Devotion
-
మరణములో నుండి జీవములోనికి
దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు (ఎఫెసీ 1:20,21). అన్నదే విశ్వసించదగ్గ అపొస్తలుల సువార్త సంబంధిత బోధయై ఉంది.సత్యవాక్యమను రక్షణ సువార్తగా కూడా ఇది ఉంది. లేచాడు అన్నది సువార్త కాదు. సర్వశక్తి సంపన్నుడైన అద్వితీయ సత్య దేవుని చేత యేసు మృతులలో నుండి సజీవంగా లేపబడ్డాడు అనునదే లేఖనానుసార సత్య సువార్త. తండ్రికి విలువిచ్చే క్రీస్తు అపార విధేయతను ఇదే ఘనంగా చాటుతుందనుటలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ’వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు’ (రోమా 10: 8–10). యేసు సజీవుడుగు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది అపొస్తలుల అమూల్య విశ్వాసం. దేవుని కుమారుడు అంటే ఆయన ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్థం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతూ ఆయన నామమందు జీవము పొందాలి అన్నదే ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధ విజయానికి మూలం. ఈ లోకం మీద విజయం యేసు దేవుని కుమారుడు అనుటలోను , ఆయన్ను దేవ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడని విశ్వసించుటలోనే విజయం దాగి ఉంది (1యోహాను 5:5 ).మరి క్రీస్తు విజయానికి మూలం ఎక్కడ అన్నది లోతుగా పరీశీలన చేస్తే అది ఒక్క ఆయన విధేయతే అనేది బహు తేటగా వెల్లడవుతూ ఉందన్నది ఆశ్చర్యకర విశేషం.ఆజ్ఞలకు లోబడి పాపం చేయకపోవడం ద్వారా పరిశుద్ధత, దాని విధేయత ఈ రెండూ ఎప్పుడు నిలుపుకొనే వేకువ ప్రార్థనలతో అవిశ్రాంత విన్నపాలతో క్రీస్తు అసాధారణ విజయుడిగా, జగజ్జేతగా చరిత్రకెక్కాడు.దేవుడు తనకు అత్యంత విధేయుడైన తన కుమారుడను మరణంలో నుండి జీవములోనికి దాటించాడు. మరణంలోనుండి జీవములోనికి రావడం, పునరుత్థానం చెందడం ఇలా యేసు మరణాన్ని జయించడం దేవుని గొప్ప సంకల్పం.అయితే తనను మరణం నుండి రక్షింపగల తండ్రియైన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించినందున యేసు అంగీకరించబడ్డాడనేది ఇదే ఆయన సాహసోపేత విజయానికి మూలం అయ్యింది. ఇక్కడ మరణం అంటే సిలువ మరణం కాదు, ఆత్మ సంబంధ మరణం. యేసుకు సిలువ మరణం తప్పదు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. ఆయన మరి ఎలాంటి మరణం మీద గురిపెట్టి విజయం సాధించాలనుకున్నాడు అన్నది చూస్తే అదే ఆత్మ సంబంధ మరణం. ఆయన పరిశుద్ధుడు గనుక మరణం ఆయన మీద ఏలుబడి చేయుటకు అన్ని కోణాల్లో అన్ని దారులు వెదకి అది బాగా అలసిపోయింది. పారదర్శకంగా పరిశుద్ధ జీవితం ఆచరించి చూపుతూ యేసు మరణానికి సంపూర్తిగా తలవంచాడు. అంతే, మరణం ఆయన ముందు తలవంచి మోకరిల్లి సాగిలపడింది.మతంతో సంబంధం లేని మార్గంమన తోటి ఇరుగు పొరుగు వాని చుట్టురా ఉన్న సమాజం మేలుకై ప్రతి పని, పరిచర్య, సేవా విధానం శుద్ధ హృదయంతో ఆచరించుట ద్వారానే దేవుని మెప్పు పొందగలం. నిత్య సత్య జీవమనే క్రీస్తు మార్గం మతంతో ఎలాంటి సంబంధం లేనిది. ఇదొక ఆత్మ సంబంధ అసాధారణ ఆధ్యాత్మిక జీవన విధానం. ఇందులో వ్యక్తిగతమైన స్వయం స్వశక్తితో కూడిన పాప నివారణ సంబంధిత పరిశుద్ధ అభ్యాస ప్రయత్నాలు మచ్చుకైన కనపడవు. క్రీస్తును బట్టి దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఏంతో పురోగమనం సాధించే స్థితిలో ఉంటుంటాయి. తమ మానవ జ్ఞానంతో ముడిపెట్టక తమ మంచి చెడ్డల విచక్షణ విషయమైన జ్ఞానం దేవునికే అప్పగించి అన్నింటా దేవునికే మహిమ చెందేలా ఆయన్ను ఘన పరచుటే అతి శ్రేష్టమైన సద్భక్తి జీవిత విధానం.నిత్యజీవము పొందుటకు నేనేం చేయాలి? అన్నదానికి సమాంతర ప్రశ్నయే ‘మరణంలో నుండి జీవంలోనికి దాటుట ఎట్లు?’ అనేది. మరణంలో నుండి జీవములోనికి దాటుటలో గొప్ప అనుభవం సంపాదించినవాడు, అత్యంత ప్రతిభ, ప్రభావ సంపన్నుడు యేసు మాత్రమే అన్న సర్వసత్యాన్ని బహు తేటగా గ్రహించినవారై మొదటగా ఆయన శిష్యులైన అపొస్తలులు ఆ తదుపరి ఆదిమ సంఘము ఆయన అడుగుజాడలలోనే నడిచి అన్నింటా గెలిచింది. ఆ ఆదిమ సంఘాన్ని అనుసరించి ఒక్కటే క్రీస్తు శరీరమను సంఘాలు నేడునూ పాపం నుండి పరిశుద్ధతలోనికి అనగా మరణంలో నుండి జీవములోనికి విజయవంతంగా దాటుతున్నాయి. అనేకులను దాటించుటలో పేరొందిన గొప్ప సువార్త పరిచర్యను అవి నిరంతరాయంగా చేస్తూ వారివలె ముందుకు కొనసాగిస్తూ విధేయంగా ఎంతో శ్రమిస్తున్నాయి. దేవదేవుడు తనదైన బలాతిశయం చేత యేసును మృతులలో నుండి లేపాడు అన్నదే నేటి పునరుత్థాన దినం. ఇదే క్రైస్తవ నిరీక్షణ జీవితానికి గొప్పదైన పునాది. సమభావపు ఏకత్వం కలిగించే ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడిన వారు ధన్యులు అంటుంది గ్రంథము.‘‘నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక ‘మరణములో నుండి జీవము లోనికి’ దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’– యేసుక్రీస్తు – జేతమ్ -
అవధులు లేని దేవుని ప్రేమ
ఒక నీతిమంతుని మరణం నశించిపోయే మానవ జాతికి శుభం చేకూర్చింది. మరణానికి వారసులైన నరజాతికి యేసుక్రీస్తు రూపంలో గొప్ప విమోచకుడ్ని అందించింది. పాపపరిహారార్థ బలిగా, సజీవ యాగంగా దేవాదిదేవుడే సిలువపై తన విలువైన పరిశుద్ధ రక్తాన్ని ధారవోశాడు. మానవుల పట్ల తన అపార ప్రేమను తన బలి అర్పణ ద్వారా చాటుకున్నాడు.ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి చివరికి రెండు తేదీలే మిగిలి పోతాయి. ఒకటి పుట్టుక రెండవది మరణ తేదీ. పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. అందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రపంచ అధినేత అయినా సరే, మారుమూల గ్రామంలో పుట్టిన సామాన్యుడైనా చావు ముందు తల వంచాల్సిందే. మరణం ముందు ఓడి పోవాల్సిందే. అందుకే మనిషికి చావంటే చచ్చేంత భయం. కొంతమంది బతకడానికి కావలసినంత ధైర్యం లేక చావును ఆశ్రయిస్తారు. అదీ శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే మనకథ మరణంతో ఆగి పోదు. మనం చేసిన పాపాలకు ఆ తర్వాత రెండో మరణం కాచుకోని ఉంటుంది. మరణాన్ని తలపించే నిత్య నరకం. ఆ నరకం నుంచి తప్పించేందుకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి మన పాపాలకు విమోచన క్రయధనముగా అర్పించాడు.పాపపరిహారార్థ బలిగా క్రీస్తు తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుని చేత సృజించబడ్డ ఆదిమానవుడైన ఆదాము, అతని భార్యకు తమ ఇష్టం చొప్పున బతికే అవకాశం ఇచ్చాడు. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ లోక అధిపతిగా పిలవబడ్డ దుష్టుడైన సాతాను వారిద్దరినీ మోసం చేసి దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు. పాపం చేసిన వారిద్దరూ పాపం ద్వారా వచ్చే జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వారిలో ఉన్న ఆ పాపపు బీజం ఆ తర్వాత ప్రతి మనిషిలో కొనసాగుతూ వచ్చింది. ఆ పాపాన్ని తీసివేసుకోడానికి మనిషి చేయని ప్రయత్నం లేదు. ప్రధానంగా జంతువుల రక్తం బలి ఇవ్వడం ద్వారా దేవుని ప్రసన్నం చేసుకోవాలని చూసాడు. అయినా నరునిలో వున్న పాపబీజం అతని వెంటాడుతూనే ఉంది. పలు బలి అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు పాపము నుండి మానవులను వేరుచేయవని గ్రహించిన దేవుడు తన కుమారుని ఈ భూమిపైకి పంపి అతని బలి అర్పణ ద్వారా, పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా సమస్త మానవులకు ఆ పాపపు శాపాన్ని విడిపించి తిరిగి దేవునితో మొదటి మానవుడి ద్వారా విడిపోయిన ఆ సంబంధాన్ని పునరుద్ధరింప జేశాడు. అందుకు నీతిమంతుడైన యేసు అప్పటి రోమా పాలకులు, తన స్వజనమైన యూదా ప్రజల ద్వారా ఘోరమైన శ్రమలు సిలువ ద్వారా అనుభవించాల్సివచ్చింది. మానవుల పాపం కోసం పాపంగా చేయబడ్డాడు. సమస్త మానవ కోటి పాపభారాన్ని, శాపాన్ని తనపై మోశాడు. శిలువపై తన పవిత్ర రక్తాన్ని చిందించాడు.క్రీస్తు ప్రశస్తమైన మాటలుశిలువ మరణానికి ముందు క్రీస్తు యేసు భూమ్మీద పలికిన ప్రతి మాట జీవపు ఊటై అప్పుడు ఇప్పుడూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. భూమి గతించినా నా మాటలు మాత్రం నిత్యం నిలిచి ఉంటాయని క్రీస్తు చె΄్పాడు. క్రీస్తు మరణ సమయంలో సిలువ మీద పలికిన 7 మాటలు ఈ శుభ శుక్రవారం ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులందరూ ధ్యానిస్తారు. వాటిలో ముఖ్యంగా తనను క్రూరంగా హింసిస్తున్న సైనికులను, హేళన చేస్తున్న యూదా మతాధికారులు, ప్రజలను చూసి తండ్రీ వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని కోరాడు. మానవుల పట్ల మితిలేని ప్రేమగల దేవుడు కాబట్టే ఇట్టి క్షమాపణగుణం కనబరిచాడు. కుడిచేతి వైపు సిలువ వేయబడిన దొంగ యేసును గమనిస్తూ ఆయన నిజమైన పాపుల రక్షకుడు, దేవుడని గ్రహించి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొనవా అని అర్థించినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని అభయం ఇచ్చాడు. నిజంగా ఒకడు పరలోకం చేరాలంటే దేవుని నమ్మి రక్షణ పొంది బాప్తీస్మం తీసుకోవాలి. కానీ ఇదేమీ లేకుండా ఒక బందిపోటు దొంగకు అతని విశ్వాసం చొప్పున నేరుగా పరలోకం అనుగ్రహించాడు. రోదిస్తున్న తల్లిని చూచి తన ప్రియమైన శిష్యుడికి అమ్మ బాధ్యతలు అప్పగించాడు. సిలువ యాగం ద్వారా తాను భూలోకానికి వచ్చిన రక్షణ కార్యం పూర్తయిందని గ్రహించి తండ్రికి తన ఆత్మను అప్పగించి చివరకు సమాప్తమైనదని చెప్పి యేసు ప్రాణం విడిచాడు. యేసు చనిపోయాడో లేదో నిర్ధారించుకోడానికి ఒక సైనికుడు పక్కటెముకల్లో బల్లెంతో ΄÷డిచాడు. ఇదంతా గమనిస్తున్న కఠినమైన రోమా శతాధిపతి హృదయం కరిగిపోయింది. ఈయన నిజముగా దేవుని కుమారుడే అంటూ ప్రకటించాడు. యేసు చనిపోయిన వెంటనే కొన్ని అద్భుతాలు జరిగాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పేర్కొంది. ప్రసిద్ధ యెరూషలేము దేవాలయపు గర్భగుడిలో ఉండే పెద్ద తెర పైనుంచి క్రిందికి రెండుగా చీలిపోయిందని, ఆ ప్రాంతంలో భూమి కంపించిందని, బండలు బద్దలవడం, సమాధులు తెరవబడి మృతులైన పరిశుద్ధులు పట్టణములో ప్రవేశించి అనేకులకు కనపడ్డారని పేర్కొంది. క్రీస్తు కథ సిలువ మరణంతో ఆగిపోలేదు. చరిత్ర పుటల్లో మరణాన్ని జయించి మూడవ దినమున పునరుత్థానుడైన ఒకే వ్యక్తిగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇప్పటికీ క్రీస్తు ఖాళీ సమాధి యెరూషలేములో మనకు దర్శనమిస్తుంది. సజీవుడైన క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిపోయింది. అందుకే అగస్టిన్ అనే భక్తుడు ’సిలువ దేవుని ప్రేమను ప్రకటించిన గొప్ప వేదిక’ అంటాడు.– స్టెర్జి రాజన్ బందెల, సీనియర్ జర్నలిస్ట్ -
చైత్ర పూర్ణిమ.. ఎవరిని పూజించాలి?
సాధారణంగా పున్నమి అనగానే వెన్నెల గుర్తుకొస్తుంది. సంవత్సరంలో పన్నెండు పున్నములు వస్తాయి. ప్రతి పున్నమికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. పున్నమి నాడు మనఃకారకుడైన చంద్రుని పూజించడం మంచిదని పెద్దలు చెబుతారు. నేడు చైత్ర పౌర్ణమి. ఈ రోజున హనుమంతుడిని, సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. అలాగే అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. దీపోత్సవం, అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రంపూట చంద్రుడిని ఆరాధించడం శుభఫలితాలను ఇస్తుంది. ఆ రోజున లలిత సహస్ర నామ పారాయణ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. శివకేశవుల ఆరాధన చేయడం మంచిది. అలాగే సత్యనారాయణ స్వామి పూజతో సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున ఉపవాసం చేసేవారు ఉప్పు వాడిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.పౌర్ణమి వ్రతం ఆచరించడం ద్వారా మానసిక సంబంధిత మార్పులు జరుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు కావున మానసిక బలం చేకూరుతుంది. చైత్ర పౌర్ణమి నేతి దీపాలను వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. హనుమంతునికి, నారాయణ స్వామికి నేతి దీపం వెలిగించడం విశిష్ట ఫలితాలను ప్రసాదిస్తుంది.అక్కమహాదేవి జయంతి నేడు12వ శతాబ్దపు ప్రసిద్ధ కన్నడ కవయిత్రి అక్కమహాదేవి జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహిస్తారు.శ్రీశైలంలో ఆమె తపస్సు చేసినట్లుగా భావించేప్రాంతం, మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.పరమశివుని భర్తగా భావించి,వచన సాహిత్యానికి ఆమె చేసిన కృషి అద్వితీయం. 12వ శతాబ్దపు వీరశైవ భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొలి మహిళా కవయిత్రి.కర్ణాటకకు చెందిన ఆమె శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని ఆరాధించి, తపస్సు చేసిందామె.అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని, శ్రీశైల దేవస్థానంతో పాటు కర్ణాటకలోని అనేక ప్రదేశాలలో, మహిళా విశ్వవిద్యాలయాలలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి.నేడు (ఏప్రిల్ 2, గురువారం) చైత్రపూర్ణిమ– డి.వి.ఆర్ -
పౌరాణికానికి పద్యాలంకరణ
తెలుగు నాటక కళారంగంలో వల్లూరు శ్రీహరి రావు పద్యనాటక నిపుణులు. ‘గాన కోకిల’, ‘మధుర కంఠీరవ’గా బిరుదులు పొందినవారు. ఏడు పదుల వయసులోనూ రాముడుగా, కృష్ణుడుగా పౌరాణిక పాత్రలో రాణిస్తూ కళాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. హైదరాబాద్లోని సీతాఫల్మండిలో ఉంటున్న ఈ పద్య నాటక కళాకారుడు నేడు ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాటకరంగం గురించి, చేసిన విశేష సాధన గురించి ప్రస్తావించారు.‘‘ఇప్పుడు నాకు డెబ్భైఆరేళ్లు. మొన్నటి ఉగాది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని రామానాయుడు కళామండపం లో జరిగిన వేదికపైన ప్రదర్శన ఇచ్చాను. శారీరకంగా కాస్త అలసటగా అనిపించినా, గొంతు మాత్రం పద్యంతో ఇంకా పదం తొక్కుతూనే ఉంది. ఇది ఆ రాముడు ఇచ్చిన శక్తే. అదే నన్ను ఇంకా సజీవంగా ఉంచుతోంది. వదలని ప్రేమ... జీవితాన్ని ప్రతిబింబించేది నాటకమైతే, నాటకానికి ప్రతిస్పందించేది జీవితమే. పదిహేనేళ్ల వయసులో మా పెదనాన్న కుమారుడు వల్లూరు కామేశ్వరరావు ద్వారా నాటకరంగంలోకి వచ్చాను. కంఠం బాగుందని, పద్యాలు పాడించి ప్రోత్సహించేవారు. ఆ విధంగా సతీ సక్కుబాయిలో ‘జ్ఞానయోగి’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఆ తర్వాత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో సిద్ధయ్యగా రేణుకా మహత్యంలో ‘నారదుని’గా, కనకదుర్గ మహత్యంలో ‘శంకరుని’గా శ్రీరామాంజనేయ యుద్ధంలో ‘శ్రీరాముని’గా, కురుక్షేత్రం గయోపాఖ్యానంలో శ్రీకృష్ణునిగా, తులసి జలంధరలో ‘దేవేంద్రుని’గా, పాండవ సౌశీల్యంలో ధర్మరాజు’ గా సాయినాథ ప్రస్థానంలో ‘శ్యామా’గా... వివిధ రకాల పాత్రలను పోషించాను. పోషిస్తూనే ఉన్నాను. ఏ పాత్ర ప్రత్యేకత దానిది. పద్యాలను నుడికారాలతో సహా కంఠస్థం చేస్తూ గొంతును నాటకానికి మేటిగా మార్చుకున్నాను. రాముడిగా, కృష్ణుడిగా పాత్రలు పోషించేటప్పుడు ప్రేక్షకులు రాముడిగా భావించి, నాటకం పూర్తయ్యేక నమస్కరించేవారు. అది నాటకం ద్వారా రాముడే ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. ఇప్పటికీ ప్రతిరోజూ పద్యాలు సాధన చేస్తూనే ఉంటాను. నాటి నుంచి నేటి వరకు ఏనాడూ ఈ కళను వదిలింది లేదు. నాకరంగంలో తెలుగు రాష్ట్రాలలో సీనియర్ రంగస్థల నటుడిగా గౌరవ పురస్కారాలు అందుకున్నాను.తెల్లవార్లూ పాత్రలో లీనమై... రాత్రి ఎనిమిది గంటలకు నాటకం మొదలైతే తెల్లవారు ఝాము వరకు పాత్రలో జీవిస్తూనే ఉంటాం. సన్నివేశాలను బట్టి ఒక్కో నాటకానికి 40 పద్యాలపైనే ఉంటాయి. ప్రేక్షకులు కూడా తెల్లవార్లూ నాటకాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు డిజిటల్ టీవీలు వచ్చాక లైవ్ టెలీకాస్ట్లు కూడా ఇస్తున్నారు. దీనివల్ల ప్రదర్శనకు రాలేని, నాటకంపైన అభిమానం ఉన్న నాటి తరం వాళ్లు లైవ్లో చూస్తుంటారు.పోషణకు మరో ఉపాధి... నేను నాటకంలో పాల్గొనాలంటే నాతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా రావాలి. ఒకరు హార్మోనిస్ట్, మరొకరు మేకప్ ఆర్టిస్ట్. నాటకరంగం ఊపిరిగా కొనసాగుతున్నా జీవనోపా«ధి, కుటుంబ పోషణ కోసం ప్రైవేట్గా ఉద్యోగాలూ చేశాను. నా చిన్నతనంలోనే మా అమ్మనాన్నలు చనిపోయారు. నా తరువాత ఐదుగురు చెల్లెళ్లు. పసిపిల్లలుగా ఉన్నవారిని పెంచి, పెద్ద చేసి, పెళ్ళిళ్లు జరిపించాను. ఇప్పడు అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. నా భార్య సూర్యకుమారి. ఆమెకు నలుగురు చెల్లెళ్లు. మాకు ముగ్గురు పిల్లలు. పిల్లల చదువుల కోసం మా స్వస్థలం కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చాం. ఇప్పుడు పిల్లలందరి బాధ్యతలు పూర్తయ్యి, విశ్రాంత జీవనంలో ఉన్నాం.పెన్షన్ సదుపాయం లేదు... నేటికీ మన తెలుగు పండగలైన వినాయకచవితి, దసరా, సుబ్రహ్మణ్యషష్టి, ఉగాది, శ్రీరామనవమి.. వంటి వేడుకల సమయాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో వేదికల మీద నా ప్రతిభ చూపే అవకాశం నేటికీ లభిస్తున్నది. దీని ఆధారంగానే నా జీవనం గడుస్తుంది. కళాకారులకు ఇచ్చే పెన్షన్ సదుపాయం ప్రభుత్వం నుంచి ఏదీ అందడం లేదు. అయినా ఆ కళా రంగమే నాకు ఇంకా ఇంత ముద్దపెట్టి, ఆదుకుంటోంది. నాలాంటి కళాకారులు ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కళను బతికించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాతో పాటు కళను నమ్ముకుని బతుకుతున్న నిరుపేద కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. పద్యనాటక కళాకారులను ప్రోత్సహించి, వారు ప్రదర్శనల్లో పాల్గొనేలా నా వంతు సాయం చేస్తుంటాను’’ అంటూ తాను చేస్తున్న నాటక కళారాధన గురించి తెలియజేశారు ఈ కంఠీరవుడు.– నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: గడిగె బాలస్వామివల్లూరు శ్రీహరి రావు -
వరదుడు నా రాముడు
భద్రాద్రి రాముడు ఇలవేల్పు కానిదెవరికి? సీతారాముల కల్యాణం కన్నుల పండువగా కాంచనివారెవరు? రఘువీరుడు... దాశరథి... ఆ సీతారామచంద్రమూర్తిప్రతి హృదిలో మనసు గుడిలో పదిలమూర్తి. అనుక్షణం తలుచుకునే జన్మ జన్మాంతర అనుబంధాన్ని పంచుకుంటున్నారు రచయిత చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ.అరవై నాలుగేళ్ళ క్రితం భద్రాచలం పమిడిఘంటం వారి అంబసత్రంలో ఓ రాత్రి హడావిడిగా పుట్టేశాన్నేను మా అమ్మ తొలి పురిటికి తన పుట్టింటి దార్లో ఉండగానే. రాముడితో అంతకు మునుపు పరిచయం తక్కువ నాకు. పుట్టుకతోనే మొదలైంది మా స్నేహం, ఆయన బాధ్యత. చిరు్రపాయంలో ఇప్పపువ్వులతోపాటు తునికిపళ్ళు తనకు తినిపించిన నన్నెలా మరవగలడు నా రామన్న!ఓ రెండున్నర దశాబ్దాలు నే తిరిగిందంతా మా రాముడు నడయాడిన పర్ణశాల ప్రాంతమే. పదోఏట న్యుమోనియా వచ్చినప్పుడు నాకు ముందుగా రాముడి దర్శనం చేయించి, ఆ తర్వాతే డాక్టరు పువ్వాడ నాగేశ్వరరావు గారికి చూపించింది అమ్మ. పదహారేళ్ళ ప్రాయంలో ఓ రాత్రి గుడివీధి ΄÷డిచేటివారి వరండాలో గడిపి మర్నాడు ఉదయమే నే చేసుకున్న రామచంద్రుడి దర్శనం అప్పటికి చివరిదన్నట్టు గుర్తు. ఆ తర్వాత నాస్తికత్వం వగైరాలు... మా అబ్బాయి సిద్దార్ధ ఎనిమిదో నెలలో పదిహేను రోజులపాటు టైఫాయిడ్ బారిన పడ్డప్పుడు నా బాల్య స్నేహితుడు తిరిగి మదికొచ్చేంత వరకూ. ఉత్తరోత్తరా కీర్తిశేషులు వైయస్సార్గారి సెక్యూరిటీలో భాగంగా సీతమ్మతో మా రాముడి కళ్యాణం శాంతా సమేతంగా అతి దగ్గరగా చూసిన భాగ్యం. ఏతావాతా, భద్రాద్రి రాముడు నన్ను తన భుజాలను ఎక్కించేసుకున్నాడు పుట్టీ పుట్టగానే. అలాగని ఆయనంటే నాకు అపారమైన భక్తా అంటే అదీ కాదు. అదో స్నేహం, ఆత్మీయ భాషణం, నేనున్నానన్న భరోసా; అవును, తను చూస్తున్నాడన్న కించిత్ భయం కూడా.ఒకానొక ఉద్యోగపర్వంలో వెనక నుంచి నా చెవిని తాకుతూ చిమ్ముకొచ్చిన వేడినీ, నా మీదికి దూసుకొస్తున్న ఒక విషనాగునీ పక్కదారి పట్టించిన వైనం మా నేస్తుడిదే. పూలమ్మిన చోటనే ముత్యాల తలంబ్రాలు పంచే అదృష్టం నాకొసగిన ఘనత ఆ ఆపన్నహస్తానిదే. విజయవాడలో పని చేస్తున్నప్పుడు బాపుగారు ఓ రోజు ఫోన్లోనే ‘మీకేం బొమ్మ కావాలండీ’ అనడిగినప్ప్పుడు ‘అయ్యా, రాముడిదే’ అనేశాను మరో ఆలోచన లేకుండా. ‘అర నిమిషము నిన్నెడబాసియు నేనాపద పడలేనురా వరదా’ అనెరిగిన వాణ్ణి. నెల తిరక్క ముందే వారు ప్రేమతో గీసిచ్చిన గుహుడి చేతిలో దాసజన సమేత భద్రాద్రి సీతారామచంద్ర స్వామి మా ఇంట్లో ఎప్పటికీ స్థిరోభవ, వరదోభవ! ఇక, సుమారు మూడున్నరేళ్ళపాటు తిరుమలలో ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామి దర్శనం ‘సబేరా’ ముందున్న రాతిస్తంభం కింద భాగంలో వేంచేసి ఉన్న సీతారామలక్ష్మణుల దర్శనం వినా పూర్తయ్యేది కాదు. ఏములాడ రాజన్నలో, బెజవాడ కనకదుర్గమ్మ లో, తిరుమల వేంకటేశ్వరుడిలో నాకు సదా దర్శనమిచ్చేది భక్తమందార, రఘువీర శ్రీరామచంద్రమూర్తే. మౌలాలీ గుట్ట మీది దర్గాలో హజ్రత్ అలీగారి చేతిముద్రని తాకి, వారికి మోకరిల్లినప్పుడు నా మనస్సులో మెదిలేది నిజ జనావన కాముడు, ఫాలలోచన సహితుడు నా దాశరథే.మొన్నీమధ్య నన్ను చూస్తూనే రామచంద్రుyì చెవిలో గుసగుసలాడింది సీతమ్మ.. ఒళ్ళోకూర్చునే.. మీవాడొస్తున్నాడు, ఇంక నేనేం గుర్తుంటాను స్వామీ మీకని. స్వామివారు ‘మనం కాక వాడికింకెవరున్నారు చెప్పు’ అన్నారు. మరి వాడి చేతికంటిన ఆ ఎర్ర మరక మాటేమిటి అని తనలో తానే అనుకొన్నది నా తల్లి– భర్తకి ఈతని విషయంలో ఏ ఫిర్యాదూ పట్టదని. స్నేహానికి తలొంచానా రోజు, తల పంకించాడు మా తండ్రి.ఇంతకీ నేను నా రాముణ్ణేమి కోరుతున్నట్టు? ఏది అడిగితే అది నేనైనా మీరైనా ఇట్టే ప్రసాదించే ఘనశ్యాముడాయన. నేస్తుడి నాడి పట్టినవాణ్ణి కనుక నేనెప్పుడూ ఏదీ అడిగి ఎరుగనతన్ని. అన్నీ ఇచ్చేశాడాయన, ఇస్తూనే ఉన్నాడా వరదుడు, కొండొకచో తానే అంబై పలుకుతూ కూడా! కంచర్ల గోపన్న గారైనా అప్పుడెప్పుడో సీతారామస్వామీ నే చేసిన నేరమదేమీ అంటూ కినుక వహించారేమో కానీ, నేనెన్నడూ నా రాముని మీద అలిగిందీ లేదు, ఆయన్ను కోపగించుకున్నదీ లేదు.. కలలో కూడా... ఏం జరిగినా అది నీ మహిమో, నా ప్రారబ్దమో అనుకుంటూ.కానీ ఇప్పుడెందుకో, ‘రామా, నువ్వు కొంచెం చిరుకోపం నీ మొహాన పూసుకోవయ్యా, నా తరఫున కూడా, ‘పాతకములతి పామరత్వమున ప్రీతి తోడ చేసెడి వారిపై’ అనాలనిపిస్తోంది.‘దీనత్రాణ దీక్షను మరచెదో పదిలమో రామ బహుపరాకు’ అనవలసింది, ‘దాచుకొను నీ సొమ్మది పదిలమో రామ బహుపరాకు’ అంటూ నా రామ భద్రునికి హెచ్చరిక చేయవలసి వస్తోంది.అమ్మయ్యో... ధర్మస్వరూపుడివి, నీకు చెప్పదగిన వాడినా స్వామీ, మన జన్మజన్మాంతర అవిచ్ఛిన్న మైత్రి నాపై ఈ బాధ్యత మోపుతున్నది కానీ...శ్రీరామా... అదిగో శివధనుర్భంగ సమయాన నీవైపు పవిత్రమగు శృంగారభావ మొడిసిపట్టిన చంద్రముఖి మాయమ్మ సీతమ్మ చూపు, చెరుకు గడవోలె నడిమికి విరిగి సర్వలోకములలో మ్రోగుతున్న ఆ ధనువు, రేపటి లగ్నంబునందె నాలుగు ముళ్ళు పడనిమ్మంటున్న దశరథ మహారాజు, నవ మనోజ్ఞ కళ్యాణ మంటపం, వశిష్ట వామదేవ శతానంద గాధేయులు, తట్టలో సీతమ్మను తెచ్చిన మేనమామలు, మా అమ్మ దోసిట్లో పద్మరాగమణులు, మరుక్షణపు మల్లెలు, తదుపరి ఇంద్రనీల మణులు, ప్రతి చైత్రశుద్ధ నవమికి వితతంబుగ తెలుగు నేల విరసెడి జల్లులు... చిరుజల్లులు చిటపటలు... ఎక్కడ చూసినా రఘు కులేశుడవు నువ్వేనయ్యా... ఆగాగు, నేనొస్తున్నాను ప్రభూ, తడవనివ్వను నిన్ను, నా చిన్న తాటాకు గొడుగు తెస్తున్నానుండు... మా సీతమ్మ తల్లికీ, నీకూ, భక్తజన సంద్రానికీనూ... -
అందరివాడు
‘రామ’ అనే పదం దశరథ సుతుడైన శ్రీరాముని పేరును సూచించే నామవాచకం మాత్రమే కాదు.. ధర్మాత్ములు, గుణవంతులు, అయిన వ్యక్తుల పట్ల విశేషణంగా, ఉపమానంగా కూడా వాడే అద్భుతమైన పదం. తల్లి దండ్రుల పట్ల భక్తి గౌరవాలు కలవారిని, సోదరుల పట్ల వాత్సల్యం ఉన్నవారిని, సహధర్మచారిణిపై విశేష ప్రేమానురాగాలు కలవారిని, ధర్మం తప్పని వారిని, ఎంత కష్టమైనా సరే, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారిని, దుర్మార్గులను శిక్షించే వారిని, ప్రజారక్షకులైన పరిపాలకులను అపర శ్రీరామచంద్రులుగా కీర్తించడం మన దేశంలో అనాదిగా జరుగుతున్నదే.‘రాము’డంటే రంజింపచేయువాడని అర్థం. అందరి మనసులనూ ఆనందింపచేయగలిగిన వారందరూ శ్రీరాములే. వాల్మీకి మహర్షి మాటలలో చెప్పాలంటే ‘రామో విగ్రహవాన్ ధర్మః అంటే ‘ధర్మానికి మూర్తీభవించిన రూపమే శ్రీ రాముడు. ఆయన ధర్మం, సత్యం, పితృవాక్య పరిపాలన, సంపూర్ణ మానవత్వం, ఏకపత్నీ వ్రతం, ధర్మబద్ధమైన పరి పాలనకు మారు పేరు. సోదర ప్రేమ, మిత్రధర్మం, సమత్వ బుద్ధి ఆయన స హజ స్వభావాలు.శ్రీరాముడు విశ్వజనీనమైన కొన్ని ధర్మాలను తాను ఆచరించి, లోకానికి ఆదర్శంగా నిలిచాడు. లక్ష్య సాధన కోసం ఎంత సుదీర్ఘ కాలమైనా ప్రయత్ని స్తూనే ఉండాలనీ, ఆ దశలో ఎన్ని ఆటంకాలు, కష్టాలు ఎదురైనా అనుకొ న్న లక్ష్యం సాధించేదాకా పట్టు సడలింపరాదనీ, తన సీతాన్వేషణ ద్వారా చాటిన వ్యక్తిత్వ వికాస నిపుణుడాయన. లక్ష్యసాధన కోసం ఉడుతలు, వానరుల వంటి వారు అందించే చేయూతను కూడా సహృదయంతో స్వీకరించి ముందుకు సాగాలన్నది ఆయన సందేశం. తానెంతటి గొప్ప పరాక్రమ శాలియైనా, ఏనాడూ అహంకారాన్ని దరిచేరనీయక వినయశీలిగా ప్రవర్తించిన మహోన్నతుడాయన. శత్రువులలోని మంచి గుణాలను సైతం ప్రశంసించే తత్వమాయనది. ఎప్పటికప్పుడు తన భావోద్వేగాలను నియంత్రించుకొంటూ, తన సోదరులనూ ప్రశాంతంగా ఉండమని బోధించిన మహామనీషి శ్రీరాముడు. లోకంలో ప్రతి యువతీ తనకు శ్రీరామునిలాంటి భర్త లభించాలని కోరుకొనేంత ఆదర్శ వంతుడైన భర్త ఆయన.ఇంక రాజా రాముని గొప్పదనాన్ని ఎంత వర్ణించినా చాలదు. అసలుసిసలైన ప్రజా పాలకుడంటే శ్రీరాముడే. వ్యక్తిగత విషయాలకు, సమష్టి విషయాలకు సంఘర్షణ ఏర్పడితే, వ్యక్తిగత అంశాలకంటే సమష్టి విషయాలకే ప్రాధాన్యతనివ్వాలనేది ఆయన ఆచరించిన రాజధర్మం. రాజ్య శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని రాజు శ్రీరాముడు. ప్రజలందరికీ సమన్యాయాన్ని, సమాన గౌరవాన్నీ అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగలసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే ఆయన పాలనలో నెలకు మూడు వానలు కురిసేవి. ప్రజలు సుఖ సంతోషాలతో, ఎలాంటి భయాలూ లేకుండా హాయిగా.. నిశ్చింతగా జీవించేవారు. ఆ సుభిక్షమైన రామరాజ్యాన్ని తిరిగి స్థాపించాలని ఎందరో నాయకులు కలలు కన్నారు.రామరాజ్యంలో ప్రజల యోగక్షేమాలకు, వారి రక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడింది. కార్యదక్షులైన, తెలివితేటలు కల్గిన, నిష్కపటులైన మంత్రులు పరిపాలనలో రాజుకు సలహాలనిచ్చేవారు. ప్రజల ఆదాయంలో ఆరవ భాగం (బలిషడ్భాగం) మాత్రమే పన్నుగా రాజారాముడు స్వీకరించే వాడు. అదికూడా ప్రజలకు భారం కాకుండా చూసుకొనేవాడు. సైన్యాన్ని, గూఢచారి వ్యవస్థను బలంగా ఉంచుకొనేవాడు. దేశకాల పాత్రోచితమైన న్యాయం ప్రజలకు అందించబడేది. కనుకనే ఆయన చరిత్ర ‘యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే/ తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి’ అని వాల్మీకి చెప్పినట్లుగా ఈ భూమిపై ఎంతకాలం పర్వతాలు, నదులు నిలిచి ఉంటాయో అంతకాలం అంటే ఈ సృష్టి ఉన్నంతకాలం రామకథ ప్రజల హృదయాలలో నిలిచి ఉంటుంది. వ్యక్తి సౌఖ్యం కంటే ఎంతో గొప్పదైన ధర్మ సంస్థాపన కోసం జీవించాలని బోధించిన, లోక క్షేమం కోసం సాగే ధర్మకర్మ వ్యవస్థను కాపాడిన ధర్మ విగ్రహుడు శ్రీరామచంద్రుడు. అందరికీ రక్షగా నిలవాలని కోరుకుందాం. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామశాస్త్రి, విశ్రాంత అధ్యాపకులు -
అనుగ్రహబలమివ్వు సీతారామా!
‘శ్రీరాముని అనుగ్రహబలమే బలము’ అన్నాడు త్యాగయ్య. రాముని అనుగ్రహం అతి సులువు. మాటకు కట్టుబడుట... మంచికి కట్టుబడుట... ఇవి చేస్తే చాలు. అయిననూ ఆయన మనయందు పరాకుగా ఉంటే ఒక మాట చెప్పేందుకు సీతమ్మ తల్లి ఉండనే ఉందిగా. సీతాసమేతుడైన ఆ దివ్యమూర్తి జన్మదినమూ, వివాహమూ లోక విశేషము. పొందగలిగినన్ని వరములు ప్రతి ఒక్కరూ పొందాలని ఆకాంక్షిస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.స్థితప్రజ్ఞతరేపే పట్టాభిషేకం అన్నప్పుడు పొంగిపోలేదు, ఆ పట్టాభిషేకం ఆగిపోయి, అడవికి వెళ్లాలని తెలిసినప్పుడు కుంగిపోలేదు. తండ్రిని నిందించలేదు, పినతల్లి కైకేయిని ద్వేషించలేదు. ఆ క్షణంలో ఆయన చూపిన నిలకడ స్థితప్రజ్ఞకి పరాకాష్ట. అత్యంత ఒత్తిడిలో కూడా విచక్షణ కోల్పోకుండా ఉండటం ఒక గొప్ప వ్యక్తిత్వ లక్షణం.కృతజ్ఞత ఎవరైనా వంద తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా, వారు చేసిన ఒక్క చిన్న మేలును కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే గొప్ప గుణం రాముడిది. కృతజ్ఞత చూపడంలో రాముడు ఒక మార్గదర్శి.ధర్మబద్ధతరాముడిని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటే ధర్మానికి ప్రతిరూపంగా పేర్కొంటారు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు. రాముడి బాణం దెబ్బ తొలుతగా రుచి చూసిన మారీచుడే. అంటే శత్రువు చేత కూడా ప్రశంసలు పొందేంతటి ధర్మగుణం కలవాడన్నమాట. ఎన్ని కష్టాలు ఎదురైనా తను నమ్మిన సత్యం, ధర్మం నుంచి తప్పుకోకపోవడం ఆయన గొప్పతనం. -
పంజాబీ వంటకాలకు ఫుడ్లవర్స్ ఫిదా..!
కొత్త రుచులను నగరవాసులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.. పంజాబ్ నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో నివాసం ఉండేవారి కోసం వెలిసిన దాబాలు క్రమంగా చేరువయ్యాయి. దశాబ్దాలుగా భాగ్యనగర సిటీవాసులు పంజాబీ రుచులను భల్లే భల్లే అంటూ ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు హైవేలపై ప్రత్యక్షమయ్యే దాబాలు ప్రస్తుతం నగరంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి నచ్చిన రెసిపీలను లాగించేస్తున్నారు ఫుడ్ లవర్స్.. ఆయా ఫ్లేవర్లలో లభించే లస్సీని ఈ సమ్మర్లో తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే అంటున్నారు. శామీర్పేట్ వద్ద(హైదరాబాద్ నుంచి 40 కి.మీ) ఉన్న పంజాబీ దాబా, లాంగ్ డ్రైవ్కు వెళ్లినప్పుడు సేద తీరడానికి పలువురు పంజాబీ హవేలీ దాబాను ఎంచుకుంటారు. ఇది సంప్రదాయ పంజాబీ హైవే ఆహారాన్ని, విలక్షణమైన, రంగురంగుల హవేలీ డిజైన్లతో మిళితం చేస్తుంది. ఇక్కడ ప్రత్యేకమైన భారీ బాహుబలి లస్సీ సహా వెన్న పూసిన పరాటాలు, అమృత్సరి కుల్చాలు ఉంటాయి. విశేషం ఏమిటంటే.. ప్రాంగణంలో ఒక సెల్ఫీ మ్యూజియంలో ఎంజాయ్ చేయవచ్చు. హైటెక్ థ్రిల్.. హైవే ఫీల్.. కొండాపూర్లో ఉన్న చార్పాయ్ దాబా విలక్షణమైన అలంకరణ మంచాల మీద కూర్చునే ఏర్పాటుతో పాటు ఫైన్ డైనింగ్ సీటింగ్తో ఆధునిక దాబా భావనను అందిస్తుంది. ఇక్కడి మెనూలో సంప్రదాయ ఉత్తర భారతీయ థాలీలు, శాఖాహారం, మాంసాహారం రెండూ సృజనాత్మక మార్పులతో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చైనీస్/ధాబా ఫ్యూజన్ స్టార్టర్స్, మెయిన్ కోర్సులను కూడా ఆస్వాదించవచ్చు. సింపుల్.. హిస్టారికల్.. సుదీర్ఘ కాలంగా బోయిన్పల్లిలో భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటోంది లవ్లీ పంజాబీ దాబా. ఇది పూర్తి శాఖాహార పంజాబీ దాబా, ఇది చాలా సింపుల్గా ఆడంబరాలు లేకున్నా ఎంతో కాలంగా తనకు ఉన్న పేరు ప్రతిష్టలతో ఆకట్టుకుంటోంది. పరాటాలు, రోటీలు, పప్పు, కూరగాయలు కొన్ని ఇండోచైనీస్ వంటకాలతో నిండిన క్లాసిక్ పంజాబీ వంటకాలు మెనూలో ఎక్కువగా ఉంటాయి. అందుబాటు ధరల్లో ఐటవ్స్ు లభ్యమవుతాయని అంటుంటారు.హిల్స్లో కపూర్స్.. నగరంలో అత్యంత ఖరీదైన, ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్లో ఉన్న కపూర్స్ కేఫ్ అచ్చం పంజాబీ థీమ్తో రూపొందింది. కృత్రిమ గడ్డిపై మంచాల సీటింగ్, రంగురంగుల అలంకరణతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. చాలా ప్రశాంతమైన, ఆహ్లాదకర వాతావరణంతో ఇది పంజాబీ దాబా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. పూర్తిగా శాఖాహార వంటకాలు మాత్రమే అందించే ఈ కేఫ్ ఆలూ పరాటా, బేడ్మి పూరి, చిక్కటి అమృత్సరి లస్సీ తదితర వంటకాలకు ప్రసిద్ధి.నార్త్ టూ సౌత్ నగరంలోని పురాతన పంజాబీ దాబాలలో సాగర్ పాపాజీ కా దాబా కూడా ఒకటి.. అబిడ్స్లోని సాగర్ పాపాజీ కా దాబా, ఒక ఇంటి వంట ప్రాంగణంగా పేరొందింది. దీనిలో ఎటువంటి హంగామాలు, ఆధునిక అలంకరణలు ఉండవు. ఇది పూర్తిగా ఉత్తర భారత రుచులకు ప్రసిద్ధి చెందింది. దువా కుటుంబం 1985 నుంచి దీనిని నిర్వహిస్తోంది. దాల్ మఖానీ, ఆలూ పరాఠాల నుంచి ఖీమా ఫ్రై, తందూరీ రోటీల వరకు ఇంట్లో తయారు చేసిన రుచిని కలిగి ఉంటాయి. ఇక్కడ క్లాసిక్ చిక్కటి లస్సీ తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన ఐటమ్ అంటారు ఫుడ్ లవర్స్. -
వైష్ణవ తిలకం అర్థం తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు!
భారతీయ సనాతన ధర్మంలో నుదుట ధరించే తిలకానికి విశిష్టస్థానం ఉంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో కనిపించే 'U' ఆకారపు తిలకం వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు, శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయంలో విశిష్టంగా కనిపించే 'U' ఆకారపు ఊర్ధ్వపుండ్రం వెనుక దాగి ఉన్న పరమార్థం ఏమిటి? భగవంతుడి పాదపద్మాలకు చిహ్నంగా భావించే ఈ తిలకం, మనిషిలోని అహాన్ని తొలగించి ఆధ్యాత్మిక పురోగతికి ఎలా బాటలు వేస్తుందో తెలుసుకుందాం..వైష్ణవ భక్తులు ధరించే 'U'’ ఆకారపు తిలకాన్ని ‘ఊర్ధ్వపుండ్రం’ అని పిలుస్తారు. ఆధ్యాత్మిక పరిభాషలో ‘ఊర్ధ్వ’ అంటే పైకి, ‘పుండ్రం’ అంటే గుర్తు అని అర్థం. అంటే ఇది మనిషిని ఉన్నత స్థితికి లేదా మోక్ష మార్గానికి నడిపించే గుర్తు.శాస్త్రాల ప్రకారం, 'U' ఆకారం సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలకు సంకేతం. నుదుటిపై ఈ తిలకాన్ని ధరించడం ద్వారా భక్తుడు తనను తాను పరమాత్మ పాదాల చెంత సమర్పించుకున్నట్లు భావిస్తారు. ఇది మనిషిలో అహంకారాన్ని తగ్గించి, వినయాన్ని, భక్తి భావాన్ని పెంపోందిస్తుంది.ఆజ్ఞా చక్రం – శక్తి కేంద్రం...మన శరీరంలో ఏడు ముఖ్యమైన చక్రాలు ఉంటే, అందులో నుదుటి మధ్య భాగం ‘ఆజ్ఞా చక్రం’గా పిలుస్తారు. ఇది జ్ఞానానికి, ఆలోచనా శక్తికి కేంద్రస్థానం.ఏకాగ్రత: తిలకాన్ని ధరించే సమయంలో వేలితో ఆజ్ఞా చక్రాన్ని తాకడం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమవుతాయి. ఇది ఏకాగ్రతను పెంచి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.నాడుల కలయిక: ఊర్ధ్వపుండ్రంలోని రెండు నిలువు రేఖలు మన శరీరంలోని ఇడ, పింగళ నాడులను సూచిస్తాయి. వీటిని నుదుటిపై ధరించడం వల్ల ప్రాణశక్తి క్రమబద్ధం అవుతుంది.గంధం, పసుపు.. ఆరోగ్య ప్రదాయిని...తిలక ధారణలో ఉపయోగించే ద్రవ్యాలు కేవలం రంగు కోసం మాత్రమే కాదు, వాటిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. తెల్లటి చందనం లేదా పసుపు పచ్చని గంధాన్ని ధరించడం వల్ల నుదుటి భాగం చల్లబడుతుంది. ఇది కోపాన్ని తగ్గించి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కుంకుమ లేదా పసుపు మిశ్రమం యాంటీ–సెప్టిక్లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, సానుకూల ప్రకంపనలను ఆకర్షిస్తుంది.శాస్త్రీయ కోణం...ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, రెండు కనుబొమ్మల మధ్య భాగంలో పీనియల్ గ్రంథి ఉంటుంది. దీనిని తరచుగా తిలకం ద్వారా తాకడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే విద్యార్థులు, మేధావులు తిలక ధారణను ఒక క్రమశిక్షణగా పాటిస్తారు.నుదుట తిలకం ధరించడం కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు.. అది ఒక సంస్కారం. మన సంస్కృతిని ప్రతిబింబించే అద్దం. భగవంతుడిపై భక్తిని చాటడంతో పాటు, మానసిక వికాసానికి, ఆరోగ్యానికి ఈ ఊర్ధ్వపుండ్రం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.– పసుపులేటి శ్రీలక్ష్మి, జర్నలిస్ట్ -
తండ్రి ఆజ్ఞలో దాగిన నాయకత్వ రహస్యం
శ్రీరాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్యలో ఆనందోత్సాహాలు ఉప్పొంగుతున్న శుభవేళ. ప్రజల హృదయాల్లో ఒకే పేరు – రాముడు. న్యాయం, వినయం, ధర్మనిష్ఠల ప్రతిరూపంగా ఉన్న శ్రీరాముడు కాసేపట్లో రాజ్యభారాన్ని స్వీకరించబోయే సమయంలో, ఎవ్వరూ ఊహించనిదిగా ఆ దృశ్యం కాస్తా మారిపోయింది. ఆనందోత్సాహాల స్థానంలో నిరాశా నిస్పృహలు... రాజసభలో నిశ్శబ్ద వాతావరణం. కారణం – దశరథుడు, భార్య కైకేయికి ఇచ్చిన మాటతో అంతా తారుమారు కావడం.రాజ్యాన్ని వదిలి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమనే ఆజ్ఞను రామునికి తెలియజేయటానికి కూడా ఆయనకి ధైర్యం ఉండదు. ఈ పరిస్థితిలో, కైకేయి రామునికి ఈ విషయం చెప్పినప్పుడు రాముడు స్పందించిన తీరుని వాల్మీకి మహర్షి ‘న హమర్థ పరో దేవి’... అమ్మా! సంపదల కోసం నేను జీవించను. ‘మాం ఋషిభిస్తుల్యం, కేవలం ధర్మమాస్థితం’... ఋషుల వలె ధర్మాన్ని ఆచరించడం మాత్రమే నా తత్త్వం అని నీకు తెలిసిందే కదమ్మా...’’ అంటాడు. ఇది అంధ విధేయత కాదు. ఆయన చైతన్య పూర్వక నిర్ణయం. రాముడు తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తన హక్కును వినియోగించుకోవచ్చు కానీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టటమే రాజధర్మమని గ్రహించాడు.అయితే ఆయన ఆజ్ఞను పాటించటం కేవలం కుమార ధర్మం మాత్రమేనా? లేక దానిలో మరింత లోతైన ధర్మబోధ, నాయకత్వ దృష్టి, విలువల పట్ల నిబద్ధత దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం వాల్మీకి రామాయణం వైపు తిరగాలి. ’పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన గౌరవాత్’.... తండ్రి మాట గౌరవం కోసం, ఆయన ఆజ్ఞను పాటించాలనుకుంటున్నాను అంటాడు. శ్రీరాముడు దశరథుడు ఇచ్చిన వాగ్దానం విఫలమైతే, రాజ్యంపై, రాజుపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే రాముడు తండ్రికి చెప్పి, ఓదార్పును ఇచ్చాడు.కౌసల్యాదేవి రాముని వనవాస వార్త విని దుఃఖించినప్పుడు ఆమెను కూడా ధైర్యపరుస్తూ, ఓదార్చిన తీరు అమోఘం. తండ్రిగారు మనకి రాజు; మనల్ని పోషించే దశరథుడు మనకి గురుస్థానంలో ఉన్నారు – మనకంటే పెద్దవారు. అందరితో పాటు మనిద్దరమూ కూడా ఆయన ఆజ్ఞని పాటించి తీరాలి. స్త్రీకి స్వర్గ్రపాప్తికి భర్త శుశ్రూష ఒక్కటే మార్గమమ్మా అని వివరించాడు. ‘దశరథస్తు ధర్మాత్మా’ అంటారు మహర్షి. అంటే పితృవాక్యం ధర్మవాక్యం అని ఒక సందేశాన్నిస్తున్నారు. ఈ సందేశం ఎప్పటికీ సత్యమే. ఇదంతా విని కౌసల్య రాముని ధర్మనిష్ఠకి పోంగిపోయింది.శ్రీరాముడు వనవాసం చేయాలన్న వార్త తెలియగానే, లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూ ముసలివాడైన తండ్రిని అంతం చేస్తానన్నాడు. అతణ్ణి వారిస్తూ, తండ్రిగారి ఆజ్ఞని తప్పకుండా ఆచరించాల్సిందేనని తమ్ముడికి కర్తవ్య బోధ చేస్తాడు. ఈ విధంగా ఏకకాలంలో కుటుంబానికి బలం ఇచ్చినవాడు శ్రీరాముడు – తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి, రాజ్య ప్రతిష్టను కాపాడటానికి, తన హక్కుని త్యాగం చేశాడు.అరణ్యవాసం – నాయకత్వ శిక్షణఇంకొక కోణంలో చూస్తే అరణ్యవాసం రాముని నాయకత్వానికి ఒక శిక్షణా శిబిరం అయింది. రాజ్రపాసాదంలో అన్ని హంగులతో పెరిగిన శ్రీరాముడు, అరణ్యంలో ఋషుల కష్టాల్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నాడు. ప్రజల బాధలను ప్రత్యక్షంగా అనుభవించాడు. అటు రాక్షసులతోనూ, ఇటు ఋషులతోనూ, సాధారణ జీవితాన్ని గడుపుతూ, ఉపశమనం, సహనం, విధేయత, ధర్మనిష్ఠని పాటిస్తూ, సమగ్ర నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. గిరిజనుల జీవన విధానాన్ని తెలుసుకున్నాడు. పాలనలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం వారితో సహజీవనం ఎంత అవసరమో రాముడి జీవితం చెబుతోంది. అధికారంలోకి రాకముందే అనుభవం సంపాదించిన నాయకుడిగా ఎదగగలిగాడు. కనుక అరణ్యవాసం రాజ్యభారానికి శిక్షణ శిబిరంగా చెప్పొచ్చు.విలువలపై నిలిచిన వ్యక్తిత్వంరాముని వనవాస నిర్ణయం తక్షణ ఫలితాల కోసం కాదు, దీర్ఘకాలిక విలువల కోసం. తన వ్యక్తిగత ఆనందం, తల్లిదండ్రుల ప్రేమ, రాజ్యాభిషేక గౌరవం మొదలైనవన్నీ పక్కన పెట్టి, ధర్మాన్ని ఎంచుకుని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనిపించుకున్నాడు.ప్రస్తుత సంక్షుభిత సమయంలో రాముడి జీవితం ఒక స్ఫూర్తి. మాట నిలబెట్టుకోవడం, బాధ్యతని నిస్వార్థంగా స్వీకరించటం, క్లిష్టకాలంలో ధైర్యంగా నిలబడటం, హక్కుల కంటే కర్తవ్యాన్ని ముందుంచటం, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడటం మొదలైనవి ఏ కాలానికైనా వర్తిస్తాయి.శ్రీరాముని జీవితం మనకిచ్చే సందేశం ఒక్కటే –‘అధికారం గొప్పది కాదు; ఆ అధికారాన్ని నిలబెట్టే విలువలే గొప్పవి’. శ్రీరాముని విధేయతను చాలామంది త్యాగంగా చూస్తారు కానీ, అది స్వచ్ఛంద ధర్మం. అందుకే రామకథ యుగ యుగాలపాటు మన హృదయాల్లో వెలుగుతుంది. అది భక్తి కథ మాత్రమే కాదు, ఆత్మవిమర్శకు ఆహ్వానం కూడా! నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు రాముడికి తులసి మాలను ధరింపజేయాలి. పూర్తయిన తర్వాత అన్నదానం చేసి, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ఆహూతులకు బహుమతిగా ఇవ్వడం ద్వారా శుభఫలితాలు చేకూరతాయి.రామననమిరోజు రామాలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణం వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయని ప్రతీతి.శ్రీ రామనవమి రోజున పానకం–వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ్రపాకృతిక పరమార్థం ఏమిటంటే ఇది వేసవికాలం కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయని పండితుల అభిప్రాయం. – దావులూరి రామకృష్ణ శర్మ విశ్రాంత అధ్యాపకులు -
ప్రశాంతంగా శ్రీరామ నవమి శోభాయాత్ర : అధికారులు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ గరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధమయ్యాయి. సీతారాం బాగ్ లోని ద్రౌపది గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, పాల్గొన్నారు. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసు కోవాల్సిన చర్యలపై చర్చించారు.2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందిందని, సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో జరుపు కోవాలని కోరారు. ఇందుకోసం సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుతోపాటు, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.ముఖ్యంగా చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. గతేడాది వాహనాల బ్రేక్డౌన్ వల్ల యాత్ర నెమ్మదించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.శోభాయాత్రను మధ్యాహ్నం 1 గంట కల్లా ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాల వల్ల ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లు వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. ప్రజలు, ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటును ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే వాహనాల ఎత్తు విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులు భగవంతరావు, గోవింద్ రాఠి,ఆనంద్ సింగ్, కృష్ణ, శ్రీమతి శశికల (మాజీ కార్పొరేటర్), లాల్ సింగ్ (మాజీ కార్పొరేటర్) అందరూ శోభాయాత్ర సందర్భంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించగా, అన్నింటిని పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు. అనంతరం శోభాయాత్ర వెళ్లే రూట్ను పరిశీలించారు.ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, ఐపీఎస్,ఎన్. శ్వేత, ఐపీఎస్, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
యద్భావం తద్భవతి
వరదల ధాటికి ఒక ఊరు పెద్ద మొత్తంలో నష్ట పోయింది. ఆ ఊరి రైతుల ప్రధానపంట వేరుశనగ. వరద నీటి వల్ల వారు విత్తనాలకని దాచిపెట్టుకున్న వేరుశనగ విత్తనాలు పనికిరాకుండా పోయాయి. అందరూ వెళ్ళి జమీందారును సహాయం చేయమని కోరారు. దానగుణం కలిగిన జమీందారు సహాయం చేయడానికి అంగీకరించాడు. రైతులు అడిగినన్ని విత్తనాలు ఇవ్వసాగాడు.అదే సమయంలో అక్కడికి ఒక ముసలావిడ విత్తనాలకని వచ్చింది. ఆమె గురించి తెలిసిన కొందరు ఆమెను వింతగా చూశారు. మరి కొందరైతే ‘నీకు సెంటు నేల లేదు. నువ్వెక్కడ పండిస్తావు? నువ్వు పండించినా తినడానికి నీకు పిల్లాజెల్లా లేరు కదా’ అని వేళాకోళం చేశారు. ఆమె నవ్వి ఊరుకుంది. జమీందారు మాత్రం ఆమె అడిగినన్ని విత్తనాలు ఇచ్చి పంపాడు. మూడు నెలలు గడిచింది. వేరుశనగ తోటలు కోతకు సిద్ధమయ్యాయని తెలిసి వాటిని చూడటానికని జమీందారు జట్కాలో బయలుదేరాడు. ఆ ఊరి రైతులందరూ జమీందారుకు పడీపడీ నమస్కరించారు. తాము నాటిన వేరుశనగ తోటలను చూపారు. ఆ మొక్కలన్నీ పొట్టిగా, బలహీనంగా, ఆకులు ఎండి పోయి ఉన్నాయి. రైతులకు సరైన ఫలితం వచ్చే సూచనలు కనిపించలేదు. బాధగా వెనుదిరిగాడు.ఎండ ఎక్కువయ్యింది. విశ్రాంతి కోసం ఒక మామిడి చెట్టు కింద ఆగాడు. ఎదురుగా చిన్న గుట్ట కనిపించింది. ఆ గుట్ట మీద వేరుశనగ మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వాటి ఆకులు గాఢ పచ్చ రంగులో ఉన్నాయి. ఆశ్చర్య పోయాడు జమీందారు. చిన్నగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ ముసలావిడ కూర్చుని ఉంది.‘మీ ఊర్లో వేరుశనగ పంట ఎవ్వరికీ సరిగా పండలేదు, నీకు మాత్రం ఎలా పండింది?’ అని అడిగాడు. ఆమె చల్లటి కుండ నీళ్ళు జమీందారు చేతికి ఇస్తూ ‘నా ప్రార్థన వల్ల’ అని బదులిచ్చింది.ఆసక్తిగా ‘నువ్వు ఏమని ప్రార్థన చేశావో నాకు చెప్పు!’ అన్నాడు.నాకు పొలం లేదు. నాకంటూ ఎవ్వరూ లేరు. ఇవి బాగా పండితే ఎవరో ఒకరు తింటారని ఈ గుట్ట మీద నిలబడి విత్తనాలు చల్లాను. అలా చల్లేటప్పుడు... ‘కాపలాదారుడు తినగా మిగిలింది, దొంగ తినగా మిగిలింది, చూసినవాడు తినగా మిగిలింది, పక్షులు తినగా మిగిలింది, నాకూ కొంత మిగిలితే సంతోషం స్వామీ’ అని దేవుణ్ణి ప్రార్థించాను’’ అని చెప్పింది.ఆమె సహృదయతకు జమీందారు చలించి పోయాడు. ‘మనం మంచిగా ఆలోచించి ఒక పని చేస్తే ప్రకృతి పదింతల సహాయం చేస్తుందని’ జమీందారుకు అర్థం అయింది. ఆమెకు హృదయపూర్వకంగా నమస్కరించి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
యక్షప్రశ్న లంటే..?
ఎవరైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతుంటుంటే యక్షప్రశ్నలు వేస్తున్నావు అనడం....పరిపాటి. అసలు యక్షప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని ఏ సందర్భంలో అడిగారో ఇపుడు తెలుసుకుందాం. అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలోని అరణ్యపర్వానికి సంబంధించినవే.. ఈ యక్ష ప్రశ్నలు. పాండవులు మాయాజూదంలో ఓడిన తర్వాత 14 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైత వనానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక పండితుడు తన ‘అరణి‘( నిప్పు పుట్టించే కర్ర ) ఒక మృగం తీసుకు పోయిందని, దానిని వెతికి ఇవ్వమని ధర్మరాజును అడుగుతాడు. ధర్మరాజు అంటే... పాండవుల్లో పెద్దవాడు, బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు.ధర్మరాజు ధర్మనిష్టకు పరీక్షయే ఈ యక్షప్రశ్నలు. ధర్మరాజు తన తమ్ముళ్లలో నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముని ఒకరి తరవాత మరొకరిని అరణి తీసుకుని రావలసిందిగా కోరడంతో వారు అరణ్యంలోకి వెళ్లడం ఎంతకూ తిరిగి రాక పోవడంతో చివరకు ధర్మరాజే.. బయలుదేరి వెళ్ళాడు. అయితే తన సోదరులు విగతజీవుల్లా ఒక సరస్సు వద్ద పడి ఉండడాన్ని ధర్మరాజు గమనించాడు. ఈ నేపథ్యంలో తనకు దాహంగా ఉండడంతో సరస్సులో నీరు తాగేందుకు దిగుతుండగా ఒక యక్షుని అదృశ్యవాణి వినిపించింది. ఓ.. ధర్మరాజా! నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీకు తాగేందుకు మంచి నీరు లభిస్తుందని, లేకుంటే నీ సోదరులకు పట్టిన గతే నీకూ పడుతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. అందుకు ధర్మరాజు సరే అనడంతో ఆ యక్షుడు 72 ప్రశ్నలను అడుగుతాడు. వాటన్నిటికీ ధర్మరాజు సక్రమంగా సమాధానాలను చెప్పడంతో ఆ యక్షుడు సంతృప్తి చెంది, మీ సోదరులలో ఒకరిని మాత్రమే బతికిస్తానని ఎవరు కావాలో కోరుకోమంటాడు. అందుకు ధర్మరాజు తన పినతల్లి కుమారులైన నకుల, సహదేవులలో ఒకరిని బతికించమని కోరడంతో ఆ యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు సంతోషించి, అందరికీ ప్రాణదానం చేస్తాడు. ధర్మాచరణ విశిష్టతను తెలిపిన ప్రశ్నలనే యక్షప్రశ్నలు అంటారు.– సి.ఎన్. మూర్తి, పాత్రికేయులు -
మౌనం..అంతరంగ అన్వేషణకు మార్గం
భారతీయ జీవన దర్శనం మౌనాన్ని ఒక మహోన్నత తపస్సుగా, ముని వృత్తిగా అభివర్ణించింది. ‘మౌనం సర్వార్థ సాధకమ్‘ – అనగా మౌనం ద్వారా సమస్త కార్యాలను సాధించవచ్చు. మౌనం అంటే కేవలం పెదవులు మూసి ఉంచడం కాదు; అనవసర ఆలోచనలను నియంత్రించి మనసును నిశ్శబ్దంగా మార్చడం.నేటి ఆధునిక కాలంలో మనిషి నిరంతరం బాహ్య ప్రపంచపు శబ్దాల మధ్య, సామాజిక మాధ్యమాల అలజడిలో జీవిస్తున్నాడు. ఈ గందరగోళం వల్ల తనతో తాను మాట్లాడుకునే అమూల్య సమయాన్ని కోల్పోతున్నాడు. మౌనం మనలో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను, వివేకాన్ని మేల్కొల్పుతుంది. మాటల ద్వారా వ్యయమయ్యే శక్తిని ఆదా చేసి, ఆ శక్తిని అంతరంగ వికాసానికి ఉపయోగించేలా చేస్తుంది.వైదిక ఆధ్యాత్మిక చరిత్రలో మౌనానికి రమణ మహర్షి ఒక మహోన్నత నిదర్శనం. ఆయన కేవలం తన మౌనం ద్వారానే భక్తుల సంశయాలను నివృత్తి చేసేవారు. మాటలు వివరించలేని గూఢ సత్యాలను మౌనం సులువుగా వివరిస్తుంది. అలాగే, దక్షిణామూర్తి స్వరూపంలో పరమశివుడు మౌన ముద్ర ద్వారానే శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అశాంతిగా ఉన్న మనసు ఎప్పుడూ వాదిస్తుంది; ప్రశాంతమైన చిత్తం మౌనంలో లీనమవుతుంది. మౌనం మనల్ని అహంకారం నుండి విముక్తులను చేసి, పరమాత్మతో అనుసంధానం చేస్తుంది. లోతైన నిశ్శబ్దంలోనే దైవ వాక్కు వినిపిస్తుంది. నిశ్చలత్వమే నిత్య సత్యమని గ్రహించినప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు.నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనం మాట్లాడే మాటల్లో చాలా వరకు అనవసరమైనవి, ఇతరులను నొప్పించేవి ఉంటాయి. మౌనాన్ని అలవర్చుకోవడం వల్ల వాక్ దోషాలు నశిస్తాయి. ఒక వివాదం తలెత్తినప్పుడు ఎదురు దాడి చేసే కంటే, కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఆవేశం తగ్గి విచక్షణ పెరుగుతుంది. ప్రతిరోజూ కనీసం కొద్దిసేపైనా ఏకాంతంగా మౌనం పాటించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఇది మన నరాల వ్యవస్థకు విశ్రాంతినిచ్చి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. మనం ఎంత తక్కువగా మాట్లాడితే మన మాటలకు అంతటి గౌరవం పెరుగుతుంది. మౌనం బలహీనత కాదు; అది ఒక ఉన్నతమైన మానసిక పరిపక్వత.ఆర్ష సంస్కృతి అందించిన ఈ మౌన మార్గం వ్యక్తిని ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దుతుంది. మాటలు వెండి అయితే మౌనం బంగారం అన్న నానుడి అక్షర సత్యం. మన అంతరంగంలో మౌనం అనే జ్యోతి వెలుగుతున్నప్పుడు, బాహ్య ప్రపంచంలోని కల్లోలాలు మనల్ని స్పృశించలేవు. మాటలకందని ఆనందాన్ని అనుభవించాలంటే మౌనమే ఏకైక శరణ్యం. అశాంతిని వీడి, మౌనాన్ని ఆలింగనం చేసుకుని ఆత్మాన్వేషణ సాగిద్దాం. మౌనమే శక్తి, మౌనమే శాంతి. సర్వం నిశ్శబ్దమయం!బాహ్య ప్రపంచంలో మనం ఎంత ఎదిగినా, అంతరంగంలో మౌనాన్ని ఆశ్రయించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. మౌనంలో మన బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి; వాటిని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. ఇది మనల్ని అంధకారం నుండి వెలుగు వైపు, అశాంతి నుండి ప్రశాంతత వైపు నడిపించే దివ్య మార్గం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
రాముడికి జాబాలి ఉద్బోధ
పితృవాక్య పరిపాలన కోసం రాముడు అడవులకు బయలుదేరాడు. భర్త తోడిదే లోకం అనుకుని సీత, అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరించారు. రాముడు అడవులకు వెళ్లిపోయాడనే దుఃఖంతో దశరథుడు కన్నుమూశాడు. భరతుడు దశరథుడికి అంత్యక్రియలు చేశాడు. రాముడిని తిరిగి అయోధ్యకు తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో సపరివారంగా రాముడి వద్దకు వెళ్లాడు. అయోధ్యకు తిరిగి రావాలని, రాజ్యాన్ని చేపట్టాలని పలురకాలుగా బతిమాలుకున్నాడు. భరతుడి కోరికను రాముడు అంగీకరించలేదు. ‘తమ్ముడా! దుఃఖించకు. అయోధ్యకు వెళ్లి పరిపాలన సాగించు. మన తండ్రి ఆదేశాన్ని పాటించు. వనవాసం చేయడం ద్వారా నేను ఆయన మాటను నెరవేరుస్తాను. మహారాజైన మన తండ్రికి ఇచ్చిన మాటను ఉల్లంఘించరాదు. నువ్వు కూడా ఆయన ఆజ్ఞను పాలించు. పరలోకంలో సుఖాలను కోరే మానవుడు క్రూరత్వం లేకుండా గురు శుశ్రూష చేయాలి. తండ్రి మాటను పాటించాలి’ అని పలికాడు. భరతుడికి రాముడు ఇలా నచ్చజెప్పి, అయోధ్యకు తిరిగి వెళ్లి పరిపాలించమని ఆదేశించాడు. అంతలోనే రాముడి మాటలు విన్న జాబాలి కలగజేసుకున్నాడు.‘రామా! బాగు బాగు! ఉత్తమ బుద్ధిమంతుడవు, ఆత్మాభిమానవంతుడవు అయిన నీకు, సామాన్య మూఢుని వంటి నిష్ప్రయోజనమైన ఆలోచనలు రాకూడదు. లోకంలో ఎవడైనా ఒక్కడే పుడుతున్నాడు. ఒక్కడే మరణిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవడికి ఎవడు బంధువు? ఎవడి నుంచి ఎవడు పొందగలిగేది ఏమిటి? తల్లి అని, తండ్రి అని అనుకుంటూ వారిపై అధికానురాగం పెంచుకునేవాడు ఉన్మత్తుడితో సమానుడు. ఎవరికి ఎవరు ఏమవుతారు? గ్రామాంతరానికి వెళ్లినవాడు ఒకచోట బస చేసి, మర్నాడు ఆ బసను విడిచిపెట్టి ప్రయాణం కొనసాగిస్తాడు. మనుషులకు తల్లి, తండ్రి, ఇల్లు, ధనం అనేవి కూడా తాత్కాలిక బసలాంటివి మాత్రమే! సజ్జనులకు వాటిపై వ్యామోహం ఉండరాదు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యాన్ని విడిచి, అనేక ప్రమాదాలకు నెలవైన, దుఃఖాలకు దారితీసే ఈ అడవి మార్గాన్ని అవలంబించడం నీకు తగదు. అందువల్ల సర్వసమృద్ధమైన అయోధ్య నగరానికి తిరిగి చేరుకుని, పట్టాభిషేకం చేసుకుని, రాజ్యపాలన స్వీకరించు. పరదేశానికేగిన భర్త రాక కోసం ఎదురుచూసే పతివ్రతలా అయోధ్య నగరం నీకోసం ఎదురు చూస్తోంది. నువ్వు రాజభోగాలను అనుభవిస్తూ, దేవేంద్రుడు స్వర్గంలో విహరించేలా అయోధ్యలో విహరించు. నీకు దశరథుడు ఏమీ కాడు. నువ్వు దశరథుడికి ఏమీ కావు. ఆ రాజెవరో, నువ్వెవరో! అందువల్ల నా మాట విని, నేను చెప్పినట్లు చేయి. ఆ దశరథ మహారాజు తాను ఎక్కడికి వెళ్లాలో, అక్కడకు వెళ్లిపోయాడు. నువ్వు మాత్రం అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటున్నావు. కేవలం అర్థం కోసం, ధర్మం కోసం పాటుపడే వారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది. అర్థధర్మపరులు బతికినంత కాలం కష్టాలను అనుభవిస్తూ, మరణానంతరం కూడా నాశనం చెందుతారు. పరం అనేది ఏదీ లేదని నిశ్చయించుకుని, ప్రత్యక్షమైన దానినే ఆచరించు. పరోక్షమైన దానిని లెక్కచేయకు. పాపం, నీ సోదరుడు భరతుడు కూడా నిన్ను బతిమాలుకుంటున్నాడు. నా మాటలు ఆలకించి, రాజ్యాన్ని స్వీకరించు’ అని పలికాడు.‘నీ మాటలు పైకి హితవచనాల్లా కనబడినా, నిజానికి అవి అహితమైనవి. పాపాచారవంతుడై, సద్బుద్ధికి దూరమై, మంచికి విరుద్ధంగా సంచరించే మానవుడు ఎవడైనా, అతడు సత్పురుషుల గౌరవం పొందలేడు. అధర్మాన్ని ధర్మవేషంతో ఆచరిస్తూ, దుష్టమార్గాన్ని అనుసరిస్తే, లోకంలో ఎవడైనా గౌరవిస్తాడా? నేను ప్రతిజ్ఞను విడిచి, రాజ్యాన్ని చేపడితే ఎవరికి హితవును ఉపదేశించగలను? అప్పుడు నా మాట వినేవారు ఎవరైనా ఉంటారా? నేనే మార్గం తప్పితే, జనాలు స్వైరసంచారులు అయిపోరా? అతి పురాతనం, శాశ్వతం అయిన రాజధర్మం సత్యస్వరూపమైనది. ఇందులో క్రూరత్వానికి తావులేదు. రాజ్యం సత్యప్రధానం. దేవతలు, ఋషులు కూడా సత్యమే పరమధర్మమని అంగీకరించారు. సత్యమే స్వర్గానికి మూలకారణమని అంటారు. నేను సత్యప్రతిజ్ఞ కలవాడిని. తండ్రి ఎదుట నేను చేసిన శపథం సత్యమైనప్పుడు, ఆ ప్రతిజ్ఞను ఎలా వదిలేయగలను? నువ్వు నాస్తికుడివి. ధర్మచ్యుతుడివి. నీలాంటి వాణ్ణి చేరదీసినందుకు మా తండ్రిని నిందించాలి’ అని రాముడు కోపావేశంతో బదులిచ్చాడు.రాముడి కోపాన్ని గమనించిన వసిష్ఠుడు, ‘రామా! మరణానంతరం మనుషులు కర్మానుసారం స్వర్గ నరకాలకు పోతారని, తిరిగి జన్మిస్తారని జాబాలికి కూడా తెలుసు. నిన్ను తిరిగి అయోధ్యకు రప్పించి, పట్టాభిషిక్తుడిని చేయాలనే ఉద్దేశంతో అలా అన్నాడు’ అని నచ్చజెప్పి, ‘ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజ్యాధికారం స్వీకరించడం తర తరాల ఆచారం. జ్యేష్ఠుడు ఉండగా, కనిష్ఠుడు రాజు కాడు. కాబట్టి, ఇక్ష్వాకు వంశాచారాన్ని మంటగలపకు. అయోధ్యకు బయలుదేరి, రాజ్యాన్ని స్వీకరించు’ అని చెప్పాడు.రాజగురువు అయిన వసిష్ఠుడు స్వయంగా నచ్చజెప్పినా, రాముడు తన ప్రతిజ్ఞను పక్కనపెట్టి, రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. ఇక చేసేదేమీ భరతుడు పరివారంతో కలసి అయోధ్యకు మరలక తప్పని పరిస్థితి ఏర్పడింది.సీతమ్మవారి కోవెలశ్రీలంకలో సీతమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. వనవాసంలో ఉండగా సీతను అపహరించిన రావణుడు ఆమెను ఇదేచోట అశోకవనంలో బంధించినట్లు స్థలపురాణ కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన అశోకవృక్షం కూడా ఉంది. ఆ చెట్టు కిందనే సీతమ్మవారు కూర్చుని ఉండేదని చెబుతారు. ‘సీతా అమ్మన్ కోవిల్’ అనే ఈ ఆలయం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్లోని నువారా జిల్లా కేంద్రానికి చేరువలో ఉంది.→ సాంఖ్యాయన -
ఖురాన్ ప్రస్తావన: ఆరోగ్యానికి ఆలంబన
ఖురాన్లో పలు సందర్భాల్లో మొక్కల ప్రస్తావన వస్తుంది. ఆయా మొక్కల నుంచి లభించే ఫలాలు, పత్రాలు, పుష్పాలు మానవాళికి ఎలా ఉపయోగపడుతాయో దైవగ్రంథం, హదీసులు వివరించాయి. అలాంటి వాటిలో ఆలివ్, ఖర్జూర, ద్రాక్ష, దానిమ్మ, అరటి, నల్ల జీలకర్ర, గుమ్మడి వంటివి ముఖ్యమైనవి.ఆలివ్ : దీని శాస్త్రీయనామం– ఓలియా యురోపియా. ఇది ఓలియేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్ లో జైతున్ అని పిలుస్తారు. ఈ మొక్క గురించి ఖురాన్లో ఆరు చోట్ల ప్రస్తావించారు. ఆలివ్ నూనెలో, ఆలివ్ పండ్లలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి.ఖర్జూరం : దీని శాస్త్రీయనామం– ఫోనిక్స్ డెక్టైలిఫెరా. ఇది అరికేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో నఖ్ల్ అని పిలుస్తారు. ఖర్జూరం లో ఉండే ΄పొటాషియం రక్తపోటును నియంత్రించడంలోనూ, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధక నివారణకు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికీ తోడ్పడుతుంది.దానిమ్మ : దీని శాస్త్రీయనామం– ప్యూనిక గ్రానేటం. ఇది ప్యూనికేసి కుటుంబానికి చెందినది. అరబిక్లో రూమ్మన్ అని పిలుస్తారు. దానిమ్మలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధా΄్యాన్ని, చర్మంపై ఏర్పడే ముడతలనూ దూరం చేస్తాయి. అల్జీమర్స్, చర్మక్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఆస్టియో ఆర్థ్రయిటిస్తో బాధపడేవారికిది అద్భుత ఔషధం.అంజూర : దీని శాస్త్రీయనామం– ఫైకస్ కెరిక. ఇది మొరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో తీన్ అని పిలుస్తారు. దీని పండ్లను, వేర్లను, ఆకులను సాంప్రదాయ వైద్యంలో జీర్ణకోశ, శ్వాసకోశ, హృదయ సంబంధ రుగ్మతలు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.తులసి : దీని శాస్త్రీయ నామం– ఆసిమం టెన్యూ ఫ్లోరమ్. దీనిని అరబిక్లో రైహాన్ అంటారు. ఇది లామియేసి కుటుంబానికి చెందినది. తులసి ఆకులు నాడులకు టానిక్లా పని చేసి, జ్ఞాపకశక్తిని పెం΄పొందిస్తాయి. తులసి కషాయంతో గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసితో మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. తులసి కొలెస్ట్రాల్ను తగ్గించడంతోపాటు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.ద్రాక్ష : దీని శాస్త్రీయనామం – వైటిస్ వెనిఫెరా. ఇది వైటేసి కుటుంబానికి చెందినది. దీనిని అరబిక్లో ఇనబ్ అంటారు. ద్రాక్షగింజల రసం గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, చర్మక్యాన్సర్ను నివారించడంలో, ఇన్ ఫెక్షన్ తో పోరాడడంలో సహాయ పడుతుంది.ఉల్లి : దీని శాస్త్రీయనామం – ఆలియమ్ సెపా. ఇది లిలియేసి కుటుంబానికి చెందినది. ఉల్లిపాయల్లో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు, విటమిన్ ఎ, బి6 , సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిని వాడితే శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకున్నట్లే. మధుమేహం ఉన్నవారికి అది నియంత్రణలోకి వచ్చి.. ఎముకలు గట్టిపడతాయి.ఆవాలు : దీని శాస్త్రీయనామం– బ్రాసిక నైగ్ర. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందింది. వీటిని అరబిక్లో ఖర్దల్ అంటారు. ఆవాలనుంచి తయారు చేసిన ఆవనూనెని కొన్ని సంప్రదాయ చికిత్సలలో ఉపయోగిస్తారు. ఆవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.మిస్వాక్ : దీని శాస్త్రీయనామం– సాల్వో డోరా పెర్సికా. ఇది సాల్వో డేరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో అల్ అరక్ అని పిలుస్తారు. దీని పుల్లలతో దంత ధావనం చేసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడి నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. వీటివేర్లను ఊపిరితిత్తుల సమస్యలకు, ఆకులను దగ్గు, ఉబ్బసం, స్కర్వి వ్యాధి నివారణకూ వాడతారు. బెరడును వెన్నుపోటు, తలపోటు, కడుపునొప్పి నివారణలో ఉపయోగిస్తారు.అరటి : దీని శాస్త్రీయ నామం– మ్యూసా పారడైసియాక. ఇది మ్యూసేసి కుటుంబానికి చెందినది. అరటిని అరబిక్లో తల్హ్ అంటారు. అరటిలో ΄పొటాషియం అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు హైబీపీ, షుగర్, ఆస్తమా, క్యాన్సర్, అజీర్తి వంటి సమస్యలను నిరోధిస్తాయి. అరటి పండ్లలోని కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియకు ఉపకరిస్తాయి. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు, ఫ్యాటీ యాసిడ్స్ను ఉత్పత్తి చేసేందుకు ఇది తోడ్పడుతుంది.నల్ల జీలకర్ర : దీని శాస్త్రీయనామం – నైగెల్ల సటివ. దీనిని అరబిక్ లో హబ్బతుస్ సౌదా అంటారు. ఇది రానన్కులేసి కుటుంబానికి చెందినది. నల్ల జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ను అదుపులో వుంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.డాక్టర్ ఎల్. నాగిరెడ్డి సహాయ ఆచార్యులుశ్రీ కృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, అనంతపురంచాంద్ బాషా, ఉపాధ్యాయులు, తాడిపత్రి -
మానవ హితమే ‘ఈద్’ అభిమతం
రమజాన్ నెల ముగిసిన తర్వాత ముస్లిం సమాజం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం ఈదుల్ ఫిత్ర్. ఏకధాటిగా నెలరోజులపాటు సాగిన ఆధ్యాత్మిక సాధన స్పూర్తితో, మానవీయ విలువలకు నూతన ఆరంభం. ఉపవాసం ద్వారా శరీరాన్ని మాత్రమే కాదు, తన ఆలోచనలను, ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకున్న మనిషి ఆ అనుభూతిని సమాజంతో పంచుకునే రోజు ఈద్. అందుకే ఈ పండుగలో కనిపించే ఆనందం కేవలం ఉత్సవపు ఉల్లాసం కాదు; అది ఆధ్యాత్మికత, దానం, సహోదరత్వం, సామాజిక బాధ్యతల సమ్మేళనం. అందుకే ఈ నెలను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించడం, రాత్రిళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ఖుర్ ఆన్ పఠనం, దానం వంటి ఆచారాలు విశ్వాసుల జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియలా మారుతాయి. ఉపవాసం ద్వారా ఆకలి, దాహం అనుభూతిని స్వచ్ఛందంగా స్వీకరించడం ద్వారా మనిషి తన కోరికలను నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు. అదే సమయంలో పేదసాదల కష్టాలను అర్థం చేసుకునే సానుభూతి కూడా అతనిలో పెరుగుతుంది.ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి జకాతుల్ ఫిత్ర్ లేదా ఫిత్రా. ప్రతి ముస్లిం కుటుంబం తమ శక్తికి తగ్గట్టు పేదలకు దానం చేయడం సంప్రదాయం. దీని వెనుక ఉన్న భావం ఎంతో గొప్పది. సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవీయ బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. పండుగ ఆనందం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలనే భావన ఇస్లాం లోని సామాజిక న్యాయ భావనను ప్రతిబింబిస్తుంది.ఈద్ రోజూ ఉదయం మసీదులు, ఈద్ గాహ్లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు సమాజంలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. వేలాదిమంది ఒకేస్థలంలో చేరి, ధనిక, పేద, పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ప్రార్థన చేయడం సమానత్వానికి ప్రతీక. ప్రార్థన అనంతరం ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అని శుభాకాంక్షలు తెలుపుకోవడం పరస్పర ప్రేమను, క్షమాభావాన్ని వ్యక్తపరుస్తుంది.ఈదుల్ ఫిత్ర్ తాత్వికంగా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రమజాన్ నెలలో మనిషి తనలోని స్వార్థాన్ని తగ్గించి దయ, సహనం, నియంత్రణ వంటి విలువలను పెం΄పొందించుకుంటాడు. ఈ విలువలు కేవలం ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాంతం కొనసాగాలని ఈద్ మనకు గుర్తు చేస్తుంది. నిజమైన ఈద్ అంటే కేవలం ఒక రోజు సంబరం కాదు; రమజాన్ ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక మార్పును జీవితంలో నిలబెట్టుకోవడం.సామాజికంగా కూడా ఈ పండుగ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. చాలా సందర్భాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అపార్థాలు, విభేదాలు కూడా ఈ సందర్భంలో పరిష్కారమవుతాయి. పరస్పరం క్షమించుకోవడం, మళ్లీ దగ్గరవడం ఈ పండుగకు ప్రత్యేకమైన లక్షణం.నిజమైన ఈద్ కొత్త బట్టలు ధరించడంలో కాదు; కొత్త మనసుతో జీవించడంలో ఉంది. ద్వేషం స్థానంలో ప్రేమను, స్వార్థం స్థానంలో దానాన్ని, విభేదాల స్థానంలో ఐక్యతను పెం΄పొందించడమే ఈదుల్ ఫిత్ర్ అసలు ఆత్మ. ఈ ఆత్మను మన జీవితంలో నిలబెట్టగలిగితేనే ఈ పండుగ ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక సందేశం సార్థకమవుతుంది. దైవం మనందరికీ ఈ పర్వదినం స్ఫూర్తిని అందిపుచ్చుకొనే అవకాశం అనుగ్రహించాలని కోరుకుందాం.రమజాన్ నెల మనిషికి ఒక ఆత్మపరిశీలన సమయం. తన జీవితంలోకి ఒకసారి తొంగిచూసుకుని, తన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే కాలం. ఈద్ ఆ ప్రయాణానికి ఒక ఆనందకర ముగింపు. అదే సమయంలో ఒక కొత్త సంకల్పానికి ఆరంభం కూడా. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే చెందిన పండుగ కాదు; అది మానవత్వానికి సంబంధించిన పండుగ. ఉపవాసం ద్వారా నేర్చుకున్న నియంత్రణ, దానం ద్వారా పెరిగిన దయాగుణం, ప్రార్థన ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక బలం – ఇవన్నీ కలిసి సమాజంలో ప్రేమ, న్యాయం, సామరస్యం స్థాపించడానికి మార్గం చూపుతాయి. అందుకే ఈ పండుగ మనకిచ్చే అసలు సందేశం ఎంతో సరళం, కానీ చాలా గొప్పది.– మదీహా అర్జుమంద్ -
షడ్రుచుల సంగమం..!
తెలుగు సంవత్సరాది వెలుగులు విరజిమ్మింది. ఆహ్లాదభరిత వేదికపై ఆత్మీయ ఆహ్వానం అందుకుంది. మూసాపేట రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ ఫేజ్–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ‘ఉగాది’ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అధునాతన నగరంలో అచ్చమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా సంప్రదాయ దుస్తులతో రెయిన్బో వాసులు పాల్గొనడం, షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించడం కనువిందు చేసింది. లలితా, విష్ణు సహస్ర నామ పారాయణలతో మొదలైన ఈ వేడుకలు జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పచ్చడి ప్రసాదం, బొబ్బట్లు, పులిహోరాల పంపిణీతో పూర్తయ్యాయి. లలితా విష్ణు సహస్ర నామ పారాయణంతో పాటు భక్తి గీతాలాపనతో ఉగాది వేడుక ప్రారభమైంది. సుమారు 450 మంది లలితా విష్ణు సహస్ర నామ పారాయణం చేయడంతో పాటు, శ్లోకాలను ఆలపించి ఆధ్యాత్మిక పరిమళాలు అందించారు. గ్రూపు కో–ఆర్డినేటర్ వాణి ఆధ్వర్యంలో సహస్ర నామ పారాయణం జరిగింది. తెలుగులో ఆడిపాడిన చిన్నారులు.. ఆధునిక, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు తెలుగు రుచిని చూపిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన తెలుగులో ‘లేవండిరా ముందుగా ఈ రోజే ఉగాది పండుగ’ అంటూ ఆలపించిన పాట అహూతులను అలరించింది. రామలక్ష్మి ఆమె విద్యార్థుల బృందం ఆలపించిన పాట అతిథులను ఆకట్టుకుంది. పాటలోనే ఉగాది విశిష్టత తెలిపే విధంగా చక్కగా ఉందని అతిథులు ప్రశంసించారు.పరాభవం నుంచి ప్రాభవంలోకి.. ముఖ్య అతిథి, శృంగేరి శారదా పీఠం ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ధర్మమార్గంలో నడిచే వారికి ప్రాభవం అని, అధర్మంలో నడిచే వారికి పరాభవమని, పరాభవం నుంచి ప్రాభవంలోకి రావటమే పరాభవ నామ సంవత్సరమని వివరించారు. మనల్ని అనుగ్రహించి ఆధ్యాతి్మకతకు, సత్య మార్గాన్ని చూపించే సంవత్సరమే పరాభవ నామ సంవత్సరమన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రీల్స్ వదిలిపెట్టి రియాలిటీలోకి రావాలని తెలిపేదే పరాభవం అని అన్నారు. ఈ సంవత్సరం శుభాలు ఎక్కువగా జరుగుతాయని, మిగిలిన ప్రపంచంలో యుద్ధ భయం ఉంటుంది కానీ, భారత దేశానికి ఉండదన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, పశు, వృక్ష సంపద పెరుగుతుందని వివరించారు. పాలకుల్లో చికాకులు పెరుగుతాయి, వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్త పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. అప్పులు చేసి భూములు కొనుగోలు చేయవద్దని, బంగారం, వెండి, రత్నాలు కొనుగోలు చేసే బదులు, కరెన్సీ నోట్లు ఇంట్లో ఉంటేనే మంచిదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి పరాభవం ఉండబోదన్నారు. ఈ సీజన్లో 50 డిగ్రీలకుపైగా వేడి పెరుగుతుందని, అగ్ని ప్రమాదాలు, రోగాలు, కల్తీ ఎక్కువగా జరుగుతాయన్నారు. ఈ సంవత్సరంలో అధిక జ్యేష్ట మాసంతో కలిపి మొత్తం 13 నెలలు ఉంటాయన్నారు. పంచాంగం అంటే విజ్ఞాన భాండాగారం, కొందరు చేసిన తప్పులకు జ్యోతిష్కులను నిందించవచ్చు కానీ, శా్రస్తాన్ని అపహాస్యం చేయవద్దని సూచించారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం సాహితీవేత్త ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి నాగరాజు సంవత్సర పురుషోపాసన అనే అంశంపై ప్రసంగించారు. ప్రకృతిలో వచ్చే మార్పు, ప్రకృతితో కలిసి జరుపుకునేదే ఉగాది అని పేర్కొన్నారు. కాలచక్రాన్ని అనుసరించాలని సూచించారు. ఉగాది పండుగ, సంవత్సర పురుషోపాసన గురించి క్లుప్తంగా వివరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రెయిన్ బో విస్టాస్ రాక్గార్డెన్ అధ్యక్షులు టీఎస్ రెడ్డి, ఉపాధ్యక్షులు కృపాకర్రెడ్డి, తదితర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.అమోఘం.. రుచుల మిశ్రమం..ఈ వేడుకల్లో షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని కుండలలో తయారు చేశారు. అపార్ట్ మెంట్ వాసులు వాణి, జ్యోతి, నిర్మల, అపర్ణ, మాళవిక ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. దీంతో పాటు బొబ్బట్లు, పులిహోర ప్రసాదంగా అందజేశారు. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు ఉన్నట్లుగానే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నీ కలిస్తేనే పరిపూర్ణ జీవితం అవుతుందని ఉగాది పచ్చడి పరమార్థాన్ని మననం చేసుకున్నారు. పిజ్జాలు, బర్గర్ల మధ్య నివసించే నగరవాసులకు షడ్రుచుల పచ్చడి, బొబ్బట్లు సిసలైన రుచులను పంచాయి. (చదవండి: 'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగ జరుపుకుంటున్నామా?) -
'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగను..
భాషాపరంగా యుగాది సరైన పదం. ఉగాది అనే పదం వికృతిపదం. అయితే రెండూ ఒకే అర్థాన్ని బోధించే పదాలే. నిజానికి “యుగాది” అనే పదమే కాలాంతరంలో 'ఉగాది'గా మారింది. సోమకాసురుని నుండి వేదాలను విష్ణువు రక్షించిన రోజు ఉగాది. నూతన కల్పంలో జగత్తు సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజు. ఆరు రుచుల కలయికతో అనారోగ్యాలను అంతం చేసేది ఉగాది. హిందువుల పండుగల సంప్రదాయానికి మొదలు ఉగాది. వరాహమిహిరుడు ఈ ఉగాది నాడే పంచాంగాన్ని పరిచయం చేశాడని అంటారు. శ్రీరా ముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు మొదలైన వారు ఉగాదినాడే పట్టాభిషిక్తులైనారని ఆర్యులు చెబుతారు. సంవత్సరాది నాడు ప్రజలు తెల్లవారక ముందే నిద్ర లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవానికి పూజలు చేసి, షడ్రుచుల పచ్చడిని ఆరగించాలి. నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం చేయాలి.తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ,పంచాగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్.తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగ శ్రవణం వల్ల గంగా స్నానంతో సమానంగా పుణ్యం, పురు షార్థం లభిస్తుందని పై శ్లోకం చెబుతున్న భావం. కొత్త సంవత్సరంలో గ్రహ, రాశిఫలాల్లో, నామ నక్షత్రాల్లో తేడా వస్తే దోషనివారణ కోసం శాంతి హోమాలు, వ్రతాలు, పూజలు చేసి సుఖశాంతులతో ప్రజలు జీవించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. నవగ్రహాల్లో సూర్యుడు తేజస్సును, చంద్రుడు భోగభాగ్యాలను, కుజుడు శుభాలను, బుధుడు బుద్ధి వికాసాన్ని, గురుడు జ్ఞాన విత్తాన్ని, శుక్రుడు కార్యసిద్ధిని, శనీశ్వరుడు దుఖ వినాశాన్ని, రాహువు సంతోషకరమైన రాణింపును, కేతువు చెప్పుకోదగి నంత గొప్పదనాన్ని కలిగిస్తారని విద్వాంసులు చెబుతారు.ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కలిగించేది ఉగాది పచ్చడి. శాస్త్రవచనాల్లో దానికి నింబకుసుమ భక్షణం, అశోకకళికా ప్రాశనం అనే పేర్లు కూడా ఉన్నాయి. తీపి, ఉప్పు, చేదు, వగరు, పులుపు, కారం సమపాళ్లలో కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. తీపికి బెల్లం, ఉప్పునకు ఉప్పు, చేదుకు వేపపూత, వగరుకు మామిడి ముక్కలు, పులుపునకు చింత పండు, కారమునకు మిరియాలు ఉగాది పచ్చడిలో వాడు తారు. వీటికి తోడు తమతమ ఇష్టాలను బట్టి జీలకర్ర, అరటిపండ్లు, ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటివి కూడా కలిపి గొప్ప ఔషధంగా ఆరగిస్తారు. ఈ పచ్చడిని చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు ఒక పక్షం రోజులు సేవిస్తే వాత, పిత్త, కఫములకు చెందిన రోగాలన్నీ పటాపంచలవుతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్టేతరులు సైతం సంవత్సరాది ఉత్సవాలను జరుపుకుంటారు. తమిళులు, మళయాళీలు, మరాఠీలు, సిక్కులు ఈ పండుగను జరుపుకోవడం విశేషం.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
ప్రతి రుచీ ఆస్వాదిస్తూ...
ఈ కాలపు జనరేషన్కి ఉగాది గురించి ఏం తెలుసు? అనేవారున్నారు. ఈ డిజిటల్ యుగంలో బిజీగా ఉండే నవతరానికి తెలుగింటి సంప్రదాయం ఎంత పరిచయం? తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్టూడెంట్లు కొందరిని పలకరించింది సాక్షి ఫ్యామిలీ. వారి స్పందన ఇక్కడ ఉంది. చదివాక మీరంటారు మన పిల్లలు తెలుగుదనాన్ని కొనసాగిస్తున్నారనీ... తెలుగుదనానికి అద్దం పడుతున్నారనీ.... యుగం + ఆది, ఒక కొత్త యుగానికి ఆరంభం,బ్రహ్మదేవుని సృష్టికి ఆయువు పోసిన క్షణం,కాలం మొదటి అడుగు వేసిన సమయం.మామిడి తోరణాల అలికిడి,ప్రకృతితో మన అనుబంధానికి గుర్తు.పంచాంగ శ్రవణ జ్ఞాననాడి,భవిష్యత్తు అనే కాలాన్ని గౌరవించే గుర్తు.చిగురించిన కొమ్మలు, వికసించిన పువ్వుల సందడి,మళ్ళీ మొదలుపెట్టమని ఒక ఆశల పల్లకికి గుర్తు.కొత్త వస్తువుల హడావిడి,కొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి గుర్తు.బ్రహ్మదేవుని సృష్టిని మొదలుపెట్టిన శుభముహూర్తం,మన తెలుగు సంస్కృతికి ఒక మొదటి అధ్యాయం,ప్రతి గుండెలో వెలుగు నింపే ఆనందం, ఉగాది ఉదయం,ఇంటిని శుభ్రం చేయడం మాత్రమే కాదు,మన మనసులోని బాధల్ని శుభ్రం చేయడం.ఉగాది పచ్చడిలో ఉన్న రుచులు,తీపి, కారం, పులుపు, చేదు, ఉప్పు, వగరు,మన జీవితంలోని భావాలు,ప్రతి రుచిని అంగీకరించండి మీరు.ఉగాది అంటే మారుతున్న కాలం కాదు,మారుతున్న మనసు, జీవితం,కొత్త ఆశ, కొత్త ప్రయాణం,అది అనుసరించడం ముఖ్యం.అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.– చిక్కాల షర్మిలనవ సంజీవనిఉగాది అంటే ప్రపంచానికి తొలి ఉషస్సు.మానవజాతి మనుగడకు ్రపాణం పోసిన నవసంజీవని ఉత్సాహాల ఉషస్సులతో మదిలోని ఇంద్రనస్సులా ఊయలలూగే ఊసులతో ఆకాశ వీధిలో అందాల జాబిలిలా సంవత్సరంలో వచ్చే తొలి చంద్రరేఖ నా ఉగాదిఉగాది మన ధర్మం, అదే మనకు ధర్మపథం.వసంత నవరాత్రుల రాక ప్రకృతిని పూజించే సుషుమ్న కాంతి రేఖ నా ఉగాది.షడ్రుచుల సమ్మేళనం నా ఉగాది, భవ్య పదం నా ఉగాది పరాభవాలను పారద్రోలి విజయానుభవాలను కలుగజేసే నా ఉగాది. – దేవి సరస్వతికాలం చెప్పే సూచిక...ఉగాది అనేది కేవలం కొత్త సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితంలోని అనేక భావోద్వేగాలు, అనుభవాల మిశ్రమమని గుర్తు చేసే ఒక అందమైన సందేశం. ఉగాదికి ప్రత్యేకత ‘ఉగాది పచ్చడి‘. ఆరు రకాల రుచులతో తయారు చేసే ఔషధం. ప్రతి రుచి జీవితంలోని ఒక్కో భావాన్ని సూచిస్తుంది. తీపి ఆనందానికి, చేదు బాధకు, పులుపు ఆశ్చర్యాలకు, కారం కోపానికి, ఉప్పు భయానికి, వగరు సవాళ్లకు సూచికగా ఉంటుంది. ఉగాది మనకు జీవితం ఎప్పుడూ తీపిగా ఉండదని, కానీ ప్రతి అనుభవం మనలను మరింత బలంగా, జ్ఞానవంతులుగా మార్చుతుందని నేర్పుతుంది. ఇది గత సంవత్సరపు తప్పులు, బాధలు, ఆందోళనలను వెనక్కి వదిలేయాలని కూడా మనకు గుర్తు చేస్తుంది. మనమందరం కలిసి సంతోషంగా ఉండాలని, ఉగాదిని ఆనందంగా జరుపుకోవాలని, మంచి పనులు చేయాలని కాలం చెప్పే సూచిక. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని, మామిడి ఆకులతో అలంకరిస్తాం, కొత్త బట్టలు ధరించి, శాంతియుతమైన, విజయవంతమైన సంవత్సరానికి నాంది కావాలని ప్రార్థిస్తాం. ఈరోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు అని చాలా మందికి నమ్మకం. ఉగాది కేవలం క్యాలెండర్ మార్పు కాదు ఇది విశ్వం తన ప్రయాణాన్ని ప్రారంభించిన క్షణాన్ని సూచిస్తుంది. ఉగాదికి మరో ప్రత్యేక సంప్రదాయం ‘పంచాంగ శ్రవణం’. ఇందులో పండితులు సంవత్సర ఫలితాలను చదివి వినిపిస్తారు. ఇది కాలం చక్రంలా తిరుగుతుందని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు ఇది ఆత్మపరిశీలన, ఆశల పునర్జన్మకు సూచిక. – బొందుగుల వర్షిణి రెడ్డిప్రకృతికి దగ్గరగా! తెలుగు తనాన్ని మరింత అందంగా చూపే పండగ ఉగాది. పసుపు రాసిన గడపలు, మామిడితోరణాలు.. ప్రకృతే మన ఇంటికి వచ్చిందా అనిపించే పండగ ఉగాది. ఎంతటి మోడర్న్ వారైనా సంప్రదాయ దుస్తులతో అందంగా అలంకరించుకుంటారు. కొత్త కుండలో ఒక్కటిగా కలిపిన ఆరు రుచుల పచ్చడి కుటుంబంలో అందరినీ ఐక్యంగా ఉండమని చూపుతుంది. అంతేకాదు, ఆరు రుచులు కలిసిన ఏడవ రుచి కుటుంబ సభ్యుల మధ్య నిండిన ప్రేమను పరిచయం చేస్తుంది. వసంతకాలంలో కొత్త చిగుళ్లు తిని కూసే కోకిలల గొంతులు ప్రకృతికి దగ్గరగా ఉండమని చెబుతాయి. సంతోషంగా మన జీవితాలు సాగాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, అది ప్రకృతి ద్వారా మనకు లభిస్తుందని వేప, మామిడి, చెరకు,.. వివిధ రకాల చెట్ల గొప్పతనాన్ని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్నీ మనకు తెలియజేస్తుంది. నిరుత్సాహంగా అనిపించే రోజుల్లోకి కొత్త ఆశల చిగుళ్లను మోసుకువచ్చేది ఉగాది. – లాస్య దేశ్ముఖ్గెలుపే కాదు చేదు కూడా! ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయి. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఈ ఆరు రుచులు మన జీవితంలోని ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, భయం, సవాళ్లను సూచిస్తాయి. ఈ పచ్చడి మనకు జీవితంలో అన్ని రకాల అనుభవాలు ఉంటాయని తెలియజేస్తుంది. ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసుకొని, నూనె, నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, దేవుడిని పూజిస్తాం. ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని. ఈ ఉగాది కొత్త ఆశలకు, ఆనందానికి, జీవితంలో కొత్త ప్రారంభాలకు నాందిగా నిలవాలని, బాగా చదువుకోవాలని, ఉన్నతంగా జీవించాలనే ఆశతో ఉండాలి. ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఉగాది పచ్చడిని గుర్తుతెచ్చుకొని, తిరిగి ఆశను నింపుకోవచ్చు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ అన్ని విధాల గెలుపునే కాదు చేదు అనుభవాలను కూడా ఇస్తుంటుంది. అన్నింటినీ సమానంగా తీసుకుంటూ, ఉత్సాహంగా జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. విద్యారంగంలో మనమంతా నూతనోత్సాహంతో, సరికొత్త ఆలోచనలతో మరింత సృజనాత్మకతతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. – మద్ది తనిష్కారెడ్డిఅన్నీ సమానంగా...తెలుగు ఇంటికి ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన ఆరంభం. ఆశ, కృతజ్ఞత, విశ్వాసంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ప్రత్యేకమైన క్షణం. మా ఇంట్లో ఉగాది చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధంతో నిండిన అనుభూతి. పండగ రోజున మేమంతా అత్యంత ఇష్టమైన సంప్రదాయ దుస్తులను ధరిస్తాం. ఆడవాళ్లు పట్టు చీరలు, సంప్రదాయ ఆభరణాలతో ముస్తాబవుతారు. ఇంటిని పూలతో, మామిడి ఆకులతో అందంగా అలంకరిస్తాం. పూజ గదిని శుభ్రం చేసుకుంటాం. ఉగాది పచ్చడి తయారుచేస్తాం. ఈ పచ్చడి తయారీలో ఇంటిల్లిపాది పాల్గొంటాం. వేప ఆకులు, బెల్లం, చింతపండు రసం, మామిడి ముక్కలు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తాం. ఇందులోని ప్రతి రుచి జీవితంలోని విభిన్న భావాలను సూచిస్తుంది. సంతోషం, బాధ, ఆశ్చర్యం, కోపం, సమతుల్యత, మనం వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అందమైన సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది. తర్వాత పంతులుగారు చెప్పే పంచాంగం వింటాం, ఆయన మాటలు వచ్చే సంవత్సరానికి దారి చూపుతూ, శుభాశయాలను కలిగిస్తాయి. తర్వాత మా పండుగలో ముఖ్యమైన భాగంగా అందరం కలిసి వంట చేయడం. మామిడి పప్పు, మామిడికాయ పచ్చడి, పూరీ కుర్మా, రసం, మామిడికాయ పులిహోర, బొబ్బట్లు వంటి వంటకాలు తయారు చేస్తాం. మేం మా ఇంట్లో ప్రతి యేటా దాదాపు ముప్పై మంది కలిసి పండుగను జరుపుకుంటాం. – రచిత లింగానిర్వహణ: నిర్మలారెడ్డి -
ఆరు రుచుల పండుగ
ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. ఈ రుచులు లేకపోతే స్వాదిష్టత లేదు. ఈ అనుభూతులు లేనిది జీవితం కాదు. అందుకే ఉగాది మనల్ని అన్ని రుచులతో అన్ని అనుభూతులతో అనుదినాన్ని సెలబ్రేట్ చేసుకోమని అంటున్నారు సాహితీవేత్త జి.వి. పూర్ణచందు‘రుచి’లో సంస్కృతి ఉంది. సౌందర్యం ఉంది. అనుభూతి ఉంది. ఆనందం ఉంది. ‘రుచించటం’ అంటే కమ్మగా మనసుకు అంగీకార యోగ్యంగా, ఙ్ఞానదాయకంగా ఉండటం అని! ఉగాదిని ఆరు రుచుల పండుగగా భావించటం వలన రుచులు మన శరీరంపై, మనసుపై, మస్తిష్కంపై కలిగించే ప్రభావాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం అవుతుంది. ఉగాది నాలుకకు, మనసుకు, మెదడుకు సంబంధించిన రుచుల సమ్మేళనంగా జరిగే పండుగ. తెలుగులో ‘ఉగము’ అంటే ఆయువు. ‘ఆద’ అంటే కష్టం. ‘ఆదట’ అంటే ప్రేమ, తృప్తి. కాబట్టి ‘ఉగాది’ సుఖదుఃఖాల్ని, నిర్మాణ విచ్ఛిన్నాల్ని, తీపి పులుపుల్ని సమన్వయం చేసుకుంటూ సాగిపోవాలని, జీవితాన్ని ప్రేమించి సంతృప్తి పొందాలని, ఉన్నతికి మెట్లు పరుచుకోవాలని మనకు సూచిస్తోంది. ఉగాది నుండి ఉగాది దాకా జరిగే పరిణామాల్ని, ఎదురయ్యే అవరోధాల్ని గోచార రీత్యా అంచనావేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు తెలుగువాడు!మనసు రుచులు రుచులు ఆరు... తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఒక్కో రుచికీ ఒక్కో ప్రభావం ఉంటుంది. ఈ ఆరు రుచులూ శరీరానికే కాదు మనసుకూ మెదడుకు కూడా పోషణ నిస్తాయి. ఆహారంలోని ఆరు రుచులే సత్త్వ రజస్తమో గుణాలను ప్రేరేపిస్తున్నాయని భగవద్గీత పేర్కొంది. ‘యథా అన్నం తథా మనః’ ఆహారం ద్వారానే ఆత్మాభివృద్ధి, మానసిక ఉన్నతి సిద్ధిస్తాయి. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని, మన మనస్తత్వాన్ని, జీవన ధోరణిని నిర్ణయిస్తుంది. భోజనం అనేది కడుపు నింపి పోషించటానికే కాదు, అది మానసిక పరిపక్వతకు కూడా కారణం అవుతోంది. నోటికైనా, మనసుకైనా, మెదడుకైనా రుచులు ఆరే! జీవితానికి ఆనందాన్ని, సంప్రదాయాన్ని, సామూహిక అనుభూతిని అందించేది ఆరు రుచులతో కూడిన ఆహారం. ఉగాది పండుగ ఈ ఆరు రుచుల ప్రాధాన్యతని నొక్కి చె΄్తోంది.త్రిగుణాత్మక రుచులుమనిషి మెదడులోని ఆలోచనలను తమోగుణం నియమిస్తే, రజోగుణం ప్రవర్తింపచేస్తే, సత్త్వగుణం నియంత్రిస్తుందని మన సిద్ధాంతం. మెదడు రుచులకు కూడా ఇలాంటి గుణాలే ఉంటాయి. ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. వీటిలో ఏ రుచిని వదిలి జీవించగలం...? నోటి రుచుల్ని, మనసు రుచుల్ని సమ్మేళనం చేసుకోగలిగితే శరీరమూ మనసు, ఇంద్రియాలతో పాటు ఆత్మ కూడా సంతృప్తి చెందుతుంది. ఉగాది పండుగ ఆరు రుచులకూ అంతటి ప్రాధాన్యత నిచ్చింది.నోటి రుచులుతీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు.... ఈ 6 రుచులు ఒకదానితో ఒకటి వివిధ నిష్పత్తుల్లో కలవటం ద్వారా 63 రుచులు అవుతాయి. ఈ 63 రుచుల మర్మాన్ని తెలుసుకుని, ఆహార పదార్ధాల్ని వండుకోగలిగితే ఆహారం ఆరోగ్యదాయకంగా పోషకంగా ఉంటుంది. భారత దేశం మొత్తంలో తమ ప్రధానమైన ఆహారాన్ని అన్నం అని నోరారా పిలిచేది ఒక్క తెలుగువారే! మనకు అన్నం అంటే ఆరు రుచులతో కూడిన పదార్థాలను ఆస్వాదిస్తూ తినటం అని! అలా మనల్ని ఆరు రుచులకి అంకితం చేసింది ఉగాది! ఈనాటికీ ఉగాది ప్రబోధం ఆరు రుచుల్ని విడవొద్దనే! ఉగాది పచ్చట్లో వేపపూతని కూడా చేర్చటం ద్వారా ఆహార ఔషధ ప్రాధాన్యతని ఉగాది గుర్తు చేస్తోంది! -
కొత్త తరం ఉగాది స్వరం
ఉగాదంటే వాకిట్లో పూల రుతువుచిగుర్లేసే తీవెల నుండి... విప్పారే పూవుల నుండి... కోయిలమ్మల గొంతుల నుండీ... చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి... కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి. ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసే రోజు. కోయిల గొంతులో సంబరం వంటి ఈ తెలుగువారి పండుగపై కవయిత్రి మానస చామర్తి ఏమంటున్నారో తెలుసుకుందాం...ఉగాది చాలా నెమ్మదైన పండుగనిపిస్తుంది నాకు. సంక్రాంతికి ఉన్నట్టు పెద్ద ఆర్భాటముండదు. దసరా దీపావళులకున్నట్టు సందడీ, సెలవులూ ఉండవు. పైపెచ్చు పిల్లల పరీక్షల కాలం. ఒక్కటంటే ఒక్కటే రోజుకు సెలవు. అయినా అది కాదు లెక్క. విరబూసే పూల ఋతువు వాకిట్లో కనపడుతున్నప్పుడు, గుప్పెడు గుప్పెడు ప్రాణాలు గొంతు విప్పి ఉదయాలను మేల్కొల్పుతున్నప్పుడు, క్యాలెండర్ కన్నా ముందు హృదయానికే తెలుస్తుంది, ఈ కాలమేదో ప్రత్యేకమని. ఏడాది మొత్తానికీ ఇది పండుగకాలమని. అందుకే గీతలో కృష్ణుడు కూడా, తాను ఋతువులలో వసంతాన్నని చెప్పుకున్నాడు (ఋతూనాం కుసుమాకరః). ఆ వసంత ఋతువు, చైత్ర మాసపు తొలిరోజునే మనం ఉగాదిగా పిలుస్తున్నాం. చిగుర్లేసే తీవెల నుండి, విప్పారే పూవుల నుండి, కోయిలమ్మల గొంతుల నుండీ చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి, కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి! ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసుకునే సందర్భం. రేగిపళ్ళు, పసిడితోరాలు, పానకం వడపప్పులు, పుస్తకాల మీద పసుపు ఓంకారాలు, బొమ్మల కొలువులు, గోంగూరకాడలు...ఒక్కో పండక్కీ జతపడే ఆనవాయితీ ఒకటుంది మనకి. ఉగాది అంటే అట్లా గుర్తొచ్చేవి మరీ ముఖ్యంగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.ఏడాది పొడుగునా అన్నీ దొరికే ఈ కాలంలో కూడా ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజునే దొరుకుతుంది. నచ్చి, ఇంకోసారి చెయ్యమని మారాం చేస్తే, ఇది ఈ ఒక్కరోజే తినాలని ఆ పసి్రపాణాన్ని బుజ్జగించిన అమ్మ గొంతు చెవుల్లో ఇంకా అట్లానే వినపడుతోంది. వేపకొమ్మల నుండి వేప పూవులను సాధించుకుని, తెల్లటి పల్చటి రేకులను మాత్రం జాగ్రత్తగా వొలిచి ఆ పచ్చడి గిన్నెలో కలపడం నా పని. చిన్నప్పుడంతా ఉగాది రోజు ఉదయాన్నే ఎవరో పుణ్యాత్ములు ఇంటింటికీ తిరిగి గుమ్మాల దగ్గర వేపకొమ్మలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇంటికొకరు చొప్పున చెట్లెక్కి వేపకొమ్మలు విరిచే శ్రమను తప్పించడమన్నమాట. కావాలా? అని అడగడం కూడా ఉండేది కాదు. వేప పూరేకులు వొలిచి, పొట్లాలు చుట్టి, రేటు కట్టి అమ్ముతున్న ఈ రోజుల్లో నిలబడి చూస్తే, నా చిన్నప్పటి ఊరికీ, ఆ వేపగాలికీ చాలా దూరం వచ్చేశాననిపిస్తోంది. రాజపూజ్యమూ– అవమానమూ, ఆదాయమూ వ్యయమూ, పుట్టి బుద్ధెరిగాక ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ఇవి జంటగా నాకు బాగున్న దాఖల్లాల్లేవు. అయినా పంచాంగ శ్రవణమంటే చెవులప్పజెప్పి కూర్చోవడమే తెలుసు. మానవ సహజమైన ఆశ ఒకటి, ఎవరేమి చెప్పినా అంతా మంచే జరగనుందని నమ్మబలికేది. ఆ అద్భుతాల కోసం ఏడాది పొడుగునా ఎదురుచూడటమే జీవితమనిపించేది. కొత్త సంవత్సరం, కొత్త ఋతువు, కొత్త మాసం...మట్టి పలక మీద నీళ్ళు జల్లి, శ్రద్ధగా తుడిచి మళ్ళీ నచ్చినవేవో రాసుకోమన్నట్టు– కొత్త ఉగాది. జనవరి ఒకటికి రాసుకుని మర్చిపోయిన కలలకి మళ్ళీ కాస్త కదలిక వచ్చే రోజు. మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త నియమాలతో కొత్త జాబితాలు తయారు. మళ్ళీ నిండు వాగ్దానమై చేతుల్లో పడ్డట్టుండే జీవితం. ఆరోగ్యంగా మేలుకునే ప్రతిరోజూ మనిషికి దొరికే కొత్త అవకాశమే కానీ, ఉగాది మాత్రం వాగ్దానమనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే చాలు. అడుగు బయటపెడితే చాలు పూలు, సీతాకోకల రంగుల తేజస్సు, విరిసే మల్లెల పరిమళం, కోయిల గొంతులోని సంబరం – అయాచితంగా మనిషికి బట్వాడా అయిపోతాయని నాకనిపిస్తుంది. ఆ కాస్త వ్యవధి, ఆ కాస్త ప్రయత్నం ఆశించగలమా ఈ హడావుడి జీవితాల నుండీ, అన్నది ప్రశ్న. ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాదంతా అదే చేస్తామన్న అమాయకపు నమ్మిక ఒకటి ఉండేది. అందుకని మంచి మాటలే మాట్లాడటం, మంచిపనులే చెయ్యడం, ఇష్టమైన వాళ్ళని కలవడం, కలిసి, ఏడాదంతా మనదేనని చెప్పుకోవడం... ఎదిగే క్రమంలో ఎక్కడో పారేసుకున్నాను ఈ అందమైన విశ్వాసాన్ని. సాయంకాలపు నడకల్లో మామిడిచెట్లు కనపడితే ఇప్పుడు చూపు ఆగిపోతోంది. ఆ పూతవేసిన లేతమావి శోభ కాళ్ళను కట్టిపడేస్తోంది. పక్క వీధిలో ఉండే స్నేహితురాలొకరు, ఈ ఏడాదికి మొదటగా పూశాయంటూ దోసెడు మల్లెలు చూపించారు. ఎగబీల్చిన పరిమళం నా ఊపిర్లో కలిసిపోయింది. గుత్తులు గుత్తులుగా వాకిట్లో ఏవేవో పూవులు. ఆ పూల మధువు కోసం పూటా కొందరు కొత్త అతిథులు. ‘ఎవరు వారు వచ్చేరు? పూవుల తేరుపై; చైత్ర రథంలోన శ్యామపత్రపథంపైన, ఎవరా వచ్చేది?’ అని ప్రశ్నించి, అది ఉగాది అది ఉగాది అంటారు కృష్ణశాస్త్రి. ఉగాదితో పాటు వచ్చే ఈ అతిథులను చూస్తే నాకైతే ‘రొద సేయకే తుమ్మెదా...‘ అని పాడాలనిపిస్తుంది. నెలల తరబడి నీళ్ళు పోస్తూ ఆశగా చూసినన్నాళ్ళూ పూలు రాల్చని మొక్కల మీదకి, మొగ్గలు మొదలవుతూనే తుమ్మెదల తాకిడి. ఆ పూల మెత్తదనాన్ని తాకి చూసే వీలైనా లేకుండా మత్తుగా ఆ పూరెమ్మల మీదే తూగుతూ కనపడతాయ్. ‘ఈ పూల ఋతువంతా ఈ తేటిదో... ఈ తోటమాలిదో...’ అన్న సినీకవి సందేహం ఇప్పుడు నాది కూడా. -
ఉగాది పండుగ సందేశం ఇదే!
తెలుగు వారి పండుగల చిట్టాలో ఉగాది ముఖ్యమైనది. పూర్వ కాలంలో దీనినే ‘యుగాది’గా పిలిచేవారు. అంటే యుగానికి ఆదిగా దీనికి నిర్వచనం. ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటిన ప్రారంభం అవుతుండగా, మన తెలుగు సంవత్సరాది చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే ఈ పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు వరుసగా పర్వదినాలు వస్తాయి. రానున్న సంవత్సరాన్ని పరాభవ నామ సంవత్సరంగా వ్యవహరిస్తారు.శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. రుతువుల్లో మొదటిదైన వసంతం మనోహరమైనదీ, ఆహ్లాదకరమైనదీ. వసంత రుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే అంటోంది బ్రహ్మపురాణం. రామ పట్టాభిషేకం జరిగిందీ, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ, కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు.ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలి మాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ, ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్ర శుద్ధ పాడ్యమినే నూతన సంవత్సర ఆరంభ దినంగా, కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకొంటారు.ఉత్కంఠ గొలిపే సంవత్సర ఫలితాలను, కందాయ ఫలాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం ఉగాది నాటి ముఖ్య వేడుక. కొత్త చిగుళ్లతో, రంగురంగుల పూలతో, పరిమళాల పన్నీరుతో కొమ్మకొమ్మకీ మామిడి తోరణాలు, కోయిల పాటలు వసంతానికి పచ్చని గురుతులై ప్రాణికోటికి శుభం పలుకుతున్నాయి. షడ్రుచుల ప్రసాదం కోసం మామిడి పిందెలు, వేపపూతలు సిద్ధంగా ఉన్నాయి.అన్ని రుచులు సమానంగా ఆస్వాదించాలనీ, అన్ని అనుభవాలు కలిస్తేనే సంపూర్ణ జీవితమనే సందేశాన్ని ఉగాది పచ్చడి మానవాళికి అందిస్తోంది. సంవత్సరమంతా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖ సంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్విక సందేశం ఉగాది పండుగలో ఉంది.– నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ -
ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!
ఉగాది.. తెలుగు ప్రజల కొత్త ఏడాదికి ప్రారంభం. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే పనులు ఏడాది మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుందని పెద్దలు, పండితులు చెప్తారు. అందుకే ఉగాది రోజు కొన్ని శుభకార్యాలు చేయడం ఆచారంగా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, సాంప్రదాయాలు చేయడం వల్ల ఆ ఏడాది మొత్తం శుభంగా ఉంటుందనేది భక్తుల నమ్మకం.ప్రభాత వేళే మేల్కొనడం – బ్రహ్మ ముహూర్తంలో లేచి, తైలస్నానం (నువ్వుల నూనెతో స్నానం) చేయడం శ్రేయస్కరం.కొత్త బట్టలు ధరించడం – కొత్త ఆరంభానికి సంకేతంగా, ఈ రోజు అందరూ కొత్త బట్టలు ధరించి ఉగాదిని ఆహ్వానిస్తారు.వేప పచ్చడి సేవించడం – తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచులను కలిపి తయారుచేసిన ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలను సూచిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.పంచాంగ శ్రవణం – ప్రతి ఉగాది రోజున కొత్త సంవత్సర ఫలితాలను తెలుసుకునేందుకు పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం ఉత్తమం. మినపప్పు , కందిపప్పు, శెనగపప్పుతో చేసిన పదార్ధాలు స్వీకరించాలి, స్వయంపాకంగా దానం ఇవ్వాలి.బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. కుదిరితే అన్నదానం చేయాలి. జలదానం చేయాలి. తల్లిదండ్రులకు భక్తితో నమస్కరించాలి, భార్యను ప్రేమతో చూచి కుదిరితే గాజులు కొనిచ్చి /కొనిపెట్టి , కుంకుమ బొట్టు పెట్టి ఆమెను దేవతగా భావించాలి. తద్వారా పార్వతీదేవి యొక్క ఆశీస్సులు పొందగలము. గురువునకు ఉగాదినాడు 3 ప్రదక్షిణలు చేసినవారు, 3 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. లక్ష్మీదేవిని పూజించి వ్యూహలక్ష్మీ మంత్రమును జపించుకోవటం, ఈశ్వరునికి అభిషేకం చేసుకోవటం శ్రేష్ఠం. పంచాంగ శ్రవణం చేయండి, కుదిరితే పంచాంగం లేక మంచి పుస్తకాలు దానం చేయడం మరింత ఉత్తమం. ఆలా చేస్తే పిల్లల యొక్క విద్య వృద్ధి చెoదుతుంది. పసుపు కుంకుమలు దానం ఇవ్వండి. బూరెలతో కూడిన భోజనము చేస్తే భూరి సంపదలు ఇస్తాడు పరమాత్మ. కోపం వదిలి, అన్నీ మంచి పలుకులు పలుకుదాము, ఈ నూతన సంవత్సరం సకల శుభాలను పొందుదాం... ఇవేగాక చాలామంది ఉగాది పండుగ నాడు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయడం వంటివి చేస్తుంటారు. ఇలా ఎందకు చేస్తారు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక రహస్యాలు ఏంటంటే.విజయ ప్రతీకగా..నూతన సంవత్సర ఆరంభం (విజయ ప్రతీక)... తెలుగు రాష్ట్రాలలో ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం, ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. కాషాయ రంగు త్యాగానికి, పవిత్రతకు, ధర్మానికి చిహ్నం. కొత్త సంవత్సరం అంతా ధర్మబద్ధంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఇంటిపై ధ్వజాన్ని ఎగురవేస్తారు.చారిత్రక నేపథ్యం (విజయ సంకల్పం)... చారిత్రక కోణంలో చూస్తే, ఈ రోజును విజయ దినంగా కూడా భావిస్తారు. శాలివాహన చక్రవర్తి శకులను జయించి 'శాలివాహన శకం' ప్రారంభించిన శుభసందర్భం ఇది. ధ్వజం అనేది విజయానికి గుర్తు. ప్రతి ఇంటిపై ఈ జెండాను ఉంచడం ద్వారా ఆ కుటుంబం రక్షణ, ఐక్యతను చాటుతారు.ఆధ్యాత్మిక అర్థం... కాషాయం అంటే సూర్యోదయ కిరణాల రంగు. ఇది చీకటిని (అజ్ఞానాన్ని) తొలగించి వెలుగును (జ్ఞానాన్ని) ప్రసాదించే రంగు. హిందూ సంప్రదాయంలో జెండాను 'కేతువు' అని పిలుస్తారు. ఇంటి పైన జెండా ఎగురవేయడం వల్ల దుష్టశక్తులు దరిచేరవని, దైవ రక్షణ ఉంటుందని భక్తుల నమ్మకం.పండుగ అలంకరణలో భాగం...సాధారణంగా ఉగాదినాడు గుమ్మాలకు మామిడి తోరణాలు, వేప రెమ్మలతో పాటు ఇంటి కప్పు పైన లేదా బాల్కనీలో కాషాయ జెండాను కడతారు. ఇది ఇంటికి ఒక పవిత్రమైన రూపాన్ని ఇస్తుంది. ధ్వజం కట్టేటప్పుడు జెండా శుభ్రంగా, చిరగకుండా ఉండాలి.సాధారణంగా దీనిపై 'ఓం' కారము లేదా హనుమంతుడి చిహ్నం ఉంటుంది. జెండాను ఎత్తైన ప్రదేశంలో గాలికి రెపరెపలాడేలా కట్టడం శుభప్రదంగా భావిస్తారు.(చదవండి: పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!) -
పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!
తెలుగు వారి నూతన సంవత్సరం, పరాభవ నామ సంవత్సరం మార్చి 19, 2026న ప్రారంభం కాబోతుంది. అయితే చాలా మంది సంవత్సరం పేరు చూసి భయపడుతున్నారు. ఇదే సంవత్సరంరా బాబు..అసలు బాగుంటుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పేరే పరాభవ నామ సంవత్సరం అంటే అన్ని పరాభవాలే, అవమానాలేనా అని ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ పరాభవ నామ సంవత్సరం అంతరార్థం ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.మనిషిలో ఉన్న 'అహంకారం', 'గర్వం', 'స్వార్థం' పరాభవం పాలు కావడాన్ని (ఓడిపోవడాన్ని) ఇది సూచిస్తుంది. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించి, వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది. అహంకారంతో విర్రవీగే పాలకులకు, వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుంది. కానీ... వినయంతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో పరాభవ నామ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం ఉగాది పచ్చడి కూడా విలక్షణమైనదిగానే పరిగణిస్తారట. ఎందుకంటే.. ఆరు రుచుల తోపాటు ప్రతికూలత అనుకూలత అనే రెండింటిని సమానంగా చూపుతుంది. ఎవరు అయితే సవాళ్లను అధిగమించి, సహనంతో ముదుకు సాగుతారో వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుందంట. అలాగే సంవత్సరం ఫలితాలు అనేవి కేవం కొత్త ఏడాది పేర్లపైనే ఆధారపడి ఉండవు, ఇవన్నీ కూడా కర్మ, ప్రయత్నం, ధర్మం, భక్తి ఆధారంగా మారతాయి. కానీ ఈ పేర్లు కేవలం మీకు ఒక సూచను ఇస్తాయని వారు తెలుపుతున్నారు.(చదవండి: చైత్రమాసం విశిష్టత..! తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..) -
భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు
ఆ మణికంఠుని అపార కృపాకటాక్షాలతో, అత్యంత పవిత్రమైన మీనమాస పూజలు, శబరిమల ఉత్సవం 2026 కొరకు అయ్యప్ప సన్నిధాన ద్వారాలు తెరుచుకున్నాయి. "స్వామియే శరణం అయ్యప్ప" అనే నామస్మరణతో ఆ దివ్య దర్శనానికి తరలి వెళ్దాం.మీనమాస పూజల షెడ్యూల్నడ తెరిచే సమయం: మార్చి 14, 2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు.నడ మూసివేత: మార్చి 19, 2026 (గురువారం) రాత్రి 10:00 గంటలకు (అత్తాజ పూజ, హరివరాసనం అనంతరం).శబరిమల ఉత్సవం, పంగుని ఉత్తరం 2026వార్షిక ఉత్సవాల నిమిత్తం మార్చి 22 సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి.మార్చి 23: కొడియేట్టు (ధ్వజారోహణం)మార్చి 24: ఉత్సవ బలిమార్చి 31: పళ్ళివేట (రాజవేట)ఏప్రిల్ 01: పంపా ఆరాట్టు & పంగుని ఉత్తరం – భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య జన్మదినోత్సవం.ముగింపు: ఏప్రిల్ 1, 2026.ఏప్రిల్ 1వ తేదీన సన్నిధానం ఉదయం 5:00 నుండి 8:00 వరకు మాత్రమే తెరవబడుతుంది. తిరిగి పంపా ఆరాట్టు ముగిసిన తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేస్తారు.(చదవండి: మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి) -
గత 23 ఏళ్లుగా రంజాన్ దీక్ష చేస్తున్న 56 ఏళ్ల ఎన్ఆర్ఐ
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్లో 56 ఏళ్ల నాన్ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది. 2002 నుండి సతీష్ కుమార్న దుబాయ్లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు. రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని చెప్పారు.ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్ -
International Women's Day 2026 క్రీస్తు నందున్న స్త్రీ సాధికారత
‘ఇప్పుడైతే క్రీస్తునందు’ అన్న దృష్టికోణంలో నుండి చూడగలిగితే అన్నీ సానుకూలంగానే దర్శనమిస్తాయి. బైబిలు గ్రంథం స్త్రీని చిన్నచూపు చూసింది. స్త్రీని తక్కువ చేసి మాట్లాడింది వంటివి కూడా అర్ధరహిత వ్యాఖ్యలే. ఆదామువలె స్త్రీ కూడా దేవుని సృష్టి. దేవుడు ఆమెను తన స్వహస్తాలతోనే నిర్మించాడు. సాటియైన సహాయం అన్న కీర్తి ఆమె సొంతం. ఈ మాట దేవుడే చెప్పాడు.సమానత్వం అనేది అది నుండి ఇప్పటి వరకూ ఉంది. అది విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. చూసే దృష్టిలోనే అంతా ఉంది. ఆ లోపం చూసే విధానపు తీరుదే. అసాధారణ ఆధ్యాత్మిక భావజాలం అలవరచుకుంటే అన్నీ అనుకూలమే. దేవుని పట్ల భయంతో ఇట్టివారే స్త్రీని గౌరవిస్తారు. ఉత్సాహ, ప్రోత్సాహాలతో ఆమెను అందలం ఎక్కిస్తారు. మమ్మల్ని పూజించకున్నా... దయచేసి గుర్తించి గౌరవించండి మాకు అదే చాలు అన్న వేడుకోలు యవ్వన స్త్రీలది. రోజు రోజుకు ఇలాంటి విషమ పరిస్థితులు నేటి సమాజంలో నెలకొంటున్నాయి. నేటి పురుష జన్మ వైవిధ్యం ఏమంటే, తల్లిగా దయతలచి ఒక స్త్రీ పెట్టిన భిక్షే అతనికి ఈ జన్మ. తమదైన పురుషజన్మ స్త్రీ నుండే, స్త్రీకి మరో జన్మ అను మరణకర సంకట స్థితి నుండే ఈ నా జన్మ అన్న సత్యం ఎరిగిన పురుషోత్తములే దేవునికి ఎప్పుడూ భయపడుతూ మెరుగైన సమాజం కోసం కృషి చేస్తారు. స్త్రీ శిశు సంక్షేమాన్ని కోరేవారంతా సమాజ ఉద్ధారకులే.చిన్న కుటుంబమైనా.. పెద్దదైన ఉమ్మడి కుటుంబమైనా... అందులోని వారంతా చేతులెత్తి మొక్కే విధంగా స్త్రీ సాధికారతను బైబిలు అద్భుతంగా వివరించింది (సామెతలు 31:10–31). తనలోని నైపుణ్యాన్ని గుర్తించి దానికి నిత్యం సానపెడుతూ శ్రమించే స్త్రీ విజయపథాన ఊరేగుతుంది అంటుంది బైబిలు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సు అంటే ఏలుబడి లేదా పరి΄ాలన. ఇది దేవుని నియమం. భర్తను మినహాయించి యావత్తూ కుటుంబాన్ని ఆమె ఏలుతుంది.స్త్రీ వినయ విధేయతలు, మరీ ముఖ్యంగా ఆమె వినమ్రత తగ్గింపు, అణుకువ వంటివి ఆకట్టుకొని ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ వినయ సంపన్నతతోనే యేసు ‘నన్ను ఎలా మంచివాడు అంటున్నావు? మంచివాడు, సత్పురుషుడు, సద్బోధకుడు ఒక్కడే. ఆయనే దేవుడు’ అంటూ తగ్గించుకోవడం చూస్తే స్త్రీలకు ఇది గొప్ప ్ర΄ోత్సాహకరమే. ఎప్పుడూ హెచ్చించుకోక తగ్గింపు స్వభావంతో క్రీస్తు తనకు శిరస్సైన దేవుని మెప్పించడం మాదిరిగానే స్త్రీలు కూడా తమ స్వపురుషులను మెప్పించవచ్చు.– జేతమ్ -
15 రోజుల కదిరి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
భక్తుల చేత వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఉంది. గత 27న అంకురార్పణంతో అత్యంత వైభవంగాప్రారంభమయిన ఖాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు పక్షం రోజుల పాటు సాగుతాయి. భక్తప్రహ్లాద సమేత నారసింహుని దర్శనం ఇక్కడ తప్ప మరెక్కడా ఉండదు.హిరణ్యకశిపుని శిక్షించేందుకు, అలాగే తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు ‘నర–సింహ’ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో సమీపంలోని కదిరికొండ తంలో సంచరించారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై నుండి నారసింహుని వేడుకున్నారు. దీనికి గుర్తుగా ఆ కొండపై నారసింహుని ఆలయం కూడా ఉంది. అదేకొండపై శ్రీవారి పాద ముద్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ఖాద్రి’ అని పిలిచారు. ‘ఖా’ అంటే విష్ణుపాదమని, ‘అద్రి’ అంటే కొండ అని అర్థం. ఖాద్రి కాస్తా ఇప్పుడు కదిరి అని పిలుస్తున్నారు. కదిరి ప్రాంతంలో ఒకప్పుడు ఖాదిరి వృక్షాలు (చండ్ర వృక్షాలు) ఎక్కువగా ఉండేవి. వీటికింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభువుగా వెలిశాడని, అందుకే ఖాద్రీ నారసింహుడని పిలుస్తున్నారని మరో కథనం.రంగనాయకుడి స్వప్నం10వ శతాబ్దంలో అప్పటి పట్నం పాలేగారైన రంగనాయకుడికి చెందిన గోవులు ప్రతిరోజూ ఖాదిరి వృక్షం కింద ఉన్న ఓ పుట్టలో పాలు వదిలేవి. ఆ పాలను నారసింహుడు తాగేవారని, అందువల్లనే రంగనాయకులు ఆర్థికంగా బాగా ఎదిగారని ఒక కథనం. ఓరోజు ఆయనకు శ్రీవారు కలలో కన్పించి తాను స్వయంభువుగా వెలిశానని, పుట్టలో ఉన్న తన విగ్రహాన్ని వెలికితీసి తనకు గుడి కట్టించమని కోరితే ఆలయం నిర్మించినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. నాటి ఆలయం కాలగతిలో అదృశ్యం కావడంతో బుక్కరాయలు, హరిహర రాయలు, తర్వాత శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.వసంత వల్లభుడని కూడా...శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భృగుమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిశానని, తన విగ్రహాలను వెలికితీసి పూజాది కార్యక్రమాలు చేయాలని కోరినట్లు ఇంకో కథనం. ఉత్సవ విగ్రహాల వెలికితీత వసంత మాసంలో జరగడంతో స్వామివారిని వసంత వల్లభుడని కూడా పిలుస్తున్నారు. అందుకే కోనేరును భృగుతీర్థమని కూడా పిలుస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలనే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో పక్షం రోజులపాటు ప్రతిరోజూ తిరువీధుల్లో ఊరేగిస్తారు.దేశంలోనే 3వ అతి పెద్ద బ్రహ్మరథంస్వామివారి బ్రహ్మ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 130 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మరథం తయారు చేశారు. రథంపై సుమారు 256 శిల్పకళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీశుడి బ్రహ్మరథం.ఏ రోజు ఏ ఉత్సవం?గత నెల 27వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం గావించారు. 28న శ్రీవారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ నెల 4వ తేదీన బ్రహ్మ గరుడసేవ, 5న శేషవాహనం, 6న పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, 7న మోహినీ ఉత్సవం, 8న ప్రజాగరుడసేవ, 9వ తేదీన గజవాహనం, 10న బ్రహ్మ రథోత్సవం, 11న అశ్వవాహనం, 12న తీర్థవాది ఉత్సవం చివరగా 13వ తేదీన జరిగే పుష్పయాగోత్సవంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.– చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరిపక్షం రోజుల బ్రహ్మోత్సవాలు15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరిగేది కదిరిలో మాత్రమే. ఇంకెక్కడా జరగవు. ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం కూడా ఇంకెక్కడా ఉండదు. ప్రతినెలా స్వాతినక్షత్రం రోజు మూల విరాట్కు అభిషేకం చేస్తాం. ఆ సమయంలో స్వామివారికి చెమట పట్టడాన్ని గమనించవచ్చు.– నరసింహాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు, కదిరి -
ఇఫ్తార్ విందులో.. ఖర్జూర నోరార
రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు.. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం, ఆధునికత కలిసే ఒక ప్రత్యేక జీవనశైలి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో ఉన్న ఫుడ్ లవర్స్ రంజాన్ సీజన్ వచ్చిందంటే ఇఫ్తార్ టేబుల్స్ కొత్త ట్రెండ్స్తో మెరుస్తాయి. అయితే ఈ ఇఫ్తార్లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఖర్జూరాలది మాత్రం ప్రత్యేక స్థానం. కేవలం రంజాన్ మాసం కోసం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన ఖర్జూరాలను నగరానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నగరంలో మరిన్ని వెరైటీల ఖర్జూరాలు సందడి చేస్తున్నాయి. వీటికి తోడు ట్రెడిషనల్ ఇఫ్తార్కు మోడ్రన్ టచ్ ఇచ్చే పానీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ ఏడాది రంజాన్ మాసం ఒకహెల్తీ లైఫ్ స్టైల్ స్టేట్మెంట్లా కనిపిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరోరంజాన్ (Ramadan) మాసంలో ప్రతిరోజూ ఇఫ్తార్ విందులో ఖర్జూరాలు తొలి ముద్దగా తినడం తెలిసిందే.. ఈ ఖర్జూరాల్లో అంతర్జాతీయ ఆహార ప్రయాణం దాగుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా పండించిన ఫలాల్లో ఒకటైన ఖర్జూరం.. ఇప్పుడు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఒక లగ్జరీ గిఫ్ట్, న్యూట్రిషనల్ పవర్హౌస్ కూడా. విభిన్న దేశాల నుంచి వచ్చే ఈ ఖర్జూరాలకు ప్రత్యేక ఆదరణ, దానికి తగ్గట్టుగానే రేట్లు సైతం ఉంటున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా పండించే భారతీయ ఖర్జూరం(ఖజూర్) నగరంలో సులభంగా లభ్యమవుతుంది. ఈ ఖర్జూరం ఫోనిక్స్ సిల్వెస్ట్రీస్ జాతికి చెందింది. దేశంలో రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో దొరికే ఈ ఖర్జూరం గట్టిగా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ రకం. ఫ్రెష్గా లేదా సన్–డ్రైడ్గా వీటిని వినియోగిస్తారు. సిటీలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’ (King of Dates).. అధునాతన జీవనశైలికి కేంద్రమైన హైదరాబాద్లో ఏ దేశాలకు చెందిన ఉత్పత్తులైనా సులభంగా నగరానికి చేరుకుంటాయి. ఇదే క్రమంలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’గా పిలుచుకునే మొరాకో నుంచి వచ్చే మెడ్జూల్ ఖర్జూరం (Medjool dates ) పెద్ద పరిమాణంలో, అంబర్ బ్రౌన్ కలర్తో ప్రత్యేకంగా నిలుస్తుంది. కారమెల్, టాఫీ, హనీ నోట్స్తో నిండిన ఈ రకం గిఫ్టింగ్కు హాట్ ఫేవరెట్. సిటీలో ప్రీమియం డ్రైఫ్రూట్ స్టోర్లలో దీని డిమాండ్ భారీగా పెరుగుతోంది. హనీ టచ్తో సాఫ్ట్ డిలైట్గా ఉంటే. సౌదీ అరేబియాలో పండే సుక్కరి ఖర్జూరం కూడా నగరంలోని ముస్లింలు అమితంగా ఇష్టపడతారు. ఇవి మృదువుగా, తక్కువ ఫైబర్, సహజమైన తేనె రుచితో ఉంటాయి. రంజాన్ గిఫ్ట్ హ్యాంపర్లలో ఇది తప్పనిసరి ఐటమ్. ఈ రకం తాజాగా ఉన్నప్పుడు గోల్డెన్ యెల్లో, పండినప్పుడు అంబర్ బ్రౌన్గా మారుతుంది. సహజ చక్కెర ఎక్కువగా ఉండటంతో ఎనర్జీ బూస్టర్గా వీటిని పరిగణిస్తారు. అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాల నుంచి వచ్చే డెగ్లట్ నూర్ రకాన్ని ‘క్వీన్ ఆఫ్ డేట్స్’గా పిలుస్తారు. ఈ రకం పాక్షికంగా ఎండిపోయి, నట్టి స్వీట్నెస్తో ఉంటుంది. బేకింగ్, కుకింగ్కు ఇవి అద్భుతంగా సరిపోతాయి. రంజాన్ డెజర్ట్స్లో ఇది ఫేవరెట్. ఇరాన్ నుంచి వచ్చే మజాఫతి ఖర్జూరం డార్క్ బ్రౌన్ నుంచి నలుపు రంగులో ఉంటుంది. సాఫ్ట్, జ్యూసీ టెక్స్చర్తో మోలాసిస్ లాంటి రుచి దీని ప్రత్యేకత. సౌదీ అరేబియా మదీనాలో మాత్రమే దొరికే అజ్వా రకానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఖర్జూరం మతపరమైన, సాంస్కృతిక విలువలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది. -
మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి
కేరళ పేరు వినగానే మన తెలుగువారికి భక్తితో అయ్యప్పస్వామి గుర్తుకొస్తారు శబరిమల యాత్ర మనకి గొప్ప అనుభూతినిస్తుంది. శబరివాసుడు అయ్యప్పస్వామి దర్శనం ఇంచుమించుగా పురుషులకి మాత్రమే అయితే స్త్రీలకి మాత్రమే ఏటా ఒకసారి పొంగలి సమర్పించే దేవాలయం ఆటుకాల్ భగవతి క్షేత్రం. ఈ క్షేత్రం కేరళ రాజధాని తిరువనంతపురం నగరంలో ఉంది. ఏటా ఫిబ్రవరి, మార్చినెలలలో ఆటుకాల్ భగవతికి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి పొంగలి సమర్పిస్తారు. కేరళ రాష్ట్రం నలుమూలల నుండి అలాగే దేశ విదేశాలలో ఉండే మలయాళీ స్త్రీలు లక్షలలో భగవతికి పొంగాల (పొంగలి) సమర్పించడానికి వస్తారు. ఆరోజు కేరళ రాష్ట్ర రాజధాని స్త్రీలతో నిండిపోతుంది. పొంగాల సమర్పించడానికి పొయ్యి, వంట దినుసులు మాన్తా కోసం వంటచెరకు సిద్ధం చేసుకుంటారు. లక్షలాది మంది స్త్రీలు ఒకచోట చేరి దేవికి ప్రసాదం వండడం గిన్నెస్ బుక్ రికార్డు. ప్రతి ఏటా ఆ రికార్డు తిరగ రాయడం భగవతి శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో కేవలం స్త్రీలు మాత్రమే పాల్గొనాలి. పురుషులకి ప్రాధాన్యత లేదు. స్త్రీలు తమ జీవిత ఐశ్వర్యం కొరకు కుటుంబ అభివృద్ధి కోసం ఆటుకాల్ భగవతికి పొంగాల సమర్పించుకుంటారు. పొంగాల స్త్రీలు నగరం వీధులలోను రోడ్డు మీద ఇంటి అరుగు మీదా చేసుకుంటారు. ఇంకా చె΄్పాలంటే... ఇందులో పాల్గొనేవాళ్ళు అందరు భగవతి స్వరూపంగా భావించి ఎంతో భక్తి, గౌరవం చూపుతారు. స్త్రీలు స్నానం చేయడానికి, బట్టలు మార్చడానికి అన్ని సౌకర్యాలు జాతిమతం;పేదా గొప్పా భేదం లేకుండా చూసుకుంటారు. ఇన్నిలక్షలమంది స్త్రీలు ఒకచోట చేరినా, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగడం గొప్పవిశేషం. స్త్రీలు కొత్త వస్త్రాలు ధరించి కొత్త మట్టి కుండ, కర్రలు మూడు ఇటుకలు, పాలు, బియ్యం, బెల్లం వంటివి తెచ్చుకుని తాము కూర్చునే చిన్నస్థలాన్ని శుభ్రం చేసుకుంటారు. అంతకుముందు పారిశుధ్య కార్మికులు నగర వీధులు అంతటా శుభ్రం చేస్తారు. ఇక్కడ జరిగే ఒక అద్భుతం ముహూర్త సమయానికి చిరుజల్లులు పడి ఆ ప్రదేశం అంతా పవిత్రంగా మారడం. ఇది ప్రతి యేటా కనిపించే సత్యం. దేవి చైతన్యానికి నిదర్శనం. అందరూ ముందుగా ఇటుకలు పేర్చి కొత్త మట్టికుండలో పాలు, బెల్లం, బియ్యం పోసి సిద్ధంగా ఉంచాలి. ఆటుకాల్ భగవతి ముందు పూజారి పొయ్యి వెలిగించి పొంగాల వండటం ప్రారంభిస్తారు. ఆ పొయ్యి నుండి దీపాన్ని వెలిగించి పూజారులు నాలుగువైపులా తిరుగుతూ తీర్థంతో సంప్రోక్షణ చేస్తారు. స్త్రీలు తాము సిద్ధం చేసిన పొయ్యిలో తాము తెచ్చిన దీపంతోనే అగ్ని వెలిగిస్తారు. స్త్రీలు, వారి వెంట వచ్చిన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవతిని ప్రార్థిస్తారు. భగవతికి సమర్పించిన పొంగాల ఎంతగా పొంగి పొయ్యిలోకి పొర్లుతుందో అంతగా తమ జీవితాలలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.ప్రతి సంవత్సరం మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హైదరాబాద్ నగరాల నుంచి రైలు తిరువనంతపురం నగరానికి వెళ్తోంది. ఇంకా కేరళలోని ఎర్నాకులం తిరువనంతపురం చేరడానికి విమాన మార్గం ఉంది.(ఈ యేడు ఫిబ్రవరి 23న మొదలైన ఆటుకాల్ పొంగాల్ ఉత్సవాలు మార్చి 4 వరకు జరిగాయి).– ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..! -
గ్రహణంలోనూ తెరిచే ఉండే ఆలయాలు
గ్రహణంలోనూతెరిచే ఉండే ఆలయాలుసాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలను మూసివేసి, గ్రహణం తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణతో శుద్ధి చేసి భక్తుల సందర్శనార్థం అనుమతించడం అనేది ఆచారం. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతక కాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. ఆ ఆలయాలేమిటో తెలుసుకుందాం...గ్రహణసమయంలో కూడా తెరిచే ఉండే ఆలయాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం, పెదకాకానిలోని కోటేశ్వర స్వామి ఆలయం ముఖ్యమైనవి. తమిళనాట గల అరుణాచల క్షేత్రం సరేసరి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభువులు కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడమే ఇందుకు కారణంగా పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని విశ్వాసం. మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు, అగ్నిభట్టారడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ క్షేత్రానికి రాహు, కేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం.గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీజ్ఞాన ప్రసునాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం కూడా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామి వారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహు కేతు, సర్ప దోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు.మహా కాళేశ్వర్ ఆలయం... ఉజ్జయిని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూ మహాకాళ రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండనందువల్ల గ్రహణ సమయంలో కూడా ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. ఏ ఢిల్లీలోని కల్కాజీ ఆలయం: ఈ ఆలయం కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కా దేవి కాలచక్రానికి అధిపతి అని నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కల్కా దేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి వస్తారు.ఏ కల్పేశ్వర్ ఆలయం – ఉత్తరాఖండ్ : గ్రహణ సమయంలో కూడా ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిథిగా దర్శనాలు కొనసాగుతాయి. ఏ తిరువరప్పు శ్రీ కృష్ణ ఆలయం – కొట్టాయం ఏ కేరళ రాష్ట్రం కొట్టాయంలోని తిరువరప్పులో శ్రీ కృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీ కృష్ణుడికి రోజుకు పదిసార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామి వారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామి వారి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామి వారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. ఏ విష్ణుపాద ఆలయం – గయ: ఈ ఆలయంలో గ్రహణం సమయంలో పిండ ప్రధానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుందట.ఏ లక్ష్మీనాథ్ ఆలయం – బికనీర్, ఏ రాజస్థాన్ రాష్ట్రం బికనీర్లోని లక్ష్మీనాథ్ ఆలయం. దీన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరు. ఎందుకంటే ఓసారి గ్రహణ సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఓ కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.(మార్చి 3 బుధవారం సంపూర్ణ చంద్ర గ్రహణం) -
సహజయోగం బ్రహ్మచైతన్యమైన వేళ...
భారతదేశం పుణ్యభూమి, ధర్మభూమి, యోగభూమి. ఈ గడ్డపైన ఎందరో ఋషులు, మహా ఋషులు, అవతార మూర్తులు, ఆధ్యాత్మిక గురువులు జన్మించారు. అలాంటి ఆధ్యాత్మిక గురువులలో అంతర్జాతీయంగా గుర్తింపు, మన్ననలను పొందిన పరమపూజ్య శ్రీ మాతాజీగా పిలువబడే శ్రీమతి నిర్మలా దేవి శ్రీ వాత్సవ ఒకరు. ఆమె కారణ జన్మురాలని ఆమెను గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత, సర్వధర్మ సంస్థాపనకోసం ఊరూరా తిరిగి, విదేశాలలో పర్యటించి తాను నమ్మిన సత్యాన్ని, ధర్మాన్ని స్వయంగా ఆచరించి చూపించిన ఆత్మసాక్షాత్కార గురువు. ప్రవక్తలందరూ చెప్పిన ధర్మాలన్నీ ఒకేచెట్టుకు పూసిన పువ్వులే అయినప్పటికీ, ఎవరికి తోచిన పువ్వును వారు కోసుకుని వివిధ మతాలను స్థాపించుకుని, వాటి ప్రవక్తలు ప్రవచించిన మూల సూత్రాలను పక్కదారి పట్టిస్తున్న సమయంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి అటువంటి వాటినుండి వాస్తవాన్ని, అసలు సత్యాన్ని సహజయోగం ద్వారా బహిర్గత పరచారు. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1970 మే 5 వ తేదీన తన స్వీయ తపోశక్తి ద్వారా ‘సహజయోగ’ ని ఆవిష్కరించారు. తనలో నిద్రాణ స్థితిలో వున్న కుండలినీ శక్తిని జాగృతి చేసి సహస్రార చక్రం తెరిచి తద్వారా తన లోని ఆ భగవత్ శక్తి అయిన కుండలినీ శక్తిని బాహ్యపరంగా వున్న పరమాత్మ ప్రేమైక శక్తి అయిన పరమ చైతన్యంతో అనుసంధానం చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కార స్వీయ అనుభూతిని సాధించారు. ‘సహ’ అంటే మనతో ‘జ’ అంటే జన్మించిన శక్తి, యోగ అంటే బాహ్య పరంగా వున్న శక్తితో కలయిక అని అర్థం. ఆ విధంగా మనలోని కుండలినీ శక్తి బాహ్యపరంగా విశ్వవ్యాపిత భగవత్ శక్తితో ఏకీకరణ పొందినప్పుడు మనం కూడా ఆ పరమాత్మ దివ్య శక్తిలో ఓ భాగమైపోతాము.పరమచైతన్యం లేక బ్రహ్మ చైతన్యం అంటే విశ్వవ్యాపితమైన పరమాత్మ ప్రేమ శక్తి మాత్రమే. విశ్వాన్నంతటిని, సకల చరాచర జీవులను, నడిపించే భగవత్ శక్తి. మానవ మేధస్సుకు అతీతమైనది. ఆత్మ సాక్షాత్కారం పొంది ప్రతినిత్యం సహజయోగ సాధన చేస్తున్నవారి సహస్రార చక్రం పూర్తిగా వికసించి, మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో ఉన్న 7 చక్రాలు తెరుచుకుని బ్రహ్మ చైతన్యంలో అంతర్భాగాలైన అధిష్టాన దేవతలు మేల్కొనబడి మనకు తమ ఆశీర్వచనాలు అందచేస్తారు. సదాశివుని అర్ధాంగి అయిన ఆదిశక్తి ఆయన చుట్టూ పరివేష్టించి ఓ చల్లటి మేఘం లాగా ఆవృతమై వుంటుంది. అదే బ్రహ్మ చైతన్యం. పరమచైతన్య శక్తిగా పిలువబడుతున్న ఆ శక్తియే పరమాత్మ అయిన సదాశివుని ఇచ్చాశక్తి. ఆ శక్తియే విశ్వాన్ని సృష్టించింది. భూమి మీద వున్న జీవజాలం మీద,మానవుల మీద తన పరమ చైతన్య శక్తిని వెదజల్లుతుంది. మనల్ని అంతర్గతంగా బలోపేతం చేస్తుంది, పోషిస్తుంది. మనలో ప్రేమ శక్తిగా అంకురిస్తుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్న వారందరూ ఈ భగవంతుని ప్రేమ శక్తిని తన చుట్టూ ఉన్న పదిమందికీ పంచడానికి కృషి చేస్తారు. కుల, మత, జాతి, ప్రాంత, వయసు, లింగ భేదాలు లేకుండా ఎవరైనా, ఎప్పుడైనా అతి సునాయాసంగా ఆచరించగలిగే ఈ సహజయోగం దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే శారీరిక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం. మనిషి ఎన్నో ఏళ్లనుండి, ఎన్నో జన్మలనుండి అన్వేషిస్తున్న ‘సత్యాన్ని’ సహజయోగ ధ్యానం ద్వారా ఆవిష్కరించి ఎటువంటి స్వార్థచింతన లేకుండా మానవాళికి శ్రీ మాతాజీ నిర్మలా దేవి అందించారు. సహజయోగం ద్వారా వారిని భగవంతుని శక్తితో అనుసంధానపరచి తమ కష్టాలను, సమస్యలను ధ్యానం ద్వారా తమను తాము ఎలా సమతుల్యంలో ఉంచుకోవాలో, ఎలా తమ సమస్యలను తమంతట తాము పరిష్కరించుకోవాలో తెలుసుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇలా కోరుకున్న ప్రతి ఒక్కరిలో సరైన పరివర్తన తీసుకురాగలిగే ‘నవ సమాజ నిర్మాణం’, ‘వసుధైక కుటుంబం’, ‘సర్వమానవ సౌభాతృత్వం’ ‘ద్వేష రహిత, ప్రేమ పూరిత సమాజం’ ఏర్పడటం సుసాధ్యమే అని తాను స్థాపించిన సహజయోగం ద్వారా శ్రీ మాతాజీ నిర్మలా దేవి ఆచరించి నిరూపించారు. శ్రీమతి నిర్మలాదేవి తన జన్మ సార్ధకం చేసుకుని 2011 వ సంవత్సరం, ఫిబ్రవరి 23వ తేదీన తన సాకార రూపాన్ని చాలించుకుని నిరాకారం లోనికి వెళ్ళిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా సహజయోగ ధ్యానకేంద్రాలలో ప్రతిఏటా ఫిబ్రవరి 23వ తేదీన ‘బ్రహ్మ చైతన్య దినోత్సవం’ గా జరుపుకుంటున్నారు.– డా. పి. రాకేష్, సహజ యోగ సాధకులు(నేడు అంతర్జాతీయ బ్రహ్మచైతన్య దినోత్సవం) -
సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?
స అష్ట అంగ నమస్కారం... దీనినే సాష్టాంగ నమస్కారం అంటారు. అంటే మన శరీరంలోని అన్ని అంగాలూ నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే నమస్కారం అన్నమాట.. బాగా గౌరవించే వాళ్ల దగ్గర కాస్త ముందుకు వంగి నమస్కారం చేస్తాం. మరి సృష్టికి మూలమైన భగవంతుడికి నమస్కారం చేయాలంటే... ఎంత వంగినా ఇంకా వంగవచ్చునా అనిపిస్తుంది. అందుకే ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనిపించే స్థితిలో నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం.భగవంతుడికి పూర్తిస్థాయిలో మోకరిల్లడం ఇందులోని పరమార్థం. అయితే సాష్టాంగనమస్కారం (Sashtanga Namaskaram) పురుషులకు మాత్రమే. స్త్రీలకు వర్తించదు. మనిషి జననానికీ, జీవనానికీ కారణమైన పొట్ట, వక్షభాగాన్ని నేలకు తగిలించకూడదనీ, అందుకే వాళ్లు మోకాళ్ల మీద ముందుకు వంగి నమస్కారం చేస్తే సరిపోతుందనీ శాస్త్రం చెబుతోంది.చదవండి: మంత్రపుష్పం పరమార్థం ఏమిటి? -
ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రి, 5వేలకు పైగా శైవభక్తిగీతాలు
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికత,సాంకేతికతల సమన్వయానికి నిదర్శనంగా సూపర్ ఏఐ అకాడమీ (SUPER AI Academy) మహాశివరాత్రి 2026ని ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రిని నిర్వహించింది . ఈ సందర్బంగా ‘డిజిటల్ నాద యజ్ఞం” ద్వారా 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలను రూపొందించడం విశేషంగా నిలిచింది. కేవలం 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలలో 108 గీతాలను ప్రత్యేక ప్రసారం చేసింది.Zoom వెబినార్ ప్లాట్ఫారమ్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే సమయంలో శివతత్వాన్ని ఆధారంగా చేసుకుని గీతాలను సృష్టించారు. క్రమబద్ధమైన సాహిత్య రూపకల్పన కోసం ChatGPT Custom GPT వినియోగించగా, సంగీత నిర్మాణానికి AI ఆధారిత సంగీత సాధనాలను ఉపయోగించారు. అలాగే దీన్ని వాణిజ్య కార్యక్రమంలా కాకుండా పరమశివునికి సమర్పించిన సమూహ భక్తి నాదార్పణగా భావించామని నిర్వాహకులు ప్రకటించారు. “డిజిటల్ నాద యజ్ఞం”కార్యక్రమంలో శివుని విభిన్న రూపాలైన శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగ రూపాలు, శివ తాండవం వంటి ఉత్సాహభరిత భావాలతో కూడిన గీతాలను సృష్టించారు. భాషా, సాంస్కృతిక భక్తి పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిబింబంగా అన్ని గీతాలు తెలుగులోనే ఉండటం విశేషం. వీటిని సమయపాలన, సమన్వయంతో రియల్టైమ్ ట్రాకింగ్ వంటి పద్ధతులతో కార్యక్రమం సజావుగా నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమం Impact Foundation సహకారంతో, District Governor 320H గంపా నాగేశ్వర్ రావు నాయకత్వంలో Impact International ట్రెజరర్ గంపా ఆదిత్య భారత్ సహకారం అందించారు. SUPER AI Academy కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయ శ్రీ తదితరులు పాల్గొనేవారి సమన్వయం మరియు సాంకేతిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందర్భాల్లో కృత్రిమ మేధస్సును సృజనాత్మకంగా వినియోగించడం సులభమనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినట్లు సూపర్ ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు Nikeelu Gunda తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారికి నమోదు, సమాచారం అందించేందుకు AIMahashivaratri. com అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేశారు.ప్రాంతీయ భాషల్లో AI అవగాహన పెంపొందించి, సృజనాత్మకత, ఉపాధి, సాంస్కృతిక పరిరక్షణకు సాంకేతికతను సాధనంగా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమని, గ్రామీణ , ప్రాంతీయ భాషా వర్గాల వరకు కృత్రిమ మేధస్సు విద్యను చేర్చాలని తమ లక్ష్యమని సూపర్ ఏఐ అకాడమీ ప్రకటించింది. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
వృద్ధాప్యం ఆధ్యాత్మిక సాధనకు వరం
వృద్ధాప్యం అనేది జీవితమనే పుస్తకంలో చివరి అధ్యాయం కావచ్చు, కానీ అది అత్యంత విలువైన గౌరవప్రదమైన దశ. దీనిని కేవలం శారీరక క్షీణతగా కాకుండా, ‘అనుభవాల పండగ’గా చూడాలి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గొచ్చు కానీ, జీవితాన్ని చూసే దృష్టి పెరుగుతుంది. ఏది ముఖ్యం, ఏది అనవసరం అనే విచక్షణ వారికి ఉన్నంతగా మరెవరికీ ఉండదు. అందుకే వారిని జ్ఞాన నిధులు అంటారు.వృద్ధాప్యంలో ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, పునస్కారాలకే పరిమితం కాదు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి., జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి చేసే ప్రయాణం. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడం వల్ల కలిగే అసహనాన్ని ఆధ్యాత్మికత తగ్గిస్తుంది. రోజుకు కొద్దిసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసు నియంత్రణలోకి వస్తుంది. జీవితంలో జరిగిన మంచి చెడులను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుంది. వృద్ధాప్యం అనేది కేవలం శారీరక శక్తిని కోల్పోయే దశ కాదు, అది ఆధ్యాత్మిక పురోగతికి అత్యంత అనుకూలమైన సమయం. జీవితంలో బాధ్యతలన్నీ తీరిన తర్వాత, మనసును బయటి ప్రపంచం నుండి మళ్లించి లోపలికి (అంతర్ముఖం) పంపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. యవ్వనంలో ఉన్నప్పుడు ధనం, పదవి, పిల్లల భవిష్యత్తుపై ఉండే విపరీతమైన వ్యామోహం వృద్ధాప్యంలో క్రమంగా తగ్గుతుంది. కుటుంబంలో జరిగే విషయాలను ఒక సాక్షిలా గమనించడం అలవడుతుందిఅంతా ‘దైవేచ్ఛ’ అని భావించడం ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు.వృద్ధాప్యంలో శారీరక కదలికలు తగ్గినప్పుడు, మనసు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ జీవిత పరమార్థం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదలవుతుంది. అనవసరమైన మాటలు తగ్గించి, మౌనంగా ఉండటం వల్ల ప్రాణశక్తి వృధా కాకుండా ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో అహంకారం సహజంగానే తగ్గుతుంది. నా వల్ల ఏమీ కాదు అని తెలిసినప్పుడు, భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. ‘‘నేను నీ వాడిని, నీవే నన్ను నడిపించు’’ అని భగవంతుడికి పూర్తిగాఅప్పగించుకోవడం (శరణాగతి ) వల్ల కలిగే ప్రశాంతత అద్భుతమైనది. ఇది మరణం పట్ల భయాన్ని పోగొట్టి, ప్రశాంతమైన చిరనిద్రకు (మరణానికి) సిద్ధం చేస్తుంది. తమకున్న అనుభవాన్ని యువతరానికి పంచడం, నిస్వార్థంగా సలహాలు ఇవ్వడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే.అందరికీ వృద్ధాప్య దశ వరకు చేరుకునే అదృష్టం కలగదు. ఉన్న పెద్దలను గౌరవించడం అంటే మన భవిష్యత్తును మనం గౌరవించుకోవడమే. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అనుభవాలను గడించి, ఒక తరాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులు వృద్ధులు. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో లేదా కొన్ని కుటుంబాలలో వారిని ఒక భారంలా చూడటం కనిపిస్తుంది, కానీ అది సరైన దృక్పథం కాదు. ఈరోజు మనం వృద్ధులను ఎలా చూస్తామో, రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు.వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే ఒక సహజ ప్రక్రియ. వారిని అనాథ శరణాలయాలకు పంపడం లేదా ఇంట్లో ఒక మూలకు పరిమితం చేయడం వంటివి కాకుండా, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం మన సంస్కృతి.వృద్ధాప్యం అనేది ఒక పండు పక్వానికి వచ్చినట్లు. పండు పండితే తీపి పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ మనిషిలో శాంతి, క్షమ, ప్రేమ అనే ఆధ్యాత్మిక గుణాలు పెరగాలి. అదే నిజమైన పురోగతి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే మనలోని అశాంతిని వదిలి, శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవడం. వృద్ధాప్యంలో ఈ సాధన మరింత సులభం, ఎందుకంటే లోకజ్ఞానం మనకు అప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది.వృద్ధులను వేధించే ప్రధాన సమస్య ఒంటరితనం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే భజనలు, ప్రవచనాలు లేదా ఆధ్యాత్మిక చర్చల (సత్సంగం ) ద్వారా సమాజంతో సంబంధం ఏర్పడుతుంది. పరమాత్మ ఎప్పుడూ నాతోనే ఉన్నాడు (భగవంతునితో అనుసంధానం) అనే నమ్మకం వారిలో ధైర్యాన్ని నింపుతుంది. జీవితం ఒక నిరంతర ప్రక్రియ అని, మరణం కేవలం ఒక మార్పు మాత్రమే అనే సత్యాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయి. భగవద్గీత వంటి గ్రంథాల పఠనం ద్వారా మరణం పట్ల ఉండే భయం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది. గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఉన్నదానితో తృప్తి చెందడం (సంతోషం) అనేది గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. బాధ్యతలు తీరిపోయాయి, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాననే భావన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.– రామలక్ష్మీ సదానందమ్ -
సినిగళంలో నీల కంఠుడు
‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం’ అని రాశారు వేటూరి ‘సాగర సంగమం’లో.తెలుగు సినిమాల్లో శివుడి ప్రస్తావన ఆది నుంచి ఉన్నా అనేక పాటల్లో శివుని ప్రస్తావనను, ప్రభావాన్ని ప్రేక్షకులకు అందించినవారిలో కె.విశ్వనాథ్, వేటూరి ఉంటారు.‘నటరాజ శత సహస్ర రవితేజా... నట గాయక వైతాళిక మునిజనభోజా’ అని వేటూరి తాను కె.విశ్వనాథ్తో పని చేసిన తొలి హిట్ ‘సిరిసిరిమువ్వ’లో శివుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత ‘శంకరాభరణం’లో ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము’ అని సకల కళలకూ మూలమైన నటరాజ స్వరూపం పరమశివుడిని పల్లవిగా చేశారు.భగవంతుడ్ని చేరుకోడానికి సంగీతం కూడా ఒక అనుసంధాన మార్గమే కదా. అందుకే ‘అద్వైత సిద్దికి అమరత్వ లబ్దికి గానమే సోపానమూ’ అని కూడా అన్నారు వేటూరి.శివతత్వాన్ని పూర్తిగా తెలిసి రాసిన సాహిత్యం ‘సాగరసంగమం’లోనూ వినిపిస్తారు వేటూరి, విశ్వనాథ్లు. శివుడు లయకారుడు. సంగీతంలోనూ... సాహిత్యంలోనూ... గానంలోనూ కూడా లయే ప్రధానం. శివుడు మాట్లాడితే సాహిత్యం. మాట్లాడకపోతే వేదాంతం. అన్నీ శివుడే అని చెప్పటానికి వేటూరి, విశ్వనాథ్ కలసి చేసిన ప్రయోగం సాగరసంగమంలోని ‘ఓం నమఃశివాయ’ పాట. అందులో ‘నీ లయలే ఈ కాలగమనమై’ అంటారు. ‘ప్రకృతి పార్వతి శివునితో కలిసి అడుగులు వేస్తాయి’ అని కూడా అంటారు. ‘జీవితమే చిర నర్తనమాయే’ అనడం వేటూరి మాస్టర్స్ట్రోక్. ఇక బాపు ‘భక్త కన్నప్ప’లో వేటూరి రాసిన ‘కిరాతార్జునీయం’ మరో కవికి సాధ్యం కానిది.వెనక్కు వెళ్లి చూస్తే తెలుగు సినిమా సాహిత్యంలో పరమ శివుడికి ప్రత్యేక స్థానమే ఉంది. రావణ విరచిత ‘శివ దండకాన్ని’ సంపాదించి దాన్ని రావణ పాత్రతోనే పాడించేలా పరిశోధన చేసి సాధించారు సముద్రాల రాఘవాచార్యులు ‘భూకైలాస్’లో. దాన్ని గాలి పెంచెల నరసింహా రావు స్వరసారధ్యంలో నిజంగానే రావణుడే పాడుతున్నారా అన్నంత ఎక్స్ప్రెసివ్గా గానం చేసి రక్తి కట్టించారు ఘంటసాల. తెరమీద రావణపాత్రలో ఎన్టీఆర్ అయితే ఇక చెప్పడానికేముంది. ‘భూకైలాస్’లోనే శివుణ్ణి ‘లోక శుభంకరుడు’గా వర్ణించారు సముద్రాల. ‘అన్య దైవము గొలువ నీదు పాదము విడువ’ అంటాడు రావణుడు శివభక్తితో ‘నీలకంధరా దేవ’ పాటలో. ఇక పింగళి గారు ‘సత్య హరిశ్చంద్ర’లోని ‘నమో భూతనాథ’ పాటలో శివుణ్ణి ‘సదా సుప్రకాశ’ అన్నారు.‘అర్ధనారీశ్వర’ తత్వాన్ని అర్ధం చేసుకున్న వారెవరైనా శివపార్వతులను ఒకటిగానే చూస్తారు. అందుకే భయం కలిగినప్పుడు అభయం కోసం అమ్మవారైన పార్వతిని స్తుతిస్తుంది ద్రౌపది ‘నర్తనశాల’లో. సముద్రాల రాసిన ‘జననీ శివకామినీ’ పాటను భక్తిరసస్ఫోరకంగా స్వరపరిచారు సుసర్ల దక్షిణామ్మూర్తి. అంతే గొప్పగా గానం చేశారు సుశీల. ఆరుద్రకు ఏం తక్కువ. ‘మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అని రాశారు ‘భక్త కన్నప్ప’లో. ‘గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని’ అనే పంక్తి ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది. ‘ఏకలవ్య’లో మల్లెమాల రాసిన ‘మ్రోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం’ కూడా గుర్తు చేసుకోదగ్గది. ‘అమెరికా అమ్మాయిలో’నూ ఓ శివభక్తి గీతం వినిపిస్తుంది. నారాయణరెడ్డి రాసిన సాహిత్యం చిదంబర నిలయుడి మూర్తిని మన కళ్లెదుట నిలుపుతుంది. ‘వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా’ అంటూ ‘ఇంద్ర’ కోసం రాసిన ‘భంభం భోలే’ లో ‘గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే’ అని సిరివెన్నెల మాత్రమే రాయగలరు.‘భరత వేదముగ నిరత నాట్యముగ కదలిన పదమిది పరమేశా’ అని పౌర్ణమి’లోని పాట తరచూ వినిపించే సిరివెన్నెల మరో రచన. ఆపదల్లో ఉన్న వారికి అభయం ఇచ్చి తన వారినిగా చేసుకునే సువిశాల శివతత్వ దర్శనమే ‘ఖలేజా’లో వినిపించే రామజోగయ్యశాస్త్రి గీతం ‘సదాశివ సన్యాసి’. శివతత్త్వమే అత్యంత శుభకరము, భవహరము, హృదయంగమము. మరి ఈశ్వర సాయుజ్యం ΄÷ందేందుకు ప్రయత్నోన్ముఖులైన వారికి ఆనందం కాక మరేమిటి? ఇంక ఇహలోక బంధాలనూ... జంజాటాలనూ పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? విభూతిని ధరించని ఫాలభాగం, శివాలయం లేని గ్రామం, ఈశ్వరుని ధ్యానించని మానవ జన్మం వ్యర్థములు అంటారు. శివ అంటే సంస్కృతంలో శుభము, సౌమ్యము అని అర్థాలున్నాయి. ఈ ప్రపంచమూ అందరి జీవనమూ శుభ సౌమ్యాలతో గడవాలని కోరుకుందాం.– భరద్వాజ -
ఆయన జగం ..ఆమె సగం
బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు, నిత్యమూ శమాది గుణ సంపత్తి కలవాడు కనుక శివుడు అని ‘శివ’ పదానికి వ్యుత్పత్తి.‘శివ’ అంటే పరమేశ్వరుడు.‘శివా’ అంటే పార్వతి. పేర్లలో కూడా ఏక రూపత కలిగిన ఆది దంపతులు వారు స్త్రీ పురుషులు కలిస్తేనే పరిపూర్ణత. వారిలో ఎక్కువ తక్కువలు లేవు. ఇరువురూ సమానమేనని వేదకాలం నుంచే నిరూపించిన స్వరూపం అర్ధనారీశ్వర రూపం.‘గౌరి సగం – శివుడు సగం – అర్ధ నారీశ్వరమే అఖిల జగం’ అంటూ అవినాభావమైన ఆ ఆదర్శ దంపతుల అద్వైత రూపాన్ని మహాకవి ఆరుద్ర కీర్తించారు. వాగర్థాలవలె కలిసిపోయిన వారని కాళిదాసు ప్రస్తుతించారు. ప్రకృతి – పురుషులే సృష్టికి మూలమని, అయితే ఇందులో ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ పోషించే పాత్ర మరింత కీలకమైనదని చెప్పడానికి జగద్గురు ఆది శంకరులు తమ ‘సౌందర్యలహరి‘ లోని తొలి శ్లోకంలోనే ఇలా చెప్పారు:‘శివః శక్త్యా యుక్తో యది భవ తి శక్తః ప్రభవితుమ్ / నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి ‘.శక్తి స్వరూపిణి అయిన జగదంబతో కూడినప్పుడే పరమేశ్వరుడు సమస్త సృష్టిని నిర్వహించడానికి సమర్థుడై ఉంటాడు. పార్వతితో కూడనినాడు అంతటి శివుడూ కాస్తంత కదలడానికి కూడా శక్తిలేనివాడే అవుతాడు. అంతేకాదు. ఆదిశంకరాచార్యులవారు మరొక అడుగు ముందుకు వేసి ‘చితాభస్మమును దేహమంతా పులుముకొని, కంఠంలో గరళాన్ని ధరించి, దిగంబరుడై, జటాధారిగా, మెడలో పాములను వేసుకొని, పుర్రెను చేతిలో పట్టుకొని, యాచక వృత్తితో జీవిస్తూ, శ్మశానవాసిగా ఉన్న ఈశ్వరుడు ముజ్జగాలకే అధిపతి కావడం కేవలం పార్వతీదేవిని పెండ్లి చేసుకోవడం వలన లభించిన ఫలితమేనంటూ తమ ‘దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం’లో నొక్కి వక్కాణించారు. ఇలా భర్త ఔన్నత్యానికి కారణభూతురాలు అతని ఇల్లాలే అని ఆదిశంకరులు జగతికి చాటి చె΄్పారు. ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడానికే పరమేశ్వరుడు జగన్మాత పార్వతిని తన దేహంలో సగభాగంగా స్వీకరించాడు. శివుడంటేనే శక్తిమయుడు. శక్తి అంటేనే శివుని అభివ్యక్తి. శివశక్తులు రెండూ విశ్వానికి ఆధారమైన మూల పదార్థాలు. ఆ అర్ధనారీశ్వరుని స్వరూపాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఆవిష్కరించుకొందాం.అర్ధనారీశ్వరత్త్వంఅర్ధనారీశ్వర స్వరూపంలో కుడిభాగం శివునిది. ఎడమభాగం పార్వతిది. శివుని మేని ఛాయ బంగారు వర్ణం కాగా, పార్వతీదేవిది కర్పూర సమ ధవళ వర్ణం. శివునిది జటలు కట్టిన రాగిరంగు కేశపాశం కాగా, అమ్మవారిది అందంగా అలంకరింపబడిన నల్లని కేశపాశం. విశాలమైన, పోడవైన, నీలోత్పలం వంటి నయనం జగన్మాతదైతే, వికసించిన ఎర్ర కమలం వంటి నేత్రం ఈశ్వరునిది. తన చెవికి ఆ తల్లి రత్నపు చెవిపోగు ధరించగా, సర్పాలనే ఆయన తన చెవికి ధరిస్తాడు. పార్వతి దివ్యాభరణాలను ధరించి ఉండగా, ఆయన నాగాభరణ శోభితుడు. అమ్మవారు దివ్యమైన పట్టువస్త్రాలను అలంకరించుకొంటే, ఆయన దిగంబరుడై దర్శనమిస్తాడు. కస్తూరి, కుంకుమ వంటి సౌభాగ్య ద్రవ్యాలను ఆమె అలదుకొంటే, దేహమంతా చితాభస్మాన్ని శివుడు పులుముకొని ఉంటాడు. ఆమె పాదం అందెలతోను, ఆయన పాదం నాగ కంకణాలతోనూ కనిపిస్తాయి.ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయైసమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమశ్శివా యైచ నమః శివాయఅమ్మవారి ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వుతో విశ్వసృష్టి ప్రారంభమవుతుంది. అయ్యవారి తాండవ నృత్యంతో విశ్వం మొత్తం శివునిలో కలిసిపోతుంది. జగత్తుకే మాతా పితరులైన శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంగా కలిసి ఉన్న తత్త్వానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకభావం.రెండు విభిన్నమైన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు పరస్పర సమన్వయాన్ని సాధించిన వైనానికి సాకార రూపమే అర్ధనారీశ్వరం. విభిన్న లక్షణాలున్నప్పటికీ అన్యోన్యానురాగంతో దాంపత్య బంధాన్ని కొనసాగించాలన్నది అర్ధనారీశ్వరుడు ఇచ్చే సందేశం. ఈ తత్త్వాన్ని ఆకళింపు చేసుకోగలిగితే భూమిపై ప్రతి జంటా ఆ ఆదిదంపతుల లాగా అన్యోన్యతకు సాకార రూపమై నిలుస్తుంది. అలా ఉండే ప్రయత్నం మనమందరం చేయగలిగితే మన సంస్కృతిలో భాగమయిన వివాహధర్మం కలకాలం మనగలుగుతుంది !– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
థైరాయిడ్కు.. సేతు బంధాసనం
మహిళల్లో వయసుతో సంబంధం లేకుండా సాధారణంగా కనిపించే సమస్య థైరాయిడ్. ఈ సమస్యను సహజంగా నియంత్రించడంలో సేతు బంధాసన (Setu Bandhasana) చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ‘సేతు’ అంటే వంతెన, ‘బంధ’ అంటే బంధించడం.. ఈ ఆసనంలో శరీరం వంతెన ఆకారంలో ఉండి, గొంతు, మెడ ప్రాంతంపై మృదువైన ఒత్తిడి పడుతుంది. దీని వల్ల థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల విడుదల సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే ఛాతీ తెరుచుకోవడం వల్ల శ్వాస లోతుగా మారి, ఒత్తిడి తగ్గుతుంది.ఉపయోగాలు..థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ పెరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది. మెటబాలిజం మెరుగై, రువు పెరుగుదల తగ్గుతుంది. గొంతు, మెడ ప్రాంతం బలపడుతుంది. అలసట, నిద్రలేమి తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించి మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. వెన్ను, నడుము నొప్పులకు ఒక వరం.జాగ్రత్తలు.. మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు ఉన్నవారు డాక్టర్, యోగా గురువు సలహాతో చేయాలి. గర్భధారణ సమయంలో ఈ ఆసనం చెయ్యొద్దు. తీవ్రమైన నడుము నొప్పి లేదా స్లిప్ డిస్క్ ఉన్నవారు చెయ్యకపోడం మంచిది.చేసే విధానం..స్టెప్ 1: ముందుగా వెల్లకిలా (వెనుక భాగం వెనుకకు ఆనించి) పడుకోవాలి.స్టెప్ 2: రెండు మోకాళ్లను మడిచి, పాదాలను నేలపై నడుముకు దగ్గరగా ఉంచాలి. చేతులను శరీరానికి పక్కన, అరచేతులు నేలను తాకుతూ ఉండాలి.స్టెప్ స్టెప్ 3: గాలి పీల్చుకుంటూ, నెమ్మదిగా నడుమును పైకి లేపాలి.స్టెప్ 4: భుజాలను, చేతులను, పాదాలను బలంగా నేలపై ఆనించి, మీ ఛాతిని గడ్డం వైపు తీసుకురావాలి. ఈ స్థితిలో 15–30 సెకండ్లు సాధారణ శ్వాసతో ఉండాలి.స్టెప్ 5: శ్వాస విడిచే సమయంలో నెమ్మదిగా నడుమును కిందకు దించి వెన్నెముకను నేలపైకి తీసుకువచ్చి, విశ్రాంతి తీసుకోవాలి.– పాతర్ల అనిత, యోగాట్రైనర్ -
Mahashivratri 2026: శివపూజకు దినుసులు
ఆయన సామాన్యుడా! ఆయనను విశ్వేశ్వరుడనీ, మహాదేవుడనీ, త్య్రంబకుడనీ, త్రిపురాంతకు డనీ, నీలకంఠుడనీ, మృత్యుంజయుడనీ, సదాశివుడనీ వేదం వేనోళ్ళ స్తుతించింది. మహాదేవుడి మహత్త్వాన్ని సంపూర్ణంగా చెప్పేందుకు మాటలు చాలవని మహాకవులైన వారే మనవి చేసుకొన్నారు. ఆయన గొప్పతనం ఆసాంతం చెప్పాలంటే, అది సాక్షాత్తూ చదువుల తల్లికయితే సాధ్యం కావచ్చు నన్నారు. నిజానికి, విశ్వేశ్వరుడి విశిష్టతలన్నీ వివరంగా చెప్పాలంటే సరస్వతీ దేవికి కూడా ఎన్నో సన్నాహాలు అవసరమవు తాయట. ముందు కల్పవృక్షం కొమ్మ విరిచి, దాన్ని అరిగిపోని కలం పుల్లగా అమర్చుకోవాలి. సముద్ర మంత జలపాత్ర సంపాదించాలి. ఆ నీటిలో కాటుక కొండను కరిగించి, సిరాను సిద్ధం చేయాలి. ఆ పైన విరామం లేకుండా అహర్నిశలూ రాస్తూనే వెళ్ళాలి. లేకపోతే, కైలాసనాథుడి ఘనతల జాబితాను సమగ్రంగా సమ కూర్చటం ఆమెకయినా అసంభవమే అంటుంది ‘శివ మహిమ్నస్త్రోత్రం’.అయితే, భక్తుల అదృష్టం వల్ల, మహాదేవుడు ఎంతటి మహిమాన్వితుడో అంతటి కరుణామయుడు. ఎంత సర్వ సమర్థుడో, అంత ఆడంబర విరహితుడు. అల్ప సంతోషి. ఆయన అనుగ్రహం పొందేందుకు పాండిత్య పాటవాలతో, పటాటోపాలతో పనిలేదు. విస్తృతమైన పూజావిధులూ, విలువైన సామగ్రీ అక్కర్లేదు. కావలసినవేమిటో ‘కాళహస్తీశ్వర శతకం’లో ధూర్జటి కవి చెప్పాడు: సలిలమ్ముల్ చులుక ప్రమాణ(ము), ఒక పుష్పమ్మున్ భవన్మౌళి, ని/ శ్చల భక్తి ప్రతిపత్తి చే నరుడు పూజల్ సేయగా ధన్యుడౌ,/... తుదిన్ కాంచు నీ/ చెలువంబంతయు, నీ మహత్త్వ మిదిగా, శ్రీ కాళహస్తీశ్వరా! శివపూజకు మూడు దినుసులు చాలు. పుడిసెడు (‘చులుక ప్రమాణము’) నీళ్ళు, ఒక్క పుష్పం, నిశ్చలమైన భక్తి భావం– ఈ మూడింటితో పూజ చేసిన భక్తుడు ధన్యుడై చివరకు శివ సాక్షాత్కారం ప్రాప్తింపజేసుకొంటాడు. భోలా శంకరుడే గదా, చేరెడు నీళ్ళతో అభిషేకించి, చిన్న మారేడు దళం అప్పగిస్తే చాలు, పొంగి పోయి బోలెడు వరాలిచ్చేస్తాడు అని గడసరి భక్తులు అనే మాట అర్ధ సత్యమే. నిశ్చల భక్తి అనే నిప్పు లేకుండా, భక్తుడి పప్పు ఉడకదు అనే షరతు వర్తిస్తుంది! - ఎం. మారుతి శాస్త్రి (ఫిబ్రవరి 15న శివరాత్రి) -
మంత్రపుష్పం పరమార్థం ఏమిటి?
పూజలో పూలు వాడతాం. మరి మంత్రపుష్పం ప్రత్యేకత ఏమిటీ అంటే – భగవంతుడికి మనం చేయగలిగిన ఉపచారాలన్నీ చేశాక, పెట్టగలిగిన పదార్థాలన్నీ నైవేద్యం పెట్టాక... మనల్ని మనం ఆ దేవదేవుడికి సమర్పించుకోవడమే మంత్రపుష్పంలోని పరమార్థం. కిందివైపు ముడుచుకుని ఉన్న కమలంలా నాభికి పైనా, గొంతుకు కిందా 12 అంగుళాల పరిమాణంలో ఉన్న భాగం (హృదయం), మనం తిన్న అన్నాన్ని శరీరభాగాలన్నింటికీ సమానంగా పంచుతుందట.దానిపై భాగంలో విచ్చుకున్నట్టు ఉండే సూక్ష్మపద్మంలాంటి చోట నివ్వరిధాన్యపు ముల్లంత (వడ్లగింజ కొస) పరిమాణంలో పసుపురంగు కాంతితో మనలోని పరమాత్మ ఉంటాడంటూ సవివరంగా మన జ్యోతి స్థానాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకాన్ని మంత్రపుష్పంతో (Mantrapushpam) జతచేసి చదువుతాం. అంటే నాలోని ప్రాణం నీవు, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను స్వామీ... అని చెప్పుకోవడం మంత్రపుష్పంలోని పరమార్థం.చదవండి: శఠగోపం ఆకారం ఎందుకలా? -
శఠగోపం ఆకారం ఎందుకలా?
శఠగోపం ఆకారమే చాలా ప్రత్యేకం. ఆలయ గోపురాలు దాదాపు ఇదే ఆకారంలో ఉంటాయి. అలాగే చదరంగా ఉండే తలాలకన్నా వంపుగా అర్ధవృత్తాకారంలో (డోమ్ తరహా) నిర్మాణాలూ పిరమిడ్ తరహాలోనే పనిచేస్తాయి. రాజమందిరాల పై భాగాలు ఇలా ఉండటాన్ని మనం గమనించొచ్చు. అందువల్ల శఠగోపం కూడా అచ్చంగా ఇదే విధంగా పనిచేస్తుంది.ఆత్మజ్ఞానానికి ప్రతీకైన సహస్రార చక్రం మన తలకు పై భాగంలో కాస్త ఎత్తులో ఉంటుంది. అదే జ్ఞానులూ, యోగులకు దాదాపు జానెడు ఎత్తులో ఉంటుంది. అలాంటి సహస్రార చక్రం పైన ఈ శఠగోపాన్ని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఇన్ని రకాలుగా శక్తిని పొందుతాం కాబట్టి, దాన్ని స్థిరపరచుకోవడానికి కాసేపు అక్కడే కూర్చోమని చెబుతారు. చదవండి: స్వర్ణగిరికి బ్రహ్మోత్సవ సిరి -
కన్నుల పండువగా స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు
అపార కారుణ్యమూర్తి, భక్తవత్సలుడు, సర్వగుణ సంపన్నుడు, భూలోక వైకుంఠ క్షేత్ర నాథుడు అయిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ సేవలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం.వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.లోక కల్యాణార్థం సకల శుభప్రాప్తి కోసం అస్మద్ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా... అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలు..విశేష కార్యక్రమాలు అంకురార్పణతో ఆరంభంస్వర్ణగిరీశుని ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. 17 వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహకులు మానేపల్లి రామారావు తెలిపారు.విశేష కార్యక్రమం వివరాలునేటినుంచి పల్లకిసేవ... 12 వ తేది: సింహవాహన సేవ, పరమేష్టివాహనం, నిశాచూర్ణోత్సవం, సాయంత్రం: ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామి వారికి గజవాహన సేవ, అమ్మవారికి హంసవాహన సేవ(లోక కల్యాణం కోసం)13 వ తేది: పల్లకీ సేవ, సుదర్శన ఇష్టిహవనం, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, అశ్వవాహనసేవ.14 వ తేది: పల్లకీసేవ, సకల కార్యసిద్ధి కొరకు విష్వక్సేన ఇష్టి, సాయంత్రం హనుమంతవాహన సేవ. 15 వ తేది: పల్లకి సేవ, సకల విద్యాప్రాప్తి కొరకు హయగ్రీవ ఇష్టి. సాయంత్రం అశ్వవాహన సేవ. 16 వ తేది: పల్లకి సేవ, ధన్వంతరి ఇష్టి, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. 17 వ తేది: సర్వభూపాల వాహన సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్రస్నానం. సాయంత్రం పల్లకి సేవ, పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, బలిహరణ మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, మహా కుంభ సంప్రోక్షణ, శాత్తు మొఖై, వేద విన్నపములు, రుత్విక్వరణం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్టితో పూర్తికానున్నాయి.ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకుసుప్రభాత సేవ, ప్రాతఃకాల ఆరాధన, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, వేదవిన్నపం, విశేష హోమాలు, పంచసూక్త పరివార, ప్రాయశ్చిత్త హోమాలు, నివేదనలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి.చదవండి: మోక్షమార్గం.. శివనామ స్మరణంసాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకుశ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విశేష హోమాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హోమాలు, నివేదన, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి.– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
స్వర్ణగిరికి బ్రహ్మోత్సవాల సిరి : అంగరంగ వైభవంగా ప్రారంభం
అపార కారుణ్యమూర్తి, భక్తవత్సలుడు, సర్వగుణ సంపన్నుడు, భూలోక వైకుంఠ క్షేత్ర నాథుడు అయిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మ్సావ, సంవత్సరోత్సవ సేవలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం.వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. లోక కల్యాణార్థం సకల శుభ్రప్రాప్తి కోసం అస్మద్ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా... అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలు..విశేష కార్యక్రమాలు అంకురార్పణతో ఆరంభంస్వర్ణగిరీశుని ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభ మయ్యాయి. 17వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహకులు మానేపల్లి రామారావు తెలిపారు.విశేష కార్యక్రమం వివరాలు నేటినుంచి పల్లకిసేవ... 12 వ తేది: సింహవాహన సేవ, పరమేష్టివాహనం, నిశాచూర్ణోత్సవం, సాయంత్రం: ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామి వారికి గజవాహన సేవ, అమ్మవారికి హంసవాహన సేవ(లోక కల్యాణం కోసం)13 వ తేది: పల్లకీ సేవ, సుదర్శన ఇష్టిహవనం, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, అశ్వవాహనసేవ, 14 వ తేది: పల్లకీసేవ, సకల కార్యసిద్ధి కొరకు విష్వక్సేన ఇష్టి, సాయంత్రం హనుమంతవాహన సేవ. 15 వ తేది: పల్లకి సేవ, సకల విద్యాప్రాప్తి కొరకు హయగ్రీవ ఇష్టి.సాయంత్రం అశ్వవాహన సేవ. 16 వ తేది: పల్లకి సేవ, ధన్వంతరి ఇష్టి, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. 17 వ తేది: సర్వభూపాల వాహన సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్రస్నానం. సాయంత్రం పల్లకి సేవ, పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, బలిహరణ మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, మహా కుంభ సంప్రోక్షణ, శాత్తు మొఖై, వేద విన్నపములు, రుత్విక్వరణం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్టితో పూర్తికానున్నాయి. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల ఆరాధన, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, వేదవిన్నపం, విశేష హోమాలు, పంచసూక్త పరివార,ప్రాయశ్చిత్త హోమాలు, నివేదనలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠిసాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకుశ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విశేష హోమాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హోమాలు, నివేదన, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!
ఇప్పుడంటే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు చాలా తేలికగా వెళ్లగలుగుతున్నాం. సరైన రవాణా సౌకర్యం లేనందున కొన్ని దశాబ్దాల క్రితం శ్రీవారి దర్శనభాగ్యం నగర వాసులకు చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి సమయంలో ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన బిర్లా మందిర్ ఆ కొరత తీర్చింది. సిటీ జనులే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వారికి ఫేవరెట్గా మారింది. వివాహం తర్వాత, శుభకార్యాలు, పుట్టిన రోజుల సందర్భంగా అందరూ బిర్లా మందిర్కే రావడం... ఇక్కడి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. కొత్తగా పెళ్లయినవారికైతే బిర్లామందిర్కు వెళ్లాల్సిందే అన్న రీతిలో ఖ్యాతికెక్కింది. అలాంటి బిర్లా మందిర్ 50 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు తొలిసారిగా 1976 ఫిబ్రవరి 13న తొలిసారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.చారిత్రక కట్టడాల సరసన ఆధ్యాత్మిక వైభవం భాగ్య నగరం అంటే చారిత్రక కట్టడాలే కాదు. ఆధ్యాతి్మక వైభవం అని చాటుతోంది బిర్లా మందిర్. నౌబత్ పహాడ్ కొండపై పాలరాయితో కొలువుదీరిన ఈ ఆలయం కేవలం ఆధ్యాతి్మక ప్రదేశమే కాదు.. అద్భుత శిల్పకళా వేదిక కూడా. సిటీ నడిబొడ్డున జన కోలాహలం మధ్య ఉన్న ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే కలిగే ప్రశాంతత అటు భక్తులు, ఇటు పర్యాటకులను మంత్రముగ్థులను చేస్తోంది.పాలరాతి సొగసుల మందిరం... పూర్తిగా రాజస్థాన్ నుంచి తెప్పించిన 2000 టన్నుల పాలరాయితో బిర్లా మందిర్ను నిర్మించారు. పదేళ్లపాటు నిపుణులైన శిల్పుల చేత తీర్చిదిద్దారు. ఉత్తర, దక్షిణ భారత వాస్తు శిల్పి రీతుల (గోపుర, రాజస్థానీ) కలయికతో విలక్షణంగా కనిపిస్తుంది. బిర్లా మందిర్లో శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహం 11 అడుగుల ఎత్తులో తిరుమల శ్రీవారిని తలపిస్తూ భక్తిపారవశ్యం కలిగిస్తుంది. శివుడు, గణపతి, హనుమంతుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ, మహాభారత ఘట్టాలు భారతీయ సంస్కృతికి అద్దంపడతాయి. సాయంత్రం తర్వాత విద్యుత్ కాంతులతో మెరిసిపోయే బిర్లా టెంపుల్ పర్యాటకులనూ కనువిందు చేస్తుంది. ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్, బుద్ధుడి విగ్రహం, నగర అందాలు కనువిందు చేస్తుంటాయి. ప్రశాంతత కోరుకునేవారికి, ఫొటోగ్రఫీ ప్రేమికులకు (ఆలయం వెలుపల) బిర్లా మందిర్ మంచి స్పాట్.హైదరాబాద్ ఎక్స్కర్షన్...! అందులో బిర్లా మందిర్ విజిటింగ్..! ఇదీ స్కూల్ పిల్లలకు కొన్నేళ్లపాటు తప్పనిసరిగా కొనసాగిన సంప్రదాయం. అంతేకాదు, టెక్ట్స్ బుక్స్లోనూ బిర్లా మందిర్ విశిష్టత గురించి చెప్పేవారు. దీంతో ఆ టెంపుల్ను చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తహతహలాడేవారు. కొత్త జంటలకు ఫేవరెట్ కొత్తగా పెళ్లయినవారికి సిటీలో ఫేవరెట్ స్పాట్ బిర్లా మందిర్. భక్తి, ప్రశాంతత రెండూ లభించే ప్రదేశం కావడంతో యువ జంటలు ఇక్కడికి రావడాన్ని ఓ కార్యక్రమంగా పెట్టుకునేవారు. వీకెండ్లో హార్ట్ బీట్ అసలే వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఆపై శనివారం..! ఇంకేం వీకెండ్ వస్తే చాలు సిటీ జనులు బిర్లా మందిర్కు పొలోమంటూ పోటెత్తుతుంటారు. వైకుంఠ ఏకాదశి వంటి రోజుల్లో కిక్కిరిసినట్లే. శని, ఆదివారాల్లో అత్యధిక శాతం నగరవాసుల ఆధ్యాత్మిక కేంద్రం ఇదే.ప్రత్యేకతలు ఇవి 1966లో ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ బిర్లా కలలోకి ఈ కొండ, శ్రీ వేంకటేశ్వరస్వామి కనిపించారని చెబుతారు. సమీపంలోని హోటల్ గది నుంచి చూస్తున్న ఆయనకు కొండపై వేంకటేశ్వరస్వామి ఆహా్వనిస్తున్నట్లు అనిపించిందని.. దీంతో బిర్లా మందిర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే రూ.2 కోట్లతో ఏడెకరాలలో హిందూస్థాన్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నౌబత్ పహాడ్పై బిర్లామందిర్ నిర్మించారు. 50 ఏళ్లలో 15 కోట్ల మందిపైగా భక్తులు, పర్యాటకులు సందర్శించారు. సోమ–శుక్రవారం వరకు రోజుకు 5–6 వేలమంది భక్తులు, సందర్శకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 9–11 వేలకు చేరుతుంది. 24 నుంచి స్వర్ణోత్సవాలు శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచి 27 వరకు స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నాం. హోమాలు, అభిషేకాలు, పల్లకీ సేవ, కలశపూజ, పూర్ణాహుతి, శోభాయాత్ర చేపడతాం.– సీఏ శ్యాం కొఠారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ -
మోక్ష మార్గం.. శివనామ స్మరణం
భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒక్కటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు ఉండవు. ఈ సత్య విషయాన్ని తెలియ జెప్పే నిర్గుణ పరతత్వ స్వరూపమే ‘లింగం’. ఈ లింగోద్భవ వేళ శివనామస్మరణ మోక్ష మార్గానికి మార్గమని పెద్దలు చెబుతుంటారు. ఆ సమయంలో రానే వస్తోంది. మహాశివరాత్రి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. తాడిమర్రి/ఎన్పీ కుంట: కాకిముట్టని తీర్థంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో వెలసిన కాటికోటేశ్వర క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన స్వామి.. కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటాడని భక్తుల నమ్మకం. రెండు కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాశీ నుంచి తెప్పించి ప్రతిష్టించిన శివలింగం, నవగ్రహాలు, గదాగుండం, కొండపై గుహలో అక్కమ్మ దేవతలు ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి పర్వదినాన రెండు రోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రానికి అనంతపురం నుంచి నార్పల మీదుగా పార్నపల్లి బస్సులో వెళ్లవచ్చు. అలాగే ధర్మవరం నుంచి పులివెందుల బస్సులో దాడితోట మీదుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.కాకి ముట్టని తీర్థంకాటికోటేశ్వర క్షేత్రంలో కాకులు మచ్చుకై నా కనిపించవు. అందుకే ఈ కోనేటిలోని నీటిని కాకిముట్టని తీర్థమని అంటారు. పూర్వం ఇక్కడి గుహలో వెలసిన అక్కమ్మ దేవతలు కోనేటిలో జలకాలు ఆడేవారని, ఆ సమయంలో వారి వస్త్రాలపై కాకులు రెట్ట వేయడంతో వారు ఆ ప్రాంతంలో కాకులు ఉండకుండా శాసించినట్లుగా ఓ పూర్వగాథ ఉంది.14 నుంచి జాగరణ మహోత్సవాలుఎన్పీకుంట మండలం గూటిబైలులో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు జరిగే తిమ్మమాంబ జాగరణ మహోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ వెలసిన తిమ్మమ్మ మర్రిమాను 8.15 ఎకరాల్లో విస్తరించి, 6,800 ఊడలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది.మహావృక్షం వెనుక పురాణగాథ ఉందిబుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబకు దిగువ గూటిబైలు గ్రామానికి చెందిన బాలవీరయ్యతో వివాహమైంది. కొన్నాళ్లపాటు వీరి జీవితం ఆనందంగా సాగింది. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడిన బాలవీరయ్య మృతి చెందడంతో ఆ రోజుల్లో కొనసాగుతున్న ఆచారం మేరకు తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధం కాగా, చితి పక్కకు వైదొలగకుండా నాలుగు వైపులా ఎండిన మర్రి గుంజలను నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి నేడు మహావృక్షంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.ఆలయ నిర్మాణంతో నిత్య పూజలుబెంగుళూరుకు చెందిన కై వారం యోగినారాయణస్వామి ట్రస్ట్ ధర్మాధికారి డాక్టర్ ఎంఎస్ జయరాం 2011లో తిమ్మమ్మ మర్రిమాను వద్ద తిమ్మమాంబ, బాలవీరయ్య దంపతుల ఆలయంతో పాటు తిమ్మమాంబ సతీసహగమనం చేసిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ ఘాట్ను నిర్మించారు. ఈ సారి జాగరణ మహోత్సవాలను ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. తిమ్మమ్మ మర్రిమానుకు అరకిలోమీటరు దూరంలో శివప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ధ్యానం చేసుకునేందుకు వీలుగా గదులు కూడా నిర్మించారు. -
మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?
ఒక చెరుకు వ్యాపారి డబ్బు బాగా గడించాడు. వయసు మీద పడటంతో మనసు చిన్నగా ఆధ్యాత్మికం వైపు మళ్ళింది. గుడులూ గోపురాలూ తిరిగాడు. నదీ స్నానాలు చేశాడు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. అలా చేస్తున్న క్రమంలో అతడికి హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది.అదేమిటంటే ‘ఏ సేవ మంచిది, మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?’ అని. సమాధానం కొరకు ప్రయత్నించాడు. సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. వారి ఊరికి చాలా దూరంగా ఉన్న గుట్టమీద ఒక సాధువు ఉన్నాడని తెలిసింది. ఆయన్ని అడిగితే సమాధానం దొరుకుతుందని బయలుదేరాడు. దారి సరిగా తెలియక అవస్థలు పడ్డాడు. అప్పటికే బాగా చీకటయ్యింది. వ్యాపారికి ఆ చీకట్లో నడవడం కష్టంగా తోచింది.దారిలో ఒక రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని వ్యాపారిని ప్రశ్నించాడు. తను వెళ్తున్న విషయం చెప్పాడు వ్యాపారి. ‘ఆ గుట్టపైకి వెళ్ళడానికి పగలే కష్టంగా ఉంటుంది. రాత్రయింది కాబట్టి మరింత కష్టం. అందులోనూ పురుగూపుట్రా ఉంటాయి. నేను మీకు తోడుగా వస్తాను’ అని చెప్పి లాంతరు పట్టుకుని బయలుదేరాడు. ఎలాగైతేనేం గుట్ట చేరారు. సాధువును కలిశారు. తను వచ్చిన విషయం చెప్పా వ్యాపారి.‘బాగా రాత్రయ్యింది. అలసిపోయి ఉన్నారు. ఇద్దరూ శుభ్రంగా భోజనం చేసి నిద్రపొండి, ఉదయం మాట్లాడుకుందాం’ అని చెప్పాడు సాధువు. ఇద్దరూ అలాగేనని ఒప్పుకున్నారు. తెల్లారిందే లేదో గబగబా నిద్ర లేచిన రైతు పొలం పని ఉంది, నేను బయలుదేరుతాను’ అన్నాడు.వెంటనే వ్యాపారి ‘‘చీకట్లో ఉన్న నాకు చాలా మంచి సహాయం చేశారు. మీరు లాంతరుతో తోడు రాకుంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాణ్ణి. మీరు చేసిన సహాయం నా జీవితకాలం మరచిపోను’’ అని చెప్పి పడీపడీ నమస్కరిస్తూ అతడిని సాగనంపాడు.చదవండి: సంక్షోభంలో స్థిరత్వంసాధువు చిరునవ్వు ముఖంతో వ్యాపారిని దగ్గరికి పిలిచి ‘ఒక్క రాత్రి, చీకటిలో ఉన్న నీకు లాంతరు సాయం చేశాడని అతడిని ప్రముఖ వ్యక్తిగా ఆదరిస్తున్నావు. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటినుంచి చీకటిలో ఉన్న నీకు ఆరని దీపంలాగా, నీ ఆలనాపాలనా చూసి, మంచి చెడ్డలు నేర్పించారు నీ అమ్మానాన్నలు. ఎన్నో కష్టాలకు ఓర్చి విద్యాబుద్ధులు నేర్పి నిన్ను ఇంతవాడిగా చేసిన అమ్మానాన్నలకి చేసే సేవకన్నా వేరే ఏ సేవా గొప్పదికాదు, వారికి కృతజ్ఞతగా ఉండటానికి మించింది ఏదీ లేదు’ అని హితవు చెప్పాడు.‘నిజమే, నిరంతరం తను కాలుతూ వెలుగునిచ్చే దీపంలాగా మన జీవితాలకు వెలుగునిచ్చే అమ్మా నాన్నలకు మించిన గొప్పవారు ఎవరు ఉంటారని’ తెలుసుకున్న వ్యాపారి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
గంగాతీరంలో బోళా శంకరుడి అత్తారిల్లు..!
దక్ష ప్రజాపతికి తన కూతురు సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒక మహాయాగాన్ని నిర్వహించినప్పుడు సతీదేవిని, మహాశివుడిని ఆహ్వానించడు. పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలనే కోరికతో శివుడు నిరాకరించినప్పటికీ సతీదేవి అక్కడికి వెళుతుంది. తండ్రి చేసిన అవమానంతో యజ్ఞగుండంలోకి వెళ్లి, ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ స్థలమే దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ సమీపంలోని కంఖాల్ ప్రాంతంలో ఉన్న దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించి నాటి పౌరాణిక విశేషాలు తెలుసుకోవచ్చు. శివరాత్రి రోజులలో అత్యంత ప్రాచీన ఆలయాల సందర్శనకు,ఆధ్యాత్మిక విషయాల అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతంది..శక్తి పీఠాల కథకు ఆదిప్రధాన ఆలయం లోపల ఉన్న సతీకుండ్ అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ యజ్ఞగుండంలోనే సతీదేవి అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకుందని విశ్వాసం ఉంది. ఈ ఘటన తరువాత మహాశివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేయగా, విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడని పురాణాలు చెబుతాయి. అవి మొత్తం 108 భాగాలు కాగా, వాటిలో ముఖ్యమైన 54 భాగాలు, మరీ ముఖ్యమైన 18 భాగాలే ఈ శక్తి పీఠాల కథకు మూలంగా భావించే ప్రదేశంగా ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని భక్తులు నమ్ముతారు. ఆలయ ్ర΄ాంగణంలో అనేక ఉ΄ాలయాలు, పవిత్ర వృక్షాలు దర్శనమిస్తాయి. మరోవైపు గంగానది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది. ఇక్కడ భక్తులు పితృకార్యాలు, నదీ పూజలు, పిండప్రదానాలు నిర్వహిస్తారు.అహంకారానికి అంతందక్షేశ్వర్ మహాదేవ్ ఆలయ సముదాయంలో దశ మహావిద్య ఆలయం, బ్రహ్మేశ్వర్ మహాదేవ్ ఆలయం, శని ఆలయం, శ్రీరాముడి దర్బార్, శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు రుద్రాక్ష చెట్టును కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని పూర్తిగా దర్శించాలంటే కనీసం రెండు నుండి మూడు గంటల సమయం వెచ్చించాలి. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడు తన అత్తారింటికి వస్తాడని నమ్మకం ఉంది. శివరాత్రి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ కాలంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksha Mahadev Temple) ఒక ఆలయం మాత్రమే కాదు అహంకారానికి ముగింపు ఉంటుందని తెలియజేసే పవిత్ర స్థలం. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక భూమి. శక్తి పీఠాల కథతో ముడిపడిన పవిత్ర ప్రదేశంగా భక్తుల విశ్వాసంలో నిలిచింది.ఇలా చేరుకోవచ్చు..దక్షేశ్వర మహాదేవ్ ఆలయం సమీప రైల్వే స్టేషన్- హరిద్వార్సమీప విమానాశ్రయం- డెహ్రాడూన్. హరిద్వార్ నుండి 35 కి.మీ. రోడ్ వే ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. తక్కువ ధర, ఆశ్రమాల వంటి ఉచిత వసతితో సహా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయిఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే లభిస్తుంది.గంగానది ఒడ్డునహరిద్వార్ (Haridwar) భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక మతపరమైన ప్రాచీన నగరం. హిందువులకు పవిత్ర స్థలం. అనేక దేవాలయాల సముదాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది హిందువుల ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దక్షేశ్వర మహాదేవ్ హరిద్వార్లోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది హరిద్వార్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కంఖల్లో ఉంది. సలేశ్వరం ప్రకృతి రమణీయతశివరాత్రి నుంచి గుర్తు పెట్టుకోవాల్సిన సందర్శన స్థలాల జాబితా తయారుచేసుకుంటే అందులో చేర్చాల్సిన పర్యాటక ప్రాంతం ‘సలేశ్వరం.’ ప్రకృతి ఏర్పాటు చేసిన ఈ ప్రాంత సందర్శన మనలో ఒక ఉత్తేజాన్ని, శక్తిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం క్షేత్రానికి దగ్గరలో.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువై ఉన్న యాత్రా స్థలం ఇది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లోయలో ఉన్న గుహలో లింగ రూపంలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడి జలపాతానికి సందర్శకులు ముగ్ధులు అవుతుంటారు. లోయలోకి ట్రెక్కింగ్ చేసేవారికి అనుకూలం. లోయ అడుగు భాగంలో ఉన్న శివయ్యను దర్శించుకోవాలంటే గుట్టల మధ్య నుంచి కిందుగా కాలి నడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ దారిలో ఎన్నో గుహల నుండి జాలువారే సన్నని జల ధారలు కనిపిస్తూ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అడుగు భాగంలో ఉన్న గుండం చేరుకున్నాక పైకి చూస్తే .. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి.. మధ్యలో మనం.. తెలియని అనుభూతికి లోనవుతాం. గుండంలోని నీళ్లు అతి చల్లగా, స్వచ్ఛంగా, రుచిగా ఉంటాయి. స్థానిక చెంచులు ఇక్కడ పూజారులుగా ఉంటారు. చైత్ర పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలు జరుపుతారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కి.మీ దూరంలో పరహాబాద్ వస్తుంది. అక్కడి నుంచి మరో 32 కిలో మీటర్ల దూరం దట్టమైన అడవిలోకి వెళ్లాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.అమర్నాథ్ నమ్మకమే శాశ్వతంహిమాలయాల మధ్యలో అమర్నాథ్ మంచు గుహలో మహాశివుడు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. సహజంగా ఏర్పడే ఈ లింగం జీవితం శాశ్వతం కాదు అని, నమ్మకం, విశ్వాసమే శాశ్వతం అని గుర్తు చేస్తుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు. అమర్నాథ్ యాత్ర అనేది శరీరానికి పెద్ద పరీక్ష లాంటిది. పలుచని గాలి, తీవ్రమైన చలి, చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం – ఇవే యాత్రలో భక్తులకు ఎదురయ్యే సవాళ్లు. అందుకే తొలిసారి అమర్నాథ్ యాత్ర చేపట్టిన వారు మొదట్లో కాస్త తటపటాయించినా, భోళాశంకరుడు తన భక్తుడికి కావాల్సిన మనోధైర్యం, శారీరక శక్తిని అందిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రయాణంలో మాటలు తగ్గిపోతాయి. ప్రతి శ్వాస లెక్కతోనే సాగుతుంది. అయినా లక్షలాది మంది ఈ మార్గంలో నడుస్తారు. అద్భుతం కోసమో, అడ్వెంచర్ కోసమో కాదుం పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇలా శివయ్యను దర్శించుకుంటారు. ఈ యాత్రలో ప్రయాణాన్ని బాధగా కాకుండా తత్త్వబోధనగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి అడుగు ఒక ధ్యానం. నిశ్శబ్దం మనలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుంది. మంచు మన మనసు కూడా తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలి అని బోధిస్తుంది. లింగం కరిగిపోతుంది కానీ అనుభూతి మాత్రం మనసులో మిగిలిపోతుంది. అదే అమర్నాథ్ గుహాలయం చెప్పే సారాంశం. అదే శివతత్వం.కేదార్నాథ్ క్షేత్రం ఓ సందేశంప్రతి సంవత్సరం సుమారు ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది. నిత్య పూజలు జరగవు. భక్తుల సందడి, రాకపోకలు ఉండవు. అయినప్పటికీ మహాశివుడు అక్కడే ఉన్నాడని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.ఇక్కడ శివుడిని ఉనికిగా కాకుండా, లేమిగా పూజిస్తారు. అంటే ప్రత్యక్ష దర్శనం లేకపోయినా భక్తి ఆగదనే భావానికి కేదార్నాథ్ ఒక జీవంత ఉదాహరణగా నిలుస్తుంది. వేసవిలో ఆలయం మళ్లీ తెరుచుకున్నప్పుడు భారీ ఉత్సవాల కంటే ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి దీపోత్సవం నిశ్శబ్దంగా జరిగినా, ఆ దీపం ఆలయ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రారంభాన్ని ఒక పండగగా కాకుండా ఆధ్యాత్మిక యాత్రకు నాందిగా భావిస్తారు. ఆ తరువాతే తీర్థయాత్రికుల రాక ప్రారంభమవుతుంది. భక్తి అంటే దేవుడిని ప్రతిరోజూ దర్శించుకోవడమే కాదు. ఆలయానికి నిత్యం వెళ్లడమే కాదు. దూరంగా ఉన్నా దేవుడిని స్మరించడమే నిజమైన భక్తి అని ఈ క్షేత్రం సందేశం ఇస్తుంది. అందుకే ఆలయం మూసి ఉన్న కాలం ముగిసిన వెంటనే భక్తులు దేశం నలుమూలల నుంచి కేదార్నాథ్ దర్శనం కోసం తరలివస్తారు.ఈ ఏడాది ఆలయం తెరుచుకునే తేదీ 2026 సంవత్సరంలో కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 22న ఉదయం సుమారు 7 గంటలకు భక్తుల దర్శనానికి తెరుచుకోనుంది. అలాగే నవంబర్ 11 వరకు దర్శనాలు కొనసాగనున్నట్లు తెలియజేస్తున్నారు. అధికారిక ప్రకటనలు, వాతావరణ పరిస్థితులను బట్టి తేదీలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి యాత్రకు ముందు తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.కాశీ దివ్యమైన అనుభూతిగంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం (Kashi Vishwanath Temple) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు. కాశీలో జీవితం, మరణాన్ని ఒకే తత్వంగా చూస్తారు. గంగానది తీరంలో జరిగే పూజలు, హారతులు, సంస్కారాలు జీవితం శాశ్వతం కాదని గుర్తు చేస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుడిని మాత్రమే కాదు జీవిత సారాన్ని కూడా దర్శించుకుంటారు. జననం, మరణం, మోక్షం అనే చక్రం గురించి ఆలోచిస్తారు.ప్రతీ రోజు జరిగే గంగా హారతి ఒక ఆచారం మాత్రమే కాదు. అది భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మిక అనుభూతి కలిసే ఒక దివ్యమైన సందర్భం. అగ్ని జ్యోతి గంగాజలాలపై ప్రతిబింబించే సమయంలో భక్తులు తమ భయాలు, బాధలు అన్నింటినీ శివుడికి సమర్పించినట్లు భావిస్తారు. కాశీ గురించి చాలా మంది ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మరణించిన వారికి శివయ్యే మోక్ష మార్గాన్ని చూపిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే జీవితంలో ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేయాలని భక్తులు కోరుకుంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయం మనిషికి ఒక సందేశాన్ని కూడా అందిస్తుంది. జీవితం అశాశ్వతంం ఆధ్యాత్మికతే శాశ్వతం అని చాటి చెప్పే పవిత్ర ప్రదేశం కాశీ నగరం. భక్తి అంటే దేవుడిని బయట వెతకడం కాదుం మనలోని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనడం అని చెప్పే పరమ పవిత్ర క్షేత్రం కాశీ. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుచదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు.. ఆ దేశాల్లో లక్షాధికారులే..? -
సహనం: సంక్షోభంలో స్థిరత్వం
భారతీయ జీవన దర్శనం సహనాన్ని కేవలం ఒక సామాన్య గుణంగా కాకుండా, ఒక మహోన్నత తపస్సుగా అభివర్ణించింది. కష్ట సమయాల్లో చలించకుండా ఉండటమే సహనం. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషి ప్రతిదీ తక్షణమే జరిగిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ అత్యుత్సాహం అసహనాన్ని పెంచి, చిన్న విషయాలకే ఒత్తిడికి గురిచేస్తోంది. సహనం అంటే చేతకానితనం కాదు; అది మన మనస్సుపై మనకు ఉండే అద్భుత నియంత్రణ.విత్తనం విత్తిన వెంటనే ఫలాలు అందవు కదా! ఆ విత్తనం మట్టిలో కలిసి, అంకురించి, మొక్కగా ఎదిగి, వృక్షమై, చివరకు పండ్లను అందించడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో ఆ విత్తనం ఎదుర్కొనే ఎండలు, వానలు, గాలివానలు అన్నీ ఓర్పుకు నిదర్శనాలు. జీవితంలో మన శ్రమకు తగ్గ ఫలితం దక్కాలంటే ఈ నిరీక్షణ తప్పనిసరి.ఆర్ష విజ్ఞానంలో సహనానికి భూదేవిని మించిన నిదర్శనం మరొకటి లేదు. సమస్త జీవరాశి తనపై సంచరిస్తున్నా, తనను తవ్వుతున్నా ఆమె చలించకుండా అందరినీ భరిస్తుంది. అలాగే వనవాస సమయంలో పాండవులు చూపిన నిగ్రహం అద్భుతం. రాజభోగాలను వీడి, ఎన్నో అవమానాలను భరిస్తూ సరైన సమయం కోసం వేచి చూశారు. ఆ ఓర్పే వారిని ధర్మ యుద్ధంలో విజేతలుగా నిలబెట్టింది. కోపం క్షణికావేశంలో కలిగే వినాశనం అయితే, సహనం శాశ్వతమైన విజయాన్ని అందించే మౌన శక్తి. పాలు పెరుగుగా మారాలన్నా, రాయి శిల్పంగా మారాలన్నా ఆ ప్రక్రియలో సహనం అంతర్లీనంగా ఉంటుంది. మన సంస్కృతిలో సహనం కలిగిన వాడిని మాత్రమే ధీరుడు అని పిలుస్తారు. నిశ్చలత్వమే నిత్య సత్యమని గుర్తించినప్పుడు ఏ కల్లోలమూ మనల్ని చలింపజేయదు. నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనకు ఇష్టమైన ఫలితం ఆలస్యమైనప్పుడు మనసు ఆందోళన చెందుతుంది. అటువంటి సమయంలో ప్రకృతిని గమనించాలి. ఋతువులు తమ క్రమం తప్పకుండా వస్తాయి, నదులు సుదీర్ఘ ప్రయాణం తర్వాతే సముద్రాన్ని చేరుతాయి. మనం చేసే ప్రయత్నం సరైనదైనప్పుడు, కాలం మనకు సానుకూల ఫలితాన్ని అందిస్తుందనే నమ్మకమే సహనం. కుటుంబ సంబంధాల్లో కానీ, వృత్తి పరమైన సవాళ్లలో కానీ ఆవేశంతో స్పందించే కంటే, సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అనర్థాలు తప్పుతాయి. సహనం మనలో విచక్షణను పెంచుతుంది. ఇది ఒక రకమైన మానసిక పరిపక్వత; ఇది మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.విశ్వజనీన ధర్మం అందించిన ఈ సహన మార్గం వ్యక్తిని స్థితప్రజ్ఞుడిగా తీర్చిదిద్దుతుంది. తొందరపాటు నిర్ణయాలు అపజయాన్ని ఇస్తే, ఓర్పుతో కూడిన అడుగులు విజయతీరాలకు చేరుస్తాయి. మన హృదయంలో సహనం అనే జ్యోతి వెలుగుతున్నంత కాలం ఏ సవాలునైనా అధిగమించవచ్చు. లోకంలో మార్పు అనేది క్రమంగా జరుగుతుంది; ఆ మార్పులో మనం భాగస్వాములవ్వాలంటే సహనం అత్యంత అవసరం. అందుకే మనలో ఉన్న ఓర్పును పెంచుకుంటూ, ప్రశాంతమైన చిత్తంతో లక్ష్యం వైపు సాగిపోదాం. సహనమే శక్తి, సహనమే శాంతి. సర్వం సుమంగళం!వ్యక్తిత్వ వికాస నిపుణులువైదిక సంంస్కృతి బోధించిన తితిక్ష అంటే సుఖదుఃఖాలను, శీతోష్ణాలను సమానంగా భరించే శక్తి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా, విమర్శలు ఎదురైనప్పుడు ఉలిక్కిపడకుండా ఉండటమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. సహనం ఉన్న చోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట దైవత్వం విరాజిల్లుతుంది. మన అంతరంగంలో సహనం అనే వృక్షం పెరిగినప్పుడు, బయటి తుఫానులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ గుణం అలవడిన మనిషికి ప్రతి కష్టం ఒక పాఠంగా, ప్రతి ఓటమి ఒక అనుభవంగా కనిపిస్తుంది. సహనం అనేది మన ఆత్మకు ఉండే కవచం వంటిది; అది మనల్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. – కె. భాస్కర్ గుప్తా -
‘రామాయణ్’ సరికొత్త చరిత్ర
ఆదివారం ఉదయం... అప్పట్లో కేవలం ఒక సెలవు దినం కాదు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారి, దేశమంతా ఒకే నిశ్శబ్దంలో మునిగిపోయే సమయం. సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రజలు పనులన్నీ పక్కనపెట్టి టీవీల ముందు చేరేవారు. ఇళ్లలో ఒక రకమైన భక్తి వాతావరణం నెలకొనేది. దేశవ్యాప్తంగా ఈ స్తబ్ధతకు, ఐక్యతకు కారణం రామానంద సాగర్ (Ramanand Sagar) సృష్టించిన ‘రామాయణ్’ టీవీ సీరియల్. 1987 జనవరి 25న ప్రారంభమైన ఈ ధారా వాహిక కేవలం ఒక వినోద కార్యక్రమంగా కాకుండా భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఒక అపు రూప ఘట్టంగా నిలిచిపోయింది.ప్రస్తుతం ఈ దృశ్యకావ్యం నలభయ్యో వసంతంలోకి అడుగు పెట్టింది. గత నాలుగు దశాబ్దాలలో మీడియా స్వరూపం పూర్తిగా మారిపోయింది. చేతిలో మొబైల్, ఓటీటీలు, వంద లాది ఛానెళ్లు అందుబాటు లోకి వచ్చాయి. అయినా, ‘రామాయణ్’ సాధించిన ఐక్యత, అది నేర్పిన విలువలు నేటికీ ప్రత్యేకమే. భారతీయ జనజీవనాన్ని అంతలా ప్రభావితం చేసిన మరో కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు.దూరదర్శన్ వేదికగా తొలిసారి ఒక మహా కావ్యాన్ని ధారావాహికగా మలిచిన ఘనత రామానంద సాగర్కు దక్కుతుంది. సుమారు 300 మంది నటీనటులతో సాగర్ ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. ప్రధానంగా గోస్వామి తులసీదాస్ ‘రామచరిత్ మానస్’ను ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ, వాల్మీకి రామాయణంతో పాటు ప్రాంతీయ భాషల్లోని కంబన్, భావార్థ, కృతివాస్, రంగనాథ రామాయణాలలోని విశేషాలను పొందుపరిచారు. సీనియర్ నటుడు అశోక్ కుమార్ వ్యాఖ్యానం ఈ సీరియల్కు జాతీయ సమగ్రతా చిహ్నంగా గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మొదట 52 ఎపిసోడ్లుగా ప్లాన్ చేసినా, ప్రేక్షకుల అపూర్వ స్పందన దృష్ట్యా దీనిని 78 ఎపిసోడ్లకు పెంచాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘లవకుశ’ సీక్వెల్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.వ్యాపారపరంగానూ ‘రామాయణ్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. అప్పట్లో ప్రజాదరణ పొందిన ‘బుని యాద్’, ‘చిత్రహార్’ వంటి టీవీ కార్యక్రమాలను వెనక్కి నెట్టి ప్రకటనల ఆదాయంలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రారంభంలో ఒక్కో ఎపిసోడ్కు 15గా ఉన్న ప్రకటనలు, కొద్ది నెలల్లోనే 40కి పెరిగాయి. దూరదర్శన్ ఆదాయంలో ఎనిమిదో వంతు కేవలం ఈ ఒక్క సీరియల్ నుంచే వచ్చేదంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో 10 సెకన్ల ప్రకటన కోసం రూ. 40 వేలు చెల్లించేందుకు 135 సంస్థలు క్యూ కట్టేవి. వారానికి సుమారు రూ. 28 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించి పెట్టిన ఘనత దీని సొంతం.అప్పట్లో దూరదర్శన్ వీక్షకుల సంఖ్య 6 నుంచి 8 కోట్ల మధ్య ఉండగా, రామాయణంలోని కీలక ఎపిసోడ్లను సుమారు 10 కోట్ల మంది చూశారు. ఇది అప్పటి దేశ జనాభాలో దాదాపు ఎనిమిది శాతం. ఈ సీరియల్ ప్రసార సమయంలో వీధులు కర్ఫ్యూను తలపించేవి. జనం అపాయింట్మెంట్లు రద్దు చేసుకునే వారు. ఫ్యాక్టరీల్లో కార్మికులు దొరకని పరిస్థితి ఉండేది.సినిమా హాళ్లలో ఉదయం షోలు (Morning Show) రద్దయ్యేవి. గ్రామాల్లో ఒకటి, రెండు టీవీలు మాత్రమే ఉన్న ఆ రోజుల్లో, జనం కమ్యూనిటీ హాళ్ల వద్ద సామూహికంగా కూర్చుని రామాయణాన్ని వీక్షించే వారు. చాలా ఇళ్లలో ‘రామాయణ్’ వీక్షణ ఒక మతపరమైన ఆచారంగా మారింది. టీవీ సెట్లను శుభ్రం చేసి, పూలమాలలు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించి, ధూపదీపాలతో పూజలు చేసేవారు. శంఖం ఊది మరీ సీరియల్ ప్రారంభించే వారు. 1988 జూలై 31న ప్రసారమైన చివరి ఎపిసోడ్ రోజున ప్రజలు దీపాలు వెలిగించి ముందస్తు దీపావళిలా పండుగ చేసుకున్నారు. ఇందులో రాముడు, సీత పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్, దీపికా చిఖిలియాలను ప్రజలు నిజమైన దైవస్వరూపాలుగా కొలిచారు.చదవండి: నాటి రోజుల్లో రెండో పెద్ద పండుగ‘రామాయణ్’ విజయంతో భారతీయ బుల్లితెరపై పురాణ గాథల పరంపర మొదలైంది. ‘మహాభారత్’, ‘శ్రీకృష్ణ’, ‘విష్ణు పురాణ్’ వంటి ఎన్నో సీరియళ్లకు ఇది మార్గదర్శిగా నిలిచింది. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు భయాందోళనల్లో ఉన్నప్పుడు, దూరదర్శన్ మళ్లీ ఈ సీరియల్ను ప్రసారం చేసింది. ఆ అనిశ్చిత సమయంలో ‘రామాయణ్’ ప్రజలకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. భారతీయ సంస్కృతికి, ఆత్మకు రామాయణం ఒక ప్రతిబింబం. తులసీదాస్ చెప్పినట్లు రాముడు అనంతుడు, ఆయన కథ కూడా అపారమైనది. నిన్నటి కథగా కాకుండా, నేటి తరం జీవన విలువల మార్గదర్శిగా ఈ దృశ్యకావ్యం నిలిచిపోతుంది.– డాక్టర్ అజేయ్ శివర్ల, ఆంగ్ల అధ్యాపకుడు (2026, జనవరి 25తో నలభయ్యో పడిలో దూరదర్శన్ ‘రామాయణ్’ సీరియల్) -
వర్తమానంలోనే ఉందాం..
వర్తమానంలో జీవించడం అనేది ఒక అద్భుతమైన కళ. దీనినే మనం ‘మైండ్ఫుల్నెస్’ అని కూడా పిలుస్తాం. గతం గురించి పశ్చాత్తాపం చెందకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా, ప్రస్తుతం ముందున్న క్షణాన్ని పూర్తిగా అనుభవించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.మనం చాలా పనులు యాంత్రికంగా చేస్తుంటాం. ఉదాహరణకు: అన్నం తినేటప్పుడు టీవీ చూడటం, స్నానం చేసేటప్పుడు ఆఫీసు పనుల గురించి ఆలోచించడం. ఆహారం రుచి, వాసన, అది మీ నోటిలో ఎలా ఉందో గమనిస్తూ తినండి. నేలపై మీ అడుగుల స్పర్శను, గాలిని అనుభూతి చెందండి. తీర్పులు ఇవ్వడం మానుకోండి. మనకు ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు అది ‘మంచి’ లేదా ‘చెడు’ అని వెంటనే ముద్ర వేస్తాం. అలా కాకుండా, ఆ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా గమనించండి. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని మేఘాలను చూస్తూన్నట్లు వదిలేయండి. కానీ వాటితోపాటు కొట్టుకుపోకండి. మనం నియంత్రించలేని విషయాల గురించి (ఉదాహరణకు: ఇతరుల ప్రవర్తన) ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆందోళన అనేది నిజానికి మన మెదడు మనల్ని రక్షించుకోవడానికి ఇచ్చే ఒక సంకేతం. కానీ అది పరిమితి దాటినప్పుడు మన పనితీరును దెబ్బతీస్తుంది. భవిష్యత్తు ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటుంది. అస్పష్టతను భయంగా కాకుండా ఒక అవకాశంగా చూడటం అలవాటు చేసుకోవాలి. వర్తమానంలో జీవించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. భవిష్యత్తు గురించిన అనవసర భయాలు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. పనిలో నాణ్యత పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు పూర్తి శ్రద్ధతో ఉంటారు కాబట్టి బంధాలు బలపడతాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతకడం అలవాటవుతుంది.మనసు పరిగెత్తడం సహజం. అలా వెళ్ళిన ప్రతిసారీ కోప్పడకుండా, ప్రేమగా మళ్ళీ ప్రస్తుత క్షణానికి తీసుకురండి. ఇది ఒక సాధన. పని చేస్తున్నప్పుడు / ప్రయాణంలో ఉన్నప్పుడు ఇష్టదైవ నామాన్ని మెల్లగా జపించండి. ఇది మనస్సును నిలకడగా ఉంచుతుంది. భగవంతుడిని కేవలం గుడిలోనో, పూజాగదిలోనో చూడకుండా, చేసే ప్రతి పనిలోనూ చూడటం. ‘నేను చేసే ఈ పని భగవంతుడికి అర్పితం’ అనే భావనతో పని చేయండి. అప్పుడు ఆ పనిలో నాణ్యత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ‘జరగబోయేది ఏదో భగవంతుడికి తెలుసు, ఆయన చూసుకుంటాడనే నమ్మకం వర్తమానంలో ప్రశాంతతను ఇస్తుంది. ఫలితం మీద ఆశ వదిలేసి, కర్తవ్యాన్ని నిర్వహించడమే గీతలో చెప్పిన సారాంశం. నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసను గమనించడం కూడా ఒక రకమైన ఆరాధనే. శ్వాస అనేది మన శరీరంలో వర్తమానానికి గుర్తు. దేవుడు ఎక్కడో లేడు, మనలో ఉన్న ‘శాంతి’ రూపంలోనే ఉన్నాడు. వర్తమానంలో జీవించడమే భగవంతుడికి మనం ఇచ్చే అతిపెద్ద నైవేద్యం. వర్తమాన కాలంలో ప్రశాంతంగా, సంతృప్తిగా జీవించడం భగవంతుని ఆరాధనలో ఒక అద్భుతమైన మార్గం. రేపటి గురించి ఆందోళన పడకుండా, నిన్నటి గురించి బాధపడకుండా ‘ఈ క్షణంలో’ దైవాన్ని ఎలా అనుభవించాలో మనస్సు పాత జ్ఞాపకాల్లోకో లేదా భవిష్యత్తు భయాల్లోకో వెళ్తున్నప్పుడు, దైవనామాన్ని స్మరించడం వల్ల మనస్సు మళ్లీ వర్తమానంలోకి వస్తుంది.– రామలక్మీ సదానందమ్ -
సప్త వాహనాలపై సప్తగిరీశుడు
ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణాలు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన ఏడు గుర్రాలతో, అనూరువైన సారథి నడుపుతున్న రథాన్ని అధిరోహించి అంతరిక్షంలో మన మాంసనేత్రంతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథం ప్రత్యేకతను తెలియజేస్తూ, మాఘ శుద్ధ సప్తమిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టినరోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని ‘‘రథసప్తమి’’ పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారు నేడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ విశేషాలు...కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణచైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధుల్లో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్యజయంతిగానే గుర్తింపు పొందింది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన సారథీ అంతే.. వికలాంగుడైన అనూరుడు క్షణం విశ్రాంతి తీసుకోడు. ఎప్పుడూ విధి నిర్వహణలోనే ఉంటాడు.సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో ‘అర్క‘ నామంతో సంచరిస్తాడు.సూర్యారాధన ఫలాలుఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చె΄్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్ని పొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యం ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం. అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని శాస్త్రవచనం. రథసప్తమి ... శ్రీవారి వాహన సేవల వివరాలురథసప్తమి సందర్భంగా తిరుమలలో స్వామివారు ఈనెల 25వ తేదీ, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు ద్శనమిస్తారుఉదయం 5.30 నుండి 8 వరకు : సూర్య ప్రభ వాహనం ఉదయం 9 నుండి 10 వరకు : చిన్న శేష వాహనం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు : గరుడ వాహనం మధ్యాహ్నం 1 నుండి 2 వరకు : హనుమంత వాహనం మధ్యాహ్నం 2 నుండి 3 వరకు : చక్రస్నానం సాయంత్రం 4 నుండి 5 వరకు : కల్పవృక్ష వాహనం సాయంత్రం 6 నుండి 7 వరకు : సర్వభూపాల వాహనంరాత్రి 8 నుండి 9 వరకు : చంద్రప్రభ వాహనం– అలిదేన లక్ష్మీకాంత్, సాక్షి, తిరుమల -
శ్రీపంచమి రోజున సరస్వతి మాతను ఎలా పూజించాలంటే..!
ఈ ఆధునిక యుగంలో సమస్తానికీ మూలకారణం విద్య ఒక్కటే. చక్కటి విద్యకారణంగానే పిల్లలు సభ్యమానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. భాషాజ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్పూర్తిగా, నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధిస్తే చాలు ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను ప్రసాదిస్తుంది.సకల కళలకు, విద్యకు అధిదేవత శ్రీసరస్వతీదేవి. వివిధ పురాణాలలో సరస్వతీ ఆవిర్భావం గురించి వివిధ కథనాలు కనబడతాయి. గాయత్రీ ఉపాసనలో కూడా సరస్వతీదేవి ప్రస్తావన కనబడుతుంది. ‘‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి.....’’ అంటూ విధ్యాభ్యాసం ప్రారంభిస్తారు. అగ్నికార్యక్రమాలలో కూడా సరస్వతీదేవి ప్రార్థన కనిపిస్తుంది. ఈ విధంగా సరస్వతీదేవి ప్రస్తావన అన్ని ఙ్ఞాన సముపార్జన కార్యక్రమాలలో, దేవతాపూజా విధానాలలో కనిపిస్తుంది. ఎవరైనా సరే, తమకుగాని, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా వసంత పంచమి నాటి ఉదయమే స్నానాదికాలు ముగించుకుని, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమె ప్రతిమ లేదా చిత్రపటాన్ని తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వులతో చేసిన లడ్లు, చెరుకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్లు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. లేదంటే ఎవరైనా పేద విద్యార్థులను చదివించే బాధ్యతను హృదయపూర్వకంగా తీసుకోవడం లేదా శక్తి కొలది ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలను కొనివ్వడం లేదా పండితులు, గురువులకు గ్రంథాలను బహూకరించడం. (చదవండి: ఇవాల్టితో శబరిమల దర్శనం ముగియనుంది..!) -
ఇవాల్టితో శబరిమల దర్శనం ముగియనుంది..!
శబరిమలలోని భక్తుల దర్శనం ఈరోజు రాత్రి 10 గంటలకు ముగుయనుంది. భక్తులను పంప నుంచి సాయంత్రం 5 గంటల వరకే బయలుదేరడానికి అనుమతిస్తారు. ఉదయం కొద్ది మొత్తంలో డబ్బుతో అభిషేకం జరుగుతుంది. నెయ్యాభిషేకం నిన్న ముగిసింది. హరివరాసనం మంత్రోచ్ఛారణతో నాదం ముగిసిన తర్వాత, రాజ ప్రతినిధి సమక్షంలో గురుతి మణిమండపం ముందు ప్రారంభమవుతుంది.రేపు (జనవరి 20), రాజ ప్రతినిధికి మాత్రమే దర్శనం ఉంటుంది. గణపతి హోమం తర్వాత, తిరువాభరణం తిరుగు ప్రయాణం పండలం శ్రాంపిక్కల్ ప్యాలెస్కు బయలుదేరుతుంది. రాజ ప్రతినిధి దర్శనం తర్వాత, ప్రధాన పూజారి అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం చేసి, ఆలయాన్ని మూసివేయడానికి హరివరాసనం పఠిస్తారు. ప్రధాన పూజారి ఆలయ తాళం చెవులను రాజప్రతినిధికి అప్పగిస్తారు. ఇది కూడా ఒక పద్ధతిలో నియమానుసారంగా జరుగుతుంది. 18వ మెట్టు దిగిన తర్వాత ప్రధాని పూజారి దేవస్వం బోర్డు ప్రతినిధులు, శబరిమల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు తాళలను అప్పగిస్తారు. నెలవారి పూజ ఖర్చులు చెల్లించిన తర్వాత అతను పండలం ప్యాలెస్కు తిరిగి వస్తాడు.ఇదిలా ఉండగా, శబరిమల దర్శనం కోసం స్పాట్ బుకింగ్ కౌంటర్లు నేటి వరకు పనిచేస్తాయి, అప్పటి వరకు అయ్యప్ప భక్తులను దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. పంప, నీలక్కల్, ఎరుమేలిలలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జనవరి 19 వరకు వర్చువల్ క్యూ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. జనవరి 19న, వర్చువల్ క్యూ ద్వారా 30 వేల మందిని, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మంది భక్తులను అనుమతించినట్లు సమాచారం. ఇవాళ మలికప్పురం గురుతిఇవాళ, మలికప్పురం మణిమండపం ముందు శబరిమల యాత్ర ముగుస్తుంది. సన్నిధానం నాదం హరివరాసనం పారాయణంతో ముగిసిన తర్వాత, పండలం రాజప్రతినిధి సమక్షంలో వేడుక జరుగుతుంది. సాయంత్రం గురుతికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. మణిమండపం ముందు వాఝపూల, కురుత్తోల ఉపయోగించి ఐదు 64 నేత్రాల కలాలు తయారు చేస్తారు. మధ్యలో ఒక లాంతరు వెలిగిస్తారు. తర్వాత దీపాలు, పూల దండలతో అలంకరిస్తారు.ఈ గురుతి తంతు కూడా ఒకేసారి మలికప్పురం కన్నిమూల ప్రాంతంలో, కోచుకదత్త ముందు, మలికప్పురం గోపురం తూర్పున జరుగుతుంది. మలికప్పురంలోని రాజప్రతినిధి సాయంత్రం సన్నిధానానికి తిరిగి వస్తారు. అక్కడ హరివరాసనం పూర్తి అయ్యి.. రాజప్రతినిధి తిరిగి వచ్చాక ఈ వేడుక ప్రారంభమవుతుంది. అయితే భక్తులు గురుతి మొదటి వేడుకను మాత్రమే చూడగలరు. గురుతికి ముందు, మలికప్పురం మేల్శాంతి కూడా సన్నిధానానికి తిరిగి వస్తారు.మలికప్పురం గురుతి (Malikappuram Guruthi) అంటే శబరిమల అయ్యప్ప దేవాలయం దగ్గర ఉన్న మలికప్పురం దేవతకు నిర్వహించే ఒక ముఖ్యమైన, వార్షిక పూజా కార్యక్రమం. అయ్యప్ప ఆలయానికి మలికప్పురం దేవత (మాలిక్కపురత్తమ్మ) ఉంటుంది. ఇక్కడ గురుతి పూజ అనేది తీర్థయాత్ర ముగింపులో నిర్వహించే సంప్రదాయ ఆచారం. దీనిలో భాగంగా కొండ దేవతల ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ ఘట్టాన్ని.. అయ్యప్పను సందర్శిన అనంతరం చాలా శుభప్రదంగా భావిస్తారు అయ్యప్ప భక్తులు. (చదవండి: రేపటితో శబరిమల ఆలయం మూసివేత.. ఆదాయం ఎంతంటే?) -
గుప్త దానం
స్వామి వారి దర్శనార్థం తిరుమలకొండకు చాలామంది తమిళ భక్తులు కాలినడకన వెళ్తూ ఉంటారు. వారు కాలికి చెప్పులు వేసుకోరు. ఆడామగా తేడా లేకుండా పసుపు గుడ్డలు ధరించి, భుజానికి సంచి తగిలించి, గోవింద నామస్మరణలు చేస్తూ నడుస్తారు. అలసిన సమయంలో ఏ చెట్టునో ఏ గుడినో ఆశ్రయిస్తారు. దొరికింది తింటారు.తమిళనాడు దాటి ఆంధ్ర సరిహద్దుల్లో ప్రవేశించే దారిలో అనేక పల్లెటూర్లు ఉన్నాయి. ఆ ఊర్లలోని ఒక పల్లెటూరి యువకుడికి ఒక పౌర్ణమి రోజున నడిచి వెళ్ళే భక్తులకు అన్నదానం చేయాలనిపించి తండ్రితో ఆ విషయం చెప్పాడు. ‘‘పేదలమైన మనం అంత ఖర్చుతో కూడుకున్న పనులు చేయలేము, ఆ ఆలోచన మానుకో!’’ అన్నాడు తండ్రి. ‘‘మన దగ్గర డబ్బు లేదు సరే, దానగుణం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వారిని అడుగుదాము’’ అన్నాడు కొడుకు.సరేనని కొడుకును తోడు చేసుకుని తండ్రి ఊరివారినడిగాడు. ఎవ్వరూ స్పందించలేదు. పక్క ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక ధనవంతుడిని కలిశారు. తాను ఎంతమందికైనా చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయగలనని, అయితే, అన్నదానం చేసే చోట తన పేరును పెద్ద అక్షరాలతో రాసి పెట్టాలని కోరాడతను. ఆలోచించి చె΄్తామని అక్కడినుంచి కదిలాడు తండ్రి. వెనుకనే కొడుకు కూడా నడిచాడు.మరో ఊరు వెళ్తూ ఉంటే దారిలో ఒక మధ్యతరగతి రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. అన్నదాన కార్యక్రమానికి దాతలకోసం వెదుకుతున్నామని బదులిచ్చారు. వెంటనే ఆ రైతు ‘‘నాకు ఆ అవకాశం ఇవ్వండి. విందు భోజనం కాక΄ోయినా నా శక్తి కొలది మంచి భోజనమే చేయిస్తాను. అయితే నేను అన్నదానం చేసినట్లుగా ఎక్కడా ప్రచారం చేయకండి. నాకు అలాంటి ప్రచారాలు ఇష్టం లేదు’’ అని చెప్పాడు. అలాగేనని తండ్రి అంగీకరించాడు.పౌర్ణమి రోజు రానే వచ్చింది. భక్తులకు తండ్రీకొడుకు అన్నదానం చేస్తూ ఉన్నారు. కొడుకు తండ్రితో ‘‘ఇప్పుడు మనం చేసే అన్నదానం... పులిహోర, పెరుగన్నం, అరటిపండే కదా. దీనికన్నా చక్కటి భోజనం ఏర్పాటు చేస్తానన్న అతడి విందు ఎందుకు వద్దన్నావు? అని ప్రశ్నించాడు.తండ్రి నవ్వి ‘‘ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే అది దానమవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. పేరు ప్రతిష్టల కోసం చేసేది దానమనిపించుకోదు. అందుకే దాన్ని వద్దన్నాను’’ అని వివరించాడు. తృప్తి్తగా తిన్న భక్తులు ‘అన్నదాతా సుఖీభవ!’ అంటూ అక్కడినుంచి కదిలారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
పండుగను ఆస్వాదిద్దాం
అదే పండగ. కాని తీరు మారింది. గతంలో నలుగురూ కూడి ఆస్వాదన చేసేవారు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదనలో జ్ఞాపకం మిగులుతుంది. ఎంజాయ్మెంట్ క్షణికం. పండుగ చేసుకోవడం సులభమైంది. పెరట్లో పూచే బంతిపూల చెట్ల వరుస నేడు కుండీలు చేరాయి. గ్లోబల్ మార్పుల్లో సంక్రాంతిని కొత్తగా చూడాలి... అంటున్నారు ప్రసిద్ధ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీ దేవి.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వచ్చిన ప్రతి సంక్రాంతి పండగ నాకు బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు మా గిరిజన ప్రాంతపు పల్లెల్లో సంక్రాంతి రోజుల్లో పంటతో పాటు తోటల నుంచి తాజా చిక్కుడు కాయలు, ఏజన్సీ ముళ్ళ వంకాయలూ, పచ్చి మిరపకాయలు ఇళ్ళకు గుట్టగా వచ్చి పడేవి. తియ్య గుమ్మడి పళ్లు సరేసరి. ‘కొసరి నూరిన పచ్చి పసుపు పూత మొగాన గుమ్మడి పూ దుమారమ్ము నద్ది పండ రేగడి బండి నార కన్పండువై ΄÷లుచు మిర్యపు పండు బొట్టు పెట్టి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వీధి‘ అని రాసేడు ఆనాడెప్పుడో కవి. దేశంలో ఇప్పుడు పంట ఉత్పత్తి పెరిగింది. ఎరువులు, పురుగుల మందులు మనవి కాదనుకుంటే దిగుబడి పెరిగింది. బజార్ల నిండా బంతి పూలు, చేమంతి పూలు విరగబడి ఉంటున్నాయి. ఈ ఏడాది చలి కూడా బావుంది. పుష్యమాసానికి తగినట్టు ఉంది. పాత, పాత సంక్రాంతి రోజులను గుర్తుకు తెచ్చింది. మా గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ ఇంత గ్లోబల్ నాగరికత వల్ల కమ్ముకొన్న ΄÷గ అంతటిలోనూ ధనుర్మాసమంతా వీథి వీథినా వాకిళ్లలో ముగ్గులు పెడుతూనే ఉన్నారు.మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ప్రజలు సంక్రాంతి సంప్రదాయ వేడుకలకు గ్లోబల్ మెరుపుల మధ్య పరాకు పడినట్టయేరు. ఎనభయిల్లో మా రాజవొమ్మంగికి టూరింగ్ టాకీస్ వచ్చినప్పుడు జనం సంక్రాంతి పండగని పక్కన పెట్టి విగబడి సినిమాకి పోయేవారు. ఆ రోజుల్లో పండగ తాలూకు అన్ని సంబరాలూ తగ్గేయి. గ్లోబల్ నాగరికత అలా పండుగను వెనక్కు నెట్టింది. కానీ తిరిగి దేశమంతా మళ్లీ కొత్తదారుల్లో పండుగను వెతుక్కుంటోంది. నా చిన్నప్పుడు మా పెరట్లో పశువుల శాల ఉండేది. అక్కడి ఆవు పేడ తీసుకెళ్లి మా వెదురు కంచె అవతల ఉన్న చింత చెట్టు మాను మీద గిరిజన పిల్లలతో కలిసి పిడకలు వేసేదాన్ని. ఆ చింత చెట్టు మాను దాని చుట్టూ ముగ్గురు చేతులు చాపి కౌగిలించుకుంటే పట్టే అంత పెద్దగా ఉండేది. బహుశా ఒక 300 ఏళ్ల వయసు అయి ఉంటుంది దానిది. భోగి పండగ నాటికి ఆ పిడకలన్నీ గుచ్చి భోగిమంటలో వేయటానికి. ఇది ఒక వారం రోజుల కార్యక్రమం. ఇప్పుడు అమెజాన్ నుంచి డైరెక్ట్గా ఆవుపేడ, పిడకలు కూడా వచ్చేస్తున్నాయి. ప్రజలకి ఆ సంప్రదాయం కావాలి, ఎలా దొరికినా సరే. దాంట్లో ఉన్నది అందమా, పుణ్యమా, పురుషార్ధమా అన్నది వేరే విషయం. మేము చదువులకి పట్టణానికి వచ్చినప్పుడు సంక్రాంతి పండక్కి మా పల్లెటూళ్ళకి తరలి వెళ్లే వాళ్ళం. ఎక్కడెక్కడ చుట్టాలూ, బంధువులూ ఇళ్లలో కలిసి పండగ చేసుకునేవారు. ఇవాళ మనిషి రోజులో ఎక్కువ గంటలు సెల్ఫోన్తో జీవిస్తున్నాడు. కానీ సెల్ఫోన్ ద్వారా కూడా చేస్తున్నది సమూహానికి దగ్గర అయ్యే ప్రయత్నమేనేమో. అందులో ఉన్న వాట్సాప్ నిండా ఎన్ని గ్రూపులు ఉంటాయో చెప్పలేం. బయట గ్రూపులే కాక కుటుంబాల గ్రూపులని, కుటుంబాల్లో కజి¯Œ ్స గ్రూపులని, ఒక ఊరి బంధువుల గ్రూపులని రకరకాలు. ఇలా ఒకరినొకరు కలుపుకుంటూ మళ్లీ తిరిగి ఈ పండగలకి ఎక్కడో చోట అందరూ కలవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కలుస్తూ ఉంటున్నారు. పల్లటూర్లు, రిసార్ట్లు నిండి పోతున్నాయి.తిరిగి అవే అరిసెలు, అవే బొబ్బట్లు, అవే చక్రాలు, అవే పిండి వంటలు. పూర్వం వండుకుని తినేవారు. ఇప్పుడు చేయించుకుని తింటున్నారు. సాంకేతికంగా వస్తున్నటువంటి పెనుమార్పులు చూసినప్పుడు, ఇవి మానవ జీవితంలో తీసుకొస్తున్న సౌకర్యాలను గాని, అలజడులను గాని గమనిస్తున్నప్పుడు మన పాత సరదాలన్నీ వెనక్కి పోయాయా అనే విచారం కలుగుతుంది. కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే మనుషులు మళ్ళీ తిరిగి కష్టపడకుండా ఇంకా సులువుగా పండగలను ఎంజాయ్ చేయడానికి సర్వవిధాలా సంసిద్ధులవుతూనే ఉన్నారు. ఇది నగరాలకు కూడా మినహాయింపు కాదు. అసలు జీవితంలో తిండినేనా, అనుబంధాన్నేనా పూర్వం ఆస్వాదించే వారు. ఇప్పుడు ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదన వేరు ఎంజాయ్ వేరు. నేను ఎప్పుడో చె΄్పాను– ఈ ఎంజాయ్మెంట్ అన్నది కూడా గ్లోబలైజేషన్ తాలూకు జార్గాన్ అని. ఎంజాయ్మెంట్ క్షణికం. ఆస్వాదనలో జ్ఞాపకం, కొనసాగింపు ఉంటాయి.సంక్రాంతి పండుగ అంటే మూడు నెలల ముందు నుంచి రైలు టికెట్లు దొరక్కపోవడం, బస్సులు కిటికిటలాడుతూ ఉండటం ఇప్పటికీ ఆ పండగ తాలూకు అట్టహాసాన్ని చెప్తూనే ఉన్నాయి. పల్లెటూర్ల నుంచి, ΄÷లాల నుంచి తోటల నుంచి దూరంగా వచ్చేసిన నేను కూడా సంక్రాంతి పండగ ముందు నాలుగు బంతిపూల కుండీలు, నాలుగు చామంతి పూల కుండీలు కొనుక్కుని ప్రతి ఏడాది బాల్కనీలో పెట్టుకుని కవులను తలుచుకుంటూ ఉంటాను. ‘బంతి పువ్వులకు చామంతులకు నెయ్యమును గూర్చి కబరీభరమ్ము చక్కన కుదిర్చి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వైపు’వాడ్రేవు వీరలక్ష్మీ దేవి రచయిత్రి, సాహితీ విమర్శకులు -
బంగారం పేపర్లతో భగవద్గీత!
యశవంతపుర: కర్ణాటకలోని ప్రఖ్యాత ఉడుపి శ్రీకృష్ణ ఆలయానికి ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువగల బంగారం పేపర్లతో రూపొందించిన భగవద్గీత గ్రంథాన్ని కానుకగా ఇవ్వనున్నారు. 18 అధ్యాయాల్లో 700 స్లోకాలను పొందుపరిచిన స్వర్ణ భగవద్గీతను (Golden Bhagavad Gita) విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. శ్రీకృష్ణ మఠం చరిత్రలో ఇది అపరూపమైన కానుకగా చెప్పుకోవచ్చు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరిస్తారు.వైభవంగా అధ్యయనోత్సవాలుయాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో శ్రీస్వామిని ఆరవ రోజు శ్రీలక్ష్మీనరసింహ స్వామిగా అలంకరించి తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ‘ఇరామానుజ నుత్తందాది ఉపదేశ రత్తినమాలై’అనుసంధానం చేసి, అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలికారు. కాగా.. ఆరు రోజుల పాటు రద్దు చేసిన నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవం, శ్రీసుదర్శన నారసింహ హోమం పూజలు సోమవారం పునః ప్రారంభం అయ్యాయి.– యాదగిరిగుట్ట ధర్మ దర్శనానికి 3 గంటలుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడవీధులు వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు.శ్రీస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామిని 35 వేల మందికిపైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.40,81,041 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: ఆథ్యాత్మిక కథ.. తిరగలి చూడాలి! -
తిరగలి చూడాలి!
ఓ ఉదయం పాండిచ్చేరి పట్టణం నుంచి కారులో ఒక జంట తిరుమల కొండకు దర్శనానికి బయలుదేరింది. వారిది పాండిచ్చేరి స్వంత పట్టణమైనా, ప్రస్తుతం వారు అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. దారి మధ్యలో తిరువళ్ళూరు వద్ద కారు పంక్చర్ అయ్యింది. కారును రోడ్డు పక్కన ఆపి టైరు మార్చుకోవడానికి అవస్థలు పడుతూ ఉన్నారు.అదే దారిలో తిరువళ్ళూరు నుంచి తిరుమలకు మరో జంట వెళ్తూ ఉన్నారు. ఆ తిరువళ్ళూరు జంట, పాండిచ్చేరి జంటను చూసి కారు ఆపింది. సమస్య తెలుసుకుని టైరు మార్చడంలో సహాయం చేయసాగారు. మాటల్లో రెండు జంటలూ దేవుని దర్శనానికి తిరుమలకు వెళ్తున్నట్లు తెలుసుకుని సంతోషపడ్డారు.పాండిచ్చేరి జంట కొంచెం ఒత్తిడితో ఉన్నట్లు గుర్తించింది తిరువళ్ళూరు జంట. దర్శనానికి ఇంకా చాలా సమయం ఉంది కదా, ఎందుకు ఆదుర్దా పడుతున్నారని అడిగింది.‘‘మేము దారిలో ఉన్న నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. అక్కడ శ్రీ పద్మావతీ శ్రీనివాసుల దర్శనం చేసుకుని తిరగలి చూసి ఆపైన కొండకు రావాలి’’ అని సమాధానమిచ్చింది పాండిచ్చేరి జంట.‘‘అవునా... నారాయణవనం అనేది స్వామివారికి కళ్యాణం జరిగిన ప్రదేశమని తెలుసు. కానీ తిరగలి గురించి తెలియదు. అక్కడి తిరగలి అంత విశేషమైనదా?’’ అని ఎదురు ప్రశ్న వేశారు.‘‘ఎంతో విశేషమున్న తిరగలి అది. తప్పకుండా చూసి తీరాలి. గుడిలోని పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన ఉంటుంది. స్వామివారి పరిణయోత్సవ వేడుకల్లో నలుగుపిండి, వడియాల పిండి, పసుపును విసరిన తిరగలి అది. వేల సంవత్సరాలైనా అది చెక్కు చెదరలేదు. మనవారు దాన్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు’’ అని వివరించారు.‘‘అయ్యో... మేము ఇంత దగ్గర ఉండి కూడా ఇన్నాళ్ళూ చూడలేకపోయామే. మీరు అమెరికానుంచి వచ్చి దాన్ని చూస్తున్నారు’’ అని ఆశ్చర్యపోయారు.ఇంతలో టైరును మార్చే పని పూర్తయ్యింది.అందరూ కలిసి నారాయణవనం వెళ్ళారు. ఏడుకొండలస్వామి ఎరుకలసాని వేషంలో ఆ పుర వీధుల్లోనే తిరిగినాడని తెలుసుకుని పులకరించిపోయారు. ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా అవతరించిన శ్రీ మహాలక్ష్మిని శ్రీనివాసుడు వివాహమాడిన పుణ్యక్షేత్రాన్ని కనులారా చూశారు. అమ్మవారు విహారం చేసే విమాన ప్రదక్షిణ మార్గంలో పసుపు కుంకుమలు పెట్టి ఉన్న తిరగలి కనిపించింది. అంత పెద్ద తిరగలిని తామెప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతూ ముక్కుమీద వేలు వేసుకున్నారు. తిరగలిని భక్తిభావంతో తాకిన ఆ నలుగురూ పరవశించిపోయారు. తిరగలిని చూస్తూ ఎంతో బలవంతులైతే కానీ దాన్ని తిప్పలేరని అనుకున్నారు. అప్పట్లో మనుషులు అంత బలంగా ఉండేవారు కాబట్టి అది సాధ్యమయిందని తిరగలికి దణ్ణం పెట్టుకుని తిరుమల ప్రయాణం కొనసాగించారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ప్రశాంత జీవన సూత్రం
సముద్ర తీరాన నిలబడినప్పుడు ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుంది. ఒకరు అలల హోరును చూసి భయపడితే, మరొకరు పాదా లను తడిపే అలల స్పర్శతో పరవశిస్తారు, ఇంకొకరు నీటిపై తేలే రంగురాళ్లను ఏరుకుంటారు. కొందరు విలువైన రత్నాల కోసం లోతుకు వెళ్తారు. తీరాన స్థిరంగా నిలబడి, దేనితోనూ అంటుకోకుండా సముద్ర గమనాన్ని గమనించేవాడే నిజమైన ‘ద్రష్ట’.మన ఆలోచనల నుండి మనం విడివడి, వాటిని కేవలం ఒక సాక్షిగా గమనించినప్పుడు, ఆ ఉద్వేగాల తీవ్రత క్రమంగా క్షీణించి మనసు ప్రశాంత నిర్మల సాగరమవుతుంది. నదిలో కొట్టుకుపోయేవాడు ప్రవాహ వేగాన్ని కొలవలేడు, తీరాన నిలబడేవాడే దాని లోతును గ్రహించగలడు. జీవితంలో సంభవించే పరిణామాలు కూడా అలల వంటివే; అవి మనల్ని తాకవచ్చు గానీ ముంచేయకూడదు. ఈ నిరంతర జాగరూకతే మనల్ని నిలబెడుతుంది. నిశ్చలత్వమే నిత్య సత్యమని గ్రహించినప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు.విశ్వజనీన ధర్మం కేవలం పూజాది క్రతువుల సముచ్చయం కాదు; అది అనంతమైన చైతన్య రహస్యాల నిధి. ముండకోపనిషత్తు ఉద్ఘాటించిన ‘ద్వా సుపర్ణా సయుజా సఖాయా...’ అనే దివ్య మంత్రం మానవ మనస్తత్వానికి ఒక అద్భుత భాష్యం. ఒకే వృక్షంపై నివసించే రెండు పక్షులలో ఒకటి భౌతిక ఫలాలను భుజిస్తూ సుఖదుఃఖాలకు లోనవుతుంటే, రెండవది కేవలం ‘సాక్షి’గా వీక్షిస్తూ ఆనందమయంగా ఉంటుంది. లోకంలోని ద్వంద్వాలను అనుభవించేది ఒక పక్షి అయితే, ఆ అనుభవాన్ని నిర్లిప్తతతో గమనించేది మరో పక్షి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ఒత్తిడి కోరల్లో చిక్కుకున్న ఆధునిక మానవుడికి ఈ సాక్షీభావమే అత్యంత ఆవశ్యకమైన సంజీవని. ఆ దివ్య దృష్టిలోనే జగత్తు అసలైన పరమార్థం నిబిడీకృతమై ఉంది. ఈ నిరంతర ఎరుక కలిగిననాడు మనిషి సామాన్య జీవి నుండి దైవత్వపు అంచులకు చేరుకుంటాడు. జ్ఞానాగ్నితో అజ్ఞానాన్ని దహించి, ఆత్మజ్ఞాన సౌరభాన్ని పొందడమే ఆర్ష సంస్కృతి మనకు బోధించే పరమ రహస్యం. మానవ జన్మ ధన్యమవ్వడానికి ఇటువంటి తాత్విక చింతన ఎంతో అవసరం.భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించిన ‘అసంగత్వమే’ ఈ సాక్షీభావం. తామరాకుపై నీటిబొట్టులా సంసారంలో ఉంటూనే, దేనికీ అంటకుండా ఉండటం ఒక దివ్య కళ. ‘నేను కోపంగా ఉన్నాను’ అని కాకుండా, ‘నా మనసులో కోపం అనే తరంగం ఉద్భవించింది’ అని గమనించడం ప్రారంభించిన క్షణమే ఆ వికారం ఆవిరైపోతుంది. ఇది పలాయనవాదం కాదు; పరిపూర్ణమైన అవగాహనతో కూడిన ప్రశాంత స్థితి. సుఖం వచ్చినప్పుడు అది ఒక అతిథి అని, దుఃఖం సంభవించినప్పుడు అది ఒక తాత్కాలిక మేఘమని భావించాలి.వైదిక విజ్ఞానం మనకు అందించిన ఈ అమోఘమైన దృక్పథం, వ్యక్తిని సమర్థుడిగా, సమాజాన్ని సలక్షణంగా తీర్చిదిద్దుతుంది. ఎక్కడైతే ద్వేషం ఉండదో, ఎక్కడైతే మమకారపు సంకెళ్లు ఉండవో, అక్కడ నిరతిశయమైన శాంతి విరాజిల్లుతుంది. సాక్షీభావంతో జీవించడం నేర్చుకుంటే, ప్రతి రోజూ ఒక ఉత్సవమే, ప్రతి క్షణం ఒక పరమపదమే. చీకటిని నిందించడం కంటే చిన్న దీపాన్ని వెలిగించడం మేలు అన్నట్లు, కల్లోల ప్రపంచంలో మనశ్శాంతి అనే జ్యోతిని వెలిగించుకుందాం. సర్వం ఆ పరమాత్మ స్వరూపం! లోకాః సమస్తాః సుఖినో భవంతు!మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి; ఆకాశం మాత్రం ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. మన ఆత్మ ఆ ఆకాశం వంటి నిర్లిప్త స్థితి. ఇటువంటి మానసిక సంస్కారం అలవడినప్పుడు మనిషి ఏ పరిస్థితిలోనూ చెక్కుచెదరని ధైర్యంతో, ప్రశాంతతతో వ్యవహరించగలడు. అంతిమంగా, మన జీవిత నాటకంలో మనం కేవలం పాత్రధారులమే కాదు, ఆ నాటకాన్ని తిలకించే ప్రేక్షకులం కూడా అని గుర్తించడమే పరమ సత్యం. ఈ జ్ఞానమే మనల్ని బంధవిముక్తులను చేసి మోక్షమార్గాన నడిపిస్తుంది. నిష్కామ కర్మ ద్వారానే సిద్ధి కలుగుతుందని పెద్దల మాట.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
కోడలికి మేడలు లేవని చెబుతాం!
కర్నూలు జిల్లా: తరాలు మారినా, కంప్యూటర్ యుగం నడుస్తున్నా ఆ గ్రామంలో ఇప్పటికీ ఓ ఆచారం కొనసాగుతోంది. ఎంతటి వారైనా, ఉన్నతాధికారులైనా తమ గ్రామంలో ఉండాలంటే ఈ ఆచారాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. గ్రామస్తుల ఆరాధ్య దైవమైన ఉచ్చీరప్ప తాత ఆలయం కంటే ఒక్క ఇంచు కూడా ఎత్తుగా ఇళ్లను కట్టరాదన్నది ఇక్కడ ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం. తమ పెద్దలు ఆచరించి చూపిన నియమాన్ని తాము ఎప్పటికీ పాటిస్తామని ఆ గ్రామస్తులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో 6,500 మంది ఓటర్లు, దాదాపు 2,900 వరకు గృహాలు ఉన్నాయి. గ్రామంలో మోతుబరి రైతైనా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించిన వారైనా, ఆర్థికంగా ఉన్న వారైనా ఇంటిపై మేడలు కట్టరు. గ్రామస్తుల ఆరాధ్య దైవం ఉచీ్చరప్ప తాత ఇక్కడ ఎన్నో మహిమలు చూపి భక్తుల విశ్వాసం పొందారు. తన ఆలయం కంటే ఎత్తుగా ఎవరూ మిద్దెలు నిర్మించుకోరాదని గ్రామస్తులను ఆజ్ఞాపించారు. తద్వారా గ్రామానికి ప్రతిష్ట ఉంటుందని చూచించారు. నాటి ఆయన ఆజ్ఞను గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు. దీంతో ఆ ఊరి కోడలిగా వచ్చే యువతికి, ఆమె బంధువులకు వివాహం కుదుర్చుకునే సమయంలోనే తమకు మేడలు లేవని చెప్పడం సంప్రదాయంగా వస్తోంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా మరోచోట ఖాళీ స్థలం తీసుకొని ఇంటిని నిర్మించుకుంటారు గానీ మిద్దెపై మరో అంతస్తు కట్టే సాహసం చేయరు. పెద్దహోతూరు గ్రామంలో కొలువుదీరిన ఉచ్చీరప్పతాత, సమీపంలోని మరకట్టు గ్రామంలో కొలువుదీరిన సలువప్ప తాత ఆజ్ఞల మేరకు నేటికీ ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అలాగే జని్మంచిన శిశువులకు ఉచీ్చ రప్ప, ఉచీ్చరమ్మ, సలువప్ప తాత పేర్లు పెట్టడం అనవాయితీగా వస్తోంది. -
ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారాన వైకుంఠనాథుడు
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి – భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడట. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని, ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని పెద్దలు చెబుతారు. ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం వలన మోక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే తిరుమలతో సహా అన్ని వైష్ణవ క్షేత్రాలలోనూ భక్తుల సందర్శనకు వీలుగా ఈరోజున తెల్లవారు జాము నుంచే ఉత్తర ద్వారాలు తెరచి ఉంచుతారు. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ఇది సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువుతో ముడిపడిన తిథి. అందుకే ఏకాదశిని హరితిథి అని, వైకుంఠదినమనీ అంటారు. ఇటువంటి ఏకాదశులు మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి. అధికమాసం వచ్చిన సంవత్సరంలో ఇరవై ఆరు వస్తాయి. (చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకూ ఒక అధికమాసం వస్తుంది). వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగానూ, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగానూ మనం పండుగలాగ జరుపుకుంటాం. ఉత్తరాయన ప్రారంభదినం కావడం మూలాన ఇది అత్యంత విశిష్ఠమైనది. ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించింది. అప్పటినుంచి మూసి ఉన్న స్వర్గ ద్వారాలు ఈధనుర్మాసారంభం నుంచి తెరుచుకుంటాయని పురాణ వచనం. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తరద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివినుంచి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశినాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రినుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఇవాళ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.ఉత్తర ద్వారమే వైకుంఠ ద్వారం. ఈ వైకుంఠద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తర ద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం. శ్రీరంగం, తిరుపతి, అన్నవరం, భద్రాద్రి, మంగళగిరి, యాదగిరి గుట్ట, స్వర్ణగిరి వంటి అన్ని క్షేత్రాలలో ఈ ముక్కోటి ఏకాదశిని మహోత్సవంగా జరుపుకుంటారు. ముక్కోటి ఏకాదశిని అత్యంత మహిమాన్వితమైన రోజుగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈనాడు ఉపవాసం, విష్ణుపూజ విశేష ఫలాలనిస్తాయి. వైకుంఠ ఏకాదశినాడు గోపూజ చేయడం చాలమంచిది. విష్ణుమూర్తి సన్నిధిలో ఆవునేతితో దీపం వెలిగిస్తే సర్వపాపాలు హరించి అజ్ఞానమనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. – డి.వి.ఆర్, (మంగళవారం ముక్కోటి) -
కొత్తగా స్వాగతం చెబుదాం...
కాలం అనేది అందరినీ శాసించే శక్తి. మనం కాలాన్ని ఆపలేము, కానీ కాలంతో పాటు మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ‘సమయపాలన, కర్తవ్య నిర్వహణ’ ద్వారా మాత్రమే మనిషి ఈ కాల చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధించగలడు.ఆధ్యాత్మిక కోణంలో ‘క్యాలెండర్’ అనేది కేవలం తేదీలు, వారాల పట్టిక మాత్రమే కాదు, అది మన జీవిత ప్రయాణానికి కాల చక్రానికి ఒక దిక్సూచి వంటిది. అనేక సంస్కృతులలో కాలాన్ని దైవంగా భావిస్తారు (’కాలాయ తస్మై నమః’). క్యాలెండర్ మనకు కేటాయించబడిన పరిమిత సమయాన్ని గుర్తుచేస్తూ, ప్రతి క్షణాన్ని సార్థకం చేసుకోవాలని బోధిస్తుంది. క్యాలెండర్లు (పంచాంగాలు) సూర్యచంద్రుల గమనాన్ని బట్టి రూపొందించబడతాయి. ఇవి మనం ప్రకృతితో, విశ్వంతో ఎలా మమేకమై ఉన్నామో తెలియజేస్తాయి. గ్రహాల గమనం మన మనస్సుపై, శరీరంపై చూపే ప్రభావాన్ని ఇవి సూచిస్తాయి. ధ్యానం, ప్రార్థన లేదా పండుగలకు క్యాలెండర్ ఒక క్రమబద్ధమైన రూపాన్ని ఇస్తుంది. ఒక నిర్దిష్టమైన దినాన ఒక ఆధ్యాత్మిక కార్యాన్ని చేయడం వల్ల మనలో క్రమశిక్షణ, సంకల్ప బలం పెరుగుతాయి.క్యాలెండర్లోని ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అవి చెడుపై మంచి సాధించిన విజయాన్ని లేదా మనలోని అంతర్గత మార్పును సూచిస్తాయి. క్యాలెండర్ ఈ సందర్భాలను గుర్తు చేస్తూ మనల్ని ఉన్నత స్థితికి నడిపిస్తుంది. క్యాలెండర్ గడిచిన, రాబోయే రోజులను (భవిష్యత్తు) చూపిస్తున్నప్పటికీ, అది మనకు ఇచ్చే గొప్ప పాఠం ‘ఈ రోజు’ ప్రాముఖ్యత. ఆధ్యాత్మికంగా, ఈ క్షణంలో జీవించడమే పరమార్థం.క్లుప్తంగా చెప్పాలంటే, క్యాలెండర్ అనేది కాల గమనాన్ని గమనిస్తూ, ఆ కాలంలో మన ఆత్మ ఎదుగుదలకు మనం చేసే ప్రయత్నాలను నమోదు చేసే ఒక సాధనం. గడిచిన ఏడాదిలో మనం చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలను నెమరువేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. మనలోని అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) ఎంతవరకు నియంత్రించాలో ఆలోచించి, కొత్త నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన ప్రారంభం.గడిచిన కాలంలో మనకు అండగా నిలిచిన వారికి, మనల్ని నడిపించిన ఆ దైవానికి లేదా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఆధ్యాత్మిక ఉన్నతికి మొదటి మెట్టు. కృతజ్ఞత కలిగిన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది.కొత్త సంవత్సరంలో కేవలం భౌతికమైన లక్ష్యాలే (డబ్బు, ఉద్యోగం) కాకుండా, ‘నేను ప్రశాంతంగా ఉంటాను‘, ‘నేను ఇతరులకు సహాయం చేస్తాను‘, ‘నేను ప్రతిరోజూ ధ్యానం చేస్తాను‘ వంటి ఆధ్యాత్మిక సంకల్పాలు తీసుకోవడం ముఖ్యం.కాలం అనంతమైనది. గతం ముగిసిప్పాయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. ఈ కొత్త ఏడాదిలో ప్రతి క్షణాన్ని దైవ ప్రసాదంగా భావించి, పూర్తి అవగాహనతో జీవించడమే గొప్ప ఆధ్యాత్మిక సాధన. మన కోసం మనం జీవించడం సహజం, కానీ ఇతరుల కోసం జీవించడం దైవత్వం. ఈ కొత్త సంవత్సరంలో సాటి మనుషులకు, ప్రకృతికి మనవంతు సహాయం చేయడం వల్ల ఆత్మ తృప్తి లభిస్తుంది.‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్నట్లుగా, మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని, జ్ఞానమనే వెలుగు వైపు అడుగులు వేయడమే కొత్త సంవత్సరం ఇచ్చే అసలైన సందేశం. మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేయడం. మనం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపినప్పుడు, తెలియకుండానే మనలో ఒక లోతైన సంతృప్తి, దైవత్వం చోటు చేసుకుంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... నూతన సంవత్సరానికి స్వాగతం చెబుదాం. – రామలక్మీ సదానందమ్ -
మకరజ్యోతి దర్శనం ఎప్పుడంటే..?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తుంటారు. పవిత్రమైన మకర జ్యోతి దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు.. ఎంతో పుణ్యం .. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఆ జ్యోతి దర్శన భాగ్యం కలుగదనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అపురూప దృశ్యం కోసం గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉంటారు. అలాంటి పవిత్ర ఘడియ మకర జ్యోతి 2026లో ఎప్పుడంటే..శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.ఆధ్యాత్మిక ప్రాముఖ్యతమకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలుసన్నిధానంపాండితావళంమాలికాపురం ప్రాంతం – అట్టతోడునీలిమలపుల్మేడుశరణ్ గుత్తిమరకూట్టంభక్తులకు సూచనలు..మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది.(చదవండి: శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!) -
ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్-ఇసుక శాంతాక్లాజ్ శిల్పం..!
ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతి పండుగ, ప్రత్యేక రోజుల సమయంలో ఆయా ఇతి వృత్తంతో కూడిన సైకత శిల్పంతో మన ముందుకు వస్తుంటారు. ఈసారి అచ్చం అలానే అత్యంత ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని అతి పెద్ద శాంతాక్లాజ్ని రూపొందించారు. అయితే దేనితో తెలిస్తే షాకవ్వడం ఖాయం. మరి ఆ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పూరీలోని నీలాద్రి బీచ్లో 1.5 టన్నుల ఆపిల్ పండ్లు, ఇసుకతో అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇది ఏకంగా 60 అడుగుల పొడవు, 22 అడుగుల ఎత్తు. దీన్ని సుమారు 30 మంది విద్యార్థుల సాయంతో తీర్చిదిద్దారు. క్రిస్మస్ శుభాకాంక్షల తోపాటు ప్రపంచ శాంతి, ఐక్యత సందేశాన్ని ఇస్తూ ఈ భారీ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. అంతేగాదు యాపిల్స్తో రూపొందించిన అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంతో ప్రపంచ రికార్డు సృష్టించనుంది కూడా. దీన్ని పట్నాయక్ 22వ పూరీ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా, క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో రూపొందించారు. తన సాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన 30 మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.Puri-based sand artist Sudarshan Patnaik attempts world record with biggest Santa Claus sculpture created with apples. pic.twitter.com/Qsb1Ez7aHY— News Arena India (@NewsArenaIndia) December 24, 2025 (చదవండి: ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?) -
ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?
యావత్తు ప్రపంచం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగతో సందడిగా ఉంటే..ఈ దేశాల్లో ఆ సందడి కానరాదు. ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకరికొకరు గిఫ్ట్లు, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేషన్ వేడుకల్లో మునిగితేలుతుంటే..ఆయా దేశాలు నిశబ్దంతో నిండి ఉంటాయి. కానీ ఆ దేశాలు కూడా క్రిస్మస్ని ఘనంగానే జరుపుకుంటుంది కానీ ఈ డిసెంబర్ 25 మాత్రం కాదట. మరి ఇంతకీ ఏరోజున క్రీస్తూ పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారంటే..ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు, క్రిస్మస్ డిసెంబర్ 25. రష్యా వంటి కొన్ని దేశాల్లో మాత్రం దాదాపు రెండు వారాల తర్వాత, జనవరి 7న వస్తుంది. ఆ రోజు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. చెప్పాలంటే అక్కడ ఆరోజు ఓ విరామం లేదా విశ్రాంతి రోజులా మారిపోతుంది చుట్టూ వాతావరణం. పూర్వం మొత్తం దేశాలన్ని జూలియన్ క్యాలెండర్ అనుసరించేవి. అయితే 1582లో యూరప్లో ఎక్కువ భాగం కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్ను స్వీకరించింది. లీప్ ఇయర్ని జోడించడంతో రెండు క్యాలెండర్లలో రోజులు, తేదీల అమరికలు తేడాలు వచ్చాయి. అయితే కొన్ని దేశాలు మతపరమైన ఆచారాల నిమిత్తం పాత క్యాలెండర్నే అనుసరించాలనే నిబంధనను ఏర్పరుచుకున్నాయి. దాంతో ఈరెండు క్యాలెండర్ల మధ్య మతపరమైన వేడుకలు జరుపుకునే వ్యత్యాసం ఏకంగా 13 రోజులకుపైనే ఉంటుంది. కాబట్టి కొత్త క్యాలెండర్ని స్వీకరించిన దేశాలు డిసెంబర్25న క్రిస్మస్ జరుపుకుంటే..పాత క్యాలెండర్ని అనుసరించేవారు జనవరి 7న జరుపుకుంటారు. అలా రష్యా డిసెంబర్ 25న ఎలాంటి వేడుకలు నిర్వహించదు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ తోపాటు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటుంది. ఆయా దేశాలన్నీ అధికారికంగా రోజువారీ వ్యవహారాలకు గ్రెగోరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తుండగా, మత పరమైన వేడుకలకు జూలియన్ క్యాలెండర్ని అనుసరించడం విశేషం. అంతేగాదండోయ్ రష్యా వంటి దేశాల ప్రజలు ఆరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రంలో ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మాంసాహారంతో విందు ఆస్వాదిస్తారట.ఏసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు. ఇక్కడ ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటే క్రైస్తవ మతంలోని ఒక ప్రధాన శాఖ, ఇది బైజాంటైన్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది.ఆ దేశాల జాబితా ఇదే:రష్యా (Russia)ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలుసెర్బియా (Serbia)జార్జియా (Georgia)బెలారస్ (Belarus)మోల్డోవా (Moldova)మాంటెనెగ్రో (Montenegro)ఉత్తర మాసిడోనియా (North Macedonia)ఎథియోపియా (Ethiopia)ఎరిట్రియా (Eritrea)(చదవండి: క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?) -
సర్వ మానవాళికి శుభ సందేశం క్రిస్మస్
దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకనే తొలి మానవుడిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేలమంటితో నిర్మించాడు. తొలి భార్య భర్తలైన హవ్వ ఆదాములతో అందమైన ఏదెను తోట ఏర్పాటు చేసి స్నేహితునిలా కొనసాగాడు. అయితే దుష్టుడైన సాతాను ప్రభావంతో వారు దేవుని ఆజ్ఞ మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఫలితంగా మానవులకు మరణం సం్రపాప్తమైంది. భూమి శపింపబడింది. భూమిపై మానవ మనుగడ కష్టతరంగా మారింది.అయితే తాను సృష్టించిన మానవుడిని మాత్రం దేవుడు ఎప్పుడూ విడిచి పెట్టలేదు. భూమిపై అక్రమం, స్వార్థం, హింస పెరిగిన తరుణంలో మానవులను రక్షించేందుకు నాయకులను, న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను ఏర్పాటు చేసినా మానవుని స్వభావంలో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. పాపానికి నరుడు బానిసగా మారిపోయాడు. మోసకరమైన హృదయంతో చీకటితో నిండిన జగతిలో నరకానికి వారసుడయ్యాడు. నరక పాత్రుడైన మానవుడ్ని రక్షించి నిత్య జీవం ఇచ్చేందుకు తిరిగి దేవునితో అనుసంధానం చేసేందుకు పరలోక దేవుడే నరరూపధారుడై రెండు వేల సంవత్సరాల క్రితం దివి నుంచి ఈ భువిపైకి వచ్చేందుకు సిద్ధ పడ్డాడు. మానవుల పట్ల దేవుని అపారమైన ప్రేమకు గొప్ప తార్కాణమే క్రిస్మస్.క్రీస్తు జననం సర్వాధికారియైన దేవాది దేవుని జననం ఎంతో ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం. జగముల నేలే రారాజు అతి సామాన్యుడిగా, దీనుడుగా ఈ ధరిత్రిపై అరుదెంచాడు. అందుకు యూదా దేశంలోని బేత్లెహేము వేదికైంది. ఆ కాలంలో యూదా ప్రాంతం అంతా రోమా చక్రవర్తి కైసరు ఔగుప్తు ఏలుబడిలో ఉంది. హేరోదు యూదా ప్రాంతానికి అధినేతగా యూదుల రాజుగా కొనసాగుతున్నాడు. గలిలయ ప్రాంతంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి నజరేతు వాడైన యోసేపుకు ప్రదానం చేయబడిన పరిశుద్ధురాలైన కన్యక మరియ గర్భంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు జననం శుభవార్త దేవుని ప్రధాన దూతయైన గబ్రియేలు ముందుగా మరియకు తెలియచేశాడు. దయా్రపాప్తురాలా అంటూ శుభ వచనం పలికి దేవుని కృప పొందిన నీవు పురుష సంయోగం లేకుండా కన్యకగానే గర్భము ధరించి ఓ కుమారునికి జన్మనిస్తావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు అతడు సర్వోన్నత దేవుని కుమారుడనబడతాడు అని దేవునిదూత చెప్పడంతో నవ యవ్వనంలో ఉన్న మరియ ఎంతో భయపడింది. ఇది ఎలా సాధ్యం అంటున్న తరుణంలో ‘మరియా భయపడకు ఇది కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తితోనే జరుగుతుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడు...’ అన్న దూత పలుకులను మరియ వినయంగా స్వీకరించింది. మరియ తన ప్రమేయం లేకుండా గర్భవతి అయిందని తెలిసిన యేసేపు ఆమెను రహస్యంగా వదిలివేయాలని భావిస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వివాహం కాకుండా ఏ స్త్రీ అయినా గర్భవతి అయితే బహిరంగంగా రాళ్ళతో కొట్టి చంపడం యూదుల ఆచారం. అదే సమయంలో ఈ శుభ వర్తమానం దూత ద్వారా యోసేపుకు చేరుతుంది. యేసేపూ భయపడవద్దు మరియను చేర్చుకొనుటకు సందేహింప వద్దు. పరిశుద్ధాత్మ వలన ఈ కార్యం జరుగుతుంది. ఆమె కుమారునికి యేసు అని పేరుపెట్టాలి ఎందుకంటే తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షిస్తాడు. క్రీస్తు పుట్టుకకు వందల సంవత్సరాలకు ముందే యెషయా, మీకా లాంటి ప్రవక్తల ద్వారా చేసిన ప్రవచనాల నెరవేర్పు జరిగింది. మరియ సుతుడికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడుతుంది దానికి అర్థం ‘దేవుడు మనకు తోడు’. యెషయా క్రీస్తు జననాన్ని ప్రవచిస్తూ ‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని పేర్కొన్నాడు. క్రీస్తుకు ముందుగా నడవడానికి వృద్ధ దంపతులైన జెకర్యా, ఎలీసబెతులకు కుమారుడిగా బాప్తీస్మమిచ్చు యోహాను అనుగ్రహించ బడ్డాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎటువంటి పాపము చేయకుండా పరిశుద్ధత కలవారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.చరిత్ర సాక్షిగా..మానవ చరిత్రలో యేసు నమోదు చేయబడ్డాడు. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని రోమా చక్రవర్తి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ వచ్చింది. యోసేపు దావీదు వంశములో పుట్టిన వాడు గనుక తనకు ప్రదానం చేయబడిన నిండు చూలాలైన మరియను తీసుకొని గలలియలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేముకు బయలు దేరాడు. ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం ముగించుకొని బేత్లెహేము గ్రామం చేరుకున్నారు. అప్పటికే జనాభా సంఖ్యలో రాయబడటానికి వచ్చిన ప్రజలతో బేత్లెహేము గ్రామం క్రిక్కిరిసి పోయింది. ఓ సత్రపు యజమాని దయతలచి తన పశువుల కొట్టంలో ఉండటానికి వీరికి చోటిచ్చాడు. ప్రసవ దినములు నిండటంతో మరియ శిశువును కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టింది. అవని అంతా ఆయనదే అయినా స్థలం లేక రాజుల రాజుకు చివరకు పశువుల తొట్టె పవళించే పాన్పుగా మారిపోయింది. మనలను ధనవంతులుగా చేసేందుకు ఆయన దరిద్రుడాయేను అన్న లేఖనాల నెరవేర్పు నిజమైంది.దివిలో భువిలో సంబరాలుయేసు జన్మించిన వెంటనే అటు పరలోకంలోనూ ఇటు ధాత్రిలోనూ సంబరాలు మొదలయ్యాయి. ముందుగా పొలంలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరుల వద్దకు ప్రభువు దూత శుభవర్తమానం వెళ్ళింది. ఆ దూత ద్వారా కలిగిన ప్రకాశమైన వెలుగును చూసి వారు భయపడగా దూత భయపడ వద్దని చెప్పి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము తెచ్చానని ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడని ఆయనే ప్రభువైన క్రీస్తు’ అని ప్రకటించడం జరిగింది. అనంతరం పరలోకం నుంచి దూతల మహా సైన్యసమూహము ‘సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక‘ అంటూ స్తోత్ర గీతాలతో దేవుని మహిమ పరచారు. గొర్రెల కాపరులు వెళ్ళి పశువుల తొట్టిలో పండుకున్న శిశువును చూచి ఎంతో సంబరపడి శిశువును గూర్చి తాము చూసిన సంగతులన్నీ ఊరంతా ప్రచారం చేశారు. యేసు జననం సందర్భంగా ఆకాశంలో ఒక అరుదైన నక్షత్రం వెలసింది. అది చూసిన తూర్పుదేశపు జ్ఞానులు ముగ్గురు తారను వెంబడించి ముందుగా యెరూషలేము చేరుకొని హేరోదు రాజును కలిసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగి తెలుసుకొని బేత్లెహేము చేరుకొని బాల యేసును చూసి అత్యానందభరితులై సాగిలపడి పూజించి తాము తెచ్చిన బంగారము, సాంబ్రాణి, భోళము ప్రభువుకు కానుకగా సమర్పించారు. అలా క్రీస్తు జననం దివిని భువిని ఏకం చేసింది. దేవుడితో మరల మానవుడు పోగొట్టుకున్న సమాధానం కల్పించింది. అందుకే క్రిస్మస్ సర్వ లోక వేడుకగా మారిపోయింది. సామాన్యులకు, జ్ఞానులకు ఒకే పీట వేసింది. అప్పటినుంచే ప్రపంచ చరిత్ర రెండుగా విభజింపబడింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా పిలువబడింది.క్రిస్మస్ అంటే ఆరాధనక్రిస్మస్ అంటే దేవుని నిండు మనసుతో ఆరాధించడం. మనకోసం పరలోక భాగ్యాన్ని వదులుకొని పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఎలా జీవించాలో ఆచరణాత్మకంగా చూపించిన ఆ ప్రభువును వేనోళ్ళ స్తుతించడమే నిజమైన క్రిస్మస్. ఆరాధన అంటే అల్లరితో కూడిన ఆట, పాటలు కాదు అంబరాన్ని అంటే సంబరాలు జరపడం కాదు, విందులు వినోదాల్లో తెలియాడటం కాదు, హంగు ఆర్భాటం ఆడంబరాల్లో మునిగితేలడం కాదు.. దేవుని ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి. క్రీస్తును హృదయం లో కలిగి ఉండటమే క్రిస్మస్. అదే క్రీస్తుకు కావాల్సిన ఆరాధన. నశించి పోయే ఆత్మలకు నిత్యజీవము వర ప్రసాదంగా అందించాడు. నీతివంతమైన జీవితం, మారుమనస్సు, రక్షణ ద్వారా ఇది సాధ్యం అని చె΄్పాడు అంతేకాదు ఈ లోకాన్ని జయించడానికి కావలసిన ప్రేమ, కరుణ, జాలి, దయ, శాంతం, సహనం, తగ్గింపు, వినయం, ఓర్పు ఎలా కలిగి వుండాలో తన జీవితం ద్వారా నేర్పించాడు. అన్నిటికీ మించి చీకటిలో బతుకుల్లో గొప్ప వెలుగు నింపేందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగునైయున్నాను అని ప్రకటించాడు. ఆయనతో నడిచే వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఈ క్రిస్మస్ శుభవేళ మనందరం క్రీస్తు స్వారూప్యంలోకి మారాలన్నది ఆ కరుణామయుని అభిలాష. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక! ఆమేన్ !!!మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.దేవుడే ఎందుకు దిగి వచ్చాడు?క్రీస్తు రాకకు ప్రధాన కారణం పాపులను రక్షించుటకే. తొలి మానవుడు ఆదాము ద్వారా వచ్చిన పాపపు బీజం తీసివేయడానికి తన పరిశుద్ధ రక్తం ద్వారా సిలువపై బలిదానం ద్వారా ధరవాసులందరికి పాప విమోచన కోసం మనుషుల మధ్య నివసించేందుకు సర్వాధికారియైన దేవుడు శరీరధారి అయ్యాడు. అంతేకాదు యేసు ప్రభు ప్రజలందరికీ రక్షణ సువార్త అందించడం, పాపపు చెరలో వున్న వారికి విడుదల, అంధకారమైన జీవితాల్లో వెలుగు నింపడం, బాధల్లో నలిగి పోయినవారికి ఓదార్పు విడుదల ఇచ్చేందుకే నేను వచ్చానని ప్రకటించాడు.– స్టెర్జి రాజన్ బందెల సీనియర్ పాత్రికేయులు -
లోతైన ఆలోచన
ఒక ఊర్లో కూలీలను పెట్టి బావుల్ని తవ్వించే మేస్త్రీ ఉండేవాడు. ఆ బావి మేస్త్రీ పల్లెలన్నీ తిరిగి ఎవరు బావి తవ్విస్తారో వారికి కూలీలను ఏర్పాటు చేసి బావుల్ని తవ్వించే పని చేసేవాడు. అతడు పనికి ఒప్పుకున్నాడంటే ఆ బావిలో నీళ్ళు పడాల్సిందే. కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అతడికి మంచి పేరుంది. దాంతో బాగా డబ్బు సంపాదించి కొంచెం స్థిమితపడ్డాడు.ప్రతి పౌర్ణమికీ అతడు వీలు కల్పించుకుని దగ్గరున్న పట్టణంలోని గుడికి వెళ్ళేవాడు. అక్కడ ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలను, రామాయణ భారత భాగవతాలను విని ఇంటికి వచ్చేవాడు. తీరికగా ఆ విషయాలన్నీ భార్యకు చెప్పేవాడు. ఆమె చాలా ఆసక్తిగా వినేది. తనకు వచ్చిన అనుమానాలను భర్తనడిగి తెలుసుకునేది. అయితే తాము మాత్రమే వాటిని తెలుసుకోవడం ఆమెకు రుచించలేదు. ‘మరింత మందికి ఆ మంచి విషయాలు తెలియజేస్తే బాగుంటుంది కదా’ అని ఆలోచించసాగింది.ఒకరోజు పనులన్నీ ముగించుకుని ఉపన్యాసాలు వినడానికి పట్టణానికి బయలుదేరబోయాడు మేస్త్రీ. అతడి స్నానానికని ఇంట్లోని చేదబావిలోని నీళ్ళను తోడుతూ ‘ఎవరింట్లో అయినా బావి తవ్విస్తే ఏమి జరుగుతుంది?’ అని అడిగింది. ‘ఆ ఇంట్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు తోడుకుంటారు. వంటకీ, ఇంటికీ వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు.‘అదే ఊరి మధ్యలో చేదబావి తవ్వితే ఏమవుతుంది?’ అని ప్రశ్నించింది.‘అనుమానమెందుకు? ఊర్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మీరు మాత్రమే విని నాకు చెబితే మనవరకే ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. అదే మీరు ఉపన్యాసకులను మన ఊరికి పిలిపిస్తే ఇంకా బాగుంటుంది. మన ఊరి రాములవారి గుడిలో నెలకొకసారి కార్యక్రమం ఏర్పాటు చేస్తే పిల్లలూ, పెద్దలూ అందరూ వింటారు. నలుగురు వింటే నాలుగు లోకాలు విన్నట్లు కదా’ అని మెత్తగా చెప్పింది.‘ఇన్నాళ్ళూ నా భార్యని బావిలోని కప్పనుకున్నాను. కానీ, లోతుగా ఆలోచన చేసే మనిషి’ అని గుర్తించాడు. వెంటనే వెళ్ళి ఉపన్యాసకులతో మాట్లాడి వారిని ఒప్పించాడు. తమ ఊర్లోనే కార్యక్రమాలు ఏర్పాటు చేయించాడు. మొదటగా ఊర్లో వాళ్ళు మాత్రమే వినడానికి వచ్చే వారు. చిన్నగా చుట్టుపక్కల గ్రామాలకు విషయం పాకింది. ఇతర గ్రామాల ప్రజలు మైళ్ళ దూరం నడిచి వచ్చి శ్రద్ధగా వినడం ప్రారంభించారు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, వచ్చి నాలుగు మంచిమాటలు వినే జనాన్ని చూసిన మేస్త్రీ దంపతులకు, నిండుగా నీళ్ళున్న బావిని చూసినంత ఆనందం కలిగింది.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
కర్మ యోగం... కర్తవ్య పాలన
భారతీయ జీవన దర్శనం ప్రకారం ఈ జగత్తంతా దైవమయం. మనం చేసే ప్రతి కర్మను ఆ పరమాత్మకు అర్పించే ‘నైవేద్యం’గా భావించాలి. ఉపనిషత్తులు బోధించిన సూత్రం ప్రకారం, కర్మలను చేస్తూనే వాటి ఫలితాలకు అంటకుండా ఉండటమే జీవన ముక్తి. అహంకారాన్ని వీడి, ‘నేను కర్తను కాదు, కేవలం ఒక నిమిత్త మాత్రుడను’ అనే భావనతో పని చేసినప్పుడు ఆ కర్మకు పుణ్యపాపాలు అంటవు.ఆర్ష ధర్మం ప్రతిపాదించిన అద్భుత జీవన వేదాంతం కర్మయోగం. లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు. అయితే, ఆ కర్మను బంధనంగా మార్చుకోవాలా లేక మోక్ష మార్గంగా మలచుకోవాలా అన్నదే ఇక్కడి అసలైన ప్రశ్న. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందించిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే దివ్య శ్లోకం మానవాళికి ఒక శాశ్వత దిక్సూచి. పని చేయడంపైనే నీకు అధికారం ఉంది గానీ, ఫలితంపై లేదని చెప్పడం వెనుక లోతైన మనస్తత్వ శాస్త్రం దాగి ఉంది. ఫలితంపై అతిగా ఆశ పెంచుకున్నప్పుడు మనిషిలో ఆందోళన, భయం, అసహనం ప్రవేశిస్తాయి. అదేపనిని దైవ కార్యంగా భావించి చేసినప్పుడు ఆ కర్మ ‘యోగం’గా మారుతుంది. ఇది కేవలం సిద్ధాంతం కాదు, నిత్య జీవితంలో అనుసరించదగిన పరమ సత్యం.కర్మయోగం అంటే పలాయనవాదం కాదు, అది సంపూర్ణమైన క్రియాశీలత. ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు కేవలం ఆ ప్రతిమ ఎంత ధరకు అమ్ముడవుతుందనే ఆలోచనతో ఉంటే, ఆ శిల్పంలో జీవం ఉట్టిపడదు. అదే శిల్పి తన నైపుణ్యాన్ని పరమాత్మకు అర్పిస్తున్నాననే భావనతో చెక్కితే, ఆ పనిలో ఒక అలౌకికానందం వెల్లివిరుస్తుంది. అలాగే ఒక వైద్యుడు కేవలం ధనం కోసమే చికిత్స చేస్తే అది వ్యాపారం అవుతుంది. అదే వైద్యుడు రోగిలో దైవాన్ని చూస్తూ, తన విజ్ఞానాన్ని ప్రాణదానానికి అంకితం చేస్తే అది పవిత్ర యజ్ఞమవుతుంది. ఫలితం భగవంతుడి నిర్ణయమని నమ్మి, తన శక్తినంతా చికిత్సపైనే కేంద్రీకరించినప్పుడు ఆ వైద్యుడికి మానసిక ఒత్తిడి ఉండదు. ఈ నిష్కామ బుద్ధి మనిషిని నిరంతరం ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. అగ్ని తన ధర్మాన్ని తాను నిర్వర్తించినట్లు, మనిషి తన స్వధర్మాన్ని నిష్కామంగా ఆచరించాలి.ఈ మార్గంలో అత్యంత ముఖ్యమైనది ‘ఫలత్యాగం’. అంటే ఫలితాన్ని వదిలేయడం కాదు, ఫలితం వల్ల కలిగే హర్ష విచారాలకు అతీతంగా ఉండటం. విజయం వస్తే పొంగిపోకుండా, అపజయం ఎదురైతే కుంగిపోకుండా ఉండే స్థితి కర్మయోగికి మాత్రమే సాధ్యం.యోగశాస్త్రం బోధించిన ఈ నిష్కామ కర్మ సిద్ధాంతం వ్యక్తిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. చేసే పనిలో దైవత్వాన్ని వెతుక్కున్నప్పుడు ఒత్తిడి మాయమై శాంతి ప్రవహిస్తుంది. ప్రతి క్షణం మన కర్మను ఒక ఆరాధనగా మలుచుకుంటే, ఈ ప్రపంచమే ఒక వైకుంఠమవుతుంది. స్వార్థపు చీకటిని తొలగించి, సేవా భావం అనే జ్యోతిని వెలిగించుకుందాం. సర్వం ఈశ్వరార్పణమస్తు! నిప్పు నిప్పును కాల్చదు గానీ, దానిపై పడిన వస్తువును కాలుస్తుంది. అలాగే, అహంకారంతో చేసే కర్మలు బంధాలను సృష్టిస్తే, నిరహంకారంతో చేసే కర్మలు మనసును నిర్మలం చేస్తాయి. సూర్యుడు ప్రతిరోజూ లోకానికి వెలుగును ఇస్తాడు, తనే వెలుగునిస్తున్నాననే అహంకారం ఆయనకు ఉండదు. అటువంటి నిస్వార్థ గుణమే మనల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. నిత్య జీవిత సవాళ్లను సాకులు చెప్పకుండా ఎదుర్కోవడం, బాధ్యతలను భారం కాకుండా గౌరవంగా భావించడం కర్మయోగపు అంతరార్థం. ఈ జ్ఞానమే మనల్ని నిరంతరం కర్మపథంలో నడిపిస్తూ, అంతిమంగా ఆత్మానందానికి చేరువ చేస్తుంది.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
ఆధ్యాత్మిక ఆవాసం ధనుర్మాసం!
సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతితో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసంప్రారంభాన్నే గ్రామీణ ప్రాంతాల్లో పండుగ నెల పెట్టడం అంటారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికమైన ఈ ధనుర్మాసం (Dhanurmasam) 16, మంగళవారం ప్రారంభమైన సందర్భంగా ఆ మాస విశిష్టతలను తెలుసుకుందాం...ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి రెండు పూటలా దీపారాధన చేయడం వల్ల శ్రీమహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఆవాసంధనుర్మాసం విశేషమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. ధనుర్మాసంలో స్నానం, దానం, హోమం, వ్రతం పూజలు చేయడం అత్యంత శుభప్రదం.సుప్రభాతానికి బదులు తిరుప్పావై ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై (tiruppavai) గానం చేస్తారు. అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా పిల్లలకు ప్రసాదం పంచడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెబుతారు.అలక్ష్మిని ఆవలకు నెట్టే లక్ష్మీ పూజపవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి.. వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం సకల శుభదాయకం.చదవండి: నెలగంట కట్టడం అంటే.. ఎంటే తెలుసా?గోదా రంగనాథుల కల్యాణం గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించే అతి ముఖ్యమైన ఆచారం. సాధారణంగా శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి నాడు జరుగుతుంది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే వారు గోదాదేవి, శ్రీ కృష్ణుడు లేదా శ్రీరంగనాథ స్వామి వారిని పూజించాలి. తిరుప్పావై పాశురాలను రోజుకు ఒక్కటి గానం చేయాలి. స్వామివారికి, అమ్మవారికి పొంగలి నివేదించాలి. ధనుర్మాసంలో ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్ఠం. గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం చేయడం పరమ విశిష్టం. మనసు, వాక్కు, శరీరం ఈ త్రికరణాలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకున్న వారికి లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సకల సంపదలూ చేకూరతాయని శాస్త్ర వచనం. -
శబరిమల బంగారం చోరీ కేసులో పురోగతి
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొంత పురోగతి సాధించింది. ఈమేరకు ఒక ప్రవాస వ్యాపారి వాంగ్మూలాన్ని నమోదు చేయగలిగింది. నిన్న సాయంత్రం బుధవారం(డిసెంబర్ 18) పండలం స్థానికుడైన ప్రవాస వ్యాపారి నుంచి వివరణాత్మక వాంగ్మూలం సేకరించింది సిట్ బృందం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ప్రవాస దర్యాప్తు బృందంతో పంచుకున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నంబర్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వాంగ్మూలం ఆధారంగా SIT తదుపరి దర్యాప్తుకు సిద్ధమవుతోంది.ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల శబరిమల బంగారు దోపిడీ వెనుక అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠా ఉందని తనకు సమాచారం అందిందని ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త నుంచి సిట్ గతంలో వాంగ్మూలం నమోదు చేసింది కూడా. దోపిడీలో పాల్గొన్న ఒకరితో తనకున్న వ్యక్తిగత అనుభవాల గురించి ఆ వ్యాపారవేత్త చెప్పాడు కానీ అందుకు సంబంధించి.. ఎటువంటి పత్రాలను ఇంతవరకు అతడు సమర్పించలేదు.ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న రమేష్ చెన్నితల సిట్కి లేఖ రాస్తూ, బంగారు దోపిడీలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాకు ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలని, రూ.500 కోట్ల లావాదేవీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఆయన సిట్ ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. శబరిమల బంగారు దోపిడీలో రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారని చెన్నితల లేఖలో ఆరోపించారు. అలాగే ఆయన ఆ లేఖలో ఇలా వివరించారు.'పురాతన వస్తువులను దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. అతను ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా లేడు. కానీ అతను దర్యాప్తు బృందం, కోర్టు ముందు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రంగా దర్యాప్తు చేసిన తర్వాత నేను అలాంటి మాటలు చెబుతున్నాను. రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు, ఈ ముఠా రాకెట్లకు బంగారు దొంగతనంతో సంబంధం ఉంది. దేవస్వం బోర్డులోని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు ఈ రాకెట్తో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలి. అలాగే పురావస్తు సమూహాలను కూడా దర్యాపు పరిధిలోకి తీసుకురావాలి' అని రమేష్ చెన్నితల లేఖలో డిమాండ్ చేశారు.(చదవండి: శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్లు) -
‘సినిమాలు చూసి సంతోషించండి.. నమ్మకండి’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పురాణ కథలకు సంబంధించిన సినిమాలు చూసి సంతోషించండి. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, కానీ నమ్మకండి’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యాఖ్యానించారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాసభారత ప్రవచనంలో ఆయన మంగళవారం సభాపర్వం ముగించి, వనపర్వంలోకి ప్రవేశించారు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలను శకుని ఉపయోగించాడంటూ ఓ సినిమాలో ప్రధానంగా చూపారని, ఇటువంటి కథనం భారతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ లేదని చెప్పారు. నిజం చెప్పినా ప్రజలు శంకించేంతలా అసత్యాలు ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్యూతానికి పాండవులను మళ్లీ పిలవాలని విదురుడిని ఆదేశించినప్పుడు భీష్మద్రోణ కృపాచార్యులు, గాంధారి తదితర పెద్దలందరూ ధృతరాష్ట్రుడిని వారించడానికి ప్రయత్నిస్తారు. అవినీతి, క్రౌర్యంతో సంపాదించుకున్న సంపద వినాశ హేతువు అవుతుందని హితైషులు హెచ్చరిస్తారు. కానీ, ధృతరాష్ట్రుని బుద్ధి వేరు. మామకాః పాండవాః.. అని ఆయన అనడంలో ఆంతర్యం బయటపడుతోంది. నా వాళ్లు వేరు, పాండవులు వేరు అని దీని భావం. ద్యూతానికి మళ్లీ వచ్చిన ఆహ్వానాన్ని ధర్మరాజు అంగీకరించడాన్ని కొందరు ఆధునికులు విమర్శిస్తారు. బంగారు లేడి ఉండదని తెలిసే, రాముడు దానిని తేవడానికి బయలుదేరినట్టు.. మాయాద్యూతమని తెలిసే, తండ్రి ఆనతి మీర లేక, ధర్మరాజు తిరిగి ఆడటానికి వస్తాడు. విధిని అనుసరించి బుద్ధి ఉంటుంది. పరాజితులైన పాండవులతో వెళ్తున్న ద్రౌపదిని చూసి దుశ్శాసనుడు పలుమార్లు ‘ఎద్దు, ఎద్దు’ అని ఆమెను హేళన చేస్తాడు. భీముడు ఉగ్రుడై దుశ్శాసనుడి రొమ్ము పగులగొట్టి, రక్తం తాగుతానని ప్రతిన చేస్తాడు. తన తొడను ద్రౌపదికి చూపిన దుర్యోధనుడితో తొడలు పగులగొడతానని, లేకపోతే తనకు పుణ్యగతులు కలగవని ప్రతిన చేస్తాడు. తొడలు పగులగొట్టడం యుద్ధనీతికి వ్యతిరేకమే అయినా, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞా పాలన కోసం యుద్ధనీతిని అతిక్రమించవచ్చు’’ అని సామవేదం వివరించారు. పాండవులను వేదవేత్తలు అనుసరించారంటూ ఆయన వనపర్వాన్ని ప్రారంభించారు. వ్యాసుడు వనపర్వంగా పేర్కొన్న పర్వాన్ని నన్నయ అరణ్య పర్వమన్నాడని వివరించారు. తొలుత కంచి కామకోటి సంయమీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని, పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సూచనల మేరకు రుద్రహోమం నిర్వహించి, అనుశాసన పర్వాంతర్గతమైన శివ సహస్రనామ పారాయణ నిర్వహించారు. -
దేవుడి ఖజానా ఏమైంది?
బృందావన్లోని ప్రసిద్ధ బాంకే బిహారీ మందిరంలో దేవుడికి నైవేద్య సమయాల్లో గందరగోళం ఏర్పడింది. అందుకు కారణం ఆలయంలో చెల్లింపులతో కూడిన "ప్రత్యేక పూజలు" చేయడానికి భక్తులను అనుమతించడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిరంతర పూజల వల్ల కృష్ణుడి విశ్రాంతి వేళలు లేకుండాపోయాయని మండిపడింది. అంతేగాదు కాసులకు కక్కర్తిపడి ఇలా చేస్తున్నారా అంటూ ఆలయ అధికారులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలానే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో తెరిచిన ఆలయ ఖజనా వివాదానికి సంబంధించి.. పలు ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!1862లో రాజస్తానీ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్లోని బృందావన్ బాంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఇది ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం. ఈ ఆలయంలో కృష్ణుడిని బాంకే బిహారీగా పూజలందుకుంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు బాల రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..గంటలు మోగించరు, హారతులు ఇవ్వరు. భక్తి శ్రద్ధలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఇలా చేస్తుంటామని ఆలయ పూజారులు చెబుఉతున్నారు. ఏడాదిలో ఒక్కసారి అదికూడా అక్షయ తృతియ రోజున మాత్రమే భక్తులు బాల కృష్ణుని పాదాలను దర్శించుకునే భాగ్యం లభిస్తుందట.ఖజానా వివాదం..అనంతపద్మనాభుని ఆలయంలో మూసి ఉన్న గదిలాంటిదే బృందావన్లోని బాంకే బిహారి ఆలయంలో కూడా ఉంది. అందులో ఎన్నో నిధులు ఉన్నాయని అంతా అనుకునేవారు. ఆ గదిని అక్టోబర్ 2025లో, సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ పర్యవేక్షణలో తెరిచారు. నిజానికి ఈ గది 1970ల నుంచి మూసివేసే ఉంది. సుమారు 54 ఏళ్ల తర్వాత తెరిచే ప్రయత్నం చేస్తే అదికాస్త పెను వివాదాంశమైంది. అయితే ఆ గదిలో ప్యానెల్ సభ్యులు రాగి కూజాలు, రాళ్లు, చెక్కపెట్టే, మూడు వెండి కడ్డీలు, ఒక బంగారు కడ్డీ,కొన్ని పాత్రలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. అయితే అదంతా అబద్ధమంటూ పూజారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన ఆభరణాలు, శతాబ్దాల నాటి కానుకలు అపహరణకు గురయ్యాయని, ప్యానెల్ సభ్యులు తప్పదారి పట్టిస్తున్నారంటూ కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకత కోసం ప్రత్యక్షప్రసారంలో ఆ గది తనిఖీని ప్రసారం చేయాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు. అంతేగాదు ఆలయ సంపద దుర్వినియోగం చేయబడిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికీ ఆ ఆలయ ఖజనా విషయం ఓ వివాదాస్పదమైన మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ప్రధాని మంత్రికి లేఖ సైతం రాశారు. విశేషం ఏంటంటే..ఈ బృందావన్లో ఉన్న కృష్ణుడి ఆలయానికి భారీగానే ఆర్థిక వనరులున్నాయి. ఏకంగా రూ. 400 కోట్ల వరకు బ్యాంకు డిపాజిట్లు, సీలు వేసిన లాకర్లు, భూమి కమతాలు, భారీ విరాళల రికార్డులు ఆడిట్లో ఉన్నట్లు నివేదికలు పేర్కొనడం విశేషం. కాగా, అపహరణకు గురైన ఆస్తులపై తొలి పూర్తిస్థాయి ఆడిట్ని నిర్వహించాలని సుప్రీం కోర్టు ప్యానెల్ ఆదేశించింది.(చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?) -
నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?
ధనుర్మాసం మొదలవ్వగానే అందరూ నెలగంట కడతారు అని అంటుంటారు. పైగా అప్పటి నుంచి ముంగిళ్ల అన్ని రంగవల్లులతో శోభాయమానంగా ఉంటాయి. అసలేంటి ఈ నెలగంట..అందులోని ఆంతర్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!నెలగంట కట్టడం అంటే, సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం (Dhanurmasam) ప్రారంభాన్ని సూచించే ఒక సంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి, గుడిలో గంటలు మోగిస్తూ, పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడుఆలయంలో మోగే గంటల శబ్దమే "నెలగంట". ఇవాళ (డిసెంబర్ 16 వ తేదీన) మధ్యాహ్నం (1. 23)ప్రాంతంలో ధనుస్సులో ప్రవేశిస్తాడు. దానినే మనం ధనుస్సంక్రమణం అంటాం! అలా ధనూరాశిలో ప్రవేశించిన సూర్యుడు - నెలంతా ఆ రాశిలోనే ఉంటాడు. ఇలా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించగానే నెలగంట కట్టడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తరువాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణం!.ఈ నెలగంట కట్టినది మొదలుకొని పెద్ద పండుగ అయ్యేంతవరకు ఊళ్ళో ఎవరూ ఏ శుభకార్యం చేయరు. అంటే ఈ నెలంతా ఈ దీక్షలోనే ఉంటారు. ఈ నెలగంట కట్టడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి..తిరుప్పావై పాశురాలు - వేకువజాము పూజలు నిర్వహిస్తారు. అంతేగాదు అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత 15 రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అలా భోగి పండుగ నాడు ఈ మార్గళి వ్రతం లేదా తిరుప్పావై పూర్తవుతుంది. ఒకరకంగా ఈ నెలగంట మన సంక్రాంతి పండుగ రాకను సూచిస్తుందని చెప్పొచ్చు.ఈ సమయంలో ఏం చేస్తారంటే..పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర, సహస్రనామాలతో ఆరాధించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెలరోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు.(చదవండి: ఈశ్వరీ..జగదీశ్వరీ..) -
హనుక్కా పండుగ అంటే..? అందుకే యూదులు అంతలా..
ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు. హనుక్కా అంటే.."హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.అద్భుతం జరిగిన రోజు..క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు?మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.విందు..ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్లను గిఫ్ట్గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..) -
జీవన నావకు స్నేహ సారథి
ఆపదలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. యుద్ధంలో ధైర్యం చూపించేవాడే అసలైన వీరుడు. దానగుణం కలవాడే నిజమైన ధనవంతుడు. పేదరికంలోనూ పక్కన నిలబడేదే ఉత్తమ భార్య. కష్టాల్లో ఆదుకునేవారే నిజమైన బంధువులు. నిజమైన గుణగణాలు కష్ట సమయాలలోనే బయటపడతాయి. సుఖంలో నవ్వు పంచుకున్నవారంతా స్నేహితులు కారు; కష్టకాలంలో కన్నీళ్లు తుడిచేవాడే కల్మషం లేని బంధువు అని ఇది స్పష్టం చేస్తుంది. వారిచ్చే మానసిక ధైర్యం, ఆపత్కాలంలో మనకు పెద్ద ఆసరా.జీవితం ఓ అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు తోడుగా, నీడగా నిలిచే అనుబంధాలలోకెల్లా స్నేహం అత్యంత మధురమైనది, విలువైనది. రక్తసంబంధం లేకున్నా, ఆత్మ బంధాన్ని పెంచే మనసులతో పెనవేసుకునే ఈ బంధం, సంతోషాన్ని ద్విగుణీకృతం చేసి, దుఃఖాన్ని అర్థం చేసుకుని, భారంగా ఉన్నప్పుడు భుజం తట్టి, విజయాలను ఉత్సాహంగా పంచుకుని, వైఫల్యాలలో ఓదార్పునందించే అమృత భాండం. జీవితంలోని ప్రతీ మైలురాయి వద్ద తోడు నిలిచే స్నేహం, కాలంతో పాటు మరింత గాఢమవుతుంది. స్నేహం లేని జీవితం, రంగులు లేని చిత్రలేఖనంలా, సంగీతం లేని రాగంలా వెలవెలబోతుంది.స్నేహం – జీవన గీతంమన సనాతన ధర్మంలో స్నేహానికి అత్యున్నత స్థానం ఉంది. శ్రీ కృష్ణుడు, కుచేలుడు; రాముడు, సుగ్రీవుడు వంటి అనన్య స్నేహ బంధాలు మన ఇతిహాసాలలో నిబిడీకృతమై ఉన్నాయి. భగవద్గీతలో సైతం స్నేహితుని పట్ల ఉండాల్సిన ఆత్మీయత, త్యాగ భావన పరోక్షంగా ప్రస్తావించబడ్డాయి.‘న మిత్రార్థే పరిత్యజేత్ ప్రియమాత్మానమాత్మనః’. అంటే స్నేహితుడి కోసం తన ప్రియమైన ఆత్మను కూడా త్యజించకూడదు (అంటే, తన ఉనికిని కోల్పోకుండానే స్నేహితునికి ఎంతటి సహాయమైనా చేయాలి). ఇది స్నేహం తాలూకు ఉన్నతమైన ఆత్మార్పణ భావనను తెలియజేస్తుంది. నిజమైన స్నేహితుడు మన ఎదుగుదలకు తోడ్పడతాడే తప్ప, మన అస్తిత్వాన్ని హరించడు. స్నేహం పేరుతో ఒకరిపై ఒకరు ఆధారపడటమో, బలహీనతలను ఆసరాగా తీసుకోవడమో కాకుండా, ఇరువురూ తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే పరస్పరం శక్తిగా మారతారని ఈ సూక్తి తెలియజేస్తుంది.కష్టసమయాల్లో మనం కృంగి΄ోకుండా, మనలో ధైర్యాన్ని నింపి, సరైన మార్గంలో నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే కేవలం కాలక్షేపం కాదు, అది పరస్పర గౌరవం, నమ్మకం, నిస్వార్థ ప్రేమల కలయిక.‘దద్యాత్ దద్యాన్న దద్యాత్ ఖలు మిత్రస్య మిత్రః సదా ప్రార్థనాశీలో న మిత్రం స్యాత్ సదా ప్రార్థనాశీలః.‘అనగా... ఇచ్చేవాడు స్నేహితుడు, కానీ ఎప్పుడూ యాచించేవాడు స్నేహితుడు కాడు. నిజమైన స్నేహం ఇవ్వడం, తీసుకోవడం అనే సమతుల్యతతో కూడుకున్నదని ఈ సుభాషితం తెలుపుతుంది. స్నేహంలో ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడమే గొప్పతనం. నిరంతరం ఏదో ఒకటి ఆశించే వ్యక్తి, నిజమైన స్నేహితుడు కాలేడు. స్నేహం అనేది త్యాగం, నిస్వార్థ ప్రేమల పునాదులపై నిర్మితమైన గొప్ప అనుబంధం. ఇవ్వడంలోనే నిజమైన ఆనందం, స్నేహ మాధుర్యం దాగి ఉన్నాయి.జీవిత గమనంలో స్నేహితుల చేయూత ఎల్లప్పుడూ తోడుగా నిలిచి, ప్రతీ అడుగులోనూ సరికొత్త స్ఫూర్తిని నింపుతుంది. మన జీవితాలను సుసంపన్నం చేసే ఈ అమూల్యమైన స్నేహ బంధాలను పదిలంగా కాపాడుకుంటూ, ప్రతిరోజూ ఆనందాన్ని, శక్తిని పొందుదాం.నిజమైన స్నేహితుడు మనకు లభించిన ఒక వరం. అటువంటి స్నేహాన్ని కాపాడుకోవడమే మన జీవితానికి అసలైన సంపద. మనసులోని మాటను పంచుకోవడానికి, ఆశలను, కలలను సాకారం చేసుకోవడానికి, ఒంటరితనాన్ని దూరం చేయడానికి స్నేహం కంటే గొప్ప ఔషధం లేదు.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా
సాక్షి శబరిమల: శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శబరిమల పరిసరాల్లో నకిలీ పత్రాలతో.. గుర్తింపు కార్డులతో సేవకు వచ్చే వారి కోసం తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంపాబేస్ నుంచి సన్నిధానం వరకు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా పెంచినట్లు వెల్లడించారు.అలాగే భద్రత దృష్టా అధికారులు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో సహా తాత్కాలిక ఉద్యోగుల పత్రాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కొందరు నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయా వ్యక్తుల కోసం పోలీసులు, బోర్డు సమాచారాన్ని పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాని చెప్పారు. అయితే ఒక్కోసారి నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారి పరిస్థితి దృష్ట్యా సాధారణంగా ప్రశ్నించి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, శబరిమల అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నాయి. "రద్దీ పెరిగినప్పుడు దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులు , యాచకులు తరచుగా శబరిమలకు వస్తారు. వారు పోలీసులను, అటవీ శాఖను పట్టించుకోకుండా శబరిమల మార్గంలోని అడవుల్లోనే ఉంటారు. అలాంటివారు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు వంటి పత్రాలతో వస్తారు. వారి రాక భద్రతా ముప్పుని సృష్టిస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. అయ్యప్ప భక్తులను మోసగించి రద్దీ సమయాల్లో అడవిలోకి ప్రవేశించడం వారి నేరశైలి అని తెలిపారు. ఈ నేపథ్యంలో నీలిమల, అప్పచిమేడు, శరణ్గుత్తి తదితర ప్రాంతాల పరిసర అడవులలో డ్రోన్ నిఘాను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పోలీసుల రిజిస్టర్లలో నమోదుకాని కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంపా, సన్నిధానంలో రెవెన్యూ శాఖ స్క్వాడ్, పోలీసు షాడో బృందం 24 గంటలు మోహరించి ఉంటాయని వెల్లడించారు.(చదవండి: శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే) -
ఈశ్వరీ..జగదీశ్వరీ..
బ్రహ్మంగారి మఠంలో కొలువుదీరిన శ్రీ ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగుబంగారమై నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. ఈశ్వరీదేవి మఠంలో నేటి గురువారం నుంచి అమ్మవారి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి చరిత్ర, ఉత్సవాల విశేషాలపై ప్రత్యేక కథనం.శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ప్రబోధకర్త, రాజయోగి, హేతువాది, మహిమాన్వితులు, తత్వవేత్త, సంఘ సంస్కర్త, దైవస్వరూపులుగా వినుతికెక్కారు. ఆయన మనువరాలు శ్రీ ఈశ్వరీదేవి. ఆమె జేజినాయన వలే తత్త్వాలు, కీర్తనలు, కాలజ్ఞానం రాసి విశేష కీర్తి పొందారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ఎక్కువగా భవిష్యత్తును తెలియజేస్తే.. ఈశ్వరిదేవి నోటి నుంచి వెలువడే మాటలు అప్పటికప్పుడే జరిగి తీరేవి. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి ΄ార్వతీదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమె 1703లో స్వస్తిశ్రీ స్వభాను నామసంవత్సరంలో జన్మించారు. వీరబ్రహ్మేంద్రస్వామి రెండో కుమారుడైన గోవిందయ్యస్వామి, గిరియమ్మ దంపతులకు ఈశ్వరమ్మ, కాశమ్మ, శంకరమ్మ అనే ముగ్గురు కుమార్తెలు, ఓంకారమయ్య, సాంబమూర్తి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఈశ్వరమ్మ పెద్దకుమార్తె. బ్రహ్మంగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అందరి పిల్లల్లాగా.. వీధి బడిలో సామాన్య విద్యనభ్యసించారు. సంస్కృతం, తెలుగు భాషలలో పాండిత్యం సంపాదించారు. భారత భాగవతాది గ్రంథాలను స్వయంగా వర్ణించే వారు. నిత్యం యోగం అభ్యసించుట, గ్రంథాల పఠనంతోనే గడుపుతుండేది. 12 ఏళ్ల వయసులోనే... ఒకరోజు గోవిందయాచార్య శయ్యపై పరుండి, తీవ్రమైన ధ్యాననిష్టలో మునిగిపోయారు. అలా మూడు రోజులు ఉన్నారు. పిలిచినా పలకలేదు. దీంతో చనిపోయారేమోనని భావించి.. ఆయన భార్య గిరియమ్మ, బంధుమిత్రులు దుఃఖించటం ప్రారంభించారు. అప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్న ఈశ్వరీదేవి వచ్చి.. దుఃఖించే అంత పని ఏమి జరగలేదని, నాయన పరమాత్మతో ఆత్మను లీనం చేశారని తెలిపారు. ఆమె గది తలుపులు వేసి సాంబ్రాణి ధూపం వేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపిన ‘ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః’ అనే బీజాక్షరి మంత్రాన్ని జపించారు. వెంటనే గోవిందయ్య లేచి కూర్చున్నారు. ఈ విషయాన్ని చూసిన జనం సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఈశ్వరీదేవి సామాన్య మనిషి కాదని, మహిమాన్వితురాలని గుర్తించారు. తండ్రినే గురువుగా భావించి.. ఆయన ద్వారా మంత్రోపదేశం నేర్చుకున్నారు. 14 ఏళ్లు తపస్సు చేసి... బ్రహ్మంగారి మఠానికి సమీపాన ఉన్న నల్లమల కొండ గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞానవాక్సిద్ధి పొందారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్నసాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేయడానికి సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. లోక కల్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు. మఠాధీశులై... తండ్రి గోవిందయ్యస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశులై నిత్యపూజ కార్యక్రమాలు, ఆరాధన గురు పూజోత్సవాలు నిర్వహిస్తుండేవారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. రాజయోగినిగా మారి, శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. భక్తులకు ఎన్నో లీలలు ప్రత్యక్షంగా చూపించారు. ఎందరినో సంస్కరించి జ్ఞాన దీప్తిలా భాసిల్లి.. జనుల గుండెల్లో అమ్మవారిగా కొలువైనారు.సజీవ సమాధి ఈశ్వరమ్మ వారు 1789లో శ్రీ సౌమ్యనామ సంవత్సర మార్గశిర బహుళ నవమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటినుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు. చిన్నమఠం శ్రీ ఈశ్వరిదేవిమఠంగా పేరొందినది. అమ్మవారు సజీవ సమాధి నిష్ట పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గురువుగా భావిస్తారు కనుక శిష్యులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు.భారీగా భక్తుల రాకదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వీరి సౌకర్యం కోసం పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనుంది.ఆరాధనోత్సవాలు నేటి నుంచి 16 వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో రోజూ ఉదయం ప్రభాతసేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం సూక్త΄ారాయణం, అభిషేకం, కుంకుమార్చన, రాత్రి నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే భక్తుల కాలక్షేపం కోసం సంగీత విభావరి, హరికథలు, భజన కార్యక్రమాలు ఉంటాయి.11న కలశోత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.12న ఉదయం అశ్వవాహనం, రాత్రి హంస వాహనంపై అమ్మవారి ఊరేగింప13న (ఈశ్వరీదేవి మార్గశిర బహుళ నవమిన మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన రోజు) ఉదయం దేవతా ఆవాహనం, శాంతి హోమం, సామూహిక కుంకుమార్చనలు, మధ్యాహ్నం దీక్షా అలంకరణ ఉత్సవం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ, తులాభారం, ఊయల సేవ, రాత్రి సింహ వాహన గ్రామోత్సవం ఉంటాయి. 14న గుడి ఉత్సవం, రాత్రి పుష్పరథోత్సవం 15న పూర్వపు మఠాధిపతులు వీరబ్రహ్మయాచార్య స్వాముల వారి ఆరాధన, గ్రామోత్సవం16న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. – వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడప(చదవండి: అరటిచెట్టు వెనక ఆధ్యాత్మిక రహస్యం) -
శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే
శబరిమలలో అంతకంతకు పెరుగుతున్న భక్తుల జనసందోహం. కేవలం నిన్న ఒక్కరోజే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శబరిమలకు తరలివచ్చారు. స్థానిక సంస్థల ఓటింగ్ రోజు(పంచాయతీ ఎన్నికలు) అయినప్పటికీ.. సన్నిధానం, పంపా, శబరిపీఠం, శరణ్గుత్తి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడూ.. ఒక గంటలో ఏకంగా 13 వేల మందికి పైగా భక్తులు శబరికొండ ఎక్కారు. సాయంత్రం 6 గంటలకు దర్శనం కొచ్చే వారి సంఖ్య 75,463 కు చేరుకుంది. 18వ మెట్టు ఎక్కేందుకు శరణ్గుత్తి, మరంకూట్ట మధ్య భారీ క్యూ ఉంది. గత కొన్ని రోజులతో పోలిస్తే.. నిన్న ఒక్కరోజే రద్దీ అధికం. శబరిమలకు వస్తున్న భక్తుల్లో 50 శాతం మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే ఉంటున్నారు. అలాగే నిన్న దర్శనానికి వచ్చిన మలయాళీలలో చాలామంది మలబార్ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం.(చదవండి: Sabarimala: ‘ఉరక్కుళి జలపాతం వైపు వెళ్లొద్దు’) -
గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!
ఆలయంలో వివాహం చేసుకుంటుంటారు చాలామంది. అలాగే కొన్ని ఆలయాలు సాముహిక పెళ్లిళ్లను జరిపిస్తుంటాయి కూడా. మరికొందరు మొక్కుల రీత్యా కూడా ఆలయంలో వివాహం చేసుకుంటారు. అలాంటిది వేల ఏళ్ల నాటి పురాతన ఆలయం ఆకస్మికంగా వివాహాలను నిషేధించాలని గట్టి నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఆలయ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా అక్కడ ప్రభుత్వానికి తెలియజేసింది కూడా. అందుకు సుప్రీం కోర్టు కూడా సమ్మతించడం విశేషం ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే విస్తుపోతారు.బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటి, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ చాలామంది జంటలు వివాహాలు చేసుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారం కూడా. అలాంటిది గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వివాహ వేడుకులను నిలిపివేసింది. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ ఆలయంలో వివాహాలను నిషేధించడం భక్తులలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చరిత్రసోమేశ్వరస్వామి ఆలయం సుమారు 12వ-13వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. దీని నిర్మాణంలో చోళులు, విజయనగర రాజుల నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపేగౌడ కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు లేదా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో వేలాది జంటలు పెళ్లితో ఒక్కటయ్యేవి. అయితే ఆ జంటలే మధ్య సయోధ్య కుదరక విడాకులకు దారితీయడంతో.. ఆ ఆలయ పూజారులు కోర్టుల చుట్టూ తిగరాల్సి వచ్చింది. అంతేగాదు ఆలయ ఆగమ పనులకంటే..కోర్టు చుట్టూ తిరగడమే పనైంది పూజారులకు. ఈ న్యాయపరమైన చిక్కులను నివారించేందుకు, అలాగే పూజారులు ఆయల కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఇలా వివాహాలను నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. హిందూ వివాహాలకు పేరుగాంచిన ఈ ఆలయం ఏటా వందలాది జంటల వివాహాలను ఘనంగా జరిపించేది. ఆలయ గోపురం కింద ఈ వివాహాలు జరిగేవవి. వేద సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా జరిగే ఈ వివాహాలు..ఇటీవల విడాకులు కేసులు అంతకంతకు పెరిగి ఆలయ పవిత్రత మంట కలిసిపోయేలా మారింది. దానికి తోడు ఆ పెళ్లిలో సాక్షులుగా ఉన్న పూజారులు కోర్లుమెట్టాక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతరెండేళ్లలోనే ఆలయ అధికారులకు 50కి పైగా విడాకులు ఫిర్యాదుల అందాయట. చాలా వివాహాలు ఇంట్లోని కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా చేసుకోవడం, కొందరు నకిలీ డాక్యుమెంట్లతో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వాపోయారు. పూజారుల భక్తి సమయం ఆదా అయ్యేలా, అలాగే ఆలయ పవిత్రతను కాపాడుకునేలా ఇలా వివాహాలను నిషేధించక తప్పలేదని చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది అమిష్ అగర్వాల్ మాట్లాడుతూ..ఆలయం ఇతర ఆచారాలు, మతపరమైన వేడుకలను అనుమతిస్తూనే ఉంది. కానీ ప్రస్తుతానికి వివాహాలను అనుమతించబోమని నిర్ణయించింది. ట్రెండ్ను అంచనా వేసి, కమ్యూనిటీ వాటాదారులతో సంప్రదించిన తర్వాత భవిష్యత్తులో ఈ విధానాన్ని సమీక్షించవచ్చని యాజమాన్యం పేర్కొంది." అని చెప్పారు. నిజానికి దక్షిణ భారతదేశంలో దేవాలయాలలో వివాహాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఆ నేపథ్యంలోనే పురాతన దేవాలయాల్లో వీటిని నిర్వహించేందుకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. కానీ పెరుగుతున్న విడాకుల కేసులు, పూజారులను చట్టపరమైన చిక్కుల్లో పడేశాయి. దీంతో అధికారులు సోమేశ్వర ఆలయం మరిన్ని న్యాయమపరమైన చిక్కులను ఎదుర్కొనకుండా ఉండేలా ఈ వివాహాలకు అడ్డుకట్టవేయాల్సి వచ్చింది.(చదవండి: లెట్స్ సింగ్..ఫుల్ స్వింగ్..!) -
ఆత్మనిగ్రహం... ఆత్మస్థైర్యం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిగురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అభివృద్ధి నిలిచిపోయి అథఃపాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు నిగ్రహించుకుంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో మనస్సును అధీనంలో ఉంచుకోవడమే ఆత్మ నిగ్రహం.చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. మనసును నిగ్రహించడం వాయువును బంధించడం కన్నా కష్టమైందని అర్జునుడే స్వయంగా అన్నాడు. భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తనకు సారధ్యం వహిస్తున్న శ్రీ కృష్ణునితో అర్జునుడు ఈ మాటలు పలికాడు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, సహాధ్యాయ గురుపుత్రుడు అశ్వత్థామ, అన్నదమ్ములైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడి పోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని చేతిలో నుంచి ధనస్సును జార విడుస్తూ ‘‘కృష్ణా నాకు విజయం వద్దు... రాజ్య సుఖాలు వద్దు... ఆచార్యుణ్ణి, పితామహుణ్ణి, బంధువులను నేను సంహరించలేను’’ అంటూ మౌనం వహించి విముఖుడై కూర్చుండిపోయాడు. అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. అందువల్లనే అర్జునికి ఇలాంటి స్థితి ఏర్పడింది. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి అంగీకరించాడు. మనోనిగ్రహం పొందడం చేతనే అర్జునుడు తిరిగి మామూలు స్థితికి వచ్చాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్యసంధులుగా, న్యాయవేత్తలుగా, నీతిపరులుగా తీర్చిదిద్దుతుంది. మనో నిగ్రహం అలవడితే సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. అయితే ఆత్మ నిగ్రహానికి, ఆత్మస్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మ స్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ్రపోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ఆత్మ స్ధైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్య సాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతాభావన సాధించేందుకు బలం ఇస్తుంది. ఆధ్యాత్మిక అంశంలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతివ్యక్తి ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడుగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయలోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీత కూడా స్పష్టం చేసింది.– దాసరి దుర్గాప్రసాద్ -
ఇంటి వద్దకే శబరిమల అయ్యప్ప ప్రసాదం..! ఇలా ఆర్డర్ చేయండి..
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇష్టపడని వారుండరు. అంతటి ప్రత్యేకత కలిగిని అరవణ ప్రసాదం ఇంటి వద్దకే నేరుగా వచ్చేస్తుంది. అదికూడా శబరిమలకు వెళ్లక్కర్లేకుండానే అయ్యప్ప ప్రసాదాన్ని నేరుగా పొందొచ్చు. అదెలాగంటే..మనం ఉన్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే సులభంగా శబరిమల అరవణ ప్రసాదం పొందొచ్చు. దీనికోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పోస్టల్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తోంది. శబరిమలలోని పోస్టాఫీస్ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తుల కోసం ఇంటి నుంచే అరవణ ప్రసాదం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. భారతదేశంలో అన్ని పోస్టాఫీసులు నుంచి ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదం కొనుగోలు చేసుకోవచ్చని దేవస్వం బోర్డు పేర్కొంది. భారతదేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల అయ్యప్ప ప్రసాదం అందేలా చేయడమే తమ లక్ష్యమని శబరిమల పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. దీనికోసం ప్రసాదాన్ని ఇంటింటికి చేరవేసే ప్రాజెక్టును పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. ఈ ప్రసాదంలో నెయ్యి, అరవణ ప్రసాదం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం తదితరాలు ఉంటాయి. ధరల వివరాలు..టిన్ కవర్తో కూడిన ప్రసాదం కిట్ కొనడానికి రూ.520లు రుసుము చెల్లించాలి4-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.960లు10-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.1,760 చెల్లించాలిపోస్టాఫీసులో ప్రసాదం ధర చెల్లస్తే..రాబోయే కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం స్వయంగా మీ ఇంటికి వచ్చి తీరుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది అయ్యప్ప ఆలయం మకర సంక్రాంతి జ్యోతి దర్శనం నిమిత్తం తెరిచి..కొద్దిరోజుల అనంతరం మూతబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేయబడుతుంది. అలాగే వచ్చిన స్టాంప్లను పంపాలో సురక్షితంగా ఉంచుతారు. అంతేగాదు భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత ప్రత్యేకమైన పిన్కోడ్ (689713) కలిగి ఉన్న ఏకైక దైవం శబరిమల అయ్యప్ప స్వామి. వార్షిక మకరజ్యోతి ప్రారంభం కాగానే శబరిమల అయ్యప్ప ఆలయానికి వివిధ లేఖలు అందుతాయి. ఆ భక్తుల లేఖలు అయ్యప్ప పాదాల వద్ద ఉంచడం అనేది అక్కడొక ఆచారం. ఇక్కడి పోస్టాఫీసు ద్వారానే భక్తుల ఇళ్లకు ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.(చదవండి: అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..) -
అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..
సాక్షి శబరిమల: సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ రాత్రికి నాడ మూసివేస్తే రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు యాత్రికులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఆ తర్వాత భద్రతలో భాగంగా, పోలీసులు, కేంద్ర దళాలు CRPF, RAF, NDRF, యాంటీ టెర్రర్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సంయుక్తంగా రూట్ మార్చ్ నిర్వహించనున్నారు.నాడ మూసివేత అంటే..నాడ అంటే శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే ప్రధాన మర్గం. ఇది అయ్యప్ప భక్తులకు, ముఖ్యంగా దీక్షధారులకు అతి ముఖ్యమైనది. సింపుల్గా చెప్పాలంటే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే మెట్ల మార్గం. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఆలయ ప్రవేశ మార్గం. అందువల్ల ఈ మెట్లమార్గం గుండా ఉండే ప్రధాన ద్వారాన్ని మూసివేస్తే..భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఇక్కడే స్వామివారికి ఆలయ పూజారులు విశేష పూజలు జరుపుతారు. భక్తులు తెచ్చే ఆవునేతితో అయ్యప్పకు అభిషేకం చేస్తారు.ఇదిలా ఉండగా, సన్నిధానం పంపా, నీలక్కల్ వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి నాడ మూసివేశాక, తిరుముట్టం, దాని పరిసరాలు ప్రత్యేక పోలీసుల రక్షణలో ఉంటాయి. ఎప్పుడైతే నాడ మూసివేస్తారో ఆ తదనంతరం యాత్రికులను పాపంతల్ వద్ద క్యూలో నిలబెడతారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు నాడ తెరిచిన తర్వాత మాత్రమే భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతిస్తారు. సన్నిధానం వైపు ట్రాక్టర్ల తరలింపును రెండు రోజులుగా పరిమితం చేశారు. ట్రాక్టర్లలో తీసుకువచ్చిన వస్తువులను కూడా తనిఖీ చేస్తారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని సిబ్బంది ద్వారం గుండా తిరుముట్టంలోకి ప్రవేశించడానికి అనుమతించరు. ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరంగా ఉంటుంది. ఇక ఫుట్పాత్ వద్ద దర్శనం ప్రారంభంలో స్కానర్లు డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హోల్డ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించే స్రీనింగ్ తనిఖీ తదితరాలు పర్యవేక్షణ ఉంటుంది.(చదవండి: పులిమేడు రూట్లో భక్తుల రద్దీ) -
సకల సంకటాలను తొలగించే సంకట చతుర్థి
డిసెంబర్ 7, ఆదివారం సంకష్టహర చతుర్థి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. సాధారణంగా క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహర చతుర్థి ఎప్పుడనేదీ ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి.ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు. సూర్యాస్తమయం (Sunrise) అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి.ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం (Fasting) చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం నాలుగుసార్లు పఠించి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఉపవాసం చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకట నాశన గణేశ స్తోత్రం పఠించినా ఫలితం ఉంటుంది.చదవండి: దత్తజయంతి నాడు ఏమి చేయాలి? -
కార్తికేయుని అనుగ్రహంతోనే యోగప్రాప్తి
సాధారణంగా కొన్ని దేవాలయాలలో రెండు సర్పాలు ఒక దానితో మరొకటి మెలికలు తిరుగుతూ ఉన్న శిల్పం మనకు కనిపిస్తుంది. ఆ శిల్పంలో ఉండే రెండు సర్పాలు మన సూక్ష్మ శరీరంలో ఏ విధంగా ఇడా, పింగళా నాడులు ఒక దానితో ఒకటి మెలికలు తిరిగి ఆరు శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను ఏర్పరుస్తాయో సూచిస్తాయి. వీటినే చంద్ర నాడి, సూర్య నాడి అని కూడా పిలుస్తారు. మన వెన్నెముక అడుగు భాగాన త్రికోణాకార ఎముకలో ఉండే కుండలినీ శక్తి ఈ రెండు నాడుల మధ్య ఉండే సుషుమ్నానాడి ద్వారా పైకి వచ్చి మన మాడు పై భాగంలో ఉండే బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించి, మన చుట్టూ ఉండే సర్వ వ్యాపితమైన భగవంతుని పరమ చైతన్య శక్తితో ఐక్యం చెందుతుంది. అప్పుడే ఒక సాధకునికి యోగ్ర ప్రాప్తి జరుగుతుంది. ధ్యానంలో కుండలినీ శక్తి జాగృతిని, దాని ఊర్థ్వ గమనాన్ని అనుభూతి చెందితే, సాధకుడు నిరానంద అనుభూతిని పొంద గలుగుతాడు.మన కుడివైపు మూలాధార చక్రం శుభ్రమయ్యే కొద్దీ మన లోపల అనవసరమైన ఆలోచనలు తగ్గిపోయి అంతర్గత ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ విధంగా కుడి వైపు మూలాధార చక్రం మన లోపల సమతుల్యత ఏర్పడడానికి, నిర్విచార స్థితి నెలకొనడానికి సహాయ పడుతుంది.మితిమీరిన క్రియాశీలత, ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం, అవసరానికి మించి పని చేయడం, అతిగా ప్రణాళికలు వేయడం, నిద్ర లేమి, మొండితనం, మూర్ఖత్వం, చిరాకు, కోపం, అతిగా మాట్లాడడం, అతిగా ఆటలు ఆడటం, క్రూరత్వం, కాఠిన్యం ఇటువంటివన్నీ మన కుడివైపు పింగళానాడిని బలహీన పరుస్తాయి. ఆ సమయంలో శ్రీ కార్తికేయుని ధ్యానం ద్వారా మనం మన లోపల గల అసమతుల్యత లను తొలగించు కోవచ్చును. శ్రీ కార్తికేయుని ధ్యానం వలన మన చిత్తం నిర్మలంగా మారి మనకు నిర్విచార స్థితి లభిస్తుంది.ఒక గురువుకు తన మీద తనకు ఆత్మనిగ్రహం ఉంటుంది. అంటే తనను తాను నియంత్రించుకో గలుగుతాడు. కానీ శ్రీ కార్తికేయుని ఆశీస్సులు ఉన్న వ్యక్తి ఇతరులను శాసించ గలుగుతాడు. ఆ విధంగా శాసించగల శక్తి పురుషులకు వారి మాటల ద్వారా, చురుకుదనం ద్వారా, వ్యక్తిగత విజయాల ద్వారా లభిస్తే, స్త్రీలకు వారి ప్రేమించే గుణం, సహనం, హుందాతనం, క్షమా గుణం, కరుణల ద్వారా లభిస్తుంది.శ్రీ కార్తికేయుని శక్తి మన లోపల పసితనం లాంటి అమాయకత్వాన్ని పరిరక్షిస్తుంది. ఈ అమాయకత్వం వలనే మానవులు ఆనందంగా ఉండగలుగుతారు. మనలో కుండలినీ శక్తి వెన్నెముక అడుగున ఉన్న త్రికోణాకార ఎముక నుండి బయలు దేరి, షట్చక్రాలనూ దాటుకుంటూ వెళ్ళి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించడానికి మార్గ మధ్యంలో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగించడానికి కుడి మూలాధార చక్రం సహకరిస్తుంది. శ్రీ కార్తికేయుని శక్తి పరిపూర్ణంగా స్వచ్ఛమైన క్రియాశీలక శక్తి. అందులో ఎటువంటి అనవసరమైన, పనికిమాలిన ఆలోచనలకు తావు లేదు. అది చక్కటి ఫలితాలను ఇస్తుంది.– డా. పి. రాకేశ్(మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాలు, ప్రసంగాల ఆధారంగా) -
దత్తజయంతి నాడు ఏమి చేయాలి?
మానవులకు దైవభీతి, గురుభక్తి, ధర్మదీక్ష, పుణ్య కార్యాచరణం, జితేంద్రియత్వం, బ్రహ్మజ్ఞానం మొదలైన సుగుణాలను కలిగించడానికి అనేక రూపాలలో అనేక స్థలాలలో అవతరించిన త్రిమూర్తి స్వరూపుడే దత్తాత్రేయుడు. కలియుగంలో మొదట శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించి కురువపురంలో నివసించారు. ఆ తర్వాత ఆయనే శ్రీ నరసింహ సరస్వతీ యతీంద్రులుగానూ, అక్కల్కోట మహరాజ్గానూ, శ్రీ షిరిడీ సాయి నాథుడిగానూ అవతరించారని ప్రతీతి. నేడు (డిసెంబర్ 4) మార్గశిరపూర్ణిమ, దత్తజయంతి (dattatreya jayanti) సందర్భంగా ఈ వ్యాస కుసుమం ...జన్మసంసార బంధనాలను సులువుగా వదిలించి, జ్ఞానానందాన్ని పంచుతూ, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వేరుకారని నిరూపించిన అపురూప ఘట్టమే దత్తాత్రేయ ఆవిర్భావం. త్రిమూర్తులే తనకు పుత్రులుగా జన్మించాలంటూ అత్రిమహర్షి–అనసూయ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దూర్వాసుడు (Durvasa) జన్మించగా, విష్ణు అంశతో అవతరించినవాడే దత్తాత్రేయుడు!సకల విద్యాపారంగతుడైన దత్తుడు జ్ఞానసముపార్జనలో ప్రకృతి అణువణువూ తనకు గురువేనని వెల్లడించాడు. ధర్మబద్ధంగా ఇహలోక సుఖాలను కోరుకునేవారికి వాటిని అనుగ్రహిస్తూ, వారిని యోగమార్గంవైపు పయనింపజేసే విశ్వగురు దత్తాత్రేయడు. ఆయన అనుగ్రహిస్తే గురువుతోబాటుగా దైవానుగ్రహమూ లభించినట్లే!ముగ్గురు మూర్తులూ మూడు శిరస్సులుగా...దిక్కులనే అంబరంగా చేసుకుని, భక్తులను ఉద్ధరించేందుకు అనేక రూపాలను ధరించిన దత్తాత్రేయుడి మూడు తలలలో నడిమి శిరస్సు విష్ణువుది కాగా.. కుడివైపున శివుడు సద్గురు స్వరూపంగా, ఎడమవైపు బ్రహ్మదేవుడు పరబ్రహ్మస్వరూపమైన శిరస్సుతో భాసిస్తారు. మధ్యభాగంలో అజ్ఞానాన్ని తొలగించే గురుమూర్తిగా శ్రీదత్తుడు ముల్లోకాలను రక్షిస్తాడు.దత్తావధూతదేహంపై వ్యామోహాన్ని వదిలి, జడ పదార్థంలా ఉండేవారిని అవధూత అంటారు. ఈ పదానికి అసలైన నిర్వచనంగా మారి దత్తావధూత అయ్యాడు. బౌద్ధమతకర్త అయిన బుద్ధుడు, జైనమత స్థాపకుడైన మహావీరుడు వారి శిష్యులైన మహాయోగులు, బోధిసత్వులు, జైనతీర్థంకరులు, షిరిడీ సాయిబాబా వంటి మహనీయులందరూ దత్తాత్రేయుని అంశావతారాలే అవుతారు.పేర్లు వేరైనా పదార్థం ఒక్కటే!ఒక వస్తువును వివిధ భాషలవారు వివిధ పేర్లతో పిలుస్తారు. తెలుగులో మామిడిపండంటే ఆంగ్లంలో ‘మ్యాంగో’ అంటారు. హిందీలో ఆమ్ అంటే సంస్కృతంలో చూతఫలం అంటారు. ఇంకా ఇతర భాషల్లో వేరే పేర్లతో పిలుస్తారు. పేర్లెన్ని ఉన్నా పదార్థం ఒక్కటే కదా! ఆవిరిగా మారినా, మంచులా గడ్డకట్టినా, నీరుగా ఉన్నా అది ఉదకమే కదా! కాబట్టి ఆయన భక్తులకోసం తానే అనేక రూపాలు ధరించి, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతూ, ఆదుకుంటూ ఉంటాడు.అరుదైన రూపంరుద్రాక్షమాల, డమరుకం, చక్రం, శంఖం, త్రిశూలం, కమండలాదులను ఆరుచేతులలో ధరించిన దత్తుని చుట్టూ ఉన్న నాలుగు శునకాలు వేదాలకు ప్రతీకలు. తనను ఆశ్రయించిన వారిని నాలుగువైపులనుండి రక్షిస్తాననే సందేశం కూడా ఇందులో ఉంది. ఆయన వెనకాల కనిపించే గోవును ఉపనిషత్తుల సారంగా చెబుతారు.దత్తజయంతి నాడు ఏమి చేయాలి?అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో మార్గశీర్ష శుద్ధ పౌర్ణమినాడు జన్మించాడు దత్తాత్రేయుడు. ఈ పర్వదినాన ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం శుచిౖయె దత్తాత్రేయులవారి చిత్రాన్ని లేదా ప్రతిమను ముందు ఉంచుకుని షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. శారీరక ఉపవాసం కన్నా మానసికంగా చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండటమే ఆయనకు ఇష్టం.అనంతరం దత్తచరిత్ర, దత్తసహస్రనామావళి, శ్రీగురుచరిత్ర (Shri Guru Charitra) వంటి గ్రంథాలను పారాయణ చేయడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మానసిక, శారీరక వైకల్యాలున్నవారు మార్గశిర పూర్ణిమనాడు దత్తాత్రేయుణ్ణి షోడశోపచారాలతో పూజించి, పంచామృతాలతో అభిషేకిస్తే వారి వైకల్యాలన్నీ తొలగి ఆరోగ్యవంతులవుతారని దత్తచరితం చెబుతోంది.చదవండి: ప్రశాంత జీవన రహస్యమే గీతాసారందత్తుడు ఉదయించిన మార్గశిర పౌర్ణమినే (Margashirsha Purnima) దత్తజయంతిగా జరుపుకుంటారు. ‘దిగంబరా దిగంబరా శ్రీ ΄ాదవల్లభ దిగంబరా’ అంటూ దత్తనామ స్మరణలో గడుపుతారు. దత్తచరిత్ర, అవధూత గీత మొదలైన గ్రంథాల్ని పారాయణ చేస్తారు. భజనలు, సత్సంగాలు నిర్వహిస్తారు. నేడు దత్త స్తవం లేదా దత్తాత్రేయ వజ్రకవచం పఠించడం వలన అన్నిరకాల రక్షణ లభిస్తుంది. దత్తుడి ఆరాధన ఎంతో జటిలమైన పితృదోషాలను సైతం తొలగిస్తుందని ప్రతీతి. అందరికీ ఆ దత్తుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం. జై గురు దేవదత్త– డి.వి.ఆర్.భాస్కర్ -
అపూర్వ ఘట్టం, అరుదైన ఘనత : ప్రధాని మోదీ ప్రశంసలు
వారణాసి, సాక్షి : మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖీ (Devavrat Mahesh Rekhe) అరుదైన ఘనతను సాధించారు. శుక్ల యజుర్వేదం (మధ్యందిన శాఖ) నుండి దాదాపు 2,000 మంత్రాల అత్యంత సంక్లిష్టమైన పారాయణం ‘దండక్రమ పారాయణాన్ని’ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. అద్భుతమైన ఆ వారణాసి అసాధారణమైన ఆధ్యాత్మిక క్షణాలకు వారణాసి వేదికగా నిలిచింది. వేద సంప్రదాయంలో అత్యంత క్లిష్టమైన వాటిల్లో ఒకటిగా ఈ పారాయణాన్ని భావించారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా శాస్త్రీయంగా ఈ కార్యక్రమం జరిగింది.19 year old Chi. Devavrat Mahesh Rekhe reciting Danda krama Parayana infront of elderly vidwans in kashi 😍🙏 https://t.co/Z7Tx2tTqWV pic.twitter.com/DIbPa6w8UI— Adarsh Hegde (@adarshahgd) December 2, 2025 ఈ పవిత్ర కార్యానికి గౌరవసూచకంగా, దేవవ్రతకు రూ.5 లక్షల విలువైన బంగారు కంకణం, రూ.1,11,116 విలువైన బంగారు కంకణాన్ని బహుకరించారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం , జగద్గురు శంకరాచార్యుల ఆశీస్సులతో ఈ గుర్తింపు లభించింది. 500 మందికి పైగా వేద విద్యార్థులు, సాంప్రదాయ సంగీతకారులు , శంఖ రావాల ప్రతిధ్వనుల మధ్య వారణాసి పులకించిపోయింది. భక్తులు వీధుల్లో బారులు తీరి, జల్లులు కురిపించారు ఈ వేడుకలో, శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతి తీర్థ మహాసన్నిధానం నుండి ఆస్థాన విద్వాన్ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ ప్రత్యేక ఆశీర్వాద సందేశాన్ని అందించారు. సంక్లిష్టమైన స్వర-నమూనాలు మరియు శబ్ద ఖచ్చితత్వానికి వేద పారాయణ కిరీటంగా గౌరవించబడే దండక్రమ పారాయణం చరిత్రలో మూడు సార్లు మాత్రమే నిర్వహించబడిందని, దేవవ్రత పారాయణం దోషరహితంగా అతి తక్కువ సమయంలో పూర్తయిందని శృంగేరి మఠం అధికారిక ఎక్స్లో పోస్ట్ చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు 19 ఏళ్ల దేవవ్రత మహేష్ రేఖే అద్భుతమైన విజయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేవవ్రతుడి విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతిని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆ యువ పండితుడు శుక్ల యజుర్వేదంలోని 2,000 మంత్రాలతో కూడిన దండక్రమ పారాయణాన్ని 50 రోజుల పాటు నిరంతరాయంగా పూర్తి చేశాడని తెలుసుకుని సంతోషిస్తారని ఆయన అన్నారు. ఇంతటి అసాధారణ ఆధ్యాత్మిక క్రమశిక్షణను కాశీ పవిత్ర నేలపై జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా దేవవ్రతుడి కుటుంబం, సాధువులు, పండితులు, అతని కఠినమైన వేద అభ్యాసానికి దేశవ్యాప్తంగా అతనికి మద్దతు ఇచ్చిన సంస్థల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. వల్లభరం శాలిగ్రామ్ సంగ్వేద్ విద్యాలయంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 30 వరకు పారాయణం నిర్వహించారు. శృంగేరి పీఠం వేదపోషక సభ ఆధ్వర్యంలో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖ పరీక్షల ప్రధాన పరిశీలకుడు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే యువ పండితుడు మరియు అతని తండ్రి-గురువు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే ఇద్దరినీ సాధువులు , వేద పండితులు ప్రశంసించారు.19 वर्ष के देवव्रत महेश रेखे जी ने जो उपलब्धि हासिल की है, वो जानकर मन प्रफुल्लित हो गया है। उनकी ये सफलता हमारी आने वाली पीढ़ियों की प्रेरणा बनने वाली है। भारतीय संस्कृति में आस्था रखने वाले हर एक व्यक्ति को ये जानकर अच्छा लगेगा कि श्री देवव्रत ने शुक्ल यजुर्वेद की माध्यन्दिन… pic.twitter.com/YL9bVwK36o— Narendra Modi (@narendramodi) December 2, 2025 -
16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే.
సాక్షి శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్లో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కేవలం 16 రోజుల్లోనే రూ.92 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంటే ఈ సీజన్ తొలి 16 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. గతేడాది ఇదే సీజన్తో పోలిస్తే ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగినట్లు టీడీబీ పేర్కొంది. అయితే గతేడాది కేవలం రూ.69 కోట్లు మాత్రమే వసూలైనట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఈ ఏడాది ఆదాయంలో అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచే వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు దాదాపు రూ.47 కోట్లు ప్రసాదాల విక్రయాల ద్వారే సమకూరినట్లు బోర్డు వివరించింది. ఇక మండల-మకరవిలక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు(16 రోజుల తర్వాత) సుమారు పదమూడున్నర లక్షల మందికి పైగా భక్తుల అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. శని, ఆదివారాల్లో రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ..సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. సోమవారం గురుపవనపురి ఏకాదశి సందర్భం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 90 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. అలాగే కేరళ అన్నదాన సద్య పథకం నేడు ప్రారంభం కాదని దేవస్వం బోర్డు తెలిపింది. కాగా, పంపా నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలో 12 ప్రదేశాల్లో తాగునీరు, స్నాక్స్, అత్యవసర ఆరోగ్య సేవలను ఏర్పాటు చేశారు.(చదవండి: శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!) -
లుంబిని నుంచి కుశినగర్ వరకు...!
బుద్ధుడికి జన్మనిచ్చిన లుంబినివనం.. సిద్ధార్థుడికి జ్ఞానోదయమైన బోద్గయ. తొలి అష్టాంగమార్గాన్ని విన్న సారనాథ్.. సారనాథ్లో శ్రీలంక చైత్యం మూలగంధకుటి. బౌద్ధానికి రాజ గౌరవాన్నిచ్చిన రాజగృహ.. బుద్ధుడి ప్రకృతి విహారకేంద్రం వేణువనం. సమ్యక్ జీవనసాఫల్య క్షేత్రం శ్రావస్థి.. చివరి ప్రబోధాన్ని విన్న మాతాకుటీర్. బుద్ధుని అవశిష్ఠ నిర్మాణం రామభార్ స్థూప.. బుద్ధుడి తుదిశ్వాసకు మౌనసాక్షి కుశినగర. ఒకే పర్యటనలో వీటన్నింటినీ చూడాలంటే... ఐఆర్సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైనెక్కాలి.1వ రోజు..ఢిల్లీ నుంచి గయకు ప్రయాణం. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వేస్టేషన్కి చేరాలి. చిన్న వెల్కమ్ తర్వాత ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ ఎక్కాలి. ట్రైన్ రెండున్నరకు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు భోజనం రైల్లోనే అందిస్తారు. ప్రయాణం కొనసాగుతుంది.2వ రోజురైలు ప్రయాణం కొనసాగుతుంటుంది. రైల్లో ఉదయం టీ, రిఫ్రెష్మెంట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. గయకు చేరిన తర్వాత రైలు దిగి బోద్గయకు ప్రయాణం. బోద్గయలో హోటల్ గదిలో చెక్ ఇన్. కొంత సేపు విశ్రాంతి తర్వాత బోధగయ విహారం, మహాబోధి వృక్షం, మహాబోధి ఆలయ దర్శనం, నిరంజన నది తీరాన విహారం. బోద్గయలోని థాయ్ టెంపుల్, జపనీస్ టెంపుల్, బుద్ధ విగ్రహ వీక్షణం. రాత్రి భోజనం, బస హోటల్లో. నిరాడంబరం సుసంపన్నంగాబోధగయలో చూడాల్సిన ప్రదేశాల్లో ప్రధానమైనది బోధివృక్షం. దాన్ని మహాబోధి అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రదేశం ఇది. ఇక్కడ మహా ఆలయ నిర్మాణం జరిగింది. అదే మహాబోధి ఆలయం. ఈ ఆలయానికి ఓ అరకిలోమీటరు దూరాన మాయా సరోవర్ తీరాన ఉంది వాట్థాయ్ టెంపుల్. బోద్గయలోని వివిధ బౌద్ధాలయాన్నీ దేనికదే ప్రత్యేకమైన నిర్మాణశైలితో ఆకర్షణీయంగా ఉంటాయి. నిరాడంబరతను ఇంత సుసంపన్నంగా వ్యక్తం చేయవచ్చా అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇది 1956లో ధాయ్లాండ్ ప్రభుత్వం నిర్మించిన ఆలయం. భారత్– థాయ్లాండ్ దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రధాని నెహ్రూ కోరిన మీదట థాయ్ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. బంగారు పూత పై కప్పు నిర్మాణంలోని సునిశితత్వం అబ్బురపరుస్తుంది. ఈ ఆలయానికి సమీపంలో ఎనభై అడుగుల గ్రేట్ బుద్ధ స్టాట్యూ ఉంది. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహంలో శిల్పనైపుణ్యం అద్భుతం. ఇక జపనీస్ టెంపుల్ ఇండోసాన్ నిప్పన్ జపనీస్ టెంపుల్ ప్రశాంతతకు ప్రతీకలా ఉంటుంది. 3వరోజుబోద్గయ నుంచి నలంద, రాజ్గిర్, గయ, వారణాసికి ప్రయాణం. ఉదయం బో«ద్గయలోని హోటల్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి రాజ్గిర్ వైపు సాగిపోవాలి. రాజ్గిర్లో బింబిసార జైల్, గ్రద్ధకూట పర్వతం, వేణువన్ పర్యటన తర్వాత లంచ్కి హోటల్కి రావాలి. భోజనం తర్వాత నలందకు ప్రయాణం. నలందలో యూనివర్సిటీ శిథిలాల వీక్షణం, నలంద మ్యూజియం సందర్శనం తర్వాత గయకు ప్రయాణం. గయ రైల్వేస్టేషన్కు చేరి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ రైలెక్కాలి. రైలు వారణాసికి వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే.భీమ – జరాసంధుల యుద్ధక్షేత్రంరాజ్గిర్ అసలు పేరు రాజగృహ. ప్రాచీనకాలం నాటి నివాస ప్రదేశం. మహాభారత కాలంలో జరాసంధుని రాజ్యం గిరివ్రజ ఇదే. భీముడితో జరాసంధుడు యుద్ధం చేసిన ప్రదేశం. మగధ రాజ్యానికి కొంతకాలం రాజధాని కూడా. రాజు నివసించే నగరం కావడంతో రాజగృహ అనే పేరు వచ్చింది. బుద్ధుడు తొలి బోధన సారనాథ్లో చేశాడు. రాజగృహలో రాజుల సమావేశంలో బోధన చేయడంతో బౌద్ధానికి విశేషమైన ప్రచారం వచ్చింది. సామాన్యులతో పాటు మగధ సామ్రాజ్య స్థాపకుడు బింబిసారుడికి కూడా బుద్ధుడు ఇక్కడే బోధనలు చేశాడు. రాజ్గిర్ విశ్వశాంతి స్తూపం నుంచి కనిపించే గ్రద్ధకూట పర్వతం మీద బుద్ధుడు కొంతకాలం ధ్యానం చేసుకున్నాడు. జైన 24వ తీర్థంకరుడు మహావీరుడు కూడా కొంతకాలం ఇక్కడ నివసించాడు. బింబిసారుడిని అతడి కొడుకు అజాతశత్రు జైలులో బంధించాడు. ఆ జైలు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. బుద్ధుడు రాజ్గిర్లో నివసించిన కాలంలో పగలంతా బోధనలు చేస్తూ సాంత్వన కోసం సమీపంలోని వేణువన్లో సమయం గడిపేవాడు.నాటి సరస్వతి నిలయంనలంద ప్రపంచంలోనే తొలి రెసిడెన్సియల్ యూనివర్సిటీ. బౌద్ధ మహావిహార పేరుతో విలసిల్లింది. క్రీ.శ ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు విద్యార్థులతో కళకళలాడింది. ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే నిర్మాణంలో అనుసరించిన ఇంజనీరింగ్ స్కిల్ అబ్బురపరుస్తుంది. విద్యార్థులకు ఒక్కో గది, పుస్తకాలు దుస్తులకు అరలు ఉన్నాయి. నీరు వెలుపలకు వెళ్లడానికి నిర్మాణంలోనే పైపుల ఏర్పాటు ఉంది. జానపద కథల్లో చంద్రుడి వెలుతురు పడి ప్రకాశించే చంద్రశిలలను ఇక్కడ చూడవచ్చు. అతి పెద్ద లైబ్రరీలోని గ్రంథాలను రాశిపోసి భక్తియార్ ఖిల్జీ తగుల పెట్టాడని చెబుతారు. గ్రంథాలు తగలబడిన చోట ఇటుకలు నల్లగా మాడిపోయి ఉన్నాయి. నలందలో మహావిహార తర్వాత ఆర్కియలాజికల్ మ్యూజియం. సూర్యమందిర్, చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ మందిరాలను చూడవచ్చు. 4వ రోజువారణాసి నుంచి సారనాథ్, నౌతన్వాకు ప్రయాణం. గయ నుంచి వారణాసికి వస్తున్న రైల్లో ఉదయాన్నే టీ, బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. రిఫ్రెష్మెంట్ పూర్తి చేసుకుని వారణాసిలో రైలు దిగిన తర్వాత సారనాథ్కు ప్రయాణం. సారనాథ్లో ధమేక్ స్థూప, సారనాథ్ మ్యూజియం, అశోక పిల్లర్, మూలగంధకుటి విహార్కు ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్, లంచ్ తర్వాత గంగానది తీరాన హారతి వీక్షణం. రాత్రికి రైల్వేస్టేషన్కు చేరి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రైలు నౌతన్వా వైపు సాగి΄ోతుంది. నౌతన్వా మనదేశంలో చివరి రైల్వేస్టేషన్.సారనాథ్ బుద్ధుడుబోధగయలో జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు తొలి ప్రవచనాన్ని వెలువరించిన ప్రదేశం సారనాథ్. బౌద్ధానికి సంబంధించిన నమూనా చిత్రాల్లో బోధిచెట్టు కింద కూర్చున్న బుద్ధుడు, ఎదురుగా ఐదుగురు శిష్యులు ఉంటారు. అది సారనాథ్లో ఇచ్చిన ప్రవచనానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్లోని బౌద్ధ స్థూపం పేరు ధమేక్ స్థూపం. దానిని అధ్యయనం చేస్తే బౌద్ధ పరమార్థం అవగతమవుతుంది. భారత ప్రభుత్వం అధికారిక ముద్రగా స్వీకరించిన నాలుగు సింహాల పిల్లర్ ఇక్కడిదే. ఇక్కడి మ్యూజియం ఒక బౌద్ధ అధ్యయన కేంద్రం. నిర్వహణ కూడా బాగుంటుంది. మూలగంధ కుటీర్ నిర్మాణకౌశలంలో మహోన్నతమైనదనే చెప్పాలి. ఓ వందేళ్ల కిందట బుద్ధుడి అవశిష్ఠాన్ని ప్రతిష్ఠించి నిర్మించిన ఆలయం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు మనం చూసే బోధివృక్షం శ్రీలంలోని అనూరాధపురా నుంచి సేకరించిన ఒక బోధి మొక్క. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన బోధగయ బోధివృక్షం నుంచి ఒక మొక్కను అశోకుడి కూతురు సంఘమిత్ర... అనూరాధపురాకు తీసుకువెళ్లింది. బో«ద్గయలోని చెట్టు విధ్వంసం అయినప్పుడు అనూరాధపుర వృక్షం నుంచి సేకరించి తెచ్చిన మొక్కల్లో ఒకటి బో«ద్గయలో మరొక దానిని సారనాథ్లో నాటారు. 5వ రోజుఉదయాన్నే టీ, బ్రేక్ఫాస్ట్ రైల్లోనే. నౌతన్వా రైల్వేస్టేషన్కు చేరిన తర్వాత రైలు దిగి నేపాల్లో ప్రవేశించి లుంబినికి చేరాలి. పర్యాటకులు పాస్సోర్ట్, వీసా దగ్గర ఉంచుకోవాలి. నేపాల్ వీసా లేని వాళ్లు ఆన్ అరైవల్ వీసా కోసం (అక్కడికి చేరిన తర్వాత జారీ చేసే వీసా) ఫీజు తోపాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు ఉండాలి. లుంబినిలో హోటల్లో చెక్ఇన్, మధ్యాహ్న భోజనం తర్వాత లుంబిని సైట్ సీయింగ్. రాత్రి భోజనం, బస లుంబినిలో.లుంబినిలో పుట్టాడునౌత్వానా రైల్వే స్టేషన్ చాలా చిన్న స్టేషన్. నిజానికి ప్రత్యేకంగా చెప్పు కోవాల్సిన ప్రదేశం కాదు. కానీ భారత్– నేపాల్ సరిహద్దులో మనదేశం నిర్వహిస్తున్న చివరి స్టేషన్. నేపాల్కి వెళ్లాలంటే ఇక్కడ దిగి రోడ్డుమార్గాన సరిహద్దు ప్రదేశం సునౌలి దగ్గర పాస్పోర్ట్ మీద స్టాంప్ వేయించుకోవాలి. ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే క్రీ.పూ 544లో బుద్ధుడు పుట్టిన లుంబినిలో ఉంటాం. లుంబిని బుద్ధుడు పుట్టిన ప్రదేశంలో మాయాదేవి ఆలయాన్ని నిర్మించారు. ధవళం మీద ప్రసరించిన కాంతి వెలుగులతో ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుందీ ఆలయం. లుంబినిలో నిర్మించిన మహాస్థూ΄ాన్ని వరల్డ్ పీస్ పగోడాగా గుర్తిస్తారు. లుంబిని మొత్తాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది యునెస్కో.6వ రోజులుంబిని హోటల్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్. కుశినగరకు ప్రయాణం. కుశినగరలో లంచ్ తర్వాత మహాపరినిర్వాణ టెంపుల్, రామ్భర్ స్థూప, మాతా కుటీర్ టెంపుల్తోపాటు ఇతర దర్శనీయ స్థలాల వీక్షణం. అక్కడి నుంచి గోరఖ్పూర్కు ప్రయాణం. గోరఖ్పూర్ రైల్వేస్టేషన్లో ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ ఎక్కి బలరామ్పూర్కు సాగి΄ోవాలి. డిన్నర్ ట్రైన్లోనే. (శ్రావస్థికి వెళ్లడానికి)బుద్ధుడి నిర్యాణంనే΄ాల్లో పుట్టిన సిద్ధార్థుడు భారతదేశంలో బుద్ధుడయ్యాడు. ఎనభై ఏళ్లు జీవించిన తర్వాత భారతదేశంలోనే చివరి నిద్రకుపక్రమించాడు. ఉత్తరప్రదేశ్లోని కుశినగరలో బుద్ధుడు తుది శ్వాస వదిలిన చోట మహాపరి నిర్యాణ ఆలయాన్ని నిర్మించారు. దాని వెనుక నిర్వాణ చైత్య (పరినిర్వాణ స్థూప) ఉంది. ఇక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన బుద్ధుడి అవశిష్ఠంతో నిర్మించిన రామభార్ స్థూప కూడా గొప్ప ప్రాశస్త్యం కలిగిన బౌద్ధ నిర్మాణం. ఇక ఇక్కడ చూడాల్సిన వాటిలో మాతా కుటీర్ టెంపుల్ ముఖ్యమైనది. బుద్ధుడు తొలి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం సారనాథ్ అయితే చివరి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం మాతా కుటీర్ టెంపుల్.7వరోజుఉదయం టీ తాగిన తర్వాత బలరామ్పూర్ రైల్వేస్టేషన్లో రైలు దిగి శ్రావస్థికి ప్రయాణం. 15 కిమీల దూరం. శ్రావస్థిలో హోటల్ గదిలో చెక్ ఇన్. రిఫ్రెష్మెంట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరాలి. జేతవన విహార, పక్కి సెహాత్ మహేత్ వీక్షణం. మధ్యాహ్న భోజనం తర్వాత కొంత సేపు విశ్రాంతి. ఆ తర్వాత బలరామ్పూర్ రైల్వేస్టేషన్కు ప్రయాణం. రైలెక్కిన తర్వాత రైలు ఆగ్రాకు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లో.శ్రావస్థి... ప్రపంచ శాంతిరవంశ్రావస్థి ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం, జనపదాల కాలంలో కోసల రాజ్యానికి రాజధాని నగరం. రాముడి కుమారుడు లవుడు పాలించిన నగరమని చెబుతారు. జ్ఞానోదయమైన తరవాత బుద్ధుడు చాలా కాలం ఈ ప్రదేశంలో నివసించాడు. బుద్ధుడి జీవితంలో అనేక అద్భుతాలు ఇక్కడే జరిగాయని చెబుతారు. వందలాది బోధనలు వెలువరించడంతోపాటు అనేక మందిని సమ్యక్ జీవనం వైపు ప్రభావితం చేసిన ప్రదేశం. నాటి చౌద్ధ జ్ఞాపకాల పునర్నిర్మాణాలను చూడవచ్చు. ఇక్కడ పర్యటించిన బౌద్ధులు శ్రావస్థి సమీపంలోని ఆనందబోధి వృక్షం కింద కొంత సేపు ధ్యానంలో గడుపుతారు. బౌద్ధం ఆకాంక్ష అయిన ప్రపంచ శాంతికి ప్రతీకగా ఇక్కడ ప్రపంచ శాంతి గంట ఉంది. ఈ ప్రదేశం బౌద్ధంతో΄ాటు జైనానికి కూడా ప్రత్యేకమైనదే.జేతవన వీక్షణంబుద్ధుడు ప్రవచనాలను బోధిస్తూ పర్యటిస్తున్న క్రమంలో వేణువనంలో కొంతకాలం నివసించిన తర్వాత జేతవనంలో నివసించాడు. ఇక్కడ పెద్ద విహారం ఉండేది. ఇప్పుడు మనం చూడగలిగింది ఆ విహారానికి ఆనవాలుగా మిగిలిన శిథిలాలను మాత్రమే. బుద్ధుడి కోసం ఈ విహారాన్ని నిర్మించింది శ్రావస్థి నగరంలోని సంపన్నుడైన వ్యాపారి ఆనంద పిండిక. బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత జీవితాన్ని సమాజసేవ కోసం అంకితం చేసిన ఆనంద పిండిక విశాలమైన స్థలాన్ని కొని విహారాన్ని నిర్మించాడు. ఈ ప్రదేశాన్ని శ్రావస్థి యువరాజు జేత పేరుతో జేతవనంగా పిలిచేవారు. అదే జేతవన విహారంగా వాడుకలోకి వచ్చింది. 8వ రోజుఉదయం టీ తర్వాత రైలు ఆగ్రాకు చేరుతుంది. రిఫ్రెష్మెంట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి రైలు దిగి సైట్సీయింగ్కి వెళ్లాలి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్మహల్ వీక్షణం తర్వాత ఆగ్రా రైల్వేస్టేషన్కు వెళ్లి రైలెక్కాలి. మధ్యాహ్న భోజనం రైల్లోనే. ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ సాయంత్రం టీ తర్వాత ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వేస్టేషన్కు చేరుతుంది. టూర్ నిర్వహకులు పర్యాటకులకు వీడ్కోలు చెబుతారు.బియాండ్ ద తాజ్!తాజ్మహల్ రకరకాల వాస్తుశైలిల సమ్మిళితం. ఇండో– ఇస్లామిక్ నిర్మాణ శైలికి మొఘల్ ఆర్కిటెక్చర్ని జోడిస్తే వచ్చిన రూపం. ముంతాజ్ మరణం తర్వాత మొఘల్ పాలకుడు షాజహాన్ని తీవ్రమైన దుంఖం నుంచి సాంత్వన కలిగించిన నిర్మాణం కూడా. ముంతాజ్ మరణం తర్వాత షాజహాన్ విచారంతో తనకిష్టమైన సంగీతం, ఆహారం, దుస్తుల పట్ల కూడా ఆసక్తి లేకుండా గడిపాడు. ఆగ్రా సమీపంలో రాజా మొదటి జయ్సింగ్ నిర్మించిన గొప్ప నిర్మాణం ఉందని తెలిసిన తర్వాత రాజుతో అంగీకారం కుదుర్చుకుని ముంతాజ్ సమాధి కోసం తీసుకున్నాడని చరిత్రకారులు నిర్ధారించారు. ముంతాజ్ మరణించినప్పుడు ఆమె శవపేటికను మధ్యప్రదేశ్, బుర్హాన్పూర్లో తపతి నది తీరాన అహుఖానా అనే భవనంలో సమాధి చేశారు. జయ్సింగ్తో ఒప్పందం తర్వాత ఆ భవనానికి కొన్ని మార్పులు చేసి ముంతాజ్ శవపేటికను ఇక్కడికి తరలించారు. ఆ తర్వాత షాజహాన్ను కూడా ఇక్కడే ఖననం చేశారు. తాజ్మహల్లో ఆ రెండు సమాధులను చూడవచ్చు. తాజ్మహల్ వెనుక దాగిన వాస్తవాలను తెలుసుకునే కొద్దీ ప్రేమ చాలా గొప్పదని ఒప్పుకుని తీరాల్సిందే.ప్యాకేజీల సంగతిదీ.. ఐఆర్సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్ ప్రస్తుతం కొత్త ఆఫర్లతో ΄్యాకేజ్ ప్రకటించింది. ఇది ఎనిమిది రోజుల యాత్ర. ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఇవి విదేశీయులు, ఎన్ఆర్ఐల కోసం ఉద్దేశించిన ప్యాకేజ్లు, కాబట్టి ప్యాకేజ్ ధరలు యూఎస్ డాలర్లలో ఉంటాయి. మనదేశంలో నివసిస్తున్న భారతీయులు కూడా ఆసక్తి ఉంటే ఈ ప్యాకేజ్లో టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్యాకేజ్లో సూచించిన డాలర్ల సరిపడిన రూపాయలు చెల్లించి టూర్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు ఏసీ ఫస్ట్ క్లాస్లో టూర్ మొత్తానికి 1400 డాలర్టు. ఒక రోజుకు 175 డాలర్లు.ఏసీ టూ టయర్లో టూర్ మొత్తానికి 1160 డాలర్లు, ఒక్క రోజుకు 145 డాలర్లు.ఏసీ ఫస్ట్ క్లాస్ కూపేలో టూర్ మొత్తానికి 1550 డాలర్లు, ఒక్క రోజుకు 175 డాలర్లు.టూర్ మొదలయ్యే తేదీలు డిసెంబర్ 20, జనవరి (2026) 3, ఫిబ్రవరి 21, మార్చి 21.ఇవి వర్తించవు!వీసా ఫీజులు ప్యాకేజ్లో వర్తించవు., లాండ్రీ, మందులు, మద్యం, ఇతర పానీయాలు ఉండవు. పర్యటన కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వేస్టేషన్కు చేరుకోవడం, పర్యటన పూర్తయిన తర్వాత రైల్వేస్టేషన్ నుంచి వెళ్లే రవాణా సౌకర్యం ఇందులో ఉండదు. పర్యాటక ప్రదేశాల్లోకి కెమెరాలను అనుమతించడానికి ఫీజులు కూడా ప్యాకేజ్లో వర్తించవు.ఇవి వర్తిస్తాయి!రైలు ప్రయాణం, రైలు దిగిన తర్వాత పర్యాటక ప్రదేశాలకు ఏసీ వాహనంలో రోడ్డు రవాణా, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బస, భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్. వీటితోపాటు ఇంగ్లిష్, హిందీ మాట్లాడే టూర్ ఎస్కార్ట్ కూడా పర్యటన ఆద్యంతం వెంట ఉంటారు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: కర్నాటక టూర్..పర్యాటక దివ్యధామం..!) -
శబరిమల అయ్యప్పకు అర్పించే నైవేద్యాలివే..!
శబరిమల అయ్యప్పస్వామి అనగానే నోరూరించే అరవణ ప్రసాదమే గుర్తొస్తుంటుంది. ఆ ప్రసాదం ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఒక్క ప్రసాదమే కాదు నాలుగు రకాల పాయసాలను ఆ హరిహరసుతుడికి నివేదిస్తారు. అవన్నీ ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగినవి. తక్షణ శక్తిని ఇచ్చేవి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అరవణ పాయసంతోపాటు సమర్పించే ఇతర నైవేద్యాల వివరాలు, వాటి ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందాం.⇒ ఉషః కాలంలో ఉదయం 7.30 గంటల సమయంలో కొబ్బరి పిండితో చేసిన పాయసాన్ని నివేదిస్తారు. దీని పేరుకు తగ్గట్టుగా ఈ పాయసం కొబ్బరికాయను చూర్ణం చేసి.. ఆ పిండికి, రెండు గ్లాసుల కొబ్బరి పాలకు బెల్లం జోడించి తయారు చేస్తారు. ⇒ మధ్యాహ్నం 12 గంటల పూజ కోసం అరవణ పాయసాన్ని నివేదిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఇది రైస్, ఎండు కొబ్బరి ముక్కలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, తాటిబెల్లం, శొంఠిపొడి, యాలకుల పొడి, పచ్చ కర్పూరంతో తయారవుతుంది. ⇒ ఇక మిగతా పూజాసమయాల్లో తెల్ల నైవేద్యాన్ని నివేదిస్తారు. రాత్రి 9.15 గంటలకు సాయంత్రం పూజ కోసం నువ్వుల పాయసం నివేదిస్తారు. ఈ మేరకు శబరిమల తంత్రి కంఠరార్ మహేష్ మోహనార్ మాట్లాడుతూ.. ‘‘నువ్వుల పాయసం నిజానికి పాయసం రూపంలో ఉండదు.. నువ్వులే’’ అని చెప్పుకొచ్చారు. సాయంత్రం పూజ కోసం అయ్యప్పకు పానకం, అప్పం, అడ అనే పానీయం నివేదిస్తారు. ఇక్కడ పానకం అనేది జీలకర్ర, బెల్లం, పసుపు, నల్ల మిరియాలు కలిపిన ఔషధ మిశ్రమం.అత్యంత స్పెషల్ పంచామృతం..తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడు అభిషేకానికి ఈ పంచామృతాన్ని వినియోగిస్తారు. స్పటికబెల్లం, బెల్లం, అరటి పండు, ఎండు ద్రాక్ష(కిస్మిస్), నెయ్యి, తేనె, యాలకుల పొడి, లవంగాల పొడి, తదితర ఎనిమిది పొడులను కలిపి పంచామృతం తయారు చేస్తారు. పాయసాలలో అరవణ తర్వాత పంచామృతం అత్యంత రుచికరమైన ప్రసాదంగా భక్తులు చెబుతుంటారు. అంతేాకాదు శబరిమలలో ఈ అరవణ ప్రసాదంతోపాటు అచ్చం అరవణ టన్ మాదిరి సగం సీసాలో ఈ పంచామృతాన్ని విక్రయిస్తారు. దీని ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ.125లు పలుకుతుంది. అయ్యప్ప స్వామి పూజా విధానాలే కాదు నివేదించే నైవేద్యాలు కూడా అత్యంత ప్రత్యేకమే కదా..!.(చదవండి: దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్పై ఫిర్యాదులు..!) -
ప్రశాంత జీవన రహస్యమే గీతాసారం
యుద్ధభూమిలో శ్రీ కృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. అయితే, దాని అసలైన సందేశం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి. అంటే ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, శక్తిమేరకు కృషి చేయడం.గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన పరమహంస యోగానంద కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత అనే తన మహత్తర గీతాభాష్యం లో, శ్రీ కృష్ణుని సందేశం గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు.భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించాడు...‘‘కర్మలు చేయుట యందు మాత్రమే నీకు అధికారముంది, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.’’దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి ఆందోళన చెందుతూ ఉండకండి. ‘‘ ఈ పని చేయడం వల్ల నాకేమి లభిస్తుంది’’ అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 48వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చాడు...‘‘ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించు. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావం గలవాడవై ఉండు. ఈ మానసిక సమత్వమే యోగం.’’జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీ కృష్ణుడు మనకు బోధిస్తాడు. ఈ సమభావమే నిజమైన యోగం. అంటే ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం.3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీ కృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశాడు. ‘‘సమస్త కర్మలను నాకు అర్పించు! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండు.’’సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు... కోరికలు, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైకమార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించాడు:‘‘నీరు స్పృశించలేని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.’’బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు.ఈ సనాతనమైన బోధనల వ్యాప్తికి యోగానంద పశ్చిమ దేశాలలో సెల్ఫ్–రియలైజేషన్ ఫెలోషిప్ను, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను భారతదేశంలోను స్థాపించారు. ఆయన ‘ఒక యోగి ఆత్మకథ’ లక్షలాది మందికి యోగాన్ని, ధ్యానాన్ని– ముఖ్యంగా భగవద్గీత కూడా ప్రస్తావించిన క్రియాయోగమనే సనాతన ప్రక్రియను– దైవానుభవం కలిగించే ఒక తిన్నని రాజమార్గంగా పరిచయం చేసింది.నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా– కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను పనిచేయడం, కానీ ఫలితాల కోసం పాకులాడకుండా ఉండటం.యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది–వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు. – సత్యశ్రీ -
ఆత్మస్తుతి... పరనింద
మానవ సంబంధాలలో ఉన్నతమైన విలువలకు, మన ఆత్మగౌరవానికి మూలస్తంభాలుగా నిలిచేవి – నమ్మకం, వినయం, బాధ్యత. అయితే, ఈ ఉన్నత లక్షణాలను ఒక్క దెబ్బతో నేలకూల్చే ఒక అంతర్గత శక్తి ఉంది: అదే అహంకారం. జీవితంలో మనం నిత్యం కోల్పోతున్న ఆంతరంగిక ప్రశాంతతకు, సామాజిక మన్ననకు – ఈ ఆత్మస్తుతి, పరనింద అనేవే ప్రధాన కారణాలు.మన అంతరంగంలో, ‘నేనే గొప్ప’, ‘నా నిర్ణయమే శిరోధార్యం’ అని నిశ్శబ్దంగా వినిపించే ఒక బలమైన, ప్రమాదకరమైన స్వరం ఉంటుంది. ఇదే అహంకారం. ఇది ఒక మానసిక విషం లాగా, మనల్ని ఇతరుల నుండి దూరం చేస్తుంది. నిజానికి, ఈ రెండూ మన లోపల ఉన్న అభద్రతా భావాన్ని, వైఫల్య భీతిని కప్పిపుచ్చే దుర్భేద్యమైన ముసుగులు. ఇవి మన నిజమైన ఎదుగుదలకు, ఇతరులతో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి అడ్డుగోడలుగా నిలుస్తాయి.అహంకారం రెండు ముఖాలు – స్పష్టమైన అనుభవం. ఈ రెండు లక్షణాలు రోజువారీ జీవితంలో మన నమ్మకమైన బంధాలను ఎలా ఛిద్రం చేస్తాయో గమనిద్దాం.ఆత్మస్తుతి: (అతిశయోక్తి) మీరు ఒక గొప్ప విజయాన్ని సాధించినా, ప్రతి సంభాషణను మీ గొప్పల చుట్టే తిప్పి, ‘ఇదంతా నా తెలివి తేటలే‘ అని పదే పదే ప్రకటిస్తే – వినేవారికి అది సంతోషాన్ని పంచదు, తీవ్రమైన విసుగును, దూరాన్ని పెంచుతుంది. మిమ్మల్ని మీరే పొగుడు కుంటే, ఇతరులు మీకు నిజమైన గౌరవం ఇవ్వడం మానేస్తారు. గొప్ప జ్ఞాని అయిన యాజ్ఞవల్క్యుడు సైతం, తన జ్ఞానాన్ని తానే అతిగా చెప్పుకున్నప్పుడు, పండితుల విమర్శలను ఎదుర్కొన్నారు. పరనింద (పలాయనవాదం): నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడం... వ్యా పారంలో ఎదురుదెబ్బ తగిలితే, పోటీదారులు కారణం, పరిస్థితులే కారణం‘ అని నిందించడం; క్రీడలలో ఓటమి ఎదురైతే ‘అంపైర్ పొర పాటు, రూల్స్ తప్పు‘ అని వాదించడం. ఈ విధంగా తప్పును మరొకరిపై నెట్టడం తాత్కాలికంగా మన అహం కా పాడుకున్నట్టు అనిపించినా, అది మన నైతిక శక్తిని నాశనం చేస్తుంది. మీ వైఫల్యాలకు మీరు బాధ్యత తీసుకోనప్పుడు, ఇతరులు మిమ్మల్ని విశ్వసించడం పూర్తిగా మానేస్తారు. మహాభారతంలో దుర్యోధనుడు తన పతనానికి తన అహంకారాన్ని కాక, ఎప్పుడూ శ్రీ కృష్ణుడిని లేదా పాండవుల అదృష్టాన్ని నిందించేవాడే తప్ప, ఆత్మపరిశీలన చేసుకోలేకపోయాడు. విజయం సాధించినప్పుడు, ‘నా ప్రయత్నం’ అని కాకుండా, ‘మా బృందం/కుటుంబ సహకారం వల్ల సాధ్యమైంది’ అని చెప్పండి. మీ గొప్పతనాన్ని మీరే చెప్పుకోకుండా, మీ పనిని మీకోసం మాట్లాడనివ్వండి.తప్పు జరిగినప్పుడు, వెంటనే ‘దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బాధ్యతను ధైర్యంగా అంగీకరించండి. ఈ ఒక్క చర్య మిమ్మల్ని ఇతరుల దృష్టిలో నిజమైన నాయకుడిగా, విశ్వసనీయుడిగా నిలబెడుతుంది.ఆత్మస్తుతి అనేది వృథా అయిన శక్తి, పరనింద అనేది మీ ఎదుగుదలను అడ్డుకునే మానసిక చెరసాల. ఈ అహంకారం అనే సంకెళ్లను తెంచే సాహసం చేసినప్పుడే, మీరు ఆ నిజమైన ఆనందాన్ని, ప్రశాంతతను సొంతం చేసుకుంటారు. ఇతరులపై నిందలు వేయడం ఆపి, మీ బాధ్యతను ప్రేమతో స్వీకరించండి. ఈ వినయం, బాధ్యత అనే రెండు అసాధారణ లక్షణాలతో, మీరు ప్రపంచం నుండి గౌరవంతో పాటు నమ్మకాన్ని, ప్రేరణను కూడా అందుకుంటారు. ఇదే మీ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
భగవద్గీత బోధించే ప్రశాంత జీవన రహస్యం ఇదే..!
భగవద్గీత, యుద్ధభూమిలో శ్రీకృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ. అయితే, దాని అసలైన సందేశం కేవలం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి ఉంది. ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, మీ శక్తిమేరకు కృషి చేయడం. గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన పరమహంస యోగానంద, కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita) అనే తన మహత్తర గీతాభాష్యంలో, శ్రీకృష్ణుని సందేశం ఒక అర్థంకాని తత్వశాస్త్రం కాదని, గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు. భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించారు. “కర్మలు చేయుటయందు మాత్రమే నీకు అధికారము కలదు, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.” దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉండకండి. “నాకేమి లభిస్తుంది” అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 48వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చారు:“ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించుము. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావము గలవాడవై ఉండుము. ఈ మానసిక సమత్వమే యోగం అని చెప్పబడుతుంది.” జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తారు. ఈ సమభావమే నిజమైన యోగం—ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం. 3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీకృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశారు. “సమస్త కర్మలను నాకు అర్పించుము! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండుము.”సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు, అశాంతికారకమైన కోరికలు లేకుండా, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైక మార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించారు:“నీటిచే అంటబడని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి (భగవంతునికి) సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.”బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. ఈ సనాతనమైన బోధనల వ్యాప్తికి యోగానంద పశ్చిమ దేశాలలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)ను, మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను భారతదేశంలోను స్థాపించారు. ఆయన విశిష్ట గ్రంథం, ఒక యోగి ఆత్మకథ (autobiography of a yogi), లక్షలాది మందికి యోగమును, ధ్యానాన్ని— ముఖ్యంగా భగవద్గీతలో కూడా ప్రస్తావించబడిన క్రియాయోగమనే సనాతన ప్రక్రియను,— దైవానుభవం కలిగించే ఒక తిన్నని రాజమార్గంగా పరిచయం చేసింది.నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా— కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను — పనిచేయడం, కానీ ఫలితాల కోసం ప్రాకులాడకుండా ఉండటం. యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది—వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు.(చదవండి: ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!) -
దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్పై ఫిర్యాదులు..!
సాక్షి ఎరుమేలి: దేవస్వం బోర్డు యాత్రికుల వాహనాల పార్కింగ్పై ఫిర్యాదుల కలకలం. దేవస్వం బోర్డు ఒప్పందం కుదుర్చకున్న మొత్తం కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై తక్కణమే రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలంటూ మండిపడితున్నారు యాత్రికులు. నిజానికి దేవస్వం బోర్డు ప్రయాణికులు వాహనాల పార్కింగ్ ఫీజును రూ. 75గా నిర్ణయించగా, కర్ణాటకు చెందిన యాత్రికుల వాహనాలకు అధిక మొత్తంలో రూ. 250 వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. హిందూ సంస్థలు, పోలీసులు జోక్యం మేరకు అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అదీగాక కొంతమొంది యాత్రికులు పోలీసు కంట్రోల్ రూమ్కి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి రెవెన్యూ కంట్రోల్ రూమ్ బృందానికి ఫోన్ చేశారని, అలాగే వసూలు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారే గానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని హిందూ సంస్థ ఆఫీస్ బేరర్లు ఆరోపించారు. ఈ మేరకు అయ్యప్ప సేవా సమాజం రాష్ట్ర కార్యదర్శి ఎస్. మనోజ్ నేతృత్వంలో కొందరూ సంఘటన స్థలానికి చేరుకుని అధిక రుసుములు వసూలు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక రుసుములు వసూలు చేసినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించినప్పటికీ, చర్యలు తీసుకోవాల్సింది తాము కాదని చెప్పడం గమనార్హం. అదీగాక లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనా చర్యలు తీసుకుంటామనేది పోలీసుల వాదన. గత వారంన్నర కాలంలో యాత్రికుల వాహనాల నుంచి సుమారు మూడు రెట్లు పార్కింగ్ రుసుము వసూలు చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం దేవస్వం బోర్డు సైతం చర్యలు తీసుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఆఖరికి తిరిగి వెళ్లేటప్పుడూ కూడా ..దేవస్వం బోర్డు మైదానంలోని కాంట్రాక్టర్లు బిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి పార్కింగ్ రుసుము వసూలు చేస్తారు. పైగా దేవస్వం బోర్డు ఒప్పందం ప్రకారం, పార్కింగ్ రుసుముకు రశీదు ఇవ్వాలి. అంతేగాదు దోపిడీ పెరగడంతో, దేవస్వం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీలు వేసిన రశీదును జారీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా. అదీగాక వాహనాలు పార్కింగ్ మైదానంలోకి ప్రవేశించిన వెంటనే రశీదు జారీ చేయాలన్న ఆదేశం. అయితే అందుకూ విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ మైదానం నుంచి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు డబ్బు వసూలు చేస్తున్నాట్లు సమాచారం.నోటీసులు జారీ ..యాత్రికుల వాహనాలకు అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో కాంట్రాక్టర్కు దేవస్వం బోర్డు నోటీసులు జారీ చేస్తుంది. అలాగే ఒప్పంద ఉల్లంఘనకు గానూ తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది. (చదవండి: బుకింగ్ పాస్లు ఉన్నవారికే శబరిమలకు అనుమతి..! హైకోర్టు) -
బుకింగ్ పాస్లు ఉన్నవారికే శబరిమలకు అనుమతి..!
వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ పాస్లు ఉన్నవారిని మాత్రమే శబరిమలలోకి అనుమతించాలని కేరళ హైకోర్టు పేర్కొంది. అలాగే పాస్లోని తేదీ, సమయాన్ని అనుసరించాలని జస్టిస్ వి రాజా విజయరాఘవన్, జస్టిస్ కే వి జయకుమార్లతో కూడిన దేవస్వం బెంచ్ కూడా ఆదేశించింది. అధిక రద్దీ కారణంగా ఏదైనా అనుచిత ఘటన జరిగితే సహించబోయేది లేదని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుని, పోలీసులను గట్టిగా హెచ్చరించింది ధర్మాసనం. పరిపాలన నిర్లక్ష్యం లేదా అమలులో లోపాల కారణంగా నివారించదగిన అత్యవసర పరిస్థితులకు లక్షలాదిమంది యాత్రికులును బలి చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే నకిలీ పాస్లతో వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కూడా ఆదేశించింది. కనీసం తేదీని పాటించకుండా వచ్చేవారిని సన్నిధానంలోకి కూడా అనుమతించకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా బుకింగ్ విధానాన్ని తూచా తప్పకుండా పాటించాలని పేర్కొంది. నిజానికి వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్లపై ఆంక్షలు ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా సుమారు లక్ష మంది యాత్రికులు పుణ్యక్షేత్రానికి చేరుకున్నారనే శబరిమల స్పెషల్ కమిషనర్ నివేదిక ఆధారంగా కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా ఆదేశాలు జారీ చేసింది. అదీగాక హైకోర్టు కూడా యాత్రికుల సంఖ్యపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే వర్చువల్ క్యూ బుకింగ్లు 70,000, స్పాట్ బుకింగ్లు 5000 వద్ద ఉన్నాయని, కానీ తనిఖీ చేసేటప్పుడూ..సుమారు 7877 పాస్లపై స్పష్టమైన సమాచారం లేదని, స్పెషల్ కమిషనర్ హైకోర్టుకి నివేదించారు. అలాగే కొందరు నకిలీ పాస్లతో వస్తున్నట్లుకూడా హైకోర్టుకి సమాచారం అందింది. ముఖ్యంగా గుంపులు గుంపులుగా వచ్చే చాలామంది యాత్రికుల వద్ద పాస్లు లేవని, అమికస్ క్యూరీ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు స్వయంగా ఈ కేసుని పరిగణలోనికి తీసుకుని విచారించి ఇలా ఆదేశాలు జారీ చేసింది.(చదవండి: పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్ఆర్టీసీ సేవలకు అనుమతి) -
సజ్జన సాంగత్య ఫలం... బలం
ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒకరోజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి విశ్వామిత్రుడు వచ్చి ఆదిశేషుడిని తనతో రమ్మన్నాడు. ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో ‘‘ఓ మహర్షీ! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరిస్తే, ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తథ్యం. అప్పుడు కోటానుకోట్ల జీవరాశులు నా మూలంగా నాశనమైపోతాయి’’ అన్నాడు. ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి ‘‘అటువంటిదే గనక జరిగితేనేను నా అమోఘమైన తపశ్శక్తితో దానిని ఆపుతాను’’ అన్నాడు.ఆదిశేషుడు అందుకు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయాడు. ఆదిశేషుడు భయపడి చేసేదిలేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.అంతలోనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఆదిశేషుని వేయిపడగలపై భద్రంగా వున్న భూగోళం వెంటనే తాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి.జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఃఖంతో ఆదిశేషుడు మ్రాన్పడిపోగా, తపశ్శక్తి సంపన్నుడనన్న గర్వంతో విశ్వామిత్రుడు తన కమండలంలోని నీరు ధారపోసి ‘ఆగు’ అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భూగోళ పతనం ఆగకపోగా, మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో ‘‘నా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాను, వెంటనే ఆగు’’ అంటూ ఆజ్ఞాపించాడు. అయినా ఫలితం లేకపోయింది.దాంతో విశ్వామిత్రునికి అహంకార మైకం తొలగిపోయింది. భూమిని ఆపడానికి తన తపశ్శక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని ‘‘నీవు ఎప్పుడైనా సజ్జన సాంగత్యం చేసి ఉంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపోయి. భూపతనం ఆగి΄ోతుంది’’ అని చెప్పాడు. విశ్వామిత్రుడు ఆలోచనలో పడ్డాడు. తాను అందరితో తగవులు పెట్టుకోవడమేకాని సజ్జన సాంగత్యం చేసింది లేదు. సాటి ముని పుంగవులతోనూ తగవులే. సత్సంగం చేసింది లేదు. అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధార΄ోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆదిశేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తలకు ఎత్తుకున్నాడు.ఇందులోని నీతి ఏమిటంటే... మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి. సమయం సందర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చేస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం. అదే సజ్జన సాంగత్యం చేసినట్లయితే మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది. అందుకే సజ్జన సాంగత్యం ఎంతో బలం..ఫలం.– భాస్కర్ -
మూలధార చక్రం..కార్తికేయ స్థానం..!
మన సూక్ష్మ శరీరంలో శ్రీ కార్తికేయుని స్థానం కుడివైపు మూలాధార చక్రంలో ఉంటుంది. మన లోపల కుండలినీ శక్తి కుడివైపు మూలాధార చక్రాన్ని దాటి పైకి రావాలంటే, మనలో శ్రీ కార్తికేయుని గుణగణాలు ఉండాలి. ఆ గుణగణాలు ఏమిటో, కుడివైపు మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ శ్రీ కార్తికేయుని ఆశీస్సులను పొందడమెలానో శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల నుంచి తెలుసుకుందాం.శ్రీ గణేశుడు గణాలన్నింటికీ రాజు అయితే శ్రీ కార్తికేయుడు సర్వ సైన్యాధ్యక్షుడు. అతను మన కుడివైపు ఉండే పింగళా నాడిని ప్రభావితం చేసే శక్తికి ప్రతీకగా ఉంటాడు. ఈ శక్తి మన ప్రాణ శక్తితో అనుసంధానింపబడి ఉంటుంది. శ్రీ కార్తికేయుని అనుగ్రహం దడం వలన మానవులకు పసిపిల్లల అమాయకత్వంతో కూడిన తేజస్సు, చక్కటి క్రియాశీలత, చెడును అంతమొందించ గల అంతర్గత దైవ శక్తి లభిస్తాయి. భగవంతుని పట్ల వినయ విధేయతలు, నాయకత్వ లక్షణాలు, అందరికీ మార్గ దర్శకత్వం చేయగల శక్తి, దైవికమైన జ్ఞానం, వివేకం లభిస్తాయి.శ్రీ కార్తికేయుని నివాసం కుడివైపు మూలాధార చక్రమే అయినా కుడివైపు నాడి అయిన పింగళా నాడి మొత్తంపై అతని ప్రభావం ఉంటుంది. అందువలనే అతనికి ‘సుపింగళా’ అనే నామం ఏర్పడింది. మన కుడివైపు మూలాధార చక్రం శుభ్రమైనప్పుడు, కుడివైపు ఉండే పింగళా నాడి మొత్తం శుభ్రమవుతుంది. మన లోపల మూలాధార చక్రం, ఆజ్ఞా చక్రం ఒకదానితో మరొకటి పరిపూర్ణ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే కుడివైపు మూలాధార చక్రం శుభ్రమైనప్పుడు కుడివైపు ఆజ్ఞా చక్రం కూడా శుభ్రపడి మనలో అహంకారాన్ని నియంత్రించే శక్తిని మెరుగుపరుస్తుంది. ‘అహం కరోతి ఇతి అహంకారః’ అన్నారు మన పెద్దలు. అంటే ‘నేను చేస్తున్నాను అనుకుంటే అది అహంకారం‘. నిజానికి మన ద్వారా జరిగే ప్రతీ పనినీ మన లోపల ఉండే భగవంతుని శక్తి జరిపిస్తుంది. ఆ నిజాన్ని విస్మరించి మన ద్వారా ఏదైనా గొప్ప పని జరిగినప్పుడు అది మనమే చేశామనుకొని భ్రమ పడితే, అప్పుడు అది మన సూక్ష్మ శరీరంలో అహంకారమనే బుడగను ఏర్పరుస్తుంది. ఈ అహంకారమనే బుడగ మన ఆజ్ఞా చక్రం ఎడమవైపు అవరోధంగా నిలిచి మన కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రమును దాటకుండా అడ్డుకుంటుంది. శ్రీ కార్తికేయుని ధ్యానము వలన అహంకారము తగ్గి మన లోపల శ్రద్ధ నెలకొంటుంది. మన మెదడులో దైవికమైన విచక్షణా శక్తి ఏర్పడి జ్ఞానంతో ప్రకాశిస్తుంది. భగవంతుని సంహారక శక్తి శ్రీ కార్తికేయుడు నరకలోక ద్వారాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. శ్రీ భైరవనాథుడు మన ఎడమ వైపు ఉండే ఇడా నాడి మొత్తం సంచరిస్తూ, అక్కడ ఏమైనా దుష్ట శక్తులు ఉంటే వాటిని నరకానికి తరిమేస్తారు. అవి తిరిగి మన మీద దాడి చేయకుండా ఉండడానికి శ్రీ కార్తికేయుడు నరకలోక ద్వారాన్ని మూసివేస్తాడు. కావున కుడివైపు మూలాధార చక్రం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో, వారు ఎడమవైపు దుష్ట శక్తుల బారిన పడకుండా ఉంటారు. ఆ విధంగా శ్రీ కార్తికేయుని ప్రభావం ఎడమవైపు ఇడా నాడి మీద కూడా ఉంటుంది. మానవులలో ఉండే మొండితనం, మూర్ఖత్వం, క్రూరత్వం, రాక్షసత్వం వంటి గుణాలు కుడివైపు మూలాధార చక్రాన్ని బలహీన పరుస్తాయి. మనలోని రాక్షస గుణాలు అంతం కావాలంటే మన అంతర్గత సూక్ష్మ శరీరంలో కార్తికేయుని స్థానమైన కుడి మూలాధార చక్రం బలంగా ఉండాలి. – డా. పి. రాకేశ్(పరమపూజ్య మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాలు, ప్రవచనాల ఆధారంగా...) (చదవండి: ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!) -
ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!
హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం...’ ఎటు చూసినా‘నమస్తేస్తు మహామాయే...’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందం చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే! ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది మహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం...లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.ఐదువారాల అద్భుత వ్రతం...మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. ఒకవేళ ఏ కారణం వల్లనైనా మొదటి గురువారం లేదా మధ్యలో మరేదైనా గురువారం నాడు ఈ వ్రతం చేయలేనివారు కూడా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.వ్రతవిధానంముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాన్ని శ్రద్ధతో సమర్పించాలి. ‘ ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ ‘అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమాప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం అట్లు, తిమ్మనంమూడోవారం అప్పాలు, పరమాన్నమునాలుగోవారం చిత్రాన్నం, గారెలు నివేదించాలి. ఐదోవారం నాడు అమ్మవారిని ఈ వ్రతానికి పూర్ణ ఫలాన్నిమ్మని ప్రార్థిస్తూ పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని ΄ాటించాలనేది పండితుల ఉవాచ.నియమనిష్ఠలు కీలకంగురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదుర΄ోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి ప్రీతికరమైన పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళ ద్రవ్యాలను సమర్పించడం ఆమె అనుగ్రహాన్ని ΄÷ందే మార్గాలలో ఒకటైన సులభ మార్గం. – డి.వి.ఆర్. (చదవండి: సర్వం పర్వదినాలే..! మార్గాన్ని చూపేది కాబట్టి..) -
మనం చేసిన తప్పుకు మనమే బాధ్యులం
ఈ ప్రపంచంలో తప్పుడు పనులు, హింస, వంచనలతో కావాల్సినంత సంపదను పొంది సుఖంగా ఉన్నవారు ఒక వైపు ఉంటే, సదా సత్యాన్నే చెబుతూ ధర్మ కార్యాలలో ఆసక్తులై కూడా దుఃఖంతోనే జీవితాన్ని గడిపే ప్రజలు మరోవైపు ఉన్నారు. కొంతమందికి ఎన్ని మందులు స్వీకరించినా కూడా రోగం పరిహారం అవ్వట్లేదు. అయితే ఈ ఔషధాలను స్వీకరించకుండా ఆరోగ్యవంతులై బతుకుతున్నారెంతోమంది. కొంతమందికి సంపదల వాన కురుస్తుంది. అయితే డబ్బులు అవసరం ఉన్నవారికి మాత్రం ఒక చిల్లిగవ్వ కూడా లభించదు. భగవంతుడిని సర్వసమర్థుడు అంటున్నారు. అలా అయితే అతడు అందరికీ సుఖాన్ని కలిగించాలి కదా! ఎందుకు ఈ పక్షపాతం? ఇలా లోకంలో జనసామాన్యానికి కలిగే ప్రశ్నలను తీసుకొని ధర్మవ్యాధుడు ఇలా సమాధానం చెబుతున్నాడు.మన జీవితంలో ఈ లోటుపాట్లకు బాధ్యులం మనమే. భగవంతుడు కాదు. మనిషి జీవితం కేవలం ఒక జన్మ కే పరిమితం కాదు. నూరు జన్మలలో చేసిన కర్మలను ఈ జన్మలో కాని ముందు జన్మలో గాని అనుభవించాల్సిందే. అలా అని మన కష్టాలన్నింటికీ దేవుడే కారణం అని అతడిని దూషించకూడదు.లోకంలో కొందరు దుష్కర్మలను చేసి వాటిని దేవుడిపై వేస్తుంటారు. అన్నింటినీ చేయించేవాడు దేవుడే అయినప్పుడు నేను చేసే తప్పులలో నా పాత్ర ఏముంటుంది? ఇలా అహంకారంతో చేసిన చెడ్డ పనుల గురించి పశ్చాత్తాపం లేకుండా తిరుగుతుంటారు. వర్షం అన్ని ప్రదేశాలో సమానంగా కురుస్తున్నట్లు, భగవంతుడు కూడా అనాథలైన జీవులను భూమిపైకి తెస్తాడు. తర్వాత వారి వారి స్వభావానికి అనుగుణంగా వారు పెరుగుతారు. భగవంతుడు ఎదుగుదలకు కావలసిన అనుకూలతలను మాత్రం ఏర్పాటు చేస్తాడు. -
స్వీకరించే విధానం
అదొక పట్టణం. నాలుగు రోడ్ల కూడలి వద్ద బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు ఒక పత్రికా విలేఖరి. ఇంతలో జోరుగా వర్షం మొదలైంది. పక్కనే చిన్న చాటు ఉంటే అక్కడ నిలబడ్డాడు.ఆగకుండా గంటసేపు వానపడటంతో వీధులన్నీ జలమయమయ్యాయి. వాన నీళ్ళు, వీధి కాలువ నీళ్ళు కలిసిపోయి దారులన్నీ నీళ్ళతో నిండిపోయాయి. దాంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.గంట తర్వాత, వాన నిలవడంతో నీళ్ళు మెల్లమెల్లగా వెళ్ళసాగాయి. మళ్ళీ వాహనాల రద్దీ మొదలయ్యింది. ముగ్గురు మధ్య వయస్కులు అదే దారిన చిన్నగా నడిచి వెళ్తున్నారు. ఇంతలో ఒక కాలేజీ కుర్రవాడు వేగంగా మోటార్ సైకిల్పై వచ్చాడు. బండి వేగానికి రోడ్డు మీద ఉన్న మురికి నీళ్ళు వారిపై పడ్డాయి. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి కాలేజీ కుర్రవాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆ మోటార్ సైకిల్ నడిపే కుర్రవాడిని పట్టుకోవాలని బండి వెనుకే పరుగులు తీశాడు. అయితే అది వీలుకాలేదు.రెండోవ్యక్తి ‘‘వీడు మనిషి కాదు, వరాహం. ఈ రూపంలో వాహనం మీద వచ్చి నన్ను, నా గుడ్డల్ని మురికి చేసి వెళ్ళాడు’’ అని బాధపడుతూ వెళ్ళిపోయాడు.మిగిలిన మూడో వ్యక్తి అవేవీ పట్టించుకోలేదు. రోడ్డు పక్కనున్న కుళాయి వద్ద ఒంటికి, గుడ్డలకి అయిన మురికిని శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు.అక్కడే ఉండి అంతా చూసిన ఆ విలేఖరి గబగబా ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. ‘‘మీ మీద మురికి నీళ్ళు పడ్డాయి కదా, మీకు కోపం రాలేదా? ఆ కుర్రవాడిని తిట్టాలనిపించలేదా?’’ అని అడిగాడు.అతడు నవ్వి ‘‘నాకెందుకు కోపం? నేను మరింత రోడ్డు పక్కగా నడవాల్సింది. నామీద నీళ్ళు పడేట్లు నేను నడవడం వల్ల నాకీ ఇబ్బంది వచ్చింది. నన్ను నేను నియంత్రించుకోగలను కానీ ఎదుటివారి చర్యలను ఎలా నియంత్రించగలను. ఆ కుర్రవాడిని పట్టుకుని, నిలబెట్టి కొట్టినా, ఫలితం ఉంటుందని నేను అనుకోను’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.ఆశ్చర్యపోయాడు ఆ విలేఖరి. ‘ఒకే సమస్య. ముగ్గురూ మూడు రకాలుగా స్వీకరించారు. సమస్య ఏదైనా మనం స్వీకరించే విధానాన్ని బట్టే ఫలితం ఉంటుంది’ అని తెలుసుకున్నాడు. అప్పుడే తను ఎక్కాల్సిన బస్సు రావడంతో అందులో ఎక్కి కూర్చున్నాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
శిక్ష కాదు... శిక్షణ
మానవజన్మ అనేక జన్మల కర్మఫల సంపద. ప్రతి జీవి తన కర్మానుసారమే ఈలోకంలో జన్మిస్తుంది. ఎదుగుతుంది. అనుభవిస్తుంది. మన కర్మల ప్రకారమే మన స్థితి, మన గతి నిర్ణయించబడతాయి. కర్మఫలానికి, ఆత్మకు అవినాభావ సంబంధం ఉంది. మనం చేసే ప్రతి ఆలోచన, మాట, చర్య విశ్వంలో ఒక ప్రకంపన సృష్టిస్తుంది. ఆ ప్రకంపన తిరిగి మనకే వస్తుంది. ఇది కర్మసూత్రం గాఢమైన సత్యం. కర్మానికి మూడు స్థితులు ఉంటాయి. అనేక జన్మలలో మనం చేసిన మొత్తం కర్మల నిల్వ సంచితకర్మ. ఈ జన్మలో ఫలించబోయే కర్మభాగం ప్రారబ్ధకర్మ. ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలు, భవిష్యత్తులో ఫలితాలుగా వచ్చేవి ఆగామికర్మ. ఈ మూడు కలయికలతో మన జీవితం నడుస్తుంది. మనకు ఎదురయ్యే సుఖం, దుఃఖం, విజయాలు, అపజయాలు ఇవన్నీ ఈ కర్మఫలాల ప్రతిఫలాలు. గతంలో చేసిన కర్మ ఈ రోజున ఫలిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాభారతంలో ధృతరాష్ట్రుడు సత్పురుషుల సలహాలు ఉన్నా అంధత్వం వదలలేకపోయాడు. ఆ దృష్టిహీనత కేవలం భౌతికం కాదు మానసికం. గత జన్మ కర్మఫలమే అతడిని అహంకారంలోకి నెట్టింది. చివరకు తన వంశ నాశనం చూసి అనుభవించాడు. ఇదే కర్మఫలానికి దృఢమైన ఉదాహరణ. కర్మను ఎవరూ తప్పించుకోలేరు. కానీ, దాన్ని ఆత్మజ్ఞానం, సహనం, భక్తి ద్వారా అధిగమించవచ్చు. శ్రీ కృష్ణుడు గీతలో ‘నీకు కర్మ చేయడానికి మాత్రమే అధికారముంది. ఫలితాన్ని నియంత్రించే శక్తి నీచేతిలో ఉండదు. కాబట్టి కర్మను నిష్కామ భావంతో చెయ్యాలి.’ అని చెప్పాడు. అదే నిష్కామ కర్మ. రామాయణంలో శ్రీరాముడు అనేక క్లేశాలను ఎదుర్కొన్నాడు. కానీ, ఎప్పుడూ ధర్మమార్గాన్ని వదలలేదు. ఆయన తన కర్మను కర్తవ్యభావంతో ఆచరించాడు. ధర్మానికి కట్టుబడి ఉండటంవల్లె చివరకు విజయాన్ని పొందాడు. కష్టాలు మన శత్రువులు కాదు. అవి మన ఆత్మను పరీక్షించే ఉపాధ్యాయులు. మనిషి ఎదుర్కొనే ప్రతి దుఃఖం శిక్ష కాదు. అది శిక్షణ. కర్మఫలం మన ఆత్మను మలచే సాధనం. అగ్నిజ్వాలల్లో పసిడి కరిగి మెరుస్తున్నట్లుగా, కష్టాల్లో ఆత్మ పవిత్రమవుతుంది. కర్మఫలం నుండి విముక్తి పొందాలంటే మనఃసాక్షిగా జీవించాలి. మనం కర్తలమని అనుకునే అహంకారాన్ని వదిలి ‘నేను కేవలం సాధనం మాత్రమే’ అనే భావంతో ఉండాలి. శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సమతాభావన అంటే సుఖదుఃఖాలను సమంగా స్వీకరించడం. ఆ స్థితిలో చేసిన కర్మ మనను బంధించదు. బలిచక్రవర్తి తన సంపదను, అధికారాన్ని విష్ణువుకు సమర్పించి కర్మబంధాలనుంచి విముక్తి పొందాడు. హరిశ్చంద్రుడు సత్యంకోసం సర్వం త్యజించి ఆత్మశుద్ధిని పొందాడు. పాండవులు కష్టాలను భరించి, ధర్మాన్ని విడువకపోవడంతో, సహనమే వారి విజయానికి మూలం అయ్యింది. మన జీవితంలో జరిగే ప్రతీ సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. అదే మన కర్మ. మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే దాన్ని భయంగా కాదు, అవకాశంగా చూస్తాం. కర్మను ధర్మంతో చెయ్యాలి. ఫలితాన్ని సమంగా స్వీకరించాలి. కర్మఫలం మనల్ని పరీక్షిస్తుంది. ఆధ్యాత్మికతే దానికి సమాధానం చెబుతుంది.కర్మఫలం భయంకరమైనదే కావొచ్చు. కానీ, భక్తి, భగవన్నామస్మరణ కర్మ బంధాలను కూడా తెంచి విముక్తి కలిగిస్తుందనడానికి భాగవత పురాణంలో కనిపించే అజామిళుడి కథే ఉదాహరణ. – విరించి -
మనసే ప్రశాంతి నిలయం
ఆధునిక ప్రపంచంలో ప్రతి వ్యక్తి శాంతిని పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అయితే కేవలం ఆధ్యాత్మిక సూత్రాల ద్వారానో లేదా మార్కెట్ నుండి వస్తువుగానో ప్రశాంతత పొందలేము. అలాగే గ్రంథాల జ్ఞానం ద్వారా లేదా జీవితంలో ఉన్నత స్థానం ద్వారా కూడా దానిని పొందలేము. ‘నాకు ప్రశాంతత కావాలి’ అని పరితపించేవారు ముందుగా ‘నేను, నాకు, నాది’ అనే స్వార్థాన్ని విడనాడాలని, అలాగే, ‘ఇది ఎలాగైనా నా సొంతం కావాల్సిందే’ అనే దురాశను తొలగించుకోవాలి. అప్పుడే అన్ని అశాంతులూ తొలగి మానసిక ప్రశాంతత చేకూరుతుందంటారు భగవాన్ సత్యసాయి బాబా.నిష్కామ కర్మ ఆచరిస్తూ, ఆధ్యాత్మిక ధర్మాలను పాటిస్తూ, జ్ఞాన చక్షువులతో అందరిలో, అన్నింటిలో ఆ దైవాన్ని దర్శించడమే అసలైన వేదాంతం అంటారు సాయి. భగవాన్ చెప్పిన ‘అందరినీ ప్రేమించు అందరినీ సేవించు’ అనే ఒక్క మహా వాక్యం అందరి జీవితాలను ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే మహాబోధ. మోక్షానికి దగ్గర చేసే మార్గం. ‘ప్రచారం, ఆర్భాటం, ప్రదర్శన కోసం చేసే సేవ మీ కీర్తిప్రతిష్ఠలు పెంచవచ్చునేమో కానీ అది సమాజానికి మంచి సందేశాన్ని, స్ఫూర్తిని ఇవ్వలేదు’ అన్నది సత్యసాయి బోధల సారం. ‘మనలో సేవాభావం ఉంటే, అది వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. ఉన్నతమైన గుణసంపదను ఇస్తుంది’ అని భగవాన్ తన విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులకు బోధించేవారు.దృఢమైన భక్తి, నియమ పాలన, కర్తవ్య శీలత, యుక్తాయుక్త విచక్షణ, సాధించి తీరాలనే సంకల్పం... ఈ అయిదూ విజయానికి చేరువ చేసే సోపానాలని బాబా బోధించేవారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, విలువలు పాటించే ప్రతి మనిషీ దైవ సమానుడేనన్నది సత్యసాయి సందేశం. – డి.వి.ఆర్. -
ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!
ఒకప్పుడు వాళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. సాధారణంగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత..ఉన్నత చదువుల రీత్యా లేదా మరేదైనా కారణాల వల్ల విడిపోవడం అనేది కామన్. అలానే ఈస్నేహితులు వారి లక్ష్యాల దృష్ట్యా వేరయ్యారు ఆ మిత్రులు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు శబరిమల సన్నిధానంలో తారసపడి..వేర్వేరుగా విధులు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకరు భద్రతా బాధ్యతలైతే మరొకరు స్వామి సేవలో తరిస్తుండటం విశేషం.ఆ స్నేహితులే ప్రసాద్ నంబూద్రి, షోజులు. ఎరన్నూర్లోని చాలకుడికి చెందిన ప్రసాద్ నంబూద్రి, మేలూర్కి చెందిన షోజులిద్దరూ. 1997 నుంచి 99 వరకు ఐటీఐలో కలిసి చదువుకున్నారు. రెండు సంవత్సరాల అనంతరం పై చదువుల దృష్ట్యా ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. కట్ చేస్తే..26 ఏళ్లకు అదే స్నేహితులు అయ్యప్పస్వామి సేవలో తరిస్తుండటం చూస్తే..ఎవరిని ఎప్పుడూ కలపాలో అప్పుడే కలుపుతాడు అనేందుకు ఈ ఫ్రెండ్సే ఉదాహరణ. ఈ ఇద్దరు యాదృచ్ఛికంగా శబరిమలలోనే విధులు నిర్వరిస్తుండటం అత్యంత ఆసక్తికర అంశం. ఇక్కడ షోజు ఏఎస్ఐగా శబరిమలలో భద్రతా బాధ్యతలు చూసుకుంటే..నంబూద్రి యాత్రికులను నియంత్రించడం, స్వామి దర్శనం అయ్యేలా చూసే మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంటే ఇక్కడ షోజు తన స్నేహితడు మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్న నంబూద్రికే భద్రత కల్పిస్తూన్నాడు. ప్రస్తుతం షోజు త్రిస్సైర్ జిల్లా స్పెషల్ బ్రాంచ్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తుండగా, అదేసమయంలో నంబూద్రి శబరిమల మేల్శాంతిగా ఎన్నికయ్యారు. దాంతో ఆయనకు సెక్యూరిటీగా యాదృచ్ఛికంగా చిన్ననాటి స్నేహితుడు షోజునే నియమాకం అయ్యాడు. అలాగే నంబూద్రి వచ్చే ఏడాది వరకు ఈ పదివిలో కొనసాగనున్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత విధుల రీత్యా ఒకచోటే ఆ ఇద్దరు నేస్తాలు కలిసి ఉండటం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కాదు కదూ..!. తంత్రి, మేల్శాంతి అంటే..'తంత్రి', 'మేల్శాంతి' అనే పదాలు ఆలయ పూజలో అత్యున్నత స్థానాలను సూచిస్తాయి. ముఖ్యంగా శబరిమల వంటి ఆలయాలలో. 'తంత్రి' అంటే ప్రధాన పూజారి. ఆయన ఆలయ నిర్వహణ, నియామకాల తోపాటు ముఖ్యమైన క్రతువులకు బాధ్యత వహిస్తారు. 'మేల్శాంతి' అంటే ప్రధాన పూజారి సహాయకుడు లేదా ముఖ్య పూజారి అని అర్థం. ఈయన ప్రధాన పూజారి సమక్షంలో రోజువారీ పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.Source: manorama news(చదవండి: శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం) -
టెంపుల్ టౌన్ జాబితాలో మరో ఆలయం
మంథని: ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లు. వేయి సంవత్సరాలకు పైగా మహోన్నత చరిత్ర కలిగిన మంత్రపురి దేవాలయాలకు నిలయమై టెంపుల్ టౌన్గా కూడా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా అష్టభుజ వినాయకుని గుడి, దక్షిణ భారతదేశంలో ఏకైక పశ్చిమముఖ శివలింగం పెద్దపల్లి జిల్లా మంథనిలోనే దర్శనమిస్తాయి. మంథనిలో ఒక్క వేంకటేశ్వర స్వామి ఆలయం మినహా అన్నిదేవతల ఆలయాలను పురాణకాలంలోనే నిర్మించారు. ఇటీవల మరిన్ని దేవాలయాలు వెలిశాయి. తాజాగా గురువారం తెలంగాణలో కొత్తగా మూడు దేవాలయాలు నిర్మించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రకటించారు. ఇందులో కరీంనగర్, దుబ్బాక, మంథనికి చోటు కల్పించారు. కాగా మంథని మండలం కన్నాల గ్రామంలో సెంటిమెంట్ టెంపుల్గా పేరున్న శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. కానీ, టీటీడీ (TTD) దేవాలయ నిర్మాణంలో మంథనిలో అన్ని దేవాలయాలకు ప్రసిద్ధిగా పరిఢవిల్లనుంది. అన్ని దేవతామూర్తుల ఆలయాలు ప్రసిద్ధి గాంచిన మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయంతోపాటు కన్యకా పరమేశ్వరి, లలితాదేవి, సరస్వతీ అమ్మవారి దేవాలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అలాగే 11 పురాతన హనుమాన్ దేవాలయాలతో పాటు నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయం.. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశ్చిమ ద్వారం, పశ్చిమ ముఖం కలిగిన శివలింగం మంథనిలో మాత్రమే ఉంది. మరో ఐదు శివాలయాలు ఉన్నాయి. మంథని పట్టణానికి ఉత్తర ముఖంలో వెలసిన మహాగణపతి ఆలయం భక్తులకు అభయమిస్తూ పూజలు అందుకుంటోంది. పూజల్లో మొదటి ఆదిదేవుడైన గణపతినే కొలుస్తారు. ఇక్కడ గణపతికి ప్రత్యేకంగా దేవాలయం ఉంది. గౌతమేశ్వరుడు మంథని (Manthani) పట్టణ సమీపంలో ప్రవహిస్తున్న గోదావరి నది పక్కన ఎత్తయిన ప్రదేశంలో ప్రాచీన కళ ఉట్టిపడుతుండేదే గౌతమేశ్వరాలయం. శతాబ్ద కాలం క్రితం ఈ దేవాలయాన్ని వొజ్జల కిష్టయ్య అనే వ్యక్తి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం (Temple) ఎన్నోసార్లు గోదావరి నది ఆటుపోట్లకు గురైనా చెక్కు చెదరకుండా ఉంది. దేవాలయ ప్రాంగణంలోని పురాతన ఆలయాలు కొంత మేరకు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంగణంలో శివపంచాయనం, రామాలయం, సరస్వతి, లక్ష్మీదేవిల ఆలయాలు ఉన్నాయి. దత్తాత్రేయ ఆలయం మంథని పట్టణ సరిహద్దులో నిర్మించిన దత్తాత్రేయ ఆలయం ఈ ప్రాంత భక్తులకు కొంగుబంగారమైంది. అరవై ఏళ్ల క్రితం మంథనికి చెందిన దోమల రాధమ్మ శిష్యుడైన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి మహారాజాకిషన్ ప్రసాద్ సహాయంతో ఈ దేవాలయం రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఏటా ఈ ఆలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలను, నవరాత్రులను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. శీలేశ్వర – సిద్ధేశ్వర ఆలయం పట్టణ నడిబొడ్డున వెలసిన శీలేశ్వర–సిద్ధేశ్వరాలయం మంథని చరిత్రకు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తోంది. కాకతీయ సైన్యా«దీశుడు శీలప్పనాయుడు, సిద్ధప్పనాయుడుల జ్ఞాపకార్థం ఈ దేవాలయాన్ని ప్రోలరాజు నిర్మించినట్లు తెలుస్తోంది. మంథనికి చెందిన లోకె రామన్న రామానాంద్ర సరస్వతీ స్వామిగా సన్యాసం స్వీకరించి 1942లో ఆలయాన్ని పునరుద్ధరించారు. సుందరమైన శిల్పసంపదతో నిర్మించిన ఈ ఆలయంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయంలో గర్భగుళ్లకు ఇరువైపులా నల్లరాతితో చెక్కిన నందీశ్వరులను, నాట్య మయూరిల విగ్రహాలను ఏర్పాటు చేశారు. చింతపండు స్వామి వీణవంక నుంచి చింతపండు బండ్లపై వచి్చన లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాన్ని వరదరాజ స్వామి ఆలయంలో ప్రతిíÙ్ఠంచారు. ఈ దేవాలయానికి మంథని చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ, గరుడ విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆండాళ్ అమ్మవారు, గోదాదేవి, శ్రీకృష్ణార్జునుల విగ్రహాలు దర్శనమిస్తాయి.పశ్చిమ ముఖ శివలింగం దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశి్చమ ద్వారం, పశి్చమ ముఖం కలిగిన శివలింగం మంథనిలో మాత్రమే ఉంది. భిక్షేశ్వరాలయంగా పిలిచే ఈ ఆలయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీలేశ్వర– సిద్ధేశ్వర దేవాలయం, సురాబాండేశ్వరుడు, గౌతమేశ్వరుడు, ఓంకారేశ్వరుడు కొలువై ఉన్నారు. వీరబ్రహ్మంగారి దేవాలయం, షిరిడీసాయి ఆలయం, అయ్యప్ప దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం, బలవీర హనుమాన్ ఆలయం, నాగదేవత ఆలయం, కాళీకాదేవి, గంగాదేవి, బద్దిపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని అనడానికి మంత్రపురిలోని ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.. -
Margasira Masam 2025: సర్వం పర్వదినాలే..
పరమ పవిత్రమైన కార్తిక మాసం నేటితో ముగుస్తోంది. రేపటినుంచి విష్ణుప్రీతికరమైన మార్గశిర మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ సందర్భంగా మార్గశిర మాస విశిష్టతను తెలుసుకుందాం.మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ దేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయన్నది పెద్దల మాట. మార్గశిర మాసం మాసాలలోకెల్లా ’శీర్షం’ అంటే’ శిరసు’ వంటిదని అర్ధం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రం మృగశిర కాబట్టి ఈ మాసానికే మార్గశిరమని పేరు.రోజుకో పర్వం...మార్గశిర మాసంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే. అసలు ఈ నెలలోని మొదటిరోజైన శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా జరుపుకోవడంతో ఈ మాసంంలోని పర్వదినాల పరంపర ప్రారంభం కానుంది. ఈ రోజు గంగాస్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి, మిత్ర సప్తమి, గీతా జయంతి, దత్త జయంతి వంటి విశేష పర్వదినాలు వచ్చేది ఈ మాసంలోనే.మార్గశిర గురువార వ్రతంకేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. ఐదువారాల అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువార లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు.మార్గశిర గురువారం వ్రతంసాధారణంగా గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలోనూ, పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడూ ఈ పూజను ఆచరించడం సర్వ శ్రేష్టం. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద. ఆరోగ్య భాగ్యం చేకూరతాయని విశ్వాసం.ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసం. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళాలతో పూజించడం పుణ్యప్రదం.ద్వాదశినాడు పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించడం విశిష్ట ఫలప్రదం. శ్రీ విష్ణుతోపాటు సూర్యుని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయ నమః, ఓ నమో నారాయణాయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం. ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని వృత్తికతో, తులసి ఆకులను తీసికొని ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించడం వల్ల సర్వ విపత్తులూ తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పెద్దలు చెబుతారు. – డి.వి.ఆర్. -
అయ్యప్ప భక్తులకు అలర్ట్..! శబరిమలలో మళ్లీ..
సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజా, పతనం తిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శబరిమల యాత్ర ప్రాంతంతో సహా మొత్తం ఆరు ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ భారీ వర్షాలకి కారణం అని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ఈ రోజు, రేపు శబరిమల సన్నిధానం, పంప, నీలక్కల్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా ప్రాంతల్లో తప్పనిసరిగా..సన్నిధానం, పంబా, నీలక్కల్లలో ఇవాళ, రేపు 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు వర్షం పడే అవకాశం ఉందిఅలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో 24 గంటల్లో 64.5 మిమీ నుంచి 115.5 మిమీ వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అయ్యప్ప భక్తులకు భద్రతా సూచనలుభారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ యాత్రికులకు ప్రత్యేక హెచ్చరిక సూచనలు జారీ చేసింది.కొండచరియలు విరిగిపడటం, బురదజల్లులు, పర్వత వరదలకు గురయ్యే ప్రాంతాలలో నివసించేవారు, అలాగే నదుల వెంబడి, ఆనకట్టల దిగువన నివసించేవారు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.విపత్తు సంభవించే ప్రాంతాల్లో నివసించేవారు పగటిపూట సమీపంలోని సహాయ శిబిరాలకు తరలి వెళ్లాలి. వాటి సమాచారం కోసం ప్రజలు స్థానిక స్వపరిపాలన, రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, భద్రత లేని ఇళ్లు లేదా బలహీనమైన పైకప్పులు ఉన్న ఇళ్లలో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.వర్షపు రోజుల్లో అనవసరమైన ప్రయాణాలు, పర్వతారోహణను నివారించాలి.శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే భద్రతాధికారుల సూచనల మేరకు ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉందన స్పష్టం చేసింది కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ.(చదవండి: శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!) -
స్త్రీగా ఉండటం అంటే అదే..!: మానికా విశ్వకర్మ
థాయిలాండ్లో జరుగుతున్న మిస్ యూనివర్స్ పోటీలో మానికా విశ్వకర్మ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆదివారం జరిగిన చైన్రియాక్షన్ ప్రశ్న సెషన్లో ఇతర పోటీదారుల తోపాటు మానికా విశ్వకర్మ కూడా పాల్గొన్నారు. ఆ రౌండ్లో ఒక ఇంటర్వ్యూర్ మానికాను మాజీ మిస్ యూనివర్స్ (1994) సుష్మితా సేన్ అడిగిన ప్రశ్ననే అడగడం విశేషం. అందుకు చాలాచక్కగా సమాధానం ఇచ్చి..తాను వేషధారణతోటే కాదు, తెలివితేటలతో కూడా మెప్పించగలనని చెప్పకనే చెప్పింది.అప్పుడు మిస్యూనివర్స్ ఫైనల్ సుష్మితా సేన్ని 'మీకు స్త్రీగా ఉండటంలో సారాంశం ఏమిటి?' అనే ప్రశ్న ఎదురైంది. అదే ప్రశ్న మళ్లా ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల మానికాకు యాధృచ్ఛికంగా ఎదురైంది. అయితే మానికా ఏం సమాధానం ఇచ్చిందంటే..నాడు సుష్మితా చాలా సింపుల్గా ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. స్త్రీగా ఉండటం అంటే జీవితాన్ని పోషించగల సామర్థ్యం, మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని పోషించగల సామర్థ్యం అని చెప్పగా, మానికా ఇలా చెప్పింది. "మహిళలను సమాజం తరుచుగా పలు పాత్రల్లో చూస్తుంటుంది. అయితే మహిళలు మాత్రం తాము ఒక వ్యక్తిగా మానవుడిగా చూడాలని కోరుకుంటారు. మాకు పెంచే సామర్థ్యం, జీవితాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. అంతేగాదు మా చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని అందంగా తీర్చిద్దిగల సామర్థ్యం కూడా మాకు ఉంది. సింపుల్గా చెప్పాలంటే స్త్రీగా ఉండటం అంటే అదే. కేవలం ప్రతి వస్తువు అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, దానిని స్వీకరించి.. విస్తరించగల సామర్థ్యం కూడా ఆమెకు ఉంది. అంటే స్త్రీగా ఉండటం అంటే..అనంతంగా ఉండటమే దాని సారాంశం." అని మానికా అత్యద్భుతంగా సమాధానమిచ్చింది. కాగా ఢిల్లీలో నివశిస్తున్న మానికా విశ్వకర్మ ప్రస్తుతం పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతోందామె. ఈ ఏడాది ఆగస్టులో మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఇక ఈ 74వ మిస్ యూనివర్స్ పోటీ నవంబర్ 21న థాయిలాండ్లోని నోంతబురిలోని పాక్ క్రెట్లోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్లో ప్రతిష్టాత్మకంగా జరుగనుంది. View this post on Instagram A post shared by SUMMER SMITH (@crownsisters) (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!
శబరిమల దేవాలయాన్ని సన్నిధానం అని కూడా అంటారు. సన్నిధానం అనేది దివ్య స్థలం లేదా దేవుడు నివసించే ప్రదేశం. శబరిమల ఆలయం భూమి మట్టం నుంచి 40 అడుగుల ఎత్తులో పీఠభూమిపై ఉంది. దీనిలో బంగారు పూతతో కూడిన పైకప్పుతో ప్రధాన ఆలయం (గర్భగుడి), దాని పైన నాలుగు గోపురాలు, రెండు మండపాలు (గాజెబో లాంటి నిర్మాణాలు), బలిపీఠం (యజ్ఞ శిలా పీఠాలు), బలికల్పుర (పూజా నైవేద్యాలు చేయడానికి రాతి నిర్మాణం) బంగారం తాపడం చేసిన ధ్వజస్తంభం తదితరాలు ఉంటాయి. అలాగే ఈ సన్నిధానానికి దారితీసే పతినెట్టాంపడి లేదా పద్దెనిమిది మెట్లు బంగారంతో తాపడం చేసి ఉంటాయి. పద్దెనిమిది మెట్ల అడుగు భాగంలో ఇద్దరు ద్వారపాలకులు - వలియ కడుత స్వామి, కరుప్ప స్వామి ఉంటారు. వావర్ నడ కూడా దీనికి సమీపంలోనే ఉంది. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని దర్శంన చేసుకునేందుకు పెద్దసంఖ్య మాలధారులు ప్రతి ఏటా పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్నవారి సంఖ్య అధికంగా ఉంటుందనేది అధికారిక వర్గాల సమాచారం. మరి ఈ నేపథ్యంలో శబరిమల సన్నిధానంలో యాత్రికుల పూజ, వసతి నిమిత్తమై ఎలాంటి వసతి సౌకర్యాలు ఉంటాయి వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!. శబరిమల సన్నిధానం వద్ద వసతి సౌకర్యాలు ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు, అలాగే దేవస్వం బోర్డు గుర్తింపు పొందిన కేంద్రాలలో స్పాట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉంది. భక్తులు ఆన్లైన్లో దర్శనం స్లాట్లు, పూజలు, వసతిని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సమీపంలో అనేక హోటళ్ళు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి కూడా.శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాలుసన్నిధానంలో యాత్రికుల బస కోసం వివిధ భవనాల్లో 540 గదులు ఉన్నాయి.శబరి గెస్ట్ హౌస్లో మాత్రమే 56 గదులు ఉన్నాయి, వీటితో పాటు 5 కాటేజీలు, 12 విడిషెడ్లు ఉన్నాయి.వివిధ విభాగాల అధికారులకు మొత్తం 146 గదులు కేటాయించగా, పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక బ్యారక్ నిర్మించారు.ఎలా బుక్ చేసుకోవాలంటే..www.onlinetdb.com ద్వారా ఆన్లైన్లో గదులు, ప్రసాదాలను (వాళిపాడు) బుక్ చేసుకోవచ్చు.దాంతోపాటు పూజకు సంబంధించి.. ఇలాంటి ఆఫర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. అవేంటంటే..ఉదయాస్తమాన పూజపడి పూజసహస్రకలసంకలశాభిషేకంఉష పూజఉచ్ఛ పూజఅథాళ పూజనెయ్యాభిషేకంవీటిని వర్చువల్ క్యూ టికెట్ తోపాటు బుక్ చేసుకోవచ్చు.ముఖ్య గమనిక: 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బుకింగ్ అవసరం లేదు.దర్శన సమయాలుదర్శనం కోసం ఆలయం తెల్లవారుజామున 3:00 గంటలకు తెరుచుకుంటుంది.ఉచ్ఛ పూజ తర్వాత మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడుతుంది.మధ్యాహ్నం 3:00 గంటలకు తిరిగి తెరుచుకుంటుంది.రాత్రి 11:00 గంటలకు హరివరాసనం పారాయణంతో చివరి ముగింపు.ఈ ఆలయం రోజుకు 18 గంటలు దర్శనం కోసం తెరిచి ఉంటుంది.మధ్యాహ్నం 1 గంటలకు ఆలయం మూసివేసినప్పుడూ.. అలాగే రాత్రి మూసివేత తర్వాత కూడా..అప్పటికే క్యూలో ఉన్న యాత్రికులు 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. తర్వాత ఆలయం దర్శనం కోసం తిరిగి తెరిచినప్పుడు వారు ఉత్తర ద్వారం గుండా వెళ్ళవచ్చు. ఇది భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేశారు.యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన పథకాలు..గుండెపోటు ఉపశమన పథకంతీర్థయాత్ర సమయంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణించే యాత్రికుల కుటుంబాలకు దాదాపు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వర్చువల్ క్యూ బుకింగ్లో రూ.5 రుసుము అదనంగా జోడించారు. అయితే ఈ చెల్లింపు తప్పనిసరి కాదు.కేరళ అంతటా బీమా కవరేజ్వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకునే యాత్రికులందరికీ ఎటువంటి ప్రీమియం లేకుండా రూ. 5 లక్షల ప్రమాద మరణ బీమా కవరేజ్ లభిస్తుంది.ఒక యాత్రికుడు మరణిస్తే :కేరళలో అంబులెన్స్ ఖర్చులు: రూ. 30,000 వరకుఇతర రాష్ట్రాలకు అంబులెన్స్ ఖర్చులు: రూ. 1,00,000 వరకు ఈ ఖర్చులను దేవస్వం బోర్డు భరిస్తుంది.నీలక్కల్ వద్ద పార్కింగ్ పంప నుంచి 23 కి.మీ దూరంలో ఉన్న నీలక్కల్ శబరిమల యాత్రికులకు ప్రధాన పార్కింగ్ హబ్. ఇక్కడ సుమారు 8,500 వాహనాలకు స్థలం ఉంది.పంపా వద్ద , హిల్స్ స్టాప్, చక్కుపాలెం వద్ద పరిమిత పార్కింగ్ అందుబాటులో ఉంది.ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపు వ్యవస్థనిలక్కల్ , చక్కుపాలెం, హిల్టాప్ వద్ద పార్కింగ్ ఫీజులను ఫాస్టాట్యాగ్ ద్వారా చెల్లించవచ్చు:బస్సులు: రూ. 100మినీ బస్సులు: రూ. 7514 సీట్ల వరకు వాహనాలు: రూ. 504 సీట్లు రూ. 30ఆటో - రిక్షాలు: రూ.15చివరగా శబరిమలలో వసతి రూ.80 నుంచి అదుబాటులో ఉంది. గది స్థాయిని బట్టి రూ.2,200 వరకు ఫీజు వసూలు చేస్తారు.గదులు బుక్ చేసుకోవాలను కునే యాత్రికులకు ఆన్లైన్ సేవల కోసం నమోదు చేసుకోవడానికి మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా అవసరం.గదిని ఆన్లైన్ బుకింగ్ సమయంలో మీరు అందించిన అదే ఫొటో సహా IDని తీసుకెళ్లాలి. అలాగే ఒక రోజులో గరిష్టంగా 20వేల మంది భక్తులకు రియల్ టైమ్ బుకింగ్ ద్వారా దర్శనం అవకాశం కల్పిస్తోంది ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఒకే సమయంలో ఎక్కువమంది వెబ్సైట్లో లాగిన్ అవ్వడం వల్ల ఒక్కోసారి సర్వర్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని, దీన్ని భక్తులందరు గమనించగలరు అంటూ..ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విన్నవించింది. (చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..) -
కనీస ధర్మం
అరివీరభయంకరంగా జరిగిన రామరావణ యుద్ధం ముగిసింది. మహాబలవంతుడైన రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో హతుడయ్యాడు. ధర్మమూర్తి అయిన రాముడు రావణుడి అధర్మవర్తనకు కోపించి, అతనిపై యుద్ధం చేశాడు కానీ, రామునికి అతనిపై ప్రత్యేకమైన ద్వేషం, పగ లేవు. అందువల్ల రావణుని సంహరించిన తర్వాత రామునికి అతనిపై అపారమైన జాలి, దయ కలిగాయి. ఎందుకంటే ఇప్పుడు రావణునికి చితిపేర్చి, ఆ చితికి నిప్పంటించడానికి కూడా ఎవరూ మిగలలేదు. రావణుని కుమారులు, సోదరులు, మనుమలు, బంధువులు, సేనానులు, సైన్యం.... ఒకరేమిటి స్త్రీలు తప్ప రావణుని బలగమంతా తుడిచిపెట్టుకుపోయింది. చివరకు మిగిలిందల్లా విభీషణుడొక్కడే. విభీషణునికి అన్నగారంటే భయం, భక్తి, ద్వేషం, ప్రేమ అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ, ఆయనకు అంత్యక్రియలు జరిపించడం మాత్రం ఎందుకనో ఇష్టం లేకపోయింది. బహుశ రాముడు ఏమైనా అనుకుంటాడేమో అనే శంక వల్ల కావచ్చు, తాను చెప్పిన మాటను అన్నగారు పెడచెవిన పెట్టి, చివరికిలా శత్రువు చేతిలో కుప్పకూలిపోయాయే అనే కోపం వల్ల కావచ్చు. అలాగని ఆయన శరీరాన్ని అలా యుద్ధభూమిలో వదిలేసి వెళ్లడానికి మనస్కరించడం లేదు. దూరంగా ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు రామచంద్రుడు. విభీషణుని వద్దకు వచ్చాడు. భుజంపై చేయివేశాడు. విభీషణుని చేతులను తన చేతిలోకి తీసుకుని, ఆ΄్యాయంగా నొక్కుతూ, ‘‘ఎవరిపైన అయినా ద్వేషం, పగ పెంచుకుంటే, అది వారు మరణించేంతవరకే ఉండాలి. మరణించిన తర్వాత కూడా వారిపైన ద్వేషం చూపడం మంచిది కాదు. శాస్త్రప్రకారం మరణించిన వారు దాయాదులు అయితే, వారి అంత్యక్రియలకు వెళ్లకపోవడం, కర్మకాండలలో పాలుపంచుకోకపోవడం, వారి కర్మభోజనం చేయకపోవడం అధర్మం. అంతేకాదు, మరణించిన వారిపై బురద జల్లడం, వారిని విమర్శించడం, వారి ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా మాట్లాడటం కూడా అధర్మమే. నీ సోదరుడైన రావణుడు మరణించాడు కాబట్టి అతనిపై నీకే కాదు, నాకు కూడా ఇప్పుడు ఎటువంటి ద్వేషభావమూ ఉండకూడదు. ఆ మరణంతో అతనిపై ఉన్న పగ, ప్రతీకారం, ద్వేషభావం కూడా నశించినట్లే భావించు’’ అంటూ హితవు పలికాడు. ఆ మాటలు విన్న తర్వాత విభీషణుడు శాస్త్రోక్తంగా తన అన్నకు అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధపడ్డాడు. రాముడు అన్నివిషయాలలోనూ తోడుగా ఉండి, విభీషణుని చేత ఉత్తరక్రియలన్నీ జరిపించాడు. అంతకుమునుపు వాలి మరణానంతరం కూడా ఇదేవిధమైన సూత్రాన్ని సుగ్రీవుడికి బోధించి, అంగదుడి చేత వాలికి ఉత్తరక్రియలు జరిపించి, అనంతరం సుగ్రీవుని చేతనే అంగదునికి కిష్కిందానగరానికి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయించాడు రాముడు. మరణించిన వారికి కర్మకాండలు జరిపించి, తెలిసిన వారినందరినీ కర్మ భోజనానికి పిలవడం, వారంతా వచ్చి ఆ భోజనాలు చేసి వెళ్లడం వల్ల మృతుల ఆత్మకు శాంతి చేకూరుతుందని శాస్త్రం చెబుతోంది. కొందరు వివిధ రకాల కారణాలతో... సాకులతో మృతి చెందిన బంధుమిత్రులను చివరి చూపు చూసేందుకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. మరికొందరు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా వెళ్లరు. అది మహా అపరాధం. మరణంతో వారితో ఉన్న శత్రుత్వం సమసిపోతుంది. కష్టంలో ఉన్న వారిని పరామర్శించడం పుణ్యకార్యమే కానీ ధర్మ విరుద్ధమైనది కాదు. – డి.వి.ఆర్. -
జీవిత రథ సారథి
ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయట ప్రపంచంతో కాదు, తన అంతరంగంలోనే ఉంది. మనం అనుక్షణం తీసుకునే వేలకొలది నిర్ణయాలు, మన స్పందనల పరంపర... ఇవన్నీ మన భావోద్వేగాల ప్రవాహంలోనే జన్మిస్తాయి. జీవితమనే రథానికి మనసు రథసారథి. ఆ రథం ఎటు వెళ్ళాలో మనసు నిర్ణయిస్తుంది. అయితే, ఆ మనసును నడిపించాల్సిన పరమసారథ్యం కేవలం మన స్వీయ నియంత్రణలోనే ఉంది. భావోద్వేగాలనే గుర్రాలను అదుపులో ఉంచుకుంటేనే మన జీవిత ప్రయాణం సవ్యంగా, నిర్దేశిత గమ్యం వైపు సాగుతుంది. ఒకవేళ ఈ పగ్గాలు వదిలేస్తే, అవి మనల్ని అదుపుతప్పి, పదేపదే నిరాశ, దుఃఖం అనే లోయల్లో పడేస్తాయి. మనసు మన అధీనంలో లేకపోతే, జీవితం ఒక నిరంతర పోరాటంలా మారి, శాశ్వత ఆనందాన్ని దూరం చేస్తుంది. మన అంతర్గత ప్రశాంతతకు ఇదే పునాది.సాధారణంగా మన భావోద్వేగాలు సముద్రంలో ఉప్పొంగే శక్తిమంతమైన అలల మాదిరిగా ఉంటాయి. కోపం, దుఃఖం, భయం, అసూయ వంటివి మనల్ని క్షణాల్లో ఉక్కిరిబిక్కిరి చేసి, అనాలోచిత నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కానీ, సనాతన ధర్మం బోధించినట్టుగా, మనం కేవలం మన భావోద్వేగాలకు బానిసలం కాదు; వాటిని శాసించగలిగే అపారమైన శక్తి కేంద్రం మనలోనే దాగి ఉంది. మనసును నిగ్రహించుకోవడానికి కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలు అత్యంత సులువైన, అద్భుతమైన మార్గాలుగా పనిచేస్తాయి.కర్మ మార్గం–ఫలితాల ఆశ లేకుండా, కేవలం ఉన్నత లక్ష్యాల కోసం నిస్వార్థ నిబద్ధతతో మన కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్దేశిస్తుంది. చివరగా, భక్తి మార్గం–జీవితానికి అంతిమ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే అని నిశ్చయంగా నమ్మి, విశ్వశక్తిలో లీనమవడమే. ఈ త్రికరణ శుద్ధి కలయిక మనసుకు తిరుగులేని స్థైర్యాన్ని, అఖండమైన అంతర్గత బలాన్ని ప్రసాదిస్తుంది.నిజమైన ఆత్మనిగ్రహం ద్వారానే మనం అంతరంగ శాంతికి శాశ్వత వారధిని నిర్మించగలం. ఈ వారధిని నిర్మించిన మహనీయుల జీవితాలు మనకు శాశ్వత ప్రేరణ. ఉదాహరణకు, సింహాసనం కళ్లముందే కరిగిపోయినప్పుడు, శ్రీరాముడు ఉవ్వెత్తున ఎగిసిన కోపాగ్నిని కేవలం అణచివేయలేదు. ఆయన వ్యక్తిగత ఆశను, ఆవేశాన్ని త్యజించి, ధర్మానికి శిరసు వంచారు. ఇది కేవలం తండ్రి మాటకు గౌరవం కాదు, బాహ్య పరిస్థితులకు అతీతంగా తన అంతర్గత ప్రశాంతతను తానే నిర్ణయించుకునే అత్యున్నత వివేకం. అలాగే, మహాభారతంలో ధర్మరాజు, అపారమైన దుఃఖం, రాజ్య నష్టం మధ్య కూడా, తన స్థైర్యాన్ని పోగొట్టుకోకుండా, క్షమతో... వివేకంతో వ్యవహరించారు. ఈ ఉదాహరణలు కేవలం కథలు కావు; భావోద్వేగాలపై పట్టు సాధిస్తే, విధి రాతను సైతం తన జీవితపు ఉన్నత గమ్యానికి అనుగుణంగా మలచుకోవచ్చని నిరూపించాయి.గుర్తుంచుకోండి: మన జీవితమనే ఈ అద్భుతమైన ప్రయాణంలో, మన గమ్యాన్ని నిర్దేశించే తిరుగులేని సారథులం మనమే. ఇక ఆలస్యం చేయక, ప్రతి క్షణాన్ని వివేకంతో, ప్రేమతో నింపి, మన హృదయం కోరుకునే ప్రశాంతమైన, అద్భుతమైన భవిష్యత్తును మన చేతులతో నిర్మించుకుందాం.మన అంతర్గత ప్రపంచంలో కలిగే ప్రతి ఆలోచనా అలజడి, ప్రతి ప్రతిస్పందన ఒక కర్మగానే పరిగణించబడుతుంది. ఈ కర్మల ప్రభావాన్ని తగ్గించడానికి, జ్ఞానయోగం మనకు నిష్పాక్షిక పరిశీలన అనే వివేకాన్ని అందిస్తుంది. అంటే, కళ్ళ ముందు జరిగే నాటకాన్ని చూస్తున్నట్లుగా, మన ఆలోచనలను, భావోద్వేగాలను తటస్థంగా, నిశితంగా గమనించడం. ఈ దృష్టి వివేకానికి పదునైన కత్తిలా పనిచేసి, ప్రతిచర్యలకు బదులుగా, ప్రశాంతమైన, సరైన ఎంపికను ఎంచుకునే స్వేచ్ఛనిస్తుంది.భావోద్వేగాలను నియంత్రించగలగడమే నిజమైన, నిస్సందేహమైన శక్తి. ఎందుకంటే, అది మనల్ని బాహ్య పరిస్థితుల బందీగా కాకుండా, మన స్వీయ మనసుకి నిజమైన అధిపతిగా నిలబెడుతుంది. అశాంతి, ఆందోళనల నుంచి సంపూర్ణ విముక్తి ΄÷ందడానికి, మనసును మనకు అత్యంత విశ్వసనీయ స్నేహితుడిగా మలచుకోవాలి. యోగా, ధ్యానం, ఆత్మపరిశీలన వంటి సాధనల ద్వారా మనం ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం.– కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
లక్ష్మీదేవికి కమలం ఎందుకు ప్రీతికరం?
సిరిసంపదలకు అధిదేవత అయిన అమ్మవారిని వర్ణించే ప్రతి చిత్రంలోనూ లేదా విగ్రహంలోనూ కమలం తప్పక ఉంటుంది. ఆమె కమలంపై కూర్చుని ఉండటం చేతిలో కమలం ధరించి ఉండటం మనం చూస్తాం. దీని వెనుక పురాణ గాథలు, ఆధ్యాత్మిక కారణాలు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవి సముద్ర మథనం సమయంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించింది. ఆ సమయంలో ఆమె చేతిలో కమలంతో వచ్చింది. అందుకే ఆమెను ‘క్షీర సాగర కన్య’ అని, అలాగే కమలంతో ముడిపడి ఉంది కాబట్టి ‘పద్మ’ ‘కమల’ ‘పద్మప్రియ’ వంటి పేర్లతో పిలుస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే కమలం అనేది పరిశుభ్రతకు. వైరాగ్యానికి గొప్ప చిహ్నం. కమలం ఎల్లప్పుడూ బురద నీటిలో లేదా మురికి కొలనులో పెరుగుతుంది. కానీ ఆ బురదలోని ఒక్క అణువు కూడా కమలాన్ని అంటకుండా అది అత్యంత స్వచ్ఛంగా నిర్మలంగా వికసిస్తుంది. ఈ లక్షణమే కమలాన్ని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మార్చింది.ఇక్కడ దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే. సంపద, ధనం అనేది ‘బురద’ వంటి ఈ లోక వ్యవహారాల మధ్యే ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించే భక్తులు సంపదను పొందినప్పటికీ, ఆ ధనమదం లేదా లోక కష్టాల ప్రభావం తమపై పడకూడదు. కమలంలాగే, ఈ ప్రపంచంలో ఉన్నా, దానికి అంటకుండా పరిశుద్ధంగా, నిర్లిప్తంగా జీవించాలి. ధనాన్ని కేవలం జీవితానికి ఒక సాధనంగా మాత్రమే చూడాలి, దానిలో మునిగిపోకూడదు. కమలంపై కూర్చునే లక్ష్మీదేవి ‘‘నీ సంపదను ధర్మ మార్గంలో ఉంచు, దానిపై వ్యామోహం పెంచుకోకు’’ అని పరోక్షంగా చెబుతుంది. అందుకే ఆధ్యాత్మిక సంపద మరియు భౌతిక సంపద రెండింటికి చిహ్నంగా కమలం ఆమెతో నిరంతరం ఉంటుంది. (చదవండి: Kalabhairava Swamy Temple: నమోస్తు కాలభైరవా!) -
నమోస్తు కాలభైరవా!
‘కాలుడు’ అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమగల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. ఈ పేరును స్వయంగా శివుడే తన కుమారునికి పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. అందుకే నిత్యం అశేష భక్తుల తాకిడితో ఇసన్నపల్లి (రామారెడ్డి) శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. నవంబర్ 9, ఆదివారం కార్తీక బహుళ పంచమి నుంచి 13, గురువారం బహుళ నవమి వరకు కాలభైరవస్వామి జన్మదిన వేడుకల సందర్భంగా... కామారెడ్డి జిల్లా ఎన్నో ప్రాచీన దేవాలయాలకు ప్రసిద్ధిగాంచింది. రాష్ట్ర రాజధాని నుంచి నాగ్పూర్ వెళ్లే ఎన్హెచ్–44 జాతీయ రహదారి పై కామారెడ్డి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మరో 10 కిలోమీటర్ల దూరంలో ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామం ఉంటుంది. వందల యేళ్ల క్రితం ఇక్కడ వెలసిన శ్రీ కాలభైరవస్వామి దర్శనానికి నిత్యం వేలసంఖ్యలో జనం వస్తుంటారు. దిగంబరునిగా ఎందుకున్నాడంటే..? ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. స్వామివారి మూలవిగ్రహం ఎప్పుడు వెలిసిందో కచ్చితంగా చెప్పే ఆధారాలు లభ్యం కాలేదు. క్రీ.శ 13వ శతాబ్దంలో జైనమతం బాగా వ్యాప్తి చెందిన సమయంలో ఆలయం నిర్మించి ఉంటారని కొందరు చెబుతుంటారు. అందుకే దిగంబరునిగా దర్శనమిస్తాడని కొందరి భావన. కానీ ఇసన్ననపల్లి–రామారెడ్డి గ్రామాలు క్రీ.శ 1550–1600 సంవత్సరాల మధ్య కాలంలో దోమకొండ సంస్థానాధీశుల పరి΄ాలనను నిర్మించబడినట్లు స్పష్టమైన ఆధారాలు కనబడుతున్న కారణంగా జైనవిగ్రహం అనడానికి వీలులేదు. పురాణేతిహాసాల్లోనూ శ్రీ కాలభైరవుడిని దిగంబరుడిగానే పేర్కొనడం జరుగుతుంది. స్థలపురాణంఇసన్నపల్లి గ్రామం ప్రారంభంలోనే శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఉంటుంది. అష్టదిక్కులలో రామారెడ్డి గ్రామానికి అష్టభైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడు గ్రామాన్ని రక్షిస్తుంటారని నానుడి. ఈ అష్టభైరవులలో ప్రధానుడు శ్రీ కాలభైరవస్వామి. మిగతా ఏడు భైరవ విగ్రహాలు కాలప్రవాహంలో కనుమరుగై΄ోయాయి. గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో కాశిపల్లి అనే చోట విశ్వేశ్వరుని ఆలయం, దానికి ముందుభాగంలో గ్రామం వైపు చూస్తున్న భైరవ విగ్రహం కూడా ఉన్నాయి. ఇలా రామారెడ్డి గ్రామం చుట్టు కాశీ (కాశిపల్లి), రామేశ్వరం (రామేశుని కుంట) ఇలాంటి పుణ్యక్షేత్రాల పేర్లతో శివాలయాలు, భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ కాలభైరవస్వామి తన తండ్రి పేరిట ఈశాన్య దిక్కునే ఉంచుకుని నిరంతరం గ్రామాన్ని, భక్తులనూ రక్షిస్తు ఉంటాడని చెబుతున్నారు. ఇక్కడి పుష్కరిణిని అమృతమయమైన నీళ్లను అందించే అక్షయ పాత్రగా భావిస్తారు. ఎన్ని నీళ్లు తోడుకున్నా తరిగిపోని జలసంపద ఈ పుష్కరిణి ప్రత్యేకత.ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసే వారికి అన్నిరకాల వ్యాధులు, భూతప్రేత పిశాచ బాధలు తొలగి΄ోతాయని నమ్మకం. నిత్యపూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి యేడాది వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తికంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలోనూ ఒకరోజంతా సంతతాభిషేకం, విశేషపూజలు నిర్వహిస్తారు. ఆదివారం మొదలైన జయంతి వేడుకలు నేడు దక్షయజ్ఞం, ఆరున్నర నుంచి 8 గంటల వరకు పూర్ణాహుతితో ముగుస్తాయి. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి, -
ఆత్మీయత.. అనురాగమే ఔషధంగా...వనభోజనాలు
అనుకూలమైన వనంలో బంధు మిత్రుల కలయిక... అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరో వైపు ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం – కార్తీక మాసంలో వన సమారాధనలంటే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. అయితే ఈ వన భోజనాల వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక కోణం దాగి ఉంది. బయటకు చాలా సరదాగా కనిపిస్తునే, లోపల చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించే ఈ పిక్నిక్ యొక్క పరమార్థమేమిటో శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల నుంచి తెలుసుకోవచ్చును.మన ప్రాచీన భారత దేశంలో ఋషులు, మునులు ఏర్పాటు చేసిన సంప్రదాయాలు అన్నీ మన సూక్ష్మ శరీరంలో కుండలినీ శక్తి జాగృతి కోసం, చక్ర నాడుల శుద్ధి కోసం ఉద్దేశించి చేసినవే. నైమిశారణ్యంలో సూత మహాముని తన తోటి మునులందరితో కలిసి ఉసిరి చెట్టు క్రింద వన భోజనాలు చేసినట్లుగా పురాణాలలో ఉంది.అంతే కాకుండా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు కూడా గోపాలురతో కలిసి వనభోజనాలు చేసినట్లుగా మన పురాణాలలో ఉంది. దేవతల ఆరాధన కన్నా మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆనందిస్తూ, గౌరవిస్తూ ఆరాధించడం ముఖ్యమని చె΄్పారు. గోవర్ధన గిరిని పైకి ఎత్తి ఈ ప్రకృతి మనకు ఏ విధంగా గొడుగులా రక్షణగా నిలుస్తుందో చూపించారు. ఈ గోవర్ధన పూజ పర్వదినం కూడా కార్తీక మాసంలోనే శుక్ల పక్ష పాడ్యమి నాడు వస్తుంది. మన చుట్టూ ఉండే ప్రకృతిని, గోవులను శ్రీ కృష్ణ భక్తులందరూ గౌరవించి, పూజలు చేస్తారు. అదే గౌరవ భావాన్ని మన దైనందిన జీవితంలో ప్రతి నిత్యం ప్రకృతి పట్ల మనం కలిగి ఉండాలి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారు. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవని వంటిది. ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా కాస్తాయి. ’సి’ విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరిని రోజూ ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇది మన జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది. ఉసిరిలో ఆరు రుచులలో ఒక్క లవణం (ఉప్పు) తప్ప మిగలిన ఐదు రుచులూ ఉంటాయి. అంటే మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కషాయం(వగరు), కటువు(కారం), తిక్తం(చేదు) ఈ ఐదు రుచుల సంగమం. ముఖ్యంగా ఉసిరిలో ఆమ్ల గుణం అంటే పులుపు ఎక్కువగా కనిపిస్తుంది.. కనుక దీనిని ఆమ్లా లేదా ఆమలకము అని పిలుస్తారు కూడా. కార్తీక మాసంలోనే ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆరోగ్య రహస్యం దాగి ఉందని తెలుస్తోంది. ఈ నెల నుంచి శీతాకాలం మొదలు అవుతుంది. దీంతో రుతు సంబంధ వ్యాధుల తోపాటు దగ్గు, జలుబు వంటివి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ నెలలో ఉసిరిని తినడం.. లేదా ఉసిరి చెట్టు నీడన ఉండడం వలన ఈ దోషాలు నివారింపబడతాయి. సకల మానవాళిని రక్షిస్తుందని.. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చరక సంహిత పేర్కొంది. మానవ శరీరం పంచ భూతాలైన భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని అనే ఐదు మూలకాలతో తయారవుతుంది. ఈ పంచ భూతాల తత్త్వాల తోనే మన సూక్ష్మ శరీరంలో ఆరు చక్రాలు రూపొందాయి. ఉదాహరణకు మన సూక్ష్మ శరీరంలో మొదటి శక్తి కేంద్రమైన మూలాధార చక్రం భూతత్త్వంతో ఏర్పడుతుంది. ఈ శక్తి కేంద్రంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, మనం భూమి మీద కూర్చొని, రెండు చేతులూ భూమి మీద పెట్టి సహజ యోగ పద్ధతిలో ధ్యానం చేస్తే, ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఆ విధంగా పంచ భూతాత్మకమైన ఈ ప్రకృతి మానవుల సూక్ష్మ శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలను చైతన్య పరిచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. వన భోజనాల ద్వారా సమకూరే మరో ప్రయోజనం సహజ యోగులలో సామూహిక జీవనం మరింతగా బలపడుతుంది.మానవుడు సంఘజీవి. సామూహికంగా అందరూ కలిసి జరుపుకునే పిక్నిక్ ల వలన సహజ యోగుల మధ్య అభి్ర΄ాయ భేదాలు, మనస్పర్థలు ఏమైనా ఉంటే తొలగిపోయి, సామరస్యం ఏర్పడుతుంది. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరూ కలిసి సహకరించుకోవడం వలన మనుష్యుల మధ్య ప్రేమ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అహంకార, ప్రత్యహంకారాలు కరిగి΄ోయి హృదయం విశాలమవుతుంది. అటువంటి వాతావరణం పెరుగుతున్న పిల్లల మీద సానుకూల ప్రభావాన్ని చూపించి, వారిలో సానుకూల దృక్పథం ఏర్పడేటట్లు చేస్తుంది. మన విశుద్ధి చక్రం ఆకాశ తత్త్వాన్ని కలిగి ఉంటుంది. వన భోజనాల వంటి సామూహిక కార్యక్రమాలలో ΄ాలుపంచుకొన్నప్పుడు, మన విశుద్ధి చక్రం అభివృద్ధి చెంది చక్కటి సంభాషణా చాతుర్యం అలవడి అందరితో సత్సంబంధాలను పెంపొందించుకొనగలుగుతాం. మన లోపల గల షట్చక్రాలు సహజమైన ప్రకృతిలో లభించే పంచ భూతాల తత్త్వాలతో చాలా వేగంగా స్పందిస్తాయి. కాబట్టి కనీసం ఏడాదికి ఒకసారి ఇలా కార్తీక మాసంలో వన భోజనాల ద్వారా అయినా ప్రకృతి ఒడిలో అందరూ మమేకమై, ధ్యానంతో, భజనలతో ఆట పాటలతో హాయిగా సేద తీరితే, సహజకుటుంబాల సామూహికత మరింత బలోపేతం అవుతుందని ఆశిద్దాం. – డా. పి. రాకేశ్(మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాలు, ప్రవచనాల ఆధారంగా) (చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..) -
గుడ్ న్యూస్ : ధ్వజారోహణం వేడుకకు సిద్ధమవుతున్న అయోధ్య
లక్నో: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామ భక్తులకు గుడ్ న్యూస్. ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామ జన్మభూమి ఆలయంలో 'ధ్వజారోహణం' వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 25న జరగనున్న ధ్వజారోహణం వేడుకకు పవిత్ర నగరం ముస్తాబవుతోంది.అయితే అయోధ్య రామ మందిరంలో నవంబర్ 24వ తేదీ సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు భక్తులకు దర్శనం నిలిపి వేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. వివాహ పంచమి సందర్భంగా నవంబర్ 25న జరిగే ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. నిర్మాణ పనులు, భద్రతా కారణాల దృష్ట్యా అతిథుల సంఖ్యను పరిమితం చేసినప్పటికీ.. ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా నవంబర్ 24వ తేదీ సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. నవంబర్ 26న ఉదయం 7 గంటలకు దర్శనాలు పునఃప్రారంభం అవుతాయి.వివాహ పంచమి -ధ్వజారోహణంనవంబర్ 25 సీతారాముల వాహాన్ని జరుపుకునే పండుగ వివాహ పంచమితో సమానమని తెలిపారు. ఈ చారిత్రక ధ్వజారోహణను రాముచంద్రుడు, సీతమ్మల దివ్య వివాహానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహించ నున్నారు. ఈ సందర్భంగా 190 అడుగుల ఎత్తులో త్రిభుజ ఆకారంలోని జెండాను ఎగురవేయనున్నారు. ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.ప్రధాని మోదీ ఆలయంలోని ప్రధాన శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేస్తారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు మంగళవారం తెలిపారు. ఆలయంలోని ఏడు శిఖరాలను కాషాయ జెండాలతో అలంకరించడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. ఈ వేడుకకు దాదాపు 6,000 మంది ఆహ్వానిత అతిథులు హాజరవుతారని ఆలయ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ ప్రవేశం ఉదయం 8 గంటలకు తెరిచి 9 గంటలకు ముగుస్తుంది, మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. ఆ రోజు సాధారణ ప్రజలకు సాధారణ దర్శనం నిలిపివేయనున్నారు.కాషాయ జెండా 22 అడుగుల - 11 అడుగుల కొలతలు కలిగిన ప్రత్యేక కాషాయ జెండాను మన్నికైన పారాచూట్ ఫాబ్రిక్ , పట్టు దారాలను ఉపయోగించి తయారు చేశారు. ప్రధాన శిఖరం పైన అమర్చబడిన 42 అడుగుల స్తంభంపై 360 డిగ్రీల భ్రమణ యంత్రాంగం ద్వారా దీనిని అమర్చుతారు. అయోధ్య అంతటా భారీ సన్నాహాలునగరం అంతటా విస్తృత సన్నాహాలు జరుగుతున్నాయి. సీనియర్ రాష్ట్ర అధికారులు , ఆలయ ట్రస్ట్ సభ్యులు అయోధ్యలో ఉండి, ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO), ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కూడా ప్రతి అభివృద్ధిని నిజ సమయంలో పర్యవేక్షిస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన టెలివిజన్ నెట్వర్క్లు , డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.ఆలయ సముదాయం లోపల భక్తుల కోసం 200 అడుగుల LED స్క్రీన్ను, ప్రజల వీక్షణ కోసం నగరం అంతటా 30కి పైగా పెద్ద స్క్రీన్లు ఉంచబోతున్నారు. పెద్ద సంఖ్యలో అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి, అయోధ్య , సమీప కరసేవక్పురం, రామసేవక్పురం, తీర్థ క్షేత్రపురంలో 1,600 గదులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.అయోధ్యను కాషాయ జెండాలు, పూల దండలు, లైటింగ్తో సర్వాగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ నవంబర్ 21-25 మధ్య రామకథ పారాయణాలు, భక్తి పాటలు ,ప్రఖ్యాత కళాకారులచే జానపద శాస్త్రీయ ప్రదర్శనలు, ర్యాలీలు లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలుంటాయి. మునిసిపల్ కార్పొరేషన్ రోడ్లను మరమ్మతు చేయడం, ఘాట్లకు తిరిగి రంగులు వేయడం మరియు చెట్లను నాటడం వంటి సుందరీకరణ డ్రైవ్కు నాయకత్వం వహిస్తోంది. ఇంతలో, రాముడి వివాహాన్ని వర్ణించే రంగురంగుల రామ్ బరాత్ ఊరేగింపులు నవంబర్ 25 సాయంత్రం 4 గంటల తర్వాత అనేక ప్రాంతాలలో జరుగుతాయి. -
అదిగదిగో భద్రాద్రి..!
ఒక ఊర్లో ఒక ముసలవ్వ ఉండేది. ఆమెకు చిన్నప్పటినుంచీ భద్రాచలం వెళ్లాలని, గోదావరిలో మునిగి శ్రీసీతారామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక. అయితే సంసార సాగరంలో మునిగి తేరుకునేలోగా ఆమెకు వయసు అరవై దాటింది.ఒకరోజు తన మనవడితో అదే విషయం చెప్పింది. ‘‘రాముణ్ణి చూడటానికి అంతదూరం పోవాలా? మన ఊరి గుడిలో రాములవారి పటం ఉంది కదా, రోజూ దాన్ని చూస్తూ పూజ చేసుకుంటే పోలేదా?’’ అని ఎదురు ప్రశ్న వేశాడు. అతడికి ఎలా సర్ది చెప్పాలో ముసలవ్వకు అర్థం కాలేదు. నెలలు గడిచాయి. ఆమె వయసు అరవై ఆరుకు చేరుకుంది. కోరిక తీరకుండానే ఫోటోకి పూలమాల వేయించుకోవాల్సి వస్తుందేమోనని అవ్వకు అనుమానం వేసింది. గట్టిగా మాట్లాడి మనవడిని ఒప్పించాలనుకుంది. ఒక నిండు పౌర్ణమినాడు మనవడు ఇంటికి వచ్చాడు. భద్రాచలం విషయం అడిగింది. ‘నువ్వు ఇప్పుడు భద్రాచలం వెళ్ళి రాముణ్ణి చూడకపోతే ఏమీ కాదు, ఇదిగో... రామకోటి రాసుకో. రాముణ్ణి చూసిన పుణ్యం కలుగుతుంది’’ అని చెప్పి పుస్తకం ఆమె చేతికి ఇచ్చాడు. పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. భోజనం చేద్దామని వంటగదిలోకి వచ్చాడు. ‘‘ఆకలిగా ఉంది, అన్నం పెట్టు’’ అని అడిగాడు. గడసరి అయిన అవ్వ ‘‘అన్నం, అని వందసార్లు ఈ తెల్ల కాగితం మీద రాయి, ఆకలి పోతుంది’’ అని చెప్పి తెల్లకాగితం, పెన్ను ఇచ్చింది. ‘‘అన్నం తింటే ఆకలి తీరుతుంది కానీ లక్షసార్లు రాస్తే కడుపు నిండదు, అన్నం తినాల్సిందే’’ అన్నాడు.‘‘మరి శ్రీరాముణ్ణి చూడాలని నేను ఎన్నో ఏండ్లుగా ప్రాధేయపడుతూ ఉంటే రామకోటి రాయమని చెబుతావేమి?’’ అని నిలదీసింది. తప్పు తెలుసుకున్నాడు. వీలు చూసుకుని పోదామన్నాడు. అవ్వ మురిసిపోయింది. అభిమానంగా పప్పూ నెయ్యి కలిపిన బువ్వ కడుపు నిండా పెట్టింది. తృప్తిగా తిన్నాడు.ఆరు నెలల తర్వాత ఇద్దరూ భద్రాచలం బస్సు ఎక్కారు. అప్పటికే ఆ ముసలవ్వ రాత్రింబగుళ్ళూ మేలుకుని రామకోటి పుస్తకం పూర్తి చేసింది. ‘రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము’ పాట పాడుకుంటూ ఇద్దరూ శ్రీ సీతారాములవారి దర్శనం చేసుకున్నారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..) -
వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..
అయ్యప్ప దీక్షలో అతి ముఖ్యమైన ఘట్టం వనయాత్ర. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ హరిహరసుతుని సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదే ప్రధానమైనది. ఇరుముడిని తలపై పెట్టుకుని.. ఇరుముడితోటి నిను మదినింపి కదిలేము స్వామిఅండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా….'పల్లికట్టు శబరిమలైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయిస్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియేపళ్లికట్టు శబరిమళైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయిస్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే'అంటూ ఉత్సాహంగా సాగుతుంది ఈ వనయాత్ర. అయ్యప్ప దీక్షలో ముఖ్యంగా వనయాత్ర సమయంలో, "స్వామియే శరణం అయ్యప్ప" అని భక్తులు చెప్పే ఒక నినాదమే ఈ "కల్లుం ముల్లుం కాలికి మెత్తై". దీని అర్థం ఈ కఠినమైన వనయాత్ర మార్గంలో ఉన్న రాళ్ళు, ముళ్ళు కూడా అయ్యప్ప దీక్షలోని భక్తి, శ్రద్ధ వల్ల వారికి మెత్తగా అనిపిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక ఈ యాత్రలో భాగంగా పుణ్య నదుల్లో స్నానం ఆచరించి...దట్టమైన వృక్షాల మీదుగా వచ్చే ఔషధ గాలులను పీల్చుకుంటూ ఏదో తెలియని భక్తిపారవశ్యంతో ముందుకు సాగిపోతారు. ఇది సాక్షాత్తూ అయ్యప్పస్వామి నడిచివెళ్లిన మార్గం అని చెబుతుంటారు..వాస్తవానికి మాలధారులు అయ్యప్ప దర్శనంకోసం పెద్దపాదం మార్గంలో కొందరు..చిన్నపాదం మార్గంలో మరికొందరు వెళతారు. అయితే ఈ పెద్దపాదం మార్గం భక్తులకు పలు సవాళ్లును విసురుతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది భక్తి, ఓర్పు, ఆత్మనిర్భరత ప్రాముఖ్యతలను తెలియజేసే గొప్ప ఆధ్యాత్మిక యాత్రగా పేర్కొనవచ్చు. మరి పెద్దపాదంగా పిలిచే ఈ వనయాత్ర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!నిజానికి అయ్యప్ప భక్తులు జీవితకాలంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలని అంటుంటారు. పెద్దపాదం అంటేనే వనయాత్ర. ఇది ఎరుమేలి దగ్గర ప్రారంభమయ్యే యాత్ర.. సుమారు 58 కిలోమీటర్ల దూరం కాలినడకన భక్తులు స్వామివారి సన్నిధి చేరుకుంటారు. అడవి గుండా సాగే పెద్దపాదం యాత్ర... రాళ్లు, రప్పలతో నిండి ఉంటుంది..ఎక్కడా రోడ్డు కనిపించదు. మధ్య మధ్యలో పక్షులు, జంతువులు, సెలయేర్లు, లోయలు కనిపిస్తాయి. ఈ దారి మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లితే ఆ ఫీల్ వేరేలెవెల్.ఎందుకు వనయాత్ర చేయాలంటే..ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామిని ( అయ్యప్ప స్నేహితుడు..అనంతరకాలంలో భక్తుడు) ముందుగా దర్శించుకుని అక్కడ పేటతుళ్లై అనే నత్యం ఆడతారు. పేటతుళ్లై తర్వాత ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్భాణధారియై అయ్యప్పను దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి భక్తుల వనయాత్ర మొదలవుతుంది.అప్పటి రోజుల్లో శబరిమల చేరుకునేందుకు వనయాత్రనే అనుసరించేవారు. ఆ తర్వాత మారిన పరిస్థితులు, భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని చినపాదం యాత్రను ప్రారంభించింది దేవస్థానం. అనంతరం కేరళ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించింది.ఈ ప్రాంతం మొత్తం ఎన్నో వన మూలికలు ఉంటాయి. నడక మార్గంలో ఆ మూలికల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఒక్కసారైనా వనయాత్ర చేయాలంటారు. రాళ్లు విసరడానికి రీజన్..పెదపాదం మార్గంలో భాగంగా అళుదా నదినుంచి రెండు రాళ్లు తీసుకుని..ఆ రాళ్లను కళిద ముకుండ అనే ప్రదేశంలో వేస్తారు. పురాణాల ప్రకారం..నిజానికి ఈ మార్గంలో భక్తులు పెరూర్తోడు, కాలైకట్టి వంటి ప్రదేశాలను దాటుతారు. మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తున్నప్పుడు శివకేశవులు కాలైకట్టి వద్ద నిలబడి చూశారని ఇతిహాసం. ఆ నేపథ్యంలోనే భక్తులు అళుదా నదిలో స్నానం చేసి, అక్కడ లభించిన ఒక రాయిని తమతో తీసుకువెళ్లి, మహిషి కళేబరాన్ని పూడ్చిన "కళిడం కుండ్రు"లో వేస్తారుఈ మార్గంలో అన్నిటికన్నా కష్టమైన శిఖరాలంటే కరిమల, నీలిమల. అత్యంత కష్టమైన ఈ మార్గాన్ని దాటేందుకు స్వయంగా స్వామివారు సహాయం చేస్తారని భక్తుల విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం..ఈ వనయాత్ర చేసే భక్తులు, ముఖ్యంగా తొలిసారి వెళ్లే కన్నిస్వాములు, తలపై ఇరుముడి ధరించి మాత్రమే వెళ్లాలి. శబరిమల ఆలయం తెరిచిన ప్రతిసారీ పెదపాదం మార్గం ఓపెన్ చేయరు. కేవలం మకరవిళక్కు సమయంలో ఓపెన్ చేసి...తిరిగి సంక్రాంతి మకర జ్యోతి తర్వాత పెదపాదం మార్గం మూసివేస్తారు.ఈసారి గట్టి భద్రతతోపాటు అసౌకర్యానికి ఆస్కారం లేకుండా..ఇక ఈ ఏడాది మండల కాలం ఈ నెల నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. కేరళ ప్రభుత్వం ఈ అటవీ మార్గం గుండా భద్రతా ఏర్పాట్లు కోసం పది లక్షల టెండర్ని కేటాయించింది. ఈసారి మాత్రం రాత్రిపూట నిషేధం, పగటిపూట కొన్ని ఆంక్షలతో ఈ యాత్రకు కావల్సిన సన్నహాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. కాలినడకన వచ్చే భక్తులకు ఈ అటవీ మార్గాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. అడవి జంతువుల బెడద రీత్యా రహదారిపై రాత్రి ప్రయాణం, పగటిపూట ప్రవేశ పరిమితులు కొనసాగుతాయని ఎరుమేలి అటవీ రేంజ్ ఆఫీసర్ హరిలాల్ తెలిపారు. అంతేగాదు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటaల వరకు ప్రయాణానికి అనుమతి ఉంది. అలాగే అడవి జంతువులు ఉనికిని ముందుగా తెలియజేసేలా హెచ్చరికలు, జాగ్రత్తలు వంటి భద్రతా చర్యలు తీసుకునేలా ప్రత్యేకంగా అటవీశాఖకు చెందిన స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అటవీ సంరక్షణ కమిటీ (VSS, పర్యావరణ అభివృద్ధి కమిటీ(EDC) నేతృత్వంలో అటవీ శాఖ పర్యవేక్షణలో వ్యాపారులకు భద్రత కల్పిస్తామని పేర్కొంది. ఈసారి దారిలో ఆక్సిజన్ పార్లర్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే కలయకెట్టులో ఆరోగ్య శాఖ చికిత్సా కేంద్రం ప్రారంభిస్తామని తెలిపింది. గత సీజన్లలో పాములు, సరీసృపాల దాడుల కారణంగా చాలామంది ప్రమాదాల బారిన పడ్డారు. ఈసారి అలాంటివి తలెత్తకుండా తక్షణ వైద్య సాయం అందేలా పర్యవేక్షించనున్నారు అధికారులు. కలయకెట్టూ, అలుదాలో ఆస్పత్రి అందుబాటులో లేకపోవడం వల్ల సత్వర చికిత్స అందక భక్తులు ప్రమాదాల బారినపడుతున్నారనేది వాదన. అదీగాకుండా ఎరుమేలి ఆసుపత్రికి తరలించడానికి సత్వరమే వాహనం అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చింది. (చదవండి: శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!) -
శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!
శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంది, కానీ ఇది పరిమిత సంఖ్యలో ఉంటుంది. భక్తులు దేవస్వం బోర్డు గుర్తించిన కేంద్రాలలో తమ గుర్తింపు కార్డు చూపించి స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ స్పాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి. రోజుకు గరిష్టంగా దాదాపు 20 వేల మంది స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనానికి నమోదు చేసుకోవచ్చు. బుకింగ్ కేంద్రాల వివరాలు..ఎరుమేలి (Erumeli)అయ్యప్ప భక్తుల యాత్రలో ఆచారప్రాముఖ్యమున్న పవిత్ర స్థలం.వండిపెరియార్ – పుల్మేడు (Vandiperiyar - Pulmedu)నిర్దిష్ట మార్గం ద్వారా దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటు.నీలక్కల్ (Nilakkal)యాత్రికుల ప్రధాన విశ్రాంతి స్థలం, దర్శనానికి ప్రవేశించే మొదటి దశ.పంబ (Pamba)ఆలయానికి ఎక్కే మెట్లు ప్రారంభమయ్యే ముందు ఉన్న చివరి యాత్రా కేంద్రం.గుర్తించుకోవాల్సినవి..రోజుకు పరిమత స్థానాలు: కేవలం 20,000 స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.గుర్తింపు కార్డు: చెల్లుబాలు అయ్యే గుర్తింపు పత్రం(ఆధార్ కార్డ్ తప్పనిసరి)బుకింగ్ సమయం: ఆన్లైన్ స్లాట్ల రోజువారీ కోటా ఫుల్ అయిన తర్వాత మాత్రమే స్పాట్ బుకింగ్ ప్రారంభమవుతుంది.(చదవండి: ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్) -
ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్
మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం రాత్రి ఈ నియామకం ఖరారయ్యింది. కేరళలోని సీపీఎం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో తుది రౌండ్లో ఐదు పేర్టను షార్ట్లిస్ట్ చేశారు. వారిలో జయకుమార్కు అగ్రప్రాధ్యానత్య లభించింది. దేవస్వం మంత్రి విఎన్ వాసనవన్ పతనం తిట్ట నుంచి సతీషన్ను సిఫార్సు చేయగా, పార్టీ ముఖ్యమంత్రి ఎంపికనే ఫైనల్ చేయాలని నిర్ణయించింది. దాంతో మాజీ ఐఏఎస్ అధికారి నియామకానికి మార్గం సుగమం అయ్యింది. ఇలా టీడీపీ చీఫ్ సెక్రటరీగా, వైస్ ఛాన్సలర్గా, ప్రత్యేక కమిషనర్గా, అలాగే శబరిమల మాస్టర్ ప్లాన్ చైర్మన్గా పనిచేసిన ఒక పరిపాలనాధికారి(ఐఏఎస్ అధికారి) ఇలా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకి అధ్యుకుడిగా బాధ్యతలు స్వీకరించడం టీడీబీ చరిత్రలోనే తొలిసారి. ఈ మేరకు మాజీ ఐఏఎస్ అధికారి జయకుమార్ మాట్లాడుతూ..శబరిమలలో తనకున్న పూర్వ అనుభవాన్ని చెబుతూ..శబరిమల పనితీరు తనకు బాగా తెలుసని చెప్పారు. భక్తులు సంతృప్తికరంగా ఆలయాన్ని సందర్మించేలా చూస్తానని అన్నారు. అలాగే రాజకీయ జోక్యం లేకుండా దేవస్వం బోర్డు వ్వవస్థ మొత్తాన్ని పునరవ్యవస్థీకరించి శబరిమల, టీడీపీపై ప్రతి అయ్యప్ప భక్తుడికి నమ్మకం, విశ్వాసం కలిగేలా గట్టి చర్యలు తీసుకుంటానని నమ్మకంగా చెప్పారు.(చదవండి: Pulmedu Sabarimala forest path: శబరిమలకు వెళ్లే.. ఈ రూటు ఎన్నో విశిష్టతలకు ఆలవాలం..!) -
పర్వతమే పరమేశ్వరుడు..!
కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం... ఈ అయిదు లింగాలను పంచ భూత మహాలింగాలు అని అంటారు. ఈ అయిదు క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవటం మంచిదని చాలా మంది అలా దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోనే ఈ ఆలయాలు ఉండటం గమనించదగిన విషయం. వరుసక్రమంలోనే కాకుండా దూరం రీత్యా కూడా అరుణాచలం మధ్యలో నిలుస్తుంది.పంచభూత మహాలింగాల్లో మూడవది అరుణాచలం క్షేత్రం. దీనినే తమిళనాడులో తిరువణ్ణామలై క్షేత్రంగా కూడా పిలుస్తారు. స్వామి వారు అరుణాచలేశ్వరుడు కాగా అమ్మవారు అపిత కుచలాంబా దేవి. సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని స్వామివారే చె΄్పారట. అద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాన్ని సాక్షాత్తూ దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు పల్లవులు, విజయనగర సార్వభౌములు ఇక్కడ ఆలయాలను ఎంతగానో అభివృద్ధి పరిచారు. ఇరవై అయిదు ఎకరాల్లో నిర్మిత మైన ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. నాలుగు దిక్కుల్లో ఎత్తయిన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం పదకొండు అంతస్తుల్లో అలరారుతుంది. ఆరు ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో, విశాలమైన ప్రాంగణంతో ఉండే ఈ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచి భక్తులు వస్తూ ఉంటారు.ఇక్కడి వెయ్యి స్తంభాల మండపానికి సమీపంలో శివ గంగ తీర్థం ఉంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. అరుణాచలం క్షేత్రం అంటే రమణ మహర్షిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన్ని సుబ్రహ్మణ్యస్వామి మరో అవతారంగా భక్తులు చెబుతారు. ఇక్కడ దేవాలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అరుణగిరి (పర్వతం) కు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. ’అ–రుణాచలం’ అనే పదానికి ఐహిక బంధాలను తొలగించే పర్వతం అని అర్థం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందని నమ్మకం. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని, అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు.ఆలయ విశేషాలుతిరువణ్ణామలైలోని అణ్ణామలయ్యార్ (శివుడు) ఆలయం 24 ఎకరాల స్ధలంలో విస్తరించి వుంది. నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాలపరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి.ఈ గోపురాలలో తూర్పువైపున వున్నదానిని రాజ గోపురమంటారు. ఇదే ప్రధాన ద్వారం. నేలమట్టంమీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి, దీర్ఘచతురస్రాకారంలో వున్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూరు బహదీశ్వరాలయానికన్నా ఎత్తయిన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తయిన గోపురాన్ని నిర్మించారు. బయటి ప్రాకారానికి వున్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో వున్నాయి. 70 అడుగుల ఎత్తులో వున్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు వున్నాయి.ఎలా వెళ్ళాలంటే..?కాట్పాడి, చెన్నై మొదలగు తమిళనాడులోని అనేక ప్రదేశాలనుంచేగాక చిత్తూరు, తిరుపతి నుంచికూడా బస్సులున్నాయి. చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు (సి.యమ్.బి.టి.) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరటానికి 4–5 గంటల సమయం పడుతుంది.గిరి ప్రదక్షిణఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అణ్ణామలై వగైరా అనేక ఆలయాలేగాక, సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటివార్ల ఆశ్రమాలుకూడా దర్శనీయాలు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు. రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేకమంది సిద్ధపురుషులూ, యోగి పుంగవులూ అదృశ్యరూపం లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికడ్డవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలుగల ఈ ఆలయాన్ని దర్శించినవారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. ఇంత అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం – కాట్పాడి రైలు మార్గంలో, చెన్నైకి సుమారు 180 కి.మీ.ల దూరంలో వుంది. (చదవండి: Kashi Manikarnika Ghat Mystery: కాశీలో అంత్యక్రియల సమయంలో బూడిదపై 94 ఎందుకు రాస్తారు..? దాగున్న ఆధ్యాత్మిక రహస్యం) -
దేవుడు ఎలా ఉంటాడో తెలుసా..?
ఒకసారి బాగ్దాదు నగరంలో గొప్ప ధార్మిక సభ జరుగుతోంది. వేలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అనేకమంది పండితులు ప్రజలను ఉద్దేశించి ప్రవచనం చేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి సభలోకి ప్రవేశించి, పండితులకు ఒక సవాలు విసిరాడు. ‘మీరు చెబుతున్న ప్రకారం, ఈ సృష్టి మొత్తానికి ఒక కర్త ఉన్నాడు. అయన అల్లాహ్, అంటే సృష్టికర్త. మరి ఆయనే సమస్తాన్ని సృష్టించినప్పుడు ‘ఆయన్ని’ ఎవరు సృష్టించారు? ఆయనకు ముందు ఎవరున్నారు?’అని ప్రశ్నించాడు.సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పండితులు అతని ప్రశ్నకు సమాధానం చె΄్పారు. కాని అతను సంతృప్తి చెందలేదు. పండితులు తల పట్టుకున్నారు. అతనికి అర్ధమయ్యేలా సంతృప్తికరమైన సమాధానం ఎలా చె΄్పాలో వారికి అర్థం కాలేదు. ఆ వ్యక్తి గర్వంగా సభికుల వైపు చూశాడు. అంతలో సభికుల్లోంచి ఓ పదకొండేళ్ళ బాలుడు సమాధానం చెబుతానని ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి బాలుణ్ణి చూసి,‘నువ్వు సమాధానం చెబుతావా?’ అంటూ వెటకారంగా నవ్వాడు.ఆ బాలుడు ఏమాత్రం తొణక్కుండా, ‘అవును నేనే.. మీప్రశ్న మరోసారి వినిపించండి’ అన్నాడు. ‘అన్నిటికీ అల్లాయే అంటున్నారు గదా.. మరి అల్లా‹ß కు ముందు ఎవరున్నారు? ’ అని ప్రశ్నించాడు. అప్పుడా బాలుడు, ‘మీకు ఒకటి, రెండు ఒంట్లు వచ్చుగదా..? ఒకటి నుండి పది వరకు లెక్కించండి’. అన్నాడు.‘ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇదేమి పిచ్చి ప్రశ్న’ అంటూనే ఒకటి నుండి పది వరకు లెక్కించాడు. ‘పది తరువాత..?’ అన్నాడా బాలుడు. ‘పదకొండు..పన్నెండు..’ఇలా ఎంతవరకైనా వెళ్ళవచ్చు.’ అన్నాడా వ్యక్తి. ‘అవును కదా..! అలాగే పది నుండి వెనక్కి లెక్కించండి. ’అన్నాడా బాలుడు. ‘పది..తొమ్మిది..ఎనిమిది..ఇలా .. ఒకటి వరకు వచ్చి ఆగి ΄పొయ్యాడు.‘తరువాత..? లెక్కించండి..’ అన్నాడు బాలుడు. ‘తరువాత ఇంకేముంటుంది. ఏమీలేదు.. సున్నా.. శూన్యం.’ అన్నాడా వ్యక్తి. ‘..కదా..? అల్లాహ్కు ముందు కూడా ఏమీ లేదు.. అంతా శూన్యం. అన్నిటికీ కర్త ఆయనే..’అన్నాడు బాలుడు. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రశ్నించిన వ్యక్తి ముఖం వాడిపోయింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కాశీలో అంత్యక్రియల సమయంలో బూడిదపై 94 ఎందుకు రాస్తారు..?
కాశీ లేదా బనారస్గా పిలిచే వారణాసిని మోక్ష నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కాశీ, వారణాసి రెండు వేర్వేరు కాదు. వారణాసినే కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రవహించే గంగానది ఒడ్డునే జీవన్మరణాలు కలిసే పవిత్ర స్థలం ఉంది. అదే అత్యంత ప్రసిద్ధిగాంచిన మణికర్ణిక ఘాట్. ఇక్కడే శవాలను దహనం చేసేది. ఇది హరిశ్చంద్రుల కాలం నుంచే నిరంతరం మండుతూనే ఉన్నట్లు చెబుతుంటారు. అంతేగాదు దీన్ని ప్రపంచంలోని అత్యంత మర్మమైన దహన సంస్కార ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఇక్కడ అంత్యక్రియల అనంతరం జరిగే ఒక తంతు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అక్కడ చితి చల్లారక ప్రజలు బూడిదపై 94 సంఖ్యను రాస్తారట. అలా ఎందుకు రాస్తారు..దానిలో దాగున్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఇక్కడ వారణాసిలో ఎన్నో ఇతర ఘాట్లు ఉన్నా.. ఈ మర్ణికఘాట్కే అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని పరమ పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. ముందుగా ఈ ప్రదేశానికే ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం..మర్ణికఘాట్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..హిందూ పురాణాల ప్రకారం సతీదేవి చెవి ఆభరణం(కర్ణ కుండలం) పడిపోయిన ప్రదేశం కాబట్టి ఈ ఘాట్కి మణికర్ణిక అనే పేరు వచ్చింది. అలాగే మరో పురాణ కథనం ప్రకారం శివుడు సుదీర్ఘ ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడూ..విష్ణువు తన సుదర్శన చక్రంతో ఇక్కడ పవిత్ర చెరువుని సృష్టించాడని, ఆ చెరువులో శివుడు స్నానం చేసి వచ్చినప్పుడూ అతని చెవిపోగు((మణికర్ణిక) జారిపడి అదృశ్యమైందని అందుకే ఈ ప్రదేశానికి మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారని చెబుతుంటారు. అంతేగాదు దీన్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అగ్నిజ్వాలలు నిరంతరం ఎగిసిపడుతూనే ఉంటాయట. పగలు, రాత్రి అనునిత్యం అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయట. ఇది విముక్తిని ప్రసాదించే ప్రవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారట.బూడిదపై 94 రాయడానికి కారణం..ఈ మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు చేసిన వ్యక్తి..అంటే ఆ కార్యక్రమం జరిపే కుటుంబ సభ్యుడు అగ్ని చల్లారక బూడిదపై 94 అనే సంఖ్యను రాస్తారట. ఈ చర్య అక్కడ స్థానిక సంప్రదాయంలో భాగమట. ఈ సంఖ్య మరణించిన వ్యక్తి ఆత్మ విముక్తి కోరికను సూచిస్తుందట. మోక్ష మంత్రంగా '94'ఈ సంఖ్యను అక్కడ స్థానికులు ముక్తి మంత్రంగా పిలుస్తారట. ఆ సంఖ్యను వ్రాసిన తర్వాత అతడికోసం దుఃఖిస్తున్న కుటుంబ సభ్యుడు ఆత్మను స్వర్గం వైపు నడిపించమని శివుడిని ప్రార్థిస్తాడట. తర్వాత చితిపై నీటి కుండను పగలు కొడతాడు. ఇది అంత్యక్రియల ఆచారం ముగింపుని సూచిస్తుంది.ఈ సంఖ్యలో దాగున్న ఆధ్యాత్మిక రహస్యం..హిందూ శాస్త్రాల ప్రకారం మానవుడి జీవితాన్ని 100 కర్మలు నడిపిస్తాయట. వాటిలో 94మనిషి చేతుల్లో ఉన్న కర్మలు. మిగిలిన ఆరు మాత్రం దైవాధీనంలో ఉంటాయి. జీవితం, మరణం, లాభం, నష్టం, కీర్తి, అపకీర్తి అనే ఆరు కర్మలు బ్రహ్మచే ముందే నిర్ణయించబడినవి, పైగా మానవ నియంత్రణకు మించినవట. మిగిలిన 94మనిషి చేతితో నిర్మించిన మార్గాలగా చెబుతారు. అంటే మనిషి ఆలోచనలు, చర్యలు, ధర్మం, పాపం లాంటి ఈ 94 సంఖ్యల్లో ఉంటాయి. మణికర్ణిక ఘాట్లో దహనమవుతున్నప్పుడు ఆ కర్మలు అగ్నిలో కరిగిపోతాయని, మిగిలేది దేవుని నిర్ణయమని నమ్మకం. అందుకే ఆ సంఖ్యను రాయడం అనేది దివ్య సమర్పణతో పాటు జీవన సమీకరణం కూడా అని స్థానిక పండితులు చెబుతున్నారు.అందువల్లే చితి చల్లారక బూడిదపై 94 అనే సంఖ్యను రాసి.. ఈ మానవ లక్షణాలకు పునర్జన్మ చక్రం నుంచి విముక్తి కోరూతూ..శివుడిని ప్రార్థిస్తారట. ఈ ఆచారం కేవలం మణికర్ణిక ఘాట్లోని దహన సంస్కాల వద్ద మాత్రమే అనుసరిస్తారట. దీని గురించి ఏ హిందూ గ్రంథంలోనూ ప్రస్తావించలేదట. అక్కడ స్థానికుల నుంచి పరంపరగా సాగుతన్న సంప్రదాయమట. అంతేగాదు. ఈ సంఖ్య'94' రాయడం అనేది మోక్షానికి ప్రతీకాత్మక అభ్యర్థన అని భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా.(చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!) -
దేవ దీపావళి దేవతలకూ పర్వదినమే!
చంద్రమా మనసో జాతః – చంద్రుడు (సృష్టికారకుడైన) విరాట్ పురుషుడి మనసు నుండి పుట్టాడు – అని ఋగ్వేద వాక్యం. అందుకే, సముద్రపు ఆటుపోట్లకూ, అమా వాస్య – పూర్ణిమలకూ ఉన్న సంబంధం లాగే, భూమి మీద మనుషుల మనసుల పని తీరు తీవ్రతకూ, ఆకాశంలో చంద్రబింబం వృద్ధి క్షయాలకూ కాదనలేని సంబంధం కనిపిస్తుంది. మానసిక రోగ చికిత్సా నిపుణులు కూడా మద్దతునిచ్చే మాట ఇది.నిండు పున్నమి దినాలలో మనిషి మనసుకు చురుకు ఎక్కువ. పున్నమి నాళ్ళలో, అటు రసభావాల వైపుగానీ ఇటు ఆధ్యాత్మికత వైపుగానీ మనసు ఎప్పటికంటే ఎక్కువ తీవ్రతతో స్పందిస్తుంది. అందుకే సాధకులకూ, భక్తులకూ, యోగులకూ పౌర్ణమి ప్రత్యేక విశిష్టత గల తిథి. అది మంత్రోపదేశాలకూ, ఉపాసనలకూ, తీవ్రమైన ధ్యానాలకూ మహత్తరమైన ముహూర్తం. పున్నమి అంటేనే పొంగిపోయే మనసు, శరత్కాల పూర్ణిమ అంటే మరీ ఉరకలెత్తు తుంది. శివకేశవులిరువురి అర్చనకూ సమానంగా ప్రశస్తమైనది కార్తిక పౌర్ణమి. ఆ పర్వ దినాన, మనసు పరుగునూ, చురుకునూ మంత్ర జపాల వైపు, ఇష్టదేవతారాధన వైపు మళ్ళిస్తే మరింత ఫలప్రాప్తి పొందవచ్చునని పెద్దల మాట.కార్తిక పూర్ణిమ మనుషులకే కాదు, దేవతలకు కూడా పవిత్రమైన పర్వదినమని పురాణాలు చెబున్నాయి. ఆస్తికావళికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీ క్షేత్రంలో, కార్తిక పూర్ణిమను ‘దేవ దీపావళి’గా పరిగణిస్తారు. వారణాసిలో గంగా తీరాన అన్ని ఘాట్లనూ దీపాలతో అలంకరించటంతో, గంగ ఒడ్డు లోకాతీతంగా ప్రకాశిస్తుంది. దేవతలు వారణాసికి వచ్చి గంగామాతను ఘనంగా అర్చించి వెళతారని ఆస్తికుల విశ్వాసం. కార్తిక దీపాలూ, జ్వాలాతోరణాలు, దేవ దీపావళుల లాంటి నైమిత్తిక సంప్రదాయాలతోనూ; అర్చనలూ, జపతపాలూ, అభిషేకాలూ, ధానధర్మాలతోనూ, ఆస్తికులు తమ మనసుకు నచ్చిన మార్గంలో, తమతమ ఇష్ట దేవతలను కొలుచుకొని, విశేషమైన అనుగ్రహం పొందటానికి అనుకూలమైన రోజు కార్తిక పూర్ణిమ. అలాగే, సాధకులు తమలో అనవరతం ప్రకాశించే ఆత్మజ్యోతి వైపు దృష్టి కేంద్రీకరించేందుకూ అది అనువైన రోజు. – ఎం. మారుతి శాస్త్రి -
ఘనంగా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట
కోకాపేటలోని ఏఎస్బీఎల్ స్పైర్లో శ్రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన కుంభాభిషేకం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక అక్టోబర్ 31, 2025 శుక్రవారం ఉదయం 10:26 గంటలకు పూర్తి భక్తి శ్రద్దలతో, ఆగమ శాస్త్ర నియమాలు, తెన్నాచార్య సంప్రదాయానికి అనుగుణంగా జరిగాయి.ASBL స్పైర్ లోపల కొత్తగా నిర్మించిన ఆలయం భక్తి, సాంస్కృతిక కొనసాగింపుకు చిహ్నంగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. సాంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో రూపొందించిన ఈ ఆలయ గర్భగుడి దైవిక కృప, ప్రశాంతతను వెదజల్లుతుంది.ఈ సందర్భంగా ASBL గ్రూప్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, “ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు భక్తులందర్నీ దగ్గర చేస్తాయని, ఆధునిక జీవనానికి అర్థాన్ని జోడిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. మా భవిష్యత్ ప్రాజెక్టులన్నింటిలో ఈ తరహా పవిత్ర స్థలాలను సృష్టించాలని, విశ్వాసం, శాంతి, సామరస్యాన్ని సమిష్టి వేడుకగా జరుపుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము”అని అన్నారు.ఈ వేడుకకు అనేక మంది భక్తులు, నివాసితులు, ASBL కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యాగాలు, హోమాలను నిర్వహించారు. గోవింద, హరే కృష్ణ మంత్రాలతో ప్రాంగణం మొత్తం ప్రతిధ్వనించింది.(చదవండి: యాత్రికులు, నివాసితుల సౌకర్యార్థం రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి) -
శబరిమలలో రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి
శబరిమల యాత్రా కాలం ప్రారంభానికి ముందే నీలక్కల్లో రూ.6.12 కోట్లతో అధునాతన స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఈ ఆసుపత్రిని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(TDB) కేటాయించిన స్థలంలో నిర్మించనున్నారు. మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సౌకర్యం నివాసితులకు, ఆలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు ఉపయోగపడుతుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిజానికి ఈ ఆస్పత్రి ఏర్పాటు శబరిమల యాత్రికుల శ్రేయస్సుని నిర్థారించడంలో ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. సుమారు పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ఔట్ పేషెంట్ గదులు, అత్యవసర విభాగం, ఐసియు,నర్సుల స్టేషన్ , ఇసిజి గది, ఫార్మసీ వంటివి ఉంటాయన్నారు. మొదటి అంతస్థులో ఎక్స్రే, బహుళ ఆపరేటింగ్ స్క్రభ్ స్టేషన్ తదితరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నీలక్కల్ బేస్ క్యాంప్కు రోడ్డు మార్గంలో వచ్చే యాత్రికులకు అత్యవసర,సాధారణ వైద్య సహాయాన్ని ఈ ఆస్పత్రి గణనీయంగా బలోపేతం చేస్తుందని మంత్రి వీణా జార్జ్ అన్నారు. నీలక్కల్ ఆలయ సమపంలోనే ఈ ఈ ఆస్పత్రి నిర్మాణ ప్రారంభోత్సవం జరగునుంది. దీనికి ఎమ్మెల్యే ప్రమోద్ నారాయణ్ , ఎంపీ ఆంటో ఆంటోనీ , డిప్యూటీ స్పీకర్ చిత్తయం గోపకుమార్ , జిల్లా పంచాయతీ అధ్యక్షుడు జార్జ్ అబ్రహం , టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తదితరులు హాజరు కానున్నారు. కాగా, నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే రెండు నెలల వార్షిక తీర్థయాత్ర కాలంలో భారతదేశం, విదేశాల నుంచి వేలాది భక్తులు శబరిమలను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.(చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!) -
'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!
కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారణతో స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోష మారుమ్రోగిపోగా.., మరోవైపు కార్తీక దీపాలు, సోమవారాల పూజలతో సాధారణ భక్తుల కోలహాలం. అంత పుణ్యప్రదమై మాసం ఈ కార్తీక మాసం. ఈ సమయంలోనే చలి మొదలయ్యేది కూడా. ఈ గజగజలాడించే చలిలో మండలకాలం పాటు చన్నీటి స్నానాలతో అయప్పస్వాములు ఎంత నిష్టగా ఉదయం సాయంత్రాలు పూజలు చేస్తారో తెలిసిందే. ఆఖరున శబరిమల వెళ్లి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్ష ముగించడం జరగుతుంది. సాధారణంగా అయ్యప్ప ఆలయం నవంబర్, జనవరి మధ్య కాలంలోనే తెరుస్తారనే విషయం తెలిసిందే. అది కూడా మండలదీక్ష పూర్తి చేసుకునేందుకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. అయితే అంతకంటే ముందు ఒక విశిష్ణ పూజ నిమిత్తం ఐదు రోజులు తెరిచే ఉంచుతారు. అది శబరిమలలో అత్యంత ప్రత్యేకమైన వేడుక. ఈ సందర్భంగా ఆ పండుగ విశేషాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.ఆ పండుగే చిత్తిర అట్టవిశేషం (అత్తతిరునాల్) ఇది శబరిమలలో జరుపుకునే ప్రత్యేక పండుగ. ట్రావెన్కోర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహిస్తారట. ఆయన గౌరవార్ధం ఈ వేడుకను నిర్వహిస్తారు. అప్పటి పందళం రాజవంశం శబరిమల ఆలయాన్ని ట్రావెన్కోర్కు అప్పగించింది. ఆ నేపథ్యంలోనే ఈవేడుకను ఆలయన నిర్వహాకులు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఆయన పుట్టిన రోజున 1942లో చితిర తిరునాళ్ మహారాజు తన కుటుంబంతో శబరిమల సందర్శించినందుకు గుర్తుగా కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు. అంతేగాదు ఆ సమయంలో ఆయనతో పాటు ఉన్న మహారాజు తమ్ముడు ఉత్రాడం తిరునాల్ మార్తాండ వర్మ శబరిమల దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. అది ఇప్పటికీ నెట్టింట వైరల్ ఫోటోగా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ వేడుకను మహారాజు జన్మదినమైన తులా మాసంలో చిత్తా నక్షత్రం ఉన్న రోజున నిర్వహిస్తారు. చెప్పాలంటే సాధారణంగా ఆ పండుగ అక్టోబర్ నెలాఖరు-నవంబర్ మొదటి వారంలో జరుగుతుంటుంది.చిత్తిర అట్టవిశేషం విశిష్టత..అత్తతిరునాల్ పూజ కోసం అయ్యప్ప ఆలయం దాదాపు 29 గంటలు తెరిచి ఉంటుంది. ఈ వేడుకను అచ్చం మళయాళుల జరుపుకునే సంవత్సరాది వేడుక మాదిరిగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ పండుగ రోజు ఉదయ 5 గంటలకు ఊరేగింపు, అభిషేకం జరుగుతాయి. దాంతోపాటు నెయ్యాభిషేకం, అష్టద్రవ్య మహాగణపతి హోమం, ఉష పూజ వంటి కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే..తిరువనంతపురంలోని కవడియార్ ప్యాలెస్ నుంచి ట్రావెన్కోర్ రాజకుటుంబం తీసుకొచ్చిన ప్రత్యేక నెయ్యిని అయ్యప్పస్వామికి అభిషేకం చేస్తారు. అంతేగాదు ఈ ప్రత్యేక రోజున, అయ్యప్పన్ సన్నిధిలో ఉదయం సాయంత్రాల్లో పూజ, అష్టాభిషేకం, లక్షార్చనే, సహస్రకలశాభిషేకం, పడిపూజ, పుష్పాభిషేకం వంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి. రాత్రి భోజనాల అనంతరం భస్మానికి అభిషేకం చేసి 10 గంటలకు హరివరాసన గానంతో ఊరేగిస్తారు. ఈ ‘చిత్తిర అట్టవిశేషం’ వేడుకల అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు మండలం(మండల దీక్ష) కోసం తిరిగి నవంబరు నుంచి మూడు మాసాల పాటు తెరిచి ఉంచుతారు. ఆ సమయంలోనే లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. (చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై..) -
సాటి లేని మాసం.. పుణ్యకార్తీక మాసం
స్కాంద పురాణంలో కార్తికమాస మహిమ ఈ విధంగా వర్ణితమయ్యింది: ‘న కార్తికే సమో మాసం, న కృతేన సమం యుగం, న వేద సదృశం శాస్త్రం, న తీర్థంగంగాయ సమం.’ యుగాలలో కృతయుగానికీ, శాస్త్రాలలో వేదాలకూ, తీర్థాలలో గంగకూ సమానమైనవి లేవు. అలాగే మాసాలలో కార్తికమాసానికీ సమానమైన మాసం లేదని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి అత్యంత విశిష్టతను సంతరించు కుంది. శివ–విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ వంటి పేర్లతో పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తికా నక్షత్రంలోనే ఈ పౌర్ణమి వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాచిన సోమకాసురుణ్ణి సంహ రించడానికి శ్రీహరి మత్సా్యవతారం ధరించింది ఈ రోజే. ఉసిరిక చెట్టు కింద శ్రీహరి దామోదర స్వరూపాన్ని ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజించడం కార్తిక మాసపు ప్రత్యేకత. కార్తికమాసం భక్తి, జ్ఞానం, ధ్యానం సమన్వయమైన మాసం. పౌర్ణమి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు వచ్చే ఈ మాసానికి అధిదేవత అగ్ని. అందుచేత ఇది యజ్ఞ సంబంధమైన పవిత్ర మాసం. కార్తిక మాసంలోని సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి చెట్లు ఉన్న వనంలో బంధు మిత్రులతో కలిసి వనభోజనం చేయడం మరొక ప్రత్యేకత. కార్తికమాసంలోని ఆచారాలు కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలనే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలనూ అందిస్తాయి. ఈ కాలంలో జఠరాగ్నిమందగిస్తుందనే శాస్త్రపరమైన సత్యాన్ని గ్రహించి, ఉపవాసం ద్వారా శరీర శుద్ధి సాధించడం పద్ధతి. ఈ విధంగా, కార్తిక మాసం కేవలం పూజల, వ్రతాల మాసం మాత్రమే కాదు– భక్తి, జ్ఞానం, ఆరోగ్యం, సమాజ సమతా,ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాలను పునరుద్ధరించే దివ్య మాసం! ఇదీ చదవండి: హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు – వాడవల్లి శ్రీధర్ -
భీష్మ పంచుక నాలుగురోజులే : అపురూప దర్శనం
భువనేశ్వర్: మహా పవిత్ర కార్తిక మాసం(karthika Masam 2025) చిట్ట చివరి 5 రోజులను మహా కార్తిక పంచుకగా వ్యవహరిస్తారు. కార్తిక మాసం నెల పొడవునా ఉపవాసం, ప్రత్యేక పూజలతో ప్రాప్తించే పుణ్యం కంటే పంచుక ఉపవాసం ప్రాప్తించే పుణ్య ఫలం అత్యంత మోక్షదాయకమని విశ్వసిస్తారు. దీన్ని భీష్మ పంచుక అని కూడా అంటారు. ఒడిశాలోని పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయంలో ఈసారి పంచుక 5 రోజులకు బదులు 4 రోజులకు పరిమితం అయింది. పంచాంగం గణాంకాల ప్రకారం కార్తిక శుక్ల ద్వాదశి క్షీణతతో ఈ పరిస్థితి నెలకొంది. పంచుక సందర్భంగా శ్రీ మందిరం రత్న వేదికపై సోదర సోదరీ సమేత శ్రీ జగన్నాథ స్వామి రోజుకో అలంకరణలో శోభిల్లుతాడు. ఈ అలంకారాల్లో మూల విరాటులను దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. శ్రీ మందిరం పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. రద్దీ నియంత్రణ కోసం దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహా లఘు దర్శనం భక్తులకు వెలుపలి గడప (బహారొ కఠొ) నుండి రత్న వేదికపై మూల విరాట్ల దర్శనం ఏర్పాటు చేశారు. కార్తిక పూర్ణిమ రోజున ప్రథమ భోగ మండప సేవ ముగిసే వరకు ఈ కట్టడి నిరవధికంగా కొనసాగుతుంది. ఆ తర్వాత లోపలి గోడలపై నుంచి దర్శనం కల్పిస్తారు. సింహ ద్వారం గుండా ప్రవేశం భక్తులు సింహ ద్వారం గుండా ప్రవేశించి మిగిలిన మూడు ద్వారాల గుండా బయటకు రావాల్సి ఉంది. సేవకులు అన్ని ద్వారాల గుండా రాకపోకలు చేస్తారు. యాత్రికులతో ఆలయం లోనికి ప్రవేశించే యాత్రీ పండాలను మాత్రం అనుమతించరు. శ్రీ మందిరం లోపలి ప్రాంగణంలో మరియు బగేడియా ధర్మశాల సమీపంలో రాత్రింబవళ్లు సేవలు అందించే ఆరోగ్య కేంద్రం తెరిచారు. ఆలయం సమీపంలో రాత్రింబవళ్లు 2 అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి. వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు రద్దీ నియంత్రణ కార్యకలాపాల కోసం 32 ప్లాటూన్ల బలగాలను మోహరించినట్లు డీఐజీ డాక్టర్ సత్యజిత్ నాయక్ తెలిపారు. పంచుక ముగిసేంత వరకు ఈ నెల 5వ తేదీ వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. పంచుక తొలి రోజు పురస్కరించుకుని ఆది వారం భద్రతా ఏర్పాట్లుని ప్రత్యక్షంగా సందర్శించి సమీక్షించారు. ఇదీ చదవండి: నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు, నెట్టింట చర్చ -
ధ్రువ చరిత్ర
నిబద్ధత వ్యక్తి జీవితాన్ని విజయపథంలో నడిపిస్తుందనడానికి మహాభాగవతంలోని ధ్రువ చరిత్ర మంచి ఉదాహరణ. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు (Dhruvudu) ఒకరోజు తన తండ్రి ఒడిలో కూర్చొని వుండగా, సవతి తల్లి సురుచి అతన్ని వారించి, నీకా అర్హత లేదు. నువ్వు విష్ణుభగవానుని ప్రసన్నం చేసుకోగలిగితే, అప్పుడు మాత్రమే నీతండ్రి ఒడిలో కూర్చోవడానికి అర్హుడవౌతావు అని అనడంతో ధ్రువుడు అవమానంగా భావించి, యీ మాటలను సవాలుగా స్వీకరించాడు. అప్పుడు ధ్రువుని వయసు ఐదు సంవత్సరాలే. కాని సవతి తల్లి మాటలు ధ్రువునికి తీవ్ర మనస్తాపాన్ని కలుగజేసాయి. విష్ణుని ప్రసన్నం చేసుకోవాలనే బలమైన కోరిక ధ్రువుని మనసులో స్థిరపడింది. ధ్రువుడు రాజ్యాన్ని వదలి అడవికి పోయాడు. నారదుడు ధ్రువుని ఇంటికి రప్పించే ప్రయత్నం చేశాడు గాని ‘నేను విష్ణువుని దర్శించే వరకు యింటికి రాను’ అన్న ధ్రువుని సమాధానంతో నారదుడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మంత్రాన్ని ధ్రువునికి ఉపదేశించాడు.ధ్రువుడు అనేక సంవత్సరాలు ఆహారం, నిద్ర, చలనం లేకుండా ఘోర తపస్సు చేశాడు. కనీసం శ్వాస కూడా తీసుకోకుండా తపస్సు చేశాడు. అతని తపశ్శక్తి ముందు విశ్వశక్తి బలహీనపడింది. దేవతలంతా విష్ణువుని దర్శించి,‘స్వామీ జగద్రక్షకా ఆ బాలుని తపోశక్తి ముందు విశ్వమే తలవంచవలసి వస్తుంది. కనుక అతనికి మీ దర్శనభాగ్యం కలిగించమని మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ధ్రువునికి తన దర్శన భాగ్యం కలిగించాడు. ధ్రువుడు అమితానంద భరితుడై విష్ణువుని కీర్తించాలనుకున్నాడు కాని నోట మాటరాలేదు. అపుడు విష్ణుమూర్తి తన శంఖంతో ధ్రువుని నుదురు స్పృశించగానే దైవశక్తి దవునిలో ప్రవేశించింది. అప్పుడు దవుడు విష్ణుమూర్తిని కీర్తించగా, విష్ణుమూర్తి ‘‘ధ్రువా! నీవు ఈ భూమండలాన్ని వేల సంవత్సరాలు పాలిస్తావు. అంతేగాకుండా నువ్వు అమరుడవై ధ్రువనక్షత్రంగా వెలుగుతావు, అందరికీ మార్గదర్శక మౌతావు’’ అని ఆశీర్వదించాడు.ధ్రువుడు సత్యాన్వేషణ లో బాధని అవకాశంగా మార్చుకోవడం వల్ల, కోరిక భవిష్యత్ దర్శినిగా మారింది. కష్టాలకోర్చి అడవిలో చేసిన తపస్సు, విజయానికి అంతః క్రమశిక్షణ అవసరమని నిరూపించింది. ధ్రువుడు లౌకిక విజయం (తండ్రి ఒడిలో కూర్చోవడం) కోసం ప్రయత్నిస్తే దైవానుగ్రహంతో అమరత్వాన్ని పొందాడు. గురువు (నారదుడు) చూపిన మార్గాన్ని విడిచిపెట్టకపోవడం విపత్తునెదుర్కొనే శక్తినిచ్చింది. విజయం నిబద్ధత తో కూడిన స్థిర చిత్తం నుంచి పుడుతుందని ధ్రువ చరిత్ర మానవాళికి సందేశం మిస్తుంది.– డా. విశ్వేశ్వర వర్మ భూపతిరాజు -
జీవన సమరానికి గీతాఖడ్గం
గీత అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కేవలం మేధస్సుతో పొందేదికాదు. భక్తి, ధ్యానం ద్వారానే అది పరిపూర్ణమ వుతుంది. విజయుడు అంటే బయటి శత్రువులను జయించిన వాడు కాదు, తన అంతరంగ శత్రువులైన కోపం, భయం, మోహం, అసూయలను జయించిన వాడే అసలైన విజేత. మనిషి పతనం బయటి పరిస్థితుల వల్ల రాదు. అది అంతరంగ బలహీనతల ఫలితం. అలాగే ఉన్నతి ఎవ్వరూ ప్రసాదించలేరు. అది ఆత్మవిశ్వాసం, ఆత్మజయంతోనే సాధ్యమవుతుంది. ఇప్పటి సమాజంలో మానవ జీవనం చాలా సంక్లిష్టం. ఉద్యోగ భారం, కుటుంబ బాధ్యతలు, సామాజిక ΄ోటీలు, భవిష్యత్తు భయాలు ఇవన్నీ మనసును అల్లకల్లోలంగా మార్చుతున్నాయి. మనసు ఒకవైపు ఆకాంక్షలతో పరుగెత్తుతుంటే, మరొకవైపు నిరాశలతో కుంగి΄ోతుంది. ఈ సందిగ్ధంలో గీత బోధించే తాత్పర్యం మనసుకు శాంతి, బుద్ధికి స్పష్టత, ఆత్మకు దిశ చూపిస్తుంది. అర్జునుడు నైరాశ్యంలో ఉన్నప్పుడు కృష్ణుడు జ్ఞానాన్ని బోధించాడు. మనం కూడా నిరాశలో ఉన్న ప్రతి సందర్భంలో గీత మనలోని ఆత్మస్థైర్యాన్ని మేల్కొలు పుతుంది.ఇదీ చదవండి: నీతా అంబానీకి స్టాఫ్ సర్ప్రైజ్ : భర్త, తల్లి కాళ్లు మొక్కి బర్త్డే సెలబ్రేషన్స్ చూశారా?గీత బోధించే సమత్వం జీవన గర్భరహస్యం. సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు ఇవన్నీ జీవనయాత్రలో సహజమైనవి. ఆ ప్రవాహంలో కొట్టుకు΄ోకుండా స్థిరంగా నిలబడగలగడమే గీత వలన మనం పొందే శిక్షణ. కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయడమే గీతాజ్ఞానం. గీతలోని వైరాగ్య భావం అత్యున్నత విముక్తి. తామరాకుమీద నీటిబిందువులా జీవనం కొనసాగిస్తూ లోకబంధనాలకు అతీతంగా ఉండగలగడం అనాసక్తి. ఇది త్యాగం కాదు, సంసారంలోనే ఉండి కర్తవ్యాన్ని సమర్పణతో నిర్వర్తించడం.భగవద్గీత ఒక శాస్త్రగ్రంథం కాదు. కాలాతీత మానసికశాస్త్రం, ఆత్మవికాస శస్త్రం. ఇది యుగాల మార్పులోనూ, నాగరికతల పరివర్తనలోనూ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. నేడు శాస్త్రవేత్తలు విశ్వరహస్యాలను అన్వేషిస్తుంటే, గీత మనలోని ఆత్మరహస్యాన్ని వెలికితీస్తుంది. శరీరాన్ని సంరక్షించేది వైద్యం అయితే, ఆత్మను కాపాడేది గీత. ఇదీ చదవండి: భీష్మ పంచుక నాలుగురోజులే : అపురూప దర్శనంమనసును జయించడం ద్వారా మనిషి విశ్వాన్ని జయించగలడు. కో;eన్ని అధిగమించడం ద్వారా భయాన్ని జయించగలడు. అనాసక్తితో విముక్తిని పొందదగలడు. కర్తవ్యాన్ని ఆరాధనగా భావించడం ద్వారా జీవితం పవిత్రమవుతుంది. జ్ఞానం వెలుగుతో ఆత్మజ్యోతి ప్రసరిస్తుంది. ఇదే గీతామాధుర్యం. ఇదే యుగయుగాలకీ తియ్యని జ్ఞానామృతం. – సత్యశ్రీ -
దేవ దీపావళి... జ్వాలాతోరణం
కార్తీకమాసమంతా పర్వదినాల పరంపరే అయినప్పటికీ ఈ మాసంలో కొన్ని పర్వాలు కన్నుల పండువగా జరుగుతాయి. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా జ్వాలాతోరణ విశిష్టత ఏమిటి, ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అలా అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై ఆవునెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పార్వతీ పరమేశ్వరులని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. అలా వారి ఊరేగింపు అనంతరం భక్తులు కూడా ఆ మంటల కింది నుంచి దూరి వెళ్తారు.మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం, యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే శ్రీమన్నారాయణుని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి సర్వదేవతా కటాక్షం లభిస్తుందనీ, వారికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదనీ కార్తీక పురాణం చెబుతోంది. అందుకే భక్తులు తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.దీనివెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద స్వామివారి పల్లకి పక్కనే నడుస్తూ...‘‘నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని సంకల్పం చెప్పుకోవాలి. అనంతరం ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి – ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం...లక్ష్మీనారాయణులను కూడా...కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివుడితో పాటుగా లక్ష్మీనారాయణులను కూడా ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు వ్రతమాచరించి సత్యనారాయణ స్వామి వ్రత కథను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావిచెట్టు, తులసిచెట్టు ఈ మూడింట్లో ఎక్కడో ఒక చోట దీపం వెలిగించాలి.కాశీలో దేవ దీపావళికాశీలో ఈ కార్తీక పున్నమినాడు దేవదీపావళీ రూపంలో వేడుకలు జరుగుతుంటాయి. ఆ రోజున కాశీలోని గంగా ఘాట్లలో లక్షలాది దీపాలు వెలిగిస్తారు. ఒకేసారి ఘాట్లలో దీపాల వరుసలు వెలిగినప్పుడు, మొత్తం నగరం దీపతోరణంలా కనిపిస్తుంది. ఈ కమనీయ దృశ్యాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా వారణాసికి చేరుకుంటారు.ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వధించాడనీ, ఆ విజయాన్ని పురస్కరించుకుని దేవతలు కాశీలో దీపాలు వెలిగించి వేడుక చేసుకున్నార నీ, అప్పటినుండి ఈ పండుగ దేవ దీపావళిగా ప్రసిద్ధి చెందిందనీ స్థలపురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం గంగా హారతి చూడడం ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఈ దివ్య వీక్షణం కోసం గంటల తరబడి భక్తులు ఘాట్లలో ఓపిగ్గా ఎదురు చూస్తారు. కార్తీక పౌర్ణమిని సిక్కులు గురునానక్ జయంతిగా జరుపుకుంటారు. – డి.వి.ఆర్. -
హర హర మహాదేవ : కార్తీకంలో దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు
కార్తీక మాసంలో మహాశివుడిని భక్తితో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం, అలాగే కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ మాసం శివరాధనకు అంకితం. ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాలన్ని సందర్శించి, భక్తితో దీపారాధన చేస్తే మోక్షం లబిస్తుందని, కష్టాలన్నీ తొలగి, అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో ఒక్క రోజులోనే పంచారామాలను ఒక్కరోజులోనే సందర్శించడం మరో విశేషం. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో సందర్శించదగిన కొన్ని శివాలయాల గురించి తెలుసుకుందాం.నిజానికి చెప్పాలంటే శివాలయం లేని గ్రామం ఉండదు. అయినా ప్రసిద్ధ శివాలయాలను, జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలను దర్శించి తరించాలని భక్తులు భావిస్తారు. అమరారామం: గుంటూరు జిల్లాలోని అమరావతిలో ప్రధాన దైవం అమరలింగేశ్వర స్వామి. అమరేంద్ర ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినందున ఈ పేరు వచ్చింది. కృష్టా నది దక్షిణ ఒడ్డున ఉన్న బాల చాముండిక అమరలింగేశ్వర స్వామి భార్య. ఈ ఆలయం రెండు అంతస్తులను కలిగి ఉన్న భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందింది.ద్రాక్షారామం: తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి సమీపంలో ఉన్న ద్రాక్షారామంలో కొలువైన శివుడిని భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని సూర్య భగవానుడు స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు.దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడి రాతి స్థంభాన్ని ఆలింగనం చేసుకుని భక్తితో మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని విశ్వాసం.సోమారామం: భీమవరంలో ఉన్న సోమారామం పంచారామాలలో మూడవది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడట. ఇక్కడ శివుడిని పూజించడం ద్వారా చంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని నమ్ముతారు. అందుకే దీనికి సోమారామం అని పేరు వచ్చింది. చంద్రుని దశల ఆధారంగా దాని రంగు మారుతూ ఉంటుంది. పౌర్ణమి సమయంలో , సోమారామంలోని శివలింగం తెల్లగాను, అమావాస్య కు నల్లగా మారుతుందట.సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలోని కుమార రామ ఆలయం పంచారామాలలో చివరిది. వుడిని కుమార భీమేశ్వర స్వామిగా కొలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని కార్తికేయుడు ప్రతిష్టించాడని ప్రతీతి. పూర్తిగా సున్నపురాయితో తయారు చేసిన ఇక్కడి శివలింగం దాదాపు 16 అడుగుల ఎత్తు ఉంటుంది అలాగే ఈ ఆలయం 100 స్తంభాల మండపం, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఏకశిలా నంది ప్రత్యేకం. కోటప్పకొండ : అత్యంత ప్రసిద్ధ శైవ దేవాలయాలలో గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ ఒకటి. 1587 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండలో అత్యంత పురాతనమైన శివాలయం. శివుడిని త్రికూటేశ్వర స్వామి అని పిలుస్తారు.కోటప్పకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్పకొండలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కోటప్ప కొండను కాకులు వాలని కొండగా కూడా ఇది ప్రసిద్ధి. శ్రీశైలం: నంద్యాల జిల్లాలో కొలువై ఉన్న శ్రీశైలం దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 179 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వయా పాలమూరు జిల్లా నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయాన్ని రెండో శతాబ్దంలో నిర్మించాని చెబుతారు. ఈ క్షేత్రంలో పాతాళగంగ, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార వంటి సందర్శనీయ ప్రదేశాలు.ఛాయ సోమేశ్వర స్వామి : నల్లగొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం. దీన్ని ఇక్ష్వాకు వంశస్తులు 11, 12వ శతాబ్దంలో నిర్మించారట. ఈ గుడిలోని శివ లింగం ప్రతిరోజూ శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది. అందుకే ఈ గ ఇక్కడి శివుడికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.రామప్ప దేవాలయం: తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమైన దేవాలయం. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. అత్యున్నతమైన వాస్తు, శిల్ప సంపదతో ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఆలయం. రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు.యాగంటి : కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది. 5వ శతాబ్దంలో నిర్మించారని ప్రతీతి. పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలవడం మరో ప్రత్యేకత. అలాగే యాగంటి నంది ప్రతీ ఏడాదీ కొంచెం కొంచెం పెరుగుతుందని చెబుతారు.ఆలంపూర్ నవ బ్రహ్మ. : జోగుళాంబ-గద్వాల జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ తొమ్మిది దేవాలయాల శ్రేణిని చాళుక్యులు నిర్మించారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు అనుగ్రహించి ప్రపంచ సృష్టించడానికి కావలసిన శక్తులు బ్రహ్మకు ప్రసాదిస్తూ ఆశీర్వాదిస్తాడు. అందువల్ల శివునికి బ్రహ్మేశ్వరుడు అని కూడా పిలుస్తారు. బ్రహ్మ ఉపసర్గ మొత్తం కుమార, అర్క, వీర, బాల, స్వర్గ, గరుడ, విశ్వ, పద్మ, తారక బ్రహ్మ అనే తొమ్మిది ఆలయాలున్నాయి.సంగమేశ్వరుడు : కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రత్యేకత. సప్తనదీ సంగమంగా పిలువబడే శివయ్య ఏడాదిలో కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. వేల ఏళ్లనాడు ఆలయంలో ప్రతిష్టించిన వేప లింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం.వేములవాడ రాజన్న: రాజన్న సిరిసిల్లాల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయం నిర్మాణం, ఆధ్యాత్మిక పవిత్రత రెండింటికీ ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పేరొందిది. ఇక్కడి ధర్మ గుండం జలాల్లో తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు.కీసర : లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరి క మేరకు శ్రీరామలింగేశ్వరస్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం.ఇవి కొన్ని శివాలయాలు మాత్రమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరెన్నో శివాలయాలు, పవిత్రమైనవిగా, భక్తులు కోర్కెలు తీర్చే కొంగుబంగారం విలసిల్లుతున్నాయి. భక్తుల ఆదరణకు నోచుకున్నాయి. -
అమలా నవమి ఉత్సవాలు, సాక్షి గోపాల్ టెంపుల్ గురించి తెలుసా?
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లా సాక్షి గోపాల్ పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. పూరీ నుండి 19 కి.మీ దూరంలో ఉన్న సాక్షిగోపాల్ పట్టణంలో ఉంది. ఇక్కడ రాధా కృష్ణులను ఆరాధిస్తారు. మధ్యయుగ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చి బియ్యం బదులుగా దేవతకు గోధుమలు సమర్పిస్తారు.సాక్షి గోపాల్ ఈ పేరు ఎలా వచ్చింది?సఖిగోపాల్ అని పిలువబడే ఒక పేదవాడు గ్రామాధికారి కుమార్తెను ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు.కానీ వారి ఆర్థిక స్థితిలో తేడాను చూసి గ్రామ పెద్ద వీరి ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే కొంతకాలానికి గ్రామపెద్ద సఖిగోపాల్తో పాటు, కొంతమంది ప్రజలు తీర్థయాత్ర కోసం కాశీకి వెళ్లారు. అక్కడ గ్రామ పెద్ద అనారోగ్యానికి గురవుతాడు. గ్రామస్తులు ఎవరూ అతనికి సహాయం చేయలేదు. అప్పుడు సఖిగోపాలు మాత్రమే సపర్యలు చేస్తాడు. దీంతో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ ఇంటికి వచ్చిన మాట మారుస్తాడు. దీనికి సాక్షులని తెమ్మంటాడు. దీంతో స్వయంగా శ్రీకృష్ణుడు సాక్ష్యమిస్తాడు. అలా ఈ ఆలయానికి సాక్షిగోపాల్ అని పేరు వచ్చింది. ఇదీ చదవండి: పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయంఈ క్షేత్రంలో రాధాదేవీ పాద దర్శనం ప్రముఖ ఉత్సవం. ఏటా కార్తీక మాసం శుక్ల నవమి నాడు ఈ దర్శనం లభిస్తుంది. ఈ ఏడాది శుక్రవారం రాధా పాద దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ గోపాల్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. దీన్నే అక్షయ నవమి, అమలా నవమిగా పేర్కొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సాక్షిగోపాల్ పట్టణం ఉత్సవ సన్నాహాలతో కళకళలాడుతోంది. ఈ ప్రత్యేక రోజున, భక్తులకు రాధారాణి దేవి పాదాలను చూసే అరుదైన అవకాశం లభిస్తుంది. ఏడాది పొడవునా దేవీ పాదాల దర్శనం లభించదు. ఈ దివ్య దృశ్యాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. రాధా పాద దర్శనం మోక్షం ప్రసాదిస్తుందని భక్తుల నమమ్మకం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రాచీన సంప్రదాయానికి అనుగుణంగా రాధా పాద దర్శనం ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాధారాణి దేవత అద్భుతమైన ఒడియా ఇంటి ఆడపడుచు (ఒడియాణి) అలంకరణలో, సాక్షి గోపాలుడు నటవర్ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. శుక్రవారం ఉదయం 5 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. సంప్రదాయ ఆచార వ్యవహారాలతో పూజాదులు నిర్వహించి భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భారీ రద్దీకి అనుగుణంగా ఆలయ అధికార యంత్రాంగం విçస్తత ఏర్పాట్లు చేస్తుంది. గట్టి భద్రత రాధా పాద దర్శనం కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో సాక్షి గోపాలు పట్టణ వ్యాప్తంగా భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. వరుస క్రమంలో భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రవాణా క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల పైబడి భక్తులు రాధా పాద దర్శనం కోసం తరలి వస్తారని నిర్వహణ యంత్రాంగం అంచనా. తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పూరీ జిల్లా మేజి్రస్టేటు , పోలీసు సూపరింటెండెంట్ తదితర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా సాక్షిగోపాల క్షేత్రం సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు. దర్శనం పురస్కరించుకుని 11 వరుసల బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు పంచసఖ బహిరంగ స్థలం, పరిసర ప్రాంతాలలో సువిశాల పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. -
స్వర్గం, నరకం అంతా మన లోపలే!
ఒకానొకసారి, ఓ బలవంతుడైన వస్తాదు జ్ఞానం, ప్రశాంతతకు పేరుగాంచిన బౌద్ధ గురువు వద్దకు వచ్చాడు. ఆ వస్తాదు అంటే అందరికీ భయమే. అతని హృదయం కోపంతో గందరగోళంగా ఉండేది. చేస్తున్న పనుల పట్ల చిరాకూ పరాకూ పడుతుంటేవాడు. అతను సన్యాసి వద్దకు వచ్చీ రావడంతోనే తలవంచి నప్పటికీ అహంకారంతో అడిగాడు: ‘గురువుగారూ! నాకు స్వర్గం, నరకం గురించి బోధించాలి’. సన్యాసి అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ‘నీకు వాటి గురించి చెప్పాలా? నీ మాటలో గర్వం కనిపిస్తోంది. నేను విడమరిచి చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు’ అన్నారు. ఆ మాటతో వస్తాదు కోపంతో ఊగిపోతూ, తన దగ్గరున్న కత్తిని తీసి ‘మీరన్న మాట నన్ను అవమానపరిచింది. నేను ఇప్పుడే మిమ్మల్ని చంపగలను’ అని అరిచాడు. సన్యాసి ఏమాత్రం కంగారు పడలేదు. అతని కళ్ళలోకి చూసి ప్రశాంతంగా చూస్తూ, ‘ఇదిగో ఈ నీ చర్యే నరకం’ అని చెప్పారు. వస్తాదు స్తంభించిపోయాడు. అతని కోపం కరిగిపోయింది. సిగ్గుపడ్డాడు. తన కత్తిని పక్కనపెట్టి సన్యాసి ముందు మోకరిల్లి, ‘క్షమించండి... నాకు వాస్తవాన్ని చిన్న మాటతో నేర్పించినందుకు ధన్యవాదాలు’ అని మృదువుగా అన్నాడు. సన్యాసి సున్నితంగా నవ్వి, ‘ఇదిగో ఇదే నువ్వడిగిన స్వర్గం’ అన్నారు. ఈ చిరుఘటన ధ్యానం సారాంశాన్ని చెబుతోంది. ధ్యానం జీవితం నుండి తప్పించుకోవడం గురించినది కాదు, అది మన అంతర్గత ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడం గురించి చెప్పేది. ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు, భావోద్వేగాలు సముద్రంలో అలల వలె పైకి ఎగరడం, కింద పడటం అనుభవంలోకి రావడం గమనిస్తాం. అప్పుడు ఆందోళనపడటం మానేసి, దాని కింద ఉన్న ప్రశాంతతను చూస్తాం. అందుకే బుద్ధుడంటాడు: ‘శాంతి లోపలినుండి వస్తుంది. బయట దానిని వెతక్కండి’ అని! -యామిజాల జగదీశ్ -
ప్రమథ గణాలు, వారిలో ముఖ్యులు ఎవరంటే..?
ప్రమథ గణాలంటే శివపరివారం లేదా శివుని సేన. ప్రమథ అంటే బాగా మథించగలిగే వారని అర్థం. వీరు దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులు. ప్రమధ గణాలు కోట్లకొలది ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్రగణాలుగా ఉండి పోతారని ప్రతీతి. అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులువీరభద్రుడు: సాక్షాత్ శివస్వరుపం. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగే వరం పొంది, అతని సమీపం లో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. నందీశ్వరుడు: శివునికి ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితేనే శివదర్శనం! భృంగి: శివుని పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని ఖ్యాతిగాంచాడు. స్కందుడు: కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. క΄ాల హస్తుడు. కాశీ పురాధీశుడు.రిటి: ఉద్దాలకుని పుత్రుడు. శివకప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.బాణుడు: శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన శ్రీ కృష్ణునితో యుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.చండీశుడు: ఒక గోప బాలుడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు. ఇలా శివగణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. -
ఇండియాలో తొలి మసీదు గురించి తెలుసా?
క్రీ.శ. 629 (హిజ్రీ 7) సంవత్సరంలో నిర్మించబడిన చేరమాన్ జుమా మస్జిద్, కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; అది భారత ఉపఖండంలో మతసామరస్యానికి, ఆధ్యాత్మిక అన్వేషణకు, సంస్కృతీ సంప్రదాయాల సంగమానికి అపుర్వమైన చిహ్నంగా నిలిచింది. మస్జిద్ నిర్మాణ శైలిలో ఆ కాలపు కేరళ శిల్ప సౌందర్యం ప్రతిబింబిస్తుంది. కానోపు (గుడార ఆకారం) ఆకారంలో కట్టిన గోపురం, కలపతో నిర్మించిన పైకప్పు, పురాతన సాంప్రదాయ నూనెదీపం – ఇవన్నీ దక్షిణ భారత ఆర్కిటెక్చర్కి ఇస్లామిక్ రూపాన్ని అద్దిన అరుదైన ఉదాహరణ. కాలక్రమేణా అనేక పునరుద్ధరణలు జరిగినా, ప్రాథమిక రూపం చెక్కు చెదరకుండా కాపాడబడుతూ వస్తోంది. అక్కడి ఇమామ్లు ఇప్పటికీ తమ వంశావళిని మాలిక్ ఇబ్నె దినార్ వరకు కలిపి చెప్పుకుంటారు.మస్జిద్ చతురస్ర ఆకారంలో పురాతన కళా వైభవాన్ని చాటుతోంది. మస్జిద్ కు సంబంధించిన కాంప్లెక్స్ లో చేరామన్ మ్యూజియం, వెనుక భాగంలో అందమైన కొలను, కుడి పక్కన ఖబ్రస్తాన్ , అందులో పచ్చని నిశ్శబ్దంతో తలలూపుతున్న కొబ్బరి చెట్లు, వివిధ రకాల మొక్కలు, కాలానికి అనుగుణంగా మార్పు చెందిన రాతి మెట్లు, మస్జిద్ లోపలి భాగం మధ్యలో వేలాడుతున్న పురాతన నూనెదీపం, అత్యంత సుందరమైన చెక్క మింబర్ ఇవన్నీ ఆ ప్రదేశాన్ని ఒక చరిత్రకావ్యంలా మార్చేశాయి.అక్కడి స్థానికులు చెప్పిన ఒక మాట ప్రకారం ‘‘ఇది కేవలం మస్జిద్ కాదు, ఇది భారత దేశానికి ఇస్లాం ప్రవేశ ద్వారం.’’ఈ ఒక్క వాక్యంతో ఆ స్థలం ప్రాముఖ్యత పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సముద్ర గాలిలోనూ, ప్రార్థన ధ్వనిలోనూ, ఆ భూమి ఇంకా చెరామాన్ పెరుమాళ్ ఆత్మను ఆత్మీయంగా మీటుతూనే ఉన్న అనుభూతి కలుగుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అవరోధాలనే అవకాశాలుగా..!
మానవ జీవిత గమనంలో గమ్యం చేరుకునే దారిలో అవరోధాలు ఏర్పడటం సహజం. సష్టిలో ఏ ఇద్దరికీ జీవనప్రయాణం ఒకేలా సాగదు. ఏకోదరులకు కూడా ఒకేరకంగా జీవనప్రయాణం ఉండదు. భౌతిక ప్రపంచంలో కష్టాలు మనుషుల్ని బలహీన పరుస్తాయి. కానీ, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ప్రతి అవరోధమూ మన సహనం, విశ్వాసం, అంతర్గతశక్తిని పరీక్షించడానికి దైవం కల్పించిన గొప్ప అవకాశం. పురాణ ఇతిహాసాలు ఈ సత్యాన్ని నిరూపించాయి. రామాయణంలో అయోధ్యకాండను పరిశీలిస్తే పట్టాభిషేకానికి సిద్ధమైన శ్రీరాముడు, కైకేయికి తండ్రి దశరథమహారాజు ఇచ్చిన వరాల కారణంగా అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. పదునాలుగేండ్లు వనవాసం చేయాల్సి వచ్చింది. అది శ్రీరాముని జీవితంలో పెద్ద అవరోధం. కానీ స్థితప్రజ్ఞత కలిగిన రాముడు దీనినొక అవకాశంగా చేసుకున్నాడు. ధర్మాన్ని కాపాడటం తన కర్తవ్యంగా భావించాడు. పితృవాక్య పరి΄ాలకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అరణ్యంలోనూ రాముని జీవనం సజావుగా సాగలేదు. సీతాపహరణం తీవ్ర అవరోధంగా పరిణమించింది. అయితే ఈ అవరోధమే కోదండరామునికి కొత్త సహచరులను పరిచయం చేసింది. వానర, సుగ్రీవ, హనుమ వంటి వీరులతో మైత్రి ఏర్పరిచింది. రావణసంహారం గావించాడు. అసుర చెరనుండి అయోనిజ ని విడిపించాడు. పురుషోత్తమ రాముడయ్యాడు.సుందరకాండను పరిశీలిస్తే సీతమ్మ జాడకై వెళ్లిన పవనసుతునికి లంకలో అవమానం ఎదురైంది. అసురులు తన తోకకు నిప్పంటించారు. ఈ అవరోధాన్ని ఆంజనేయుడు అవకాశంగా మార్చుకున్నాడు. శత్రుశక్తిని ఆయుధంగా మలిచాడు. మండుతున్న తోకతో మొత్తం లంకానగరాన్ని దహనం చేసాడు. అటు మహాభారతంలో ద్యూతక్రీడలో కౌరవులపై ఓటమి చెందిన పాండవులు అరణ్యవాసం, ఆపై అజ్ఞాతవాసం అనుభవించాల్సి వచ్చింది. ఈ అవరోధనా కాలాన్ని, పాండవులు అవకాశంగా మరల్చుకున్నారు. వారు నేర్చుకున్న విద్యలనూ, అభ్యసించిన శాస్త్రాలనూ, ఆయుధవిద్యలో ప్రావీణ్యం సంపాదించుకునే దిశలో వినియోగించుకున్నారు. తమ వీరత్వాన్ని చాటారు.భాగవతంలో ప్రహ్లాదుడు ఎదుర్కొన్న అవరోధం అసాధారణం. తండ్రి హిరణ్యకశిపుడే శత్రువుగా మారాడు. నిప్పులో వేయించడం, ఏనుగులతో తొక్కించడం, కొండపైనుండి తోయించడం వంటివి అవరోధాలు. కానీ ప్రహ్లాదుడు ఈ అవరోధాలన్నింటినీ తన భక్తిని మరింత దృఢం చేసుకునే అవకాశంగా మార్చుకున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా అతని మనస్సు ఆ పరమాత్మ స్మరణ నుండి తొలగలేదు. అంతిమంగా ఆ పీడనమే నృసింహ అవతార రూపంలో భగవంతుని సాక్షాత్కారానికి దారితీసింది. ఇక్కడ అవరోధం ప్రహ్లాదునికి మోక్ష సాధన మార్గమైంది.ధ్రువుడు చిన్న వయసులోనే సవతి తల్లి చేతిలో తీవ్ర అవమానాన్ని చవి చూశాడు. ఈ చేదు అనుభవం అతనికి అవరోధం. ఈ అవరోధమే అతణ్ణి మహా భక్తునిగా మార్చింది. నారద మహర్షి మార్గ దర్శకత్వంలో ధ్రువుడు కఠిన తపస్సు చేశాడు. చివరికి మహా విష్ణువు ప్రత్యక్షమై ధ్రువుని అచంచల భక్తిని సదా జ్వలించే ధ్రువ నక్షత్రంగా స్థాపించాడు. అవమానం అనే అవరోధం విశ్వనక్షత్రమనే అవకాశం గా మారింది.పురాణాలన్నీ బోధించేది ఒక్కటే. జీవితంలో ఎదురయ్యే ప్రతీ అవరోధమూ మన ఆత్మశక్తిని, భగవంతునిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి దొరికిన అవకాశం. కష్టాలు, సవాళ్లు అనేవి మనల్ని దిగజార్చడానికి కాక మన అంతరంగం లో నిగూఢమై ఉన్న దైవత్వాన్ని వెలికితీయడానికి, మనల్ని ఉన్నత ఆధ్యాత్మికస్థితికి చేర్చడానికి తోడ్పడతాయి. కాబట్టి అవరోధాలను చూసి భయపడకుండా దానిని ఒక ఆశీర్వాదంగా భావించి ధైర్యంతో, విశ్వాసంతో ముందడుగు వేయడమే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక వికాసం ఉన్నచోట ఆటంకం కూడా అవకాశంగా కొత్తరూపు ఏర్పడుతుంది. అదే విజయానికి పునాది అవుతుంది.ఓటమి విజయానికి గెలుపు అనుకుంటే అవరోధమేమే అవకాశానికి తలుపు అవుతుంది.ఆధ్యాత్మిక సాధనతోనే ఇది సాధ్యమవుతుంది. – కె.వి.లక్ష్మణరావు (చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై.) -
కార్తీక దీపానికి భక్తకోటి కాంతులు
అవి ప్రతి యేటా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు... సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులూ కాదు తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు అలాగని అది మునుపెన్నడూ చేయని క్రతువు కాదు. వేదాలు.. పురాణేతిహాసాలు అందించిన ఒక చిన్న వెలుగుకు కోటికాంతులు అద్దిన ఉత్సవం. కార్తికమాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన అద్భుతం. సుమారు పుష్కరకాలం క్రితం కార్తికమాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభం. అదే భక్తిటీవీ కోటి దీపోత్సవం. కార్తికమాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకువచ్చే అపురూప సంరంభం. భక్తిటీవీ కోటిదీపోత్సవం. చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. 2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై... పుష్కరకాలానికి పైగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామాగ్రి ఇలా ప్రతీది ఉచితంగా సిద్ధం చేస్తారు.సుమారు పుష్కరకాలం క్రితం... పదమూడేళ్లక్రితం శృంగేరీ దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ సందర్భాన్ని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులకు ఓ సంకల్పం కలిగింది. భక్తులందరి సమక్షంలో వారికి గురువందనం చేయాలని భావించారు. దానితోపాటు కార్తికమాసంలో శివస్వరూపమైన జగద్గురువులు స్వయంగా విచ్చేశారు గనుక.. వారి సమక్షంలో కార్తికదీపోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. ఆ చిన్న సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్షదీపోత్సవం. భక్తిటీవీ చేపట్టిన దీపయజ్ఞానికి నాంది అది. ఎన్టీఆర్స్టేడియం వేదికగా కైలాసాన్ని తలపించే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శృంగేరి జగద్గురువులు దీపారాధన చేసి భక్తులను ఆశీర్వదించారు.ముక్కోటి దేవతలు ఒక్కటైనారు...కార్తికమాసంలో శంకరనారాయణులనే కాదు.. సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్టధామాల నుంచి కోటిదీ΄ోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తూ ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలు.. యాదాద్రి, శ్రీరంగం, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు... అలంపురం, కంచి, వారణాసి వంటి శక్తిపీఠాలు. ఇలా ఒకటేమిటి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటిదీ΄ోత్సవ వేదికపై కొలువుదీరతారు. కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. ఎన్నో పూజలు – పరిణయోత్సవ వైభవ సమాహారం.గురుర్దేవో మహేశ్వరఃప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలి వస్తుంటారు. శివైక్యం చెందిన కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యానృసింహ భారతిస్వామి, ఉడిపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామి, ఆర్షవిద్యాగురుకులం శ్రీదయానందసరస్వతి వంటి మహామహులు కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించడం వీక్షకుల అదృష్టం. శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థమహాస్వామి, పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి, జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానందస్వామి, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గివాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, సమతామూర్తి స్థాపకులు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీవిద్యాశంకరభారతిస్వామి, ధర్మస్థల క్షేత్రాధికారి వీరేంద్రహెగ్డే, అక్షయ΄ాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమధుపండితదాస, ఇస్కాన్ అంతర్జాతీయ అధ్యక్షులు జయపతాకస్వామి, పతంజలి యోగ బాబారామ్ దేవ్, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతిస్వామి, రుషికేశ్ పరమార్థ్నకేతన్ చిదానంద సరస్వతి, కాశీ – శ్రీశైల జగద్గురువులతో పాటు ఎందరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించారు. గురుదేవులే మహేశ్వరులై భక్తకోటిని అనుగ్రహించారు. ఈ ఏడాది సైతం శృంగేరి జగద్గురు విధుశేఖరభారతిస్వామివారు.. కంచి జగద్గురు విజయేంద్రసరస్వతి స్వామివారు విచ్చేయడం కోటిదీపోత్సవానికి సూర్యచంద్రుల ఆగమనం లాంటి శుభతరుణం. సువర్ణాక్షరాల ఘట్టాలు కోటిదీపోత్సవ చరిత్రలోనే కాదు... భక్తిటీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టాలు. కోటిదీపోత్సవం – 2023. కోటిదీపోత్సవం – 2024. రెండేళ్ల క్రితం మహాదేవునికి కోటిదీపాల నీరాజనం అర్పించేందుకు తుమ్మల నరేంద్రచౌదరి – రమాదేవి దంపతుల ఆహ్వానం మేరకు.. సాక్షాత్తూ దేశప్రధానమంత్రి నరేంద్రమోది విచ్చేయడం... దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి.. తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న భావన కలుగుతోందని ప్రశంసించడం ఓ అపూర్వ జ్ఞాపకం. గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయడం మరో మరపురాని ఘట్టం. దేశ ప్రథమ ΄ పౌరురాలి చేతులమీదుగా కార్తికదీపం వెలిగింది. భక్తుల ఆనందం కోటిదీపాల కాంతులై మెరిసింది. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టమని ద్రౌపది ముర్ము పేర్కొనడం అద్వితీయం. సప్తహారతులు... మహానీరాజనాలు ఈ అపూర్వ వేడుకలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు.లక్ష కాదు.. కోటి 2013లో... మళ్లీ కార్తికమాసం రానే వస్తోంది. 2012లో జరిగిన వైభవం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. లక్షదీపోత్సవం కంటే మించినది ఏదైనా చేయాలని తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి – వారి కుమార్తె రచనా చౌదరిల సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపమే అంతవరకూ ఎవరూ చేయని మహోత్సవం. నూతన ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం. ఆనాడు వెలిగిన దీపజ్యోతి ఇంతింతై అన్నట్లుగా... పుష్కరకాలంగా కొనసాగుతోంది. అఖండదీపమై ప్రకాశిస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త హంగులతో వెలుగొందుతోంది. కోటిదీ΄ోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్లే అనే భావన ప్రతీ భక్తుడికీ కలిగేలా కార్యక్రమ రూపకల్పన జరిగింది. నటరాజుకు కళాంజలి: జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, కైకుట్టి, మోహినిఆట్టం, ఒడిస్సీ, మణిపురి, లావణి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీ΄ోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. ఇందుకోసం ప్రసిద్ధ కళాకారులు సైతం తరలివస్తారు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈశా ఫౌండేషన్ తరఫున బ్రహ్మచారులు చేసే అగ్నినృత్యం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు ప్రతిఏటా చోటుచేసుకుంటాయి.ఆ అపూర్వ యజ్ఞంమరోమారు...కార్తికమాసాన్ని పురస్కరించుకునినవంబరు1 నుంచి 13 వరకుహైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో... -
పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయం
కృష్ణానదిలో స్నానం... అమరేశ్వరుని దర్శనం’ మోక్షదాయకం అన్నారు పెద్దలు. తెలుగునేల మీద ఉన్న పంచారామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్నది. ఇక్కడ వెలసిన బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామిని దర్శించి తరించటానికి భక్తజనం నిత్యం అమరావతిని సందర్శిస్తుంటారు. శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమ గల క్షేత్రంగా భక్తులు భావిస్తారు.దేవాలయంలో గల వివిధ శాసనాలు ద్వారా అమరేశ్వరుణ్ణి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి వివిధ రాజవంశీయులు సేవించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటకేతు రాజులు అమరేశ్వరుని సేవించినట్లు చరిత్ర చెపుతోంది.శ్రీ కృష్ణదేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు, బ్రాహ్మణులకు దానాలిచ్చినట్లు ఆధారాలున్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణాంధ్రదేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయాన్ని పునరుద్ధరించి, మూడు ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశీక ధర్మకర్తలుగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా కూడా పిలవబడుతుంది.ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగో΄ాల స్వామి క్షేత్ర΄ాలకునిగా విరాజిల్లుతూ శివ కేశవులకు భేదం లేదని చాటుతున్నాడు.ఏకశిలా రూపంగా దాదాపు 15 అడుగుల ఎత్తున, మూడు అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామి వారి నుదుట మూడు చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి.శుక్రాచార్యుడి సందేహంఅసుర గురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్తులో సహ్యాద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధాన మిస్తూ, అమరేశ్వరుడు వెలసిన దీన్ని క్రౌంచగిరి అంటారనీ, దీని అడుగు పాతాళం దాకా ఉందనీ, దానివల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందనీ, కృష్ణమ్మ ఈ గిరి పక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదనీ బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది.అమరలింగేశ్వరాలయ ప్రాముఖ్యత...ద్వాపర యుగం చివరిలో 5053 సంవత్సరాల క్రితం మరియూ కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షి నారదుడిని మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కాంద పురాణం పేర్కొంది. నారదుడు శౌనకాది మహర్షిని కృష్ణానదిలో రోజూ స్నానం చేసి, కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున, అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ నివసించమని సలహా యిచ్చాడు.నారద మహర్షి సౌనకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు, తన భక్తులకు కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగం రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కష్ణానదిలో స్నానం చేసి ఇక్కడి ఆలయంలోని అమరేశ్వరుడిని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ ప్రదేశంలో మూడు రోజులపాటు ఉండి భక్తిశ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులు శివలోకాన్ని పొందుతారన్నారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు గ్రహిస్తాడు.అమరలింగేశ్వర ఆలయ ఉత్సవాలు...ఈ ఆలయంలో కార్తీక మాసం, మహా బహుళ దశమి, నవరాత్రి, మహా శివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయ సమయాలు...మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. ప్రస్తుత కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సా. 4 గంటల నుండి రాత్రి 8.30 వరకు గుడిని తెరచి ఉంచుతారు.కార్తీకమాసం పౌర్ణమి, సోమవారాలలో ఉ.3 నుండి రాత్రి 10 వరకు, ఆదివారాలలో ఉ. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. -
జీవులన్నీ దేవుడే!
ప్రాణికోటిలో మనిషితో పాటు ఎన్నో జంతువులున్నా, భారతీయ గ్రామీణ జీవితంలో అతి పురాతన కాలం నుంచి, గోమాతగా పూజించబడే ఆవుకూ, నాగదేవతగా ఆరాధించబడే పాముకూ ప్రత్యేక స్థానం ఉంటూ వచ్చింది. భౌతికంగా చూస్తే, పాము ‘రైతు నేస్తం’. సిద్ధమైన పంటలను గుటకాయ స్వాహా చేసి అపార నష్టాన్ని కలిగించే ఎలుకలు మొదలైన ప్రాణులను తమకు ఆహారంగా చేసుకొనే పాములే లేకపోతే, పండిన పంటలో సగం కూడా చేతికి చిక్కదు. పాముది, మనిషిలాగే, వైరుద్ధ్యాల జీవితం. వాటిని క్రూర జీవులనటం అపార్థం వల్లే! వాటికి మనిషితో శత్రుత్వం లేదు. మనిషి అలికిడి తెలియగానే, అతడికి వీలయినంత దూరంగా వెళ్ళటానికే అవి ప్రయ త్నిస్తాయి. పాము మనిషిని కాటు వేస్తే, అది కాకతాళీయమైన విధి విలాసమే తప్ప, ‘క్రూరత్వం’ కాదు. పాము విషం ప్రాణాంతకమే. కానీ సరిగా వాడితే, అది దివ్యౌషధంగా పని చేస్తుంది అంటుంది వైద్య శాస్త్రం.పాములకు ఇతర జంతువులకు లేని స్థాయిలో శ్రవణ శక్తీ, ఘ్రాణ శక్తీ, గ్రహణ శక్తీ ఉంటాయన్న నమ్మకం గ్రామీణులలో కనిపిస్తుంది. ముఖ్యంగా భౌతికాతీతమైన, లోకాతీతమైన శక్తి, దివ్య సంపత్తి ఎక్కడ ఉన్నా, అది పాములను ఆకర్షిస్తుంది అని ప్రతీతి. యోగులూ, మునులూ పాములతో సఖ్యం చేసిన సందర్భాల గురించి ఎన్నో విశేషాలు వింటూ ఉంటాం. భగవాన్ రమణ మహర్షితో పాములు ముఖాముఖి నిలిచి, సుదీర్ఘమైన మౌన భాషణలు చేసేవనీ, పాములు కాళ్ళకు చుట్టుకొని పాదాభివందనం చేసినా ఆయనకు చక్కలిగింత తప్ప మరో భావన కలిగేది కాదనీ ఆయన మాటలలోనే విన్నాం.ఇదీ చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?పాములలో ఒక దివ్యత్వం ఉన్నదని భారతీయ గ్రామీణులు అనాదిగా విశ్వసిస్తూ వచ్చారు. చనిపోయిన పాము త్రోవలో ఎదురైతే, దానికి సాదరంగా, సభక్తికంగా అంతిమ సంస్కారం చేసే ఆనవాయితీ మన గ్రామాలలో ఉండేది. సమస్త జీవరాశిలో భగవంతుణ్ణి చూడడమే భారతీయ ఆదర్శం.– ఎం. మారుతి శాస్త్రి -
ప్రజల ఆకలి తీర్చడానికి...
భూమండలాన్ని పృథు చక్రవర్తి పాలిస్తున్న రోజులలో ఒకప్పుడు ధర్మనష్టం జరిగి వర్షాలు పడక, పంటలు పండక, ప్రజలు కందమూలాలు తిని ఆకలి తీర్చుకోవాల్సి వచ్చింది. కరవును భరించలేని జనం పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి ఆ భయంకర క్షామం నుండి కాపాడమని వేడుకున్నారు. అది చూసి తట్టుకోలేని పృథు చక్రవర్తి, సస్యనాశనం కావించి జనులకు ఆహారాన్ని దూరం చేసిన భూదేవిని శిక్షించడానికి పూను కున్నాడు. భయపడిన విశ్వంభర గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు చేరింది. ఎక్కడికి వెళ్ళినా వెంబడించి పట్టుకుని శిక్షిస్తానని, తాను కూడా వెళ్ళాడు పృథు. ‘అంతగా కోపం తెచ్చుకోవడానికి నేను చేసిన తప్పేమిటి?’ అని అడిగింది భూదేవి. ‘క్షామ పరిస్థితులు సృష్టించి ప్రజలు ఆకలితో అలమటించేలా చేసిన దుష్టచారిణివి నీవు. నిన్ను శిక్షిస్తే ప్రజలు సుఖపడతారు’ అన్నాడు పృథు. ‘కరవుకు అసలు కారణం గ్రహించకుండా నీవు నన్ను శిక్షించే ఆలోచన చేస్తున్నావు. నీ ప్రజలను కాపాడుకునే ఉపాయం నేను చెబుతాను. సస్యరాశి సమస్తం, ఔషధాలు నాలో జీర్ణమై ఉన్నాయి. గోరూపంలో ఉన్న నాకు సంతానం కలిగితే, పాల రూపంలో అవన్నీ మళ్ళీ భూమిపై ప్రవహించి, బీజములు మొలకెత్తి, పంటలు సమృద్ధిగా పండుతాయి. కనుక అలా చెయ్యి’ అని సలహా ఇచ్చింది. ఆలోచించిన పృథు చక్రవర్తి, పర్వత శ్రేణులతో ఎత్తుపల్లాలుగా ఉన్న భూమిని చదును చేశాడు. గ్రామాలు, పట్టణాలు నిర్మింపజేశాడు. కాయకష్టం చేయడానికి జీవనోపకరణాలను తయారు చేయించి అందరికీ సమ కూర్చాడు. అలా అంతటినీ వ్యవస్థీకృతం చేసి భూదేవి సలహా ప్రకారంగా చేయడానికి ఇలా పూనుకున్నాడని వెన్నెలకంటి సూరన ‘శ్రీవిష్ణుపురాణం’, ప్రథమాశ్వాసంలో చెప్పాడు. కం. పాయక భూధేనువునకు / స్వాయంభువు గ్రేపుగాగ సమకట్టి మహీ నాయకుడు పిదికె దుగ్ధ/ ప్రాయంబై జగములెల్ల బరిపూర్ణముగాన్. గోరూపంలో ఉన్న భూదేవికి స్వాయంభువ మనువును దూడగా చేసి పృథు చక్రవర్తి పాలు పితికి భూమండలం మొత్తం తడిసేలా చేశాడని పై పద్యంభావం. ఆ చర్యతో భూమి మళ్ళీ సారవంతమై పంటలు పండి ప్రజలు సుఖించారని ‘శ్రీవిష్ణుపురాణం’లోని పృథు చక్రవర్తి కథ చెబుతోంది.– భట్టు వెంకటరావు -
హనుమంతుని గీతా భాష్యం గురించి తెలుసా?
ప్రాచీన కాలంలో గురుముఖ విద్యకే ప్రాధాన్యం. విద్య అనేది గురు శుశ్రూష వలన, తమ దగ్గర ఉన్న ఒక విద్యనిచ్చి వారి నుండి మరొక విద్య గ్రహించటం అనే పద్ధతులలో ఉండేది. గురువు లేకుండా విద్యనార్జించటం అసాధ్యం. గురువు స్వయంగా చెబితేనే విద్య గ్రహించాలి. ఇతరులకు చెబుతున్నపుడు, అనుమతి లేకుండా విద్య గ్రహించటం కూడా తప్పే! అదీ నాటి పరిస్థితి.ద్వాపర యుగంలో కురు పాండవ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం పట్ల విముఖుడైన అర్జునునికికృష్ణుడు భగవద్గీత రూపంలో తత్వార్థాన్ని బోధించాడు. బోధించాక, ‘నీకు బాగా అర్థమైందా?’ అనడుగుతాడు. అర్జునుడు, ‘అర్థమయ్యింది కానీ మళ్ళీ వినాలనుకుంటున్నాను, సంక్షిప్తంగా చెప్పమ’ ని అంటాడు. అప్పుడు అర్జునుని ధ్వజంపై ఉన్న హనుమ ‘నేను ఈ బ్రహ్మ విద్యను సమస్తం గ్రహించాను. నా హృదయంలో అది స్థిరంగా ఉంది. నేను నీకు తర్వాత చెపుతాను. ఇది యుద్ధ సమయం. వృథా ఆలోచనలు మాని యుద్ధం చేయి’ అంటాడు.ఇదీ చదవండి: ధర్మాన్ని నిలిపే త్రిశక్తుల గురించి తెలుసా?అపుడు కృష్ణుడు హనుమంతునితో, ‘నా అనుమతి లేకుండా నువ్వు బ్రహ్మ విద్య నెలా గ్రహించావు? గురువాజ్ఞ లేకుండా విద్య గ్రహించిన వానికి పిశాచత్వం కలుగుతుంది. నువ్వు విద్వాంసుడవై కూడా ఇలా ఎందుకు చేసావు?’ అన్నాడు. హనుమ ధ్వజాగ్రం నుండి దిగి వచ్చి, వినయంగా, ‘నాకు బ్రహ్మ విద్య ఎలా సఫల మౌతుంది? పిశా చత్వం ఎలా పోతుంది?’ అని ప్రార్థించగా, కృష్ణుడు కౌరవుల యుద్ధం ముగిసిన వెంటనే ‘నీ పిశాచత్వం తొలగి పోతుంది. సేతువు వద్ద స్నానం చేసి రామేశ్వరుని ఆర్చించు. తర్వాత నువ్వు ఈ గీతా శాస్త్రానికి భాష్యం రాయి. ఈ భాష్య రచనకు నీ కన్నా సమర్థులు లేరు. నీ ద్వారా ఈ శాస్త్రం విఖ్యాత మౌతుంది’ అన్నాడు. హనుమంతుడు గీతకు అద్భుతమైన భాష్యం రాశాడు. ఈ భాష్యం వలన భగవద్గీతలోని విశేషార్థాలు, సామా న్యార్థాలు అవగతమవుతాయని ‘పరాశర సంహిత’ తెలుపుతోంది. చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?– డా.చెంగల్వ రామలక్ష్మి -
ధర్మాన్ని నిలిపే త్రిశక్తుల గురించి తెలుసా?
పాప భీతి, దెవప్రీతి, సంఘనీతి త్రయం. ఈ మూడే మన అంతరాత్మను వెలిగించే త్రివేణి సంగమం. అంతఃకరణసాక్షిత్వమే మనిషికి నిత్యమైన ధర్మం. ఈ ధర్మాన్ని నిలిపే త్రిశక్తులు: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి. ఈ మూల విలువలు లోపించినప్పుడే వ్యక్తిగత జీవితంలో శాంతి నశించి, ప్రపంచం అపనమ్మకంతో నిండిపోతుంది. మనిషిని ధర్మబద్ధంగా నడిపించేవి ఈ మూడు: పాప భీతి (తప్పు పర్యవసానానికి భయం), దైవ ప్రీతి (విశ్వం పట్ల ప్రేమ), సంఘ నీతి (సామాజిక బాధ్యత). ఈ అంతర్గత విలువలు లోపించినప్పుడే, చట్టం చూడకపోయినా, ఎవరూ గమనించకపోయినా, మనిషి అవినీతికి, అన్యాయానికి పాల్పడతాడు. దీని పర్యవసానంగా, అంతఃకరణ శాంతి నశించి, ప్రపంచంలో నమ్మకం కొరవడుతుంది. పాప భీతి లేని ఒక వ్యాపారి, తక్షణ లాభం కోసం అక్రమాలకు, పన్ను ఎగవేతకుపాల్పడతాడు. చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే ధైర్యంతో, ధర్మాన్ని పక్కన పెడతాడు. ఈ స్వార్థపూరిత చర్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.ఒక ఆటో డ్రైవర్, ప్రయాణికుడు మరచిపోయిన డబ్బు సంచిని తిరిగి అప్పగిస్తాడు. ఈపాప భీతితో కూడిన నిజాయితీ వల్ల, అతను తిరిగి ఇచ్చిన డబ్బు కంటే, ఎక్కువ గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకుని, తన కుటుంబానికి గొప్ప కీర్తిని అందిస్తాడు. ఈ మూడు విలువల కారణంగానే ఒక ఇంజనీర్ ్ర΄ాజెక్టును అత్యంత నాణ్యతతో నిర్మిస్తాడు. ఇది కేవలం పని మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు భద్రత కల్పించే తన ధర్మం అని నమ్ముతాడు. ఈ నిజాయితీ అతనికి శాశ్వత కీర్తిని, క్లయింట్లలో అపారమైన నమ్మకాన్ని ఇస్తుంది. దీనికి విరుద్ధంగా, అదే ఇంజనీర్ నాణ్యత తగ్గించి డబ్బు సం΄ాదిస్తే, తాత్కాలికంగా ధనం వచ్చినా, ఆ ప ప్రాజెక్టు పతనం అయినప్పుడు ఆ వ్యక్తి ఆత్మశాంతిని పూర్తిగా కోల్పోతాడు. ఈ విలువల వల్ల మీ జీవితంలో/వృత్తిలో మీకు శాశ్వత కీర్తి, తిరుగులేని నమ్మకం లభిస్తాయి. ఒత్తిడి ఎదురైనా, దైవ ప్రీతి వల్ల మనసుకు మానసిక స్థైర్యం లభిస్తుంది. ఈ విలువలు లేక΄ోతే, మీరు ఎంత డబ్బు సంపాదించినా అంతరాత్మ ప్రశాంతత నశించి, అభద్రతా భావం పెరుగుతుంది.చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?కుటుంబంలోనూ ఈ ప్రభావం మరీ లోతుగా ఉంటుంది. మీ నిజాయితీ మీ పిల్లలకు గొప్ప ఆస్తి. మీరు విలువలు నిర్లక్ష్యం చేస్తే, ఇంట్లో అశాంతి, అపనమ్మకం పెరుగుతాయి. పిల్లలు మాటలకంటే ఎక్కువగా, చేతలనే చూస్తారు; తల్లిదండ్రులకు పాప భీతి లోపిస్తే, పిల్లలూ నిజాయితీని కోల్పోతారు. పాప భీతి మనల్ని తప్పుల నుండి కాపాడే కఠినమైన గురువుగా రక్షిస్తుంది. దైవ ప్రీతి మనల్ని ప్రేమతో నడిపించే తల్లిగా ప్రేరణనిస్తుంది. సంఘ నీతి మనల్ని బాధ్యతాయుత పౌరులుగా మార్చే బంధం. పాప భీతిని ఆచరించండి, దైవ ప్రీతిని పెంచుకోండి, సంఘనీతిని పాటించండి. ఈ మూడింటిని హృదయపూర్వకంగా ధరించినప్పుడే, మన వ్యక్తిగత ప్రశాంతత పెరుగుతుంది, ప్రపంచం నమ్మకం, మానవత్వంతో నిండిపోతుంది.ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందనే నమ్మకం లేనప్పుడు, మనిషిలో కరుణ, సహానుభూతి తగ్గిపోతాయి. ఫలితంగా, అతను కేవలం తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించి, ఇతరుల బాధను, కష్టాన్ని విస్మరిస్తాడు. దైవ ప్రీతి లోపం ఉన్న ఓ పరిశ్రమ యజమాని, తక్షణ లాభం కోసం, నదుల్లో కాలుష్యాన్ని విచ్చలవిడిగా వదిలి వేస్తాడు. ఈ కలుషిత నీటిని తాగే జంతువులు, ఆధారపడిన ప్రజారోగ్యంపై పడే భయంకరమైన ప్రభావాన్ని అతను పట్టించుకోడు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఉండాలనే కనీస బాధ్యతను విస్మరించి, ప్రకృతి విధ్వంసానికి పాల్పడతాడు. ఈ లోపం అతన్ని సమాజానికి, ప్రకృతికి హాని కలిగించేలా నిర్దయగా మారుస్తుంది. సంఘ నీతి లోపించిన ఒక వ్యాపారి, లాభం కోసం ఆహారంలో కల్తీ చేసి, తక్షణ లాభం పొందుతాడు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం, బాధ్యత లేని స్వార్థం వల్ల సమాజం రోగాల పాలయ్యే అవకాశం ఉంది. – కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు)ఇదీ చదవండి: ఆధ్యాత్మికత...ఆత్మదర్శనం అంటే ఏమిటి? -
ఆధ్యాత్మికత...ఆత్మదర్శనం అంటే ఏమిటి?
ఆత్మదర్శనం ఒక్కటే నిన్ను దైవాన్ని చేర్చే ఏకైక సాధనం. సమాజంలో జరుగుతున్న ప్రతి తప్పు ఆత్మను మరచిపోయిన స్థితిలో జరుగుతున్నవే. సామాజికమైన సమస్యలన్నీ కూడా కాలం– స్థలం అన్న పరిమితిలో జరుగుతున్నవే. మోసం, ద్వేషం, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు మొదలైనవన్నీ యాంత్రికమైన స్థితిలో జరుగుతున్నవే. శరీరం–మనస్సు, కోరికలు, కాలం–స్థలం అనే పరిధిలోనే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. సమాజాన్నిమార్చాలి అంటే మొదట నీవు ఆత్మతత్వాన్ని చేరుకోవాలి. నీ ప్రయాణం అంతర్ముఖమై ’నేను ఆత్మను’ అని అనుభవంతో తెలుసుకునే వరకు తప్పులు జరుగుతూనే ఉంటాయి. నీ గమనిక బహిర్ముఖమైనప్పుడు కలిగే స్థితే యాంత్రిక స్థితి, ఆత్మ పట్ల ఎరుకలేని స్థితి. నీ గమనిక అంతర్ముఖమైనప్పుడు ఆత్మ చైతన్యస్థితిలో ఉంటావు. నీ మూలాన్ని చేరుకుంటావు. ఆ స్థితిలో శరీరం–మనస్సులు చేస్తున్న పనులన్నింటినీ ఒక సాక్షిగా గమనిస్తూ ఉంటావు. నడవటం, మాట్లాడటం, స్పర్శించటం, రుచి చూడటం వంటి పనులు చేస్తున్న శరీరం–మనస్సులను అంటకుండా దూరంనుండి చూస్తూ ఉంటావు. వచ్చే ఆలోచనలను, కోరికలను కూడా సమభావనతో గమనిస్తూ ఉన్నప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు. వాటి ఫలితాలు కూడా నిన్ను బాధించలేవు. సుఖమైనా, దుఃఖమైనా సమభావనతో సాక్షిగా ఉండిపోతావు. ఆలోచనలను గమనిస్తున్నప్పుడు ఆలోచనల కదలిక ఆగి పోతుంది. అలోచనల్లో ఉన్న శక్తి తిరిగి గమనికలోకి వచ్చి చేరి ఆలోచనలు శక్తిహీనమై మనస్సు సహజంగానే నశించి΄ోతుంది. నీవు బలవంతంగా అణిచి పెట్టవలసిన అవసరమే లేదు. నీవు ఈ నిద్రనుండి లేచే వరకు ప్రపంచం మారదు. నీ నమ్మకాలు, దైవం పట్ల ఉన్న నీ అభిప్రాయాలు, బాహ్యమైన ఆరాధనలు, అర్చనలు మొదలైనవన్నీ భ్రమలేనని తెలుసుకుంటావు. నీవు ఏది ఊహించుకున్నా చివరికి అది దైవం గూర్చిన ఉహలే ఐనా, అవి కేవలం నీ కల్పితమైన మనస్సు ప్రతిబింబాలే గానీ సత్యాలు కావు. మనస్సుతో ఊహించినదేదీ సత్యం కాదు. సత్యం మనస్సుకు అతీతమైనది. మనస్సు మాయమైనపుడు ఉన్న శుద్ధ చైతన్యస్థితే సత్యం. అది కేవలం అనుభవంతోనే తెలుసుకోగలవు. నీవు నీవు కావడమే ఆధ్యాత్మికత. మనసుతో తెలుసు కున్నవి, ఊహించినవి అన్నీ అసత్యాలే. ఆ చైతన్య స్థితిని తెలుసుకోవాలి. అదే బుద్ధుడు, కృష్ణుడు, లావోట్సు మొదలైన యోగులు చేరుకున్న స్థితి. వారంతా బోధించినది చైతన్యస్థితి గురించే. మనస్సు భ్రమలనుండి బయటపడమని బోధిస్తే మనమేమో ఆ భ్రమలను పెంచుకుంటూ అవే నిజాలని నమ్ముతున్నాము. మనస్సు మలినాన్ని కడిగేదే ధ్యానం. ధ్యానంతోనే దైవాన్ని చేరగలవు. అదే ఏకైక మార్గం. నమ్మకాలను, భ్రమలను తీసివేసేదే ధ్యానం. నీ నిజతత్వాన్ని అనుభవింపజేసేదే ధ్యానం.అసలు మనస్సు అనేదే ఆగిపోయినప్పుడు దేన్ని కోరగలవు. అప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. నమ్మకాలు, భ్రమలు అన్నీ మాయమైపోతాయి. అల సముద్రంతో తిరిగి కలిసిపోతుంది. మనస్సు దాని మూలమైన ఆత్మతో తిరిగి ఏకమైపోతుంది. ఏకత్వం అనుభవమై ఔతుంది. ప్రకృతి పురుష ఏకమౌతుంది. చూసేవాడు, చూడబడేది అనే రెండూ శుద్ధ చైతన్యంలో లీనమౌతాయి. కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. – స్వామి మైత్రేయ ఆధ్యాత్మిక బోధకులు∙ -
చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..
కార్తిక మాసం ఈశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది. భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఈశ్వరానుగ్రహం తప్పక దొరుకుతుందని పండితుల ఉవాచ. ఈశ్వరానుగ్రహం పొందేందుకు నలుదిక్కులా అష్టసోమేశ్వరాలయాల్లో ఆ స్వామి కొలువుదీరిన అరుదైన ఆలయాలున్నాయి. దేవతలతో ప్రతిష్టించినట్టు విశేష ప్రాచుర్యం పొందిన ఆ ఆలయాల్లో ఈశ్వరుడు కొలువయ్యాడు. అష్టసోమేశ్వరాలయాలను దర్శించుకుంటే భగవత్ సంకల్పం నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. కార్తిక మాసంలో అష్ట సోమేశ్వరాలయ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యముంది. రామచంద్రపురం, మండపేట పరిసర ప్రాంతాల్లోని అష్ట సోమేశ్వరాలయాలకు ప్రత్యేకత ఉంది. ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. సూర్యునితో స్వయం ప్రతిష్ఠగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్ట సోమేశ్వరాలయాల నడుమ కొలువుదీరి పూజలందుకుంటున్నారు. అనుకోని అవాంతరం కారణంగా కాలహరణమై ముహూర్త సమయం మించిపోతుండడంతో భీమేశ్వరుడు స్వయంభు లింగంగా ద్రాక్షారామలో అవతరించారు. భీమలింగాన్ని సూర్యభగవానుడు ప్రతిష్టించి భీమేశ్వరునికి ప్రథమార్చన చేసినట్టు పురాణ ప్రతీతి. ఇంద్రాది దేవతలు పూజించగా, సప్త గోదావరి పవిత్ర జలాలతో స్వామివారిని సప్త రుషులు అభిషేకించారు. సూర్య ప్రతిష్ఠత తాపాన్ని, ఉగ్రతను నియంత్రించేందుకు ఆగమ సంప్రదాయం ప్రకారం నలు దిక్కులే కాకుండా, విదిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు వెలిశాయి. చంద్రునితో స్వయం ప్రతిష్టితాలుగా ద్రాక్షారామ భీమేశ్వరాలయం అష్ట దిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు ప్రతిష్ఠించబడినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరునికి ఒక్కొక్క యోజన దూరంలో అష్టసోమేశ్వరాలయాలు నెలకొని ఉండటం విశేషం. కార్తిక మాసంలో ద్రాక్షారామ భీమేశ్వరుని దర్శనంతో పాటు, అష్ట సోమేశ్వరాలయాల్లోని సోమేశ్వరులను దర్శించుకోవడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. సూర్య ప్రతిష్ఠ గావించిన భీమేశ్వరుని దర్శనం అనంతరం.. చంద్ర ప్రతిష్ఠితాలుగా పేరొందిన అష్ట సోమేశ్వరాలయాల్లోని స్వామివారి దర్శనంతో భక్తులకు సకల పాప పరిహారంతో పాటు, ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.తూర్పున కోలంక ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున కాజులూరు మండలం కోలంక గ్రామంలో పార్వతీ సమేత ఉమా సోమేశ్వరస్వామివారు నెలకొని ఉన్నారు. కార్తిక మాసంలో ఈ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే కోర్కెలు తీరుతాయని ప్రసిద్ధి. కోలంకకు చేరుకోవాలంటే ద్రాక్షారామ నుంచి యానాం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాలి. ఆటో సదుపాయమూ ఉంది. పడమర వెంటూరు ద్రాక్షారామకు పడమర దిక్కులో రాయవరం మండలం వెంటూరులో పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి పూజలందుకుంటున్నారు. వెంటూరు చేరుకోవాలంటే రామచంద్రపురం–వాకతిప్ప ఆర్టీసీ బస్సులో వెళ్లవచ్చు. రామచంద్రపురం నుంచి నేరుగా ఆటోల సౌకర్యం ఉంది.దక్షిణాన కోటిపల్లి అష్ట సోమేశ్వరాలయాల్లో గౌతమీ నదీ తీరాన కె.గంగవరం మండలం కోటిపల్లి శ్రీఛాయా సోమేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. చంద్రుడు స్వయం ప్రతిష్ఠగా వెలసిన సోమే శ్వరుడిని పవిత్ర గోదావరి పుణ్య స్నానమాచరించి దర్శించుకుంటే పాప పరిహారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ద్రాక్షారామ నుంచి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యముంది.ఈశాన్యంలో పెనుమళ్ల ద్రాక్షారామకు ఈశాన్యంలోని కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామంలో పార్వతీ సమేత సోమేశ్వరస్వామి కొలువయ్యారు. కార్తిక మాసంలో స్వామివారి ఆలయం వద్ద భక్తులు దర్శనం చేసుకుని తరిస్తుంటారు. ద్రాక్షారామతో పాటు, గొల్లపాలెం నుంచి ఆటోల్లో పెనుమళ్ల చేరుకోవచ్చు.ఉత్తరాన వెల్ల ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారికి ఉత్తరాన రామచంద్రపురం మండలంలోని వెల్లలో బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం. రామచంద్రపురం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని వెల్ల చేరుకోవడానికి ఆటో సదుపాయం ఉంది. నైరుతిన కోరుమిల్లి ద్రాక్షారామకు నైరుతిలో కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో కొలువైన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరాలయం అష్ట సోమేశ్వరాలయాల్లో ఒకటి. ద్రాక్షారామ, రామచంద్రపురం, మండపేట నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులతో పాటు, ఆటోల సదుపాయముంది. వాయవ్యం సోమేశ్వరంలో.. ద్రాక్షారామ ఆలయానికి వాయవ్యంలో రాయవరం మండలం సోమేశ్వరంలోని బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం అష్ట సోమేశ్వరాలయా ల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. రామచంద్రపురం నుంచి ఆర్టీసీ బస్సులో మాచవరంలో దిగి, సోమేశ్వరం చేరుకోవాలి. ఆటో సదుపాయమూ ఉంది. ఆగ్నేయం దంగేరు ద్రాక్షారామకు ఆగ్నేయంగా కె.గంగవరం మండలం దంగేరులో కొలువైన ఉమాసోమేశ్వరాలయం అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి. కార్తిక మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మేలని చెబుతుంటారు. ద్రాక్షారామ–మసకపల్లి ఆర్టీసీ బస్సుతో పాటు, ఆటోల సౌకర్యం ఉంది.(చదవండి: సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం) -
పుణ్య కార్తీకమాసం సందడి షురూ .. కార్తీక పౌర్ణమి ఎపుడు?
అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆలయాలు శివ భక్తులతో శివనామస్మరణతో మారుమ్రోగుతాయి. అత్యంత మహిమాన్వితమైన మైన కార్తీకమాసంలో పుణ్యనదీ స్నానాలు, దీపారాధనలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివకేశలను అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అందునా ఆదిదేవుడైన ఆ పరమేశ్వరుడికి కార్తీక సోమవారం అత్యంత ప్రీతికరమని భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతీ సోమవారం ఉదయాన్నే చన్నీటి స్నానం ఆచరించి, శివాలయాల్లో దీపారాధన చేయడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. కార్తీక పురాణం పారాయణం ద్వారా సర్వ పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. సోమవారాలు, పౌర్ణమి మాత్రమేనా? పండితుల మాట ప్రకారం చెప్పాలంటే.. కార్తీక మాసంలోని ప్రతీ రోజూ శుభప్రదమైనదే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, ద్వాదశి ఉపవాస దీక్ష, పూజలు ఇంకా పవిత్ర మైనవిగా చెబుతారు .ఉదయాన్నేనదులు, కాలువలు, చెరువులు లేదా బావివద్ద, లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి తులసి కోట వద్ద, నువ్వులు, లేదా నేతిదీపాలు వెలిగిస్తారు. కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు. భోళాశంకరుడిని భక్తితో పూజిస్తారు. ఉపవాస దీక్ష చేపడతారు. కార్తీక పురాణం విధిగా చదువుతారు. మాంసాహారానికి దూరంగా ఉంటై నిష్టగా శివుడ్ని కొలుస్తారు. శివాలయాలను, ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తోచినంత దానం చేస్తారు.కార్తీక సోమవారం రోజున ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలిస్తాయట. ఇలా చేయడం ద్వారా ఏడేడు జన్మల సర్వపాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని, సంపద వృద్ధి అవుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఇంకా ఎంతో ప్రీతి పాత్రమైన బిల్వార్చన చేయడంతోపాటు శ్రీమహావిష్ణువుని ఆరాధించడం శుభప్రదం.ఈ మాసమంతా ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ పరమేశ్వరుడి నామస్మరణ మారుమోగుతుంది. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళ పూజలు, లక్షపత్రి పూజల అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, ఇలా ప్రత్యేకపూజలు, వ్రతాలతో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడతాయి. వనభోజనాలు మరో విశిష్ట కార్యంగా చెప్పుకోవచ్చు.కార్తీకమాసంలో నాలుగు సోమవారాలు, తేదీలు తొలి కార్తీక సోమవారం - అక్టోబర్ 27రెండవ కార్తీక సోమవారం - నవంబర్ 3మూడో కార్తీక సోమవారం - నవంబర్ 10నాలుగో కార్తీక సోమవారం - నవంబర్ 17కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరంలో, కార్తీక పూర్ణిమ నవంబర్ , 5వ తేదీ బుధవారం వచ్చింది.కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. మాసం అంతా దీపారాధన చేయలేని వారు ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఏడాదికి సరిపడా నేతిలో ముంచిన 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడినికొలిచి భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వెలగించి పున్నమి వెలుగుల్లో నదిలో వదిలే సన్నివేశాన్ని చూసి తరించాల్సిందే. ఇలా కార్తీక మాస సందడి నవంబర్ 20 వరకు ఉంటుంది. నోట్ : వారి వారి విశ్వాసాల ఆధారంగా ఎవరికి వారు భక్తితో ఆచరించే పుణ్యకార్యాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. అలాగే అనారోగ్యంతో ఉన్నపుడు కూడా అన్నీ ఇలాగే తు.చ తప్పకుండా ఆచరించాలనే విధి ఏమీ లేదు. భక్తి ముఖ్యం. నిండైన భక్తితో చేసే ఏ కార్యమైనా ఆ దేవుడి ప్రేమకు నోచుకుంటుంది. భక్తితో వెలిగించే చిన్న దీపం కూడా మెక్షానికి మార్గం చూపిస్తుంది. కార్తీక పురాణం మనకు బోధించేది ఇదే. -
కుచేలా... కుచేలా!
బెంగుళూరుకు చెందిన ఒక బంగారు వ్యాపారి శ్రీ కృష్ణ భక్తుడు. ప్రతి ఏడాదీ ఇతర భక్తులతో కలిసి క్రమం తప్పకుండా మథుర వెళ్ళివస్తూ ఉంటాడు. ‘ఎప్పుడూ మనం వెళ్ళి రావడమేనా, ఒక పేద వాడైన కృష్ణ భక్తుడికి ఆ అవకాశం కల్పిస్తే బాగుంటుంది కదా’ అని అతడి భార్య సూచించింది. అనుకున్నదే తడవుగా తమ బృందనాయకుడితో ఆ విషయం చెప్పాడు. బృంద నాయకుడు అతడి ఆలోచనకు హర్షం వెలిబుచ్చాడు. అయితే తాను ప్రయాణ ఖర్చులతో పాటు అన్ని ఖర్చులూ భరిస్తున్నట్లు ఎక్కడా బహిరంగపరచవద్దని కోరు కున్నాడు వ్యాపారి. అలాగే ఆ ఏడాది హరేకృష్ణ బృందం విమానంలో బయలుదేరింది. దేశ రాజధాని దిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మథుర చేరుకుంది. యమునా నదీతీరంలో శ్రీ కృష్ణ జన్మ స్థానమైన కారాగారాన్ని చూస్తూ ఒక బృంద సభ్యుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఉండబట్టలేని బంగారు వ్యాపారి కారణమేమిటని ప్రశ్నించాడు. ‘‘నేను చిన్న కూలీని. నా ఆదాయం అంతంత మాత్రమే. శ్రీ కృష్ణుడి భక్తుడినైనా ఇంతింత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చేంత స్తోమత నాకు లేదు. ఈ జన్మలో మథుర వస్తానని అనుకోలేదు. శ్రీ కృష్ణ జన్మస్థానం కళ్ళారా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ఏ మహానుభావుడికో ఒక ఆలోచన వచ్చి నాకు ఈ ప్రయాణ అవకాశం కల్పించాడు. అతడి ఋణం ఎలా తీర్చుకోగలను? అతడికి కృతజ్ఞతలు తెలుపుదామంటే కూడా వీలుపడటం లేదు. ఎందుకంటే అతడు గుప్తదానం చేశాడు’’ అని విలపించాడు.బంగారు వ్యాపారి మనసు చలించింది. అయినా తానే ఆ గుప్తదాత అని చెప్పుకోదలచలేదు. గమ్మున ఉండిపోయాడు. ఆ బృందం అలాగే నైమిశారణ్యం, అయోధ్యలు చూసి విమానం ఎక్కారు. యాత్ర విజయవంతం అయినందులకు బృంద నాయకుడు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. విమానం బెంగళూరు విమానాశ్రయం చేరుకుంది. అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని అభినందనలు తెలుపుకున్నారు. లగేజీ అందించే సమయం వచ్చింది. లగేజీలు అందుకునే సమయంలో బంగారు వ్యాపారి సంచికన్నా కూలీ సంచి ముందు వచ్చింది. ఆనందంతో అతడు సంచి ఎత్తుకుంటూ ఉంటే సంచిపై అతడి పేరు చూశాడు వ్యాపారి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.‘శ్రీ కృష్ణలీలలు ఇంతింత కాదయా’ అనుకున్నాడు. ఎందుకంటే ఆ కూలీ పేరు కుచేలన్!– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
పాప భీతి.. దైవ ప్రీతి.. సంఘ నీతి
పాప భీతి, దెవప్రీతి, సంఘనీతి త్రయం. ఈ మూడే మన అంతరాత్మను వెలిగించే త్రివేణి సంగమం. అంతఃకరణసాక్షిత్వమే మనిషికి నిత్యమైన ధర్మం. ఈ ధర్మాన్ని నిలిపే త్రిశక్తులు: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి. ఈ మూల విలువలు లోపించినప్పుడే వ్యక్తిగత జీవితంలో శాంతి నశించి, ప్రపంచం అపనమ్మకంతో నిండిపోతుంది.మనిషిని ధర్మబద్ధంగా నడిపించేవి ఈ మూడు: పాప భీతి (తప్పు పర్యవసానానికి భయం), దైవ ప్రీతి (విశ్వం పట్ల ప్రేమ), సంఘ నీతి (సామాజిక బాధ్యత). ఈ అంతర్గత విలువలు లోపించినప్పుడే, చట్టం చూడకపోయినా, ఎవరూ గమనించకపోయినా, మనిషి అవినీతికి, అన్యాయానికి పాల్పడతాడు. దీని పర్యవసానంగా, అంతఃకరణ శాంతి నశించి, ప్రపంచంలో నమ్మకం కొరవడుతుంది. పాప భీతి లేని ఒక వ్యా పారి, తక్షణ లాభం కోసం అక్రమాలకు, పన్ను ఎగవేతకు పాల్పడతాడు. చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే ధైర్యంతో, ధర్మాన్ని పక్కన పెడతాడు. ఈ స్వార్థపూరిత చర్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.ఒక ఆటో డ్రైవర్, ప్రయాణికుడు మరచిపోయిన డబ్బు సంచిని తిరిగి అప్పగిస్తాడు. ఈ పాప భీతితో కూడిన నిజాయితీ వల్ల, అతను తిరిగి ఇచ్చిన డబ్బు కంటే, ఎక్కువ గౌరవాన్ని, నమ్మకాన్ని సం పాదించుకుని, తన కుటుంబానికి గొప్ప కీర్తిని అందిస్తాడు. ఈ మూడు విలువల కారణంగానే ఒక ఇంజనీర్ ప్రాజెక్టును అత్యంత నాణ్యతతో నిర్మిస్తాడు. ఇది కేవలం పని మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు భద్రత కల్పించే తన ధర్మం అని నమ్ముతాడు. ఈ నిజాయితీ అతనికి శాశ్వత కీర్తిని, క్లయింట్లలో అ పారమైన నమ్మకాన్ని ఇస్తుంది. దీనికి విరుద్ధంగా, అదే ఇంజనీర్ నాణ్యత తగ్గించి డబ్బు సం పాదిస్తే, తాత్కాలికంగా ధనం వచ్చినా, ఆ ప్రాజెక్టు పతనం అయినప్పుడు ఆ వ్యక్తి ఆత్మశాంతిని పూర్తిగా కోల్పోతాడు.ఈ విలువల వల్ల మీ జీవితంలో/వృత్తిలో మీకు శాశ్వత కీర్తి, తిరుగులేని నమ్మకం లభిస్తాయి. ఒత్తిడి ఎదురైనా, దైవ ప్రీతి వల్ల మనసుకు మానసిక స్థైర్యం లభిస్తుంది. ఈ విలువలు లేకపోతే, మీరు ఎంత డబ్బు సం పాదించినా అంతరాత్మ ప్రశాంతత నశించి, అభద్రతా భావం పెరుగుతుంది.కుటుంబంలోనూ ఈ ప్రభావం మరీ లోతుగా ఉంటుంది. మీ నిజాయితీ మీ పిల్లలకు గొప్ప ఆస్తి. మీరు విలువలు నిర్లక్ష్యం చేస్తే, ఇంట్లో అశాంతి, అపనమ్మకం పెరుగుతాయి. పిల్లలు మాటలకంటే ఎక్కువగా, చేతలనే చూస్తారు; తల్లిదండ్రులకు పాప భీతి లోపిస్తే, పిల్లలూ నిజాయితీని కోల్పోతారు. పాప భీతి మనల్ని తప్పుల నుండి కా పాడే కఠినమైన గురువుగా రక్షిస్తుంది. దైవ ప్రీతి మనల్ని ప్రేమతో నడిపించే తల్లిగా ప్రేరణనిస్తుంది. సంఘ నీతి మనల్ని బాధ్యతాయుత పౌరులుగా మార్చే బంధం. పాప భీతిని ఆచరించండి, దైవ ప్రీతిని పెంచుకోండి, సంఘనీతిని పాటించండి. ఈ మూడింటిని హృదయపూర్వకంగా ధరించినప్పుడే, మన వ్యక్తిగత ప్రశాంతత పెరుగుతుంది, ప్రపంచం నమ్మకం, మానవత్వంతో నిండిపోతుంది.ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందనే నమ్మకం లేనప్పుడు, మనిషిలో కరుణ, సహానుభూతి తగ్గిపోతాయి. ఫలితంగా, అతను కేవలం తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించి, ఇతరుల బాధను, కష్టాన్ని విస్మరిస్తాడు. దైవ ప్రీతి లోపం ఉన్న ఓ పరిశ్రమ యజమాని, తక్షణ లాభం కోసం, నదుల్లో కాలుష్యాన్ని విచ్చలవిడిగా వదిలివేస్తాడు. ఈ కలుషిత నీటిని తాగే జంతువులు, ఆధారపడిన ప్రజారోగ్యంపై పడే భయంకరమైన ప్రభావాన్ని అతను పట్టించుకోడు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఉండాలనే కనీస బాధ్యతను విస్మరించి, ప్రకృతి విధ్వంసానికి పాల్పడతాడు. ఈ లోపం అతన్ని సమాజానికి, ప్రకృతికి హాని కలిగించేలా నిర్దయగా మారుస్తుంది. సంఘ నీతి లోపించిన ఒక వ్యా పారి, లాభం కోసం ఆహారంలో కల్తీ చేసి, తక్షణ లాభం పొందుతాడు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం, బాధ్యత లేని స్వార్థం వల్ల సమాజం రోగాల పాలయ్యే అవకాశం ఉంది.– కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!
మన దేశంలోని యోగా వైభవానికి ఎంతో మంది విదేశీయులు ఆకర్షితులయ్యారు. అది నేర్చుకునేందుకు భారత్కి వచ్చి స్థిరపడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు విదేశీయులు తమ మాతృభూమిలో దాని గొప్పతనం తెలిపేలా కృషి చేస్తున్నారు. అలాంటి యోగ గొప్పతనాన్ని తెలుసుకుని, అది నేర్చుకున్న తర్వాత పొందిన అనుభవం గురించి షేర్ చేసుకున్నాడు ఓ జపనీస్ వ్యక్తి. అతడి మాటలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.భారత్లో నివశిస్తున్న జపనీస్ భారతీయుడు నోజోము హగిహర ఒక శక్తిమంతమైన పాఠాన్నినేర్చుకున్నానంటూ భ్యావోద్వంగంగా మాట్లాడిన వీడియోని నెట్టిట షేర్ చేయడంతో వైరల్గా మారింది. తత్వం ఆంతర్యం తెలుసుకునేందుకు ఉపకరించే ధర్మ యోగా గురించి మాట్లాడాడు ఆ వీడియోలో. ఇది మనిషి ఎలా జీవించాలో..ఎలా ఉంటే మంచిది అనేది తెలియజేస్తుంది. యోగ సూత్రాలైన యమ(నిగ్రహం), నియమ(క్రమశిక్షణ)లు నిజాయితీ, కరుణ, క్రమశిక్షణలతో పాతుకుపోయిందని చెబుతున్నాడు. ఇది జీవన విధానం గురించి తెలుపుతుంది. అహింస, సత్యం, స్వీయ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు పోస్ట్లో ఈ యోగా అహింస, సత్యం, నిజాయితీ, దొగతనం చేయకుండా ఉండటం వంటి విలువలను నేర్పుతుందని పేర్కొన్నాడు. బ్రహ్మచర్యం, మిత సంభాషణ, శారీరక, మానసిక శక్తిని బలోపేతం చేయడమే కాదు, దురాశను, దక్కని దానియందు బాధ వంటి వాటిని దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యోగా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసిందంటూ భావోద్వేగంగా మాట్లాడాడు నోజోము. దీనికి దయతో జీవించే ఆర్ట్ని నేర్పింస్తుందనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Nozomu Hagihara (Nono)萩原望 (@india_nono_) (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
వెలుగు వైపు యువత
‘దీపం అంటే ప్రమిద మాత్రమే కాదు మన మనసులను మేల్కొలిపే సాంస్కృతిక వెలుగు’ అంటారు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రచనా చౌదరి. నవంబర్ 1నుంచి 13 వరకు కోటి దీ పోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో కన్నుల పండువగా జరగనుంది. ఈ సందర్భంగా ఉత్తర–దక్షిణ భారత దేశాల కళాసంస్కృతిని ఒకే వేదికమీదకు తీసుకురావడానికి చేస్తున్న కృషి, ఆధ్యాత్మిక సేవ, కోటి దీ పోత్సవ కార్యక్రమం తమలో తీసుకువచ్చిన మార్పుల గురించి రచనా చౌదరి ప్రత్యేకంగా ‘సాక్షి’తో ముచ్చటించారు.‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహమ్, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే...చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే దీపం వల్ల అన్నిపనులు సాధ్యమవుతాయి అన్నది నిజం. ప్రతిరోజూ దీపం వెలిగించడం నా దినచర్యలో భాగం. ఈ దీపం వెనక మా అమ్మ రమాదేవి, నాన్న నరేంద్ర చౌదరిల కృషి ఎంత ఉందో చూస్తూ పెరిగాను. కోటి దీ పాలు ప్రసరించే శక్తి ఎంత దూరం వెళుతుందో ప్రతియేటా చూడటమే కాదు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి నా వంతు సహకారాన్ని అందిస్తుంటాను.’ మంచి మార్పులుఅమ్మానాన్న మొదట లక్ష దీ పోత్సవం అనే ఆలోచన చేసే సమయానికి నేను టీనేజ్లో ఉన్నాను. శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ స్వామివారి చేతుల మీదుగా 2012లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పుడు అమెరికాలో బోర్డింగ్ స్కూల్ లో చదువుకుంటున్నాను. ప్రతియేటా కోటి దీ పోత్సవానికి మాత్రం తప్పనిసరిగా వచ్చి వెళ్లేదాన్ని. ఆధ్యాత్మిక విషయాల్లో పెద్దలను, గురువులను అనుసరించడం ద్వారానే ఎన్నో విషయాలను తెలుసుకోగలం. ప్రతి యేటా దీక్షగా చేసే ఈ కార్యక్రమం నాలో చాలా మార్పులు తీసుకువచ్చింది. స్టేడియం అలంకరణ, అతిథులను ఆహ్వానించడం, ఏర్పాట్లు చూడటం,.. ఇదంతా అమ్మ చేసే పనులను గమనిస్తూ, తెలుసుకోగలిగాను. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కోటి దీ పోత్సవంలో చురుకుగా పాల్గొంటున్నాను. ప్రఖ్యాతి గాంచిన శృంగేరి, కంచిపీఠం, మైసూరు దత్త పీఠం.. వంటి పీఠాధిపతులు కోటి దీ పోత్సవ కార్యక్రమానికి హాజరయేవిధంగా సమన్వయం చేస్తున్నాను. దీపం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చు అని బోధపడింది. ఈ మహా కార్యక్రమంలో ధనిక, పేద అనే తేడా ఉండదు. కళాకారులకు వేదికైన ఈ కార్యక్రమాన్ని ఏదో గొప్ప శక్తి అదృశ్యంగా ఉండి నడిపిస్తోందని నా భావన. ఈ కార్యక్రమానికి వచ్చినవాళ్లు ‘కిందటేడాది వచ్చాం.. మా జీవితంలో మంచి మార్పు జరిగింది’ అని చెబుతుంటారు. అదంతా దైవం ఇచ్చే ఆశీస్సులే అని చెబుతుంటాం. కార్తీకమాసంలో పదమూడు రోజులు ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం పాజిటివ్ వైబ్స్ అనంతంగా వెలువడుతున్నాయా అనిపిస్తుంటుంది.’ ఉత్తర–దక్షిణాల కలబోతఈసారి కోటిదీ పోత్సవం పాన్ ఇండియా అయ్యిందని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరాదిలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ఉత్సవ విగ్రహాలను కోటి దీ పోత్సవ వేదికపైకి తీసుకొచ్చి తెలుగు ప్రజలకు దర్శనం కల్పించేవిధంగా కృషి చేస్తున్నాం. గత ఏడాది నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రధాన దేవతామూర్తులు తరలివస్తున్నారు. అక్కడి అర్చకులే స్వయంగా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా అన్ని దేవాలయాల నుంచి వచ్చిన ఉత్సవమూర్తులకు కోటిదీ పోత్సవంలో దర్శన భాగ్యం కల్పించడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. చాలామంది జీవితంలో దర్శించదగిన దేవాలయాల జాబితా దగ్గర పెట్టుకుంటారు. కానీ, వెళ్లలేని కారణాలేవో ఉంటాయి. అలాంటివారు ఇక్కడకు వచ్చి, ఈ కార్యక్రమంలో ఆ దేవతామూర్తులను దర్శించుకుని, పూజలలో పాల్గొని, గుండెలనిండా ఆ దివ్యానుభూతులను నింపుకుని వెళుతుంటారు.’ యువతలో సేవాగుణంఇటీవలి కాలంలో యువతలో మన సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని, భక్తిని, ఆసక్తిని ఎక్కువగా గమనిస్తున్నాను. అయితే, చాలామంది సెలబ్రేషన్స్ వైపు ఎక్కువ మొగ్గుచూపుతుంటారు. మన దేశీయ వారసత్వం అంతర్గతంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తుంటారు. సంప్రదాయంగా ముస్తాబై, వచ్చి, ఈ కార్యక్రమంలో ఫొటోలు దిగుతుంటారు. దీ పాలు వెలిగించి, ఫొటోలు తీసుకొని, సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతుంటారు. పూజ ఒక్కటే కాదు ఈ దేశ ఆధ్యాత్మిక శక్తి సందేశం వారి మెదళ్లకు చేరుతుంది. అందుకే, యువత చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. మా అందరికీ దీపోత్సవం కార్యక్రమంలో ప్రతిరోజూ ఒక మారథాన్లా ఉంటుంది. పూర్తయ్యాక ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక తరం మరో తరాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మా జనరేషన్ కూడా అనుసరిస్తుంది. మంచి ఎక్కడ ఉన్నా దానిని ఫాలో అవడం సహజమే. తెలంగాణలోని పల్లె ప్రాంతాలే కాదు ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుంటారు. దాదాపుగా తొంభైశాతం మంది తమ వంతు దీపం వెలిగించి హడావుడిగా వెళ్లి పోవాలని కాకుండా మహా నీరాజనం అయ్యేవరకు ఉండి, భక్తితో కళ్లకద్దుకుని వెళుతుంటారు. వయసు పైబడినవారు తమ కుటుంబసభ్యులతో వచ్చి, కార్యక్రమంలో పాల్గొని సంతృప్తితో వెళుతుంటారు. ఈ సమయంలో యువత పెద్దవారికి ఇచ్చే చేయూత గమనించినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, బి.జె.పి. సీనియర్ నేత డాక్టర్ ఎ. లక్ష్మణ్ అనూహ్య సహకారం అందిస్తున్నారు.’ రక్షణ చర్యలూ ప్రధానమే!పీఠాధిపతులు, సద్గురువులు, ప్రవచనకారులు.. అందరి సమక్షంలో జరిగే ఈ దీక్షా కార్యక్రమంలో సామూహికంగా ప్రతిరోజూ దాదాపు పదిలక్షల దీ పాలు వెలిగిస్తారు. ఇరవై మంది కూర్చొని దీపం వెలిగించి, పూజ చేసుకునేలా ఒక సెట్ ఉంటుంది. ప్రతి ఒక సెట్ దగ్గర ఒక వాలంటీర్ ఉంటారు. అలా మొత్తం 2000 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్టీవీ, వనిత, భక్తి టీవీ బృందంలోని వెయ్యి మంది కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంటారు. 40 కెమెరా సెటప్ను ఏర్పాటు చేస్తాం. దీ పాలతో చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ ఏ చిన్న అవాంతరం జరిగినా వెంటనే తెలిసి పోతుంది. దీనివల్ల ఎంత చిన్న సమస్య అయినా వెంటనే క్లియర్ చేసే సదు పాయం ఉంటుంది. అందుకే ఇన్నేళ్లలో ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాలేదు. అంబులెన్స్, టాయ్లెట్ సదు పాయాలు ఉంటాయి. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏం చేయాలో ముందస్తు సమావేశాలు నిర్వహిస్తుంటాం. అందరిలోనూ ఒక దైవిక శక్తి ఉన్నదా... అన్నంతగా ఈ కార్యక్రమం పూర్తయ్యేవరకు ప్రతి ఒక్కరూ తమ ఎఫర్ట్ని పెడుతుంటారు. కోటి దీ పోత్సవం ఆరంభం నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం మా సిబ్బంది చేసే కృషిని మాటల్లో చెప్పలేను. తమ సొంత కార్యక్రమంలా కార్యోన్ముఖులై పనిచేస్తారు. ప్రతిసారీ ఈ కార్యక్రమం దిగ్విజయం అయేలా చేయడం మాకు ఒక టాస్క్ అని చెప్పవచ్చు. భగవంతుడు ఉన్నాడు, లేడు.. అనే చర్చలు అవసరం లేదు. ఇది డబ్బుకు సంబంధించిన అంశం కానే కాదు. ధర్మానికి సంబంధించినది. ఈ కార్యక్రమం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది. మన దేశం కళలకు పుట్టినిల్లు. సాహిత్య, సాంస్కృతిక వైభవాలతో విరాజిల్లే ఘనమైన చరిత్ర ఉంది. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా అక్కడి కళాకారుల సాంస్కృతిక కళారూ పాలు కనిపిస్తాయి. వాటిని ఈ వేదిక ద్వారా పరిచయం చేస్తున్నాం. ఆ విధంగా ఎంతోమంది కళాకారులకు గుర్తింపు, ఉ పాధి లభిస్తుంది. కోట్లాదిమందికి కోటిదీ పోత్సవ వేదికగా కాంతి సందేశాలు అందుతుంటాయి’ అని వివరించారు ఈ యువ పారిశ్రామికవేత్త.’ సేవయే ప్రధానం...ప్రతియేటా ఆగస్టు రాగానే మా ఇంట కోటి దీ పోత్సవానికి సంబంధించిన సందడి నెలకొంటుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు, పనుల విభజన, థీమ్.. ప్రతిది ప్లానింగ్తో రెడీ అవుతుంది. పూణె, తంజావూరు నుంచి వచ్చిన కళాకారులు పువ్వులతో రంగోలీలు వేస్తారు. శాండ్ ఆర్టిస్టులు రకరకాల కళారూ పాలను చిత్రిస్తారు. బొమ్మల కొలువులు పెడతాం. రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు కూడా స్టేడియం అంతా అలంకరిస్తాం. ఏ దేవుడికి ఏ పూలు అర్పించాలి, వాటి మాలలు ఎలా ఉండాలో ప్రత్యేకించి తయారు చేయిస్తాం. కోయంబత్తూరు, బెంగళూరు నుంచి ప్రత్యేక అలంకరణ కళాకారులను తీసుకొచ్చి, వేదికను అలంకరిస్తాం. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు స్టేడియంకు వెళ్లి, అక్కడ ఆ రోజుకు కావల్సిన ఏర్పాట్లు, అలంకరణ ఎలా ఉండాలో చూస్తాం. అమ్మ ఈ పనులన్నీ స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు. వాలెంటీర్లు వచ్చి, స్టేడియం అంతా శుభ్రం చేసి, పూజ సామాగ్రి తులసి కోటతో సహా అన్ని ఏర్పాట్లు చేసి పెడతారు. అక్కడ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చి, రెడీ అయి, మళ్లీ స్టేడియంకు వచ్చేస్తాం. ఈ పనిలో సేవయే ప్రధానం. ముందుగా అనుకున్న షెడ్యూల్ మారి పోవచ్చు. పనుల విభజనలో ఎవరు ఏ పనైనా చేయాల్సి రావచ్చు. రెండువేల మంది వాలంటీర్లు, ఛానెల్స్లో వర్క్ చేసేవారు వెయ్యి మంది, మేం.. అందరం కలిసి ఒకే ఇంటి కార్యక్రమంగా పని చేస్తాం.తంజావూరుగోపురం సెట్ఇప్పటికే దేశంలోని ప్రధాన పీఠాధిపతులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి.. మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతియేటా ఒక్కో థీమ్ తీసుకుంటాం. ఈసారి కాశీ థీమ్తో పాటు మరిన్ని కొత్త మార్పులు ఉండబోతున్నాయి. దీంతో ప్రతియేటా వచ్చినవారు కూడా కొత్త అనుభూతి పొందుతారు. ఇప్పటికి దేశంలో ఉన్న ప్రముఖులందరూ దీ పోత్సవానికి హాజరయ్యారు. ఈ సంవత్సరం శృంగేరీ, కంచి పీఠాధిపతులు రాబోతున్నారు. నాగసాధువుల చేత శివునికి ప్రత్యేక అభిషేకాలు జరగబోతున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే భక్తులందరికీ పూజా సామాగ్రిని భక్తి టీవీయే ఉచితంగా అందజేస్తుంది. ప్రతిరోజూ కార్యక్రమం ముగిసిన వెంటనే మరుసటి రోజు చేసే కార్యక్రమాలను ఆరంభిస్తాం. ఈ సంవత్సరం తంజావూరు గోపురం నేపథ్యంలో ప్రధాన సెట్ను రూపొందిస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: అనిల్ కుమార్ మోర్ల


