ్యమైన దైవికహస్తం తోడవుతుంది. మీ పనులు సులువవుతాయి, హృదయం తేలికవుతుంది. ఇతరులు రోజంతా చేసే పనిని మీరు కేవలం కొన్ని గంటల్లోనే అలవోకగా పూర్తి చేయగలుగుతారు.షైతాను సంకెళ్ళను తెంచేయండిమనం నిద్రిస్తున్నప్పుడు షైతాను మన తల వెనుక మూడు బలమైన ముడులను వేస్తాడని ఆధ్యాత్మిక సత్యాలు చెప్తున్నాయి. ఆ అదృశ్య సంకెళ్ళను తెంచడానికి ఒకే ఒక్క దివ్య ఔషధం1. మీరు నిద్ర లేచి అల్లాహ్ను స్మరించుకున్న క్షణంలో మొదటి ముడి విడిపోతుంది.2. ప్రార్థన కోసం పవిత్రమైన శుద్ధి (వజూ) చేసుకున్నప్పుడు రెండవ ముడి విడిపోతుంది.3. ప్రార్థన (నమాజ్) లో దేవుని ముందు నిలబడినప్పుడు మూడవ ముడి పూర్తిగా తెగిపోతుంది.ఈ ముడులను తెంచుకున్న దాసుడు ఆ ఉదయం ఉత్సాహపు కెరటంలా, పవిత్రమైన ఆనంద నిధిలా మేల్కొంటాడు. – ముహమ్మద్ ముజాహిద్ -
స్నేహమాధుర్యం..
స్నేహం గూర్చి ఎంతో గొప్పగా చెప్తారు.. సృష్టిలో తియ్యనిదని కొందరంటే, కొందరు మధురమైనదని అన్నారు. స్నేహబంధం విడదీయరాని బంధం అన్నారు...పురాణాల్లో రామ సుగ్రీవుల మైత్రి, కృష్ణుడు కుచేలుల మైత్రి, కృష్ణార్జునల మైత్రి చెప్పుకోదగ్గవి... స్వభావరీత్యా దుష్టులైన దుర్యోధనుడు, కర్ణుల మైత్రి అయినా మంచి ఉదాహరణ కాదు. ఇలాంటి వారి విషయంలో శతకనీతి మనకు ఎంతో మంచి మార్గం చూపిస్తుంది...సజ్జన సాంగత్యం గొప్పదంటాడు భర్తృహరి... ఏనుగు లక్ష్మణ కవి తాను చేసిన అనువాదంలో... ‘సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్పుగౌరవమొసంగు, జనులకు గలుష మడచుగీర్తి బ్రకటించు, చిత్తస్ఫూర్తిజేయుసాధుసంగంబు సకలార్థ సాధనంబు’సజ్జన సహవాసం వలన ఉపయోగాలు చెప్తున్నాడు కవి. సమస్త ప్రయోజనాలు సాధించబడతాయి. అంటే కాదు సకలార్ధ సాధకం అని సెలవిచ్చాడు. ఇదే బాణీని అందరూ కొనసాగించారని అనిపిస్తుంది.. వేమన ‘నీచగుణములెల్ల నిర్మూలమై పోవు, కొదువ లేదు సుజన గోష్టి వలన’ అని సుజన గోష్టి వలన నీచ గుణాలు తొలగిపోతాయంటాడు.‘కాని వానితోడగలసి మెలంగినహాని వచ్చు నెంతవానికైనకాకి గూడి హంస గష్టంబు పొందదా’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు, వేమన. దుష్టుని స్నేహం గూర్చి వివరిస్తాడు, సుమతీ శతకంలో.‘ఉపమింప మొదట తియ్యనకపటం బెడనెడను జెఱకుకైవడినే పోనెపములు వెదకును గడపటగపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ‘ చెడు స్నేహానికి మంచి ఉదాహరణ చె΄్పారు ఇక్కడ.. చెడ్డవారితో స్నేహం మొదట్లో చెఱకు గడ తీపిలా ఉంటుంది. మధ్యలో రుచి తగ్గుతుంది, చివరికి పూర్తిగా చప్పగా ఉండి, ఏమి లేదనిపిస్తుంది. అటువంటి వాడికి తప్పులే కనిపిస్తాయి.‘ఎప్పుడు తప్పులు వెదకెడునప్పురుషుని గొల్వగూడడది’ అని అంటాడు సుమతీ శతకంలో.‘కాదు సుమీ దుస్సంగతి’ అని హెచ్చరిక చేస్తాడు ఇదే శతకంలో.మరో పద్యంలో ‘కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు’ అని అన్నారు..‘కొంచెపునరు సంగతిచేనంచితముగ గీడు వచ్చునది’ అంటూ ఒక ఉపమానం చెప్తాడు.. నల్లి కుడితే మంచానికి దెబ్బలు తగులుతాయి..‘పాలను గలసిన జలమునుపాలవిధంబునె యుండు బరికింపంగాబాల చవి జెఱచు గావునబాలసుడగువాని పొందు వలదుర సుమతీ‘ పాలు కలిసిన నీళ్లు పాల లాగే ఉంటాయి, అలాగే దుర్జనుడు సజ్జనుడు ఉంటే సజ్జనుడు లాగా ఉంటాడు... అందుకు సజ్జనుడే జాగ్రత్త వహించాలి..‘లేమి కలిమి రెండు సమముగ జూచేడి పురుషుడే మిత్రుడెన్ని పొగడారయా’ అని వేమన అంటే ‘మంచి గుణము లేని వానితో మైత్రి చేసి తుది సుఖము బడయుదురా భాస్కరా’ అంటారు భాస్కర శతకంలో.చివరగా భర్తృహరి భాషలో ‘త్యజేత్ ధనం రక్షణార్థం, ధనం త్యజేత్ ఆపది ఆత్మర్థం పృథివీం త్యజేత్, మిత్రార్థే త్యజేత్ ఆత్మనఃకాపాడుకోవడానికి సంపద, ధనం, రాజ్యం అని వదులుకోవచ్చు,కాని మిత్రుడి కోసం నువ్వు నిన్నే వదులుకోవాలి.. అంత గొప్పది స్నేహం. – డా. కందాళ సత్య నారాయణ మూర్తి -
పాదయాత్రే జైత్రయాత్రగా...
జైత్రయాత్ర అనగా గెలుపు కోసం చేసే యాత్ర. యేసు తన జీవితకాల చివరి మూడున్నర సంవత్సరాల పాదయాత్రను జైత్రయాత్రగా చూడవచ్చు. నిజానికి యేసు పాదయాత్రే జైత్రయాత్ర. రెండూ ఒక్కటే. పాదయాత్ర సాధారణ రీతిలో జరుగకపోగా అసాధారణ రీతి లో జైత్రయాత్రగా మార్చబడి గొప్ప సంచలనాలకు కేంద్రం అయ్యింది. ఇక్కడ మాత్రం పాదయాత్రకు జైత్రయాత్ర పర్యాయపదం కాక అంతకు మించినది కావడం విశేషం. ఆనాటి యేసు జైత్రయాత్ర ఇచ్చే ప్రేరణ ఇంతా అంతా కాదు.జైత్ర అంటే జయించేది అని అర్థం. అది విజయానికి సంబంధించినది అని చెప్పవచ్చు. విజయ శీలుడు, విజయశీలమైనది అనే అర్థాలు కూడా ఉన్నాయి. యాత్ర అంటే క్షేత్రస్థాయి పర్యటన. శత్రువులపై దండెత్తి విజయం సాధించడానికి వెళ్ళే యాత్రే జైత్రయాత్ర. ఆత్మ సంబంధంగా చూస్తే, దైవవాక్కుల ఖడ్గంతో దూసుకెళుతూ శత్రువైన సాతానుపై యేసు దండెత్తిన విధానం కనువిందే కాక చరిత్రలో అదొక గొప్ప వాగ్యుద్ధం. యావత్ ప్రపంచానికి దీన్ని మించిన స్ఫూర్తి మరొకటి లేదు. ఒకరు ఏదైనా ఒక రంగంలో వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగే ప్రయాణాన్ని కూడా జైత్రయాత్ర అంటారు.కుష్ఠురోగియైన సీమోను ఇల్లు, ఆ ఇంటి పరిసరాలు గొప్ప సువాసనతో నిండేలా ఒక స్త్రీ అత్యంత విలువగల బహు ఖరీదైన అచ్చ జటామాంసి అత్తరు తీసికొనివచ్చి యేసు తలమీద అదిపోసి తనదైన ప్రేమను ఉన్నతంగా వ్యక్తం చేసింది. మరియొక స్త్రీ అత్తరు బుడ్డితో యేడ్చుచు వచ్చి కన్నీటితో యేసు పాదాలను తడిపి కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పూసింది. గొప్ప జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ యేసు అసాధారణ బోధలకు బహుగా ఆశ్చర్యపోతూ, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పింది. ‘మేము ఎవరి దగ్గరకు వెళతాం? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు’ అంటూ పేతురు యేసును గట్టిగా పట్టుకున్నాడు. ఇదంతా పరిశీలనగా చూస్తే యేసుకు జైజైలు పలుకుటే.ప్రవచనం ప్రకారంగా కట్టబడియున్న ఒక గాడిద పిల్లను శిష్యులు విడిపించి తెచ్చిన వెంటనే యేసు గాడిదపిల్ల మీద కూర్చోగానే హోసన్నా నినాదాలు హోరెత్తాయి. ఖర్జూర మట్టలతో ఆయనకు స్వాగతం పలికారు. దారి ΄÷డుగున తమ బట్టలు, ఒలీవకొమ్మలతో పాటు వివిధ చెట్లకొమ్మలు తెచ్చిపరుస్తూ తమ సంతోషానందాలు వ్యక్తం చేసారు. దావీదు కుమారునికి జయం. ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక! సర్వోన్నత స్థలములలో జయము అంటూ బహు జనసముహం మహా శబ్దంతో కేకలు వేశారు. మిన్నంటిన జయజయధ్వనులతో బేత్పగే, బేతనియ గ్రామాలు మార్మోగాయి.యెరూషలేము పట్టణపు యూదులే కాకుండా, పస్కా పండుగ చేయుటకు వివిధ దేశాల నుండి ముందుగానే వచ్చిన యూదులు కూడా మెస్సీయాను ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన్ను జేజేలతో కీర్తించారు. ఎలుగెత్తి చేస్తోన్న ఈ గొప్ప శబ్దాన్ని చూసి ఓర్వలేని వినలేని వినుటకు మనస్సులేని పరిసయ్యులు అభ్యంతరాలు చె΄్పారు. బోధకుడా, నీ శిష్యులను గద్దించు అంటూ యేసుకే ఫిర్యాదు చేశారు. వీరు ఊరకుండి మౌనంగా నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని యేసు పరిసయ్యులను హెచ్చరించాడు.ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అను కొండగ్రామాల మీదుగా యేసు విజయయాత్ర ్రపారంభమై కిద్రోను లోయను దాటి దేవుని ఆలయం ఉన్న పవిత్ర నగరం యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేవరకు సాగింది. ఈయన ఎవరో అనుకుంటూ యెరూషలేము పట్టణమంతా ఒకసారిగా కలవరానికి గురైంది. యేసు జైత్రయాత్రలకు ముచ్చటపడిపోతూ ఇలా ఆరోజున ఆయనకు ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జైకొట్టినవారే. నాట్యమాడే అంతరంగాలతో క్రీస్తుకు జేజేలు పలికినవారు నాడు ఎందరెందరో. – జేతమ్ -
గర్భధారణ సమయంలో పరిణీతి చోప్రా శివస్తుతి..! ఆ టైంలో చేయొచ్చా
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఎప్పటికప్పుడూ తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. ఈసారి అలానే మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ సందర్శన గురించి గుర్తుచేసుకుంటూ..ఆ అనుభవాలను షేర్ చేసుకున్నారు. అదీగాక ఆమె శివుడి మీద ఆలపించిన పాట నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో ఇలా నాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ వివరణ ఇచ్చారు. నటి పరిణితీ చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్ధాలకు గతేడాదే పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ ప్రెగ్నెన్సీ సమయంలోనే తాను శివస్తుతిని ఆలపించానని, ఆ వీడియో ఆ సమయంలోనిదే అంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారుఈ సందర్భంగా రాఘవ్తో పెళ్లి జరగకుముందు ఆయనతో కలసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించిన విషయాన్ని కూడా ప్రస్తావించారామె. ఆ పోస్ట్లో ఈ నెల ప్రారంభంలో తాను ‘నమామీశ మీశాన నిర్వాణ రూపం’ అంటూ ఆలపించిన శివస్తుతి వీడియోని విడుదల చేసినట్లు తెలిపారు. అది గర్భధారణ సమయంలో ఒక ప్రశాంతమైన ఉదయం వేళ ఆ శివస్తుతిని రికార్డు చేసినట్లు తెలిపారు. "అయితే దీనికి ఇంతటి ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలేదు. చాలా ఏళ్లుగా మా కుటుంబంలో ఇది ఒక భాగంగా ఉన్నట్లే, ఇప్పుడు ఇది మీ ఉదయపు పాటల జాబితాలో (ప్లేలిస్ట్) చేరడం నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తోంది. శివస్తుతి అనేది పరమశివునికి అంకితం చేసిన ఒక భక్తి గీతం." అని రాసుకొచ్చారు పోస్ట్లో. అలాగే ఆ భక్తిగీతం తోపాటు పరిణీతి తాను, రాఘవ్ కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని సందర్శించిన వీడియోని కూడా పోస్ట్ చేశారు. సెప్టెంబర్లో జరిగిన వారి వివాహానికి కొన్ని వారాల ముందు, అంటే 2023 ఆగస్టులో వారు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ వీడియోలో పూజారి హారతి ఇస్తుండగా శివలింగం స్పష్టంగా కనిపించడం చూడొచ్చు. చుట్టూ చాలా మంది జనం ఉన్నప్పటికీ, పరిణీతి-రాఘవ్లు భక్తితో చేతులు జోడించి కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత, వారు స్వయంగా హారతి కూడా ఇచ్చారు. ఈ జంట అదే ఏడాది జూలై 2023లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) కూడా సందర్శించారు. మరి ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో శివస్తుతి వంటివి చేయొచ్చా అంటే..ఆ టైంలో చేయొచ్చా..గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలోనే కాకుండా మానసిక ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయి. ఈ సమయంలో స్త్రీ కొన్నిసార్లు ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తుంది, మరికొన్నిసార్లు చాలా భావోద్వేగంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శివపూజ చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది, ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగ ఆలోచనలు తగ్గుతాయి. గర్భధారణ సమయంలో శివలింగ పూజ లేదా భక్తిపాటలు ఆలపించడం వల్ల ప్రతికూల శక్తి నీడ పుట్టబోయే బిడ్డపై పడదు. గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది తల్లి బిడ్డ ఇద్దరి మానసిక, శారీరక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉపవాసాలు వంటవి చేయకుండా ప్రశాంతత చేకూర్చే ఇష్టదైవ పూజ లేదా పాటలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చని అన్నారు. వత్రాలు, నోములు వంటివి తప్పించి హాయిగా ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవచ్చు, ఆయా భక్తి పాటలు ఆలపించొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నచ్చిన పని, ఇష్టదైవ ప్రార్థన వంటివి గర్భిణీలకు ఒత్తిడిని తగ్గించి..మానసిక ప్రశాంతతను అందివ్వడమే కాకుండా సుఖ ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తుందని అన్నారు. View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) గమనిక: ఇది కేవలం భక్తి, నమ్మకాల ఆధారంగా ఇచ్చిన కథనం మాత్రమే. భక్తులు తీన్ని అనుసరించే ముందు ఆయా ప్రముఖ పండితులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. (చదవండి: సీషెల్స్ ద్వితీయ మహిళకు ప్రధాని మోదీ గిఫ్ట్గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే) -
విశ్రాంత స్వాంతుడు..
దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్, సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు -
అహంకార శిల్పం..
ఒక రాజ్యంలో ఒక మంచి శిల్పి ఉండేవాడు. ఎలాంటి శిలనైనా శిల్పంగా మార్చగల నైపుణ్యం అతడి సొంతం. ఉండేది. ‘నీ పనితనం చాలా గొప్పది, అందుకే ఎన్నో అద్భుతమైన శిల్పాలను చెక్కగలుగుతున్నావు. నీవు చెక్కుతున్న శిల్పాలలో జీవం ఉట్టిపడుతోంది’ అని అందరూ అతడిని ప్రశంసించేవారు. దాంతో ఆ శిల్పిలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. మరింత గొప్పగా శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు.ఆనోటా ఈనోటా పాకిన ఈ విషయం ఆ పెద్ద సామ్రాజ్యపు చక్రవర్తి వరకు వెళ్ళింది. ఆ చక్రవర్తి శ్రీ కృష్ణుడి భక్తుడు. ఆయన ఆ శిల్పిని పిలిపించి, ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వమన్నాడు. శిల్పి రాత్రింబగళ్ళు కష్టపడి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని చూసిన చక్రవర్తి పరమానందభరితుడయ్యాడు. ఆ దివ్య సౌందర్యానికి పులకరించిపోయాడు. ప్రజల సమక్షంలో శిల్పిని ధన కనక వస్తువాహనాలతో సన్మానించాడు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అతడికి ‘మహాశిల్పి’ అని బిరుదునిచ్చాడు.శిల్పి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, అతడిలో ఉన్న ఆత్మవిశ్వాసం మెల్లగా అహంకారంగా మారింది. అతడు ఇంటికి వెళ్ళి తండ్రితో, ‘నాకు మించిన శిల్పి ఈ భూలోకంలోనే లేడు’ అని విర్రవీగాడు. కొడుకు మాటలను ఆ శిల్పి తండ్రి పట్టించుకోలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. ‘ప్రపంచమే నాకు నీరాజనాలు పడుతుంటే, తండ్రివైన నీవు నన్ను పొగడవేమిటి?’ అని శిల్పి తండ్రిని గట్టిగా నిలదీశాడు. అప్పుడు తండ్రి నవ్వి, ‘పిచ్చివాడా... ఈ సృష్టికర్త ముందర మనమెంత? ఈ కీర్తి, బిరుదులు ఇవన్నీ నీటి బుడగల్లాంటివి. ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవలసిందే’ అన్నాడు. శిల్పి కోపంగా తండ్రి వైపు చూస్తూ,‘నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు అసూయ కలిగించినట్లుంది’ అని నిష్టూరమాడాడు.దానికి జవాబుగా తండ్రి ఒక పలక, బలపాన్ని శిల్పి చేతికిచ్చాడు. సృష్టికర్త సృష్టించినట్లుగా కాకుండా, మరో భిన్నమైన రూపంలో ఒక మానవ ఆకారాన్ని గీసి చూపించమన్నాడు. ‘అదెంత పని!’ అన్నట్లుగా శిల్పి వాటిని చేతిలోకి తీసుకున్నాడు. శిల్పి మూడు రాత్రులు నిద్ర లేకుండా రకరకాలుగా ప్రయత్నించాడు.కాలు, చేయి, కన్ను, ముక్కు, చెవి... ఎలా మార్చినా మానవ శరీరం సంపూర్ణం కాలేదు సరి కదా, ఒకవేళ మరో విధంగా మార్చితే మానవ మనుగడే సాధ్యం కాదని అతడు తెలుసుకున్నాడు. ఏ అవయవాన్ని కూడా మరో రకంగా మార్చలేమని, వాటి స్థానాలను అంగుళం కూడా కదపలేమని గుర్తించాడు. చివరికి తల వెంట్రుకలను సైతం ఆ సృష్టికర్త ఎంతో నైపుణ్యంతో అమర్చాడని గ్రహించాడు. సృష్టికర్తకు మించిన మహాశిల్పి ఈ విశ్వంలోనే మరొకరు ఉండరని అతడికి స్పష్టమైంది. తన అహంకార ధోరణి తనకే అర్థం కావడంతో, ఆ శిల్పి పశ్చాత్తాపంతో తండ్రి ముందర తల దించుకున్నాడు. – ఆర్.సి. కృష్ణస్వామిరాజు -
అలనాటి అస్త్రాలు... బ్రహ్మాస్త్రం... బ్రహ్మాండాస్త్రం
మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించి గతవారం కొంత తెలుసుకున్నాం కదా... ఈ వారం ఆ అస్త్రాలలో కొన్ని ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాం... బ్రహ్మాస్త్రం... సృష్టికర్త అయిన బ్రహ్మ తన తపఃశక్తితో రూపొందించినదే ‘బ్రహ్మాస్త్రం’. అత్యంత శక్తిమంతమైన బ్రహ్మాస్త్రం గురించి ఇతిహాసాలలో వివరించారు. ఇది అత్యంత విధ్వంసకర, ప్రమాదకరమైన ఆయుధం. విశ్వంలో అన్ని కార్యకలాపాలూ సక్రమంగా జరగడానికీ, నియంత్రణను కొనసాగించడానికీ, ఇది ఉద్దేశింపబడింది. ఈ ఆలోచనతోనే, బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తిమంతమైన ఆయుధం. దీనిని కేవలం, రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. త్రేతాయుగం నాటి రామాయణ కాలంలో విభీషణుడూ, లక్ష్మణుడూ మాత్రమే దీనిని వాడారు. మహాభారత యుద్ధంలో, ద్రోణాచార్యుడూ,అర్జునుడు అశ్వత్థామ, శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, ఈ అస్త్ర ప్రయోగం తెలిసిన వారు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో, కర్ణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేద్దామనుకొంటే గురువైన పరశురాముని శాపం వల్ల అస్త్రాన్ని సంధించే మంత్రం జ్ఞాపకం రాకపోవడంతో సంధించలేకపోయాడు.బ్రహ్మశీర్షాస్త్రం...ఇది బ్రహ్మాస్త్రం కంటే, నాలుగు రెట్లు శక్తిమంతమైనది. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల, వినాశనం కలుగుతుంది. దీనిని ప్రయోగించిన ప్రాంతం, 12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారిపోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని, పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తిమంతమైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ద్రోణాచార్యుడు, తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం రాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా, దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి, రామ రావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీనివలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో, శక్తిమంతమైనదో అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ప్రయోగించవద్దని అర్జునుడికి హితబోధ చేసి మరీ ఈ అస్త్రాన్ని ఉపదేశించాడు. బ్రహ్మాండాస్త్రం...ఈ ఆయుధం, మొత్తం సౌర వ్యవస్థను, అంటే, ఈ బ్రహ్మాండాన్నే నాశనం. చేసేంత శక్తిమంతమైనది. ఈ ఆయుధం కొనపై బ్రహ్మ దేవుని నాలుగు తలలతో పాటు ఊర్ధ్య ముఖంగా మరో తల ఉంటుంది. ఈ అస్త్రంలో బ్రహ్మాస్త్ర బ్రహ్మ శీర్షాస్త్రాల రెండు శక్తులూ సమ్మిళితమై ఉంటాయి. ఒకసారి ఈ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత దీనిని ఆపడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా దీనిని ప్రయోగించినవారు కూడా దాని వల్ల జరగబోయే ముప్పును, అనర్థాలనూ తప్పించలేరు. ఈ అస్త్రం ద్రోణాచార్యుడి వద్దనే ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ధర్మం కోసం పోరాడుతుండటంతో వారిపై ప్రయోగించవద్దని దేవతల కోరిక మేరకు ద్రోణాచార్యుడు ప్రయోగించలేదు.త్రిశూలం... త్రిశూలం శివుని ఆయుధం.. పార్వతీదేవి శివునికి ప్రసాదించిన అత్యంత శక్తిమంతమైన అస్త్రం ఇది. దీనికున్న మూడు కొనలు సృష్టి, స్థితి, లయ అనే మూడింటికి ప్రతీకలు. మొత్తం విశ్వమంతా ఈ మూడు శక్తుల మీదే నడుస్తుంది. లక్ష్య భేదితమైన త్రిశూలం శైవ సంప్రదాయం ప్రకారం అత్యంత శక్తిమంతమైన ఆయుధం. కేవలం శివుడు, శక్తి దేవతలు మాత్రమే దీనిని భరించగలరు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
కర్మఫలం... కర్తవ్య బలం
అంకితభావంతో కూడిన ఆచరణనే కర్తవ్యం అంటారు. జీవితంలో ఏ రంగంలో ఉన్నా తన వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడమే అసలైన యజ్ఞం. కర్తవ్యం కేవలం భారం కాదు; అది ఆత్మ వికాసానికి లభించిన పవిత్ర అవకాశం. గాలివానలోనూ దీపం ఆరిపోకుండా కాపాడుకున్నట్లు, ప్రతికూల పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని వీడకూడదు. పదును లేని కత్తి యుద్ధానికి పనికిరానట్లు, నిబద్ధత లేని పని ఫలితాన్ని ఇవ్వలేదు. ఉదాహరణకు, ఒక నిరుపేద విద్యార్థి తన పేదరికాన్ని సాకుగా చూపకుండా, కష్టపడి చదివి విజయం సాధించడం ఉన్నతమైన కర్మ నిర్వహణ. శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీ బానిసవుతుంది. పనిని ప్రేమించేవాడికి అలసట ఉండదు, లక్ష్యం పట్ల స్పష్టత ఉన్నవాడికి అపజయం ఎదురుకాదు. సంకల్పం దృఢంగా ఉంటే మార్గం సుగమమవుతుంది. నిరంతర సాధన ఉంటేనే రాయి రత్నంగా మారుతుంది.కర్మ చేయడం మన హక్కు, కానీ ఫలితంపై అధికారం ప్రకృతికి లోబడి ఉంటుంది. ఫలితాన్ని ఆశించి చేసే పని మనిషిని బానిసగా మారుస్తుంది; ఫలితాన్ని సమర్పణ భావంతో వదిలేసే వ్యక్తిని కర్మ యోగిగా తీర్చిదిద్దుతుంది. తన నీటిని తాను తాగని నదిలా, తన పండ్లను తాను ఆరగించని వృక్షంలా మన కర్మలు లోక హితం కోరాలి. ఆశలు సంకెళ్ళయితే, ఆశయం రెక్కల వంటిది. నేటి పోటీ ప్రపంచంలో కేవలం స్వార్థ ప్రయోజనం కోసమే పరుగెత్తడం వల్లనే మానసిక అశాంతి పెరుగుతోంది. విల్లు నుంచి విడిచిన బాణం లక్ష్యం వైపే వెళ్ళాలి కానీ వెనక్కి చూడకూడదు. త్యాగంలో ఉన్న ఆనందం భోగంలో లభించదు. ప్రతిఫలం ఆశించని సేవ పరమాత్మకు చేరువయ్యే రాజమార్గం. ఫలితాపేక్ష లేని క్రియే మనిషిని బంధనాల నుండి విముక్తుడిని చేస్తుంది.ఏది ధర్మబద్ధమైన కర్మ అని గుర్తించడమే వివేకం. వివేకం లేని క్రియ అంధకారంలో ప్రయాణం వంటిది. జ్ఞానంతో కూడిన ఆచరణే కర్మ కౌశలం. బాహ్య ప్రపంచంలో మనం చేసే పనుల కన్నా, మన అంతరంగంలో ఉన్న సంకల్పం గొప్పది. నిప్పును తాకితే చేయి కాలడం ఎంత సహజమో, దుష్కర్మ చేస్తే దుఃఖం కలగడం అంతే అనివార్యం. పాల నుండి నీటిని వేరు చేసే హంసలా, మనం చేసే పనులలోని మంచి చెడులను వివేకంతో వేరు చేయాలి. బురదలో ఉన్నా పవిత్రతను కాపాడుకునే పద్మంలా, సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ధర్మబద్ధంగా వ్యవహరించడమే మనీషి లక్షణం. కర్మ సిద్ధాంతం శిక్ష కాదు; అది మనల్ని మనం సరిదిద్దుకునే గొప్ప శిక్షణ. గతం మన చేతుల్లో లేదు, కానీ వర్తమానంలో మనం చేసే సత్కర్మలు సుందరమైన భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. అహంకారం వీడినప్పుడే ఆత్మ దర్శనం సాధ్యమవుతుంది. స్వార్థం వీడిన కర్మయే మోక్ష మార్గం. ప్రతి క్షణం ఒక నూతన అవకాశం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం, నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరిద్దాం.సనాతన ధర్మం కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. మానవ జన్మ ఒక అద్భుత కర్మభూమి. ఇక్కడ ప్రతి చేష్ట, ప్రతి ఆలోచన విశ్వంలో ఒకానొక శక్తిమంతమైన తరంగాన్ని సృష్టిస్తుంది. విత్తినవాడే ఫలాన్ని అనుభవించాలనేది ప్రకృతి అమోఘమైన నియమం. కర్మల వెనుక ఉన్న ఉద్దేశం, వివేకం మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బంధనాల నుండి విముక్తి పొందాలన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా కర్మఫల రహస్యం తెలియడం అత్యంత ఆవశ్యకం.సేవే పరమార్థంగా, త్యాగమే మార్గంగా సాగే జీవనం ధన్యమవుతుంది. వ్యక్తిలోని కర్మశక్తి విశ్వశ్రేయస్సుకై అంకితం కావాలి. కర్మ యోగంతో అంతరంగాన్ని శుద్ధి చేసుకుందాం. భారతీయుల కర్మ సాధన జగత్తుకు వెలుగు కావాలి. మనిషి మారాలి, మనీషిగా ఎదగాలి, జగత్తు పునీతం కావాలి, లోకం సుఖపడాలి.వివేకం లేని బలం ప్రమాదకరం, బలం లేని వివేకం నిష్ప్రయోజనం. చిత్తశుద్ధి లేని శివపూజ ఫలితాన్నివ్వదు. వెలుగు లేని కన్ను ప్రపంచాన్ని చూడలేనట్లు, వివేకం లేని మేధస్సు సరైన నిర్ణయం తీసుకోలేదు.– కె. భాస్కర్ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు. -
పితృకార్యాలు.. ఎక్కడ చేస్తే మంచిది?
పితృదోషాలు.. వాటి పరిష్కారమార్గాల గురించి మనం ఇదివరకు చేసిన వీడియోల్లో చెప్పుకొన్నాం కదా..! జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక అడ్డంకులు.. వైవాహిక సమస్యలు, తీరని ఆర్థిక ఇబ్బందులకు కేవలం గ్రహగతులు మాత్రమే కాకుండా.. పితృదోషాలు కూడా కారణం కావొచ్చని చెప్పుకొన్నాం. అసంతృప్తిగా ఉండే పూర్వీకుల ఆత్మల శాపం.. ఆ వంశంపై పడుతుంది. అయితే.. ఆత్మలకు శాంతిని చేకూర్చి, పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు కొన్ని పవిత్ర స్థలాలను మన పురాణాలు సూచించాయి. ఆ ప్రాంతాల్లో పిండప్రదానాలు చేస్తే.. పితృదేవతలు సంతృప్తి చెందుతారని వివరిస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం..పితృదోషాలు, పితృశాపాల నుంచి విముక్తి ఎలా లభిస్తుందని చెబుతుంటారు? పూర్వీకులకు తర్పణాలు అర్పించడానికి ఏ క్షేత్రాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు? ఏ క్షేత్రంలో పిండప్రదానాలు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు నేరుగా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు? ఏయే ఆలయాలను పితృ దోష నివారణకు అద్భుతమైనవిగా చెబుతారు? ఎక్కడ ‘మోక్ష దీపాన్ని’ వెలిగించడం ద్వారా పూర్వీకుల కోపం తొలగి.. కుటుంబంలో శ్రేయస్సు నెలకొంటుంది? వంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూడండి.. -
పరమ తండ్రి ప్రేమ
ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచనలు చేయక తప్పదు. విలువైన మూలాల వలన మూల΄ాఠములవలన ఇట్టి క్షేత్రస్థాయి వనరుల వలన సువాసనసారం ఎది ఉన్నా అది నేరుగా బయటపడి జీవితాలకు వంటబడుతుంది. పరిశోధనాత్మక ఆత్మ సంబంధ అభ్యాస జీవితానికి అన్వయించుకునేలా క్రీస్తు సందేశాలు ఎప్పుడూ ఘనంగానే ఉండుట అనేది గమనార్హం.‘నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను’ అంటాడు అద్వితీయ సత్యదేవుడు. ఆయన మనస్సు ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తువారి ఉన్నతమైన బోధ ఏమంటే ‘ఈ భూమి మీద ఎవరికిని తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందు ఉన్నాడు’. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనేది వేరే అంశం. ధర్మశాస్త్రాన్ని మరింత లోతుగా పరిశోధించినా, యేసు అసాధారణ బోధల ప్రకారంగా చూసినా కూడా ఒకరు ఆత్మ సంబంధంగా తండ్రి హోదాను అనుభవించడం దేవునికి కోపం తెప్పించే విషయమే కాక, ఇదొక గొప్పదైన విశేషం కూడానూ.గ్రంథప్రకారంగా దేవుని మహిమను దొంగిలించడం ఘోరతప్పిదమే అని చెప్పక తప్పదు. మేము మీకు ఆత్మీయ తల్లిదండ్రులం అంటూ సువార్తికులు, బోధకులు, సంఘ పెద్దలు పిలిపించుకోవడం లేఖన విరుద్ధం. మీరంతా సహోదరులు అనునదే క్రీస్తు బోధ. మనమంతా క్రీస్తునందున్నా సహోదరీ సహోదరులం. దేవుని పిల్లలం అనేదే లేఖన సంబంధ సర్వసత్యం. ఎప్పుడూ యేసును రబ్బునీ అని పిలుచుకొనే మగ్దలేనే మరియకే సమాధి దగ్గర మొట్టమొదటగా యేసు పునరుత్థానుడిగా దర్శనమిస్తూ చెప్పిన మాట ఆశ్చర్యకరమే. ‘నా సహోదరులవద్దకు వెళ్ళి – నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కి΄ోవుచున్నానని వారితో చెప్పుమనెను’. యేసుక్రీస్తు వారి తండ్రి, సర్వమానవాళి తండ్రి ఒక్కరే. ఆయనే యెహోవా అనబడే తండ్రియైన దేవుడు.హెబ్రీగ్రంథ లేఖికుని వివరణలో ‘నీవు నాకు ఇచ్చిన పిల్లలు’ అని ఒకచోట క్రీస్తు అన్నట్టుగా వ్రాయబడింది గానీ తండ్రి అని ఆయన పిలిపించుకొన్న దాఖలాలు ఎక్కడనూ లేవు. క్రీస్తు అపొస్తలులు కూడా ‘అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే’ అన్నది చాలా సూటిగా సుస్పష్టంగా ఉన్నతంగా వివరిస్తూ దేవున్ని ఎంతగానో హెచ్చిస్తూ గొప్ప చేసారు. సంఘ సహకారం తీసికొని సంఘసమక్షంలో సంఘంతో కలిసి గ్రంథాన్ని పఠిస్తే యేసు తన తండ్రియైన దేవునికి ఎంతగా విధేయుడై లోబడ్డాడో అనేది తేటగా అర్థమవుతుంది.ఒక తండ్రికి ఎంతటి కఠినాత్ముడైనా, అవిధేయుడైనా కుమారుడు ఉన్నప్పటికీ అతనికి యేసు విధేయతా జీవిత విధానం గూర్చి బోధిస్తే మొదట ఆలోచనలోపడి ఇక మార్పు తప్పని పరిస్థితే అతనికి ఎదురవుతుంది. కుమారునిగా యేసు జీవితం అంతటి ఉన్నతమైనది. పరమందున్న తండ్రియైన ఆ దేవదేవునికి, ఇంట్లో ఉన్న నాన్నకు లోబడి జీవించడం మనకెప్పుడూ గౌరవం తెచ్చే సత్క్రియే అనుటలో ఎలాంటి సందేహం లేదు. – జేతమ్ -
అంతా ఆచార్యుడి నిర్ణయమే..!
‘నాకు రాజ్యమూవద్దు, రాజ్యాధికారమూ వద్దు. నన్ను పట్టాభిషిక్తుని చేయనక్కర లేదు. నేను ఆచార్యుని చేతిలో కీలుబొమ్మలా వున్నాను. నాకు ఒక స్వేచ్ఛలేదు, సుఖం లేదు, స్వంత నిర్ణయం తీసుకోలేను. చివరకు నా వివాహం కూడా ఆచార్యుడి నిర్ణయమే. అందులోనూ ఆయన రాజకీయ కోణం చూస్తున్నారు .’’ అన్నాడు చంద్రగుప్తుడు వార్తాహరునితో. ఆ వార్త ఆచార్య విష్ణుగుప్తుని చేరింది. ఆచార్యులు చంద్రగుప్తుని వద్దకు వచ్చి ‘‘నేను విన్నది నిజమేనా?’’ అని అడిగారు.‘‘అవును’’ చంద్రగుప్తుని సమాధానం .‘‘ఎందుకు ?’’ ఆచార్యుని ప్రశ్న .‘‘నాకు స్వేచ్ఛ లేదు, సుఖంలేదు, ఏం, చక్రవర్తి సుఖాన్ని కోరకూడదా? నేను మీ చేతిలో జీతం తీసుకుంటున్న పెద్దనౌకరు లా వున్నాను.’’ అన్నాడు.‘‘అవును రాజు, రాజ్యంలో ప్రజాసేవచేసే పెద్దనౌకరే. చక్రవర్తికి సుఖం ఉండదు. ఉండకూడదు. ప్రజాసుఖమే చక్రవర్తి సుఖం. ప్రజాహితమే రాజుకి హితం.నేను నీకు రాజ్యాన్ని అప్పగిస్తానన్నాను గాని, సుఖాన్ని కాదు. దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితోబాధపడుతున్నా చక్రవర్తికి సుఖమెలావుంటుంది? సుఖానికి మూలం అర్థం. అర్థ, కామాలు ధర్మం మీద ఆధార పడి వుంటాయి. సంపాదన సక్రమ మార్గంలో వుండాలి. అక్రమ మార్గమైతే అర్థం, అనర్థమౌతుంది. రాజ్య సంక్షేమం, ప్రజల సుఖంకోసం అర్థం ఎంత అవసరమో, అది ఎందుకు ధర్మబద్ధం కావాలో వివరించారు ఆచార్య చాణక్యులు.చంద్రగుప్తుని చివరి రోజుల్లో దేశంలో కరువు తాండవించింది. ప్రజలు ఆకలికి అలమటించారు. అప్పుడు చంద్రగుప్తుడు కూడా ఆహారం తీసుకోలేదు. ప్రజాహితమే తమ హితంగా భావించిన ఆ ఇద్దరూ ధన్యులే. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
కాబాను కాపాడిన పక్షుల కథ!
చాలాకాలం క్రితం.. అంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టడానికి కొద్ది రోజుల ముందు జరిగిన కథ ఇది. అప్పట్లో యెమెన్ దేశాన్ని ‘అబ్రహ’ అనే ఒక క్రూరమైన రాజు పాలిస్తుండేవాడు. మక్కా నగరంలోని పవిత్ర ‘కాబా’ మందిరానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు రావడం, అక్కడప్రార్థనలు చేయడం అబ్రహకు అస్సలు నచ్చలేదు. ప్రజలందరూ తన దేశానికే రావాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా, కోట్లు ఖర్చు పెట్టి తన రాజధానిలో ఒక పెద్ద, అందమైన చర్చిని కట్టించాడు. ‘ఇకపై ఎవరూ మక్కాకు వెళ్లకూడదు, అందరూ నా దగ్గరికే రావాలి‘ అని హుకుం జారీ చేశాడు. ఈ విషయం తెలిసి అరబ్బులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో ఒక అరబ్ వ్యక్తి, రాత్రికి రాత్రే అబ్రహ కట్టించిన చర్చిలోకి దూరి, అపవిత్రం చేశాడు. దీంతో అబ్రహకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నా చర్చిని అవమానిస్తారా? ఆ మక్కాలో ఉన్న కాబా మందిరాన్ని పునాదులతో సహా కూల్చేస్తా!’ అంటూ కరడుగట్టిన సైన్యంతో మక్కా వైపు బయలుదేరాడు.గజరాజుల సైన్యం.. వణికిపోయిన మక్కా!అబ్రహ సైన్యం మామూలు సైన్యం కాదు. శత్రువులను తొక్కి పారేయడానికి కొండల లాంటి భారీ ఏనుగులను ఆ సైన్యంలో చేర్చాడు. దారిలో అడ్డువచ్చిన చిన్న చిన్న తెగలను చీల్చిచెండాడుతూ అబ్రహ సైన్యం మక్కా సరిహద్దుల్లోకి చేరుకుంది. అక్కడ అమాయక ప్రజల ఆస్తులను, ఒంటెలను దోచుకుంది. అలా దోచబడిన వాటిలో మక్కా నాయకుడు, ప్రవక్త ముహమ్మద్ గారి తాతగారైన ‘అబ్దుల్ ముత్తలిబ్’కు చెందిన 200 ఒంటెలు కూడా ఉన్నాయి. యుద్ధం వద్దనుకుంటే కాబాను కూల్చడానికి అడ్డుపడొద్దని అబ్రహ సందేశం పంపాడు. దాంతో చర్చల కోసం అబ్దుల్ ముత్తలిబ్ నేరుగా అబ్రహ డేరాకు వెళ్లారు. ఆయన గంభీరమైన రూపాన్ని చూసి అబ్రహ ముచ్చటపడ్డాడు. ‘ఏం కావాలి?’ అని అడిగాడు.‘నీ సైన్యం నా 200 ఒంటెలను పట్టుకెళ్లింది, వాటిని నాకు ఇచ్చేయ్’ అన్నారు అబ్దుల్ ముత్తలిబ్ ప్రశాంతంగా. అబ్రహ ఆశ్చర్యపోయాడు, నవ్వుతూ అవహేళన చేశాడు. ‘మిమ్మల్ని చూసి గొప్పవాడనుకున్నా! నేను మీ పవిత్రమైన కాబా మందిరాన్ని కూల్చేయడానికి వస్తుంటే, దాని గురించి అడగకుండా మీ ఒంటెల గురించి అడుగుతున్నారేంటి?’ అన్నాడు.దానికి అబ్దుల్ ముత్తలిబ్ ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ఎంతో ధీమాగా.. ‘ఆ ఒంటెలకు యజమానిని నేను, అందుకే నా ఒంటెలను అడిగాను. కానీ, ఆ కాబా మందిరానికి ఒక యజమాని (అల్లాహ్) ఉన్నాడు. దానిని ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు!’ అని చెప్పారు. తిరిగి వచ్చిన అబ్దుల్ ముత్తలిబ్, ప్రజలందరినీ కాబా ఖాళీ చేసి,ప్రాణాలు కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న కొండలపైకి వెళ్ళిపోవాలని ఆదేశించారు.మోకాళ్లూనిన ఏనుగు.. ఆకాశంలో అద్భుతం!మరుసటి రోజు ఉదయం.. అబ్రహ సైన్యం కాబా వైపు అడుగులు వేయడంప్రారంభించింది. ‘మహమూద్’ అనే ఒక పెద్ద ఏనుగు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తోంది. కానీ, సరిగ్గా కాబా వైపు నడవమనేసరికి ఆ ఏనుగు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మోకాళ్లూని కూర్చుండిపోయింది! దానిని ఎంత కొట్టినా, పొడిచినా కదలలేదు. అదే విచిత్రంగా యెమెన్ వైపో, లేదా వేరే దిశల వైపో తిప్పితే మాత్రం పరిగెత్తింది. అబ్రహ సైన్యానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. సముద్రం వైపు నుండి వేలాది పక్షుల సమూహాలు మక్కా వైపు రాసాగాయి. వాటిని అరబ్బీలో ‘అబాబీల్’ అంటారు. ఆ చిన్న చిన్న పక్షుల నోట్లో ఒక రాయి, రెండు కాళ్లలో రెండు రాళ్లు ఉన్నాయి. అవి మామూలు రాళ్లు కావు.. కాల్చిన మట్టి రాళ్లు (సిజ్జీల్).తిన్న గడ్డిపరకల్లా.. సర్వనాశనం!ఆ పక్షుల సైన్యం అబ్రహ సైన్యంపైకి రాగానే, తమ కాళ్లలో, నోట్లో ఉన్న రాళ్లను పైనుంచి తుపాకీ గుళ్లలా వర్షింపజేశాయి. ఆ చిన్న రాళ్లు ఏనుగుల మీద, సైనికుల మీద పడగానే.. శరీరాన్ని చీల్చుకుంటూ అవతలికి వెళ్ళిపోయాయి. రాజు అబ్రహతో సహా సైన్యమంతా కకావికలమైపోయింది.పవిత్ర ఖురాన్ లోని ‘సూరహ్ అల్–ఫీల్’ (105:5) లో దేవుడు చెప్పినట్లుగా.. ఆ భారీ సైన్యం అంతా ‘పశువులు నమిలి పారేసిన గడ్డిపరకల్లా, పొట్టులా’ మారిపోయింది. అహంకారంతో వచ్చిన అబ్రహ ఘోర పరాజయాన్ని మూటగట్టుకునిప్రాణాలతో పారిపోతూ దారిలోనే అంతమయ్యాడు. కాబా మందిరం సురక్షితంగా నిలిచింది! – ముహమ్మద్ ముజాహిద్ -
శ్రీవారి జ్యేష్ఠాభిషేకానికి వేళాయెరా!
తిరుమలేశుడు ఉత్సవాల వేల్పు. నిత్యపూజలతోపాటు విశేష పూజలెన్నో జరుగుతుంటాయి. అలాంటి వాటిలో జ్యేష్ఠాభిషేకం ఒకటి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం రోజున ముగిసేలా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ‘అభిధ్యేయక అభిషేకం’ అని కూడా పిలుస్తారు.ఏడాది పొడవునా జరిగే వివిధ ఉత్సవాలు, ఊరేగింపుల వల్ల శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, వాటి కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఈ 26 నుంచి 28 వరకు జ్యేష్ఠాభిషేకం జరగనున్న సందర్భంగా ఆ విశేషాలు.ఏడాది పొడవునా స్వామివారి ఉత్సవమూర్తులకు ఉండే బంగారు కవచాన్ని ఈ ఉత్సవం మొదటి రోజున తొలగిస్తారు. కవచాలు లేని స్వామివారి నిజరూపాన్ని చూసే అరుదైన అవకాశం కేవలం ఈ సమయంలోనే భక్తులకు దక్కుతుంది.స్నపన తిరుమంజనం: మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి ద్రవ్యాలతో వైభవంగా ‘స్నపన తిరుమంజనం’ (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి రోజూ స్వామివారికి వేర్వేరు కవచాలను సమర్పిస్తారు. శతాబ్దాల నాటి శ్రీ మలయప్ప స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ప్రతి ఏటా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ‘అభిధ్యేయక అభిషేకం‘ నిర్వహిస్తారు. – ఫొటోలు: కేతారి మోహన కృష్ణ, సాక్షి, తిరుపతిఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలుమూడు రోజుల ముఖ్య కార్యక్రమాలు (జూన్ 26 – 28)మొదటి రోజు (జూన్ 26, శుక్రవారం): స్వామివారికి ఏడాది పొడవునా ఉండే బంగారు కవచాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తారు. తిరుమంజనం అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరించి మాడ వీధుల్లో ఊరేగిస్తారు.రెండవ రోజు (జూన్ 27, శనివారం): ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన తర్వాత అత్యంత శోభాయమానంగా ముత్యాలకవచం సమర్పిస్తారు.మూడవ రోజు (జూన్ 28, ఆదివారం): చివరి రోజు తిరుమంజన కార్యక్రమాలు పూర్తి చేసి, స్వామివారికి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని తిరిగి వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు తీయరు. -
నైవేద్యం ఆలస్యమైతే కరిగిపోయే విగ్రహం!.. ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
ఆకలి.. జీవులకు ఓ గొప్ప వరం.. ఒక్కోసారి అదే పెద్ద శాపం! ‘క్షుధాతురాణాం న రుచి న పక్వమ్’ అన్నారు పెద్దలు. అంటే ఆకలి వేసినప్పుడు రుచులు, పక్వాలు చూడరని అర్థం. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని శంకరుల వారే చెప్పారు. కానీ.. ఈ ఆకలికి ఆ దేవుడు అతీతుడా? అసలు దేవుడికి కూడా తీవ్రమైన ఆకలి వేస్తుందా? గ్రహణం పడితే ప్రపంచంలో ఏ గుడైనా మూసేస్తారు.. కానీ, గ్రహణ సమయంలో కూడా ఆకలి తట్టుకోలేక, నైవేద్యం స్వీకరించే వింత దేవుళ్లు ఎక్కడైనా ఉన్నారా?మన దేశంలోని కొన్ని పురాణ క్షేత్రాలు... 'అవును.. దేవుడికి కూడా ఆకలి వేస్తుంది!' అని నిరూపిస్తున్నాయి. ఒక్క 10 నిమిషాలు నైవేద్యం ఆలస్యమైతే చాలు.. అక్కడ దేవుడి విగ్రహం ఆకలితో చిక్కిపోతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ఆ అద్భుత క్షేత్రాల రహస్యాలు ఏంటో తెలుసా?గ్రహణం అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దేవాలయాల తలుపులను మూసివేయడం.. గ్రహణం విడుపు తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరిపి, నిత్య సేవలను ప్రారంభించడమే..! కానీ, కొన్ని ఆలయాల్లో దేవుడి ఆకలి కారణంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయాల తలుపులు తెరుచుకునే ఉంటాయి. కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఈ కోవలో ముందంజలో ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన కన్నయ్యకు ఆకలి చాలా ఎక్కువ. రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అంతేకాదు.. ఈ ఆలయంలోని గర్భగుడి వెలుపల పెద్ద గొడ్డలి ఉంటుంది. ఉదయం ఆలయం తెరవడానికి తాళం మొరాయిస్తే.. దాన్ని ఈ గొడ్డలితో పగులగొట్టి మరీ.. దేవుడి ఆకలిని తీర్చేలా వెనువెంటనే నైవేద్యాలు పెడతారు. ఈ ఆలయంలో 10 నైవేద్యాల్లో ఏ ఒక్కటి తగ్గినా.. స్వామివారు సన్నబడతారట..! సైన్స్కు కూడా ఈ వింత అంతుచిక్కలేదట..! అందుకే.. ఇక్కడి పూజారులు గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. స్వామివారు ఆకలిని తట్టుకోలేరనే ఉద్దేశంతో.. గ్రహణ పట్టు.. విడుపులతో సంబంధం లేకుండా నైవేద్యం సమర్పిస్తారు.రాజస్థాన్లోని బికనీర్లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంచుతారు. ఓసారి ఇక్కడి ఆలయాన్ని గ్రహణ సమయంలో మూసివేస్తే.. స్వామివారు ఆ పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వ్యాపారి కలలోకి వచ్చి.. ‘‘నాకు చాలా ఆకలిగా ఉంది’’ అని చెప్పారట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి క్షేత్రంలో శివలింగం స్వయంభూ. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు నవగ్రహాలను, 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. ఆయనకు గ్రహాలను శాసించే స్వామిగా పేరుంది. అలాంటి స్వామికి గ్రహణ దోషం ఎందుకుంటుంది? అందుకే.. ఇక్కడ గ్రహణ సమయంలో రాహు-కేతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఉజ్జయినిలోని మహాకాళుడికి కాలాతీతుడు.. అంటే కాలానికి అతీతుడు అనే పేరుంది. అందుకే.. ఈ స్వామివారికి గ్రహణ ప్రభావం అంటదు. గ్రహణ సమయంలో ఈ జ్యోతిర్లింగ దర్శన సమయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక దివి నుంచి భువికి గంగాప్రవాహం వచ్చేప్పుడు.. ఆ ఉధృతిని తన జటాజూటంతో నిర్బంధించిన శివుడు ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయంలో కొలువుదీరాడు. ఈయనకు కూడా గ్రహణ సమయంలో పూజలు ఆగవు. ఇక ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో అమ్మవారు కల్కాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె సాక్షాత్తూ కాలచక్రానికే అధిపతి. అంటే.. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయి. అందుకే.. గ్రహణ ప్రభావం అమ్మవారిపై ఉండదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక గయలోని విష్ణుపాద ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. ఇక్కడ గ్రహణ సమయంలో పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. -
దానం చేసే మనసు!
ప్రతి ΄పౌర్ణమికీ ఆ ఊరిలో సత్సంగం జరుగుతుంది. ఒక ΄పౌర్ణమి నాడు ప్రవచన కర్త దానం గురించి వివరిస్తున్నారు. ఆయన దానం విశిష్టతను తెలియజేస్తూ, ‘దానం చేయని చేయి, కాయలు కాయని చెట్టు ఒకటే’ అని చెప్పారు. దానాలన్నింటిలోనూ అన్నదానం, విద్యాదానం, గోదానాలు చాలా గొప్పవని, దానం చేసేటప్పుడు కలిగే అలౌకిక ఆనందం వర్ణనాతీతమని వివరించారు. ఆ ప్రవచనానికి వచ్చిన ఒక యువకుడు అక్కడి నుంచి నిరాశతో... కోపంతో వెళ్ళిపోవడానికి లేచాడు. ప్రవచనకర్త అతడిని బుజ్జగిస్తూ, ‘ఎందుకు నాయనా, వెళ్ళిపోతున్నావు?’ అని అడిగారు.దానికి ఆ యువకుడు, ‘చెప్పడం సులభం, చేయడం కష్టం. మీరేమో దానం గొప్పదని చెబుతున్నారు. నాలాంటి వాడికి దానం చేయడం ఎలా కుదురుతుంది? అన్నదానం చేయాలంటే డబ్బు ఉండాలి, నా దగ్గర డబ్బు లేదు. చిన్న రైతునైన నా ఆదాయం చాలా తక్కువ. పోనీ విద్యాదానం చేద్దామంటే నేను అంతగా చదువుకోలేదు. అలాగే మా ఇంట్లో పశువులు లేవు, కాబట్టి గోదానం చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి మీరు చెప్పేవేవీ ఆచరణకు యోగ్యం కావని నిరాశతో వెళ్ళిపోతున్నాను’ అన్నాడు.ప్రవచనకర్త చిరునవ్వు నవ్వి, ‘దానమంటే అవే కాదు నాయనా! నీవు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి, పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి రక్తదానం చేయి. అది మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది’ అని సూచించారు. ‘నిజమే కదా’ అనిపించింది ఆ యువకుడికి. మరుసటి వారమే పట్టణానికి వెళ్ళి రక్తనిధి కేంద్రంలో రక్తమిచ్చి వచ్చాడు. అయితే, రక్తదానం చేసిన అతడికి ప్రవచనకర్త చెప్పినంత గొప్ప అనుభూతి ఏదీ కలగలేదు. మరలా వచ్చే ΄పౌర్ణమి రోజున ప్రవచనకర్త ఊరి రచ్చబండ వద్దకు వచ్చారు. ‘రక్తమిచ్చాను కానీ అందులో నాకు ప్రత్యేకమైన ఆనందమేదీ కలగలేదు’ అని చెప్పాలని ఆ యువకుడు అక్కడికి వెళ్ళాడు. అయితే, అక్కడ ఆ యువకుడి కోసం ఒక వృద్ధ జంట ఎదురుచూస్తోంది.వారు ఎంతో గౌరవంగా ఆ యువకుడికి మిఠాయిలు, పండ్లు ఇచ్చి చేతులెత్తి దణ్ణం పెట్టారు. ఆశ్చర్యంగా వారివైపు చూశాడు ఆ యువకుడు. ‘ఈ మధ్య మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పుడు మీరు ఇచ్చిన రక్తం అతడి ప్రాణాన్ని కాపాడింది. అందుకే మీకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చాం’ అని వారు చెప్పారు. ఆ మాటలతో యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దానం చేయడానికి సంపద కన్నా గొప్ప మనసు ఉంటే చాలని అతడికి అర్థమైంది. వెంటనే ప్రవచనకర్త వైపు తిరిగి తలవంచి నమస్కరించాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
అలనాటి అస్త్రాలు... ఎంత శక్తిమంతాలు?
ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామంలో కౌరవ, పాండవులు ఉపయోగించిన అస్త్రాలు ఎలాంటివి? ఎంత శక్తిమంతమైనవి ?... నేటి ఆయుధాలు, అణుబాంబులు, క్షిపణుల కంటే గొప్పవా?...? అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆనాడే ఉందా... అంటే....ఉందనే చెప్పాలి... నాటి ఆయుధాలు రష్యా, ఉక్రై యిన్, అమెరికా, ఇరాన్ ల మధ్య జరుగుతున్న యుద్దాల మధ్య వినియోగిస్తున్న ఆయుధాల కంటే ఎన్నో వేల రెట్లు శక్తి మంతమైనవని చెప్పుకోవచ్చు. ఈ అస్త్రాలన్నీ భగవత్ ప్రసాదితమైనవి. అందుకే ఎంతో ఉపాసన, దీక్షలతో పాటు, తగిన మంత్ర, తంత్రాలతో ప్రయోగించాలి. మహాభారత సంగ్రామంలో వినియోగించిన కొన్ని శక్తి మంతమైన అస్త్రాల గురించి తెలుసుకుందాం.....చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధంగా మహాభారత యుద్దాన్ని చెప్పుకోవచ్చు. కురుక్షేత్రమనే ప్రదేశం, ఉత్తర భారత దేశం లోని ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఉంది. 18 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ యుద్ధంలో, 18 అక్షౌహిణిల సైన్యం అంటే. కౌరవులది 11 అక్షౌహిణిల సైన్యం కాగా పాండవులది 7 అక్షౌహిణుల సైన్యం. ఈ యుద్ధంలో 47 లక్షల, 23 వేల, 920 మంది పాల్గొంటే, అందులో కేవలం 10 మంది మాత్రమే మిగిలారంటే... భారీ జననష్టం సంభవించడానికి కారణం మహాభారత యుద్ధంలో ప్రయోగించబడిన అణ్వస్త్రాలే కారణమనే వాదన కూడా ఉంది. ఆ నాడు జరిగినది మామూలు యుద్ధం కాదని, అత్యంత ఉత్పాతాలు సృష్టించిందని పాశ్చాత్య చరిత్రకారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై దాదాపు శతాబ్ది కాలంగా, ఆయా ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలూ, సుదీర్ఘ చర్చలూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం 18రోజుల్లో 47 లక్షల పైబడి జనాభా మరణించడం అంటే, సామాన్యమైన విషయం కాదని, సాధారణ ఆయుధాలతో సాధ్యపడే విషయం అంతకంటే కాదని శాస్త్రవేత్తలే అంటున్నారు. మన ధార్మిక గ్రంథాలను లోతుగా పరిశీలిస్తే, రెండు రకాల ఆయుధాలను వివరించాయి. ఒకటి అస్త్రం, అంటే, మంత్రించి ప్రయోగించేది. రెండవది శస్త్రం, అంటే, హానికరమైన ఆయుధం. నేటి తరంలో, వీటిని పోల్చుకుంటే మిస్సైల్స్ లాంటివి కంటే ఎంతో శక్తిమంతమైనవని చెప్పుకోవచ్చు. వీటిలో ప్రధానంగా బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీర్షాస్త్రం,బ్రహ్మాండాస్త్రం, సుదర్శన చక్రం, నారాయణాస్త్రం, వజ్రాయుధం, పాశుపతాస్త్రం, శక్తి ఆయుధం, నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాసవి శక్తి, గాండీవం తదితరాలను చెప్పుకోవచ్చు.మరి మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాలను గురించి ముందు వారాలలో మరింత వివరంగా తెలుసుకుందాం...– సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?
ఒక సభలో జ్ఞాని, మేధావి అయిన వ్యక్తి భారతీయ సనాతన ధర్మం, సంస్కృతులపై అనర్గళంగా, అద్భుతంగా ప్రవచనం చెబుతున్నాడు. గంగాఝరిలా ఆయన ఉపన్యాసం సాగుతోంది. వందల మంది శ్రోతలు మైమరచి ఆయన ప్రవచనం ఆనందంగా వింటున్నారు. ఇంతలో ఒక తుంటరి యువకుడు లేచి నిలపడి, ఆయన వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ ‘మంత్రానికి శక్తి ఉన్నదా?’ అని ప్రశ్నించాడు. అయోమయానికి గురైన శ్రోతలు ఆందోళన చెందారు.ఆ ఉపన్యాసకుడు ఆ యువకుని వైపు కాసేపు నిశ్చలంగా చూసి ‘ఏం కూశావురా వెధవా!’ అని బిగ్గరగా అరిచాడు. అందరూ విస్తుపోయారు. ఇలా అందరి ముందు తనని అవమానించిన ప్రవచనకారునిపై ఆ యువకునికి విపరీతమైన క్రోధం కలిగింది. రక్త ప్రవాహ వేగం హెచ్చి ఆ యువకుని బుగ్గలలోకి ప్రవహించి అవి ఎరుపెక్కాయి. పెదవులు వణకుతున్నాయి. ఎర్రని నిప్పు క ణికల లాగా అతని కళ్ళు కెంపులయ్యాయి. అతను వెంటనే తన పొడవాటి చొక్కా చేతులు పైకి మడవ సాగాడు. పిడికిలి బిగించి భౌతిక దాడికి సిద్ధమయ్యాడు. సభలో స్తబ్ధత ఏర్పడింది. రెండు నిముషాలాగి ఆ ప్రవచనకారుడు బిగ్గరగా నవ్వాడు. తర్వాత ఇలా అన్నాడు. ‘నాయనా! అప్పటికప్పుడు, అనాలోచితంగా, ముందుగా అనుకో కుండా నేను పలికిన నాలుగు సాధారణ అక్షరాల పదమైన ’ మాట ఎంత మార్పు తెచ్చిందో గమనించావా? నీ కళ్ళు ఎర్రబడి, దేహమంతా వణుకుతూ, కోపంతో ఊగిపోతున్నావే! అనాలోచితంగా అన్న మాటకే ఇంత శక్తి ఉంటే, నేను ఏకాగ్రతతో, ధ్యాన నిమగ్నుడనై గాయత్రీ మంత్రం జపిస్తే దానికి అపరిమితమైన శక్తి ఉండదంటావా?’ అని సౌమ్యంగా, అనునయంగా అడిగాడు. సభా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ యువకుడు మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది శబ్దానికి, మాటకు ఉన్న శక్తి. – డా. గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
ముహర్రం నెల అల్లాహ్ మాసం..
ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ) ఆరంభం కేవలం క్యాలెండర్ మారడం కాదు; అది అంతరాత్మను రగిల్చే ఒక అద్భుత అవకాశం. నూతనత్వాన్ని వేడుకలతోనే ముగించకుండా, ఆత్మపరిశీలనతో స్వాగతించాలని ఇస్లాం బోధిస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత పవిత్రమైనవి ‘ముహర్రమ్’ నెలలోని మొదటి పది రోజులు. ప్రవక్త ముహమ్మద్ (స) ఈ నెలను ‘షహ్రుల్లాహ్’ (అల్లాహ్ మాసం) అని పిలిచారు.1. ఆషూరా మహత్తు.. ఒక దైవిక అద్భుతం.ముహర్రమ్ 10వ రోజును ‘ఆషూరా’ అంటారు. నాడు క్రూరుడైన ఫరోసైన్యం నుంచి ప్రవక్త మూసా (మోషే), అతని అనుచరులను అల్లాహ్ ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చి కాపాడిన అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది. ఈ దైవిక రక్షణకు కృతజ్ఞతగా ప్రవక్త మూసా ఉపవాసం ఉండేవారు. ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముహర్రమ్ 9, 10 తేదీలలో ఉపవాసం ఉండటం ముస్లింలకు పుణ్యప్రదం. నిష్ఠతో ఉండే ఈ ఒక్క రోజు ఉపవాసం.. గడిచిన ఏడాది కాలపు చిన్నపాపాలన్నింటినీ తుడిచిపెడుతుందని ప్రవక్త నమ్మకాన్ని వ్యక్తపరిచారు.2. ఆచరించాల్సిన ముఖ్యమైన పుణ్యకార్యాలుఈ పది రోజులను వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఈ అలవాట్లను భాగం చేసుకోవాలి:ఉపవాసాలు: రంజాన్ తర్వాత నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలకు అత్యుత్తమమైన మాసం ఇదే.దైవస్మరణ (జిక్ర్): ‘సుబ్హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్హానల్లాహిల్ అజీమ్‘ లాంటి పదాలతో నోటిని పవిత్రంగా ఉంచుకోవడం.పశ్చాత్తాపం (తౌబా): గడిచిన ఏడాది తప్పులను ఒప్పుకుంటూ, నూతన సంవత్సరంలో సన్మార్గంలో నడవాలని సంకల్పించడం.దానధర్మాలు (సదఖా)పవిత్ర మాసంలో చేసే చిన్న సహాయానికైనా పుణ్యం రెట్టింపు అవుతుంది.ఖురాన్ పఠనం: నిత్యం దైవవాణిని చదవడం, దాని భావాన్ని అర్థం చేసుకోవడం.జీవిత పాఠంఆషూరా కథ నేటి మానవాళికి ఒక గొప్ప ధైర్యం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక వేదనల రూపంలో మన ముందు ‘ఎర్రసముద్రం’ లాంటి అగాధం ఉన్నప్పుడు.. ప్రవక్త మూసా చూపిన పరిపూర్ణ విశ్వాసమే మనకు శరణ్యం. ‘నా ప్రభువు నా వెంట ఉన్నాడు, ఆయన నాకు తప్పక మార్గం చూపుతాడు‘ అనే నమ్మకంతో ప్రార్థిస్తే, దైవం మన కష్టాల సముద్రాన్ని చీల్చి కొత్త దారి చూపిస్తాడు.త్యాగాల స్మరణ...ఆషూరా రోజున ప్రవక్త ముహమ్మద్ (స) ప్రియ మనవడు హజ్రత్ హుసైన్ , వారి అనుచరులు ‘కర్బలా’ మైదానంలో సత్యం, న్యాయం కోసం ప్రాణాలర్పించారు. వారి అమరత్వాన్ని గుండెల్లో స్మరిస్తూనే, ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే నిజమైన విశ్వాసి లక్షణం. జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ పది రోజులు మీ జీవితంలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!– ముహమ్మద్ ముజాహిద్ -
మహా శివమ్: చెంగల్ శివ పార్వతి క్షేత్రం
మహేశ్వరా! మహాశివా పరమ శివా అని ఈశ్వరుని ఆరాధిస్తాం. అంటే మహాపర్వతం మీద వాసం ఉండేవాడు అని అర్ధం. అంతటి మహాశివుడికి పెద్ద మహా శివాలయాన్ని కేరళలో నిర్మించారు. నిరూపధారిగా లింగ రూపంలో మహా మహా రుద్రాలను తనలో ఆవహించుకున్న మహాదేవుడు లోక రక్షకుడు పరమ శివుడు. మన పుణ్యభూమిలో పలుచోట్ల జ్యోతిర్లింగాలు... ఆత్మలింగాలుగా కొలువుదీరాడాయన. అలాంటి మహాలింగం కేరళలో నిర్మించారు.కేరళ రాజధాని తిరువనంతపురానికి దగ్గర నెయ్యాటింకర అనేప్రాంతంలో ఉంది. నూట పదకొండు అడుగుల ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్టించారు.అక్కడ ఎనిమిది అంతస్థులలో మన దేశంలోకెల్ల పెద్ద శివ క్షేత్రం. దీని పేరు చెంగల్ శివ పార్వతి క్షేత్రం. ఈ స్థల మహాత్మ్యం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ రెండు సార్లు అతి రుద్ర యజ్ఞం చేశారు. అలాగే మరెన్నో సార్లు అతిరుద్ర యజ్ఞం చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఒకసారి అతి రుద్ర మహా యజ్ఞం చేయడమే గొప్ప విషయం. చెంగల్ శివ పార్వతి క్షేత్రం ఉన్న ప్రదేశం ఎంతో పుణ్యభూమిగా భావిస్తారు.ఈ స్థలానికి ఉండే మహత్వాన్ని గమనించి స్వామి మహేశ్వరానంద సరస్వతి ఈ మహా శివలింగ ప్రతిష్ట కోసం పూనుకున్నారు. వీరికి కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి మంత్ర దీక్ష ఉపదేశించారు. ఈ పుణ్యస్థలం పేరు పుట్టురాకల్. ఇక్కడే శివపార్వతులు పుట్టరూపంలో వెలిశారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో దొరికిన ఆధారాల వలన దేవాలమం 5 వేల ఏళ్ళ పురాతనమైనది అని తెలిసింది. దేశం నలుమూలల నుంచి మట్టి, పవిత్ర నదీ జలాలు వనమూలికలు తెచ్చి నిర్మించారు. మూలాధారంగా వినాయకుడు సరస్వతి బ్రహ్మ రూపాలను ప్రతిష్టించారు. మొదటి అంతస్థు భూ మట్టానికి కింద నిర్మించారు.64 మహారూపాలలో శివుని విగ్రహాలను ఉంచారు. భక్తులు కూర్చుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు అలాగే ప్రతి అంతస్థులో ఓంకారనాదం వినిపిస్తుంటుంది. పంచభూతాలు తనలో ఇమిడి ఉన్నట్టుగా ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఏడవ అంతస్తులోకి వెళితే కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది మనకి. సహస్రదళ పద్మాకృతి కింద శివ పార్వతి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలోకి వెళ్లడం మనస్సుకి ప్రశాంతంగా ఉండడం గమనించవచ్చు. కింద అంతస్థులో శివలింగ ప్రతిష్ట ఉంది ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల భావన కలిగిన శివ ప్రతిష్ట అద్భుతం. శివపార్వతుల తనయునికి ఇక్కడ చాలప్రాధాన్యత ఉంది. అందుకే 32 విఘ్నేశ్వర రూపాల ప్రతిష్ట ఉంది. బాల గణపతి నుండి యోగ గణపతి వరకు ఉన్న రూపాలకి నిత్యపూజలు జరిపే దేవాలయం ఇక్కడ మాత్రమే ఉంది.అసామాన్య శిల్పకళాచాతుర్యంమహాబలి పురం నుండి వచ్చిన శిల్పుల కళాచాతుర్యం ఇక్కడ ఉన్న విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. రుద్రుడు అంటేనే మానవ కష్టాలను హరించేవాడు అని అర్ధము. మహా రుద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతి రుద్ర మహా యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేయడం నిజంగా ఎంతో మహత్తర విషయం. పదకొండు రోజులపాటు 121 మంది వేద పండితులు 121 కలశాలతో అభిషేకం, పదకొండు సార్లు రుద్రా మంత్రం జపిస్తే ఫలప్రాప్తి కలుగుతుంది .అటువంటిది రెండుసార్లు జరగడం శివుని శక్తికి నిదర్శనం అని నమ్ముతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా భావంతో ఇక్కడకు భక్తులు వస్తుంటారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంచెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం 111.2 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివలింగం గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇంతకుముందు, కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలోని 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైనది గా ఉండేది.10 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 లోప్రారంభమైంది, దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. దాని ఎత్తు మాత్రమే కాదు, దాని విశిష్టమైన స్థూపాకార నిర్మాణం, దానిలోపల దాగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యాలు కూడా చూడటానికి ఒక అద్భుతం.కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాసం వంటి వివిధ పుణ్యక్షేత్రాల నుండి నీరు, ఇసుక, మట్టిని కూడా నిర్మాణ సామగ్రిలో కలిపారు. అందువల్ల, చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం ఒక దైవిక నిర్మాణంగా భావిస్తారు. ఈ కట్టడంలో 8 అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఆరు అంతస్తులు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తికేంద్రాలకుప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ అంతస్తులలో భక్తులు, యాత్రికులు, పర్యాటకులు ఆయా చక్రాలపై ధ్యానం చేయడానికి 6 ధ్యానమందిరాలు ఉన్నాయి. ఈ కట్టడం మొదటి అంతస్తులో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.భక్తులు మహా శివలింగంలోకి ప్రవేశించవచ్చు. ఈ శివలింగం లోపల, శివలింగం విశ్వ ప్రభావాన్ని అనుభవించడంతో పాటు, శరీరంలోని చక్రాల శక్తిని పెంచుకోవడానికి ధ్యానం కూడా చేయవచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
పసుపు కొమ్ము అలా పుట్టింది..! అందుకే గణపతిని..
పసుపు కొమ్ము గణపతి దీన్నే హరిద్రా గణపతి అంటారు. అష్టోత్తరంలో ఓం హరిద్రా గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తుంటాం. గురు గ్రహ అనుగ్రహం కోసం హరిద్రా గణపతిని పూజించాలని పండితులు చెబుతుంటారు. గురువు అనుకూలంగా లేనివారు పసుపుకొమ్ము గణపతిని పూజించి ఉపశమనం పొందవచ్చని జ్యోతిష నిపుణులు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో పసుపు కొమ్ము గణపతి ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటి? పశువు కొమ్ము కాస్తా పసుపు కొమ్ముగా ఎలా మారింది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..?పూర్వం త్రిపురాసురలనే రాక్షసులుండేవారు. వారు తమను ఏకకాలంలో చంపాలనే వరాన్ని పొంది ఉన్నారు. దాంతో నందీశ్వరుడు ఆ ముగ్గురిని తన త్రిశృంగములతో అంటే మూడు కొమ్ములతో ఏకకాలంగా పైకెత్తగా శివుడు తన త్రిశూలంతో ముగ్గురిని సంహరించాడు. అయితే శివుడి త్రిశూలం ధాటికి నంది మధ్య శృంగం అంటే మధ్యలో ఉండే కొమ్ము ఊడిపోయి, కింద పడిపోయింది. దాన్ని గమనించిన పరమేశ్వరుడు పశువు కొమ్మును పసుపు కొమ్ముగా మారేలా వరమిచ్చి విఘ్నేశ్వర మూర్తి రూపంలో ఆ పసుపు కొమ్ముకు హరిద్రా గణపతిగా పూజలు అందుకునే వరాన్ని ఇచ్చారు.శుభానిక ప్రతీక..అందుకే హల్దీ..పసుపు కమ్ము గణపతి శుభానికి ప్రతీక. గురు గ్రహం పసుపు వర్ణానికి అధిపతి. శుభకార్యాల్లో కూడా పసుపు వర్ణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పెళ్లికి ముందు హల్దీ వంటి వేడుకలు.. పసుపు బట్టలతో పెళ్లి పీటలపై వధువరులను కూర్చోబెట్టడం వంటివి ఉదాహరణలు. అర్చనలు ఆధ్యాత్మిక క్రతువుల్లో కూడా పసుపునకు ప్రాధాన్యం ఉంది. ఇక జ్యోతిష్య శాస్త్రంలో గురువు జ్ఞాన కారకుడు, సంతాన కారకుడు గురువు అనుగ్రహంతో పాటు గృహ సౌఖ్యం ఆచారాలు మొదలైన వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు పసుపు కమ్ము గణపతిని పూజించడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. జాతకంలో గురువుస్థానం సరిగ్గా లేనప్పుడు కాలేయ సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఇక పైకి తెలియకుండా లోపల లోపలే విస్తరించే షుగర్, కేన్సర్ వంటి వ్యాధులు కూడా గురువు అనుగ్రహం లేకపోవడం వల్లనే కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇలాంటి వారు పసుపు కమ్ము గణపతిని పూజించాలని పెద్దలు చెబుతున్నారు.గురుసేవ, గురుపారాయణం..అయితే గురు గ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు వచ్చే దుష్ఫలితాల భారి నుంచి కొంతలో కొంతైనా తప్పించుకునే మార్గాలు లేకపోలేదని పెద్దలు చెబుతున్నారు. దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి రామకృష్ణ పరమహంస వంటి గురువులను పూజించడం వల్ల బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చని దక్షిణామూర్తిని స్మరించడం వల్ల గురువును శాంతింపచేసి ఆయన ద్వారా ప్రాప్తించే వ్యతిరేక ఫలితాల నుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతున్నారు. శనగలు గురు సంబంధమైన ధాన్యంగా చెబుతారు. వాటిని దానం చేయడం వలన కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా గురు పారాయణం గురు ధ్యానం గురు స్మరణ గురుసేవ మాత్రమే గురు గ్రహం అనుగ్రహానికి కారణం అవుతాయని చెబుతుంటారు. అనేక వ్యాధుల బారి నుంచి దూరంగా ఉంచడానికి గురువు ఒక్కడే కారణమని అందుకోసం హరిద్రా గణపతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. హరిద్రా గణపతిని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న వారికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ధన కనుక వస్తువాహనాభివృద్ధి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పసుపు గణపతిని పూజించడం వల్ల దేహం కాంతిమంతంగా మెరుస్తుంది. అంటే చర్మరోగాలు దరిచేరవు. ఒకవేళ చర్మ వ్యాధులు ఉన్నట్లయితే అవి నయంవుతాయని చెబుతారు. వ్యాపారులు కూడా ఓల్డ్ స్టాక్ ను క్లియర్ చేయడానికి ఆయా వస్తువులను హరిద్రా గణపతితో తాకించడం మనం ఉత్తరాదిలో ఎక్కువగా చూస్తుంటాం. రుణ విముక్తికి ధన లాభానికి హరిద్రా గణపతిని పూజించడం చక్కటి మార్గంని పెద్దలు వివరిస్తున్నారు. (చదవండి: ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు? ఇంతకీ ఎవరు వాళ్లు??) -
సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి.ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు..అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ. 30,000లను జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వారి బాటలోనే ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని వెండి ఖడ్గాన్ని సమర్పించారు. ఆలయ చరిత్ర..పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి అతడ్ని మూసాసురుడిగా పిలిచేవారు. అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్ఞయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట. ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. అమ్మవారి మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండేదని.. కానీ అక్కడకు వెళ్లడం భక్తులకు కష్టంగా ఉండటంతో శంకరాచర్య ఆలయాన్ని కొల్లూరులో తిరిగి ప్రతిష్ఠించారని చెబుతుంటారు స్థానికులు.అంతేగాదు ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.ఈ అమ్మ ఆసీస్సుల కోసమే ఎందుకంటే..ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. అంతేగాదు ఈ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిగా (లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపిణిగా) భక్తులు విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో జయాలు సాధించిన తర్వాత, తమ పదవికి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు, చండీ యాగం వంటివి నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. అందుకే సామాన్య భక్తుల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు.🚨 Why CM Vijay’s visit to the Kollur Mookambika Temple is a massive political statement.Tamil Nadu Chief Minister Vijay is visiting the Kollur temple in Karnataka today at 3 PM. While it looks like a standard spiritual visit, the historical context is fascinating.He is…— MacroMatrix (@MacroMatrix1) June 12, 2026 (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
చెడు స్నేహానికి ప్రతీక శకుని
మహాభారతయుద్ధంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దుష్టచతుష్టయంలో ఒకరుగా పేరుగాంచి, కౌరవులకు మేనమామగా, వారిలో యువరాజైన దుర్యోధనునికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించి అన్నీ తప్పుడు సలహాలు, సూచనలిచ్చి కౌరవులకు కీడు తలపెట్టడంతో, పాండవులకు మేలు జరిగేది. శకుని ఉద్దేశ్యం కూడా ఇదే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాంధహార్ ఆనాటి గాంధార దేశం. గాంధారదేశపు రాజు సుబలుడు, రాణి సుధర్మల కుమారుడే శకుని. సుబలునికి వందమంది కుమారులు, గాంధారి అనే కుమార్తె ఉన్నారు. అందరిలో ఆఖరివాడే శకుని. ఇతని అసలు పేరు సుబలోత్తముడు. అపారమైన తెలివితేటలు కల్గిన, శకుని ‘చౌసర్’ అనే మాయా జూదపు ఆటలో మంచి నేర్పరి. శకుని ప్రాణప్రదంగా అభిమానించే తన సోదరి గాంధారిని, కౌరవ సామ్రాజ్యాధీశుడు, పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి పట్టమహిషిగా చేయాలని భీష్ముడు భావించాడు. అయితే జాతకం ప్రకారం గాంధారికి వైధవ్య యోగం ఉందని తెలిసిన శకుని తన సోదరి అంటే ఉన్న వల్లమాలిన అభిమానంతో, ఈ విపత్తు నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో, జ్యోతిష్యుల సూచనలు, సలహాల మేరకు గాంధారికి మొదటగా ఓ మేకతో వివాహం జరిపించి, అనంతరం ఆ మేకను బలిచ్చి ఆపై ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తే ఆ దోష పరిహారం అవుతుందని ఆ విధంగా చేశాడు. వివాహానంతరం ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆగ్రహం చెంది సుబలుని కుటుంబాన్ని చెరశాలలో బంధించి, మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు. చెరసాలలో ఉన్న సుబలుని కుటుంబానికి ఇచ్చే ఆహారం ఒక్కరికి మాత్రమే సరిపోయేది. మిగిలిన సోదరులు ఆహారాన్ని తమలో తెలివైన, ఆఖరి సోదరుడైన శకునికే పెట్టి ఎలాగైనా కౌరవులపై పగ తీర్చుకోవాలని ప్రమాణం చేయించుకున్నారు. అనంతరం క్షుద్బాధతో తండ్రి, ఒక్కొక్క సోదరుడు మృతి చెందారు. తన తండ్రి మరణానంతరం అతని తొడ ఎముకతో తయారైన పాచికలను వినియోగిస్తూ, తాను అనుకున్న సంఖ్య పడేలా శకుని వరం పొందాడు. ఆ పాచికలతో శకుని మాయాజూదం ఆడి మోసపూరితంగా పాండవులను ఓడించి, కౌరవులచే మరిన్ని అన్యాయాలు, అక్రమాలు చేయిస్తూ మహాభారత యుద్ధం జరిగేలా పథకం రచించి కౌరవవంశాన్ని నాశనం చేసాడు. అయితే మహాభారత యుద్ధంలో ఆఖరిరోజున (18వ రోజు)సహదేవుని చేతిలో శకుని మరణించాడు. ఇదిలావుండగా శకునికి కూడా గుడి ఉంది. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం నిర్మించారు అక్కడి కురువర్ తెగ ప్రజలు. అయితే అక్కడ ఏ విధమైన శకుని విగ్రహం ఉండదు.– సి.ఎన్. మూర్తిసీనియర్ పాత్రికేయులు -
ఇవాల్టి నుంచే యమునా నది పుష్కరాలు ప్రారంభం
దేవగురువు బృహస్పతి జూన్ 2, మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13, శనివారం తో ముగుస్తాయి. ఈ పన్నెండు రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు.యమ బాధలు తీర్చే పవిత్ర స్నానం!పురాణాల ప్రకారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి యమునా దేవి కుమార్తె. యమధర్మరాజుకి స్వయాన సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే యమ బాధలు తొలుగుతాయని విశ్వాసం. సూర్యుడి సంతానంలో యముడు, యమున, శని ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. ఈ భూమ్మీద మానవుడు చేసే పాప పుణ్యాల కర్మను శని భగవానుడు అనుభవింపజేస్తాడు. జీవుడు ప్రస్తుత జన్మలో, అనేక జన్మల ద్వారా ఏర్పడిన పాప పుణ్య కర్మల ఫలితాలను మరణం తర్వాత యమధర్మరాజు చూస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమ బాధలు, పాపాల నుంచి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అందువల్లే, శ్రీకృష్ణుడు స్వయంగా యమునా నది ఒడ్డున జన్మించడంతో పాటు ఈ నదితో ముడిపడి అనేక పురాణ విషయాలు ఉండటం యమున వైభవాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.భారతీయ సనాతన ధర్మం, పురాణాలలో యమునను కాళిందీ నదిగా పేర్కొన్నారు. 'యమునా నది కృష్ణ ప్రియః' అంటే యమునా నది కృష్ణుడికి ప్రియమైనదిగా చెబుతారు. యమునా నది నీటి స్పర్శ తాకితే పాపాల తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ,తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ, ఆత్మశుద్ధి వంటివి కలుగుతాయని విశ్వాసం. మరీ ముఖ్యంగా ఇక్కడ పుణ్యస్నానంతో శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగలరని శాస్త్రవచనం. ఇంతటి విశేషం, మహత్యం కలిగిన నదికి పుష్కరాలు రావడం, పుష్కరాల్లో భక్తి శ్రద్ధలతో స్నాన విధి ఆచరిస్తే విశేష ఫలితాలు దక్కుతాయని విశ్వాసం.జ్యోతిష శాస్త్రం ప్రకారం.. దేవగురువు అయిన బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తుంటాయి (ఉదా: బృహస్పతి మేష రాశిలో ఉంటే గంగా నదికి , వృషభంలో పరాభవ నామ సంవత్సరంలో దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి 13 వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి.ఎక్కడ స్నానమాచరించాలి ?యమునా నది ప్రవహించే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పుణ్య ఫలాలు పొందుతారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం ఆచరించవచ్చు. గంగా , యమున , సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర సంగమంలో పుష్కర స్నానమాచరించడం విశేష పుణ్యఫలం లభిస్తుంది.మథుర/బృందావనం: శ్రీకృష్ణుడు స్వయంగా జన్మించి తన బాల్యాన్ని గడిపి, లీలలను ప్రదర్శించిన ప్రాంతమిది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఘాట్లలో పుష్కర స్నానం ఎంతో విశేషం.యమునోత్రి: యమునా నది జన్మస్థలం ఇది. ఇక్కడ యమునా నదిని దర్శించుకొని పుష్కర స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం.ఇంద్రప్రస్థం (ఢిల్లీ): పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా చేసుకొని అనేక యజ్ఞయాగాదులు చేసిన పవిత్ర ప్రదేశమిది. ఇలా ఈ పుణ్య నది పరిసర ప్రాంతాల్లో పురాణాలకు సంబంధించిన విశేషం ఉన్న ప్రాంతాల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిదిఏయే దానాలు చేస్తే మంచిది ?పుష్కరస్నానం అనంతరం దానం (అన్నదానం గోదానం , భూదానం , సువర్ణదానం , లవణదానం, పుస్తక దానం వంటివి) చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. యజ్ఞ యాగాదులు, హోమాలు వంటివి నిర్వహించడం లేదా ఆయా పవిత్ర కార్యాల్లో పాల్గొనడం వంటివి ఆచరిస్తే పుణ్యం.పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం. పుష్కరాల్లో పురాణ పఠనం, మంత్రోచ్ఛారణ , భగవన్నామస్మరణ , జపం , తపం వంటివి ఆచరించడం ఉత్తమం.పుష్కరాలంటే సబ్బులు , శాంపూలతో స్నానమాచరించి నదులను కలుషితం చేయడం కాదు. యత్ర స్వచ్ఛః తత్ర లక్ష్మి అన్నారు పెద్దలు. పుష్కరాల్లో స్నాన విధిని అనుసరించి పురుషులు పంచె వంటివి ధరించడం , మహిళలు తమకు సౌకర్యమైన చీరవంటివి ధరించడం, దంపతులైతే భార్య , భర్త కొంగుముడి వేసుకొని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో చేసే స్నానం పుష్కర స్నానం. ఇలా స్నానమాచరించి దేవతలకు, రుషులకు, నదికి అర్ఘ్యం సమర్పించడం, పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది నదులలో చెడు పదార్థాలను విడిచిపెట్టడం పాతకం వీటిని దృష్టిలో ఉంచుకొని పుణ్యార్చన కోసం భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలని సూచన.పుష్కర స్నాన మహత్యంనదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మనం కూడా యమునా నది పుష్కరాలలో స్నానమాచరించి మోక్షాన్ని పొందుదాం. (చదవండి: శ్రీ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక వైభవం.) -
బక్రీద్ అహంకార త్యాగం... స్నేహోత్సవం
బక్రీద్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది ‘ఖుర్బానీ’ లేదా త్యాగం. కానీ ఆ త్యాగం కేవలం జంతువు వరకే పరిమితమై ఉండదు. నిజమైన త్యాగం అంటే మనలోని అహంకారాన్ని వదిలేయడం, స్వార్థాన్ని త్యజించడం. మనకు ఉన్నదాంట్లో కొంత అవసరమైన వారికి పంచడం. మన ఇష్టాల కంటే దేవుని ఆజ్ఞకు, మానవత్వానికి ప్రాధాన్యమివ్వడం. బక్రీద్ మనిషికి నేర్పే అసలు పాఠం ఇదే.సాధారణంగా పండుగ అంటేనే ఆనందం, కొత్తబట్టలు, పిండివంటలు అనుకుంటాం. కానీ, బక్రీద్ పర్వదినం వెనుక ఒక గొప్ప సామాజిక సందేశం దాగి ఉంది. దైవాజ్ఞను శిరసావహిస్తూ ప్రాణసమానమైన కుమారుడిని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం మనకు కేవలం భక్తిని మాత్రమే కాదు, సమాజం కోసం స్వార్థాన్ని వదులుకోవాలనే గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.పంపిణీలో సమానత్వంపండుగ రోజున చేసే ఖుర్బానీ, దానధర్మాల వెనుక ఉన్న అసలైన పరమార్థం సామాజిక సమానత్వమే. ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి... ఒక భాగం పేదలకు, ఒక భాగం బంధుమిత్రులకు, మరొక భాగం తమ కుటుంబానికి కేటాయించే సాంప్రదాయం ఇందులో ఉంది. సంపాదన ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరికీ పండుగ ఆనందం అందాలనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ వ్యవస్థ ఏర్పాటయింది. ఇందులో ఎక్కడా కులాల, మతాల ప్రస్తావన ఉండదు, కేవలం మానవత్వం మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటుంది.మన భారతదేశం ఎప్పుడూ గంగా – జమున తహజీబ్కు, అంటే భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దంగా ఉంది. ఒకరి పండుగను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావడం ఇక్కడి సంస్కృతి. హిందూ ముస్లింసోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ప్రేమాభిమానాలను పంచుకోవడం మన సమాజానికి ఉన్న అసలైన బలం.అపోహలు వీడాలి – సామరస్యం పెరగాలిప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత పండుగల సందర్భాలలో అనవసరమైన విమర్శలు, అపోహలు ప్రచారంలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో విజ్ఞత గల సమాజంగా మనం మరింత బాధ్యతగా వ్యవహరించాలి. పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, నైతిక కోణాలను అర్థం చేసుకోకుండా కేవలం బాహ్య ఆచారాలను మాత్రమే విమర్శించడం సరికాదు. ప్రతి మతంలోనూ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించే సంప్రదాయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, గౌరవించినప్పుడే పరమత సహనం అనే పునాదిపై మన సమాజం మరింత బలంగా నిలబడుతుంది. ముఖ్యంగా యువత ఇరువర్గాల సంస్కృతులను అర్థం చేసుకుంటూ, డిజిటల్ ప్రపంచంలో సైతం శాంతిని, సామరస్యాన్ని పెంపొందించేలా సానుకూల సందేశాలను వ్యాప్తి చేయాలి.కులమతాల పట్టింపులను పక్కన పెట్టి, మానవులంతా ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించి, ద్వేషాలను వీడి స్నేహ హస్తాలను చాచుకుంటూ ముందుకు సాగడమే ఈ బక్రీద్ పర్వదినం మనకు అందించే అసలైన సందేశం. ఈ పర్వదినం అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపి, సమాజంలో సరికొత్త సామరస్యానికి బాటలు వేయాలని ఆకాంక్షిద్దాం.పండుగ జరుపుకోవడంలో సామాజిక బాధ్యతమారుతున్న కాలంతోపాటు పండుగలు జరుపుకునే విధానంలో సామాజిక బాధ్యత కూడా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ఇరుగు΄÷రుగు వారి భావోద్వేగాలను గౌరవిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కూడా ఒకరకమైన సామాజిక త్యాగమే అవుతుంది. ఒకరికొకరు ఇబ్బంది కలగకుండా శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకున్నప్పుడే ఆ పండుగకు పరిపూర్ణత లభిస్తుంది. – మదీహా అర్జుమంద్ -
ఇవాళ నుంచే రోహిణి కార్తె ప్రారంభం..! రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే 'రోహిణి కార్తె' (Rohini Karthi 2026) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం , గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగభగమండనున్నాయి.'రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా?'వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే, రోహిణి కార్తెలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు "రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి" అనే సామెతను వాడుకలోకి తెచ్చారు.వ్యవసాయ పంచాంగం - ఏరువాక ప్రారంభం:సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో కార్తెగా పిలుస్తారు. ఏడాదికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి.రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుండి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది.ఈ సమయంలోనే తొలకరి జల్లులు కురుస్తాయి.దీనిని బేస్ చేసుకుని రైతులు తమ పొలాల్లో 'ఏరువాక' పనులను ముమ్మరం చేస్తారు.రోహిణి కార్తెలో చేయకూడని పనులు ఇవే:ఈ పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచించారు:శుభకార్యాలు వద్దు: రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యాలు లేదా కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.ఆహార నియమాలు: శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ, సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.ప్రయాణాలు వాయిదా: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం, శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.(చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
ఆధ్యాత్మికతతో సమతుల్యత
యాంత్రిక జీవనంలో మనిషి డబ్బు, హోదా వెనుక పరుగెత్తుతూ తనను తాను మర్చిపోతున్నాడు. సౌకర్యాలు పెరిగినా సంతోషం తగ్గుతోంది. ఈ క్రమంలో మనకు సమతుల్యతను నేర్పేది ఆధ్యాత్మికత ఒక్కటే! ఆధ్యాత్మిక జీవనంపై చాలామందికి భిన్నాభిప్రాయాలు... అంతకుమించిన అపోహలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికత అంటే ఏమిటో... ఆధ్యాత్మిక జీవనం అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం...ఆధ్యాత్మికత అనేది కేవలం మతం లేదా పూజా కార్యక్రమాలకు పరిమితమైనది కాదు. ఇది ఒక వ్యక్తి తన అంతరాత్మను తెలుసుకోవడానికి, విశ్వ చైతన్యంతో అనుసంధానం కావడానికి చేసే నిరంతర ప్రయాణం. ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు మనల్ని మనం గమనించుకోవడం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, కోపతాపాలు ఎలా పుడుతున్నాయో తెలుసుకోవడమే ప్రాథమిక చైతన్యం. ‘నేను కేవలం ఈ శరీరాన్ని మాత్రమే కాదు, అంతకు మించిన శక్తిన’ని గుర్తించడం ఇందులో ముఖ్యం (ఆత్మ వివేచన). లోకంలో తప్పులను వెతకడం మానేసి, తనలో తాను మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం. రోజులో కొంత సమయం మౌనంగా ఉంటూ, తన ఆలోచనలను గమనించుకుంటూ స్వీయ నియంత్రణ పాటించడం.ప్రస్తుత సమాజంలో మన జీవన విధానంలో అడుగడుగునా ఉద్వేగం, ఉద్రేకం, అనవసరమైన వేగం, వత్తిడి ఎక్కువయ్యాయి. ఓ పసిపిల్లకు నూటికి 98 మార్కులొస్తే వచ్చే సంతోషంకన్నా 2 మార్కులు పోయాయన్న బాధే ఎక్కువగా కనిపిస్తున్నది. చిన్న పార్శ్వం ఇది. ఒక పుస్తకంలో చదివి నేర్చుకునేది ఆధ్యాత్మికత కాదు, అనుభవపూర్వకంగా పొందాల్సింది. నిత్యం కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం, ప్రకృతిని గమనించడం, సాత్విక గుణాలను పెంపొందించుకోవడం ద్వారా ఎవరైనా ఈ మార్గంలో పయనించవచ్చు. అంతిమంగా, మనలోని దైవత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మిక శిఖరం.యువతరం ఆధ్యాత్మికతను ఒక పాతకాలపు ఆచారంగా కాకుండా, తమ వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించే ఒక శక్తిమంతమైన సాధనంగా స్వీకరించాలి. ఇది వ్యక్తిగత వికాసానికి, మానసిక ప్రశాంతతకు సార్థకమైన జీవితానికి మార్గం చూపుతుంది. నిజమైన ఆధ్యాత్మికత అనేది బాహ్య వేషధారణలోనో, మంత్రతంత్రాల్లోనో లేదు. అది మనిషి ప్రవర్తనలో, ఆలోచనా విధానంలో ప్రతిబింబించే పరిణతి. మన హృదయం ఎంత విశాలమైతే, మనం అంత ఆధ్యాత్మికంగా ఉన్నామని అర్థం.కేవలం ధ్యానం చేయడమే ఆధ్యాత్మికత కాదు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, జంతువుల పట్ల, ప్రకృతి పట్ల దయ కలిగి ఉండటం నిజమైన ఆధ్యాత్మిక లక్షణం. విశ్వంలోని ప్రతి జీవిలోనూ ఆ దైవత్వాన్ని చూడటమే దీని పరమార్థం. క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక సాధన చేసేవారిలో నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు నిండిన నేటి కాలంలో ఆధ్యాత్మికత ఒక మందులా పనిచేస్తుంది. ధ్యానం... ప్రార్థన మనస్సును నిలకడగా ఉంచుతాయి. ఉన్నదానితో తృప్తి చెందుతూ, లేనిదాని కోసం ఆరాటపడకుండా ప్రశాంతంగా ఉండటం అలవడుతుంది.ఆధ్యాత్మికత అలవడిన వ్యక్తికి చావు, పుట్టుకల పట్ల భయం ఉండదు. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించే పరిణతి వస్తుంది. అనవసరమైన వాదనలు, చర్చల కంటే మౌనంగా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. లోపల ప్రశాంతత ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలోని శబ్దాలు వారిని ఇబ్బంది పెట్టవు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వారు అసంతృప్తికి లోనుకాకుండా, ఆ సమయాన్ని ఆత్మ విమర్శకు వాడుకుంటారు. – తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి -
అహంకారంతో అసువులు బాసిన శిశుపాలుడు
మహాభారతంలో శిశుపాలుడిది ఒక ప్రత్యేక పాత్ర... నాలుగు చేతులు, మూడు కళ్ళతో చూసేందుకు భీతిగొల్పేలా పుట్టిన శిశుపాలుని ఎవరు ఎత్తుకొంటే సాధారణ రూపానికి చేరుకుంటాడో అతని చేతిలోనే మృత్యువు రాసి పెట్టి ఉందని ఆకాశవాణి పలుకుతుంది.శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుడు, సాత్వతిల కుమారుడు. సాత్వతి స్వయానా కృష్ణుని తండ్రి వసుదేవునికి సోదరి. అంటే కృష్ణుడికి మేనత్త. శిశుపాలుడు మేనత్త కొడుకు. ఇదిలావుండగా అంగవైకల్యంతో, చూసేందుకు భీతి గొలుపుతున్న శిశుపాలుని ఎత్తుకోమని, సాత్వతి అందరినీ కోరసాగింది.ఒకరోజు బలరామకృష్ణులు మేనత్తని చూడాలని ఛేది రాజ్యానికి వచ్చారు. అప్పుడే శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఎత్తుకున్నాడు. దీంతో అతడి వికృత రూపం పోయింది. తన కుమారుడు శిశుపాలునికి సాధారణ రూపం వచ్చినందుకు కలిగిన ఆనందం కంటే, మేనల్లుడి చేతిలో తన కొడుకు మరణిస్తాడనే ఆందోళన తో తనకు పుత్రభిక్ష పెట్టమని జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుని వేడుకుంది సాత్వతి. అర్హమైన వంద తప్పుల వరకు మన్నిస్తానని, ఆపై తప్పులు మీరితే సంహరిస్తానని తన మేనత్త అయిన సాత్వతి కి మాట ఇచ్చాడు. అందుకే శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు కృష్ణుడు ఎంతో సంయమనంతో ఉన్నాడు. దీనిని అలుసుగా తీసుకొని అహంకారం తో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయాడు. వసుదేవుని యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని సంహరించాడు. కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రువాహనుడి భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని తప్పులు, ఘోరాలు శిశుపాలుడు చేసినా ఇచ్చిన మాట ప్రకారం శ్రీకృష్ణుడు ఓపిక పట్టాడు. ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగంలో భాగంగా ఛేది దేశానికి వచ్చిన భీముడిని, శిశుపాలుడు ఆదరించాడు. యాగం కోసం ధనం కూడా అందించాడు. ధర్మరాజు ఆహ్వానం మేరకు సభకు వచ్చాడు. తొలి అర్ఘ్యానికి శ్రీ కృష్ణుడే అర్హుడని భీష్ముడు చెప్పడంతో శిశుపాలుడు ఆగ్రహించాడు.ఒక యాదవుడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు మాట్లాడి శ్రీ కృష్ణుని అవమానించాడు శిశుపాలుడు. భీష్మపితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశపడితే భీష్ముడు వారిని వారించాడు. కృష్ణుడు సభనుద్దేశించి ‘‘శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం అతడి వంద అపరాధాలను మన్నించాను... నేటితో వంద తప్పులు పూర్తయ్యాయి. ఈ మూర్ఖుని ఇప్పుడే సంహరిస్తాను’’ అని పలికి సుదర్శన చక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు.శిశుపాలుడు ఎవరు?బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందాదులు విష్ణు మూర్తిని దర్శించుకోవాలని వైకుంఠానికి వెళ్ళినపుడు అక్కడ ఉన్న ద్వార పాలకులైన జయ, విజయులు, ఈ సమయంలో విష్ణుమూర్తి ఏకాంత సమయంలో ఉన్నారని, దర్శనానికి తగిన సమయం కాదని వారించడంతో పాటు, వారిని లోనికి పంపకపోవడంతో, ఆగ్రహించిన సనక, సనందాదులు, జయ, విజయులను వైకుంఠ లోకంలో ఉండేందుకు అర్హత లేకుండా శపిస్తారు. అనంతరం తమ తప్పును తెలుసుకున్న జయ, విజయులు శాప విమోచనం కోరగా విష్ణుమూర్తితో 7 జన్మల మిత్రుత్వం కానీ 3జన్మల శత్రుత్వం అనంతరం మరలా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని సూచిస్తారు. దీనితో జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి మూడు జన్మల శత్రుత్వం నెరపి విష్ణుమూర్తి చేతిలో హతులై, మరలా విష్ణుమూర్తి ద్వారపాలకులయ్యారు జయవిజయలు...– సి.ఎన్.మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
కోటిలింగేశ్వరా.. శిరసా నమామి
కోటి లింగేశ్వర నమఃశివాయ అనే ఉచ్చారణ వింటుంటే మనకి ఒక సందేహం కలుగుతుంది... కోటి లింగాలతో శివాలయమా అని... ఔను! నిజంగానే కోటి లింగాలతో శివాలయం ఉంది అంటే ఆశ్చర్యపోతాము. దానికి తోడు 108 అడుగుల ఎత్తు కలిగిన అతి ఎత్తయిన శివలింగం... ఎదురుగా 36 అడుగుల పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంది. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్య పెద్ద త్రిశూలం స్థాపించారు. సుమారు 97 లక్షల శివలింగాల ప్రతిష్ట జరిగి ఉంటుందని లెక్క. ఇవికాక ఉపదేవతలు... దేవి పీఠాలు వెరసి భక్తితో ఓం నమఃశివాయ అనే ఉచ్చారణతో లోకమే మర్చిపోతాము. కోటి లింగాల స్థాపన అంటేనే చిన్న విషయం కాదు. ఈ దేవాలయ ప్రతిష్టతో ఆ ఊరి అసలు పేరు మారిపోయి కోటి లింగేశ్వర అని చెప్తేనే తెలుస్తోంది. మరి అంతటి ప్రశస్తి పొందింది. ఈ కోటి లింగేశ్వర దేవాలయం బెంగుళూరుకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరి పేరు కమ్మసంద్ర. ట్రైన్లో వెళ్తే బంగారుపెట్ట రైల్వేస్టేషన్లో దిగితే 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఉండడానికి అంత సౌకర్యాలు లేవు. బెంగళూరు, కమ్మసంద్ర రెండు వేరు వేరు లోకాలని చెప్పొచ్చు. బెంగళూరు యాంత్రికమైన వేగంతో కూడుకున్న జీవితం అయితే కమ్మసంద్రలో ప్రశాంతమైన పల్లె వాతావరణం... భక్తితో కోటి లింగేశ్వర లోకం అని అనిపిస్తుంది. మరి ఈ దేవాలయాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరు స్వామి సాంబశివమూర్తి. పేరులోనే శివ నామం ఉంది. అందుకేనేమో కోటి శివలింగాలను ప్రతిష్టించాలని మనసులో అనుకున్నారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే కేంద్ర సంస్థలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి శివనామస్మరణతో కోటి లింగేశ్వర దేవాలయంలో తన శేష జీవితం గడిపారు. వీరి స్వప్నమే కోటిలింగాల ప్రతిష్ట. 2018లో స్వామి సమాధి ΄పొంది శివైక్యం అయ్యారు. ఇక్కడ 17 శక్తి స్వరూపాలను ప్రతిష్టించారు. అలాగే దుర్గ, పార్వతీదేవిల ప్రతిష్ట ఉంది. ఉప దేవతలుగా అన్నపూర్ణేశ్వరి, కరుమారి అమ్మ, సుబ్రమణ్యేశ్వర స్వామి, పాండురంగస్వామి, సీతారామలక్ష్మణులు, పంచ ముఖ గణపతి, కన్యకాపరమేశ్వరి ఉపదేవతా క్షేత్రాలు ఉన్నాయి. ముందుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను పూజించి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ చూడదగ్గది సహస్రనామ శివలింగం. ఏకశిల మీద వేయి శివలింగాలను చెక్కి ఉంటుంది. ఒకేసారి వేయి శివలింగాల దర్శనం చేసినంత పుణ్యం దక్కుతుంది. అలాగే మరో పుణ్యఫలం పంచ ముఖ శివలింగం. ఇక్కడ భక్తులకి మరో మంచి పుణ్యం శివునికి అభిషేకం స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ దేవాలయ యాజమాన్యాన్ని సంప్రదించి మనకి నచ్చిన వారి జ్ఞాపకార్ధం ఎనిమిది వేల నుండి రెండు లక్షల రూపాయలు వరకు చెల్లించి శివలింగ ప్రతిష్ట చేసుకోవచ్చు. ఆ విధంగా మనం కూడా కోటిలింగేశ్వర యజ్ఞంలో పాలుపంచుకోవచ్చు. ఎందరో ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పేర్లు కనిపిస్తాయి. గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం, నాగలింగ వృక్షాలు ఉన్నాయి. ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసికొని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయాల్లో నిత్యసేవ, అన్నదానం, పేదలకు వస్త్రదానం జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం, జాతర జరుగుతుంది. మంజునాథుడు పరమ శివ భక్తుడు. వీరి చరిత్రలో కూడా కోటి లింగేశ్వర ప్రసక్తి ఉందని అంటారు. స్వతహాగా మంజునాథుడు భక్తిభావం లేకుండా తిరిగేవాడు. ఒకరోజు అతనిలో శివుని మీద భక్తి కలిగింది ఎవరు నమ్మలేదు. అప్పుడు మంజునాథుడు పక్కనే ఉన్న శివాలయంలోకి వెళ్లారు. అప్పుడు దీపాలు ఆరిపోయాయి. అది చూసి బాధతో శివ నామ స్మరణ చేసి కీర్తనలు పాడారు. అప్పుడు దీపాలు తిరిగి వెలిగాయి. అప్పుడే ఆయన తన తప్పుకి ప్రాయశ్చిత్తం కోసం కోటి లింగాలను ప్రతిష్ట చేయడానికి సంకల్పం చేశారని చెబుతారు. కోటిలింగేశ్వర యాత్రా దర్శనం అద్భుతం అని చెప్పొచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్లో రాన్లోని బందర్ అబ్బాస్లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్లోని వివిధ ట్రావెల్ వ్లాగ్ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
ఏకలవ్య శిష్యరికం
ఆధునిక భారతదేశంలో ఏకలవ్యుడు దళిత, గిరిజన హక్కులకు ఆదర్శంగా ప్రత్యేకంగా నిలిచాడు. ఏకలవ్యుని గౌరవార్ధం, కేంద్ర ప్రభుత్వం భారతీయ గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను‘ నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు క్రీడలలో అసాధారణ విజయాలు సాధించిన 19 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులకు, వ్యక్తులకు ఏకలవ్య పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఇది ఇలా ఉండగా హర్యానాలోని గురగ్రామ్ లో ఏకలవ్యునికి అంకితం చేయబడిన ఆలయం ఒకటి ఉంది. ఆ గ్రామంలోని కాండ్సప్రాంతంలో ఆలయాన్ని అక్కడి గ్రామస్తులు అప్పట్లో నిర్మించారు. ఈ ఆలయం వద్దనే ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురువైన ద్రోణాచార్యుడికి సమర్పించినట్లు చారిత్రాత్మక ఆధారం. ఏకలవ్యుడంటే తెలియని వాళ్లు...గురు దక్షిణగా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి ఇచ్చిన విషయం గురించి వినని వారు బహుశా ఉండరేమో.... దీక్ష... పట్టుదల...అంకిత భావం... ఎనలేని గురుభక్తితో కాదు పొమ్మన్నా సరే... ఆ గురువునే మట్టిబొమ్మగా మలుచుకొని ఒక గొప్ప విలువిద్య కారుడుగా మహాభారతంలో పేరుగాంచిన మేటి విలుకాడే ఏకలవ్యుడు....నిషాదుల రాజు హిరణ్యధన్వుని కుమారుడే ఏకలవ్యుడు. కౌరవ పాండవులకు ఆస్థాన గురువైన ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలన్నది ఏకలవ్యుని ఆకాంక్ష. అయితే ఏకలవ్యుని సామర్థ్యాన్ని గమనించిన ద్రోణాచార్యుడు అతనికి తగిన శిక్షణ ఇస్తే అతడు విలువిద్యలో కౌరవ, పాండవ రాకుమారులను మించిపోతాడని, దాంతో తాను భీష్మునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమోననే ఉద్దేశ్యంతో ఏకలవ్యుని తన శిష్యునిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు అందుకు ఏమాత్రం నిరాశపడక గురువుపై ఉన్న అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో ద్రోణాచార్యుని మట్టిబొమ్మను తయారు చేసుకొని స్వీయ శిక్షణతో గొప్ప విలుకాడుగా పేరుగాంచాడు.ఒకసారి ఒక వేట కుక్క ఏకలవ్యుడిని చూసి మొరగడంతో ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరిచి ఉండగానే దానికి ఏమాత్రం హాని కలగకుండా ఏడు బాణాలు వేశాడు. ఎంతో నైపుణ్యంతో వేసిన బాణాలను చూసిన అర్జునుడు నిరాశకు లోనై ద్రోణాచార్యునికి విషయాన్ని తెలిపాడు. అనంతరం ఏకలవ్యుని కలిసిన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుని ఏకాగ్రతను గుర్తించి అభినందిస్తాడు. అయితే తన ప్రియ శిష్యుడైన అర్జునుని మేటి విలుకానిగా తీర్చిదిద్దుతానని తాను అర్జునునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అనే ఉద్దేశ్యంతోనూ, అతను తనను గురువుగా భావించి నేర్చుకున్న విలువిద్యకు తగిన గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలు కోరతాడు, ఏమాత్రం సంకోచించకుండా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి గురువైన ద్రోణాచార్యునికి సమర్పిస్తాడు ఏకలవ్యుడు. గురువుతో ప్రత్యక్ష సంబంధం లేకుండానే ఆ గురువును ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడలలో నడుస్తూ స్వయంగా విద్యను నేర్చుకునే వారిని ఏకలవ్య శిష్యులు అనే నానుడి అలా వచ్చింది. అమృత బిందువులు – ఆలోచన లేని స్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని ఓటమి వీటివల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది.– ‘మన సంబంధం ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులవుతారు. మన విలువలు సుఖ దుఃఖాలతో ముడిపడిన వారంతా ఆత్మ బంధువులవుతారు.– సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శ్రపాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సాయం చేసే స్థాయికి మనం ఎదగాలి.– మనం గెలిస్తే మనవాళ్ళకి మనమేంటో తెలుస్తుంది. మనం ఓడిపోతే మనవాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది.– చిన్నప్పుడు దేన్నయినా పట్టుకుని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నయినా తట్టుకుని నిలబడాలి.→ ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. – సి. ఎన్. మూర్తి సీనియర్ పాత్రికేయులు -
నిస్వార్థ సేవే నిజమైన ధర్మం
రాగి పాత్రని ప్రతి రోజూ శుభ్రం చేయకపోతే, చిలుం పట్టినట్లుగా, ప్రతి రోజూ విహిత కర్మాచరణ, సత్కర్మలు చేయకపోతే, మనసు కూడా మలినమై పాపగ్రస్థమవుతుంది. సత్కర్మ అంటే కేవలం పూజలు, పునస్కారాలు చేయడం మాత్రమే కాదు. సమాజానికి, తోటి ప్రాణులకు మేలు చేసే ప్రతి పని సత్కర్మే అవుతుంది. కీడు తలపెట్టకపోవడం, అందరూ బాగుండాలని కోరుకోవడం (మానసిక సత్కర్మ). మృదువుగా మాట్లాడటం, సత్యాన్ని పలకడం, ఎవరినీ మాటలతో గాయపరచకపోవడం(వాచిక సత్కర్మ). శ్రమించి పని చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, సమాజసేవ చేయడం(శారీరక సత్కర్మ). భారతీయ సంస్కృతిలో ‘యద్భావం తద్భవతి‘ అని అంటారు. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే మన పనులు అలానే ఉంటాయి. భారతీయ జీవన విధానంలో, ధర్మశాస్త్రాలలో సత్కర్మాచరణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మనం చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనిషి పుట్టుకతో గొప్పవాడు కాడు, తను చేసే కర్మల (పనుల) ద్వారానే గొప్పవాడవుతాడు. మనం చేసే ప్రతి చిన్న మంచి పని సమాజంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలుకుతుంది. కాబట్టి, ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి.రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల పోనుపోను మనసు ప్రక్షాళితమవుతుంది. ఒకరి అనుభవం, జిజ్ఞాస ఇతరులకు చేరతాయి. దీనివల్ల వేరే ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజజీవితంలో ఏదైనా కర్మ నిర్వర్తించేటప్పుడు, అది నాకు, ఇతరులకు మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల మోక్షమార్గం సులువవుతుంది. మనసు పూర్తిగా ఆ పరమాత్మపై లగ్నమైనప్పుడు, లౌకికమైన భయాలు మనిషిని ఏమీ చేయలేవు. మనసుని దైవపరం చేయడం వల్ల మనం చేసే ప్రతి పనీ నిష్కామ కర్మ అవుతుంది. సంసారమనే సాగరంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, భగవంతుడనే నావ మనల్ని మునిగిపోనివ్వదు. క్రోధం, ఈర‡్ష్య, ద్వేషం వంటి అంతర్గత శత్రువులనే మంటలు మనల్ని దహించలేవు. మనసు ప్రశాంతమైన మలయమారుతంలా మారుతుంది. లోకంలో మన చుట్టూ ఉండే ప్రతికూలతలనే విషం వ్యక్తిత్వాన్ని లేదా మనశ్శాంతిని హరించలేదు.‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం లేకుండా, ‘అంతా దైవ నిర్ణయం, నేను కేవలం నిమిత్తమాత్రుడిని’ అనే భావంతో కర్మలు చేయడం వల్ల విజయం వచ్చినా పొంగిపోము, అపజయం ఎదురైనా కుంగిపోము.ఒక వ్యక్తి చేసే ’మంచి పని’ అనేది కేవలం ఎదుటివారికి సహాయం చేయడం మాత్రమే కాదు, అది సమాజంలో ఒక సానుకూల మార్పుకు పునాది వేస్తుంది. మంచి పనిని ఆచరించడానికి పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులే గొప్ప మార్పును తెస్తాయి. మంచి పని చేసేటప్పుడు ఏ గుర్తింపునూ లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే, అది పైన మనం చెప్పుకున్న ’నిష్కామ కర్మ’ అవుతుంది. ఫలితం ఆశించకుండా చేసే సాయం ఎప్పుడూ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.మానవ జీవితం కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ‘కర్మ’ అంటే పని. మనం చేసే పనులే మన భవిష్యత్తును, మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ‘సత్’ అంటే మంచి, ‘ఆచరణ’ అంటే అనుసరించడం. అంటే, శాస్త్ర సమ్మతంగా, ధర్మబద్ధంగా, పరోపకార భావంతో చేసే పనులనే సత్కర్మాచరణ అంటారు. ఒక వ్యక్తి చేసే మంచి పని సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెట్టు నాటితే, అది వందల మందికి నీడనిస్తుంది. డబ్బు, పదవులు శాశ్వతం కావు. మనిషి మరణించిన తర్వాత కూడా అతను చేసిన మంచి పనులు మాత్రమే జీవించి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక చిన్న మంచి పనినైనా చేస్తూ సత్కర్మ మార్గంలో పయనించాలి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
శని జయంతి ప్రాముఖ్యత..ఆయన అనుగ్రహం పొందాలంటే..!
శనీశ్వరుడి జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.శనీశ్వరుడి జయంతిదేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.చేయవలసిన పూజలుశని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి. అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.శని దేవుడి ప్రాముఖ్యతసూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.శని శాంతి మంత్ర స్తుతి..ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయకృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయశుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతినవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి , తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.శన్యారిష్టే తు సంప్రాప్తేశనిపూజాంచ కారయేత్శనిధ్యానం ప్రవక్ష్యామిప్రాణి పీడోపశాంతయేఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.వై.వెంకటసుబ్బారెడ్డి9849100044మరిన్ని వివరాలకు కింది వీడియోపై క్లిక్ చేయండి (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
కలియుగ కల్పవృక్షం 'రావిచెట్టు'
భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే ప్రథమ తాంబూలం. చెట్టును, చేమను, పుట్టను, గుట్టను, రాతిని కూడా దైవ స్వరూపంగా భావించే ఉదాత్తమైన సంప్రదాయం మనది. ఈ వృక్ష సంపదలో అగ్రతాంబూలం అందుకునేది ‘రావి చెట్టు’. ఋగ్వేదం మొదలుకొని భగవద్గీత వరకు ప్రతిచోటా కొనియాడబడిన ఈ మహావృక్షాన్ని ‘కలియుగ కల్పవృక్షం’ అని ఎందుకు అంటారు. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగానూ ప్రాణికోటిని రక్షించే ఈ అశ్వత్థ వృక్ష వైభవంపై ప్రత్యేక కథనం..సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వృక్షాలన్ని నేను రావి చెట్టును అని ప్రకటించిన ఈ వృక్షం సామాన్యమైనది కాదు.. త్రిమూర్తుల సమ్మేళనం. దీని వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీమహావిష్ణువు, అగ్రభాగంలో పరమశివుడు కొలువై ఉంటారని పురాణోక్తి. అందుకే ఈ చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.దోషాల నుంచి విముక్తికి...జీవితంలో ఎదురయ్యే గ్రహ దోషాలకు, పితృదోషాలకు రావి చెట్టు చెంత చక్కని పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనిదేవుడు రావి చెట్టును వరమిచ్చాడని, ఎవరైతే శనివారం నాడు ఈ చెట్టును పూజించి దీపం వెలిగిస్తారో వారికి తన పీడ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారని, తద్వారా వంశాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు.శాస్త్రీయ కోణంలో .. రావి చెట్టును కల్పవృక్షం అనడానికి కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. ప్రకృతిలో 24 గంటల పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువును విడుదల చేసే ఏకైక వృక్షం రావి. దీని విశాలమైన నీడ పర్యావరణంలోని విష వాయువులను హరిస్తుంది. ఆయుర్వేదంలోనూ రావి బెరడు, ఆకులు, పండ్లను ఎన్నో మొండి వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు. అందుకే ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం.అనుగ్రహం పొందే మార్గం..ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక అశాంతితో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ‘ మంత్రాన్ని జపిస్తూ ఏడు ప్రదక్షిణలు చేయడం విశేష ఫలితాలనిస్తుంది. నమ్మకంతో చేసే ఈ చిన్న ప్రయత్నం అపారమైన మనశ్శాంతిని, కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతిని ప్రేమిద్దాం.. దైవత్వాన్ని పూజిద్దాం..! – పసుపులేటి వెంకటేశ్వరరావు (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..!
మన దక్షిణాదిన శుచీంద్రం ప్రముఖ శివ క్షేత్రాలలో ఒకటి. ఎంతో మహిమ గల శైవదేవాలయం. స్వర్గాధిపతి దేవేంద్రుడు శాపవిమోచన పొందిన స్థలం. మరి మనకి కూడా తెలిసీ తెలియక చేసిన తప్పులకి ప్రార్థనతో పొదవచ్చు. స్త్రీవ్యామోహంతో శాపం పొందిన ఇంద్రుడు ఇక్కడ పాప మోచనం పొంది శుచిత్వం పొందడంతో శుచీన్ద్రం అని పేరు వచ్చింది. ఆ కథ, శుచీంద్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. ఒకసారి అహల్య అందాన్ని చూసి మోహ పరవశుడు అయ్యాడు దేవేంద్రుడు. అప్పుడు ఇంద్రుడు తెల్లవారక ముందే కోడికూత వేసి గౌతమ మునిని స్నానానికి పం΄ాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతమ ముని వేషంలో అనసూయ దగ్గరకి వచ్చాడు. జరిగిన మోసం గ్రహించి గౌతమ ముని తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడిని, అహల్యని చూసి శపించాడు. శిలగా మారిన అహల్య శ్రీ రాముని పాదస్పర్శ తగిలి ఇక్కడే శాప విమోచనం పొందింది. ఇక్కడే అత్రి మహా ఋషికి ఆశ్రమం ఉండేది అందుకే జ్ఞానారణ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక చెట్టు మొదలు నరికినప్పుడు శివలింగం కనిపించింది. గొడ్డలి దెబ్బకి శివలింగం నుండి రక్తం కారసాగింది. ఇది దేవాలయ మూలస్థానంగా చెబుతారు. సుచీన్ద్రంలో మహాశివుని ప్రతిష్ట ఉన్నప్పటికీ త్రిమూర్తి సంకల్పం కూడా ఉంది. కారణం ఇక్కడ వృక్షాలలో త్రిమూర్తులు ఉన్నారు అని చెట్లకు పూజ చేస్తారు. తప్పు చేసిన వారు పాప పరిహారంగా సుచీన్ద్రుని దర్శించుకుని భక్తులు పాప విమోచనం పొందుతారు. సుచీన్ద్రుని ముందు మరుగుతున్న నేతిలో వెండి విగ్రహాన్ని వేస్తాడు పూజారి. తప్పు చేసిన వారు ఆ విగ్రహాన్ని చేతితో తీయాలి. పూజారి ఆ చేతిని వస్త్రంతో కట్టి మూడు రోజుల తరువాత విప్పుతాడు. చేతి చర్మం రంగు మారినా వ్రణం ఏర్పడినా ఆ వ్యక్తి తప్పు చేసినట్టుగా నిర్ధారిస్తారు. బ్రిటిష్ వారు ఈ విధానానికి స్వస్తి పలికారు. మహాభిషేకం సమయంలో భక్తులు రథం లాగుతారు. ఈ కార్యక్రమానికి సుచీన్ద్రం వాసులు ఎక్కడ ఉన్నా వచ్చి పాల్గొంటారు. ఆ విధంగా తమ పాప ప్రక్షాళనం చేసుకుంటారు. ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడి స్తంభాలను మీటితే సప్తస్వరాల ధ్వని వినిపిస్తుంది. స్త్రీ రూపంలో చెక్కిన వినాయకుడు, రుద్రవీణ వాయిస్తున్న రావణాసురుడు, నోటిలో తిరుగుతున్న భూగోళం, రామాయణ మహాభారతాల రాతి శిల్పాలు... ఎంత చూసినా అద్భుతమే. మన దేశంలో లాటరీ విధానం ఇక్కడ నుండి ప్రారంభించారు అని అధికారిక పత్రాలు ఉన్నాయి ఇక్కడ. శుచీన్ద్రం రాజ గోపుర పునరుద్ధరణకు డబ్బు అవసరం ఏర్పడింది. అప్పటి తిరువనంతపురం రాజు గారి అనుమతితో ఒక రూపాయి లాటరీ టికెట్ అమ్మకం చేశారు. పదివేల రూపాయల బహుమతి. యాభై వేల టికెట్లు అమ్మారు. బహుమతి సొమ్ము పోను మిగిలిన డబ్బుతో ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. పచ్చని అడవితో పాలార్ నదీ ప్రవాహం, శిల్పకళా వైభవం మంచి అనుభూతినిస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ టూర్ శబరిమల యాత్రలో సుచీన్ద్రం వెళ్లడం సులువు. కన్యాకుమారి నుండి 18, నాగర్కోయిల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది సుచీన్ద్రం శివ క్షేత్రం. సుచీన్ద్రంలో అంతగా లాడ్జీలు లేవు. నాగర్కోయిల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. – ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం(చదవండి: మైసూరు మహాదేవి చాముండేశ్వరి) -
72 గంటల్లోనే అద్భుతమైన ధ్యాన క్షేత్రం తొలి కార్యక్రమం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అద్భుతమైన 'ధ్యాన మందిరం', తన మొట్టమొదటి భారీ కార్యక్రమానికి సిద్ధమైంది. మే 13, 2026న గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి నేతృత్వంలో "ప్రపంచ శాంతి కోసం గురుదేవ్తో కలిసి ధ్యానం" అనే అంతర్జాతీయ కార్యక్రమం జరగనుంది.'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్'లో ప్రతిష్టాత్మక ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన 72 గంటలలోపే, ఆ అద్భుతమైన ధ్యాన క్షేత్రం తన మొదటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ధ్యాన కార్యక్రమంలో 182 దేశాల నుండి లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా మరియు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొననున్నారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక ధ్యాన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుంది.ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఆధ్యాత్మికత , మానసిక ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక యుగంలో ఒత్తిడి, అనిశ్చితి ఎదుర్కొంటున్న యువతకు ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దిక్సూచిలా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. "మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత కలిగిన యువత ద్వారానే అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మించబడుతుంది" అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యేక ధ్యాన కేంద్రాలలో ఒకటైన దీని వెనుక ఉన్న స్ఫూర్తి గురించి మాట్లాడిన మోదీ సంకల్పం స్పష్టంగా ఉన్నప్పుడు, సేవాభావంతో పని చేసినప్పుడు, ప్రతి ప్రయత్నం సరైన ఫలితాన్ని ఇస్తుందంటూ కొనియాడారు."ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ఏళ్లుగా ఒక మహావృక్షంలా విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో జీవితాలను ప్రభావితం చేస్తోందని ప్రశంసించారు.45 ఏళ్ల వేడుకలుఈ గ్లోబల్ మెడిటేషన్ ఈవెంట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న నెల రోజుల వేడుకల్లో భాగంగా జరుగుతోంది. మే 13న జరిగే 'ది వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్' కార్యక్రమం, 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల రోజుల పాటు జరిగే వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంతో మజుందార్; కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ఉత్తరాఖండ్ గవర్నర్ నంద్ కిషోర్ యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్,రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, హిరానందాని గ్రూప్ ఛైర్మన్ నిరంజన్ హిరానందానిలాంటి ప్రముఖులు హాజరు కానున్నారు.ఈ ప్రపంచ స్థాయి ధ్యాన కార్యక్రమం, వివిధ కాల మండలాలు , ఖండాలలో విస్తరించి ఉన్న లక్షలాది మందిని ఒకే క్షణంలో సామూహిక మౌనం మరియు ఆత్మపరిశీలన కోసం ఏకం చేస్తుందని ఆశిస్తున్నారు. "అంతర్గత శాంతి మాత్రమే బాహ్య ప్రపంచంలో శాంతిని తీసుకురాగలదు" అనే సందేశాన్ని గురుదేవ్ గత నాలుగున్నర దశాబ్దాలుగా చాటుతున్నారు.బెంగళూరులోని ఈ ధ్యాన మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది, ఇది శాంతికి మరియు మానసిక వికాసానికి కేంద్ర బిందువుగా మారనుంది. -
జయ హనుమంత! అమిత బలవంత!
చాలా గొప్ప వైవిధ్యభరిత పాత్రలనే రత్నాలతో కూర్చబడిన హారం శ్రీ మద్రామాయణం. అన్నిటి మధ్యనా తళుకులీనే మేటి మణిపూస వంటి పాత్రగా హనుమంతుడు మనకు దర్శ నమిస్తాడు. మహా జ్ఞాన సంపన్నుడు, అద్భుత బలశాలి, వినయశీలి, మహా భక్తుడు, ధీరాగ్రేసరుడు, కార్యసాధకుడుగా మనకు గోచరమవుతాడు.శివాంశతో, వాయుదేవుని అనుగ్ర హంతో కేసరి, అంజనాదేవి దంపతులకు జన్మించిన ఆంజనేయుడు బాల్యం నుండే తన అద్భుత శక్తి సామర్థ్యాలను చూపించాడు. సముద్ర లంఘనం, రాక్షస సంహారం, సంజీవనిని తేవడం వంటి ఘనకార్యాలు మారుతివంటి బలశాలికి తప్ప ఇతరులకు సాధ్యమయే విషయాలు కావు. బాల్యంనుండే తన దేహబలాన్ని దుందుడుకు పనులకు ఉపయోగిస్తున్న బాలాంజనేయునికి ఆయన హితైషులు ఒక శాపం వంటి వరాన్ని ఇచ్చారు. అదేమంటే తన శక్తి తనకు తెలియక పోవడం. ఇతరులెవరైనా తెలిపితే తప్ప మారు తికి తన శక్తి సామర్థ్యాలు తనకు తెలియకూడదని శ్రేయోభిలాషుల ఆంతర్యం.విద్యావినయసంపన్నుడు– కేసరీ నందనుడుపట్టుదల, బుద్ధికుశలత, సూక్ష్మగ్రాహిత్వము, విద్యా పారీణతలకు ఆంజనేయుడు ప్రతీక. ఆయనను సేవిస్తే విద్యలలో కౌశల్యం, సూక్ష్మ బుద్ధి తప్పక లభిస్తాయని పరాశర సంహిత చెబుతుంది. అంతటి విద్య, ఘనమైన దేహబలమున్నా, మూర్తీభవించిన వినయస్వరూపుడు హనుమ. తన ప్రభువైన సుగ్రీవుని పట్ల, తనకు దైవమైన శ్రీరాముని పట్ల ఆయ న ప్రదర్శించిన వినయం అద్వితీయ మైనది. తాను వారికి సేవకునిగా, బంటుగా ఎప్పుడూ భావించేవాడు ఆయన. ఇది లోకులందరకూ స్ఫూర్తి దాయకం. అతని భక్తికి నిదర్శనమా అన్నట్లు మారుతి లేని రామాలయం ఎక్కడా కనపడదు.కార్యదీక్షా తత్పరుడు ఒక కార్యాన్ని తలపెట్టిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కు తగ్గే ప్రసక్తే లేకుండా, ఆ కార్యం నెరవేర్చే దాకా విశ్రమించని లక్షణం హనుమది. సామాన్యులకు సరే సరి... అంగద, జాంబవంతాది వీరులకు కూడా దాటడానికి సాధ్యం కాని సముద్రాన్ని దాటి, లంక ను చేరి, సీతమ్మ జాడ కనుగొని, తమ శక్తిని శత్రువులకు తెలియజేసి, తిరిగి ఆ విషయాన్ని శ్రీరామునికి నివేదించే వరకూ హనుమ విశ్రమించలేదు. ఆతిథ్యాన్ని అందించ వచ్చిన మైనాకునితో మరియు సముద్రునితో ఆ విషయమే సవినయంగా తెలిపి ముందుకు సాగిన కార్య నిబద్ధుడు ఆంజనేయుడు.ఎన్నో సుగుణాలు, ఆదర్శాలు మూర్తీభవించి ఉన్న హనుమను తమలపాకులు, వడల మాలలు, సింధూరాలతో పూజించిన భక్తులకు బుద్ధి, దేహబలం, కీర్తి, ధైర్యం, నిర్భయ త్వం, ఆరోగ్యం, పాపనివృత్తి, వాక్పాటవం కలుగుతాయని పెద్దల మాట. అంతేకాదు. ఆంజనేయుని పూజించే వారి కి భోగ, మోక్షాలు రెండూ సులభంగా లభిస్తాయని పరాశర సంహిత చెబు తున్నది. మన దేశంలోని దాదాపు ప్రతి చిన్న పల్లెలోనూ రామాలయాలు, ఆంజనే యుని ఆలయాలూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధగిరి, కొండగట్టు, గండి, కసాపురం, శింగరకొండ వంటి సుప్రసిద్ధ హనుమత్ క్షేత్రాలన్నింటిలోనూ హనుమజ్జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
అమృతోత్సవ సోమ నాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానం సోమనాథ క్షేత్రానిదే... ఇది గుజరాత్లోని సౌరాష్ట్రలో అరేబియా సముద్ర తీరాన ఉంది. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథ క్షేత్రంగా పేరొందింది. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ ఆకారంలో యుగాల నుంచి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపై అనేకమంది విదేశీపాలకులు లెక్కలేనన్ని సార్లు దండయాత్రలు చేశారు. అయితే ఎన్ని దండయాత్రలకు గురైనా మళ్లీ అన్నిసార్లూ పునర్ నిర్మితమైన క్షేత్రమిది. చంద్రుని పేరుమీదుగా సోమనాథుడుస్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన దక్షప్రజాపతి అశ్విని నుంచి రేవతి వరకు గల 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు రోహిణి ఒక్కదానినీ అనురాగంతో చూస్తూ, మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగాడు. దాంతో... తక్కిన 26 మంది తమ తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు, తమ కష్టాలు తీరే మార్గం చూపమని బ్రహ్మని ప్రార్థించగా ఆయన చంద్రునితో ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించవలసిందిగా చెబుతాడు. బ్రహ్మ దేవుని సలహాను అనుసరించి, భక్తి శ్రద్ధలతో శివుని పూజించిన చంద్రుడికి శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దినమొక కళ చొప్పున పెరుగుతుందనీ అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేరకు సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీ సమేతంగా వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు పరమేశ్వరుడు.అలనాడు స్వర్ణాలయం..ఈ క్షేత్రంలో తనకు శాపవిముక్తి కలిగినందుకు పరమానందభరితుడైన చంద్రుడు సువర్ణంతో పరమేశ్వరునికి ఆలయం నిర్మించాడట. అనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని రావణాసురుడు వెండితో పునర్ నిర్మించగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కలతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత రాజా భీమ్దేవ్ ఈ ఆలయాన్ని రాతితో పునర్నిర్మించాడు. పునఃప్రతిష్ఠకు డెబ్భై ఐదు ఏళ్లు పూర్తిసోమనాథక్షేత్రంలో భారీ సంపద వుండటంతో అనేకసార్లు దండయాత్రలకు గురైంది. క్రీ.శ. 1024లో గజనీ మహమ్మద్ దండయాత్రలో ఆలయం తీవ్ర నష్టానికి గురైంది. అనంతరం స్థానిక పాలకులు తిరిగి నిర్మించారు. దిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ, మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలోనూ ఆలయంపై దాడులు జరిగాయి. జునాగఢ్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన తరువాత ఉక్కుమనిషి, భారతదేశ ప్రథమ హోంమంత్రి వల్లభాయ్పటేల్ ఆలయాన్ని సందర్శించి పునర్ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. నాటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించారు. ఇది జరిగి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సోమనాథేశ్వరునికి అమృత మహోత్సవాలను జరిపించాలని సంకల్పించడమే కాదు... అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.సోమనాథునికి ప్రధాని ప్రత్యేక పూజలు1951లో బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ జరిగిన నాటి నుండి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో పాల్గొననున్నారు. అంతేకాదు, సోమనాథునికి స్వయంగా అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలు నిర్వహించనున్నారు. నిత్యం పూజలు, హారతులు, సౌండ్ అండ్ లైట్ షోలతో ఆలయం సందడిగా ఉంది. ఆలయ దర్శనం ఉదయం 6:00 నుండి రాత్రి 10:00 వరకు ఉంటుంది, మధ్యాహ్నం 1:00 నుండి 5:00 వరకు దర్శనం ఉండదు. – డి.వి.ఆర్. -
తిరుపతి గంగజాతర: వారు మాత్రమే ఆ వేషాలు వేస్తారు!
‘తిరుపతి కొండంత కొండ, పేరూరు గుట్టంత గుట్ట, తిరుపతి గంగజాతరంత జాతర’ లేవని తిరుపతి ప్రాంతీయుల నమ్మకం. నేడు తిరుపతి గంగజాతర రాష్ట్ర స్థాయి జాతర. ఇందులో 20 దున్న పోతుల్ని, 400 మేకపోతుల్ని, 700 కోళ్లని బలి ఇచ్చే సంప్రదాయం ఉన్నట్టు 1881 నాటి ఆర్కాట్ మాన్యువల్లో ఆర్థర్ ఎఫ్ కాక్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం దున్నపోతు బలి నిషేధితం. జాతరకి చిత్రి మాసంతో కత్రి కార్తెతో సంబంధం ఉంది. తిరుపతి గంగజాతర చాటింపు చిత్రి నెల నాలుగో మంగళవారం (మే 5, 2026). జాతర ముగింపు తర్వాతి మంగళవారం రాత్రి.చాటింపునకు ముందు అవిలాల గ్రామం (Avilala Village) నుంచి ఆడబిడ్డ సాంగ్యం తేవడం ఆనవాయితీ. ఇచ్చేది ముళ్లపూడి పెదరెడ్డి కుటుంబీకులు. తెచ్చేది తాళ్లపాక గంగమ్మ గుడి పూజారులైన కైకాల కుటుంబీకులు. అవిలాల ఆడబిడ్డ సాంగ్యంలో భాగంగా అమృతపళ్లెం, గండదీపం, పసుపు కుంకుమ, వేపాకు, నిమ్మకాయలు, ఆకు వక్కలు, పానకం, ఒడిబియ్యం, పచ్చిపిండి (బియ్యపుపిండి) తప్ప నిసరి. చాటింపులో పానకం దుత్త, పసుపు ముంతకు ప్రాధాన్యం ఉంది. చాటింపుకు ముందు అందరికీ నానబియ్యంతో పాటు పానకం ఇస్తారు, ఆడవారికి పసుపు పంచుతారు. వేపాకు, తమల పాకు, అరటి పండు దోసిట్లో పట్టుకొని పోతురాజు ముందు ఎర్నీళ్లు లేదా వసంతం నీళ్లు పూజారి పోస్తుండగా వదిలి, వెనక్కి చూడకుండా వెళ్తారు. కైకాల, తోటివారు పంబ పలకలు అనుసరిస్తుండగా చాటింపు వేసే ప్రాంతానికి వెళ్తారు.వేషాల వరుసచాటింపు మర్నాడు నుంచి గుడి తరపున మిరాశీ దారులు వేసే వేషాలు... వేషాలమ్మ గుడి నుంచి ప్రారంభమై మిరాశి ఉన్న ఇళ్లకు వెళ్లి చాటు దాటకుండా తిరిగి వేషాలమ్మ గుడికి చేరుకుంటాయి. బుధవారం పొద్దున వచ్చే బైరాగి వేషం మొదటిది. సాయంత్రం పాముల వేషం, బేస్తవారం పొద్దున గొల్ల, సాయంత్రం బండ వేషాలు ఉంటాయి. శుక్రవారం పొద్దున కోమటి, సాయంత్రం తోటి వేషాలు. శనివారం పొద్దున్నే ఒకప్పుడు జంగం వేషం వచ్చేది కాని ఇపుడు రావడం లేదు. సాయంత్రం దొర లేదా రాజు వేషం, బంటు వేషాలు. రాజు పాళెగాణ్ణి వధించి ‘బండిపీనుగు’ అని పాళెగాని శవాన్ని ఊరేగిస్తారు.ఆదివారం మాతంగి, పోతురాజు వేషాలు కాని ఇపుడు పోతురాజు వేషం రావడం లేదు. సోమవారం రెండు పసుపు కుండల వేషాలు. మంగళవారం పేరంటాలు వేషం ఊరు తిరుగు కుంటూ బుధవారం తెల్లవారు జామున గుడిలో ప్రత్యేకంగా తయారు చేసిన గంగమ్మ బొమ్మ చెంప నరుకుతుంది. తోటి వేషం నుంచి వేపాకు తప్పనిసరి. భక్తులు ఎక్కువ ఇష్టపడే వేషం తోటి వేషం. పాళెగాణ్ణి పట్టుకోవడానికి గంగమ్మ వేషాలు వేస్తుందనీ, దొర వేషంలో పట్టుకొని చంపివేస్తుందనీ కొన్ని కథలు చెప్తాయి.బైరాగి వేషం గొడుగు, పాముల వేషం కావడి, గొల్ల వేషం మజ్జిగ దుత్తతో వస్తే; బండ, తోటి వేషాలు కొత్త చేటతో వస్తాయి. దొర చేతిలో కత్తి, పేరంటాలు చేతిలో గంగమ్మ అద్దం, కోమటి వేషం మెడలో కరవాళ్ల జందెం ఉంటాయి. వేషాలు ఇంటి గుమ్మం తొక్కి ఆశీర్వదించడంలో కూడా ఒక వ్యవస్థ ఉంది. మాతంగి హారతి పళ్లెంలో ఒడిబాల బియ్యం వేసి, సున్నపుకుండలు, పసుపు ఇచ్చి, పేరంటాలు పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదిస్తే; తోటి వేషం చేటతో, పొరకతో కొట్టి ఆశీర్వదిస్తుంది.చదవండి: భవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు?గంగజాతరలో గుడి తరపు వేసే వేషాల్ని కైకాల వారు, మేకల తూరి, మంగపతి ఇంటిపేరు కల్గిన చాకలి వారు మాత్రమే వేస్తారు. చాకలి వారు బైరాగి నుంచి రాజు వేషం దాకా వేస్తే... మాతంగి, పసుపుకుండలు, పేరంటాలు వేషాలు కైకాలవారు వేస్తారు. ప్రస్తుతం ప్రతి వేషంతో పాటు ఆడవేషం కూడా వస్తోంది. వేషాల్లో చాకలి వారు వేసేవి ఒక వర్గంగా, కైకాలవారు వేసేవి మరో వర్గంగా విభజించి చూసినపుడు వాటి మధ్య ఒక అడ్డురేఖ ఉన్న విషయం గుర్తించవచ్చు. మగ వేషాలు మిరాశీ లేదా పూర్వం నుంచి పోతున్న కుటుంబాల దగ్గరికే పోతాయి. ఆడవేషాలు ప్రతి ఇంటి గడప తొక్కు తాయి. వేషధారణ, దీవెనలో కూడా తేడా ఉంది. మగ వేషాలకు ప్రత్యేక పాటలున్నాయి, బూతు పాటలున్నాయి. మగ వేషాలు గంగమ్మ గుడి దగ్గరకు పోతాయి కాని గుడిలోకి పోవు. రాజు మంత్రి వేషాలు వేశాలమ్మ గుడి దగ్గరకు పోతాయి గాని గుడిలోకి పోవు.- ప్రొఫెసర్ నాగపట్ల భక్తవత్సల రెడ్డి జానపద విజ్ఞాన పరిశోధకులు -
భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు?
Tallapaka Annamacharya Jayanthi భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు? ఇది తరతరాల ప్రశ్న.. ప్రతి యుగం లోని సరి అయిన జవాబు దొరికినా మళ్ళీ అదే ప్రశ్న!.. అలవైకుంఠపురంలోని మూల సౌధంబు లోంచి బయలు దేరాడు విష్ణువు శరణు కోరిన కరిరాజుని రక్షించడానికి.. తక్కువ కులస్థుడైనా గుహుడిని అక్కున చేర్చుకున్నాడు, రామచంద్రుడు.. శబరి ఎంగిలి పళ్ళు తిన్నది ఆ రాముడే.. ఉడత చేసిన సహాయానికి ఉడతని స్పృశించినది ఆ ఉత్తమోత్తముడే.. భారతంలో విదురుణ్ణి విజ్ఞానిగా పరిగణించారు, కులంతో నిమిత్తం లేకుండా. కర్ణుడి వ్యధ ఏకలవ్యుడి కధా కులరహిత సమాజం కోసమే. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు నేను నాల్గు వర్ణాలనే సృష్టించాను అని స్పష్టంగా చె΄్పాడు. వేద వేదాంగాలు, ఉపనిషత్తులు ముక్తకంఠం తో ఘోషించాయి కులం లేదని.. ‘ఇదంతా బ్రహ్మమే’ అని...పురాణాల్లో ఉదాహరణలు తీసుకోలేదు కానీ వాటి సారాన్ని తన ‘తత్వ బోధన’ మధురంగా, మనోరంజకంగా మనకు సులువైన తెలుగు భాష లో అందించాడు అన్నమయ్య.... 600 సంవత్సరాల క్రితమే ఇప్పటి మన రాజ్యాంగంలో కుల మత ప్రసక్తి ఉండ కూడదన్న విషయానికి ఊపిరి ΄ోశాడేమో అన్నమయ్య...అన్నమయ్య కోశం నుండి జాలు వారిన ఆధ్యాత్మిక ఆణిముత్యాల సారం కులం కన్నా భక్తి మిన్న అని... సమదృష్టి సక్రమ మార్గం అని. సకల శాస్త్రాల సారాన్ని అందమైన భాషలో అనంతమైన భావాన్ని రాగవంతంగా మేళవించి వేదాంత ధోరణిలో సంఘానికి ‘సమ దృష్టి’ తో ఉండాలని సలహా ఇచ్చాడు.... ‘బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే’ అని ఎలుగెత్తి చాటుతూ, హీనం, అధికం లేవని, ఎక్కువ తక్కువలు లేనే లేవని, జంతువులు, మనుషులు అనే భేదం లేకుండా, కుల మత భేదం లేకుండా ఉండాలని, అందరిలో ని శ్రీహరి ఉన్నాడని, శ్రీ హరే పరబ్రహ్మస్వరూపం అని చెప్పాడు.‘తందనాన ఆహి తందనాని పురె’ లో కూడా అదే భావాన్ని జోప్పించాడు.. అందరికి శ్రీ హరే అంతరాత్మ అని అంటాడు.. రాజు గారి నిద్రకి బంటు నిద్రకి తేడా లేదంటాడు.. భౌతికంగా చూడొద్దు, భేదభావాలు వద్దని చె΄్తాడు. చని΄ోయాక బ్రాహ్మణుడైన, చండాలుడైన చేరవలసింది ఒకచోటుకే అని చె΄్తాడు.. ప్రకృతికి తారతమ్యాలు లేవంటూ ఎండకు ఏనుగైనా, శునకమైనా సమానమే అని సెలవి స్తాడు..‘చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు’ అని ప్రశ్నిస్తూ సమ బుద్ధితో సంకీర్తనం చెయ్యండి. వేషభాషలతో విష్ణువుకు దగ్గర కాలేరని చెబుతాడు.వేదవట్టి యికనేమి వేదకేరు చదివేరు’ అని వెటకారం చేస్తూ వేదాలు చదివినా భగవంతుని తెలుసుకోజాలరని, భక్తి ముఖ్యమని, చదువు, కులం జ్ఞానం కన్నా భక్తి ముఖ్యమని ముక్తాయింపు చేస్తాడు.‘ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడ’ని నిజమైన భక్తి, నిక్క మైన జ్ఞానం ఉన్నవాడే గొప్పవాడని ఘోషిస్తాడు.‘వేదాలు వచ్చినా హరిభక్తి లేని సోమయాజి కన్నా విష్ణుపాదాలని వదలని కుల హీనుడే ఘనుడు’ అని ఘంటాపదంగా నొక్కి వక్కాణించాడు.‘ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు’ అంటూ తుది ఘడియల్లో హరినే స్మరిస్తే హరిని చేరుకుంటారని భక్తిమార్గం చూపిస్తున్నాడు.ఇలా ఎన్నో కీర్తనల్లో జీవరాశుల పట్ల సమదృష్టి ఉండాలని బోధించాడు... కొంగు బంగారమైన స్వామిని కొలవమన్నాడు.. అదివో అల్లదిగో, కొలువై ఉన్నాడు గోవిందరాజు, వేడుకుందామా అని శరణు వేడుకుంటున్నాడు, ఎందుకంటే ఇందరికి అభయమిచ్చు చేయి కాబట్టి...చివరగా... గాలికి కులమేది, నేలకి కులమేదని డా. సి నారాయణ రెడ్డి ప్రశ్నిస్తే, ఏ కులము నీదంటే, గోకులం నవ్విందని వాపోయారు వేటూరి సుందర రామ మూర్తి గారు. కులమతాలు వద్దంటూ వెంకటేశ్వరునిలో ఐక్యమైన అన్నమయ్య కుల మతాలతో చిచ్చువద్దని, అవి జాతి ఐక్యతని దెబ్బ తీస్తాయనీ పరోక్షంగా పలికాడు.. ఈ కీర్తనలను స్ఫూర్తిగా తీసుకుని కుల మత చిచ్చులో పడకుండా మన జాతిని మనం రక్షించు కుందాం..– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
సహజ యోగంతో సహజ ప్రవర్తన : అద్వితీయ ఘట్టం
మనిషి ధ్యాసను అంతర్ముఖంగా తీసుకువెళ్లి వారి చిత్తాన్ని వారి శరీరంలోనే వున్న పరమాత్మ శక్తి అయిన ఆత్మ మీదకు మళ్లించగలిగితే మనిషి ఆధ్యాత్మికత పరిపక్వం చెంది, అతనిలో పరివర్తన వచ్చి చిన్నతనంలో తనలో స్వాభావికంగా వున్న దైవికమైన పసితనపు అమాయకత్వాన్ని తిరిగి స్థిర పరచవచ్చు, తద్వారా అతనిని సమతుల్యతలో ఉంచవచ్చు అని తలచారు మాతాజీ నిర్మలాదేవి.అదెలా సాధ్యపడుతుందంటే మన శరీరంలోనే అంతర్గతంగా భగవంతుని శక్తి ఒకటి నిక్షిప్తమై ఉంది. అదే కుండలినీ శక్తి. తల్లి గర్భంలో సుమారు 2–3 నెలల వయస్సు వున్న సమయంలో పసిపిల్లవాని తల మాడుభాగాన వున్న బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ శక్తి ప్రవేశించి వెన్నెముక భాగాన 3 నాడులుగాను, 7 చక్రాలుగాను ఏర్పడి మిగిలిన శక్తి వెన్నెముక చివరన వున్న త్రికోణాకారపు ఎముక (సాక్రమ్ బోన్)లో మూడున్నర చుట్లు చుట్టుకుని ఉంటుంది. అదే కుండలినీ శక్తి. పిల్లలలోని ఆ శక్తి వారికి 9–10 సం. వయసు వరకు వారి వెన్నెముక ద్వారా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తూ బాహ్యపరంగా ఉన్న పరమాత్మ ప్రేమ శక్తితో అనుసంధానమవుతూవుంటుంది. ఆ వయసులో పిల్లలు భగవంతుని రక్షణలోనే వుంటారు. క్రమేపీ అది తిరిగి సాక్రమ్ బోన్ లోకి వెళ్ళి నిద్రాణ స్థితిలో వుండిపోతుంది.అలా నిద్రాణ స్థితిలోకి వెళ్ళి΄ోయిన ఈ కుండలినీ శక్తిని తిరిగి జాగృతి చేసి ఉత్థానపరచి శిరస్సుమీద వున్న సహస్రార చక్రాన్ని ఛేదించి బాహ్యపరంగా వున్న పరమాత్మ ప్రేమశక్తి అయిన విశ్వవ్యాపిత పరమ చైతన్యశక్తితో అనుసంధానపరచగలిగితే మనిషి మరలా తనలో దైవత్వాన్ని నింపుకోగలుగుతాడు. అప్పుడిక మానవులు ఎదుర్కొనే ఈ శారీరిక, భౌతిక, మానసిక, భావోద్వేగ, సమస్యలకు తావే వుండదు. వారిలో వివేకం, మంచి చెడుల విచక్షణా జ్ఞానం స్థిరపడి, వారి ఆలోచనలలో, జీవన విధానంలో, ప్రవర్తనలో, అవగాహనలో సమతుల్యత ఏర్పడి ప్రపంచమంతా మనం కోరుకున్న విశ్వమానవ సౌభ్రాతృత్వం, వసుదైక కుటుంబం ఏర్పడి విశ్వనిర్మల ధర్మం స్థిరపడుతుంది అని శ్రీమాతాజీ నిర్మలాదేవి ఒక నిర్ణయానికి వచ్చారు. మానవులు తమ మూర్ఖత్వం వలన లేక అంధ విశ్వాసాల వలన భగవంతుని సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి వస్తే చాలా ప్రమాదానికి, భవంతుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది అని గ్రహించి అందుకు ఒకే ఒక పరిష్కారం మనిషి లోని కుండలినీ శక్తిని తిరిగి జాగృత పరిచి తద్వారా ఆత్మసాక్షాత్కారానికి పాదుకొల్పడం సాధ్యమవుతుందని తెలుసుకున్నారు. ఇంతకు పూర్వం కుండలినీ జాగృతి కావాలంటే సర్వస్వం త్యాగం చేసి అడవులకో, హిమాలయాలకో వెళ్ళి వందల సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తేగాని దొరకని భాగ్యం అది. ఈ ఆధునిక కాలంలో అది అసాధ్యం. మనిషి ఏ త్యాగమూ చేయనవసరం లేకుండా, దేనినీ పరిత్యజించనవసరం లేకుండా తన రోజువారీ జీవితానికి ఏ ఆటంకం లేకుండా ఈ కార్యం నిర్వహించడానికి, ఆత్మసాక్షాత్కారం ΄÷ందడానికి ఏదైనా మార్గం కనుగొనాలని శ్రీమతి నిర్మలాదేవి నిశ్చయించుకున్నారు. అది కూడా 1970వ సంవత్సరం మే 6వ తారీఖు లోపునే జరగాలని అనుకున్నారు. వెంటనే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న నార్గోల్ సముద్రతీరాన ఓ సరుగుడు చెట్టు చెంతనకూర్చుని ఒక రాత్రంతా సుదీర్ఘ ధ్యానం (తపస్సు)లో వున్నారు. అంతే! మే నెల 5వ తేదీ తెల్లవారు ఝామున శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం ఒక్కసారిగా తెరుచుకుంది. భూమినుండి ఒక్కసారిగా భూగర్భజలం ఉవ్వెత్తున ఆకాశం వైపు అతి వేగంగా లేచినట్లుగా తనలోని కుండలినీ శక్తి ఉత్థానం జరిగి మాడు మీద బ్రహ్మరంధ్రం ఛేదించుకుని ఆకాశంలోకి ఒక కాంతిపుంజం చక్రాల గుండా ప్రయాణించి 7 రంగుల హరివిల్లులా వెదజల్లబడింది. శ్రీమాతాజీ మాటల్లో చెప్పాలంటే ఒక రాకెట్టును అంతరిక్షంలోకి పంపినప్పుడు అది ఒక్కొక్క ఛాంబర్ను నెట్టుకుంటూ అత్యంత వేగంతో, నిప్పులు కక్కుకుంటూ, రంగురంగుల వెలుగులు విరజిమ్ముతూ ఆకాశంలోనికి ఎలా దూసు కెళుతుందో అలాంటి అనుభూతే కలిగిందన్నారు. ఇది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అద్వితీయ, అపురూప ఘట్టం. మానవ మాత్రులకు ఇది అసాధ్యం అనుకున్న కార్యం సుసాధ్యం అయ్యిందని శ్రీ మాతాజీ నిర్మలాదేవి పేర్కొన్నారు.ఇంతకుముందు చెప్పినట్లుగా 1970 మే 5 తేదీన ముంబైకి దగ్గరలో గుజరాత్ రాష్ట్రం పరిధిలో వున్న నార్గోల్ సముద్ర తీరాన శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం తెరచిన సహస్రారధామ్ అనే ఆ స్థలాన్ని పుణ్యస్థలిగా భావించి ప్రతి ఏటా మే 5 తేదీన ప్రపంచవ్యాప్తంగా సహజయోగ సాధకులందరు దీనిని సహస్రార దినోత్సవంగా జరుపుకుంటారు. సహజయోగ సాధన చేస్తున్నవారు తమ శారీరిక, మానసిక, భావోద్వేగ బాధలనుండి, సమస్యలనుండి సునాయసంగా స్వాంతన పొందుతున్నారు. సహజయోగం పూర్తిగా ఉచితం.– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు -
మైసూరు మహాదేవి చాముండేశ్వరి
మనం మైసూర్ వెళ్తే 1008 మెట్లకి పసుపు కుంకుమ రాస్తూ మహిషాసుర మర్దినీ స్తోత్రాన్ని భక్తితో స్మరిస్తూ మెట్లు ఎక్కుతుంటారు భక్తులు. ఇలా మెట్లెక్కి దేవి దర్శనం చేసుకోవడం అనేది అమ్మ అనుగ్రహం ఉంటే కానీ జరగదని భక్తుల నమ్మకం. అలాగే దేవి నవరాత్రులు రోజులు వస్తే దేశం అంతటా వినబడే పేరు మైసూరు చాముండేశ్వరి ఉత్సవాలు. విదేశాల నుంచికూడా యాత్రికులు వచ్చి ఆసక్తితో చూస్తారు. ఏనుగు అంబారీ మీద మైసూరు రాజుల ఊరేగింపు ఎంతో ప్రసిద్ధి. మైసూరు మహా నగరంలో చాముండా పర్వతం మీద కొలువై ఉన్నారు చాముండేశ్వరీ దేవి. ఈ పర్వతాన్ని మొదట్లో మహాబల గిరి అని పిలిచేవారట. జగన్మాత చాముండేశ్వరి అవతారం ఎత్తి మహిషాసురుడిని వధించడంతో చాముండ పర్వతంగా పేరు పడింది. అమ్మచేతిలో మరణించే ముందు – ముందుగా తనకే దేవి భక్తులు పూజ చేసి దేవి దర్శనానికి వెళ్లాలని వరం పొందాడు మహిషాసురుడు. ఇప్పటికి జగన్మాత చాముండేశ్వరి దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు ముందుగా మహిషాసురుని దర్శించుకుని ఒక పుష్పాన్ని సమర్పిస్తారు. చాముండేశ్వరి దేవాలయం పక్కనే మహిషాసురుడి భయంకరమైన ప్రతిమ ఉంటుంది.శ్రీ చాముండేశ్వరి దేవాలయానికి మెట్ల దారి గుండా నడిచి వెళ్ళవచ్చు. బస్సు సౌకర్యం కూడా ఉంది. ఏడు అంతస్తులతో నిర్మించిన ఈ దేవాలయం శిల్ప కళా వైభవంతో అద్భుతంగా ఉంటుంది. ఏడవ అంతస్థు అర్ధ వృత్తాకారంగా ఉంటుంది. కలశ గోపుర ప్రతిష్ట గావించారు. ఆలయ ప్రవేశ ద్వారం అంతరాలయం దాటి గర్భగుడిలో వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవిని చూడడానికి రెండు కన్నులు చాలవు. దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు అరటి పండ్లు, పువ్వులు, పచ్చ రంగు చీర గాజులు కుంకుమ బియ్యం మల్లెపూల దండ దేవి సమర్పించి భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటారు. ఆ తరువాత ఉద్దనహళ్లి వెళ్లి చాముండేశ్వరి దేవి సోదరి జ్వాలాముఖి త్రిపుర సుందరీ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ దేవి ఉగ్రరూపిణిగా దర్శనం ఇస్తారు. శ్రీ చాముండేశ్వరి దేవాలయం దగ్గర మహా నందీశ్వరుని పెద్ద శిల్పం జీవ కళ ఉట్టి పడుతుంటుంది. దేవాలయాన్ని పెద్ద పెద్ద నల్లని రాతి పలకలతో నిర్మించారు. సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఇది. మొదట్లో రాజ వంశస్థులకి మాత్రమే దేవి దర్శనం ఉండేది. ఆ తరువాత ప్రజలకి జగన్మాత దర్శనం అనుగ్రహం లభించింది. మైసూరు రాజులూ చామరాజ, ఒడయార్ వంశస్థులు దేవి దాసులు అయ్యారు. ఇప్పటికి రాజవంశీకుల ఆధ్వర్యంలోనే దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ చాముండేశ్వరి దేవిని దర్శించుకుని కొల్లూరు శ్రీ మూకాంబిక దేవి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. ఆ ఆలయం ఇక్కడకు దగ్గర కూడా.– ఈఎస్ మాధవన్, విశాఖపట్నం (చదవండి: సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..) -
సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..
తిరుపతి సమీపంలోని రాయలచెరువులో ఉన్న శ్రీ శక్తి పీఠం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని ఈ శ్రీ శక్తి పీఠాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పీఠం భారతీయ సనాతన సంస్కృతి, యోగ విద్యలకు నిలయంగా అలరారుతోంది. ఈ పీఠాన్ని మాతాజీ రమ్యానందభారతీ స్వామిని (సిద్ధాశ్రమ యోగి) నిర్వాహిస్తున్నారు. ఆమె ధర్మాచరణ ప్రచారంలో భాగంగా మన భాగ్య నగరానికి విచ్చేసిన నేపథ్యంలో మన సాక్షి ఆ అమ్మతో సంభాషించి..మన పాఠకులుకు కలిగే ఎన్నో దర్మసందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. మరి అవేంటో సవివరంగా చూద్దామా.."శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్న రీతిలో సామాన్యులు సైతం సులభంగా ఆ భగవంతుని కృపకు ఎలా పాత్రులు కాగలరు, అలాగే శ్రీ విద్యా ఉపాసన, సులభంగా ఇంట్లోనే చేయడం, యజ్ఞ యాగ క్రతువులు ఏవిధంగా చేయొచ్చు, ఇంకా..మరకతవర్ణ కాళిదేవి విశిష్టత, క్షుద్ర పూజలు ఉన్నాయా..? తదితర ధర్మ సందేహాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!తిరుపతి శ్రీశక్తి పీఠాధిపతి మాతాజీ రమ్యానందభారతీ స్వామిని జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామివారి ప్రధాన శిష్యులలో ఒకరు. ఆమెను స్వయంగా సిద్ధేశ్వరానందభారతీ స్వామివారే "సిద్ధాశ్రమ యోగి"గా అభివర్ణించారు. మాత రమ్యానంద భారతీ స్వామి ప్రస్థానం డాక్టర్గా మొదలైన ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసిన గొప్పయోగి ఆమె. సామాన్య భక్త జనం మదిలో మెదిలో ఎన్నో సందేహాలను చిరుదరహాసంతో నివృత్తి చేసేలా అద్భుతమైన పరిష్కార మార్గాలను అందించారు. అవేంటంటే.సువాసిని పూజ ప్రధానోద్దేశ్యం? ఎందుకోసం?లలితాదేవిని "సువాసినర్చన ప్రీత" అని లలితా త్రిశతి మంత్రల్లో ఉంటుంది. అంటే దీని అర్థం సువాసినులను (భర్తతో కూడిన స్త్రీలను) పూజించడం (అర్చించడం) వల్ల సంతోషించే దేవత అని. ఇక్కడ సువాసినీ: అంటే సౌభాగ్యవతి, పసుపు కుంకుమలతో ఉన్న స్త్రీ. లలితా దేవిని సువాసినీ పూజ ద్వారా ఆరాధిస్తే, ఆమె అత్యంత ప్రసన్నురాలై భక్తుల కోరికలను నెరవేరుస్తుందని లలితా త్రిశతి తెలియజేస్తుంది. అలాగే ఎక్కడ యత్ర నార్యంతు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! అన్న ఆర్యోక్తిని చాటి చెప్పేలా ఈ పూజలను నిర్వహిస్తున్నామని చెప్పారు అమ్మ రమ్యానంద భారతీ. అదీగాక జనవరిలో తిరుపతి క్షేత్రంలో కలియుగ వేంకటేశ్వరుడు, పద్మావతి దేవి వకుళమాత ఉన్న ఆ పుణ్యక్షేత్రంలో దశసహస్ర సువాసినీ పూజ జగడమే గాక గిన్నిస్ రికార్డులకెక్కిన సంగతి కూడా తెలిసిందే. స్తీల గొప్పతనం, వారిని గౌరవించటం గురించి సమాజానికి తెలియజేయడమే ఈ పూజ ప్రదానోద్దేశ్యమని అన్నారామె.పంచాయతన పూజ..పంచాయతన సమేత/పూజ అంటే..?హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా స్మార్త సంప్రదాయంలో పంచాయతన పూజ (ఐదుగురు ప్రధాన దేవతల ఆరాధన) చాలా ముఖ్యమైనది.పంచాయతన 'పంచ' (ఐదు) + 'ఆయతన' (స్థానం/నివాసం). ఐదుగురు ప్రధాన దేవతల సమూహం.దేవతలు: శివుడు, విష్ణువు, శక్తి (దేవి), గణపతి, మరియు సూర్యుడు.ఉద్దేశ్యం: ఆది శంకరాచార్యులచే ప్రచారం చేయబడిన విధానం ఇది. వివిధ ఆరాధనా మార్గాల (శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలైనవి) మధ్య ఐక్యతను తెస్తుంది.పంచాయతన సమేతపైన పేర్కొన్న ఐదుగురు దేవతలను ఒకే సమయంలో, నిర్దిష్టమైన స్థానాల్లో ఉంచి పూజించటం. క్తుడు తన ఇష్ట దైవాన్ని (శివుడు, విష్ణువు మొదలైనవారు) మధ్యలో ఉంచి, మిగిలిన నలుగురిని నాలుగు దిక్కులలో ఉంచి పూజిస్తారు. ఉదాహరణకు, శివుడు ప్రధానమైతే, అది "శివ పంచాయతనం" అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇష్టం దైవం మధ్యలో ఉంచి మిగిలిన వారిని పరివార దేవతలుగా పూజించటం. తంత్రం అంటే..తంత్రం అంటే.. మనల్ని రక్షించేదాన్ని తంత్రం అంటారు. అవి చాలా రకాలు ఉదాహరణకు శ్రీ విద్యా తంత్రం మేరుశాస్త్ర తంత్రం అని పలు రకాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో. అదీగాక సమస్త శాస్త్రంలో తంత్ర శాస్తం ఉత్తమం అని, వేద సమ్మతమైనదని మన పురాణాలే నొక్కి చెబుతున్నాయి. దేవతకు ఎటువంటి పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, ఏవిధంగా ఆరాధించాలి వంటివే ఈ తంత్రాలు. ఏ సమయంలో పూజ చేయాలి, ఎలాంటి హోమాలు చేయాలి. వీటి గురించి వివరించేది తంత్ర శాస్త్రం.కాళి అంటే అరుణ వర్ణం, శ్యామ వర్ణం మరకతవర్ణ కాళి అంటే..?కాలంతో ప్రకాశించే దేవి కాబట్టి నలుపు అని అంతా భావించి అందరూ ఆ మాతను నల్లనిదిగా చెప్పారు. కానీ ప్రతీదేవతకు సత్వ, తామస, రాజస లక్షణాలు ఉంటాయి. తామస లక్షణం కలిగింది నల్లటి కాళి, శ్యామా కాళీ. ఇక శ్రీశక్తిపీఠంలో కొలువుదీరిన మరకతవర్ణం కాళి అంటే..అక్కడ అమ్మ మరకతవర్ణంతో ప్రకాశించాలని ఆదేశింంచిదని, అందువల్ల ఈ ఏర్పాటు చేశామని మాత రమ్యానంద భారతీ చెప్పారు. అదీగాక ప్రకృతి రూపమే మరకతవర్ణం. ఇక్కడ మరకతవర్ణం అంటే చిరునవ్వుతో ప్రేమ స్వరూపిణీగా కనిపించే కాళిమాత. త్వరగా భక్తులను గ్రహిస్తుంది. మరకతవర్ణశిలపై చెక్కిన దేవత. ఇక్కడ కొలువుదీరిన సిద్ధేశ్వరుడు సైతం మరకతవర్ణమే. అంతేగాదు ఈ మరకతవర్ణం ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని అందిస్తుంది. కోరుకున్న సంకల్పం నెరవేరడానికి మరకతవర్ణంలోని దేవతలను పూజించే ఆచారం మన పురాణాల్లో కూడా ఉంది.శ్వేత పాతాళ వారాహి అంటే..?హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయాడు. ఆయన బ్రహ్మదేవుడి గురించి తప్పస్సు చేసినట్లు పురాణాల్లో విన్నాం, చదివాం. కానీ ఆయన వారాహి దేవి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే. మరణం లేని వరం కావాలని కోరాడు. అందుకు అమ్మ సమ్మతించకపోవడంతో హిరణ్యాక్షుడు తెలివిగా నువ్వే సంహరించాలి..అలాగని ఆమెనే స్వయంగా సంహరించకుండా ఉండేలా వరం కోరతాడు. అమ్మ ప్రసన్న వదనంతో తథాస్తు అంటుంది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూమిని పాతాళలోకంలో దాచే ప్రయత్నం చేస్తాడో అప్పుడు మానవులకు దేవతాలకు భూ కష్టాలను నివారించేందుకు విష్ణువు సమాయక్తమవుతాడు. అప్పుడు వారాహి దేవిలోని శ్వేత వరాహం విష్ణువులో ప్రవేశింపచేస్తుంది. దాంతో విష్ణువు వరాహరూపం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. అలా వచ్చిందే శ్వేత వరాహం. ఆమె వ్యవసాయ దేవత కూడా. అందువల్ల భూ సంబంధమైన కష్టాలు, ఆస్తి తగదాలతో సతమతమయ్యే వాళ్లు ఈ అమ్మ పూజించి ఆ సమస్యలను పోగొట్టుకుంటారని చెప్పారు. ఇంట్లోనే హోమాలు, యాగాలు చేయొచ్చా?అయితే ఇలాంటి క్రతువులు ఇంట్లోనే చేయడం అనేది సులభం కాదని అన్నారు. అలాగే మన పురాణాల్లో చూసినా కూడా ఎక్కడా కూడా.. పలాన పర్వతం, దేవాలయం, అడవుల్లో చేసినట్లే ఉంటాయి. పైగా ఓ క్షేత్రం, పీఠం అని కూడా ఉంటుంది. అంటే అక్కడ ప్రాణ ప్రతిష్ట చేసి ఎంతో నిష్టతో పూజలు కైంకర్యలు నిర్వహిస్తారు. పైగా అక్కడ అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. అందుల్లో అలాంటి పీఠాలలో లేదా దేవాలయాలు, ప్రుమఖ పుణ్యక్షేత్రాల్లోనే హోమాలు, యాగాలు చేయడం శ్రేష్టమని అన్నారామె. అలాగే అంత ఖర్చు పెట్టలేని వారు, తమ శ్రీశక్తిపీఠంలో చేయించుకోవచ్చని, ఇక్కడ ఉచితంగానే నిర్వహిస్తామని, అన్ని తామే ఇస్తామని చెప్పారామె.శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా?ఎలా పూజించాలి?యంత్రంలలోకెల్లా గొప్పది శ్రీయంత్రం..విగ్రహాన్ని గానీ, యంత్రాన్ని గానీ తెచ్చి ప్రాణప్రతిష్ట చేస్తే నిత్య పూజలు, నైవేద్యం పెట్టాలి. ప్రాణ ప్రతిష్టలేకుండా విగ్రహం, యంత్రం పూజించినా ఎలాంటి దోషం లేదు. ఎప్పుడైతే ప్రాణప్రతిష్టం చేస్తామో అక్కడ అమ్మవారి వచ్చి కూర్చోంటుంది కాబట్టి అనునిత్యం పూజ చేయాలి. అయితే గృహస్థులకు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆటంకాలు వస్తాయి. అలాంటి సందర్భంలో బియ్యం డబ్బాలో ఉంచుకుంటే సరిపోతుంది. కానీ ఇంట్లో మాత్రం ప్రాణప్రతిష్ట చేయకుండా పెట్టుకుని పూజించొచ్చు. ఎలాంటి సమస్య లేదన్నారామె.క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయా? అది నిజమేనా?ప్రకృతి ఉంటే వికృతి ఉంటుంది. దైవం ఉంటే దెయ్యం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అంత నిష్టగా క్షద్రప్రయోగాలు చేయడం లేదు గానీ మనుషులంతా కేవలం తమ నెగిటివ్ వైబ్రేషన్స్తో అవతవాళ్లపై ప్రయోగాలు చేస్తున్నారని చమత్కరించారామె. తపస్సుకి, మంత్రానికి అధిదేవతలు దేవుళ్లు. దేవతా సాధన చేసేవాళ్లు, మానసిక పరిస్థితి స్ట్రాంగ్గా ఉన్నవాళ్లపై ఇలాంటి ప్రయోగాలు అంతగా పనిచేయవన్నారు. ఆందోళనలు, బలహీన మనస్సు ఉన్నవారు సులభంగా ఆ ప్రభావానికి గురవ్వుతారని అన్నారు. ఎవ్వరూ ఎలాంటి ప్రయోగాలు చేసినా..మీరు తట్టుకునేలా స్ట్రాంగ్గా మారండి. భగవంతుడి సాధన చేయండని పిలుపునిచ్చారామె. మరి ఎవరైనా ప్రయోగాలు చేస్తే..వాటి లక్షణాలు కనిపిస్తాయా? అంటే ఈజీగా తెలుసుకోవచ్చన్నారు. కొన్నింటికి పరిష్కారమార్గం తెలుసుకునే వ్యవధి ఉండదని, కొన్నింటికి మాత్రం సమయం ఉంటుందని అన్నారు కావున సకాలంలో మంచి గురువులని ఆశ్రయించి వాటి నుంచి సులభంగా బయటపడొచ్చని అన్నారు.వామాచారం అంటే..ఏకశ్వేరోపాసనే అసలైన వామాచారం. ఒకే దేవుడిని పూజిస్తా అనేదే వామాచారం. ఇందులో సరైన గురువు దొరికితే ఫలితం రావొచ్చు. మన పురాణాల్లో నరకాసురుడి దీన్ని అనుసరించి శక్తులు ఎన్ని సంపాదించినా కామాఖ్య దేవి వెళ్లిపోయింది అన్న విషయాన్ని గుర్తుచేశారామెడాక్టర్ కమ్ ఆధ్యాత్మిక వేత్తగా మంత్రం అనారోగ్యం నుంచి రక్షించగలదా?ఆధ్యాత్మికతలోనే ఎన్నో వైద్య రహస్యాలు ఉన్నాయి. మణి మంత్ర, ఓషధులతో ఎన్నో రోగాలను నయం చేయొచ్చని అన్నారు. తాను వైద్యాన్ని మంత్ర సారాన్ని అనుసంధానిస్తు..కొన్ని పుస్తకాలను సైతం రాశానని చెప్పారు. మరింత పూర్తివివరంగా ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి. (చదవండి: ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!) -
ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిరోజుల ముందు తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం(ఏప్రిల్ 28, 2026) తెల్లవారుజామునే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్న ఆయన, అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన విజయ్, స్వామివారి ‘విశ్వరూప దర్శనం’లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రసాదంతో పాటు వెండి ‘వేల్’ను బహుకరించారు. ఇది మత విశ్వాసాలకి సంబంధించినది మాత్రమే కాదు..సర్వమత సామరస్యానికి అతీతంగా చేసిన ఒక సంజ్ఞ కూడా. ఈ నేపథ్యంలో ఆ ఆలయం ప్రత్యేకత, ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ తిరుచెదూర్ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంది. సుబ్రమణ్యస్వామి పిలవబడే మురుగన్ దేవునికి చెందినదే ఈ తిరుచెందూర్ ఆలయం. మరుగన్ ఆరు నివాసాలో ఒకటిగా పేరొందిన మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ గుడి తమిళ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికత వంటి అపార ప్రాముఖ్యత కలిగిన ఆలయం. చరిత్ర..ఈ ఆలయం చరిత్ర ప్రాచీన కాలం నాటిది. దీని ప్రస్తావన తమిళ సంగం సాహిత్యం కనిపిస్తుంది ఇక్కడ మురుగన్ దేవుడు రాక్షసుడైన సూరపద్మన్తో పోరాడి ఓడించాడని నమ్ముతారు. ఈ పౌరాణిక ఘట్టాన్ని సూరసంహారంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా, పాండ్య, చేర, చోళ, విజయనగర పాలకులతో సహా వివిధ తమిళ రాజవంశాలు దీని అభివృద్ధికి దోహదపడ్డారు. అలాగే, 17వ శతాబ్దంలో డచ్ వారి దండయాత్ర సమయంలో, కొన్ని విగ్రహాలను తీసుకువెళ్లారు, కానీ తరువాత వాటిని భక్తులు తిరిగి కనుగొనడం విశేషం.ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పానికి నిలయం. ఇందులో విస్తృతమైన శిల్పాలు, స్తంభాల మండపాలు, ఎత్తైన గోపురాలు ఉంటాయి. ఇక్కడ సుమారు 137 అడుగుల ఎత్తులో ఉన్న 9-అంచెల రాజగోపురం నుంచి సముద్రాన్ని వీక్షించడం ప్రధాన ఆకర్షణ. అలాగే ఇక్క ప్రధాన గర్భగుడిలో యోగ భంగిమలో ఉన్న మరుగన్ దేవుడు వల్లి, దేవసేన సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. అంతేగాదు ఇక్కడ మురుగన్ వల్లి వివాహాల గాథలతో ముడిపడి ఉన్న ఒక గుహ కూడా సమీపంలో ఉంది. అలాగే సముద్రానికి సమీపంలో ఉన్న సహజ మంచినీటి ఊట నాజికినారును కూడా భక్తలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వెనక్కి తగ్గిన సునామీ..2004 డిసెంబర్లో వచ్చిన సునామీ తమిళనాడు తీరంపైనా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సునామీ కారణంగా మిగతా ప్రాంతాల్లో సముద్ర జలాలు ముందుకు రాగా.. తిరుచెందూర్లో మాత్రం సముద్రుడు వెనక్కి తగ్గాడు. దీంతో సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నీటి వల్ల ఈ ఆలయానికి ఎలాంటి హాని జరగదనే వరం ఉందని చెబుతారు.ఆలయ ఆచారాలు..ఆలయం సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.సాంప్రదాయబద్ధంగా రోజుకు ఆరుసార్లు మురుగన్ పూజ నిర్వహిస్తారు.దేవుడికి పాలు, చందనం, పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు.ఆలయంలో భక్తులు భక్తికి చిహ్నంగా వేల్స్ సమర్పించి, తలనీలాలు సమర్పించుకుంటారు.ఎలా చేరుకోవాలంటే..సమీప విమానాశ్రయం - తూత్తుకుడి విమానాశ్రయం (సుమారు 40 కి.మీ.), మదురై విమానాశ్రయం (సుమారు 190 కి.మీ.) ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.తిరుచెందూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన పట్టణాలతో అనుసంధానించబడి ఉంది.మదురై, తిరునెల్వేలి, తూత్తుకుడి నుంచి ఈ పట్టణానికి బస్సుల ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
మంచుకొండల్లో.... మహాన్నదానం
చుట్టూ మంచుకొండలు... ఓ వైపు నది... మరోవైపు లోయ... అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇబ్బంది. తీవ్రమైన చలిలో సాగే కేదార్నాథ్ యాత్రలో తెలుగు రాష్ట్రాల భక్తులకు ఆహారం దొరకడం అంత సులభం కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాకు చెందిన కొందరు భక్తులు భక్తికి సేవనే మార్గంగా ఎంచుకుని కేదార్నాథ్కు వచ్చే భక్తులకు ఉచితంగా భోజనం, అల్పాహారం, వసతి అందించాలని సంకల్పించి ‘కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి’ పేరుతో మంచుకొండల్లో తెలుగు భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. 2015 సంవత్సరంలో సిద్దిపేటకు చెందిన భక్తులు కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు. అక్కడ భోజనం లభించక వారు చాలా ఇబ్బంది పడ్డారు. డబ్బులు పెట్టినా సరైన ఆహారం లభించని పరిస్థితి. దీంతో తాము పడ్డ ఇబ్బందులు మిగతా భక్తులు పడకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట కు చెందిన మిత్రులు కొందరు 31 మంది సభ్యులతో కేదార్నాథ్ సేవా సమితి పేరిట ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కేంద్రాల ద్వారా మూడుచోట్ల అన్నదానం అందిస్తున్నారు. అన్నదాన సేవలో సమితి ప్రతినిధులు తమవంతు పాత్ర పోషిస్తూనే రోజూ 10 వేల నుంచి 12వేల మందికి భోజనాన్ని అందిస్తున్నారు. అలాగే దాదాపు 400 మందికి ఉచిత వసతి సైతం ఏర్పాటు చేశారు.ఆహారం... అందించే వేళలుతెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ జరుగుతున్న ఈ సేవలో ఉదయం 7 నుంచి 11 వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు భోజనం అందిస్తారు. సాటి భక్తుల కడుపు నింపడంలోనే తమ ఆనందాన్ని, ఆధ్యాత్మికతను వెతుక్కుంటున్నారు సమితి ప్రతినిధులు. అన్నదానం... దైవ సంకల్పంఅన్ని దానాలలో అన్నదానం మిన్న. మానవ సేవతో మనిషి జీవితానికి పరిపూర్ణ సార్థకత లభిస్తుంది. సిద్దిపేటకు చెందిన పలువురి సహకారంతో 2019లో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితిని ఏర్పాటు చేశాం. దక్షిణ భారతదేశంలోనే తొలి లంగర్ను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు ఇతర భక్తులకు భోజనాన్ని అందిస్తున్నాం. మహాపుణ్య క్షేత్రమైన కేదార్నాథ్లో అన్నదానం చేయడం దైవ సంకల్పంగా భావిస్తున్నాం.– చీకోటి మధుసూదన్, కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట -
కర్ణుని చావుకి కారణాలెన్నో..!
మహాయోధుడిగా... దానకర్ణుడుగా పేరు పొందిన‘కర్ణుని చావుకు కారణాలెన్నో...’ అనే నానుడి ఎలా వచ్చిందో తెలుసుకుందాం....మహాభారత యుద్ధంలో కర్ణుడు 17వరోజున తన తమ్ముడైన అర్జునుని చేతిలో వీరమరణం పొందాడు. అర్జునుడు ఎంతో గర్వంగా శ్రీకృష్ణునితో మహాయోధుడైన కర్ణుని అంతమొందించానని చెప్పడంతో... నీవు చంపడమేమిటి... నీకన్నా ముందు ఆరుగురు వ్యక్తుల వల్ల కర్ణుడు మరణించాడని శ్రీకృష్ణుడు చెప్తాడు.విద్య నేర్చుకునే సమయంలో గురువైన పరశురామునితో తాను బ్రాహ్మణుడనని, తనకు బ్రహ్మాస్త్రంతో పాటు ఇతర అస్త్రాల ప్రయోగాలన్నీ నేర్పమని కర్ణుడు కోరాడు. అందుకు సమ్మతించిన పరశురాముడు అన్ని అస్త్రాల ప్రయోగాలను నేర్పించాడు. అయితే ఒకరోజు పరశురాముడు, కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తుండగా ఒక కీటకం అతని తొడను తొలచసాగింది. రక్తం ఏరులై పారుతున్నప్పటికీ కర్ణుడు బాధను దిగమింగి కదలక ఉండిపోయాడు. అయితే ఆ రక్తప్రవాహానికి మెలకువ వచ్చిన పరశురాముడు, విషయాన్ని అడగటంతో, తాను బ్రాహ్మణుడు కాదని నిజం చెబుతాడు కర్ణుడు. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన పరశురాముడు నువ్వు నేర్చుకున్న అస్త్రాలన్నీ నిష్ప్రయోజనమవుతాయని, సరియైన సమయానికి పనికిరాకుండా పోతాయని శాపం ఇచ్చాడు. అలాగే మహాభారత యుద్ధంలో అతను నేర్చుకున్న అస్త్రాలు ఏవీ జ్ఞాపకానికి రాక కర్ణుని మరణానికి ఒక కారణం అయింది.... కర్ణుడు విలువిద్య అభ్యసిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక బాణం ఆవుకి తగిలింది. అదే సమయంలో ఆవు యజమాని అక్కడికి వచ్చి తన ఆవు పడుతున్న బాధను చూసి ఆక్రోశంతో నీవు కూడా యుద్ధ సమయంలో రోదిస్తూ నిస్సహాయంగా మిగిలిపోయి చనిపోతావని శాపం ఇచ్చాడు.... కర్ణుడు తన రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక చిన్నపిల్ల మట్టికుండలో తీసుకెళ్తున్న నెయ్యి ఒలికి పోయిందని, ఇంటికి వెళ్తే తన తల్లి తిడుతుందని తనకు అదే నెయ్యి కావాలని ఏడుస్తూ కర్ణుని అడిగింది. భూమిని పిండి నెయ్యిని తీసి ఇవ్వడంతో గాయాలతో బాధపడిన భూదేవి యుద్ధ సమయంలో నీ రథచక్రం నేలలో దిగిపోతుందని శపించింది.... కర్ణుడు తన పుత్రుడే అని తెలుసుకున్న కుంతి శ్రీ కృష్ణుని సలహా మేరకు యుద్ధం జరుగుతున్న సమయం లో ఒక రాత్రివేళ కర్ణుని వద్దకు వెళ్లి జన్మవృత్తాంతం తెలిపి, నీ సోదరులను చంపవద్దని కోరగా అర్జునుడు మినహా మిగిలిన నలుగురిని వదిలివేస్తానని మాట ఇస్తాడు కర్ణుడు.....సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుని చంపడం ఎవరివల్లా కాదని గ్రహించిన ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుని కోసం ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో కర్ణుని వద్దకు వెళ్లి కవచ కుండలాలు దానం చేయమని కోరగా, ప్రాణాలకు తెగించి వాటిని కర్ణుడు కోసి ఇచ్చాడు. ఇది కూడా కర్ణుని మృతికి కారణమైంది.... అన్నిటికన్నా ముఖ్యంగా మహాభారత సంగ్రామం లో ఒంటరివాడై నిస్సహాయంగా ఉన్న కర్ణునిపై బాణం సంధించమని అర్జునుని ప్రేరేపిస్తాడు శ్రీకృష్ణుడు. ఇది న్యాయం కాదని, అర్జునుడు చెప్పినప్పటికీ అభిమన్యుని ఒంటరివాడిగా చేసి చంపడం న్యాయమా... అని ప్రశ్నిస్తూ యుద్ధనియమాలు పక్కనపెట్టి కర్ణుని సంహరించమని సూచిస్తాడు.... ఏది ఏమైనా అధర్మం వైపు నిలబడడం వల్లే కర్ణుని మరణం సంభవించిందని చెప్పుకోవచ్చు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
ముక్తి మార్గం... ఒక ఆధ్యాత్మిక ప్రయాణం
సాధారణంగా మనిషి తనను తాను శరీరం, పేరు, కులంతో గుర్తుంచుకుంటాడు. దీనివల్ల రాగద్వేషాలు, భయం, దుఃఖం కలుగుతాయి. ముక్తి అనేది కేవలం మరణానంతరం లభించేది కాదు, జీవించి ఉండగానే పొందే స్థితి (జీవన్ముక్తి). వైరాగ్యం– లౌకిక విషయాల పట్ల మోహం తగ్గించుకోవడం. ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవడం. ఇతరులకు హాని చేయకుండా జీవించడం. సరైన దిశానిర్దేశం చేసే గురువును ఆశ్రయించడం. ముక్తి అంటే ఎక్కడికో వెళ్లడం కాదు, మనలోని దైవత్వాన్ని మనం గుర్తించడం. మన ప్రవృత్తికి ఏ మార్గం సరిపోతుందో దానిని ఎంచుకుని సాగడమే ముక్తికి అసలైన బాట.ముక్తి లేదా మోక్షం అంటే పునర్జన్మ లేని స్థితిని పొందడం. దేహం ముసలిదవుతుంది, మనస్సు మారుతుంటుంది, కానీ వీటన్నింటినీ గమనిస్తున్న ‘సాక్షి’ ఒకరు ఉన్నారు. ఆ సాక్షి లేదా ఆ చైతన్యమే అసలైన దైవత్వం. దైవత్వానికి., మనకు మధ్య ఉన్న అతిపెద్ద అడ్డుగోడ ‘అహం’ ‘నేను చేస్తున్నాను’, ‘ఇది నాది’ అనే భావన తగ్గినప్పుడు, మనలోని అనంతమైన దైవశక్తి వెలుగులోకి వస్తుంది. సముద్రంలోని అల నేను సముద్రాన్ని కాదని భావిస్తే అది అహంకారం, తాను సముద్రంలో భాగమే అని గుర్తిస్తే అది జ్ఞానం. గంగా, యమునా వంటి నదులు వేర్వేరుగా ప్రవహించినా, సముద్రంలో కలిసిన తర్వాత అవి సముద్రమే అయిపోతాయి. అలాగే జీవులన్నీ వేర్వేరుగా కనిపించినా, వాటి మూలం ఆ పరమాత్మే. మట్టితో చేసిన కుండ, ప్రమిద, బొమ్మలు.. పేర్లు వేరైనా వాటన్నింటిలో ఉన్న అసలు వస్తువు మట్టే. అలాగే జగత్తులోని రూపాలు వేరైనా, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నతో మొదలై, దేహం అనిత్యమని, ఆత్మ శాశ్వతమని తెలుసుకోవడం. పరమాత్మపై పరిపూర్ణ మైన ప్రేమను, శరణాగతిని కలిగి ఉండటమే భక్తి మార్గం. కలియుగంలో ఇది అత్యంత సులభమైన మార్గంగా చెప్పబడింది. ‘దైవత్వాన్ని గుర్తించడం’ అనే మాట వినడానికి సరళంగా అనిపించినా, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. దీనిని సాకారం చేసుకోవడానికి మన గ్రంథాలు కొన్ని ఆచరణాత్మక మార్గాలను సూచించాయి. అదేమంటే... రమణ మహర్షి బోధించినట్లుగా ‘నేను ఎవరు?’ అనే విచారణ చేయడం. చెరువు నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే అందులో చంద్రుని ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే దైవత్వం ప్రతిఫలిస్తుంది. షరతులు లేని ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా దైవానికి దగ్గరవ్వవచ్చు. ‘తత్వమసి‘ అంటే ‘దైవం నీవే’. తత్వమసి అనేది కేవలం చదవడానికి వాక్యం కాదు, అది ఒక అనుభూతి. ‘నేను పరిమితమైన వాడిని’ అనే అజ్ఞానం నుంచి ‘నేను అనంతమైన వాడిని’ అనే జ్ఞానం వైపు నడిపించే మహా మంత్రం ఇది. ఈ సత్యాన్ని గ్రహించిన మనిషి జీవన్ముక్తుడు అవుతాడు.మనం దైవాన్ని గుడులలో, గోపురాలలో వెతుకుతాము, కానీ అసలైన దేవుడు మన హృదయస్థానంలో ఉంటాడు. ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చుని, ఆలోచనలను గమనిస్తూ ఉంటే, ఆ నిశ్శబ్దంలోనే దైవత్వం అనుభవంలోకి వస్తుంది. బాహ్య ప్రపంచపు సందడిని తగ్గించి, అంతరంగంలోకి ప్రయాణించడమే దీనికి మార్గం. ‘అందరిలోనూ ఉన్నది ఒకే దైవం‘ అని గుర్తించడం. ఎదుటి వారిని చూసినప్పుడు వారి రూపం కంటే, వారిలో ఉన్న జీవాన్ని (దైవత్వాన్ని) గౌరవించడం నేర్చుకోవాలి. ‘అద్వైతం’ అంటే ఇదే. ఇది ఏదో ఒక రోజులో జరిగేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
లిటిల్స్ కు బుద్ధ స్టోరీస్
‘సకల సౌకర్యాలూ ఉన్నాయి. మనఃశాంతి లేదు’ ‘ఎంత ప్రయత్నించినా కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నాను’ ‘చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడుతుంటాను’‘ఆత్మన్యూనతతో ఏ పనీ చేయలేకపోతున్నాను’... ఇలాంటి మాటలు ఎక్కడో ఒకచోట వినబడుతుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారాలు వ్యక్తిత్వ వికాసనిపుణులు, మోటివేషనల్ స్పీకర్స్ మాటల్లోనే వెదుక్కుంటాం. అయితే బుద్ధుడి కథల్లో ఎన్నో సమస్యలకు, ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. వాటిని పిల్లలతో చదివిస్తే... నైతిక విలువలతో కూడిన వారి భవిష్యత్కు ఆ కథలు పునాదిగా పనిచేస్తాయి. మచ్చుకు కొన్ని కథలు...సూత్రాలు కాదు... స్ఫూర్తి ముఖ్యంబుద్దుడు తన శిష్యుడితో కలిసి దట్టమైన అడవి గుండా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. వారికి ఎదురుగా ఒక నది వచ్చింది. వారు నదిలోకి అడుగుపెట్టబోతుండగా ఒక యువతి పరుగెత్తుకుంటూ వచ్చి నది దాటడానికి సహాయం చేయాల్సిందిగా వేడుకుంది. బుద్ధుడు క్షణం కూడా సంకోచించకుండా ఆ యువతిని తన వీపుపై ఎత్తుకొని నదిని దాటాడు. ఆ తరువాత... తనను వేధిస్తున్న ప్రశ్నను బుద్ధుడిని అడిగాడు శిష్యుడు....‘ఓ మహర్షి! మనం బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాం. అయినా మీరు ఆ స్త్రీని మీతోపాటు నదిలోకి తీసుకెళ్లారు. ఇది మన సూత్రాలకు విరుద్ధం కాదా?’బుద్దుడు నవ్వి ఇలా అన్నారు: ‘కుమారా! నేను అవసరంలో ఉన్న తోటి మనిషికి సహాయం చేయడానికి ఆ స్త్రీని ఒడ్డున వదిలి పెట్టాను. నువ్వే ఆమెను ఇంకా నీ మనసులో మోస్తున్నావు’ చివరకు శిష్యుడు గ్రహించాడు. దీక్షలోని పదాలు ముఖ్యం కాదు అందులోని స్ఫూర్తి ముఖ్యం అని. మనకు ఉండే భౌతిక భారం కన్నా మన ఆలోచనలే పెద్ద భారం అని.వజ్రాల కంటె విలువైన సందేశంఒక శిష్యుడు బుద్దుడి దగ్గరకు వచ్చి ‘పేదరికంతో విసిగివేసారి పోయాను. నాకు సంపద కావాలి’ అన్నాడు. అప్పుడు బుద్దుడు ‘ఈ చెట్ల వరుసను చూడు. ప్రతి చెట్టు కింద ఒక నిధి పెట్టె పాతిపెట్టి ఉంది. నువ్వు దానిని తీసుకొని ధనవంతుడివి కావచ్చు’ అన్నారు. ఆ శిష్యుడు చాలా సంతోషించి తవ్వడానికి సిద్ధమయ్యాడు. మొదటి చెట్టును తవ్వడం మొదలు పెట్టిన కొద్దిసేపటికి వెండి ఉన్న నిధి పెట్టె దొరికింది.అతను కాసేపు ఆలోచించి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రెండవ చెట్టు కింద తవ్వగా బంగారంతో నిండిన ఒక పెట్టె దొరికింది. అతడు కాసేపు ఆలోచించి ఇంకా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టుకింద ఇప్పటివరకు చూసిన వాటిలోకెల్లా అతి పెద్ద పెట్టె ఉంది. తన జీవితంలో ఎన్నడూ చూడని విలువైన వజ్రాలు అందులో ఉన్నాయి. అయినా, అతనికి ఇంకా కావాలనిపించింది.చివరి చెట్టు దగ్గరికి వెళ్లి తవ్వాడు. అతడికి ఆశ్చర్యం కలిగేలా ఒక చిన్నపెట్టె కనిపించింది. ఆ పెట్టెలో ఇలా రాసి ఉంది...‘అవకాశాలు నీ దారిలోకి వస్తూనే ఉంటాయి. వాటిని నువ్వు అందిపుచ్చుకోవచ్చు. కానీ మితిమీరిన దురాశ ఎల్లప్పుడూ పతనానికి దారితీస్తుంది’ ఈ సందేశంతో శిష్యుడు గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ తరువాత ఎప్పుడూ దురాశకు లోనుకాలేదు.యానిమేటెడ్ కథలుబుద్ధుడి కథలు యానిమేటెడ్ వీడియోల రూపంలో యూట్యూబ్లో ఉన్నాయి. ‘మ్యాజిక్బాక్స్ ఇంగ్లీష్ స్టోరీస్, ‘గీతాంజలి–కార్టూన్ ఫర్ కిడ్స్’... మొదలైన యూట్యూబ్ చానల్స్లో బుద్ధ స్టోరీస్ ఫర్ కిడ్స్ విభాగాలు ఉన్నాయి. లిటిల్ బుద్ధ: ఏ పీస్ఫుల్ జర్నీ, బుద్దా’స్ లెస్సన్స్, 28–లైఫ్ చేంజింగ్ బుద్దిస్ట్ స్టోరీస్(దట్ విల్ రీషేప్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్), ది బుద్ధ అండ్ ది హోమ్లెస్ మ్యాన్ స్టోరీ, లెజెండ్ ఆఫ్ బుద్ద...ఇలా ఎన్నో యానిమేటెడ్ వీడియోలు (యూట్యూబ్)లో, బుద్ధ విజ్డమ్ స్టోరీస్, బుద్ధ మోటివేషన్ స్టోరీ... మొదలైనవి ఇన్స్టాగ్రామ్లో అందుబాటులో ఉన్నాయి.శంకర ‘మంచి కథలు’తెలుగులో రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి ఉపయోగపడే పుస్తకం...అమరావతి కథలు. సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు పెద్దలకే కాదు పిల్లలకూ బాగా నచ్చుతాయి. ఈ పుస్తకంలో ‘కానుక’ అనే అద్భుతమైన కథ ఉంది. రాకుమారుడు బుద్దుడై తిరిగి వచ్చిన నాటి కథ ఇది. ‘మంగళ వాద్యాలు మోగాయి. వీథుల్లో జనం కిక్కిరిసి ఉన్నారు. అల్లడుగో బుద్దుడు! అల్లదే వెలుగు! వీథుల నిండా వెన్నెల!’ ‘రాజ్యమేలవలసిన రాజు లోకాన్నంతా ఏలుతున్నాడంట!’‘అంత సుకుమారుడు అడవుల ఏ ఎండకాసెనో, ఏ వాన తడిసెనో, ఏ ముళ్లబాట నడిచెనో, ఏ కసరుకాయ కొరికెనో...’ ‘రాజకుమారుడు సన్యాసి అయ్యాడు. రత్నకిరీటం లేదు. మణిహారాలు లేవు. కాషాయాంబరాలతో, చిరునవ్వుతో అందరి కళ్ళలోకి చూస్తున్నాడు. ఆకాశంలోంచి కాంతిగోళం భూమిని తాకినట్టుంది’.. ఇలాంటి వాక్యాలెన్నో మనసుకు హత్తుకుపోతాయి. మనస్సుకు కొంత సమయం ఇవ్వు!ధ్యానం ముగిసిన తరువాత బుద్దుడి దగ్గరకు వచ్చిన ఒక శిష్యుడు ఆయనతో ఇలా అన్నాడు... ‘ఈరోజు నాకు చాలా కోపంగా ఉంది. వృద్ధురాలైన మా తల్లిని చూసుకోవడానికి మా అన్న తిరస్కరిస్తున్నాడు. అతనికి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు’ శిష్యుడు చెప్పింది విన్న బుద్దుడు... ‘దయచేసి దగ్గరలో ఉన్న చెరువు నుండి నా కోసం గిన్నెడు నీళ్లు తీసుకురాగలవా?’ అని అడిగారు. అతడు వెంటనే చెరువు దగ్గరికి వెళ్లాడు. అక్కడ కొన్ని జంతువులు చెరువును దాటి వెళ్లడం వల్ల నీళ్లు మురికి అయ్యాయి. ఆ శిష్యుడు బుద్ధుడి దగ్గరకు వచ్చి ‘చెరువు నీరు తాగడానికి యోగ్యంగా లేవు’ అని చెప్పాడు. ‘మనం ధ్యానం చేద్దాం’ అన్నాడు బుద్దుడు. కొద్దిసేపటి తరువాత...శిష్యుడిని నీళ్లు తీసురమ్మని అడిగాడు బుద్దుడు. చెరువు దగ్గరికి వెళ్లాడు శిష్యుడు. నీళ్లు స్వచ్ఛంగా ఉండడంతో బుద్ధుడికి ఈసారి నీళ్లు తీసుకురాగలిగాడు. నీళ్లు తాగిన బుద్దుడు ఇలా అన్నాడు... ‘నీ మనసు ఒక చెరువులాంటిది. నీకు కోపపూరితమైన ఆలోచనలు వచ్చినప్పుడు బురద నీళ్లలాగే మనసు కూడా నిరూపయోగకరంగా మారుతుంది. మనస్సుకు కొంత సమయం ఇవ్వు. కోపం శాంతించనివ్వు. అప్పుడు నీ మనస్సే నీకు సమాధానం ఇస్తుంది’ -
విశిష్ట ఫలదాయకం... వైశాఖ పూర్ణిమ
వైశాఖ శుద్ధ పూర్ణిమ (వైశాఖ పౌర్ణమి) హిందూ, బౌద్ధ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు. దీనిని ‘బుద్ధ పూర్ణిమ’ అని, ‘మహా వైశాఖి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును కూర్మావతారంలో పూజించడం, నదీస్నానం చేయడం, అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును ఆరాధించడం వల్ల అక్షయ పుణ్యఫలం లభిస్తుందని, చేతనైనంత దానధర్మాలు చేయడం వల్ల నరఘోష తొలగిపోతుందని శాస్త్రోక్తి.విశిష్టతలు: బుద్ధ పూర్ణిమ/జయంతి: సిద్ధార్థుడు జన్మించడం, జ్ఞానోదయం పొందడం, మహా పరినిర్వాణం చెందడం అనే మూడు ముఖ్యమైన ఘట్టాలు ఇదేరోజు జరగడంతో దీనిని ‘త్రివిధ పుణ్యదినం’గా బౌద్ధులు జరుపుకుంటారు.శ్రీ కూర్మ జయంతి: శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన రోజుగా కూర్మ పురాణం చెబుతోంది.ఈ రోజు కూర్మనారాయణుని ఆరాధించడం సత్ఫలితాలనిస్తుంది.సముద్ర/నదీ స్నానం: ఈ రోజున సముద్రంలో లేదా గంగానదిలో స్నానం చేయడం అత్యంత పవిత్రం. కరక్కాయను సముద్రంలో వేసి స్నానం చేస్తే నరదిష్టి, నరఘోష తొలుగుతాయని నమ్మకం.చదవండి: మంచుకొండల్లో ఓంకార నాదంరావి చెట్టు పూజ: వైశాఖ మాసంలో రావిచెట్టుపై విష్ణుమూర్తి కొలువై ఉంటాడని, ఈ పూర్ణిమ రోజు రావి చెట్టును పూజిస్తే శని, బృహస్పతుల అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు లభిస్తాయని పెద్దల మాట.అన్నమాచార్య జయంతి: సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుల వారు జన్మించిన రోజు కావడంతో దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. దానధర్మాలు: ఈ రోజున చేసే జలదానం, వస్త్రదానం, ఆహార దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పురాణోక్తి.– డి.వి.ఆర్. -
నా దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను.. స్వీకరిస్తారా?
ఆమ్రపాలి క్రీ.పూ. 500 సంవత్సర ప్రాంతానికి చెందినది. గౌతమ బుద్ధుని సమకాలికురాలు. ఆమ్రపాలి అంటే ‘మామిడి చిగురు’ అని అర్థం. ఆమ్రపాలికి అంబపాలిక, అంబపాలి, ఆమ్ర అనే నామాంతరాలూ ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులెవరో తెలియదు. వైశాలి నగరంలో మామిడి తోటలో ఒక చెట్టు కింద పసిపిల్లగా ఏడుస్తూ పడి ఉంటే సోమదత్తుడు అనే ఆయన ఇంటికి తెచ్చుకొని ఆ పాపను పెంచి పెద్ద చేశాడు. కౌమార దశలోనే ఆమ్రపాలి అపురూప సౌందర్యవతిగా, అద్భుత నాట్య కళాకారిణిగా ఖ్యాతి గడించింది.లిచ్ఛవి జాతికి చెందిన రాజులకు వైశాలి నగరం రాజధానిగా ఉండేది. ఆ కాలంలో అందమైన స్త్రీలు పెండ్లిచేసుకొని కేవలం ఒక వ్యక్తితో జీవించడం కాక, తమకు నచ్చిన పురుషునితో రోజుకు ఒకరితో గడిపే ఆచారం వైశాలిలో ఉండేది. ఆమ్రపాలి తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అయిన పుష్ప కుమారుని వివాహం చేసుకోవాలనుకొంది. కానీ వైశాలి రాజు మనుదేవుని కన్ను ఆమ్రపాలిపై పడింది. ఆమె పెండ్లి రోజునే పుష్పకుమారుని హత్యచేసి మనుదేవుడు ఆమ్రపాలిని వైశాలి ‘నగర వధు’ (వేశ్య)గా అధికారికంగా ప్రకటించాడు.ఆమ్రపాలి రాజనర్తకిగా నియమింప బడింది. ఆమె జగన్మోహన సౌందర్యం, అసమాన నాట్య కౌశలం ఎంతోమంది రాజులను, ధనవంతులను ఆకర్షించింది. ఆమె నాట్యం చూడటానికి, ఆమెతో గడపటానికి యాభై ‘కార్షపణములు’ వెలగా నిర్ణయింపబడింది. స్వల్పకాలంలోనే ఆమ్రపాలి సంపద ఏ రాజు కోశాగారంలో లేనంతగా పెరిగి పోయింది. అలా రాజనర్తకి, సౌందర్యరాశి అయిన ఆమ్రపాలి రాజాధిరాజుల, ధనవంతుల ప్రాపకంలో అత్యంత ధనవంతురాలై, సుఖంగా జీవించ సాగింది. గౌతమ బుద్ధుడు వైశాలి నగరానికి వచ్చాడు. ఆయన గొప్పదనం గూర్చి చెలికత్తెల ద్వారా విని, ఆయన తన వద్దకు ఎందుకు రాలేదా అని ఆశ్చర్య పడింది ఆమ్రపాలి.ఒకరోజు బుద్ధుడు వచ్చి, ఆమె భవనం ముందు నిలబడి భిక్ష కోరాడు. సమస్త ఆభరణాలూ ధరించి, ద్విగుణీకృత అలంకారాలతో ఆమ్రపాలి బయటకు వచ్చి, తన సౌందర్యవంతమైన రూపలావణ్యాలను ప్రదర్శిస్తూ బుద్ధుని ముందు నిలబడి, ‘‘నా ఈ దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను. స్వీకరిస్తారా’’ అని వగలొలికిస్తూ అడిగింది. ఆమె మాటలు విని కొంతసేపు కండ్లు మూసుకొని, తర్వాత కండ్లను తెరిచి, బుద్ధుడు ఆమ్రపాలితో ‘అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ భిక్షను తప్పక స్వీకరిస్తాను. అందాకా సెలవు‘ అని చెప్పి వెళ్ళిపోయాడు.కొంతకాలానికి ఆమ్రపాలి శరీర పటుత్వం తగ్గింది. వేశ్యావృత్తి వలన ఆమె శరీరాన్ని అనేక రోగాలు చుట్టుముట్టాయి. క్రమంగా ఆమె కుష్ఠురోగి అయ్యింది. కురూపి అయ్యింది. విటులతోబాటు దాసదాసీ జనమంతా దూరమయ్యారు. సంపద నశించి పోయింది. ఆమె వికార రూపం అందరితో అసహ్యించుకోబడింది. సమాజంచే బహిష్కరింపబడిన ఆమ్రపాలి ఊరి బయట ఒక చిన్న కుటీరంలో దుఃఖభూయిష్ట జీవితం గడపసాగింది. ఒకరోజు వర్షం పడుతూండగా సాయంత్రంవేళ, చిరుచీకట్లు అలుముకొంటున్న సమయంలో, తన కుటీర ఆవరణలో కూర్చొని ఉన్న ఆమ్రపాలికి ’అమ్మా’ అన్న పిలుపు వినబడింది. ఒక ఆజానుబాహువు తన దగ్గరకు వస్తూండడం చూసి, బుద్ధుడు అని గ్రహించి, ‘అక్కడే ఆగు. సమీపానికి రావద్దు. నేనొక కుష్ఠు రోగిని’ అనింది ఆమ్రపాలి.‘అమ్మా, మరిచావా నన్ను. ఒకరోజు భిక్షకోరి మీ ఇంటికి వస్తే మీ శరీరాన్నే భిక్షగా ఇస్తానన్నారు. అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు తప్పక స్వీకరిస్తానని అన్నాను. ఇప్పుడు ఆ భిక్షను ఇవ్వమ్మా’ అని ఆర్ద్రంగా పలికాడు బుద్ధుడు. ‘ఆ రోజు నేను నీకు ఇస్తానన్నది అందం, ఆరోగ్యం, యవ్వనంతో కూడిన శరీరాన్ని. ఈ రోజు ఆ దేహం వ్యాధిగ్రస్తమయ్యింది’ అంటూ దూరం జరిగింది ఆమ్రపాలి. చదవండి: సంకల్పం ముందు వైకల్యం ఎంత!దయామయుడైన బుద్ధుడు ‘అమ్మా, అందచందాలతో మాకు అవసరంలేదు. భయంకరమైన రోగంతో దేహం శిథిలమైనా పరివర్తన చెందిన మనసు మీది’ అంటూ మరింత దగ్గరగా రాసాగాడు. ఆయన నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళే ప్రయత్నంలో కిందపడిపోయిన ఆమ్రపాలిని తన రెండు చేతులతో ఎత్తుకొని ‘నా కన్నతల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమెకు సేవ చేసే భాగ్యం నాకు లేక పోయింది. నీలో నా కన్నతల్లిని చూసుకుంటూ సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ’ అంటూ ఆమెను మెల్లగా కుటీరంలోకి చేర్చి, ఆమె తుది శ్వాస విడిచే వరకూ సేవలు చేశాడు కరుణామూర్తి బుద్ధ భగవానుడు.బుద్ధం శరణం గచ్ఛామి– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
144 ఏళ్ల క్రితం కేదార్నాథ్ ఆలయం ఎలా ఉండేదో తెలుసా..!
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ యాత్ర ప్రారంభకానుంది. ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ హిమాలయాలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం, నెలల తరబడి శీతాకాలపు మూసివేత తర్వాత మరోసారి భక్తుల కోసం తలుపులు తెరుచుకోనుంది. ఛార్ధామ్ యాత్ర పేరుతో ఇక్కడకు వచ్చి ఆ మహాదేవుడిని కొలుస్తుంటారు భక్తులు. అయితే ఇప్పుడు ఆధునికత యాత్రను కొంచెం సులభతరం చేయగలిగింది. కానీ వందేళ్ల క్రితం ఈ కేదార్నాథ్ ఎలా ఉండేదో అందుకు సంబంధించిన ఫోటోని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఎలా ఉందంటే..1882లో తీసిన కేదార్నాథ్ ధామ్కు సంబంధించిన మొట్టమొదటి ఛాయాచిత్రాలలో ఒకటిగా భావిస్తున్న ఒక చిత్రాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి రోడ్లు, రైల్వే స్టేషన్లు, హెలికాప్టర్లు ఏవీ లేవని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రయాణం సౌలభ్యం అయిపోయాక..అక్కడున్న అందాల్ని ఆస్వాదించడం మర్చిపోతున్నాం అంటూ ఆలోచింపచేసే ప్రశ్నను లేవనెత్తారు. టెక్నాలజీ సౌలభ్యతను అందివ్వాలేగానీ..ఏదో వచ్చాం, వెళ్లిపోయాం అన్నట్లు కాదు కదా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహీంద్రా. ఆ మంచు కొండల మధ్య కొలువైన ఆ మహా దేవుడి చుట్టుతా ఉన్న అద్భుతాలు, ప్రకృతి రమ్యతను తనివితీరా ఆస్వాదించడం ఓ కళ. అప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణమయ్యేది అనేది పలువురి ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. ఆ విషయాన్నే గుర్తుచేసేలా ఇలా నాటి ఫోటోని షేర్ చేశారు మహీంద్రా. కాగా, కేదార్నాథ్ యాత్ర ఊపందుకుంటున్న తరుణంలో మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. యాత్ర ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లోనే 1.1 లక్ష మందికి పైగా భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సీజన్లో యాత్రికుల రాకపోకలు సజావుగా సాగడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ప్రణాళికే కారణమని ఆలయ అధికారులు అన్నారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సుమారు 3,584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్, శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే దేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. అక్కడి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ప్రతి ఏడాది పరిమిత కాలం వరకు మాత్రమే(ఆరు నెలలు) సందర్శనకు అందుబాటులో ఉంటుంది.Apparently, this is one of the earliest known photographs of the sacred Kedarnath Dham, taken in 1882.Couldn’t take my eyes off it. No roads. No railheads. No helicopters.Just the abode of Lord Shiva, cradled by the HimalayasBack then, the yatra demanded time, endurance,… pic.twitter.com/UfvWVsmLnf— anand mahindra (@anandmahindra) April 26, 2026 (చదవండి: పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...) -
శల్య సారథ్యం అంటే..?
మహాభారత సంగ్రామంలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక శైలి. వారిలో శల్యుడు ఒకరు. ఒకరిపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సాయం చేసే నెపంతో చేతులారా చెడగొట్టడంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడాన్ని శల్య సారధ్యం అంటారు.శల్యుడు మద్ర దేశానికి అధిపతి, పాండురాజుకు రెండవ భార్య అయిన మాద్రికి సోదరుడు. మాద్రి సంతానమైన నకుల, సహదేవులకు మేనమామ. శల్యుడు అస్త్రవిద్య, గదా యుద్ధం, ముఖ్యంగా రథసారథిగా గొప్ప నేర్పరి. అలాంటి శల్యుడు పాండవుల పక్షాన ఉంటే వారిని గెలవడం కష్టమని గ్రహించిన దుర్యోధనుడు ఒక పథకం పన్నాడు. పాండవులను కలవడానికి వెళుతున్న శల్యుడికి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అక్కడక్కడా పెద్దపెద్ద గుడారాలు వేయిస్తాడు. ఆ గుడారాలు పాండవులవేనని అనుకొన్న శల్యుడు వాటిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి సేవకులు శల్యునికి ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి, గౌరవ మర్యాదలు చేసి అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. ఇదంతా పాండవులు తన కోసమే చేశారనుకున్న శల్యుడు విందు ఆరగించి, వెంటనే సేవకునితో తక్షణమే వెళ్లి మీ యజమాని పిలుచుకొని రా... రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతును తెలుపుతానని చెప్పాడు.సేవకులతో పాటు దుర్యోధనుడు రావడంతో ఆశ్చర్యపడ్డ శల్యుడు జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోలేక మహా భారత సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. అనంతరం శిబిరం నుండి బయలుదేరిన శల్యుడు పాండవులను కలుసుకొని జరిగిన సంఘటన వివరించాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడితో మాట్లాడుతూ, కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని, కానీ ఒక సహాయం చేస్తాననే మాట ఇమ్మని శల్యుణ్ణి అడిగాడు. అలాగే, అదేమిటో చెప్పమన్న శల్యుడితో ‘‘రథం తోలడంతో నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని రథాన్ని తోలే అవకాశం వస్తే ఆ సమయంలో కర్ణుని అడుగడుగునా అవహేళన చేస్తూ, మానసికంగా, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాలి’’ అని ధర్మరాజు కోరాడు. అందుకు అంగీకరించాడు శల్యుడు.ఊహించిన విధంగానే మహాభారత సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి అప్పగించారు. కర్ణుని పరాక్రమాన్ని గమనించిన శల్యుడు అడుగడుగునా కర్ణుని అవహేళన చేస్తూ సూటిపోటి మాటలతో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఒక సమయంలో కర్ణుడు వదిలిన అస్త్రాన్ని అర్జునుని తలపైకి కాకుండా గుండెల వైపు గురి పెట్టమని శల్యుడు సూచిస్తాడు. అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడ్డ కర్ణుడు అస్త్రాన్ని తలవైపునకే గురిపెట్టడం, అర్జునిని రథ సార థ, జగన్నాటక సూత్ర ధారి అయిన శ్రీ కృష్ణుడు రథాన్ని కిందకు తొక్కడంతో ఎంతో శక్తిమంతమైన అస్త్రం అర్జునుని తలపై నుండి వెళ్ళిపోయి వ్యర్థ మైపోయింది. ఈ లోగా కర్ణుని శాపాలు అన్నీ కలిసి రావటంతో అర్జునుడు విడిచిన అస్త్రంతో కర్ణుడు మరణిస్తాడు. అప్పటి నుండి శల్య సారథ్యం అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.– సి. ఎన్. మూర్తి,సీనియర్ పాత్రికేయులు -
కొండ హారతి
అది శేషాచలం కొండలకు కూత వేటు దూరంలో ఉన్న గ్రామం. ఆ ఊరి అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి కేరళ అమ్మాయితో పెళ్ళి జరిగింది. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి.మొదటిసారిగా ఆ అమ్మాయి అత్తగారింటికి కారులో బయల్దేరింది. ఆ ఊర్లో ప్రతి ఇంటి ముందరో, వెనకాలో కొబ్బరిచెట్లు ఉండటం గమనించింది. చిన్నపిల్లలాగా గంతులేస్తూ కారును ఆపమని కోరింది. గబగబా ఒక కొబ్బరిచెట్టు దగ్గరకు వెళ్ళి చేత్తో తడిమి పరవశించిపోయింది. ‘మా కేరళలో లాగా ఇక్కడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా సంతోషం. ఈ నేల కొబ్బరిచెట్లకు అనుకూలమైనదా’ అని అడిగింది. ఆమెను ఎప్పుడూ అంత ఆనందంగా ఉండటం చూడలేదు భర్త. పక్కనే ఉన్న భర్త ‘అంత అనుకూలమైన నేల కాదు కానీ, మా ఊర్లో ఈ కొబ్బరి చెట్లను పెంచడానికి ఓ కారణం ఉంది. మా నాన్నగారు వేంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడు. నుదుటిన నామం పెట్టేవాడు. ఆ రోజు ఉదయం శేషాచలం కొండలకి నేతి దీపాల హారతి ఇచ్చే వాడు. దాంతోపాటు కొబ్బరికాయ కూడా కొట్టేవాడు.ఒక్కోసారి, పట్టణం నుంచి కొబ్బరికాయ తెచ్చేది మరిచే వాడు. అలా కొబ్బరికాయ తీసుకురాని రోజు మా అమ్మ చాలా బాధపడేది. ఆ వారమంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండేది.అది గమనించిన మా నాన్న ‘ఇంట్లోనే కొబ్బరి చెట్టు నాటితే ఆ సమస్యనుంచి బయటపడవచ్చు కదా’ అని భావించాడు. అనుకున్నట్లే చేశాడు. ఇది చిన్న ఊరు కాబట్టి, ఒకర్ని చూసి మరొకరు కొబ్బరి చెట్లు నాటడం మొదలయ్యింది. అలాగే ప్రతి శనివారం కొండకి హారతి పట్టి టెంకాయ కొట్టడం అందరి ఇండ్లలోనూ అలవాటుగా మారింది’’ అని చెప్పాడు.‘అలాగా’ అని ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.ఇద్దరూ ఇంటికి వెళ్ళి కాళ్ళూచేతులూ కడుక్కుంటూ ఉండగా– ఇంతలో ఆమె అత్తమామలు పిలవడంతో మిద్దెమీదకు వెళ్ళారు. వారు అప్పటికే నేతి దీప హారతికి అంతా సిద్ధం చేసి ఉన్నారు. పళ్ళెంలో దీపం వెలిగించి కొండకి హారతి ఇచ్చి, టెంకాయ కొట్టి గోవింద నామస్మరణలు చేశారు. ‘ఎంత అదృష్టవంతులు ఇక్కడి వారు, ఆదిశేషుడి రూపంలో ఉన్న శేషాచలం కొండని రోజూ చూసే భాగ్యవంతులు’ అని వారితో పాటు గోవింద నామస్మరణలు చేసింది. దైవభక్తి కల్గిన కోడలు దొరికిందని అత్తమామలు మురిసిపోయారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
దౌర్జన్యానికి దైవశిక్ష తప్పదు!
మానవ సంబంధాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ’సహోదరత్వం’. అయితే నేటి సమాజంలో స్వార్థం, అహంకారం పెరిగిపోయి ఇతరుల హక్కులను కాలరాయడం, బలహీనులపై దౌర్జన్యం చేయడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఇస్లామీయ బోధనల ప్రకారం దౌర్జన్యం (జులుమ్) అనేది అల్లాహ్ దృష్టిలో క్షమించరాని మహాపరాధం.దౌర్జన్యం అంటే ఏమిటి?అరబీలో ’మజాలిమ్’ అంటే అకారణంగా ప్రజలను వేధించడం, ఒకరి ఆస్తిని అక్రమంగా కబళించడం మరియు ఒకరి హక్కులను బలవంతంగా లాక్కోవడం. వివేకవంతులైన విశ్వాసులు అల్లాహ్ హెచ్చరికను గుర్తుంచుకోవాలి: ‘దుర్మార్గులు చేస్తున్న దానిని అల్లాహ్ పట్టించుకోవడం లేదని భావించకండి. ఆయన వారిని శిక్షించే రోజును వాయిదా వేస్తున్నాడు మాత్రమే.‘ ఆనాడు ఏ అధికార బలగం, ఏ సంఖ్యా బలం వారిని రక్షించలేదు.పరలోకంలో శిక్షా రూపంప్రవక్త ముహమ్మద్ (సఅసం) హెచ్చరించినట్లుగా, ఈ లోకంలో ఇతరులపై చేసే దౌర్జన్యం ప్రళయదినాన దట్టమైన చీకటిగా మారుతుంది. పీడితుని ఆక్రందనకూ, అల్లాహ్ కీ మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. ఒక వ్యక్తి వేరొకరి జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే, ప్రళయదినాన ఏడు భూభాగాల గుదిబండను అతని మెడలో వేయడం జరుగుతుంది. ఇది కేవలం భూమికే కాదు, ఇతరుల మాన మర్యాదలను మంటగలిపేవారికి కూడా వర్తిస్తుంది.అసలైన సహాయం: బాధితునికీ, దౌర్జన్యపరునికీ!మత సామరస్యం, సామాజిక న్యాయం వెల్లివిరియాలంటే ముస్లింలు తమ తోటి సోదరులకు అండగా ఉండాలి. ప్రవక్త (సఅసం) ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు: ‘మీ సోదరునికి అతను దౌర్జన్యపరుడైనా, బాధితుడైనా తోడ్పడండి. బాధితునికి సహాయం చేయడం అంటే అతనికి న్యాయం జరిగేలా చూడటం. మరి దౌర్జన్యపరునికి సహాయం చేయడం అంటే ఏమిటి? అతను అన్యాయం చేయకుండా అతని చేతిని పట్టుకోవడం, అతన్ని తప్పు నుండి మళ్ళించడం.క్షమ – ప్రాయశ్చిత్తంఒక వ్యక్తి చేసిన పాపాలను అల్లాహ్ క్షమిస్తాడేమో కానీ, తోటి మనిషికి చేసిన అన్యాయాన్ని ఆ బాధితుడు క్షమించే వరకు అల్లాహ్ కూడా క్షమించడు. అందుకే పారలౌకిక విచారణ రాకముందే, ఈ లోకంలోనే బాధితుని వద్ద క్షమాపణ పొంది, వారి హక్కులను తిరిగి చెల్లించాలి. లేదంటే, పుణ్యాలన్నీ బాధితుని ఖాతాలోకి వెళ్లిపోయి పాపాలే మిగిలే ప్రమాదం ఉంది.ఆక్రందనలు అరణ్య రోదనలు కావులోకంలో పీడితుల ఆక్రందనలు అరణ్య రోదనలు కావు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పక జరుగుతుంది. ఒక విశ్వాసి మరో విశ్వాసికి భవనంలోని ఇటుకల వలె ఒకరికొకరు బలం చేకూర్చుకోవాలి. అప్పుడే సమాజంలో శాంతి, అల్లాహ్ కారుణ్యం లభిస్తాయి. క్షమించడం, సర్దుకుపోవడం అనేది కేవలం బలహీనత కాదు, అది ఒక గొప్ప సాహసం, దృఢ సంకల్పం.– ముహమ్మద్ ముజాహిద్ -
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు : ముస్తాబైన మఠం
భారతదేశం ఎందరో గురుదేవుళ్ల పుణ్యధామం. వారు సమాజంలో జ్ఞాన దీప్తులు వెలిగించారు. అలాంటి వారిలో సుప్రసిద్ధులు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బ్రహ్మంగారి మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో స్వామి చరిత్ర, ఉత్సవ విశేషాలపై ప్రత్యేక కథనం. శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి గొప్ప కాలజ్ఞానిగా భూ మండలంపై కీర్తి గడించారు. అంతేకాక ఆయన రాజయోగి, హేతువాది, తత్త్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. రాబోయే కాలంలో జరిగే విపత్తులపై కాలజ్ఞానం ద్వారా వివరించి.. మానవాళికి ఎన్నో సూచనలు, హెచ్చరికలు చేశారు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. కావున మిగతావి కూడా జరుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే.. సన్మార్గంలో నడవాలని బోధించారు. ఎన్నో మహిమలు చూపి మహిమాన్వితుడిగా విరాజిల్లారు. కులమతాలను రూపుమాపేందుకు కృషి చేసి సంఘ సంస్కర్తగా పేరు పొందారు. కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసి జగద్గురువుగా ప్రఖ్యాతి గాంచారు. చివరికి దైవ స్వరూపులుగా వినుతి కెక్కారు. సజీవసమాధి నిష్ట పొంది భక్తులను అనుగ్రహిస్తు న్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో నేటి నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.సన్మార్గంలో నడిపించడం కోసం...మానవులకు జ్ఞాన బోధ చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. తెలుగు నేల నలుచెరగులా సంచరించి బోధనలు చేసి 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. (ఆ ్ర΄ాంతంలోనే ప్రస్తుతం శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి క్షేత్రం ఉంది.) నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది.ఏటా వేడుకలుస్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సాతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలిరానున్నారు. స్వామి మాల ధరించిన భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారితో కందిమల్లాయపల్లె కళకళలాడుతోంది. ఆరాధనోత్సవానికి ఇంకా పెద్ద ఎత్తున రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు.. మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఉత్సవాలు ఇలా..శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్యబృందం, భక్తులు.. ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిషేకం, సహస్ర నామార్చన కార్య్రçకమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న శేషవాహనోత్సవం, 24న గజవాహనోత్సవం, 25న నరనంది ఉత్సవం, 26న నంది ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 26న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామి వారు దీక్షాబంధన అలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 28న మహాప్రసాదం నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయి.– వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, వైఎస్ఆర్ కడప జిల్లాఘనంగా ఏర్పాట్లుశ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల ఆరాధనోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. వసతి, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.– శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వాముల వారు, మఠాధిపతులు, బ్రహ్మంగారిమఠం -
సైంధవుడిలా అడ్డు పడ్డట్టు....
ఎవరైనా ఏదైనా పనికి అడ్డుపడితే ‘సైంధవునిలా అడ్డు పడుతున్నాడు‘ అనే నానుడి సమాజంలో ఉంది. ఇందుకు సంబంధించి ఈ నానుడి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.మహాభారతంలో కౌరవుల ఏకైక సోదరి దుస్సల అని అందరికీ తెలిసిందే. ఆమె భర్తే సైంధవుడు. ఇతడి అసలు పేరు జయద్రథుడు. సింధు దేశాన్ని పాలించిన రాజు కాబట్టి సైంధవుడు అని పేరు వచ్చింది. సైంధవునికి దుస్సలతో పాటు మందాకిని, కుముద్వతి అనే ఇరువురు భార్యలున్నారు.పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న రోజులలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని వావి వరసలు మర్చిపోయి బలవంతంగా రథం పైకి తీసుకువెళ్లడానికి సైంధవుడు ప్రయత్నించాడు. భీముడు సైంధవుని బంధించి ధర్మరాజు ముందు ప్రవేశపెట్టాడు. తమ చేతులతో అతడి ప్రాణాలు తీసి, చెల్లెలికి వైధవ్యం కలిగించకూడదనే ఉద్దేశంతో అందుకు సమానమైన శిక్షగా.. శిరోముండనం చేసి వదిలి పెట్టారు. దీంతో పాండవులపై పగతో సైంధవుడు శివుని గురించి తపస్సు చేసి అర్జునుడు మినహా మిగిలిన పాండవులను ఒక్కరోజు అడ్డుకునే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజున ద్రోణుడు రచించిన పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశించగా అతని వెనక పద్మవ్యూహంలోకి ప్రవేశించే అర్జునుడు మినహా మిగిలిన నలుగురు పాండవులను శివుని వరం వల్ల సైంధవుడు అడ్డుకున్నాడు. దీనివల్ల పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఒంటరివాడై అసువులు బాసాడు. ఇదిలా ఉండగా అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుడిని ఆ మర్నాడు సూర్యాస్తమయంలోగా చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుని ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు సూర్యాస్తమయానికి ఇంకా సమయం ఉండగానే శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, యోగమాయతో సూర్యునికి అడ్డువేశాడు. దీంతో చీకట్లు కమ్మడంతో సూర్యాస్తమయం అయిపోయిందని సైంధవుడు భావించి బయటకు రాగా అర్జునుడు సైంధవుడిని పాశుపతాస్త్రంతో వధించి అతని తల నేలపై పడకుండా అతని తండ్రి అయిన వృద్ధక్షతుడి చేతిలో పడేలా చేయమని శ్రీ కృష్ణుడు చెబుతాడు. ఎందుకంటే సైంధవుడి తల ఎవరి చేతిలోనుంచి కింద పడుతుందో వారి తల నూరు చెక్కలవుతుందన్న వృద్ధక్షతుడి శాపం అతనికే తగిలి అతడు కూడా మరణిస్తాడు. అప్పటినుంచి ఎవరైనా ఏ పనికైనా అడ్డుపడుతుంటే సైంధవుడిలా అడ్డు పడుతున్నాడన్న సామెత వ్యాప్తిలోకి వచ్చింది. – సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
రామ చరిత మానసం
బంగారు వ్యాపారం చేసే ఒక యువకుడు తన భార్యా బిడ్డలతో కలిసి అయోధ్య వెళ్ళదలిచాడు. మూడు నెలల ముందే రైలు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణించే రోజు రానే వచ్చింది. భార్యా పిల్లలతో పాటు లగేజీ తీసుకుని రైల్వే స్టేషన్ చేరాడు. వారు ఎక్కాల్సిన రైలు వచ్చి ప్లాట్ మీద ఆగింది. వెంటనే పిల్లల్ని ఎక్కించి తను ఎక్కాడు.భార్య ప్లాట్ ఫాం మీద నిలబడి ఒక్కొక్క లగేజీ అందిస్తోంది. అతడు అందుకుంటున్నాడు. ఇంతలో రైలు కదిలింది. భార్య ప్లాట్ ఫాం మీదనే ఉంది. అమ్మకోసం పిల్లలు ఏడవటం ప్రారంభించారు. అతడిలో గాబరా మొదలయ్యింది. రైలు మరింత వేగం పుంజుకుంది. ఏం చేయాలో తెలియలేదు అతడికి. చైనులాగి రైలు ఆపమని తోటి ప్రయాణీకులు కొందరు సలహా ఇచ్చారు. అతడు అలాగే చేశాడు.రైలు ఆగింది. భార్య పరుగులు తీస్తూ వచ్చి రైలు పెట్టెలోకి వచ్చి చేరింది. వారి పక్క సీటులోనే ఒక వృద్ధ జంట కూర్చుని ఉంది. వృద్ధుడు సుందరకాండ చదువుతూ ఉన్నాడు. వృద్ధురాలు– ‘మన పక్క సీటు ఆమె, రైలు ఎక్క లేకపోవడం, ఆమె భర్త చైను లాగడం లాంటి హడావుడి జరుగుతున్నా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదు. రైల్వే సిబ్బంది కూడా వచ్చి వెళ్ళారు’ అని నిష్టూర పోయింది. ఆ వృద్ధుడు చిన్న నవ్వు నవ్వి ‘అంతా గమనించాను. ఈ యువకుడు భక్తి భావంతో అయోధ్యకు బయలుదేరాడు కానీ, రామ చరిత మానసం చదివినట్లు లేడు’ అన్నాడు. పక్కనే ఉన్న ఆ యువకుడు ‘అలా అంటున్నారేమిటి? దానికీ దీనికీ సంబంధం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. యువకుడి కళ్ళలోకి చూస్తూ ఆ వృద్ధుడు ‘అరణ్య వాసం వెళ్ళేటప్పుడు గంగానది దాటే సమయంలో పడవలోకి మొదటగా సీతను, తర్వాత లక్ష్మణుడినీ ఎక్కించి ఆ తర్వాత రాముడు ఎక్కుతాడు. మనం రామాయణం చదివితే ఇలాంటి మంచి మంచి సూక్ష్మ విషయాలెన్నో తెలుసుకోవచ్చు. వాటిని మన నిత్యజీవితంలోకి అన్వయించుకుని సుఖమైన జీవితాన్ని అనుభవించవచ్చు’ అన్నాడు. ‘నిజమే... ఎప్పుడూ రైలు ప్రయాణాల్లో ఆడవారిని మొదటగా ఎక్కించి మగవారు ఆ తర్వాత ఎక్కాలి. చీరలు కట్టుకునే స్త్రీలు రైలు వెనుక పరుగులు తీసి వాహనాన్ని అందుకోలేరు కదా’ అని వృద్ధురాలు హితవు మాటలు చెప్పింది.అప్పుడు గుర్తుకొచ్చింది ఆ యువకుడికి– చాలా నెలల క్రితం గోస్వామి తులసీదాస్ రచించిన రామ చరిత మానసం తెలుగు అనువాదం ఇంట్లో తెచ్చి పెట్టుకున్న విషయం. ప్రయాణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చదివి తీరాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు. అందరూ రామ నామ స్మరణలు చేస్తూ అయోధ్య ప్రయాణం కొనసాగించారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
సనాతన సారథి ఆదిశంకరులు
‘దేవుడనే వాడున్నాడా ‘అని వితండవాద నాస్తికవాదులకు ఎదురుగా అగుపడే వ్యక్తి దేవుడే అయితే అంత కన్నా సరి అయిన ఋజువు, సమర్థన మరేం కావాలి? కథల్లో, పురాణాల్లో భగవంతుడు వచ్చాడని, రక్షించాడని విన్నాం, నమ్మాం.. నిజంగా నిలబడి నడిచొస్తూ నాస్తికత్వాన్ని ఖండించి అద్వైత తత్త్వాన్ని సుస్థిరం చేసి అద్వైత వాదిగా అరుదెంచి హిందూమతాన్ని రక్షించి జాతిని నడిపించే దేవుడే శంకర భగవత్పాదులు.. పరమాచార్య శంకరాచార్యులు...శివుడే శంకరులుగా...హిందూమతం క్షీణదశలో ఉన్నప్పుడు ఆ మత పరిరక్షణకై పుణ్యదంపతులు శివగురు, ఆర్యాంబలు చేసిన తపః ఫలంగా కాలాడి అగ్రహారంలో సాక్షాత్తు ఈశ్వరుడే శంకరులుగా జన్మించాడు.. ఆవేళ ప్రకృతి పరవశించింది. ప్రపంచంలో పరమశాంతి పరిమళించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ బాలుడిలో చంద్రవంక, మూడవ నేత్రం, శూలం ఉన్నాయి. తెల్లని కాంతి.. లక్షణాల్లో సూర్యుడు.. మేరు పర్వతం.. సరస్వతీదేవి పోలిక.. ఈశ్వర వర ప్రసాదుడు. తోటి బాలురు తప్పటడుగులు వేస్తుంటే శంకరాచార్యులు సర్వ భాషలందు ప్రావీణ్యం, ప్రజ్ఞ సాధించి అసాధారణ బుద్ధితో వేద, వేదాంగాల్లో బ్రహ్మని, బృహస్పతిని మించి΄ోయాడు. శివ రహస్యంలోనూ, కూర్మ పురాణం లోనూ ఈ అవతార ప్రస్తావన ఉంది.అద్వైత తత్వ స్థాపన –జైత్రయాత్రశంకరాచార్యుల తన ప్రజ్ఞాపాటవాలతో, వాగ్ధాటితో నాస్తిక మతాన్ని మట్టుపెట్టటానికి విద్వాంసులతో వాద ప్రతి వాదనలకు దిగి అందరినీ ఓడించారు. ఒకసారి వేయిమంది పండితులను అవలీలగా జయించారు. విష్ణు సముడైన వ్యాసభగవానుడినే తన వాదనతో మెప్పించారు. దేశంలో నలు మూలల్లో పీఠాలు స్థాపించి సనాతన మత పునరుద్ధరణలో భాగంగా తత్వ, వేదాంత పూజాది నియమాలు, సంప్రదాయాలు నెలకొల్పి జ్ఞాన జ్యోతులను వెలిగించారు.ఎన్నెన్నో రచనలు – నిత్య సాధనలుబ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గిత, విష్ణు సహస్ర నామం, గాయత్రి మంత్రానికి భాష్యాలు రచించారు. వీటివల్ల మనకి దైవ సన్నిధి, పెన్నిధి ఏర్పడ్డాయి. పలు ప్రకరణ గ్రంథాలు రచించారు. మనం రోజు చదివే స్తోత్రాలలో ఎక్కువ వారు రాసినవే. వివేక చూడామణి, నిర్గుణ మానస పూజ, శివానంద లహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, కనకధార స్తోత్రం.. ఇలా ఎన్నెన్నో. తాను నడుస్తూ మన అందరిని మంచి ద్రోవలో నడిపిస్తున్న ఆ దేవుడికి జేజేలు. ఇదీ చదవండి: Ramanuja Jayanthi 2026 ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా? – డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
రామానుజ జయంతి : ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా?
మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పుటి కట్టుబాట్లను దాటి మానవు లందరికీ భగవంతుని చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. శ్రీ మహావిష్ణువు శేషపానుపే రామానుజులుగా ఈ భూమిపై అవతరించి వెయ్యేళ్లు దాటింది. ఈ నెల 22న రామానుజ జయంతి. ఈ సందర్భంగా రామానుజులవారి జీవిత విశేషాలు...రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరు అనే ఉరిలో కలియుగం మొదలైన 4118 అంటే సామాన్యశకంలోని 1016 వ సంవత్సరంలో.. భారతీయ కాలమానంలో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి, శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రా నక్షత్రంలో ఆసూరి కేశవ సోమయాజి, కాంతిమతి అనే పుణ్యదంపతుల నోముల పంటగా జన్మించారు..గురువుకే గురువు శ్రీరామానుజాచార్యులవారు 16 సంవత్సరాల వరకూ శ్రీపెరంబుదూరులో, ఆ తర్వాత 8 ఏళ్లపాటు తిరుప్పుట్ కుళిలోనూ, పదేళ్లపాటు కంచిలో వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. రామానుజులవారి ప్రజ్ఞ గురువుకు, ఇతర శిష్యులకు కంటగింపుగా మారింది. వారిని చంపడానికి గురుశిష్యులంతా పన్నాగం పన్నారు. సాక్షాత్తూ కంచి వరదరాజస్వామివారే రామానుజులును ఆ ప్రాణాపాయం నుంచి తప్పించారు. చివరికి కంచికి చేరారు. ఆనాటి నుంచి నిత్యం వరదరాజ పెరుమాళ్ కోవెలలో తిరుమంజన, తిరువారాధన కైంకర్యాలు చేసుకుంటూ వచ్చారు రామానుజులు.విశిష్టాద్వైతం అంటే? దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం. ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటమే విశిష్టాద్వైతం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో కలిసి ఒకటిగా ఉండవచ్చని తెలిపారు.పాండిత్యం... ప్రాచుర్యంరామానుజులవారు శ్రీ భాష్యమనే పేరుతో ప్రస్థాన త్రయానికి భాష్యం రచించారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్టసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ద్రవిడ వేదంపట్ల అందరూ గౌరవ ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు.మూర్తీభవించిన సమతభగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షానికి అర్హులే అంటూ సర్వమానవ సమానత్వ భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించారు రామానుజులు. ఆయన పాతికేళ్ల వయస్సులో గార్హస్థ్యాన్ని వీడి యతిగా మారారు. దేశమంతటా సంచరిస్తూ... తన వాదం ద్వారా ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు. 125 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో సమతామూర్తిగా పేరు పొంది తన అవతార పరమార్థాన్ని నిరూపించుకున్నారు. – డి.వి.ఆర్. -
పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...
కృష్ణా... గురువాయురప్పా..! ఈ ఒక్క మాట మనకి బాగా పరిచయం ఉన్న కేరళంలో ఎక్కువ వినిపిస్తుంటుంది. కేరళం పేరు వింటే మనకి గుర్తుకు వచ్చే దేవాలయం గురువాయూర్. శ్రీ కృష్ణ దేవాలయాలలో కేరళలో ఉన్న గురువాయురప్పన్ దేవాలయం ఎంతో విశిష్టమైనది.ఆయనను బాలగోపాలుడిగా భక్తితో కొలుస్తారు. ఆర్ద్రతతో కృష్ణా... గురువాయురప్పా అనిపిలిస్తే పలుకుతాడని కేరళవాసుల నమ్మకం. ఎంతో మంది కృష్ణ భక్తులు భక్తితో పలవరిస్తుంటారు. బాలగోపాలుడు ఇక్కడ అల్లరి చేస్తూ తిరుగుతాడు అని చూసిన వాళ్ళు చెప్తుంటారు. కురూరమ్మ బిల్వమంగళుడు వీరి ఇంట్లో అల్లరి కన్నయ్య తిరుగాడేవాడని ఇక్కడివారి నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తామే కురూరమ్మ బిల్వమంగళుడిగా భావిస్తుంటారు. మన తెలుగు వారు అయ్యప్ప మాల వేసుకుని దర్శనం తరువాత లేదా ముందు ఇక్కడ అల్లరి కన్నాయని గురువాయూర్ లో దర్శనం తప్పనిసరిగా దర్శనం చేసుకుంటారు. తాము రాధాకృష్ణులమని భావించి తులసి మాలలు వేసుకుని గురువాయూర్లో వివాహం చేసుకోవడం గొప్ప అనుభూతి. అలాగే అల్లరి కన్నయ్యకి నృత్యం, ఆటపాటలు అంటే ఇష్టం. అందుకే ప్రతిరోజు అరంగేట్రం సంగీత కచేరీలు జరుగుతుంటాయి. కన్నయ్యకి పాలు, బియ్యం పంచదార వేసి పాయసం చేసి నైవేద్యం పెడతారు. పసిపిల్లలను తులాభారం చేయిస్తారు. అలాగే మొక్కు తీర్చడానికి ఏనుగులు సమర్పించేవారు. ఆ విధంగా సుమారు 38 ఏనుగులతో పునాథూర్ కోటలో చూడవచ్చు. విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఏనుగులతో పరుగు పందాలు, ఏనుగులకు విందు కార్యక్రమాలు ఉంటాయి మరి కృష్ణష్టామి రోజు విశేషమైన పూజలు జరుపుతారు. కేరళ వాళ్ళ కొత్త సంవత్సరాది రోజు ఉదయం ఈ కన్నయ్యని ముందుగా చూస్తారు. దానిని విషు కని అంటారు. గురువు, వాయువు కలిసి నదిలో దొరికిన విగ్రహం ఇక్కడ బాల గోపాలుడి దర్శనం. ఈ ఆలయం త్రిచూర్ రైల్వే స్టేషన్కి 20 కిలోమీటర్లు లేదా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉంది. – ఈఎస్. మాధవన్ (చదవండి: శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?) -
శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?
హిందూ ధర్మంలో దేవతా ఆరాధనకు, క్షేత్ర సందర్శనకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. భక్తులు పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు ‘శక్తిపీఠం’, ‘సిద్ధపీఠం’ అనే పదాలను తరచుగా వింటుంటారు. సామాన్య భక్తులకు ఇవి రెండూ ఒకేలా అనిపించినప్పటికీ, వీటి వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వేర్వేరు. శక్తిపీఠాలు మాతా సతీదేవి త్యాగానికి చిహ్నాలైతే, సిద్ధపీఠాలు ఋషులు, మునులు సాధించిన తపఃఫలానికి నిదర్శనాలు. శరీర భాగాలు పడినచోట శక్తి ఆవిర్భవిస్తే.. తపస్సు పండిన చోట సిద్ధి చేకూరుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న పౌరాణిక, ఆధ్యాత్మిక వ్యత్యాసాలేమిటో తెలుసుకుందాం..!భారతీయ ఆధ్యాత్మిక భూమికలో శక్తిపీఠాలు, సిద్ధపీఠాలు రెండూ అత్యంత మహిమాన్వితమైనవిగా పరిగణించినప్పటికీ, వాటి ఆవిర్భావం వెనుక భిన్నమైన పౌరాణిక నేపథ్యాలు ఉన్నాయి. శక్తిపీఠాలు ప్రధానంగా మాతా సతీదేవి దేహ త్యాగానికి చిహ్నాలు; శివుడు ఆమె భౌతిక కాయాన్ని మోసుకెళ్తున్న తరుణంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించగా, భూమిపై ఆ శరీర భాగాలు పడిన 51 ప్రదేశాలు కొన్ని పురాణాల ప్రకారం..108 శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి దేవి భౌతిక అవశేషాల శక్తిని కలిగి ఉండి, భక్తులకు పాప ప్రక్షాళనను, దేవి సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. ఈ శక్తిపీఠాలలో ఆ దేవి ప్రత్యక్షంగా, తన నిజ స్వరూపంలో కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ శక్తితోపాటు భైరవుడు అంటే శివుడు కూడా ఉంటాడని భావిస్తారు.తపఃఫల సిద్ధి క్షేత్రాలు..సిద్ధపీఠం అంటే ఒక ఋషి, సాధువు, సిద్ధుడు లేదా సాక్షాత్తు ఒక దేవత సుదీర్ఘకాలం పాటు కఠోరమైన తపస్సు ఆచరించి, పరమాత్మ అనుగ్రహాన్ని ΄÷ందిన ప్రదేశం. ఇక్కడ దేవత ఆవిర్భావం దైహికమైన భాగాల వల్ల జరగదు. కేవలం సాధన, ధ్యానం, మంత్రబలం ద్వారా జరుగుతుంది. సిద్ధపీఠాలలో ఆధ్యాత్మిక తరంగాలు అత్యంత బలంగా ఉంటాయి. సాధకులు ఇక్కడ సాధన చేయడం వల్ల త్వరగా ’సిద్ధి’ అంటే జ్ఞానం లేదా శక్తులు పొందుతారు. భక్తుల కోరికలు త్వరగా నెరవేరే ప్రదేశాలుగా వీటిని భావిస్తారు. ఉదాహరణకు, మార్కండేయ మహర్షి తపస్సు చేసిన చోటో లేదా మాతా వైష్ణోదేవి లాంటి క్షేత్రాలను సిద్ధపీఠాలుగా పరిగణించవచ్చు.సిద్ధపీఠాలు దైహికమైన అవశేషాలతో సంబంధం లేకుండా, కఠోరమైన తపస్సు, సాధన ద్వారా ప్రాశస్త్యం పొందిన పుణ్యక్షేత్రాలు. ఒక ఋషి, ముని లేదా దేవత ఏ ప్రదేశంలోనైతే సంవత్సరాల తరబడి ధ్యానం చేసి దైవత్వాన్ని సిద్ధింపజేసుకుంటారో, ఆ ప్రదేశమే సిద్ధపీఠంగా విరాజిల్లుతుంది. వీటికి నిర్ణీత సంఖ్య అంటూ ఉండదు. తపస్సు పండిన ఏ చోటైనా ఇది సాధ్యమే. ఇక్కడ కేంద్రీకృతమై ఉండే తపఃశక్తి, సంకల్ప బలం భక్తులకు అపారమైన మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా, వారు తలపెట్టిన కార్యాలు త్వరితగతిన సిద్ధించేలా అనుగ్రహిస్తాయి. క్లుప్తంగా చె΄్పాలంటే, శక్తిపీఠం దైవస్వరూపాన్ని దర్శింపజేస్తే, సిద్ధపీఠం ఆ దైవత్వాన్ని పొందే మార్గాన్ని సాధనను గుర్తుచేస్తుంది.శక్తిపీఠమైనా, సిద్ధపీఠమైనా అంతిమంగా లభించేది ఆ జగన్మాత అనుగ్రహమే. శక్తిపీఠాలు మనకు ‘త్యాగాన్ని’, ‘భక్తిని’ గుర్తుచేస్తాయి. ఒక దేహాన్ని త్యజించినా ఆ శక్తి అక్షయంగా ఉంటుందని చాటిచెబుతాయి. సిద్ధపీఠాలు మనకు ’క్రమశిక్షణను’, ‘సాధనను’ బోధిస్తాయి. మనం కూడా ఏకాగ్రతతో తపస్సు చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ క్షేత్రాలు నిరూపిస్తాయి. ఈ క్షేత్రాలను సందర్శించేటప్పుడు భౌతికమైన ఆడంబరాల కంటే, ఆధ్యాత్మిక చింతనతో వెళ్లడం ముఖ్యం. అప్పుడే ఆ పీఠాల నుంచి వెలువడే దివ్యశక్తి మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది.– పసుపులేటి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక) -
కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక
అనంత్, రాధికా అంబానీ హెలికాప్టర్లో మహారాష్ట్రలోని నేరల్కు చేరుకుని అక్కడ కృష్ణ కాళి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆయన పుట్టిన రోజు వేడుకులకు ముందు అనంత్ రాధికలు ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 10న అనంత్కు 31 ఏళ్లు నిండనున్నాయి. పూజ అనంతరం ఆలయంలో ఆవులకు అన్నదనం చేసి, గోసేవ కూడా చేశారు. ఆ తర్వాతక రాధిక అంబానీ భక్తులను పలకరిస్తూ..మిఠాయిల, దుస్తులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణ కాళి అమ్మవారి ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Deepender Thakur (@deepender_thakur)కృష్ణుడు, కాళి మాత ఒక్కరేనా..బృందావనంలో ఉండే కృష్ణుడు, కాళీ దేవి ఒక్కరేనా అంటే..ఒక్కరేనే చెబుతున్నాయి పురాణాలు. కృష్ణకాళిగా, కృష్ణ స్వరూప కాళిగా అమ్మవారి ఆరాధన కనిపిస్తుంది కలకత్తా, పశ్చిమబెంగాల్లో బాగా కనిపిస్తుంది. అందుకు ఒక పురాణ గాధ కూడా ఉంది. యశోద సోదరుడు శతగోపుడు. ఆయన భార్య రాధ (బృందావనేశ్వరి, గోలోక నాయిక అయిన రాధాదేవి వేరు. కృష్ణుని మేనమామ భార్య పేరు కూడా రాధ. అందుకే చాలా మంది రాధ అంటే కృష్ణుని మేనత్త అనుకుంటారు. కానీ ఆమె వేరు. ఆ స్వామి ప్రాణాధిక అయిన రాధాదేవి వేరు). ఆమె చిన్నప్పుడు కృష్ణుని ఎత్తుకొని పెంచింది. చిన్నికృష్ణుని సౌందర్యాన్ని ఆరాధించింది. ఆయన అనుగ్రహం పొందింది. అందుకే కృష్ణుడు ఆమె కోసం యువకుడిగా మారి విహరిస్తూ ఉండేవాడు. అది చూసి కొందరు శతగోపునికి ఆ విషయం చెప్పారు. ఒకసారి రాధతో కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది శతగోపుని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి చూస్తే.. రాధాదేవి కాళీ దేవి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా కనపడింది. దీంతో వారంతా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిన తర్వాత కాళీదేవి విగ్రహం కృష్ణునిగా మారిపోయింది. శతగోపుని రాకను గుర్తించిన కృష్ణుడు రాధను రక్షించడం కోసం అలా కాళిగా మారాడు. ఈ కథ బృందావన గాథలలో చాలా ప్రసిద్ధమైనది. అలాగే.. నరకాసురుని జీవితంలో కూడా కాళీదేవి ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది.నరకుని ఆరాధ్య దైవం కామాఖ్య కాళి. ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది ఎన్నో అద్భుతమైన శక్తులు సాధించాడతడు. కానీ.. అతడు అధర్మబద్ధమైన సాధనలు చేయడం వల్ల కాళీ దేవి అతడి వద్ద నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ తల్లి నరకునికి కనిపించలేదు. నరకుని మరణ సమయంలో మాత్రం.. కృష్ణుడిలో కాళి కనిపించింది. అధర్మాన్ని నశింపజేయడానికి అలా కృష్ణ కాళిగా వచ్చి నరకుని సంహరించిందన్నమాట. కృష్ణ కాళిగా అమ్మవారిని భక్తితో, ప్రేమ భావనతో పూజిస్తే ఆమె కృష్ణ స్వరూపిణిగా, ప్రేమ స్వరూపిణిగా, కృష్ణునిగా అనుగ్రహిస్తుంది. బృందావనంలో ప్రవేశించిన ఎందరో సిద్ధులు కృష్ణుడే కాళి అని తెలుసుకుని కృష్ణ కాళిగా పూజించి అనుగ్రహం పొందారు.(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..) -
అశ్వత్థామ హతః ధర్మరాజు చెప్పిన అబద్ధం
అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. యమధర్మరాజు అంశతో కుంతీదేవికి జన్మించినవాడు. ధర్మకోవిదుడు, నీతిపరుడు, సత్యవంతుడు... ఇన్ని సుగుణాలు కలిగిన ధర్మరాజు అబద్ధం ఆడాడా..?? అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఆపద్ధర్మం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అబద్ధం ఆడించాడు. లేకుంటే పాండవ వంశానికే ప్రమాదం వచ్చి ఉండేది. మహాభారత యుద్ధంలో పాల్గొన్న వ్యక్తులు అతిరథ మహారధులని చెప్పుకోవచ్చు. వారిలో అశ్వత్థామ ఒకరు. అశ్వత్థామ మహారథి కోవకు చెందుతాడు. యుద్ధరంగంలో అడుగుపెట్టాడంటే ఏకకాలంలో ఏడు లక్షల 20 వేల మందితో యుద్ధం చేయగలడు. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుని కుమారుడు.ద్రోణాచార్యుడు, కృపి దంపతులకు పరమేశ్వరుడి వరప్రసాదంగా జన్మించిన వాడే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా ఉండడంతో ఆ బాలునికి అశ్వత్థామ అని పేరు పెట్టారని, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అశ్వత్థామ నుదుటిపై శివుని మూడో కన్నులా అనిపించే ఒక దివ్యమైన మణి ఉండటం వల్ల అశ్వత్థామకు ఏ ఆయుధం వల్ల కానీ, ఎవరి వల్ల కానీ భయం, పరాజయం ఉండవని వరం.. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు మహాభారత యుద్ధంలో వీరవిహారం చేస్తూ పాండవ సైన్యాన్ని మట్టు పెడుతున్న సమయంలో ద్రోణాచార్యుని నిలువరించేందుకు ధర్మరాజుచే శ్రీ కృష్ణుడు అబద్ధం చెప్పిస్తాడు. ఎంతో సత్యవంతుడైన ధర్మరాజు చెప్తేనే అబద్ధాన్ని సైతం నిజమని నమ్ముతాడు ద్రోణాచార్యుడు. తాను అబద్దమాడనని ధర్మరాజు చెప్పినప్పటికీ ఆపద్ధర్మం కోసం అబద్ధమాడితే తప్పులేదని, శ్రీ కృష్ణు్ణడు ధర్మరాజుకు బోధించడంతో అయిష్టంగానే ధర్మరాజు అంగీకరిస్తాడు. ద్రోణాచార్యునికి వినబడేటట్లు అశ్వద్ధామ హతః... కుంజరహః అన్న సమయంలో కుంజరహః అనే మాట ద్రోణాచార్యునికి వినబడకుండా యుద్ధభేరీలు మోగించేటట్లు పథకం రూపొందించాడు శ్రీ కృష్ణుడు. ధర్మరాజు అన్న అశ్వత్థామ హతః అనే మాటను విన్న ద్రోణాచార్యుడు నిజంగానే తన కుమారుడైన అశ్వత్థామ మరణించాడని భావించి అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే అదునుగా భావించిన ధృష్ట్యద్యుమ్నుడు ద్రోణాచార్యుల తలనరికి అంతమొందిస్తాడు.కాగా ధర్మకోవిదుడైన ధర్మరాజు ఒక చిన్నపాటి అబద్ధం ఆడటం వల్ల అప్పటివరకు మహాభారత యుద్ధంలో ధర్మరాజు పయనించిన రథం భూమికి నాలుగు అంగుళాలు పైన వెళ్లేదని, ఈ చిన్న అబద్ధం ప్రభావం వల్ల ధర్మరాజు రథం నేలను తాకిందని, మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు ఒకేఒక్కసారి నరకలోకాన్ని సందర్శించవలసి వచ్చిందని, ఆపై నేరుగా స్వర్గానికి వెళ్ళాడనే మరో కథనం కూడా వ్యాప్తిలో ఉంది.కాగా ప్రస్తుత కలియుగంలో అశ్వత్థామ హతః కుంజరహః అనే మాటను రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రచారంలో వినియోగిస్తున్నారు. అంటే వారు ప్రజలకు ఇచ్చే హామీలలో కొన్ని మాత్రమే వినిపించేలా మిగిలినవి మెల్లగా చెప్తున్నప్పుడు ఈ నానుడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
డోలీ
అదొక చిన్న మండల కేంద్రం. దానికి కూత వేటు దూరంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊర్లో గులాబీ తోటలున్నాయి. ఆ తోటల యజమానుల నుంచి గులాబీలు తీసుకుని మండల కేంద్రానికి వెళ్ళి పూలమ్ముతుంది ఓ ముసలవ్వ.ఆ మండల కేంద్రంలో ఒక గ్రామీణ బ్యాంకు ఉంది. రిటైర్ మెంట్ కు దగ్గరున్న ఓ మహిళా మేనేజర్ ఆ బ్యాంకుకు బదిలీ మీద వచ్చింది. నెత్తి మీద గంప పెట్టుకుని ఇంటింటికీ వెళ్ళి పూలమ్మే అవ్వ ఆ రోజు బ్యాంకు మేనేజర్ ఇంటికి వెళ్ళింది. పూలు తీసుకొమ్మని అడిగింది. పూలు తీసుకునే సమయంలో అవ్వ, ‘కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ ఆమే’ అని తెలుసుకుంది.‘నాకు పదివేలు అప్పు కావాలి, నా దగ్గర కుదవ పెట్టడానికి ఏమీ లేదు. మీ బ్యాంకు నన్ను నమ్మి అప్పు ఇస్తుందా?’ అని అడిగింది. ‘అప్పు చేయాల్సిన అవసరం నీకేమి వచ్చింది?’ అని అడిగింది మేనేజర్. ‘నా వయసు డెబ్భై ఏళ్ళు. నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నాను. కొండ ఎక్కడం ఇన్నాళ్ళూ సాధ్యమయ్యింది. ఈసారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొండ ఎక్కడం అసాధ్యమనిపిస్తోంది. ఎలాగైనా ఈసారి కూడా స్వామిని చూడాలని కోరికగా ఉంది. కాబట్టి పంబ నదినుంచి సన్నిధానం వరకు డోలీలో వెళ్ళాలనుకుంటున్నాను. నలుగురు మగ మనుషులు నన్ను మోయాలి కదా. దానికి కనీసం పదివేల రూపాయల అవసరం ఉంటుంది. నేను దాచిపెట్టుకున్న డబ్బు ప్రయాణానికి మాత్రమే సరిపోతుంది. మీరు మేనేజర్ కాబట్టి నాకెలాగైనా సహాయం చేయండి. మీ ఋణం పెట్టుకోను. నాకు రావాల్సిన డబ్బు రెండు నెలల్లో వస్తుంది. వెంటనే తీర్చేస్తాను’ అని వేడుకుంది.ఆ అవ్వ భక్తి భావానికి మేనేజర్ ఆశ్చర్యపోయింది. చిన్నగా తేరుకుని ‘నాక్కూడా చాన్నాళ్ళుగా శబరిమలై వెళ్ళాలని ఉంది. స్వామి దర్శనం చేసుకోవాలని ఉంది. కొండపైకి నడిచి వెళ్ళే శక్తి నాకుంది. నువ్వు ఇప్పటికే నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నావు కాబట్టి ఎలా వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో నీకు బాగా తెలుసు. ఆ దీక్షకు కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి కదా. ఆ విషయంలో నాకు సహకరించు. ఒకరికొకరు తోడుగా వెళ్ళి వద్దాం. నీ డోలీ డబ్బులు నేను కడుతాను. అప్పు ఆలోచన పక్కన పెట్టేయ్’ అని బదులిచ్చింది. ఆ ముసలవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మేనేజర్కి ఇవ్వాల్సిన పూలకంటే మరి కొన్ని పూలు అదనంగా ఇచ్చి నమస్కరించి అక్కడినుంచి కదిలింది. నెల తర్వాత వచ్చిన కార్తీక మాసంలో ఇద్దరూ నల్ల వస్త్రాలు ధరించి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ కొట్టాయం రైలెక్కారు. – ఆర్సి. కృష్ణస్వామి రాజు -
వైరాగ్యం ఆధ్యాత్మికతకు ఆసరా
ఆధ్యాత్మిక పథంలో పయనించే ప్రతి సాధకుడికి ‘వైరాగ్యం’ అనేది ఒక బలమైన పునాది. సాధారణంగా లోకంలో వైరాగ్యం అంటే అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవడం అని పొరబడుతుంటారు. కానీ, నిజమైన వైరాగ్యం అంటే వస్తువులను వదలడం కాదు, వస్తువుల పట్ల ఉన్న ‘మమకారాన్ని’ లేదా ‘ఆసక్తిని’ వదలడం. ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటాడు, కానీ పెద్దయ్యాక వాటిని వదిలేస్తాడు. అది బొమ్మల మీద కోపంతో కాదు, వాటికంటే విలువైనది ఏదో తెలిసిందనే అవగాహనతో. ఆధ్యాత్మిక వైరాగ్యం కూడా అటువంటిదే.వైరాగ్యం అంటే ‘రాగ రహిత స్థితి’. మనసు దేనినైనా చూసి ఆకర్షింపబడితే దానిని ‘రాగం’ అంటారు. ఆ ఆకర్షణ వల్ల కలిగే బంధం నుండి మనసును విముక్తం చేయడమే వైరాగ్యం. ఇది విరక్తి కాదు, ఒక రకమైన పరిణతి. ఇంద్రియ విషయాల నుండి మనసును మళ్ళించడానికి చేసే ప్రాథమిక ప్రయత్నం (యతమాన సంజ్ఞ ), కొన్ని విషయాల మీద నియంత్రణ సాధించి, కొన్నింటిపై ఇంకా పట్టు కోల్పోని స్థితి (వ్యతిరేక సంజ్ఞ), బాహ్యంగా కోరికలు లేకపోయినా, మనసులో మాత్రం సూక్ష్మంగా ఆ కోరికలు మిగిలి ఉండటం(ఏకేంద్రియ సంజ్ఞ). ఇక నాలుగోది ‘వశీకార సంజ్ఞ’ అత్యున్నత స్థితి. ఇక్కడ మనసు పూర్తి నియంత్రణలో ఉంటుంది. ఏ బాహ్య వస్తువూ మనసును చలింపజేయదు.సంస్కృతంలో ‘రాగ’ అంటే రంగు లేదా ఆకర్షణ అని అర్థం. ‘వైరాగ్య’ అంటే ఆ ఆకర్షణ లేని స్థితి. నీటిలో ఉన్నా కూడా తామర ఆకుకు నీరు అంటనట్లుగా, సంసారంలో ఉంటూనే దేనికీ అతిగా బందీ కాకుండా ఉండటమే వైరాగ్యం. సాధారణంగా వైరాగ్యాన్ని రెండు స్థాయులలో చూడవచ్చు. ప్రాపంచిక విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని చూసి లేదా భయం వల్ల కలిగే తాత్కాలిక వైరాగ్యం (ఉదాహరణ – శ్మశాన వైరాగ్యం). ఇది ఎక్కువ కాలం నిలవదు. పర వైరాగ్యం అత్యున్నతమైనది. ఆత్మజ్ఞానం వల్ల, సత్యాన్ని గ్రహించడం వల్ల కలిగే స్థిరమైన స్థితి. ప్రపంచంలోని ఏ వస్తువూ శాశ్వతం కాదని గ్రహించినప్పుడు ఇది కలుగుతుంది.వైరాగ్యం సిద్ధించాలంటే రెండు ముఖ్యమైన పద్ధతులు అవసరమని భగవద్గీత చెబుతోంది. ‘అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే’. ఏది నిత్యం (శాశ్వతం), ఏది అనిత్యం (తాత్కాలికం) అని వేరు చేసి చూసే తెలివితేటలు. మనసుని పదే పదే ప్రాపంచిక కోరికల నుండి మళ్ళించి, అంతరాత్మ వైపు తిప్పుకోవడం. దేని మీద ఆశ లేనప్పుడు, అది దక్కలేదనే మానసిక ప్రశాంతత, కోల్పోతామనే భయం లేకపోవడం వైరాగ్యం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు.వైరాగ్యం అనేది ఒక మందు వంటిది. అది సంసార వ్యాధిని నయం చేసి, మనిషిని తన నిజ స్వరూపమైన ఆనందం వైపు నడిపిస్తుంది. జీవితాన్ని త్యజించడం వైరాగ్యం కాదు, జీవితాన్ని సరైన దృక్పథంతో దర్శించడమే నిజమైన వైరాగ్యం. జీవితం పట్ల సరైన అవగాహన. ఒక పక్షి పండును తింటున్నప్పుడు ఆ రుచికి బానిస కావచ్చు. కానీ మరొక పక్షి అదే చెట్టు మీద ఉండి, పండును తినకుండా కేవలం చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఈ ‘సాక్షి భూత’ స్థితిలో ఉండటమే వైరాగ్యానికి సంకేతం. భగవద్గీత ప్రకారం వైరాగ్యం అంటే పనులను వదలడం కాదు, ఫలాపేక్షను వదలడం. వైరాగ్యం వల్ల మనిషికి నిర్భయత్వం కలుగుతుంది. ‘వైరాగ్యమేవ అభయం’ అని భర్తృహరి సుభాషితం చెబుతోంది. భోగంలో రోగ భయం ఉంటుంది, కులంలో పతనం ఉంటుందనే భయం ఉంటుంది, ధనంలో రాజుల భయం ఉంటుంది.. కానీ వైరాగ్యంలో మాత్రం ఎటువంటి భయం ఉండదు. ఇది మనిషికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. వైరాగ్యం అంటే కేవలం బాహ్య ప్రపంచాన్ని లేదా బాధ్యతలను వదిలేసి అడవులకు వెళ్లడం కాదు. ఇది మనసుకి సంబంధించిన ఒక స్థితి. వస్తువుల మీద, వ్యక్తుల మీద లేదా ఫలితాల మీద ఉండే అతివ్యాప్తిని వదిలివేయడమే నిజమైన వైరాగ్యం.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
మరణములో నుండి జీవములోనికి
దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు (ఎఫెసీ 1:20,21). అన్నదే విశ్వసించదగ్గ అపొస్తలుల సువార్త సంబంధిత బోధయై ఉంది.సత్యవాక్యమను రక్షణ సువార్తగా కూడా ఇది ఉంది. లేచాడు అన్నది సువార్త కాదు. సర్వశక్తి సంపన్నుడైన అద్వితీయ సత్య దేవుని చేత యేసు మృతులలో నుండి సజీవంగా లేపబడ్డాడు అనునదే లేఖనానుసార సత్య సువార్త. తండ్రికి విలువిచ్చే క్రీస్తు అపార విధేయతను ఇదే ఘనంగా చాటుతుందనుటలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ’వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు’ (రోమా 10: 8–10). యేసు సజీవుడుగు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది అపొస్తలుల అమూల్య విశ్వాసం. దేవుని కుమారుడు అంటే ఆయన ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్థం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతూ ఆయన నామమందు జీవము పొందాలి అన్నదే ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధ విజయానికి మూలం. ఈ లోకం మీద విజయం యేసు దేవుని కుమారుడు అనుటలోను , ఆయన్ను దేవ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడని విశ్వసించుటలోనే విజయం దాగి ఉంది (1యోహాను 5:5 ).మరి క్రీస్తు విజయానికి మూలం ఎక్కడ అన్నది లోతుగా పరీశీలన చేస్తే అది ఒక్క ఆయన విధేయతే అనేది బహు తేటగా వెల్లడవుతూ ఉందన్నది ఆశ్చర్యకర విశేషం.ఆజ్ఞలకు లోబడి పాపం చేయకపోవడం ద్వారా పరిశుద్ధత, దాని విధేయత ఈ రెండూ ఎప్పుడు నిలుపుకొనే వేకువ ప్రార్థనలతో అవిశ్రాంత విన్నపాలతో క్రీస్తు అసాధారణ విజయుడిగా, జగజ్జేతగా చరిత్రకెక్కాడు.దేవుడు తనకు అత్యంత విధేయుడైన తన కుమారుడను మరణంలో నుండి జీవములోనికి దాటించాడు. మరణంలోనుండి జీవములోనికి రావడం, పునరుత్థానం చెందడం ఇలా యేసు మరణాన్ని జయించడం దేవుని గొప్ప సంకల్పం.అయితే తనను మరణం నుండి రక్షింపగల తండ్రియైన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించినందున యేసు అంగీకరించబడ్డాడనేది ఇదే ఆయన సాహసోపేత విజయానికి మూలం అయ్యింది. ఇక్కడ మరణం అంటే సిలువ మరణం కాదు, ఆత్మ సంబంధ మరణం. యేసుకు సిలువ మరణం తప్పదు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. ఆయన మరి ఎలాంటి మరణం మీద గురిపెట్టి విజయం సాధించాలనుకున్నాడు అన్నది చూస్తే అదే ఆత్మ సంబంధ మరణం. ఆయన పరిశుద్ధుడు గనుక మరణం ఆయన మీద ఏలుబడి చేయుటకు అన్ని కోణాల్లో అన్ని దారులు వెదకి అది బాగా అలసిపోయింది. పారదర్శకంగా పరిశుద్ధ జీవితం ఆచరించి చూపుతూ యేసు మరణానికి సంపూర్తిగా తలవంచాడు. అంతే, మరణం ఆయన ముందు తలవంచి మోకరిల్లి సాగిలపడింది.మతంతో సంబంధం లేని మార్గంమన తోటి ఇరుగు పొరుగు వాని చుట్టురా ఉన్న సమాజం మేలుకై ప్రతి పని, పరిచర్య, సేవా విధానం శుద్ధ హృదయంతో ఆచరించుట ద్వారానే దేవుని మెప్పు పొందగలం. నిత్య సత్య జీవమనే క్రీస్తు మార్గం మతంతో ఎలాంటి సంబంధం లేనిది. ఇదొక ఆత్మ సంబంధ అసాధారణ ఆధ్యాత్మిక జీవన విధానం. ఇందులో వ్యక్తిగతమైన స్వయం స్వశక్తితో కూడిన పాప నివారణ సంబంధిత పరిశుద్ధ అభ్యాస ప్రయత్నాలు మచ్చుకైన కనపడవు. క్రీస్తును బట్టి దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఏంతో పురోగమనం సాధించే స్థితిలో ఉంటుంటాయి. తమ మానవ జ్ఞానంతో ముడిపెట్టక తమ మంచి చెడ్డల విచక్షణ విషయమైన జ్ఞానం దేవునికే అప్పగించి అన్నింటా దేవునికే మహిమ చెందేలా ఆయన్ను ఘన పరచుటే అతి శ్రేష్టమైన సద్భక్తి జీవిత విధానం.నిత్యజీవము పొందుటకు నేనేం చేయాలి? అన్నదానికి సమాంతర ప్రశ్నయే ‘మరణంలో నుండి జీవంలోనికి దాటుట ఎట్లు?’ అనేది. మరణంలో నుండి జీవములోనికి దాటుటలో గొప్ప అనుభవం సంపాదించినవాడు, అత్యంత ప్రతిభ, ప్రభావ సంపన్నుడు యేసు మాత్రమే అన్న సర్వసత్యాన్ని బహు తేటగా గ్రహించినవారై మొదటగా ఆయన శిష్యులైన అపొస్తలులు ఆ తదుపరి ఆదిమ సంఘము ఆయన అడుగుజాడలలోనే నడిచి అన్నింటా గెలిచింది. ఆ ఆదిమ సంఘాన్ని అనుసరించి ఒక్కటే క్రీస్తు శరీరమను సంఘాలు నేడునూ పాపం నుండి పరిశుద్ధతలోనికి అనగా మరణంలో నుండి జీవములోనికి విజయవంతంగా దాటుతున్నాయి. అనేకులను దాటించుటలో పేరొందిన గొప్ప సువార్త పరిచర్యను అవి నిరంతరాయంగా చేస్తూ వారివలె ముందుకు కొనసాగిస్తూ విధేయంగా ఎంతో శ్రమిస్తున్నాయి. దేవదేవుడు తనదైన బలాతిశయం చేత యేసును మృతులలో నుండి లేపాడు అన్నదే నేటి పునరుత్థాన దినం. ఇదే క్రైస్తవ నిరీక్షణ జీవితానికి గొప్పదైన పునాది. సమభావపు ఏకత్వం కలిగించే ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడిన వారు ధన్యులు అంటుంది గ్రంథము.‘‘నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక ‘మరణములో నుండి జీవము లోనికి’ దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’– యేసుక్రీస్తు – జేతమ్ -
అవధులు లేని దేవుని ప్రేమ
ఒక నీతిమంతుని మరణం నశించిపోయే మానవ జాతికి శుభం చేకూర్చింది. మరణానికి వారసులైన నరజాతికి యేసుక్రీస్తు రూపంలో గొప్ప విమోచకుడ్ని అందించింది. పాపపరిహారార్థ బలిగా, సజీవ యాగంగా దేవాదిదేవుడే సిలువపై తన విలువైన పరిశుద్ధ రక్తాన్ని ధారవోశాడు. మానవుల పట్ల తన అపార ప్రేమను తన బలి అర్పణ ద్వారా చాటుకున్నాడు.ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి చివరికి రెండు తేదీలే మిగిలి పోతాయి. ఒకటి పుట్టుక రెండవది మరణ తేదీ. పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. అందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రపంచ అధినేత అయినా సరే, మారుమూల గ్రామంలో పుట్టిన సామాన్యుడైనా చావు ముందు తల వంచాల్సిందే. మరణం ముందు ఓడి పోవాల్సిందే. అందుకే మనిషికి చావంటే చచ్చేంత భయం. కొంతమంది బతకడానికి కావలసినంత ధైర్యం లేక చావును ఆశ్రయిస్తారు. అదీ శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే మనకథ మరణంతో ఆగి పోదు. మనం చేసిన పాపాలకు ఆ తర్వాత రెండో మరణం కాచుకోని ఉంటుంది. మరణాన్ని తలపించే నిత్య నరకం. ఆ నరకం నుంచి తప్పించేందుకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి మన పాపాలకు విమోచన క్రయధనముగా అర్పించాడు.పాపపరిహారార్థ బలిగా క్రీస్తు తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుని చేత సృజించబడ్డ ఆదిమానవుడైన ఆదాము, అతని భార్యకు తమ ఇష్టం చొప్పున బతికే అవకాశం ఇచ్చాడు. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ లోక అధిపతిగా పిలవబడ్డ దుష్టుడైన సాతాను వారిద్దరినీ మోసం చేసి దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు. పాపం చేసిన వారిద్దరూ పాపం ద్వారా వచ్చే జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వారిలో ఉన్న ఆ పాపపు బీజం ఆ తర్వాత ప్రతి మనిషిలో కొనసాగుతూ వచ్చింది. ఆ పాపాన్ని తీసివేసుకోడానికి మనిషి చేయని ప్రయత్నం లేదు. ప్రధానంగా జంతువుల రక్తం బలి ఇవ్వడం ద్వారా దేవుని ప్రసన్నం చేసుకోవాలని చూసాడు. అయినా నరునిలో వున్న పాపబీజం అతని వెంటాడుతూనే ఉంది. పలు బలి అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు పాపము నుండి మానవులను వేరుచేయవని గ్రహించిన దేవుడు తన కుమారుని ఈ భూమిపైకి పంపి అతని బలి అర్పణ ద్వారా, పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా సమస్త మానవులకు ఆ పాపపు శాపాన్ని విడిపించి తిరిగి దేవునితో మొదటి మానవుడి ద్వారా విడిపోయిన ఆ సంబంధాన్ని పునరుద్ధరింప జేశాడు. అందుకు నీతిమంతుడైన యేసు అప్పటి రోమా పాలకులు, తన స్వజనమైన యూదా ప్రజల ద్వారా ఘోరమైన శ్రమలు సిలువ ద్వారా అనుభవించాల్సివచ్చింది. మానవుల పాపం కోసం పాపంగా చేయబడ్డాడు. సమస్త మానవ కోటి పాపభారాన్ని, శాపాన్ని తనపై మోశాడు. శిలువపై తన పవిత్ర రక్తాన్ని చిందించాడు.క్రీస్తు ప్రశస్తమైన మాటలుశిలువ మరణానికి ముందు క్రీస్తు యేసు భూమ్మీద పలికిన ప్రతి మాట జీవపు ఊటై అప్పుడు ఇప్పుడూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. భూమి గతించినా నా మాటలు మాత్రం నిత్యం నిలిచి ఉంటాయని క్రీస్తు చె΄్పాడు. క్రీస్తు మరణ సమయంలో సిలువ మీద పలికిన 7 మాటలు ఈ శుభ శుక్రవారం ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులందరూ ధ్యానిస్తారు. వాటిలో ముఖ్యంగా తనను క్రూరంగా హింసిస్తున్న సైనికులను, హేళన చేస్తున్న యూదా మతాధికారులు, ప్రజలను చూసి తండ్రీ వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని కోరాడు. మానవుల పట్ల మితిలేని ప్రేమగల దేవుడు కాబట్టే ఇట్టి క్షమాపణగుణం కనబరిచాడు. కుడిచేతి వైపు సిలువ వేయబడిన దొంగ యేసును గమనిస్తూ ఆయన నిజమైన పాపుల రక్షకుడు, దేవుడని గ్రహించి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొనవా అని అర్థించినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని అభయం ఇచ్చాడు. నిజంగా ఒకడు పరలోకం చేరాలంటే దేవుని నమ్మి రక్షణ పొంది బాప్తీస్మం తీసుకోవాలి. కానీ ఇదేమీ లేకుండా ఒక బందిపోటు దొంగకు అతని విశ్వాసం చొప్పున నేరుగా పరలోకం అనుగ్రహించాడు. రోదిస్తున్న తల్లిని చూచి తన ప్రియమైన శిష్యుడికి అమ్మ బాధ్యతలు అప్పగించాడు. సిలువ యాగం ద్వారా తాను భూలోకానికి వచ్చిన రక్షణ కార్యం పూర్తయిందని గ్రహించి తండ్రికి తన ఆత్మను అప్పగించి చివరకు సమాప్తమైనదని చెప్పి యేసు ప్రాణం విడిచాడు. యేసు చనిపోయాడో లేదో నిర్ధారించుకోడానికి ఒక సైనికుడు పక్కటెముకల్లో బల్లెంతో ΄÷డిచాడు. ఇదంతా గమనిస్తున్న కఠినమైన రోమా శతాధిపతి హృదయం కరిగిపోయింది. ఈయన నిజముగా దేవుని కుమారుడే అంటూ ప్రకటించాడు. యేసు చనిపోయిన వెంటనే కొన్ని అద్భుతాలు జరిగాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పేర్కొంది. ప్రసిద్ధ యెరూషలేము దేవాలయపు గర్భగుడిలో ఉండే పెద్ద తెర పైనుంచి క్రిందికి రెండుగా చీలిపోయిందని, ఆ ప్రాంతంలో భూమి కంపించిందని, బండలు బద్దలవడం, సమాధులు తెరవబడి మృతులైన పరిశుద్ధులు పట్టణములో ప్రవేశించి అనేకులకు కనపడ్డారని పేర్కొంది. క్రీస్తు కథ సిలువ మరణంతో ఆగిపోలేదు. చరిత్ర పుటల్లో మరణాన్ని జయించి మూడవ దినమున పునరుత్థానుడైన ఒకే వ్యక్తిగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇప్పటికీ క్రీస్తు ఖాళీ సమాధి యెరూషలేములో మనకు దర్శనమిస్తుంది. సజీవుడైన క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిపోయింది. అందుకే అగస్టిన్ అనే భక్తుడు ’సిలువ దేవుని ప్రేమను ప్రకటించిన గొప్ప వేదిక’ అంటాడు.– స్టెర్జి రాజన్ బందెల, సీనియర్ జర్నలిస్ట్ -
చైత్ర పూర్ణిమ.. ఎవరిని పూజించాలి?
సాధారణంగా పున్నమి అనగానే వెన్నెల గుర్తుకొస్తుంది. సంవత్సరంలో పన్నెండు పున్నములు వస్తాయి. ప్రతి పున్నమికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. పున్నమి నాడు మనఃకారకుడైన చంద్రుని పూజించడం మంచిదని పెద్దలు చెబుతారు. నేడు చైత్ర పౌర్ణమి. ఈ రోజున హనుమంతుడిని, సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. అలాగే అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. దీపోత్సవం, అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రంపూట చంద్రుడిని ఆరాధించడం శుభఫలితాలను ఇస్తుంది. ఆ రోజున లలిత సహస్ర నామ పారాయణ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. శివకేశవుల ఆరాధన చేయడం మంచిది. అలాగే సత్యనారాయణ స్వామి పూజతో సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున ఉపవాసం చేసేవారు ఉప్పు వాడిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.పౌర్ణమి వ్రతం ఆచరించడం ద్వారా మానసిక సంబంధిత మార్పులు జరుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు కావున మానసిక బలం చేకూరుతుంది. చైత్ర పౌర్ణమి నేతి దీపాలను వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. హనుమంతునికి, నారాయణ స్వామికి నేతి దీపం వెలిగించడం విశిష్ట ఫలితాలను ప్రసాదిస్తుంది.అక్కమహాదేవి జయంతి నేడు12వ శతాబ్దపు ప్రసిద్ధ కన్నడ కవయిత్రి అక్కమహాదేవి జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహిస్తారు.శ్రీశైలంలో ఆమె తపస్సు చేసినట్లుగా భావించేప్రాంతం, మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.పరమశివుని భర్తగా భావించి,వచన సాహిత్యానికి ఆమె చేసిన కృషి అద్వితీయం. 12వ శతాబ్దపు వీరశైవ భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొలి మహిళా కవయిత్రి.కర్ణాటకకు చెందిన ఆమె శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని ఆరాధించి, తపస్సు చేసిందామె.అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని, శ్రీశైల దేవస్థానంతో పాటు కర్ణాటకలోని అనేక ప్రదేశాలలో, మహిళా విశ్వవిద్యాలయాలలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి.నేడు (ఏప్రిల్ 2, గురువారం) చైత్రపూర్ణిమ– డి.వి.ఆర్ -
పౌరాణికానికి పద్యాలంకరణ
తెలుగు నాటక కళారంగంలో వల్లూరు శ్రీహరి రావు పద్యనాటక నిపుణులు. ‘గాన కోకిల’, ‘మధుర కంఠీరవ’గా బిరుదులు పొందినవారు. ఏడు పదుల వయసులోనూ రాముడుగా, కృష్ణుడుగా పౌరాణిక పాత్రలో రాణిస్తూ కళాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. హైదరాబాద్లోని సీతాఫల్మండిలో ఉంటున్న ఈ పద్య నాటక కళాకారుడు నేడు ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాటకరంగం గురించి, చేసిన విశేష సాధన గురించి ప్రస్తావించారు.‘‘ఇప్పుడు నాకు డెబ్భైఆరేళ్లు. మొన్నటి ఉగాది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని రామానాయుడు కళామండపం లో జరిగిన వేదికపైన ప్రదర్శన ఇచ్చాను. శారీరకంగా కాస్త అలసటగా అనిపించినా, గొంతు మాత్రం పద్యంతో ఇంకా పదం తొక్కుతూనే ఉంది. ఇది ఆ రాముడు ఇచ్చిన శక్తే. అదే నన్ను ఇంకా సజీవంగా ఉంచుతోంది. వదలని ప్రేమ... జీవితాన్ని ప్రతిబింబించేది నాటకమైతే, నాటకానికి ప్రతిస్పందించేది జీవితమే. పదిహేనేళ్ల వయసులో మా పెదనాన్న కుమారుడు వల్లూరు కామేశ్వరరావు ద్వారా నాటకరంగంలోకి వచ్చాను. కంఠం బాగుందని, పద్యాలు పాడించి ప్రోత్సహించేవారు. ఆ విధంగా సతీ సక్కుబాయిలో ‘జ్ఞానయోగి’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఆ తర్వాత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో సిద్ధయ్యగా రేణుకా మహత్యంలో ‘నారదుని’గా, కనకదుర్గ మహత్యంలో ‘శంకరుని’గా శ్రీరామాంజనేయ యుద్ధంలో ‘శ్రీరాముని’గా, కురుక్షేత్రం గయోపాఖ్యానంలో శ్రీకృష్ణునిగా, తులసి జలంధరలో ‘దేవేంద్రుని’గా, పాండవ సౌశీల్యంలో ధర్మరాజు’ గా సాయినాథ ప్రస్థానంలో ‘శ్యామా’గా... వివిధ రకాల పాత్రలను పోషించాను. పోషిస్తూనే ఉన్నాను. ఏ పాత్ర ప్రత్యేకత దానిది. పద్యాలను నుడికారాలతో సహా కంఠస్థం చేస్తూ గొంతును నాటకానికి మేటిగా మార్చుకున్నాను. రాముడిగా, కృష్ణుడిగా పాత్రలు పోషించేటప్పుడు ప్రేక్షకులు రాముడిగా భావించి, నాటకం పూర్తయ్యేక నమస్కరించేవారు. అది నాటకం ద్వారా రాముడే ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. ఇప్పటికీ ప్రతిరోజూ పద్యాలు సాధన చేస్తూనే ఉంటాను. నాటి నుంచి నేటి వరకు ఏనాడూ ఈ కళను వదిలింది లేదు. నాకరంగంలో తెలుగు రాష్ట్రాలలో సీనియర్ రంగస్థల నటుడిగా గౌరవ పురస్కారాలు అందుకున్నాను.తెల్లవార్లూ పాత్రలో లీనమై... రాత్రి ఎనిమిది గంటలకు నాటకం మొదలైతే తెల్లవారు ఝాము వరకు పాత్రలో జీవిస్తూనే ఉంటాం. సన్నివేశాలను బట్టి ఒక్కో నాటకానికి 40 పద్యాలపైనే ఉంటాయి. ప్రేక్షకులు కూడా తెల్లవార్లూ నాటకాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు డిజిటల్ టీవీలు వచ్చాక లైవ్ టెలీకాస్ట్లు కూడా ఇస్తున్నారు. దీనివల్ల ప్రదర్శనకు రాలేని, నాటకంపైన అభిమానం ఉన్న నాటి తరం వాళ్లు లైవ్లో చూస్తుంటారు.పోషణకు మరో ఉపాధి... నేను నాటకంలో పాల్గొనాలంటే నాతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా రావాలి. ఒకరు హార్మోనిస్ట్, మరొకరు మేకప్ ఆర్టిస్ట్. నాటకరంగం ఊపిరిగా కొనసాగుతున్నా జీవనోపా«ధి, కుటుంబ పోషణ కోసం ప్రైవేట్గా ఉద్యోగాలూ చేశాను. నా చిన్నతనంలోనే మా అమ్మనాన్నలు చనిపోయారు. నా తరువాత ఐదుగురు చెల్లెళ్లు. పసిపిల్లలుగా ఉన్నవారిని పెంచి, పెద్ద చేసి, పెళ్ళిళ్లు జరిపించాను. ఇప్పడు అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. నా భార్య సూర్యకుమారి. ఆమెకు నలుగురు చెల్లెళ్లు. మాకు ముగ్గురు పిల్లలు. పిల్లల చదువుల కోసం మా స్వస్థలం కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చాం. ఇప్పుడు పిల్లలందరి బాధ్యతలు పూర్తయ్యి, విశ్రాంత జీవనంలో ఉన్నాం.పెన్షన్ సదుపాయం లేదు... నేటికీ మన తెలుగు పండగలైన వినాయకచవితి, దసరా, సుబ్రహ్మణ్యషష్టి, ఉగాది, శ్రీరామనవమి.. వంటి వేడుకల సమయాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో వేదికల మీద నా ప్రతిభ చూపే అవకాశం నేటికీ లభిస్తున్నది. దీని ఆధారంగానే నా జీవనం గడుస్తుంది. కళాకారులకు ఇచ్చే పెన్షన్ సదుపాయం ప్రభుత్వం నుంచి ఏదీ అందడం లేదు. అయినా ఆ కళా రంగమే నాకు ఇంకా ఇంత ముద్దపెట్టి, ఆదుకుంటోంది. నాలాంటి కళాకారులు ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కళను బతికించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాతో పాటు కళను నమ్ముకుని బతుకుతున్న నిరుపేద కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. పద్యనాటక కళాకారులను ప్రోత్సహించి, వారు ప్రదర్శనల్లో పాల్గొనేలా నా వంతు సాయం చేస్తుంటాను’’ అంటూ తాను చేస్తున్న నాటక కళారాధన గురించి తెలియజేశారు ఈ కంఠీరవుడు.– నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: గడిగె బాలస్వామివల్లూరు శ్రీహరి రావు -
వరదుడు నా రాముడు
భద్రాద్రి రాముడు ఇలవేల్పు కానిదెవరికి? సీతారాముల కల్యాణం కన్నుల పండువగా కాంచనివారెవరు? రఘువీరుడు... దాశరథి... ఆ సీతారామచంద్రమూర్తిప్రతి హృదిలో మనసు గుడిలో పదిలమూర్తి. అనుక్షణం తలుచుకునే జన్మ జన్మాంతర అనుబంధాన్ని పంచుకుంటున్నారు రచయిత చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ.అరవై నాలుగేళ్ళ క్రితం భద్రాచలం పమిడిఘంటం వారి అంబసత్రంలో ఓ రాత్రి హడావిడిగా పుట్టేశాన్నేను మా అమ్మ తొలి పురిటికి తన పుట్టింటి దార్లో ఉండగానే. రాముడితో అంతకు మునుపు పరిచయం తక్కువ నాకు. పుట్టుకతోనే మొదలైంది మా స్నేహం, ఆయన బాధ్యత. చిరు్రపాయంలో ఇప్పపువ్వులతోపాటు తునికిపళ్ళు తనకు తినిపించిన నన్నెలా మరవగలడు నా రామన్న!ఓ రెండున్నర దశాబ్దాలు నే తిరిగిందంతా మా రాముడు నడయాడిన పర్ణశాల ప్రాంతమే. పదోఏట న్యుమోనియా వచ్చినప్పుడు నాకు ముందుగా రాముడి దర్శనం చేయించి, ఆ తర్వాతే డాక్టరు పువ్వాడ నాగేశ్వరరావు గారికి చూపించింది అమ్మ. పదహారేళ్ళ ప్రాయంలో ఓ రాత్రి గుడివీధి ΄÷డిచేటివారి వరండాలో గడిపి మర్నాడు ఉదయమే నే చేసుకున్న రామచంద్రుడి దర్శనం అప్పటికి చివరిదన్నట్టు గుర్తు. ఆ తర్వాత నాస్తికత్వం వగైరాలు... మా అబ్బాయి సిద్దార్ధ ఎనిమిదో నెలలో పదిహేను రోజులపాటు టైఫాయిడ్ బారిన పడ్డప్పుడు నా బాల్య స్నేహితుడు తిరిగి మదికొచ్చేంత వరకూ. ఉత్తరోత్తరా కీర్తిశేషులు వైయస్సార్గారి సెక్యూరిటీలో భాగంగా సీతమ్మతో మా రాముడి కళ్యాణం శాంతా సమేతంగా అతి దగ్గరగా చూసిన భాగ్యం. ఏతావాతా, భద్రాద్రి రాముడు నన్ను తన భుజాలను ఎక్కించేసుకున్నాడు పుట్టీ పుట్టగానే. అలాగని ఆయనంటే నాకు అపారమైన భక్తా అంటే అదీ కాదు. అదో స్నేహం, ఆత్మీయ భాషణం, నేనున్నానన్న భరోసా; అవును, తను చూస్తున్నాడన్న కించిత్ భయం కూడా.ఒకానొక ఉద్యోగపర్వంలో వెనక నుంచి నా చెవిని తాకుతూ చిమ్ముకొచ్చిన వేడినీ, నా మీదికి దూసుకొస్తున్న ఒక విషనాగునీ పక్కదారి పట్టించిన వైనం మా నేస్తుడిదే. పూలమ్మిన చోటనే ముత్యాల తలంబ్రాలు పంచే అదృష్టం నాకొసగిన ఘనత ఆ ఆపన్నహస్తానిదే. విజయవాడలో పని చేస్తున్నప్పుడు బాపుగారు ఓ రోజు ఫోన్లోనే ‘మీకేం బొమ్మ కావాలండీ’ అనడిగినప్ప్పుడు ‘అయ్యా, రాముడిదే’ అనేశాను మరో ఆలోచన లేకుండా. ‘అర నిమిషము నిన్నెడబాసియు నేనాపద పడలేనురా వరదా’ అనెరిగిన వాణ్ణి. నెల తిరక్క ముందే వారు ప్రేమతో గీసిచ్చిన గుహుడి చేతిలో దాసజన సమేత భద్రాద్రి సీతారామచంద్ర స్వామి మా ఇంట్లో ఎప్పటికీ స్థిరోభవ, వరదోభవ! ఇక, సుమారు మూడున్నరేళ్ళపాటు తిరుమలలో ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామి దర్శనం ‘సబేరా’ ముందున్న రాతిస్తంభం కింద భాగంలో వేంచేసి ఉన్న సీతారామలక్ష్మణుల దర్శనం వినా పూర్తయ్యేది కాదు. ఏములాడ రాజన్నలో, బెజవాడ కనకదుర్గమ్మ లో, తిరుమల వేంకటేశ్వరుడిలో నాకు సదా దర్శనమిచ్చేది భక్తమందార, రఘువీర శ్రీరామచంద్రమూర్తే. మౌలాలీ గుట్ట మీది దర్గాలో హజ్రత్ అలీగారి చేతిముద్రని తాకి, వారికి మోకరిల్లినప్పుడు నా మనస్సులో మెదిలేది నిజ జనావన కాముడు, ఫాలలోచన సహితుడు నా దాశరథే.మొన్నీమధ్య నన్ను చూస్తూనే రామచంద్రుyì చెవిలో గుసగుసలాడింది సీతమ్మ.. ఒళ్ళోకూర్చునే.. మీవాడొస్తున్నాడు, ఇంక నేనేం గుర్తుంటాను స్వామీ మీకని. స్వామివారు ‘మనం కాక వాడికింకెవరున్నారు చెప్పు’ అన్నారు. మరి వాడి చేతికంటిన ఆ ఎర్ర మరక మాటేమిటి అని తనలో తానే అనుకొన్నది నా తల్లి– భర్తకి ఈతని విషయంలో ఏ ఫిర్యాదూ పట్టదని. స్నేహానికి తలొంచానా రోజు, తల పంకించాడు మా తండ్రి.ఇంతకీ నేను నా రాముణ్ణేమి కోరుతున్నట్టు? ఏది అడిగితే అది నేనైనా మీరైనా ఇట్టే ప్రసాదించే ఘనశ్యాముడాయన. నేస్తుడి నాడి పట్టినవాణ్ణి కనుక నేనెప్పుడూ ఏదీ అడిగి ఎరుగనతన్ని. అన్నీ ఇచ్చేశాడాయన, ఇస్తూనే ఉన్నాడా వరదుడు, కొండొకచో తానే అంబై పలుకుతూ కూడా! కంచర్ల గోపన్న గారైనా అప్పుడెప్పుడో సీతారామస్వామీ నే చేసిన నేరమదేమీ అంటూ కినుక వహించారేమో కానీ, నేనెన్నడూ నా రాముని మీద అలిగిందీ లేదు, ఆయన్ను కోపగించుకున్నదీ లేదు.. కలలో కూడా... ఏం జరిగినా అది నీ మహిమో, నా ప్రారబ్దమో అనుకుంటూ.కానీ ఇప్పుడెందుకో, ‘రామా, నువ్వు కొంచెం చిరుకోపం నీ మొహాన పూసుకోవయ్యా, నా తరఫున కూడా, ‘పాతకములతి పామరత్వమున ప్రీతి తోడ చేసెడి వారిపై’ అనాలనిపిస్తోంది.‘దీనత్రాణ దీక్షను మరచెదో పదిలమో రామ బహుపరాకు’ అనవలసింది, ‘దాచుకొను నీ సొమ్మది పదిలమో రామ బహుపరాకు’ అంటూ నా రామ భద్రునికి హెచ్చరిక చేయవలసి వస్తోంది.అమ్మయ్యో... ధర్మస్వరూపుడివి, నీకు చెప్పదగిన వాడినా స్వామీ, మన జన్మజన్మాంతర అవిచ్ఛిన్న మైత్రి నాపై ఈ బాధ్యత మోపుతున్నది కానీ...శ్రీరామా... అదిగో శివధనుర్భంగ సమయాన నీవైపు పవిత్రమగు శృంగారభావ మొడిసిపట్టిన చంద్రముఖి మాయమ్మ సీతమ్మ చూపు, చెరుకు గడవోలె నడిమికి విరిగి సర్వలోకములలో మ్రోగుతున్న ఆ ధనువు, రేపటి లగ్నంబునందె నాలుగు ముళ్ళు పడనిమ్మంటున్న దశరథ మహారాజు, నవ మనోజ్ఞ కళ్యాణ మంటపం, వశిష్ట వామదేవ శతానంద గాధేయులు, తట్టలో సీతమ్మను తెచ్చిన మేనమామలు, మా అమ్మ దోసిట్లో పద్మరాగమణులు, మరుక్షణపు మల్లెలు, తదుపరి ఇంద్రనీల మణులు, ప్రతి చైత్రశుద్ధ నవమికి వితతంబుగ తెలుగు నేల విరసెడి జల్లులు... చిరుజల్లులు చిటపటలు... ఎక్కడ చూసినా రఘు కులేశుడవు నువ్వేనయ్యా... ఆగాగు, నేనొస్తున్నాను ప్రభూ, తడవనివ్వను నిన్ను, నా చిన్న తాటాకు గొడుగు తెస్తున్నానుండు... మా సీతమ్మ తల్లికీ, నీకూ, భక్తజన సంద్రానికీనూ... -
అందరివాడు
‘రామ’ అనే పదం దశరథ సుతుడైన శ్రీరాముని పేరును సూచించే నామవాచకం మాత్రమే కాదు.. ధర్మాత్ములు, గుణవంతులు, అయిన వ్యక్తుల పట్ల విశేషణంగా, ఉపమానంగా కూడా వాడే అద్భుతమైన పదం. తల్లి దండ్రుల పట్ల భక్తి గౌరవాలు కలవారిని, సోదరుల పట్ల వాత్సల్యం ఉన్నవారిని, సహధర్మచారిణిపై విశేష ప్రేమానురాగాలు కలవారిని, ధర్మం తప్పని వారిని, ఎంత కష్టమైనా సరే, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారిని, దుర్మార్గులను శిక్షించే వారిని, ప్రజారక్షకులైన పరిపాలకులను అపర శ్రీరామచంద్రులుగా కీర్తించడం మన దేశంలో అనాదిగా జరుగుతున్నదే.‘రాము’డంటే రంజింపచేయువాడని అర్థం. అందరి మనసులనూ ఆనందింపచేయగలిగిన వారందరూ శ్రీరాములే. వాల్మీకి మహర్షి మాటలలో చెప్పాలంటే ‘రామో విగ్రహవాన్ ధర్మః అంటే ‘ధర్మానికి మూర్తీభవించిన రూపమే శ్రీ రాముడు. ఆయన ధర్మం, సత్యం, పితృవాక్య పరిపాలన, సంపూర్ణ మానవత్వం, ఏకపత్నీ వ్రతం, ధర్మబద్ధమైన పరి పాలనకు మారు పేరు. సోదర ప్రేమ, మిత్రధర్మం, సమత్వ బుద్ధి ఆయన స హజ స్వభావాలు.శ్రీరాముడు విశ్వజనీనమైన కొన్ని ధర్మాలను తాను ఆచరించి, లోకానికి ఆదర్శంగా నిలిచాడు. లక్ష్య సాధన కోసం ఎంత సుదీర్ఘ కాలమైనా ప్రయత్ని స్తూనే ఉండాలనీ, ఆ దశలో ఎన్ని ఆటంకాలు, కష్టాలు ఎదురైనా అనుకొ న్న లక్ష్యం సాధించేదాకా పట్టు సడలింపరాదనీ, తన సీతాన్వేషణ ద్వారా చాటిన వ్యక్తిత్వ వికాస నిపుణుడాయన. లక్ష్యసాధన కోసం ఉడుతలు, వానరుల వంటి వారు అందించే చేయూతను కూడా సహృదయంతో స్వీకరించి ముందుకు సాగాలన్నది ఆయన సందేశం. తానెంతటి గొప్ప పరాక్రమ శాలియైనా, ఏనాడూ అహంకారాన్ని దరిచేరనీయక వినయశీలిగా ప్రవర్తించిన మహోన్నతుడాయన. శత్రువులలోని మంచి గుణాలను సైతం ప్రశంసించే తత్వమాయనది. ఎప్పటికప్పుడు తన భావోద్వేగాలను నియంత్రించుకొంటూ, తన సోదరులనూ ప్రశాంతంగా ఉండమని బోధించిన మహామనీషి శ్రీరాముడు. లోకంలో ప్రతి యువతీ తనకు శ్రీరామునిలాంటి భర్త లభించాలని కోరుకొనేంత ఆదర్శ వంతుడైన భర్త ఆయన.ఇంక రాజా రాముని గొప్పదనాన్ని ఎంత వర్ణించినా చాలదు. అసలుసిసలైన ప్రజా పాలకుడంటే శ్రీరాముడే. వ్యక్తిగత విషయాలకు, సమష్టి విషయాలకు సంఘర్షణ ఏర్పడితే, వ్యక్తిగత అంశాలకంటే సమష్టి విషయాలకే ప్రాధాన్యతనివ్వాలనేది ఆయన ఆచరించిన రాజధర్మం. రాజ్య శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని రాజు శ్రీరాముడు. ప్రజలందరికీ సమన్యాయాన్ని, సమాన గౌరవాన్నీ అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగలసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే ఆయన పాలనలో నెలకు మూడు వానలు కురిసేవి. ప్రజలు సుఖ సంతోషాలతో, ఎలాంటి భయాలూ లేకుండా హాయిగా.. నిశ్చింతగా జీవించేవారు. ఆ సుభిక్షమైన రామరాజ్యాన్ని తిరిగి స్థాపించాలని ఎందరో నాయకులు కలలు కన్నారు.రామరాజ్యంలో ప్రజల యోగక్షేమాలకు, వారి రక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడింది. కార్యదక్షులైన, తెలివితేటలు కల్గిన, నిష్కపటులైన మంత్రులు పరిపాలనలో రాజుకు సలహాలనిచ్చేవారు. ప్రజల ఆదాయంలో ఆరవ భాగం (బలిషడ్భాగం) మాత్రమే పన్నుగా రాజారాముడు స్వీకరించే వాడు. అదికూడా ప్రజలకు భారం కాకుండా చూసుకొనేవాడు. సైన్యాన్ని, గూఢచారి వ్యవస్థను బలంగా ఉంచుకొనేవాడు. దేశకాల పాత్రోచితమైన న్యాయం ప్రజలకు అందించబడేది. కనుకనే ఆయన చరిత్ర ‘యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే/ తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి’ అని వాల్మీకి చెప్పినట్లుగా ఈ భూమిపై ఎంతకాలం పర్వతాలు, నదులు నిలిచి ఉంటాయో అంతకాలం అంటే ఈ సృష్టి ఉన్నంతకాలం రామకథ ప్రజల హృదయాలలో నిలిచి ఉంటుంది. వ్యక్తి సౌఖ్యం కంటే ఎంతో గొప్పదైన ధర్మ సంస్థాపన కోసం జీవించాలని బోధించిన, లోక క్షేమం కోసం సాగే ధర్మకర్మ వ్యవస్థను కాపాడిన ధర్మ విగ్రహుడు శ్రీరామచంద్రుడు. అందరికీ రక్షగా నిలవాలని కోరుకుందాం. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామశాస్త్రి, విశ్రాంత అధ్యాపకులు -
అనుగ్రహబలమివ్వు సీతారామా!
‘శ్రీరాముని అనుగ్రహబలమే బలము’ అన్నాడు త్యాగయ్య. రాముని అనుగ్రహం అతి సులువు. మాటకు కట్టుబడుట... మంచికి కట్టుబడుట... ఇవి చేస్తే చాలు. అయిననూ ఆయన మనయందు పరాకుగా ఉంటే ఒక మాట చెప్పేందుకు సీతమ్మ తల్లి ఉండనే ఉందిగా. సీతాసమేతుడైన ఆ దివ్యమూర్తి జన్మదినమూ, వివాహమూ లోక విశేషము. పొందగలిగినన్ని వరములు ప్రతి ఒక్కరూ పొందాలని ఆకాంక్షిస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.స్థితప్రజ్ఞతరేపే పట్టాభిషేకం అన్నప్పుడు పొంగిపోలేదు, ఆ పట్టాభిషేకం ఆగిపోయి, అడవికి వెళ్లాలని తెలిసినప్పుడు కుంగిపోలేదు. తండ్రిని నిందించలేదు, పినతల్లి కైకేయిని ద్వేషించలేదు. ఆ క్షణంలో ఆయన చూపిన నిలకడ స్థితప్రజ్ఞకి పరాకాష్ట. అత్యంత ఒత్తిడిలో కూడా విచక్షణ కోల్పోకుండా ఉండటం ఒక గొప్ప వ్యక్తిత్వ లక్షణం.కృతజ్ఞత ఎవరైనా వంద తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా, వారు చేసిన ఒక్క చిన్న మేలును కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే గొప్ప గుణం రాముడిది. కృతజ్ఞత చూపడంలో రాముడు ఒక మార్గదర్శి.ధర్మబద్ధతరాముడిని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటే ధర్మానికి ప్రతిరూపంగా పేర్కొంటారు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు. రాముడి బాణం దెబ్బ తొలుతగా రుచి చూసిన మారీచుడే. అంటే శత్రువు చేత కూడా ప్రశంసలు పొందేంతటి ధర్మగుణం కలవాడన్నమాట. ఎన్ని కష్టాలు ఎదురైనా తను నమ్మిన సత్యం, ధర్మం నుంచి తప్పుకోకపోవడం ఆయన గొప్పతనం. -
పంజాబీ వంటకాలకు ఫుడ్లవర్స్ ఫిదా..!
కొత్త రుచులను నగరవాసులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.. పంజాబ్ నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో నివాసం ఉండేవారి కోసం వెలిసిన దాబాలు క్రమంగా చేరువయ్యాయి. దశాబ్దాలుగా భాగ్యనగర సిటీవాసులు పంజాబీ రుచులను భల్లే భల్లే అంటూ ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు హైవేలపై ప్రత్యక్షమయ్యే దాబాలు ప్రస్తుతం నగరంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి నచ్చిన రెసిపీలను లాగించేస్తున్నారు ఫుడ్ లవర్స్.. ఆయా ఫ్లేవర్లలో లభించే లస్సీని ఈ సమ్మర్లో తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే అంటున్నారు. శామీర్పేట్ వద్ద(హైదరాబాద్ నుంచి 40 కి.మీ) ఉన్న పంజాబీ దాబా, లాంగ్ డ్రైవ్కు వెళ్లినప్పుడు సేద తీరడానికి పలువురు పంజాబీ హవేలీ దాబాను ఎంచుకుంటారు. ఇది సంప్రదాయ పంజాబీ హైవే ఆహారాన్ని, విలక్షణమైన, రంగురంగుల హవేలీ డిజైన్లతో మిళితం చేస్తుంది. ఇక్కడ ప్రత్యేకమైన భారీ బాహుబలి లస్సీ సహా వెన్న పూసిన పరాటాలు, అమృత్సరి కుల్చాలు ఉంటాయి. విశేషం ఏమిటంటే.. ప్రాంగణంలో ఒక సెల్ఫీ మ్యూజియంలో ఎంజాయ్ చేయవచ్చు. హైటెక్ థ్రిల్.. హైవే ఫీల్.. కొండాపూర్లో ఉన్న చార్పాయ్ దాబా విలక్షణమైన అలంకరణ మంచాల మీద కూర్చునే ఏర్పాటుతో పాటు ఫైన్ డైనింగ్ సీటింగ్తో ఆధునిక దాబా భావనను అందిస్తుంది. ఇక్కడి మెనూలో సంప్రదాయ ఉత్తర భారతీయ థాలీలు, శాఖాహారం, మాంసాహారం రెండూ సృజనాత్మక మార్పులతో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చైనీస్/ధాబా ఫ్యూజన్ స్టార్టర్స్, మెయిన్ కోర్సులను కూడా ఆస్వాదించవచ్చు. సింపుల్.. హిస్టారికల్.. సుదీర్ఘ కాలంగా బోయిన్పల్లిలో భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటోంది లవ్లీ పంజాబీ దాబా. ఇది పూర్తి శాఖాహార పంజాబీ దాబా, ఇది చాలా సింపుల్గా ఆడంబరాలు లేకున్నా ఎంతో కాలంగా తనకు ఉన్న పేరు ప్రతిష్టలతో ఆకట్టుకుంటోంది. పరాటాలు, రోటీలు, పప్పు, కూరగాయలు కొన్ని ఇండోచైనీస్ వంటకాలతో నిండిన క్లాసిక్ పంజాబీ వంటకాలు మెనూలో ఎక్కువగా ఉంటాయి. అందుబాటు ధరల్లో ఐటవ్స్ు లభ్యమవుతాయని అంటుంటారు.హిల్స్లో కపూర్స్.. నగరంలో అత్యంత ఖరీదైన, ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్లో ఉన్న కపూర్స్ కేఫ్ అచ్చం పంజాబీ థీమ్తో రూపొందింది. కృత్రిమ గడ్డిపై మంచాల సీటింగ్, రంగురంగుల అలంకరణతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. చాలా ప్రశాంతమైన, ఆహ్లాదకర వాతావరణంతో ఇది పంజాబీ దాబా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. పూర్తిగా శాఖాహార వంటకాలు మాత్రమే అందించే ఈ కేఫ్ ఆలూ పరాటా, బేడ్మి పూరి, చిక్కటి అమృత్సరి లస్సీ తదితర వంటకాలకు ప్రసిద్ధి.నార్త్ టూ సౌత్ నగరంలోని పురాతన పంజాబీ దాబాలలో సాగర్ పాపాజీ కా దాబా కూడా ఒకటి.. అబిడ్స్లోని సాగర్ పాపాజీ కా దాబా, ఒక ఇంటి వంట ప్రాంగణంగా పేరొందింది. దీనిలో ఎటువంటి హంగామాలు, ఆధునిక అలంకరణలు ఉండవు. ఇది పూర్తిగా ఉత్తర భారత రుచులకు ప్రసిద్ధి చెందింది. దువా కుటుంబం 1985 నుంచి దీనిని నిర్వహిస్తోంది. దాల్ మఖానీ, ఆలూ పరాఠాల నుంచి ఖీమా ఫ్రై, తందూరీ రోటీల వరకు ఇంట్లో తయారు చేసిన రుచిని కలిగి ఉంటాయి. ఇక్కడ క్లాసిక్ చిక్కటి లస్సీ తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన ఐటమ్ అంటారు ఫుడ్ లవర్స్. -
వైష్ణవ తిలకం అర్థం తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు!
భారతీయ సనాతన ధర్మంలో నుదుట ధరించే తిలకానికి విశిష్టస్థానం ఉంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో కనిపించే 'U' ఆకారపు తిలకం వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు, శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయంలో విశిష్టంగా కనిపించే 'U' ఆకారపు ఊర్ధ్వపుండ్రం వెనుక దాగి ఉన్న పరమార్థం ఏమిటి? భగవంతుడి పాదపద్మాలకు చిహ్నంగా భావించే ఈ తిలకం, మనిషిలోని అహాన్ని తొలగించి ఆధ్యాత్మిక పురోగతికి ఎలా బాటలు వేస్తుందో తెలుసుకుందాం..వైష్ణవ భక్తులు ధరించే 'U'’ ఆకారపు తిలకాన్ని ‘ఊర్ధ్వపుండ్రం’ అని పిలుస్తారు. ఆధ్యాత్మిక పరిభాషలో ‘ఊర్ధ్వ’ అంటే పైకి, ‘పుండ్రం’ అంటే గుర్తు అని అర్థం. అంటే ఇది మనిషిని ఉన్నత స్థితికి లేదా మోక్ష మార్గానికి నడిపించే గుర్తు.శాస్త్రాల ప్రకారం, 'U' ఆకారం సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలకు సంకేతం. నుదుటిపై ఈ తిలకాన్ని ధరించడం ద్వారా భక్తుడు తనను తాను పరమాత్మ పాదాల చెంత సమర్పించుకున్నట్లు భావిస్తారు. ఇది మనిషిలో అహంకారాన్ని తగ్గించి, వినయాన్ని, భక్తి భావాన్ని పెంపోందిస్తుంది.ఆజ్ఞా చక్రం – శక్తి కేంద్రం...మన శరీరంలో ఏడు ముఖ్యమైన చక్రాలు ఉంటే, అందులో నుదుటి మధ్య భాగం ‘ఆజ్ఞా చక్రం’గా పిలుస్తారు. ఇది జ్ఞానానికి, ఆలోచనా శక్తికి కేంద్రస్థానం.ఏకాగ్రత: తిలకాన్ని ధరించే సమయంలో వేలితో ఆజ్ఞా చక్రాన్ని తాకడం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమవుతాయి. ఇది ఏకాగ్రతను పెంచి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.నాడుల కలయిక: ఊర్ధ్వపుండ్రంలోని రెండు నిలువు రేఖలు మన శరీరంలోని ఇడ, పింగళ నాడులను సూచిస్తాయి. వీటిని నుదుటిపై ధరించడం వల్ల ప్రాణశక్తి క్రమబద్ధం అవుతుంది.గంధం, పసుపు.. ఆరోగ్య ప్రదాయిని...తిలక ధారణలో ఉపయోగించే ద్రవ్యాలు కేవలం రంగు కోసం మాత్రమే కాదు, వాటిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. తెల్లటి చందనం లేదా పసుపు పచ్చని గంధాన్ని ధరించడం వల్ల నుదుటి భాగం చల్లబడుతుంది. ఇది కోపాన్ని తగ్గించి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కుంకుమ లేదా పసుపు మిశ్రమం యాంటీ–సెప్టిక్లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, సానుకూల ప్రకంపనలను ఆకర్షిస్తుంది.శాస్త్రీయ కోణం...ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, రెండు కనుబొమ్మల మధ్య భాగంలో పీనియల్ గ్రంథి ఉంటుంది. దీనిని తరచుగా తిలకం ద్వారా తాకడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే విద్యార్థులు, మేధావులు తిలక ధారణను ఒక క్రమశిక్షణగా పాటిస్తారు.నుదుట తిలకం ధరించడం కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు.. అది ఒక సంస్కారం. మన సంస్కృతిని ప్రతిబింబించే అద్దం. భగవంతుడిపై భక్తిని చాటడంతో పాటు, మానసిక వికాసానికి, ఆరోగ్యానికి ఈ ఊర్ధ్వపుండ్రం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.– పసుపులేటి శ్రీలక్ష్మి, జర్నలిస్ట్ -
తండ్రి ఆజ్ఞలో దాగిన నాయకత్వ రహస్యం
శ్రీరాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్యలో ఆనందోత్సాహాలు ఉప్పొంగుతున్న శుభవేళ. ప్రజల హృదయాల్లో ఒకే పేరు – రాముడు. న్యాయం, వినయం, ధర్మనిష్ఠల ప్రతిరూపంగా ఉన్న శ్రీరాముడు కాసేపట్లో రాజ్యభారాన్ని స్వీకరించబోయే సమయంలో, ఎవ్వరూ ఊహించనిదిగా ఆ దృశ్యం కాస్తా మారిపోయింది. ఆనందోత్సాహాల స్థానంలో నిరాశా నిస్పృహలు... రాజసభలో నిశ్శబ్ద వాతావరణం. కారణం – దశరథుడు, భార్య కైకేయికి ఇచ్చిన మాటతో అంతా తారుమారు కావడం.రాజ్యాన్ని వదిలి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమనే ఆజ్ఞను రామునికి తెలియజేయటానికి కూడా ఆయనకి ధైర్యం ఉండదు. ఈ పరిస్థితిలో, కైకేయి రామునికి ఈ విషయం చెప్పినప్పుడు రాముడు స్పందించిన తీరుని వాల్మీకి మహర్షి ‘న హమర్థ పరో దేవి’... అమ్మా! సంపదల కోసం నేను జీవించను. ‘మాం ఋషిభిస్తుల్యం, కేవలం ధర్మమాస్థితం’... ఋషుల వలె ధర్మాన్ని ఆచరించడం మాత్రమే నా తత్త్వం అని నీకు తెలిసిందే కదమ్మా...’’ అంటాడు. ఇది అంధ విధేయత కాదు. ఆయన చైతన్య పూర్వక నిర్ణయం. రాముడు తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తన హక్కును వినియోగించుకోవచ్చు కానీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టటమే రాజధర్మమని గ్రహించాడు.అయితే ఆయన ఆజ్ఞను పాటించటం కేవలం కుమార ధర్మం మాత్రమేనా? లేక దానిలో మరింత లోతైన ధర్మబోధ, నాయకత్వ దృష్టి, విలువల పట్ల నిబద్ధత దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం వాల్మీకి రామాయణం వైపు తిరగాలి. ’పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన గౌరవాత్’.... తండ్రి మాట గౌరవం కోసం, ఆయన ఆజ్ఞను పాటించాలనుకుంటున్నాను అంటాడు. శ్రీరాముడు దశరథుడు ఇచ్చిన వాగ్దానం విఫలమైతే, రాజ్యంపై, రాజుపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే రాముడు తండ్రికి చెప్పి, ఓదార్పును ఇచ్చాడు.కౌసల్యాదేవి రాముని వనవాస వార్త విని దుఃఖించినప్పుడు ఆమెను కూడా ధైర్యపరుస్తూ, ఓదార్చిన తీరు అమోఘం. తండ్రిగారు మనకి రాజు; మనల్ని పోషించే దశరథుడు మనకి గురుస్థానంలో ఉన్నారు – మనకంటే పెద్దవారు. అందరితో పాటు మనిద్దరమూ కూడా ఆయన ఆజ్ఞని పాటించి తీరాలి. స్త్రీకి స్వర్గ్రపాప్తికి భర్త శుశ్రూష ఒక్కటే మార్గమమ్మా అని వివరించాడు. ‘దశరథస్తు ధర్మాత్మా’ అంటారు మహర్షి. అంటే పితృవాక్యం ధర్మవాక్యం అని ఒక సందేశాన్నిస్తున్నారు. ఈ సందేశం ఎప్పటికీ సత్యమే. ఇదంతా విని కౌసల్య రాముని ధర్మనిష్ఠకి పోంగిపోయింది.శ్రీరాముడు వనవాసం చేయాలన్న వార్త తెలియగానే, లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూ ముసలివాడైన తండ్రిని అంతం చేస్తానన్నాడు. అతణ్ణి వారిస్తూ, తండ్రిగారి ఆజ్ఞని తప్పకుండా ఆచరించాల్సిందేనని తమ్ముడికి కర్తవ్య బోధ చేస్తాడు. ఈ విధంగా ఏకకాలంలో కుటుంబానికి బలం ఇచ్చినవాడు శ్రీరాముడు – తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి, రాజ్య ప్రతిష్టను కాపాడటానికి, తన హక్కుని త్యాగం చేశాడు.అరణ్యవాసం – నాయకత్వ శిక్షణఇంకొక కోణంలో చూస్తే అరణ్యవాసం రాముని నాయకత్వానికి ఒక శిక్షణా శిబిరం అయింది. రాజ్రపాసాదంలో అన్ని హంగులతో పెరిగిన శ్రీరాముడు, అరణ్యంలో ఋషుల కష్టాల్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నాడు. ప్రజల బాధలను ప్రత్యక్షంగా అనుభవించాడు. అటు రాక్షసులతోనూ, ఇటు ఋషులతోనూ, సాధారణ జీవితాన్ని గడుపుతూ, ఉపశమనం, సహనం, విధేయత, ధర్మనిష్ఠని పాటిస్తూ, సమగ్ర నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. గిరిజనుల జీవన విధానాన్ని తెలుసుకున్నాడు. పాలనలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం వారితో సహజీవనం ఎంత అవసరమో రాముడి జీవితం చెబుతోంది. అధికారంలోకి రాకముందే అనుభవం సంపాదించిన నాయకుడిగా ఎదగగలిగాడు. కనుక అరణ్యవాసం రాజ్యభారానికి శిక్షణ శిబిరంగా చెప్పొచ్చు.విలువలపై నిలిచిన వ్యక్తిత్వంరాముని వనవాస నిర్ణయం తక్షణ ఫలితాల కోసం కాదు, దీర్ఘకాలిక విలువల కోసం. తన వ్యక్తిగత ఆనందం, తల్లిదండ్రుల ప్రేమ, రాజ్యాభిషేక గౌరవం మొదలైనవన్నీ పక్కన పెట్టి, ధర్మాన్ని ఎంచుకుని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనిపించుకున్నాడు.ప్రస్తుత సంక్షుభిత సమయంలో రాముడి జీవితం ఒక స్ఫూర్తి. మాట నిలబెట్టుకోవడం, బాధ్యతని నిస్వార్థంగా స్వీకరించటం, క్లిష్టకాలంలో ధైర్యంగా నిలబడటం, హక్కుల కంటే కర్తవ్యాన్ని ముందుంచటం, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడటం మొదలైనవి ఏ కాలానికైనా వర్తిస్తాయి.శ్రీరాముని జీవితం మనకిచ్చే సందేశం ఒక్కటే –‘అధికారం గొప్పది కాదు; ఆ అధికారాన్ని నిలబెట్టే విలువలే గొప్పవి’. శ్రీరాముని విధేయతను చాలామంది త్యాగంగా చూస్తారు కానీ, అది స్వచ్ఛంద ధర్మం. అందుకే రామకథ యుగ యుగాలపాటు మన హృదయాల్లో వెలుగుతుంది. అది భక్తి కథ మాత్రమే కాదు, ఆత్మవిమర్శకు ఆహ్వానం కూడా! నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు రాముడికి తులసి మాలను ధరింపజేయాలి. పూర్తయిన తర్వాత అన్నదానం చేసి, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ఆహూతులకు బహుమతిగా ఇవ్వడం ద్వారా శుభఫలితాలు చేకూరతాయి.రామననమిరోజు రామాలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణం వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయని ప్రతీతి.శ్రీ రామనవమి రోజున పానకం–వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ్రపాకృతిక పరమార్థం ఏమిటంటే ఇది వేసవికాలం కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయని పండితుల అభిప్రాయం. – దావులూరి రామకృష్ణ శర్మ విశ్రాంత అధ్యాపకులు -
ప్రశాంతంగా శ్రీరామ నవమి శోభాయాత్ర : అధికారులు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ గరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధమయ్యాయి. సీతారాం బాగ్ లోని ద్రౌపది గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, పాల్గొన్నారు. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసు కోవాల్సిన చర్యలపై చర్చించారు.2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందిందని, సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో జరుపు కోవాలని కోరారు. ఇందుకోసం సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుతోపాటు, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.ముఖ్యంగా చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. గతేడాది వాహనాల బ్రేక్డౌన్ వల్ల యాత్ర నెమ్మదించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.శోభాయాత్రను మధ్యాహ్నం 1 గంట కల్లా ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాల వల్ల ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లు వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. ప్రజలు, ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటును ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే వాహనాల ఎత్తు విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులు భగవంతరావు, గోవింద్ రాఠి,ఆనంద్ సింగ్, కృష్ణ, శ్రీమతి శశికల (మాజీ కార్పొరేటర్), లాల్ సింగ్ (మాజీ కార్పొరేటర్) అందరూ శోభాయాత్ర సందర్భంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించగా, అన్నింటిని పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు. అనంతరం శోభాయాత్ర వెళ్లే రూట్ను పరిశీలించారు.ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, ఐపీఎస్,ఎన్. శ్వేత, ఐపీఎస్, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
యద్భావం తద్భవతి
వరదల ధాటికి ఒక ఊరు పెద్ద మొత్తంలో నష్ట పోయింది. ఆ ఊరి రైతుల ప్రధానపంట వేరుశనగ. వరద నీటి వల్ల వారు విత్తనాలకని దాచిపెట్టుకున్న వేరుశనగ విత్తనాలు పనికిరాకుండా పోయాయి. అందరూ వెళ్ళి జమీందారును సహాయం చేయమని కోరారు. దానగుణం కలిగిన జమీందారు సహాయం చేయడానికి అంగీకరించాడు. రైతులు అడిగినన్ని విత్తనాలు ఇవ్వసాగాడు.అదే సమయంలో అక్కడికి ఒక ముసలావిడ విత్తనాలకని వచ్చింది. ఆమె గురించి తెలిసిన కొందరు ఆమెను వింతగా చూశారు. మరి కొందరైతే ‘నీకు సెంటు నేల లేదు. నువ్వెక్కడ పండిస్తావు? నువ్వు పండించినా తినడానికి నీకు పిల్లాజెల్లా లేరు కదా’ అని వేళాకోళం చేశారు. ఆమె నవ్వి ఊరుకుంది. జమీందారు మాత్రం ఆమె అడిగినన్ని విత్తనాలు ఇచ్చి పంపాడు. మూడు నెలలు గడిచింది. వేరుశనగ తోటలు కోతకు సిద్ధమయ్యాయని తెలిసి వాటిని చూడటానికని జమీందారు జట్కాలో బయలుదేరాడు. ఆ ఊరి రైతులందరూ జమీందారుకు పడీపడీ నమస్కరించారు. తాము నాటిన వేరుశనగ తోటలను చూపారు. ఆ మొక్కలన్నీ పొట్టిగా, బలహీనంగా, ఆకులు ఎండి పోయి ఉన్నాయి. రైతులకు సరైన ఫలితం వచ్చే సూచనలు కనిపించలేదు. బాధగా వెనుదిరిగాడు.ఎండ ఎక్కువయ్యింది. విశ్రాంతి కోసం ఒక మామిడి చెట్టు కింద ఆగాడు. ఎదురుగా చిన్న గుట్ట కనిపించింది. ఆ గుట్ట మీద వేరుశనగ మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వాటి ఆకులు గాఢ పచ్చ రంగులో ఉన్నాయి. ఆశ్చర్య పోయాడు జమీందారు. చిన్నగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ ముసలావిడ కూర్చుని ఉంది.‘మీ ఊర్లో వేరుశనగ పంట ఎవ్వరికీ సరిగా పండలేదు, నీకు మాత్రం ఎలా పండింది?’ అని అడిగాడు. ఆమె చల్లటి కుండ నీళ్ళు జమీందారు చేతికి ఇస్తూ ‘నా ప్రార్థన వల్ల’ అని బదులిచ్చింది.ఆసక్తిగా ‘నువ్వు ఏమని ప్రార్థన చేశావో నాకు చెప్పు!’ అన్నాడు.నాకు పొలం లేదు. నాకంటూ ఎవ్వరూ లేరు. ఇవి బాగా పండితే ఎవరో ఒకరు తింటారని ఈ గుట్ట మీద నిలబడి విత్తనాలు చల్లాను. అలా చల్లేటప్పుడు... ‘కాపలాదారుడు తినగా మిగిలింది, దొంగ తినగా మిగిలింది, చూసినవాడు తినగా మిగిలింది, పక్షులు తినగా మిగిలింది, నాకూ కొంత మిగిలితే సంతోషం స్వామీ’ అని దేవుణ్ణి ప్రార్థించాను’’ అని చెప్పింది.ఆమె సహృదయతకు జమీందారు చలించి పోయాడు. ‘మనం మంచిగా ఆలోచించి ఒక పని చేస్తే ప్రకృతి పదింతల సహాయం చేస్తుందని’ జమీందారుకు అర్థం అయింది. ఆమెకు హృదయపూర్వకంగా నమస్కరించి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
యక్షప్రశ్న లంటే..?
ఎవరైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతుంటుంటే యక్షప్రశ్నలు వేస్తున్నావు అనడం....పరిపాటి. అసలు యక్షప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని ఏ సందర్భంలో అడిగారో ఇపుడు తెలుసుకుందాం. అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలోని అరణ్యపర్వానికి సంబంధించినవే.. ఈ యక్ష ప్రశ్నలు. పాండవులు మాయాజూదంలో ఓడిన తర్వాత 14 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైత వనానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక పండితుడు తన ‘అరణి‘( నిప్పు పుట్టించే కర్ర ) ఒక మృగం తీసుకు పోయిందని, దానిని వెతికి ఇవ్వమని ధర్మరాజును అడుగుతాడు. ధర్మరాజు అంటే... పాండవుల్లో పెద్దవాడు, బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు.ధర్మరాజు ధర్మనిష్టకు పరీక్షయే ఈ యక్షప్రశ్నలు. ధర్మరాజు తన తమ్ముళ్లలో నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముని ఒకరి తరవాత మరొకరిని అరణి తీసుకుని రావలసిందిగా కోరడంతో వారు అరణ్యంలోకి వెళ్లడం ఎంతకూ తిరిగి రాక పోవడంతో చివరకు ధర్మరాజే.. బయలుదేరి వెళ్ళాడు. అయితే తన సోదరులు విగతజీవుల్లా ఒక సరస్సు వద్ద పడి ఉండడాన్ని ధర్మరాజు గమనించాడు. ఈ నేపథ్యంలో తనకు దాహంగా ఉండడంతో సరస్సులో నీరు తాగేందుకు దిగుతుండగా ఒక యక్షుని అదృశ్యవాణి వినిపించింది. ఓ.. ధర్మరాజా! నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీకు తాగేందుకు మంచి నీరు లభిస్తుందని, లేకుంటే నీ సోదరులకు పట్టిన గతే నీకూ పడుతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. అందుకు ధర్మరాజు సరే అనడంతో ఆ యక్షుడు 72 ప్రశ్నలను అడుగుతాడు. వాటన్నిటికీ ధర్మరాజు సక్రమంగా సమాధానాలను చెప్పడంతో ఆ యక్షుడు సంతృప్తి చెంది, మీ సోదరులలో ఒకరిని మాత్రమే బతికిస్తానని ఎవరు కావాలో కోరుకోమంటాడు. అందుకు ధర్మరాజు తన పినతల్లి కుమారులైన నకుల, సహదేవులలో ఒకరిని బతికించమని కోరడంతో ఆ యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు సంతోషించి, అందరికీ ప్రాణదానం చేస్తాడు. ధర్మాచరణ విశిష్టతను తెలిపిన ప్రశ్నలనే యక్షప్రశ్నలు అంటారు.– సి.ఎన్. మూర్తి, పాత్రికేయులు -
మౌనం..అంతరంగ అన్వేషణకు మార్గం
భారతీయ జీవన దర్శనం మౌనాన్ని ఒక మహోన్నత తపస్సుగా, ముని వృత్తిగా అభివర్ణించింది. ‘మౌనం సర్వార్థ సాధకమ్‘ – అనగా మౌనం ద్వారా సమస్త కార్యాలను సాధించవచ్చు. మౌనం అంటే కేవలం పెదవులు మూసి ఉంచడం కాదు; అనవసర ఆలోచనలను నియంత్రించి మనసును నిశ్శబ్దంగా మార్చడం.నేటి ఆధునిక కాలంలో మనిషి నిరంతరం బాహ్య ప్రపంచపు శబ్దాల మధ్య, సామాజిక మాధ్యమాల అలజడిలో జీవిస్తున్నాడు. ఈ గందరగోళం వల్ల తనతో తాను మాట్లాడుకునే అమూల్య సమయాన్ని కోల్పోతున్నాడు. మౌనం మనలో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను, వివేకాన్ని మేల్కొల్పుతుంది. మాటల ద్వారా వ్యయమయ్యే శక్తిని ఆదా చేసి, ఆ శక్తిని అంతరంగ వికాసానికి ఉపయోగించేలా చేస్తుంది.వైదిక ఆధ్యాత్మిక చరిత్రలో మౌనానికి రమణ మహర్షి ఒక మహోన్నత నిదర్శనం. ఆయన కేవలం తన మౌనం ద్వారానే భక్తుల సంశయాలను నివృత్తి చేసేవారు. మాటలు వివరించలేని గూఢ సత్యాలను మౌనం సులువుగా వివరిస్తుంది. అలాగే, దక్షిణామూర్తి స్వరూపంలో పరమశివుడు మౌన ముద్ర ద్వారానే శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అశాంతిగా ఉన్న మనసు ఎప్పుడూ వాదిస్తుంది; ప్రశాంతమైన చిత్తం మౌనంలో లీనమవుతుంది. మౌనం మనల్ని అహంకారం నుండి విముక్తులను చేసి, పరమాత్మతో అనుసంధానం చేస్తుంది. లోతైన నిశ్శబ్దంలోనే దైవ వాక్కు వినిపిస్తుంది. నిశ్చలత్వమే నిత్య సత్యమని గ్రహించినప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు.నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనం మాట్లాడే మాటల్లో చాలా వరకు అనవసరమైనవి, ఇతరులను నొప్పించేవి ఉంటాయి. మౌనాన్ని అలవర్చుకోవడం వల్ల వాక్ దోషాలు నశిస్తాయి. ఒక వివాదం తలెత్తినప్పుడు ఎదురు దాడి చేసే కంటే, కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఆవేశం తగ్గి విచక్షణ పెరుగుతుంది. ప్రతిరోజూ కనీసం కొద్దిసేపైనా ఏకాంతంగా మౌనం పాటించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఇది మన నరాల వ్యవస్థకు విశ్రాంతినిచ్చి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. మనం ఎంత తక్కువగా మాట్లాడితే మన మాటలకు అంతటి గౌరవం పెరుగుతుంది. మౌనం బలహీనత కాదు; అది ఒక ఉన్నతమైన మానసిక పరిపక్వత.ఆర్ష సంస్కృతి అందించిన ఈ మౌన మార్గం వ్యక్తిని ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దుతుంది. మాటలు వెండి అయితే మౌనం బంగారం అన్న నానుడి అక్షర సత్యం. మన అంతరంగంలో మౌనం అనే జ్యోతి వెలుగుతున్నప్పుడు, బాహ్య ప్రపంచంలోని కల్లోలాలు మనల్ని స్పృశించలేవు. మాటలకందని ఆనందాన్ని అనుభవించాలంటే మౌనమే ఏకైక శరణ్యం. అశాంతిని వీడి, మౌనాన్ని ఆలింగనం చేసుకుని ఆత్మాన్వేషణ సాగిద్దాం. మౌనమే శక్తి, మౌనమే శాంతి. సర్వం నిశ్శబ్దమయం!బాహ్య ప్రపంచంలో మనం ఎంత ఎదిగినా, అంతరంగంలో మౌనాన్ని ఆశ్రయించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. మౌనంలో మన బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి; వాటిని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. ఇది మనల్ని అంధకారం నుండి వెలుగు వైపు, అశాంతి నుండి ప్రశాంతత వైపు నడిపించే దివ్య మార్గం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
రాముడికి జాబాలి ఉద్బోధ
పితృవాక్య పరిపాలన కోసం రాముడు అడవులకు బయలుదేరాడు. భర్త తోడిదే లోకం అనుకుని సీత, అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరించారు. రాముడు అడవులకు వెళ్లిపోయాడనే దుఃఖంతో దశరథుడు కన్నుమూశాడు. భరతుడు దశరథుడికి అంత్యక్రియలు చేశాడు. రాముడిని తిరిగి అయోధ్యకు తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో సపరివారంగా రాముడి వద్దకు వెళ్లాడు. అయోధ్యకు తిరిగి రావాలని, రాజ్యాన్ని చేపట్టాలని పలురకాలుగా బతిమాలుకున్నాడు. భరతుడి కోరికను రాముడు అంగీకరించలేదు. ‘తమ్ముడా! దుఃఖించకు. అయోధ్యకు వెళ్లి పరిపాలన సాగించు. మన తండ్రి ఆదేశాన్ని పాటించు. వనవాసం చేయడం ద్వారా నేను ఆయన మాటను నెరవేరుస్తాను. మహారాజైన మన తండ్రికి ఇచ్చిన మాటను ఉల్లంఘించరాదు. నువ్వు కూడా ఆయన ఆజ్ఞను పాలించు. పరలోకంలో సుఖాలను కోరే మానవుడు క్రూరత్వం లేకుండా గురు శుశ్రూష చేయాలి. తండ్రి మాటను పాటించాలి’ అని పలికాడు. భరతుడికి రాముడు ఇలా నచ్చజెప్పి, అయోధ్యకు తిరిగి వెళ్లి పరిపాలించమని ఆదేశించాడు. అంతలోనే రాముడి మాటలు విన్న జాబాలి కలగజేసుకున్నాడు.‘రామా! బాగు బాగు! ఉత్తమ బుద్ధిమంతుడవు, ఆత్మాభిమానవంతుడవు అయిన నీకు, సామాన్య మూఢుని వంటి నిష్ప్రయోజనమైన ఆలోచనలు రాకూడదు. లోకంలో ఎవడైనా ఒక్కడే పుడుతున్నాడు. ఒక్కడే మరణిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవడికి ఎవడు బంధువు? ఎవడి నుంచి ఎవడు పొందగలిగేది ఏమిటి? తల్లి అని, తండ్రి అని అనుకుంటూ వారిపై అధికానురాగం పెంచుకునేవాడు ఉన్మత్తుడితో సమానుడు. ఎవరికి ఎవరు ఏమవుతారు? గ్రామాంతరానికి వెళ్లినవాడు ఒకచోట బస చేసి, మర్నాడు ఆ బసను విడిచిపెట్టి ప్రయాణం కొనసాగిస్తాడు. మనుషులకు తల్లి, తండ్రి, ఇల్లు, ధనం అనేవి కూడా తాత్కాలిక బసలాంటివి మాత్రమే! సజ్జనులకు వాటిపై వ్యామోహం ఉండరాదు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యాన్ని విడిచి, అనేక ప్రమాదాలకు నెలవైన, దుఃఖాలకు దారితీసే ఈ అడవి మార్గాన్ని అవలంబించడం నీకు తగదు. అందువల్ల సర్వసమృద్ధమైన అయోధ్య నగరానికి తిరిగి చేరుకుని, పట్టాభిషేకం చేసుకుని, రాజ్యపాలన స్వీకరించు. పరదేశానికేగిన భర్త రాక కోసం ఎదురుచూసే పతివ్రతలా అయోధ్య నగరం నీకోసం ఎదురు చూస్తోంది. నువ్వు రాజభోగాలను అనుభవిస్తూ, దేవేంద్రుడు స్వర్గంలో విహరించేలా అయోధ్యలో విహరించు. నీకు దశరథుడు ఏమీ కాడు. నువ్వు దశరథుడికి ఏమీ కావు. ఆ రాజెవరో, నువ్వెవరో! అందువల్ల నా మాట విని, నేను చెప్పినట్లు చేయి. ఆ దశరథ మహారాజు తాను ఎక్కడికి వెళ్లాలో, అక్కడకు వెళ్లిపోయాడు. నువ్వు మాత్రం అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటున్నావు. కేవలం అర్థం కోసం, ధర్మం కోసం పాటుపడే వారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది. అర్థధర్మపరులు బతికినంత కాలం కష్టాలను అనుభవిస్తూ, మరణానంతరం కూడా నాశనం చెందుతారు. పరం అనేది ఏదీ లేదని నిశ్చయించుకుని, ప్రత్యక్షమైన దానినే ఆచరించు. పరోక్షమైన దానిని లెక్కచేయకు. పాపం, నీ సోదరుడు భరతుడు కూడా నిన్ను బతిమాలుకుంటున్నాడు. నా మాటలు ఆలకించి, రాజ్యాన్ని స్వీకరించు’ అని పలికాడు.‘నీ మాటలు పైకి హితవచనాల్లా కనబడినా, నిజానికి అవి అహితమైనవి. పాపాచారవంతుడై, సద్బుద్ధికి దూరమై, మంచికి విరుద్ధంగా సంచరించే మానవుడు ఎవడైనా, అతడు సత్పురుషుల గౌరవం పొందలేడు. అధర్మాన్ని ధర్మవేషంతో ఆచరిస్తూ, దుష్టమార్గాన్ని అనుసరిస్తే, లోకంలో ఎవడైనా గౌరవిస్తాడా? నేను ప్రతిజ్ఞను విడిచి, రాజ్యాన్ని చేపడితే ఎవరికి హితవును ఉపదేశించగలను? అప్పుడు నా మాట వినేవారు ఎవరైనా ఉంటారా? నేనే మార్గం తప్పితే, జనాలు స్వైరసంచారులు అయిపోరా? అతి పురాతనం, శాశ్వతం అయిన రాజధర్మం సత్యస్వరూపమైనది. ఇందులో క్రూరత్వానికి తావులేదు. రాజ్యం సత్యప్రధానం. దేవతలు, ఋషులు కూడా సత్యమే పరమధర్మమని అంగీకరించారు. సత్యమే స్వర్గానికి మూలకారణమని అంటారు. నేను సత్యప్రతిజ్ఞ కలవాడిని. తండ్రి ఎదుట నేను చేసిన శపథం సత్యమైనప్పుడు, ఆ ప్రతిజ్ఞను ఎలా వదిలేయగలను? నువ్వు నాస్తికుడివి. ధర్మచ్యుతుడివి. నీలాంటి వాణ్ణి చేరదీసినందుకు మా తండ్రిని నిందించాలి’ అని రాముడు కోపావేశంతో బదులిచ్చాడు.రాముడి కోపాన్ని గమనించిన వసిష్ఠుడు, ‘రామా! మరణానంతరం మనుషులు కర్మానుసారం స్వర్గ నరకాలకు పోతారని, తిరిగి జన్మిస్తారని జాబాలికి కూడా తెలుసు. నిన్ను తిరిగి అయోధ్యకు రప్పించి, పట్టాభిషిక్తుడిని చేయాలనే ఉద్దేశంతో అలా అన్నాడు’ అని నచ్చజెప్పి, ‘ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజ్యాధికారం స్వీకరించడం తర తరాల ఆచారం. జ్యేష్ఠుడు ఉండగా, కనిష్ఠుడు రాజు కాడు. కాబట్టి, ఇక్ష్వాకు వంశాచారాన్ని మంటగలపకు. అయోధ్యకు బయలుదేరి, రాజ్యాన్ని స్వీకరించు’ అని చెప్పాడు.రాజగురువు అయిన వసిష్ఠుడు స్వయంగా నచ్చజెప్పినా, రాముడు తన ప్రతిజ్ఞను పక్కనపెట్టి, రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. ఇక చేసేదేమీ భరతుడు పరివారంతో కలసి అయోధ్యకు మరలక తప్పని పరిస్థితి ఏర్పడింది.సీతమ్మవారి కోవెలశ్రీలంకలో సీతమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. వనవాసంలో ఉండగా సీతను అపహరించిన రావణుడు ఆమెను ఇదేచోట అశోకవనంలో బంధించినట్లు స్థలపురాణ కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన అశోకవృక్షం కూడా ఉంది. ఆ చెట్టు కిందనే సీతమ్మవారు కూర్చుని ఉండేదని చెబుతారు. ‘సీతా అమ్మన్ కోవిల్’ అనే ఈ ఆలయం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్లోని నువారా జిల్లా కేంద్రానికి చేరువలో ఉంది.→ సాంఖ్యాయన -
ఖురాన్ ప్రస్తావన: ఆరోగ్యానికి ఆలంబన
ఖురాన్లో పలు సందర్భాల్లో మొక్కల ప్రస్తావన వస్తుంది. ఆయా మొక్కల నుంచి లభించే ఫలాలు, పత్రాలు, పుష్పాలు మానవాళికి ఎలా ఉపయోగపడుతాయో దైవగ్రంథం, హదీసులు వివరించాయి. అలాంటి వాటిలో ఆలివ్, ఖర్జూర, ద్రాక్ష, దానిమ్మ, అరటి, నల్ల జీలకర్ర, గుమ్మడి వంటివి ముఖ్యమైనవి.ఆలివ్ : దీని శాస్త్రీయనామం– ఓలియా యురోపియా. ఇది ఓలియేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్ లో జైతున్ అని పిలుస్తారు. ఈ మొక్క గురించి ఖురాన్లో ఆరు చోట్ల ప్రస్తావించారు. ఆలివ్ నూనెలో, ఆలివ్ పండ్లలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి.ఖర్జూరం : దీని శాస్త్రీయనామం– ఫోనిక్స్ డెక్టైలిఫెరా. ఇది అరికేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో నఖ్ల్ అని పిలుస్తారు. ఖర్జూరం లో ఉండే ΄పొటాషియం రక్తపోటును నియంత్రించడంలోనూ, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధక నివారణకు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికీ తోడ్పడుతుంది.దానిమ్మ : దీని శాస్త్రీయనామం– ప్యూనిక గ్రానేటం. ఇది ప్యూనికేసి కుటుంబానికి చెందినది. అరబిక్లో రూమ్మన్ అని పిలుస్తారు. దానిమ్మలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధా΄్యాన్ని, చర్మంపై ఏర్పడే ముడతలనూ దూరం చేస్తాయి. అల్జీమర్స్, చర్మక్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఆస్టియో ఆర్థ్రయిటిస్తో బాధపడేవారికిది అద్భుత ఔషధం.అంజూర : దీని శాస్త్రీయనామం– ఫైకస్ కెరిక. ఇది మొరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో తీన్ అని పిలుస్తారు. దీని పండ్లను, వేర్లను, ఆకులను సాంప్రదాయ వైద్యంలో జీర్ణకోశ, శ్వాసకోశ, హృదయ సంబంధ రుగ్మతలు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.తులసి : దీని శాస్త్రీయ నామం– ఆసిమం టెన్యూ ఫ్లోరమ్. దీనిని అరబిక్లో రైహాన్ అంటారు. ఇది లామియేసి కుటుంబానికి చెందినది. తులసి ఆకులు నాడులకు టానిక్లా పని చేసి, జ్ఞాపకశక్తిని పెం΄పొందిస్తాయి. తులసి కషాయంతో గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసితో మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. తులసి కొలెస్ట్రాల్ను తగ్గించడంతోపాటు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.ద్రాక్ష : దీని శాస్త్రీయనామం – వైటిస్ వెనిఫెరా. ఇది వైటేసి కుటుంబానికి చెందినది. దీనిని అరబిక్లో ఇనబ్ అంటారు. ద్రాక్షగింజల రసం గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, చర్మక్యాన్సర్ను నివారించడంలో, ఇన్ ఫెక్షన్ తో పోరాడడంలో సహాయ పడుతుంది.ఉల్లి : దీని శాస్త్రీయనామం – ఆలియమ్ సెపా. ఇది లిలియేసి కుటుంబానికి చెందినది. ఉల్లిపాయల్లో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు, విటమిన్ ఎ, బి6 , సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిని వాడితే శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకున్నట్లే. మధుమేహం ఉన్నవారికి అది నియంత్రణలోకి వచ్చి.. ఎముకలు గట్టిపడతాయి.ఆవాలు : దీని శాస్త్రీయనామం– బ్రాసిక నైగ్ర. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందింది. వీటిని అరబిక్లో ఖర్దల్ అంటారు. ఆవాలనుంచి తయారు చేసిన ఆవనూనెని కొన్ని సంప్రదాయ చికిత్సలలో ఉపయోగిస్తారు. ఆవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.మిస్వాక్ : దీని శాస్త్రీయనామం– సాల్వో డోరా పెర్సికా. ఇది సాల్వో డేరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో అల్ అరక్ అని పిలుస్తారు. దీని పుల్లలతో దంత ధావనం చేసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడి నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. వీటివేర్లను ఊపిరితిత్తుల సమస్యలకు, ఆకులను దగ్గు, ఉబ్బసం, స్కర్వి వ్యాధి నివారణకూ వాడతారు. బెరడును వెన్నుపోటు, తలపోటు, కడుపునొప్పి నివారణలో ఉపయోగిస్తారు.అరటి : దీని శాస్త్రీయ నామం– మ్యూసా పారడైసియాక. ఇది మ్యూసేసి కుటుంబానికి చెందినది. అరటిని అరబిక్లో తల్హ్ అంటారు. అరటిలో ΄పొటాషియం అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు హైబీపీ, షుగర్, ఆస్తమా, క్యాన్సర్, అజీర్తి వంటి సమస్యలను నిరోధిస్తాయి. అరటి పండ్లలోని కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియకు ఉపకరిస్తాయి. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు, ఫ్యాటీ యాసిడ్స్ను ఉత్పత్తి చేసేందుకు ఇది తోడ్పడుతుంది.నల్ల జీలకర్ర : దీని శాస్త్రీయనామం – నైగెల్ల సటివ. దీనిని అరబిక్ లో హబ్బతుస్ సౌదా అంటారు. ఇది రానన్కులేసి కుటుంబానికి చెందినది. నల్ల జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ను అదుపులో వుంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.డాక్టర్ ఎల్. నాగిరెడ్డి సహాయ ఆచార్యులుశ్రీ కృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, అనంతపురంచాంద్ బాషా, ఉపాధ్యాయులు, తాడిపత్రి -
మానవ హితమే ‘ఈద్’ అభిమతం
రమజాన్ నెల ముగిసిన తర్వాత ముస్లిం సమాజం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం ఈదుల్ ఫిత్ర్. ఏకధాటిగా నెలరోజులపాటు సాగిన ఆధ్యాత్మిక సాధన స్పూర్తితో, మానవీయ విలువలకు నూతన ఆరంభం. ఉపవాసం ద్వారా శరీరాన్ని మాత్రమే కాదు, తన ఆలోచనలను, ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకున్న మనిషి ఆ అనుభూతిని సమాజంతో పంచుకునే రోజు ఈద్. అందుకే ఈ పండుగలో కనిపించే ఆనందం కేవలం ఉత్సవపు ఉల్లాసం కాదు; అది ఆధ్యాత్మికత, దానం, సహోదరత్వం, సామాజిక బాధ్యతల సమ్మేళనం. అందుకే ఈ నెలను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించడం, రాత్రిళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ఖుర్ ఆన్ పఠనం, దానం వంటి ఆచారాలు విశ్వాసుల జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియలా మారుతాయి. ఉపవాసం ద్వారా ఆకలి, దాహం అనుభూతిని స్వచ్ఛందంగా స్వీకరించడం ద్వారా మనిషి తన కోరికలను నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు. అదే సమయంలో పేదసాదల కష్టాలను అర్థం చేసుకునే సానుభూతి కూడా అతనిలో పెరుగుతుంది.ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి జకాతుల్ ఫిత్ర్ లేదా ఫిత్రా. ప్రతి ముస్లిం కుటుంబం తమ శక్తికి తగ్గట్టు పేదలకు దానం చేయడం సంప్రదాయం. దీని వెనుక ఉన్న భావం ఎంతో గొప్పది. సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవీయ బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. పండుగ ఆనందం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలనే భావన ఇస్లాం లోని సామాజిక న్యాయ భావనను ప్రతిబింబిస్తుంది.ఈద్ రోజూ ఉదయం మసీదులు, ఈద్ గాహ్లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు సమాజంలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. వేలాదిమంది ఒకేస్థలంలో చేరి, ధనిక, పేద, పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ప్రార్థన చేయడం సమానత్వానికి ప్రతీక. ప్రార్థన అనంతరం ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అని శుభాకాంక్షలు తెలుపుకోవడం పరస్పర ప్రేమను, క్షమాభావాన్ని వ్యక్తపరుస్తుంది.ఈదుల్ ఫిత్ర్ తాత్వికంగా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రమజాన్ నెలలో మనిషి తనలోని స్వార్థాన్ని తగ్గించి దయ, సహనం, నియంత్రణ వంటి విలువలను పెం΄పొందించుకుంటాడు. ఈ విలువలు కేవలం ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాంతం కొనసాగాలని ఈద్ మనకు గుర్తు చేస్తుంది. నిజమైన ఈద్ అంటే కేవలం ఒక రోజు సంబరం కాదు; రమజాన్ ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక మార్పును జీవితంలో నిలబెట్టుకోవడం.సామాజికంగా కూడా ఈ పండుగ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. చాలా సందర్భాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అపార్థాలు, విభేదాలు కూడా ఈ సందర్భంలో పరిష్కారమవుతాయి. పరస్పరం క్షమించుకోవడం, మళ్లీ దగ్గరవడం ఈ పండుగకు ప్రత్యేకమైన లక్షణం.నిజమైన ఈద్ కొత్త బట్టలు ధరించడంలో కాదు; కొత్త మనసుతో జీవించడంలో ఉంది. ద్వేషం స్థానంలో ప్రేమను, స్వార్థం స్థానంలో దానాన్ని, విభేదాల స్థానంలో ఐక్యతను పెం΄పొందించడమే ఈదుల్ ఫిత్ర్ అసలు ఆత్మ. ఈ ఆత్మను మన జీవితంలో నిలబెట్టగలిగితేనే ఈ పండుగ ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక సందేశం సార్థకమవుతుంది. దైవం మనందరికీ ఈ పర్వదినం స్ఫూర్తిని అందిపుచ్చుకొనే అవకాశం అనుగ్రహించాలని కోరుకుందాం.రమజాన్ నెల మనిషికి ఒక ఆత్మపరిశీలన సమయం. తన జీవితంలోకి ఒకసారి తొంగిచూసుకుని, తన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే కాలం. ఈద్ ఆ ప్రయాణానికి ఒక ఆనందకర ముగింపు. అదే సమయంలో ఒక కొత్త సంకల్పానికి ఆరంభం కూడా. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే చెందిన పండుగ కాదు; అది మానవత్వానికి సంబంధించిన పండుగ. ఉపవాసం ద్వారా నేర్చుకున్న నియంత్రణ, దానం ద్వారా పెరిగిన దయాగుణం, ప్రార్థన ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక బలం – ఇవన్నీ కలిసి సమాజంలో ప్రేమ, న్యాయం, సామరస్యం స్థాపించడానికి మార్గం చూపుతాయి. అందుకే ఈ పండుగ మనకిచ్చే అసలు సందేశం ఎంతో సరళం, కానీ చాలా గొప్పది.– మదీహా అర్జుమంద్ -
షడ్రుచుల సంగమం..!
తెలుగు సంవత్సరాది వెలుగులు విరజిమ్మింది. ఆహ్లాదభరిత వేదికపై ఆత్మీయ ఆహ్వానం అందుకుంది. మూసాపేట రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ ఫేజ్–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ‘ఉగాది’ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అధునాతన నగరంలో అచ్చమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా సంప్రదాయ దుస్తులతో రెయిన్బో వాసులు పాల్గొనడం, షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించడం కనువిందు చేసింది. లలితా, విష్ణు సహస్ర నామ పారాయణలతో మొదలైన ఈ వేడుకలు జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పచ్చడి ప్రసాదం, బొబ్బట్లు, పులిహోరాల పంపిణీతో పూర్తయ్యాయి. లలితా విష్ణు సహస్ర నామ పారాయణంతో పాటు భక్తి గీతాలాపనతో ఉగాది వేడుక ప్రారభమైంది. సుమారు 450 మంది లలితా విష్ణు సహస్ర నామ పారాయణం చేయడంతో పాటు, శ్లోకాలను ఆలపించి ఆధ్యాత్మిక పరిమళాలు అందించారు. గ్రూపు కో–ఆర్డినేటర్ వాణి ఆధ్వర్యంలో సహస్ర నామ పారాయణం జరిగింది. తెలుగులో ఆడిపాడిన చిన్నారులు.. ఆధునిక, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు తెలుగు రుచిని చూపిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన తెలుగులో ‘లేవండిరా ముందుగా ఈ రోజే ఉగాది పండుగ’ అంటూ ఆలపించిన పాట అహూతులను అలరించింది. రామలక్ష్మి ఆమె విద్యార్థుల బృందం ఆలపించిన పాట అతిథులను ఆకట్టుకుంది. పాటలోనే ఉగాది విశిష్టత తెలిపే విధంగా చక్కగా ఉందని అతిథులు ప్రశంసించారు.పరాభవం నుంచి ప్రాభవంలోకి.. ముఖ్య అతిథి, శృంగేరి శారదా పీఠం ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ధర్మమార్గంలో నడిచే వారికి ప్రాభవం అని, అధర్మంలో నడిచే వారికి పరాభవమని, పరాభవం నుంచి ప్రాభవంలోకి రావటమే పరాభవ నామ సంవత్సరమని వివరించారు. మనల్ని అనుగ్రహించి ఆధ్యాతి్మకతకు, సత్య మార్గాన్ని చూపించే సంవత్సరమే పరాభవ నామ సంవత్సరమన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రీల్స్ వదిలిపెట్టి రియాలిటీలోకి రావాలని తెలిపేదే పరాభవం అని అన్నారు. ఈ సంవత్సరం శుభాలు ఎక్కువగా జరుగుతాయని, మిగిలిన ప్రపంచంలో యుద్ధ భయం ఉంటుంది కానీ, భారత దేశానికి ఉండదన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, పశు, వృక్ష సంపద పెరుగుతుందని వివరించారు. పాలకుల్లో చికాకులు పెరుగుతాయి, వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్త పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. అప్పులు చేసి భూములు కొనుగోలు చేయవద్దని, బంగారం, వెండి, రత్నాలు కొనుగోలు చేసే బదులు, కరెన్సీ నోట్లు ఇంట్లో ఉంటేనే మంచిదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి పరాభవం ఉండబోదన్నారు. ఈ సీజన్లో 50 డిగ్రీలకుపైగా వేడి పెరుగుతుందని, అగ్ని ప్రమాదాలు, రోగాలు, కల్తీ ఎక్కువగా జరుగుతాయన్నారు. ఈ సంవత్సరంలో అధిక జ్యేష్ట మాసంతో కలిపి మొత్తం 13 నెలలు ఉంటాయన్నారు. పంచాంగం అంటే విజ్ఞాన భాండాగారం, కొందరు చేసిన తప్పులకు జ్యోతిష్కులను నిందించవచ్చు కానీ, శా్రస్తాన్ని అపహాస్యం చేయవద్దని సూచించారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం సాహితీవేత్త ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి నాగరాజు సంవత్సర పురుషోపాసన అనే అంశంపై ప్రసంగించారు. ప్రకృతిలో వచ్చే మార్పు, ప్రకృతితో కలిసి జరుపుకునేదే ఉగాది అని పేర్కొన్నారు. కాలచక్రాన్ని అనుసరించాలని సూచించారు. ఉగాది పండుగ, సంవత్సర పురుషోపాసన గురించి క్లుప్తంగా వివరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రెయిన్ బో విస్టాస్ రాక్గార్డెన్ అధ్యక్షులు టీఎస్ రెడ్డి, ఉపాధ్యక్షులు కృపాకర్రెడ్డి, తదితర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.అమోఘం.. రుచుల మిశ్రమం..ఈ వేడుకల్లో షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని కుండలలో తయారు చేశారు. అపార్ట్ మెంట్ వాసులు వాణి, జ్యోతి, నిర్మల, అపర్ణ, మాళవిక ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. దీంతో పాటు బొబ్బట్లు, పులిహోర ప్రసాదంగా అందజేశారు. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు ఉన్నట్లుగానే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నీ కలిస్తేనే పరిపూర్ణ జీవితం అవుతుందని ఉగాది పచ్చడి పరమార్థాన్ని మననం చేసుకున్నారు. పిజ్జాలు, బర్గర్ల మధ్య నివసించే నగరవాసులకు షడ్రుచుల పచ్చడి, బొబ్బట్లు సిసలైన రుచులను పంచాయి. (చదవండి: 'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగ జరుపుకుంటున్నామా?) -
'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగను..
భాషాపరంగా యుగాది సరైన పదం. ఉగాది అనే పదం వికృతిపదం. అయితే రెండూ ఒకే అర్థాన్ని బోధించే పదాలే. నిజానికి “యుగాది” అనే పదమే కాలాంతరంలో 'ఉగాది'గా మారింది. సోమకాసురుని నుండి వేదాలను విష్ణువు రక్షించిన రోజు ఉగాది. నూతన కల్పంలో జగత్తు సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజు. ఆరు రుచుల కలయికతో అనారోగ్యాలను అంతం చేసేది ఉగాది. హిందువుల పండుగల సంప్రదాయానికి మొదలు ఉగాది. వరాహమిహిరుడు ఈ ఉగాది నాడే పంచాంగాన్ని పరిచయం చేశాడని అంటారు. శ్రీరా ముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు మొదలైన వారు ఉగాదినాడే పట్టాభిషిక్తులైనారని ఆర్యులు చెబుతారు. సంవత్సరాది నాడు ప్రజలు తెల్లవారక ముందే నిద్ర లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవానికి పూజలు చేసి, షడ్రుచుల పచ్చడిని ఆరగించాలి. నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం చేయాలి.తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ,పంచాగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్.తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగ శ్రవణం వల్ల గంగా స్నానంతో సమానంగా పుణ్యం, పురు షార్థం లభిస్తుందని పై శ్లోకం చెబుతున్న భావం. కొత్త సంవత్సరంలో గ్రహ, రాశిఫలాల్లో, నామ నక్షత్రాల్లో తేడా వస్తే దోషనివారణ కోసం శాంతి హోమాలు, వ్రతాలు, పూజలు చేసి సుఖశాంతులతో ప్రజలు జీవించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. నవగ్రహాల్లో సూర్యుడు తేజస్సును, చంద్రుడు భోగభాగ్యాలను, కుజుడు శుభాలను, బుధుడు బుద్ధి వికాసాన్ని, గురుడు జ్ఞాన విత్తాన్ని, శుక్రుడు కార్యసిద్ధిని, శనీశ్వరుడు దుఖ వినాశాన్ని, రాహువు సంతోషకరమైన రాణింపును, కేతువు చెప్పుకోదగి నంత గొప్పదనాన్ని కలిగిస్తారని విద్వాంసులు చెబుతారు.ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కలిగించేది ఉగాది పచ్చడి. శాస్త్రవచనాల్లో దానికి నింబకుసుమ భక్షణం, అశోకకళికా ప్రాశనం అనే పేర్లు కూడా ఉన్నాయి. తీపి, ఉప్పు, చేదు, వగరు, పులుపు, కారం సమపాళ్లలో కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. తీపికి బెల్లం, ఉప్పునకు ఉప్పు, చేదుకు వేపపూత, వగరుకు మామిడి ముక్కలు, పులుపునకు చింత పండు, కారమునకు మిరియాలు ఉగాది పచ్చడిలో వాడు తారు. వీటికి తోడు తమతమ ఇష్టాలను బట్టి జీలకర్ర, అరటిపండ్లు, ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటివి కూడా కలిపి గొప్ప ఔషధంగా ఆరగిస్తారు. ఈ పచ్చడిని చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు ఒక పక్షం రోజులు సేవిస్తే వాత, పిత్త, కఫములకు చెందిన రోగాలన్నీ పటాపంచలవుతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్టేతరులు సైతం సంవత్సరాది ఉత్సవాలను జరుపుకుంటారు. తమిళులు, మళయాళీలు, మరాఠీలు, సిక్కులు ఈ పండుగను జరుపుకోవడం విశేషం.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
ప్రతి రుచీ ఆస్వాదిస్తూ...
ఈ కాలపు జనరేషన్కి ఉగాది గురించి ఏం తెలుసు? అనేవారున్నారు. ఈ డిజిటల్ యుగంలో బిజీగా ఉండే నవతరానికి తెలుగింటి సంప్రదాయం ఎంత పరిచయం? తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్టూడెంట్లు కొందరిని పలకరించింది సాక్షి ఫ్యామిలీ. వారి స్పందన ఇక్కడ ఉంది. చదివాక మీరంటారు మన పిల్లలు తెలుగుదనాన్ని కొనసాగిస్తున్నారనీ... తెలుగుదనానికి అద్దం పడుతున్నారనీ.... యుగం + ఆది, ఒక కొత్త యుగానికి ఆరంభం,బ్రహ్మదేవుని సృష్టికి ఆయువు పోసిన క్షణం,కాలం మొదటి అడుగు వేసిన సమయం.మామిడి తోరణాల అలికిడి,ప్రకృతితో మన అనుబంధానికి గుర్తు.పంచాంగ శ్రవణ జ్ఞాననాడి,భవిష్యత్తు అనే కాలాన్ని గౌరవించే గుర్తు.చిగురించిన కొమ్మలు, వికసించిన పువ్వుల సందడి,మళ్ళీ మొదలుపెట్టమని ఒక ఆశల పల్లకికి గుర్తు.కొత్త వస్తువుల హడావిడి,కొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి గుర్తు.బ్రహ్మదేవుని సృష్టిని మొదలుపెట్టిన శుభముహూర్తం,మన తెలుగు సంస్కృతికి ఒక మొదటి అధ్యాయం,ప్రతి గుండెలో వెలుగు నింపే ఆనందం, ఉగాది ఉదయం,ఇంటిని శుభ్రం చేయడం మాత్రమే కాదు,మన మనసులోని బాధల్ని శుభ్రం చేయడం.ఉగాది పచ్చడిలో ఉన్న రుచులు,తీపి, కారం, పులుపు, చేదు, ఉప్పు, వగరు,మన జీవితంలోని భావాలు,ప్రతి రుచిని అంగీకరించండి మీరు.ఉగాది అంటే మారుతున్న కాలం కాదు,మారుతున్న మనసు, జీవితం,కొత్త ఆశ, కొత్త ప్రయాణం,అది అనుసరించడం ముఖ్యం.అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.– చిక్కాల షర్మిలనవ సంజీవనిఉగాది అంటే ప్రపంచానికి తొలి ఉషస్సు.మానవజాతి మనుగడకు ్రపాణం పోసిన నవసంజీవని ఉత్సాహాల ఉషస్సులతో మదిలోని ఇంద్రనస్సులా ఊయలలూగే ఊసులతో ఆకాశ వీధిలో అందాల జాబిలిలా సంవత్సరంలో వచ్చే తొలి చంద్రరేఖ నా ఉగాదిఉగాది మన ధర్మం, అదే మనకు ధర్మపథం.వసంత నవరాత్రుల రాక ప్రకృతిని పూజించే సుషుమ్న కాంతి రేఖ నా ఉగాది.షడ్రుచుల సమ్మేళనం నా ఉగాది, భవ్య పదం నా ఉగాది పరాభవాలను పారద్రోలి విజయానుభవాలను కలుగజేసే నా ఉగాది. – దేవి సరస్వతికాలం చెప్పే సూచిక...ఉగాది అనేది కేవలం కొత్త సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితంలోని అనేక భావోద్వేగాలు, అనుభవాల మిశ్రమమని గుర్తు చేసే ఒక అందమైన సందేశం. ఉగాదికి ప్రత్యేకత ‘ఉగాది పచ్చడి‘. ఆరు రకాల రుచులతో తయారు చేసే ఔషధం. ప్రతి రుచి జీవితంలోని ఒక్కో భావాన్ని సూచిస్తుంది. తీపి ఆనందానికి, చేదు బాధకు, పులుపు ఆశ్చర్యాలకు, కారం కోపానికి, ఉప్పు భయానికి, వగరు సవాళ్లకు సూచికగా ఉంటుంది. ఉగాది మనకు జీవితం ఎప్పుడూ తీపిగా ఉండదని, కానీ ప్రతి అనుభవం మనలను మరింత బలంగా, జ్ఞానవంతులుగా మార్చుతుందని నేర్పుతుంది. ఇది గత సంవత్సరపు తప్పులు, బాధలు, ఆందోళనలను వెనక్కి వదిలేయాలని కూడా మనకు గుర్తు చేస్తుంది. మనమందరం కలిసి సంతోషంగా ఉండాలని, ఉగాదిని ఆనందంగా జరుపుకోవాలని, మంచి పనులు చేయాలని కాలం చెప్పే సూచిక. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని, మామిడి ఆకులతో అలంకరిస్తాం, కొత్త బట్టలు ధరించి, శాంతియుతమైన, విజయవంతమైన సంవత్సరానికి నాంది కావాలని ప్రార్థిస్తాం. ఈరోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు అని చాలా మందికి నమ్మకం. ఉగాది కేవలం క్యాలెండర్ మార్పు కాదు ఇది విశ్వం తన ప్రయాణాన్ని ప్రారంభించిన క్షణాన్ని సూచిస్తుంది. ఉగాదికి మరో ప్రత్యేక సంప్రదాయం ‘పంచాంగ శ్రవణం’. ఇందులో పండితులు సంవత్సర ఫలితాలను చదివి వినిపిస్తారు. ఇది కాలం చక్రంలా తిరుగుతుందని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు ఇది ఆత్మపరిశీలన, ఆశల పునర్జన్మకు సూచిక. – బొందుగుల వర్షిణి రెడ్డిప్రకృతికి దగ్గరగా! తెలుగు తనాన్ని మరింత అందంగా చూపే పండగ ఉగాది. పసుపు రాసిన గడపలు, మామిడితోరణాలు.. ప్రకృతే మన ఇంటికి వచ్చిందా అనిపించే పండగ ఉగాది. ఎంతటి మోడర్న్ వారైనా సంప్రదాయ దుస్తులతో అందంగా అలంకరించుకుంటారు. కొత్త కుండలో ఒక్కటిగా కలిపిన ఆరు రుచుల పచ్చడి కుటుంబంలో అందరినీ ఐక్యంగా ఉండమని చూపుతుంది. అంతేకాదు, ఆరు రుచులు కలిసిన ఏడవ రుచి కుటుంబ సభ్యుల మధ్య నిండిన ప్రేమను పరిచయం చేస్తుంది. వసంతకాలంలో కొత్త చిగుళ్లు తిని కూసే కోకిలల గొంతులు ప్రకృతికి దగ్గరగా ఉండమని చెబుతాయి. సంతోషంగా మన జీవితాలు సాగాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, అది ప్రకృతి ద్వారా మనకు లభిస్తుందని వేప, మామిడి, చెరకు,.. వివిధ రకాల చెట్ల గొప్పతనాన్ని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్నీ మనకు తెలియజేస్తుంది. నిరుత్సాహంగా అనిపించే రోజుల్లోకి కొత్త ఆశల చిగుళ్లను మోసుకువచ్చేది ఉగాది. – లాస్య దేశ్ముఖ్గెలుపే కాదు చేదు కూడా! ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయి. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఈ ఆరు రుచులు మన జీవితంలోని ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, భయం, సవాళ్లను సూచిస్తాయి. ఈ పచ్చడి మనకు జీవితంలో అన్ని రకాల అనుభవాలు ఉంటాయని తెలియజేస్తుంది. ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసుకొని, నూనె, నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, దేవుడిని పూజిస్తాం. ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని. ఈ ఉగాది కొత్త ఆశలకు, ఆనందానికి, జీవితంలో కొత్త ప్రారంభాలకు నాందిగా నిలవాలని, బాగా చదువుకోవాలని, ఉన్నతంగా జీవించాలనే ఆశతో ఉండాలి. ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఉగాది పచ్చడిని గుర్తుతెచ్చుకొని, తిరిగి ఆశను నింపుకోవచ్చు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ అన్ని విధాల గెలుపునే కాదు చేదు అనుభవాలను కూడా ఇస్తుంటుంది. అన్నింటినీ సమానంగా తీసుకుంటూ, ఉత్సాహంగా జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. విద్యారంగంలో మనమంతా నూతనోత్సాహంతో, సరికొత్త ఆలోచనలతో మరింత సృజనాత్మకతతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. – మద్ది తనిష్కారెడ్డిఅన్నీ సమానంగా...తెలుగు ఇంటికి ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన ఆరంభం. ఆశ, కృతజ్ఞత, విశ్వాసంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ప్రత్యేకమైన క్షణం. మా ఇంట్లో ఉగాది చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధంతో నిండిన అనుభూతి. పండగ రోజున మేమంతా అత్యంత ఇష్టమైన సంప్రదాయ దుస్తులను ధరిస్తాం. ఆడవాళ్లు పట్టు చీరలు, సంప్రదాయ ఆభరణాలతో ముస్తాబవుతారు. ఇంటిని పూలతో, మామిడి ఆకులతో అందంగా అలంకరిస్తాం. పూజ గదిని శుభ్రం చేసుకుంటాం. ఉగాది పచ్చడి తయారుచేస్తాం. ఈ పచ్చడి తయారీలో ఇంటిల్లిపాది పాల్గొంటాం. వేప ఆకులు, బెల్లం, చింతపండు రసం, మామిడి ముక్కలు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తాం. ఇందులోని ప్రతి రుచి జీవితంలోని విభిన్న భావాలను సూచిస్తుంది. సంతోషం, బాధ, ఆశ్చర్యం, కోపం, సమతుల్యత, మనం వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అందమైన సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది. తర్వాత పంతులుగారు చెప్పే పంచాంగం వింటాం, ఆయన మాటలు వచ్చే సంవత్సరానికి దారి చూపుతూ, శుభాశయాలను కలిగిస్తాయి. తర్వాత మా పండుగలో ముఖ్యమైన భాగంగా అందరం కలిసి వంట చేయడం. మామిడి పప్పు, మామిడికాయ పచ్చడి, పూరీ కుర్మా, రసం, మామిడికాయ పులిహోర, బొబ్బట్లు వంటి వంటకాలు తయారు చేస్తాం. మేం మా ఇంట్లో ప్రతి యేటా దాదాపు ముప్పై మంది కలిసి పండుగను జరుపుకుంటాం. – రచిత లింగానిర్వహణ: నిర్మలారెడ్డి -
ఆరు రుచుల పండుగ
ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. ఈ రుచులు లేకపోతే స్వాదిష్టత లేదు. ఈ అనుభూతులు లేనిది జీవితం కాదు. అందుకే ఉగాది మనల్ని అన్ని రుచులతో అన్ని అనుభూతులతో అనుదినాన్ని సెలబ్రేట్ చేసుకోమని అంటున్నారు సాహితీవేత్త జి.వి. పూర్ణచందు‘రుచి’లో సంస్కృతి ఉంది. సౌందర్యం ఉంది. అనుభూతి ఉంది. ఆనందం ఉంది. ‘రుచించటం’ అంటే కమ్మగా మనసుకు అంగీకార యోగ్యంగా, ఙ్ఞానదాయకంగా ఉండటం అని! ఉగాదిని ఆరు రుచుల పండుగగా భావించటం వలన రుచులు మన శరీరంపై, మనసుపై, మస్తిష్కంపై కలిగించే ప్రభావాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం అవుతుంది. ఉగాది నాలుకకు, మనసుకు, మెదడుకు సంబంధించిన రుచుల సమ్మేళనంగా జరిగే పండుగ. తెలుగులో ‘ఉగము’ అంటే ఆయువు. ‘ఆద’ అంటే కష్టం. ‘ఆదట’ అంటే ప్రేమ, తృప్తి. కాబట్టి ‘ఉగాది’ సుఖదుఃఖాల్ని, నిర్మాణ విచ్ఛిన్నాల్ని, తీపి పులుపుల్ని సమన్వయం చేసుకుంటూ సాగిపోవాలని, జీవితాన్ని ప్రేమించి సంతృప్తి పొందాలని, ఉన్నతికి మెట్లు పరుచుకోవాలని మనకు సూచిస్తోంది. ఉగాది నుండి ఉగాది దాకా జరిగే పరిణామాల్ని, ఎదురయ్యే అవరోధాల్ని గోచార రీత్యా అంచనావేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు తెలుగువాడు!మనసు రుచులు రుచులు ఆరు... తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఒక్కో రుచికీ ఒక్కో ప్రభావం ఉంటుంది. ఈ ఆరు రుచులూ శరీరానికే కాదు మనసుకూ మెదడుకు కూడా పోషణ నిస్తాయి. ఆహారంలోని ఆరు రుచులే సత్త్వ రజస్తమో గుణాలను ప్రేరేపిస్తున్నాయని భగవద్గీత పేర్కొంది. ‘యథా అన్నం తథా మనః’ ఆహారం ద్వారానే ఆత్మాభివృద్ధి, మానసిక ఉన్నతి సిద్ధిస్తాయి. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని, మన మనస్తత్వాన్ని, జీవన ధోరణిని నిర్ణయిస్తుంది. భోజనం అనేది కడుపు నింపి పోషించటానికే కాదు, అది మానసిక పరిపక్వతకు కూడా కారణం అవుతోంది. నోటికైనా, మనసుకైనా, మెదడుకైనా రుచులు ఆరే! జీవితానికి ఆనందాన్ని, సంప్రదాయాన్ని, సామూహిక అనుభూతిని అందించేది ఆరు రుచులతో కూడిన ఆహారం. ఉగాది పండుగ ఈ ఆరు రుచుల ప్రాధాన్యతని నొక్కి చె΄్తోంది.త్రిగుణాత్మక రుచులుమనిషి మెదడులోని ఆలోచనలను తమోగుణం నియమిస్తే, రజోగుణం ప్రవర్తింపచేస్తే, సత్త్వగుణం నియంత్రిస్తుందని మన సిద్ధాంతం. మెదడు రుచులకు కూడా ఇలాంటి గుణాలే ఉంటాయి. ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. వీటిలో ఏ రుచిని వదిలి జీవించగలం...? నోటి రుచుల్ని, మనసు రుచుల్ని సమ్మేళనం చేసుకోగలిగితే శరీరమూ మనసు, ఇంద్రియాలతో పాటు ఆత్మ కూడా సంతృప్తి చెందుతుంది. ఉగాది పండుగ ఆరు రుచులకూ అంతటి ప్రాధాన్యత నిచ్చింది.నోటి రుచులుతీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు.... ఈ 6 రుచులు ఒకదానితో ఒకటి వివిధ నిష్పత్తుల్లో కలవటం ద్వారా 63 రుచులు అవుతాయి. ఈ 63 రుచుల మర్మాన్ని తెలుసుకుని, ఆహార పదార్ధాల్ని వండుకోగలిగితే ఆహారం ఆరోగ్యదాయకంగా పోషకంగా ఉంటుంది. భారత దేశం మొత్తంలో తమ ప్రధానమైన ఆహారాన్ని అన్నం అని నోరారా పిలిచేది ఒక్క తెలుగువారే! మనకు అన్నం అంటే ఆరు రుచులతో కూడిన పదార్థాలను ఆస్వాదిస్తూ తినటం అని! అలా మనల్ని ఆరు రుచులకి అంకితం చేసింది ఉగాది! ఈనాటికీ ఉగాది ప్రబోధం ఆరు రుచుల్ని విడవొద్దనే! ఉగాది పచ్చట్లో వేపపూతని కూడా చేర్చటం ద్వారా ఆహార ఔషధ ప్రాధాన్యతని ఉగాది గుర్తు చేస్తోంది! -
కొత్త తరం ఉగాది స్వరం
ఉగాదంటే వాకిట్లో పూల రుతువుచిగుర్లేసే తీవెల నుండి... విప్పారే పూవుల నుండి... కోయిలమ్మల గొంతుల నుండీ... చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి... కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి. ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసే రోజు. కోయిల గొంతులో సంబరం వంటి ఈ తెలుగువారి పండుగపై కవయిత్రి మానస చామర్తి ఏమంటున్నారో తెలుసుకుందాం...ఉగాది చాలా నెమ్మదైన పండుగనిపిస్తుంది నాకు. సంక్రాంతికి ఉన్నట్టు పెద్ద ఆర్భాటముండదు. దసరా దీపావళులకున్నట్టు సందడీ, సెలవులూ ఉండవు. పైపెచ్చు పిల్లల పరీక్షల కాలం. ఒక్కటంటే ఒక్కటే రోజుకు సెలవు. అయినా అది కాదు లెక్క. విరబూసే పూల ఋతువు వాకిట్లో కనపడుతున్నప్పుడు, గుప్పెడు గుప్పెడు ప్రాణాలు గొంతు విప్పి ఉదయాలను మేల్కొల్పుతున్నప్పుడు, క్యాలెండర్ కన్నా ముందు హృదయానికే తెలుస్తుంది, ఈ కాలమేదో ప్రత్యేకమని. ఏడాది మొత్తానికీ ఇది పండుగకాలమని. అందుకే గీతలో కృష్ణుడు కూడా, తాను ఋతువులలో వసంతాన్నని చెప్పుకున్నాడు (ఋతూనాం కుసుమాకరః). ఆ వసంత ఋతువు, చైత్ర మాసపు తొలిరోజునే మనం ఉగాదిగా పిలుస్తున్నాం. చిగుర్లేసే తీవెల నుండి, విప్పారే పూవుల నుండి, కోయిలమ్మల గొంతుల నుండీ చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి, కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి! ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసుకునే సందర్భం. రేగిపళ్ళు, పసిడితోరాలు, పానకం వడపప్పులు, పుస్తకాల మీద పసుపు ఓంకారాలు, బొమ్మల కొలువులు, గోంగూరకాడలు...ఒక్కో పండక్కీ జతపడే ఆనవాయితీ ఒకటుంది మనకి. ఉగాది అంటే అట్లా గుర్తొచ్చేవి మరీ ముఖ్యంగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.ఏడాది పొడుగునా అన్నీ దొరికే ఈ కాలంలో కూడా ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజునే దొరుకుతుంది. నచ్చి, ఇంకోసారి చెయ్యమని మారాం చేస్తే, ఇది ఈ ఒక్కరోజే తినాలని ఆ పసి్రపాణాన్ని బుజ్జగించిన అమ్మ గొంతు చెవుల్లో ఇంకా అట్లానే వినపడుతోంది. వేపకొమ్మల నుండి వేప పూవులను సాధించుకుని, తెల్లటి పల్చటి రేకులను మాత్రం జాగ్రత్తగా వొలిచి ఆ పచ్చడి గిన్నెలో కలపడం నా పని. చిన్నప్పుడంతా ఉగాది రోజు ఉదయాన్నే ఎవరో పుణ్యాత్ములు ఇంటింటికీ తిరిగి గుమ్మాల దగ్గర వేపకొమ్మలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇంటికొకరు చొప్పున చెట్లెక్కి వేపకొమ్మలు విరిచే శ్రమను తప్పించడమన్నమాట. కావాలా? అని అడగడం కూడా ఉండేది కాదు. వేప పూరేకులు వొలిచి, పొట్లాలు చుట్టి, రేటు కట్టి అమ్ముతున్న ఈ రోజుల్లో నిలబడి చూస్తే, నా చిన్నప్పటి ఊరికీ, ఆ వేపగాలికీ చాలా దూరం వచ్చేశాననిపిస్తోంది. రాజపూజ్యమూ– అవమానమూ, ఆదాయమూ వ్యయమూ, పుట్టి బుద్ధెరిగాక ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ఇవి జంటగా నాకు బాగున్న దాఖల్లాల్లేవు. అయినా పంచాంగ శ్రవణమంటే చెవులప్పజెప్పి కూర్చోవడమే తెలుసు. మానవ సహజమైన ఆశ ఒకటి, ఎవరేమి చెప్పినా అంతా మంచే జరగనుందని నమ్మబలికేది. ఆ అద్భుతాల కోసం ఏడాది పొడుగునా ఎదురుచూడటమే జీవితమనిపించేది. కొత్త సంవత్సరం, కొత్త ఋతువు, కొత్త మాసం...మట్టి పలక మీద నీళ్ళు జల్లి, శ్రద్ధగా తుడిచి మళ్ళీ నచ్చినవేవో రాసుకోమన్నట్టు– కొత్త ఉగాది. జనవరి ఒకటికి రాసుకుని మర్చిపోయిన కలలకి మళ్ళీ కాస్త కదలిక వచ్చే రోజు. మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త నియమాలతో కొత్త జాబితాలు తయారు. మళ్ళీ నిండు వాగ్దానమై చేతుల్లో పడ్డట్టుండే జీవితం. ఆరోగ్యంగా మేలుకునే ప్రతిరోజూ మనిషికి దొరికే కొత్త అవకాశమే కానీ, ఉగాది మాత్రం వాగ్దానమనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే చాలు. అడుగు బయటపెడితే చాలు పూలు, సీతాకోకల రంగుల తేజస్సు, విరిసే మల్లెల పరిమళం, కోయిల గొంతులోని సంబరం – అయాచితంగా మనిషికి బట్వాడా అయిపోతాయని నాకనిపిస్తుంది. ఆ కాస్త వ్యవధి, ఆ కాస్త ప్రయత్నం ఆశించగలమా ఈ హడావుడి జీవితాల నుండీ, అన్నది ప్రశ్న. ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాదంతా అదే చేస్తామన్న అమాయకపు నమ్మిక ఒకటి ఉండేది. అందుకని మంచి మాటలే మాట్లాడటం, మంచిపనులే చెయ్యడం, ఇష్టమైన వాళ్ళని కలవడం, కలిసి, ఏడాదంతా మనదేనని చెప్పుకోవడం... ఎదిగే క్రమంలో ఎక్కడో పారేసుకున్నాను ఈ అందమైన విశ్వాసాన్ని. సాయంకాలపు నడకల్లో మామిడిచెట్లు కనపడితే ఇప్పుడు చూపు ఆగిపోతోంది. ఆ పూతవేసిన లేతమావి శోభ కాళ్ళను కట్టిపడేస్తోంది. పక్క వీధిలో ఉండే స్నేహితురాలొకరు, ఈ ఏడాదికి మొదటగా పూశాయంటూ దోసెడు మల్లెలు చూపించారు. ఎగబీల్చిన పరిమళం నా ఊపిర్లో కలిసిపోయింది. గుత్తులు గుత్తులుగా వాకిట్లో ఏవేవో పూవులు. ఆ పూల మధువు కోసం పూటా కొందరు కొత్త అతిథులు. ‘ఎవరు వారు వచ్చేరు? పూవుల తేరుపై; చైత్ర రథంలోన శ్యామపత్రపథంపైన, ఎవరా వచ్చేది?’ అని ప్రశ్నించి, అది ఉగాది అది ఉగాది అంటారు కృష్ణశాస్త్రి. ఉగాదితో పాటు వచ్చే ఈ అతిథులను చూస్తే నాకైతే ‘రొద సేయకే తుమ్మెదా...‘ అని పాడాలనిపిస్తుంది. నెలల తరబడి నీళ్ళు పోస్తూ ఆశగా చూసినన్నాళ్ళూ పూలు రాల్చని మొక్కల మీదకి, మొగ్గలు మొదలవుతూనే తుమ్మెదల తాకిడి. ఆ పూల మెత్తదనాన్ని తాకి చూసే వీలైనా లేకుండా మత్తుగా ఆ పూరెమ్మల మీదే తూగుతూ కనపడతాయ్. ‘ఈ పూల ఋతువంతా ఈ తేటిదో... ఈ తోటమాలిదో...’ అన్న సినీకవి సందేహం ఇప్పుడు నాది కూడా. -
ఉగాది పండుగ సందేశం ఇదే!
తెలుగు వారి పండుగల చిట్టాలో ఉగాది ముఖ్యమైనది. పూర్వ కాలంలో దీనినే ‘యుగాది’గా పిలిచేవారు. అంటే యుగానికి ఆదిగా దీనికి నిర్వచనం. ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటిన ప్రారంభం అవుతుండగా, మన తెలుగు సంవత్సరాది చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే ఈ పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు వరుసగా పర్వదినాలు వస్తాయి. రానున్న సంవత్సరాన్ని పరాభవ నామ సంవత్సరంగా వ్యవహరిస్తారు.శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. రుతువుల్లో మొదటిదైన వసంతం మనోహరమైనదీ, ఆహ్లాదకరమైనదీ. వసంత రుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే అంటోంది బ్రహ్మపురాణం. రామ పట్టాభిషేకం జరిగిందీ, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ, కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు.ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలి మాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ, ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్ర శుద్ధ పాడ్యమినే నూతన సంవత్సర ఆరంభ దినంగా, కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకొంటారు.ఉత్కంఠ గొలిపే సంవత్సర ఫలితాలను, కందాయ ఫలాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం ఉగాది నాటి ముఖ్య వేడుక. కొత్త చిగుళ్లతో, రంగురంగుల పూలతో, పరిమళాల పన్నీరుతో కొమ్మకొమ్మకీ మామిడి తోరణాలు, కోయిల పాటలు వసంతానికి పచ్చని గురుతులై ప్రాణికోటికి శుభం పలుకుతున్నాయి. షడ్రుచుల ప్రసాదం కోసం మామిడి పిందెలు, వేపపూతలు సిద్ధంగా ఉన్నాయి.అన్ని రుచులు సమానంగా ఆస్వాదించాలనీ, అన్ని అనుభవాలు కలిస్తేనే సంపూర్ణ జీవితమనే సందేశాన్ని ఉగాది పచ్చడి మానవాళికి అందిస్తోంది. సంవత్సరమంతా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖ సంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్విక సందేశం ఉగాది పండుగలో ఉంది.– నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ -
ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!
ఉగాది.. తెలుగు ప్రజల కొత్త ఏడాదికి ప్రారంభం. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే పనులు ఏడాది మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుందని పెద్దలు, పండితులు చెప్తారు. అందుకే ఉగాది రోజు కొన్ని శుభకార్యాలు చేయడం ఆచారంగా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, సాంప్రదాయాలు చేయడం వల్ల ఆ ఏడాది మొత్తం శుభంగా ఉంటుందనేది భక్తుల నమ్మకం.ప్రభాత వేళే మేల్కొనడం – బ్రహ్మ ముహూర్తంలో లేచి, తైలస్నానం (నువ్వుల నూనెతో స్నానం) చేయడం శ్రేయస్కరం.కొత్త బట్టలు ధరించడం – కొత్త ఆరంభానికి సంకేతంగా, ఈ రోజు అందరూ కొత్త బట్టలు ధరించి ఉగాదిని ఆహ్వానిస్తారు.వేప పచ్చడి సేవించడం – తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచులను కలిపి తయారుచేసిన ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలను సూచిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.పంచాంగ శ్రవణం – ప్రతి ఉగాది రోజున కొత్త సంవత్సర ఫలితాలను తెలుసుకునేందుకు పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం ఉత్తమం. మినపప్పు , కందిపప్పు, శెనగపప్పుతో చేసిన పదార్ధాలు స్వీకరించాలి, స్వయంపాకంగా దానం ఇవ్వాలి.బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. కుదిరితే అన్నదానం చేయాలి. జలదానం చేయాలి. తల్లిదండ్రులకు భక్తితో నమస్కరించాలి, భార్యను ప్రేమతో చూచి కుదిరితే గాజులు కొనిచ్చి /కొనిపెట్టి , కుంకుమ బొట్టు పెట్టి ఆమెను దేవతగా భావించాలి. తద్వారా పార్వతీదేవి యొక్క ఆశీస్సులు పొందగలము. గురువునకు ఉగాదినాడు 3 ప్రదక్షిణలు చేసినవారు, 3 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. లక్ష్మీదేవిని పూజించి వ్యూహలక్ష్మీ మంత్రమును జపించుకోవటం, ఈశ్వరునికి అభిషేకం చేసుకోవటం శ్రేష్ఠం. పంచాంగ శ్రవణం చేయండి, కుదిరితే పంచాంగం లేక మంచి పుస్తకాలు దానం చేయడం మరింత ఉత్తమం. ఆలా చేస్తే పిల్లల యొక్క విద్య వృద్ధి చెoదుతుంది. పసుపు కుంకుమలు దానం ఇవ్వండి. బూరెలతో కూడిన భోజనము చేస్తే భూరి సంపదలు ఇస్తాడు పరమాత్మ. కోపం వదిలి, అన్నీ మంచి పలుకులు పలుకుదాము, ఈ నూతన సంవత్సరం సకల శుభాలను పొందుదాం... ఇవేగాక చాలామంది ఉగాది పండుగ నాడు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయడం వంటివి చేస్తుంటారు. ఇలా ఎందకు చేస్తారు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక రహస్యాలు ఏంటంటే.విజయ ప్రతీకగా..నూతన సంవత్సర ఆరంభం (విజయ ప్రతీక)... తెలుగు రాష్ట్రాలలో ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం, ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. కాషాయ రంగు త్యాగానికి, పవిత్రతకు, ధర్మానికి చిహ్నం. కొత్త సంవత్సరం అంతా ధర్మబద్ధంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఇంటిపై ధ్వజాన్ని ఎగురవేస్తారు.చారిత్రక నేపథ్యం (విజయ సంకల్పం)... చారిత్రక కోణంలో చూస్తే, ఈ రోజును విజయ దినంగా కూడా భావిస్తారు. శాలివాహన చక్రవర్తి శకులను జయించి 'శాలివాహన శకం' ప్రారంభించిన శుభసందర్భం ఇది. ధ్వజం అనేది విజయానికి గుర్తు. ప్రతి ఇంటిపై ఈ జెండాను ఉంచడం ద్వారా ఆ కుటుంబం రక్షణ, ఐక్యతను చాటుతారు.ఆధ్యాత్మిక అర్థం... కాషాయం అంటే సూర్యోదయ కిరణాల రంగు. ఇది చీకటిని (అజ్ఞానాన్ని) తొలగించి వెలుగును (జ్ఞానాన్ని) ప్రసాదించే రంగు. హిందూ సంప్రదాయంలో జెండాను 'కేతువు' అని పిలుస్తారు. ఇంటి పైన జెండా ఎగురవేయడం వల్ల దుష్టశక్తులు దరిచేరవని, దైవ రక్షణ ఉంటుందని భక్తుల నమ్మకం.పండుగ అలంకరణలో భాగం...సాధారణంగా ఉగాదినాడు గుమ్మాలకు మామిడి తోరణాలు, వేప రెమ్మలతో పాటు ఇంటి కప్పు పైన లేదా బాల్కనీలో కాషాయ జెండాను కడతారు. ఇది ఇంటికి ఒక పవిత్రమైన రూపాన్ని ఇస్తుంది. ధ్వజం కట్టేటప్పుడు జెండా శుభ్రంగా, చిరగకుండా ఉండాలి.సాధారణంగా దీనిపై 'ఓం' కారము లేదా హనుమంతుడి చిహ్నం ఉంటుంది. జెండాను ఎత్తైన ప్రదేశంలో గాలికి రెపరెపలాడేలా కట్టడం శుభప్రదంగా భావిస్తారు.(చదవండి: పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!) -
పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!
తెలుగు వారి నూతన సంవత్సరం, పరాభవ నామ సంవత్సరం మార్చి 19, 2026న ప్రారంభం కాబోతుంది. అయితే చాలా మంది సంవత్సరం పేరు చూసి భయపడుతున్నారు. ఇదే సంవత్సరంరా బాబు..అసలు బాగుంటుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పేరే పరాభవ నామ సంవత్సరం అంటే అన్ని పరాభవాలే, అవమానాలేనా అని ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ పరాభవ నామ సంవత్సరం అంతరార్థం ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.మనిషిలో ఉన్న 'అహంకారం', 'గర్వం', 'స్వార్థం' పరాభవం పాలు కావడాన్ని (ఓడిపోవడాన్ని) ఇది సూచిస్తుంది. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించి, వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది. అహంకారంతో విర్రవీగే పాలకులకు, వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుంది. కానీ... వినయంతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో పరాభవ నామ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం ఉగాది పచ్చడి కూడా విలక్షణమైనదిగానే పరిగణిస్తారట. ఎందుకంటే.. ఆరు రుచుల తోపాటు ప్రతికూలత అనుకూలత అనే రెండింటిని సమానంగా చూపుతుంది. ఎవరు అయితే సవాళ్లను అధిగమించి, సహనంతో ముదుకు సాగుతారో వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుందంట. అలాగే సంవత్సరం ఫలితాలు అనేవి కేవం కొత్త ఏడాది పేర్లపైనే ఆధారపడి ఉండవు, ఇవన్నీ కూడా కర్మ, ప్రయత్నం, ధర్మం, భక్తి ఆధారంగా మారతాయి. కానీ ఈ పేర్లు కేవలం మీకు ఒక సూచను ఇస్తాయని వారు తెలుపుతున్నారు.(చదవండి: చైత్రమాసం విశిష్టత..! తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..) -
భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు
ఆ మణికంఠుని అపార కృపాకటాక్షాలతో, అత్యంత పవిత్రమైన మీనమాస పూజలు, శబరిమల ఉత్సవం 2026 కొరకు అయ్యప్ప సన్నిధాన ద్వారాలు తెరుచుకున్నాయి. "స్వామియే శరణం అయ్యప్ప" అనే నామస్మరణతో ఆ దివ్య దర్శనానికి తరలి వెళ్దాం.మీనమాస పూజల షెడ్యూల్నడ తెరిచే సమయం: మార్చి 14, 2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు.నడ మూసివేత: మార్చి 19, 2026 (గురువారం) రాత్రి 10:00 గంటలకు (అత్తాజ పూజ, హరివరాసనం అనంతరం).శబరిమల ఉత్సవం, పంగుని ఉత్తరం 2026వార్షిక ఉత్సవాల నిమిత్తం మార్చి 22 సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి.మార్చి 23: కొడియేట్టు (ధ్వజారోహణం)మార్చి 24: ఉత్సవ బలిమార్చి 31: పళ్ళివేట (రాజవేట)ఏప్రిల్ 01: పంపా ఆరాట్టు & పంగుని ఉత్తరం – భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య జన్మదినోత్సవం.ముగింపు: ఏప్రిల్ 1, 2026.ఏప్రిల్ 1వ తేదీన సన్నిధానం ఉదయం 5:00 నుండి 8:00 వరకు మాత్రమే తెరవబడుతుంది. తిరిగి పంపా ఆరాట్టు ముగిసిన తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేస్తారు.(చదవండి: మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి) -
గత 23 ఏళ్లుగా రంజాన్ దీక్ష చేస్తున్న 56 ఏళ్ల ఎన్ఆర్ఐ
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్లో 56 ఏళ్ల నాన్ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది. 2002 నుండి సతీష్ కుమార్న దుబాయ్లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు. రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని చెప్పారు.ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్ -
International Women's Day 2026 క్రీస్తు నందున్న స్త్రీ సాధికారత
‘ఇప్పుడైతే క్రీస్తునందు’ అన్న దృష్టికోణంలో నుండి చూడగలిగితే అన్నీ సానుకూలంగానే దర్శనమిస్తాయి. బైబిలు గ్రంథం స్త్రీని చిన్నచూపు చూసింది. స్త్రీని తక్కువ చేసి మాట్లాడింది వంటివి కూడా అర్ధరహిత వ్యాఖ్యలే. ఆదామువలె స్త్రీ కూడా దేవుని సృష్టి. దేవుడు ఆమెను తన స్వహస్తాలతోనే నిర్మించాడు. సాటియైన సహాయం అన్న కీర్తి ఆమె సొంతం. ఈ మాట దేవుడే చెప్పాడు.సమానత్వం అనేది అది నుండి ఇప్పటి వరకూ ఉంది. అది విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. చూసే దృష్టిలోనే అంతా ఉంది. ఆ లోపం చూసే విధానపు తీరుదే. అసాధారణ ఆధ్యాత్మిక భావజాలం అలవరచుకుంటే అన్నీ అనుకూలమే. దేవుని పట్ల భయంతో ఇట్టివారే స్త్రీని గౌరవిస్తారు. ఉత్సాహ, ప్రోత్సాహాలతో ఆమెను అందలం ఎక్కిస్తారు. మమ్మల్ని పూజించకున్నా... దయచేసి గుర్తించి గౌరవించండి మాకు అదే చాలు అన్న వేడుకోలు యవ్వన స్త్రీలది. రోజు రోజుకు ఇలాంటి విషమ పరిస్థితులు నేటి సమాజంలో నెలకొంటున్నాయి. నేటి పురుష జన్మ వైవిధ్యం ఏమంటే, తల్లిగా దయతలచి ఒక స్త్రీ పెట్టిన భిక్షే అతనికి ఈ జన్మ. తమదైన పురుషజన్మ స్త్రీ నుండే, స్త్రీకి మరో జన్మ అను మరణకర సంకట స్థితి నుండే ఈ నా జన్మ అన్న సత్యం ఎరిగిన పురుషోత్తములే దేవునికి ఎప్పుడూ భయపడుతూ మెరుగైన సమాజం కోసం కృషి చేస్తారు. స్త్రీ శిశు సంక్షేమాన్ని కోరేవారంతా సమాజ ఉద్ధారకులే.చిన్న కుటుంబమైనా.. పెద్దదైన ఉమ్మడి కుటుంబమైనా... అందులోని వారంతా చేతులెత్తి మొక్కే విధంగా స్త్రీ సాధికారతను బైబిలు అద్భుతంగా వివరించింది (సామెతలు 31:10–31). తనలోని నైపుణ్యాన్ని గుర్తించి దానికి నిత్యం సానపెడుతూ శ్రమించే స్త్రీ విజయపథాన ఊరేగుతుంది అంటుంది బైబిలు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సు అంటే ఏలుబడి లేదా పరి΄ాలన. ఇది దేవుని నియమం. భర్తను మినహాయించి యావత్తూ కుటుంబాన్ని ఆమె ఏలుతుంది.స్త్రీ వినయ విధేయతలు, మరీ ముఖ్యంగా ఆమె వినమ్రత తగ్గింపు, అణుకువ వంటివి ఆకట్టుకొని ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ వినయ సంపన్నతతోనే యేసు ‘నన్ను ఎలా మంచివాడు అంటున్నావు? మంచివాడు, సత్పురుషుడు, సద్బోధకుడు ఒక్కడే. ఆయనే దేవుడు’ అంటూ తగ్గించుకోవడం చూస్తే స్త్రీలకు ఇది గొప్ప ్ర΄ోత్సాహకరమే. ఎప్పుడూ హెచ్చించుకోక తగ్గింపు స్వభావంతో క్రీస్తు తనకు శిరస్సైన దేవుని మెప్పించడం మాదిరిగానే స్త్రీలు కూడా తమ స్వపురుషులను మెప్పించవచ్చు.– జేతమ్ -
15 రోజుల కదిరి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
భక్తుల చేత వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఉంది. గత 27న అంకురార్పణంతో అత్యంత వైభవంగాప్రారంభమయిన ఖాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు పక్షం రోజుల పాటు సాగుతాయి. భక్తప్రహ్లాద సమేత నారసింహుని దర్శనం ఇక్కడ తప్ప మరెక్కడా ఉండదు.హిరణ్యకశిపుని శిక్షించేందుకు, అలాగే తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు ‘నర–సింహ’ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో సమీపంలోని కదిరికొండ తంలో సంచరించారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై నుండి నారసింహుని వేడుకున్నారు. దీనికి గుర్తుగా ఆ కొండపై నారసింహుని ఆలయం కూడా ఉంది. అదేకొండపై శ్రీవారి పాద ముద్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ఖాద్రి’ అని పిలిచారు. ‘ఖా’ అంటే విష్ణుపాదమని, ‘అద్రి’ అంటే కొండ అని అర్థం. ఖాద్రి కాస్తా ఇప్పుడు కదిరి అని పిలుస్తున్నారు. కదిరి ప్రాంతంలో ఒకప్పుడు ఖాదిరి వృక్షాలు (చండ్ర వృక్షాలు) ఎక్కువగా ఉండేవి. వీటికింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభువుగా వెలిశాడని, అందుకే ఖాద్రీ నారసింహుడని పిలుస్తున్నారని మరో కథనం.రంగనాయకుడి స్వప్నం10వ శతాబ్దంలో అప్పటి పట్నం పాలేగారైన రంగనాయకుడికి చెందిన గోవులు ప్రతిరోజూ ఖాదిరి వృక్షం కింద ఉన్న ఓ పుట్టలో పాలు వదిలేవి. ఆ పాలను నారసింహుడు తాగేవారని, అందువల్లనే రంగనాయకులు ఆర్థికంగా బాగా ఎదిగారని ఒక కథనం. ఓరోజు ఆయనకు శ్రీవారు కలలో కన్పించి తాను స్వయంభువుగా వెలిశానని, పుట్టలో ఉన్న తన విగ్రహాన్ని వెలికితీసి తనకు గుడి కట్టించమని కోరితే ఆలయం నిర్మించినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. నాటి ఆలయం కాలగతిలో అదృశ్యం కావడంతో బుక్కరాయలు, హరిహర రాయలు, తర్వాత శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.వసంత వల్లభుడని కూడా...శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భృగుమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిశానని, తన విగ్రహాలను వెలికితీసి పూజాది కార్యక్రమాలు చేయాలని కోరినట్లు ఇంకో కథనం. ఉత్సవ విగ్రహాల వెలికితీత వసంత మాసంలో జరగడంతో స్వామివారిని వసంత వల్లభుడని కూడా పిలుస్తున్నారు. అందుకే కోనేరును భృగుతీర్థమని కూడా పిలుస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలనే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో పక్షం రోజులపాటు ప్రతిరోజూ తిరువీధుల్లో ఊరేగిస్తారు.దేశంలోనే 3వ అతి పెద్ద బ్రహ్మరథంస్వామివారి బ్రహ్మ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 130 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మరథం తయారు చేశారు. రథంపై సుమారు 256 శిల్పకళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీశుడి బ్రహ్మరథం.ఏ రోజు ఏ ఉత్సవం?గత నెల 27వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం గావించారు. 28న శ్రీవారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ నెల 4వ తేదీన బ్రహ్మ గరుడసేవ, 5న శేషవాహనం, 6న పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, 7న మోహినీ ఉత్సవం, 8న ప్రజాగరుడసేవ, 9వ తేదీన గజవాహనం, 10న బ్రహ్మ రథోత్సవం, 11న అశ్వవాహనం, 12న తీర్థవాది ఉత్సవం చివరగా 13వ తేదీన జరిగే పుష్పయాగోత్సవంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.– చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరిపక్షం రోజుల బ్రహ్మోత్సవాలు15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరిగేది కదిరిలో మాత్రమే. ఇంకెక్కడా జరగవు. ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం కూడా ఇంకెక్కడా ఉండదు. ప్రతినెలా స్వాతినక్షత్రం రోజు మూల విరాట్కు అభిషేకం చేస్తాం. ఆ సమయంలో స్వామివారికి చెమట పట్టడాన్ని గమనించవచ్చు.– నరసింహాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు, కదిరి -
ఇఫ్తార్ విందులో.. ఖర్జూర నోరార
రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు.. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం, ఆధునికత కలిసే ఒక ప్రత్యేక జీవనశైలి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో ఉన్న ఫుడ్ లవర్స్ రంజాన్ సీజన్ వచ్చిందంటే ఇఫ్తార్ టేబుల్స్ కొత్త ట్రెండ్స్తో మెరుస్తాయి. అయితే ఈ ఇఫ్తార్లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఖర్జూరాలది మాత్రం ప్రత్యేక స్థానం. కేవలం రంజాన్ మాసం కోసం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన ఖర్జూరాలను నగరానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నగరంలో మరిన్ని వెరైటీల ఖర్జూరాలు సందడి చేస్తున్నాయి. వీటికి తోడు ట్రెడిషనల్ ఇఫ్తార్కు మోడ్రన్ టచ్ ఇచ్చే పానీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ ఏడాది రంజాన్ మాసం ఒకహెల్తీ లైఫ్ స్టైల్ స్టేట్మెంట్లా కనిపిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరోరంజాన్ (Ramadan) మాసంలో ప్రతిరోజూ ఇఫ్తార్ విందులో ఖర్జూరాలు తొలి ముద్దగా తినడం తెలిసిందే.. ఈ ఖర్జూరాల్లో అంతర్జాతీయ ఆహార ప్రయాణం దాగుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా పండించిన ఫలాల్లో ఒకటైన ఖర్జూరం.. ఇప్పుడు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఒక లగ్జరీ గిఫ్ట్, న్యూట్రిషనల్ పవర్హౌస్ కూడా. విభిన్న దేశాల నుంచి వచ్చే ఈ ఖర్జూరాలకు ప్రత్యేక ఆదరణ, దానికి తగ్గట్టుగానే రేట్లు సైతం ఉంటున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా పండించే భారతీయ ఖర్జూరం(ఖజూర్) నగరంలో సులభంగా లభ్యమవుతుంది. ఈ ఖర్జూరం ఫోనిక్స్ సిల్వెస్ట్రీస్ జాతికి చెందింది. దేశంలో రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో దొరికే ఈ ఖర్జూరం గట్టిగా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ రకం. ఫ్రెష్గా లేదా సన్–డ్రైడ్గా వీటిని వినియోగిస్తారు. సిటీలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’ (King of Dates).. అధునాతన జీవనశైలికి కేంద్రమైన హైదరాబాద్లో ఏ దేశాలకు చెందిన ఉత్పత్తులైనా సులభంగా నగరానికి చేరుకుంటాయి. ఇదే క్రమంలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’గా పిలుచుకునే మొరాకో నుంచి వచ్చే మెడ్జూల్ ఖర్జూరం (Medjool dates ) పెద్ద పరిమాణంలో, అంబర్ బ్రౌన్ కలర్తో ప్రత్యేకంగా నిలుస్తుంది. కారమెల్, టాఫీ, హనీ నోట్స్తో నిండిన ఈ రకం గిఫ్టింగ్కు హాట్ ఫేవరెట్. సిటీలో ప్రీమియం డ్రైఫ్రూట్ స్టోర్లలో దీని డిమాండ్ భారీగా పెరుగుతోంది. హనీ టచ్తో సాఫ్ట్ డిలైట్గా ఉంటే. సౌదీ అరేబియాలో పండే సుక్కరి ఖర్జూరం కూడా నగరంలోని ముస్లింలు అమితంగా ఇష్టపడతారు. ఇవి మృదువుగా, తక్కువ ఫైబర్, సహజమైన తేనె రుచితో ఉంటాయి. రంజాన్ గిఫ్ట్ హ్యాంపర్లలో ఇది తప్పనిసరి ఐటమ్. ఈ రకం తాజాగా ఉన్నప్పుడు గోల్డెన్ యెల్లో, పండినప్పుడు అంబర్ బ్రౌన్గా మారుతుంది. సహజ చక్కెర ఎక్కువగా ఉండటంతో ఎనర్జీ బూస్టర్గా వీటిని పరిగణిస్తారు. అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాల నుంచి వచ్చే డెగ్లట్ నూర్ రకాన్ని ‘క్వీన్ ఆఫ్ డేట్స్’గా పిలుస్తారు. ఈ రకం పాక్షికంగా ఎండిపోయి, నట్టి స్వీట్నెస్తో ఉంటుంది. బేకింగ్, కుకింగ్కు ఇవి అద్భుతంగా సరిపోతాయి. రంజాన్ డెజర్ట్స్లో ఇది ఫేవరెట్. ఇరాన్ నుంచి వచ్చే మజాఫతి ఖర్జూరం డార్క్ బ్రౌన్ నుంచి నలుపు రంగులో ఉంటుంది. సాఫ్ట్, జ్యూసీ టెక్స్చర్తో మోలాసిస్ లాంటి రుచి దీని ప్రత్యేకత. సౌదీ అరేబియా మదీనాలో మాత్రమే దొరికే అజ్వా రకానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఖర్జూరం మతపరమైన, సాంస్కృతిక విలువలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది. -
మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి
కేరళ పేరు వినగానే మన తెలుగువారికి భక్తితో అయ్యప్పస్వామి గుర్తుకొస్తారు శబరిమల యాత్ర మనకి గొప్ప అనుభూతినిస్తుంది. శబరివాసుడు అయ్యప్పస్వామి దర్శనం ఇంచుమించుగా పురుషులకి మాత్రమే అయితే స్త్రీలకి మాత్రమే ఏటా ఒకసారి పొంగలి సమర్పించే దేవాలయం ఆటుకాల్ భగవతి క్షేత్రం. ఈ క్షేత్రం కేరళ రాజధాని తిరువనంతపురం నగరంలో ఉంది. ఏటా ఫిబ్రవరి, మార్చినెలలలో ఆటుకాల్ భగవతికి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి పొంగలి సమర్పిస్తారు. కేరళ రాష్ట్రం నలుమూలల నుండి అలాగే దేశ విదేశాలలో ఉండే మలయాళీ స్త్రీలు లక్షలలో భగవతికి పొంగాల (పొంగలి) సమర్పించడానికి వస్తారు. ఆరోజు కేరళ రాష్ట్ర రాజధాని స్త్రీలతో నిండిపోతుంది. పొంగాల సమర్పించడానికి పొయ్యి, వంట దినుసులు మాన్తా కోసం వంటచెరకు సిద్ధం చేసుకుంటారు. లక్షలాది మంది స్త్రీలు ఒకచోట చేరి దేవికి ప్రసాదం వండడం గిన్నెస్ బుక్ రికార్డు. ప్రతి ఏటా ఆ రికార్డు తిరగ రాయడం భగవతి శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో కేవలం స్త్రీలు మాత్రమే పాల్గొనాలి. పురుషులకి ప్రాధాన్యత లేదు. స్త్రీలు తమ జీవిత ఐశ్వర్యం కొరకు కుటుంబ అభివృద్ధి కోసం ఆటుకాల్ భగవతికి పొంగాల సమర్పించుకుంటారు. పొంగాల స్త్రీలు నగరం వీధులలోను రోడ్డు మీద ఇంటి అరుగు మీదా చేసుకుంటారు. ఇంకా చె΄్పాలంటే... ఇందులో పాల్గొనేవాళ్ళు అందరు భగవతి స్వరూపంగా భావించి ఎంతో భక్తి, గౌరవం చూపుతారు. స్త్రీలు స్నానం చేయడానికి, బట్టలు మార్చడానికి అన్ని సౌకర్యాలు జాతిమతం;పేదా గొప్పా భేదం లేకుండా చూసుకుంటారు. ఇన్నిలక్షలమంది స్త్రీలు ఒకచోట చేరినా, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగడం గొప్పవిశేషం. స్త్రీలు కొత్త వస్త్రాలు ధరించి కొత్త మట్టి కుండ, కర్రలు మూడు ఇటుకలు, పాలు, బియ్యం, బెల్లం వంటివి తెచ్చుకుని తాము కూర్చునే చిన్నస్థలాన్ని శుభ్రం చేసుకుంటారు. అంతకుముందు పారిశుధ్య కార్మికులు నగర వీధులు అంతటా శుభ్రం చేస్తారు. ఇక్కడ జరిగే ఒక అద్భుతం ముహూర్త సమయానికి చిరుజల్లులు పడి ఆ ప్రదేశం అంతా పవిత్రంగా మారడం. ఇది ప్రతి యేటా కనిపించే సత్యం. దేవి చైతన్యానికి నిదర్శనం. అందరూ ముందుగా ఇటుకలు పేర్చి కొత్త మట్టికుండలో పాలు, బెల్లం, బియ్యం పోసి సిద్ధంగా ఉంచాలి. ఆటుకాల్ భగవతి ముందు పూజారి పొయ్యి వెలిగించి పొంగాల వండటం ప్రారంభిస్తారు. ఆ పొయ్యి నుండి దీపాన్ని వెలిగించి పూజారులు నాలుగువైపులా తిరుగుతూ తీర్థంతో సంప్రోక్షణ చేస్తారు. స్త్రీలు తాము సిద్ధం చేసిన పొయ్యిలో తాము తెచ్చిన దీపంతోనే అగ్ని వెలిగిస్తారు. స్త్రీలు, వారి వెంట వచ్చిన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవతిని ప్రార్థిస్తారు. భగవతికి సమర్పించిన పొంగాల ఎంతగా పొంగి పొయ్యిలోకి పొర్లుతుందో అంతగా తమ జీవితాలలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.ప్రతి సంవత్సరం మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హైదరాబాద్ నగరాల నుంచి రైలు తిరువనంతపురం నగరానికి వెళ్తోంది. ఇంకా కేరళలోని ఎర్నాకులం తిరువనంతపురం చేరడానికి విమాన మార్గం ఉంది.(ఈ యేడు ఫిబ్రవరి 23న మొదలైన ఆటుకాల్ పొంగాల్ ఉత్సవాలు మార్చి 4 వరకు జరిగాయి).– ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..! -
గ్రహణంలోనూ తెరిచే ఉండే ఆలయాలు
గ్రహణంలోనూతెరిచే ఉండే ఆలయాలుసాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలను మూసివేసి, గ్రహణం తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణతో శుద్ధి చేసి భక్తుల సందర్శనార్థం అనుమతించడం అనేది ఆచారం. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతక కాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. ఆ ఆలయాలేమిటో తెలుసుకుందాం...గ్రహణసమయంలో కూడా తెరిచే ఉండే ఆలయాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం, పెదకాకానిలోని కోటేశ్వర స్వామి ఆలయం ముఖ్యమైనవి. తమిళనాట గల అరుణాచల క్షేత్రం సరేసరి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభువులు కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడమే ఇందుకు కారణంగా పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని విశ్వాసం. మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు, అగ్నిభట్టారడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ క్షేత్రానికి రాహు, కేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం.గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీజ్ఞాన ప్రసునాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం కూడా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామి వారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహు కేతు, సర్ప దోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు.మహా కాళేశ్వర్ ఆలయం... ఉజ్జయిని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూ మహాకాళ రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండనందువల్ల గ్రహణ సమయంలో కూడా ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. ఏ ఢిల్లీలోని కల్కాజీ ఆలయం: ఈ ఆలయం కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కా దేవి కాలచక్రానికి అధిపతి అని నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కల్కా దేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి వస్తారు.ఏ కల్పేశ్వర్ ఆలయం – ఉత్తరాఖండ్ : గ్రహణ సమయంలో కూడా ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిథిగా దర్శనాలు కొనసాగుతాయి. ఏ తిరువరప్పు శ్రీ కృష్ణ ఆలయం – కొట్టాయం ఏ కేరళ రాష్ట్రం కొట్టాయంలోని తిరువరప్పులో శ్రీ కృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీ కృష్ణుడికి రోజుకు పదిసార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామి వారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామి వారి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామి వారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. ఏ విష్ణుపాద ఆలయం – గయ: ఈ ఆలయంలో గ్రహణం సమయంలో పిండ ప్రధానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుందట.ఏ లక్ష్మీనాథ్ ఆలయం – బికనీర్, ఏ రాజస్థాన్ రాష్ట్రం బికనీర్లోని లక్ష్మీనాథ్ ఆలయం. దీన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరు. ఎందుకంటే ఓసారి గ్రహణ సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఓ కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.(మార్చి 3 బుధవారం సంపూర్ణ చంద్ర గ్రహణం) -
సహజయోగం బ్రహ్మచైతన్యమైన వేళ...
భారతదేశం పుణ్యభూమి, ధర్మభూమి, యోగభూమి. ఈ గడ్డపైన ఎందరో ఋషులు, మహా ఋషులు, అవతార మూర్తులు, ఆధ్యాత్మిక గురువులు జన్మించారు. అలాంటి ఆధ్యాత్మిక గురువులలో అంతర్జాతీయంగా గుర్తింపు, మన్ననలను పొందిన పరమపూజ్య శ్రీ మాతాజీగా పిలువబడే శ్రీమతి నిర్మలా దేవి శ్రీ వాత్సవ ఒకరు. ఆమె కారణ జన్మురాలని ఆమెను గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత, సర్వధర్మ సంస్థాపనకోసం ఊరూరా తిరిగి, విదేశాలలో పర్యటించి తాను నమ్మిన సత్యాన్ని, ధర్మాన్ని స్వయంగా ఆచరించి చూపించిన ఆత్మసాక్షాత్కార గురువు. ప్రవక్తలందరూ చెప్పిన ధర్మాలన్నీ ఒకేచెట్టుకు పూసిన పువ్వులే అయినప్పటికీ, ఎవరికి తోచిన పువ్వును వారు కోసుకుని వివిధ మతాలను స్థాపించుకుని, వాటి ప్రవక్తలు ప్రవచించిన మూల సూత్రాలను పక్కదారి పట్టిస్తున్న సమయంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి అటువంటి వాటినుండి వాస్తవాన్ని, అసలు సత్యాన్ని సహజయోగం ద్వారా బహిర్గత పరచారు. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1970 మే 5 వ తేదీన తన స్వీయ తపోశక్తి ద్వారా ‘సహజయోగ’ ని ఆవిష్కరించారు. తనలో నిద్రాణ స్థితిలో వున్న కుండలినీ శక్తిని జాగృతి చేసి సహస్రార చక్రం తెరిచి తద్వారా తన లోని ఆ భగవత్ శక్తి అయిన కుండలినీ శక్తిని బాహ్యపరంగా వున్న పరమాత్మ ప్రేమైక శక్తి అయిన పరమ చైతన్యంతో అనుసంధానం చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కార స్వీయ అనుభూతిని సాధించారు. ‘సహ’ అంటే మనతో ‘జ’ అంటే జన్మించిన శక్తి, యోగ అంటే బాహ్య పరంగా వున్న శక్తితో కలయిక అని అర్థం. ఆ విధంగా మనలోని కుండలినీ శక్తి బాహ్యపరంగా విశ్వవ్యాపిత భగవత్ శక్తితో ఏకీకరణ పొందినప్పుడు మనం కూడా ఆ పరమాత్మ దివ్య శక్తిలో ఓ భాగమైపోతాము.పరమచైతన్యం లేక బ్రహ్మ చైతన్యం అంటే విశ్వవ్యాపితమైన పరమాత్మ ప్రేమ శక్తి మాత్రమే. విశ్వాన్నంతటిని, సకల చరాచర జీవులను, నడిపించే భగవత్ శక్తి. మానవ మేధస్సుకు అతీతమైనది. ఆత్మ సాక్షాత్కారం పొంది ప్రతినిత్యం సహజయోగ సాధన చేస్తున్నవారి సహస్రార చక్రం పూర్తిగా వికసించి, మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో ఉన్న 7 చక్రాలు తెరుచుకుని బ్రహ్మ చైతన్యంలో అంతర్భాగాలైన అధిష్టాన దేవతలు మేల్కొనబడి మనకు తమ ఆశీర్వచనాలు అందచేస్తారు. సదాశివుని అర్ధాంగి అయిన ఆదిశక్తి ఆయన చుట్టూ పరివేష్టించి ఓ చల్లటి మేఘం లాగా ఆవృతమై వుంటుంది. అదే బ్రహ్మ చైతన్యం. పరమచైతన్య శక్తిగా పిలువబడుతున్న ఆ శక్తియే పరమాత్మ అయిన సదాశివుని ఇచ్చాశక్తి. ఆ శక్తియే విశ్వాన్ని సృష్టించింది. భూమి మీద వున్న జీవజాలం మీద,మానవుల మీద తన పరమ చైతన్య శక్తిని వెదజల్లుతుంది. మనల్ని అంతర్గతంగా బలోపేతం చేస్తుంది, పోషిస్తుంది. మనలో ప్రేమ శక్తిగా అంకురిస్తుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్న వారందరూ ఈ భగవంతుని ప్రేమ శక్తిని తన చుట్టూ ఉన్న పదిమందికీ పంచడానికి కృషి చేస్తారు. కుల, మత, జాతి, ప్రాంత, వయసు, లింగ భేదాలు లేకుండా ఎవరైనా, ఎప్పుడైనా అతి సునాయాసంగా ఆచరించగలిగే ఈ సహజయోగం దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే శారీరిక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం. మనిషి ఎన్నో ఏళ్లనుండి, ఎన్నో జన్మలనుండి అన్వేషిస్తున్న ‘సత్యాన్ని’ సహజయోగ ధ్యానం ద్వారా ఆవిష్కరించి ఎటువంటి స్వార్థచింతన లేకుండా మానవాళికి శ్రీ మాతాజీ నిర్మలా దేవి అందించారు. సహజయోగం ద్వారా వారిని భగవంతుని శక్తితో అనుసంధానపరచి తమ కష్టాలను, సమస్యలను ధ్యానం ద్వారా తమను తాము ఎలా సమతుల్యంలో ఉంచుకోవాలో, ఎలా తమ సమస్యలను తమంతట తాము పరిష్కరించుకోవాలో తెలుసుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇలా కోరుకున్న ప్రతి ఒక్కరిలో సరైన పరివర్తన తీసుకురాగలిగే ‘నవ సమాజ నిర్మాణం’, ‘వసుధైక కుటుంబం’, ‘సర్వమానవ సౌభాతృత్వం’ ‘ద్వేష రహిత, ప్రేమ పూరిత సమాజం’ ఏర్పడటం సుసాధ్యమే అని తాను స్థాపించిన సహజయోగం ద్వారా శ్రీ మాతాజీ నిర్మలా దేవి ఆచరించి నిరూపించారు. శ్రీమతి నిర్మలాదేవి తన జన్మ సార్ధకం చేసుకుని 2011 వ సంవత్సరం, ఫిబ్రవరి 23వ తేదీన తన సాకార రూపాన్ని చాలించుకుని నిరాకారం లోనికి వెళ్ళిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా సహజయోగ ధ్యానకేంద్రాలలో ప్రతిఏటా ఫిబ్రవరి 23వ తేదీన ‘బ్రహ్మ చైతన్య దినోత్సవం’ గా జరుపుకుంటున్నారు.– డా. పి. రాకేష్, సహజ యోగ సాధకులు(నేడు అంతర్జాతీయ బ్రహ్మచైతన్య దినోత్సవం) -
సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?
స అష్ట అంగ నమస్కారం... దీనినే సాష్టాంగ నమస్కారం అంటారు. అంటే మన శరీరంలోని అన్ని అంగాలూ నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే నమస్కారం అన్నమాట.. బాగా గౌరవించే వాళ్ల దగ్గర కాస్త ముందుకు వంగి నమస్కారం చేస్తాం. మరి సృష్టికి మూలమైన భగవంతుడికి నమస్కారం చేయాలంటే... ఎంత వంగినా ఇంకా వంగవచ్చునా అనిపిస్తుంది. అందుకే ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనిపించే స్థితిలో నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం.భగవంతుడికి పూర్తిస్థాయిలో మోకరిల్లడం ఇందులోని పరమార్థం. అయితే సాష్టాంగనమస్కారం (Sashtanga Namaskaram) పురుషులకు మాత్రమే. స్త్రీలకు వర్తించదు. మనిషి జననానికీ, జీవనానికీ కారణమైన పొట్ట, వక్షభాగాన్ని నేలకు తగిలించకూడదనీ, అందుకే వాళ్లు మోకాళ్ల మీద ముందుకు వంగి నమస్కారం చేస్తే సరిపోతుందనీ శాస్త్రం చెబుతోంది.చదవండి: మంత్రపుష్పం పరమార్థం ఏమిటి? -
ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రి, 5వేలకు పైగా శైవభక్తిగీతాలు
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికత,సాంకేతికతల సమన్వయానికి నిదర్శనంగా సూపర్ ఏఐ అకాడమీ (SUPER AI Academy) మహాశివరాత్రి 2026ని ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రిని నిర్వహించింది . ఈ సందర్బంగా ‘డిజిటల్ నాద యజ్ఞం” ద్వారా 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలను రూపొందించడం విశేషంగా నిలిచింది. కేవలం 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలలో 108 గీతాలను ప్రత్యేక ప్రసారం చేసింది.Zoom వెబినార్ ప్లాట్ఫారమ్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే సమయంలో శివతత్వాన్ని ఆధారంగా చేసుకుని గీతాలను సృష్టించారు. క్రమబద్ధమైన సాహిత్య రూపకల్పన కోసం ChatGPT Custom GPT వినియోగించగా, సంగీత నిర్మాణానికి AI ఆధారిత సంగీత సాధనాలను ఉపయోగించారు. అలాగే దీన్ని వాణిజ్య కార్యక్రమంలా కాకుండా పరమశివునికి సమర్పించిన సమూహ భక్తి నాదార్పణగా భావించామని నిర్వాహకులు ప్రకటించారు. “డిజిటల్ నాద యజ్ఞం”కార్యక్రమంలో శివుని విభిన్న రూపాలైన శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగ రూపాలు, శివ తాండవం వంటి ఉత్సాహభరిత భావాలతో కూడిన గీతాలను సృష్టించారు. భాషా, సాంస్కృతిక భక్తి పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిబింబంగా అన్ని గీతాలు తెలుగులోనే ఉండటం విశేషం. వీటిని సమయపాలన, సమన్వయంతో రియల్టైమ్ ట్రాకింగ్ వంటి పద్ధతులతో కార్యక్రమం సజావుగా నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమం Impact Foundation సహకారంతో, District Governor 320H గంపా నాగేశ్వర్ రావు నాయకత్వంలో Impact International ట్రెజరర్ గంపా ఆదిత్య భారత్ సహకారం అందించారు. SUPER AI Academy కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయ శ్రీ తదితరులు పాల్గొనేవారి సమన్వయం మరియు సాంకేతిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందర్భాల్లో కృత్రిమ మేధస్సును సృజనాత్మకంగా వినియోగించడం సులభమనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినట్లు సూపర్ ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు Nikeelu Gunda తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారికి నమోదు, సమాచారం అందించేందుకు AIMahashivaratri. com అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేశారు.ప్రాంతీయ భాషల్లో AI అవగాహన పెంపొందించి, సృజనాత్మకత, ఉపాధి, సాంస్కృతిక పరిరక్షణకు సాంకేతికతను సాధనంగా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమని, గ్రామీణ , ప్రాంతీయ భాషా వర్గాల వరకు కృత్రిమ మేధస్సు విద్యను చేర్చాలని తమ లక్ష్యమని సూపర్ ఏఐ అకాడమీ ప్రకటించింది. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
వృద్ధాప్యం ఆధ్యాత్మిక సాధనకు వరం
వృద్ధాప్యం అనేది జీవితమనే పుస్తకంలో చివరి అధ్యాయం కావచ్చు, కానీ అది అత్యంత విలువైన గౌరవప్రదమైన దశ. దీనిని కేవలం శారీరక క్షీణతగా కాకుండా, ‘అనుభవాల పండగ’గా చూడాలి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గొచ్చు కానీ, జీవితాన్ని చూసే దృష్టి పెరుగుతుంది. ఏది ముఖ్యం, ఏది అనవసరం అనే విచక్షణ వారికి ఉన్నంతగా మరెవరికీ ఉండదు. అందుకే వారిని జ్ఞాన నిధులు అంటారు.వృద్ధాప్యంలో ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, పునస్కారాలకే పరిమితం కాదు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి., జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి చేసే ప్రయాణం. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడం వల్ల కలిగే అసహనాన్ని ఆధ్యాత్మికత తగ్గిస్తుంది. రోజుకు కొద్దిసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసు నియంత్రణలోకి వస్తుంది. జీవితంలో జరిగిన మంచి చెడులను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుంది. వృద్ధాప్యం అనేది కేవలం శారీరక శక్తిని కోల్పోయే దశ కాదు, అది ఆధ్యాత్మిక పురోగతికి అత్యంత అనుకూలమైన సమయం. జీవితంలో బాధ్యతలన్నీ తీరిన తర్వాత, మనసును బయటి ప్రపంచం నుండి మళ్లించి లోపలికి (అంతర్ముఖం) పంపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. యవ్వనంలో ఉన్నప్పుడు ధనం, పదవి, పిల్లల భవిష్యత్తుపై ఉండే విపరీతమైన వ్యామోహం వృద్ధాప్యంలో క్రమంగా తగ్గుతుంది. కుటుంబంలో జరిగే విషయాలను ఒక సాక్షిలా గమనించడం అలవడుతుందిఅంతా ‘దైవేచ్ఛ’ అని భావించడం ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు.వృద్ధాప్యంలో శారీరక కదలికలు తగ్గినప్పుడు, మనసు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ జీవిత పరమార్థం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదలవుతుంది. అనవసరమైన మాటలు తగ్గించి, మౌనంగా ఉండటం వల్ల ప్రాణశక్తి వృధా కాకుండా ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో అహంకారం సహజంగానే తగ్గుతుంది. నా వల్ల ఏమీ కాదు అని తెలిసినప్పుడు, భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. ‘‘నేను నీ వాడిని, నీవే నన్ను నడిపించు’’ అని భగవంతుడికి పూర్తిగాఅప్పగించుకోవడం (శరణాగతి ) వల్ల కలిగే ప్రశాంతత అద్భుతమైనది. ఇది మరణం పట్ల భయాన్ని పోగొట్టి, ప్రశాంతమైన చిరనిద్రకు (మరణానికి) సిద్ధం చేస్తుంది. తమకున్న అనుభవాన్ని యువతరానికి పంచడం, నిస్వార్థంగా సలహాలు ఇవ్వడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే.అందరికీ వృద్ధాప్య దశ వరకు చేరుకునే అదృష్టం కలగదు. ఉన్న పెద్దలను గౌరవించడం అంటే మన భవిష్యత్తును మనం గౌరవించుకోవడమే. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అనుభవాలను గడించి, ఒక తరాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులు వృద్ధులు. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో లేదా కొన్ని కుటుంబాలలో వారిని ఒక భారంలా చూడటం కనిపిస్తుంది, కానీ అది సరైన దృక్పథం కాదు. ఈరోజు మనం వృద్ధులను ఎలా చూస్తామో, రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు.వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే ఒక సహజ ప్రక్రియ. వారిని అనాథ శరణాలయాలకు పంపడం లేదా ఇంట్లో ఒక మూలకు పరిమితం చేయడం వంటివి కాకుండా, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం మన సంస్కృతి.వృద్ధాప్యం అనేది ఒక పండు పక్వానికి వచ్చినట్లు. పండు పండితే తీపి పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ మనిషిలో శాంతి, క్షమ, ప్రేమ అనే ఆధ్యాత్మిక గుణాలు పెరగాలి. అదే నిజమైన పురోగతి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే మనలోని అశాంతిని వదిలి, శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవడం. వృద్ధాప్యంలో ఈ సాధన మరింత సులభం, ఎందుకంటే లోకజ్ఞానం మనకు అప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది.వృద్ధులను వేధించే ప్రధాన సమస్య ఒంటరితనం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే భజనలు, ప్రవచనాలు లేదా ఆధ్యాత్మిక చర్చల (సత్సంగం ) ద్వారా సమాజంతో సంబంధం ఏర్పడుతుంది. పరమాత్మ ఎప్పుడూ నాతోనే ఉన్నాడు (భగవంతునితో అనుసంధానం) అనే నమ్మకం వారిలో ధైర్యాన్ని నింపుతుంది. జీవితం ఒక నిరంతర ప్రక్రియ అని, మరణం కేవలం ఒక మార్పు మాత్రమే అనే సత్యాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయి. భగవద్గీత వంటి గ్రంథాల పఠనం ద్వారా మరణం పట్ల ఉండే భయం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది. గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఉన్నదానితో తృప్తి చెందడం (సంతోషం) అనేది గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. బాధ్యతలు తీరిపోయాయి, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాననే భావన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.– రామలక్ష్మీ సదానందమ్ -
సినిగళంలో నీల కంఠుడు
‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం’ అని రాశారు వేటూరి ‘సాగర సంగమం’లో.తెలుగు సినిమాల్లో శివుడి ప్రస్తావన ఆది నుంచి ఉన్నా అనేక పాటల్లో శివుని ప్రస్తావనను, ప్రభావాన్ని ప్రేక్షకులకు అందించినవారిలో కె.విశ్వనాథ్, వేటూరి ఉంటారు.‘నటరాజ శత సహస్ర రవితేజా... నట గాయక వైతాళిక మునిజనభోజా’ అని వేటూరి తాను కె.విశ్వనాథ్తో పని చేసిన తొలి హిట్ ‘సిరిసిరిమువ్వ’లో శివుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత ‘శంకరాభరణం’లో ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము’ అని సకల కళలకూ మూలమైన నటరాజ స్వరూపం పరమశివుడిని పల్లవిగా చేశారు.భగవంతుడ్ని చేరుకోడానికి సంగీతం కూడా ఒక అనుసంధాన మార్గమే కదా. అందుకే ‘అద్వైత సిద్దికి అమరత్వ లబ్దికి గానమే సోపానమూ’ అని కూడా అన్నారు వేటూరి.శివతత్వాన్ని పూర్తిగా తెలిసి రాసిన సాహిత్యం ‘సాగరసంగమం’లోనూ వినిపిస్తారు వేటూరి, విశ్వనాథ్లు. శివుడు లయకారుడు. సంగీతంలోనూ... సాహిత్యంలోనూ... గానంలోనూ కూడా లయే ప్రధానం. శివుడు మాట్లాడితే సాహిత్యం. మాట్లాడకపోతే వేదాంతం. అన్నీ శివుడే అని చెప్పటానికి వేటూరి, విశ్వనాథ్ కలసి చేసిన ప్రయోగం సాగరసంగమంలోని ‘ఓం నమఃశివాయ’ పాట. అందులో ‘నీ లయలే ఈ కాలగమనమై’ అంటారు. ‘ప్రకృతి పార్వతి శివునితో కలిసి అడుగులు వేస్తాయి’ అని కూడా అంటారు. ‘జీవితమే చిర నర్తనమాయే’ అనడం వేటూరి మాస్టర్స్ట్రోక్. ఇక బాపు ‘భక్త కన్నప్ప’లో వేటూరి రాసిన ‘కిరాతార్జునీయం’ మరో కవికి సాధ్యం కానిది.వెనక్కు వెళ్లి చూస్తే తెలుగు సినిమా సాహిత్యంలో పరమ శివుడికి ప్రత్యేక స్థానమే ఉంది. రావణ విరచిత ‘శివ దండకాన్ని’ సంపాదించి దాన్ని రావణ పాత్రతోనే పాడించేలా పరిశోధన చేసి సాధించారు సముద్రాల రాఘవాచార్యులు ‘భూకైలాస్’లో. దాన్ని గాలి పెంచెల నరసింహా రావు స్వరసారధ్యంలో నిజంగానే రావణుడే పాడుతున్నారా అన్నంత ఎక్స్ప్రెసివ్గా గానం చేసి రక్తి కట్టించారు ఘంటసాల. తెరమీద రావణపాత్రలో ఎన్టీఆర్ అయితే ఇక చెప్పడానికేముంది. ‘భూకైలాస్’లోనే శివుణ్ణి ‘లోక శుభంకరుడు’గా వర్ణించారు సముద్రాల. ‘అన్య దైవము గొలువ నీదు పాదము విడువ’ అంటాడు రావణుడు శివభక్తితో ‘నీలకంధరా దేవ’ పాటలో. ఇక పింగళి గారు ‘సత్య హరిశ్చంద్ర’లోని ‘నమో భూతనాథ’ పాటలో శివుణ్ణి ‘సదా సుప్రకాశ’ అన్నారు.‘అర్ధనారీశ్వర’ తత్వాన్ని అర్ధం చేసుకున్న వారెవరైనా శివపార్వతులను ఒకటిగానే చూస్తారు. అందుకే భయం కలిగినప్పుడు అభయం కోసం అమ్మవారైన పార్వతిని స్తుతిస్తుంది ద్రౌపది ‘నర్తనశాల’లో. సముద్రాల రాసిన ‘జననీ శివకామినీ’ పాటను భక్తిరసస్ఫోరకంగా స్వరపరిచారు సుసర్ల దక్షిణామ్మూర్తి. అంతే గొప్పగా గానం చేశారు సుశీల. ఆరుద్రకు ఏం తక్కువ. ‘మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అని రాశారు ‘భక్త కన్నప్ప’లో. ‘గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని’ అనే పంక్తి ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది. ‘ఏకలవ్య’లో మల్లెమాల రాసిన ‘మ్రోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం’ కూడా గుర్తు చేసుకోదగ్గది. ‘అమెరికా అమ్మాయిలో’నూ ఓ శివభక్తి గీతం వినిపిస్తుంది. నారాయణరెడ్డి రాసిన సాహిత్యం చిదంబర నిలయుడి మూర్తిని మన కళ్లెదుట నిలుపుతుంది. ‘వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా’ అంటూ ‘ఇంద్ర’ కోసం రాసిన ‘భంభం భోలే’ లో ‘గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే’ అని సిరివెన్నెల మాత్రమే రాయగలరు.‘భరత వేదముగ నిరత నాట్యముగ కదలిన పదమిది పరమేశా’ అని పౌర్ణమి’లోని పాట తరచూ వినిపించే సిరివెన్నెల మరో రచన. ఆపదల్లో ఉన్న వారికి అభయం ఇచ్చి తన వారినిగా చేసుకునే సువిశాల శివతత్వ దర్శనమే ‘ఖలేజా’లో వినిపించే రామజోగయ్యశాస్త్రి గీతం ‘సదాశివ సన్యాసి’. శివతత్త్వమే అత్యంత శుభకరము, భవహరము, హృదయంగమము. మరి ఈశ్వర సాయుజ్యం ΄÷ందేందుకు ప్రయత్నోన్ముఖులైన వారికి ఆనందం కాక మరేమిటి? ఇంక ఇహలోక బంధాలనూ... జంజాటాలనూ పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? విభూతిని ధరించని ఫాలభాగం, శివాలయం లేని గ్రామం, ఈశ్వరుని ధ్యానించని మానవ జన్మం వ్యర్థములు అంటారు. శివ అంటే సంస్కృతంలో శుభము, సౌమ్యము అని అర్థాలున్నాయి. ఈ ప్రపంచమూ అందరి జీవనమూ శుభ సౌమ్యాలతో గడవాలని కోరుకుందాం.– భరద్వాజ -
ఆయన జగం ..ఆమె సగం
బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు, నిత్యమూ శమాది గుణ సంపత్తి కలవాడు కనుక శివుడు అని ‘శివ’ పదానికి వ్యుత్పత్తి.‘శివ’ అంటే పరమేశ్వరుడు.‘శివా’ అంటే పార్వతి. పేర్లలో కూడా ఏక రూపత కలిగిన ఆది దంపతులు వారు స్త్రీ పురుషులు కలిస్తేనే పరిపూర్ణత. వారిలో ఎక్కువ తక్కువలు లేవు. ఇరువురూ సమానమేనని వేదకాలం నుంచే నిరూపించిన స్వరూపం అర్ధనారీశ్వర రూపం.‘గౌరి సగం – శివుడు సగం – అర్ధ నారీశ్వరమే అఖిల జగం’ అంటూ అవినాభావమైన ఆ ఆదర్శ దంపతుల అద్వైత రూపాన్ని మహాకవి ఆరుద్ర కీర్తించారు. వాగర్థాలవలె కలిసిపోయిన వారని కాళిదాసు ప్రస్తుతించారు. ప్రకృతి – పురుషులే సృష్టికి మూలమని, అయితే ఇందులో ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ పోషించే పాత్ర మరింత కీలకమైనదని చెప్పడానికి జగద్గురు ఆది శంకరులు తమ ‘సౌందర్యలహరి‘ లోని తొలి శ్లోకంలోనే ఇలా చెప్పారు:‘శివః శక్త్యా యుక్తో యది భవ తి శక్తః ప్రభవితుమ్ / నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి ‘.శక్తి స్వరూపిణి అయిన జగదంబతో కూడినప్పుడే పరమేశ్వరుడు సమస్త సృష్టిని నిర్వహించడానికి సమర్థుడై ఉంటాడు. పార్వతితో కూడనినాడు అంతటి శివుడూ కాస్తంత కదలడానికి కూడా శక్తిలేనివాడే అవుతాడు. అంతేకాదు. ఆదిశంకరాచార్యులవారు మరొక అడుగు ముందుకు వేసి ‘చితాభస్మమును దేహమంతా పులుముకొని, కంఠంలో గరళాన్ని ధరించి, దిగంబరుడై, జటాధారిగా, మెడలో పాములను వేసుకొని, పుర్రెను చేతిలో పట్టుకొని, యాచక వృత్తితో జీవిస్తూ, శ్మశానవాసిగా ఉన్న ఈశ్వరుడు ముజ్జగాలకే అధిపతి కావడం కేవలం పార్వతీదేవిని పెండ్లి చేసుకోవడం వలన లభించిన ఫలితమేనంటూ తమ ‘దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం’లో నొక్కి వక్కాణించారు. ఇలా భర్త ఔన్నత్యానికి కారణభూతురాలు అతని ఇల్లాలే అని ఆదిశంకరులు జగతికి చాటి చె΄్పారు. ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడానికే పరమేశ్వరుడు జగన్మాత పార్వతిని తన దేహంలో సగభాగంగా స్వీకరించాడు. శివుడంటేనే శక్తిమయుడు. శక్తి అంటేనే శివుని అభివ్యక్తి. శివశక్తులు రెండూ విశ్వానికి ఆధారమైన మూల పదార్థాలు. ఆ అర్ధనారీశ్వరుని స్వరూపాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఆవిష్కరించుకొందాం.అర్ధనారీశ్వరత్త్వంఅర్ధనారీశ్వర స్వరూపంలో కుడిభాగం శివునిది. ఎడమభాగం పార్వతిది. శివుని మేని ఛాయ బంగారు వర్ణం కాగా, పార్వతీదేవిది కర్పూర సమ ధవళ వర్ణం. శివునిది జటలు కట్టిన రాగిరంగు కేశపాశం కాగా, అమ్మవారిది అందంగా అలంకరింపబడిన నల్లని కేశపాశం. విశాలమైన, పోడవైన, నీలోత్పలం వంటి నయనం జగన్మాతదైతే, వికసించిన ఎర్ర కమలం వంటి నేత్రం ఈశ్వరునిది. తన చెవికి ఆ తల్లి రత్నపు చెవిపోగు ధరించగా, సర్పాలనే ఆయన తన చెవికి ధరిస్తాడు. పార్వతి దివ్యాభరణాలను ధరించి ఉండగా, ఆయన నాగాభరణ శోభితుడు. అమ్మవారు దివ్యమైన పట్టువస్త్రాలను అలంకరించుకొంటే, ఆయన దిగంబరుడై దర్శనమిస్తాడు. కస్తూరి, కుంకుమ వంటి సౌభాగ్య ద్రవ్యాలను ఆమె అలదుకొంటే, దేహమంతా చితాభస్మాన్ని శివుడు పులుముకొని ఉంటాడు. ఆమె పాదం అందెలతోను, ఆయన పాదం నాగ కంకణాలతోనూ కనిపిస్తాయి.ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయైసమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమశ్శివా యైచ నమః శివాయఅమ్మవారి ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వుతో విశ్వసృష్టి ప్రారంభమవుతుంది. అయ్యవారి తాండవ నృత్యంతో విశ్వం మొత్తం శివునిలో కలిసిపోతుంది. జగత్తుకే మాతా పితరులైన శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంగా కలిసి ఉన్న తత్త్వానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకభావం.రెండు విభిన్నమైన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు పరస్పర సమన్వయాన్ని సాధించిన వైనానికి సాకార రూపమే అర్ధనారీశ్వరం. విభిన్న లక్షణాలున్నప్పటికీ అన్యోన్యానురాగంతో దాంపత్య బంధాన్ని కొనసాగించాలన్నది అర్ధనారీశ్వరుడు ఇచ్చే సందేశం. ఈ తత్త్వాన్ని ఆకళింపు చేసుకోగలిగితే భూమిపై ప్రతి జంటా ఆ ఆదిదంపతుల లాగా అన్యోన్యతకు సాకార రూపమై నిలుస్తుంది. అలా ఉండే ప్రయత్నం మనమందరం చేయగలిగితే మన సంస్కృతిలో భాగమయిన వివాహధర్మం కలకాలం మనగలుగుతుంది !– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
థైరాయిడ్కు.. సేతు బంధాసనం
మహిళల్లో వయసుతో సంబంధం లేకుండా సాధారణంగా కనిపించే సమస్య థైరాయిడ్. ఈ సమస్యను సహజంగా నియంత్రించడంలో సేతు బంధాసన (Setu Bandhasana) చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ‘సేతు’ అంటే వంతెన, ‘బంధ’ అంటే బంధించడం.. ఈ ఆసనంలో శరీరం వంతెన ఆకారంలో ఉండి, గొంతు, మెడ ప్రాంతంపై మృదువైన ఒత్తిడి పడుతుంది. దీని వల్ల థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల విడుదల సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే ఛాతీ తెరుచుకోవడం వల్ల శ్వాస లోతుగా మారి, ఒత్తిడి తగ్గుతుంది.ఉపయోగాలు..థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ పెరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది. మెటబాలిజం మెరుగై, రువు పెరుగుదల తగ్గుతుంది. గొంతు, మెడ ప్రాంతం బలపడుతుంది. అలసట, నిద్రలేమి తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించి మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. వెన్ను, నడుము నొప్పులకు ఒక వరం.జాగ్రత్తలు.. మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు ఉన్నవారు డాక్టర్, యోగా గురువు సలహాతో చేయాలి. గర్భధారణ సమయంలో ఈ ఆసనం చెయ్యొద్దు. తీవ్రమైన నడుము నొప్పి లేదా స్లిప్ డిస్క్ ఉన్నవారు చెయ్యకపోడం మంచిది.చేసే విధానం..స్టెప్ 1: ముందుగా వెల్లకిలా (వెనుక భాగం వెనుకకు ఆనించి) పడుకోవాలి.స్టెప్ 2: రెండు మోకాళ్లను మడిచి, పాదాలను నేలపై నడుముకు దగ్గరగా ఉంచాలి. చేతులను శరీరానికి పక్కన, అరచేతులు నేలను తాకుతూ ఉండాలి.స్టెప్ స్టెప్ 3: గాలి పీల్చుకుంటూ, నెమ్మదిగా నడుమును పైకి లేపాలి.స్టెప్ 4: భుజాలను, చేతులను, పాదాలను బలంగా నేలపై ఆనించి, మీ ఛాతిని గడ్డం వైపు తీసుకురావాలి. ఈ స్థితిలో 15–30 సెకండ్లు సాధారణ శ్వాసతో ఉండాలి.స్టెప్ 5: శ్వాస విడిచే సమయంలో నెమ్మదిగా నడుమును కిందకు దించి వెన్నెముకను నేలపైకి తీసుకువచ్చి, విశ్రాంతి తీసుకోవాలి.– పాతర్ల అనిత, యోగాట్రైనర్ -
Mahashivratri 2026: శివపూజకు దినుసులు
ఆయన సామాన్యుడా! ఆయనను విశ్వేశ్వరుడనీ, మహాదేవుడనీ, త్య్రంబకుడనీ, త్రిపురాంతకు డనీ, నీలకంఠుడనీ, మృత్యుంజయుడనీ, సదాశివుడనీ వేదం వేనోళ్ళ స్తుతించింది. మహాదేవుడి మహత్త్వాన్ని సంపూర్ణంగా చెప్పేందుకు మాటలు చాలవని మహాకవులైన వారే మనవి చేసుకొన్నారు. ఆయన గొప్పతనం ఆసాంతం చెప్పాలంటే, అది సాక్షాత్తూ చదువుల తల్లికయితే సాధ్యం కావచ్చు నన్నారు. నిజానికి, విశ్వేశ్వరుడి విశిష్టతలన్నీ వివరంగా చెప్పాలంటే సరస్వతీ దేవికి కూడా ఎన్నో సన్నాహాలు అవసరమవు తాయట. ముందు కల్పవృక్షం కొమ్మ విరిచి, దాన్ని అరిగిపోని కలం పుల్లగా అమర్చుకోవాలి. సముద్ర మంత జలపాత్ర సంపాదించాలి. ఆ నీటిలో కాటుక కొండను కరిగించి, సిరాను సిద్ధం చేయాలి. ఆ పైన విరామం లేకుండా అహర్నిశలూ రాస్తూనే వెళ్ళాలి. లేకపోతే, కైలాసనాథుడి ఘనతల జాబితాను సమగ్రంగా సమ కూర్చటం ఆమెకయినా అసంభవమే అంటుంది ‘శివ మహిమ్నస్త్రోత్రం’.అయితే, భక్తుల అదృష్టం వల్ల, మహాదేవుడు ఎంతటి మహిమాన్వితుడో అంతటి కరుణామయుడు. ఎంత సర్వ సమర్థుడో, అంత ఆడంబర విరహితుడు. అల్ప సంతోషి. ఆయన అనుగ్రహం పొందేందుకు పాండిత్య పాటవాలతో, పటాటోపాలతో పనిలేదు. విస్తృతమైన పూజావిధులూ, విలువైన సామగ్రీ అక్కర్లేదు. కావలసినవేమిటో ‘కాళహస్తీశ్వర శతకం’లో ధూర్జటి కవి చెప్పాడు: సలిలమ్ముల్ చులుక ప్రమాణ(ము), ఒక పుష్పమ్మున్ భవన్మౌళి, ని/ శ్చల భక్తి ప్రతిపత్తి చే నరుడు పూజల్ సేయగా ధన్యుడౌ,/... తుదిన్ కాంచు నీ/ చెలువంబంతయు, నీ మహత్త్వ మిదిగా, శ్రీ కాళహస్తీశ్వరా! శివపూజకు మూడు దినుసులు చాలు. పుడిసెడు (‘చులుక ప్రమాణము’) నీళ్ళు, ఒక్క పుష్పం, నిశ్చలమైన భక్తి భావం– ఈ మూడింటితో పూజ చేసిన భక్తుడు ధన్యుడై చివరకు శివ సాక్షాత్కారం ప్రాప్తింపజేసుకొంటాడు. భోలా శంకరుడే గదా, చేరెడు నీళ్ళతో అభిషేకించి, చిన్న మారేడు దళం అప్పగిస్తే చాలు, పొంగి పోయి బోలెడు వరాలిచ్చేస్తాడు అని గడసరి భక్తులు అనే మాట అర్ధ సత్యమే. నిశ్చల భక్తి అనే నిప్పు లేకుండా, భక్తుడి పప్పు ఉడకదు అనే షరతు వర్తిస్తుంది! - ఎం. మారుతి శాస్త్రి (ఫిబ్రవరి 15న శివరాత్రి) -
మంత్రపుష్పం పరమార్థం ఏమిటి?
పూజలో పూలు వాడతాం. మరి మంత్రపుష్పం ప్రత్యేకత ఏమిటీ అంటే – భగవంతుడికి మనం చేయగలిగిన ఉపచారాలన్నీ చేశాక, పెట్టగలిగిన పదార్థాలన్నీ నైవేద్యం పెట్టాక... మనల్ని మనం ఆ దేవదేవుడికి సమర్పించుకోవడమే మంత్రపుష్పంలోని పరమార్థం. కిందివైపు ముడుచుకుని ఉన్న కమలంలా నాభికి పైనా, గొంతుకు కిందా 12 అంగుళాల పరిమాణంలో ఉన్న భాగం (హృదయం), మనం తిన్న అన్నాన్ని శరీరభాగాలన్నింటికీ సమానంగా పంచుతుందట.దానిపై భాగంలో విచ్చుకున్నట్టు ఉండే సూక్ష్మపద్మంలాంటి చోట నివ్వరిధాన్యపు ముల్లంత (వడ్లగింజ కొస) పరిమాణంలో పసుపురంగు కాంతితో మనలోని పరమాత్మ ఉంటాడంటూ సవివరంగా మన జ్యోతి స్థానాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకాన్ని మంత్రపుష్పంతో (Mantrapushpam) జతచేసి చదువుతాం. అంటే నాలోని ప్రాణం నీవు, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను స్వామీ... అని చెప్పుకోవడం మంత్రపుష్పంలోని పరమార్థం.చదవండి: శఠగోపం ఆకారం ఎందుకలా? -
శఠగోపం ఆకారం ఎందుకలా?
శఠగోపం ఆకారమే చాలా ప్రత్యేకం. ఆలయ గోపురాలు దాదాపు ఇదే ఆకారంలో ఉంటాయి. అలాగే చదరంగా ఉండే తలాలకన్నా వంపుగా అర్ధవృత్తాకారంలో (డోమ్ తరహా) నిర్మాణాలూ పిరమిడ్ తరహాలోనే పనిచేస్తాయి. రాజమందిరాల పై భాగాలు ఇలా ఉండటాన్ని మనం గమనించొచ్చు. అందువల్ల శఠగోపం కూడా అచ్చంగా ఇదే విధంగా పనిచేస్తుంది.ఆత్మజ్ఞానానికి ప్రతీకైన సహస్రార చక్రం మన తలకు పై భాగంలో కాస్త ఎత్తులో ఉంటుంది. అదే జ్ఞానులూ, యోగులకు దాదాపు జానెడు ఎత్తులో ఉంటుంది. అలాంటి సహస్రార చక్రం పైన ఈ శఠగోపాన్ని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఇన్ని రకాలుగా శక్తిని పొందుతాం కాబట్టి, దాన్ని స్థిరపరచుకోవడానికి కాసేపు అక్కడే కూర్చోమని చెబుతారు. చదవండి: స్వర్ణగిరికి బ్రహ్మోత్సవ సిరి -
కన్నుల పండువగా స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు
అపార కారుణ్యమూర్తి, భక్తవత్సలుడు, సర్వగుణ సంపన్నుడు, భూలోక వైకుంఠ క్షేత్ర నాథుడు అయిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ సేవలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం.వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.లోక కల్యాణార్థం సకల శుభప్రాప్తి కోసం అస్మద్ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా... అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలు..విశేష కార్యక్రమాలు అంకురార్పణతో ఆరంభంస్వర్ణగిరీశుని ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. 17 వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహకులు మానేపల్లి రామారావు తెలిపారు.విశేష కార్యక్రమం వివరాలునేటినుంచి పల్లకిసేవ... 12 వ తేది: సింహవాహన సేవ, పరమేష్టివాహనం, నిశాచూర్ణోత్సవం, సాయంత్రం: ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామి వారికి గజవాహన సేవ, అమ్మవారికి హంసవాహన సేవ(లోక కల్యాణం కోసం)13 వ తేది: పల్లకీ సేవ, సుదర్శన ఇష్టిహవనం, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, అశ్వవాహనసేవ.14 వ తేది: పల్లకీసేవ, సకల కార్యసిద్ధి కొరకు విష్వక్సేన ఇష్టి, సాయంత్రం హనుమంతవాహన సేవ. 15 వ తేది: పల్లకి సేవ, సకల విద్యాప్రాప్తి కొరకు హయగ్రీవ ఇష్టి. సాయంత్రం అశ్వవాహన సేవ. 16 వ తేది: పల్లకి సేవ, ధన్వంతరి ఇష్టి, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. 17 వ తేది: సర్వభూపాల వాహన సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్రస్నానం. సాయంత్రం పల్లకి సేవ, పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, బలిహరణ మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, మహా కుంభ సంప్రోక్షణ, శాత్తు మొఖై, వేద విన్నపములు, రుత్విక్వరణం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్టితో పూర్తికానున్నాయి.ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకుసుప్రభాత సేవ, ప్రాతఃకాల ఆరాధన, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, వేదవిన్నపం, విశేష హోమాలు, పంచసూక్త పరివార, ప్రాయశ్చిత్త హోమాలు, నివేదనలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి.చదవండి: మోక్షమార్గం.. శివనామ స్మరణంసాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకుశ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విశేష హోమాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హోమాలు, నివేదన, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి.– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
స్వర్ణగిరికి బ్రహ్మోత్సవాల సిరి : అంగరంగ వైభవంగా ప్రారంభం
అపార కారుణ్యమూర్తి, భక్తవత్సలుడు, సర్వగుణ సంపన్నుడు, భూలోక వైకుంఠ క్షేత్ర నాథుడు అయిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మ్సావ, సంవత్సరోత్సవ సేవలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం.వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. లోక కల్యాణార్థం సకల శుభ్రప్రాప్తి కోసం అస్మద్ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా... అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలు..విశేష కార్యక్రమాలు అంకురార్పణతో ఆరంభంస్వర్ణగిరీశుని ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభ మయ్యాయి. 17వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహకులు మానేపల్లి రామారావు తెలిపారు.విశేష కార్యక్రమం వివరాలు నేటినుంచి పల్లకిసేవ... 12 వ తేది: సింహవాహన సేవ, పరమేష్టివాహనం, నిశాచూర్ణోత్సవం, సాయంత్రం: ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామి వారికి గజవాహన సేవ, అమ్మవారికి హంసవాహన సేవ(లోక కల్యాణం కోసం)13 వ తేది: పల్లకీ సేవ, సుదర్శన ఇష్టిహవనం, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, అశ్వవాహనసేవ, 14 వ తేది: పల్లకీసేవ, సకల కార్యసిద్ధి కొరకు విష్వక్సేన ఇష్టి, సాయంత్రం హనుమంతవాహన సేవ. 15 వ తేది: పల్లకి సేవ, సకల విద్యాప్రాప్తి కొరకు హయగ్రీవ ఇష్టి.సాయంత్రం అశ్వవాహన సేవ. 16 వ తేది: పల్లకి సేవ, ధన్వంతరి ఇష్టి, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. 17 వ తేది: సర్వభూపాల వాహన సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్రస్నానం. సాయంత్రం పల్లకి సేవ, పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, బలిహరణ మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, మహా కుంభ సంప్రోక్షణ, శాత్తు మొఖై, వేద విన్నపములు, రుత్విక్వరణం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్టితో పూర్తికానున్నాయి. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల ఆరాధన, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, వేదవిన్నపం, విశేష హోమాలు, పంచసూక్త పరివార,ప్రాయశ్చిత్త హోమాలు, నివేదనలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠిసాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకుశ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విశేష హోమాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హోమాలు, నివేదన, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!
ఇప్పుడంటే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు చాలా తేలికగా వెళ్లగలుగుతున్నాం. సరైన రవాణా సౌకర్యం లేనందున కొన్ని దశాబ్దాల క్రితం శ్రీవారి దర్శనభాగ్యం నగర వాసులకు చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి సమయంలో ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన బిర్లా మందిర్ ఆ కొరత తీర్చింది. సిటీ జనులే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వారికి ఫేవరెట్గా మారింది. వివాహం తర్వాత, శుభకార్యాలు, పుట్టిన రోజుల సందర్భంగా అందరూ బిర్లా మందిర్కే రావడం... ఇక్కడి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. కొత్తగా పెళ్లయినవారికైతే బిర్లామందిర్కు వెళ్లాల్సిందే అన్న రీతిలో ఖ్యాతికెక్కింది. అలాంటి బిర్లా మందిర్ 50 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు తొలిసారిగా 1976 ఫిబ్రవరి 13న తొలిసారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.చారిత్రక కట్టడాల సరసన ఆధ్యాత్మిక వైభవం భాగ్య నగరం అంటే చారిత్రక కట్టడాలే కాదు. ఆధ్యాతి్మక వైభవం అని చాటుతోంది బిర్లా మందిర్. నౌబత్ పహాడ్ కొండపై పాలరాయితో కొలువుదీరిన ఈ ఆలయం కేవలం ఆధ్యాతి్మక ప్రదేశమే కాదు.. అద్భుత శిల్పకళా వేదిక కూడా. సిటీ నడిబొడ్డున జన కోలాహలం మధ్య ఉన్న ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే కలిగే ప్రశాంతత అటు భక్తులు, ఇటు పర్యాటకులను మంత్రముగ్థులను చేస్తోంది.పాలరాతి సొగసుల మందిరం... పూర్తిగా రాజస్థాన్ నుంచి తెప్పించిన 2000 టన్నుల పాలరాయితో బిర్లా మందిర్ను నిర్మించారు. పదేళ్లపాటు నిపుణులైన శిల్పుల చేత తీర్చిదిద్దారు. ఉత్తర, దక్షిణ భారత వాస్తు శిల్పి రీతుల (గోపుర, రాజస్థానీ) కలయికతో విలక్షణంగా కనిపిస్తుంది. బిర్లా మందిర్లో శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహం 11 అడుగుల ఎత్తులో తిరుమల శ్రీవారిని తలపిస్తూ భక్తిపారవశ్యం కలిగిస్తుంది. శివుడు, గణపతి, హనుమంతుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ, మహాభారత ఘట్టాలు భారతీయ సంస్కృతికి అద్దంపడతాయి. సాయంత్రం తర్వాత విద్యుత్ కాంతులతో మెరిసిపోయే బిర్లా టెంపుల్ పర్యాటకులనూ కనువిందు చేస్తుంది. ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్, బుద్ధుడి విగ్రహం, నగర అందాలు కనువిందు చేస్తుంటాయి. ప్రశాంతత కోరుకునేవారికి, ఫొటోగ్రఫీ ప్రేమికులకు (ఆలయం వెలుపల) బిర్లా మందిర్ మంచి స్పాట్.హైదరాబాద్ ఎక్స్కర్షన్...! అందులో బిర్లా మందిర్ విజిటింగ్..! ఇదీ స్కూల్ పిల్లలకు కొన్నేళ్లపాటు తప్పనిసరిగా కొనసాగిన సంప్రదాయం. అంతేకాదు, టెక్ట్స్ బుక్స్లోనూ బిర్లా మందిర్ విశిష్టత గురించి చెప్పేవారు. దీంతో ఆ టెంపుల్ను చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తహతహలాడేవారు. కొత్త జంటలకు ఫేవరెట్ కొత్తగా పెళ్లయినవారికి సిటీలో ఫేవరెట్ స్పాట్ బిర్లా మందిర్. భక్తి, ప్రశాంతత రెండూ లభించే ప్రదేశం కావడంతో యువ జంటలు ఇక్కడికి రావడాన్ని ఓ కార్యక్రమంగా పెట్టుకునేవారు. వీకెండ్లో హార్ట్ బీట్ అసలే వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఆపై శనివారం..! ఇంకేం వీకెండ్ వస్తే చాలు సిటీ జనులు బిర్లా మందిర్కు పొలోమంటూ పోటెత్తుతుంటారు. వైకుంఠ ఏకాదశి వంటి రోజుల్లో కిక్కిరిసినట్లే. శని, ఆదివారాల్లో అత్యధిక శాతం నగరవాసుల ఆధ్యాత్మిక కేంద్రం ఇదే.ప్రత్యేకతలు ఇవి 1966లో ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ బిర్లా కలలోకి ఈ కొండ, శ్రీ వేంకటేశ్వరస్వామి కనిపించారని చెబుతారు. సమీపంలోని హోటల్ గది నుంచి చూస్తున్న ఆయనకు కొండపై వేంకటేశ్వరస్వామి ఆహా్వనిస్తున్నట్లు అనిపించిందని.. దీంతో బిర్లా మందిర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే రూ.2 కోట్లతో ఏడెకరాలలో హిందూస్థాన్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నౌబత్ పహాడ్పై బిర్లామందిర్ నిర్మించారు. 50 ఏళ్లలో 15 కోట్ల మందిపైగా భక్తులు, పర్యాటకులు సందర్శించారు. సోమ–శుక్రవారం వరకు రోజుకు 5–6 వేలమంది భక్తులు, సందర్శకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 9–11 వేలకు చేరుతుంది. 24 నుంచి స్వర్ణోత్సవాలు శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచి 27 వరకు స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నాం. హోమాలు, అభిషేకాలు, పల్లకీ సేవ, కలశపూజ, పూర్ణాహుతి, శోభాయాత్ర చేపడతాం.– సీఏ శ్యాం కొఠారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ -
మోక్ష మార్గం.. శివనామ స్మరణం
భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒక్కటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు ఉండవు. ఈ సత్య విషయాన్ని తెలియ జెప్పే నిర్గుణ పరతత్వ స్వరూపమే ‘లింగం’. ఈ లింగోద్భవ వేళ శివనామస్మరణ మోక్ష మార్గానికి మార్గమని పెద్దలు చెబుతుంటారు. ఆ సమయంలో రానే వస్తోంది. మహాశివరాత్రి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. తాడిమర్రి/ఎన్పీ కుంట: కాకిముట్టని తీర్థంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో వెలసిన కాటికోటేశ్వర క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన స్వామి.. కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటాడని భక్తుల నమ్మకం. రెండు కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాశీ నుంచి తెప్పించి ప్రతిష్టించిన శివలింగం, నవగ్రహాలు, గదాగుండం, కొండపై గుహలో అక్కమ్మ దేవతలు ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి పర్వదినాన రెండు రోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రానికి అనంతపురం నుంచి నార్పల మీదుగా పార్నపల్లి బస్సులో వెళ్లవచ్చు. అలాగే ధర్మవరం నుంచి పులివెందుల బస్సులో దాడితోట మీదుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.కాకి ముట్టని తీర్థంకాటికోటేశ్వర క్షేత్రంలో కాకులు మచ్చుకై నా కనిపించవు. అందుకే ఈ కోనేటిలోని నీటిని కాకిముట్టని తీర్థమని అంటారు. పూర్వం ఇక్కడి గుహలో వెలసిన అక్కమ్మ దేవతలు కోనేటిలో జలకాలు ఆడేవారని, ఆ సమయంలో వారి వస్త్రాలపై కాకులు రెట్ట వేయడంతో వారు ఆ ప్రాంతంలో కాకులు ఉండకుండా శాసించినట్లుగా ఓ పూర్వగాథ ఉంది.14 నుంచి జాగరణ మహోత్సవాలుఎన్పీకుంట మండలం గూటిబైలులో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు జరిగే తిమ్మమాంబ జాగరణ మహోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ వెలసిన తిమ్మమ్మ మర్రిమాను 8.15 ఎకరాల్లో విస్తరించి, 6,800 ఊడలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది.మహావృక్షం వెనుక పురాణగాథ ఉందిబుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబకు దిగువ గూటిబైలు గ్రామానికి చెందిన బాలవీరయ్యతో వివాహమైంది. కొన్నాళ్లపాటు వీరి జీవితం ఆనందంగా సాగింది. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడిన బాలవీరయ్య మృతి చెందడంతో ఆ రోజుల్లో కొనసాగుతున్న ఆచారం మేరకు తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధం కాగా, చితి పక్కకు వైదొలగకుండా నాలుగు వైపులా ఎండిన మర్రి గుంజలను నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి నేడు మహావృక్షంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.ఆలయ నిర్మాణంతో నిత్య పూజలుబెంగుళూరుకు చెందిన కై వారం యోగినారాయణస్వామి ట్రస్ట్ ధర్మాధికారి డాక్టర్ ఎంఎస్ జయరాం 2011లో తిమ్మమ్మ మర్రిమాను వద్ద తిమ్మమాంబ, బాలవీరయ్య దంపతుల ఆలయంతో పాటు తిమ్మమాంబ సతీసహగమనం చేసిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ ఘాట్ను నిర్మించారు. ఈ సారి జాగరణ మహోత్సవాలను ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. తిమ్మమ్మ మర్రిమానుకు అరకిలోమీటరు దూరంలో శివప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ధ్యానం చేసుకునేందుకు వీలుగా గదులు కూడా నిర్మించారు. -
మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?
ఒక చెరుకు వ్యాపారి డబ్బు బాగా గడించాడు. వయసు మీద పడటంతో మనసు చిన్నగా ఆధ్యాత్మికం వైపు మళ్ళింది. గుడులూ గోపురాలూ తిరిగాడు. నదీ స్నానాలు చేశాడు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. అలా చేస్తున్న క్రమంలో అతడికి హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది.అదేమిటంటే ‘ఏ సేవ మంచిది, మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?’ అని. సమాధానం కొరకు ప్రయత్నించాడు. సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. వారి ఊరికి చాలా దూరంగా ఉన్న గుట్టమీద ఒక సాధువు ఉన్నాడని తెలిసింది. ఆయన్ని అడిగితే సమాధానం దొరుకుతుందని బయలుదేరాడు. దారి సరిగా తెలియక అవస్థలు పడ్డాడు. అప్పటికే బాగా చీకటయ్యింది. వ్యాపారికి ఆ చీకట్లో నడవడం కష్టంగా తోచింది.దారిలో ఒక రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని వ్యాపారిని ప్రశ్నించాడు. తను వెళ్తున్న విషయం చెప్పాడు వ్యాపారి. ‘ఆ గుట్టపైకి వెళ్ళడానికి పగలే కష్టంగా ఉంటుంది. రాత్రయింది కాబట్టి మరింత కష్టం. అందులోనూ పురుగూపుట్రా ఉంటాయి. నేను మీకు తోడుగా వస్తాను’ అని చెప్పి లాంతరు పట్టుకుని బయలుదేరాడు. ఎలాగైతేనేం గుట్ట చేరారు. సాధువును కలిశారు. తను వచ్చిన విషయం చెప్పా వ్యాపారి.‘బాగా రాత్రయ్యింది. అలసిపోయి ఉన్నారు. ఇద్దరూ శుభ్రంగా భోజనం చేసి నిద్రపొండి, ఉదయం మాట్లాడుకుందాం’ అని చెప్పాడు సాధువు. ఇద్దరూ అలాగేనని ఒప్పుకున్నారు. తెల్లారిందే లేదో గబగబా నిద్ర లేచిన రైతు పొలం పని ఉంది, నేను బయలుదేరుతాను’ అన్నాడు.వెంటనే వ్యాపారి ‘‘చీకట్లో ఉన్న నాకు చాలా మంచి సహాయం చేశారు. మీరు లాంతరుతో తోడు రాకుంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాణ్ణి. మీరు చేసిన సహాయం నా జీవితకాలం మరచిపోను’’ అని చెప్పి పడీపడీ నమస్కరిస్తూ అతడిని సాగనంపాడు.చదవండి: సంక్షోభంలో స్థిరత్వంసాధువు చిరునవ్వు ముఖంతో వ్యాపారిని దగ్గరికి పిలిచి ‘ఒక్క రాత్రి, చీకటిలో ఉన్న నీకు లాంతరు సాయం చేశాడని అతడిని ప్రముఖ వ్యక్తిగా ఆదరిస్తున్నావు. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటినుంచి చీకటిలో ఉన్న నీకు ఆరని దీపంలాగా, నీ ఆలనాపాలనా చూసి, మంచి చెడ్డలు నేర్పించారు నీ అమ్మానాన్నలు. ఎన్నో కష్టాలకు ఓర్చి విద్యాబుద్ధులు నేర్పి నిన్ను ఇంతవాడిగా చేసిన అమ్మానాన్నలకి చేసే సేవకన్నా వేరే ఏ సేవా గొప్పదికాదు, వారికి కృతజ్ఞతగా ఉండటానికి మించింది ఏదీ లేదు’ అని హితవు చెప్పాడు.‘నిజమే, నిరంతరం తను కాలుతూ వెలుగునిచ్చే దీపంలాగా మన జీవితాలకు వెలుగునిచ్చే అమ్మా నాన్నలకు మించిన గొప్పవారు ఎవరు ఉంటారని’ తెలుసుకున్న వ్యాపారి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
గంగాతీరంలో బోళా శంకరుడి అత్తారిల్లు..!
దక్ష ప్రజాపతికి తన కూతురు సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒక మహాయాగాన్ని నిర్వహించినప్పుడు సతీదేవిని, మహాశివుడిని ఆహ్వానించడు. పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలనే కోరికతో శివుడు నిరాకరించినప్పటికీ సతీదేవి అక్కడికి వెళుతుంది. తండ్రి చేసిన అవమానంతో యజ్ఞగుండంలోకి వెళ్లి, ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ స్థలమే దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ సమీపంలోని కంఖాల్ ప్రాంతంలో ఉన్న దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించి నాటి పౌరాణిక విశేషాలు తెలుసుకోవచ్చు. శివరాత్రి రోజులలో అత్యంత ప్రాచీన ఆలయాల సందర్శనకు,ఆధ్యాత్మిక విషయాల అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతంది..శక్తి పీఠాల కథకు ఆదిప్రధాన ఆలయం లోపల ఉన్న సతీకుండ్ అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ యజ్ఞగుండంలోనే సతీదేవి అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకుందని విశ్వాసం ఉంది. ఈ ఘటన తరువాత మహాశివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేయగా, విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడని పురాణాలు చెబుతాయి. అవి మొత్తం 108 భాగాలు కాగా, వాటిలో ముఖ్యమైన 54 భాగాలు, మరీ ముఖ్యమైన 18 భాగాలే ఈ శక్తి పీఠాల కథకు మూలంగా భావించే ప్రదేశంగా ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని భక్తులు నమ్ముతారు. ఆలయ ్ర΄ాంగణంలో అనేక ఉ΄ాలయాలు, పవిత్ర వృక్షాలు దర్శనమిస్తాయి. మరోవైపు గంగానది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది. ఇక్కడ భక్తులు పితృకార్యాలు, నదీ పూజలు, పిండప్రదానాలు నిర్వహిస్తారు.అహంకారానికి అంతందక్షేశ్వర్ మహాదేవ్ ఆలయ సముదాయంలో దశ మహావిద్య ఆలయం, బ్రహ్మేశ్వర్ మహాదేవ్ ఆలయం, శని ఆలయం, శ్రీరాముడి దర్బార్, శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు రుద్రాక్ష చెట్టును కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని పూర్తిగా దర్శించాలంటే కనీసం రెండు నుండి మూడు గంటల సమయం వెచ్చించాలి. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడు తన అత్తారింటికి వస్తాడని నమ్మకం ఉంది. శివరాత్రి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ కాలంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksha Mahadev Temple) ఒక ఆలయం మాత్రమే కాదు అహంకారానికి ముగింపు ఉంటుందని తెలియజేసే పవిత్ర స్థలం. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక భూమి. శక్తి పీఠాల కథతో ముడిపడిన పవిత్ర ప్రదేశంగా భక్తుల విశ్వాసంలో నిలిచింది.ఇలా చేరుకోవచ్చు..దక్షేశ్వర మహాదేవ్ ఆలయం సమీప రైల్వే స్టేషన్- హరిద్వార్సమీప విమానాశ్రయం- డెహ్రాడూన్. హరిద్వార్ నుండి 35 కి.మీ. రోడ్ వే ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. తక్కువ ధర, ఆశ్రమాల వంటి ఉచిత వసతితో సహా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయిఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే లభిస్తుంది.గంగానది ఒడ్డునహరిద్వార్ (Haridwar) భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక మతపరమైన ప్రాచీన నగరం. హిందువులకు పవిత్ర స్థలం. అనేక దేవాలయాల సముదాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది హిందువుల ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దక్షేశ్వర మహాదేవ్ హరిద్వార్లోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది హరిద్వార్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కంఖల్లో ఉంది. సలేశ్వరం ప్రకృతి రమణీయతశివరాత్రి నుంచి గుర్తు పెట్టుకోవాల్సిన సందర్శన స్థలాల జాబితా తయారుచేసుకుంటే అందులో చేర్చాల్సిన పర్యాటక ప్రాంతం ‘సలేశ్వరం.’ ప్రకృతి ఏర్పాటు చేసిన ఈ ప్రాంత సందర్శన మనలో ఒక ఉత్తేజాన్ని, శక్తిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం క్షేత్రానికి దగ్గరలో.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువై ఉన్న యాత్రా స్థలం ఇది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లోయలో ఉన్న గుహలో లింగ రూపంలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడి జలపాతానికి సందర్శకులు ముగ్ధులు అవుతుంటారు. లోయలోకి ట్రెక్కింగ్ చేసేవారికి అనుకూలం. లోయ అడుగు భాగంలో ఉన్న శివయ్యను దర్శించుకోవాలంటే గుట్టల మధ్య నుంచి కిందుగా కాలి నడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ దారిలో ఎన్నో గుహల నుండి జాలువారే సన్నని జల ధారలు కనిపిస్తూ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అడుగు భాగంలో ఉన్న గుండం చేరుకున్నాక పైకి చూస్తే .. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి.. మధ్యలో మనం.. తెలియని అనుభూతికి లోనవుతాం. గుండంలోని నీళ్లు అతి చల్లగా, స్వచ్ఛంగా, రుచిగా ఉంటాయి. స్థానిక చెంచులు ఇక్కడ పూజారులుగా ఉంటారు. చైత్ర పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలు జరుపుతారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కి.మీ దూరంలో పరహాబాద్ వస్తుంది. అక్కడి నుంచి మరో 32 కిలో మీటర్ల దూరం దట్టమైన అడవిలోకి వెళ్లాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.అమర్నాథ్ నమ్మకమే శాశ్వతంహిమాలయాల మధ్యలో అమర్నాథ్ మంచు గుహలో మహాశివుడు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. సహజంగా ఏర్పడే ఈ లింగం జీవితం శాశ్వతం కాదు అని, నమ్మకం, విశ్వాసమే శాశ్వతం అని గుర్తు చేస్తుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు. అమర్నాథ్ యాత్ర అనేది శరీరానికి పెద్ద పరీక్ష లాంటిది. పలుచని గాలి, తీవ్రమైన చలి, చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం – ఇవే యాత్రలో భక్తులకు ఎదురయ్యే సవాళ్లు. అందుకే తొలిసారి అమర్నాథ్ యాత్ర చేపట్టిన వారు మొదట్లో కాస్త తటపటాయించినా, భోళాశంకరుడు తన భక్తుడికి కావాల్సిన మనోధైర్యం, శారీరక శక్తిని అందిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రయాణంలో మాటలు తగ్గిపోతాయి. ప్రతి శ్వాస లెక్కతోనే సాగుతుంది. అయినా లక్షలాది మంది ఈ మార్గంలో నడుస్తారు. అద్భుతం కోసమో, అడ్వెంచర్ కోసమో కాదుం పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇలా శివయ్యను దర్శించుకుంటారు. ఈ యాత్రలో ప్రయాణాన్ని బాధగా కాకుండా తత్త్వబోధనగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి అడుగు ఒక ధ్యానం. నిశ్శబ్దం మనలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుంది. మంచు మన మనసు కూడా తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలి అని బోధిస్తుంది. లింగం కరిగిపోతుంది కానీ అనుభూతి మాత్రం మనసులో మిగిలిపోతుంది. అదే అమర్నాథ్ గుహాలయం చెప్పే సారాంశం. అదే శివతత్వం.కేదార్నాథ్ క్షేత్రం ఓ సందేశంప్రతి సంవత్సరం సుమారు ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది. నిత్య పూజలు జరగవు. భక్తుల సందడి, రాకపోకలు ఉండవు. అయినప్పటికీ మహాశివుడు అక్కడే ఉన్నాడని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.ఇక్కడ శివుడిని ఉనికిగా కాకుండా, లేమిగా పూజిస్తారు. అంటే ప్రత్యక్ష దర్శనం లేకపోయినా భక్తి ఆగదనే భావానికి కేదార్నాథ్ ఒక జీవంత ఉదాహరణగా నిలుస్తుంది. వేసవిలో ఆలయం మళ్లీ తెరుచుకున్నప్పుడు భారీ ఉత్సవాల కంటే ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి దీపోత్సవం నిశ్శబ్దంగా జరిగినా, ఆ దీపం ఆలయ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రారంభాన్ని ఒక పండగగా కాకుండా ఆధ్యాత్మిక యాత్రకు నాందిగా భావిస్తారు. ఆ తరువాతే తీర్థయాత్రికుల రాక ప్రారంభమవుతుంది. భక్తి అంటే దేవుడిని ప్రతిరోజూ దర్శించుకోవడమే కాదు. ఆలయానికి నిత్యం వెళ్లడమే కాదు. దూరంగా ఉన్నా దేవుడిని స్మరించడమే నిజమైన భక్తి అని ఈ క్షేత్రం సందేశం ఇస్తుంది. అందుకే ఆలయం మూసి ఉన్న కాలం ముగిసిన వెంటనే భక్తులు దేశం నలుమూలల నుంచి కేదార్నాథ్ దర్శనం కోసం తరలివస్తారు.ఈ ఏడాది ఆలయం తెరుచుకునే తేదీ 2026 సంవత్సరంలో కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 22న ఉదయం సుమారు 7 గంటలకు భక్తుల దర్శనానికి తెరుచుకోనుంది. అలాగే నవంబర్ 11 వరకు దర్శనాలు కొనసాగనున్నట్లు తెలియజేస్తున్నారు. అధికారిక ప్రకటనలు, వాతావరణ పరిస్థితులను బట్టి తేదీలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి యాత్రకు ముందు తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.కాశీ దివ్యమైన అనుభూతిగంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం (Kashi Vishwanath Temple) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు. కాశీలో జీవితం, మరణాన్ని ఒకే తత్వంగా చూస్తారు. గంగానది తీరంలో జరిగే పూజలు, హారతులు, సంస్కారాలు జీవితం శాశ్వతం కాదని గుర్తు చేస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుడిని మాత్రమే కాదు జీవిత సారాన్ని కూడా దర్శించుకుంటారు. జననం, మరణం, మోక్షం అనే చక్రం గురించి ఆలోచిస్తారు.ప్రతీ రోజు జరిగే గంగా హారతి ఒక ఆచారం మాత్రమే కాదు. అది భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మిక అనుభూతి కలిసే ఒక దివ్యమైన సందర్భం. అగ్ని జ్యోతి గంగాజలాలపై ప్రతిబింబించే సమయంలో భక్తులు తమ భయాలు, బాధలు అన్నింటినీ శివుడికి సమర్పించినట్లు భావిస్తారు. కాశీ గురించి చాలా మంది ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మరణించిన వారికి శివయ్యే మోక్ష మార్గాన్ని చూపిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే జీవితంలో ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేయాలని భక్తులు కోరుకుంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయం మనిషికి ఒక సందేశాన్ని కూడా అందిస్తుంది. జీవితం అశాశ్వతంం ఆధ్యాత్మికతే శాశ్వతం అని చాటి చెప్పే పవిత్ర ప్రదేశం కాశీ నగరం. భక్తి అంటే దేవుడిని బయట వెతకడం కాదుం మనలోని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనడం అని చెప్పే పరమ పవిత్ర క్షేత్రం కాశీ. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుచదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు.. ఆ దేశాల్లో లక్షాధికారులే..? -
సహనం: సంక్షోభంలో స్థిరత్వం
భారతీయ జీవన దర్శనం సహనాన్ని కేవలం ఒక సామాన్య గుణంగా కాకుండా, ఒక మహోన్నత తపస్సుగా అభివర్ణించింది. కష్ట సమయాల్లో చలించకుండా ఉండటమే సహనం. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషి ప్రతిదీ తక్షణమే జరిగిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ అత్యుత్సాహం అసహనాన్ని పెంచి, చిన్న విషయాలకే ఒత్తిడికి గురిచేస్తోంది. సహనం అంటే చేతకానితనం కాదు; అది మన మనస్సుపై మనకు ఉండే అద్భుత నియంత్రణ.విత్తనం విత్తిన వెంటనే ఫలాలు అందవు కదా! ఆ విత్తనం మట్టిలో కలిసి, అంకురించి, మొక్కగా ఎదిగి, వృక్షమై, చివరకు పండ్లను అందించడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో ఆ విత్తనం ఎదుర్కొనే ఎండలు, వానలు, గాలివానలు అన్నీ ఓర్పుకు నిదర్శనాలు. జీవితంలో మన శ్రమకు తగ్గ ఫలితం దక్కాలంటే ఈ నిరీక్షణ తప్పనిసరి.ఆర్ష విజ్ఞానంలో సహనానికి భూదేవిని మించిన నిదర్శనం మరొకటి లేదు. సమస్త జీవరాశి తనపై సంచరిస్తున్నా, తనను తవ్వుతున్నా ఆమె చలించకుండా అందరినీ భరిస్తుంది. అలాగే వనవాస సమయంలో పాండవులు చూపిన నిగ్రహం అద్భుతం. రాజభోగాలను వీడి, ఎన్నో అవమానాలను భరిస్తూ సరైన సమయం కోసం వేచి చూశారు. ఆ ఓర్పే వారిని ధర్మ యుద్ధంలో విజేతలుగా నిలబెట్టింది. కోపం క్షణికావేశంలో కలిగే వినాశనం అయితే, సహనం శాశ్వతమైన విజయాన్ని అందించే మౌన శక్తి. పాలు పెరుగుగా మారాలన్నా, రాయి శిల్పంగా మారాలన్నా ఆ ప్రక్రియలో సహనం అంతర్లీనంగా ఉంటుంది. మన సంస్కృతిలో సహనం కలిగిన వాడిని మాత్రమే ధీరుడు అని పిలుస్తారు. నిశ్చలత్వమే నిత్య సత్యమని గుర్తించినప్పుడు ఏ కల్లోలమూ మనల్ని చలింపజేయదు. నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనకు ఇష్టమైన ఫలితం ఆలస్యమైనప్పుడు మనసు ఆందోళన చెందుతుంది. అటువంటి సమయంలో ప్రకృతిని గమనించాలి. ఋతువులు తమ క్రమం తప్పకుండా వస్తాయి, నదులు సుదీర్ఘ ప్రయాణం తర్వాతే సముద్రాన్ని చేరుతాయి. మనం చేసే ప్రయత్నం సరైనదైనప్పుడు, కాలం మనకు సానుకూల ఫలితాన్ని అందిస్తుందనే నమ్మకమే సహనం. కుటుంబ సంబంధాల్లో కానీ, వృత్తి పరమైన సవాళ్లలో కానీ ఆవేశంతో స్పందించే కంటే, సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అనర్థాలు తప్పుతాయి. సహనం మనలో విచక్షణను పెంచుతుంది. ఇది ఒక రకమైన మానసిక పరిపక్వత; ఇది మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.విశ్వజనీన ధర్మం అందించిన ఈ సహన మార్గం వ్యక్తిని స్థితప్రజ్ఞుడిగా తీర్చిదిద్దుతుంది. తొందరపాటు నిర్ణయాలు అపజయాన్ని ఇస్తే, ఓర్పుతో కూడిన అడుగులు విజయతీరాలకు చేరుస్తాయి. మన హృదయంలో సహనం అనే జ్యోతి వెలుగుతున్నంత కాలం ఏ సవాలునైనా అధిగమించవచ్చు. లోకంలో మార్పు అనేది క్రమంగా జరుగుతుంది; ఆ మార్పులో మనం భాగస్వాములవ్వాలంటే సహనం అత్యంత అవసరం. అందుకే మనలో ఉన్న ఓర్పును పెంచుకుంటూ, ప్రశాంతమైన చిత్తంతో లక్ష్యం వైపు సాగిపోదాం. సహనమే శక్తి, సహనమే శాంతి. సర్వం సుమంగళం!వ్యక్తిత్వ వికాస నిపుణులువైదిక సంంస్కృతి బోధించిన తితిక్ష అంటే సుఖదుఃఖాలను, శీతోష్ణాలను సమానంగా భరించే శక్తి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా, విమర్శలు ఎదురైనప్పుడు ఉలిక్కిపడకుండా ఉండటమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. సహనం ఉన్న చోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట దైవత్వం విరాజిల్లుతుంది. మన అంతరంగంలో సహనం అనే వృక్షం పెరిగినప్పుడు, బయటి తుఫానులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ గుణం అలవడిన మనిషికి ప్రతి కష్టం ఒక పాఠంగా, ప్రతి ఓటమి ఒక అనుభవంగా కనిపిస్తుంది. సహనం అనేది మన ఆత్మకు ఉండే కవచం వంటిది; అది మనల్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. – కె. భాస్కర్ గుప్తా -
‘రామాయణ్’ సరికొత్త చరిత్ర
ఆదివారం ఉదయం... అప్పట్లో కేవలం ఒక సెలవు దినం కాదు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారి, దేశమంతా ఒకే నిశ్శబ్దంలో మునిగిపోయే సమయం. సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రజలు పనులన్నీ పక్కనపెట్టి టీవీల ముందు చేరేవారు. ఇళ్లలో ఒక రకమైన భక్తి వాతావరణం నెలకొనేది. దేశవ్యాప్తంగా ఈ స్తబ్ధతకు, ఐక్యతకు కారణం రామానంద సాగర్ (Ramanand Sagar) సృష్టించిన ‘రామాయణ్’ టీవీ సీరియల్. 1987 జనవరి 25న ప్రారంభమైన ఈ ధారా వాహిక కేవలం ఒక వినోద కార్యక్రమంగా కాకుండా భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఒక అపు రూప ఘట్టంగా నిలిచిపోయింది.ప్రస్తుతం ఈ దృశ్యకావ్యం నలభయ్యో వసంతంలోకి అడుగు పెట్టింది. గత నాలుగు దశాబ్దాలలో మీడియా స్వరూపం పూర్తిగా మారిపోయింది. చేతిలో మొబైల్, ఓటీటీలు, వంద లాది ఛానెళ్లు అందుబాటు లోకి వచ్చాయి. అయినా, ‘రామాయణ్’ సాధించిన ఐక్యత, అది నేర్పిన విలువలు నేటికీ ప్రత్యేకమే. భారతీయ జనజీవనాన్ని అంతలా ప్రభావితం చేసిన మరో కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు.దూరదర్శన్ వేదికగా తొలిసారి ఒక మహా కావ్యాన్ని ధారావాహికగా మలిచిన ఘనత రామానంద సాగర్కు దక్కుతుంది. సుమారు 300 మంది నటీనటులతో సాగర్ ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. ప్రధానంగా గోస్వామి తులసీదాస్ ‘రామచరిత్ మానస్’ను ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ, వాల్మీకి రామాయణంతో పాటు ప్రాంతీయ భాషల్లోని కంబన్, భావార్థ, కృతివాస్, రంగనాథ రామాయణాలలోని విశేషాలను పొందుపరిచారు. సీనియర్ నటుడు అశోక్ కుమార్ వ్యాఖ్యానం ఈ సీరియల్కు జాతీయ సమగ్రతా చిహ్నంగా గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మొదట 52 ఎపిసోడ్లుగా ప్లాన్ చేసినా, ప్రేక్షకుల అపూర్వ స్పందన దృష్ట్యా దీనిని 78 ఎపిసోడ్లకు పెంచాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘లవకుశ’ సీక్వెల్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.వ్యాపారపరంగానూ ‘రామాయణ్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. అప్పట్లో ప్రజాదరణ పొందిన ‘బుని యాద్’, ‘చిత్రహార్’ వంటి టీవీ కార్యక్రమాలను వెనక్కి నెట్టి ప్రకటనల ఆదాయంలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రారంభంలో ఒక్కో ఎపిసోడ్కు 15గా ఉన్న ప్రకటనలు, కొద్ది నెలల్లోనే 40కి పెరిగాయి. దూరదర్శన్ ఆదాయంలో ఎనిమిదో వంతు కేవలం ఈ ఒక్క సీరియల్ నుంచే వచ్చేదంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో 10 సెకన్ల ప్రకటన కోసం రూ. 40 వేలు చెల్లించేందుకు 135 సంస్థలు క్యూ కట్టేవి. వారానికి సుమారు రూ. 28 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించి పెట్టిన ఘనత దీని సొంతం.అప్పట్లో దూరదర్శన్ వీక్షకుల సంఖ్య 6 నుంచి 8 కోట్ల మధ్య ఉండగా, రామాయణంలోని కీలక ఎపిసోడ్లను సుమారు 10 కోట్ల మంది చూశారు. ఇది అప్పటి దేశ జనాభాలో దాదాపు ఎనిమిది శాతం. ఈ సీరియల్ ప్రసార సమయంలో వీధులు కర్ఫ్యూను తలపించేవి. జనం అపాయింట్మెంట్లు రద్దు చేసుకునే వారు. ఫ్యాక్టరీల్లో కార్మికులు దొరకని పరిస్థితి ఉండేది.సినిమా హాళ్లలో ఉదయం షోలు (Morning Show) రద్దయ్యేవి. గ్రామాల్లో ఒకటి, రెండు టీవీలు మాత్రమే ఉన్న ఆ రోజుల్లో, జనం కమ్యూనిటీ హాళ్ల వద్ద సామూహికంగా కూర్చుని రామాయణాన్ని వీక్షించే వారు. చాలా ఇళ్లలో ‘రామాయణ్’ వీక్షణ ఒక మతపరమైన ఆచారంగా మారింది. టీవీ సెట్లను శుభ్రం చేసి, పూలమాలలు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించి, ధూపదీపాలతో పూజలు చేసేవారు. శంఖం ఊది మరీ సీరియల్ ప్రారంభించే వారు. 1988 జూలై 31న ప్రసారమైన చివరి ఎపిసోడ్ రోజున ప్రజలు దీపాలు వెలిగించి ముందస్తు దీపావళిలా పండుగ చేసుకున్నారు. ఇందులో రాముడు, సీత పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్, దీపికా చిఖిలియాలను ప్రజలు నిజమైన దైవస్వరూపాలుగా కొలిచారు.చదవండి: నాటి రోజుల్లో రెండో పెద్ద పండుగ‘రామాయణ్’ విజయంతో భారతీయ బుల్లితెరపై పురాణ గాథల పరంపర మొదలైంది. ‘మహాభారత్’, ‘శ్రీకృష్ణ’, ‘విష్ణు పురాణ్’ వంటి ఎన్నో సీరియళ్లకు ఇది మార్గదర్శిగా నిలిచింది. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు భయాందోళనల్లో ఉన్నప్పుడు, దూరదర్శన్ మళ్లీ ఈ సీరియల్ను ప్రసారం చేసింది. ఆ అనిశ్చిత సమయంలో ‘రామాయణ్’ ప్రజలకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. భారతీయ సంస్కృతికి, ఆత్మకు రామాయణం ఒక ప్రతిబింబం. తులసీదాస్ చెప్పినట్లు రాముడు అనంతుడు, ఆయన కథ కూడా అపారమైనది. నిన్నటి కథగా కాకుండా, నేటి తరం జీవన విలువల మార్గదర్శిగా ఈ దృశ్యకావ్యం నిలిచిపోతుంది.– డాక్టర్ అజేయ్ శివర్ల, ఆంగ్ల అధ్యాపకుడు (2026, జనవరి 25తో నలభయ్యో పడిలో దూరదర్శన్ ‘రామాయణ్’ సీరియల్) -
వర్తమానంలోనే ఉందాం..
వర్తమానంలో జీవించడం అనేది ఒక అద్భుతమైన కళ. దీనినే మనం ‘మైండ్ఫుల్నెస్’ అని కూడా పిలుస్తాం. గతం గురించి పశ్చాత్తాపం చెందకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా, ప్రస్తుతం ముందున్న క్షణాన్ని పూర్తిగా అనుభవించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.మనం చాలా పనులు యాంత్రికంగా చేస్తుంటాం. ఉదాహరణకు: అన్నం తినేటప్పుడు టీవీ చూడటం, స్నానం చేసేటప్పుడు ఆఫీసు పనుల గురించి ఆలోచించడం. ఆహారం రుచి, వాసన, అది మీ నోటిలో ఎలా ఉందో గమనిస్తూ తినండి. నేలపై మీ అడుగుల స్పర్శను, గాలిని అనుభూతి చెందండి. తీర్పులు ఇవ్వడం మానుకోండి. మనకు ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు అది ‘మంచి’ లేదా ‘చెడు’ అని వెంటనే ముద్ర వేస్తాం. అలా కాకుండా, ఆ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా గమనించండి. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని మేఘాలను చూస్తూన్నట్లు వదిలేయండి. కానీ వాటితోపాటు కొట్టుకుపోకండి. మనం నియంత్రించలేని విషయాల గురించి (ఉదాహరణకు: ఇతరుల ప్రవర్తన) ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆందోళన అనేది నిజానికి మన మెదడు మనల్ని రక్షించుకోవడానికి ఇచ్చే ఒక సంకేతం. కానీ అది పరిమితి దాటినప్పుడు మన పనితీరును దెబ్బతీస్తుంది. భవిష్యత్తు ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటుంది. అస్పష్టతను భయంగా కాకుండా ఒక అవకాశంగా చూడటం అలవాటు చేసుకోవాలి. వర్తమానంలో జీవించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. భవిష్యత్తు గురించిన అనవసర భయాలు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. పనిలో నాణ్యత పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు పూర్తి శ్రద్ధతో ఉంటారు కాబట్టి బంధాలు బలపడతాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతకడం అలవాటవుతుంది.మనసు పరిగెత్తడం సహజం. అలా వెళ్ళిన ప్రతిసారీ కోప్పడకుండా, ప్రేమగా మళ్ళీ ప్రస్తుత క్షణానికి తీసుకురండి. ఇది ఒక సాధన. పని చేస్తున్నప్పుడు / ప్రయాణంలో ఉన్నప్పుడు ఇష్టదైవ నామాన్ని మెల్లగా జపించండి. ఇది మనస్సును నిలకడగా ఉంచుతుంది. భగవంతుడిని కేవలం గుడిలోనో, పూజాగదిలోనో చూడకుండా, చేసే ప్రతి పనిలోనూ చూడటం. ‘నేను చేసే ఈ పని భగవంతుడికి అర్పితం’ అనే భావనతో పని చేయండి. అప్పుడు ఆ పనిలో నాణ్యత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ‘జరగబోయేది ఏదో భగవంతుడికి తెలుసు, ఆయన చూసుకుంటాడనే నమ్మకం వర్తమానంలో ప్రశాంతతను ఇస్తుంది. ఫలితం మీద ఆశ వదిలేసి, కర్తవ్యాన్ని నిర్వహించడమే గీతలో చెప్పిన సారాంశం. నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసను గమనించడం కూడా ఒక రకమైన ఆరాధనే. శ్వాస అనేది మన శరీరంలో వర్తమానానికి గుర్తు. దేవుడు ఎక్కడో లేడు, మనలో ఉన్న ‘శాంతి’ రూపంలోనే ఉన్నాడు. వర్తమానంలో జీవించడమే భగవంతుడికి మనం ఇచ్చే అతిపెద్ద నైవేద్యం. వర్తమాన కాలంలో ప్రశాంతంగా, సంతృప్తిగా జీవించడం భగవంతుని ఆరాధనలో ఒక అద్భుతమైన మార్గం. రేపటి గురించి ఆందోళన పడకుండా, నిన్నటి గురించి బాధపడకుండా ‘ఈ క్షణంలో’ దైవాన్ని ఎలా అనుభవించాలో మనస్సు పాత జ్ఞాపకాల్లోకో లేదా భవిష్యత్తు భయాల్లోకో వెళ్తున్నప్పుడు, దైవనామాన్ని స్మరించడం వల్ల మనస్సు మళ్లీ వర్తమానంలోకి వస్తుంది.– రామలక్మీ సదానందమ్ -
సప్త వాహనాలపై సప్తగిరీశుడు
ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణాలు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన ఏడు గుర్రాలతో, అనూరువైన సారథి నడుపుతున్న రథాన్ని అధిరోహించి అంతరిక్షంలో మన మాంసనేత్రంతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథం ప్రత్యేకతను తెలియజేస్తూ, మాఘ శుద్ధ సప్తమిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టినరోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని ‘‘రథసప్తమి’’ పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారు నేడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ విశేషాలు...కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణచైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధుల్లో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్యజయంతిగానే గుర్తింపు పొందింది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన సారథీ అంతే.. వికలాంగుడైన అనూరుడు క్షణం విశ్రాంతి తీసుకోడు. ఎప్పుడూ విధి నిర్వహణలోనే ఉంటాడు.సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో ‘అర్క‘ నామంతో సంచరిస్తాడు.సూర్యారాధన ఫలాలుఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చె΄్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్ని పొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యం ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం. అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని శాస్త్రవచనం. రథసప్తమి ... శ్రీవారి వాహన సేవల వివరాలురథసప్తమి సందర్భంగా తిరుమలలో స్వామివారు ఈనెల 25వ తేదీ, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు ద్శనమిస్తారుఉదయం 5.30 నుండి 8 వరకు : సూర్య ప్రభ వాహనం ఉదయం 9 నుండి 10 వరకు : చిన్న శేష వాహనం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు : గరుడ వాహనం మధ్యాహ్నం 1 నుండి 2 వరకు : హనుమంత వాహనం మధ్యాహ్నం 2 నుండి 3 వరకు : చక్రస్నానం సాయంత్రం 4 నుండి 5 వరకు : కల్పవృక్ష వాహనం సాయంత్రం 6 నుండి 7 వరకు : సర్వభూపాల వాహనంరాత్రి 8 నుండి 9 వరకు : చంద్రప్రభ వాహనం– అలిదేన లక్ష్మీకాంత్, సాక్షి, తిరుమల -
శ్రీపంచమి రోజున సరస్వతి మాతను ఎలా పూజించాలంటే..!
ఈ ఆధునిక యుగంలో సమస్తానికీ మూలకారణం విద్య ఒక్కటే. చక్కటి విద్యకారణంగానే పిల్లలు సభ్యమానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. భాషాజ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్పూర్తిగా, నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధిస్తే చాలు ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను ప్రసాదిస్తుంది.సకల కళలకు, విద్యకు అధిదేవత శ్రీసరస్వతీదేవి. వివిధ పురాణాలలో సరస్వతీ ఆవిర్భావం గురించి వివిధ కథనాలు కనబడతాయి. గాయత్రీ ఉపాసనలో కూడా సరస్వతీదేవి ప్రస్తావన కనబడుతుంది. ‘‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి.....’’ అంటూ విధ్యాభ్యాసం ప్రారంభిస్తారు. అగ్నికార్యక్రమాలలో కూడా సరస్వతీదేవి ప్రార్థన కనిపిస్తుంది. ఈ విధంగా సరస్వతీదేవి ప్రస్తావన అన్ని ఙ్ఞాన సముపార్జన కార్యక్రమాలలో, దేవతాపూజా విధానాలలో కనిపిస్తుంది. ఎవరైనా సరే, తమకుగాని, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా వసంత పంచమి నాటి ఉదయమే స్నానాదికాలు ముగించుకుని, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమె ప్రతిమ లేదా చిత్రపటాన్ని తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వులతో చేసిన లడ్లు, చెరుకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్లు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. లేదంటే ఎవరైనా పేద విద్యార్థులను చదివించే బాధ్యతను హృదయపూర్వకంగా తీసుకోవడం లేదా శక్తి కొలది ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలను కొనివ్వడం లేదా పండితులు, గురువులకు గ్రంథాలను బహూకరించడం. (చదవండి: ఇవాల్టితో శబరిమల దర్శనం ముగియనుంది..!) -
ఇవాల్టితో శబరిమల దర్శనం ముగియనుంది..!
శబరిమలలోని భక్తుల దర్శనం ఈరోజు రాత్రి 10 గంటలకు ముగుయనుంది. భక్తులను పంప నుంచి సాయంత్రం 5 గంటల వరకే బయలుదేరడానికి అనుమతిస్తారు. ఉదయం కొద్ది మొత్తంలో డబ్బుతో అభిషేకం జరుగుతుంది. నెయ్యాభిషేకం నిన్న ముగిసింది. హరివరాసనం మంత్రోచ్ఛారణతో నాదం ముగిసిన తర్వాత, రాజ ప్రతినిధి సమక్షంలో గురుతి మణిమండపం ముందు ప్రారంభమవుతుంది.రేపు (జనవరి 20), రాజ ప్రతినిధికి మాత్రమే దర్శనం ఉంటుంది. గణపతి హోమం తర్వాత, తిరువాభరణం తిరుగు ప్రయాణం పండలం శ్రాంపిక్కల్ ప్యాలెస్కు బయలుదేరుతుంది. రాజ ప్రతినిధి దర్శనం తర్వాత, ప్రధాన పూజారి అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం చేసి, ఆలయాన్ని మూసివేయడానికి హరివరాసనం పఠిస్తారు. ప్రధాన పూజారి ఆలయ తాళం చెవులను రాజప్రతినిధికి అప్పగిస్తారు. ఇది కూడా ఒక పద్ధతిలో నియమానుసారంగా జరుగుతుంది. 18వ మెట్టు దిగిన తర్వాత ప్రధాని పూజారి దేవస్వం బోర్డు ప్రతినిధులు, శబరిమల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు తాళలను అప్పగిస్తారు. నెలవారి పూజ ఖర్చులు చెల్లించిన తర్వాత అతను పండలం ప్యాలెస్కు తిరిగి వస్తాడు.ఇదిలా ఉండగా, శబరిమల దర్శనం కోసం స్పాట్ బుకింగ్ కౌంటర్లు నేటి వరకు పనిచేస్తాయి, అప్పటి వరకు అయ్యప్ప భక్తులను దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. పంప, నీలక్కల్, ఎరుమేలిలలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జనవరి 19 వరకు వర్చువల్ క్యూ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. జనవరి 19న, వర్చువల్ క్యూ ద్వారా 30 వేల మందిని, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మంది భక్తులను అనుమతించినట్లు సమాచారం. ఇవాళ మలికప్పురం గురుతిఇవాళ, మలికప్పురం మణిమండపం ముందు శబరిమల యాత్ర ముగుస్తుంది. సన్నిధానం నాదం హరివరాసనం పారాయణంతో ముగిసిన తర్వాత, పండలం రాజప్రతినిధి సమక్షంలో వేడుక జరుగుతుంది. సాయంత్రం గురుతికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. మణిమండపం ముందు వాఝపూల, కురుత్తోల ఉపయోగించి ఐదు 64 నేత్రాల కలాలు తయారు చేస్తారు. మధ్యలో ఒక లాంతరు వెలిగిస్తారు. తర్వాత దీపాలు, పూల దండలతో అలంకరిస్తారు.ఈ గురుతి తంతు కూడా ఒకేసారి మలికప్పురం కన్నిమూల ప్రాంతంలో, కోచుకదత్త ముందు, మలికప్పురం గోపురం తూర్పున జరుగుతుంది. మలికప్పురంలోని రాజప్రతినిధి సాయంత్రం సన్నిధానానికి తిరిగి వస్తారు. అక్కడ హరివరాసనం పూర్తి అయ్యి.. రాజప్రతినిధి తిరిగి వచ్చాక ఈ వేడుక ప్రారంభమవుతుంది. అయితే భక్తులు గురుతి మొదటి వేడుకను మాత్రమే చూడగలరు. గురుతికి ముందు, మలికప్పురం మేల్శాంతి కూడా సన్నిధానానికి తిరిగి వస్తారు.మలికప్పురం గురుతి (Malikappuram Guruthi) అంటే శబరిమల అయ్యప్ప దేవాలయం దగ్గర ఉన్న మలికప్పురం దేవతకు నిర్వహించే ఒక ముఖ్యమైన, వార్షిక పూజా కార్యక్రమం. అయ్యప్ప ఆలయానికి మలికప్పురం దేవత (మాలిక్కపురత్తమ్మ) ఉంటుంది. ఇక్కడ గురుతి పూజ అనేది తీర్థయాత్ర ముగింపులో నిర్వహించే సంప్రదాయ ఆచారం. దీనిలో భాగంగా కొండ దేవతల ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ ఘట్టాన్ని.. అయ్యప్పను సందర్శిన అనంతరం చాలా శుభప్రదంగా భావిస్తారు అయ్యప్ప భక్తులు. (చదవండి: రేపటితో శబరిమల ఆలయం మూసివేత.. ఆదాయం ఎంతంటే?) -
గుప్త దానం
స్వామి వారి దర్శనార్థం తిరుమలకొండకు చాలామంది తమిళ భక్తులు కాలినడకన వెళ్తూ ఉంటారు. వారు కాలికి చెప్పులు వేసుకోరు. ఆడామగా తేడా లేకుండా పసుపు గుడ్డలు ధరించి, భుజానికి సంచి తగిలించి, గోవింద నామస్మరణలు చేస్తూ నడుస్తారు. అలసిన సమయంలో ఏ చెట్టునో ఏ గుడినో ఆశ్రయిస్తారు. దొరికింది తింటారు.తమిళనాడు దాటి ఆంధ్ర సరిహద్దుల్లో ప్రవేశించే దారిలో అనేక పల్లెటూర్లు ఉన్నాయి. ఆ ఊర్లలోని ఒక పల్లెటూరి యువకుడికి ఒక పౌర్ణమి రోజున నడిచి వెళ్ళే భక్తులకు అన్నదానం చేయాలనిపించి తండ్రితో ఆ విషయం చెప్పాడు. ‘‘పేదలమైన మనం అంత ఖర్చుతో కూడుకున్న పనులు చేయలేము, ఆ ఆలోచన మానుకో!’’ అన్నాడు తండ్రి. ‘‘మన దగ్గర డబ్బు లేదు సరే, దానగుణం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వారిని అడుగుదాము’’ అన్నాడు కొడుకు.సరేనని కొడుకును తోడు చేసుకుని తండ్రి ఊరివారినడిగాడు. ఎవ్వరూ స్పందించలేదు. పక్క ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక ధనవంతుడిని కలిశారు. తాను ఎంతమందికైనా చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయగలనని, అయితే, అన్నదానం చేసే చోట తన పేరును పెద్ద అక్షరాలతో రాసి పెట్టాలని కోరాడతను. ఆలోచించి చె΄్తామని అక్కడినుంచి కదిలాడు తండ్రి. వెనుకనే కొడుకు కూడా నడిచాడు.మరో ఊరు వెళ్తూ ఉంటే దారిలో ఒక మధ్యతరగతి రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. అన్నదాన కార్యక్రమానికి దాతలకోసం వెదుకుతున్నామని బదులిచ్చారు. వెంటనే ఆ రైతు ‘‘నాకు ఆ అవకాశం ఇవ్వండి. విందు భోజనం కాక΄ోయినా నా శక్తి కొలది మంచి భోజనమే చేయిస్తాను. అయితే నేను అన్నదానం చేసినట్లుగా ఎక్కడా ప్రచారం చేయకండి. నాకు అలాంటి ప్రచారాలు ఇష్టం లేదు’’ అని చెప్పాడు. అలాగేనని తండ్రి అంగీకరించాడు.పౌర్ణమి రోజు రానే వచ్చింది. భక్తులకు తండ్రీకొడుకు అన్నదానం చేస్తూ ఉన్నారు. కొడుకు తండ్రితో ‘‘ఇప్పుడు మనం చేసే అన్నదానం... పులిహోర, పెరుగన్నం, అరటిపండే కదా. దీనికన్నా చక్కటి భోజనం ఏర్పాటు చేస్తానన్న అతడి విందు ఎందుకు వద్దన్నావు? అని ప్రశ్నించాడు.తండ్రి నవ్వి ‘‘ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే అది దానమవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. పేరు ప్రతిష్టల కోసం చేసేది దానమనిపించుకోదు. అందుకే దాన్ని వద్దన్నాను’’ అని వివరించాడు. తృప్తి్తగా తిన్న భక్తులు ‘అన్నదాతా సుఖీభవ!’ అంటూ అక్కడినుంచి కదిలారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
పండుగను ఆస్వాదిద్దాం
అదే పండగ. కాని తీరు మారింది. గతంలో నలుగురూ కూడి ఆస్వాదన చేసేవారు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదనలో జ్ఞాపకం మిగులుతుంది. ఎంజాయ్మెంట్ క్షణికం. పండుగ చేసుకోవడం సులభమైంది. పెరట్లో పూచే బంతిపూల చెట్ల వరుస నేడు కుండీలు చేరాయి. గ్లోబల్ మార్పుల్లో సంక్రాంతిని కొత్తగా చూడాలి... అంటున్నారు ప్రసిద్ధ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీ దేవి.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వచ్చిన ప్రతి సంక్రాంతి పండగ నాకు బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు మా గిరిజన ప్రాంతపు పల్లెల్లో సంక్రాంతి రోజుల్లో పంటతో పాటు తోటల నుంచి తాజా చిక్కుడు కాయలు, ఏజన్సీ ముళ్ళ వంకాయలూ, పచ్చి మిరపకాయలు ఇళ్ళకు గుట్టగా వచ్చి పడేవి. తియ్య గుమ్మడి పళ్లు సరేసరి. ‘కొసరి నూరిన పచ్చి పసుపు పూత మొగాన గుమ్మడి పూ దుమారమ్ము నద్ది పండ రేగడి బండి నార కన్పండువై ΄÷లుచు మిర్యపు పండు బొట్టు పెట్టి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వీధి‘ అని రాసేడు ఆనాడెప్పుడో కవి. దేశంలో ఇప్పుడు పంట ఉత్పత్తి పెరిగింది. ఎరువులు, పురుగుల మందులు మనవి కాదనుకుంటే దిగుబడి పెరిగింది. బజార్ల నిండా బంతి పూలు, చేమంతి పూలు విరగబడి ఉంటున్నాయి. ఈ ఏడాది చలి కూడా బావుంది. పుష్యమాసానికి తగినట్టు ఉంది. పాత, పాత సంక్రాంతి రోజులను గుర్తుకు తెచ్చింది. మా గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ ఇంత గ్లోబల్ నాగరికత వల్ల కమ్ముకొన్న ΄÷గ అంతటిలోనూ ధనుర్మాసమంతా వీథి వీథినా వాకిళ్లలో ముగ్గులు పెడుతూనే ఉన్నారు.మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ప్రజలు సంక్రాంతి సంప్రదాయ వేడుకలకు గ్లోబల్ మెరుపుల మధ్య పరాకు పడినట్టయేరు. ఎనభయిల్లో మా రాజవొమ్మంగికి టూరింగ్ టాకీస్ వచ్చినప్పుడు జనం సంక్రాంతి పండగని పక్కన పెట్టి విగబడి సినిమాకి పోయేవారు. ఆ రోజుల్లో పండగ తాలూకు అన్ని సంబరాలూ తగ్గేయి. గ్లోబల్ నాగరికత అలా పండుగను వెనక్కు నెట్టింది. కానీ తిరిగి దేశమంతా మళ్లీ కొత్తదారుల్లో పండుగను వెతుక్కుంటోంది. నా చిన్నప్పుడు మా పెరట్లో పశువుల శాల ఉండేది. అక్కడి ఆవు పేడ తీసుకెళ్లి మా వెదురు కంచె అవతల ఉన్న చింత చెట్టు మాను మీద గిరిజన పిల్లలతో కలిసి పిడకలు వేసేదాన్ని. ఆ చింత చెట్టు మాను దాని చుట్టూ ముగ్గురు చేతులు చాపి కౌగిలించుకుంటే పట్టే అంత పెద్దగా ఉండేది. బహుశా ఒక 300 ఏళ్ల వయసు అయి ఉంటుంది దానిది. భోగి పండగ నాటికి ఆ పిడకలన్నీ గుచ్చి భోగిమంటలో వేయటానికి. ఇది ఒక వారం రోజుల కార్యక్రమం. ఇప్పుడు అమెజాన్ నుంచి డైరెక్ట్గా ఆవుపేడ, పిడకలు కూడా వచ్చేస్తున్నాయి. ప్రజలకి ఆ సంప్రదాయం కావాలి, ఎలా దొరికినా సరే. దాంట్లో ఉన్నది అందమా, పుణ్యమా, పురుషార్ధమా అన్నది వేరే విషయం. మేము చదువులకి పట్టణానికి వచ్చినప్పుడు సంక్రాంతి పండక్కి మా పల్లెటూళ్ళకి తరలి వెళ్లే వాళ్ళం. ఎక్కడెక్కడ చుట్టాలూ, బంధువులూ ఇళ్లలో కలిసి పండగ చేసుకునేవారు. ఇవాళ మనిషి రోజులో ఎక్కువ గంటలు సెల్ఫోన్తో జీవిస్తున్నాడు. కానీ సెల్ఫోన్ ద్వారా కూడా చేస్తున్నది సమూహానికి దగ్గర అయ్యే ప్రయత్నమేనేమో. అందులో ఉన్న వాట్సాప్ నిండా ఎన్ని గ్రూపులు ఉంటాయో చెప్పలేం. బయట గ్రూపులే కాక కుటుంబాల గ్రూపులని, కుటుంబాల్లో కజి¯Œ ్స గ్రూపులని, ఒక ఊరి బంధువుల గ్రూపులని రకరకాలు. ఇలా ఒకరినొకరు కలుపుకుంటూ మళ్లీ తిరిగి ఈ పండగలకి ఎక్కడో చోట అందరూ కలవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కలుస్తూ ఉంటున్నారు. పల్లటూర్లు, రిసార్ట్లు నిండి పోతున్నాయి.తిరిగి అవే అరిసెలు, అవే బొబ్బట్లు, అవే చక్రాలు, అవే పిండి వంటలు. పూర్వం వండుకుని తినేవారు. ఇప్పుడు చేయించుకుని తింటున్నారు. సాంకేతికంగా వస్తున్నటువంటి పెనుమార్పులు చూసినప్పుడు, ఇవి మానవ జీవితంలో తీసుకొస్తున్న సౌకర్యాలను గాని, అలజడులను గాని గమనిస్తున్నప్పుడు మన పాత సరదాలన్నీ వెనక్కి పోయాయా అనే విచారం కలుగుతుంది. కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే మనుషులు మళ్ళీ తిరిగి కష్టపడకుండా ఇంకా సులువుగా పండగలను ఎంజాయ్ చేయడానికి సర్వవిధాలా సంసిద్ధులవుతూనే ఉన్నారు. ఇది నగరాలకు కూడా మినహాయింపు కాదు. అసలు జీవితంలో తిండినేనా, అనుబంధాన్నేనా పూర్వం ఆస్వాదించే వారు. ఇప్పుడు ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదన వేరు ఎంజాయ్ వేరు. నేను ఎప్పుడో చె΄్పాను– ఈ ఎంజాయ్మెంట్ అన్నది కూడా గ్లోబలైజేషన్ తాలూకు జార్గాన్ అని. ఎంజాయ్మెంట్ క్షణికం. ఆస్వాదనలో జ్ఞాపకం, కొనసాగింపు ఉంటాయి.సంక్రాంతి పండుగ అంటే మూడు నెలల ముందు నుంచి రైలు టికెట్లు దొరక్కపోవడం, బస్సులు కిటికిటలాడుతూ ఉండటం ఇప్పటికీ ఆ పండగ తాలూకు అట్టహాసాన్ని చెప్తూనే ఉన్నాయి. పల్లెటూర్ల నుంచి, ΄÷లాల నుంచి తోటల నుంచి దూరంగా వచ్చేసిన నేను కూడా సంక్రాంతి పండగ ముందు నాలుగు బంతిపూల కుండీలు, నాలుగు చామంతి పూల కుండీలు కొనుక్కుని ప్రతి ఏడాది బాల్కనీలో పెట్టుకుని కవులను తలుచుకుంటూ ఉంటాను. ‘బంతి పువ్వులకు చామంతులకు నెయ్యమును గూర్చి కబరీభరమ్ము చక్కన కుదిర్చి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వైపు’వాడ్రేవు వీరలక్ష్మీ దేవి రచయిత్రి, సాహితీ విమర్శకులు -
బంగారం పేపర్లతో భగవద్గీత!
యశవంతపుర: కర్ణాటకలోని ప్రఖ్యాత ఉడుపి శ్రీకృష్ణ ఆలయానికి ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువగల బంగారం పేపర్లతో రూపొందించిన భగవద్గీత గ్రంథాన్ని కానుకగా ఇవ్వనున్నారు. 18 అధ్యాయాల్లో 700 స్లోకాలను పొందుపరిచిన స్వర్ణ భగవద్గీతను (Golden Bhagavad Gita) విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. శ్రీకృష్ణ మఠం చరిత్రలో ఇది అపరూపమైన కానుకగా చెప్పుకోవచ్చు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరిస్తారు.వైభవంగా అధ్యయనోత్సవాలుయాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో శ్రీస్వామిని ఆరవ రోజు శ్రీలక్ష్మీనరసింహ స్వామిగా అలంకరించి తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ‘ఇరామానుజ నుత్తందాది ఉపదేశ రత్తినమాలై’అనుసంధానం చేసి, అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలికారు. కాగా.. ఆరు రోజుల పాటు రద్దు చేసిన నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవం, శ్రీసుదర్శన నారసింహ హోమం పూజలు సోమవారం పునః ప్రారంభం అయ్యాయి.– యాదగిరిగుట్ట ధర్మ దర్శనానికి 3 గంటలుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడవీధులు వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు.శ్రీస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామిని 35 వేల మందికిపైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.40,81,041 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: ఆథ్యాత్మిక కథ.. తిరగలి చూడాలి! -
తిరగలి చూడాలి!
ఓ ఉదయం పాండిచ్చేరి పట్టణం నుంచి కారులో ఒక జంట తిరుమల కొండకు దర్శనానికి బయలుదేరింది. వారిది పాండిచ్చేరి స్వంత పట్టణమైనా, ప్రస్తుతం వారు అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. దారి మధ్యలో తిరువళ్ళూరు వద్ద కారు పంక్చర్ అయ్యింది. కారును రోడ్డు పక్కన ఆపి టైరు మార్చుకోవడానికి అవస్థలు పడుతూ ఉన్నారు.అదే దారిలో తిరువళ్ళూరు నుంచి తిరుమలకు మరో జంట వెళ్తూ ఉన్నారు. ఆ తిరువళ్ళూరు జంట, పాండిచ్చేరి జంటను చూసి కారు ఆపింది. సమస్య తెలుసుకుని టైరు మార్చడంలో సహాయం చేయసాగారు. మాటల్లో రెండు జంటలూ దేవుని దర్శనానికి తిరుమలకు వెళ్తున్నట్లు తెలుసుకుని సంతోషపడ్డారు.పాండిచ్చేరి జంట కొంచెం ఒత్తిడితో ఉన్నట్లు గుర్తించింది తిరువళ్ళూరు జంట. దర్శనానికి ఇంకా చాలా సమయం ఉంది కదా, ఎందుకు ఆదుర్దా పడుతున్నారని అడిగింది.‘‘మేము దారిలో ఉన్న నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. అక్కడ శ్రీ పద్మావతీ శ్రీనివాసుల దర్శనం చేసుకుని తిరగలి చూసి ఆపైన కొండకు రావాలి’’ అని సమాధానమిచ్చింది పాండిచ్చేరి జంట.‘‘అవునా... నారాయణవనం అనేది స్వామివారికి కళ్యాణం జరిగిన ప్రదేశమని తెలుసు. కానీ తిరగలి గురించి తెలియదు. అక్కడి తిరగలి అంత విశేషమైనదా?’’ అని ఎదురు ప్రశ్న వేశారు.‘‘ఎంతో విశేషమున్న తిరగలి అది. తప్పకుండా చూసి తీరాలి. గుడిలోని పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన ఉంటుంది. స్వామివారి పరిణయోత్సవ వేడుకల్లో నలుగుపిండి, వడియాల పిండి, పసుపును విసరిన తిరగలి అది. వేల సంవత్సరాలైనా అది చెక్కు చెదరలేదు. మనవారు దాన్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు’’ అని వివరించారు.‘‘అయ్యో... మేము ఇంత దగ్గర ఉండి కూడా ఇన్నాళ్ళూ చూడలేకపోయామే. మీరు అమెరికానుంచి వచ్చి దాన్ని చూస్తున్నారు’’ అని ఆశ్చర్యపోయారు.ఇంతలో టైరును మార్చే పని పూర్తయ్యింది.అందరూ కలిసి నారాయణవనం వెళ్ళారు. ఏడుకొండలస్వామి ఎరుకలసాని వేషంలో ఆ పుర వీధుల్లోనే తిరిగినాడని తెలుసుకుని పులకరించిపోయారు. ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా అవతరించిన శ్రీ మహాలక్ష్మిని శ్రీనివాసుడు వివాహమాడిన పుణ్యక్షేత్రాన్ని కనులారా చూశారు. అమ్మవారు విహారం చేసే విమాన ప్రదక్షిణ మార్గంలో పసుపు కుంకుమలు పెట్టి ఉన్న తిరగలి కనిపించింది. అంత పెద్ద తిరగలిని తామెప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతూ ముక్కుమీద వేలు వేసుకున్నారు. తిరగలిని భక్తిభావంతో తాకిన ఆ నలుగురూ పరవశించిపోయారు. తిరగలిని చూస్తూ ఎంతో బలవంతులైతే కానీ దాన్ని తిప్పలేరని అనుకున్నారు. అప్పట్లో మనుషులు అంత బలంగా ఉండేవారు కాబట్టి అది సాధ్యమయిందని తిరగలికి దణ్ణం పెట్టుకుని తిరుమల ప్రయాణం కొనసాగించారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ప్రశాంత జీవన సూత్రం
సముద్ర తీరాన నిలబడినప్పుడు ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుంది. ఒకరు అలల హోరును చూసి భయపడితే, మరొకరు పాదా లను తడిపే అలల స్పర్శతో పరవశిస్తారు, ఇంకొకరు నీటిపై తేలే రంగురాళ్లను ఏరుకుంటారు. కొందరు విలువైన రత్నాల కోసం లోతుకు వెళ్తారు. తీరాన స్థిరంగా నిలబడి, దేనితోనూ అంటుకోకుండా సముద్ర గమనాన్ని గమనించేవాడే నిజమైన ‘ద్రష్ట’.మన ఆలోచనల నుండి మనం విడివడి, వాటిని కేవలం ఒక సాక్షిగా గమనించినప్పుడు, ఆ ఉద్వేగాల తీవ్రత క్రమంగా క్షీణించి మనసు ప్రశాంత నిర్మల సాగరమవుతుంది. నదిలో కొట్టుకుపోయేవాడు ప్రవాహ వేగాన్ని కొలవలేడు, తీరాన నిలబడేవాడే దాని లోతును గ్రహించగలడు. జీవితంలో సంభవించే పరిణామాలు కూడా అలల వంటివే; అవి మనల్ని తాకవచ్చు గానీ ముంచేయకూడదు. ఈ నిరంతర జాగరూకతే మనల్ని నిలబెడుతుంది. నిశ్చలత్వమే నిత్య సత్యమని గ్రహించినప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు.విశ్వజనీన ధర్మం కేవలం పూజాది క్రతువుల సముచ్చయం కాదు; అది అనంతమైన చైతన్య రహస్యాల నిధి. ముండకోపనిషత్తు ఉద్ఘాటించిన ‘ద్వా సుపర్ణా సయుజా సఖాయా...’ అనే దివ్య మంత్రం మానవ మనస్తత్వానికి ఒక అద్భుత భాష్యం. ఒకే వృక్షంపై నివసించే రెండు పక్షులలో ఒకటి భౌతిక ఫలాలను భుజిస్తూ సుఖదుఃఖాలకు లోనవుతుంటే, రెండవది కేవలం ‘సాక్షి’గా వీక్షిస్తూ ఆనందమయంగా ఉంటుంది. లోకంలోని ద్వంద్వాలను అనుభవించేది ఒక పక్షి అయితే, ఆ అనుభవాన్ని నిర్లిప్తతతో గమనించేది మరో పక్షి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ఒత్తిడి కోరల్లో చిక్కుకున్న ఆధునిక మానవుడికి ఈ సాక్షీభావమే అత్యంత ఆవశ్యకమైన సంజీవని. ఆ దివ్య దృష్టిలోనే జగత్తు అసలైన పరమార్థం నిబిడీకృతమై ఉంది. ఈ నిరంతర ఎరుక కలిగిననాడు మనిషి సామాన్య జీవి నుండి దైవత్వపు అంచులకు చేరుకుంటాడు. జ్ఞానాగ్నితో అజ్ఞానాన్ని దహించి, ఆత్మజ్ఞాన సౌరభాన్ని పొందడమే ఆర్ష సంస్కృతి మనకు బోధించే పరమ రహస్యం. మానవ జన్మ ధన్యమవ్వడానికి ఇటువంటి తాత్విక చింతన ఎంతో అవసరం.భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించిన ‘అసంగత్వమే’ ఈ సాక్షీభావం. తామరాకుపై నీటిబొట్టులా సంసారంలో ఉంటూనే, దేనికీ అంటకుండా ఉండటం ఒక దివ్య కళ. ‘నేను కోపంగా ఉన్నాను’ అని కాకుండా, ‘నా మనసులో కోపం అనే తరంగం ఉద్భవించింది’ అని గమనించడం ప్రారంభించిన క్షణమే ఆ వికారం ఆవిరైపోతుంది. ఇది పలాయనవాదం కాదు; పరిపూర్ణమైన అవగాహనతో కూడిన ప్రశాంత స్థితి. సుఖం వచ్చినప్పుడు అది ఒక అతిథి అని, దుఃఖం సంభవించినప్పుడు అది ఒక తాత్కాలిక మేఘమని భావించాలి.వైదిక విజ్ఞానం మనకు అందించిన ఈ అమోఘమైన దృక్పథం, వ్యక్తిని సమర్థుడిగా, సమాజాన్ని సలక్షణంగా తీర్చిదిద్దుతుంది. ఎక్కడైతే ద్వేషం ఉండదో, ఎక్కడైతే మమకారపు సంకెళ్లు ఉండవో, అక్కడ నిరతిశయమైన శాంతి విరాజిల్లుతుంది. సాక్షీభావంతో జీవించడం నేర్చుకుంటే, ప్రతి రోజూ ఒక ఉత్సవమే, ప్రతి క్షణం ఒక పరమపదమే. చీకటిని నిందించడం కంటే చిన్న దీపాన్ని వెలిగించడం మేలు అన్నట్లు, కల్లోల ప్రపంచంలో మనశ్శాంతి అనే జ్యోతిని వెలిగించుకుందాం. సర్వం ఆ పరమాత్మ స్వరూపం! లోకాః సమస్తాః సుఖినో భవంతు!మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి; ఆకాశం మాత్రం ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. మన ఆత్మ ఆ ఆకాశం వంటి నిర్లిప్త స్థితి. ఇటువంటి మానసిక సంస్కారం అలవడినప్పుడు మనిషి ఏ పరిస్థితిలోనూ చెక్కుచెదరని ధైర్యంతో, ప్రశాంతతతో వ్యవహరించగలడు. అంతిమంగా, మన జీవిత నాటకంలో మనం కేవలం పాత్రధారులమే కాదు, ఆ నాటకాన్ని తిలకించే ప్రేక్షకులం కూడా అని గుర్తించడమే పరమ సత్యం. ఈ జ్ఞానమే మనల్ని బంధవిముక్తులను చేసి మోక్షమార్గాన నడిపిస్తుంది. నిష్కామ కర్మ ద్వారానే సిద్ధి కలుగుతుందని పెద్దల మాట.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
కోడలికి మేడలు లేవని చెబుతాం!
కర్నూలు జిల్లా: తరాలు మారినా, కంప్యూటర్ యుగం నడుస్తున్నా ఆ గ్రామంలో ఇప్పటికీ ఓ ఆచారం కొనసాగుతోంది. ఎంతటి వారైనా, ఉన్నతాధికారులైనా తమ గ్రామంలో ఉండాలంటే ఈ ఆచారాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. గ్రామస్తుల ఆరాధ్య దైవమైన ఉచ్చీరప్ప తాత ఆలయం కంటే ఒక్క ఇంచు కూడా ఎత్తుగా ఇళ్లను కట్టరాదన్నది ఇక్కడ ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం. తమ పెద్దలు ఆచరించి చూపిన నియమాన్ని తాము ఎప్పటికీ పాటిస్తామని ఆ గ్రామస్తులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో 6,500 మంది ఓటర్లు, దాదాపు 2,900 వరకు గృహాలు ఉన్నాయి. గ్రామంలో మోతుబరి రైతైనా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించిన వారైనా, ఆర్థికంగా ఉన్న వారైనా ఇంటిపై మేడలు కట్టరు. గ్రామస్తుల ఆరాధ్య దైవం ఉచీ్చరప్ప తాత ఇక్కడ ఎన్నో మహిమలు చూపి భక్తుల విశ్వాసం పొందారు. తన ఆలయం కంటే ఎత్తుగా ఎవరూ మిద్దెలు నిర్మించుకోరాదని గ్రామస్తులను ఆజ్ఞాపించారు. తద్వారా గ్రామానికి ప్రతిష్ట ఉంటుందని చూచించారు. నాటి ఆయన ఆజ్ఞను గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు. దీంతో ఆ ఊరి కోడలిగా వచ్చే యువతికి, ఆమె బంధువులకు వివాహం కుదుర్చుకునే సమయంలోనే తమకు మేడలు లేవని చెప్పడం సంప్రదాయంగా వస్తోంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా మరోచోట ఖాళీ స్థలం తీసుకొని ఇంటిని నిర్మించుకుంటారు గానీ మిద్దెపై మరో అంతస్తు కట్టే సాహసం చేయరు. పెద్దహోతూరు గ్రామంలో కొలువుదీరిన ఉచ్చీరప్పతాత, సమీపంలోని మరకట్టు గ్రామంలో కొలువుదీరిన సలువప్ప తాత ఆజ్ఞల మేరకు నేటికీ ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అలాగే జని్మంచిన శిశువులకు ఉచీ్చ రప్ప, ఉచీ్చరమ్మ, సలువప్ప తాత పేర్లు పెట్టడం అనవాయితీగా వస్తోంది. -
ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారాన వైకుంఠనాథుడు
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి – భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడట. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని, ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని పెద్దలు చెబుతారు. ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం వలన మోక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే తిరుమలతో సహా అన్ని వైష్ణవ క్షేత్రాలలోనూ భక్తుల సందర్శనకు వీలుగా ఈరోజున తెల్లవారు జాము నుంచే ఉత్తర ద్వారాలు తెరచి ఉంచుతారు. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ఇది సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువుతో ముడిపడిన తిథి. అందుకే ఏకాదశిని హరితిథి అని, వైకుంఠదినమనీ అంటారు. ఇటువంటి ఏకాదశులు మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి. అధికమాసం వచ్చిన సంవత్సరంలో ఇరవై ఆరు వస్తాయి. (చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకూ ఒక అధికమాసం వస్తుంది). వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగానూ, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగానూ మనం పండుగలాగ జరుపుకుంటాం. ఉత్తరాయన ప్రారంభదినం కావడం మూలాన ఇది అత్యంత విశిష్ఠమైనది. ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించింది. అప్పటినుంచి మూసి ఉన్న స్వర్గ ద్వారాలు ఈధనుర్మాసారంభం నుంచి తెరుచుకుంటాయని పురాణ వచనం. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తరద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివినుంచి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశినాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రినుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఇవాళ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.ఉత్తర ద్వారమే వైకుంఠ ద్వారం. ఈ వైకుంఠద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తర ద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం. శ్రీరంగం, తిరుపతి, అన్నవరం, భద్రాద్రి, మంగళగిరి, యాదగిరి గుట్ట, స్వర్ణగిరి వంటి అన్ని క్షేత్రాలలో ఈ ముక్కోటి ఏకాదశిని మహోత్సవంగా జరుపుకుంటారు. ముక్కోటి ఏకాదశిని అత్యంత మహిమాన్వితమైన రోజుగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈనాడు ఉపవాసం, విష్ణుపూజ విశేష ఫలాలనిస్తాయి. వైకుంఠ ఏకాదశినాడు గోపూజ చేయడం చాలమంచిది. విష్ణుమూర్తి సన్నిధిలో ఆవునేతితో దీపం వెలిగిస్తే సర్వపాపాలు హరించి అజ్ఞానమనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. – డి.వి.ఆర్, (మంగళవారం ముక్కోటి) -
కొత్తగా స్వాగతం చెబుదాం...
కాలం అనేది అందరినీ శాసించే శక్తి. మనం కాలాన్ని ఆపలేము, కానీ కాలంతో పాటు మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ‘సమయపాలన, కర్తవ్య నిర్వహణ’ ద్వారా మాత్రమే మనిషి ఈ కాల చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధించగలడు.ఆధ్యాత్మిక కోణంలో ‘క్యాలెండర్’ అనేది కేవలం తేదీలు, వారాల పట్టిక మాత్రమే కాదు, అది మన జీవిత ప్రయాణానికి కాల చక్రానికి ఒక దిక్సూచి వంటిది. అనేక సంస్కృతులలో కాలాన్ని దైవంగా భావిస్తారు (’కాలాయ తస్మై నమః’). క్యాలెండర్ మనకు కేటాయించబడిన పరిమిత సమయాన్ని గుర్తుచేస్తూ, ప్రతి క్షణాన్ని సార్థకం చేసుకోవాలని బోధిస్తుంది. క్యాలెండర్లు (పంచాంగాలు) సూర్యచంద్రుల గమనాన్ని బట్టి రూపొందించబడతాయి. ఇవి మనం ప్రకృతితో, విశ్వంతో ఎలా మమేకమై ఉన్నామో తెలియజేస్తాయి. గ్రహాల గమనం మన మనస్సుపై, శరీరంపై చూపే ప్రభావాన్ని ఇవి సూచిస్తాయి. ధ్యానం, ప్రార్థన లేదా పండుగలకు క్యాలెండర్ ఒక క్రమబద్ధమైన రూపాన్ని ఇస్తుంది. ఒక నిర్దిష్టమైన దినాన ఒక ఆధ్యాత్మిక కార్యాన్ని చేయడం వల్ల మనలో క్రమశిక్షణ, సంకల్ప బలం పెరుగుతాయి.క్యాలెండర్లోని ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అవి చెడుపై మంచి సాధించిన విజయాన్ని లేదా మనలోని అంతర్గత మార్పును సూచిస్తాయి. క్యాలెండర్ ఈ సందర్భాలను గుర్తు చేస్తూ మనల్ని ఉన్నత స్థితికి నడిపిస్తుంది. క్యాలెండర్ గడిచిన, రాబోయే రోజులను (భవిష్యత్తు) చూపిస్తున్నప్పటికీ, అది మనకు ఇచ్చే గొప్ప పాఠం ‘ఈ రోజు’ ప్రాముఖ్యత. ఆధ్యాత్మికంగా, ఈ క్షణంలో జీవించడమే పరమార్థం.క్లుప్తంగా చెప్పాలంటే, క్యాలెండర్ అనేది కాల గమనాన్ని గమనిస్తూ, ఆ కాలంలో మన ఆత్మ ఎదుగుదలకు మనం చేసే ప్రయత్నాలను నమోదు చేసే ఒక సాధనం. గడిచిన ఏడాదిలో మనం చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలను నెమరువేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. మనలోని అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) ఎంతవరకు నియంత్రించాలో ఆలోచించి, కొత్త నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన ప్రారంభం.గడిచిన కాలంలో మనకు అండగా నిలిచిన వారికి, మనల్ని నడిపించిన ఆ దైవానికి లేదా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఆధ్యాత్మిక ఉన్నతికి మొదటి మెట్టు. కృతజ్ఞత కలిగిన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది.కొత్త సంవత్సరంలో కేవలం భౌతికమైన లక్ష్యాలే (డబ్బు, ఉద్యోగం) కాకుండా, ‘నేను ప్రశాంతంగా ఉంటాను‘, ‘నేను ఇతరులకు సహాయం చేస్తాను‘, ‘నేను ప్రతిరోజూ ధ్యానం చేస్తాను‘ వంటి ఆధ్యాత్మిక సంకల్పాలు తీసుకోవడం ముఖ్యం.కాలం అనంతమైనది. గతం ముగిసిప్పాయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. ఈ కొత్త ఏడాదిలో ప్రతి క్షణాన్ని దైవ ప్రసాదంగా భావించి, పూర్తి అవగాహనతో జీవించడమే గొప్ప ఆధ్యాత్మిక సాధన. మన కోసం మనం జీవించడం సహజం, కానీ ఇతరుల కోసం జీవించడం దైవత్వం. ఈ కొత్త సంవత్సరంలో సాటి మనుషులకు, ప్రకృతికి మనవంతు సహాయం చేయడం వల్ల ఆత్మ తృప్తి లభిస్తుంది.‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్నట్లుగా, మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని, జ్ఞానమనే వెలుగు వైపు అడుగులు వేయడమే కొత్త సంవత్సరం ఇచ్చే అసలైన సందేశం. మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేయడం. మనం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపినప్పుడు, తెలియకుండానే మనలో ఒక లోతైన సంతృప్తి, దైవత్వం చోటు చేసుకుంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... నూతన సంవత్సరానికి స్వాగతం చెబుదాం. – రామలక్మీ సదానందమ్ -
మకరజ్యోతి దర్శనం ఎప్పుడంటే..?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తుంటారు. పవిత్రమైన మకర జ్యోతి దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు.. ఎంతో పుణ్యం .. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఆ జ్యోతి దర్శన భాగ్యం కలుగదనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అపురూప దృశ్యం కోసం గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉంటారు. అలాంటి పవిత్ర ఘడియ మకర జ్యోతి 2026లో ఎప్పుడంటే..శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.ఆధ్యాత్మిక ప్రాముఖ్యతమకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలుసన్నిధానంపాండితావళంమాలికాపురం ప్రాంతం – అట్టతోడునీలిమలపుల్మేడుశరణ్ గుత్తిమరకూట్టంభక్తులకు సూచనలు..మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది.(చదవండి: శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!) -
ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్-ఇసుక శాంతాక్లాజ్ శిల్పం..!
ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతి పండుగ, ప్రత్యేక రోజుల సమయంలో ఆయా ఇతి వృత్తంతో కూడిన సైకత శిల్పంతో మన ముందుకు వస్తుంటారు. ఈసారి అచ్చం అలానే అత్యంత ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని అతి పెద్ద శాంతాక్లాజ్ని రూపొందించారు. అయితే దేనితో తెలిస్తే షాకవ్వడం ఖాయం. మరి ఆ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పూరీలోని నీలాద్రి బీచ్లో 1.5 టన్నుల ఆపిల్ పండ్లు, ఇసుకతో అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇది ఏకంగా 60 అడుగుల పొడవు, 22 అడుగుల ఎత్తు. దీన్ని సుమారు 30 మంది విద్యార్థుల సాయంతో తీర్చిదిద్దారు. క్రిస్మస్ శుభాకాంక్షల తోపాటు ప్రపంచ శాంతి, ఐక్యత సందేశాన్ని ఇస్తూ ఈ భారీ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. అంతేగాదు యాపిల్స్తో రూపొందించిన అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంతో ప్రపంచ రికార్డు సృష్టించనుంది కూడా. దీన్ని పట్నాయక్ 22వ పూరీ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా, క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో రూపొందించారు. తన సాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన 30 మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.Puri-based sand artist Sudarshan Patnaik attempts world record with biggest Santa Claus sculpture created with apples. pic.twitter.com/Qsb1Ez7aHY— News Arena India (@NewsArenaIndia) December 24, 2025 (చదవండి: ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?) -
ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?
యావత్తు ప్రపంచం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగతో సందడిగా ఉంటే..ఈ దేశాల్లో ఆ సందడి కానరాదు. ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకరికొకరు గిఫ్ట్లు, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేషన్ వేడుకల్లో మునిగితేలుతుంటే..ఆయా దేశాలు నిశబ్దంతో నిండి ఉంటాయి. కానీ ఆ దేశాలు కూడా క్రిస్మస్ని ఘనంగానే జరుపుకుంటుంది కానీ ఈ డిసెంబర్ 25 మాత్రం కాదట. మరి ఇంతకీ ఏరోజున క్రీస్తూ పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారంటే..ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు, క్రిస్మస్ డిసెంబర్ 25. రష్యా వంటి కొన్ని దేశాల్లో మాత్రం దాదాపు రెండు వారాల తర్వాత, జనవరి 7న వస్తుంది. ఆ రోజు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. చెప్పాలంటే అక్కడ ఆరోజు ఓ విరామం లేదా విశ్రాంతి రోజులా మారిపోతుంది చుట్టూ వాతావరణం. పూర్వం మొత్తం దేశాలన్ని జూలియన్ క్యాలెండర్ అనుసరించేవి. అయితే 1582లో యూరప్లో ఎక్కువ భాగం కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్ను స్వీకరించింది. లీప్ ఇయర్ని జోడించడంతో రెండు క్యాలెండర్లలో రోజులు, తేదీల అమరికలు తేడాలు వచ్చాయి. అయితే కొన్ని దేశాలు మతపరమైన ఆచారాల నిమిత్తం పాత క్యాలెండర్నే అనుసరించాలనే నిబంధనను ఏర్పరుచుకున్నాయి. దాంతో ఈరెండు క్యాలెండర్ల మధ్య మతపరమైన వేడుకలు జరుపుకునే వ్యత్యాసం ఏకంగా 13 రోజులకుపైనే ఉంటుంది. కాబట్టి కొత్త క్యాలెండర్ని స్వీకరించిన దేశాలు డిసెంబర్25న క్రిస్మస్ జరుపుకుంటే..పాత క్యాలెండర్ని అనుసరించేవారు జనవరి 7న జరుపుకుంటారు. అలా రష్యా డిసెంబర్ 25న ఎలాంటి వేడుకలు నిర్వహించదు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ తోపాటు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటుంది. ఆయా దేశాలన్నీ అధికారికంగా రోజువారీ వ్యవహారాలకు గ్రెగోరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తుండగా, మత పరమైన వేడుకలకు జూలియన్ క్యాలెండర్ని అనుసరించడం విశేషం. అంతేగాదండోయ్ రష్యా వంటి దేశాల ప్రజలు ఆరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రంలో ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మాంసాహారంతో విందు ఆస్వాదిస్తారట.ఏసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు. ఇక్కడ ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటే క్రైస్తవ మతంలోని ఒక ప్రధాన శాఖ, ఇది బైజాంటైన్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది.ఆ దేశాల జాబితా ఇదే:రష్యా (Russia)ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలుసెర్బియా (Serbia)జార్జియా (Georgia)బెలారస్ (Belarus)మోల్డోవా (Moldova)మాంటెనెగ్రో (Montenegro)ఉత్తర మాసిడోనియా (North Macedonia)ఎథియోపియా (Ethiopia)ఎరిట్రియా (Eritrea)(చదవండి: క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?) -
సర్వ మానవాళికి శుభ సందేశం క్రిస్మస్
దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకనే తొలి మానవుడిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేలమంటితో నిర్మించాడు. తొలి భార్య భర్తలైన హవ్వ ఆదాములతో అందమైన ఏదెను తోట ఏర్పాటు చేసి స్నేహితునిలా కొనసాగాడు. అయితే దుష్టుడైన సాతాను ప్రభావంతో వారు దేవుని ఆజ్ఞ మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఫలితంగా మానవులకు మరణం సం్రపాప్తమైంది. భూమి శపింపబడింది. భూమిపై మానవ మనుగడ కష్టతరంగా మారింది.అయితే తాను సృష్టించిన మానవుడిని మాత్రం దేవుడు ఎప్పుడూ విడిచి పెట్టలేదు. భూమిపై అక్రమం, స్వార్థం, హింస పెరిగిన తరుణంలో మానవులను రక్షించేందుకు నాయకులను, న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను ఏర్పాటు చేసినా మానవుని స్వభావంలో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. పాపానికి నరుడు బానిసగా మారిపోయాడు. మోసకరమైన హృదయంతో చీకటితో నిండిన జగతిలో నరకానికి వారసుడయ్యాడు. నరక పాత్రుడైన మానవుడ్ని రక్షించి నిత్య జీవం ఇచ్చేందుకు తిరిగి దేవునితో అనుసంధానం చేసేందుకు పరలోక దేవుడే నరరూపధారుడై రెండు వేల సంవత్సరాల క్రితం దివి నుంచి ఈ భువిపైకి వచ్చేందుకు సిద్ధ పడ్డాడు. మానవుల పట్ల దేవుని అపారమైన ప్రేమకు గొప్ప తార్కాణమే క్రిస్మస్.క్రీస్తు జననం సర్వాధికారియైన దేవాది దేవుని జననం ఎంతో ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం. జగముల నేలే రారాజు అతి సామాన్యుడిగా, దీనుడుగా ఈ ధరిత్రిపై అరుదెంచాడు. అందుకు యూదా దేశంలోని బేత్లెహేము వేదికైంది. ఆ కాలంలో యూదా ప్రాంతం అంతా రోమా చక్రవర్తి కైసరు ఔగుప్తు ఏలుబడిలో ఉంది. హేరోదు యూదా ప్రాంతానికి అధినేతగా యూదుల రాజుగా కొనసాగుతున్నాడు. గలిలయ ప్రాంతంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి నజరేతు వాడైన యోసేపుకు ప్రదానం చేయబడిన పరిశుద్ధురాలైన కన్యక మరియ గర్భంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు జననం శుభవార్త దేవుని ప్రధాన దూతయైన గబ్రియేలు ముందుగా మరియకు తెలియచేశాడు. దయా్రపాప్తురాలా అంటూ శుభ వచనం పలికి దేవుని కృప పొందిన నీవు పురుష సంయోగం లేకుండా కన్యకగానే గర్భము ధరించి ఓ కుమారునికి జన్మనిస్తావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు అతడు సర్వోన్నత దేవుని కుమారుడనబడతాడు అని దేవునిదూత చెప్పడంతో నవ యవ్వనంలో ఉన్న మరియ ఎంతో భయపడింది. ఇది ఎలా సాధ్యం అంటున్న తరుణంలో ‘మరియా భయపడకు ఇది కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తితోనే జరుగుతుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడు...’ అన్న దూత పలుకులను మరియ వినయంగా స్వీకరించింది. మరియ తన ప్రమేయం లేకుండా గర్భవతి అయిందని తెలిసిన యేసేపు ఆమెను రహస్యంగా వదిలివేయాలని భావిస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వివాహం కాకుండా ఏ స్త్రీ అయినా గర్భవతి అయితే బహిరంగంగా రాళ్ళతో కొట్టి చంపడం యూదుల ఆచారం. అదే సమయంలో ఈ శుభ వర్తమానం దూత ద్వారా యోసేపుకు చేరుతుంది. యేసేపూ భయపడవద్దు మరియను చేర్చుకొనుటకు సందేహింప వద్దు. పరిశుద్ధాత్మ వలన ఈ కార్యం జరుగుతుంది. ఆమె కుమారునికి యేసు అని పేరుపెట్టాలి ఎందుకంటే తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షిస్తాడు. క్రీస్తు పుట్టుకకు వందల సంవత్సరాలకు ముందే యెషయా, మీకా లాంటి ప్రవక్తల ద్వారా చేసిన ప్రవచనాల నెరవేర్పు జరిగింది. మరియ సుతుడికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడుతుంది దానికి అర్థం ‘దేవుడు మనకు తోడు’. యెషయా క్రీస్తు జననాన్ని ప్రవచిస్తూ ‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని పేర్కొన్నాడు. క్రీస్తుకు ముందుగా నడవడానికి వృద్ధ దంపతులైన జెకర్యా, ఎలీసబెతులకు కుమారుడిగా బాప్తీస్మమిచ్చు యోహాను అనుగ్రహించ బడ్డాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎటువంటి పాపము చేయకుండా పరిశుద్ధత కలవారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.చరిత్ర సాక్షిగా..మానవ చరిత్రలో యేసు నమోదు చేయబడ్డాడు. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని రోమా చక్రవర్తి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ వచ్చింది. యోసేపు దావీదు వంశములో పుట్టిన వాడు గనుక తనకు ప్రదానం చేయబడిన నిండు చూలాలైన మరియను తీసుకొని గలలియలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేముకు బయలు దేరాడు. ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం ముగించుకొని బేత్లెహేము గ్రామం చేరుకున్నారు. అప్పటికే జనాభా సంఖ్యలో రాయబడటానికి వచ్చిన ప్రజలతో బేత్లెహేము గ్రామం క్రిక్కిరిసి పోయింది. ఓ సత్రపు యజమాని దయతలచి తన పశువుల కొట్టంలో ఉండటానికి వీరికి చోటిచ్చాడు. ప్రసవ దినములు నిండటంతో మరియ శిశువును కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టింది. అవని అంతా ఆయనదే అయినా స్థలం లేక రాజుల రాజుకు చివరకు పశువుల తొట్టె పవళించే పాన్పుగా మారిపోయింది. మనలను ధనవంతులుగా చేసేందుకు ఆయన దరిద్రుడాయేను అన్న లేఖనాల నెరవేర్పు నిజమైంది.దివిలో భువిలో సంబరాలుయేసు జన్మించిన వెంటనే అటు పరలోకంలోనూ ఇటు ధాత్రిలోనూ సంబరాలు మొదలయ్యాయి. ముందుగా పొలంలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరుల వద్దకు ప్రభువు దూత శుభవర్తమానం వెళ్ళింది. ఆ దూత ద్వారా కలిగిన ప్రకాశమైన వెలుగును చూసి వారు భయపడగా దూత భయపడ వద్దని చెప్పి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము తెచ్చానని ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడని ఆయనే ప్రభువైన క్రీస్తు’ అని ప్రకటించడం జరిగింది. అనంతరం పరలోకం నుంచి దూతల మహా సైన్యసమూహము ‘సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక‘ అంటూ స్తోత్ర గీతాలతో దేవుని మహిమ పరచారు. గొర్రెల కాపరులు వెళ్ళి పశువుల తొట్టిలో పండుకున్న శిశువును చూచి ఎంతో సంబరపడి శిశువును గూర్చి తాము చూసిన సంగతులన్నీ ఊరంతా ప్రచారం చేశారు. యేసు జననం సందర్భంగా ఆకాశంలో ఒక అరుదైన నక్షత్రం వెలసింది. అది చూసిన తూర్పుదేశపు జ్ఞానులు ముగ్గురు తారను వెంబడించి ముందుగా యెరూషలేము చేరుకొని హేరోదు రాజును కలిసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగి తెలుసుకొని బేత్లెహేము చేరుకొని బాల యేసును చూసి అత్యానందభరితులై సాగిలపడి పూజించి తాము తెచ్చిన బంగారము, సాంబ్రాణి, భోళము ప్రభువుకు కానుకగా సమర్పించారు. అలా క్రీస్తు జననం దివిని భువిని ఏకం చేసింది. దేవుడితో మరల మానవుడు పోగొట్టుకున్న సమాధానం కల్పించింది. అందుకే క్రిస్మస్ సర్వ లోక వేడుకగా మారిపోయింది. సామాన్యులకు, జ్ఞానులకు ఒకే పీట వేసింది. అప్పటినుంచే ప్రపంచ చరిత్ర రెండుగా విభజింపబడింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా పిలువబడింది.క్రిస్మస్ అంటే ఆరాధనక్రిస్మస్ అంటే దేవుని నిండు మనసుతో ఆరాధించడం. మనకోసం పరలోక భాగ్యాన్ని వదులుకొని పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఎలా జీవించాలో ఆచరణాత్మకంగా చూపించిన ఆ ప్రభువును వేనోళ్ళ స్తుతించడమే నిజమైన క్రిస్మస్. ఆరాధన అంటే అల్లరితో కూడిన ఆట, పాటలు కాదు అంబరాన్ని అంటే సంబరాలు జరపడం కాదు, విందులు వినోదాల్లో తెలియాడటం కాదు, హంగు ఆర్భాటం ఆడంబరాల్లో మునిగితేలడం కాదు.. దేవుని ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి. క్రీస్తును హృదయం లో కలిగి ఉండటమే క్రిస్మస్. అదే క్రీస్తుకు కావాల్సిన ఆరాధన. నశించి పోయే ఆత్మలకు నిత్యజీవము వర ప్రసాదంగా అందించాడు. నీతివంతమైన జీవితం, మారుమనస్సు, రక్షణ ద్వారా ఇది సాధ్యం అని చె΄్పాడు అంతేకాదు ఈ లోకాన్ని జయించడానికి కావలసిన ప్రేమ, కరుణ, జాలి, దయ, శాంతం, సహనం, తగ్గింపు, వినయం, ఓర్పు ఎలా కలిగి వుండాలో తన జీవితం ద్వారా నేర్పించాడు. అన్నిటికీ మించి చీకటిలో బతుకుల్లో గొప్ప వెలుగు నింపేందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగునైయున్నాను అని ప్రకటించాడు. ఆయనతో నడిచే వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఈ క్రిస్మస్ శుభవేళ మనందరం క్రీస్తు స్వారూప్యంలోకి మారాలన్నది ఆ కరుణామయుని అభిలాష. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక! ఆమేన్ !!!మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.దేవుడే ఎందుకు దిగి వచ్చాడు?క్రీస్తు రాకకు ప్రధాన కారణం పాపులను రక్షించుటకే. తొలి మానవుడు ఆదాము ద్వారా వచ్చిన పాపపు బీజం తీసివేయడానికి తన పరిశుద్ధ రక్తం ద్వారా సిలువపై బలిదానం ద్వారా ధరవాసులందరికి పాప విమోచన కోసం మనుషుల మధ్య నివసించేందుకు సర్వాధికారియైన దేవుడు శరీరధారి అయ్యాడు. అంతేకాదు యేసు ప్రభు ప్రజలందరికీ రక్షణ సువార్త అందించడం, పాపపు చెరలో వున్న వారికి విడుదల, అంధకారమైన జీవితాల్లో వెలుగు నింపడం, బాధల్లో నలిగి పోయినవారికి ఓదార్పు విడుదల ఇచ్చేందుకే నేను వచ్చానని ప్రకటించాడు.– స్టెర్జి రాజన్ బందెల సీనియర్ పాత్రికేయులు -
లోతైన ఆలోచన
ఒక ఊర్లో కూలీలను పెట్టి బావుల్ని తవ్వించే మేస్త్రీ ఉండేవాడు. ఆ బావి మేస్త్రీ పల్లెలన్నీ తిరిగి ఎవరు బావి తవ్విస్తారో వారికి కూలీలను ఏర్పాటు చేసి బావుల్ని తవ్వించే పని చేసేవాడు. అతడు పనికి ఒప్పుకున్నాడంటే ఆ బావిలో నీళ్ళు పడాల్సిందే. కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అతడికి మంచి పేరుంది. దాంతో బాగా డబ్బు సంపాదించి కొంచెం స్థిమితపడ్డాడు.ప్రతి పౌర్ణమికీ అతడు వీలు కల్పించుకుని దగ్గరున్న పట్టణంలోని గుడికి వెళ్ళేవాడు. అక్కడ ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలను, రామాయణ భారత భాగవతాలను విని ఇంటికి వచ్చేవాడు. తీరికగా ఆ విషయాలన్నీ భార్యకు చెప్పేవాడు. ఆమె చాలా ఆసక్తిగా వినేది. తనకు వచ్చిన అనుమానాలను భర్తనడిగి తెలుసుకునేది. అయితే తాము మాత్రమే వాటిని తెలుసుకోవడం ఆమెకు రుచించలేదు. ‘మరింత మందికి ఆ మంచి విషయాలు తెలియజేస్తే బాగుంటుంది కదా’ అని ఆలోచించసాగింది.ఒకరోజు పనులన్నీ ముగించుకుని ఉపన్యాసాలు వినడానికి పట్టణానికి బయలుదేరబోయాడు మేస్త్రీ. అతడి స్నానానికని ఇంట్లోని చేదబావిలోని నీళ్ళను తోడుతూ ‘ఎవరింట్లో అయినా బావి తవ్విస్తే ఏమి జరుగుతుంది?’ అని అడిగింది. ‘ఆ ఇంట్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు తోడుకుంటారు. వంటకీ, ఇంటికీ వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు.‘అదే ఊరి మధ్యలో చేదబావి తవ్వితే ఏమవుతుంది?’ అని ప్రశ్నించింది.‘అనుమానమెందుకు? ఊర్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మీరు మాత్రమే విని నాకు చెబితే మనవరకే ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. అదే మీరు ఉపన్యాసకులను మన ఊరికి పిలిపిస్తే ఇంకా బాగుంటుంది. మన ఊరి రాములవారి గుడిలో నెలకొకసారి కార్యక్రమం ఏర్పాటు చేస్తే పిల్లలూ, పెద్దలూ అందరూ వింటారు. నలుగురు వింటే నాలుగు లోకాలు విన్నట్లు కదా’ అని మెత్తగా చెప్పింది.‘ఇన్నాళ్ళూ నా భార్యని బావిలోని కప్పనుకున్నాను. కానీ, లోతుగా ఆలోచన చేసే మనిషి’ అని గుర్తించాడు. వెంటనే వెళ్ళి ఉపన్యాసకులతో మాట్లాడి వారిని ఒప్పించాడు. తమ ఊర్లోనే కార్యక్రమాలు ఏర్పాటు చేయించాడు. మొదటగా ఊర్లో వాళ్ళు మాత్రమే వినడానికి వచ్చే వారు. చిన్నగా చుట్టుపక్కల గ్రామాలకు విషయం పాకింది. ఇతర గ్రామాల ప్రజలు మైళ్ళ దూరం నడిచి వచ్చి శ్రద్ధగా వినడం ప్రారంభించారు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, వచ్చి నాలుగు మంచిమాటలు వినే జనాన్ని చూసిన మేస్త్రీ దంపతులకు, నిండుగా నీళ్ళున్న బావిని చూసినంత ఆనందం కలిగింది.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
కర్మ యోగం... కర్తవ్య పాలన
భారతీయ జీవన దర్శనం ప్రకారం ఈ జగత్తంతా దైవమయం. మనం చేసే ప్రతి కర్మను ఆ పరమాత్మకు అర్పించే ‘నైవేద్యం’గా భావించాలి. ఉపనిషత్తులు బోధించిన సూత్రం ప్రకారం, కర్మలను చేస్తూనే వాటి ఫలితాలకు అంటకుండా ఉండటమే జీవన ముక్తి. అహంకారాన్ని వీడి, ‘నేను కర్తను కాదు, కేవలం ఒక నిమిత్త మాత్రుడను’ అనే భావనతో పని చేసినప్పుడు ఆ కర్మకు పుణ్యపాపాలు అంటవు.ఆర్ష ధర్మం ప్రతిపాదించిన అద్భుత జీవన వేదాంతం కర్మయోగం. లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు. అయితే, ఆ కర్మను బంధనంగా మార్చుకోవాలా లేక మోక్ష మార్గంగా మలచుకోవాలా అన్నదే ఇక్కడి అసలైన ప్రశ్న. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందించిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే దివ్య శ్లోకం మానవాళికి ఒక శాశ్వత దిక్సూచి. పని చేయడంపైనే నీకు అధికారం ఉంది గానీ, ఫలితంపై లేదని చెప్పడం వెనుక లోతైన మనస్తత్వ శాస్త్రం దాగి ఉంది. ఫలితంపై అతిగా ఆశ పెంచుకున్నప్పుడు మనిషిలో ఆందోళన, భయం, అసహనం ప్రవేశిస్తాయి. అదేపనిని దైవ కార్యంగా భావించి చేసినప్పుడు ఆ కర్మ ‘యోగం’గా మారుతుంది. ఇది కేవలం సిద్ధాంతం కాదు, నిత్య జీవితంలో అనుసరించదగిన పరమ సత్యం.కర్మయోగం అంటే పలాయనవాదం కాదు, అది సంపూర్ణమైన క్రియాశీలత. ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు కేవలం ఆ ప్రతిమ ఎంత ధరకు అమ్ముడవుతుందనే ఆలోచనతో ఉంటే, ఆ శిల్పంలో జీవం ఉట్టిపడదు. అదే శిల్పి తన నైపుణ్యాన్ని పరమాత్మకు అర్పిస్తున్నాననే భావనతో చెక్కితే, ఆ పనిలో ఒక అలౌకికానందం వెల్లివిరుస్తుంది. అలాగే ఒక వైద్యుడు కేవలం ధనం కోసమే చికిత్స చేస్తే అది వ్యాపారం అవుతుంది. అదే వైద్యుడు రోగిలో దైవాన్ని చూస్తూ, తన విజ్ఞానాన్ని ప్రాణదానానికి అంకితం చేస్తే అది పవిత్ర యజ్ఞమవుతుంది. ఫలితం భగవంతుడి నిర్ణయమని నమ్మి, తన శక్తినంతా చికిత్సపైనే కేంద్రీకరించినప్పుడు ఆ వైద్యుడికి మానసిక ఒత్తిడి ఉండదు. ఈ నిష్కామ బుద్ధి మనిషిని నిరంతరం ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. అగ్ని తన ధర్మాన్ని తాను నిర్వర్తించినట్లు, మనిషి తన స్వధర్మాన్ని నిష్కామంగా ఆచరించాలి.ఈ మార్గంలో అత్యంత ముఖ్యమైనది ‘ఫలత్యాగం’. అంటే ఫలితాన్ని వదిలేయడం కాదు, ఫలితం వల్ల కలిగే హర్ష విచారాలకు అతీతంగా ఉండటం. విజయం వస్తే పొంగిపోకుండా, అపజయం ఎదురైతే కుంగిపోకుండా ఉండే స్థితి కర్మయోగికి మాత్రమే సాధ్యం.యోగశాస్త్రం బోధించిన ఈ నిష్కామ కర్మ సిద్ధాంతం వ్యక్తిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. చేసే పనిలో దైవత్వాన్ని వెతుక్కున్నప్పుడు ఒత్తిడి మాయమై శాంతి ప్రవహిస్తుంది. ప్రతి క్షణం మన కర్మను ఒక ఆరాధనగా మలుచుకుంటే, ఈ ప్రపంచమే ఒక వైకుంఠమవుతుంది. స్వార్థపు చీకటిని తొలగించి, సేవా భావం అనే జ్యోతిని వెలిగించుకుందాం. సర్వం ఈశ్వరార్పణమస్తు! నిప్పు నిప్పును కాల్చదు గానీ, దానిపై పడిన వస్తువును కాలుస్తుంది. అలాగే, అహంకారంతో చేసే కర్మలు బంధాలను సృష్టిస్తే, నిరహంకారంతో చేసే కర్మలు మనసును నిర్మలం చేస్తాయి. సూర్యుడు ప్రతిరోజూ లోకానికి వెలుగును ఇస్తాడు, తనే వెలుగునిస్తున్నాననే అహంకారం ఆయనకు ఉండదు. అటువంటి నిస్వార్థ గుణమే మనల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. నిత్య జీవిత సవాళ్లను సాకులు చెప్పకుండా ఎదుర్కోవడం, బాధ్యతలను భారం కాకుండా గౌరవంగా భావించడం కర్మయోగపు అంతరార్థం. ఈ జ్ఞానమే మనల్ని నిరంతరం కర్మపథంలో నడిపిస్తూ, అంతిమంగా ఆత్మానందానికి చేరువ చేస్తుంది.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
ఆధ్యాత్మిక ఆవాసం ధనుర్మాసం!
సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతితో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసంప్రారంభాన్నే గ్రామీణ ప్రాంతాల్లో పండుగ నెల పెట్టడం అంటారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికమైన ఈ ధనుర్మాసం (Dhanurmasam) 16, మంగళవారం ప్రారంభమైన సందర్భంగా ఆ మాస విశిష్టతలను తెలుసుకుందాం...ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి రెండు పూటలా దీపారాధన చేయడం వల్ల శ్రీమహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఆవాసంధనుర్మాసం విశేషమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. ధనుర్మాసంలో స్నానం, దానం, హోమం, వ్రతం పూజలు చేయడం అత్యంత శుభప్రదం.సుప్రభాతానికి బదులు తిరుప్పావై ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై (tiruppavai) గానం చేస్తారు. అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా పిల్లలకు ప్రసాదం పంచడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెబుతారు.అలక్ష్మిని ఆవలకు నెట్టే లక్ష్మీ పూజపవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి.. వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం సకల శుభదాయకం.చదవండి: నెలగంట కట్టడం అంటే.. ఎంటే తెలుసా?గోదా రంగనాథుల కల్యాణం గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించే అతి ముఖ్యమైన ఆచారం. సాధారణంగా శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి నాడు జరుగుతుంది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే వారు గోదాదేవి, శ్రీ కృష్ణుడు లేదా శ్రీరంగనాథ స్వామి వారిని పూజించాలి. తిరుప్పావై పాశురాలను రోజుకు ఒక్కటి గానం చేయాలి. స్వామివారికి, అమ్మవారికి పొంగలి నివేదించాలి. ధనుర్మాసంలో ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్ఠం. గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం చేయడం పరమ విశిష్టం. మనసు, వాక్కు, శరీరం ఈ త్రికరణాలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకున్న వారికి లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సకల సంపదలూ చేకూరతాయని శాస్త్ర వచనం. -
శబరిమల బంగారం చోరీ కేసులో పురోగతి
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొంత పురోగతి సాధించింది. ఈమేరకు ఒక ప్రవాస వ్యాపారి వాంగ్మూలాన్ని నమోదు చేయగలిగింది. నిన్న సాయంత్రం బుధవారం(డిసెంబర్ 18) పండలం స్థానికుడైన ప్రవాస వ్యాపారి నుంచి వివరణాత్మక వాంగ్మూలం సేకరించింది సిట్ బృందం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ప్రవాస దర్యాప్తు బృందంతో పంచుకున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నంబర్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వాంగ్మూలం ఆధారంగా SIT తదుపరి దర్యాప్తుకు సిద్ధమవుతోంది.ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల శబరిమల బంగారు దోపిడీ వెనుక అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠా ఉందని తనకు సమాచారం అందిందని ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త నుంచి సిట్ గతంలో వాంగ్మూలం నమోదు చేసింది కూడా. దోపిడీలో పాల్గొన్న ఒకరితో తనకున్న వ్యక్తిగత అనుభవాల గురించి ఆ వ్యాపారవేత్త చెప్పాడు కానీ అందుకు సంబంధించి.. ఎటువంటి పత్రాలను ఇంతవరకు అతడు సమర్పించలేదు.ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న రమేష్ చెన్నితల సిట్కి లేఖ రాస్తూ, బంగారు దోపిడీలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాకు ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలని, రూ.500 కోట్ల లావాదేవీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఆయన సిట్ ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. శబరిమల బంగారు దోపిడీలో రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారని చెన్నితల లేఖలో ఆరోపించారు. అలాగే ఆయన ఆ లేఖలో ఇలా వివరించారు.'పురాతన వస్తువులను దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. అతను ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా లేడు. కానీ అతను దర్యాప్తు బృందం, కోర్టు ముందు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రంగా దర్యాప్తు చేసిన తర్వాత నేను అలాంటి మాటలు చెబుతున్నాను. రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు, ఈ ముఠా రాకెట్లకు బంగారు దొంగతనంతో సంబంధం ఉంది. దేవస్వం బోర్డులోని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు ఈ రాకెట్తో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలి. అలాగే పురావస్తు సమూహాలను కూడా దర్యాపు పరిధిలోకి తీసుకురావాలి' అని రమేష్ చెన్నితల లేఖలో డిమాండ్ చేశారు.(చదవండి: శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్లు) -
‘సినిమాలు చూసి సంతోషించండి.. నమ్మకండి’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పురాణ కథలకు సంబంధించిన సినిమాలు చూసి సంతోషించండి. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, కానీ నమ్మకండి’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యాఖ్యానించారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాసభారత ప్రవచనంలో ఆయన మంగళవారం సభాపర్వం ముగించి, వనపర్వంలోకి ప్రవేశించారు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలను శకుని ఉపయోగించాడంటూ ఓ సినిమాలో ప్రధానంగా చూపారని, ఇటువంటి కథనం భారతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ లేదని చెప్పారు. నిజం చెప్పినా ప్రజలు శంకించేంతలా అసత్యాలు ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్యూతానికి పాండవులను మళ్లీ పిలవాలని విదురుడిని ఆదేశించినప్పుడు భీష్మద్రోణ కృపాచార్యులు, గాంధారి తదితర పెద్దలందరూ ధృతరాష్ట్రుడిని వారించడానికి ప్రయత్నిస్తారు. అవినీతి, క్రౌర్యంతో సంపాదించుకున్న సంపద వినాశ హేతువు అవుతుందని హితైషులు హెచ్చరిస్తారు. కానీ, ధృతరాష్ట్రుని బుద్ధి వేరు. మామకాః పాండవాః.. అని ఆయన అనడంలో ఆంతర్యం బయటపడుతోంది. నా వాళ్లు వేరు, పాండవులు వేరు అని దీని భావం. ద్యూతానికి మళ్లీ వచ్చిన ఆహ్వానాన్ని ధర్మరాజు అంగీకరించడాన్ని కొందరు ఆధునికులు విమర్శిస్తారు. బంగారు లేడి ఉండదని తెలిసే, రాముడు దానిని తేవడానికి బయలుదేరినట్టు.. మాయాద్యూతమని తెలిసే, తండ్రి ఆనతి మీర లేక, ధర్మరాజు తిరిగి ఆడటానికి వస్తాడు. విధిని అనుసరించి బుద్ధి ఉంటుంది. పరాజితులైన పాండవులతో వెళ్తున్న ద్రౌపదిని చూసి దుశ్శాసనుడు పలుమార్లు ‘ఎద్దు, ఎద్దు’ అని ఆమెను హేళన చేస్తాడు. భీముడు ఉగ్రుడై దుశ్శాసనుడి రొమ్ము పగులగొట్టి, రక్తం తాగుతానని ప్రతిన చేస్తాడు. తన తొడను ద్రౌపదికి చూపిన దుర్యోధనుడితో తొడలు పగులగొడతానని, లేకపోతే తనకు పుణ్యగతులు కలగవని ప్రతిన చేస్తాడు. తొడలు పగులగొట్టడం యుద్ధనీతికి వ్యతిరేకమే అయినా, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞా పాలన కోసం యుద్ధనీతిని అతిక్రమించవచ్చు’’ అని సామవేదం వివరించారు. పాండవులను వేదవేత్తలు అనుసరించారంటూ ఆయన వనపర్వాన్ని ప్రారంభించారు. వ్యాసుడు వనపర్వంగా పేర్కొన్న పర్వాన్ని నన్నయ అరణ్య పర్వమన్నాడని వివరించారు. తొలుత కంచి కామకోటి సంయమీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని, పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సూచనల మేరకు రుద్రహోమం నిర్వహించి, అనుశాసన పర్వాంతర్గతమైన శివ సహస్రనామ పారాయణ నిర్వహించారు. -
దేవుడి ఖజానా ఏమైంది?
బృందావన్లోని ప్రసిద్ధ బాంకే బిహారీ మందిరంలో దేవుడికి నైవేద్య సమయాల్లో గందరగోళం ఏర్పడింది. అందుకు కారణం ఆలయంలో చెల్లింపులతో కూడిన "ప్రత్యేక పూజలు" చేయడానికి భక్తులను అనుమతించడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిరంతర పూజల వల్ల కృష్ణుడి విశ్రాంతి వేళలు లేకుండాపోయాయని మండిపడింది. అంతేగాదు కాసులకు కక్కర్తిపడి ఇలా చేస్తున్నారా అంటూ ఆలయ అధికారులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలానే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో తెరిచిన ఆలయ ఖజనా వివాదానికి సంబంధించి.. పలు ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!1862లో రాజస్తానీ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్లోని బృందావన్ బాంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఇది ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం. ఈ ఆలయంలో కృష్ణుడిని బాంకే బిహారీగా పూజలందుకుంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు బాల రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..గంటలు మోగించరు, హారతులు ఇవ్వరు. భక్తి శ్రద్ధలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఇలా చేస్తుంటామని ఆలయ పూజారులు చెబుఉతున్నారు. ఏడాదిలో ఒక్కసారి అదికూడా అక్షయ తృతియ రోజున మాత్రమే భక్తులు బాల కృష్ణుని పాదాలను దర్శించుకునే భాగ్యం లభిస్తుందట.ఖజానా వివాదం..అనంతపద్మనాభుని ఆలయంలో మూసి ఉన్న గదిలాంటిదే బృందావన్లోని బాంకే బిహారి ఆలయంలో కూడా ఉంది. అందులో ఎన్నో నిధులు ఉన్నాయని అంతా అనుకునేవారు. ఆ గదిని అక్టోబర్ 2025లో, సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ పర్యవేక్షణలో తెరిచారు. నిజానికి ఈ గది 1970ల నుంచి మూసివేసే ఉంది. సుమారు 54 ఏళ్ల తర్వాత తెరిచే ప్రయత్నం చేస్తే అదికాస్త పెను వివాదాంశమైంది. అయితే ఆ గదిలో ప్యానెల్ సభ్యులు రాగి కూజాలు, రాళ్లు, చెక్కపెట్టే, మూడు వెండి కడ్డీలు, ఒక బంగారు కడ్డీ,కొన్ని పాత్రలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. అయితే అదంతా అబద్ధమంటూ పూజారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన ఆభరణాలు, శతాబ్దాల నాటి కానుకలు అపహరణకు గురయ్యాయని, ప్యానెల్ సభ్యులు తప్పదారి పట్టిస్తున్నారంటూ కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకత కోసం ప్రత్యక్షప్రసారంలో ఆ గది తనిఖీని ప్రసారం చేయాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు. అంతేగాదు ఆలయ సంపద దుర్వినియోగం చేయబడిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికీ ఆ ఆలయ ఖజనా విషయం ఓ వివాదాస్పదమైన మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ప్రధాని మంత్రికి లేఖ సైతం రాశారు. విశేషం ఏంటంటే..ఈ బృందావన్లో ఉన్న కృష్ణుడి ఆలయానికి భారీగానే ఆర్థిక వనరులున్నాయి. ఏకంగా రూ. 400 కోట్ల వరకు బ్యాంకు డిపాజిట్లు, సీలు వేసిన లాకర్లు, భూమి కమతాలు, భారీ విరాళల రికార్డులు ఆడిట్లో ఉన్నట్లు నివేదికలు పేర్కొనడం విశేషం. కాగా, అపహరణకు గురైన ఆస్తులపై తొలి పూర్తిస్థాయి ఆడిట్ని నిర్వహించాలని సుప్రీం కోర్టు ప్యానెల్ ఆదేశించింది.(చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?) -
నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?
ధనుర్మాసం మొదలవ్వగానే అందరూ నెలగంట కడతారు అని అంటుంటారు. పైగా అప్పటి నుంచి ముంగిళ్ల అన్ని రంగవల్లులతో శోభాయమానంగా ఉంటాయి. అసలేంటి ఈ నెలగంట..అందులోని ఆంతర్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!నెలగంట కట్టడం అంటే, సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం (Dhanurmasam) ప్రారంభాన్ని సూచించే ఒక సంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి, గుడిలో గంటలు మోగిస్తూ, పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడుఆలయంలో మోగే గంటల శబ్దమే "నెలగంట". ఇవాళ (డిసెంబర్ 16 వ తేదీన) మధ్యాహ్నం (1. 23)ప్రాంతంలో ధనుస్సులో ప్రవేశిస్తాడు. దానినే మనం ధనుస్సంక్రమణం అంటాం! అలా ధనూరాశిలో ప్రవేశించిన సూర్యుడు - నెలంతా ఆ రాశిలోనే ఉంటాడు. ఇలా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించగానే నెలగంట కట్టడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తరువాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణం!.ఈ నెలగంట కట్టినది మొదలుకొని పెద్ద పండుగ అయ్యేంతవరకు ఊళ్ళో ఎవరూ ఏ శుభకార్యం చేయరు. అంటే ఈ నెలంతా ఈ దీక్షలోనే ఉంటారు. ఈ నెలగంట కట్టడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి..తిరుప్పావై పాశురాలు - వేకువజాము పూజలు నిర్వహిస్తారు. అంతేగాదు అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత 15 రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అలా భోగి పండుగ నాడు ఈ మార్గళి వ్రతం లేదా తిరుప్పావై పూర్తవుతుంది. ఒకరకంగా ఈ నెలగంట మన సంక్రాంతి పండుగ రాకను సూచిస్తుందని చెప్పొచ్చు.ఈ సమయంలో ఏం చేస్తారంటే..పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర, సహస్రనామాలతో ఆరాధించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెలరోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు.(చదవండి: ఈశ్వరీ..జగదీశ్వరీ..) -
హనుక్కా పండుగ అంటే..? అందుకే యూదులు అంతలా..
ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు. హనుక్కా అంటే.."హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.అద్భుతం జరిగిన రోజు..క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు?మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.విందు..ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్లను గిఫ్ట్గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..) -
జీవన నావకు స్నేహ సారథి
ఆపదలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. యుద్ధంలో ధైర్యం చూపించేవాడే అసలైన వీరుడు. దానగుణం కలవాడే నిజమైన ధనవంతుడు. పేదరికంలోనూ పక్కన నిలబడేదే ఉత్తమ భార్య. కష్టాల్లో ఆదుకునేవారే నిజమైన బంధువులు. నిజమైన గుణగణాలు కష్ట సమయాలలోనే బయటపడతాయి. సుఖంలో నవ్వు పంచుకున్నవారంతా స్నేహితులు కారు; కష్టకాలంలో కన్నీళ్లు తుడిచేవాడే కల్మషం లేని బంధువు అని ఇది స్పష్టం చేస్తుంది. వారిచ్చే మానసిక ధైర్యం, ఆపత్కాలంలో మనకు పెద్ద ఆసరా.జీవితం ఓ అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు తోడుగా, నీడగా నిలిచే అనుబంధాలలోకెల్లా స్నేహం అత్యంత మధురమైనది, విలువైనది. రక్తసంబంధం లేకున్నా, ఆత్మ బంధాన్ని పెంచే మనసులతో పెనవేసుకునే ఈ బంధం, సంతోషాన్ని ద్విగుణీకృతం చేసి, దుఃఖాన్ని అర్థం చేసుకుని, భారంగా ఉన్నప్పుడు భుజం తట్టి, విజయాలను ఉత్సాహంగా పంచుకుని, వైఫల్యాలలో ఓదార్పునందించే అమృత భాండం. జీవితంలోని ప్రతీ మైలురాయి వద్ద తోడు నిలిచే స్నేహం, కాలంతో పాటు మరింత గాఢమవుతుంది. స్నేహం లేని జీవితం, రంగులు లేని చిత్రలేఖనంలా, సంగీతం లేని రాగంలా వెలవెలబోతుంది.స్నేహం – జీవన గీతంమన సనాతన ధర్మంలో స్నేహానికి అత్యున్నత స్థానం ఉంది. శ్రీ కృష్ణుడు, కుచేలుడు; రాముడు, సుగ్రీవుడు వంటి అనన్య స్నేహ బంధాలు మన ఇతిహాసాలలో నిబిడీకృతమై ఉన్నాయి. భగవద్గీతలో సైతం స్నేహితుని పట్ల ఉండాల్సిన ఆత్మీయత, త్యాగ భావన పరోక్షంగా ప్రస్తావించబడ్డాయి.‘న మిత్రార్థే పరిత్యజేత్ ప్రియమాత్మానమాత్మనః’. అంటే స్నేహితుడి కోసం తన ప్రియమైన ఆత్మను కూడా త్యజించకూడదు (అంటే, తన ఉనికిని కోల్పోకుండానే స్నేహితునికి ఎంతటి సహాయమైనా చేయాలి). ఇది స్నేహం తాలూకు ఉన్నతమైన ఆత్మార్పణ భావనను తెలియజేస్తుంది. నిజమైన స్నేహితుడు మన ఎదుగుదలకు తోడ్పడతాడే తప్ప, మన అస్తిత్వాన్ని హరించడు. స్నేహం పేరుతో ఒకరిపై ఒకరు ఆధారపడటమో, బలహీనతలను ఆసరాగా తీసుకోవడమో కాకుండా, ఇరువురూ తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే పరస్పరం శక్తిగా మారతారని ఈ సూక్తి తెలియజేస్తుంది.కష్టసమయాల్లో మనం కృంగి΄ోకుండా, మనలో ధైర్యాన్ని నింపి, సరైన మార్గంలో నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే కేవలం కాలక్షేపం కాదు, అది పరస్పర గౌరవం, నమ్మకం, నిస్వార్థ ప్రేమల కలయిక.‘దద్యాత్ దద్యాన్న దద్యాత్ ఖలు మిత్రస్య మిత్రః సదా ప్రార్థనాశీలో న మిత్రం స్యాత్ సదా ప్రార్థనాశీలః.‘అనగా... ఇచ్చేవాడు స్నేహితుడు, కానీ ఎప్పుడూ యాచించేవాడు స్నేహితుడు కాడు. నిజమైన స్నేహం ఇవ్వడం, తీసుకోవడం అనే సమతుల్యతతో కూడుకున్నదని ఈ సుభాషితం తెలుపుతుంది. స్నేహంలో ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడమే గొప్పతనం. నిరంతరం ఏదో ఒకటి ఆశించే వ్యక్తి, నిజమైన స్నేహితుడు కాలేడు. స్నేహం అనేది త్యాగం, నిస్వార్థ ప్రేమల పునాదులపై నిర్మితమైన గొప్ప అనుబంధం. ఇవ్వడంలోనే నిజమైన ఆనందం, స్నేహ మాధుర్యం దాగి ఉన్నాయి.జీవిత గమనంలో స్నేహితుల చేయూత ఎల్లప్పుడూ తోడుగా నిలిచి, ప్రతీ అడుగులోనూ సరికొత్త స్ఫూర్తిని నింపుతుంది. మన జీవితాలను సుసంపన్నం చేసే ఈ అమూల్యమైన స్నేహ బంధాలను పదిలంగా కాపాడుకుంటూ, ప్రతిరోజూ ఆనందాన్ని, శక్తిని పొందుదాం.నిజమైన స్నేహితుడు మనకు లభించిన ఒక వరం. అటువంటి స్నేహాన్ని కాపాడుకోవడమే మన జీవితానికి అసలైన సంపద. మనసులోని మాటను పంచుకోవడానికి, ఆశలను, కలలను సాకారం చేసుకోవడానికి, ఒంటరితనాన్ని దూరం చేయడానికి స్నేహం కంటే గొప్ప ఔషధం లేదు.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా
సాక్షి శబరిమల: శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శబరిమల పరిసరాల్లో నకిలీ పత్రాలతో.. గుర్తింపు కార్డులతో సేవకు వచ్చే వారి కోసం తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంపాబేస్ నుంచి సన్నిధానం వరకు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా పెంచినట్లు వెల్లడించారు.అలాగే భద్రత దృష్టా అధికారులు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో సహా తాత్కాలిక ఉద్యోగుల పత్రాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కొందరు నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయా వ్యక్తుల కోసం పోలీసులు, బోర్డు సమాచారాన్ని పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాని చెప్పారు. అయితే ఒక్కోసారి నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారి పరిస్థితి దృష్ట్యా సాధారణంగా ప్రశ్నించి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, శబరిమల అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నాయి. "రద్దీ పెరిగినప్పుడు దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులు , యాచకులు తరచుగా శబరిమలకు వస్తారు. వారు పోలీసులను, అటవీ శాఖను పట్టించుకోకుండా శబరిమల మార్గంలోని అడవుల్లోనే ఉంటారు. అలాంటివారు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు వంటి పత్రాలతో వస్తారు. వారి రాక భద్రతా ముప్పుని సృష్టిస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. అయ్యప్ప భక్తులను మోసగించి రద్దీ సమయాల్లో అడవిలోకి ప్రవేశించడం వారి నేరశైలి అని తెలిపారు. ఈ నేపథ్యంలో నీలిమల, అప్పచిమేడు, శరణ్గుత్తి తదితర ప్రాంతాల పరిసర అడవులలో డ్రోన్ నిఘాను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పోలీసుల రిజిస్టర్లలో నమోదుకాని కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంపా, సన్నిధానంలో రెవెన్యూ శాఖ స్క్వాడ్, పోలీసు షాడో బృందం 24 గంటలు మోహరించి ఉంటాయని వెల్లడించారు.(చదవండి: శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే) -
ఈశ్వరీ..జగదీశ్వరీ..
బ్రహ్మంగారి మఠంలో కొలువుదీరిన శ్రీ ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగుబంగారమై నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. ఈశ్వరీదేవి మఠంలో నేటి గురువారం నుంచి అమ్మవారి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి చరిత్ర, ఉత్సవాల విశేషాలపై ప్రత్యేక కథనం.శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ప్రబోధకర్త, రాజయోగి, హేతువాది, మహిమాన్వితులు, తత్వవేత్త, సంఘ సంస్కర్త, దైవస్వరూపులుగా వినుతికెక్కారు. ఆయన మనువరాలు శ్రీ ఈశ్వరీదేవి. ఆమె జేజినాయన వలే తత్త్వాలు, కీర్తనలు, కాలజ్ఞానం రాసి విశేష కీర్తి పొందారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ఎక్కువగా భవిష్యత్తును తెలియజేస్తే.. ఈశ్వరిదేవి నోటి నుంచి వెలువడే మాటలు అప్పటికప్పుడే జరిగి తీరేవి. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి ΄ార్వతీదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమె 1703లో స్వస్తిశ్రీ స్వభాను నామసంవత్సరంలో జన్మించారు. వీరబ్రహ్మేంద్రస్వామి రెండో కుమారుడైన గోవిందయ్యస్వామి, గిరియమ్మ దంపతులకు ఈశ్వరమ్మ, కాశమ్మ, శంకరమ్మ అనే ముగ్గురు కుమార్తెలు, ఓంకారమయ్య, సాంబమూర్తి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఈశ్వరమ్మ పెద్దకుమార్తె. బ్రహ్మంగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అందరి పిల్లల్లాగా.. వీధి బడిలో సామాన్య విద్యనభ్యసించారు. సంస్కృతం, తెలుగు భాషలలో పాండిత్యం సంపాదించారు. భారత భాగవతాది గ్రంథాలను స్వయంగా వర్ణించే వారు. నిత్యం యోగం అభ్యసించుట, గ్రంథాల పఠనంతోనే గడుపుతుండేది. 12 ఏళ్ల వయసులోనే... ఒకరోజు గోవిందయాచార్య శయ్యపై పరుండి, తీవ్రమైన ధ్యాననిష్టలో మునిగిపోయారు. అలా మూడు రోజులు ఉన్నారు. పిలిచినా పలకలేదు. దీంతో చనిపోయారేమోనని భావించి.. ఆయన భార్య గిరియమ్మ, బంధుమిత్రులు దుఃఖించటం ప్రారంభించారు. అప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్న ఈశ్వరీదేవి వచ్చి.. దుఃఖించే అంత పని ఏమి జరగలేదని, నాయన పరమాత్మతో ఆత్మను లీనం చేశారని తెలిపారు. ఆమె గది తలుపులు వేసి సాంబ్రాణి ధూపం వేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపిన ‘ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః’ అనే బీజాక్షరి మంత్రాన్ని జపించారు. వెంటనే గోవిందయ్య లేచి కూర్చున్నారు. ఈ విషయాన్ని చూసిన జనం సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఈశ్వరీదేవి సామాన్య మనిషి కాదని, మహిమాన్వితురాలని గుర్తించారు. తండ్రినే గురువుగా భావించి.. ఆయన ద్వారా మంత్రోపదేశం నేర్చుకున్నారు. 14 ఏళ్లు తపస్సు చేసి... బ్రహ్మంగారి మఠానికి సమీపాన ఉన్న నల్లమల కొండ గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞానవాక్సిద్ధి పొందారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్నసాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేయడానికి సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. లోక కల్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు. మఠాధీశులై... తండ్రి గోవిందయ్యస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశులై నిత్యపూజ కార్యక్రమాలు, ఆరాధన గురు పూజోత్సవాలు నిర్వహిస్తుండేవారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. రాజయోగినిగా మారి, శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. భక్తులకు ఎన్నో లీలలు ప్రత్యక్షంగా చూపించారు. ఎందరినో సంస్కరించి జ్ఞాన దీప్తిలా భాసిల్లి.. జనుల గుండెల్లో అమ్మవారిగా కొలువైనారు.సజీవ సమాధి ఈశ్వరమ్మ వారు 1789లో శ్రీ సౌమ్యనామ సంవత్సర మార్గశిర బహుళ నవమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటినుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు. చిన్నమఠం శ్రీ ఈశ్వరిదేవిమఠంగా పేరొందినది. అమ్మవారు సజీవ సమాధి నిష్ట పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గురువుగా భావిస్తారు కనుక శిష్యులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు.భారీగా భక్తుల రాకదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వీరి సౌకర్యం కోసం పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనుంది.ఆరాధనోత్సవాలు నేటి నుంచి 16 వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో రోజూ ఉదయం ప్రభాతసేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం సూక్త΄ారాయణం, అభిషేకం, కుంకుమార్చన, రాత్రి నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే భక్తుల కాలక్షేపం కోసం సంగీత విభావరి, హరికథలు, భజన కార్యక్రమాలు ఉంటాయి.11న కలశోత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.12న ఉదయం అశ్వవాహనం, రాత్రి హంస వాహనంపై అమ్మవారి ఊరేగింప13న (ఈశ్వరీదేవి మార్గశిర బహుళ నవమిన మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన రోజు) ఉదయం దేవతా ఆవాహనం, శాంతి హోమం, సామూహిక కుంకుమార్చనలు, మధ్యాహ్నం దీక్షా అలంకరణ ఉత్సవం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ, తులాభారం, ఊయల సేవ, రాత్రి సింహ వాహన గ్రామోత్సవం ఉంటాయి. 14న గుడి ఉత్సవం, రాత్రి పుష్పరథోత్సవం 15న పూర్వపు మఠాధిపతులు వీరబ్రహ్మయాచార్య స్వాముల వారి ఆరాధన, గ్రామోత్సవం16న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. – వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడప(చదవండి: అరటిచెట్టు వెనక ఆధ్యాత్మిక రహస్యం) -
శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే
శబరిమలలో అంతకంతకు పెరుగుతున్న భక్తుల జనసందోహం. కేవలం నిన్న ఒక్కరోజే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శబరిమలకు తరలివచ్చారు. స్థానిక సంస్థల ఓటింగ్ రోజు(పంచాయతీ ఎన్నికలు) అయినప్పటికీ.. సన్నిధానం, పంపా, శబరిపీఠం, శరణ్గుత్తి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడూ.. ఒక గంటలో ఏకంగా 13 వేల మందికి పైగా భక్తులు శబరికొండ ఎక్కారు. సాయంత్రం 6 గంటలకు దర్శనం కొచ్చే వారి సంఖ్య 75,463 కు చేరుకుంది. 18వ మెట్టు ఎక్కేందుకు శరణ్గుత్తి, మరంకూట్ట మధ్య భారీ క్యూ ఉంది. గత కొన్ని రోజులతో పోలిస్తే.. నిన్న ఒక్కరోజే రద్దీ అధికం. శబరిమలకు వస్తున్న భక్తుల్లో 50 శాతం మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే ఉంటున్నారు. అలాగే నిన్న దర్శనానికి వచ్చిన మలయాళీలలో చాలామంది మలబార్ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం.(చదవండి: Sabarimala: ‘ఉరక్కుళి జలపాతం వైపు వెళ్లొద్దు’) -
గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!
ఆలయంలో వివాహం చేసుకుంటుంటారు చాలామంది. అలాగే కొన్ని ఆలయాలు సాముహిక పెళ్లిళ్లను జరిపిస్తుంటాయి కూడా. మరికొందరు మొక్కుల రీత్యా కూడా ఆలయంలో వివాహం చేసుకుంటారు. అలాంటిది వేల ఏళ్ల నాటి పురాతన ఆలయం ఆకస్మికంగా వివాహాలను నిషేధించాలని గట్టి నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఆలయ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా అక్కడ ప్రభుత్వానికి తెలియజేసింది కూడా. అందుకు సుప్రీం కోర్టు కూడా సమ్మతించడం విశేషం ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే విస్తుపోతారు.బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటి, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ చాలామంది జంటలు వివాహాలు చేసుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారం కూడా. అలాంటిది గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వివాహ వేడుకులను నిలిపివేసింది. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ ఆలయంలో వివాహాలను నిషేధించడం భక్తులలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చరిత్రసోమేశ్వరస్వామి ఆలయం సుమారు 12వ-13వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. దీని నిర్మాణంలో చోళులు, విజయనగర రాజుల నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపేగౌడ కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు లేదా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో వేలాది జంటలు పెళ్లితో ఒక్కటయ్యేవి. అయితే ఆ జంటలే మధ్య సయోధ్య కుదరక విడాకులకు దారితీయడంతో.. ఆ ఆలయ పూజారులు కోర్టుల చుట్టూ తిగరాల్సి వచ్చింది. అంతేగాదు ఆలయ ఆగమ పనులకంటే..కోర్టు చుట్టూ తిరగడమే పనైంది పూజారులకు. ఈ న్యాయపరమైన చిక్కులను నివారించేందుకు, అలాగే పూజారులు ఆయల కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఇలా వివాహాలను నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. హిందూ వివాహాలకు పేరుగాంచిన ఈ ఆలయం ఏటా వందలాది జంటల వివాహాలను ఘనంగా జరిపించేది. ఆలయ గోపురం కింద ఈ వివాహాలు జరిగేవవి. వేద సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా జరిగే ఈ వివాహాలు..ఇటీవల విడాకులు కేసులు అంతకంతకు పెరిగి ఆలయ పవిత్రత మంట కలిసిపోయేలా మారింది. దానికి తోడు ఆ పెళ్లిలో సాక్షులుగా ఉన్న పూజారులు కోర్లుమెట్టాక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతరెండేళ్లలోనే ఆలయ అధికారులకు 50కి పైగా విడాకులు ఫిర్యాదుల అందాయట. చాలా వివాహాలు ఇంట్లోని కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా చేసుకోవడం, కొందరు నకిలీ డాక్యుమెంట్లతో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వాపోయారు. పూజారుల భక్తి సమయం ఆదా అయ్యేలా, అలాగే ఆలయ పవిత్రతను కాపాడుకునేలా ఇలా వివాహాలను నిషేధించక తప్పలేదని చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది అమిష్ అగర్వాల్ మాట్లాడుతూ..ఆలయం ఇతర ఆచారాలు, మతపరమైన వేడుకలను అనుమతిస్తూనే ఉంది. కానీ ప్రస్తుతానికి వివాహాలను అనుమతించబోమని నిర్ణయించింది. ట్రెండ్ను అంచనా వేసి, కమ్యూనిటీ వాటాదారులతో సంప్రదించిన తర్వాత భవిష్యత్తులో ఈ విధానాన్ని సమీక్షించవచ్చని యాజమాన్యం పేర్కొంది." అని చెప్పారు. నిజానికి దక్షిణ భారతదేశంలో దేవాలయాలలో వివాహాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఆ నేపథ్యంలోనే పురాతన దేవాలయాల్లో వీటిని నిర్వహించేందుకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. కానీ పెరుగుతున్న విడాకుల కేసులు, పూజారులను చట్టపరమైన చిక్కుల్లో పడేశాయి. దీంతో అధికారులు సోమేశ్వర ఆలయం మరిన్ని న్యాయమపరమైన చిక్కులను ఎదుర్కొనకుండా ఉండేలా ఈ వివాహాలకు అడ్డుకట్టవేయాల్సి వచ్చింది.(చదవండి: లెట్స్ సింగ్..ఫుల్ స్వింగ్..!) -
ఆత్మనిగ్రహం... ఆత్మస్థైర్యం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిగురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అభివృద్ధి నిలిచిపోయి అథఃపాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు నిగ్రహించుకుంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో మనస్సును అధీనంలో ఉంచుకోవడమే ఆత్మ నిగ్రహం.చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. మనసును నిగ్రహించడం వాయువును బంధించడం కన్నా కష్టమైందని అర్జునుడే స్వయంగా అన్నాడు. భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తనకు సారధ్యం వహిస్తున్న శ్రీ కృష్ణునితో అర్జునుడు ఈ మాటలు పలికాడు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, సహాధ్యాయ గురుపుత్రుడు అశ్వత్థామ, అన్నదమ్ములైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడి పోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని చేతిలో నుంచి ధనస్సును జార విడుస్తూ ‘‘కృష్ణా నాకు విజయం వద్దు... రాజ్య సుఖాలు వద్దు... ఆచార్యుణ్ణి, పితామహుణ్ణి, బంధువులను నేను సంహరించలేను’’ అంటూ మౌనం వహించి విముఖుడై కూర్చుండిపోయాడు. అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. అందువల్లనే అర్జునికి ఇలాంటి స్థితి ఏర్పడింది. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి అంగీకరించాడు. మనోనిగ్రహం పొందడం చేతనే అర్జునుడు తిరిగి మామూలు స్థితికి వచ్చాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్యసంధులుగా, న్యాయవేత్తలుగా, నీతిపరులుగా తీర్చిదిద్దుతుంది. మనో నిగ్రహం అలవడితే సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. అయితే ఆత్మ నిగ్రహానికి, ఆత్మస్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మ స్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ్రపోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ఆత్మ స్ధైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్య సాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతాభావన సాధించేందుకు బలం ఇస్తుంది. ఆధ్యాత్మిక అంశంలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతివ్యక్తి ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడుగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయలోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీత కూడా స్పష్టం చేసింది.– దాసరి దుర్గాప్రసాద్ -
ఇంటి వద్దకే శబరిమల అయ్యప్ప ప్రసాదం..! ఇలా ఆర్డర్ చేయండి..
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇష్టపడని వారుండరు. అంతటి ప్రత్యేకత కలిగిని అరవణ ప్రసాదం ఇంటి వద్దకే నేరుగా వచ్చేస్తుంది. అదికూడా శబరిమలకు వెళ్లక్కర్లేకుండానే అయ్యప్ప ప్రసాదాన్ని నేరుగా పొందొచ్చు. అదెలాగంటే..మనం ఉన్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే సులభంగా శబరిమల అరవణ ప్రసాదం పొందొచ్చు. దీనికోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పోస్టల్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తోంది. శబరిమలలోని పోస్టాఫీస్ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తుల కోసం ఇంటి నుంచే అరవణ ప్రసాదం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. భారతదేశంలో అన్ని పోస్టాఫీసులు నుంచి ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదం కొనుగోలు చేసుకోవచ్చని దేవస్వం బోర్డు పేర్కొంది. భారతదేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల అయ్యప్ప ప్రసాదం అందేలా చేయడమే తమ లక్ష్యమని శబరిమల పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. దీనికోసం ప్రసాదాన్ని ఇంటింటికి చేరవేసే ప్రాజెక్టును పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. ఈ ప్రసాదంలో నెయ్యి, అరవణ ప్రసాదం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం తదితరాలు ఉంటాయి. ధరల వివరాలు..టిన్ కవర్తో కూడిన ప్రసాదం కిట్ కొనడానికి రూ.520లు రుసుము చెల్లించాలి4-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.960లు10-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.1,760 చెల్లించాలిపోస్టాఫీసులో ప్రసాదం ధర చెల్లస్తే..రాబోయే కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం స్వయంగా మీ ఇంటికి వచ్చి తీరుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది అయ్యప్ప ఆలయం మకర సంక్రాంతి జ్యోతి దర్శనం నిమిత్తం తెరిచి..కొద్దిరోజుల అనంతరం మూతబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేయబడుతుంది. అలాగే వచ్చిన స్టాంప్లను పంపాలో సురక్షితంగా ఉంచుతారు. అంతేగాదు భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత ప్రత్యేకమైన పిన్కోడ్ (689713) కలిగి ఉన్న ఏకైక దైవం శబరిమల అయ్యప్ప స్వామి. వార్షిక మకరజ్యోతి ప్రారంభం కాగానే శబరిమల అయ్యప్ప ఆలయానికి వివిధ లేఖలు అందుతాయి. ఆ భక్తుల లేఖలు అయ్యప్ప పాదాల వద్ద ఉంచడం అనేది అక్కడొక ఆచారం. ఇక్కడి పోస్టాఫీసు ద్వారానే భక్తుల ఇళ్లకు ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.(చదవండి: అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..)


