breaking news
Devotion
-
తల్లి ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా సెయింట్ హెలెనా
రోమన్ కతోలికుల ఉనికికే ప్రాణం పోసిన మహామహిళ సెయింట్ హెలెనా. రోమ్ మొదటి క్రిస్టియన్ చక్రవర్తి ‘కాన్స్టాంటైన్ ద గ్రేట్’ను కన్న వీరమాత. అది రోమా సామ్రాజ్యం మహా వైభవోపేతంగా ఉన్న కాలం! సాధారణ కుటుంబంలో హెలెనా జన్మించింది. చిన్ననాటి నుంచే భయ భక్తుల్లో పెరగబట్టి ఆమెకు పెద్దల పట్ల వినయం, సమాజం పట్ల దయ, దేవునిపై విశ్వాసం అనే సద్గుణాలు అలవడ్డాయి. ‘రోమన్ కేథలిక్కులు’ అనే పేరులో రోమన్ పదం చేరడానికి కారకులు ఈ తల్లీకొడుకులు. ఇదెలా జరిగింది?ఒకానొకపుడు క్రైస్తవుల్ని నానాహింసల పాలు చేసిందీ, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నదీ ఈ రోమన్ పాలకులే. కానీ పేదరికం అనుభవించినా గొప్ప విశ్వాసకురాలైన తల్లి ఉద్బోధనల వల్ల, కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతానికి అనుకూలంగా మారాడు. ఈ నేపథ్యంలో రోమన్ దేశంలో చిన్నగా కదలిక ప్రారంభమైంది. ‘యేసు ప్రభువు నడిచిన పవిత్ర స్థలాలను దర్శించాలి; ఆయన ప్రేమను ప్రపంచానికి గుర్తు చేయాలి’ అని హెలెనా యెరూషలేముకు పవిత్ర యాత్ర చేసింది. అక్కడ యేసు ప్రభువు శిలువ వేయబడిన స్థలాన్ని వెతికింది. సంప్రదాయం ప్రకారం, ఆమె అక్కడ శిలువకు సంబంధించిన పవిత్ర అవశేషాలను కనుగొన్నట్లు చెబుతారు.ఆమె ఆ పవిత్ర స్థలాలను గౌరవంగా సంరక్షించి, అక్కడ ప్రార్థనా మందిరాల నిర్మాణానికి సహాయం చేసింది. ముఖ్యంగా యెరూషలేములోని ‘చర్చ్ ఒఫ్ ద హోలీ సెపుల్చెర్’ నిర్మాణానికి ఆమె సహకారం అందించింది. దేవుని ప్రేమను పంచిన హెలెనా క్రీ.శ. 330లో మరణించినా, ఆమె పేరు మాత్రం శతాబ్దాల తరువాత కూడా విశ్వాసం, త్యాగం, తల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయాయి.– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు -
నమ్మిన దైవమే గట్టెక్కించే దారి చూపుతుంది..
హిరణ్యకశిపుడు ఒక రోజు ఆలోచనలో పడ్డాడు. ‘అమరుల తల్లి కంటె మా అమ్మ పెద్దది. త్రిలోక రాజ్య భోగములు నాకు దక్కాలి గాని ఆ భోగాలకు అమరులెట్లా అర్హులౌతారు? ఉగ్రతపంతో కానివి లేవు కాబట్టి తపోనిష్ఠతో బ్రహ్మను మెప్పించి, ముల్లోకాధిపత్యాన్ని నేను దక్కించుకుంటాను!’ అని నిశ్చయించుకున్నాడు.తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అతడి ఉగ్రతపస్సుకు దేవేంద్రుడు భయపడ్డాడు. దేవగురువైన బృహస్పతిని చెంతకు పిలిపించుకుని, ‘తండ్రి ఒక్కడే. తల్లులు మాత్రం మాకు వేరు. జగత్సామ్రాజ్య పూజ్యనీయత తనకు దక్కాలని దైతేయుడైన హిరణ్యకశిపుడు, బ్రహ్మదేవుడి నుండి వరం పొందాలని ఉగ్రతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు జగములు తల్లడిల్లే పరిస్థితి వస్తున్నది కాబట్టి వేరే మార్గం కనపడక అడిగినది వరంగా ఇచ్చేస్తాడు బ్రహ్మదేవుడు. అది తప్పిపోయే మార్గం చెప్పండి, గురుదేవా!’ అని ప్రాధేయపడ్డాడు.సురేంద్రుడి భయాన్ని అర్థం చేసుకున్న బృహస్పతి ‘భయపడవలసింది లేదు. విష్ణుద్వేషం, నిరంతర దోషం, శ్రుతిధర్మ విరోధం, సుజన నిరోధం లక్షణాలుగా కలిగిన అసురులను శ్రీహరి క్షమించడు. కనుక నారాయణ మంత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యి!’ అని చెప్పి ఆ మంత్ర మహత్యాన్ని గురించి ఇలా వివరించాడని ఎఱ<న శ్రీనృసింహపురాణంలో చెప్పాడు.క. తను నెబ్భంగి దలంతురుజను లాభంగిన తలంచు సరసీరుహలోచనుడును వారల గావునననిశంబు కృతార్థమతులు హరిపద భక్తుల్.‘తనను ఎంత గాఢమైన భక్తితత్పరతతో పూజిస్తారోఅంతే గాఢమైన తలపుతో వారిని శ్రీహరి రక్షిస్తాడు. అందువలననే శ్రీహరిని భక్తితో కొలిచేవారికి కలగని సుఖములు లేవు!’ అని కర్తవ్యాన్ని బోధించి సురేంద్రుడి కలతను, కష్టాన్ని తీర్చాడు బృహస్పతి. తాను ఎదుర్కొనలేని ఆపదలో చిక్కుకున్న వేళ, వ్యర్థంగా కలత చెందడం మాని నమ్మిన దైవాన్ని శరణు వేడితే, ఆ ఆపద నుంచి గట్టెక్కే మార్గం కనపడుతుందని పై సన్నివేశం విదితం చేస్తుంది.– భట్టు వెంకటరావు -
సహదేవుడు.. ఖడ్గ యుద్ధ ప్రవీణుడు
పాండవులలో కనిష్టుడు సహదేవుడు... పాండురాజు రెండో భార్య మాద్రికి అశ్వినీ దేవతల అనుగ్రహంతో జన్మించినవాడు. ద్రోణాచార్యుని శిక్షణ లో ఖడ్గయుద్ధంలో ఎంతో ప్రవీణుడిగా ఆరితేరాడు. అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో ‘తంత్రీపాలుడు’ అనే పేరుతో గోపాలకుడిగా పశు సంరక్షణ చేపట్టాడు.సహదేవునికి భవిష్యత్తులో జరిగే విషయాలు ముందే తెలిసినప్పటికీ, జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ సూచనలతోపాటు చెబితే ఏం జరుగుతుందో అన్న భయం, వ్యక్తిగత భద్రత పట్ల సందేహాలు ఉండడంతో ఏ విషయం చెప్పేవాడు కాదు. బృహస్పతిలా గొప్ప వివేకం కలవాడైనా తనకు తానుగా ఎవరి భవిష్యత్తు చెప్పలేదు. గొప్ప భవిష్యద్దార్శనికుడు అయినా ఇతరులతో పంచుకోలేడు. దీనినే ‘సహదేవ నీతి’ అంటారు.సహదేవుడు అత్యంత తెలివైనవాడు. ధర్మరాజుకు సలహాదారు, ఖడ్గయుద్ధంతోపాటు ఆయుర్వేదం, పశు సంరక్షణలో ప్రవీణుడు. మంచి జ్యోతిష్యవేత్త. అతిముఖ్యంగా కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముహూర్తం పెట్టినవాడు సహదేవుడేనంటారు. అత్యంత సాధుశీలుడు, ధర్మవర్తనుడు, ఓర్పు, సహన స్వభావం కలిగిన వ్యక్తి.కౌరవుల నాశనానికి కారకుడైన శకునిని తాను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన సహదేవుడు మహాభారత యుద్ధంలో 17వ రోజున శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు.– సి ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
TTD: నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల
తిరుపతి: నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.21న ఆర్జిత సేవా టికెట్ల విడుదలకల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.వర్చువల్ సేవల కోటా విడుదలవర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.24న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలఅంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.శ్రీవాణి దర్శన కోటా విడుదలశ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటావయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలతిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
పుండరీకుడి వృత్తాంతం: తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు!
పూర్వం పుండరీకుడు అనే మహారాజు ఒకనాడు వేటకు వెళ్లాడు. అడవిలో యథేచ్ఛగా జంతువులను వేటాడుతూ, కపిల మహర్షి ఆశ్రమ పరిసరాలకు చేరుకున్నాడు. అప్పటికి మిట్టమధ్యాహ్నమైంది. వేటలో పుండరీకుడు బాగా అలసిపోయాడు. కపిలుడి ఆశ్రమానికి చేరువలో ఒక సరోవరం కనిపించింది.పుండరీకుడు ఆ సరోవరంలో నీళ్లు తాగి, దప్పిక తీర్చుకున్నాడు. ఇంతలోనే ఒక లేడికూన ఆ సమీపంలోనే పరుగుతీస్తూ కనిపించింది. వేట ఉత్సాహం తగ్గని పుండరీకుడు వెంటనే, విల్లంబులు అందుకుని, దానిని గురిచూసి బాణం విడిచాడు. బాణం తగిలిన లేడికూన గాయపడి, ఒక్క పరుగున కపిల మహర్షి ఆశ్రమ ప్రాంగణానికి చేరుకుని, అక్కడ ప్రాణాలు విడిచింది.ఆ దృశ్యం చూసిన కపిలుడు ఉగ్రుడయ్యాడు. ‘ఎవడా మూర్ఖుడు? ఆశ్రమ పరిసరాల్లో ఇంతటి హింసకు పాల్పడినవాడు’ అని బిగ్గరగా అరిచాడు. ఇంతలో లేడిని తరుముతూ పుండరీకుడు అక్కడకు చేరుకున్నాడు. కపిలుడి ఉగ్రరూపం చూసి, భయంతో గడగడ వణుకుతూ, ‘మునివర్యా! నా అపరాధాన్ని మన్నించండి’ అంటూ కాళ్ల మీద పడ్డాడు.కపిలుడు కొంత శాంతించాడు. పుండరీకుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు.కపిలుడు తీక్షణంగా పుండరీకుని చూశాడు. ‘క్షణభంగురమైన తుచ్ఛ శరీరంపై ఆశలు పెట్టుకుని, ఇంతటి పాపానికి ఒడిగట్టావే, దీనికి కారణమేమిటి? నీ విలాసం కోసం ఒక లేడికూన నిండుప్రాణాన్ని బలిగొనడం ఏమి న్యాయం?’ అని పలికి, పుండరీకుడికి వైరాగ్యబోధ చేశాడు.కపిలుడి మాటలకు పుండరీకుడు పశ్చాత్తాపంతో దహించుకుపోయాడు. పాపిష్టి దేహాన్ని ఇక్కడే త్యాగం చేయడం మంచిదని తలచి, తన తల నరుక్కుని, ఆత్మాహుతి చేసుకోవడానికి ఒర నుంచి కత్తి దూశాడు. కపిలుడు అతడి ప్రయత్నాన్ని నివారించాడు. పుండరీకుడికి హితబోధ చేశాడు.‘మోక్షేతి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం’ అని పలికి, ‘రాజా! మానవునకు మోక్షమే పరమావధి. మోక్షాన్ని ఆపేక్షించే మానవుడు పూర్వదానఫలం వల్ల కలిగే సంపదలు క్షణికమైనవని, పరహింసాపరాయణత్వం పాపహేతువని తెలుసుకుని, గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారానే తత్త్వాన్ని తెలుసుకుని, ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించాలి’ అని బోధించి, రాజధానికి వెళ్లి రమ్మని చెప్పి సాగనంపాడు.రాజధానికి తిరిగి వెళ్లినా, పుండరీకుడి మనసు మనసులో లేదు. తన శరాఘాతంలో మరణించిన లేడికూన, ఆ తర్వాత కపిల మహర్షి చేసిన ఉద్బోధ అతడి మనసులో మెదలసాగాయి. రాజ్యపాలనపై దృష్టిపెట్టడం అతడి దుస్సాధ్యంగా మారింది. వ్యాకులచిత్తుడైన పుండరీకుడు తన రాణికి, మంత్రులకు సైతం చెప్పకుండా, అన్నీ విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.కొద్దిరోజుల్లోనే పుండరీకుడు కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు.కపిలుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన వెంటనే, అతడికి నమస్కరించాడు.‘మహర్షీ! నా రాజ్యాన్ని, సర్వసంపదలను విడిచిపెట్టి మీ చెంతకు వచ్చాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి, అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు.కపిలుడు అతడిని కన్నెత్తి చూడక, పన్నెత్తి పలుకరించక తృణీకరించాడు.అయినా, పుండరీకుడు అక్కడి నుంచి వెనుదిరగలేదు. ఆశ్రమ ప్రాంగణంలోనే కూర్చుని, ధ్యానం చేయడం ప్రారంభించాడు. పద్నాలుగు రోజులు అలాగే అన్నపానాదులు లేకుండా, ధ్యానంలో ఉన్నాడు. అతడి పరిస్థితి చూసి, కపిలుడి మనసు కరిగింది.శిష్య సమేతంగా పుండరీకుడి వద్దకు వెళ్లి, అతడిని పలకరించాడు.పుండరీకుడు కన్నీళ్లతో కపిలుడికి నమస్కరించాడు. తనను అనుగ్రహించాలని ప్రార్థించాడు.కపిలుడు అతడికి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించాడు.పుండరీకుడు కపిలుడినే గురువుగా భావించి, అతడు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ, చిరకాలం తపస్సు కొనసాగించాడు.పుండరీకుడి తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు అతడికి ప్రత్యక్షమయ్యాడు.పుండరీకుడు కోరుకున్నట్లుగానే అతడికి మోక్షాన్ని అనుగ్రహించాడు.- సాంఖ్యాయనపురావిశేషం..శ్రావణమాసంలో దేశవ్యాప్తంగా చాలాచోట్ల శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఇవి చాలామందికి తెలిసిన ఆచారాలే! కొంకణ ప్రాంతంలో శ్రావణమాసంలో ‘చుడీపూజ’ పేరుతో గాజుల పూజ చేస్తారు. తులసికోట వద్ద గాజులు, పువ్వులు, పండ్లు ఉంచి పూజ జరిపి, మహిళలకు ఫలతాంబూలాలతో పాటు గాజులను కూడా పంచిపెడతారు. శ్రావణమాసంలో శుక్రవారం, ఆదివారం రోజుల్లో తులసికోటకు, సూర్యుడిని పూజించి, మహిళలకు గాజులు కానుకగా ఇస్తారు. ఇవే రోజుల్లో కొందరు ‘దేవీసాధన’ పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. -
పూజ వేరు.. విన్నపం వేరు..
కతోలికులు మరియ మాత ముందు కూర్చొని, మూడు దేవరహస్యాలతో 15 ఘట్టాలతో కూడుకొన్న జపదండ చెబుతారు. క్రీస్తు ప్రభు గురించి, తండ్రి దేవునికి సంబంధించి, ఆత్మ దేవునికి సంబంధించిన రహస్యాలే అవి. ఆ యా ఘట్టాలన్నీ కొత్త నిబంధనా సంఘటనలే. దేవునికీ తమకూ మధ్యవర్తిగా ఆమెను నిలబెట్టి, ఆ ప్రభునికి ‘మా బాధలూ గాథలూ చేరవేయవమ్మా మా మరియమ్మా’ అని వేడుకొంటారు. పూజ వేరు, విన్నపం వేరు.బైబిల్లో ఆమెకు ఎదురైన చిన్న సంఘటనల్లోని మాటల్నే జపంగా మార్చుకొని పదే పదే ఉచ్ఛరించడం వల్ల ఆమె కేవేవో పూజలు జరుగుతున్నాయనుకోకూడదు. ఈ విషయమై ఇటీవల విశ్వ కాపరి, పోప్ లియో ప్రత్యేకమైన సందేశం ఇచ్చిన సంగతి మరువగూడదు. శిలువపై మరణించబోతున్న యేసు ప్రభువు, తన తల్లి బాధ్యత ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. మరియ మాత ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఆమె ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. అందరినీ ప్రేమతో చూసుకునేది. తన చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించేది. పేదలకు సహాయం చేసేది. యేసు చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేసేది.ఓ రోజు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ‘మరియమ్మా! దేవుడు నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు’ అని చెప్పాడు. కొంతకాలానికి ఆమె భూలోక జీవితాన్ని ముగించింది. యేసు శిష్యులు ఆమెను ఎంతో గౌరవంగా సమాధి చేశారు. కొన్ని రోజుల తర్వాత వారు సమాధి దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ మరియ మాత శరీరం కనిపించలేదు. దేవుడు ఆమెను శరీరంతో సహా పరలోకానికి తీసుకువెళ్లాడని వారు విశ్వసించారు. ఆమెకు తిన్నగా మోక్షాన్ని ఆరోపించారు. ఇది ‘మోక్షారోపణ’. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియ మాత మోక్షారోపణ పండుగ జరుపుకొంటారు. అమె ఎంతో ధన్యురాలని పిలుస్తారు. (లూకా 1:48)– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (ఆగస్టు 15న మరియా మోక్షారోపణ పండుగ) -
బయటి అందం కాదు.. అంతరంగ పవిత్రతే అసలైన అందం!
ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, మనిషి అన్వేషణ మాత్రం ఒకటే–శాంతి, ఆనందం, పరిపూర్ణత. ధనం, హోదా, సాంకేతిక విజ్ఞానం, సామాజిక గుర్తింపుం ఇవన్నీ జీవితాన్ని సౌకర్యవంతం చేయగలవేమో గానీ, అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచలేవు. మనసులో కలత, అసంతృప్తి, భయం, అసూయ, కోపం, అహంకారం వంటి భావాలు తొలగినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది.ఆ అంతరంగ శాంతికి, ఆత్మసాక్షాత్కారానికి, దైవానుభూతికి మూలం పవిత్రత అని భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. సహజయోగ వ్యవస్థాపకురాలు పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1985 ఆగస్టు 4న ఇచ్చిన సందేశంలో ఈ సత్యాన్ని అత్యంత సరళంగా వివరించారు. ఆమె మాటల్లో ‘‘పవిత్రత కుండలినిని బలపరుస్తుంది.’’ ఈ ఒక్క వాక్యంలోనే ఆధ్యాత్మిక జీవిత సారాంశం దాగి ఉంది.కుండలిని అంటే ఏమిటి?భారతీయ యోగశాస్త్రం ప్రకారం ప్రతి మనిషిలో జన్మతః ఒక దివ్యశక్తి నిద్రాణంగా ఉంటుంది. అదే కుండలిని. ఇది కేవలం ఒక తాత్విక భావన కాదు; ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక పరిణామ శక్తికి ప్రతీక. ఈ శక్తి జాగృతమైతే మనిషి తన అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఆలోచనలు నిర్మలమవుతాయి. కోపం, భయం, ద్వేషం క్రమంగా తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, క్షమాగుణం సహజంగా వికసిస్తాయి. అయితే ఈ దివ్యశక్తి వికసించడానికి అత్యంత అవసరమైన నేల పవిత్రత. మురికినీటిలో తామర పువ్వు వికసించదు. అలాగే కలుషితమైన మనస్సులో దైవచైతన్యం పూర్తిగా వికసించదు.నేటి సమాజం – పరుగు...ప్రస్తుత కాలంలో వ్యక్తి విలువను అతని వ్యక్తిత్వంతో కాకుండా, అతని బాహ్య రూపం, వస్త్రధారణ, ఆస్తి, సామాజిక మాధ్యమాల్లోని ్రపాచుర్యం ఆధారంగా కొలిచే పరిస్థితి ఏర్పడుతోంది. అందంగా కనిపించడానికి గంటల సమయం వెచ్చిస్తాం. ఇతరుల ప్రశంసలు పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మన గురించి నలుగురు ఏమనుకుంటారో అనే ఆందోళనలోనే జీవితాన్ని గడిపేస్తాం.కానీ ఈ ప్రయాసలన్నీ బాహ్య ప్రపంచానికే పరిమితం. అవి మనసును శాశ్వతంగా తృప్తిపరచవు. అంతేకాదు, అనవసరమైన పోలికలు, అసూయ, అహంకారం, నిరాశలకు కూడా కారణమవుతాయి. ఈ పరిస్థితిలో మనిషి తనలోని సహజ శక్తిని బయట ప్రపంచం కోసం ఖర్చు చేస్తూ, తన ఆత్మసంపదను కోల్పోతాడు. శ్రీ మాతాజీ అందుకే హెచ్చరిస్తారు–‘‘ఇతరులను ఆకర్షించడానికి మీ శక్తిని వృథా చేయకండి. సాధువులలాగే జీవించండి.’’– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులునిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
క్రీస్తు మరణం.. సువార్తకు కేంద్రబిందువు!
ఘనమైన సువార్త నిర్వచనం ఇలా ఉంది. దీన్నే పౌలు సువార్త నిర్వచనం అంటారు కూడా.‘...నేను ఏ సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. సమాధి చేయబడెను. మూడవ దినమున లేపబడెను’ 1కొరింధీ 15:1–4.క్రీస్తు మరణ సువార్తను మించిన సువార్త లేదన్నది బైబిలు ఉన్నత బోధ. దేవదేవుని గొప్పతనం అంతా ఇక్కడనే కనిపిస్తుంది. ఈ సర్వ లోకానికి భిన్నమైన వైవిధ్యమైన ఆశ్చర్యకర తలంపులు దేవునివి. దేవుడు ఏది సువార్త అంటాడో అదే సువార్త. ఎందుకంటే క్రీస్తు మరణం దేవదేవుని స్వకీయ సంకల్పంలో నుండే వెలుగులోకి వచ్చింది.ఉన్నది ఉన్నట్టుగా సువార్తను ప్రకటించక సువార్తకు జ్ఞానం, స్వస్థత, సాక్ష్యాలు, ఇప్పటి భక్తుల చరిత్రలు, అభిషేకారాధన వంటివి అనేకనేకం కలుపుతూ సువార్త శక్తిని హరిస్తున్నారు. పెద్ద పాలకుండలోని చిక్కనైన పాలలో చిన్నపాటి బిందువు లాంటి విషపు చుక్కవేస్తే రంగు రుచి వాసన కోల్పోతూ ఆ పాలన్నీ విరిగినట్టే. సత్య వాక్యమను రక్షణ సువార్తకు అలా ఏది చేర్చినా అది తన శక్తి ప్రభావ మహిమలను వెనువెంటనే కోల్పోతుంది. సువార్తకు మరింత రుచి, సువాసన అన్న ఆలోచనలు చేసేవాళ్ళు తక్షణమే అవి విడనాడాలి.సిలువ వేయబడిన క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం అయి ఉండగా కొత్తగా సువార్తకు జ్ఞానం అద్దడం దేనికీ? ఆత్మ స్వస్థతకు పాప రోగనివారణకు క్రీస్తు మరణిస్తే భౌతిక భావాలతో సువార్త స్వస్థత మహాసభలు దేనికీ? క్రీస్తు మరణ సువార్తకు ఏదీ కలుప కూడదు అనునదే అపొస్తలుల బోధలసారం.సూచక క్రియలకు మించిన సూచక క్రియ క్రీస్తు ప్రేమకు కేంద్రమైన సిలువ. జ్ఞానానికి మించిన జ్ఞానం సిలువ వేయబడిన క్రీస్తులో కనబడుతుంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతుంది. సర్వ సంపూర్ణత క్రీస్తు బలియాగంలో ఒదిగి నిక్షిప్తమై ఉంది. ఇందు లేనిదంటూ ఏదీ లేదు. అలాగని సువార్తను మరుగు చేసేలా ఇందు ఒదిగిన అంశాల చుట్టూ సువార్త పేర్చడం కాక సువార్తకు ఏది కలుపక యథార్థమైన సువార్తను యధాతథంగానే ప్రకటించబద్దులము.సువార్తకు ఎలాంటి ఆధారం ఏ ఊతం అవసరం లేదు. అది ఒంటరిగానే నిలబడి వ్యవహారం చక్కబెట్టగలదు. పరమ పరిశుద్ధ సువార్తను అంతే çపరిశుద్ధంగా... అంతే స్వచ్ఛంగా వెల్లడి చేయుట ద్వారా దేవుని మెప్పు అధికంగా పొందగలుగుతాం. ప్రకటనార్హమైనదిగా ఉంటూ వెళ్ళు ప్రకటించు అనదగ్గ క్రీస్తు సువార్తను అనుభవపూర్వకంగా రుచి చూస్తే మాత్రం దీనికి వేరే ఏది జతగా కలుపకూడదనేది ఇట్టే అర్థమవుతుంది.మానవాళి ఆత్మలను రక్షించే శక్తిగల సత్యసువార్త గొప్పతనం ఏమంటే నేరుగా అది వచ్చి అపొస్తలుల చేతిలో పడడం. వీరిపై క్రీస్తు ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే వీరు ఆయన సువార్తకు న్యాయం చేసారు. సువార్తకు ఏదీ కలుపక క్రీస్తు మరణ సువార్తను ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించే విషయమై మనం అపొస్తలులను అభినందించక తప్పదు. ఎట్టి పరిస్థితులలోనూ క్రీస్తు మరణ సువార్తకు ఆయన జన్మను సైతం పౌలు కలుపకపోవడం గమనించదగ్గది. ఇట్టి అపొస్తలుల బోధకు, సువార్తకు విధేయులమై తలవంచుటే రక్షణ భాగ్యం. – జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
మట్టితో మనిషికి విడదీయరాని బంధం..
మానవ అంతరాత్మలో స్వేచ్ఛ ఎంతటి సహజసిద్ధమైన కాంక్షో, తాను జన్మించిన నేల పట్ల అనురాగం కూడా అంతే సహజమైన ప్రకృతి ధర్మం. మాతృభూమిని ప్రేమించడం విశ్వాసంలో ఒక అంతర్భాగం. సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ, ప్రతి ప్రాపంచిక దాస్యం నుండి విముక్తి పొందిన ఆత్మ మాత్రమే తన జన్మభూమి పవిత్రతను, స్వేచ్ఛను సంపూర్ణంగా ఆస్వాదించగలదు. ఈ ఆత్మస్వేచ్ఛే మాతృభూమితో ఒక విడదీయరాని ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరుస్తుంది.మక్కాను వీడుతూ ప్రవక్త పలికిన అమృత వాక్కులుదైవప్రవక్త ముహమ్మద్ (స) మక్కా నగరాన్ని వీడి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్తున్న ఆ భావోద్వేగ ఘట్టం మాతృభూమి పట్ల ఉండే ఆ΄్యాయతకు సజీవ సాక్ష్యం. స్వదేశాన్ని వదిలి వెళ్తున్న వేళ, మక్కా సరిహద్దుల్లో ఆగి, ఆ నేలవైపు ప్రేమోద్వేగంతో చూస్తూ ప్రవక్త పలికిన మాటలు విశ్వచరిత్రలోనే అత్యంత ఆర్ద్రమైనవి:‘ఓ మక్కా! అల్లాహ్ సాక్షిగా... ఈ భూ మండలంపై ఉన్న సమస్త ప్రదేశాల కంటే నీవే నాకు అత్యంత ప్రియమైనదానివి. అల్లాహ్కు కూడా నీవే అత్యంత ఇష్టమైన నిలయానివి. నీ ఒడిలో పెరిగిన నా ప్రజలే నన్ను ఇక్కడి నుండి వెళ్లగొట్టి ఉండకపోతే, నేను నిన్ను వదిలి వేరే ఏ చోటుకూ వెళ్లేవాడిని కాను.’ ప్రవక్త (స) తన జన్మభూమి పట్ల వ్యక్తపరిచిన ఈ అపరిమితమైన ప్రేమ, మాతృభూమి పట్ల ప్రతి మనిషికి ఉండాల్సిన అనురాగానికి శాశ్వతమైన మార్గదర్శిగా నిలిచింది.సజ్దా – పుట్టిన నేలతో ఆత్మిక విలీనంప్రవక్త చూపిన ఈ స్వేచ్ఛా స్ఫూర్తి, మాతృభూమి ప్రేమ ముస్లింల రోజువారీ ఆరాధనలో జీవకళగా నిలుస్తాయి. ఇస్లామ్లో రోజుకు ఐదు పూటలా చేసే ప్రార్థనలో అత్యంత పవిత్రమైన ఘట్టం ‘సజ్దా’ (సాష్టాంగ ప్రణామం). మనిషి తన అహంకారాన్ని, సమస్త లౌకిక బంధనాలను త్యజించి, తన శరీరంలోనే అత్యంత గౌరవప్రదమైన శిరస్సును భూమికి ఆనించి దైవానికి ప్రణమిల్లే క్షణమది.ఈ సజ్దా కేవలం ఒక ఆరాధనా ప్రక్రియ మాత్రమే కాదు; అది మనిషి తాను పుట్టిన నేలతో ఏర్పరుచుకునే ఒక ఆత్మీయ ఆధ్యాత్మిక అనుబంధం. రోజువారీ ఫర్జ్ నమాజుల్లోనే కనీసం 34 సార్లు (సున్నత్, నఫిల్, వాజిబ్ లు కాక) తన నుదుటిని నేలకు ఆనించడం ద్వారా విశ్వాసి మాతృభూమి మట్టితో విడదీయరాని ఐక్యతను చాటుకుంటాడు. మట్టి నుండి పుట్టిన మనిషి, నిరంతరం ఆ మట్టికే ప్రణమిల్లడం వల్ల ఆ నేల పట్ల భక్తి, గౌరవం, రక్షణ భావం అతని నరనరాల్లో ఇంకిపోతాయి. మాతృభూమి మట్టిని పదే పదే తాకే ఆ శిరస్సు ఏ పరాయి దాస్యానికీ లొంగదు; ఆ నేల స్వేచ్ఛకోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడదు. చరిత్రే దీనికి సాక్ష్యం.త్యాగానికి మూలమైన ఆధ్యాత్మిక నిరూపణసజ్దాలో దైవానికి లొంగిన ఆత్మ, ప్రపంచంలో మరే శక్తికీ బానిస కాజాలదు. అందుకే, ఏ నేలనైతే రోజువారీ సజ్దాలతో పునీతం చేస్తాడో, ఆ నేల స్వేచ్ఛకు ముప్పు వాటిల్లితే ముస్లిం సమాజం తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లిం యోధులు చిందించిన ప్రతీ రక్తపుబొట్టు వెనుక, దైవప్రవక్త నేర్పిన జన్మభూమి ప్రేమ, నమాజ్లో చేసిన ప్రతీ సజ్దా అందించిన ఆత్మబలమే నిలిచి ఉన్నాయి. జన్మభూమిని ప్రేమించడం, దాని స్వేచ్ఛ కోసం పోరాడటం కేవలం రాజకీయ బాధ్యత కాదు; అది విశ్వాసి నైజంలోనే కలిసిపోయిన పరమసత్యం.– మదీహా అర్జుమంద్ ఖాన్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
గౌరవం అంటే?
ప్రతి మనిషి, ప్రతి కుటుంబం గౌరవం నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోనే ఉంటారు... గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అసలు గౌరవం అంటే ఏమిటీ, గౌరవం ఎలా పొందాలో, ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం... ఉన్నారుగా మనకు మార్గదర్శులు.. శతక రచయితలు...కులములోన నొకడు గుణవంతుడుండెకులము వెలయు వాని గుణము చేతవెలయు వనములో న మలయజంబున్నట్లువిశ్వదాభిరామ వినుర వేమఅడవిలో గంధం చెట్టుంటే దాని సువాసన అడవి అంతటికి పాకుతుంది.. అలాగే వంశంలో గుణవంతుడైన కొడుకు ఉంటే ఆ వంశానికి కీర్తి గౌరవం లభిస్తాయి... అంటూ వేమనే పై పద్యానికి వ్యతిరేకం కూడా చె΄్పారు.కులములోన నొకడు గుణహీనుడుండెనాకులము చెడును వాని గుణము వలన చెఱుకుతుద ఎన్ను పుట్టినచెఱుకున తీపెల్ల జెరుచు సిద్ధము సుమతీ అంటాడు బద్దెన కవి వేమన గౌరవం కులం ధనం వల్ల రాదు అన్నాడుకులము గొప్పది కాదురాకులమున గౌరవమ్ము లేదు కొంపలు కూలన్నడవడి గొప్పది సుమ్మీనడవడి గలవాడు పూజ్యుడగు వేమాఅర్థం: కులం వల్ల గౌరవం రాదు. మంచి నడవడి ఉన్నవాడే లోకంలో పూజ్యుడు.ఎంగిలి మెతుకులు తిన్ననుసంగతి గలవాడు గౌరవమున బ్రతుకునుసంగతి లేని ధనికుడుకంగారు పడును లోకమందు వేమాపేదవాడైనా మంచి నడవడి ఉంటే గౌరవంగా బతుకుతాడు. నడవడి లేని ధనికుడు లోకంలో చులకన అవుతాడు. గౌరవం మాట, మర్యాద, దానం వల్ల వస్తుందన్నాడు బద్దెన.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా బెంగళూరుకు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ నంది కొండల పాదభాగాన ఉన్న నంది గ్రామం చరిత్ర కళా వైభవం ప్రకృతి సౌందర్యం మూడింటినీ ఒకే చోట కలిపిన అరుదైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలోనే కర్ణాటకలో అత్యంత ప్రాచీనమైన శైవ ఆలయ సముదాయాలలో ఒకటైన భోగనందీశ్వర, అరుణాచలేశ్వర జంట దేవాలయాలు ఉన్నాయి.నోలంబవాది ద్రావిడ శిల్పశైలికి తొలి నిదర్శనాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయ సముదాయం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్రను తనలో దాచుకుంది. నంది కొండల నుండి దిగివచ్చే సహజ జలవాహినులు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చడం వల్ల ప్రాచీన కాలం నుంచే ఇది పవిత్ర తీర్థక్షేత్రంగా అభివృద్ధి చెందింది.ఈ ఆలయ నిర్మాణం తొమ్మిదవ శతాబ్దం మొదట్లో ప్రారంభమై దాదాపు వంద సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఈ ఆలయ సముదాయం నిర్మాణంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. దక్షిణాన ఉన్న అరుణాచలేశ్వర ఆలయం పరమశివుని బాల్య దశను సూచిస్తే ఉత్తరాన ఉన్న భోగనందీశ్వర ఆలయం యవ్వన దశను సూచిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న చిన్న ఉమా మహేశ్వర ఆలయం శివపార్వతుల దాంపత్య జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మూడు ఆలయాలను వరుసగా దర్శించడం ద్వారా శివుని జీవనయాత్రను ప్రతీకాత్మకంగా అనుభవించినట్లవుతుందని స్థానిక విశ్వాసం.రెండు ప్రధాన ఆలయాల గర్భగృహాలు ఎతై ్తన వేదికలపై నిర్మించబడ్డాయి. ప్రతి గర్భగృహంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. ఈ రెండు ఆలయాలకు విడివిడిగా నంది మండపాలు ఉండటం అత్యంత అరుదైన విశేషం. సాధారణంగా శివాలయాలలో ఒకే నంది విగ్రహం ప్రధాన గర్భగృహానికి ఎదురుగా ఉంటుంది. అయితే ఇక్కడ రెండు నంది విగ్రహాలు తమ తమ గర్భగృహాలకు అనుగుణంగా సరిగ్గా అమర్చబడి ఉండటం ఆలయ నిర్మాణ శైలిలో అసాధారణ లక్షణంగా భావించబడుతుంది.ఈ ఆలయ సముదాయంలోని సభామండపం శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి స్తంభంపైనా దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు నర్తకులు యాళులు ఏనుగులు గుర్రాలు హంసలు మకరాలు పూలతీగలు పురాణ దృశ్యాలు అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం. ఒక స్తంభంపై పదితలలు పది జతల చేతులతో కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తున్న రావణాసురుని శిల్పం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. జుట్టు ముడులు ఆభరణాలు గాజులు వేళ్లగోళ్లు వస్త్ర మడతలు వరకు ఎంతో సూక్ష్మంగా చెక్కిన తీరు అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం. మండపంలోని కొన్ని స్తంభాలపై తమిళ శాసనాలు చెక్కబడి ఉన్నాయి.ఆలయ గోడలు, గవాక్షాలు, ద్వారబంధాలు, పైకప్పు అంచులు అన్నిచోట్లా శిల్పకళ నిండి ఉంటుంది. ప్రధానంగా శైవ క్షేత్రమైనా నరసింహుడు లక్ష్మీదేవి దుర్గాదేవి సూర్యుడు అగ్నిదేవుడు గణపతి సుబ్రహ్మణ్యుడు సప్తమాతృకలు, భైరవుడు చండేశ్వరుడు వంటి అనేక దేవతా రూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. శైవ వైష్ణవ శాక్త సంప్రదాయాల సమన్వయాన్ని ఈ శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ఆలయ ద్వారపాలకుల విగ్రహాలు గంభీరమైన భంగిమలో నిలిచి సందర్శకులను ఆకట్టుకుంటాయి.– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
శ్రావణంలో ఇవి చేస్తే శుభఫలితాలు!
మామూలు సమయాలలో ఎలా ఉన్నా శ్రావణమాసం రాగానే ఇంచుమించు ప్రతి భక్తుడి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో, చందన సుగంధాలతో, చిరుగంటల సవ్వడితో... కర్పూర నీరాజనపు పరిమళాలతో... కాళ్లకు పసుపు, నొసట కుంకుమ ధరించిన ముత్తైదువల పట్టుచీరల రెపరెపలతో వీధులన్నింటా ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంటుంది. అంత గొప్ప శుభమాసం నేడే ప్రారంభమైంది. ఇక ఈ మాసమంతా ఎన్నో పండుగలు, పర్వదినాలు, వివాహాది శుభముహూర్తాలతో సందడి చేయనుంది.సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది, ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణమాసానికి పేరు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు విశిష్ట ఫలం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.శివారాధనకు ఎంతో విశిష్టతశ్రావణమాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రిపూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలం ఉంటుందని శాస్త్రోక్తి.మంగళ గౌరీ వ్రతంశ్రావణ మాసం లో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అనీ పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రతీతి..వరలక్ష్మీ వ్రతంశ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి.విశిష్టతలుశుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని ప్రతీతి.శుక్ల పక్ష పౌర్ణమిరాఖీ పౌర్ణమిగా జరుపుకునే శ్రావణ పున్నమి రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ చేస్తారు. వేదాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.ఇక ఆ తర్వాత వచ్చే కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య పర్వాలు కూడా శ్రావణమాసంలోనే వస్తాయి. కృష్ణాష్టమి, ΄÷లాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలను ఆచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రోక్తి.– పూర్ణిమాస్వాతినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
దీక్ష.. గురువు పెట్టిన పరీక్ష!
అస్మృతిః క్లేశజాతస్య దీక్షాయాః ఆది లక్షణమ్’ ఒక పని చేసేటప్పడు దీక్ష ముఖ్యం. ఎలాంటి బాధలు గుర్తుకురాకుండా ఉండటమే దీక్షకు ప్రధాన లక్షణం. ఏ పనినైనా చేసి లక్ష్యాన్ని సాధించాలని అనుకొన్నప్పుడు అందులో ఉండే కష్టనష్టాలు గుర్తుకు రాకూడదు. గుర్తొస్తే పట్టుదల పలచబడి లక్ష్యం సాధించలేరు. ఏకాగ్రత ఉన్నప్పుడే లక్ష్య సాధన సాధ్యమవుతుంది.కారు నడిపే సమయంలో డ్రైవరు మనసు పరిపరివిధాల పోకుండా ముందు రోడ్డువైపే ఏకాగ్రతతో ఉంటుంది. లేకపోతే ప్రమాదాలేర్పడతాయి. అందుకే డ్రైవరు కారు వేగం పరిమి తిని, సమయాన్ని, ట్రాఫిక్ రూల్సును, సిగ్నల్స్ను జాగ్రత్తగా గమనిస్తూ ముందుచూపు సడల కుండా దీక్షతో నడుపుతాడు. అప్పుడే వాహనం క్షేమంగా గమ్యం చేరుతుంది.ఒక శిల్పాచార్యుడికి ఇద్దరు శిష్యులుండేవారు. మొదటివాడు కష్టపడి చాలాసేపు శిల్పాలు చెక్కుతూనే ఉండే వాడు. రెండోవాడికెప్పుడూ ఆటల ధ్యాసే. గురువుగారు వచ్చేసరికి పని చేస్తూండటం, తర్వాత వదిలివేయటం అలవాటు. ఒకరోజు ఇద్దర్నీ పిలిచి ఫలానా కొండల్లో ఫలానా రాయి ఉంది, వెతికి తీసుకురండని పంపాడు. ఇద్దరు అలాగే వెళ్ళి శిలను గుర్తించి తెచ్చారు. మొదటివాడు పండ్లు, పూలు, మూలికలు కూడా తెచ్చాడు.‘ఇవన్నీ ఎందుకురా?’ అని గురువడిగితే ‘స్వామీ! నా తల్లికి పండ్లు, చెల్లికి పూలు, మా అమ్మమ్మ చికిత్సకు మూలికలు తెచ్చా’నన్నాడు మొదటి శిష్యుడు. రెండవవాడిని ‘ఏరా! మీ తలిదండ్రులకు సుస్తీగా ఉందికదా! మరి నీవెందుకు మూలికలు తేలేదు’ అని గురువడిగాడు. ‘స్వామీ! నేను శిలను మాత్రమే వెతికాను. ఇతర ఆలోచనలేవీ నాకు లేవు’ అన్నాడు. పనిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉంటే కార్యసిద్ధి కల్గుతుంది.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
వర్షాకాలంలో తులసి మొక్కను ఇలా పెంచడమే మంచిది..
తులసి మొక్కకు వర్షాకాలం అనుకూలమైన సమయం. వాతావరణంలో తేమ, చల్లదనం ఉండటంతోపాటు మొక్క వేగంగా కొత్త ఆకులు, కొమ్మలు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే, అధిక వర్షం, నీరు నిలిచిపోవడం, సూర్యరశ్మి తగ్గడంతో తులసి మొక్క బలహీనపడుతుంది. అయితే, ఇంట్లో తులసి మొక్కను పచ్చగా, ఆరోగ్యంగా, దట్టంగా పెంచుకోవాలంటే ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.సూచనలు.. జాగ్రత్తలు..తులసి మొక్కను దట్టంగా పెంచడానికి పైభాగంలో పెరుగుతున్న చివరి కొనలను అప్పుడప్పుడు చేతితో స్వల్పంగా తెంచేయాలి. దీంతో కిందివైపు కొత్త కొమ్మలు రావడం ప్రారంభిస్తాయి. మొక్క ఒకే కాడలా పైకి పెరగకుండా గుబురుగా మారుతుంది.తులసి చెట్టు పువ్వులు కాసినప్పుడు వాటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించవచ్చు. ఇలా చేయడంతో కొత్త ఆకులు, కొమ్మల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అయితే విత్తనాలకై కొన్ని పువ్వులను తెంచకుండా ఉంచితే చాలు.వర్షాకాలంలో ఈ చెట్టుకి నీరు ఎక్కువగా అందడం పెద్ద సమస్యగా మారవచ్చు. దీంతో కుండీలో నీరు నిలిచి చెట్టువేర్లకు సరైన ఆక్సిజన్ ఆందక చెట్టు కాడ నల్లగా మారుతుంది. మట్టి తడిగా ఉన్నట్లయితే మళ్లీ నీరు పోయాల్సిన అవసరం ఏమాత్రం లేదు.నీరు పోసే ముందు మట్టిని వేలితో తాకి చూడాలి. పై పొర పొడిగా అనిపిస్తేనే నీరు అందించాలి. అలాగే పోసిన నీరు నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు కుండీ అడుగున చిన్న చిన్న రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి. నీరు ఎక్కువసేపు నిలిచిపోతే తులసి వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.తులసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి తగినంత వెలుతురు అవసరం. అలాగే ప్రతిరోజూ కొన్ని గంటలు(4-6) సూర్యరశ్మి తగిలేలా చూడాలి. అయితే వర్షాకాలంలో ఆకాశం నల్లని మబ్బులతో కూడుకుని ఉండటంతో.. సూర్యకిరణాలు నేరుగా అందకపోవచ్చు. వాటికి బదులుగా మొక్కకు వీలైనంత ఎక్కువ సహజ వెలుతురు అందే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. దీంతో ఆకుల రంగు బాగుండటంతోపాటు కొత్త కొమ్మలు, మొక్క పెరుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది.తులసికి కేవలం ఎరువు వేయడమే కాకుండా.. కుండీలోని మట్టి ఎక్కువ నీరును పిల్చేదిగా ఉండకూడదు. అయితే, ఆ మట్టిలో తక్కువగా ఇసుక, కుళ్లిన సేంద్రియ ఎరువును కలపవచ్చు. దీంతో మట్టి మరీ బరువుగా మారకుండా ఉండటంతో వేర్లకు గాలి బాగా అందుతుంది.తులసి మొక్క పెరుగుతున్నప్పుడు పోషకాలు కూడా అవసరం. అప్పుడప్పుడు కొద్దిమొత్తంలో వర్మీకంపోస్(Vermicompost) లేదా బాగా కుళ్లిన సేంద్రియ ఎరువును మట్టిలో కలపవచ్చు. ఎరువును ఎక్కువగా వేయడంతో ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉంటుంది. దాంతో మొక్కకు తగిన మోతాదులో ఎరువును వేయడమే మంచిది.వర్షాకాలంలో తేమ పెరగడంతో తులసి ఆకులు, కాండంపై చిన్న చిన్న పురుగులు లేదా ఫంగస్ సమస్యలు తరచూ వస్తూంటాయి. అందుకు వారానికి ఒకటి, రెండుసార్లు ఆకులు, కాండాన్ని పరిశీలించాలి. ఆకులపై పురుగులు కనిపిస్తే వేప నూనె ఆధారిత స్ప్రే వంటి సహజ నియంత్రణ పద్ధతులను ఉపయోగించవచ్చు.తులసికి పూలగుత్తులు రావడం సహజమే. అయితే మొక్కను మరింత దట్టంగా, ఆకులతో నిండుగా పెంచుకోవాలనుకుంటే.. ఎక్కువగా ఉన్న పాత పుష్ప గుత్తులను ఎప్పటికప్పుడు తొలగించడం ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఎండిపోయిన, దెబ్బతిని పసుపు రంగులోకి మారిన ఆకులను కూడా తొలగిస్తూ ఉండాలి.వర్షాకాలంలో తులసి సంరక్షణ అంటే.. కేవలం నీరు, ఎరువు ఇవ్వడమేకాదు, సరైన వెలుతురు, పరిమిత నీరు, మంచి నాణ్యతగల మట్టి(ఎర్రమట్టి), ఎప్పటికప్పుడు పించింగ్, సమతుల్యమైన పోషణ వంటి కీలకమైన జాగ్రత్తలతో మొక్క మరింత ఆరోగ్యంగా, దట్టంగా పెరిగే అవకాశం ఉంటుంది.భారతీయ కుటుంబాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. పూజా స్థలంలో, ఇంటి ఆవరణలో పెంచుకునే తులసిని ప్రేమగా సంరక్షించడం ప్రతీ కుటుంబంలో ఒక మంచి సంప్రదాయం. అయితే, వర్షాకాలంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ పేరుతో ఎక్కువ నీరు పోయకుండా ఉండటమే మరో ముఖ్యమైన జాగ్రత్త. -
అసలు సన్యాసం అంటే 'నేను–నాది’ని వదలడమే!
'జటిలో ముణ్డీలుంచిత కేశఃకాషాయాంబర బహుకృత వేషఃపశ్యన్నపి చ న పశ్యతి మూఢఃఉదర నిమిత్తం బహుకృత వేషః'ఇది శంకర భగవత్పాదుల వారి ‘భజగోవిందం’లోని ఒక శ్లోకం. జడలు కట్టిన వెంట్రుకలతో ఒకడు, జుట్టులేక ముండనము చేయించుకున్నవాడు ఒకడు, వ్రేలా డుతూ ఉండే వెంట్రుకలు కలవాడు ఒకడు, కాషాయ రంగు బట్టలను ధరించినవాడు ఒకడు– నిజానికి వీళ్ళంతా ఉదర పోషణకు మాత్రమే వివిధ వేషములను వేస్తారు (భజగోవిందం; వ్యాఖ్య స్వామి చిన్మయానంద).శంకరాచార్యుల కాలం నాటికే సన్యాసులు అలా ఉండేవారంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సాధన కొరకు జీవించాలి కాబట్టి ఏదో కొంత భిక్షాన్నాన్ని, దాన్ని పవిత్రమైన ‘మధుకరి’గా భావించి యాచించేవారు. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధన ఏదీ లేకపోయినా, కేవలం కాషాయ వస్త్రాలను ధరించి, సన్యాసులుగా అవతారమెత్తి యాచిస్తున్నారు చాలామంది.కేరళలోని ఆనందాశ్రమానికి చెందిన విశ్వమాత కృష్ణాబాయి ఏ యువకుడైనా తనకు సన్యాస దీక్షను ఇమ్మని అడిగితే, మందలిస్తూ ఇలా చెప్పేది: ‘సన్యాసం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. నీవెందరో సన్నాసులను చూస్తున్నావు. వారు పొందినదేమిటి? గృహాన్ని, బంధువులను వదలటం, కాషాయ వస్త్రాలను ధరించటమే సన్యాసం కాదు. నేను, నాది అన్న భావాన్ని వదలటం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీనిని నీవు చేయవచ్చు. నీ వైపునుండి అవసరమైన ఒకే ఒక విషయం నీ శాశ్వత స్వరూపాన్ని సాక్షాత్కరించుకొనవలెననే తీవ్రమైన ఆకాంక్ష.ఈ ఆకాంక్షతో రామనామాన్ని స్వీకరించి, నీ ఇరుగు పొరుగు వారినీ, నీ ప్రదేశంలో నున్నవారినీ రాముని రూపాలుగా సేవించు. పవిత్రమూ, సర్వశక్తిమంతమైన రామ నామాన్ని నిరంతరం నీ నాలుక మీద నాట్యం చేయ నివ్వు’ (పుటలు– 41–42; విశ్వమాత కృష్ణాబాయి– స్వామి సచ్చిదానంద – ఆనందాశ్రమము).– రాచమడుగు శ్రీనివాసులు -
నకులుడు... అశ్వశిక్షణలో మేటి
పాండవుల పేర్లు చెప్పగానే అందరూ వారు అయిదుగురూ కుంతీపుత్రులే అనుకుంటారు. అయితే పాండురాజు మొదటి భార్య అయిన కుంతికి దూర్వాస మహర్షి చేసిన మంత్రోపదేశ ప్రభావంతో యమధర్మరాజు అనుగ్రహంతో ధర్మరాజు, వాయుదేవుడి వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు జన్మించగా... రెండోభార్య అయిన మాద్రికి అశ్వినీదేవతల అనుగ్రహంతో నకుల సహదేవులు జన్మించారు.నకులుడు అంటే చాలా అందగాడు అని అర్థం. అందుకే నకులుడిని అపర మన్మధుడు అని కూడా అంటారు. నకులుడు కత్తియుద్ధంలో గొప్పవీరుడు. గుర్రాలపోషణలో ఎంతో నైపుణ్యం కలిగినవాడు. పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు విరాటరాజు కొలువులో ‘దామగ్రంథి’ అనే పేరుతో గుర్రాల శిక్షకుడిగా పనిచేశాడు.కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సైన్యంలోని ఏడు అక్షౌహిణుల సైన్యంలో ఒకదానికి నాయకత్వం వహించి యుద్ధంలో పాల్గొన్నాడు. మొదటిరోజు యుద్ధంలో దుశ్శాసనుడితో తలపడి ఓడించినప్పటికీ అన్న భీమసేనుని ప్రతిజ్ఞ వల్ల చంపకుండా వదిలేసాడు. 11వ రోజు యుద్ధంలో తన మేనమామ శల్యుడి రథాన్ని నాశనం చేసి 14వ రోజున యుద్ధంలో ఓడించాడు.15వ రోజు దుర్యోధనుడితోనూ, 16వ రోజున కర్ణునితోనూ యుద్ధం చేశాడు. 17వ రోజున శకుని కుమారుడు వృకాసురుని, 18వ రోజున కర్ణుని కుమారులైన సుసేనుడు, చిత్రసేనుడు, సత్యసేనులను సంహరించాడు. యుద్ధానంతరం ధర్మరాజు ఉత్తర మధ్రదేశానికి నకులుడిని రాజుగా నియమించాడు. కృష్ణుని అవతారం పరిసమాప్తి కావడంతో, సోదరులతోపాటు రాజ్యాన్ని, సంపదలను పరిత్యజించి హిమాలయాలకు వెళ్లి అక్కడనుండి స్వర్గంవైపు న కులుడు కూడా పయనమయ్యాడు. – సి.ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులుపర్వంచుక్కల అమావాస్య!ఆషాఢ బహుళ అమావాస్యకే ‘చుక్కల అమావాస్య’ అని,‘దీప అమావాస్య’ అనీ పేర్లున్నాయి. ఈ రోజుకున్న విశిష్టతలు, ఆచారాలు... పితృతర్పణాలు: ఈ రోజున పితృలోకంలోని పూర్వీకులు భూలోకానికి వచ్చి, తమకు తర్పణలు ఇచ్చే సంతానాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. అందువల్ల ఈ రోజు∙పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయని శాస్త్రోక్తి.గృహిణులు, నూత్న వధువులు పిండిదీపాలు వెలిగించి, గౌరమ్మ ను పూజించి ముత్తైదువులకు వాయనాలు ఇస్తారు. దీనివల్ల సుమంగళీత్వం, కుటుంబంలో సుఖశాంతులు ్రపాప్తిస్తాయని విశ్వాసం. ఈ రోజు సాయంత్రం ఇళ్లలో, దేవాలయాలలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం వల్ల వ్యాధులు, ప్రతికూల శక్తులు, తొలగిపోతాయని ప్రతీతి. ఆషాఢ అమావాస్య నాడు పేదలకు అన్నదానం చేయడం విశేష ఫలప్రదం. (12, బుధవారం చుక్కల అమావాస్య) -
అచ్యుతం కేశవం: అదొక చిన్న పల్లెటూరు.. ఆ ఊర్లో వాళ్ళందరూ..
అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి శ్రీకృష్ణుడి గుడి కట్టారు. అదే ఊరికి చెందిన ఆవు పాలను అమ్మే ఓ మహిళ శ్రీకృష్ణుడి భక్తురాలిగా మారింది. తన మంచి చెడ్డలు, కష్ట సుఖాలు కృష్ణుడికి చెప్పుకునేది. తన భర్త కాలమయ్యాక ఆమెకు భక్తి మరింత ఎక్కువయ్యింది.ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. అతడు అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడటం చేస్తుండేవాడు. అక్కడే అమెరికాలో ఉన్న కన్నడ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇండియా కి రావడం తగ్గించాడు. కాగా ఆ ఊరి వాళ్ళు నెలనెలా కంతులవారీగా డబ్బును ΄÷డుపు చేసేవారు. అలా సమకూరిన డబ్బుతో రెండేళ్ళ కొకసారి తీర్థయాత్రలు చేసేవారు.ఆ తీర్థయాత్రల్లో ఓ సారి ఆమెకు ఒక కన్నడ వృద్ధురాలు పరిచయమయ్యింది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ఆ వృద్ధురాలు ఉడిపి కృష్ణుడి గురించి, స్వామి మహత్యాల గురించి విశేషంగా వర్ణించింది. అక్కడ బాలకృష్ణుడి రూపంలో స్వామి దర్శనమిస్తాడని, ఆయనను నేరుగా కాకుండా నవరంధ్ర కిటికీ ద్వారా దర్శించాలని చెప్పింది.అప్పటినుంచి ఆ పాలమ్మే మహిళకు ఉడిపి కృష్ణుడిని చూడాలని కోరిక మొదలయ్యింది. ఊరి వారు చేసే తీర్థయాద్రల్లో ఎన్నో గుడులూ గోపురాలు చూసింది కానీ ఉడిపి గుడికెళ్ళడం కుదరలేదు. ‘కృష్ణా... కరుణించవా’ అని స్వామిని వేడుకునేది. ‘ఉడిపి కృష్ణుని చూడని కళ్ళు కళ్ళేనా’ అని మదనపడేది. వయసు అరవై దాటింది. స్వామిని చూడకుండానే కాలం గడిచిపోతుందేమోనని భయం పట్టుకుంది. అదే విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పి బాధపడేది.3హఠాత్తుగా ఒకరోజు రాత్రి కొడుకు ఫోన్ చేసి, తనకు కూతురు పుట్టిందని, ఆరవ నెలలో అన్న్రపాశన అనీ, తన భార్య కుటుంబీకులకు ఉడిపిలో అన్న్రపాశన చేసే సంప్రదాయం ఉంది కాబట్టి తాము ఇండియా వస్తున్నామని, తమతోపాటు నువ్వు కూడా ఉడిపి వస్తే బాగుంటుందని అమ్మను కోరాడు. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా చెప్పుకుని పొంగిపోయింది.ఇండియాకి వచ్చిన కొడుకు, కోడలుతో మొదటిసారిగా విమానం ఎక్కింది. అది ఉడిపికి దగ్గరగా ఉండే షిమాగో వరకు వెళ్ళే విమానం. ఆమె తనతోపాటు చిన్న సంచి కూడా తీసుకు వచ్చింది. అందులో హుండీలో వేయడానికి డబ్బు దాచి ఉంది. తను పెంచే ఆవులకు దూడలు పుట్టిన ప్రతిసారీ అమ్మే జున్ను ద్వారా వచ్చిన డబ్బులవి.మనవరాలిని ఆడించుకుంటూ ‘అచ్యుతం కేశవం’ అనే పాట పాడుకుంటూ ఆమె ఉడిపి గుడిలోకి ఆధ్యాత్మికానందంతో అడుగు పెట్టింది.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
దైవకార్యాన్ని అర్థం చేసుకోవాలి
దాసియైన మంధర మాటలు విని, కైకేయి దశరథుడిని కోరిన రెండు వరములతో, శ్రీరాముడికి జరగవలసిన పట్టాభిషేక కార్యక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. అదేకాక, శ్రీరాముడు పదు నాలుగేళ్ళు వనవాసం చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్రీరాముడికి బహిప్రాణంలా ఉండే లక్ష్మణుడు ఈ హఠాత్పరిణామానికి తట్టుకోలేక దుఃఖంలో మునిగిపోయాడు.‘చేతిలోకి వచ్చి స్వంతమయింది కదా అని భావించిన సంపద అంతలోనే పోవడం, అడవుల పాలవడం– ఇవి దైవనిర్ణయా లుగా జరుగుతాయే తప్ప మనుషుల వశంలో ఉండి జరిగేవి కావు తమ్ముడా!’ అని లక్ష్మణుడిని సమాధానపరిచాడు శ్రీరాముడు. తండ్రి మీద కూడా కోపంతో ఉన్న లక్ష్మణుడితో ఇంకా ఇలా చెప్పాడని ‘గోపీనాథ రామాయణము’ తెలిపింది.మనుషుల జీవితాలలో లాభాలాభములను, సుఖదుఃఖములను, భయక్రోధములను, భవాభవంబులను ఏది కలుగజేస్తుందో అది దైవం అనబడుతుంది. విశ్వామిత్రాది తపోధనులు– జితేంద్రియులు అయ్యుండి కూడా– దైవంచే పీడితులగుచూ శక్తిమంతాలైన వారి నియమాలను విడిచిపెట్టినవారై కామక్రోధాసక్తులగుట తెలిసినదే కదా! ఈ లోకంలో కావలసినదిగా భావించబడే కార్యాన్ని కాకుండాచేసి, ఊహించని కార్యాన్ని, సంకల్పించని పరిణామాన్ని జరిగేటట్లుగా చేయడమే దైవకార్యంగా భావించి మనిషి సమాధానపడాలి. అటువంటి వివేకం కలిగిన బుద్ధితో, క్రోధాది ఇంద్రియ భావములను అదుపులో పెట్టుకుని ఆలోచించినపుడు అకస్మాత్తుగా తప్పిపోయిననా పట్టాభిషేక కార్యం గురించిన శోకం నాలో జనించదు.తే. నాకు జూడ బ్రజాపాలనము కంటెనవ్విపినవాస మధికోదయంబు గానననఘ లక్ష్మీవిపర్యయమందు నీవుమది విషాదంబు విడువుము మమత దక్కి. పట్టాభిషేకం చేయించుకుని ప్రజాపాలనం గురించిన పనులలో పడడం కంటె, అడవికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాబట్టి రాజ్యా ధికారం అనే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయిందనే శోకాన్ని విడిచిపెట్టు. ప్రశాంతంగా ఉండు – అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుడిని శాంతపరిచాడు.– భట్టు వెంకటరావు -
బడబానల తీర్థం.. పూర్వం ఒకానొక కాలంలో..
పూర్వం ఒకానొక కాలంలో మహర్షులందరూ నైమిశారణ్యంలో సుదీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ యాగంలో మృత్యువును శమితృ పదవిలో నియోగించారు. ఆ సత్రయాగం కొనసాగుతున్న కాలంలో మృత్యువు యజ్ఞకార్యంలో నియుక్తమై ఉన్నందున మానవులు మృత్యువాత పడకుండా, అమరులుగా మారిపోయారు. భూలోకంలో మరణాలు పూర్తిగా లేకుండా పోయి, జననాలు అంతకంతకు పెరగసాగాయి. మర్త్యుల రాకడ ఆగిపోవడంతో స్వర్గలోకం వెలవెలబోసాగింది.మృత్యువు తన విధి నిర్వర్తించడంలో ఉపేక్ష వహిస్తూ, యజ్ఞకార్యంలో నిమగ్నం కావడం వల్ల దేవతలు దిక్కుతోచనివారయ్యారు. చివరకు దేవతలందరూ కలసి రాక్షసుల వద్దకు వెళ్లి, ‘మీరంతా వెళ్లి మునులు సాగిస్తున్న సత్రయాగాన్ని ధ్వంసం చేయండి’ అని చెప్పారు.‘మునుల యాగాన్ని నిష్కారణంగా ధ్వంసం చేస్తే మాకు ఒరిగేదేమిటి?’ అని అడిగారు రాక్షసులు.‘మీకు యాగార్ధభాగాన్ని ఇస్తాం’ అని చెప్పారు దేవతలు.అప్పుడు మునుల యాగభంగం చేయడానికి రాక్షసులు అంగీకరించారు. మహర్షులకు ఈ సంగతి తెలిసింది. అప్పుడు వారు, ‘ఓ మృత్యువా! రాక్షసులు యాగభంగం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? తరుణోపాయం నువ్వే చెప్పు!’ అని అడిగారు.‘యాగ సామగ్రినంతా ఇక్కడే విడిచిపెట్టి, అగ్నిని మాత్రం తీసుకుని గౌతమీ తీరానికి వెళ్లండి. అక్కడ పరమశివుడిని ప్రార్థించండి’ అని మృత్యువు చెప్పాడు.మహర్షులు యాగసామగ్రిని ఎక్కడివక్కడే విడిచిపెట్టి, కొంత అగ్నిని తీసుకుని గౌతమీ తీరానికి తరలి వెళ్లారు. యాగకార్యంలో నియుక్తమై ఉన్నందున మృత్యువు కూడా వారిని అనుసరించాడు.మహర్షులందరూ పవిత్ర గౌతమీ నదిలో స్నానమాచరించారు. అనంతరం మహాదేవుడైన పరమేశ్వరుని వేనోళ్ల స్తుతిస్తూ ప్రార్థించసాగారు.అప్పుడు మృత్యువు కూడా మహాదేవుని ప్రార్థించింది. ‘పరమేశ్వరా! శంభో శంకరా! నీవు మహాకాయుడవు, మహానలుడవు, మహానీలుడవు. మహేశ్వరా నీవే మమ్ము రక్షించాలి’ అని ప్రార్థించాడు.పరమశివుడు వారి ప్రార్థనలకు ప్రసన్నుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు.‘వరమేమి కావాలో కోరుకోండి’ అన్నాడు పరమశివుడు.అప్పుడు మృత్యువు ‘పరమేశ్వరా! రాక్షసుల వలన మా యాగానికి మహాపద వాటిల్లింది. మహర్షులు తలపెట్టిన ఈ సత్రయాగం సఫలమయ్యేంత వరకు మమ్మల్నందరినీ నువ్వే రక్షించాలి’ అని ప్రార్థించాడు.పరమశివుడు ‘తథాస్తు!’ అని అనుగ్రహించాడు.పరమశివుడి వరానుగ్రహంతో మృత్యువు సాయంతో మహర్షులు తమ సత్రయాగాన్ని విజయవంతంగా పరిసమాప్తి చేశారు.యాగం పూర్తవుతూనే దేవతలు హవిర్భాగాల కోసం ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు.మృత్యువు వారిని చూసి, ‘మా యాగ విధ్వంసానికి మీరు రాక్షసులను ప్రేరేపించారు. హవిర్భాగాహారులైన మీరు అకార్యానికి పాల్పడ్డారు. ఇప్పటి నుంచి మీకు రాక్షసులతో శత్రుత్వం తప్పదు’ అని శపించాడు.మృత్యువు శాప ఫలితంగా దేవతలకు, రాక్షసులకు అప్పటి నుంచి బద్ధవైరం ఏర్పడింది.అప్పుడు మహర్షులు మృత్యువు పట్ల సంప్రీతులయ్యారు. వారు బడబ అనే కృత్యను సృష్టించి, ఆమెతో మృత్యువుకు వేదోక్తంగా వివాహం జరిపించారు. వివాహ సమయంలో బడబకు మంగళస్నానం జరిపించినప్పుడు ప్రవహించిన నీరు అక్కడ బడబానదిగా ప్రవహించింది. వివాహానంతరం మృత్యువు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగం మహానలేశ్వరుడి పేరిట ప్రసిద్ధి పొందింది. అప్పటి నుంచి ఆ తీర్థానికి బడబానల తీర్థమనే పేరు వచ్చింది. మహానలేశ్వరుడు వెలసిన బడబానల తీర్థం భక్తులకు భుక్తి ముక్తిప్రదమైనది. - సాంఖ్యాయనపురావిశేషం..ఈశాన్య రాష్టమైన మేఘాలయలో ఉన్న అరుదైన శివాలయం ఇది. తూర్పు ఖాసీ కొండల ప్రాంతంలోని మావ్సిన్రామ్ గ్రామానికి చేరువలో దట్టమైన అడవిలోని ఒక కొండ గుహలో సహజసిద్ధంగా వెలసిన శివలింగాన్ని ఇక్కడి ప్రజలు తరతరాలుగా పూజిస్తున్నారు. సున్నపురాతి గుహ పైకప్పు నుంచి రాలిన నీటిబిందువులు గట్టిబడి శివలింగం ఆకారం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, స్థానికులు మాత్రం దీనిని స్వయంభూ లింగంగానే భావించి, పూజిస్తున్నారు. స్థానిక ఖాసీ ప్రజలు దీనిని ‘మావ్జిన్ బుయి’ శివలింగంగా వ్యవహరిస్తారు. ఏటా శ్రావణమాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే, మహాశివరాత్రి పూజలు కూడా ఘనంగా జరుగుతాయి. -
శుక్రవారం పవిత్రత వెనుక అసలు కారణం ఇదే!
వారం రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా, జీవన విధానంగా చూస్తే శుక్రవారం (జుమా)ప్రాధాన్యత అత్యంత విశిష్టమైనది. సూర్యుడు ఉదయించే రోజుల్లోకెల్లా అత్యుత్తమమైన దినంగా దీనికి గుర్తింపు ఉంది.ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం మానవాళికి, విశ్వానికి సంబంధించిన అనేక చారిత్రక ఘట్టాలు ఈ రోజుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ దినాన్ని ఆరాధనలకు, దైవ కారుణ్యాన్ని పొందడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు.దైవప్రవక్త ప్రబోధించిన హదీసుల ప్రకారం మానవజాతికి మూలపురుషుడైన ఆది మానవుడు (ఆదం సృష్టించబడింది, ఆయనకు అత్యున్నతమైన స్థానం లభించింది ఈ శుక్రవారం రోజే. అంతేకాదు, మానవాళికి సన్మార్గం వైపు దృష్టి సారించడానికి, కయామత్ (ప్రళయ దినం) సంభవించడానికి కూడా ఈ రోజే వేదిక కానుంది. ఈ విశిష్టమైన విషయాలను గుర్తుచేసుకోవడం ద్వారా మానవుడు క్రమశిక్షణతో, సత్కార్యాలు చేస్తూ దైవ కారుణ్యాన్ని పొందాలనేది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.ఈ రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు (సున్నత్లు)శుక్రవారం రోజున శారీరక శుభ్రతతో పాటు మానసిక ప్రశాంతతకుప్రాధాన్యతనిచ్చేలా కొన్ని ఆచారాలు సూచించబడ్డాయి.ఉదయపుప్రార్థనల్లో ప్రత్యేకతశుక్రవారం ఉదయం చేసే ఫజ్ర్ నమాజులో ప్రవక్త ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.స్నానం (గుస్ల్) పరిమళాలుఈ రోజున ్ర΄ûఢవయస్కులైన ప్రతి ఒక్కరూ శుభ్రంగా స్నానం చేయడం అత్యంత అవసరం. అలాగే మిస్వాక్ (దంతధావనం) ఉపయోగించడం, అందుబాటులో ఉన్న మంచి సుగంధ ద్రవ్యాలను (అత్తర్) ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఇది మనస్సుకు ఉల్లాసాన్ని ఇచ్చి, ఆరాధనలో ఏకాగ్రతను పెంచుతుంది.మసీదుకు త్వరగా వెళ్లడంజుమాప్రార్థన కోసం మసీదుకు ముందే చేరుకోవడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఎవరు ఎంత త్వరగా మసీదుకు చేరుకుంటే అంత గొప్ప దానధర్మాలు చేసిన ఫలితం లభిస్తుందని కథనాలు తెలుపుతున్నాయి.ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా వినడంఇమామ్ ప్రసంగిస్తున్న సమయంలో అత్యంత నిశ్శబ్దంగా, శ్రద్ధగా వినాలి. ఆ సమయంలో పక్కవారితో మాట్లాడటం, చివరికి ‘అల్లరి చేయకు’ అని అనడం కూడా ఆ క్షణపు ఏకాగ్రతను పాడుచేస్తుందని హెచ్చరించారు.ఆ ప్రత్యేకమైన ఘడియశుక్రవారం రోజున ఒక ప్రత్యేకమైన స్వల్ప సమయం ఉంటుంది. ఆ సమయంలో దైవాన్ని మనస్ఫూర్తిగా ఏ మంచి కోరిక కోరినా అది నెరవేరుతుందని, అల్లాహ్ తన దాసులప్రార్థనలను స్వీకరిస్తాడని ప్రవక్త తెలిపారు.ప్రవక్తపై దరూద్ పంపడంఈ రోజున దైవప్రవక్తపై అధికంగా దరూద్ షరీఫ్ చదవడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి. భక్తులు పంపే ఈ దరూద్ ఆయనకు చేరవేయబడతాయని ఇస్లామిక్ గ్రంథాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం అనేది కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కాదు... మనలోని ప్రతికూల ఆలోచనలను వదిలి, శారీరకంగా, మానసికంగా దైవానికి దగ్గరయ్యే ఒక పవిత్రమైన సమయం. ప్రశాంతతను, పుణ్యఫలాలను ప్రసాదించే ఈ రోజును ప్రతి ఒక్కరూ సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక మార్గం.– ముహమ్మద్ ముజాహిద్ -
లింగరూపం కాదు... యోగిగా దర్శనమిచ్చే శివక్షేత్రం ఇది!
సాధారణంగా శైవాలయాలలో పరమశివుడు లింగరూపంలో ఆరాధించబడతాడు. అయితే హేమావతి సిద్ధేశ్వర ఆలయంలో మాత్రం పరమశివుడు అత్యంత అరుదుగా దైవరూపంలో సిద్ధయోగిగా ఆసీనుడై దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి అపూర్వమైన విశిష్టతను కల్పించింది. భారతదేశంలోని అతి కొద్ది శైవాలయాలలో మాత్రమే కనిపించే ఈ రూపం శివుని యోగేశ్వర తత్త్వాన్ని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, భిక్షాటన స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ క్షేత్రం ఎక్కడ ఉందో, ఆ శిల్ప విశేషాలేమిటో తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పూర్వపు అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని హేమావతి గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత విశిష్టమైన శైవక్షేత్రాలలో ఒకటి. అద్భుతమైన నోళంబ శిల్పకళతో, ఆధ్యాత్మిక మహిమతో, అరుదైన శివస్వరూపంతో ఈ ఆలయం భారతీయ దేవాలయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.హేమావతి ఆలయ సముదాయం ఒక విశాలమైన చారిత్రక దేవాలయ సముదాయం. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయంతో పాటు దొడ్డేశ్వర ఆలయం మల్లేశ్వర ఆలయం విరూపాక్ష ఆలయం జైన బసదులు నందిమండపాలు వీరగల్లులు నాగశిలలు శాసనాలతోపాటుఅనేక శిల్ప సంపదలు దర్శనమిస్తాయి. ఇక్కడ లభించిన శాసనాలు నోళంబుల రాజకీయచరిత్ర వారి దానధర్మాలు ఆలయ నిర్వహణ సామాజిక జీవన విధానం, ఆ కాలపు సంస్కృతిపై సమాచారాన్ని అందిస్తున్నాయి.ఆలయ నిర్మాణం నోళంబ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. గర్భగుడి అంతరాలయం మహామండపం స్తంభాలు ద్వారబంధాలు మరియు గోపుర భాగాలు అత్యంత సూక్ష్మమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. స్తంభాలపై శివపార్వతి గణపతి కుమారస్వామి నంది భైరవుడు సప్తమాతృకలు యక్ష యక్షిణులు గంధర్వులు అప్సరసలు నర్తకులు సంగీత విద్వాంసులు పురాణ ఘట్టాలు పుష్పలతలు మకరాలు గజసింహాలు యాళులు, ఇతర అలంకార రూపాలు అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు నోళంబ కళాకారుల సృజనాత్మకతకు నిదర్శనాలుగా నిలిచాయి.గర్భగుడిలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తులో పశ్చిమాభిముఖంగా ఆసీనుడై దర్శనమిస్తుంది. చతుర్భుజుడైన స్వామివారి ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో త్రిశూలం ఇంకొక చేతిలో డమరుకం మరొక చేతిలో భిక్షాపాత్ర ఉన్నాయి. తలపై జటాజూటం, నుదుటిపై తృతీయ నేత్రం మెడలో పుర్రెల మాల చెవులలో కుండలాలు, యోగాసన భంగిమ శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిఫలింపజేస్తాయి. ఈ విగ్రహం శివుని యోగేశ్వర స్వరూపాన్ని సిద్ధి వైరాగ్యం జ్ఞానం, లోకక్షేమ భావనలను ఏకకాలంలో ప్రతిబింబించే అపూర్వ కళాఖండంగా నిలిచింది. హేమావతి ఆలయం భారత పురావస్తు సర్వే శాఖ పరిరక్షణలో ఉన్న జాతీయ ప్రాముఖ్యత గల స్మారక కట్టడంగా గుర్తింపు ΄÷ందింది. ఆలయ ప్రాంగణంలో లభించిన శిల్పాలు శాసనాలు, నంది విగ్రహాలు శిలాఖండాలు, పురాతన అవశేషాలు సంరక్షించబడి చరిత్ర పరిశోధకులకు పురావస్తు శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు విలువైన ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి.ఈ క్షేత్రంలో మహాశివరాత్రి, కార్తీకమాస ఉత్సవాలు, ఇతర శైవ పర్వదినాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యోగసాధనం, ధ్యానం, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను అందిస్తుంది.హేమావతి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది నోళంబుల రాజకీయ వైభవానికి భారతీయ శిల్పకళా సంపదకు శైవ తత్త్వానికి, దక్షిణ భారత చారిత్రక వారసత్వానికి చిరస్థాయి చిహ్నం. లింగరూపానికి భిన్నంగా మానవ రూపంలో సిద్ధయోగిగా పరమశివుడు కొలువై, భారతదేశంలోని విశిష్ట శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శాశ్వత కీర్తిని ΄÷ందిన ఈ అరుదైన క్షేత్రాన్ని సందర్శించి తీరవలసిందే!– జి.బి. విశ్వనాథ, ఎం.ఎ. హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ -
క్రీస్తు ఏలుబడి.. రక్షణకు మార్గం ఇదే!
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము చాటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి’ – (యెషయా 52:7)సమాధానపరుస్తూ ఇద్దరి మధ్య శాంతి సమాధానాలకు ఏకీభావానికి కృషి చేసేవారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఉగ్రత భరించుట కష్టమని ఇక తప్పక దేవునితో సమాధానపడమని విధేయంగా లోబడమని చెప్పుటను మించిన సువర్తమాన హెచ్చరికతో కూడిన బోధ వాక్యం మరొకటి ఏముంది? ఇలా రక్షణ సమాచారం అధికారికంగా అందుబాటులో ఉంచడం మేలైన విషయం. సకల యుగాలలో రాజైన అద్వితీయ సత్యదేవుడు ఇప్పుడైతే ఎలా ఏలుచున్నాడో అన్నది ఒక్కింత పరీశీలనగా చూస్తే, దేవుడు క్రీస్తు ద్వారా ఏలుచున్నాడు అన్నది అర్థమవుతూ ఉంది.యెహోవా ఇల్లుగా యెహోవా నామ ఘనత కొరకు సొలొమోను కంటె గొప్పవాడైన క్రీస్తు ఎంతో కష్టపడి ఇష్టంగా తన విలువైన రక్తం వెచ్చించి కట్టిన ఆత్మ సంబంధ మందిరమే క్రీస్తు సంఘం. దేవ దేవుని సంకల్పాన్ని గౌరవిస్తూ దేవుని సంకల్పమైన సంఘాన్ని గుర్తించి గౌరవించుట ద్వారా మనలను మనం గౌరవించుకున్నట్టే. ప్రభువైన క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉండి పాలించుటే దేవుని పాలన. ‘సీయోను – నీ దేవుడు ఏలుచున్నాడు’ అనుటలోని అర్థం పరమార్థం ఇదే. ఇప్పుడు సీయోను అనగా క్రీస్తు ప్రభువు వారి ప్రియమైన సంఘం అనగా అద్వితీయ సత్య దేవుని నివాస కేంద్రం. దేవుడు ఏలుబడి లేని చోటు అనేది ఆత్మ సంబంధమైన అనేకనేక కష్ట నష్టాలకు నెలవు కాబట్టే. . . దేవుని దగ్గరకొచ్చి దేవుని ఏలుబడికి తలవంచి ఒదిగి జీవించడం హెచ్చయిన ఘనమైన ఆశీర్వాదాలకు కారణమనేది ఆధ్యాత్మిక పండితుల అనుభవం సారం. గ్రంథ రాజపు విలువైన బోధలకు తలవంచుట మినహా మరో మార్గం లేదు.క్రీస్తు సంఘమా, సర్వ జనాంగమా నిన్ను దేవుని పక్షాన క్రీస్తు ఏలుచున్నాడు అంటూ చెప్పువాని పాదములు సుందరమైనవి. పర్వతముల మీద స్థిర నివాసం, రాజస నడక అత్యున్నత స్థితిని, హోదాను చాటుతుంది. రాజులు, రాజ వంశీయులు, సాహసికులు ఎత్తయిన పర్వతముల మీదనే నివసిస్తూ నడుస్తారు. క్రీస్తు సువార్తను ప్రకటించుటను మించిన సాహసకార్యం మరొకటి లేదు. రాజులమైన భక్తులమైన మేము కాదు, నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడు అన్న సాహసోపేత సువార్త ప్రకటనతోనే వారి పాదములు ఎంతో సుందరములయ్యాయి.ఆత్మ సంబంధంగా చూస్తే యేసు సజీవుడగుసర్వోన్నతుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అను బండ మీద అనగా ఇట్టి విశ్వాసం మీద సంఘం కట్టబడింది. దీన్ని మించిన ఎత్తయిన స్థావరం మరొకటి లేదు. ఈ ఎత్తయిన ఘనమైన చోట నుండి సంఘం అనగా రాజులైన యాజక సమూహం సువార్త ప్రకటిస్తుంటే ఇహ లోక పాప సంబంధమైన మలిన మట్టి వారి పాదాలకు తాకక అంటక ఉన్నందున వారి పాదములు సుందరములు. ఎందుకంటే వారు ఎత్తయిన పర్వతం మీద బండ మీద వేసిన పునాది మీద అనగా యేసు అసాధారణ బోధల మీద వారు వారి జీవితాలను కట్టుకొని హుందాగా ఠీవిగా రాజసంతో నిలబడి ఉన్నారు. సంఘమా నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పగల సంసిద్ధులు, సాహసికులు ఎవరై ఉంటారు? దేవుని ఏలుబడికి ఎప్పుడూ విధేయులై ఉన్నవారే ఇలా చెప్పగలుగుతారు.– జేతమ్ -
నాయకుడు ఎలా ఉండాలంటే..?
రామాయణంలో వాల్మీకి రాజు ఏమి చెయ్యాలో చెప్పాడు.‘ప్రజాసుఖే సుఖం రాజ్ఞా ప్రజానాం చ హితే హితనాత్మప్రియం హితం రాజ్ఞాప్రజానం తు ప్రియం’... ఎంతో చక్కటి భావన.. రాజు తనకిష్టమైనది కాదు ప్రజలకిష్టమైనది చెయ్యాలి. మహాభారతంలో భీష్ముడు చెప్పిన పది ముఖ్య లక్షణాలు నేటి ఆధునిక పాఠ్య పుస్తకాలలో ప్రధానాంశాలుగా చోటు చేసుకున్నాయంటే అతిశయోక్తి లేదు.నాయకుడు/రాజు ఎలా ఉండాలి అనే విషయంలో మన నీతి కవులు చెప్పిన ముఖ్యమైన పద్యాలు ఇవే:రాజు, నాయకుడి బాధ్యతను, స్థానబలాన్ని నొక్కి చెప్పాడు వేమన.చేకొనుచును తనకు జేరి సాగినంతలోజెడిన ప్రజల రక్షసేయకున్నతనదుసాగుటేమి తనతనువదియేమివిశ్వదాభిరామ వినుర వేమభావం: తనను నమ్మి ఆశ్రయించిన ప్రజలను, చెడిపోయిన సమయంలో రక్షించని నాయకుడి అధికారం, జీవితం వ్యర్థం. ప్రజా రక్షణే నిజమైన నాయకత్వం.మరొకటి – శత్రువు పట్ల కూడా ఔదార్యం ఉండాలి..చంపదగిన యట్టి శత్రువు తన చేతజిక్కెనేని కీడు సేయ రాదుపొసగ మేలు జేసి పొమ్మనుటే చాలు!విశ్వదాభిరామ వినర వేమభావం: నాయకుడు క్షమాగుణం కలిగి ఉండాలి. చేతిలో చిక్కిన శత్రువును కూడా క్షమించి మేలు చేసి పంపాలి.దీనికి ఒక మంచి ఉదాహరణ.. పురుషోత్తముడనే రాజు యుద్ధం లో అలెగ్జాండర్ను క్షమించి వదిలి వేయుట.బద్దెన రాజు/నాయకుడి ధర్మం, ప్రజాపాలన గురించి చాలా స్పష్టంగా చెప్పాడు.రాజు హద్దు దాటితే:నరపతులు మేఱ దప్పిన,దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్,గరణము వైదికుడైనను,మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!భావం: రాజు ధర్మం తప్పి ప్రవర్తిస్తే, విధవ ఇంట పెత్తనం చేసినా, వైదికుడు కరణం చేసినా – అవి ప్రాణాంతకం అవుతాయి తప్ప మంచిది కాదు. నాయకుడు ధర్మం తప్పకూడదు.మంచి రాజు లక్షణం ఏమిటంటేదగ్గర కొండెము సెప్పెడు పెగ్గడ పలుకులకు రాజు ప్రియుడైమరిత నెగ్గు ప్రజ కాచరించు బగ్గులకై కల్పతరువు బోదచుట సుమతీకొండెగాళ్ల మాటలు విని ప్రజలకు అన్యాయం చేసే రాజు, బొగ్గుల కోసం కల్పతరువును నరికినంత తెలివితక్కువవాడు. నాయకుడు నిజానిజాలు పరిశీలించాలి.మాటకు బ్రాణము సత్యముకోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్బోటికి బ్రాణము మానముచీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీఒక రాజ్యం/కోటకు బలమైన సైన్యమే ప్రాణం. నాయకుడు రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.ఇక భర్తృహరి ఏమి చెప్పాడంటే... శ్లోకం: విపది ధైర్యమథాభ్యుదయే క్షమాసదసి వాక్పటుతా యుధి విక్రమః ’యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌప్రకృతిసిద్ధమిదం హి మహాత్మానామ్’భావం: ‘కష్టాల్లో ధైర్యంగా ఉండటం, విజయ సమయంలో క్షమ కలిగి ఉండటం, సభలో వాక్పటిమ, యుద్ధంలో పరాక్రమం, కీర్తిపై ఆసక్తి, శాస్త్రశ్రవణంలో వ్యసనం – ఇవన్నీ మహనీయులైన నాయకుల సహజ గుణాలు.మరొక ముఖ్యమైన భావం‘ప్రజలను పశువుల వత్సంలా ప్రేమగా పోషిస్తే, భూమి కల్పలతలా అనేక ఫలితాలను ఇస్తుంది‘. ఇది కేవలం రాజులకే కాదు, నాయకత్వం వహించే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.భాస్కర శతకంలో నేరుగా ‘నాయకుడు అనే పద్యం ప్రసిద్ధంగా లభించలేదు. కానీ భాస్కరుడు కూడా నీతి, ధర్మం, వినయం గురించి చెప్పాడు.నాయకుడు అహంకారం లేకుండా, విద్యావంతుడై, దానగుణం కలిగి, ప్రజాహితం కోసం పనిచేయాలి. ‘అధికారం వచ్చినా వినయంగా ఉండాలి‘ అనేది భాస్కరుడి ప్రధాన సందేశం.దేశానికి రాజు కాని, సంస్థకి అధిపతి కాని ఎన్నో సమస్యలను ఎదుర్కొని అడుగు వెయ్యాలి... బాహ్య పరిస్థితి.. లోలోపల పరిస్థితి... అన్నింటిని మించి అనిశ్చిత వాతవరణంలో దేశ భద్రత, ప్రజల సంక్షేమం, బాగోగులు, ఆర్థికంగా నిలబడ్డం... ఇలా ఎన్నో సవాళ్ళు.. ప్రజాఅభిమానాన్ని చూరగోనె ప్రయత్నం.. సత్సంబంధాలు తో బాటు సజావుగా సాఫీగా ఉండాలి పరిపాలన... ఎన్నో మంచి అలవాట్లతో నీతిగా అందించాలి పరిపాలన. అందుకు మంచి నాయకుడు కావాలి. ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలతో నడుం కట్టి అడుగు ముందుకెయ్యాలి.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
మోక్షాన్ని ప్రసాదించే ముక్తినాథ్
భారతీయ సంస్కృతిలో తీర్థయాత్ర కేవలం ఒక పర్యటన కాదు. అది మనస్సును, ఆత్మను పరమాత్మతో అనుసంధానించే పవిత్రసాధన. యాత్రలకి వెళ్ళేముందు, ఆయా క్షేత్రాల వెనుకనున్న పురాణగాథల్ని తెలుసుకుని వెళితే, ఆ ప్రదేశాలలోని పవిత్ర స్థలాల ఉనికి,ప్రాముఖ్యతను ప్రత్యక్షంగా చూడటం చేత, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సనాతన ధర్మ పురాణ, ఇతిహాసాల పట్ల దృఢ విశ్వాసం ఏర్పడుతుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించటం అదృష్టం. అటువంటి క్షేత్రాలలో నేపాల్లోని ముక్తి క్షేత్రం (ముక్తినాథ్) వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య క్షేత్రాలలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.నేపాల్లోని ముస్తాంగ్ జిల్లాలో రాణీ΄ûవా గ్రామంలో సముద్రమట్టానికి సుమారు 3,710 మీటర్ల ఎత్తులో (12,470 అడుగులు) హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వత శ్రేణుల మధ్య ఈ ఆలయం ఉన్నది. అష్టాదశ పురాణాల్లో ఒకటైన స్కాంద పురాణంలోని హిమవత్ఖండంలో, ముక్తిక్షేత్రం వెనుక ఉన్న వృత్తాంతం అత్యంత రమణీయంగా చెప్పబడింది.పూర్వం రాక్షసరాజు జలంధరుడు బ్రహ్మ మొదలైన వారినుంచి, తపఃఫలంగా వరాలు పొంది, ఆ అహంకారంతో ముల్లోకాలను పీడించాడు. దేవతలు మొరపెట్టుకున్నా అతనినేమీ చేయలేకపోయారు. కారణం, అతని భార్యయైన బృంద (తులసి) నిరుపమానమైన పాతివ్రత్య శక్తి, అతనికి చావు లేకుండా చేసింది. ఆమె పరమ ధార్మికురాలు. లోకకల్యాణం కోసం, పరమశివుడు, జలంధరుడిని వధించేందుకు వీలుగా, శ్రీమహావిష్ణువు జలంధరుడి వేషంలో బృంద వద్దకు వెళ్ళి, ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు. జలంధరుడి మరణ వార్త విన్న బృంద, తీవ్రమనస్తాపంతో, శ్రీమహావిష్ణువును భూమిపై పాషాణ రూపాన్ని పొందాలని శపిస్తుంది.బృంద ఇచ్చిన శాపాన్ని భగవంతుడు శిరసావహించాడు (శాప ప్రభావం వలన విష్ణువు నేపాల్లోని కాళీగండకీ నదీ తీరంలో నల్లని సాలగ్రామ శిలలుగా అవతరించాడు. పెద్ద పెద్ద సాలగ్రామ శిలలు నదీ తీరం వెంబడి ఇప్పటికీ విష్ణుస్వరూపంలో దర్శనమిస్తాయి.రాతి రూపం నుండి, శాప విముక్తి కోసం విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు ముగిశాక స్వామికి ముక్తి లభించింది. భగవంతుడికే ముక్తిని ప్రసాదించిన క్షేత్రం కాబట్టి ఈ పవిత్ర ప్రదేశానికి ముక్తిక్షేత్రం అనే పేరు వచ్చింది.చతుర్ముఖ (బ్రహ్మ) బృందాదేవికి మోక్షాన్ని ప్రసాదించి, భూమిపై తులసి రూపంలో సేవింపబడుతూ, గండకీ నది ప్రవహిస్తుందని వరమిచ్చాడు. అంతేగాక, శ్రీమహావిష్ణువు గండకీ నదిలో లభించే సాలగ్రామ శిలల రూపంలో యుగయుగాలపాటు, భక్తులకు దర్శనమిస్తాడని ప్రకటించారు.ఇక్కడ లభించే సాలగ్రామ శిలలకు మరలప్రాణ ప్రతిష్ఠ అవసరం లేకుండానే పూజించవచ్చని చెబుతారు. సాలగ్రామ ఆరాధన ఇంటికి ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదిస్తుందని విశ్వాసం. ఇక ముక్తినాథ్ ఆలయం చిన్నదైనా,ప్రాంగణం చాలా పెద్దది. ఆలయం ముందు పాపకుండం, పుణ్యకుండం అని రెండు కొలనులుంటాయి.ఈ కుండాల్లోని అతిశీతలమైన జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, దేవాలయం వెనుక వలయాకారంలో ఉన్న 108 గోముఖ జలధారల్లో స్నానమాచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామి దర్శనం చేసుకుంటారు. గోముఖాల నుండి వచ్చే హిమాలయ తీర్థం సర్వపాపాల్ని హరిస్తుందని పురాణ కథనం.సనాతన ధర్మానికి చెందిన భక్తులు, ముక్తినాథుని మోక్షప్రదమైన దివ్యక్షేత్రంగా భావిస్తే, బౌద్ధులు దీనిని ‘చుమిగ్ గ్యాత్సా’ (వంద జలధారల స్థలం) గా భావించి అత్యంత పవిత్రమైన తీర్థంగా పూజిస్తారు. ఆవిధంగా ఈ క్షేత్రం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆలయ సేవా కార్యక్రమాలలో హిందూ అర్చకులతోపాటు, బౌద్ధ సన్యాసినులు సన్యాసులు కూడా పాల్గొనటం విశేషం. భిన్నమైన ఆరాధన పద్ధతులున్నప్పటికీ, ఒకే మూర్తిని, పవిత్రస్థలాన్ని పరస్పర గౌరవ విశ్వాసాలతో ఆరాధించటం ముక్తినాథ్ ప్రత్యేకత.ముక్తినాథ్ ఎలా చేరుకోవాలి?గోరఖ్పూర్ నుంచి సునోలి సరిహద్దు దాటి నేపాల్లోకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. సునోలి నుండి పోఖ్రా మీదుగా సుమారుగా 300 కి.మీ. రోడ్డుమార్గంలో ప్రయాణించి ‘జోమ్సోమ్’ చేరి, అక్కడి నుండి సుమారుగా 38 కి.మీ. దూరం వెళ్ళి, అక్కడినుంచి మెట్ల మార్గంలో (300 మెట్లు) కానీ, గుర్రాలు, డోలీలలో కానీ ప్రయాణించి ముక్తినాథ్ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ పర్వతప్రాంతం అధిక ఎత్తులో ఉండటంతో, ఆక్సిజన్ తక్కువగా వుంటుంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి.ఈ క్షేత్రానికి సులువుగా, త్వరగా చేరాలనుకుంటే, ఢిల్లీ నుండి ఖాట్మండుకి విమానంలో వెళ్ళి, అక్కడి నుండి జోమ్సోమ్కి విమానంలో చేరుకోవచ్చు.ముక్తినాథ్ క్షేత్రానికి అతిదగ్గరలో ‘జ్వాలామాయి’ ఆలయం శక్తీక్షేత్రం వుంది. బ్రహ్మదేవుడు ముక్తిక్షేత్రంలో ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం నుండి విష్ణుమూర్తి జలరూపంలో 108 ముక్తి ధారలుగానూ, శివుడు అగ్ని రూపంలో, నిరంతరం వెలిగే జ్వాలగా, ఉండిపోయారు. అందుకే జ్వాలామయి ఆలయంలో నీటి బుగ్గపై అగ్నిజ్వాల వెలగడం మనకు కనిపిస్తుంది. ముక్తినాథ్ ఆలయప్రాంగణం, భక్తిని, ప్రకృతిని, పవిత్రతను ఒకేకాలంలో ఆస్వాదించే అపూర్వ క్షేత్రం. ఒకవైపు నీలగిరి, మరొకవైపు ధవళగిరి పర్వతాలు మంచుతో కప్పబడి ఆహ్లాదాన్ని అందిస్తాయి.– దావూలూరి రామకృష్ణ శర్మ, ఆధ్యాత్మిక పర్యాటకులు -
జ్ఞానం పంచితేనే పెరిగే సంపద
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహైతేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిఃతైత్తిరీయోపనిషత్తులోని శాంతి మంత్రం ఇది. పూర్వం విద్యాభ్యాసానికి ముందు ప్రతి దినం గురు శిష్యులు ముక్తకంఠంతో ఈ శ్లోకాన్ని పఠించేవారు. ‘మనం కలిసి మెలిసి ఉందాము. కలిసి మెలిసి ఫలితాలను అనుభవిద్దాము. కలిసి పనులను చేస్తూ తేజో పూర్ణుల మవుదాము. మనలో మనకు వైషమ్యాలు ఉండకుండు గాక. శాంతితో విలసిల్లుదాము’ అని చేసే ఉత్తమ ప్రార్థన ఇది.ఈ ప్రార్థన గురుశిష్యు లిరువురి మనస్సులో నిక్షిప్తమై ఉండేది. ఇరువురు కలిసి విజ్ఞాన కృషి సలపాలి. కలిసి విజ్ఞాన ఫలం పొందాలి. గురు శిష్యుల మధ్య విబేధాలు లేకుండా శాంతియుతంగా విజ్ఞానార్జన చేయాలి అనే సమభావన; గురువును శిష్యుడు, శిష్యుని గురువు పరస్పరం గౌరవించుకునే ఉన్నత భావన ప్రాచీన విద్యావిధానంలో కనిపిస్తుంది. అప్పుడు విద్య అంటే గురు శిష్యు లిద్దరు కలిసి చేసే నిత్య సత్య శోధనా యత్నం.విద్య నిరంతర ప్రవాహం. పరంపరా గతంగా విస్తరించేది. గురువు నుండి శిష్యుడు నేర్చుకున్న విద్య, సంస్కారం తర్వాత మళ్ళీ తన శిష్యులకు అందజేస్తాడు. ఆ శిష్యుల నుండి తరవాతి వారికి అలా అందుతూనే ఉంటుంది. ఇది నిరంతర జ్ఞానగంగా ప్రవాహం. ఇచ్చే కొద్దీ పెరిగే సంపద జ్ఞాన సంపద. ఆనాడు గురు శిష్య సంబంధాలు ఎంత ఆదర్శంగా ఉండేవో, జ్ఞానార్జన ఎలా సాగేదో ఈ శ్లోకం చెబుతోంది.– డా. చెంగల్వ రామలక్ష్మి -
జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడుంటాడో ఆచూకీ చెప్పండి..
జునాయెద్ అనే వ్యక్తి ఒక సూఫీ సాధువు దగ్గరకు వచ్చాడు. ‘నాకు జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడ ఉంటాడో ఆచూకీ చెప్పండి’ అని అడిగాడు. ‘ముందు మక్కాకు వెళ్ళు. తీర్థయాత్ర చెయ్యి. ఎవరి కళ్లయితే కాంతులు విరజిమ్ముతుంటాయో, ఎవరి దేహం నుంచి కస్తూరి పరిమళం వస్తూ ఉంటుందో అతడే నీ గురువు. వెళ్ళి వెతుకు’ అన్నాడు.జునాయెద్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. 20 ఏళ్లు గడిచాయి. చివరికి ఒక చెట్టు కింద ఒకరిని చూశాడు. సూఫీ సాధువు చెప్పిన లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. జునాయెద్ ఆయన పాదాలపై పడి, ‘గురుదేవా, 20 ఏళ్ళుగా మీ కోసమే వెతుకుతున్నాను’ అని ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. ఆ సాధువు కూడా ‘నేనూ 20 ఏళ్ళుగా నీ కోసమే చూస్తున్నాను. నన్ను సరిగ్గా చూడు’ అన్నాడు.జునాయెద్ ఎగాదిగా చూశాడు. తీరా 20 ఏళ్ళ క్రితం తనకు గురువు ఆచూకీ చెప్పి పంపిన ఆ మనిషే ఈయన! ‘ఇదేంటి? నాతో ఆటలాడారా? నా 20 ఏళ్ల కాలం వృథా అయిపోయింది. మీరే నా గురువు అని ఆ రోజే ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు. ‘ఆ రోజే నేను చెప్పి ఉండవచ్చు. కానీ గురువును గుర్తుపట్టే కళ్ళు ఆ రోజు నీకు లేవు. ఈ 20 ఏళ్ల వెతుకులాట నీకు ఆ కళ్ళను ఇచ్చింది. ఈ ఇరవై ఏళ్ళు నిన్ను మెరుగుపరిచాయి. ఈ కస్తూరి వాసన ఆ రోజు కూడా ఉంది. కానీ దాన్ని గుర్తించే శక్తి ఆ రోజు నీకు లేదు’ అన్నాడు.నమ్మకం లేకపోతే గురువును సమీపించలేం. ఓపికతో వేచి ఉంటే, అపారమైన సహనం ఉంటే, ఏదో ఒక రోజు మార్గ నిర్దేశకుడు కనిపిస్తాడు. సత్యాన్ని వారసత్వంగా పొందలేం. దాని కోసం ఎవరికి వారు శ్రమించాలి. ఒక శిష్యుడిగా మారాలి. కఠినమైన క్రమశిక్షణ పాటించాలి. అది వ్యక్తిగత ప్రయాణం. వెతుకులాటే పరిపక్వత తెస్తుంది. అన్వేషణ ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలరు. – యామిజాల జగదీశ్ -
అతి నుంచి ఆత్మోన్నతికి!
గోపాల్ అనే ఒక శిల్పి చాలా బాగా విగ్రహాలు చెక్కేవాడు. కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది అదే ‘అతి ఆలోచన.’ ఒకరోజు అతనికి ఒక పెద్ద దేవాలయం నుంచి అమ్మవారి విగ్రహం చెక్కే అవకాశం వచ్చింది. దానికి చాలా మంచి పారితోషికం కూడా ఇస్తామన్నారు. గోపాల్ ఇంటికి వచ్చి ఆలోచించడం మొదలుపెట్టాడు. ‘ఈ విగ్రహం చాలా అద్భుతంగా రావాలి... ఒకవేళ చెక్కేటప్పుడు రాయి పగిలిపోతే? ఊరిలో నా పేరు పోతుందేమో! ప్రజలు నన్ను చూసి నవ్వుతారేమో! నేను విజయవంతంగా పూర్తి చేయగలనా?’’ ఇలా ఆలోచనలతోనే రోజులు గడిపాడు. భయం, ఆందోళన పెరిగిపోయాయి. చేతిలో ఉలి పట్టుకోవడానికే భయపడి, రోజు రోజుకీ పనిని వాయిదా వేస్తూ వచ్చాడు.ఒకరోజు ఊరి చివర ఉండే ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్లాడు గోపాల్. తన మనసులోని అతి ఆలోచనలను, భయాలను గురువుతో చెప్పుకున్నాడు. గురువు చిరునవ్వు నవ్వి, ఒక ఖాళీ కుండను, కొద్దిగా నీటిని గోపాల్ చేతికి ఇచ్చి, ‘ఈ కుండను నీటితో నింపు’ అన్నారు.గోపాల్ కుండ కింద పడిపోతుందేమో, నీళ్లు ఒలికిపోతాయేమో అని అతిగా ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా, భయపడుతూ మెల్లగా నీళ్లు పోస్తున్నాడు. గురువు వెంటనే,‘గోపాల్, నువ్వు నీళ్లు పోసేటప్పుడు నీ దృష్టి అంతా ‘నీళ్లు ఒలికిపోతాయేమో’ అనే భయం మీద ఉంది. అందుకే నీ చెయ్యి వణుకుతోంది. నీ పని కేవలం కుండలో నీళ్లు పోయడం (అంటే ఆచరణ). నీళ్లు ఒలికినా పరవాలేదు, మళ్లీ పోయవచ్చు. ఫలితాన్ని దేవుడికి వదిలేసి, ప్రస్తుతం నీ చేతిలో ఉన్న ఆ ఒక్క చిన్న పని మీద మాత్రమే దృష్టి పెట్టు. దాన్నే భగవద్గీతలో ‘కర్మయోగం’ అంటారు’ అని చె΄్పారు.గోపాల్కి జ్ఞానోదయమైంది. తన అతి ఆలోచనలు లౌకికమైన ‘భయం, అహం (పేరు పోతుందేమో అనే భావన)’ నుంచి వస్తున్నాయని గ్రహించాడు. ఆలోచించడం ఆపి, ఆధ్యాత్మిక భావనతో (పనిని దేవుడికి అర్పించే భక్తితో) మరుసటి రోజే ఉలి, సుత్తి చేతపట్టాడు. ఫలితం ఎలా వచ్చినా సరే, నా వంతు కృషి నేను చేస్తాను’ అని మనస్ఫూర్తిగా చెక్కడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతను తన జీవితంలోనే అత్యంత అందమైన విగ్రహాన్ని తయారు చేశాడు. అతి ఆలోచనలు మనల్ని భయానికి గురిచేసి ముందడుగు వేయనివ్వవు. కానీ ఆధ్యాత్మికతతో కూడిన ఆలోచన మనకు ‘స్వీకరణ భావాన్ని’, ఫలితం మీద ఆశ లేని ధైర్యాన్నిస్తుంది. ఆలోచనలకు ఆచరణ తోడైతే విజయం తథ్యం. ఆలోచన ఒక ఆయుధం అయితే, ఆధ్యాత్మికత దానికి సరియైన దిశానిర్దేశం చేస్తుంది. ఆలోచన ఆధ్యాత్మికమైనప్పుడు, పొందే ప్రశాంతత మానసిక ఉన్నతికి, సాధించే విజయం ఆత్మోన్నతికి దారితీస్తాయి.... – తరిగొప్పుల వి ఎల్లెన్ మూర్తితపస్సు అంటే..?అమృత బిందువులు→ తపస్సు అంటే అడవికి పోయి పండ్లు, దుంపలను తింటూ నివసించడం కాదు. తమ భావాలను, ఆలోచనలను నియంత్రించడమే నిజమైన తపస్సు.→ ఎక్కడ ఉన్నా, ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచించడమే నిజమైన తపస్సు.→ ఆలోచనలు, మాటలు, పనులలో సమానత్వాన్ని సాధించడమే తపస్సు ముఖ్య లక్షణం.→ ఆనందం, దుఃఖం, లాభం నష్టం, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి.→ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సమాజానికి సేవ చేయాలి, కోరిక లేని స్థితికి చేరుకోవాలి. అదే నిజమైన తపస్సు. -
అతిథి... అనుబంధాల అక్షయపాత్ర!
ఈ అనంత విశ్వ గమనంలో మానవుడు కేవలం ఒక వ్యక్తి కాదు, అతడొక సామాజిక అనుబంధాల సంగమ స్థానం. భారతీయ జీవన వేదంలో ఆతిథ్యం అనేది కేవలం ఒక బాధ్యత కాదు, అది ఒక అనురాగ మంత్రం. మన సంస్కృతి విశ్వానికి అందించిన మహోన్నత సందేశం ‘అతిథి దేవో భవ’. అంటే గడప తొక్కిన వ్యక్తిని దైవ స్వరూపంగా దర్శించడం. ఆతిథ్యం, ఉపకారం– ఈ రెండూ ఉన్నతోన్నత సంస్కారానికి నిలువెత్తు తార్కాణాలు. ఒకరికి ఆతిథ్యమిచ్చే అవకాశం రావడం, మరొకరికి ఉపకరించే సందర్భం దొరకడం అనేది మనిషి చేసుకున్న గొప్ప అదృష్టం. పరిచయం లేని వ్యక్తిని కూడా ఆత్మీయంగా అక్కున చేర్చుకోగల ఈ గుణమే సామాన్యుడిని సైతం ‘మనీషి’గా రూపాంతరం చెందిస్తుంది.శ్రీరామచంద్రుని అచంచలమైన ప్రేమను పొందిన నిషాదరాజు గుహుడి గాథ ఇందుకు ఒక అద్భుత నిదర్శనం. రాజభోగాలను వదిలి కారడవుల పాలైన రాముడిని, గంగా తీరంలో గుహుడు సాదరంగా ఆహ్వానించాడు. అది రాజకోటలో దొరికే విందు కాదు, ఒక సామాన్య అడవి బిడ్డ హృదయం నుండి ఉబికిన ఆత్మీయ ఆలింగనం. ఆ కష్టకాలంలో గుహుడు అందించిన నిస్వార్థమైన ఆతిథ్యాన్ని, ఆత్మీయమైన ఉపకారాన్ని రాముడు తన జీవితాంతం మరువలేదు. అందుకే అయోధ్యకు తిరిగి వెళ్లే సమయంలోనూ, గుహుడు నా ‘ఆత్మసఖుడు’ అని పలికి, హనుమంతుడి ద్వారా ప్రత్యేకంగా క్షేమవార్తలు పంపాడు. ఆటవికుడైనా సరే, ఆతిథ్యమనే ఉత్తమ మనస్తత్వం ఉంటే సాక్షాత్తు ఆ పరమాత్ముని హృదయంలోనే శాశ్వత స్థానం సంపాదించుకోవచ్చని గుహుడు నిరూపించాడు. పదార్థం ఏమున్నదనేది కాదు, పరిమళించే భావం ఏమిటనేదే ఆతిథ్యపు పరమార్థం.‘వసుధైవ కుటుంబకం’ అనేది మన నినాదం మాత్రమే కాదు, అది మన ఆత్మగౌరవం. ఆతిథ్యం కేవలం ఆహారాన్ని అందించడం కాదు, ఆత్మీయతను పంచడం. అలసిపోయిన బాటసారికి చెట్టు నీడ ఎంతటి సేదను ఇస్తుందో, ఆపదలో ఉన్న గుండెకు మన ఆత్మీయమైన పలకరింపు అంతటి ప్రాణవాయువును అందిస్తుంది. ఎదుటివారికి ఉపకరించే స్థితిలో మనం ఉన్నామంటే, అది మన శక్తి కాదు.. మనకు లభించిన ఒక దివ్యమైన అవకాశం. వైఫల్యం ఎదురైనప్పుడు మనల్ని రక్షించేది మన సంపద కాదు, మనం సంపాదించుకున్న నమ్మకమైన గుండెలే. చీకటిలో తోడుండే నీడలా, ఎడారిలో దొరికే సెలయేరులా ఆత్మీయ బంధాలు మనిషిని బతికిస్తాయి.ఆత్మీయత లేని విందు ఆత్మ లేని శరీరం వంటిది. మన గడప తొక్కే ప్రతి అతిథిలో ఆ పరమాత్మను దర్శిద్దాం, ప్రతి ఉపకారంలోనూ సార్థకతను వెతుక్కుందాం. మానవత్వమే మార్గంగా, మమకారమే ప్రాణంగా లోకకల్యాణం కోసం అడుగులు వేద్దాం.లోపల అహంకారం లేని ఆత్మీయతే ఈ ప్రపంచాన్ని నడిపే ఇంధనం. గూడు లేని పక్షికి కొమ్మ ఆసరా అయినట్లు, గమ్యం తెలియని ప్రయాణికుడికి మన ఆత్మీయత ఒక వెలుగు బాట కావాలి. సముద్రపు అలలు తీరాన్ని తాకినట్లు, మన ప్రేమ ఎదుటివారి హృదయాన్ని తాకాలి. అపరిచితులను కూడా ఆత్మీయులుగా మార్చుకోగల గుణమే మన భారతీయతకు అసలైన సంతకం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
అశ్వనీకుమారుల శాపవిమోచనం!
పూర్వం భరద్వాజ వంశంలో సుతపుడు అనే విప్రుడు ఉండేవాడు. శ్రీహరి భక్తుడైన అతడు హిమాలయాలపై నివసించేవాడు. శ్రీకృష్ణుడి ప్రీతి కోసం హిమాలయాలలో అతడు సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. తపస్సు కొనసాగిస్తున్న సుతపుడు బ్రహ్మతేజంతో వెలుగొందసాగాడు. గగనమార్గంలో సంచరించే దేవ గంధర్వ కిన్నర కింపురాషుదులు సుతపుడి తపోనిష్ఠకు, అతడి తేజస్సుకు విస్మయం చెందేవారు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సుతపుడికి సాక్షాత్కారమిచ్చాడు.‘వత్సా! నీ తపస్సుకు సంతసించాను. వరమేదైనా కోరుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడి దర్శనం కలగడంతో సుతపుడు పరమానంద పరవశుడయ్యాడు. శ్రీకృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేసి, వేనోళ్ల స్తుతించాడు.‘ప్రభూ! నేను ఆత్మనిష్ఠుడను. నాకు మోక్షం అక్కర్లేదు. అనునిత్యం నీ సన్నిధిలో ఉండేలా అనుగ్రహించు. నీ పట్ల అనన్య దాస్యభక్తిని ప్రసాదించు. అంతే చాలు!’ అని కోరుకున్నాడు.‘మునివర్యా! ముందుగా నువ్వు వివాహమాడు. సంసార జీవితంలో నీ ప్రారబ్ద కర్మలు క్షీణించిన తర్వాత నీకు నా దాస్యభక్తి తప్పక లభించగలదు’ అని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు.సుతపుడు తనకు తగిన వధువు కోసం అన్వేషిస్తూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడు అతడికి పితృలోకానికి చెందిన మానసి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్నాళ్లకు మానసి గర్భం దాల్చింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. సుతపుడు ఆ బాలుడికి కల్యాణమిత్రుడు అని నామకరణం చేశాడు. కల్యాణమిత్రుడు అశ్వనీదేవతల అనుగ్రహంతో జన్మించాడు. సుతపుడు ఈ సంగతిని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే తన భార్యను విడిచిపెట్టాడు. అశ్వనీదేవతలపై ఆగ్రహం చల్లారక ‘నాకు ద్రోహం తలపెట్టిన మీరు రోగగ్రస్తులవుతారు.మీకు యజ్ఞయాగాదులలో హవిర్భాగాలకు అర్హత లేకుండా పోతారు’ అని శపించాడు. తర్వాత కొడుకును వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సుతపుడి శాప ఫలితంగా అశ్వనీదేవతలు రోగగ్రస్తులయ్యారు. యజ్ఞయాగాదులలోని హవిర్భాగాలు దక్కక వారు బలహీనులైపోయి నానాటికీ క్షీణించసాగారు. దేవవైద్యులైన అశ్వనీకుమారులే రోగులుగా మారడంతో దేవలోకంలో కల్లోలం రేగింది. శాపవశాన సోకిన వ్యాధిని నయం చేసుకునే మార్గం తోచక అశ్వనీదేవతలు తమ తండ్రి సూర్యభగవానుడి వద్దకు వెళ్లి, తమ గోడు చెప్పుకున్నారు. సూర్యుడు వారిద్దరినీ సుతపుడి వద్దకు తీసుకుపోయాడు.‘మునిపుంగవా! నా తనయుల అపరాధాలను మన్నించు. నీవంటి సద్బ్రాహ్మణుడు సంతుష్టుడైతే సాక్షాత్తు శ్రీహరి సంతుష్టుడవుతాడు. శ్రీహరి సంతుష్టుడైతే, సకల దేవతలూ సంతుష్టులవుతారు. కాస్త దయ చూపు. నా తనయులకు శాపవిమోచనం కల్పించు’ అని అభ్యర్థించాడు.సూర్యభగవానుడి ప్రార్థనకు సుతపుడి మనసు కరిగింది. కాసేపు ఆలోచనలో పడ్డాడు. తన తపోబలంతో అశ్వనీదేవతలకు తక్షణమే రోగ విముక్తులను చేశాడు.‘దివాకరా! త్వరలోనే నీ తనయులకు యజ్ఞ యాగాదులలో హవిర్భాగాలు పొందే యోగ్యత కూడా లభిస్తుంది’ అని పలికాడు.సుతపుడి సహృదయానికి సూర్యుడు వేనోళ్ల కీర్తించాడు. ‘శ్రీహరి భక్తులైన నీవంటి సద్బ్రాహ్మణులే లోకాలకు వెలుగు చూపగలరు. నా తనయులకు శాపవిమోచనం కలిగించావు. ధన్యోస్మి!’ అని పలికాడు.రోగ విముక్తులైన అశ్వనీదేవతలు ఆనంద బాష్పాలతో సుతపుడికి సాష్టాంగపడ్డారు. అశ్వనీదేవతలకు శాపవిమోచనం కలిగించాక సుతపుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరానికి బయలుదేరాడు. సూర్యుడు తనయులతో కలసి తన స్వలోకానికి బయలుదేరాడు.- సాంఖ్యాయన -
సంకటాలు తొలగించే ‘చతుర్థి’
సంకష్టహర చతుర్థనే సంకట హర చతుర్థి అని కూడా అంటారు. ప్రతినెలా కృష్ణపక్షంలో నాలుగో రోజున వచ్చే పర్వదినా న్ని సంకష్టహర చతుర్థగా పిలుస్తా రు. ఈరోజున గణపతి పూజలు, నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి లాగానే ప్రతినెలాలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని జరుపుకోవడం వ ల్ల భరించలేని కష్టాలు, విఘ్నాలు, ఆటంకాలు తొ లగిపోతాయని, సుఖశాంతులు, సిరిసంపదలు పొందుతామని భక్తులకు నమ్మకం. అలాగే మంగళవారం వచ్చే ‘అంగారక చతుర్థి’ విశిష్టమైనదిగా భా విస్తారు. ఈ ఏడాది జనవరి, మే నెలలో మంగళవా రం వచ్చింది. సెపె్టంబర్ 29న మరోసారి మంగళవారం రానుంది. ఈరోజు ఉపవాసం ఉంటే 21 సంకష్ట చతుర్థులు చేసిన ఫలితం వస్తుందని నమ్ము తారు. ఎర్రని పువ్వులు, ఎర్రచందనంతో దైవాన్ని పూజిస్తే కుజదోషం పోతుందని పెద్దలు చెబుతారు. తెల్లవారుజామునుంచే.. మహిళలు ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు అలికి, వాకిలికి పసుపు రాసి, గడపకు మామిడాకుల తోరణం కడతారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం. మధ్యాహ్నం గణపతి ప్రతిమను అలంకరించి, పూజలు చేస్తారు.‘ఉండ్రాళ్లు’ నైవేద్యంగా పెడతారు. కొన్ని చోట్ల గారెలు కూడా చేస్తారు. అనంతరం ‘సంకష్టహర గణపతి వ్రత కథ’ చదువుకుంటారు. కథ అయిపోయాక చంద్రుడి దర్శనం చేసుకొని, మహిళలు ఉపవాసం విరమిస్తారు. గణపయ్యే సంకటాలు తొలగిస్తాడు.. మా కుటుంబం కోసం 11 సంకష్టహర చతుర్థి ఉపవాసాలు చేస్తానని మొక్కుకున్నాను. చతుర్థి రోజున చంద్రుడు వచ్చేదాకా పిల్లలతో కథ చెప్పుకుంటూ కూర్చుంటే ఆకలి కూడా తెల్వదు. గణపయ్య అన్ని సంకటాలు తొలగిస్తాడనే ధైర్యం. –కదం సంధ్యారాణి, ఆర్మూర్40 ఏళ్లుగా పూజ చేస్తున్నా.. సంకటహర చతుర్థి పూజలు 40 సంవత్సరాలుగా చేస్తున్నా. భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే పూజాఫలం చక్కగా ఉంటుంది. మా ఇంటి చుట్టుపక్కల వారు సాయంత్రం ప్రసాదం కోసం ఇంటికి వస్తారు. పండుగ అంటే అందరిదీ అనే ఫీలింగ్ ఇస్తుంది. –జంగం నాగమణి, ఆర్మూర్ మనసుకు ప్రశాంతత.. చతుర్థి రోజున ఫోన్ పక్క న పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడి పూజ చేసుకుంటా. ఉండ్రాళ్లు చేయడం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నా. ఆ రోజు ఉపవాసం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. –దాసరి అనిత, ఆర్మూర్ -
మాధవుడి మందిరంలో మన్మథుడికి చోటుందా?
దేవతలు తాగే అమృతం కావాలంటే, మందర పర్వతాన్ని మోసుకొచ్చి, దాన్ని కవ్వంగా చేసి, క్షీర సాగరాన్ని చేతులు పడిపోయేలా చిలకాలి. అది మహామహులకే తప్ప, మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అలాగని దిగులు అక్కర్లేదు. భక్త కవీంద్రుడు లీలాశుకుడు తన కవితాశక్తి అనే కవ్వంతో, నుడి కడలిని మథించి వెలికి తీసిన ‘కృష్ణ కర్ణామృతం’ ఉంది.వీనుల విందు చేసే ఈ అమృతాన్ని, అభిరుచి ఉన్నవారెవరయినా, ఉచితంగా, తనివి తీరా ఆస్వాదించవచ్చు. లీలాశుకుడు ఈ కావ్యంలో తన ఇష్టదైవమైన బాలగోపాల కృష్ణుడిని ఎన్నెన్నో శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చమత్కారాలతో అలంకరించి తరించాడు. ఆ కర్ణామృత కలశంలో ఒక్క చుక్క పట్టి చూసినా, అమృతం నాణ్యత అర్థమైపోతుంది.మన్మథుడు తుంట వింటివాడే కాదు. తుంటరివాడు కూడా. ఎంతో ప్రయత్నంతో, ఎన్నో సాధనలతో కష్టపడి, శుద్ధి చేసుకొన్న మహాభక్తుడి మనసులోకి ఎలాగో చొచ్చుకుపోతాడు. మదన వికారాల మాలిన్యంతో దాన్ని మళ్లీ మైల పడేస్తాడు. అలాంటి ఆగడాలు తన దగ్గర సాగవని లీలాశుకుడు మృదుమధురంగా, సొగసుగా, గడుసుగా మంద లిస్తూ..‘మార! మా రమ మదీయ మానసే,మాధవైక నిలయే యాదృచ్ఛయా!’అంటాడు. ‘‘మదనుడా! నా మనసులో దూరి అల్లరి చేయకు. ఇది మాధవుడు ఒక్కడి కోసం అచ్చంగా ఏర్పరచిన మందిరం. ఇక్కడ స్వేచ్ఛా విహారం చేస్తూ, ‘రమించ’కు. మా రమ!’ అని. అలా రమిస్తూ, ఆగం చేస్తే ఏమౌతుంది? కొంప మునుగుతుంది.ఎందుకంటే, 'శ్రీ రమాపతిః – ఇహ – ఆగమేత్ – అసౌ’ ఇల్లుగలాయన అయిన ‘రమాధవుడు ఇప్పుడో, ఇంకాసే పట్లోనో ఇక్కడికి వస్తాడు.’ ఆయన నీ గోల చూస్తే నీ వీపు విమానం మోత మోగిస్తాడో, తాట ఒలిచేస్తాడో!కః సహేత నిజ వేశ్మ లంఘనమ్? ‘తన ఇంట్లో పరులు స్వేచ్ఛగా జొరబడితే, ఎవరు సహిస్తారు?’ అందులో ఆయన సామాన్యుడా? సకల శక్తిశాలి. ఏమయినా చేయగలడు. ‘కనుక బతుకు మీద తీపి ఉంటే, నా నుంచి దూరంగా పారిపో!’’ అని పంచశరుడిని భక్తాగ్రణి హెచ్చరిస్తున్నాడు.– ఎం. మారుతి శాస్త్రి -
అలంకారం శరీరానికా? వ్యక్తిత్వానికా?
అలంకారాలు అంటే కళ్ళు జిగేలుమనిపించేలా కనిపించడం కాదండోయ్ ఇక్కడ.. అలాగే తళుక్కుమనే ఆభరణాలు బంగారం, వెండి గూర్చి కూడా కాదు... మనిషికి సహజంగా ఉండవలిసిన నిజమైన అలంకారం ఆభరణాలు గూర్చి శతకాల్లో చెప్పిన బంగారు మాటలు నెమరువేసుకుందాం.ఈ మాటలవిలువ ఏ మూటలతో లెక్క కట్టలేం...భర్తృహరి రాసిన సంస్కృత శతకానికి ఎంతో దగ్గరగా స్వేచ్ఛానువాదం చేసిన ఏనుగు లక్ష్మణకవి ఒక పద్యంలో...‘అమరుజెవి శాస్త్రమున గుండలముగాదువలయమున నొప్ప, దీవి చే వెలయుబాణియురుదయాడ్యుల మేను పరోపకారకలన రాణించు గంధంబు వలనకాదు’.కుండలాలు, బంగారు కడియాలు, గంధం – ఇవన్నీ అలంకారాలు కావుట. ధర్మశాస్త్ర శ్రవణమే చెవులకు అలంకారం. నిరంతరం దానం చేసిన చేసిన చేతులకు మిలమిల మెరిసే కడియాలు ఆభరణం కాదు. దయాగుణం కలవారికి సుగంధద్రవ్యాలు /గంధపు పూత అలంకారం కాదు.ఇంకా లోతులోకి వెళ్తే సత్పురుషులకు వారి గుణాలే అలంకారాలు. బాహ్యంగా తళుకులు, మెరుపులు అక్కర్లేదు..ఇదే కవి మరో పద్యంలో‘కరమున నిత్యదానం, ముఖంబన సూనత వాణి, ఔదలంగురుచరణాభివాదన, ముకుంఠిత వీర్యం దోర్యుగంబునన్వరహదయంబునన్ విశదవర్తన, మంచిత వీనులన్సురుచిరభూషణంబు లివి శూరులకు సిరి లేనియప్పుడున్’....ఐశ్వర్యం లేనప్పుడు మహాత్ములకు సహజ అలంకారాలు ఏమి ఉండాలో చెప్తూన్నాడు, ఏనుగు లక్ష్మణ కవి. అవి ఏమిటంటేదానం, సత్యాన్ని పలకడం, గురువు గారికి నమస్కరించే గుణం, ఎదురు లేని పరాక్రమం, మంచి ప్రవర్తన శాస్త్ర శ్రవణం... ఇవన్నీ... కంకణాలు, కిరీటం, కుండాలాలు బయట తాత్కాలిక సౌందర్యన్నే కలిగిస్తాయ్. స్థిరమైన శాశ్వతమైన అంతరమైన సౌందర్యం కలగాలంటే సద్గుణాలుండాలి.‘నిజమైన ఆభరణాలు, అలంకారాలు’ గురించి శతక కవులు బంగారాన్ని కాదు, గుణాలనే ఆభరణాలు అని అన్నారు.వేమన గారు బాహ్య అలంకారాలను ఖండించి, అంతరంగ శుద్ధినే అసలైన అలంకారం అన్నారు.పసిడి కుండలములు చెవులకుపసిడి హారములు మెడకు భాసిల్లును గానిమంచి మాటలు లేకున్నపశువుతో సమానమగును పార్థివా వేమాఅర్థం: చెవులకు బంగారు కమ్మలు, మెడకు హారాలు ఉన్నా, నోట మంచి మాటలు లేకుంటే పశువుతో సమానం.మరో పద్యం చూడండిఅంగడి సరుకుల వలెనాఅలంకారములెల్ల కొనగ అందుబాటగునాసంగతి తెలిసిన వానికేసద్గుణమే అలంకారము సర్వజ్ఞా వేమాఅర్థం: అంగడిలో దొరికేవి ఆభరణాలు కావు. సద్గుణాలే నిజమైన అలంకారం.బద్దెన కవి విద్య, వినయమే నిజమైన ఆభరణాలు అన్నారు.విద్య భూషణము పురుషునకువిద్యయె కీర్తిని తెచ్చు విశ్వమందునవిద్య లేని మనుజుండుపశువు కంటెను హీనమగును పార్థివా సుమతీఅర్థం: విద్యయే మనిషికి అసలైన ఆభరణం. విద్యే కీర్తిని తెస్తుంది. విద్య లేనివాడు పశువు కంటే హీనుడు.‘సత్యము భూషణము సతికిసత్యము భూషణము నరునకు సర్వజనులకున్సత్యము లేని నరుండుమత్యువుతో సమానమగును మేదిని సుమతీ‘అర్థం: స్త్రీకైనా, పురుషుడికైనా సత్యమే అసలైన ఆభరణం. భాస్కరుడు అదే బాణిలో వెళ్ళాడు భాస్కరుడు శీలము, దానమే ఆభరణాలు అన్నారు.‘దానము శీలము సత్యముమానము విద్యయును నీతి మర్యాదయునుమేనికి భూషణములు సుమ్మీమేలైన గుణములు గలిగెనేని భాస్కరా‘అర్థం: దానం, మంచి నడవడి, సత్యం, గౌరవం, విద్య, నీతి, మర్యాద – ఇవే శరీరానికి నిజమైన ఆభరణాలు.భర్తృహరి గారు కూడా గుణాలనే ఆభరణాలు అన్నారు.రత్నములు కావు భూషణరత్నములు సద్గుణములె సుమ్మీ రత్నములురత్నములు లేకపోయినరాజిల్లును సద్గుణముల రమణీయముగన్’దీనికి అర్థం అక్కర్లేదు.వినయము విద్యకు భూషణవినయము లేని విద్య విషముతో సమము సుమ్మీవినయ విద్యలు గల్గినవనరులెల్ల వచ్చు జగతిన.బాహ్య అందం కోసం సాధన చేసినా ఫలితాలు తాత్కాలికం.. కనుమరుగు అయిపోతాయి... బదులుగా నిజమైన అలంకారాలు, ఆభరణాలు గుణాలు రూపంలో ఉంటే అవి సద్వినియోగం చేస్తే ఫలితాలు శాశ్వతం, లోక ప్రయోజనం, విశ్వ కళ్యాణం అవుతుంది.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి నిర్వహణ: డి.వి.ఆర్. -
ప్రార్థనతో బలపడే విశ్వాసం!
‘దేవుని ఇశ్రాయేలు’గా చెప్పబడే క్రీస్తు ప్రభువు సంఘ సభ్యులు అపొస్తలుల బోధకు లోబడి క్రీస్తునందు క్రీస్తును బట్టి దేవునియందు ఆనందించుటలో సిద్ధహస్తులు. యేసు దేవుని కుమారుడు అంటే దేవుని పక్షాన ఏలుబడి చేసే ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్ధం. ఆ రారాజైన క్రీస్తును బట్టే ఆత్మసంబంధ ఇజ్రేలీయులుగా క్రైస్తవులు పిలువబడుతున్నారు. క్రీస్తు సంబంధులు, క్రైౖస్తవులు అనే పదాలకు ఆత్మ సంబంధ ఇజ్రేలీయులు అనేది ఒక గొప్ప పర్యాయపదం. ఆత్మ సంబంధ హృదయ పరిపాలకుడుగా ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి ఎలా ఆనందించాలో ఎందుకు ఆనందించాలో చూద్దాం.ఇక సాహసించక తప్పదనేలా దేవుని సంకల్పం బహు బలంగా ఉంది. అంతరాయాలకు, అడ్డుకట్టలకు, అభ్యంతరాలకు ఎలాంటి తావులేదు. ఇజ్రేలీయులకు వాగ్దానం చేసిన మెస్సీయాను ఈ భూమి మీద ప్రవేశపెట్టే వేళలలో దుస్సాహసాలకు పాల్పడుతూ దేవుని సంకల్ప చిత్తానికి ఆయన సత్యానికి అడ్డొచ్చే ప్రతి ఒక్కరూ దేవుని శత్రువులుగా ముద్రవేయించుకొని దేవుని ఉగ్రతకు బలై చరిత్రలో కలిసిపోయారు. తన ప్రేమను క్రీస్తు ద్వారా వెల్లడి చేయుటకు దేవుడు ఎన్నో సాహసకార్యాలకు పూనుకొన్నాడు. అదేవిధంగా మానవాళి అనుభవానికొచ్చి అలరించుటకు క్రీస్తుప్రేమ కూడా అనేకనేక అడ్డు ఆటంకాలకు ఎదురొడ్డి నిలిచింది. ఇప్పుడైతే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువారెవరును లేరు.- ''క్రీస్తు లేకుంటే దేవునికి సంకల్పమే లేదు. క్రీస్తు కేంద్రంగానే సర్వంలో సర్వమూ చేయబడింది అనుటకు తగిన మూలాధారం ఇదే. మొత్తం దేవుని సంకల్పంలో కేంద్రకం క్రీస్తుబలి. కారణం చూస్తే యేసును నలగగొట్టడం యెహోవా దేవునికి ఇష్టమైంది. క్రీస్తుబలి దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తన స్వకీయ సంకల్ప ప్రకారంగా ఈ బలిని రూపొందించినది ఆ దేవదేవుడే. అంతకంటె ముఖ్య కారణం, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించడం. మానవాళికి తన సొంత కుమారుని అనుగ్రహించుట ద్వారా ఇలా తన కుమారుని బలియాగం ద్వారా తన ప్రేమను వైవిధ్యంగా చేతలలో ఈ లోకానికి చాటి చెప్పాడు.''క్రీస్తునందు ఆనందిస్తూ ఎర్ర సముద్రం, ఎరికో గోడలు, వంటి ఉపద్రవాలు, శ్రమలు, బాధలకు తలవంచక కేవలం క్రీస్తును బట్టి మాత్రమే ఎదురునిలిస్తే అవి ఏవైనా వినయ వినమ్రతలతో దారి ఇచ్చుకోక తప్పదు. యేసు తన తండ్రియైన దేవదేవుని సంకల్పప్రకారంగా మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం మరణించాల్సి వచ్చింది. ఆయన అత్యంత క్రూరంగా ఘోరంగా సిలువలో బలి అయ్యాడు. నీ చిత్తమే సిద్ధించును గాక అంటూ సాహసించి మరీ మరణానికి ఎదురుగా వెళ్ళాడు.ఇందువలననే యేసు తన తండ్రి సంకల్ప చిత్తానికి విధేయంగా తలవంచాడు. మానవాళిని ప్రేమించి ప్రేమతో సాహసించి తన నిండు యవ్వన్రపాయాన్ని బలిగా పెట్టాడు. ఇట్టి యేసు సాహసోపేత ప్రేమను బట్టి ఆనందించండి అనునదే పరిశుద్ధులైన అపొస్తలుల బోధగా సంఘాలలో ఉపదేశక్రమ సత్యారాధనలలో నిత్యమూ చెప్పబడుతూ ఉంటుంది. వారపు ప్రప్రథమదినమను ఆదివారంనాడు సంఘము ఇలా క్రీస్తు సాహసాలను ప్రకటిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. సాహసించి క్రీస్తు సాహసాలను క్రీస్తు సంఘం ప్రకటిస్తూ ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే యెడతెగక ్రపార్థన చేయాలి. ్రపార్ధన చేయుట ద్వారానే క్రీస్తుద్వారా దేవునితో సత్సంబంధ సహవాస బాంధవ్యాలు బలపడి దృఢపడతాయి. అప్పుడే ప్రతి ఒక్కరూ సాహసోపేత దైవిక ప్రేమను బట్టి ఎంతగానో సంతోషించే వీలుంటుంది.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్ -
నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు..
సమాజంలో మనిషి ఒంటరిగా జీవించలేడు. అనుక్షణం పరిచయాలు, సంబంధాలు, స్నేహాలతోనే అతని జీవితం ముడిపడి ఉంటుంది. అయితే, మనం ఎవరితో కలుస్తున్నాం, ఎవరితో కాలాన్ని గడుపుతున్నామనే అంశమే మన ఆలోచనలను, ప్రవర్తనను, అంతిమంగా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఇస్లామిక్ ధర్మం మంచి సాంగత్యాన్ని ఎంచుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.పెద్దలు అంటారు ‘‘నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు’’ అని. ఇది కేవలం లౌకిక సత్యం మాత్రమే కాదు, దివ్యఖుర్ ఆన్ హదీసుల ఆత్మకూడా ఇదే!అత్తరు తావి కావాలి!చెడు ప్రభావం మనిషిపై ఒక్కసారిగా పడదు. కొవ్వొత్తి వెలుగు మాయమైనట్లు, అది నిశ్శబ్దంగా మనలోని మంచి గుణాలను హరిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు మంచి, చెడు సాంగత్యాల ప్రభావాన్ని ఎంతగానో హృదయానికి హత్తుకునేలా వివరించారు: ‘‘మంచి మిత్రుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారి (అత్తరు అమ్మే వ్యక్తి) లాంటివాడు; అత్తరు వ్యాపారి దగ్గర ఉంటే అతడు నీకు సుగంధాన్ని బహుమతిగా ఇస్తాడు, లేదా నీవు కొనుగోలు చేస్తావు... కనీసం ఆ సువాసననైనా ఆస్వాదిస్తావు.’’ (సహీహ్ అల్–బుఖారీ)చెడు అలవాట్లు, భావాలు ఉన్నవారి మధ్య గడిపితే ఎంతటి గట్టి మనస్కుడైనా ఏదో ఒక రోజు తప్పుదోవ పట్టే ముప్పు ఉంటుంది. అదే నైతిక విలువలు, దైవభీతి ఉన్నవారి సరసన ఉంటే మనలో నిశ్శబ్దంగా నైతిక పరిమళాలు వికసిస్తాయి.సత్యవంతుల సహవాసం‘‘ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్కు భయపడండి, సత్యవంతులతో (సజ్జనులతో) ఉండండి.’’ (దివ్య ఖుర్ఆన్ 9:119) మనిషి జీవన శైలి అతని మిత్రుని ప్రభావంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మనిషి తన స్నేహితుడి మార్గంలోనే ఉంటాడు. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి‘ (అబూ దావూద్) అని హెచ్చరించారు.రేపటి పశ్చాత్తాపం వద్దు!తాత్కాలిక లౌకిక ప్రయోజనాల కోసం లేదా వ్యసనాల కోసం చేసే స్నేహాలు పరలోకంలో తీరని నష్టాన్ని మిగులుస్తాయి. ఆనాటి పశ్చాత్తాపాన్ని దివ్య ఖుర్ ఆన్ ఇలా కళ్లకు కడుతోంది: ‘‘ఆ రోజు పాపాత్ముడు తన చేతులను కొరుక్కుంటూ... ’అయ్యో! నేను ఫలానా వ్యక్తిని నా మిత్రుడిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది!’ అని వా΄ోతాడు.’’ (దివ్యఖుర్ ఆన్ 25:27–28)అందుకే స్నేహంలో కొన్ని కీలకమైన నియమాలు పాటించాలి:1. మితమైన స్నేహం: ఆత్మీయతలో సమతుల్యత ఉండాలి. రహస్యాలను, గతంలో చేసిన ΄÷రపాట్లను ఇతరుల ముందు విప్పకూడదు. తప్పులకు దేవుని సమక్షంలో పశ్చాత్తాపపడాలి (తౌబా చేయాలి) తప్ప, పబ్లిక్లో పరచడం వల్ల భవిష్యత్తులో అది బలహీనతగా మారుతుంది.2. గృహ రక్షణ: మన అంతరంగ వలయం లోకి ధర్మనిష్ఠ గలవారినే రానివ్వాలి. రకరకాల అలవాట్లు ఉన్న సాధారణ పరిచయస్తులను ఇంటి పరిధికి దూరంగా ఉంచడం వల్ల కుటుంబంలో, పిల్లలలో మంచి సంస్కారం నిలుస్తుంది.అద్దం లాంటి మిత్రుడుసచ్ఛీలుడైన మిత్రుడు ‘అద్దం’ లాంటివాడు. అద్దం ముఖంపై ఉన్న మచ్చను ఏ అసూయా లేకుండా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే నిజమైన మిత్రుడు మనలో లోపం ఉన్నప్పుడు దయతో, రహస్యంగా సరిదిద్దుతాడు. అటువంటి సద్విమర్శను అహంకారం విడిచి వినయంతో స్వీకరించడమే ఆత్మవికాసానికి తొలిమెట్టు.విశాల ప్రపంచంలో వేలాది పరిచయాలు ఉండవచ్చు. కానీ మనల్ని దైవ మార్గంలో నిలబెట్టే, మన ప్రవర్తనను సన్మార్గంలో నడిపించే కొద్దిమంది ‘సజ్జనుల’ సాంగత్యమే మన నిజమైన సంపద. మన చుట్టూ ఉన్నవారిని ఒకసారి పరిశీలించుకుందాం... వారు మనల్ని వెలుగు వైపు నడిపిస్తున్నారా, లేదా అంధకారం వైపు గుంజుతున్నారా?– ముహమ్మద్ ముజాహిద్నిర్వహణ: డి.వి.ఆర్. -
అంతర్ముఖ చిత్తం.. పరివర్తనకు మార్గం!
ప్రపంచాన్ని జయించాలనే తపనతో మానవుడు వేల సంవత్సరాలుగా నిరంతరం ముందుకు సాగుతున్నాడు. ప్రకృతిని అధ్యయనం చేశాడు. సముద్రాలను దాటాడు. ఆకాశాన్ని చేరుకున్నాడు. విజ్ఞానశాస్త్రంలో, సాంకేతిక రంగంలో, వైద్యరంగంలో అనేక అద్భుత విజయాలను సాధించాడు. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉంది– తనను తాను నిజంగా తెలుసుకున్నాడా?ప్రకృతి పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే, జీవరాశులన్నీ తమ అవసరాలకు అనుగుణంగా బాహ్య ప్రపంచాన్ని అన్వేషిస్తూ అభివృద్ధి చెందాయి. నీటిలో జీవించిన చేపలు భూమిపై జీవించేందుకు ప్రయత్నించాయి. సర్పాలు చురుకుదనాన్ని పెంపొందించుకున్నాయి. జంతువులు పరిసరాలను బాగా ఎదుర్కొనేందుకు తమ శరీర నిర్మాణాన్ని మార్చుకున్నాయి. ఈ పరిణామమంతా బాహ్య ప్రపంచానికి అనుగుణంగా జరిగిన మార్పులే.మానవుడు కూడా ఇదే మార్గంలో నడిచాడు. ఆహారం కోసం అన్వేషించాడు. నివాసం నిర్మించుకున్నాడు. సంపదను కూడబెట్టాడు. అధికారాన్ని సంపాదించాడు. విజ్ఞానాన్ని పెంచుకున్నాడు. కానీ ఈ అన్వేషణ అంతా బాహ్య ప్రపంచం వరకే పరిమితమైంది. భౌతిక ప్రగతి ఎంత జరిగినా, అంతరంగంలో ప్రశాంతత, సంతృప్తి, ఆనందం లభించకపోతే జీవితం అసంపూర్ణంగానే మిగులుతుంది.ఇక్కడే ఆధ్యాత్మిక పరిణామం ప్రారంభమవుతుంది. మన దృష్టి బాహ్య ప్రపంచం నుండి అంతరంగం వైపు మళ్లినప్పుడే నిజమైన పరివర్తన సంభవిస్తుంది. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవడం, మన ఆలోచనలను పరిశీలించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం, స్వీయ అవగాహనను పెంపొందించుకోవడంఇవే ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు.ఒక అందమైన ఇంటిని నిర్మించిన తర్వాత దాని వెలుపల నిలబడి చూస్తూ ఉంటే, ఆ ఇంటి సౌకర్యాన్ని అనుభవించలేం. లోపలికి అడుగుపెట్టినప్పుడే ఆ ఇంటి అసలు విలువ తెలుస్తుంది. అలాగే, ఎంతటి బలమైన కోటను నిర్మించినా దాని లోపలికి వెళ్లకపోతే అది రక్షణను ఇవ్వదు. ఇదే సూత్రం మన జీవితానికీ వర్తిస్తుంది. బాహ్య ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించినా, మన అంతరంగంలోకి ప్రయాణించకపోతే శాశ్వతమైన ఆనందాన్ని పొందలేం.నేటి సమాజంలో సాంకేతిక సౌకర్యాలు విస్తరించిన కొద్దీ మానసిక ఒత్తిడి, ఆందోళన, అసంతృప్తి కూడా పెరుగుతున్నాయి. సమాచారం విపరీతంగా పెరిగింది కానీ జ్ఞానం తగ్గుతోంది. పరిచయాలు పెరిగాయి కానీ ఆత్మీయత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో మనిషికి అత్యవసరమైనది అంతర్ముఖత. కొద్దిసేపైనా మనతో మనం గడపడం, మౌనాన్ని ఆస్వాదించడం, ధ్యానం ద్వారా మనస్సును పరిశుభ్రం చేసుకోవడం నేటి కాలంలో అత్యంత అవసరం.శ్రీ మాతాజీ నిర్మలాదేవి బోధించిన సహజయోగం కూడా ఇదే సందేశాన్ని అందిస్తుంది. మనలో సహజంగా ఉన్న ఆత్మచైతన్యాన్ని మేల్కొలిపి, మన చిత్తాన్ని అంతర్ముఖంగా మార్చినప్పుడే నిజమైన శాంతి, సమతుల్యత, ఆనందం లభిస్తాయని ఆమె బోధించారు. ఇది ఏ ఒక్క మతానికి పరిమితమైన మార్గం కాదు; మానవుని అంతరంగ వికాసానికి సంబంధించిన విశ్వజనీన సత్యం.ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనలో మార్పు రావాలి. సమాజంలో శాంతి నెలకొనాలంటే ముందు మన హృదయంలో శాంతి నెలకొనాలి. బాహ్య విజయాల కంటే అంతరంగ విజయం గొప్పది. మన చిత్తం బయట ప్రపంచంలో ఎంత విహరించినా, చివరికి తన అసలు గమ్యం తనలోనే ఉందని గ్రహించినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది.అంతర్ముఖత అనేది ప్రపంచాన్ని వదిలేయడం కాదు; ప్రపంచాన్ని మరింత స్పష్టంగా, సమతుల్యంగా, ప్రేమతో చూడగల స్థితికి చేరుకోవడం. అదే మానవ పరిణామంలో అత్యున్నత దశ.– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులునిర్వహణ: డి.వి.ఆర్. -
హనుమ విగ్రహం... రాతిలో చెక్కిన భక్తి తత్వం
చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం విజయనగర శిల్పకళా వైభవానికి అద్భుతమైన నిదర్శనం. ఈ శిల్పం రామాయణంలోని సుందరకాండలో చోటుచేసుకున్న అత్యంత కీలకమైన ఘట్టాన్ని రాతిలో సజీవంగా ఆవిష్కరిస్తుంది. సీతాదేవిని దర్శించి ఆమెకు శ్రీరాముని ఉంగరాన్ని అందజేసిన అనంతరం హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఈ వార్త రావణునికి చేరడంతో అతడు తన కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపించాడు. దేవతలను సైతం జయించిన మహా యోధుడైన ఇంద్రజిత్తు సాధారణ ఆయుధాలతో హనుమంతుడిని జయించలేనని గ్రహించి బ్రహ్మదేవుని అనుగ్రహంతో పొందిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడికి బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల బ్రహ్మాస్త్రం శాశ్వతంగా హాని చేయలేకపోయినా బ్రహ్మాస్త్ర మహిమను గౌరవిస్తూ ఆయన కొంతసమయం దానికి లొంగిపోయాడు. తరువాత రాక్షసులు జనపనార తాళ్లు, నాగపాశాలతో ఆయనను అదనంగా బంధించిన వెంటనే బ్రహ్మాస్త్ర ప్రభావం దానంతట అదే తొలగిపోయిందని సుందరకాండ వివరించింది. అందువల్ల హనుమంతుడు నిజంగా ఓడిపోలేదు. వ్యూహాత్మకంగా రావణుని సభలో ప్రవేశించి అతనికి శ్రీరాముని సందేశాన్ని నేరుగా తెలియజేయాలనే సంకల్పంతోనే బంధితుడిగా ఉన్నాడు.చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని శిల్పంలో హనుమంతుడు పాముల వంటి బంధనాలతో చుట్టబడి నిలిచిన రూపంలో కనిపిస్తాడు. తన శరీరాన్ని బంధించినప్పటికీ తన మనోధైర్యాన్ని ఎవరూ బంధించలేరనే భావాన్ని అద్భుతంగా వ్యక్తీకరించాడు శిల్పి. కండరాలలో కనిపించే ఉద్రిక్తత, ముఖంలో కనిపించే ప్రశాంతత, కళ్లలో ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం భక్తి, అపార శక్తి ఈ శిల్పానికి అసాధారణమైన జీవం పోశాయి. బాహ్యంగా బంధితుడిగా కనిపిస్తున్న హనుమంతుడు అంతర్గతంగా అజేయుడని ఈ శిల్పం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది శిల్పకళ మాత్రమే కాదు రాతిలో చెక్కిన ఒక తాత్విక సందేశం కూడా.చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని ఈ శిల్పం విజయనగర శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తుంది. కఠినమైన గ్రానైట్ రాయిలో శరీర నిర్మాణం కండరాల బలం పాముల చుట్టుకొలత వస్త్రాల మడతలు ముఖ కవళికలు వంటి సూక్ష్మ అంశాలను సైతం అత్యంత సహజంగా చెక్కడం వారి కళానైపుణ్యానికి నిదర్శనం. విజయనగర శిల్పకళలో శిల్పాలు అలంకారాలు మాత్రమే కాకుండా పురాణాలను ప్రజలకు బోధించే దృశ్య గ్రంథాలుగా కూడా రూపొందించబడ్డాయి. నిరక్షరాస్యులు కూడా ఈ శిల్పాలను చూసి రామాయణం మహాభారతం, పురాణాల్లోని కథలను సులభంగా అర్థం చేసుకునే విధంగా వాటిని రూపొందించారు.ఈ హనుమంతుడి శిల్పం భక్తునికి గొప్ప జీవిత సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో కష్టాలు బంధనలు అవమానాలు ఎదురైనా ధర్మాన్ని విడువకుండా భక్తిని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా లభిస్తుందని ఇది బోధిస్తుంది. బాహ్య బంధనలు ఎంత బలంగా ఉన్నా దైవభక్తి ధైర్యం, జ్ఞానం, సంయమనం ఉన్న వ్యక్తిని ఎవ్వరూ శాశ్వతంగా బంధించలేరనే శాశ్వత సత్యాన్ని ఈ శిల్పం ప్రతిధ్వనిస్తుంది. అందుకే చింతల వెంకట రమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం కేవలం ఒక కళాఖండం మాత్రమే కాదు భారతీయ ధర్మం భక్తి తత్వం, విజయనగర శిల్పకళా వైభవం కలిసిన ఒక చిరస్మరణీయ వారసత్వ సంపదగా నేటికీ భక్తులను పరిశోధకులను, కళాభిమానులను సమానంగా ఆకర్షిస్తోంది.– జిబి విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అనంతపురంనిర్వహణ: డి.వి.ఆర్. -
యక్షిణి దేవతలు.. నిజమా? భ్రమలా?
మన పురాణాలలో, మంత్ర శాస్త్రాలలో 'యక్షిణి' అనే పేరు వినబడగానే ఒక వింతైన ఉత్సుకత, భయం మనలో కలుగుతాయి. అసలు యక్షిణులు ఎవరు? వారు దేవతలా లేక దెయ్యాలా? అత్యంత శక్తివంతమైన యక్షిణి సాధనల ద్వారా మనుషులు కోరుకున్నవన్నీ సాధించవచ్చా? నిధులు, నిక్షేపాలను కాపాడేది వీరేనా? తరతరాలుగా సమాజంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, పురాణాల వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక సత్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! -
సహజమైనదే చేయాలి!
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.– యామిజాల జగదీశ్ -
చిద్రూపమే జగత్తు!
దీర్ఘతముడనే ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. తండ్రికి సపర్యలు చేయడం వారి దినచర్య. కాలం తీరి కొన్నాళ్ళకు దీర్ఘతముడు మరణించాడు. విధిగా నిర్వర్తించాల్సిన ఉత్తరకర్మలన్నిటినీ పెద్దకొడుకు భక్తితో నిర్వర్తించాడు. అంతా సజావుగా జరిగాక, తమ్ముడి కోసం చూడగా, అతడు ఆశ్రమంలో కనిపించలేదు. అడవిలో వెదికాడు. ఒక పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని శోకిస్తూ కనిపించాడు తమ్ముడు. అన్న హృదయం ద్రవించింది. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఆప్యాయంగా తల నిమిరి ఇలా చెప్పాడు:‘పూర్వం వైరోచనుడనే ఒక రాజు ఉండేవాడు. దీర్ఘకాలం వసుధను పాలించాడు. ప్రపంచంలో లభించే అన్ని సుఖాలను తృప్తి తీరా అనుభవించాడు. ఒకనాడు రాజప్రాసాదపు మేడపై నిలబడి ఆలోచిస్తూ ‘ముల్లోకాలలో అద్భుత కారణంబును, సకల భోగాలకు ఆలవాలము అయిన ఈ భూమిలో, సౌఖ్యాలు అస్థిరములైనవే! అనుభవించే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవించి, దినదినమూ భ్రాంతుడనై తిరుగుతూ ఉండడమేగా ఇక్కడ ఎన్నాళ్ళైనా! రాత్రి, పగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆగేవి కావు. చెప్పిందే చెప్పడం అన్నట్లుగా కాలం చర్వితచర్వణం. ఈ సుఖాలన్నీ ప్రాజ్ఞుల దృష్టిలో అల్పాలే’ అని తలచి బాల్యంలో తన తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నాడు.తే. కణగి యెల్ల చోట గలది చిద్రూపంబుఅదియ నీవు నేను నఖిలములునుఇదియ నిశ్చితార్థ మిది దప్ప మఱి లేదుసర్వశాస్త్రసార సంగ్రహంబు.‘ఈ విశ్వంలోని ప్రతి అణువు చిత్తమనే చేతనతో నిండి ఉంది. చేతనతో నిండినదైన చిద్రూపమే నీవు, నేను, అది, ఇది, ఇలలో అన్నీ. అదే నిశ్చయం. అది తప్ప మరొకటి లేదు. సర్వ విజ్ఞాన, వేదాంత శాస్త్రములు బోధించేది కూడా అదే! ఆ సత్యాన్ని గ్రహించిన చిత్తానికి చింత ఉండదు. అది తెలుసు కుని నీవు కూడా స్వస్థత చెందిన అంతరంగాన్ని పొందు’ అని అన్న చెప్పిన మాటలను ఆలకించాడు తమ్ముడు. శోకోపశమనం పొందాడు.– భట్టు వెంకటరావు -
యుయుత్సుడు... కౌరవులలో శ్రేష్ఠుడు
మహాభారతంలో కౌరవులు అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడితో కలిపి 100 మంది గురించి చెప్తాము. మిగిలిన 98 పేర్లు చాలా మందికి తెలియకపోవచ్చు. వారిలో యుయుత్సుడు కూడా ఒకడు. ఇతనిని కౌరవులలో శ్రేష్టుడిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మహాభారత యుద్ధానంతరం కౌరవులలో బతికిన ఒకే ఒక్కడు కూడా యుయుత్సుడే.యుయుత్సుని జననం, ధర్మనిరతిధృతరాష్ట్రుని పట్టమహిషి గాంధారి గర్భం దాల్చి రెండు ఏళ్లు గడిచినా సంతానం కలగపోవడంతో గాంధారి చెలికత్తె అయిన వైశ్యకన్య సుఖదను వివాహమాడి యుయుత్సుని పుత్రుడిగా పొందాడు ధృతరాష్ట్ర్రుడు.యుయుత్సుడు కౌరవులలో ఒకడైనప్పటికీ ధర్మనిరతుడు... మహావీరుడు... అతిరథులలో ఒకడు. ఆది నుండి ధర్మం వైపే నిలబడ్డాడు. అలనాడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఒక్క యుయుత్సుడే వ్యతిరేకించాడు. భీముడిని విషపు నీటి ప్రయోగం నుండి కాపాడాడు. కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు సహాయం చేశాడు.కురుక్షేత్ర సంగ్రామం అనివార్యం కావడంతో యుద్ధం ప్రారంభం కాకమునుపే, ధర్మరాజు మాట్లాడుతూ యుద్ధంలో అస్త్ర శస్త్రాలు చేపట్టింది, ధర్మాన్ని రక్షించడానికి... ధర్మం వైపు నిలబడి పోరాడాలనుకునే వారికి స్వాగతం... అని చెప్పడంతో, ధర్మం పాండవుల వైపే ఉందని యుయుత్సుడు గ్రహించి కౌరవుడైనప్పటికీ పాండవుల పక్షాన చేరి కౌరవులపై యుద్ధం సాగించాడు.కౌరవులలో మిగిలిన ఒకే ఒక్కడైన యుయుత్సుని కౌరవ సామ్రాజ్యానికి రాజును చేస్తామని, దీనివల్ల ధృతరాష్ట్రునికి మనశ్శాంతి కలుగుతుందని ధర్మరాజు ప్రకటించడంతో అప్పటి ధర్మవేత్తలు అడ్డుపడి, అభ్యంతరం చెబుతూ క్షత్రియ సంతానానికి చెందని యుయుత్సుడు రాజు కావడానికి అనర్హుడని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ధర్మరాజు యుయుత్సుని పాండవ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా నియమించి అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్ సంరక్షణ బాధ్యతను కూడా యుయుత్సునికే అప్పగించాడు. అనంతరం పాండవులు స్వర్గం వైపు పయనమయ్యారు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
గురవే సర్వలోకానాం..
జ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జీవితానికి దిశానిర్దేశం చేసే మహనీయుడే గురువు. అటువంటి గురువులను స్మరించుకుని, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజున ఈ పండుగను దేశమంతటా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దీనినే వ్యాసపౌర్ణమి అని కూడా పిలుస్తారు.గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలుసుకుంటే ఈ రోజు ప్రాముఖ్యత మరింత అర్థమవుతుంది. మహాభారతం, పద్దెనిమిది పురాణాలు, బ్రహ్మసూత్రాలు రచించిన మహర్షి వేదవ్యాసుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి లోకానికి అందించిన మహానుభావుడు ఆయనే. ఆయన జన్మదినమే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అందుకే ఈ రోజును వ్యాసుని జన్మదినంగా జరుపుకుంటూ, ఆయన ద్వారా మనకు అందిన జ్ఞాన సంపదకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. వ్యాసుడే మానవాళికి మొదటి గురువుగా భావిస్తారు. ఆయన నుండి ప్రారంభమైన గురు పరంపర ఈనాటికీ కొనసాగుతోంది. నారాయణుడు, బ్రహ్మ, వశిష్టుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవిందుడు, శంకరాచార్యుల వరకు సాగిన ఈ పరంపరకు ఈ రోజు నమస్కరిస్తాం.ఈ రోజు ఆధ్యాత్మికంగా కూడా చాలా విశేషమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని దేవగురువు అంటారు. నవగ్రహాలలో గురువు స్థానం చాలా బలంగా ఉంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం అన్నీ శుభంగా జరుగుతాయని నమ్మకం. జాతకంలో గురు దోషం ఉన్నవారు ఈ రోజు గురు పూజ చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా చాతుర్మాస దీక్షలకు ఈ రోజే బీజం పడుతుంది. సాధువులు, సన్యాసులు ఈ రోజు నుండే ఒక చోట స్థిరంగా ఉండి చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు.గురు పౌర్ణమి రోజున భక్తులు తమ గురువులను దర్శించుకుని పాదపూజ చేస్తారు. కొత్త వస్త్రాలు, పుష్పాలు, ఫలాలు, దక్షిణ తాంబూలాలతో గురువును సత్కరిస్తారు. గురు గీత, గురు స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేస్తారు. విద్యార్థులు ఈ రోజు ప్రత్యేకంగా సరస్వతీ దేవితో పాటు హయగ్రీవ స్వామిని పూజిస్తారు. ఎందుకంటే హయగ్రీవుడు జ్ఞానానికి అధిపతి. ఈ రోజు సత్యనారాయణ వ్రతం చేయడం, దానధర్మాలు చేయడం, అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. రాత్రి సమయంలో చంద్రుని కిరణాలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తే మానసిక ప్రశాంత లభిస్తుందని కూడా ఒక నమ్మకం. గురు పౌర్ణమి అనేది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కృతజ్ఞతా భావానికి నిదర్శనం. ఈ రోజు మనం గురువులకు నమస్కరించడం ద్వారా జ్ఞానానికి, విద్యకు, సంస్కారానికి నమస్కరిస్తున్నాం. గురువు చూపిన బాటలో నడవాలని, ఆయన ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకునే రోజు ఇది. గురువుల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే ఈ పవిత్రమైన గురు పౌర్ణమిని మనం భక్తిశ్రద్ధలతో జరుపుకుని, గురు తత్వాన్ని మన జీవితంలో ఆచరించాలి. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. మన జీవితంలో మంచి మార్గం చూపిన ప్రతి ఒక్కరూ గురువే. తల్లిదండ్రులు మొదటి గురువులు. వారు మనకు నడవడం, మాట్లాడడం నేర్పుతారు. ఆ తరువాత బడిలో టీచర్లు, జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ప్రకృతి కూడా మనకు గురువులే. 29, బుధవారం గురుపౌర్ణమి– కుందా శ్రీ కృష్ణ శాస్త్రి. -
శంకరుల బాట..
ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు. – రాచమడుగు శ్రీనివాసులు -
'దేవశయని ఏకాదశి' ప్రాశస్త్యం..! ఆ రోజు ఏం చేయాలంటే..
శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర కాలమే చాతుర్మాసం. ప్రతి ఏడాది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశిని దేవశయని ఏకాదశి(తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి) అంటారు. దీని అర్థం. దేవ్' అనగా దేవుడు, 'శయని' అనగా నిద్రించుట. విష్ణుమూర్తి క్షీరాసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించే రోజే ఈ దేవశయని ఏకాదశి. ఈ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు గల నాలుగు నెలల కాలం చాతుర్మాసంగా పరిగణిస్తారు. అంటే ఈ నాలుగు మాసాల్లో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా, సృష్టి బాధ్యతలను పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాసం ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మశుద్ధికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, మొదటి పుట్టువెంట్రుకలు తీయించడం వంటి శుభకార్యాలు చేయరు. అయితే, భక్తి, దానధర్మాలతో కూడిన కొన్ని పనులు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణువుని ఎలా ఆరాధించాలంటే..విష్ణు అనుగ్రహం కలగాలంటే..మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. అంతేగాదు మహాసాధ్వి సతీ సక్కుభాయి, ఈ వ్రతాన్నే ఆచరించి, మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు..ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు, దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం, శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. తినకూడనవి..ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.(చదవండి: వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!) -
మహాత్ముల చేష్టలు..
బాలోన్మత్త పిశాచవత్ సిద్ధానాం రీతిః మహాత్ములయిన సిద్ధపురుషుల పద్ధతంతా విపరీ తంగా ఉంటుంది. పిల్ల చేష్టలు చేస్తారు. పిశాచం పట్టిన వాళ్ళలాగా వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చివాళ్ళలాగా సంచరిస్తారు. వాళ్ళ చూపులు, పనులు వంటివన్నీ పైకి అలాగే కనిపిస్తాయి. అలాంటి మహనీయుల గొప్పతనాన్ని మహాత్ములే గుర్తిస్తారు. సామాన్యులకు తెలియదు.గౌతమ మహర్షి మహామహితాత్ముడు. గొప్ప సిద్ధుడు. శ్రీవిద్యోపసనా దురంధరుడు. ముద్రోపాసనను, శైవ సిద్ధాంతాన్ని మనకందించిన పుణ్యమూర్తి. పెద్ద పెద్ద పండితులు, చక్రవర్తులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. నిత్యం వేదపారా యణం, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, సంద్గ్రంథ పారాయణాలు జరిగేవి.ఒక ఉన్మత్తుడు ఆశ్రమంలోనే ఉంటూ అందరికీ తపో, ధ్యాన భంగం చేస్తూ ఉండేవాడు. గౌతముడు మాత్రం ఆ పిచ్చివాణ్ణి దగ్గరకు పిలిచి ఆదరించేవాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిచ్చివాణ్ణి తిట్టేవారు. ఇలా ఉండగా ఒక రోజున పండితులు, రాజు గౌతముని సన్మానించటానికి, పూజా సామగ్రిని, కానుకలను తీసుకొనివస్తే ఆ పిచ్చివాడు ఆ సామగ్రినంతటినీ చిందరవందర చేసి అందరిచేత తన్నులు తిన్నాడు. అందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. పాపం పిచ్చివాడిలాగా తిరిగే అవధూత మరణించాడు. ఇది చూచి గౌతముడు కూడా ప్రాణం వదిలేశాడు. అది తెలిసి శుక్రాచార్యులు కూడా ప్రాణత్యాగం చేశారు.ఆ విషాదం చూచి భరించలేక దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. శ్రీమాత వాళ్ళ ప్రార్థన విని గౌతముని బ్రతికించింది. గౌతముడు మంత్రజలం చల్లి అవధూతను బ్రతికించాడు. శుక్రాచార్యుని సైతం బ్రతికించాడు. అక్కడి వాళ్ళతో గౌతముడు ‘ఈయనను పిచ్చివాడనుకొంటున్నారు మీరు. ఇది భ్రమ తప్ప నిజం కాదు. ఈయనొక మహాయోగి. అవధూత! నా పూర్వజన్మలో నా గురుదేవుడు. ఈయన ఇంతవరకు మీ విషయంలో చేసిన వింతచేష్టలు మిమ్మల్ని అనుగ్రహించటానికే. కానీ ఈ యధార్థం మీకు తెలియదు’ అని చెప్పాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
స్వయం గురువుగా తయారు కావాలి..
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీగురవే నమః...గురు మంత్రంలో చివరి మంత్రం చెప్పేటప్పుడు‘గురుః సాక్షాత్ పరబ్రహ్మ’ అని అంటారు. అంటే పరబ్రహ్మయే. మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శక్తియే మీ ద్వారా ప్రవహిస్తుంది. కనుక అప్పుడు మీరు పరబ్రహ్మ సాధనంగా మారతారు. మీలో స్వయం గురుతత్వ స్థితిని పెంపొందించుకుంటారు.ఆదిగురువు అవతరమూర్తులందరూ పంచభూతాలపై ఆధిపత్యం కలిగివుంటారు. వారి ద్వారానే బ్రహ్మ వ్యక్తీకరింపడ్డాడు. ఈ ఆదిగురువు ముగ్గురి ద్వారా అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా వ్యక్తీకరింపబడ్డాడు. ఆయన నాలుగు తలలుగల బ్రహ్మలా జన్మించాడు. మనకు పైకి కనబడే ఈ ముగ్గురు కాకుండా నాల్గవ తల శ్రీ గణేశునిది. ఈ విధంగా దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గణేశ రూపంతో, శక్తులతో ఆది గురువయ్యాడు. గురువు కు వుండాల్సిన ఉత్తమ గుణాలు చాలా వున్నాయి. ఆ గుణాలన్నీ గురువులో వ్యక్తమవ్వాలి. ఈ గుణాలకు యజమాని శివుడు. శివ తత్వం అంటే గురుతత్వమే. అలా ఈ గుణాలన్నీ మీ ద్వారా ప్రస్పుటమవ్వాలి, ప్రకాశించాలి.అప్పుడు మీరు విరాటశక్తిలో ఒకరైపోతారు. ఇతరులకు ధర్మాన్ని బోధించగలుగుతారు. ఆత్మగా మారుతారు. ఆ విధంగా నిజమైన గురువుగా మారుతారు.ఒక గురువుగా మీరు మీ నిత్య జీవితంలో అనేక విషయాలకు అతీతంగా వుండగలగాలి. అదే మీరు చేరుకోవలసిన ఉన్నత స్థితి.‘‘యధా రాజా తధా ప్రజా’’ అన్నట్లుగా మీరు స్వయం గురువుగా తయారయిన్నప్పుడే ఇతరులకు గురువుగా మారి ఓ ప్రతీకగా, ఆదర్శ్ర΄ాయంగా నిలబడి నడిపించగలరు.. ఇక్కడ మన అర్థం చేసుకోవలసిన విషయమేమంటే – సమాజంలో మనం చూస్తున్న గురువులను, తమను తాము గురువులుగా చెప్పుకునే గురువులు మనకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలుగుతున్నారా అన్నది. తమలో గురు తత్వం లేని గురువు కూడా ఇతరులకు గురువు కావాలనుకుంటారు. తాను స్వయంగురువుగా వ్యక్తీకరింపబడిన వ్యక్తి ఇతరులకు గురువు కావాలని ఎన్నడూ అనుకోడు.మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మగా రూపొందండి. ఎప్పుడు మీరు ఆత్మగా రూపొందుతారో అప్పుడు మీకు మీరు గురువు కాగలగుతారు. అదే స్వయం గురుతత్వం.గురువు ప్రప్రధమంగా మనల్ని భగవంతుడినితో అనుసంధాన పరచడానికి ప్రయత్నిస్తాడు. అంటే దానర్థం ఆయన మీ కుండలినీ శక్తిని జాగృత పరిచి, సర్వవ్యాపిత శక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.గురువుకి మించిన తత్వం లేదుగురువును మించిన తపస్సు లేదుగురువుని మించిన జ్ఞానం లేదుఅటువంటి గురుదేవునికి నమస్కరిస్తున్నాను అని గురుగీత స్తోత్రంలోని ఒక శ్లోకంలో గురువుకి వున్న ఉన్నత స్థాయి గురించి చెప్పారు.– డాక్టర్ ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)శ్రీ మాతాజీ నిర్మలాదేవినిర్వహణ: డి.వి.ఆర్. -
దేవతలు కట్టిన కోవెల!
విష్ణుమూర్తి... సౌమ్యనాథస్వామిగా అవతరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో దర్శనమిస్తూ ..కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం నందలూరు సౌమ్యనాథాలయం. విశాలమైన ప్రాంగణంలో... నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం విశేషం.ఈ ఆలయంలోని 108 స్తంభాలపైనా భాగవతం చిత్రించి ఉండటం మరో విశేషం. 11 శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. స్వయంగా నారదమహర్షి సౌమ్యనాథస్వామి మూలవిరాట్టును ప్రతిష్టించారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.స్వామి పాదాలపై సూర్యకిరణాలు...గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉన్నా.. ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాల స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడటమూ ఇక్కడ చూడొచ్చు.స్వామిపై అన్నమయ్య కీర్తనలు...తాళ్లపాకకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజు దర్శించుకునేవాడనీ, స్వామిపైన పదహారు కీర్తనలు కూడా రాశాడనీ అంటారు. ఇక్కడ స్వామికి ప్రతిరోజు నిర్వహించే పూజలు ఒకెత్తయితే, ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్షతులసీ అర్చన మరొకెత్తు. ఇవే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో నిర్వహించే ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన భక్తులకు ఎక్కువగా చూస్తారు.వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాలు...ఈనెల 21, మంగళవారం అంకుర్పారణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. బుధవారం ధ్వజారోహణం జరిగింది. 26న గరుడసేవ, 28న కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగం నిర్వహించనున్నారు. స్వామివారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఐదవరోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను స్వయంగా టీటీడీ దేవస్థానం వారే నిర్వహించడం సంప్రదాయం.– రామమోహన్ మోడపోతుల, సాక్షి, రాజంపేట, వైఎస్సార్ కడప జిల్లానిర్వహణ: డి.వి.ఆర్. -
క్రీస్తునందున్న యాత్రికులు, పరదేశులు
క్రీస్తు సిలువ మరణాన్ని బట్టి కొట్టివేయబడిన ధర్మశాస్త్రమను పాతనిబంధన దృష్టిలో నుండి చూస్తే, ఇశ్రాయేలు జనాంగం పూర్తి రక్షణ కొరకు మెస్సీయా రానేవచ్చాడు. క్రొత్తనిబంధన దృష్టికోణంలో నుండి చూస్తే పాపులను రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు అనగా యావత్తూ అన్య జనాంగాన్ని రక్షించుటకు క్రీస్తు ప్రత్యేకంగా రావడం జరిగింది.గురి కలిగిన క్రైస్తవుల గూర్చి ఎప్పుడూ ఘనంగానే చెప్పవచ్చు. ప్రభువైన క్రీస్తు ద్వారా అంది వచ్చిన క్రొత్త నిబంధన చట్టప్రకారం చూసినా, నేడు అమలులో ఉన్న అపొస్తలుల బోధను అనుసరించి చూసినా, ఈ భూమి మీద ఉన్న క్రైౖస్తవులు అనబడే క్రీస్తు సంబంధులు పరదేశులు, యాత్రికులుగా చెప్పబడుతున్నారు.‘నశించిన ఇశ్రాయేలు ఇంటివారైన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను’ అన్న యాత్ర జీవితం మెస్సీయాది.గొఱ్ఱెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకే వచ్చానని నిశ్చయముగా చెప్పుకున్న ఆయన, ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తోడుకొని రావాలి అన్నది కూడా మొత్తానికి ఆయన స్పష్టం చేయడం అంతా విదితమే. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను రోజు రోజూకు భక్షిస్తూ ఆయన్ను స్థిరంగా ఒక్కచోట నిలబడనివ్వని కారణం చేత ఉన్నతమైన ఉరుకులు పరుగుల జీవితం ఆయనది. తాను పుట్టినవేళ సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పడుకొన్న శిశువైన యేసుగా పెరిగి పెద్దవాడై తనను తాను రిక్తుడిగా చేసుకొనినందున ఆయనకు ఇల్లు వాకిలి లేకున్నా రోజూ నిలువ నీడలేని సంకట పరిస్థితి. రాత్రివేళ ఎక్కడో ఒకచోట తలదాచుకొని పగలు ఉన్నంత వరకు అవిశ్రాంతంగా దేవుని పనిచేయడం ఒక్క క్రీస్తుకే చెల్లింది.దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను చాటుతూ ఆ రాజ్యం ఇప్పుడు మీ చేరువలోకే వచ్చిందంటూ యేసు సామాన్యుల చెంత సామాన్యుడుగా కలిసిపోతూ సత్యాన్ని వివరాణాత్మకంగా మనస్సుకు హత్తుకొనేలా బోధించాడు. ఇశ్రాయేలు దేశపు ప్రతి ఇంటి గడపను, ప్రతి బాధితుడను దాటిపోని క్షేత్రస్థాయి విస్తృత పర్యటనలు చేస్తూ యేసు తనదైన దైవిక ప్రేమను బట్టి మానవాళిని తన దివ్య వాక్కులతో బోధలతో అలరించడం విశేషం. ధనికులు, పండితులు వద్దకే కాకుండా అట్టడుగు వర్గాలను ఆకట్టుకొనేలా కూడా యేసు ప్రభువు నేరుగా వారి ఇళ్ళవద్దకు వెళ్ళి పరామర్శలు చేస్తూ వాగ్దాన సంబంధ దేవుడు సత్యవంతుడని స్థాపిస్తూ ఆయన ఎంతో నమ్మదగినవాడని ప్రచారం చేసాడు.దేవుని ఉనికి, స్పృహ లేకుండా పోతున్న రోజుల్లో సత్యవంతుడైన వానిని మనం ఎరుగవలెనని మనకు వివేకం అనుగ్రహించాడు కూడా. ఇట్టి విధానంలో ఈ క్రమంలో ఆయన యాత్రజీవితం విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? నేను పరదేశినైన పరసంబంధుడను, ఈ భూమిమీద యాత్రికుడను అన్నది యేసు ఉన్నత జీవితపాఠం గొప్పగా చాటుతుండడం విశేషమనే చెప్పాలి.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్. -
కోపాన్ని వదలండి..
రెండు పదాల ఈ చిన్న సలహా పాటించకపోతే జీవితం ఎన్నో మలుపులతో కలచి వేస్తుంది, సంతోషాన్ని కబళిస్తుంది.. తాత్కాలికం, క్షణికం అయినా కోపం శాశ్వతంగా బంధాల్ని తెంపివేస్తుంది..స్నేహన్ని చెడగొడుతుంది, చుట్టరికాలు చెడిపోతాయ్.. మనుషుల్ని దూరం చేస్తుంది. మమతల్ని చంపివేస్తుంది. ఆరోగ్యం మటు మాయం అయిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కోపం వలన వచ్చే కష్టనష్టాలు బేరీజు వేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే కోపం గూర్చి ఎన్నో శతకాల్లో నిక్కచ్చిగా, స్పష్టంగా చెప్పారు... కోప్పడకుండా చదవండి.‘తన కోపమే తన శత్రువుతన శాంతియె తనకు రక్ష దయ చుట్టంబౌదన సంతోషమే స్వర్గముతన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ఎన్నో సందర్భాలలో ఈ పద్యం వింటాం.. వేరే వివరణ అవసరం లేదు. కోపమే శత్రువు, శాంతమే రక్ష.. సంతోషం స్వర్గం బాధే నరకం... అన్నీ మనలోనే ఉన్నాయి ఈ పద్యంలోనే దయా గుణాన్ని అంటే ఇబ్బంది ఉంటే ఆదుకునే వాడే చుట్టం అని చె΄్తాడు. అందుకునే కాబోలు ‘అక్కరకు రాని చుట్టము... గ్రక్కున విడువంగ వలయు ‘ అని సలహా ఇస్తాడు బద్దెన కవి.వేమన కోపం గురించి అత్యధికంగా చెప్పాడుకోపము దుఃఖమునకు మూలము కోపము శత్రుభయంకరము కోపము కీర్తి నశింపజేయురా కోపము వదలిన సుఖియైతివిరా వేమా!అర్థం: కోపమే దుఃఖానికి మూలం. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. కీర్తి నాశనమవుతుంది. కోపం వదిలితేనే సుఖపడతావు.మరో పద్యం..కోపము వచ్చినప్పుడు కుయుక్తుల వచ్చురా కోపము వచ్చినప్పుడు కూటమి చెడురా కోపము వచ్చినప్పుడు కులమెల్ల చెడురా కోపము వదలరా వేమా!సుమతి శాంతంగా ఉండమని చెప్పాడుకోపము పాపమునకు మూలము కోపము దుఃఖమునకు మూలము కోపము అధోగతికి మూలము కోపము వదలి సుఖముండుము సుమతీ!అర్థం: కోపమే అన్ని పాపాలకు, దుఃఖాలకు, అధోగతికి కారణం. అందుకే కోపం వదిలి సుఖంగా ఉండు. భర్తృహరి సుభాషిత శతకం – ఏనుగు లక్ష్మణకవి చేసిన అనువాదంపద్యంక్షమయా భూషితః పురుషః క్రోధేన భూషితో నరః నీచోపచారైః నరకం వ్రజేత్ ఉత్తమో నరకాత్ పరమ్తెలుగు అనువాదంఓర్పుతో భూషితుడైన నరుడు ఉత్తముడు కోపముతో నుండు నరుడు నీచుడునీచుడు నరకమునకు పోవును ఉత్తముడు స్వర్గమునకు పోవునుకోపము కామము లోభము మదము మాత్సర్యము ఈ పంచ మహాపాములు దహించును వీనిని జయించినవాడే మానవుడు శ్రీరామ నీ దాసుడైతిని దాశరథీ!నీతి శతకంలో పద్యంకోపాత్ భవతి మూర్ఖత్వం మూర్ఖత్వాద్ వినశ్యతి వినాశాత్ నరకం యాతి తస్మాత్ కోపం వివర్జయేత్అంటే...కోపం వల్ల మూర్ఖత్వం వస్తుంది. మూర్ఖత్వం వల్ల నాశనం. నాశనం వల్ల నరకం. అందుకే కోపాన్ని వదలిపెట్టాలి. శతక రచయితలు భావ యుక్తంగా చెప్తే, త్యాగరాజుల వారు రాగయుక్తంగా ‘శాంతము లేక సౌఖ్యము లేద’న్నారు. చివరిగా చెప్పినంత సులువుగా కోపాన్ని వదులుకోగలమా..మాటకు మాట తూటాలాగా వదిలితే శాంతి ఎక్కడ.. శాంతం లేనిదే శాంతి.. సహనం, శాంతం ఉంటే కోపాన్ని దూరం చేసుకోవచ్చు... డాక్టర్లు కూడా ఆరోగ్యం బాగుండాలంటే కోపం వద్దు.. ఈ దిçశలో బయలు దేరితే మన ఆరోగ్యదశ బాగుంటుంది.. ఆ ప్రయత్నంలో అడుగులేద్దాం.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. -
వర్షాల కోసం ‘ఇస్తిస్ఖా’... నమాజు
వర్షాలు పడక పొలాలు ఎండిపోతే, చెరువులు తడారిపోతే రైతు గుండె గొంతుకలోకి వస్తుంది. వాన చుక్క కోసం ఊరంతా ఆకాశం వైపు దీనంగా చూస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మహమ్మద్ ప్రవక్త (స) కాలంలో ఏం చేసేవారో తెలుసా?ఊరి ప్రజలందరినీ ఒక చోటికి తీసుకెళ్లి వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయించేవారు. దాన్నే ‘నమాజ్–ఎ–ఇస్తిస్ఖా’ అంటారు. తప్పులు పెరిగితే తడారిపోయే నేల! మనిషి చేసే పనులకి, ప్రకృతి మారే తీరుకి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యాపారంలో మోసాలు ఎక్కువైనప్పుడు, సమాజంలో పేదలకు ఇవ్వాల్సిన దానధర్మాలు (జకాత్) సరిగ్గా చేయనప్పుడు వర్షాలు ఆగిపోతాయని ప్రవక్త చె΄్పారు. కరువు రావడం అనేది కేవలం వాతావరణం మారడం వల్ల మాత్రమే కాదు, మనుషుల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని చెప్పే ఒక హెచ్చరిక.‘ఒకవేళ ఈ భూమి మీద మూగజీవాలు లేకపోతే, అస్సలు వర్షాలే పడవు’ అని ప్రవక్త చెప్పిన మాటలు మన అహంకారాన్ని ఆలోచనలో పడేస్తాయి. ఆడంబరం లేదు... కేవలం వినయం మాత్రమే! వర్షం కోసం వేడుకునేందుకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆడంబరాలు ఉండేవి కావు. చాలా సాధారణ బట్టలు వేసుకుని, భయభక్తులతో, వినయంగా ఊరి బయట ఉన్న ఈద్గాహ్ మైదానానికి వెళ్లేవారు. పండుగ నమాజ్ లాగే రెండు రకాతుల నమాజ్ చదివిన తర్వాత, ప్రవక్త చేతులను చాలా ఎత్తుకి ఎత్తి అల్లాహ్ను వేడుకునేవారు.సాధారణంగా దేవుడిని కోరుకునేటప్పుడు అరచేతులు ఆకాశం వైపు ఉంచుతారు. కానీ వర్షం కోసం అడిగేటప్పుడు అరచేతులు నేల వైపు, చేతుల వెనుక భాగం ఆకాశం వైపు ఉంచేవారు. అలాగే వేసుకున్న దుప్పటిని కూడా తిరగేసేవారు. మన కష్టాల కాలం మారి, మంచి రోజులు రావాలని కోరుకోవడానికి ఇది ఒక పద్ధతి. ‘ప్రభూ! నీ దాసులకు, మూగజీవాలకు నీళ్లు ప్రసాదించు... నీ కరుణను పంచు... ఎండిపోయిన ఈ భూమికి మళ్లీ ప్రాణం పోయ్!’ఇస్తిస్ఖా ప్రార్థన సారాంశం చిన్న చీమ... గొప్ప పాఠం! ఒకసారి ఒక ప్రవక్త వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఒక చిన్న చీమను చూశారట. ఆ చీమ తన కాళ్లను ఆకాశం వైపు ఎత్తి వర్షం కోసం వేడుకుంటోంది. అది చూసిన ప్రవక్త తన అనుచరులతో... ‘మనం వెనక్కి వెళ్లిపోదాం, ఆ చిన్న చీమ చేసిన ప్రార్థనను ఆలకించి దేవుడు మనకు వర్షం కురిపిస్తున్నాడు’ అన్నారట.దేవుడి దయ కేవలం మనుషులకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికీ సమానంగా లభిస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వాన చినుకుల్లో పరవశం! ప్రార్థన ముగియగానే ఆకాశంలో దట్టమైన మేఘాలు పట్టి, ఉరుములు మెరుపులతో వర్షం పడేది. వాన పడటం ప్రారంభం కాగానే ప్రవక్త తన చొక్కాను కాస్త పక్కకి జరిపి, ఆ మొదటి వాన చుక్కలు తన ఒంటిమీద పడేలా నిలబడేవారు. ‘ఇది దేవుడి దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్న కొత్త వర్షం’ అని సంతోషపడేవారు. నిజమైన పశ్చాత్తాపంతో, వినయంతో ప్రార్థిస్తే ఎండిపోయిన భూములైనా, మనుషుల మనస్సులైనా మళ్లీ చిగురిస్తాయనడానికి ఇస్తిస్ఖా ప్రార్థనే నిదర్శనం.– డా. అబ్దుర్రహీం బిన్ ముహమ్మద్ బిన్ మౌలానానిర్వహణ: డి.వి.ఆర్. -
తొలి పర్వం..
సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి (అధిక మాసం వస్తే 26). అయితే ఆషాఢ శుక్ల ఏకాదశికి ‘తొలి ఏకాదశి‘ అనే విశిష్ట నామం వచ్చింది. దక్షిణాయనం ప్రారంభం అయ్యాక వచ్చే మొదటి ఏకాదశి కనుక మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి అంటే ప్రారంభ ఏకాదశి అని చెప్పవచ్చు.ఈ ఏకాదశిని ఇంకా... దేవశయన ఏకాదశి, హరిశయనీ ఏకాదశి, పద్మ ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి .. అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు మేల్కొంటారని ఆగమాలు, పురాణాలు వివరిస్తాయి.ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి నాడు విధిగా పారణ చేసినవాడు సర్వపాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతాడని పద్మ పురాణం తెలియజేస్తుంది. గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు. తల్లి కంటే గొప్ప దైవం లేదు. కాశీ కంటే గొప్ప తీర్థం లేదు. ఏకాదశి వ్రతం కంటే గొప్ప వ్రతం లేదు అని స్కందపురాణం చెబుతోంది. భవిష్య పురాణం ప్రకారం చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది.ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.తొలి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం అత్యంత శ్రేయస్కరమని సంప్రదాయం.భీష్ముడు యుధిష్ఠిరునికి ఏకాదశి మహిమను వివరిస్తూ, ఉపవాసం, దానం, విష్ణుభక్తి ప్రాముఖ్యతను బోధించాడు. అతని ఉపదేశాలే తరువాత అనేక ధర్మగ్రంథాలకు ఆధారమయ్యాయి. గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభువు ప్రతి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ రామానుజులు ఏకాదశి ఆచరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మధుమేహం, గర్భధారణ, దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు.. ‘ఓం నమో నారాయణాయ’భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని, ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.తొలి ఏకాదశి రోజున చేయవలసినవి- బ్రహ్మముహూర్తంలో లేవాలి.- స్నానం చేసి విష్ణుపూజ చేయాలి.- ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రాన్ని జపించాలి.- విష్ణు సహస్రనామం చదవాలి.- భగవద్గీత పారాయణం చేయాలి.- తులసి దళాలతో శ్రీమహావిష్ణువును అర్చించాలి.- ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. విధిగా పారణ చేయాలి.చేయకూడనివి- కోపం, అసత్యం, పరనింద, మద్యపానం, మాంసాహారం, వ్యర్థ వాదనలు, అధిక నిద్రను త్యజించాలని శాస్త్రాలు చెబుతాయి.తొలి ఏకాదశి చెప్పే సందేశంతొలి ఏకాదశి మనకు కేవలం ఆహారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, అహంకారం, కోపం, లోభం, అసూయ వంటి అంతరంగ దోషాలను తగ్గించుకోవాలని బోధిస్తుంది. భగవంతునికి దగ్గర కావడానికి ముందు మన మనస్సును పవిత్రం చేసుకోవాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఒక పండుగ మాత్రమే కాదు; అది భక్తి, నియమం, ఆత్మపరిశీలన, ధర్మాచరణ, ప్రకృతితో సమన్వయ జీవన విధానానికి శ్రీకారం చుట్టే మహోన్నత దినం. పద్మ పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం వంటి శాస్త్రాలు దీనిని అత్యున్నత వ్రతాలలో ఒకటిగా కొనియాడాయి.– మద్దికుంట శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రంనిర్వహణ: డి.వి.ఆర్. -
అశాశ్వతత్వం..
ఒక పల్లెటూరి శివారులో ఒక వృద్ధుడు నివసించేవాడు. కొన్ని నెలల క్రితం అతడి భార్య చని పోయింది. భార్య చనిపోయి నెలలు గడిచినా, ఆమె జ్ఞాపకాలు అతడి హృదయాన్ని విడిచిపెట్టేవి కాదు. ఒకరోజు, భారమైన మనసుతో దేవాలయానికి వెళ్లాడు. పూజారి ‘ప్రాణులన్నీ అశాశ్వతములే.ఈ ధర్మాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే దుఃఖం తగ్గుతుంది. మనసు ఉపశమిస్తుంది!’ అన్నాడు. ఆ మాటలు అతని హృదయంలో ఆలోచనను రేకెత్తించాయి. ఇంటికి తిరిగి వచ్చి, భార్య ఇష్టపడే తోటలో కూర్చున్నాడు. అక్కడ ఒక వాడిపోయిన పువ్వు అతడి కనుల ముందే రాలి నేలపై పడింది. అతడు దాన్ని చేతిలోకి తీసుకుని మృదువుగా పలికాడు: ‘నువ్వు వచ్చావు, వెళ్లిపోయావు. కానీ నీ సువాసన మాత్రం మిగిలింది.’ఆ తరువాత అతడు ప్రతిరోజూ అశాశ్వత ధర్మం గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని హృదయం తేలికైంది. భార్యను కోల్పోయిన బాధ తగ్గలేదు కానీ ఆమెను ప్రేమించిన శాంతి పెరిగింది. ‘అశాశ్వతత్వాన్ని అంగీకరించడం అంటే విడిచిపెట్టడం కాదు, మనసును విముక్తి చేయడం! అనుకున్నాడు. మహా భారతం, శాంతిపర్వంలోని ఈ పద్యం అతడికి జ్ఞాపకానికి వచ్చింది.'కం. భూతము లనిత్యములు, నీవీ తెరువెప్పుడును విం దహీన ధృతిన్ నీచేతోగతి నలవఱపుముభూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్'‘ప్రాణులన్నీ అశాశ్వతములే. ఈ ధర్మాన్ని గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నావు. కనుక, ధైర్యం నిండిన మనస్సుతో, ప్రాణములు అశాశ్వతాలనే ధర్మాన్ని అభ్యసించడం మొదలుపెట్టు.ఆ జ్ఞానమే అన్ని దుఃఖాలను పోగొట్టి మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది!’ అని తనవంటి వారి గురించే చెప్పినట్లున్న పై పద్యం భావాన్ని స్ఫురణకు తెచ్చుకున్నపుడు అతడిలోని దుఃఖం పూర్తిగా ఉపశమించి, మనసుశాంతిని పొందింది.– భట్టు వెంకటరావు -
విదుర నీతి
విదురుడు ధృతరాష్ట్రునికి అనేక విధాలుగా నీతిని బోధించాడని గతవారం చెప్పుకున్నాం కదా... విదురుడు బోధించిన నీతిసూత్రాలు విదురనీతిగా ప్రసిద్ధి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు...→ ఎల్లప్పుడూ అందరి శ్రేయస్సును కోరుకోవాలి. ఏ ఒక్క వర్గానికీ అపకారం, దుఃఖాన్ని కలిగించాలని కనీసం మనసులో అయినా అనుకోకూడదు. → కష్టాలు, ఆపదలు, ప్రతికూలతల్లో ఉన్న వారిపై శ్రద్ధ పెట్టాలి. మనల్నే నమ్మి ఆధారపడిన వారి నిరంతర బాధలను, అవి చిన్నవైనా నిర్లక్ష్యం చేయకూడదు.→ సకల ప్రాణుల పట్ల కరుణ చూపాలి. → మేలు చేసే పనులే చేయాలి. → ఎవరి వల్లా వ్యవసాయ, ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి, పెరుగుదలకు ఎప్పుడూ ఆటంకం కలిగించరాదు. → భద్రత, రక్షణ కోసం మనపై ఆధారపడిన వారిని కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.→ ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించాలి. వారికోసం అంకిత భావంతో అందుబాటులో ఉండాలి. → సద్గుణం ద్వారానే విజయాన్ని సాధించి నిలబెట్టుకోవాలి. → ప్రజల సంక్షేమాన్ని వ్యక్తిగత బాధ్యతగా భావించాలి. → అభ్యసనాన్ని, జ్ఞాన ప్రసారాన్ని్రపోత్సహించాలి. → లాభాన్ని, సద్గుణాన్ని ప్రోత్సహించాలి. → శ్రేయస్సు మంచి పనులపై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు శ్రేయస్సుపై ఆధారపడి ఉంటాయి. → దుష్టులతో... పాపాత్ములతో స్నేహాన్ని విడిచిపెట్టాలి. → ఎన్నడూ సంపదను దుర్వినియోగం చేయకూడదు. → కఠినమైన మాటలు మాట్లాడకూడదు, తీవ్రమైన లేదా క్రూరమైన శిక్షలు విధించకూడదు. → సద్గుణ చరిత్ర, స్వభావం, చురుకుదనం కలిగి ఉండాలి. – సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
గ్రామ దేవతలకు భక్తి బోనాలు
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగ సందడి ఇప్పటికే ఆరంభం అయింది. ఈ సందర్భంగా ఆషాఢ బోనాల విశిష్టత, వివిధ ఆలయాల్లో జరిగే ప్రధాన జాతరల వివరాలను సమగ్రంగా తెలుసుకుందాం.‘బోనం’ అనే పదం ‘భోజనం’ అనే ప్రకృతి పదం నుండి వచ్చింది. ఇది తమను అంటువ్యాధులు, రకరకాల ప్రకృతి విపత్తుల బారిన పడకుండా చల్లగా చూస్తున్నందుకు గాను కృతజ్ఞతతో అమ్మవారికి సమర్పించే పవిత్రమైన నైవేద్యం. తయారీ విధానం: కొత్త మట్టి కుండలో పాలు, నీళ్లు, బెల్లం, కొత్త బియ్యంతో అన్నం (పరమాన్నం లేదా పసుపు అన్నం) వండుతారు. ఈ కుండకు సున్నం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులు, పూలతో అందంగా అలంకరిస్తారు. కుండపై వెలిగించిన దీపాన్ని ఉంచి, మహిళలు భక్తిశ్రద్ధలతో తలపై మోస్తూ మంగళవాద్యాల నడుమ ఆలయానికి తరలివెళ్తారు. ఈ పండుగ వెనుక ఉన్న ఆచారాలు: బోనాల జాతరలో భక్తితో పాటు అద్భుతమైన జానపద కళారూపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. శివసత్తుల పూనకాలు: డోలు సప్పుడు, మైసమ్మ, మహంకాళి పాటల మధ్య శివసత్తులు పూనకంతో ఊగిపోతూ భక్తులకు వేపమండలతో దీవెనలు అందిస్తారు. ఘటోత్సవం – రంగం (భవిష్యవాణి): పండుగలో భాగంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు జరుగుతుంది. జాతర ముగిసే మరుసటి రోజు ఉదయం ‘రంగం’ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జోగిని పచ్చి మట్టి కుండపై నిలబడి, భవిష్యత్తులో వచ్చే వర్షాలు, పంటలు, ప్రజల క్షేమం గురించి అమ్మవారి సాక్షిగా భవిష్యవాణి చెబుతుంది. ఆరోగ్య రహస్యం: వర్షాకాలం (ఆషాఢం) ప్రారంభంలో మశూచి, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకుంటూ భక్తులు వేపాకులు, పసుపుతో సాకపెట్టడం వల్ల అవి సహజ సిద్ధమైన కిమినాశకాలుగా పనిచేసి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి.జూలై 16న గోల్కొండ కోటలో ప్రారంభమైన ఆషాఢ బోనాల మహోత్సవాలు ఆగస్టు 13, 2026 వరకు నెల రోజుల పాటు ముక్కోటి దేవతల సాక్షిగా సాగుతాయి. బోనాల పండుగ కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, అది తెలంగాణ ప్రజల ఐక్యతకు, ఆచారాలకు అద్దం పట్టే ఒక సాంస్కృతిక పండగ. కులమతాలకు అతీతంగా ఊరంతా ఒక్కటై అమ్మవారిని కొలిచే ఈ జాతర వైభవం ప్రతి ఒక్కరినీ భకి ్త పారవశ్యంలో ముంచెత్తుతుంది. తెలంగాణ సంస్కృతిలో మమేకమైన ఈ జాతర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడిన వారిని కూడా ఈ పండగలో భాగస్వాములను చేస్తుంది. పోతురాజుల విన్యాసాలుబోనాల జాతరకు సిసలైన సింగారం బోనాల పండుగ అనగానే మొదట గుర్తొచ్చేది.. ఒళ్లంతా పసుపు, నుదుటున పెద్ద కుంకుమ బొట్టు, చేతిలో వేపమండలు, కొరడాతో డప్పు చప్పుళ్లకు అనుగుణంగా శివాలెత్తిపోయే పోతురాజు. పోతురాజుల విన్యాసాలు లేని బోనాల జాతరను ఊహించుకోలేము. ఈ ఉత్సవాలలో పోతురాజుల పాత్ర అత్యంత కీలకమైనది.ఎవరీ పోతురాజు?జానపద కథల ప్రకారం, పోతురాజు గ్రామ దేవతలైన మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటివారికి ఏకైక తమ్ముడు. అమ్మవార్ల ప్రతిరూపమైన ఘటాలకు రక్షకుడిగా, ఊరేగింపునకు ముందు నడిచే సైన్యాధిపతిగా పోతురాజును భావిస్తారు. వీర విన్యాసాలు: తీన్మార్ డప్పు చప్పుళ్లకు అనుగుణంగా గాల్లోకి ఎగురుతూ, చేతిలోని కొరడాతో నేలను కొడుతూ భీకరంగా నృత్యం చేస్తారు. భక్తి పారవశ్యంతో తమను తాము కొరడాతో కొట్టుకుంటూ విన్యాసాలు చేసే పోతురాజు చేతి కొరదా దెబ్బలు తినడానికి భక్తులు పోటీపడతారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, పోతురాజు చేత కొరడా దెబ్బలు తినడం వల్ల దిష్టి పోతుందని, రోగాలు రావని నమ్మకం. ఊరేగింపులో అమ్మవారి ’ఘటం’ ముందుకు కదపాలంటే పోతురాజు నృత్యం చేస్తూ దారి చూపిస్తూ ఉండాలి. ఫలహార బండి ఊరేగింపు: సికింద్రాబాద్, లాల్ దర్వాజా బోనాలలో జరిగే ఫలహార బండ్ల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు పతాక స్థాయికి చేరుకుంటాయి.గావు పట్టడం: జాతర చివరి రోజున అమ్మవారికి బలి ఇచ్చే ఆచారంలో భాగంగా, పోతురాజు కోడిపుంజును నోటితో కొరికి (గావు పట్టి) గుడి బయట విసిరేస్తారు. ఇది జాతరలోనే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం. వివిధ ఆలయాల్లో జాతరలు జరిగే తేదీల వివరాలుజూలై 21న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కళ్యాణోత్సవం, బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆగస్టు 2: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం– దీనిని ‘లష్కర్ బోనాలు‘ అని పిలుస్తారు. దీనికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆగస్టు 3: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం–బోనాల పండుగలో అత్యంత కీలక ఘట్టమైన ‘రంగం’ (భవిష్యవాణి) జరుగుతుంది.ఆగస్టు 9: పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ఇది కేంద్ర బిందువు. ఇక్కడి ఘటాల ఊరేగింపుతో పండుగ ఊపు అందుకుంటుంది. ఉత్సవాల ముగింపు ఆగస్టు 13: నెల రోజుల పాటు సాగిన ఈ బోనాల మహా జాతర ముగుస్తుంది.– డి.వి.ఆర్. -
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఒకానొకప్పుడు జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు ఉండేవాడు. వ్యవసాయంలో పొలం దున్నడానికి నాగలికి జోడెద్దులను కట్టేవాడు. అతడు ఎడ్లను సరిగా చూసుకునేవాడు కాదు సరికదా, నీరసించిన ఆ ఎడ్లు వడి వడిగా పొలం దున్నలేకపోతే, చీటికి మాటికి వాటిని మునికోలతో కొడుతూ, పొడుస్తూ హింసించేవాడు. పాపం! నోరులేని ఆ మూగజీవాలు అతడు పెట్టే బాధలకు భరిస్తూ, లోలోన దుఃఖిస్తూనే పనిచేస్తుండేవి.ఒకనాడు గోమాత అయిన కామధేనువు ఆ ఎద్దుల బాధను చూసింది. వాటి బాధలకు కలత చెందింది. ఆమె నందీశ్వరుడి వద్దకు వెళ్లి, ఆ ఎద్దులు పడే బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కామధేనువు ద్వారా అంతా విన్న నందీశ్వరుడు ఆ వృషభాలపై జాలి చెందాడు. తన ప్రభువైన పరమశివుని వద్దకు వెళ్లి, జాబాలి వద్దనున్న ఎద్దులు పడే బాధలు చెప్పాడు. ‘నందీ! నువ్వేమీ దిగులు చెందకు. ఈ విషయంలో నువ్వు తలచినది జరిగేలా వరమిస్తున్నాను. నీకు ఇష్టమైన రీతిలో నీ కోరిక నెరవేర్చుకో’ అన్నాడు పరమశివుడు.నందీశ్వరుడు వెంటనే ముల్లోకాలలో ఉన్న గోజాతిని సమావేశపరచాడు. ‘మీరెవ్వరూ ఇక్కడి నుంచి మరెక్కడికీ పోవద్దు. మీరు ఎవ్వరికీ కనిపించవద్దు’ అని ఆదేశించాడు.రోజులు గడుస్తున్నా, గోజాతి కనిపించకపోవడంతో ముల్లోకాలలోనూ గగ్గోలు మొదలైంది. దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, మొరపెట్టుకున్నారు.‘బ్రహ్మదేవా! ఏమైందో ఏమో గోజాతి అంతా ఒక్కసారిగా మాయమైంది. ముల్లోకాలలోనూ ఒక గోవూ కనిపించడం లేదు. గోవులు లేకుండా ముల్లోకాలలో జనులు జీవించడమెలా?’ అని వాపోయారు.‘దేవతలారా! ఇందులో నేను చేయగలిగినదేమీ లేదు. మీరంతా పశుపతి అయిన పరమశివుని వద్దకు వెళ్లి ప్రార్థించండి. అతడే తరుణోపాయం చెప్పగలడు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలంతా కైలాసానికి చేరుకున్నారు. పరమశివుని స్తుతించి, ముల్లోకాలలోనూ గోగణాలు కనిపించకుండా పోయిన సంగతిని విన్నవించుకున్నారు.‘గోగణాల సంగతి నాకేం తెలుసు? నా వాహనం నందీశ్వరుడిని అడగండి’ అని చిద్విలాసంగా చెప్పాడు పరమశివుడు.దేవతలు నందీశ్వరుడి వద్దకు వెళ్లారు.‘నందీశ్వరా! పరోపకారీ! దయచూపి, మాకు గోప్రదానం చేసి, లోకాలను రక్షించు’ అని వేడుకున్నారు.‘దేవతలారా! గోసంతతికి చెందిన వృషభాలను జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు బాధలు పెడుతున్నాడు. అందుకు ప్రతిగానే నేను గోగణాలను నా ఆశ్రయంలో ఉంచాను. మీరందరూ గోమతీ తీరానికి వెళ్లి, అక్కడ గోసవన యాగం చేయండి. గోహింసను పాపంగా ప్రకటించండి. అక్కడకు ముల్లోకాలకు చెందిన గోవులన్నీ వచ్చి, మిమ్మల్ని సంతుష్టులను చేస్తాయి’ అని పలికాడు.నందీశ్వరుడు చెప్పినట్లే దేవతలు గోమతీ తీరంలో గోసవన యాగం ప్రారంభించారు. యాగం మొదలైన కొద్దిసేపటిలోనే ముల్లోకాల గోగణాలన్నీ లెక్కకు మిక్కిలిగా అక్కడకు చేరుకున్నాయి. నేల ఈనినట్లు గోమతీ తీరమంతా ఎటు చూసినా గోగణాలతో కళకళలాడింది. దేవతలు, మానవులు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. గోవులు తిరిగి కనిపించడంతో వారంతా పరమానందం చెందారు.దేవతలు చేపట్టిన గోసవన యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. నాటి నుంచి ముల్లోకాలలోను గోవులకు పూజ్యత హెచ్చింది. దేవతలు గోసవన యాగం చేపట్టిన ప్రదేశం గోవర్ధన తీర్థంగా ప్రసిద్ధి పొందింది.పురావిశేషం..ఈశాన్య రాష్ట్రాల్లోని అరుదైన పురాతన దేవాలయాల్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని మహాబలి ఆలయం ఒకటి. దీనిని క్రీస్తుశకం 1725లో నాటి రాజు గరీబ్ నివాజ్ నిర్మించాడు. అతడిని స్థానికంగా ‘మహారాజా పామ్హీబా’ అని పిలుస్తారు. అప్పట్లో మణిపూర్లోని సన్యాసి శాంతిదాస్ గోసాయి బోధనలకు ఆకర్షితుడైన గరీబ్ నివాజ్, ఆయన వద్ద రాముడిని ఆరాధించే ‘రామానంది’ మతాన్ని స్వీకరించాడు. రామదూత హనుమంతుడు మూలవిరాట్టుగా ‘మహాబలి’ ఆలయాన్ని ఇంఫాల్ నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం బెంగాలీ ‘దో–చాలా’ శైలిలో ఉంటుంది. ఆలయ గర్భగుడిలోని హనుమంతుడి విగ్రహం నృత్యభంగిమలో ఉండటం విశేషం. గరీబ్ నివాజ్ మరణానంతరం మణిపూర్లో రామానంది మతం కనుమరుగై, గౌడీయ వైష్ణవం ప్రాబల్యం పుంజుకుంది. ఈ ఆలయంలో ఏటా హనుమజ్జయంతి, దీపావళి, హోలీ వేడుకలు విశేషంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!
గోల్కొండ: గోల్కొండ జగదాంభిక మహంకాళీ అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా గురువారం మొదటి బోనం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు ఉదయం 6 గంటల నుంచే గోల్కొండ కోటకు తరలివచ్చారు. కోట మెయిన్ గేటు వద్ద భారీగా చేరిన భక్తులను అతికష్టం మీద పోలీసులు ఒకొక్కకరిని కోటలోకి పంపారు. రాష్ట్ర సంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహాలు ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోట చౌరస్తా వద్ద ఓ వైపు శివసత్తులు, మరో వైపు పోతరాజులు పోటాపోటీగా విన్యాసాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. రిసాల బజార్ నుంచి బి.శ్రీకాంత్చారి ఆధ్వర్యంలో రోబోటిక్ అంబారీపై అమ్మవారి మూర్తి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, గోల్కొండ జోన్ డీసీపీ రాఘవేందర్రెడ్డి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. జగదాంబకు బంగారు బోనంసప్త మాతృకలకు సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బంగారు బోనంతో పాటు పట్టు వ్రస్తాలు, ఒడి బియ్యం సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉçత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో జోగిని అవిక బోనమెత్తారు. హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవాలయంలో బంగారు పాత్రకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. లంగర్హౌజ్ వద్ద స్వాగత వేదికపై నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు బంగారు బోనానికి ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి మాజీ చైర్మన్లు గాజుల అంజయ్య, పొటేల్ సదానంద్, రాకేష్ తివారి, జనగామ మధుసూదన్ గౌడ్, ప్రవీణ్కుమార్ గౌడ్, పొటేల్ శ్రీనివాస్ యాదవ్, బల్వంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గోల్కొండ కోటలో గురువారం నగర సీపీ సజ్జనర్ పర్యటించారు. జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల నేపథ్యంలో ఆయన ఏసీపీ సయ్యద్ ఫయాజ్, సిబ్బందితో కలిసి అమ్మవారి దేవాలయానికి వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. బోనాలతో వచి్చన మహిళలతో ముచ్చటించారు. ప్రశాంత వాతావరణంలో వేడుకగా బోనాల పండుగను జరుపుకోవాలని ఆకాక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కోటకు బయలెల్లిన అమ్మవారులంగర్హౌస్ చౌరస్తా వద్ద మంత్రులు అమ్మవారికి తొట్టెల, పట్టు వ్రస్తాలు సమర్పించగా అమ్మవార్ల సోదరుడు పోతరాజులు చెర్నకోలలను జులుపుతు నృత్యాలు చేస్తు ఊరేగింపును కోట వైపు తీసుకువెళ్లారు. చోటాబజార్లో పూజారి అనంతచారి ఇంట్లో అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు శివరాజ్ స్వామి బంగారు పల్లకిని తలపై మోపుకొని ఊరేగింపు కోటపై వెలసిన జగదాంబ ఆలయానికి సాగింది. డీసీపీ రాఘవేందర్ రెడ్డి, ఏసీపీ సయ్యద్ ఫయాజ్, రాజు వస్తాద్, నాగన్న అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. -
జగన్నాథుని రథయాత్ర ఎక్కడిదాక సాగిందంటే..! ఆఖరికి వరుణుడు సైతం..
నీలిమేఘశ్యాముడు నేల మురిసేలా గర్భగుడి వదిలి భక్తుల వద్దకు కదిలి వచ్చాడు. శ్రీమందిరం పరిసరాలను పావనం చేస్తూ చిరు మందహాసుడై రథాన్ని అధిరోహించాడు. ఆకాశాన్ని తాకే జై జగన్నాథ నినాదాలు మార్మోగగా బలభద్రుడు, సుభద్రతో కలిసి గుండిచాకు బయల్దేరాడు. రథాలు ముందుకు కదలడం మొదలవ్వగానే భక్తులు మురిసిపోయారు. దేవ దేవుడిని కనులారా చూసుకొని.. మనసారా మొక్కుకొని పరవశించిపోయారు. భక్తుల వద్దకు దారుబ్రహ్మ నందిఘోష్ రథంపై వస్తున్న దృశ్యాన్ని వరుణుడు సైతం వీక్షించాడు. అనంతరం కొంతదూరం కదిలిన పతితపావనుడు.. మిగతా దూరం మరుసటి రోజు వెళ్దామని భక్తులకు సందేశమిచ్చాడు. శ్రీమందిరం వదిలి భక్తుల వద్దకు బయల్దేరిన జగతినాథుడికి నింగి, నేల స్వాగతించాయి. సుగంధ భరిత పుష్పాదుల మకుటధారణతో శ్రీమందిరం సింహద్వారం దాటి నేలంతా విస్తరించిన ఆశేష భక్తజనం మధ్య ప్రత్యక్షమై జనులకు నల్లనయ్య తొలి దర్శనం అనుగ్రహించాడు. ఈ అపురూప క్షణాల్లో ఆకాశం నుంచి వర్షపాతం శీతల పుష్పాంజలిగా నేల జారింది. అత్యంత భక్తిపూర్వక వాతావరణంలో సేవాయతుల సమూహం గర్భగుడి నుంచి మూలవిరాటులను వరుస క్రమంలో రథాలపైకి తరలించి గొట్టి పొహండి కార్యక్రమం జయప్రదం చేశారు. వరుస క్రమంలో మొదటిగా చక్రరాజ ప్రభువు సుదర్శనుడు దేవదళన్ రథంపైకి తరలివెళ్లాడు. పుష్ప మకుటధారణతో శ్రీమందిరం సింహద్వారం గుండా తాళధ్వజ రథంపైకి బలభద్ర స్వామి చేరిన తర్వాత, దేవీ సుభద్రమూర్తిని దర్ప దళనంపై ఆసీనం చేశారు. చివరగా శ్రీజగన్నాథుడు భక్త జనాన్ని తన్మయం చేస్తూ జై జగన్నాథ్ నినాదాల మధ్య నందిఘోష్ రథానికి చేరాడు. సుదీర్ఘంగా 5 గంటల పాటు నిరవధికంగా కొనసాగిన గొట్టి పొహండిలో చతుర్థామూర్తుల మూల విరాటులు సురక్షితంగా రథాలపైకి చేరాయి. మృదంగ వాద్యాల నడుమ శంఖ ధ్వని, ఘంటానాదాల గంభీర ప్రతిధ్వనులు, మృదంగ వాద్యాల మంగళ నినాదాలు, భక్త జనుల హరిబోల్ నామ సంకీర్తనలు, మహిళల పవిత్ర హుల్హులీ (ఉల్లాలు) ధ్వనులతో దిక్కులన్నీ దివ్యమైనవేళ అఖిలాండ కోటి బ్రహా్మండ నాయకుడు జగత్తుకు నాథుడైన శ్రీజగన్నాథ మహా ప్రభువు తన అగ్రజుడు బలభద్రుడు, సోదరి దేవి సుభద్రతో కలిసి గుండిచా మందిరం వైపు మహోన్నత రథయాత్రకు బయల్దేరాడు. ఏటా మాదిరి ఆషాఢ శుక్ల ద్వితీయ పురస్కరించుకుని శ్రీక్షేత్రంలో ప్రారంభమయ్యే వార్షిక రథయాత్ర వైభవోపేతంగా ఆరంభమైంది. జగన్నాథుని అనేక మానవీయ దివ్యలీలల్లో ఇది అత్యంత అపూర్వమైన, అత్యంత హృద్యమైన ఘట్టంగా భావించబడుతుంది. తొమ్మిది రోజుల ఈ నవ దినాత్మక దివ్య యాత్రలో చిత్ర విచిత్రమైన లీలావిలాసాలతో ఆలయ గర్భ గృహాన్ని విడిచి భక్తుల మధ్యకు విచ్చేసే జగన్నాథుడు జాతి, మత, వర్ణ, భాష భేదాలకు అతీతంగా సమస్త జీవ రాశులకు తన కరుణాకటాక్షాలను ప్రసాదించి వారిని పుణీతులను చేస్తాడు. అందుకే రథయాత్రను కేవలం ఒక ఉత్సవంగా కాకుండా సర్వజనోద్ధారణకు, సమానత్వానికి, విశ్వబాంధవ్యానికి ప్రతీకగా భక్తజనం భావిస్తారు. బంగారు పిడి చీపురుతో ఊడ్చి శ్రీ మందిరంలో మంగళ హారతి, మైలమ్, ప్రభాత శుద్ధిసేవ, అలంకరణ పూర్తి చేసి సూర్యపూజ, ద్వార పాలకుల పూజ, గోపాల వల్లభ పూజాదులు నిర్వహించారు. ఆలయం వెలుపల దేవతలు యాత్ర చేసే 3 రథాల ప్రతిష్ట ముగించి చతుర్థామూర్తుల మూల విరాటులను ఒక్కోటిగా రథాలపైకి వరుస క్రమంలో తరలించారు. అనంతరం మదన మోహనుడు, రామకృష్ణులు తదితర ఉత్సవమూర్తులను సంబంధిత రథాలపై ఆసీనం చేశారు. రథాలపై దేవుళ్ల అలకంరణ పూర్తి కావడంతో పూరీ గజపతి మహారాజా స్వామి సేవకునిగా 3 రథాలను బంగారు పిడి చీపురుతో ఊడ్చి శుచి కర్మలు శాస్త్రీయంగా నిర్వహించారు. ఈ తంతు ముగియడంతో రథాలకు కొయ్య గుర్రాలు, ద్వార పాలకులు, రథ సారథులు ఏర్పాటు చేసి చారుమళ్లు (తాత్కాలిక తాటి మట్టల మెట్లు) తొలగించి యాత్రకు సిద్ధం చేశారు. నేడు యాత్ర కొనసాగింపు శుక్రవారం ప్రాతఃకాల సేవాదులు పూర్తి చేసిన తర్వాత రథాలు లాగడం పునరుద్ధరిస్తారు. అంతవరకు ఆగిన చోటే రథాలపై దేవుళ్లకు నిత్య, దైనందిన, యాత్ర సేవాదులు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఈ నిడివిలో రథాలపై దేవుళ్లని యాత్రికులు, భక్తులు దర్శించుకునే అవకాశం కలిసి వస్తుంది.గమ్యం చేరని రథాలుయాత్ర సంబంధిత కార్యక్రమాల నిర్వహణలో అవాంఛనీయ జాప్యం కారణంగా రథాలు నిర్ధారిత వేళలో గమ్యం చేరలేకపోయాయి. సాయంత్రం 5.10 గంటల నుంచి రథాల కదలిక ఆరంభించి 7.25 గంటల వరకు రథాలు లాగడం కొనసాగించారు. అయితే చీకటిపడడంతో ఆలయ సంస్కారాల ప్రకారం రథాలు లాగడం మర్నాటికి వాయిదా వేశారు. తొలుత బలభద్ర స్వామి రథం కదలగా వెంబడి దేవీ సుభద్ర రథం యాత్ర ప్రారంభమైంది. చివరగా శ్రీజగన్నాథుని నందిఘోష్ రథం నెమ్మదిగా మొదలైంది. మొదట బయల్దేరిన బలభద్ర స్వామి రథం జనతా సినిమా హాలు సమీపంలో నిలిపివేశారు. దేవీ సుభద్ర రథం దర్పదళనం మారీచ్కోట్ వరకు ఆగిపోయింది. చివరగా బయల్దేరిన జగన్నాథుని నందిఘోష్ రథం లాంచనంగా కొద్దిదూరం కదిలిన తర్వాత నిలిపివేశారు. రథ ప్రతిష్ట జగన్నాథుడి రథయాత్ర జయప్రదం అయ్యేందుకు ముందుగా రథ ప్రతిష్టని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆచారం. ఆధ్యాత్మిక వాతావరణంలో మూడు రథాలపై పతాకాలు, కలశాలను ప్రతిష్టించి గురువారం 8.45 గంటలకు రథత్రయం ప్రతిష్ట పూర్తి చేయడంతో, గర్భగుడి నుంచి మూల విరాటులు వరుస క్రమంలో రథాలపైకి వేంచేశారు. వరుణుడి రాక ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాలు రథయాత్ర ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. గత 48 గంటల్లో పూరీ నగరంలో 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం పూరీ నగరంలో గంటకు 1 నుంచి 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కొనసాగుతోంది. అయితే భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు బొడొ దండొకు తరలివచ్చారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొని ఉన్న అల్పపీడన వ్యవస్థ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. డాహుక డక్కువా రథయాత్రలోని అత్యంత విశిష్టమైన సంప్రదాయాల్లో డాహుక డక్కువా ఒకటి. రథ డాహుకాలు అనే వారు పూరీలోని శ్రీజగన్నాథ ఆలయంలో సేవచేసే వంశపారంపర్య సేవాయతుల బృందం. రథయాత్ర సమయంలో వారు దేవతామూర్తులతో పాటు రథాలపై సవారీ చేస్తూ ఈ పవిత్ర యాత్రకు నాంది పలుకుతారు. శతాబ్ధాల నాటి లయబద్ధమైన పద్య గానమైన డాహుక డక్కొ (డాహుక బోలి)ను ప్రదర్శిస్తారు. డాహుక తన లయబద్ధమైన గానంతో ఉద్బోధను ప్రారంభించేంత వరకు రథాలు కదలవని నమ్ముతారు. రథంపై నిలబడి ప్రాచీన శ్లోకాలను పఠిస్తూ, తన చేతిలోని కరత్రో రథాన్ని లాగే ప్రక్రియకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. పరోక్షంగా వీరి నుంచి సంకేతం రథాల కదలికకు సానుకూల పరిస్థితులని నిర్ధారించి సుగమం చేస్తుంది. పుష్ప సోయగం యాత్ర శోభతో శ్రీమందిరం పరిసరాలు పుష్పాల సుగంధంతో గుభాళించాయి. సింహద్వారం నిలువెత్తు పుష్ప సోయగం ఆహ్లాదభరితంగా పలకరించింది. చిత్తాభరణ శోభ యాత్ర ఆద్యంతాలు స్వామి కళకళలాడుతూ భక్త జనులను మురిపిస్తుంటాడు. రథాలపై ఆసీనుడు కావడంతో నుదుట వజ్ర వైడూర్య తదితర రత్న ఖచిత చిత్తాభరణం ధరించి మెరిసిపోయాడు. ప్రత్యేక తిథులు, ఉత్సవాలు సందర్భంగా మూలవిరాటుల నుదుట రత్నాలు పొదిగిన ఈ అమూల్య ఆభరణం అలంకరిస్తారు. (చదవండి: జగన్నాథుని వంటశాల ఎలా ఉంటుందంటే..! ఆఖరికి పొయ్యిలు కూడా..) -
మానవీయతే ఇస్లాం హృదయం
ఇస్లాం ధర్మం కేవలం కొన్ని ఆరాధనల సమాహారం కాదు; అది పరస్పర ప్రేమ, కరుణ, మాన వీయ విలువలతో కూడిన సంపూర్ణ జీవన విధానం. ‘భూమిపై ఉన్నవారి పట్ల మీరు దయ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు (సృష్టికర్త) మీ పట్ల దయ చూపుతాడు’ అనే ప్రవక్త (స) వారి బోధన ఇస్లామీయ మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది.ఒకరి కష్టాన్ని చూసి చలించి పోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలను ఆదరించడం, తోటి మనిషిని చిరునవ్వుతో పలకరించడం కూడా ఇస్లాంలో పుణ్యకార్యం (సదఖా)గా పరిగణించబడుతుంది. నిజమైన విశ్వాసం అనేది తోటి మనుషులకు మేలు చేయడంలోనే దాగి ఉందనేది ఇస్లాం అంతరార్థం. తన పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే, తాను మాత్రం తృప్తిగా భుజించేవాడు నిజమైన విశ్వాసి కాదనే హెచ్చరిక సమాజం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది.హృదయాలను ముక్కలు చేయడం కాదు, గాయపడిన హృద యాలను ఆప్యాయతతో కలపడమే ఇస్లాం నేర్పిన జీవన విధానం. మనుషుల మధ్య ద్వేషాన్ని తుడిచేసి, క్షమా గుణాన్ని, సహనాన్ని అలవర్చుకున్నప్పుడే ఒక మనిషి సృష్టికర్తకు అత్యంత ప్రియమైనవాడిగా మారతాడు. సృష్టిలోని ప్రాణులన్నిటినీ ప్రేమిస్తేనే దైవాన్ని ప్రేమించినవారమవుతామనే ఉదాత్త సందేశం ఇస్లామీయ జీవన విధానంలో ప్రతిధ్వనిస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
సిరి సంపదలు ఉన్ననాడే...
సిరి సంపదలు, భోగ భాగ్యాలు ఎల్లకాలం ఉండవు. కలకాలం ఒకే స్థాయిలోనూ ఉండవు, హెచ్చు తగ్గులు సహజం... సుమతీ శతకంలో సిరి సంపదలు ఎలా వస్తాయో, ఎలా పోతాయో చక్కగా చెప్పారు.‘సిరి దా వచ్చిన వచ్చునుసరసంబుగ నారికేళ సలిలం భంగిన్సిరిదా బోయిన బోవునుకరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతి’కొబ్బరికాయలో నీరు ఎంత సహజంగా ఉంటుందో, వస్తుందో అంత సహజంగా సిరి వస్తుంది.. పోయేటప్పుడు మాయం అయిపోతుంది.. ఏనుగు తిన్న వెలగ పండులో గుజ్జు కూడా కంటికి కనపడదు.... అలాగే ఎంత ప్రయత్నం చేసినా సిరి రాదు. సిరి రాకపోకలు మన చేతిలో లేవు.సంపదలు రాగానే చుట్టాలు వస్తారు..‘ఎప్పుడు సంపద గలిగిననప్పుడు బంధువులు వత్తురది’ అంటూ మంచి ఉపమానం చెప్తాడు, సుమతి...‘దెప్పలుగ జెరువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా’.. చెరువులో నీరు ఉన్నప్పుడు కప్పలు చేరుతాయ్.. మానవ నైజాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పాడు.‘పరసతి కూటమి గోరకుపరధనముల కాశపడకు, పరునెంచకుమీసరిగాని గోష్టి సేయకుసిరి చెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ’మనం చేయకూడని ఐదు పనులు చెప్పాడు.. పర స్త్రీ ని, పరధనాన్నీ వద్దని.. ఇతరుల దోషాలని ఎంచవద్దని.. సిరి చెడితే చుట్టాలు దగ్గరికి వెళ్ళ వద్దని సలహా..సిరి వచ్చినప్పుడు సిరి యైన గర్వింపకు సిరి లేనప్పుడు చింతింపకుము సిరియు విరియు నీరు సిరి కుప్ప వంటిది విశ్వదాభిరామ వినురవేమ! అంటాడు వేమనఅర్థం: డబ్బు వచ్చినా గర్వపడకు, లేకపోయినా బాధపడకు. సంపద నీటి బుడగ లాంటిది. మరో పద్యంలో సంపద వలన వచ్చే అనర్ధాలు చెప్తాడుసిరికి మదము మదమునకు కీడు కీడునకు మృత్యువు కీడునకు చేటు చేటునకు నరకము చేరుట తథ్యము విశ్వదాభిరామ వినురవేమ!సంపదతో మదం, మదంతో కీడు, కీడుతో నాశనం వస్తుందనిసిరి గలంత కాలము చుట్టములెల్లరు సిరి లేకున్న చుట్టములు చీకాకు సిరి లేని వాని జేరరు బంధులు భాస్కరా! వినుము కుజనుల వర్తనఅర్థం: డబ్బు ఉన్నంత కాలమే అందరూ చుట్టాలు. లేకపోతే దరిదాపుల్లోకి కూడా రారు.. ఇది వేమన చెప్పిన దానికి దగ్గరగా ఉంది.సిరి సంపదలు నిల్చునా శాశ్వతముగా క్షణములోపల నశించు క్షీరతరంగ కావున దానధర్మముల కడకు వినియోగ భాస్కరా! వినుము సుజనుల మర్యాదసంపద శాశ్వతం కాదు, క్షణంలో పోతుంది. అందుకే దానధర్మాలకు వాడాలని సలహా, సుమతీ శతకం నుండి.లక్ష్మీ స్తనోపరి లుఠతి క్వచిదపి క్వచిత్ నేత్రాంతరాళముపయాతి క్వచిత్ క్వచిత్ చ ఏవం క్రమేణ సకలా జగదీశ్వరీ సా చంచలా పునరుపైతి చ నైవ యాతి... ఇది భర్తృహరి చెప్పిందిలక్ష్మి ఎప్పుడూ ఒకచోట ఉండదు. ఎవరి రొమ్ముపై, ఎవరి కంటి ముందు ఆడుతుందో తెలియదు. అందుకే చంచలమైనది.. మరో చోట సంపద శాశ్వతం కాదు అంటాడుయేషా దానపరో న భోగరతః యో నైవ విద్యార్జనే తస్యార్థస్య ఫలం త్రిధైవ భవతి దానం భోగో నాశఃడబ్బును దానం చేయని వాడు, అనుభవించని వాడు, చదువుకు వాడని వాడు ఉంటే ఆ డబ్బు మూడు విధాలుగా పోతుంది – దానం, భోగం, లేదా నాశనం. సిరి సంపదలు సక్రమ మార్గంలో సం΄ాదించాలి.. నీతిగా నిర్వహించాలి..అలాగే సక్రమమైన పద్ధతిలో ఖర్చు పెట్టాలి.. సిరి సంపదలు శాశ్వతం కాదు.. మన మధ్య ప్రేమలు, అనురాగాలు, ఆ΄్యాయత, బంధం, బంధుత్వం శాశ్వతం.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
సహనం ఒక వెలుగుబాట
ఉపకోసల కామలాయనుడు సత్యకామ జాబాలుని ఆశ్రమంలో శిష్యునిగా 12 సంవత్సరాల΄ాటు గురు శుశ్రూష చేస్తూ, యజ్ఞాగ్నులకు శ్రద్ధతో సేవచేసాడు. అతని వినయం, క్రమశిక్షణ, సేవాభావం అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకరోజు గురువుగారు ఇతర శిష్యులకు విద్యను బోధించి వారిని యింటికి పంపించేశారు.ఉపకోసలునికి మాత్రం బ్రహ్మవిద్య బోధించకుండా ప్రయాణమై వెళ్ళిపోయారు. గురుపత్నికి ఇది బాధ కలిగించి గురువుగారితో అంది ‘‘ఉపకోసలుడు ఎన్నో సంవత్సరాలు నిష్ఠగా సేవచేశాడు. అతనికి కూడా జ్ఞానం బోధించండి’’ అంది. కానీ గురువుగారు పట్టించుకోలేదు. ఉపకోసలునికి నిరాశ కలిగినా గురువుగారిపై కోపంగాని, ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడంగాని, తన సేవను ఆపడం గాని చేయలేదు. తన మనసును పవిత్రంగా ఉంచుకుంటూ ఉపవాసం చేశాడు. అతని భక్తికి, సహనానికి ముగ్ధులై ఆశ్రమంలోని 3 యజ్ఞాగ్నులు (గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని) అతనితో మాట్లాడి అతనికి బ్రహ్మ తత్వంలోని అనేక రహస్యాలు బోధించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాయి. (యజ్ఞాగ్నులు ఉపకోసలునితో మాట్లాడినట్టు చెప్పడం ఒక ప్రతీకాత్మక బోధన.)గురువు గారు తిరిగివచ్చిన తరువాత ఉపకోసలుని ముఖంలో అపూర్వమైన తేజస్సు చూసి ‘‘నీకు ఈ జ్ఞానాన్ని ఎవరు బోధించారు’’ అని అడిగారు. ఉపకోసలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. అప్పుడు గురువుగారు అగ్నులు బోధించిన జ్ఞానాన్ని సంపూర్ణం చేస్తూ బ్రహ్మస్వరూ΄ాన్ని పూర్తిగా ఉపదేశించాడు. ఉపకోసలుని సహనం ఫలించింది. గురుభక్తి వృథాకాలేదు. నిష్కామ సేవ మనసుని శుద్ధిచేసి జ్ఞాన΄ాత్రుని చేసింది. ఓర్పుతో, విశ్వాసంతో, నిష్ఠతో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృథాకాదు. సమయమొచ్చినపుడు అది విజయాన్ని, జ్ఞానాన్ని, అంతరంగ వికాసాన్ని ప్రసాదిస్తుంది. బాహ్య దృష్టితో చూస్తే యజ్ఞాగ్నులు యజ్ఞకుండంలో వెలిగే అగ్నులు. అంతర్గతంగా అవి మనలోని జ్ఞానానికి, శ్రద్ధకు, భక్తికి, ఆత్మ జిజ్ఞాసకు ప్రతీకలు.– డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
ప్రత్యామ్నాయంలేని ప్రేమ యాత్రలు
దేవుని వరమైన మెస్సీయాను, ఆ మెస్సీయ అనబడే క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా ఎవరిని ఊహించనైనా ఊహించలేము. ప్రేమకు ప్రతిరూపం అయినా ఆయన ప్రేమయాత్రలకు కూడా ప్రత్యామ్నాయాలు కనుగొనలేము. యేసు జీవితాన్ని ఆయన ప్రేమ సంబంధ పాదయాత్రలను వేరు చేసి ఎన్నడూ చూడలేము. తల్లిదండ్రులకు లోబడుతూ పెద్దలైన మనుష్యులు దయయందును, దేవుని దయయందును వర్ధిల్లిన బాల్యజీవితం యేసుది.బాలయేసు కార్టూన్ చిత్రాలలో ఆయన పాత్ర తీరుతెన్నులు ఆకాశంలో విహరించక పిల్లలను నైతిక విలువలతో అలరించడమే కాక పెద్దల పర్యవేక్షణలో సత్ప్రవర్తనతో మెలిగేలా ్రపోత్సహించడం విశేషం. అన్ని భాషల్లోని నవలా నాయకులు లేదా సినిమా, టీవీ కథానాయకుల (ప్రోటోగనిస్ట్స్) పాత్రల సృష్టిలో, ఈనాటి నేటి ఏఐ ఆధారిత వీడియోల ముఖ్య ప్రధాన పాత్రలలో వాటి ఉన్నతమైన వైవిధ్య విధాన రూపకల్పనలలో, మరి ముఖ్యంగా ‘హీరోహోదా’ కోసం యేసు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన బోధలు, మాటలను పోరాటపటిమ స్ఫూర్తిని వాడుతూ డబ్బు చేసుకుంటున్న నిర్మాతలకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి కొదువలేదు.వ్యక్తి పూజకు చోటిచ్చేలా సంతోషానందాలు ఇవే అనుకొనే భ్రమలలోనే అమాయక యువత చిక్కుకొని తమ విలువైన సమయం వెచ్చిస్తూ వినోదం కొనుక్కొనే వేళలలోనే ఇట్టి నయా ప్రేక్షకులను తెరనాయకులు థియేటర్లలో ఆకస్మికంగా వారిని దర్శించడం కంటె కూడా... బాధితులను, రోగులను, బీదలను, వృద్ధులను, నిరుపేద విద్యార్థులను ఆదుకొనేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరామర్శించటం ఆదరించడం నిజమైన నాయకుల సహజ స్వాభావిక దైవిక లక్షణంగా అది ఎంచదగ్గదే. మేలైన రీతులలో వారిని గుర్తించదగ్గదే. ఎక్కడో మారుమూల పల్లెలతో పాటుగానే, నిలువనీడ లేనివారై ΄÷ట్ట చేతపట్టుకొని వచ్చి నగరాలను నిర్మించే వలస కార్మిక శ్రమజీవులు ఎక్కడున్నా వారి గుడారాల చెంతనే వారిని పరామర్శిస్తూ వారికి న్యాయసంబంధ సేవలందించడం క్షేత్రస్థాయి పర్యటనే.నిజానికి బీదలు, రోగులు, ఖైదీలను దైవిక ప్రేమతో పరామర్శించి వారికి ధైర్యం నూరిపోస్తే ఇలా క్రియరూపాన ఆ గొప్పదైన ప్రేమను అంతటా కనబరిస్తే మీరు నన్నే ప్రేమించినట్టు అని యేసే స్వయంగా చెప్పడం విశేషం. గొప్ప గొప్ప నాయకులకే చెల్లును పాదయాత్రలు అంటూ అవి వారికే పరిమితం చేయక ఇలా ఎవరికి వారు అనుకోక వ్యక్తుల మేలు కోరి వ్యక్తిగతంగా దూర భారాలను లెక్కచేయక యేసును బట్టి యేసు ప్రేమతో యేసు మెప్పు పొందేలా ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చు.భవిష్యద్దర్శనం వాస్తవంలోనే నిలబెట్టి గెలిపిస్తుంది. కలల్లో ఊహల్లో సంచరిస్తూ గాల్లోతేలియాడడం కాక నేలమీదనే హుందాగా నిలబడడం నాయకత్వం. నడక నాయకత్వ లక్షణం కూడానూ. సకాలంలో స్పందించేలా నేరుగా వచ్చి అతి దగ్గరగా సమస్యలను వాటి ప్రభావ విపత్తులను చూసేలా వాటి పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా కృషి చేసేలా ఇలా సామాన్య జనంబాట పడుతూ దీనజనుల పరామర్శకు, బాధితుల ఓదార్పుకు నాయకుడనేవాడు తన పాదాలను నమ్ముకోవడం ఎప్పుడూ ఉత్తమమే. ఇలాంటి వీరే యేసువలె విజయ సృష్టికర్తలుగా, తిరుగులేని నాయకులుగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకోగలుగుతారు.– జేతమ్ -
ప్రకృతి గుండె చప్పుడు విందాం
మన్హా.. పదేళ్ల పసిపాప. ఆమెకు అడవి అంటే కేవలం చెట్లు కాదు, అది ఆమె ప్రాణ స్నేహితురాలు. తన చిన్నారి చేతులతో అల్లిన వెదురు బుట్టలో సేకరించిన విత్తనాలను తీసుకుని ఆమె అరణ్యంలోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ ఆమె రాకను గమనించిన పక్షులు, ఒకదానికొకటి వార్తను పంచుకుంటూ ఆమె చుట్టూ వందలాదిగా చేరేవి. అవి ఆమె భుజాల మీద, తల మీద వాలుతూ ఒక అపురూపమైన ఆత్మీయతను పంచేవి. మన్హా విత్తనాలను నేలపై చల్లుతుంటే, అవి ముత్యాలను ఏరుకున్నట్లు గింజలను ఏరుకుంటూ చేసే ఆ ‘కిలకిలలు’ ఆమె ప్రపంచానికి సంగీతం.కానీ ఆ రోజు, ఆమె అడుగుల చప్పుడు తప్ప అడవిలో మరే శబ్దమూ లేదు. ఆకాశం నీలి రంగును కోల్పోయి, ఏదో తెల్లని పొగమంచులాంటి దుమ్ముతో నిండిపోయింది. ఆమె పరుగు పరుగున తన అభిమాన రావి చెట్టు దగ్గరకు వెళ్లింది. వందలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఆ వృక్షం, ఇప్పుడు ఒక అస్థిపంజరంలా కనిపిస్తోంది. దాని ఆకులన్నీ రాలిపోయి, ఆ కొమ్మలు ఆకాశం వైపు చూస్తూ, ‘నన్ను కాపాడండి’ అని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. ‘నా స్నేహితులు ఏమయ్యారు? ఆ చిన్న పిచ్చుకమ్మ ఏది? నీలి రంగు రెక్కల పిట్ట ఏమైంది?’ అని మన్హా ఆ చెట్టును తాకుతూ వెక్కి వెక్కి ఏడ్చింది.అక్కడే ఒక బండరాయిపై కూర్చున్న వృద్ధ కాపరి, తన చిరిగిన కంబళిని సరిచేసుకుంటూ కన్నీరు నిండిన కళ్లతో అన్నాడు.. ‘అమ్మాయి.. అవి ఇక రావు. ఈ గాలిలో విషం ఉంది. మనం చేస్తున్న గనుల తవ్వకాలు, ఆ యంత్రాల కర్కశపు శబ్దాలు, పర్వతాలను పగులగొడుతున్న బాంబుల మోతలు.. ఆ సున్నితమైన జీవాలు భరించ లేకపోయాయి. చెట్టుప్రాణం పోయింది, పిట్ట రెక్క విరిగిపోయింది. మనిషి తన కడుపు నింపుకోవడానికి ఈ అడవి తల్లి కడుపును కోసేస్తున్నాడు’.మన్హాకు ఆ మాటలు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె చేతిలోని విత్తనాలు నేలపై జారిపోయాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే అడవి, ఇప్పుడు ఒక ఎండిన ఎడారిలా ఆమె కళ్ల ముందు కనిపిస్తోంది.ఈ చిత్రం కేవలం ఒక ఊరుకో, ఒక అడవికో పరిమితం కాదు. భూమికి ఒక వైపున, మంచు ఖండాలు కన్నీరులా కరిగి సముద్రంలో కలిసిపోతున్నాయి. బంగారం, బొగ్గు, చమురు.. ఇవి మనిషికి సంపద కావచ్చు, కానీ ప్రకృతికి అవిప్రాణాధారాలు. మనిషి తన స్వార్థంతో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంటే, భూమి ఇప్పుడు అల్లాడిపోతోంది. ఊపిరి అందని నగరాలు, పంటల్లేని పొలాలు, అకాల వరదలు, అంతుచిక్కని వ్యాధులు.. ఇవన్నీ భూమి తల్లి పెడుతున్న కేకలు! కానీ.. ఈ విషాదంలోనూ ఒక చిన్న ఆశ మిగిలి ఉంది.మరుసటి రోజు కూడా మన్హా నిరాశ చెందలేదు. తన కళ్లను తుడుచుకుని, మళ్లీ బుట్ట నిండా విత్తనాలు నింపుకుని అడవికి వెళ్ళింది. పక్షులు లేవని ఆమెకు తెలుసు, కానీ అవి వస్తాయన్న నమ్మకం ఆమెది. అకస్మాత్తుగా, ఎండిపోయిన ఒక కొమ్మ చివర నుండి ఒక సన్నని గొంతు వినిపించింది. అది ఆమెకు బాగా తెలిసిన ఆ చిన్న పిచ్చుక! అది నీరసంగా ఉన్నా, మన్హా వైపు చూస్తూ రెక్కలు ఆడిస్తోంది.ఆ ఒక్క పక్షి మన్హాకు ఒక గొప్ప సత్యాన్ని బోధించింది: ‘నువ్వు ఒక్క అడుగు ముందుకేసి ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టు, నేను మళ్లీప్రాణం పోసుకుంటాను.‘ మన్హా నాటుతున్న ఆ చిన్న విత్తనం రేపు ఒక మహావృక్షం కావాలి. మనందరిలోనూ ఆ మన్హా మేల్కొనాలి. లేదంటే, ప్రకృతి లేని ప్రపంచంలో మనిషి కూడా ఒక శిలాజంలా మిగిలి పోవాల్సి వస్తుంది.– ముహమ్మద్ ముజాహిద్ -
వారాహి గుప్త నవరాత్రులంటే ఏమిటి?
నేటి ఆధునిక సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ కలహాలు, అనారోగ్యం. వాటితోపాటు న్యాయపరమైన, ఆర్థిక పరమైన ఇబ్బందులు, శత్రు బాధలు సర్వసాధారణం అయిపోయాయి. ఇటువంటి సమస్యలు వారాహి దేవి ఆరాధనతో తొలగిపోతాయని, ముఖ్యంగా వారాహి దేవిని ఆరాధిస్తే శత్రు బాధలు తొలగిపోతాయని, మన ససమ్యలన్నింటికీ అమ్మ అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందనీ నమ్మకం. శక్తి దేవతల ఆరాధనకు ప్రసిద్ధి చెందిన విశిష్టమైన కాలం ఆషాఢ నవరాత్రులు. ఈ ఏడాది వారాహి గుప్త నవరాత్రులు బుధవారంప్రారంభం అయ్యాయి. ఈ నవరాత్రుల్లో ఆచరించాల్సిన విధివిధానాలేమిటో తెలుసుకుందాం.తెలుగు పంచాంగం ప్రకారం వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి, నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది జూలై 15, బుధవారం ప్రారంభమయ్యాయి. 23, గురువారం వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ పవిత్ర దినాలలో శ్రీ వారాహి అమ్మని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మ అనుగ్రహంతో కష్టాలనుంచి, చిక్కుల నుంచి బయట పడవచ్చునని శక్తి ఉపాసకులు చెబుతారు.గుప్త నవరాత్రులంటే ఏమిటి? ’గుప్త’ అంటే రహస్యం. ఈ నవరాత్రులలో అమ్మవారిని రహస్యంగా, నిష్టతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులని కూడా అంటారు.వారాహి దేవి ఎవరు?లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు. సప్త మాతృకలలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు అత్యంత శక్తిమంతమైన రూపం. ఈమె పరమేశ్వరుడి అనుగ్రహంతో అంధకాసుర సంహారం కోసం అవతరించినట్లు దేవీ పురాణం చెబుతోంది.పూజా విధానంవారాహి గుప్త నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య వారాహి దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని దేవి పురాణం చెబుతోంది. సూర్యాస్తమయం తరువాత శుచిగా స్నానం ఆచరించి అమ్మవారి రూపాన్ని ప్రతిష్టించి మనసులో సంకల్పం చెప్పుకుని 9 రోజుల దీక్ష తీసుకోవాలి. వారాహి అమ్మ వారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్టించాలి.నైవేద్యాలు... దాన ధర్మాలుప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయాలి. అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనస్సుతో వారాహి మూల మంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూప దీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతారు.పూజాఫలం ఏమిటి? భక్తిశ్రద్ధలతో వారాహి గుప్త నవరాత్రుల వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు, వారాహి దేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివద్ధి కలిగి, సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయ కేతనం ఎగుర వేయాలంటే వారాహి దేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెబుతున్నారు.రూపం ఉగ్రం... మానసం శాంతంవారాహి దేవి ఉగ్రంగా కనబడినప్పటికి తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ఈ ఆషాఢంలో వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రు పీడలు ఉండవని భక్తుల విశ్వాసం.క్షేత్ర పాలికగా వారాహీ దేవిసాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్ర పాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులు శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవీ ఉపాసకులు అంటారు.ఈ వారాహి నవరాత్రులలో మనం కూడా వారాహి దేవిని 9 రోజులపాటు పూజించి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు పొందుదాం.– ఎం. శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం -
జగన్నాయకుడి జనయాత్ర
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, పూజనీయమైన హిందూ పండుగలలో ఒకటి జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఆలయంలో కొలువై ఉన్న మూలమూర్తులు ముగ్గురూ ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులను కలుసుకోవడానికి వెళతారు. ఈ రథయాత్రలో పాల్గొనడం, దానిని వీక్షించడం అనంతమైన పుణ్యఫలాలను చేకూరుస్తుందని ఆ గ్రంథాలు నొక్కి చెబుతున్నాయి.జగన్నాథ రథయాత్ర కేవలం పూరీకే పరిమితం కాదు. నేడు ఇది ఒక ప్రపంచవ్యాప్త వేడుకగా మారింది. పూరీ ప్రధాన కేంద్రం అయినప్పటికీ, ఈ ఉత్సవం ఇప్పుడు భారతదేశంలోని అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, లండన్, న్యూయార్క్, టొరంటో, సిడ్నీ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర నగరాలలో కూడా జరుపుకుంటారు.రథయాత్ర రోజు తెల్లవారుజాము నుండి పూరీ నగరం మొత్తం భక్తిజనంతో నిండి΄ోతుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ముందుగా దేవతా విగ్రహాలను పహండి అనే ఆచారంతో గుడి నుండి బయటకు తీసుకువచ్చి రథాలపై అధిష్టింపజేస్తారు. అప్పుడు శంఖారావాలు, మేళాలు, జయజయ ధ్వానాలతో ఆప్రాంతమంతా మారుమోగుతుంది.ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన రథం ఉంటుంది. జగన్నాథుని రథం పేరు నందిఘోష. ఇది ఎరుపు, పసుపు రంగులలో ఉంటుంది. దీనికి 16 పెద్ద చక్రాలు ఉంటాయి. బలభద్రుని రథం పేరు తాళధ్వజ. ఇది ఆకుపచ్చ, ఎరుపు రంగుల లో ఉంటుంది. దీనికి 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు దర్పదలన లేదా దేవదలన. ఇది నలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. ఈ రథాలు చూడటానికి ఎంతో వైభవంగా ఉంటాయి.జగన్నాథ రథయాత్ర మనకు నేర్పే గొప్ప పాఠం సమానత్వం, కరుణ, భక్తి. జగన్నాథుడు భక్తులను కలుసుకోవడానికి స్వయంగా గుడి నుండి బయటకు వస్తారు. రాజు కూడా బంగారు చీపురుతో సేవ చేస్తారు. అందరూ కలిసి ఒకే తాడు లాగుతారు. ఇక్కడ చిన్న పెద్ద, పేద గొప్ప అనే తేడా ఉండదు. అందరూ ‘జై జగన్నాథ్’ అనే ఒక్క నామంతో ఒక్కటవుతారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత సమ్మిళితమైన హిందూ ఉత్సవం. రథాలను లాగడంప్రారంభించే ముందు ఒక అత్యంత ముఖ్యమైన ఆచారం జరుగుతుంది. దానిపేరు ఛేరా పహారా. జగన్నాథుని ముఖ్యసేవకుడిగా భావించే పూరీ గజపతిరాజు ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. రాజు బంగారు చీపురును చేతిలో పట్టుకుని చం దనం నీటిని చల్లుతూ మూడు రథాల వేదికలను స్వయంగా ఊడుస్తారు. తర్వాత రథాల చుట్టూ ప్రదక్షిణ చేసి దీపం వెలిగిస్తారు. ఛేరా పహారా తర్వాత ప్రధాన పండా ‘జై జగన్నాథ్’ అని గట్టిగా నినాదం ఇస్తారు. వెంటనే వేలాదిమంది భక్తులు తాళ్లను పట్టుకుని రథాలను లాగడం మొదలుపెడతారు. మొదట బలభద్రుని రథం, తర్వాత సుభద్రాదేవి రథం, చివరగా జగన్నాథుని నందిఘోష రథం కదులుతుంది.ఈ రథాలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వెళతాయి. ఇది జగన్నాథుని మేనత్తగారి ఇల్లని నమ్ముతారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు దేవతలు విడిది చేస్తారు. ఈ తొమ్మిది రోజులు భక్తులు స్వామిని అక్కడే దర్శించుకుంటారు. గుండిచా ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు.తొమ్మిది రోజుల తర్వాత దేవతలు తిరిగి తమ ప్రధాన ఆలయానికి వస్తారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు. బహుదా యాత్ర తర్వాత 11వ రోజు సునావేశం అనే వేడుక జరుగుతుంది. ఈ రోజు దేవతలను బంగారు ఆభరణాలు, బంగారు కిరీటాలు, బంగారు చేతులు, బంగారు కాళ్ళతో అలంకరిస్తారు. చివరగా 12వ రోజు నీలాద్రి విజయం అనే ఆచారంతో దేవతలు తిరిగి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. దానితో రథయాత్ర ముగుస్తుంది. – కుందా శ్రీ కృష్ణ శాస్త్రి -
పిడుగుతో పగిలిపోయే శివలింగం..!
లోకాన్ని రక్షించడం కోసం పరమశివుడు హాలాహలాన్ని మింగి గరళకంఠుడయ్యాడని మనకు తెలుసు. కానీ.. తన భక్తులను కాపాడుకోవడం కోసం, ఆకాశం నుంచి విరచుకుపడే భీకరమైన పిడుగులను సైతం ఆ భోలాశంకరుడు తన గుండెపైకి తీసుకునే ఒక వింత ఆలయం మన దేశంలో ఉందనే విషయం మీకు తెలుసా? అవును.. ఇది నిజం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అద్భుతం..! ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆకాశం నుంచి వచ్చే మహా పిడుగు నేరుగా ఆ శివలింగంపైనే పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం ముక్కలు ముక్కలైపోతుంది. కానీ.. ఆ తర్వాత జరిగే వింత చూస్తే మీ ఒళ్లు గగుర్పొడుస్తుంది..! హిమాచల్ప్రదేశ్లోని మంచు కొండల మధ్య దాగున్న ఆ అంతుచిక్కని సైన్స్ ఏంటి..? ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటి..? ఆ భోళా శంకరుడి లీల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.. -
రేపటి నుంచే 'వారాహి గుప్త నవరాత్రులు'.. పూర్తి పూజా విధానం ఇదిగో
సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు రేపటి నుంచి (జూలై 15, బుధవారం) వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటి నుంచి ప్రారంభమై జూలై 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా సాగనున్నాయి.లలితా త్రిపురసుందరి దేవి మహా సైన్యాధిపతి అయిన వారాహి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు నిష్ఠతో, గుప్తంగా ఆరాధిస్తే సమస్త నరఘోషలు, శత్రుపీడలు, అప్పుల బాధలు తొలగిపోతాయని దేవీ భాగవతం చెబుతోంది. భక్తులు ఈ పవిత్ర దినాలలో ప్రతిరోజూ పూజ గదిని శుభ్రం చేసుకుని, ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి, అమ్మవారి మూల మంత్రాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన బెల్లం పానకం, శనగలు, పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
అనుగ్రహం అవసరం!
సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.– ఎం.మారుతి శాస్త్రి -
సైన్స్కు షాక్ ఇచ్చిన గణేశుడు.. ఆర్నెల్లు నలుపు.. ఆర్నెల్లు తెలుపు
మనం ఇప్పటి వరకు ఆధ్యాత్మకతకు సైన్స్ను జోడిస్తూ.. సైన్స్ కూడా ఛేదించలేని కొన్ని ఆలయాల విశేషాలు తెలుసుకున్నాం కదా? నేను ఈరోజు మీకు అలాంటి మరో అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి..! దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నించే నాస్తికులను సైతం ముక్కున వేలువేసుకునేలా చేస్తున్న బ్లాక్ అండ్ వైట్ గణేశుడి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆ గణపతి విగ్రహం ఇప్పటికీ సైన్స్కు అంతు చిక్కలేదు. విశేషం ఏంటనుకుంటున్నారా?సంవత్సరంలో రెండు ఆయనాలుంటాయి. అవి ఉత్తరాయణం, దక్షిణాయనం. ఆ గణపతి విగ్రహం ఉత్తరాయణంలో నలుపు రంగులో.. దక్షిణాయనంలో తెలుపురంగులో ఉంటుంది. ఆ విగ్రహం ఎదుట ఉండే బావిలో నీరు విగ్రహం రంగుకు వ్యతిరేక వర్ణంలో ఉండడం గమనార్హం..! అంటే.. విగ్రహం తెల్లగా ఉన్నప్పుడు బావినీళ్లు నల్లగా.. విగ్రహం నలుపు రంగులో ఉన్నప్పుడు బావినీళ్లు తెల్లగా ఉంటాయి. అంతేకాదు.. ఆ ఆలయంలోని మర్రిచెట్టు వింత కూడా సైన్స్కు చిక్కడం లేదు.తమిళనాడు – కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి జిల్లా సమీపంలో.. నాగర్కోయిల్కు దగ్గర్లోని కేరళపురం అనే గ్రామంలో ఉన్న 'శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం' ఈ కోవలోకే వస్తుంది. పేరులోనే ఉంది కదా.. 'అతిశయ వినాయకర్'.. అంటేనే అద్భుతాలు చేసే వినాయకుడు అని అర్థం. ఈ రోజు ఈ వీడియోలో ఆ ఆలయం గురించి తెలుసుకుందామా? -
ధర్మానికి ప్రతీక విదురుడు
మహాభారతంలో విదురుడు ధర్మానికి, జ్ఞానానికి ప్రతీక. విదురుడు అంబిక, అంబాలికల దాసి అయిన పరిశ్రమి కి జన్మించినప్పటికీ, తన అపారమైన మేధస్సు, ధర్మవర్తనతో కురు సామ్రాజ్యాధిపతి ధృతరాష్ట్రునికి ప్రత్యేక సలహాదారుగా, ప్రధానమంత్రిగా ఎదిగాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి ప్రముఖులు కొన్ని సందర్భాలలో విదురుని వద్దకు సలహాల కోసం సంప్రదించేవారు. విదురుడు శ్రీ కృష్ణునికి పరమ భక్తుడు, పాండవుల శ్రేయోభిలాషి.విదురుని జీవితంలో ముఖ్యాంశాలు...విదురుని జన్మరహస్యం ఒక ప్రత్యేకం. కురువంశాన్ని నిలబెట్టి, రక్షించడానికి దేవర న్యాయం ద్వారా వేదవ్యాసుడు అంబిక వద్దకు వెళ్లగా, ఆమె భయంతో కళ్ళు మూసుకోవడంతో అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. ఆ తర్వాత అంబాలిక భయపడి పాలిపోయినట్లు అవడంతో ఆమెకు పాండురోగంతో కూడిన పాండురాజు జన్మిస్తాడు. మూడవసారి రాణి అంబిక తన దాసి అయిన పరిశ్రమిని పంపగా, ఆ దాసి భయపడకుండా వ్యాసునికి సేవలు చేస్తుంది. దేవరన్యాయం ద్వారా ఆమెకు జ్ఞానస్వరూపుడైన విదురుడు జన్మిస్తాడు. మాండవ్య మహర్షి శాపం వల్ల భూమిపై యమధర్మ రాజు అంశ దాసీపుత్రుడిగా విదురుని పేరుతో జన్మించవలసి వచ్చింది. మొదటి నుండి విదురుడు ఎంతో సత్ ప్రవర్తన కలిగిన వాడు. మహాభారతంలో అత్యంత నీతిపరుడిగా పేరుగాంచాడు. కురుసభలో పాండవులకు జరిగిన అన్యాయాలను, ద్రోహాలను ఖండించాడు. విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన నీతులను ‘విదుర నీతి’ అని పిలుస్తారు. ఈ నీతి అత్యంత ప్రాచీనమైన, విలువైన జీవిత సత్యాలను బోధిస్తుంది. విదురునికి ప్రారంభం నుండి కృష్ణ భక్తి ఎక్కువ. కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేందుకు విదురుడు ఎంతో ప్రయత్నించాడు. ఇందుకోసం ద్వారక నుండి రాయబారిగా వచ్చిన శ్రీ కృష్ణుడు కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు ఏర్పాటు చేసిన ఆతిధ్యాన్ని తోసిపుచ్చి, ధర్మ కోవిదుడైన విదురుని ఇంటే బస చేసి ఆతిథ్యం స్వీకరించాడు. యుద్ధం అనివార్యం అయినప్పుడు విదురుడు కౌరవ పక్షం వహించలేదు. విదుర నీతిలోని ముఖ్యాంఖాలు వచ్చేవారం.... – సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
జగన్నాథుని వంటశాల ఎలా ఉంటుందంటే..! ఆఖరికి పొయ్యిలు కూడా..
ఒడిశా నుంచి విస్తరించిన మహాప్రభు జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల రథయాత్ర ఇప్పుడు యావత్ భారతదేశంలో వ్యాపించింది. ఈ ఏడాది జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఈ దివ్య యాత్ర నేపథ్యంలో, జగన్నాథుని రథయాత్ర సంప్రదాయం, ఆయన మహా వంటశాల గురించిన ఆసక్తికర విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.వేద కాలం నుంచి రథ సంప్రదాయంవేదాల్లో దేవి ఉష, అగ్ని దేవుడి రథాల ప్రస్తావన ఉంది. భారతదేశంలో రథ ఆకృతిలో నిర్మించిన అనేక ఆలయాలు ఉన్నాయి — కోణార్క్ ఆలయం, సీమాచల ఆలయం వంటివి 'రాతి రథాలు'గా పేరొందాయి. దక్షిణ భారతదేశంలో తిరువనంతపురం త్యాగరాజ ఆలయం, సూచీంద్రం, మీనాక్షి, శ్రీరంగం ఆలయాల్లో కూడా రథయాత్ర సంప్రదాయం ఉంది. ఒడిశాలోని శ్రీలింగరాజ్, జాజ్పూర్ దేవి బిరజా రథ సంప్రదాయాలు కూడా చాలా ప్రాచీనమైనవి. ఒడిశా జగన్నాథ రథ మహోత్సవం మాత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇది క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలోనే మొదలైనట్లు భావిస్తారు — రాజు ఇంద్రద్యుమ్నుడు మొదటిసారి చతుర్ధామూర్తులను రథంపై సింహద్వారం వైపు తీసుకువచ్చినట్లు స్కంద పురాణంలో ప్రస్తావన ఉంది.చరిత్రలో వివిధ కాలాల ప్రస్తావనలు'రథచక్రడ' అనే పురాతన గ్రంథం ఆధారంగా, తొమ్మిదో శతాబ్దంలో మహారాజు యయాతి కాలంలో కూడా రథయాత్ర జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆనాడు ఏడు రథాలు నిర్మించేవారు — శ్రీవిగ్రహాలు మూడు రథాల్లో వెళ్లగా, వాటికి ముందు గుర్రాలు లాగే చిన్న రథం నడిచేది. 13వ శతాబ్దంలో మహారాజు మొదటి భానుదేవుని కాలంలో ఆరు రథాలకు బదులు మూడు రథాలు మాత్రమే ఉండేవని చరిత్రకారులు పేర్కొంటారు.సామాజిక సమానత్వానికి ప్రతీకరథ నిర్మాణంలో తొలుత ఏడుగురు ప్రత్యేక సేవకులు (సప్తరథకారులు) ఉండేవారు, తర్వాత ఇది 36 విభాగాలుగా విస్తరించింది. సూర్యవంశ పాలనలో రథ నిర్మాణం, నిర్వహణ కోసం 64 రకాల సేవకులను నియమించేవారు. ఈ సంప్రదాయంలో నాలుగు వర్ణాల ప్రజలు పాల్గొనేవారు, పాల్గొంటున్నారు — దళిత సమాజానికి చెందిన ఏడు రకాల సేవకులు నేటికీ రథ నిర్మాణంలో సేవలందిస్తున్నారు. అందరికీ సమాన హక్కులు కల్పించడమే ఈ యాత్రను ఒడిశా అంతటి 'జనయాత్ర'గా మార్చిన అసలు రహస్యం.మహాప్రభు మహా వంటశాలజగన్నాథుని వంటశాల సనాతన సంస్కృతిలోనే అతిపెద్ద, అత్యంత పవిత్రమైన వంటశాలగా పేరొందింది. ఆలయ ఆగ్నేయ ప్రాంగణంలో ఉన్న ఈ మహా వంటశాలలో సుమారు 240 పొయ్యిలు నిరంతరం మండుతూ ఉంటాయి. వందలాది బ్రాహ్మణ వంటవారు, వారి సహాయకులు పూర్తి పరిశుభ్రతతో ఇక్కడ సేవలందిస్తారు.ఇక్కడ అన్నం కేవలం కొత్త మట్టి పాత్రల్లోనే వండుతారు. ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి నిలువుగా పేర్చి పొయ్యిపై ఉంచుతారు. సాధారణ భౌతిక సూత్రాలకు విరుద్ధంగా, ఇక్కడ మంటకు అత్యంత దూరంగా ఉన్న పైభాగపు కుండలోని ఆహారమే మొదట ఉడుకుతుంది, మంటకు అతి దగ్గరగా ఉన్న అడుగు కుండలోని ఆహారం అన్నింటికంటే చివర్లో ఉడుకుతుంది.జగన్నాథుని మహాప్రసాదంలో రెండు రూపాలుంటాయి — 'సంఖుడి' (సాదా అన్నం, నెయ్యి-బియ్యం, తీపి కనిక, కంది పప్పు, డాల్మా వంటి వండిన వంటకాలు), 'సుఖిల' (చాశనీతో కూడిన ఖాజా, పాల మీగడతో చేసిన సర్పులీ వంటి ఎండు తీపి పదార్థాలు). ఈ వంటశాలలో ఉల్లి-వెల్లుల్లి నిషేధమే కాదు, బంగాళదుంప, టమాటా, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి వంటి విదేశీ మూలం ఉన్న కూరగాయలు ఒక్క గింజ కూడా లోపలికి రావు. కారానికి కేవలం మిరియాలు, శొంఠి మాత్రమే వాడతారు. నీరు కేవలం 'గంగ', 'యమున' అనే బావుల నుంచే తీసుకుంటారు.12 రోజులు విశ్రాంతి తీసుకునే పొయ్యిలురథయాత్ర సమయంలో భగవానుడు ప్రధాన ఆలయాన్ని వదిలి రథంపై కూర్చున్నప్పుడు, 12 రోజుల పాటు మహా వంటశాలలోని పొయ్యిలు విశ్రాంతి తీసుకుంటాయి. ఈ సమయంలో మహాప్రభుకు కేవలం ఎండు, చల్లని నైవేద్యాలే సమర్పిస్తారు. అనంతరం శ్రీవిగ్రహాలు తమ మేనత్త ఇంటికి — అంటే శ్రీ గుండిచా ఆలయానికి చేరుకున్నప్పుడు, అక్కడి తాత్కాలిక వంటశాల మళ్లీ మొదలవుతుంది. అదే సప్త-హండి సంప్రదాయ పద్ధతిలో వేడి అభడ (ప్రసాదం) తిరిగి తయారవుతుంది. దారిలో మేనత్త ఇంటి వద్ద రథం ఆగినప్పుడు, భగవానుడికి ప్రత్యేకంగా పోడ పిఠా నైవేద్యంగా సమర్పిస్తారు. -
వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న శాపగ్రస్త నగరం..!
ఊహించుకోండి.. చుట్టూ అంతులేని సముద్రం. ఒకవైపు బంగాళాఖాతం, ఇంకోవైపు హిందూ మహాసముద్రం. ఆ రెండు సముద్రాలు కలిసే చోట ఒక సన్నటి ఇసుక తిన్నె. పగటిపూట చూస్తే అద్భుతమైన పర్యాటక ప్రాంతం. కానీ.. సూర్యుడు అస్తమించాక, చీకటి పడ్డాక... అక్కడికి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి ఉండదు. అక్కడి గాలిలో ఒక రకమైన భయం, నిశ్శబ్దం అలుముకుంటాయి. పాడుబడిన రైల్వే స్టేషన్, కూలిపోయిన చర్చి గోడలు, ఇసుకలో పూడుకుపోయిన ఇళ్లు..అవును, మనం చెప్పుకుంటోంది భారతదేశం చివరి సరిహద్దు, తమిళనాడులోని జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన రామేశ్వరం సమీపంలోని 'ధనుష్కోటి' గురించి. ఇవాళ ప్రపంచం దీన్నే ఒక Ghost Town అని పిలుస్తోంది. కానీ, ఈ నిర్జన ప్రదేశం వెనుక కేవలం ఒక తుఫాను కథ మాత్రమే లేదు.. యుగాల నాటి రామాయణ రహస్యం దాగి ఉంది. అసలు ఈ నగరంలో రాత్రి వేళల్లో ఏం జరుగుతోంది? సైన్స్ కూడా తలవంచిన ఆ అయస్కాంత క్షేత్రాల మిస్టరీ ఏంటి? తుఫాను వల్ల నగరం నాశనమైంది.. మరి దీన్ని 'మిస్టరీ' అని ఎందుకు అంటున్నాం? పగటిపూట ఈ రామసేతు అందాలను చూడటానికి పర్యాటకులు వస్తారు. కానీ సాయంత్రం 6 గంటలు దాటితే చాలు.. ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. టూరిస్టులను, స్థానిక జాలర్లను కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించేస్తారు. ఎందుకు? ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి... -
5వేల ఏళ్ల మిస్టరీ వీడింది.. అశ్వత్థామ బతికే ఉన్నారా? ఆధారాలివే
చరిత్ర పుటల్లో కొన్ని రహస్యాలు కాలంతో పాటు కలిసిపోతాయి. కానీ కొన్ని వింతలు మాత్రం.. కాలానికి ఎదురునిలిచి, వేల సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి!ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీ ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం! నమ్మశక్యం కాని.. అంతకన్నా ఊహించలేనంత భీతి గొలిపే ఒక సజీవ మిస్టరీ ఇది!మహాభారత ఘోర యుద్ధం ముగిసి ఐదు వేల సంవత్సరాలు దాటిపోయింది. ఆ యుద్ధంలో పాల్గొన్న కోట్ల మంది వీరులు, రాజులు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ.. సప్త చిరంజీవుల్లో ఒకరైన ఆ ఒక్కడు మాత్రం.. ఇంకా బతికే ఉన్నాడు! అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజం!నుదిటి నుంచి నిరంతరం రక్తం కారుతూ.. ఒళ్లంతా చీము, గాయాలతో.. ఆకలి దప్పులతో.. చావు కోసం తపిస్తూ.. చావు కన్నా ఘోరమైన నరకాన్ని అనుభవిస్తూ.. అశ్వత్థామ ఇప్పటికీ మన మధ్యే తిరుగుతున్నాడు!.శాపగ్రస్తుడైన ఆ అశ్వత్థామ.. ప్రతిరోజూ తెల్లవారుజామున, మనుషులెవరూ అడుగుపెట్టని ఒక రహస్య శివాలయానికి వస్తాడు.అక్కడ ఉన్న శివలింగానికి పూజలు చేసి వెళ్తాడు. తెల్లారి గుడి తలుపులు తీసి చూసేసరికి.. అక్కడ తాజా పూలు, చందనం కనిపిస్తాయి! ఇది కథ కాదు.. ఇప్పటికీ అక్కడ జరుగుతున్న పచ్చి నిజం!అసలు ఆ భయంకరమైన శివాలయం ఎక్కడుంది? అక్కడ అశ్వత్థామను చూసినవారెవరు? ఐదు వేల ఏళ్లుగా ఆ గాయాలతో అతడు ఎలా బతుకుతున్నాడు? ఈ రోజూ మన వీడియోలో.. సైన్స్కు సైతం సవాల్ విసురుతున్న ఆ అశ్వత్థామ గుడి మిస్టరీని విప్పబోతున్నాం! వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి! -
ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో!
ఒకరోజు ద్వారకలో, ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో! మంచి పనులు చేసిన వారు ధన్యులు అని అందరూ అంటారు. కానీ మంచి పనులు చేసిన వారు ఎవరు? ఎక్కువ దానధర్మాలు చేసేవారా? గొప్ప యజ్ఞాలు చేసేవారా?’ అని అడిగాడు. కృష్ణుడు ఆ యువకుడిని ఒక దేవాలయం దగ్గరకు తీసుకెళ్లాడు. ఒక వృద్ధుడు మౌనంగా ఆలయ ప్రాంగణం శుభ్రం చేసుకుంటున్నాడు.కృష్ణుడు ఆ యువకుడితో ‘రా! అతనికి తెలియకుండా రోజంతా మనం ఇతనిని అను సరిద్దాం’ అన్నాడు. వృద్ధుడు తన ఆహారంలో కొంత భాగాన్ని ఆకలితో ఉన్న కుక్కకు ఇచ్చాడు. దేవాలయా నికి వచ్చిన ఒక పేద వృద్ధురాలికి నీళ్ళు ఇచ్చి, తన చేతిలో ఉన్న కొన్ని నాణేలను కూడా ఇచ్చాడు. ఆలయ మార్గంలోని ముళ్ళను, రాళ్లను తొలగించాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేముందు, ఇలా ప్రార్థించాడు: ‘కృష్ణా! ఈ రోజు నేను ఏదైనా మంచి పని చేసి ఉంటే, దానిని నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను.’ఇది చూసి ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ‘ప్రభో! ఇదేనా పుణ్యం? పెద్ద దానాలు లేవు, యజ్ఞాలు లేవు.’ కృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు: ‘విజయం అనేది చేసిన పని వల్ల వచ్చే కీర్తిలో లేదు; అది ఆ పని చేసే హృదయపు నిర్మలత్వంలో ఉంది. ఎవరూ చూడనప్పుడు కూడా ధర్మాన్ని నిలబెట్టేవాడు పుణ్యపురుషుడు’.అప్పుడు ఆ యువకుడు మళ్ళీ అడిగాడు: ‘అయితే, ప్రభూ, సద్గుణ ఫలం ఏమిటి?’ అందుకు కృష్ణుడు ‘సద్గుణానికి గొప్ప ఫలం సంపదగానీ, కీర్తిగానీ కాదు. ప్రపంచమంతా అతణ్ణి విడిచి పెట్టినా, నన్ను చేరే మార్గం అతని హృదయంలో ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. అదే సద్గుణానికి నిజమైన ఫలం’ అన్నాడు. సద్గుణం స్వర్గానికి మార్గం కాదు; అది భగవంతుని హృదయాన్ని చేరే మార్గం!– యామిజాల జగదీశ్ -
మార్గదర్శకమైన యాత్ర
ఒకడు మంచిగా ప్రవర్తించాలంటే, ఈ సమాజానికి ఉన్నత విధానాలలో మేలు చేయాలంటే, ఏదో ఒకచోట ఎక్కడో ఒక సందర్భంలో యేసును అనుకరించి అనుసరించక తప్పదు అనేంతగా యేసు జీవితాన్ని అసాధారణరీతిలో స్ఫూర్తివంతంగా సర్వమానవాళి ముందుపెట్టాడు ఆ మహాదేవుడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే, నిరంతరం అనుక్షణం తండ్రియైన దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా ఆమోదయోగ్యంగా జీవించినందు వల్లే యేసు జీవితం యావత్తూ అంగీకరించబడి మానవాళికి గొప్ప మార్గదర్శకంగా ఉందన టంలో ఎలాంటి సందేహం లేదు.యేసు ఒక్క ఆధ్యాత్మికరంగానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు. అన్ని రంగాల వారికి యేసు ఒక గొప్ప అరుదైన స్ఫూర్తిదాయకం. ప్రజాసేవకు అంకితమై సమర్పణ జీవితంతో నిరంతరం ప్రజల గూర్చే ఆలోచిస్తూ ప్రజలకు మేలు చేయాలనే తెగింపుగల నాయకులకు, పోరాట యోధులకు యేసే గొప్ప దిక్సూచి. అబద్దపు వాగ్దానాలు చేయక, ఊసరవెల్లి వేషాలు వేయక, అసత్య ప్రచారాల జోలికిపోక నమ్మకమైన నీతివంతమైన రాజకీయాలు చేసే వారికి కూడా యేసే ఆదర్శం. రాజకీయ నాయకులు లేదా పార్టీలు ఎన్నికల ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకుని విజయం సాధించితీరాలనే తపనతో అట్టి గురి కలిగి చేసే పాదయాత్రలను పర్యటనలను కూడా జైత్రయాత్రగా అభివర్ణిస్తారు.ఆధ్యాత్మిక నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, ఆరోగ్య పరిరక్షకులు, న్యాయవాదులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, దర్శకులు, జవానులు, కిసానులు, వ్యాపారవేత్తలు, భవిష్యద్దర్శకులు (విజనరీస్), వ్యక్తిత్వవికాస నిపుణులు, మార్గదర్శకులు, పరిశోధకులు, బోధకులు, జ్ఞానులు, వద్ధులు, చివరకు శత్రువులు ఇట్టి వారు ఎవరైనా ఎంతటి వారైనా యేసును, ఆయన జీవిత స్ఫూర్తిని ప్రత్యక్షంగా వెంటాడక తప్పదు. లేకుంటే వారికి మేలైన సారవంతమైన జీవితమే లేదు. వారి ఉనికే ప్రశ్నార్ధకం కూడా? తమకు తెలియకుండానే యేసును పరోక్షంగా అనుసరించేవారు ఎందరెందరో ఉన్నారనేది లెక్కేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదే గొప్పదైన యేసు జైత్రయాత్ర సంబంధిత జయ జీవితం.– జేతమ్ -
మనల్ని మనం బేరీజు వేసుకుందాం!
జీవితం అంటే కేవలం సంపదను పోగుచేసుకోవడమేనా? మన వెనుక ఎన్ని భవనాలు, ఎన్ని ఆస్తులు ఉన్నాయన్నది ముఖ్యం కాదు.. మనం వెళ్లేటప్పుడు మనతో పాటు ఏమున్నాయన్నదే అసలైన ప్రశ్న. భౌతికమైన ఆస్తులు మట్టిలో కలిసిపోవచ్చు, కానీ మనం చేసిన పరోపకారం, మనం పంచిన ప్రేమ మనల్ని అమరత్వం వైపు నడిపిస్తాయి.మార్పు మన నుంచే మొదలు కావాలిమనం చేసే చిన్నపాటి మంచి పని వల్ల ప్రపంచం మొత్తం మారుతుందా? అనే సందేహం రావచ్చు. సముద్ర తీరంలో ఒక వ్యక్తి వేల స్టార్ఫిష్లను కాపాడలేక పోయినా, తాను చేత్తో విసిరిన ఒక్కో ప్రాణి ప్రాణాన్ని కాపాడి తృప్తి చెందాడు. ‘దీని వల్ల పెద్ద మార్పు ఏమీ ఉండదు కదా?‘ అని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘కనీసం ఆ ఒక్కదాని జీవితంలోనైతే మార్పు వచ్చింది కదా!‘ అన్న సమాధానం అత్యంత శక్తిమంతమైనది.మనం చేసే ప్రతి చిరు సాయం, పక్కవారికి మనం అందించే చిరునవ్వు.. ఇవన్నీ అల్లాహ్ దృష్టిలో గొప్ప సత్కార్యాలే. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చినట్లు, ‘ఏ సత్కార్యాన్ని కూడా తక్కువ అంచనా వేయకండి.’ నిరంతరత అల్లాహ్కు అత్యంత ఇష్టమైనవి ఏమిటి? అంటే, భారీ పనులు కాదు.. మనం చేసే పనులలో నిరంతరత ఉండాలి. ‘కొద్దిగానైనా సరే నిరంతరం చేసే పనులు‘ భారంలా అనిపించవు, అవి మన ఆత్మకు శాంతిని కలిగిస్తాయి.మన ఆస్తిపాస్తులు మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టవచ్చు, కానీ మనం చేసిన సత్కార్యాలు మాత్రమే మనల్ని గమ్యం వైపు నడిపిస్తాయి. తీర్పు రోజున మన సంపద లెక్కలు అడగబడవు, మనం చేసిన పనుల ఫలితాలే మన స్వర్గానికి సోపానాలు అవుతాయి. కాబట్టి, ఆ ధనవంతుడిలా చివరలో బాధపడకుండా, ప్రతిరోజూ మన చేతనైనంత మంచిని చేద్దాం. మనకు అందిన ప్రతి అవకాశాన్ని ఒక సత్కార్యంగా మలుచుకుందాం. అణువంత మేలు కూడా వృథా పోదు. రేపటికోసం నేటి నుండే సత్కార్యాల బాటలో పయనిద్దాం.‘అనా ఫకీర్’ – ఆ వృద్ధుడి పశ్చాత్తాపంఒక ధనవంతుడు తన జీవితమంతా భవనాలు, బ్యాంకు బ్యాలెన్స్ల కోసమే వెచ్చించాడు. కానీ, మరణశయ్యపై ఉన్నప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది. తన పిల్లలు ఆస్తి పత్రాలు చూపిస్తున్నా, అతను ‘అనా ఫకీర్‘ (నేను పేదవాడిని) అని రోదించాడు. ఎందుకంటే, అక్కడ సంపద కొరత లేదు, అతను దేవుడి దరికి చేరడానికి కావలసిన ‘సత్కార్యాల సంపద’ కొరత ఉంది. జీవితం చివరలో మనం మిగుల్చుకోవాల్సింది ఆస్తులు కాదు, పరలోకానికి అవసరమైన పుణ్యకార్యాలు అని ఆ వృద్ధుడి వేదన మనకు గుర్తుచేస్తోంది. ఖురాన్ చెబుతున్నట్లుగా: ‘కావున, ఎవడైతే అణువంత మేలు చేస్తాడో, వాడు దానిని (దాని ప్రతిఫలాన్ని) చూస్తాడు.‘ (99:7)– ముహమ్మద్ ముజాహిద్ -
అత్యంత విశిష్టమైన ఏకాదశి
హిందూ సంప్రదాయంలో ఏకాదశిది ఎంతో విశిష్ట స్థానం. వాటిలో జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుతోపాటు మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఉపవాసం, పూజలు, జపం, దానం వంటి ధార్మిక కార్యాలను ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు పేర్కొంటాయి.ఈ వ్రతం వేలాదిమందికి అన్నదానం చేసినంత ఫలాన్నిస్తుందని ప్రతీతి. తులసిని‘హరిప్రియ’గా పిలుస్తారు. అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్క. అందుకే తులసి లేకుండా విష్ణుపూజ అసంపూర్ణమని సంప్రదాయం చెబుతోంది. యోగిని ఏకాదశి రోజున తులసిని భక్తితో పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, సానుకూల వాతావరణం పెరుగుతాయని విశ్వాసం. -
యద్భావం తద్భవతి: మనసులో మంచి భావనలు ఉంటే అంతా..
‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’ ప్రాపంచిక బంధాలలో చిక్కుకోవడానికిగానీ, వాటినుండి విడుదల పొందడానికి కానీ; మన సు ఖానికిగానీ, దుఃఖానికి కానీ; అభ్యున్నతికిగానీ, పతనానికి కానీ – ఇలా దేనికైనా మన మనసు, అందులో ఎగిసిపడే ఆలోచనలే కారణాలని చెబుతూ శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరోజు తమ శిష్యులకు మనిషి మనసులోని కోరికలు, ఆశలు అతనిని ఎలా పతనం చేస్తాయో వివరించడానికి ఈ కథను చెప్పారు.ఒక వర్తకుడు వ్యా΄ార నిమిత్తం తన గ్రామం నుండి పట్టణానికి నడిచి వెడుతున్నాడు. ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పటిలాగా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం దాకా నడిచేసరికి బాగా అలసిపోయాడు. మరొక నాలుగైదు గంటలు నడిస్తే కానీ గమ్యం చేరలేడు. కనుక ఎక్కడైనా తగిన చోటు దొరికితే కాసేపు ఆగి బడలిక తీర్చుకొందామనుకొన్నాడు. అతని అదృష్టం కొద్దీ ఒక పెద్ద చెట్టు, దాని చుట్టూ అరుగు కనిపించాయి. పరమానందంగా ఆ చెట్టు నీడన ఆ అరుగుపై కాళ్ళు చాచి పడుకొన్నాడు.చల్లగా వీస్తున్న గాలి అతని మార్గాయాసాన్ని కాస్త ఉపశమింపజేసింది. అప్పుడతనికి తన దాహం తెలిసింది. ‘తాగడానికి నీరు లభిస్తే ఎంత బాగుంటుందో’ అనుకొన్నాడు. వెంటనే అతని పక్కన ఒక ΄ాత్రలో చల్లని నీరు ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోతూ అమృత తుల్యంగా ఉన్న ఆ నీటిని తాగి దాహం తీర్చుకొన్నాడు. దాహం తీరగానే అతని మనసు భోజనం పైకి మళ్ళింది. ‘బాగా ఆకలి వేస్తోంది. తినడానికి మంచి భోజనం లభిస్తే బాగుండు’ అని అనుకుంటూండగానే అతని ఎదుట పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించబడిన విందు భోజనం అరిటాకులో సిద్ధంగా కన్పించింది.ఎంతో సంబరంగా కడుపునిండా భోంచేశాడు. కాసేపు కునుకు తీస్తేగానీ భుక్తాయాసం తీరి నడక ముందుకు సాగదు. ఈ అరుగు పైన మెత్తటి పరుపు, తలగడ అమరితే బాగుండు అని మనసులో అనుకొన్నాడో లేదో తక్షణం అతని ఎదుట హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై పడుకొని ‘ఇప్పుడెవరైనా నా కాళ్ళు పడితే బ్రహ్మాండంగా నిద్ర పోవచ్చు’ అని అనుకొన్న మరుక్షణం ఇద్దరు అపురూపమైన అందగత్తెలు అతని కాళ్ళు పట్టడం మొదలు పెట్టారు. తాను ఏ చెట్టు నీడన కూర్చున్నాడో అది కల్పవృక్షమనీ, అతడు మనసులో ఏది కోరుకొన్నా దానిని వెంటనే ప్రసాదిస్తుందనీ అతనికి తెలియదు.ఇప్పుడు అతనికి ఒక అనుమానం మొదలైంది. ‘ఈ అడవిలో నేను గనుక గాఢంగా నిద్రపోతే, ఒంటరిగా, నిరాయుధుడుగా ఉన్న నన్ను ఏ పెద్దపులో వచ్చి చూసిందంటే నా గతి ఏమౌతుందో’ అనుకొంటూండగానే ఎక్కణ్ణుంచో గాండ్రుమంటూ ఒక పెద్దపులి వచ్చి, అతనిపై భీకరంగా దాడిచేసి చంపేసింది. అంతటితో ఆతని కోరికలన్నీ అంతమైపోయాయి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు మన మనసులో మంచి భావనలు ఉంటే మనకు మంచే జరుగుతుంది. లేకపోతే మన గతి అథోగతే అన్నది శ్రీ రామకృష్ణులు ఈ కథ ద్వారా మనకు అందించిన సందేశం.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రినిర్వహణ : డి.వి.ఆర్ -
ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి..
మనం మాట్లాడే మాటల శబ్దాలు మనపైన, ప్రకృతిపైన ప్రభావం చూపుతాయి. అవే శబ్దాలు వేద మంత్రాలకు సంబంధించినవైతే మరింత గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. అశుద్ధమైన మాటలు వినడం, చెడు దృశ్యాలు చూడటం వంటివి మనసుపై చెడు ప్రభావం చూపుతాయి. ప్రియమైన మాటలు మాట్లాడితే సకల ప్రాణులూ ఆనందిస్తాయి. ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి. వినయ పూర్వక సత్య వచనాలు పలకడం ద్వారానే బంధువులు, స్నేహితులు దగ్గర అవుతారు. అలా మాట్లాడ గలిగే వారు సంఘంలో రాణిస్తారు.తైత్తిరీయారణ్యకం ‘మనో వాక్కాయ కర్మాణి శుధ్యన్తామ్’ అని చెప్పింది. అంటే మనస్సు, మాట, పనులను (త్రికరణములు) పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇతరుల మనసులు గాయపరుస్తూ, బాధించేలా మాట్లాడకూడదు. అలా చేయడం కూడా హింసే అన్నారు గాంధీజీ. మాట్లాడగలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి. ‘మధుర భాషణమున మర్యాదప్రాప్తించు’ అన్నారు పెద్దలు. మంచి మాట ఆభరణమే కాదు, దివ్యశక్తి కూడా! దానిని మనం మితంగా, జాగ్రత్తగా వినియోగించాలి. రఘువంశపు రాజులందరూ ‘సత్యాయ మిత భాషిణాం’ అని కాళిదాస మహాకవి అన్నారు. అంటే సత్య సంరక్షణార్థం ఆ రాజులు మిత భాషిత్వాన్ని పాటించారని అర్థం.మనిషికి నాలుక ముందు పుట్టి తర్వాత దంతాలు ఏర్పడుతాయి. కానీ నాలుక కంటే వెనుక పుట్టిన దంతాలే ముందుగా ఎందుకు ఊడిపోతాయి అనే ప్రశ్నకు శ్రీ రామకృష్ణ పరమహంస చక్కని వివరణ ఇచ్చారు. ‘దంతాలు కఠినంగా ఉంటాయి. వాటికి వినయంతో కూడిన మెత్తదనం లేదు. నాలుక మృదువుగా అణకువతో ఉండి త్వరగా బయటకు కనపడదు. అందుకే రెండు పలు వరుసల మధ్య అది సురక్షితంగా ఉంటుంది’ అన్నారాయన. వినయంతో మిత భాషులైనవారు సురక్షితంగా ఉంటారు. కఠినాత్ములు, పరుష వాక్కు గల వారు త్వరగా రాలిపోతారని అర్థం చేసుకోవాలి.మన మాటల వలన జనించే శబ్దం చాలా శక్తిమంతమైనది. అవి వినేవారి మనస్సు పైన, దేహం పైనా అపరిమిత ప్రభావాన్ని చూపుతుంది. దుఃఖిస్తున్న వారి పట్ల దయతో సాంత్వన వచనాలు పలికితే వారి శోకం ఉపశమిస్తుంది. ఎవరి పట్లనైనా పరుష పదాలతో కఠినంగా మాట్లాడితే అవతలి వారు కోపోద్రిక్తులై పరిస్థితి విషమిస్తుంది. అందువల్ల వీలైనంత మేరకు మధురంగా... హితంగా.. మితంగా మాట్లాడటమే మంచిదని పెద్దలు చెప్పారు.మాట్లాడ గలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి.– డాక్టర్ పాణ్యం వసుంధరనిర్వహణ డి.వి.ఆర్ -
ఆలయంలో దాగిన మహానిధి.. తాకితే సర్వనాశనమేనా?
నిధి.. అనంతమైన సంపద.. కొన్ని శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న రహస్యం! భారతదేశంలో నిధులు అనగానే మనకు కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడ నాగబంధం ఉన్న ఓ గది తలుపులను ఇప్పటికీ తెరవలేదు. అయితే.. అంతకంటే మర్మంగా ఉన్న ఓ ఆలయం మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉందనే విషయం మీకు తెలుసా? కర్ణాటకలో.. దట్టమైన పశ్చిమ కనుమల నడుమ.. ఉడుపి జిల్లా కొల్లూరులో కొలువుదీరిన మూకాంబిక అమ్మవారి ఆలయ గర్భంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధులు ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. అయితే.. టెక్నాలజీతో ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకున్న ఈ రోజుల్లో కూడా.. సైన్స్ సమాధానం చెప్పలేకపోతున్న ఓ మిస్టరీ ఆ ఆలయం..! మూకాంబికా ఆలయంలో నిధుల గురించి చూద్దాం..ఎన్ని శతాబ్దాలు గడిచినా.. ఎంతగా అధునాతన టెక్నాలజీ వచ్చినా.. కొల్లూరు మూకాంబిక ఆలయ సర్ప ముద్ర వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ వీడలేదు. ఆ పాము ఆకారం కింద నిజంగానే వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధి ఉందా? దాన్ని ఇప్పటికీ ఆ దైవిక సర్పం కాపాడుతోందా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.. -
ఆ విధంగా నా త్రివిధ సాధన..
కృష్ణాబాయికి స్వామి రామదాసు ‘ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే మంత్రాన్ని ఉపదేశించారు. రామనామం సుధామధురం. ఎందరెందరినో మహనీయులుగా తీర్చిదిద్దిన మంత్రం అది. కృష్ణాబాయి కూడా ఎంతో శ్రద్ధగా ఆ మహత్తర నామాన్ని జపించటం ప్రారంభించింది. కానీ ‘చంచలం హి మనః కృష్ణా!’ అని అర్జునుడు చెప్పాడు కదా, కృష్ణాబాయి మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. సమస్యను గుర్తించిన కృష్ణాబాయి స్వామి రామదాసున్న ఆశ్రమానికి పరుగెత్తింది.అప్పుడాయన ఆమెతో, ‘ఇందులో విచారించవలసినది ఏముంది? పరిభ్రమించుటే మనసు పని. దానికిష్ట మొచ్చినచోట దాన్ని పోనిమ్ము. అదంతా స్వయంగా రాముడే అని భావించు. రాముడు అనంతుడు. సమస్తమైన ప్రాణులూ, వస్తువులూ రాముని నుండి వచ్చి, రామునిలో చరించి, రామునిలో లీనమవుతాయి. అందువల్ల మనస్సు ఎక్కడికి పోయినా, సర్వమూ రాముడే అని భావించు. నీవు ఎవ్వరికి సేవ చేసినా అది రాముని సేవయనీ, రాముని పూజయనీ భావించు. ఈ అభ్యాసం విశ్వరూపుడయిన రామునితో నీ ఏకత్వాన్ని అనుభవించటానికి తేలికగా వీలు కలుగచేస్తుంది’ అని బోధించారు.గురువుగారి సలహాను కృష్ణాబాయి ఆ క్షణం నుండే పాటించింది. దాని వల్ల సాధారణ మనిషియైన కృష్ణా బాయి విశ్వమాత కృష్ణాబాయిగా ఎదిగింది. ఆమె తన అనుభవాన్ని ఇలా చెప్పింది: ‘ఆ విధంగా నా త్రివిధ సాధన – నోటితో రామమంత్రాన్ని ఉచ్చరించటం; ప్రతి ప్రాణినీ, ప్రతి వస్తువునూ సాక్షాత్ రామునిగానే భావించటం; చేతులతో చేసిన పని అంతా రాముని పనిగానూ, రాముని సేవగానూ భావించటం – ఏక కాలంలో మొదలైంది. నా దృష్టిలో పప్పా (రామదాసు), రాముడు అభిన్నం. ఈ అభ్యాసంతో నా మనస్సు నిశ్చలమైనాకు తెలియకుండగనే నా హృదయం ప్రశాంత మయమైంది’ (పుటలు 10–11; విశ్వమాత కృష్ణాబాయి, ఆనందా శ్రమము, కేరళ). – రాచమడుగు శ్రీనివాసులు -
గోధుమ రంగు గుట్ట కాదు.. బంగారు గుట్ట అని పిలుస్తాం!
తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే దారిలో ఒక గుట్టపైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పాదం ఉంది. స్వామివారు నారాయణవనంలో పద్మావతిని పెళ్ళాడి స్థిర నివాసం కోసం బయలుదేరాడు. దారిలో పుత్తూరు పట్టణం పక్కనున్న గుట్టమీద కాలు పెట్టాడని, అది స్వామిని మోయలేక కదిలిందని చెబుతారు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు స్వామి. మరికొన్ని చోట్ల కూడా పాదం మోపి చివరిగా శేషాచలం కొండలపైన కొలువైనాడని భక్తుల నమ్మకం.ఆ గుట్ట మీదున్న స్వామిపాదాన్ని చూద్దామని తమిళనాడుకు చెందిన కొందరు యువతీ యువకులు జట్టుగా బయలుదేరారు. ఆ బృందానికి ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. గుట్టపైకి వెళ్ళే దారి చూపడానికి ఒక స్థానికుడిని మాట్లాడుకున్నారు. నామం పెట్టుకుని, చేతిలో కర్ర, తలకి టోపీ, చలువ కళ్ళద్దాలు తొడిగి చెప్పులు లేకుండా ఆ బృందం బయలుదేరింది. గుట్ట ఎక్కుతున్న వారిని చూసి అక్కడి గ్రామాల ప్రజలు ‘ఈ పిల్లోళ్ళకి ఎంత భక్తి, ఎంత భక్తి’ అని పొగడ్తల వర్షం కురిపించారు.కొద్దిదూరం నడిచాక గుట్ట మీద ఉన్న గడ్డిని చూసి ఒక మెడికో అమ్మాయి ‘‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాము, కానీ ఇక్కడేమిటి, అంతా గోధుమ రంగులో ఉంది’’ అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె చూసింది పూరికప్పు వేసుకోవడానికి ఉపయోగించే బోద గడ్డి అది. ఎండకి బాగా ఎండి అది గోధుమ రంగులోకి మారి ఉంది.దారి చూపే స్థానికుడు ఆమె మాటలకు చిన్న నవ్వు నవ్వాడు. ‘‘మేము దీన్ని గోధుమ రంగు గుట్ట అని పిలవం, బంగారు గుట్ట అని పిలుస్తాం’’ అని చెప్పాడు. పక్కనే ఉన్న బృందనాయకుడు మనం ఈ గుట్టమీదున్న గడ్డిని చూసి గోధుమ రంగు గుట్ట అనుకుంటున్నాము, దాన్నే భక్తి భావంతో, ఆశావాద దృక్పథంతో ఉన్న ఇక్కడి వారు బంగారు గుట్టగా భావిస్తున్నారు. మన దృక్పథాన్ని పునః పరిశీలించుకోవాల్సి ఉందని వివరించాడు.మాటల్లోనే గుట్ట మీదకు చేరుకున్నారు. అక్కడున్న ఏనుగు పాదాలు, గుర్రపు పాదాల అడుగులు చూసి ఆశ్చర్యపోయారు. స్వామి పాదం పక్కనే ఉన్న దొనలో కాళ్ళు చేతులు కడుక్కుని పూజలు చేసి గోవిందలు పలుకుతూ వెనుదిరిగారు.దిగుతూ ఉంటే భక్తి పారవశ్యంతో ఉన్న ఆ మెడికో అమ్మాయికి గుట్ట మీదున్న గడ్డి అందంగా, బంగారు రంగులో కనిపించింది. ఏదైనా చూసే మనసును బట్టి ఉంటుంది ఈ ప్రపంచం అని తెలుసుకుంది ఆ అమ్మాయి. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
దశాశ్వమేధ ఘట్టం
దేవశిల్పి విశ్వకర్మ మనవడైన ప్రథముడికి భౌవనుడు అనే కొడుకు కలిగాడు. అతడు దినదినాభివృద్ధి చెంది సకల శాస్త్రాలను అభ్యసించి, సార్వభౌముడిగా ఎదిగాడు. భౌవనుడికి ఒకేసారి దశాశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పం కలిగింది. అతడు తన ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని దర్శించుకుని, ‘ఏకకాలంలో దశాశ్వమేధ యాగాలు చేయాలని కోరికగా ఉంది. ఈ యాగాల నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో సెలవివ్వండి’ అని అభ్యర్థించాడు.‘రాజా! పూర్వకాలం నుంచి రాజులందరూ ఏ ప్రదేశంలో అశ్వమేధ యాగాలు చేసేవారో, అదే ప్రదేశంలోనే నువ్వు కూడా యాగాలు నిర్వహించు’ అని చెప్పాడు కశ్యపుడు.కశ్యపుడి సూచనతో భౌవనుడు ఋత్విక్కులను ఏర్పాటు చేసుకుని, పూర్వీకులు యాగాలు నిర్వహించిన ప్రదేశంలోనే పది అశ్వమేధ యాగాలూ ఒకేసారి ప్రారంభించాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆ యాగాలు సంపూర్ణం కాలేదు.యాగాలు సఫలం కాకపోవడంతో భౌవనుడు విచారించాడు. పురోహితులతో చర్చించి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలంలో యాగాలను తిరిగి ప్రారంభించాడు. అక్కడ కూడా యాగాలకు అంతరాయాలు కలిగాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి.భౌవనుడు చింతాక్రాంతుడయ్యాడు. ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నా దోషమో, మీ దోషమో, దేశ కాల దోషమో నాకు అర్థం కాకున్నది. నేను తలపెట్టిన యాగాలు ఎంతగా ప్రయత్నించినా సంపూర్ణం కాకున్నవి. దీనికి మార్గాంతరమేమిటో అంతుచిక్కకున్నది’ అని విచారంగా పలికాడు.కశ్యపుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత, ‘రాజా! పద’ అంటూ భౌవనుడిని తనతో పాటు బృహస్పతి అన్న అయిన సంవర్తకుడి దగ్గరకు తీసుకుపోయాడు. ‘మహాత్మా! మేము దశాశ్వమేధ యాగాలు తలపెట్టాము. యాగ నిర్వహణకు ఇదివరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి. మేము తలపెట్టిన యాగ నిర్వహణకు తగిన ఉత్తమ ప్రదేశమేదో నువ్వే చెప్పాలి’ అని అడిగాడు కశ్యపుడు. సంవర్తకుడు కొద్దిసేపు ఆలోచించి, ‘మునివర్యా! మీరిద్దరూ నేరుగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి అడగండి. మీరు సంకల్పించిన యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలాన్ని ఆయనే చెప్పగలడు’ అని చెప్పి, వారిని సాదరంగా సాగనంపాడు. భౌవనుడిని వెంటపెట్టుకుని కశ్యపుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడిని దర్శించుకుని, వారిద్దరూ నమస్కరించారు. ‘బ్రహ్మదేవా! మా రాజైన ఈ భౌవనుడు దశాశ్వమేధ యాగాలను ఏకకాలంలో తలపెట్టాడు. ఇదివరకటి యత్నాలు విఫలం కావడంతో వ్యాకులం చెందుతున్నాడు. యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో నువ్వే సెలవివ్వాలి’ అడిగాడు కశ్యపుడు. ‘పవిత్ర గౌతమీతటాన యాగ నిర్వహణ కావించండి. అక్కడ నిర్వహించే ఏ యాగమైనా సంపూర్ణంగా ఫలిస్తుంది’ అని చెప్పి, భౌవనుడిని ఉద్దేశించి, ‘రాజా! నువ్వు ఇందుకు వేరే గురువును ఆశ్రయించవలసిన పనిలేదు. వేదపారంగతుడైన ఈ కశ్యపుడే గురుశ్రేష్ఠుడై యాగాన్ని పరిపూర్ణం చేయించగలడు’ అని చెప్పాడు.కశ్యపుడి ఆధ్వర్యంలో భౌవనుడు గౌతమీ తీరంలో దశాశ్వమేధం ప్రారంభించాడు. యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. యాగ పరిసమాప్తి సందర్భంగా భౌవనుడు భూదానానికి ఉద్యుక్తుడయ్యాడు.అదే సమయంలో అశరీరవాణి ‘ఓ రాజా! సమస్త భూమండలాన్నీ నువ్వు ఈ కశ్యప మహర్షికి దానం చేయాలని సంకల్పించుకున్నావు. నీ సత్సంకల్ప మాత్రానే భూమండలం సర్వసుభిక్షమైంది. నీ మనసులోనున్న భూదాన సంకల్పాన్ని విరమించుకుని, మహాఫలప్రదమైన అన్నదానం కావించు. నీకు శుభం కలుగుతుంది’ అని పలికింది. అశరీరవాణి పలుకులు విన్నప్పటికీ భౌవనుడు తన భూదాన సంకల్పం నుంచి వెనక్కు తగ్గలేదు. అప్పుడు భూదేవి స్వయంగా ప్రత్యక్షమై, ‘మహారాజా! మాటిమాటికి నన్ను దానం చేయడం తగదు. నీ సంకల్పం విడిచిపెట్టు’ అని చెప్పింది.భూదేవి స్వయంగా ప్రత్యక్షం కావడంతో భౌవనుడు చలించిపోయాడు. ‘తల్లీ! యాగ పరిసమాప్తి సందర్భంగా నేనిప్పుడు ఏ దానం చేయాలో నువ్వే చెప్పు’ అన్నాడు.‘పవిత్రమైన ఈ గౌతమీ తీరాన నవధాన్యాలు, గోవులు, ధన కనక వస్తు వాహనాలు వేటిని దానం చేసినా అక్షయఫలం లభిస్తుంది. ఇక్కడ అన్నదానం చేసినవారికి సమస్తదానాలూ చేసినంత ఫలం దక్కుతుంది.’ అని పలికింది. భౌవనుడు యాగస్థలంలో వేలాదిమందికి అన్నదానం చేశాడు. అతడి యాగస్థలి దశాశ్వమేధ తీర్థంగా ప్రసిద్ధి పొందింది. - సాంఖ్యాయనపురావిశేషం..ఒడిశా రాజధాని భువనేశ్వర్కు చేరువలోని హీరాపూర్ గ్రామంలో అత్యంత అరుదైన పురాతన శాక్తేయ ఆలయం ఉంది. ఇది చతుష్షష్టి యోగినుల మందిరం. ఇందులో అధిష్ఠాన దేవత మహామాయ విగ్రహంతో పాటు అరవైనాలుగు మంది యోగినుల విగ్రహాలు ఉంటాయి. పైకప్పు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. దీనిని భౌమవంశానికి చెందిన రాణి హీరాదేవి క్రీస్తుశకం 864లో నిర్మించింది. పదహారో శతాబ్దిలో కాలాపహాడ్ అనే సేనాని జరిపిన దాడిలో ధ్వంసమైన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో మిగిలింది. -
ఈ 4 అలవాట్లుంటే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే..!
హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న గ్రంథాల్లో ఒకటైన గరుడ పురాణం అనగానే.. మనకు సాధారణంగా గుర్తొచ్చేది మరణం, ఆ తర్వాత ఆత్మ ప్రయాణం, యమలోకంలో శిక్షలు మాత్రమే. కానీ, ఇది కేవలం జీవన్మరణ రహస్యాలకే పరిమితమైన గ్రంథం కాదు! మనిషి బతికుండగా భూమిపై ఎలా జీవించాలి? ఎలాంటి ప్రవర్తనను అలవర్చుకోవాలి? ఏ విధమైన క్రమశిక్షణతో మెలగాలి? అనే ఎన్నో జీవన సూత్రాలను గరుడ పురాణంలోని 'ఆచార కాండం' అద్భుతంగా వివరిస్తుంది. ఆ వివరాలను తెలుసుకుందాం..నాలుగు తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన, పరిశుభ్రమైన, సానుకూల జీవనశైలిని ఎవరైతే అనుసరిస్తారో.. వారి జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు వైపు మార్గం సుగమం అవుతుంది. అయితే ఇది పూర్తిగా విశ్వాసాలు, మన పురాతన సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడిన సమాచారం అని ప్రేక్షకులు గమనించాలి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.. -
అమర్నాథ్ యాత్రకు.. ఇలా వెళ్లాలి..!
ప్రకృతి నడిబొడ్డున, హిమాలయాల గుండెల్లో వెలిసిన ఆ పరమశివుని సాక్షాత్కారం.. అమర్నాథ్ యాత్రకు సమయం ఆసన్నమైంది!. మంచు లింగ రూపంలో దర్శనమిచ్చే ఆ జ్యోతిర్లింగాన్ని కళ్లారా చూడాలని, జన్మ ధన్యం చేసుకోవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది యాత్ర జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీ వరకు, అంటే మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డు ప్రకటన ప్రకారం.. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ.. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తున, మైనస్ డిగ్రీల చలిలో, ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని కొండదారుల్లో సాగే ఈ ప్రయాణం.. భక్తితో పాటు ఒక పెద్ద సాహసమే..! ముఖ్యంగా మొదటిసారి వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అమర్నాథ్ యాత్రకు ఉన్న రెండు మార్గాల రహస్యం ఏంటి? వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.పర్మిట్ లేకపోతే నో ఎంట్రీ! అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి సూత్రం.. రిజిస్ట్రేషన్ అండ్ పర్మిట్. చెల్లుబాటు అయ్యే యాత్రా పర్మిట్ లేకుండా.. Shrine బోర్డు ఎవరినీ కూడా ఒక్క అడుగు ముందుకు వేయనివ్వదు. ఆఖరి నిమిషం వరకు ఆగకుండా, కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే మీ స్లాట్లను బుక్ చేసుకోవాలి. మీ పర్మిట్ పత్రాలను ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.ఆరోగ్య పరీక్షఈ యాత్రలో అత్యంత కీలకమైంది ఆరోగ్య పరీక్ష. ఈ యాత్ర సముద్ర మట్టానికి 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో సాగుతుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆథరైజ్డ్ డాక్టర్ల నుంచి కంపల్సరీగా హెల్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, బీపీ ఉన్నవారు వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతే యాత్రకు సిద్ధమవ్వాలి. యాత్రకు రెండు వారాల ముందు నుంచే రోజుకు 40 నిమిషాలు నడక, యోగా అలవాటు చేసుకుంటే కొండల్లో నడవడం చాలా సులభం అవుతుంది.పహల్గాం, బాల్టాల్ మార్గాలు..అమర్నాథ్ గుహను చేరుకోవడానికి భక్తులకు రెండు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. పహల్గాం మార్గం. ఇది కొంచెం దూరంగా ఉన్నప్పటికీ.. ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. ఈ మార్గంలో ఎత్తు అనేది క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి, మన శరీరం అక్కడి వాతావరణానికి, ఆక్సిజన్ స్థాయిలకి దశలవారీగా అలవాటు పడుతుంది. అందుకే మొదటిసారి యాత్రకు వెళ్లేవారికి ఈ మార్గమే బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రెండోది.. బాల్టాల్ మార్గం. తక్కువ సమయంలో, కేవలం ఒకే రోజులో దర్శనం పూర్తి చేసుకొని తిరిగి రావాలనుకునేవారికి ఇది అనుకూలమైనది. కానీ.. ఈ మార్గంలో కొండలు చాలా నిటారుగా, ప్రమాదకరంగా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా వంద శాతం ఫిట్నెస్ ఉన్నవారు మాత్రమే బాల్టాల్ రూట్ను తట్టుకోగలరు.హిమాలయాల వెదర్ హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు మంచు తుఫాన్ వస్తుందో ఊహించడం అసాధ్యం. అందుకే వాతావరణాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. మీ బ్యాగ్లో థర్మల్ ఇన్సల్స్, వెచ్చని జాకెట్, వాటర్ప్రూఫ్ రెయిన్కోట్, ఉన్ని టోపీ, గ్లవుజులు, గట్టి గ్రిప్ ఉండే ట్రెక్కింగ్ షూస్ తప్పనిసరిగా ఉండాలి. ఇక మీ ట్రావెల్ బ్యాగ్ని ఎంత వీలైతే అంత లైట్ వెయిట్గా ఉంచుకోవడం మంచిది. అత్యవసర వస్తువులైన.. ఆధార్ కార్డ్, యాత్రా పర్మిట్, పవర్ బ్యాంక్, టార్చ్ లైట్, వాటర్ బాటిల్, ఇన్స్టంట్ ఎనర్జీని అందజేసే డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, రోజువారీ మందులు, హ్యాండ్ శానిటైజర్ మాత్రమే వెంట తీసుకెళ్లాలి.తొందరపాటు వద్దు.. ప్రాణమే ముఖ్యం!అమర్నాథ్ దారిలో వేగంగా వెళ్లాలనే తొందరపాటు అస్సలు పనికిరాదు. శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినా, తల తిరిగినా, తలనొప్పి వచ్చినా.. ఏమాత్రం మొహమాటపడకుండా దారి పొడవునా ఉండే మెడికల్ క్యాంపుల వద్దకు వెళ్లి వైద్య బృందాన్ని సంప్రదించాలి. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలతో వచ్చేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. నడవలేని భక్తుల కోసం అక్కడ నిర్ణీత రుసుముతో పోనీ, డోలీ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే సమయం లేనివారి కోసం హెలికాప్టర్ సర్వీసులు కూడా ఉన్నాయి. యాత్ర పొడవునా నున్వాన్, బాల్టాల్, శేషనాగ్, పంచతరణి బేస్ క్యాంపుల వద్ద తాత్కాలిక టెంట్లు, లంగర్లలో ఉచిత భోజనం, తాగునీటి సౌకర్యం లభిస్తుంది. మన ఇండియన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలు అడుగడుగునా భక్తులకు రక్షణగా పహారా కాస్తూనే ఉంటాయి.అవును.. అమర్నాథ్ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక సాధన. Shrine Board చెప్పిన నిబంధనలు పాటిస్తూ.. సరైన ప్రణాళిక, ఆరోగ్య జాగ్రత్తలతో ముందడుగు వేస్తే.. ఆ భోలానాథుడి పవిత్ర దర్శనం యాత్రికుల జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోవడం ఖాయం. (చదవండి: 'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! రథయాత్ర ఎప్పుడంటే..) -
'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! ఎప్పుడంటే..
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఆధ్యాత్మిక ఉత్సవం. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవీలకు అంకితమైన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఏటా ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రను శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ఈ ఆధ్యాత్మిక రథ యాత్ర ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి గుండిచా దేవి మందిరం వరకు సాగుతుంది. అలాంటి పరవమ పవిత్రమైన ఈ రథయాత్ర ఎప్పుడు జరగనుందంటే..ఆ రోజు నుంచి ప్రారంభం..ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16, గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు జూలై 24న ముగుస్తాయి. చివరి రోజున స్వామివారు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీనినే బహుదా యాత్ర లేదా తిరుగు రథయాత్ర అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది.ఎందుకింత ప్రాముఖ్యత అంటే..రథయాత్ర దర్శనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. "రథంపై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి, మరణానంతరం మోక్షం లభిస్తుంది," అని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ జగన్నాథుడి రథాన్ని లాగే వారికి అక్షయ పుణ్యం లభిస్తుందనేది భక్తుల నమ్మకం. అలాగే ఆలయానికి రాలేని భక్తులను కలుసుకోవడానికి స్వయంగా స్వామివారే వీధుల్లోకి వస్తారనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో కుల, మత, వర్ణ భేదాలు లేకుండా లక్షలాది మంది భక్తులు పాల్గొని ఈ రథాలను లాగడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.(చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..) -
ఆత్మబోధ – జీవన మార్గం
భారతీయ తత్వశాస్త్రంలో అద్వైత వేదాంతం అత్యంత ప్రభావవంతమైనది. ఈ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఆది శంకరాచార్యులు. ఆయన రచనల్లో అత్యంత లోతైన తాత్విక సందేశాన్ని అందించే కతి నిర్వాణషట్కం. కేవలం ఆరు శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం మనిషి అసలు స్వరూపం, జీవిత పరమార్థం గురించి అద్భుతమైన వివరణ ఇస్తుంది.మనిషి తనను తాను శరీరంగా, మనస్సుగా భావించడం వల్లే అన్ని బాధలు కలుగుతున్నాయని శంకరాచార్యులు బోధించారు. మనం ‘నేను’ అని సంబోధించినప్పుడు పేరు, వత్తి, హోదా వంటి తాత్కాలిక గుర్తింపులనే వాడుతుంటాం. కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఈ మార్పులన్నిటినీ గమనిస్తూ ఉండే సాక్షియే ’ఆత్మ’. అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ శాశ్వతమైన చైతన్యం. నేను మనస్సు, బుద్ధి, అహంకారం కాదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ప్రస్తుత కాలంలో అందం, ఆస్తి, హోదా వంటి బాహ్య ఆకర్షణలే జీవిత లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమని నిర్వాణషట్కం గుర్తుచేస్తుంది.శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే. ఈ అవగాహన మనిషిలో వినయాన్ని పెంచి, బాహ్య ప్రపంచం పట్ల సమతుల్య దక్పథాన్ని కలిగిస్తుంది. మనిషి జీవితాన్ని ఎక్కువగా ఇష్టాయిష్టాలే ప్రభావితం చేస్తాయి. ఈ రాగద్వేషాల వల్లే అసంతృప్తి కలుగుతుంది. కానీ ఆత్మ స్వరూపం చిదానందం(చైతన్యం తో కూడిన ఆనందం). అది వీటికి అతీతమైనది. ఈ తాత్విక దృష్టి వల్ల ఇతరుల పట్ల అసూయ, ద్వేషం తగ్గి సమత్వ భావన పెరుగుతుంది. నేటి సమాజంలో పెరుగుతున్న విభేదాలను అరికట్టడానికి ఈ ఆలోచనా విధానం ఎంతో అవసరం. సాధారణంగా మనిషిని మరణభయం వేధిస్తుంటుంది. కానీ శరీరం నశించినా ఆత్మ నశించదనే సత్యం తెలిసినప్పుడు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది.అలాగే పాపపుణ్యాలకు, కర్మల ప్రభావానికి ఆత్మ అతీతమైనదని గ్రహించడం వల్ల గతాన్ని తలచుకుని బాధపడే మనసుకు విముక్తి లభిస్తుంది. నిర్వాణషట్కం కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక గొప్ప తాత్విక ప్రకటన. జాతి, మత, వర్గ విభజనలకు అతీతంగా అందరం ఒకే చైతన్యానికి ప్రతిరూపాలమనే సామాజిక çస్పృహను ఇది కలిగిస్తుంది. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న మనిషికి తన అంతర్గత ప్రశాంతతను వెతుక్కునేందుకు ఇది ఒక దిక్సూచి. అహంకారాన్ని వీడి తన అసలు స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మనిషికి నిజమైన విముక్తి సాధ్యమవుతుంది. – సత్యశ్రీ బాలాంత్రపు -
సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తున్నారా!
లోకమంతా గాఢనిద్రలో మునిగిపోయిన వేళ. నిశ్శబ్దం అగాధంగా ఆవరించిన ఆ అర్ధరాత్రి సమయంలో, ఎప్పుడైనా అకస్మాత్తుగా మీ కళ్ళు తెరుచుకున్నాయా? చుట్టూ శూన్యం, గుండెపై ఏదో తెలియని భారం. రేపటి జీవన పోరాటం, మోయలేని బాధ్యతలు, తీరని ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ చింతలు... ఒక్కసారిగా మదిని తొలిచేస్తూ, ఈ అనంత విశ్వం లో నేనొక్కడినే ఒంటరినైపోయానా అనే వేదన మిమ్మల్ని చుట్టుముడుతుంది.ఆ ఏకాంత క్షణంలో మీరు అస్సలు ఒంటరి కారు. ఆ నిశ్శబ్దం నిరాశ కాదు... అది విశ్వసృష్టికర్త నుండి మీకు అందిన పరమ పవిత్రమైన ఆహ్వానం! జగమంతా నిద్రిస్తున్న వేళ, ఆ రాజులకే రాజు మీకోసం అంతరంగ ఆత్మీయ సదస్సును సిద్ధం చేశాడు. మీ మనసులోని కల్లోలాన్ని తుడిచేసి, అనంతమైన ప్రశాంతతను అమృతంలా కురిపించడానికి ఆయన వేచి చూస్తున్నాడు. అయితే, దుప్పటి ముసుగులో తాత్కాలిక సుఖాన్ని పొందుతూ ఆ అమృత ఘడియలను జారవిడుచుకుంటారా, లేక ఆ పరమ ప్రభువును దర్శించుకోవడానికి మేల్కొంటారా? నిర్ణయం మీదే!శారీరక బద్ధకంపై ఆధ్యాత్మిక విజయంఎప్పుడైతే నిద్రను జయించి మీరు పరుపు వదులుతారో, అప్పుడే మీ అహంకారం నశిస్తుంది. ‘నా దేహ సుఖం కంటే, నా సృష్టికర్తను ఆరాధించడమే నా ప్రథమ కర్తవ్యం’ అని మీ అంతరాత్మ ఘోషిస్తుంది. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే, ఆ చల్లని నేలపై మీ తలను వంచి, మీ అంతరంగ రహస్యాలను దేవునికి విన్నవించుకున్నప్పుడు లభించే పరమశాంతి ఈ సృష్టిలో మరెక్కడా దొరకదు.ఆరాధనలోని ఆ నిగూఢమైన ప్రేమే దాసుడిని దేవుడికి దగ్గర చేస్తుంది. రాత్రి చివరి మూడవ భాగంలో ప్రకృతిలో ఒక అద్భుతమైన దైవిక సువాసన పరిమళిస్తుంది. అది కారుణ్యపు తలుపులు తెరుచుకునే మహత్తర సమయం. ఆ అల్లాహ్ మొదటి ఆకాశానికి దిగివచ్చి... ‘నన్నుప్రార్థించే దాసులు ఎవరున్నారు, వారి మొర ఆలకించడానికి? నన్ను అడిగేవారు ఎవరున్నారు, వారి కోరికలు తీర్చడానికి? క్షమాపణ కోరేవారు ఎవరున్నారు, వారి ΄ా΄ాలను కడిగేయడానికి?’ అని మధురంగా పలికే దివ్యక్షణాలవి.ఈ సమయంలో ప్రకృతిలోని అదృశ్య శక్తులు, పుణ్య దైవదూతలు ఎంతో చైతన్యవంతంగా సంచరిస్తూ ఉంటారు. రాత్రివేళ విధుల్లో ఉండే దైవదూతలు, పగటివేళ బాధ్యతలు స్వీకరించే దైవదూతలు పరస్పరం కలుసుకునే సంధి కాలం ఈ తెల్లవారుజాము. మీరుప్రార్థనలో నిలబడినప్పుడు, ఆ దైవదూతలు మీ పేరును ధన్యుల జాబితాలో లిఖించి, ఆ వేడుకోలును నేరుగా ఆకాశాలకు తీసుకెళ్తారు. ఆ సర్వశక్తిమంతుడే మీకు రక్షణ కవచంగా మారినప్పుడు, లోకంలో ఎలాంటి తుఫానులు వచ్చినా మీ మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది.జీవితాన్ని మార్చే ‘బరకత్’ (దైవిక అనుగ్రహం)ఉదయాన్నే నిద్రలేవడం వల్ల జీవితంలోకి ‘బరకత్’ అనే దైవిక అనుగ్రహం ప్రవాహంలా వస్తుంది. ఇది మీ సమయాన్ని, శక్తినీ రెట్టింపు చేసే దైవ వరం. ప్రవక్త ముహమ్మద్ (స) తన అనుచరుల కోసం... ‘ఓ అల్లాహ్! నా జాతికి వారి తెల్లవారుజాము సమయాల్లో అమితమైన శుభాలను ప్రసాదించు’ అని మనసారాప్రార్థించారు. ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మీ కాలానికి ఒక అదృశ్యమైన దైవికహస్తం తోడవుతుంది. మీ పనులు సులువవుతాయి, హృదయం తేలికవుతుంది. ఇతరులు రోజంతా చేసే పనిని మీరు కేవలం కొన్ని గంటల్లోనే అలవోకగా పూర్తి చేయగలుగుతారు.షైతాను సంకెళ్ళను తెంచేయండిమనం నిద్రిస్తున్నప్పుడు షైతాను మన తల వెనుక మూడు బలమైన ముడులను వేస్తాడని ఆధ్యాత్మిక సత్యాలు చెప్తున్నాయి. ఆ అదృశ్య సంకెళ్ళను తెంచడానికి ఒకే ఒక్క దివ్య ఔషధం1. మీరు నిద్ర లేచి అల్లాహ్ను స్మరించుకున్న క్షణంలో మొదటి ముడి విడిపోతుంది.2. ప్రార్థన కోసం పవిత్రమైన శుద్ధి (వజూ) చేసుకున్నప్పుడు రెండవ ముడి విడిపోతుంది.3. ప్రార్థన (నమాజ్) లో దేవుని ముందు నిలబడినప్పుడు మూడవ ముడి పూర్తిగా తెగిపోతుంది.ఈ ముడులను తెంచుకున్న దాసుడు ఆ ఉదయం ఉత్సాహపు కెరటంలా, పవిత్రమైన ఆనంద నిధిలా మేల్కొంటాడు. – ముహమ్మద్ ముజాహిద్ -
స్నేహమాధుర్యం..
స్నేహం గూర్చి ఎంతో గొప్పగా చెప్తారు.. సృష్టిలో తియ్యనిదని కొందరంటే, కొందరు మధురమైనదని అన్నారు. స్నేహబంధం విడదీయరాని బంధం అన్నారు...పురాణాల్లో రామ సుగ్రీవుల మైత్రి, కృష్ణుడు కుచేలుల మైత్రి, కృష్ణార్జునల మైత్రి చెప్పుకోదగ్గవి... స్వభావరీత్యా దుష్టులైన దుర్యోధనుడు, కర్ణుల మైత్రి అయినా మంచి ఉదాహరణ కాదు. ఇలాంటి వారి విషయంలో శతకనీతి మనకు ఎంతో మంచి మార్గం చూపిస్తుంది...సజ్జన సాంగత్యం గొప్పదంటాడు భర్తృహరి... ఏనుగు లక్ష్మణ కవి తాను చేసిన అనువాదంలో... ‘సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్పుగౌరవమొసంగు, జనులకు గలుష మడచుగీర్తి బ్రకటించు, చిత్తస్ఫూర్తిజేయుసాధుసంగంబు సకలార్థ సాధనంబు’సజ్జన సహవాసం వలన ఉపయోగాలు చెప్తున్నాడు కవి. సమస్త ప్రయోజనాలు సాధించబడతాయి. అంటే కాదు సకలార్ధ సాధకం అని సెలవిచ్చాడు. ఇదే బాణీని అందరూ కొనసాగించారని అనిపిస్తుంది.. వేమన ‘నీచగుణములెల్ల నిర్మూలమై పోవు, కొదువ లేదు సుజన గోష్టి వలన’ అని సుజన గోష్టి వలన నీచ గుణాలు తొలగిపోతాయంటాడు.‘కాని వానితోడగలసి మెలంగినహాని వచ్చు నెంతవానికైనకాకి గూడి హంస గష్టంబు పొందదా’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు, వేమన. దుష్టుని స్నేహం గూర్చి వివరిస్తాడు, సుమతీ శతకంలో.‘ఉపమింప మొదట తియ్యనకపటం బెడనెడను జెఱకుకైవడినే పోనెపములు వెదకును గడపటగపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ‘ చెడు స్నేహానికి మంచి ఉదాహరణ చె΄్పారు ఇక్కడ.. చెడ్డవారితో స్నేహం మొదట్లో చెఱకు గడ తీపిలా ఉంటుంది. మధ్యలో రుచి తగ్గుతుంది, చివరికి పూర్తిగా చప్పగా ఉండి, ఏమి లేదనిపిస్తుంది. అటువంటి వాడికి తప్పులే కనిపిస్తాయి.‘ఎప్పుడు తప్పులు వెదకెడునప్పురుషుని గొల్వగూడడది’ అని అంటాడు సుమతీ శతకంలో.‘కాదు సుమీ దుస్సంగతి’ అని హెచ్చరిక చేస్తాడు ఇదే శతకంలో.మరో పద్యంలో ‘కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు’ అని అన్నారు..‘కొంచెపునరు సంగతిచేనంచితముగ గీడు వచ్చునది’ అంటూ ఒక ఉపమానం చెప్తాడు.. నల్లి కుడితే మంచానికి దెబ్బలు తగులుతాయి..‘పాలను గలసిన జలమునుపాలవిధంబునె యుండు బరికింపంగాబాల చవి జెఱచు గావునబాలసుడగువాని పొందు వలదుర సుమతీ‘ పాలు కలిసిన నీళ్లు పాల లాగే ఉంటాయి, అలాగే దుర్జనుడు సజ్జనుడు ఉంటే సజ్జనుడు లాగా ఉంటాడు... అందుకు సజ్జనుడే జాగ్రత్త వహించాలి..‘లేమి కలిమి రెండు సమముగ జూచేడి పురుషుడే మిత్రుడెన్ని పొగడారయా’ అని వేమన అంటే ‘మంచి గుణము లేని వానితో మైత్రి చేసి తుది సుఖము బడయుదురా భాస్కరా’ అంటారు భాస్కర శతకంలో.చివరగా భర్తృహరి భాషలో ‘త్యజేత్ ధనం రక్షణార్థం, ధనం త్యజేత్ ఆపది ఆత్మర్థం పృథివీం త్యజేత్, మిత్రార్థే త్యజేత్ ఆత్మనఃకాపాడుకోవడానికి సంపద, ధనం, రాజ్యం అని వదులుకోవచ్చు,కాని మిత్రుడి కోసం నువ్వు నిన్నే వదులుకోవాలి.. అంత గొప్పది స్నేహం. – డా. కందాళ సత్య నారాయణ మూర్తి -
పాదయాత్రే జైత్రయాత్రగా...
జైత్రయాత్ర అనగా గెలుపు కోసం చేసే యాత్ర. యేసు తన జీవితకాల చివరి మూడున్నర సంవత్సరాల పాదయాత్రను జైత్రయాత్రగా చూడవచ్చు. నిజానికి యేసు పాదయాత్రే జైత్రయాత్ర. రెండూ ఒక్కటే. పాదయాత్ర సాధారణ రీతిలో జరుగకపోగా అసాధారణ రీతి లో జైత్రయాత్రగా మార్చబడి గొప్ప సంచలనాలకు కేంద్రం అయ్యింది. ఇక్కడ మాత్రం పాదయాత్రకు జైత్రయాత్ర పర్యాయపదం కాక అంతకు మించినది కావడం విశేషం. ఆనాటి యేసు జైత్రయాత్ర ఇచ్చే ప్రేరణ ఇంతా అంతా కాదు.జైత్ర అంటే జయించేది అని అర్థం. అది విజయానికి సంబంధించినది అని చెప్పవచ్చు. విజయ శీలుడు, విజయశీలమైనది అనే అర్థాలు కూడా ఉన్నాయి. యాత్ర అంటే క్షేత్రస్థాయి పర్యటన. శత్రువులపై దండెత్తి విజయం సాధించడానికి వెళ్ళే యాత్రే జైత్రయాత్ర. ఆత్మ సంబంధంగా చూస్తే, దైవవాక్కుల ఖడ్గంతో దూసుకెళుతూ శత్రువైన సాతానుపై యేసు దండెత్తిన విధానం కనువిందే కాక చరిత్రలో అదొక గొప్ప వాగ్యుద్ధం. యావత్ ప్రపంచానికి దీన్ని మించిన స్ఫూర్తి మరొకటి లేదు. ఒకరు ఏదైనా ఒక రంగంలో వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగే ప్రయాణాన్ని కూడా జైత్రయాత్ర అంటారు.కుష్ఠురోగియైన సీమోను ఇల్లు, ఆ ఇంటి పరిసరాలు గొప్ప సువాసనతో నిండేలా ఒక స్త్రీ అత్యంత విలువగల బహు ఖరీదైన అచ్చ జటామాంసి అత్తరు తీసికొనివచ్చి యేసు తలమీద అదిపోసి తనదైన ప్రేమను ఉన్నతంగా వ్యక్తం చేసింది. మరియొక స్త్రీ అత్తరు బుడ్డితో యేడ్చుచు వచ్చి కన్నీటితో యేసు పాదాలను తడిపి కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పూసింది. గొప్ప జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ యేసు అసాధారణ బోధలకు బహుగా ఆశ్చర్యపోతూ, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పింది. ‘మేము ఎవరి దగ్గరకు వెళతాం? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు’ అంటూ పేతురు యేసును గట్టిగా పట్టుకున్నాడు. ఇదంతా పరిశీలనగా చూస్తే యేసుకు జైజైలు పలుకుటే.ప్రవచనం ప్రకారంగా కట్టబడియున్న ఒక గాడిద పిల్లను శిష్యులు విడిపించి తెచ్చిన వెంటనే యేసు గాడిదపిల్ల మీద కూర్చోగానే హోసన్నా నినాదాలు హోరెత్తాయి. ఖర్జూర మట్టలతో ఆయనకు స్వాగతం పలికారు. దారి ΄÷డుగున తమ బట్టలు, ఒలీవకొమ్మలతో పాటు వివిధ చెట్లకొమ్మలు తెచ్చిపరుస్తూ తమ సంతోషానందాలు వ్యక్తం చేసారు. దావీదు కుమారునికి జయం. ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక! సర్వోన్నత స్థలములలో జయము అంటూ బహు జనసముహం మహా శబ్దంతో కేకలు వేశారు. మిన్నంటిన జయజయధ్వనులతో బేత్పగే, బేతనియ గ్రామాలు మార్మోగాయి.యెరూషలేము పట్టణపు యూదులే కాకుండా, పస్కా పండుగ చేయుటకు వివిధ దేశాల నుండి ముందుగానే వచ్చిన యూదులు కూడా మెస్సీయాను ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన్ను జేజేలతో కీర్తించారు. ఎలుగెత్తి చేస్తోన్న ఈ గొప్ప శబ్దాన్ని చూసి ఓర్వలేని వినలేని వినుటకు మనస్సులేని పరిసయ్యులు అభ్యంతరాలు చె΄్పారు. బోధకుడా, నీ శిష్యులను గద్దించు అంటూ యేసుకే ఫిర్యాదు చేశారు. వీరు ఊరకుండి మౌనంగా నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని యేసు పరిసయ్యులను హెచ్చరించాడు.ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అను కొండగ్రామాల మీదుగా యేసు విజయయాత్ర ్రపారంభమై కిద్రోను లోయను దాటి దేవుని ఆలయం ఉన్న పవిత్ర నగరం యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేవరకు సాగింది. ఈయన ఎవరో అనుకుంటూ యెరూషలేము పట్టణమంతా ఒకసారిగా కలవరానికి గురైంది. యేసు జైత్రయాత్రలకు ముచ్చటపడిపోతూ ఇలా ఆరోజున ఆయనకు ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జైకొట్టినవారే. నాట్యమాడే అంతరంగాలతో క్రీస్తుకు జేజేలు పలికినవారు నాడు ఎందరెందరో. – జేతమ్ -
గర్భధారణ సమయంలో పరిణీతి చోప్రా శివస్తుతి..! ఆ టైంలో చేయొచ్చా
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఎప్పటికప్పుడూ తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. ఈసారి అలానే మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ సందర్శన గురించి గుర్తుచేసుకుంటూ..ఆ అనుభవాలను షేర్ చేసుకున్నారు. అదీగాక ఆమె శివుడి మీద ఆలపించిన పాట నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో ఇలా నాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ వివరణ ఇచ్చారు. నటి పరిణితీ చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్ధాలకు గతేడాదే పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ ప్రెగ్నెన్సీ సమయంలోనే తాను శివస్తుతిని ఆలపించానని, ఆ వీడియో ఆ సమయంలోనిదే అంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారుఈ సందర్భంగా రాఘవ్తో పెళ్లి జరగకుముందు ఆయనతో కలసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించిన విషయాన్ని కూడా ప్రస్తావించారామె. ఆ పోస్ట్లో ఈ నెల ప్రారంభంలో తాను ‘నమామీశ మీశాన నిర్వాణ రూపం’ అంటూ ఆలపించిన శివస్తుతి వీడియోని విడుదల చేసినట్లు తెలిపారు. అది గర్భధారణ సమయంలో ఒక ప్రశాంతమైన ఉదయం వేళ ఆ శివస్తుతిని రికార్డు చేసినట్లు తెలిపారు. "అయితే దీనికి ఇంతటి ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలేదు. చాలా ఏళ్లుగా మా కుటుంబంలో ఇది ఒక భాగంగా ఉన్నట్లే, ఇప్పుడు ఇది మీ ఉదయపు పాటల జాబితాలో (ప్లేలిస్ట్) చేరడం నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తోంది. శివస్తుతి అనేది పరమశివునికి అంకితం చేసిన ఒక భక్తి గీతం." అని రాసుకొచ్చారు పోస్ట్లో. అలాగే ఆ భక్తిగీతం తోపాటు పరిణీతి తాను, రాఘవ్ కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని సందర్శించిన వీడియోని కూడా పోస్ట్ చేశారు. సెప్టెంబర్లో జరిగిన వారి వివాహానికి కొన్ని వారాల ముందు, అంటే 2023 ఆగస్టులో వారు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ వీడియోలో పూజారి హారతి ఇస్తుండగా శివలింగం స్పష్టంగా కనిపించడం చూడొచ్చు. చుట్టూ చాలా మంది జనం ఉన్నప్పటికీ, పరిణీతి-రాఘవ్లు భక్తితో చేతులు జోడించి కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత, వారు స్వయంగా హారతి కూడా ఇచ్చారు. ఈ జంట అదే ఏడాది జూలై 2023లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) కూడా సందర్శించారు. మరి ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో శివస్తుతి వంటివి చేయొచ్చా అంటే..ఆ టైంలో చేయొచ్చా..గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలోనే కాకుండా మానసిక ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయి. ఈ సమయంలో స్త్రీ కొన్నిసార్లు ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తుంది, మరికొన్నిసార్లు చాలా భావోద్వేగంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శివపూజ చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది, ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగ ఆలోచనలు తగ్గుతాయి. గర్భధారణ సమయంలో శివలింగ పూజ లేదా భక్తిపాటలు ఆలపించడం వల్ల ప్రతికూల శక్తి నీడ పుట్టబోయే బిడ్డపై పడదు. గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది తల్లి బిడ్డ ఇద్దరి మానసిక, శారీరక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉపవాసాలు వంటవి చేయకుండా ప్రశాంతత చేకూర్చే ఇష్టదైవ పూజ లేదా పాటలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చని అన్నారు. వత్రాలు, నోములు వంటివి తప్పించి హాయిగా ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవచ్చు, ఆయా భక్తి పాటలు ఆలపించొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నచ్చిన పని, ఇష్టదైవ ప్రార్థన వంటివి గర్భిణీలకు ఒత్తిడిని తగ్గించి..మానసిక ప్రశాంతతను అందివ్వడమే కాకుండా సుఖ ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తుందని అన్నారు. View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) గమనిక: ఇది కేవలం భక్తి, నమ్మకాల ఆధారంగా ఇచ్చిన కథనం మాత్రమే. భక్తులు తీన్ని అనుసరించే ముందు ఆయా ప్రముఖ పండితులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. (చదవండి: సీషెల్స్ ద్వితీయ మహిళకు ప్రధాని మోదీ గిఫ్ట్గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే) -
విశ్రాంత స్వాంతుడు..
దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్, సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు -
అహంకార శిల్పం..
ఒక రాజ్యంలో ఒక మంచి శిల్పి ఉండేవాడు. ఎలాంటి శిలనైనా శిల్పంగా మార్చగల నైపుణ్యం అతడి సొంతం. ఉండేది. ‘నీ పనితనం చాలా గొప్పది, అందుకే ఎన్నో అద్భుతమైన శిల్పాలను చెక్కగలుగుతున్నావు. నీవు చెక్కుతున్న శిల్పాలలో జీవం ఉట్టిపడుతోంది’ అని అందరూ అతడిని ప్రశంసించేవారు. దాంతో ఆ శిల్పిలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. మరింత గొప్పగా శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు.ఆనోటా ఈనోటా పాకిన ఈ విషయం ఆ పెద్ద సామ్రాజ్యపు చక్రవర్తి వరకు వెళ్ళింది. ఆ చక్రవర్తి శ్రీ కృష్ణుడి భక్తుడు. ఆయన ఆ శిల్పిని పిలిపించి, ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వమన్నాడు. శిల్పి రాత్రింబగళ్ళు కష్టపడి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని చూసిన చక్రవర్తి పరమానందభరితుడయ్యాడు. ఆ దివ్య సౌందర్యానికి పులకరించిపోయాడు. ప్రజల సమక్షంలో శిల్పిని ధన కనక వస్తువాహనాలతో సన్మానించాడు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అతడికి ‘మహాశిల్పి’ అని బిరుదునిచ్చాడు.శిల్పి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, అతడిలో ఉన్న ఆత్మవిశ్వాసం మెల్లగా అహంకారంగా మారింది. అతడు ఇంటికి వెళ్ళి తండ్రితో, ‘నాకు మించిన శిల్పి ఈ భూలోకంలోనే లేడు’ అని విర్రవీగాడు. కొడుకు మాటలను ఆ శిల్పి తండ్రి పట్టించుకోలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. ‘ప్రపంచమే నాకు నీరాజనాలు పడుతుంటే, తండ్రివైన నీవు నన్ను పొగడవేమిటి?’ అని శిల్పి తండ్రిని గట్టిగా నిలదీశాడు. అప్పుడు తండ్రి నవ్వి, ‘పిచ్చివాడా... ఈ సృష్టికర్త ముందర మనమెంత? ఈ కీర్తి, బిరుదులు ఇవన్నీ నీటి బుడగల్లాంటివి. ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవలసిందే’ అన్నాడు. శిల్పి కోపంగా తండ్రి వైపు చూస్తూ,‘నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు అసూయ కలిగించినట్లుంది’ అని నిష్టూరమాడాడు.దానికి జవాబుగా తండ్రి ఒక పలక, బలపాన్ని శిల్పి చేతికిచ్చాడు. సృష్టికర్త సృష్టించినట్లుగా కాకుండా, మరో భిన్నమైన రూపంలో ఒక మానవ ఆకారాన్ని గీసి చూపించమన్నాడు. ‘అదెంత పని!’ అన్నట్లుగా శిల్పి వాటిని చేతిలోకి తీసుకున్నాడు. శిల్పి మూడు రాత్రులు నిద్ర లేకుండా రకరకాలుగా ప్రయత్నించాడు.కాలు, చేయి, కన్ను, ముక్కు, చెవి... ఎలా మార్చినా మానవ శరీరం సంపూర్ణం కాలేదు సరి కదా, ఒకవేళ మరో విధంగా మార్చితే మానవ మనుగడే సాధ్యం కాదని అతడు తెలుసుకున్నాడు. ఏ అవయవాన్ని కూడా మరో రకంగా మార్చలేమని, వాటి స్థానాలను అంగుళం కూడా కదపలేమని గుర్తించాడు. చివరికి తల వెంట్రుకలను సైతం ఆ సృష్టికర్త ఎంతో నైపుణ్యంతో అమర్చాడని గ్రహించాడు. సృష్టికర్తకు మించిన మహాశిల్పి ఈ విశ్వంలోనే మరొకరు ఉండరని అతడికి స్పష్టమైంది. తన అహంకార ధోరణి తనకే అర్థం కావడంతో, ఆ శిల్పి పశ్చాత్తాపంతో తండ్రి ముందర తల దించుకున్నాడు. – ఆర్.సి. కృష్ణస్వామిరాజు -
అలనాటి అస్త్రాలు... బ్రహ్మాస్త్రం... బ్రహ్మాండాస్త్రం
మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించి గతవారం కొంత తెలుసుకున్నాం కదా... ఈ వారం ఆ అస్త్రాలలో కొన్ని ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాం... బ్రహ్మాస్త్రం... సృష్టికర్త అయిన బ్రహ్మ తన తపఃశక్తితో రూపొందించినదే ‘బ్రహ్మాస్త్రం’. అత్యంత శక్తిమంతమైన బ్రహ్మాస్త్రం గురించి ఇతిహాసాలలో వివరించారు. ఇది అత్యంత విధ్వంసకర, ప్రమాదకరమైన ఆయుధం. విశ్వంలో అన్ని కార్యకలాపాలూ సక్రమంగా జరగడానికీ, నియంత్రణను కొనసాగించడానికీ, ఇది ఉద్దేశింపబడింది. ఈ ఆలోచనతోనే, బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తిమంతమైన ఆయుధం. దీనిని కేవలం, రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. త్రేతాయుగం నాటి రామాయణ కాలంలో విభీషణుడూ, లక్ష్మణుడూ మాత్రమే దీనిని వాడారు. మహాభారత యుద్ధంలో, ద్రోణాచార్యుడూ,అర్జునుడు అశ్వత్థామ, శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, ఈ అస్త్ర ప్రయోగం తెలిసిన వారు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో, కర్ణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేద్దామనుకొంటే గురువైన పరశురాముని శాపం వల్ల అస్త్రాన్ని సంధించే మంత్రం జ్ఞాపకం రాకపోవడంతో సంధించలేకపోయాడు.బ్రహ్మశీర్షాస్త్రం...ఇది బ్రహ్మాస్త్రం కంటే, నాలుగు రెట్లు శక్తిమంతమైనది. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల, వినాశనం కలుగుతుంది. దీనిని ప్రయోగించిన ప్రాంతం, 12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారిపోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని, పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తిమంతమైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ద్రోణాచార్యుడు, తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం రాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా, దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి, రామ రావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీనివలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో, శక్తిమంతమైనదో అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ప్రయోగించవద్దని అర్జునుడికి హితబోధ చేసి మరీ ఈ అస్త్రాన్ని ఉపదేశించాడు. బ్రహ్మాండాస్త్రం...ఈ ఆయుధం, మొత్తం సౌర వ్యవస్థను, అంటే, ఈ బ్రహ్మాండాన్నే నాశనం. చేసేంత శక్తిమంతమైనది. ఈ ఆయుధం కొనపై బ్రహ్మ దేవుని నాలుగు తలలతో పాటు ఊర్ధ్య ముఖంగా మరో తల ఉంటుంది. ఈ అస్త్రంలో బ్రహ్మాస్త్ర బ్రహ్మ శీర్షాస్త్రాల రెండు శక్తులూ సమ్మిళితమై ఉంటాయి. ఒకసారి ఈ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత దీనిని ఆపడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా దీనిని ప్రయోగించినవారు కూడా దాని వల్ల జరగబోయే ముప్పును, అనర్థాలనూ తప్పించలేరు. ఈ అస్త్రం ద్రోణాచార్యుడి వద్దనే ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ధర్మం కోసం పోరాడుతుండటంతో వారిపై ప్రయోగించవద్దని దేవతల కోరిక మేరకు ద్రోణాచార్యుడు ప్రయోగించలేదు.త్రిశూలం... త్రిశూలం శివుని ఆయుధం.. పార్వతీదేవి శివునికి ప్రసాదించిన అత్యంత శక్తిమంతమైన అస్త్రం ఇది. దీనికున్న మూడు కొనలు సృష్టి, స్థితి, లయ అనే మూడింటికి ప్రతీకలు. మొత్తం విశ్వమంతా ఈ మూడు శక్తుల మీదే నడుస్తుంది. లక్ష్య భేదితమైన త్రిశూలం శైవ సంప్రదాయం ప్రకారం అత్యంత శక్తిమంతమైన ఆయుధం. కేవలం శివుడు, శక్తి దేవతలు మాత్రమే దీనిని భరించగలరు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
కర్మఫలం... కర్తవ్య బలం
అంకితభావంతో కూడిన ఆచరణనే కర్తవ్యం అంటారు. జీవితంలో ఏ రంగంలో ఉన్నా తన వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడమే అసలైన యజ్ఞం. కర్తవ్యం కేవలం భారం కాదు; అది ఆత్మ వికాసానికి లభించిన పవిత్ర అవకాశం. గాలివానలోనూ దీపం ఆరిపోకుండా కాపాడుకున్నట్లు, ప్రతికూల పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని వీడకూడదు. పదును లేని కత్తి యుద్ధానికి పనికిరానట్లు, నిబద్ధత లేని పని ఫలితాన్ని ఇవ్వలేదు. ఉదాహరణకు, ఒక నిరుపేద విద్యార్థి తన పేదరికాన్ని సాకుగా చూపకుండా, కష్టపడి చదివి విజయం సాధించడం ఉన్నతమైన కర్మ నిర్వహణ. శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీ బానిసవుతుంది. పనిని ప్రేమించేవాడికి అలసట ఉండదు, లక్ష్యం పట్ల స్పష్టత ఉన్నవాడికి అపజయం ఎదురుకాదు. సంకల్పం దృఢంగా ఉంటే మార్గం సుగమమవుతుంది. నిరంతర సాధన ఉంటేనే రాయి రత్నంగా మారుతుంది.కర్మ చేయడం మన హక్కు, కానీ ఫలితంపై అధికారం ప్రకృతికి లోబడి ఉంటుంది. ఫలితాన్ని ఆశించి చేసే పని మనిషిని బానిసగా మారుస్తుంది; ఫలితాన్ని సమర్పణ భావంతో వదిలేసే వ్యక్తిని కర్మ యోగిగా తీర్చిదిద్దుతుంది. తన నీటిని తాను తాగని నదిలా, తన పండ్లను తాను ఆరగించని వృక్షంలా మన కర్మలు లోక హితం కోరాలి. ఆశలు సంకెళ్ళయితే, ఆశయం రెక్కల వంటిది. నేటి పోటీ ప్రపంచంలో కేవలం స్వార్థ ప్రయోజనం కోసమే పరుగెత్తడం వల్లనే మానసిక అశాంతి పెరుగుతోంది. విల్లు నుంచి విడిచిన బాణం లక్ష్యం వైపే వెళ్ళాలి కానీ వెనక్కి చూడకూడదు. త్యాగంలో ఉన్న ఆనందం భోగంలో లభించదు. ప్రతిఫలం ఆశించని సేవ పరమాత్మకు చేరువయ్యే రాజమార్గం. ఫలితాపేక్ష లేని క్రియే మనిషిని బంధనాల నుండి విముక్తుడిని చేస్తుంది.ఏది ధర్మబద్ధమైన కర్మ అని గుర్తించడమే వివేకం. వివేకం లేని క్రియ అంధకారంలో ప్రయాణం వంటిది. జ్ఞానంతో కూడిన ఆచరణే కర్మ కౌశలం. బాహ్య ప్రపంచంలో మనం చేసే పనుల కన్నా, మన అంతరంగంలో ఉన్న సంకల్పం గొప్పది. నిప్పును తాకితే చేయి కాలడం ఎంత సహజమో, దుష్కర్మ చేస్తే దుఃఖం కలగడం అంతే అనివార్యం. పాల నుండి నీటిని వేరు చేసే హంసలా, మనం చేసే పనులలోని మంచి చెడులను వివేకంతో వేరు చేయాలి. బురదలో ఉన్నా పవిత్రతను కాపాడుకునే పద్మంలా, సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ధర్మబద్ధంగా వ్యవహరించడమే మనీషి లక్షణం. కర్మ సిద్ధాంతం శిక్ష కాదు; అది మనల్ని మనం సరిదిద్దుకునే గొప్ప శిక్షణ. గతం మన చేతుల్లో లేదు, కానీ వర్తమానంలో మనం చేసే సత్కర్మలు సుందరమైన భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. అహంకారం వీడినప్పుడే ఆత్మ దర్శనం సాధ్యమవుతుంది. స్వార్థం వీడిన కర్మయే మోక్ష మార్గం. ప్రతి క్షణం ఒక నూతన అవకాశం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం, నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరిద్దాం.సనాతన ధర్మం కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. మానవ జన్మ ఒక అద్భుత కర్మభూమి. ఇక్కడ ప్రతి చేష్ట, ప్రతి ఆలోచన విశ్వంలో ఒకానొక శక్తిమంతమైన తరంగాన్ని సృష్టిస్తుంది. విత్తినవాడే ఫలాన్ని అనుభవించాలనేది ప్రకృతి అమోఘమైన నియమం. కర్మల వెనుక ఉన్న ఉద్దేశం, వివేకం మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బంధనాల నుండి విముక్తి పొందాలన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా కర్మఫల రహస్యం తెలియడం అత్యంత ఆవశ్యకం.సేవే పరమార్థంగా, త్యాగమే మార్గంగా సాగే జీవనం ధన్యమవుతుంది. వ్యక్తిలోని కర్మశక్తి విశ్వశ్రేయస్సుకై అంకితం కావాలి. కర్మ యోగంతో అంతరంగాన్ని శుద్ధి చేసుకుందాం. భారతీయుల కర్మ సాధన జగత్తుకు వెలుగు కావాలి. మనిషి మారాలి, మనీషిగా ఎదగాలి, జగత్తు పునీతం కావాలి, లోకం సుఖపడాలి.వివేకం లేని బలం ప్రమాదకరం, బలం లేని వివేకం నిష్ప్రయోజనం. చిత్తశుద్ధి లేని శివపూజ ఫలితాన్నివ్వదు. వెలుగు లేని కన్ను ప్రపంచాన్ని చూడలేనట్లు, వివేకం లేని మేధస్సు సరైన నిర్ణయం తీసుకోలేదు.– కె. భాస్కర్ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు. -
పితృకార్యాలు.. ఎక్కడ చేస్తే మంచిది?
పితృదోషాలు.. వాటి పరిష్కారమార్గాల గురించి మనం ఇదివరకు చేసిన వీడియోల్లో చెప్పుకొన్నాం కదా..! జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక అడ్డంకులు.. వైవాహిక సమస్యలు, తీరని ఆర్థిక ఇబ్బందులకు కేవలం గ్రహగతులు మాత్రమే కాకుండా.. పితృదోషాలు కూడా కారణం కావొచ్చని చెప్పుకొన్నాం. అసంతృప్తిగా ఉండే పూర్వీకుల ఆత్మల శాపం.. ఆ వంశంపై పడుతుంది. అయితే.. ఆత్మలకు శాంతిని చేకూర్చి, పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు కొన్ని పవిత్ర స్థలాలను మన పురాణాలు సూచించాయి. ఆ ప్రాంతాల్లో పిండప్రదానాలు చేస్తే.. పితృదేవతలు సంతృప్తి చెందుతారని వివరిస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం..పితృదోషాలు, పితృశాపాల నుంచి విముక్తి ఎలా లభిస్తుందని చెబుతుంటారు? పూర్వీకులకు తర్పణాలు అర్పించడానికి ఏ క్షేత్రాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు? ఏ క్షేత్రంలో పిండప్రదానాలు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు నేరుగా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు? ఏయే ఆలయాలను పితృ దోష నివారణకు అద్భుతమైనవిగా చెబుతారు? ఎక్కడ ‘మోక్ష దీపాన్ని’ వెలిగించడం ద్వారా పూర్వీకుల కోపం తొలగి.. కుటుంబంలో శ్రేయస్సు నెలకొంటుంది? వంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూడండి.. -
పరమ తండ్రి ప్రేమ
ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచనలు చేయక తప్పదు. విలువైన మూలాల వలన మూల΄ాఠములవలన ఇట్టి క్షేత్రస్థాయి వనరుల వలన సువాసనసారం ఎది ఉన్నా అది నేరుగా బయటపడి జీవితాలకు వంటబడుతుంది. పరిశోధనాత్మక ఆత్మ సంబంధ అభ్యాస జీవితానికి అన్వయించుకునేలా క్రీస్తు సందేశాలు ఎప్పుడూ ఘనంగానే ఉండుట అనేది గమనార్హం.‘నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను’ అంటాడు అద్వితీయ సత్యదేవుడు. ఆయన మనస్సు ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తువారి ఉన్నతమైన బోధ ఏమంటే ‘ఈ భూమి మీద ఎవరికిని తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందు ఉన్నాడు’. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనేది వేరే అంశం. ధర్మశాస్త్రాన్ని మరింత లోతుగా పరిశోధించినా, యేసు అసాధారణ బోధల ప్రకారంగా చూసినా కూడా ఒకరు ఆత్మ సంబంధంగా తండ్రి హోదాను అనుభవించడం దేవునికి కోపం తెప్పించే విషయమే కాక, ఇదొక గొప్పదైన విశేషం కూడానూ.గ్రంథప్రకారంగా దేవుని మహిమను దొంగిలించడం ఘోరతప్పిదమే అని చెప్పక తప్పదు. మేము మీకు ఆత్మీయ తల్లిదండ్రులం అంటూ సువార్తికులు, బోధకులు, సంఘ పెద్దలు పిలిపించుకోవడం లేఖన విరుద్ధం. మీరంతా సహోదరులు అనునదే క్రీస్తు బోధ. మనమంతా క్రీస్తునందున్నా సహోదరీ సహోదరులం. దేవుని పిల్లలం అనేదే లేఖన సంబంధ సర్వసత్యం. ఎప్పుడూ యేసును రబ్బునీ అని పిలుచుకొనే మగ్దలేనే మరియకే సమాధి దగ్గర మొట్టమొదటగా యేసు పునరుత్థానుడిగా దర్శనమిస్తూ చెప్పిన మాట ఆశ్చర్యకరమే. ‘నా సహోదరులవద్దకు వెళ్ళి – నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కి΄ోవుచున్నానని వారితో చెప్పుమనెను’. యేసుక్రీస్తు వారి తండ్రి, సర్వమానవాళి తండ్రి ఒక్కరే. ఆయనే యెహోవా అనబడే తండ్రియైన దేవుడు.హెబ్రీగ్రంథ లేఖికుని వివరణలో ‘నీవు నాకు ఇచ్చిన పిల్లలు’ అని ఒకచోట క్రీస్తు అన్నట్టుగా వ్రాయబడింది గానీ తండ్రి అని ఆయన పిలిపించుకొన్న దాఖలాలు ఎక్కడనూ లేవు. క్రీస్తు అపొస్తలులు కూడా ‘అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే’ అన్నది చాలా సూటిగా సుస్పష్టంగా ఉన్నతంగా వివరిస్తూ దేవున్ని ఎంతగానో హెచ్చిస్తూ గొప్ప చేసారు. సంఘ సహకారం తీసికొని సంఘసమక్షంలో సంఘంతో కలిసి గ్రంథాన్ని పఠిస్తే యేసు తన తండ్రియైన దేవునికి ఎంతగా విధేయుడై లోబడ్డాడో అనేది తేటగా అర్థమవుతుంది.ఒక తండ్రికి ఎంతటి కఠినాత్ముడైనా, అవిధేయుడైనా కుమారుడు ఉన్నప్పటికీ అతనికి యేసు విధేయతా జీవిత విధానం గూర్చి బోధిస్తే మొదట ఆలోచనలోపడి ఇక మార్పు తప్పని పరిస్థితే అతనికి ఎదురవుతుంది. కుమారునిగా యేసు జీవితం అంతటి ఉన్నతమైనది. పరమందున్న తండ్రియైన ఆ దేవదేవునికి, ఇంట్లో ఉన్న నాన్నకు లోబడి జీవించడం మనకెప్పుడూ గౌరవం తెచ్చే సత్క్రియే అనుటలో ఎలాంటి సందేహం లేదు. – జేతమ్ -
అంతా ఆచార్యుడి నిర్ణయమే..!
‘నాకు రాజ్యమూవద్దు, రాజ్యాధికారమూ వద్దు. నన్ను పట్టాభిషిక్తుని చేయనక్కర లేదు. నేను ఆచార్యుని చేతిలో కీలుబొమ్మలా వున్నాను. నాకు ఒక స్వేచ్ఛలేదు, సుఖం లేదు, స్వంత నిర్ణయం తీసుకోలేను. చివరకు నా వివాహం కూడా ఆచార్యుడి నిర్ణయమే. అందులోనూ ఆయన రాజకీయ కోణం చూస్తున్నారు .’’ అన్నాడు చంద్రగుప్తుడు వార్తాహరునితో. ఆ వార్త ఆచార్య విష్ణుగుప్తుని చేరింది. ఆచార్యులు చంద్రగుప్తుని వద్దకు వచ్చి ‘‘నేను విన్నది నిజమేనా?’’ అని అడిగారు.‘‘అవును’’ చంద్రగుప్తుని సమాధానం .‘‘ఎందుకు ?’’ ఆచార్యుని ప్రశ్న .‘‘నాకు స్వేచ్ఛ లేదు, సుఖంలేదు, ఏం, చక్రవర్తి సుఖాన్ని కోరకూడదా? నేను మీ చేతిలో జీతం తీసుకుంటున్న పెద్దనౌకరు లా వున్నాను.’’ అన్నాడు.‘‘అవును రాజు, రాజ్యంలో ప్రజాసేవచేసే పెద్దనౌకరే. చక్రవర్తికి సుఖం ఉండదు. ఉండకూడదు. ప్రజాసుఖమే చక్రవర్తి సుఖం. ప్రజాహితమే రాజుకి హితం.నేను నీకు రాజ్యాన్ని అప్పగిస్తానన్నాను గాని, సుఖాన్ని కాదు. దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితోబాధపడుతున్నా చక్రవర్తికి సుఖమెలావుంటుంది? సుఖానికి మూలం అర్థం. అర్థ, కామాలు ధర్మం మీద ఆధార పడి వుంటాయి. సంపాదన సక్రమ మార్గంలో వుండాలి. అక్రమ మార్గమైతే అర్థం, అనర్థమౌతుంది. రాజ్య సంక్షేమం, ప్రజల సుఖంకోసం అర్థం ఎంత అవసరమో, అది ఎందుకు ధర్మబద్ధం కావాలో వివరించారు ఆచార్య చాణక్యులు.చంద్రగుప్తుని చివరి రోజుల్లో దేశంలో కరువు తాండవించింది. ప్రజలు ఆకలికి అలమటించారు. అప్పుడు చంద్రగుప్తుడు కూడా ఆహారం తీసుకోలేదు. ప్రజాహితమే తమ హితంగా భావించిన ఆ ఇద్దరూ ధన్యులే. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
కాబాను కాపాడిన పక్షుల కథ!
చాలాకాలం క్రితం.. అంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టడానికి కొద్ది రోజుల ముందు జరిగిన కథ ఇది. అప్పట్లో యెమెన్ దేశాన్ని ‘అబ్రహ’ అనే ఒక క్రూరమైన రాజు పాలిస్తుండేవాడు. మక్కా నగరంలోని పవిత్ర ‘కాబా’ మందిరానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు రావడం, అక్కడప్రార్థనలు చేయడం అబ్రహకు అస్సలు నచ్చలేదు. ప్రజలందరూ తన దేశానికే రావాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా, కోట్లు ఖర్చు పెట్టి తన రాజధానిలో ఒక పెద్ద, అందమైన చర్చిని కట్టించాడు. ‘ఇకపై ఎవరూ మక్కాకు వెళ్లకూడదు, అందరూ నా దగ్గరికే రావాలి‘ అని హుకుం జారీ చేశాడు. ఈ విషయం తెలిసి అరబ్బులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో ఒక అరబ్ వ్యక్తి, రాత్రికి రాత్రే అబ్రహ కట్టించిన చర్చిలోకి దూరి, అపవిత్రం చేశాడు. దీంతో అబ్రహకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నా చర్చిని అవమానిస్తారా? ఆ మక్కాలో ఉన్న కాబా మందిరాన్ని పునాదులతో సహా కూల్చేస్తా!’ అంటూ కరడుగట్టిన సైన్యంతో మక్కా వైపు బయలుదేరాడు.గజరాజుల సైన్యం.. వణికిపోయిన మక్కా!అబ్రహ సైన్యం మామూలు సైన్యం కాదు. శత్రువులను తొక్కి పారేయడానికి కొండల లాంటి భారీ ఏనుగులను ఆ సైన్యంలో చేర్చాడు. దారిలో అడ్డువచ్చిన చిన్న చిన్న తెగలను చీల్చిచెండాడుతూ అబ్రహ సైన్యం మక్కా సరిహద్దుల్లోకి చేరుకుంది. అక్కడ అమాయక ప్రజల ఆస్తులను, ఒంటెలను దోచుకుంది. అలా దోచబడిన వాటిలో మక్కా నాయకుడు, ప్రవక్త ముహమ్మద్ గారి తాతగారైన ‘అబ్దుల్ ముత్తలిబ్’కు చెందిన 200 ఒంటెలు కూడా ఉన్నాయి. యుద్ధం వద్దనుకుంటే కాబాను కూల్చడానికి అడ్డుపడొద్దని అబ్రహ సందేశం పంపాడు. దాంతో చర్చల కోసం అబ్దుల్ ముత్తలిబ్ నేరుగా అబ్రహ డేరాకు వెళ్లారు. ఆయన గంభీరమైన రూపాన్ని చూసి అబ్రహ ముచ్చటపడ్డాడు. ‘ఏం కావాలి?’ అని అడిగాడు.‘నీ సైన్యం నా 200 ఒంటెలను పట్టుకెళ్లింది, వాటిని నాకు ఇచ్చేయ్’ అన్నారు అబ్దుల్ ముత్తలిబ్ ప్రశాంతంగా. అబ్రహ ఆశ్చర్యపోయాడు, నవ్వుతూ అవహేళన చేశాడు. ‘మిమ్మల్ని చూసి గొప్పవాడనుకున్నా! నేను మీ పవిత్రమైన కాబా మందిరాన్ని కూల్చేయడానికి వస్తుంటే, దాని గురించి అడగకుండా మీ ఒంటెల గురించి అడుగుతున్నారేంటి?’ అన్నాడు.దానికి అబ్దుల్ ముత్తలిబ్ ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ఎంతో ధీమాగా.. ‘ఆ ఒంటెలకు యజమానిని నేను, అందుకే నా ఒంటెలను అడిగాను. కానీ, ఆ కాబా మందిరానికి ఒక యజమాని (అల్లాహ్) ఉన్నాడు. దానిని ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు!’ అని చెప్పారు. తిరిగి వచ్చిన అబ్దుల్ ముత్తలిబ్, ప్రజలందరినీ కాబా ఖాళీ చేసి,ప్రాణాలు కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న కొండలపైకి వెళ్ళిపోవాలని ఆదేశించారు.మోకాళ్లూనిన ఏనుగు.. ఆకాశంలో అద్భుతం!మరుసటి రోజు ఉదయం.. అబ్రహ సైన్యం కాబా వైపు అడుగులు వేయడంప్రారంభించింది. ‘మహమూద్’ అనే ఒక పెద్ద ఏనుగు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తోంది. కానీ, సరిగ్గా కాబా వైపు నడవమనేసరికి ఆ ఏనుగు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మోకాళ్లూని కూర్చుండిపోయింది! దానిని ఎంత కొట్టినా, పొడిచినా కదలలేదు. అదే విచిత్రంగా యెమెన్ వైపో, లేదా వేరే దిశల వైపో తిప్పితే మాత్రం పరిగెత్తింది. అబ్రహ సైన్యానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. సముద్రం వైపు నుండి వేలాది పక్షుల సమూహాలు మక్కా వైపు రాసాగాయి. వాటిని అరబ్బీలో ‘అబాబీల్’ అంటారు. ఆ చిన్న చిన్న పక్షుల నోట్లో ఒక రాయి, రెండు కాళ్లలో రెండు రాళ్లు ఉన్నాయి. అవి మామూలు రాళ్లు కావు.. కాల్చిన మట్టి రాళ్లు (సిజ్జీల్).తిన్న గడ్డిపరకల్లా.. సర్వనాశనం!ఆ పక్షుల సైన్యం అబ్రహ సైన్యంపైకి రాగానే, తమ కాళ్లలో, నోట్లో ఉన్న రాళ్లను పైనుంచి తుపాకీ గుళ్లలా వర్షింపజేశాయి. ఆ చిన్న రాళ్లు ఏనుగుల మీద, సైనికుల మీద పడగానే.. శరీరాన్ని చీల్చుకుంటూ అవతలికి వెళ్ళిపోయాయి. రాజు అబ్రహతో సహా సైన్యమంతా కకావికలమైపోయింది.పవిత్ర ఖురాన్ లోని ‘సూరహ్ అల్–ఫీల్’ (105:5) లో దేవుడు చెప్పినట్లుగా.. ఆ భారీ సైన్యం అంతా ‘పశువులు నమిలి పారేసిన గడ్డిపరకల్లా, పొట్టులా’ మారిపోయింది. అహంకారంతో వచ్చిన అబ్రహ ఘోర పరాజయాన్ని మూటగట్టుకునిప్రాణాలతో పారిపోతూ దారిలోనే అంతమయ్యాడు. కాబా మందిరం సురక్షితంగా నిలిచింది! – ముహమ్మద్ ముజాహిద్ -
శ్రీవారి జ్యేష్ఠాభిషేకానికి వేళాయెరా!
తిరుమలేశుడు ఉత్సవాల వేల్పు. నిత్యపూజలతోపాటు విశేష పూజలెన్నో జరుగుతుంటాయి. అలాంటి వాటిలో జ్యేష్ఠాభిషేకం ఒకటి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం రోజున ముగిసేలా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ‘అభిధ్యేయక అభిషేకం’ అని కూడా పిలుస్తారు.ఏడాది పొడవునా జరిగే వివిధ ఉత్సవాలు, ఊరేగింపుల వల్ల శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, వాటి కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఈ 26 నుంచి 28 వరకు జ్యేష్ఠాభిషేకం జరగనున్న సందర్భంగా ఆ విశేషాలు.ఏడాది పొడవునా స్వామివారి ఉత్సవమూర్తులకు ఉండే బంగారు కవచాన్ని ఈ ఉత్సవం మొదటి రోజున తొలగిస్తారు. కవచాలు లేని స్వామివారి నిజరూపాన్ని చూసే అరుదైన అవకాశం కేవలం ఈ సమయంలోనే భక్తులకు దక్కుతుంది.స్నపన తిరుమంజనం: మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి ద్రవ్యాలతో వైభవంగా ‘స్నపన తిరుమంజనం’ (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి రోజూ స్వామివారికి వేర్వేరు కవచాలను సమర్పిస్తారు. శతాబ్దాల నాటి శ్రీ మలయప్ప స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ప్రతి ఏటా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ‘అభిధ్యేయక అభిషేకం‘ నిర్వహిస్తారు. – ఫొటోలు: కేతారి మోహన కృష్ణ, సాక్షి, తిరుపతిఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలుమూడు రోజుల ముఖ్య కార్యక్రమాలు (జూన్ 26 – 28)మొదటి రోజు (జూన్ 26, శుక్రవారం): స్వామివారికి ఏడాది పొడవునా ఉండే బంగారు కవచాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తారు. తిరుమంజనం అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరించి మాడ వీధుల్లో ఊరేగిస్తారు.రెండవ రోజు (జూన్ 27, శనివారం): ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన తర్వాత అత్యంత శోభాయమానంగా ముత్యాలకవచం సమర్పిస్తారు.మూడవ రోజు (జూన్ 28, ఆదివారం): చివరి రోజు తిరుమంజన కార్యక్రమాలు పూర్తి చేసి, స్వామివారికి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని తిరిగి వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు తీయరు. -
నైవేద్యం ఆలస్యమైతే కరిగిపోయే విగ్రహం!.. ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
ఆకలి.. జీవులకు ఓ గొప్ప వరం.. ఒక్కోసారి అదే పెద్ద శాపం! ‘క్షుధాతురాణాం న రుచి న పక్వమ్’ అన్నారు పెద్దలు. అంటే ఆకలి వేసినప్పుడు రుచులు, పక్వాలు చూడరని అర్థం. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని శంకరుల వారే చెప్పారు. కానీ.. ఈ ఆకలికి ఆ దేవుడు అతీతుడా? అసలు దేవుడికి కూడా తీవ్రమైన ఆకలి వేస్తుందా? గ్రహణం పడితే ప్రపంచంలో ఏ గుడైనా మూసేస్తారు.. కానీ, గ్రహణ సమయంలో కూడా ఆకలి తట్టుకోలేక, నైవేద్యం స్వీకరించే వింత దేవుళ్లు ఎక్కడైనా ఉన్నారా?మన దేశంలోని కొన్ని పురాణ క్షేత్రాలు... 'అవును.. దేవుడికి కూడా ఆకలి వేస్తుంది!' అని నిరూపిస్తున్నాయి. ఒక్క 10 నిమిషాలు నైవేద్యం ఆలస్యమైతే చాలు.. అక్కడ దేవుడి విగ్రహం ఆకలితో చిక్కిపోతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ఆ అద్భుత క్షేత్రాల రహస్యాలు ఏంటో తెలుసా?గ్రహణం అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దేవాలయాల తలుపులను మూసివేయడం.. గ్రహణం విడుపు తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరిపి, నిత్య సేవలను ప్రారంభించడమే..! కానీ, కొన్ని ఆలయాల్లో దేవుడి ఆకలి కారణంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయాల తలుపులు తెరుచుకునే ఉంటాయి. కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఈ కోవలో ముందంజలో ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన కన్నయ్యకు ఆకలి చాలా ఎక్కువ. రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అంతేకాదు.. ఈ ఆలయంలోని గర్భగుడి వెలుపల పెద్ద గొడ్డలి ఉంటుంది. ఉదయం ఆలయం తెరవడానికి తాళం మొరాయిస్తే.. దాన్ని ఈ గొడ్డలితో పగులగొట్టి మరీ.. దేవుడి ఆకలిని తీర్చేలా వెనువెంటనే నైవేద్యాలు పెడతారు. ఈ ఆలయంలో 10 నైవేద్యాల్లో ఏ ఒక్కటి తగ్గినా.. స్వామివారు సన్నబడతారట..! సైన్స్కు కూడా ఈ వింత అంతుచిక్కలేదట..! అందుకే.. ఇక్కడి పూజారులు గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. స్వామివారు ఆకలిని తట్టుకోలేరనే ఉద్దేశంతో.. గ్రహణ పట్టు.. విడుపులతో సంబంధం లేకుండా నైవేద్యం సమర్పిస్తారు.రాజస్థాన్లోని బికనీర్లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంచుతారు. ఓసారి ఇక్కడి ఆలయాన్ని గ్రహణ సమయంలో మూసివేస్తే.. స్వామివారు ఆ పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వ్యాపారి కలలోకి వచ్చి.. ‘‘నాకు చాలా ఆకలిగా ఉంది’’ అని చెప్పారట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి క్షేత్రంలో శివలింగం స్వయంభూ. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు నవగ్రహాలను, 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. ఆయనకు గ్రహాలను శాసించే స్వామిగా పేరుంది. అలాంటి స్వామికి గ్రహణ దోషం ఎందుకుంటుంది? అందుకే.. ఇక్కడ గ్రహణ సమయంలో రాహు-కేతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఉజ్జయినిలోని మహాకాళుడికి కాలాతీతుడు.. అంటే కాలానికి అతీతుడు అనే పేరుంది. అందుకే.. ఈ స్వామివారికి గ్రహణ ప్రభావం అంటదు. గ్రహణ సమయంలో ఈ జ్యోతిర్లింగ దర్శన సమయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక దివి నుంచి భువికి గంగాప్రవాహం వచ్చేప్పుడు.. ఆ ఉధృతిని తన జటాజూటంతో నిర్బంధించిన శివుడు ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయంలో కొలువుదీరాడు. ఈయనకు కూడా గ్రహణ సమయంలో పూజలు ఆగవు. ఇక ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో అమ్మవారు కల్కాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె సాక్షాత్తూ కాలచక్రానికే అధిపతి. అంటే.. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయి. అందుకే.. గ్రహణ ప్రభావం అమ్మవారిపై ఉండదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక గయలోని విష్ణుపాద ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. ఇక్కడ గ్రహణ సమయంలో పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. -
దానం చేసే మనసు!
ప్రతి ΄పౌర్ణమికీ ఆ ఊరిలో సత్సంగం జరుగుతుంది. ఒక ΄పౌర్ణమి నాడు ప్రవచన కర్త దానం గురించి వివరిస్తున్నారు. ఆయన దానం విశిష్టతను తెలియజేస్తూ, ‘దానం చేయని చేయి, కాయలు కాయని చెట్టు ఒకటే’ అని చెప్పారు. దానాలన్నింటిలోనూ అన్నదానం, విద్యాదానం, గోదానాలు చాలా గొప్పవని, దానం చేసేటప్పుడు కలిగే అలౌకిక ఆనందం వర్ణనాతీతమని వివరించారు. ఆ ప్రవచనానికి వచ్చిన ఒక యువకుడు అక్కడి నుంచి నిరాశతో... కోపంతో వెళ్ళిపోవడానికి లేచాడు. ప్రవచనకర్త అతడిని బుజ్జగిస్తూ, ‘ఎందుకు నాయనా, వెళ్ళిపోతున్నావు?’ అని అడిగారు.దానికి ఆ యువకుడు, ‘చెప్పడం సులభం, చేయడం కష్టం. మీరేమో దానం గొప్పదని చెబుతున్నారు. నాలాంటి వాడికి దానం చేయడం ఎలా కుదురుతుంది? అన్నదానం చేయాలంటే డబ్బు ఉండాలి, నా దగ్గర డబ్బు లేదు. చిన్న రైతునైన నా ఆదాయం చాలా తక్కువ. పోనీ విద్యాదానం చేద్దామంటే నేను అంతగా చదువుకోలేదు. అలాగే మా ఇంట్లో పశువులు లేవు, కాబట్టి గోదానం చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి మీరు చెప్పేవేవీ ఆచరణకు యోగ్యం కావని నిరాశతో వెళ్ళిపోతున్నాను’ అన్నాడు.ప్రవచనకర్త చిరునవ్వు నవ్వి, ‘దానమంటే అవే కాదు నాయనా! నీవు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి, పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి రక్తదానం చేయి. అది మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది’ అని సూచించారు. ‘నిజమే కదా’ అనిపించింది ఆ యువకుడికి. మరుసటి వారమే పట్టణానికి వెళ్ళి రక్తనిధి కేంద్రంలో రక్తమిచ్చి వచ్చాడు. అయితే, రక్తదానం చేసిన అతడికి ప్రవచనకర్త చెప్పినంత గొప్ప అనుభూతి ఏదీ కలగలేదు. మరలా వచ్చే ΄పౌర్ణమి రోజున ప్రవచనకర్త ఊరి రచ్చబండ వద్దకు వచ్చారు. ‘రక్తమిచ్చాను కానీ అందులో నాకు ప్రత్యేకమైన ఆనందమేదీ కలగలేదు’ అని చెప్పాలని ఆ యువకుడు అక్కడికి వెళ్ళాడు. అయితే, అక్కడ ఆ యువకుడి కోసం ఒక వృద్ధ జంట ఎదురుచూస్తోంది.వారు ఎంతో గౌరవంగా ఆ యువకుడికి మిఠాయిలు, పండ్లు ఇచ్చి చేతులెత్తి దణ్ణం పెట్టారు. ఆశ్చర్యంగా వారివైపు చూశాడు ఆ యువకుడు. ‘ఈ మధ్య మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పుడు మీరు ఇచ్చిన రక్తం అతడి ప్రాణాన్ని కాపాడింది. అందుకే మీకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చాం’ అని వారు చెప్పారు. ఆ మాటలతో యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దానం చేయడానికి సంపద కన్నా గొప్ప మనసు ఉంటే చాలని అతడికి అర్థమైంది. వెంటనే ప్రవచనకర్త వైపు తిరిగి తలవంచి నమస్కరించాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
అలనాటి అస్త్రాలు... ఎంత శక్తిమంతాలు?
ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామంలో కౌరవ, పాండవులు ఉపయోగించిన అస్త్రాలు ఎలాంటివి? ఎంత శక్తిమంతమైనవి ?... నేటి ఆయుధాలు, అణుబాంబులు, క్షిపణుల కంటే గొప్పవా?...? అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆనాడే ఉందా... అంటే....ఉందనే చెప్పాలి... నాటి ఆయుధాలు రష్యా, ఉక్రై యిన్, అమెరికా, ఇరాన్ ల మధ్య జరుగుతున్న యుద్దాల మధ్య వినియోగిస్తున్న ఆయుధాల కంటే ఎన్నో వేల రెట్లు శక్తి మంతమైనవని చెప్పుకోవచ్చు. ఈ అస్త్రాలన్నీ భగవత్ ప్రసాదితమైనవి. అందుకే ఎంతో ఉపాసన, దీక్షలతో పాటు, తగిన మంత్ర, తంత్రాలతో ప్రయోగించాలి. మహాభారత సంగ్రామంలో వినియోగించిన కొన్ని శక్తి మంతమైన అస్త్రాల గురించి తెలుసుకుందాం.....చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధంగా మహాభారత యుద్దాన్ని చెప్పుకోవచ్చు. కురుక్షేత్రమనే ప్రదేశం, ఉత్తర భారత దేశం లోని ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఉంది. 18 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ యుద్ధంలో, 18 అక్షౌహిణిల సైన్యం అంటే. కౌరవులది 11 అక్షౌహిణిల సైన్యం కాగా పాండవులది 7 అక్షౌహిణుల సైన్యం. ఈ యుద్ధంలో 47 లక్షల, 23 వేల, 920 మంది పాల్గొంటే, అందులో కేవలం 10 మంది మాత్రమే మిగిలారంటే... భారీ జననష్టం సంభవించడానికి కారణం మహాభారత యుద్ధంలో ప్రయోగించబడిన అణ్వస్త్రాలే కారణమనే వాదన కూడా ఉంది. ఆ నాడు జరిగినది మామూలు యుద్ధం కాదని, అత్యంత ఉత్పాతాలు సృష్టించిందని పాశ్చాత్య చరిత్రకారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై దాదాపు శతాబ్ది కాలంగా, ఆయా ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలూ, సుదీర్ఘ చర్చలూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం 18రోజుల్లో 47 లక్షల పైబడి జనాభా మరణించడం అంటే, సామాన్యమైన విషయం కాదని, సాధారణ ఆయుధాలతో సాధ్యపడే విషయం అంతకంటే కాదని శాస్త్రవేత్తలే అంటున్నారు. మన ధార్మిక గ్రంథాలను లోతుగా పరిశీలిస్తే, రెండు రకాల ఆయుధాలను వివరించాయి. ఒకటి అస్త్రం, అంటే, మంత్రించి ప్రయోగించేది. రెండవది శస్త్రం, అంటే, హానికరమైన ఆయుధం. నేటి తరంలో, వీటిని పోల్చుకుంటే మిస్సైల్స్ లాంటివి కంటే ఎంతో శక్తిమంతమైనవని చెప్పుకోవచ్చు. వీటిలో ప్రధానంగా బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీర్షాస్త్రం,బ్రహ్మాండాస్త్రం, సుదర్శన చక్రం, నారాయణాస్త్రం, వజ్రాయుధం, పాశుపతాస్త్రం, శక్తి ఆయుధం, నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాసవి శక్తి, గాండీవం తదితరాలను చెప్పుకోవచ్చు.మరి మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాలను గురించి ముందు వారాలలో మరింత వివరంగా తెలుసుకుందాం...– సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?
ఒక సభలో జ్ఞాని, మేధావి అయిన వ్యక్తి భారతీయ సనాతన ధర్మం, సంస్కృతులపై అనర్గళంగా, అద్భుతంగా ప్రవచనం చెబుతున్నాడు. గంగాఝరిలా ఆయన ఉపన్యాసం సాగుతోంది. వందల మంది శ్రోతలు మైమరచి ఆయన ప్రవచనం ఆనందంగా వింటున్నారు. ఇంతలో ఒక తుంటరి యువకుడు లేచి నిలపడి, ఆయన వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ ‘మంత్రానికి శక్తి ఉన్నదా?’ అని ప్రశ్నించాడు. అయోమయానికి గురైన శ్రోతలు ఆందోళన చెందారు.ఆ ఉపన్యాసకుడు ఆ యువకుని వైపు కాసేపు నిశ్చలంగా చూసి ‘ఏం కూశావురా వెధవా!’ అని బిగ్గరగా అరిచాడు. అందరూ విస్తుపోయారు. ఇలా అందరి ముందు తనని అవమానించిన ప్రవచనకారునిపై ఆ యువకునికి విపరీతమైన క్రోధం కలిగింది. రక్త ప్రవాహ వేగం హెచ్చి ఆ యువకుని బుగ్గలలోకి ప్రవహించి అవి ఎరుపెక్కాయి. పెదవులు వణకుతున్నాయి. ఎర్రని నిప్పు క ణికల లాగా అతని కళ్ళు కెంపులయ్యాయి. అతను వెంటనే తన పొడవాటి చొక్కా చేతులు పైకి మడవ సాగాడు. పిడికిలి బిగించి భౌతిక దాడికి సిద్ధమయ్యాడు. సభలో స్తబ్ధత ఏర్పడింది. రెండు నిముషాలాగి ఆ ప్రవచనకారుడు బిగ్గరగా నవ్వాడు. తర్వాత ఇలా అన్నాడు. ‘నాయనా! అప్పటికప్పుడు, అనాలోచితంగా, ముందుగా అనుకో కుండా నేను పలికిన నాలుగు సాధారణ అక్షరాల పదమైన ’ మాట ఎంత మార్పు తెచ్చిందో గమనించావా? నీ కళ్ళు ఎర్రబడి, దేహమంతా వణుకుతూ, కోపంతో ఊగిపోతున్నావే! అనాలోచితంగా అన్న మాటకే ఇంత శక్తి ఉంటే, నేను ఏకాగ్రతతో, ధ్యాన నిమగ్నుడనై గాయత్రీ మంత్రం జపిస్తే దానికి అపరిమితమైన శక్తి ఉండదంటావా?’ అని సౌమ్యంగా, అనునయంగా అడిగాడు. సభా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ యువకుడు మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది శబ్దానికి, మాటకు ఉన్న శక్తి. – డా. గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
ముహర్రం నెల అల్లాహ్ మాసం..
ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ) ఆరంభం కేవలం క్యాలెండర్ మారడం కాదు; అది అంతరాత్మను రగిల్చే ఒక అద్భుత అవకాశం. నూతనత్వాన్ని వేడుకలతోనే ముగించకుండా, ఆత్మపరిశీలనతో స్వాగతించాలని ఇస్లాం బోధిస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత పవిత్రమైనవి ‘ముహర్రమ్’ నెలలోని మొదటి పది రోజులు. ప్రవక్త ముహమ్మద్ (స) ఈ నెలను ‘షహ్రుల్లాహ్’ (అల్లాహ్ మాసం) అని పిలిచారు.1. ఆషూరా మహత్తు.. ఒక దైవిక అద్భుతం.ముహర్రమ్ 10వ రోజును ‘ఆషూరా’ అంటారు. నాడు క్రూరుడైన ఫరోసైన్యం నుంచి ప్రవక్త మూసా (మోషే), అతని అనుచరులను అల్లాహ్ ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చి కాపాడిన అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది. ఈ దైవిక రక్షణకు కృతజ్ఞతగా ప్రవక్త మూసా ఉపవాసం ఉండేవారు. ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముహర్రమ్ 9, 10 తేదీలలో ఉపవాసం ఉండటం ముస్లింలకు పుణ్యప్రదం. నిష్ఠతో ఉండే ఈ ఒక్క రోజు ఉపవాసం.. గడిచిన ఏడాది కాలపు చిన్నపాపాలన్నింటినీ తుడిచిపెడుతుందని ప్రవక్త నమ్మకాన్ని వ్యక్తపరిచారు.2. ఆచరించాల్సిన ముఖ్యమైన పుణ్యకార్యాలుఈ పది రోజులను వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఈ అలవాట్లను భాగం చేసుకోవాలి:ఉపవాసాలు: రంజాన్ తర్వాత నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలకు అత్యుత్తమమైన మాసం ఇదే.దైవస్మరణ (జిక్ర్): ‘సుబ్హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్హానల్లాహిల్ అజీమ్‘ లాంటి పదాలతో నోటిని పవిత్రంగా ఉంచుకోవడం.పశ్చాత్తాపం (తౌబా): గడిచిన ఏడాది తప్పులను ఒప్పుకుంటూ, నూతన సంవత్సరంలో సన్మార్గంలో నడవాలని సంకల్పించడం.దానధర్మాలు (సదఖా)పవిత్ర మాసంలో చేసే చిన్న సహాయానికైనా పుణ్యం రెట్టింపు అవుతుంది.ఖురాన్ పఠనం: నిత్యం దైవవాణిని చదవడం, దాని భావాన్ని అర్థం చేసుకోవడం.జీవిత పాఠంఆషూరా కథ నేటి మానవాళికి ఒక గొప్ప ధైర్యం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక వేదనల రూపంలో మన ముందు ‘ఎర్రసముద్రం’ లాంటి అగాధం ఉన్నప్పుడు.. ప్రవక్త మూసా చూపిన పరిపూర్ణ విశ్వాసమే మనకు శరణ్యం. ‘నా ప్రభువు నా వెంట ఉన్నాడు, ఆయన నాకు తప్పక మార్గం చూపుతాడు‘ అనే నమ్మకంతో ప్రార్థిస్తే, దైవం మన కష్టాల సముద్రాన్ని చీల్చి కొత్త దారి చూపిస్తాడు.త్యాగాల స్మరణ...ఆషూరా రోజున ప్రవక్త ముహమ్మద్ (స) ప్రియ మనవడు హజ్రత్ హుసైన్ , వారి అనుచరులు ‘కర్బలా’ మైదానంలో సత్యం, న్యాయం కోసం ప్రాణాలర్పించారు. వారి అమరత్వాన్ని గుండెల్లో స్మరిస్తూనే, ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే నిజమైన విశ్వాసి లక్షణం. జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ పది రోజులు మీ జీవితంలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!– ముహమ్మద్ ముజాహిద్ -
మహా శివమ్: చెంగల్ శివ పార్వతి క్షేత్రం
మహేశ్వరా! మహాశివా పరమ శివా అని ఈశ్వరుని ఆరాధిస్తాం. అంటే మహాపర్వతం మీద వాసం ఉండేవాడు అని అర్ధం. అంతటి మహాశివుడికి పెద్ద మహా శివాలయాన్ని కేరళలో నిర్మించారు. నిరూపధారిగా లింగ రూపంలో మహా మహా రుద్రాలను తనలో ఆవహించుకున్న మహాదేవుడు లోక రక్షకుడు పరమ శివుడు. మన పుణ్యభూమిలో పలుచోట్ల జ్యోతిర్లింగాలు... ఆత్మలింగాలుగా కొలువుదీరాడాయన. అలాంటి మహాలింగం కేరళలో నిర్మించారు.కేరళ రాజధాని తిరువనంతపురానికి దగ్గర నెయ్యాటింకర అనేప్రాంతంలో ఉంది. నూట పదకొండు అడుగుల ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్టించారు.అక్కడ ఎనిమిది అంతస్థులలో మన దేశంలోకెల్ల పెద్ద శివ క్షేత్రం. దీని పేరు చెంగల్ శివ పార్వతి క్షేత్రం. ఈ స్థల మహాత్మ్యం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ రెండు సార్లు అతి రుద్ర యజ్ఞం చేశారు. అలాగే మరెన్నో సార్లు అతిరుద్ర యజ్ఞం చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఒకసారి అతి రుద్ర మహా యజ్ఞం చేయడమే గొప్ప విషయం. చెంగల్ శివ పార్వతి క్షేత్రం ఉన్న ప్రదేశం ఎంతో పుణ్యభూమిగా భావిస్తారు.ఈ స్థలానికి ఉండే మహత్వాన్ని గమనించి స్వామి మహేశ్వరానంద సరస్వతి ఈ మహా శివలింగ ప్రతిష్ట కోసం పూనుకున్నారు. వీరికి కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి మంత్ర దీక్ష ఉపదేశించారు. ఈ పుణ్యస్థలం పేరు పుట్టురాకల్. ఇక్కడే శివపార్వతులు పుట్టరూపంలో వెలిశారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో దొరికిన ఆధారాల వలన దేవాలమం 5 వేల ఏళ్ళ పురాతనమైనది అని తెలిసింది. దేశం నలుమూలల నుంచి మట్టి, పవిత్ర నదీ జలాలు వనమూలికలు తెచ్చి నిర్మించారు. మూలాధారంగా వినాయకుడు సరస్వతి బ్రహ్మ రూపాలను ప్రతిష్టించారు. మొదటి అంతస్థు భూ మట్టానికి కింద నిర్మించారు.64 మహారూపాలలో శివుని విగ్రహాలను ఉంచారు. భక్తులు కూర్చుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు అలాగే ప్రతి అంతస్థులో ఓంకారనాదం వినిపిస్తుంటుంది. పంచభూతాలు తనలో ఇమిడి ఉన్నట్టుగా ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఏడవ అంతస్తులోకి వెళితే కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది మనకి. సహస్రదళ పద్మాకృతి కింద శివ పార్వతి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలోకి వెళ్లడం మనస్సుకి ప్రశాంతంగా ఉండడం గమనించవచ్చు. కింద అంతస్థులో శివలింగ ప్రతిష్ట ఉంది ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల భావన కలిగిన శివ ప్రతిష్ట అద్భుతం. శివపార్వతుల తనయునికి ఇక్కడ చాలప్రాధాన్యత ఉంది. అందుకే 32 విఘ్నేశ్వర రూపాల ప్రతిష్ట ఉంది. బాల గణపతి నుండి యోగ గణపతి వరకు ఉన్న రూపాలకి నిత్యపూజలు జరిపే దేవాలయం ఇక్కడ మాత్రమే ఉంది.అసామాన్య శిల్పకళాచాతుర్యంమహాబలి పురం నుండి వచ్చిన శిల్పుల కళాచాతుర్యం ఇక్కడ ఉన్న విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. రుద్రుడు అంటేనే మానవ కష్టాలను హరించేవాడు అని అర్ధము. మహా రుద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతి రుద్ర మహా యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేయడం నిజంగా ఎంతో మహత్తర విషయం. పదకొండు రోజులపాటు 121 మంది వేద పండితులు 121 కలశాలతో అభిషేకం, పదకొండు సార్లు రుద్రా మంత్రం జపిస్తే ఫలప్రాప్తి కలుగుతుంది .అటువంటిది రెండుసార్లు జరగడం శివుని శక్తికి నిదర్శనం అని నమ్ముతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా భావంతో ఇక్కడకు భక్తులు వస్తుంటారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంచెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం 111.2 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివలింగం గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇంతకుముందు, కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలోని 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైనది గా ఉండేది.10 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 లోప్రారంభమైంది, దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. దాని ఎత్తు మాత్రమే కాదు, దాని విశిష్టమైన స్థూపాకార నిర్మాణం, దానిలోపల దాగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యాలు కూడా చూడటానికి ఒక అద్భుతం.కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాసం వంటి వివిధ పుణ్యక్షేత్రాల నుండి నీరు, ఇసుక, మట్టిని కూడా నిర్మాణ సామగ్రిలో కలిపారు. అందువల్ల, చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం ఒక దైవిక నిర్మాణంగా భావిస్తారు. ఈ కట్టడంలో 8 అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఆరు అంతస్తులు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తికేంద్రాలకుప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ అంతస్తులలో భక్తులు, యాత్రికులు, పర్యాటకులు ఆయా చక్రాలపై ధ్యానం చేయడానికి 6 ధ్యానమందిరాలు ఉన్నాయి. ఈ కట్టడం మొదటి అంతస్తులో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.భక్తులు మహా శివలింగంలోకి ప్రవేశించవచ్చు. ఈ శివలింగం లోపల, శివలింగం విశ్వ ప్రభావాన్ని అనుభవించడంతో పాటు, శరీరంలోని చక్రాల శక్తిని పెంచుకోవడానికి ధ్యానం కూడా చేయవచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
పసుపు కొమ్ము అలా పుట్టింది..! అందుకే గణపతిని..
పసుపు కొమ్ము గణపతి దీన్నే హరిద్రా గణపతి అంటారు. అష్టోత్తరంలో ఓం హరిద్రా గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తుంటాం. గురు గ్రహ అనుగ్రహం కోసం హరిద్రా గణపతిని పూజించాలని పండితులు చెబుతుంటారు. గురువు అనుకూలంగా లేనివారు పసుపుకొమ్ము గణపతిని పూజించి ఉపశమనం పొందవచ్చని జ్యోతిష నిపుణులు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో పసుపు కొమ్ము గణపతి ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటి? పశువు కొమ్ము కాస్తా పసుపు కొమ్ముగా ఎలా మారింది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..?పూర్వం త్రిపురాసురలనే రాక్షసులుండేవారు. వారు తమను ఏకకాలంలో చంపాలనే వరాన్ని పొంది ఉన్నారు. దాంతో నందీశ్వరుడు ఆ ముగ్గురిని తన త్రిశృంగములతో అంటే మూడు కొమ్ములతో ఏకకాలంగా పైకెత్తగా శివుడు తన త్రిశూలంతో ముగ్గురిని సంహరించాడు. అయితే శివుడి త్రిశూలం ధాటికి నంది మధ్య శృంగం అంటే మధ్యలో ఉండే కొమ్ము ఊడిపోయి, కింద పడిపోయింది. దాన్ని గమనించిన పరమేశ్వరుడు పశువు కొమ్మును పసుపు కొమ్ముగా మారేలా వరమిచ్చి విఘ్నేశ్వర మూర్తి రూపంలో ఆ పసుపు కొమ్ముకు హరిద్రా గణపతిగా పూజలు అందుకునే వరాన్ని ఇచ్చారు.శుభానిక ప్రతీక..అందుకే హల్దీ..పసుపు కమ్ము గణపతి శుభానికి ప్రతీక. గురు గ్రహం పసుపు వర్ణానికి అధిపతి. శుభకార్యాల్లో కూడా పసుపు వర్ణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పెళ్లికి ముందు హల్దీ వంటి వేడుకలు.. పసుపు బట్టలతో పెళ్లి పీటలపై వధువరులను కూర్చోబెట్టడం వంటివి ఉదాహరణలు. అర్చనలు ఆధ్యాత్మిక క్రతువుల్లో కూడా పసుపునకు ప్రాధాన్యం ఉంది. ఇక జ్యోతిష్య శాస్త్రంలో గురువు జ్ఞాన కారకుడు, సంతాన కారకుడు గురువు అనుగ్రహంతో పాటు గృహ సౌఖ్యం ఆచారాలు మొదలైన వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు పసుపు కమ్ము గణపతిని పూజించడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. జాతకంలో గురువుస్థానం సరిగ్గా లేనప్పుడు కాలేయ సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఇక పైకి తెలియకుండా లోపల లోపలే విస్తరించే షుగర్, కేన్సర్ వంటి వ్యాధులు కూడా గురువు అనుగ్రహం లేకపోవడం వల్లనే కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇలాంటి వారు పసుపు కమ్ము గణపతిని పూజించాలని పెద్దలు చెబుతున్నారు.గురుసేవ, గురుపారాయణం..అయితే గురు గ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు వచ్చే దుష్ఫలితాల భారి నుంచి కొంతలో కొంతైనా తప్పించుకునే మార్గాలు లేకపోలేదని పెద్దలు చెబుతున్నారు. దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి రామకృష్ణ పరమహంస వంటి గురువులను పూజించడం వల్ల బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చని దక్షిణామూర్తిని స్మరించడం వల్ల గురువును శాంతింపచేసి ఆయన ద్వారా ప్రాప్తించే వ్యతిరేక ఫలితాల నుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతున్నారు. శనగలు గురు సంబంధమైన ధాన్యంగా చెబుతారు. వాటిని దానం చేయడం వలన కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా గురు పారాయణం గురు ధ్యానం గురు స్మరణ గురుసేవ మాత్రమే గురు గ్రహం అనుగ్రహానికి కారణం అవుతాయని చెబుతుంటారు. అనేక వ్యాధుల బారి నుంచి దూరంగా ఉంచడానికి గురువు ఒక్కడే కారణమని అందుకోసం హరిద్రా గణపతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. హరిద్రా గణపతిని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న వారికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ధన కనుక వస్తువాహనాభివృద్ధి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పసుపు గణపతిని పూజించడం వల్ల దేహం కాంతిమంతంగా మెరుస్తుంది. అంటే చర్మరోగాలు దరిచేరవు. ఒకవేళ చర్మ వ్యాధులు ఉన్నట్లయితే అవి నయంవుతాయని చెబుతారు. వ్యాపారులు కూడా ఓల్డ్ స్టాక్ ను క్లియర్ చేయడానికి ఆయా వస్తువులను హరిద్రా గణపతితో తాకించడం మనం ఉత్తరాదిలో ఎక్కువగా చూస్తుంటాం. రుణ విముక్తికి ధన లాభానికి హరిద్రా గణపతిని పూజించడం చక్కటి మార్గంని పెద్దలు వివరిస్తున్నారు. (చదవండి: ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు? ఇంతకీ ఎవరు వాళ్లు??) -
సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి.ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు..అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ. 30,000లను జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వారి బాటలోనే ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని వెండి ఖడ్గాన్ని సమర్పించారు. ఆలయ చరిత్ర..పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి అతడ్ని మూసాసురుడిగా పిలిచేవారు. అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్ఞయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట. ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. అమ్మవారి మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండేదని.. కానీ అక్కడకు వెళ్లడం భక్తులకు కష్టంగా ఉండటంతో శంకరాచర్య ఆలయాన్ని కొల్లూరులో తిరిగి ప్రతిష్ఠించారని చెబుతుంటారు స్థానికులు.అంతేగాదు ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.ఈ అమ్మ ఆసీస్సుల కోసమే ఎందుకంటే..ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. అంతేగాదు ఈ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిగా (లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపిణిగా) భక్తులు విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో జయాలు సాధించిన తర్వాత, తమ పదవికి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు, చండీ యాగం వంటివి నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. అందుకే సామాన్య భక్తుల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు.🚨 Why CM Vijay’s visit to the Kollur Mookambika Temple is a massive political statement.Tamil Nadu Chief Minister Vijay is visiting the Kollur temple in Karnataka today at 3 PM. While it looks like a standard spiritual visit, the historical context is fascinating.He is…— MacroMatrix (@MacroMatrix1) June 12, 2026 (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
చెడు స్నేహానికి ప్రతీక శకుని
మహాభారతయుద్ధంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దుష్టచతుష్టయంలో ఒకరుగా పేరుగాంచి, కౌరవులకు మేనమామగా, వారిలో యువరాజైన దుర్యోధనునికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించి అన్నీ తప్పుడు సలహాలు, సూచనలిచ్చి కౌరవులకు కీడు తలపెట్టడంతో, పాండవులకు మేలు జరిగేది. శకుని ఉద్దేశ్యం కూడా ఇదే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాంధహార్ ఆనాటి గాంధార దేశం. గాంధారదేశపు రాజు సుబలుడు, రాణి సుధర్మల కుమారుడే శకుని. సుబలునికి వందమంది కుమారులు, గాంధారి అనే కుమార్తె ఉన్నారు. అందరిలో ఆఖరివాడే శకుని. ఇతని అసలు పేరు సుబలోత్తముడు. అపారమైన తెలివితేటలు కల్గిన, శకుని ‘చౌసర్’ అనే మాయా జూదపు ఆటలో మంచి నేర్పరి. శకుని ప్రాణప్రదంగా అభిమానించే తన సోదరి గాంధారిని, కౌరవ సామ్రాజ్యాధీశుడు, పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి పట్టమహిషిగా చేయాలని భీష్ముడు భావించాడు. అయితే జాతకం ప్రకారం గాంధారికి వైధవ్య యోగం ఉందని తెలిసిన శకుని తన సోదరి అంటే ఉన్న వల్లమాలిన అభిమానంతో, ఈ విపత్తు నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో, జ్యోతిష్యుల సూచనలు, సలహాల మేరకు గాంధారికి మొదటగా ఓ మేకతో వివాహం జరిపించి, అనంతరం ఆ మేకను బలిచ్చి ఆపై ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తే ఆ దోష పరిహారం అవుతుందని ఆ విధంగా చేశాడు. వివాహానంతరం ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆగ్రహం చెంది సుబలుని కుటుంబాన్ని చెరశాలలో బంధించి, మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు. చెరసాలలో ఉన్న సుబలుని కుటుంబానికి ఇచ్చే ఆహారం ఒక్కరికి మాత్రమే సరిపోయేది. మిగిలిన సోదరులు ఆహారాన్ని తమలో తెలివైన, ఆఖరి సోదరుడైన శకునికే పెట్టి ఎలాగైనా కౌరవులపై పగ తీర్చుకోవాలని ప్రమాణం చేయించుకున్నారు. అనంతరం క్షుద్బాధతో తండ్రి, ఒక్కొక్క సోదరుడు మృతి చెందారు. తన తండ్రి మరణానంతరం అతని తొడ ఎముకతో తయారైన పాచికలను వినియోగిస్తూ, తాను అనుకున్న సంఖ్య పడేలా శకుని వరం పొందాడు. ఆ పాచికలతో శకుని మాయాజూదం ఆడి మోసపూరితంగా పాండవులను ఓడించి, కౌరవులచే మరిన్ని అన్యాయాలు, అక్రమాలు చేయిస్తూ మహాభారత యుద్ధం జరిగేలా పథకం రచించి కౌరవవంశాన్ని నాశనం చేసాడు. అయితే మహాభారత యుద్ధంలో ఆఖరిరోజున (18వ రోజు)సహదేవుని చేతిలో శకుని మరణించాడు. ఇదిలావుండగా శకునికి కూడా గుడి ఉంది. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం నిర్మించారు అక్కడి కురువర్ తెగ ప్రజలు. అయితే అక్కడ ఏ విధమైన శకుని విగ్రహం ఉండదు.– సి.ఎన్. మూర్తిసీనియర్ పాత్రికేయులు -
ఇవాల్టి నుంచే యమునా నది పుష్కరాలు ప్రారంభం
దేవగురువు బృహస్పతి జూన్ 2, మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13, శనివారం తో ముగుస్తాయి. ఈ పన్నెండు రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు.యమ బాధలు తీర్చే పవిత్ర స్నానం!పురాణాల ప్రకారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి యమునా దేవి కుమార్తె. యమధర్మరాజుకి స్వయాన సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే యమ బాధలు తొలుగుతాయని విశ్వాసం. సూర్యుడి సంతానంలో యముడు, యమున, శని ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. ఈ భూమ్మీద మానవుడు చేసే పాప పుణ్యాల కర్మను శని భగవానుడు అనుభవింపజేస్తాడు. జీవుడు ప్రస్తుత జన్మలో, అనేక జన్మల ద్వారా ఏర్పడిన పాప పుణ్య కర్మల ఫలితాలను మరణం తర్వాత యమధర్మరాజు చూస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమ బాధలు, పాపాల నుంచి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అందువల్లే, శ్రీకృష్ణుడు స్వయంగా యమునా నది ఒడ్డున జన్మించడంతో పాటు ఈ నదితో ముడిపడి అనేక పురాణ విషయాలు ఉండటం యమున వైభవాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.భారతీయ సనాతన ధర్మం, పురాణాలలో యమునను కాళిందీ నదిగా పేర్కొన్నారు. 'యమునా నది కృష్ణ ప్రియః' అంటే యమునా నది కృష్ణుడికి ప్రియమైనదిగా చెబుతారు. యమునా నది నీటి స్పర్శ తాకితే పాపాల తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ,తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ, ఆత్మశుద్ధి వంటివి కలుగుతాయని విశ్వాసం. మరీ ముఖ్యంగా ఇక్కడ పుణ్యస్నానంతో శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగలరని శాస్త్రవచనం. ఇంతటి విశేషం, మహత్యం కలిగిన నదికి పుష్కరాలు రావడం, పుష్కరాల్లో భక్తి శ్రద్ధలతో స్నాన విధి ఆచరిస్తే విశేష ఫలితాలు దక్కుతాయని విశ్వాసం.జ్యోతిష శాస్త్రం ప్రకారం.. దేవగురువు అయిన బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తుంటాయి (ఉదా: బృహస్పతి మేష రాశిలో ఉంటే గంగా నదికి , వృషభంలో పరాభవ నామ సంవత్సరంలో దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి 13 వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి.ఎక్కడ స్నానమాచరించాలి ?యమునా నది ప్రవహించే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పుణ్య ఫలాలు పొందుతారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం ఆచరించవచ్చు. గంగా , యమున , సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర సంగమంలో పుష్కర స్నానమాచరించడం విశేష పుణ్యఫలం లభిస్తుంది.మథుర/బృందావనం: శ్రీకృష్ణుడు స్వయంగా జన్మించి తన బాల్యాన్ని గడిపి, లీలలను ప్రదర్శించిన ప్రాంతమిది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఘాట్లలో పుష్కర స్నానం ఎంతో విశేషం.యమునోత్రి: యమునా నది జన్మస్థలం ఇది. ఇక్కడ యమునా నదిని దర్శించుకొని పుష్కర స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం.ఇంద్రప్రస్థం (ఢిల్లీ): పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా చేసుకొని అనేక యజ్ఞయాగాదులు చేసిన పవిత్ర ప్రదేశమిది. ఇలా ఈ పుణ్య నది పరిసర ప్రాంతాల్లో పురాణాలకు సంబంధించిన విశేషం ఉన్న ప్రాంతాల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిదిఏయే దానాలు చేస్తే మంచిది ?పుష్కరస్నానం అనంతరం దానం (అన్నదానం గోదానం , భూదానం , సువర్ణదానం , లవణదానం, పుస్తక దానం వంటివి) చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. యజ్ఞ యాగాదులు, హోమాలు వంటివి నిర్వహించడం లేదా ఆయా పవిత్ర కార్యాల్లో పాల్గొనడం వంటివి ఆచరిస్తే పుణ్యం.పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం. పుష్కరాల్లో పురాణ పఠనం, మంత్రోచ్ఛారణ , భగవన్నామస్మరణ , జపం , తపం వంటివి ఆచరించడం ఉత్తమం.పుష్కరాలంటే సబ్బులు , శాంపూలతో స్నానమాచరించి నదులను కలుషితం చేయడం కాదు. యత్ర స్వచ్ఛః తత్ర లక్ష్మి అన్నారు పెద్దలు. పుష్కరాల్లో స్నాన విధిని అనుసరించి పురుషులు పంచె వంటివి ధరించడం , మహిళలు తమకు సౌకర్యమైన చీరవంటివి ధరించడం, దంపతులైతే భార్య , భర్త కొంగుముడి వేసుకొని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో చేసే స్నానం పుష్కర స్నానం. ఇలా స్నానమాచరించి దేవతలకు, రుషులకు, నదికి అర్ఘ్యం సమర్పించడం, పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది నదులలో చెడు పదార్థాలను విడిచిపెట్టడం పాతకం వీటిని దృష్టిలో ఉంచుకొని పుణ్యార్చన కోసం భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలని సూచన.పుష్కర స్నాన మహత్యంనదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మనం కూడా యమునా నది పుష్కరాలలో స్నానమాచరించి మోక్షాన్ని పొందుదాం. (చదవండి: శ్రీ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక వైభవం.) -
బక్రీద్ అహంకార త్యాగం... స్నేహోత్సవం
బక్రీద్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది ‘ఖుర్బానీ’ లేదా త్యాగం. కానీ ఆ త్యాగం కేవలం జంతువు వరకే పరిమితమై ఉండదు. నిజమైన త్యాగం అంటే మనలోని అహంకారాన్ని వదిలేయడం, స్వార్థాన్ని త్యజించడం. మనకు ఉన్నదాంట్లో కొంత అవసరమైన వారికి పంచడం. మన ఇష్టాల కంటే దేవుని ఆజ్ఞకు, మానవత్వానికి ప్రాధాన్యమివ్వడం. బక్రీద్ మనిషికి నేర్పే అసలు పాఠం ఇదే.సాధారణంగా పండుగ అంటేనే ఆనందం, కొత్తబట్టలు, పిండివంటలు అనుకుంటాం. కానీ, బక్రీద్ పర్వదినం వెనుక ఒక గొప్ప సామాజిక సందేశం దాగి ఉంది. దైవాజ్ఞను శిరసావహిస్తూ ప్రాణసమానమైన కుమారుడిని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం మనకు కేవలం భక్తిని మాత్రమే కాదు, సమాజం కోసం స్వార్థాన్ని వదులుకోవాలనే గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.పంపిణీలో సమానత్వంపండుగ రోజున చేసే ఖుర్బానీ, దానధర్మాల వెనుక ఉన్న అసలైన పరమార్థం సామాజిక సమానత్వమే. ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి... ఒక భాగం పేదలకు, ఒక భాగం బంధుమిత్రులకు, మరొక భాగం తమ కుటుంబానికి కేటాయించే సాంప్రదాయం ఇందులో ఉంది. సంపాదన ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరికీ పండుగ ఆనందం అందాలనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ వ్యవస్థ ఏర్పాటయింది. ఇందులో ఎక్కడా కులాల, మతాల ప్రస్తావన ఉండదు, కేవలం మానవత్వం మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటుంది.మన భారతదేశం ఎప్పుడూ గంగా – జమున తహజీబ్కు, అంటే భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దంగా ఉంది. ఒకరి పండుగను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావడం ఇక్కడి సంస్కృతి. హిందూ ముస్లింసోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ప్రేమాభిమానాలను పంచుకోవడం మన సమాజానికి ఉన్న అసలైన బలం.అపోహలు వీడాలి – సామరస్యం పెరగాలిప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత పండుగల సందర్భాలలో అనవసరమైన విమర్శలు, అపోహలు ప్రచారంలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో విజ్ఞత గల సమాజంగా మనం మరింత బాధ్యతగా వ్యవహరించాలి. పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, నైతిక కోణాలను అర్థం చేసుకోకుండా కేవలం బాహ్య ఆచారాలను మాత్రమే విమర్శించడం సరికాదు. ప్రతి మతంలోనూ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించే సంప్రదాయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, గౌరవించినప్పుడే పరమత సహనం అనే పునాదిపై మన సమాజం మరింత బలంగా నిలబడుతుంది. ముఖ్యంగా యువత ఇరువర్గాల సంస్కృతులను అర్థం చేసుకుంటూ, డిజిటల్ ప్రపంచంలో సైతం శాంతిని, సామరస్యాన్ని పెంపొందించేలా సానుకూల సందేశాలను వ్యాప్తి చేయాలి.కులమతాల పట్టింపులను పక్కన పెట్టి, మానవులంతా ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించి, ద్వేషాలను వీడి స్నేహ హస్తాలను చాచుకుంటూ ముందుకు సాగడమే ఈ బక్రీద్ పర్వదినం మనకు అందించే అసలైన సందేశం. ఈ పర్వదినం అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపి, సమాజంలో సరికొత్త సామరస్యానికి బాటలు వేయాలని ఆకాంక్షిద్దాం.పండుగ జరుపుకోవడంలో సామాజిక బాధ్యతమారుతున్న కాలంతోపాటు పండుగలు జరుపుకునే విధానంలో సామాజిక బాధ్యత కూడా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ఇరుగు΄÷రుగు వారి భావోద్వేగాలను గౌరవిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కూడా ఒకరకమైన సామాజిక త్యాగమే అవుతుంది. ఒకరికొకరు ఇబ్బంది కలగకుండా శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకున్నప్పుడే ఆ పండుగకు పరిపూర్ణత లభిస్తుంది. – మదీహా అర్జుమంద్ -
ఇవాళ నుంచే రోహిణి కార్తె ప్రారంభం..! రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే 'రోహిణి కార్తె' (Rohini Karthi 2026) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం , గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగభగమండనున్నాయి.'రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా?'వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే, రోహిణి కార్తెలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు "రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి" అనే సామెతను వాడుకలోకి తెచ్చారు.వ్యవసాయ పంచాంగం - ఏరువాక ప్రారంభం:సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో కార్తెగా పిలుస్తారు. ఏడాదికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి.రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుండి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది.ఈ సమయంలోనే తొలకరి జల్లులు కురుస్తాయి.దీనిని బేస్ చేసుకుని రైతులు తమ పొలాల్లో 'ఏరువాక' పనులను ముమ్మరం చేస్తారు.రోహిణి కార్తెలో చేయకూడని పనులు ఇవే:ఈ పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచించారు:శుభకార్యాలు వద్దు: రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యాలు లేదా కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.ఆహార నియమాలు: శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ, సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.ప్రయాణాలు వాయిదా: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం, శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.(చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
ఆధ్యాత్మికతతో సమతుల్యత
యాంత్రిక జీవనంలో మనిషి డబ్బు, హోదా వెనుక పరుగెత్తుతూ తనను తాను మర్చిపోతున్నాడు. సౌకర్యాలు పెరిగినా సంతోషం తగ్గుతోంది. ఈ క్రమంలో మనకు సమతుల్యతను నేర్పేది ఆధ్యాత్మికత ఒక్కటే! ఆధ్యాత్మిక జీవనంపై చాలామందికి భిన్నాభిప్రాయాలు... అంతకుమించిన అపోహలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికత అంటే ఏమిటో... ఆధ్యాత్మిక జీవనం అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం...ఆధ్యాత్మికత అనేది కేవలం మతం లేదా పూజా కార్యక్రమాలకు పరిమితమైనది కాదు. ఇది ఒక వ్యక్తి తన అంతరాత్మను తెలుసుకోవడానికి, విశ్వ చైతన్యంతో అనుసంధానం కావడానికి చేసే నిరంతర ప్రయాణం. ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు మనల్ని మనం గమనించుకోవడం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, కోపతాపాలు ఎలా పుడుతున్నాయో తెలుసుకోవడమే ప్రాథమిక చైతన్యం. ‘నేను కేవలం ఈ శరీరాన్ని మాత్రమే కాదు, అంతకు మించిన శక్తిన’ని గుర్తించడం ఇందులో ముఖ్యం (ఆత్మ వివేచన). లోకంలో తప్పులను వెతకడం మానేసి, తనలో తాను మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం. రోజులో కొంత సమయం మౌనంగా ఉంటూ, తన ఆలోచనలను గమనించుకుంటూ స్వీయ నియంత్రణ పాటించడం.ప్రస్తుత సమాజంలో మన జీవన విధానంలో అడుగడుగునా ఉద్వేగం, ఉద్రేకం, అనవసరమైన వేగం, వత్తిడి ఎక్కువయ్యాయి. ఓ పసిపిల్లకు నూటికి 98 మార్కులొస్తే వచ్చే సంతోషంకన్నా 2 మార్కులు పోయాయన్న బాధే ఎక్కువగా కనిపిస్తున్నది. చిన్న పార్శ్వం ఇది. ఒక పుస్తకంలో చదివి నేర్చుకునేది ఆధ్యాత్మికత కాదు, అనుభవపూర్వకంగా పొందాల్సింది. నిత్యం కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం, ప్రకృతిని గమనించడం, సాత్విక గుణాలను పెంపొందించుకోవడం ద్వారా ఎవరైనా ఈ మార్గంలో పయనించవచ్చు. అంతిమంగా, మనలోని దైవత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మిక శిఖరం.యువతరం ఆధ్యాత్మికతను ఒక పాతకాలపు ఆచారంగా కాకుండా, తమ వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించే ఒక శక్తిమంతమైన సాధనంగా స్వీకరించాలి. ఇది వ్యక్తిగత వికాసానికి, మానసిక ప్రశాంతతకు సార్థకమైన జీవితానికి మార్గం చూపుతుంది. నిజమైన ఆధ్యాత్మికత అనేది బాహ్య వేషధారణలోనో, మంత్రతంత్రాల్లోనో లేదు. అది మనిషి ప్రవర్తనలో, ఆలోచనా విధానంలో ప్రతిబింబించే పరిణతి. మన హృదయం ఎంత విశాలమైతే, మనం అంత ఆధ్యాత్మికంగా ఉన్నామని అర్థం.కేవలం ధ్యానం చేయడమే ఆధ్యాత్మికత కాదు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, జంతువుల పట్ల, ప్రకృతి పట్ల దయ కలిగి ఉండటం నిజమైన ఆధ్యాత్మిక లక్షణం. విశ్వంలోని ప్రతి జీవిలోనూ ఆ దైవత్వాన్ని చూడటమే దీని పరమార్థం. క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక సాధన చేసేవారిలో నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు నిండిన నేటి కాలంలో ఆధ్యాత్మికత ఒక మందులా పనిచేస్తుంది. ధ్యానం... ప్రార్థన మనస్సును నిలకడగా ఉంచుతాయి. ఉన్నదానితో తృప్తి చెందుతూ, లేనిదాని కోసం ఆరాటపడకుండా ప్రశాంతంగా ఉండటం అలవడుతుంది.ఆధ్యాత్మికత అలవడిన వ్యక్తికి చావు, పుట్టుకల పట్ల భయం ఉండదు. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించే పరిణతి వస్తుంది. అనవసరమైన వాదనలు, చర్చల కంటే మౌనంగా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. లోపల ప్రశాంతత ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలోని శబ్దాలు వారిని ఇబ్బంది పెట్టవు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వారు అసంతృప్తికి లోనుకాకుండా, ఆ సమయాన్ని ఆత్మ విమర్శకు వాడుకుంటారు. – తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి -
అహంకారంతో అసువులు బాసిన శిశుపాలుడు
మహాభారతంలో శిశుపాలుడిది ఒక ప్రత్యేక పాత్ర... నాలుగు చేతులు, మూడు కళ్ళతో చూసేందుకు భీతిగొల్పేలా పుట్టిన శిశుపాలుని ఎవరు ఎత్తుకొంటే సాధారణ రూపానికి చేరుకుంటాడో అతని చేతిలోనే మృత్యువు రాసి పెట్టి ఉందని ఆకాశవాణి పలుకుతుంది.శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుడు, సాత్వతిల కుమారుడు. సాత్వతి స్వయానా కృష్ణుని తండ్రి వసుదేవునికి సోదరి. అంటే కృష్ణుడికి మేనత్త. శిశుపాలుడు మేనత్త కొడుకు. ఇదిలావుండగా అంగవైకల్యంతో, చూసేందుకు భీతి గొలుపుతున్న శిశుపాలుని ఎత్తుకోమని, సాత్వతి అందరినీ కోరసాగింది.ఒకరోజు బలరామకృష్ణులు మేనత్తని చూడాలని ఛేది రాజ్యానికి వచ్చారు. అప్పుడే శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఎత్తుకున్నాడు. దీంతో అతడి వికృత రూపం పోయింది. తన కుమారుడు శిశుపాలునికి సాధారణ రూపం వచ్చినందుకు కలిగిన ఆనందం కంటే, మేనల్లుడి చేతిలో తన కొడుకు మరణిస్తాడనే ఆందోళన తో తనకు పుత్రభిక్ష పెట్టమని జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుని వేడుకుంది సాత్వతి. అర్హమైన వంద తప్పుల వరకు మన్నిస్తానని, ఆపై తప్పులు మీరితే సంహరిస్తానని తన మేనత్త అయిన సాత్వతి కి మాట ఇచ్చాడు. అందుకే శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు కృష్ణుడు ఎంతో సంయమనంతో ఉన్నాడు. దీనిని అలుసుగా తీసుకొని అహంకారం తో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయాడు. వసుదేవుని యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని సంహరించాడు. కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రువాహనుడి భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని తప్పులు, ఘోరాలు శిశుపాలుడు చేసినా ఇచ్చిన మాట ప్రకారం శ్రీకృష్ణుడు ఓపిక పట్టాడు. ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగంలో భాగంగా ఛేది దేశానికి వచ్చిన భీముడిని, శిశుపాలుడు ఆదరించాడు. యాగం కోసం ధనం కూడా అందించాడు. ధర్మరాజు ఆహ్వానం మేరకు సభకు వచ్చాడు. తొలి అర్ఘ్యానికి శ్రీ కృష్ణుడే అర్హుడని భీష్ముడు చెప్పడంతో శిశుపాలుడు ఆగ్రహించాడు.ఒక యాదవుడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు మాట్లాడి శ్రీ కృష్ణుని అవమానించాడు శిశుపాలుడు. భీష్మపితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశపడితే భీష్ముడు వారిని వారించాడు. కృష్ణుడు సభనుద్దేశించి ‘‘శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం అతడి వంద అపరాధాలను మన్నించాను... నేటితో వంద తప్పులు పూర్తయ్యాయి. ఈ మూర్ఖుని ఇప్పుడే సంహరిస్తాను’’ అని పలికి సుదర్శన చక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు.శిశుపాలుడు ఎవరు?బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందాదులు విష్ణు మూర్తిని దర్శించుకోవాలని వైకుంఠానికి వెళ్ళినపుడు అక్కడ ఉన్న ద్వార పాలకులైన జయ, విజయులు, ఈ సమయంలో విష్ణుమూర్తి ఏకాంత సమయంలో ఉన్నారని, దర్శనానికి తగిన సమయం కాదని వారించడంతో పాటు, వారిని లోనికి పంపకపోవడంతో, ఆగ్రహించిన సనక, సనందాదులు, జయ, విజయులను వైకుంఠ లోకంలో ఉండేందుకు అర్హత లేకుండా శపిస్తారు. అనంతరం తమ తప్పును తెలుసుకున్న జయ, విజయులు శాప విమోచనం కోరగా విష్ణుమూర్తితో 7 జన్మల మిత్రుత్వం కానీ 3జన్మల శత్రుత్వం అనంతరం మరలా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని సూచిస్తారు. దీనితో జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి మూడు జన్మల శత్రుత్వం నెరపి విష్ణుమూర్తి చేతిలో హతులై, మరలా విష్ణుమూర్తి ద్వారపాలకులయ్యారు జయవిజయలు...– సి.ఎన్.మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
కోటిలింగేశ్వరా.. శిరసా నమామి
కోటి లింగేశ్వర నమఃశివాయ అనే ఉచ్చారణ వింటుంటే మనకి ఒక సందేహం కలుగుతుంది... కోటి లింగాలతో శివాలయమా అని... ఔను! నిజంగానే కోటి లింగాలతో శివాలయం ఉంది అంటే ఆశ్చర్యపోతాము. దానికి తోడు 108 అడుగుల ఎత్తు కలిగిన అతి ఎత్తయిన శివలింగం... ఎదురుగా 36 అడుగుల పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంది. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్య పెద్ద త్రిశూలం స్థాపించారు. సుమారు 97 లక్షల శివలింగాల ప్రతిష్ట జరిగి ఉంటుందని లెక్క. ఇవికాక ఉపదేవతలు... దేవి పీఠాలు వెరసి భక్తితో ఓం నమఃశివాయ అనే ఉచ్చారణతో లోకమే మర్చిపోతాము. కోటి లింగాల స్థాపన అంటేనే చిన్న విషయం కాదు. ఈ దేవాలయ ప్రతిష్టతో ఆ ఊరి అసలు పేరు మారిపోయి కోటి లింగేశ్వర అని చెప్తేనే తెలుస్తోంది. మరి అంతటి ప్రశస్తి పొందింది. ఈ కోటి లింగేశ్వర దేవాలయం బెంగుళూరుకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరి పేరు కమ్మసంద్ర. ట్రైన్లో వెళ్తే బంగారుపెట్ట రైల్వేస్టేషన్లో దిగితే 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఉండడానికి అంత సౌకర్యాలు లేవు. బెంగళూరు, కమ్మసంద్ర రెండు వేరు వేరు లోకాలని చెప్పొచ్చు. బెంగళూరు యాంత్రికమైన వేగంతో కూడుకున్న జీవితం అయితే కమ్మసంద్రలో ప్రశాంతమైన పల్లె వాతావరణం... భక్తితో కోటి లింగేశ్వర లోకం అని అనిపిస్తుంది. మరి ఈ దేవాలయాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరు స్వామి సాంబశివమూర్తి. పేరులోనే శివ నామం ఉంది. అందుకేనేమో కోటి శివలింగాలను ప్రతిష్టించాలని మనసులో అనుకున్నారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే కేంద్ర సంస్థలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి శివనామస్మరణతో కోటి లింగేశ్వర దేవాలయంలో తన శేష జీవితం గడిపారు. వీరి స్వప్నమే కోటిలింగాల ప్రతిష్ట. 2018లో స్వామి సమాధి ΄పొంది శివైక్యం అయ్యారు. ఇక్కడ 17 శక్తి స్వరూపాలను ప్రతిష్టించారు. అలాగే దుర్గ, పార్వతీదేవిల ప్రతిష్ట ఉంది. ఉప దేవతలుగా అన్నపూర్ణేశ్వరి, కరుమారి అమ్మ, సుబ్రమణ్యేశ్వర స్వామి, పాండురంగస్వామి, సీతారామలక్ష్మణులు, పంచ ముఖ గణపతి, కన్యకాపరమేశ్వరి ఉపదేవతా క్షేత్రాలు ఉన్నాయి. ముందుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను పూజించి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ చూడదగ్గది సహస్రనామ శివలింగం. ఏకశిల మీద వేయి శివలింగాలను చెక్కి ఉంటుంది. ఒకేసారి వేయి శివలింగాల దర్శనం చేసినంత పుణ్యం దక్కుతుంది. అలాగే మరో పుణ్యఫలం పంచ ముఖ శివలింగం. ఇక్కడ భక్తులకి మరో మంచి పుణ్యం శివునికి అభిషేకం స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ దేవాలయ యాజమాన్యాన్ని సంప్రదించి మనకి నచ్చిన వారి జ్ఞాపకార్ధం ఎనిమిది వేల నుండి రెండు లక్షల రూపాయలు వరకు చెల్లించి శివలింగ ప్రతిష్ట చేసుకోవచ్చు. ఆ విధంగా మనం కూడా కోటిలింగేశ్వర యజ్ఞంలో పాలుపంచుకోవచ్చు. ఎందరో ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పేర్లు కనిపిస్తాయి. గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం, నాగలింగ వృక్షాలు ఉన్నాయి. ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసికొని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయాల్లో నిత్యసేవ, అన్నదానం, పేదలకు వస్త్రదానం జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం, జాతర జరుగుతుంది. మంజునాథుడు పరమ శివ భక్తుడు. వీరి చరిత్రలో కూడా కోటి లింగేశ్వర ప్రసక్తి ఉందని అంటారు. స్వతహాగా మంజునాథుడు భక్తిభావం లేకుండా తిరిగేవాడు. ఒకరోజు అతనిలో శివుని మీద భక్తి కలిగింది ఎవరు నమ్మలేదు. అప్పుడు మంజునాథుడు పక్కనే ఉన్న శివాలయంలోకి వెళ్లారు. అప్పుడు దీపాలు ఆరిపోయాయి. అది చూసి బాధతో శివ నామ స్మరణ చేసి కీర్తనలు పాడారు. అప్పుడు దీపాలు తిరిగి వెలిగాయి. అప్పుడే ఆయన తన తప్పుకి ప్రాయశ్చిత్తం కోసం కోటి లింగాలను ప్రతిష్ట చేయడానికి సంకల్పం చేశారని చెబుతారు. కోటిలింగేశ్వర యాత్రా దర్శనం అద్భుతం అని చెప్పొచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్లో రాన్లోని బందర్ అబ్బాస్లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్లోని వివిధ ట్రావెల్ వ్లాగ్ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
ఏకలవ్య శిష్యరికం
ఆధునిక భారతదేశంలో ఏకలవ్యుడు దళిత, గిరిజన హక్కులకు ఆదర్శంగా ప్రత్యేకంగా నిలిచాడు. ఏకలవ్యుని గౌరవార్ధం, కేంద్ర ప్రభుత్వం భారతీయ గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను‘ నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు క్రీడలలో అసాధారణ విజయాలు సాధించిన 19 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులకు, వ్యక్తులకు ఏకలవ్య పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఇది ఇలా ఉండగా హర్యానాలోని గురగ్రామ్ లో ఏకలవ్యునికి అంకితం చేయబడిన ఆలయం ఒకటి ఉంది. ఆ గ్రామంలోని కాండ్సప్రాంతంలో ఆలయాన్ని అక్కడి గ్రామస్తులు అప్పట్లో నిర్మించారు. ఈ ఆలయం వద్దనే ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురువైన ద్రోణాచార్యుడికి సమర్పించినట్లు చారిత్రాత్మక ఆధారం. ఏకలవ్యుడంటే తెలియని వాళ్లు...గురు దక్షిణగా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి ఇచ్చిన విషయం గురించి వినని వారు బహుశా ఉండరేమో.... దీక్ష... పట్టుదల...అంకిత భావం... ఎనలేని గురుభక్తితో కాదు పొమ్మన్నా సరే... ఆ గురువునే మట్టిబొమ్మగా మలుచుకొని ఒక గొప్ప విలువిద్య కారుడుగా మహాభారతంలో పేరుగాంచిన మేటి విలుకాడే ఏకలవ్యుడు....నిషాదుల రాజు హిరణ్యధన్వుని కుమారుడే ఏకలవ్యుడు. కౌరవ పాండవులకు ఆస్థాన గురువైన ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలన్నది ఏకలవ్యుని ఆకాంక్ష. అయితే ఏకలవ్యుని సామర్థ్యాన్ని గమనించిన ద్రోణాచార్యుడు అతనికి తగిన శిక్షణ ఇస్తే అతడు విలువిద్యలో కౌరవ, పాండవ రాకుమారులను మించిపోతాడని, దాంతో తాను భీష్మునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమోననే ఉద్దేశ్యంతో ఏకలవ్యుని తన శిష్యునిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు అందుకు ఏమాత్రం నిరాశపడక గురువుపై ఉన్న అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో ద్రోణాచార్యుని మట్టిబొమ్మను తయారు చేసుకొని స్వీయ శిక్షణతో గొప్ప విలుకాడుగా పేరుగాంచాడు.ఒకసారి ఒక వేట కుక్క ఏకలవ్యుడిని చూసి మొరగడంతో ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరిచి ఉండగానే దానికి ఏమాత్రం హాని కలగకుండా ఏడు బాణాలు వేశాడు. ఎంతో నైపుణ్యంతో వేసిన బాణాలను చూసిన అర్జునుడు నిరాశకు లోనై ద్రోణాచార్యునికి విషయాన్ని తెలిపాడు. అనంతరం ఏకలవ్యుని కలిసిన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుని ఏకాగ్రతను గుర్తించి అభినందిస్తాడు. అయితే తన ప్రియ శిష్యుడైన అర్జునుని మేటి విలుకానిగా తీర్చిదిద్దుతానని తాను అర్జునునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అనే ఉద్దేశ్యంతోనూ, అతను తనను గురువుగా భావించి నేర్చుకున్న విలువిద్యకు తగిన గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలు కోరతాడు, ఏమాత్రం సంకోచించకుండా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి గురువైన ద్రోణాచార్యునికి సమర్పిస్తాడు ఏకలవ్యుడు. గురువుతో ప్రత్యక్ష సంబంధం లేకుండానే ఆ గురువును ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడలలో నడుస్తూ స్వయంగా విద్యను నేర్చుకునే వారిని ఏకలవ్య శిష్యులు అనే నానుడి అలా వచ్చింది. అమృత బిందువులు – ఆలోచన లేని స్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని ఓటమి వీటివల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది.– ‘మన సంబంధం ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులవుతారు. మన విలువలు సుఖ దుఃఖాలతో ముడిపడిన వారంతా ఆత్మ బంధువులవుతారు.– సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శ్రపాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సాయం చేసే స్థాయికి మనం ఎదగాలి.– మనం గెలిస్తే మనవాళ్ళకి మనమేంటో తెలుస్తుంది. మనం ఓడిపోతే మనవాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది.– చిన్నప్పుడు దేన్నయినా పట్టుకుని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నయినా తట్టుకుని నిలబడాలి.→ ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. – సి. ఎన్. మూర్తి సీనియర్ పాత్రికేయులు -
నిస్వార్థ సేవే నిజమైన ధర్మం
రాగి పాత్రని ప్రతి రోజూ శుభ్రం చేయకపోతే, చిలుం పట్టినట్లుగా, ప్రతి రోజూ విహిత కర్మాచరణ, సత్కర్మలు చేయకపోతే, మనసు కూడా మలినమై పాపగ్రస్థమవుతుంది. సత్కర్మ అంటే కేవలం పూజలు, పునస్కారాలు చేయడం మాత్రమే కాదు. సమాజానికి, తోటి ప్రాణులకు మేలు చేసే ప్రతి పని సత్కర్మే అవుతుంది. కీడు తలపెట్టకపోవడం, అందరూ బాగుండాలని కోరుకోవడం (మానసిక సత్కర్మ). మృదువుగా మాట్లాడటం, సత్యాన్ని పలకడం, ఎవరినీ మాటలతో గాయపరచకపోవడం(వాచిక సత్కర్మ). శ్రమించి పని చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, సమాజసేవ చేయడం(శారీరక సత్కర్మ). భారతీయ సంస్కృతిలో ‘యద్భావం తద్భవతి‘ అని అంటారు. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే మన పనులు అలానే ఉంటాయి. భారతీయ జీవన విధానంలో, ధర్మశాస్త్రాలలో సత్కర్మాచరణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మనం చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనిషి పుట్టుకతో గొప్పవాడు కాడు, తను చేసే కర్మల (పనుల) ద్వారానే గొప్పవాడవుతాడు. మనం చేసే ప్రతి చిన్న మంచి పని సమాజంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలుకుతుంది. కాబట్టి, ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి.రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల పోనుపోను మనసు ప్రక్షాళితమవుతుంది. ఒకరి అనుభవం, జిజ్ఞాస ఇతరులకు చేరతాయి. దీనివల్ల వేరే ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజజీవితంలో ఏదైనా కర్మ నిర్వర్తించేటప్పుడు, అది నాకు, ఇతరులకు మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల మోక్షమార్గం సులువవుతుంది. మనసు పూర్తిగా ఆ పరమాత్మపై లగ్నమైనప్పుడు, లౌకికమైన భయాలు మనిషిని ఏమీ చేయలేవు. మనసుని దైవపరం చేయడం వల్ల మనం చేసే ప్రతి పనీ నిష్కామ కర్మ అవుతుంది. సంసారమనే సాగరంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, భగవంతుడనే నావ మనల్ని మునిగిపోనివ్వదు. క్రోధం, ఈర‡్ష్య, ద్వేషం వంటి అంతర్గత శత్రువులనే మంటలు మనల్ని దహించలేవు. మనసు ప్రశాంతమైన మలయమారుతంలా మారుతుంది. లోకంలో మన చుట్టూ ఉండే ప్రతికూలతలనే విషం వ్యక్తిత్వాన్ని లేదా మనశ్శాంతిని హరించలేదు.‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం లేకుండా, ‘అంతా దైవ నిర్ణయం, నేను కేవలం నిమిత్తమాత్రుడిని’ అనే భావంతో కర్మలు చేయడం వల్ల విజయం వచ్చినా పొంగిపోము, అపజయం ఎదురైనా కుంగిపోము.ఒక వ్యక్తి చేసే ’మంచి పని’ అనేది కేవలం ఎదుటివారికి సహాయం చేయడం మాత్రమే కాదు, అది సమాజంలో ఒక సానుకూల మార్పుకు పునాది వేస్తుంది. మంచి పనిని ఆచరించడానికి పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులే గొప్ప మార్పును తెస్తాయి. మంచి పని చేసేటప్పుడు ఏ గుర్తింపునూ లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే, అది పైన మనం చెప్పుకున్న ’నిష్కామ కర్మ’ అవుతుంది. ఫలితం ఆశించకుండా చేసే సాయం ఎప్పుడూ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.మానవ జీవితం కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ‘కర్మ’ అంటే పని. మనం చేసే పనులే మన భవిష్యత్తును, మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ‘సత్’ అంటే మంచి, ‘ఆచరణ’ అంటే అనుసరించడం. అంటే, శాస్త్ర సమ్మతంగా, ధర్మబద్ధంగా, పరోపకార భావంతో చేసే పనులనే సత్కర్మాచరణ అంటారు. ఒక వ్యక్తి చేసే మంచి పని సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెట్టు నాటితే, అది వందల మందికి నీడనిస్తుంది. డబ్బు, పదవులు శాశ్వతం కావు. మనిషి మరణించిన తర్వాత కూడా అతను చేసిన మంచి పనులు మాత్రమే జీవించి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక చిన్న మంచి పనినైనా చేస్తూ సత్కర్మ మార్గంలో పయనించాలి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
శని జయంతి ప్రాముఖ్యత..ఆయన అనుగ్రహం పొందాలంటే..!
శనీశ్వరుడి జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.శనీశ్వరుడి జయంతిదేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.చేయవలసిన పూజలుశని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి. అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.శని దేవుడి ప్రాముఖ్యతసూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.శని శాంతి మంత్ర స్తుతి..ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయకృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయశుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతినవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి , తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.శన్యారిష్టే తు సంప్రాప్తేశనిపూజాంచ కారయేత్శనిధ్యానం ప్రవక్ష్యామిప్రాణి పీడోపశాంతయేఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.వై.వెంకటసుబ్బారెడ్డి9849100044మరిన్ని వివరాలకు కింది వీడియోపై క్లిక్ చేయండి (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
కలియుగ కల్పవృక్షం 'రావిచెట్టు'
భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే ప్రథమ తాంబూలం. చెట్టును, చేమను, పుట్టను, గుట్టను, రాతిని కూడా దైవ స్వరూపంగా భావించే ఉదాత్తమైన సంప్రదాయం మనది. ఈ వృక్ష సంపదలో అగ్రతాంబూలం అందుకునేది ‘రావి చెట్టు’. ఋగ్వేదం మొదలుకొని భగవద్గీత వరకు ప్రతిచోటా కొనియాడబడిన ఈ మహావృక్షాన్ని ‘కలియుగ కల్పవృక్షం’ అని ఎందుకు అంటారు. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగానూ ప్రాణికోటిని రక్షించే ఈ అశ్వత్థ వృక్ష వైభవంపై ప్రత్యేక కథనం..సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వృక్షాలన్ని నేను రావి చెట్టును అని ప్రకటించిన ఈ వృక్షం సామాన్యమైనది కాదు.. త్రిమూర్తుల సమ్మేళనం. దీని వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీమహావిష్ణువు, అగ్రభాగంలో పరమశివుడు కొలువై ఉంటారని పురాణోక్తి. అందుకే ఈ చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.దోషాల నుంచి విముక్తికి...జీవితంలో ఎదురయ్యే గ్రహ దోషాలకు, పితృదోషాలకు రావి చెట్టు చెంత చక్కని పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనిదేవుడు రావి చెట్టును వరమిచ్చాడని, ఎవరైతే శనివారం నాడు ఈ చెట్టును పూజించి దీపం వెలిగిస్తారో వారికి తన పీడ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారని, తద్వారా వంశాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు.శాస్త్రీయ కోణంలో .. రావి చెట్టును కల్పవృక్షం అనడానికి కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. ప్రకృతిలో 24 గంటల పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువును విడుదల చేసే ఏకైక వృక్షం రావి. దీని విశాలమైన నీడ పర్యావరణంలోని విష వాయువులను హరిస్తుంది. ఆయుర్వేదంలోనూ రావి బెరడు, ఆకులు, పండ్లను ఎన్నో మొండి వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు. అందుకే ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం.అనుగ్రహం పొందే మార్గం..ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక అశాంతితో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ‘ మంత్రాన్ని జపిస్తూ ఏడు ప్రదక్షిణలు చేయడం విశేష ఫలితాలనిస్తుంది. నమ్మకంతో చేసే ఈ చిన్న ప్రయత్నం అపారమైన మనశ్శాంతిని, కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతిని ప్రేమిద్దాం.. దైవత్వాన్ని పూజిద్దాం..! – పసుపులేటి వెంకటేశ్వరరావు (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..!
మన దక్షిణాదిన శుచీంద్రం ప్రముఖ శివ క్షేత్రాలలో ఒకటి. ఎంతో మహిమ గల శైవదేవాలయం. స్వర్గాధిపతి దేవేంద్రుడు శాపవిమోచన పొందిన స్థలం. మరి మనకి కూడా తెలిసీ తెలియక చేసిన తప్పులకి ప్రార్థనతో పొదవచ్చు. స్త్రీవ్యామోహంతో శాపం పొందిన ఇంద్రుడు ఇక్కడ పాప మోచనం పొంది శుచిత్వం పొందడంతో శుచీన్ద్రం అని పేరు వచ్చింది. ఆ కథ, శుచీంద్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. ఒకసారి అహల్య అందాన్ని చూసి మోహ పరవశుడు అయ్యాడు దేవేంద్రుడు. అప్పుడు ఇంద్రుడు తెల్లవారక ముందే కోడికూత వేసి గౌతమ మునిని స్నానానికి పం΄ాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతమ ముని వేషంలో అనసూయ దగ్గరకి వచ్చాడు. జరిగిన మోసం గ్రహించి గౌతమ ముని తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడిని, అహల్యని చూసి శపించాడు. శిలగా మారిన అహల్య శ్రీ రాముని పాదస్పర్శ తగిలి ఇక్కడే శాప విమోచనం పొందింది. ఇక్కడే అత్రి మహా ఋషికి ఆశ్రమం ఉండేది అందుకే జ్ఞానారణ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక చెట్టు మొదలు నరికినప్పుడు శివలింగం కనిపించింది. గొడ్డలి దెబ్బకి శివలింగం నుండి రక్తం కారసాగింది. ఇది దేవాలయ మూలస్థానంగా చెబుతారు. సుచీన్ద్రంలో మహాశివుని ప్రతిష్ట ఉన్నప్పటికీ త్రిమూర్తి సంకల్పం కూడా ఉంది. కారణం ఇక్కడ వృక్షాలలో త్రిమూర్తులు ఉన్నారు అని చెట్లకు పూజ చేస్తారు. తప్పు చేసిన వారు పాప పరిహారంగా సుచీన్ద్రుని దర్శించుకుని భక్తులు పాప విమోచనం పొందుతారు. సుచీన్ద్రుని ముందు మరుగుతున్న నేతిలో వెండి విగ్రహాన్ని వేస్తాడు పూజారి. తప్పు చేసిన వారు ఆ విగ్రహాన్ని చేతితో తీయాలి. పూజారి ఆ చేతిని వస్త్రంతో కట్టి మూడు రోజుల తరువాత విప్పుతాడు. చేతి చర్మం రంగు మారినా వ్రణం ఏర్పడినా ఆ వ్యక్తి తప్పు చేసినట్టుగా నిర్ధారిస్తారు. బ్రిటిష్ వారు ఈ విధానానికి స్వస్తి పలికారు. మహాభిషేకం సమయంలో భక్తులు రథం లాగుతారు. ఈ కార్యక్రమానికి సుచీన్ద్రం వాసులు ఎక్కడ ఉన్నా వచ్చి పాల్గొంటారు. ఆ విధంగా తమ పాప ప్రక్షాళనం చేసుకుంటారు. ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడి స్తంభాలను మీటితే సప్తస్వరాల ధ్వని వినిపిస్తుంది. స్త్రీ రూపంలో చెక్కిన వినాయకుడు, రుద్రవీణ వాయిస్తున్న రావణాసురుడు, నోటిలో తిరుగుతున్న భూగోళం, రామాయణ మహాభారతాల రాతి శిల్పాలు... ఎంత చూసినా అద్భుతమే. మన దేశంలో లాటరీ విధానం ఇక్కడ నుండి ప్రారంభించారు అని అధికారిక పత్రాలు ఉన్నాయి ఇక్కడ. శుచీన్ద్రం రాజ గోపుర పునరుద్ధరణకు డబ్బు అవసరం ఏర్పడింది. అప్పటి తిరువనంతపురం రాజు గారి అనుమతితో ఒక రూపాయి లాటరీ టికెట్ అమ్మకం చేశారు. పదివేల రూపాయల బహుమతి. యాభై వేల టికెట్లు అమ్మారు. బహుమతి సొమ్ము పోను మిగిలిన డబ్బుతో ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. పచ్చని అడవితో పాలార్ నదీ ప్రవాహం, శిల్పకళా వైభవం మంచి అనుభూతినిస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ టూర్ శబరిమల యాత్రలో సుచీన్ద్రం వెళ్లడం సులువు. కన్యాకుమారి నుండి 18, నాగర్కోయిల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది సుచీన్ద్రం శివ క్షేత్రం. సుచీన్ద్రంలో అంతగా లాడ్జీలు లేవు. నాగర్కోయిల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. – ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం(చదవండి: మైసూరు మహాదేవి చాముండేశ్వరి) -
72 గంటల్లోనే అద్భుతమైన ధ్యాన క్షేత్రం తొలి కార్యక్రమం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అద్భుతమైన 'ధ్యాన మందిరం', తన మొట్టమొదటి భారీ కార్యక్రమానికి సిద్ధమైంది. మే 13, 2026న గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి నేతృత్వంలో "ప్రపంచ శాంతి కోసం గురుదేవ్తో కలిసి ధ్యానం" అనే అంతర్జాతీయ కార్యక్రమం జరగనుంది.'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్'లో ప్రతిష్టాత్మక ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన 72 గంటలలోపే, ఆ అద్భుతమైన ధ్యాన క్షేత్రం తన మొదటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ధ్యాన కార్యక్రమంలో 182 దేశాల నుండి లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా మరియు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొననున్నారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక ధ్యాన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుంది.ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఆధ్యాత్మికత , మానసిక ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక యుగంలో ఒత్తిడి, అనిశ్చితి ఎదుర్కొంటున్న యువతకు ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దిక్సూచిలా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. "మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత కలిగిన యువత ద్వారానే అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మించబడుతుంది" అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యేక ధ్యాన కేంద్రాలలో ఒకటైన దీని వెనుక ఉన్న స్ఫూర్తి గురించి మాట్లాడిన మోదీ సంకల్పం స్పష్టంగా ఉన్నప్పుడు, సేవాభావంతో పని చేసినప్పుడు, ప్రతి ప్రయత్నం సరైన ఫలితాన్ని ఇస్తుందంటూ కొనియాడారు."ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ఏళ్లుగా ఒక మహావృక్షంలా విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో జీవితాలను ప్రభావితం చేస్తోందని ప్రశంసించారు.45 ఏళ్ల వేడుకలుఈ గ్లోబల్ మెడిటేషన్ ఈవెంట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న నెల రోజుల వేడుకల్లో భాగంగా జరుగుతోంది. మే 13న జరిగే 'ది వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్' కార్యక్రమం, 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల రోజుల పాటు జరిగే వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంతో మజుందార్; కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ఉత్తరాఖండ్ గవర్నర్ నంద్ కిషోర్ యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్,రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, హిరానందాని గ్రూప్ ఛైర్మన్ నిరంజన్ హిరానందానిలాంటి ప్రముఖులు హాజరు కానున్నారు.ఈ ప్రపంచ స్థాయి ధ్యాన కార్యక్రమం, వివిధ కాల మండలాలు , ఖండాలలో విస్తరించి ఉన్న లక్షలాది మందిని ఒకే క్షణంలో సామూహిక మౌనం మరియు ఆత్మపరిశీలన కోసం ఏకం చేస్తుందని ఆశిస్తున్నారు. "అంతర్గత శాంతి మాత్రమే బాహ్య ప్రపంచంలో శాంతిని తీసుకురాగలదు" అనే సందేశాన్ని గురుదేవ్ గత నాలుగున్నర దశాబ్దాలుగా చాటుతున్నారు.బెంగళూరులోని ఈ ధ్యాన మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది, ఇది శాంతికి మరియు మానసిక వికాసానికి కేంద్ర బిందువుగా మారనుంది. -
జయ హనుమంత! అమిత బలవంత!
చాలా గొప్ప వైవిధ్యభరిత పాత్రలనే రత్నాలతో కూర్చబడిన హారం శ్రీ మద్రామాయణం. అన్నిటి మధ్యనా తళుకులీనే మేటి మణిపూస వంటి పాత్రగా హనుమంతుడు మనకు దర్శ నమిస్తాడు. మహా జ్ఞాన సంపన్నుడు, అద్భుత బలశాలి, వినయశీలి, మహా భక్తుడు, ధీరాగ్రేసరుడు, కార్యసాధకుడుగా మనకు గోచరమవుతాడు.శివాంశతో, వాయుదేవుని అనుగ్ర హంతో కేసరి, అంజనాదేవి దంపతులకు జన్మించిన ఆంజనేయుడు బాల్యం నుండే తన అద్భుత శక్తి సామర్థ్యాలను చూపించాడు. సముద్ర లంఘనం, రాక్షస సంహారం, సంజీవనిని తేవడం వంటి ఘనకార్యాలు మారుతివంటి బలశాలికి తప్ప ఇతరులకు సాధ్యమయే విషయాలు కావు. బాల్యంనుండే తన దేహబలాన్ని దుందుడుకు పనులకు ఉపయోగిస్తున్న బాలాంజనేయునికి ఆయన హితైషులు ఒక శాపం వంటి వరాన్ని ఇచ్చారు. అదేమంటే తన శక్తి తనకు తెలియక పోవడం. ఇతరులెవరైనా తెలిపితే తప్ప మారు తికి తన శక్తి సామర్థ్యాలు తనకు తెలియకూడదని శ్రేయోభిలాషుల ఆంతర్యం.విద్యావినయసంపన్నుడు– కేసరీ నందనుడుపట్టుదల, బుద్ధికుశలత, సూక్ష్మగ్రాహిత్వము, విద్యా పారీణతలకు ఆంజనేయుడు ప్రతీక. ఆయనను సేవిస్తే విద్యలలో కౌశల్యం, సూక్ష్మ బుద్ధి తప్పక లభిస్తాయని పరాశర సంహిత చెబుతుంది. అంతటి విద్య, ఘనమైన దేహబలమున్నా, మూర్తీభవించిన వినయస్వరూపుడు హనుమ. తన ప్రభువైన సుగ్రీవుని పట్ల, తనకు దైవమైన శ్రీరాముని పట్ల ఆయ న ప్రదర్శించిన వినయం అద్వితీయ మైనది. తాను వారికి సేవకునిగా, బంటుగా ఎప్పుడూ భావించేవాడు ఆయన. ఇది లోకులందరకూ స్ఫూర్తి దాయకం. అతని భక్తికి నిదర్శనమా అన్నట్లు మారుతి లేని రామాలయం ఎక్కడా కనపడదు.కార్యదీక్షా తత్పరుడు ఒక కార్యాన్ని తలపెట్టిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కు తగ్గే ప్రసక్తే లేకుండా, ఆ కార్యం నెరవేర్చే దాకా విశ్రమించని లక్షణం హనుమది. సామాన్యులకు సరే సరి... అంగద, జాంబవంతాది వీరులకు కూడా దాటడానికి సాధ్యం కాని సముద్రాన్ని దాటి, లంక ను చేరి, సీతమ్మ జాడ కనుగొని, తమ శక్తిని శత్రువులకు తెలియజేసి, తిరిగి ఆ విషయాన్ని శ్రీరామునికి నివేదించే వరకూ హనుమ విశ్రమించలేదు. ఆతిథ్యాన్ని అందించ వచ్చిన మైనాకునితో మరియు సముద్రునితో ఆ విషయమే సవినయంగా తెలిపి ముందుకు సాగిన కార్య నిబద్ధుడు ఆంజనేయుడు.ఎన్నో సుగుణాలు, ఆదర్శాలు మూర్తీభవించి ఉన్న హనుమను తమలపాకులు, వడల మాలలు, సింధూరాలతో పూజించిన భక్తులకు బుద్ధి, దేహబలం, కీర్తి, ధైర్యం, నిర్భయ త్వం, ఆరోగ్యం, పాపనివృత్తి, వాక్పాటవం కలుగుతాయని పెద్దల మాట. అంతేకాదు. ఆంజనేయుని పూజించే వారి కి భోగ, మోక్షాలు రెండూ సులభంగా లభిస్తాయని పరాశర సంహిత చెబు తున్నది. మన దేశంలోని దాదాపు ప్రతి చిన్న పల్లెలోనూ రామాలయాలు, ఆంజనే యుని ఆలయాలూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధగిరి, కొండగట్టు, గండి, కసాపురం, శింగరకొండ వంటి సుప్రసిద్ధ హనుమత్ క్షేత్రాలన్నింటిలోనూ హనుమజ్జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
అమృతోత్సవ సోమ నాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానం సోమనాథ క్షేత్రానిదే... ఇది గుజరాత్లోని సౌరాష్ట్రలో అరేబియా సముద్ర తీరాన ఉంది. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథ క్షేత్రంగా పేరొందింది. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ ఆకారంలో యుగాల నుంచి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపై అనేకమంది విదేశీపాలకులు లెక్కలేనన్ని సార్లు దండయాత్రలు చేశారు. అయితే ఎన్ని దండయాత్రలకు గురైనా మళ్లీ అన్నిసార్లూ పునర్ నిర్మితమైన క్షేత్రమిది. చంద్రుని పేరుమీదుగా సోమనాథుడుస్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన దక్షప్రజాపతి అశ్విని నుంచి రేవతి వరకు గల 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు రోహిణి ఒక్కదానినీ అనురాగంతో చూస్తూ, మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగాడు. దాంతో... తక్కిన 26 మంది తమ తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు, తమ కష్టాలు తీరే మార్గం చూపమని బ్రహ్మని ప్రార్థించగా ఆయన చంద్రునితో ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించవలసిందిగా చెబుతాడు. బ్రహ్మ దేవుని సలహాను అనుసరించి, భక్తి శ్రద్ధలతో శివుని పూజించిన చంద్రుడికి శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దినమొక కళ చొప్పున పెరుగుతుందనీ అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేరకు సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీ సమేతంగా వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు పరమేశ్వరుడు.అలనాడు స్వర్ణాలయం..ఈ క్షేత్రంలో తనకు శాపవిముక్తి కలిగినందుకు పరమానందభరితుడైన చంద్రుడు సువర్ణంతో పరమేశ్వరునికి ఆలయం నిర్మించాడట. అనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని రావణాసురుడు వెండితో పునర్ నిర్మించగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కలతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత రాజా భీమ్దేవ్ ఈ ఆలయాన్ని రాతితో పునర్నిర్మించాడు. పునఃప్రతిష్ఠకు డెబ్భై ఐదు ఏళ్లు పూర్తిసోమనాథక్షేత్రంలో భారీ సంపద వుండటంతో అనేకసార్లు దండయాత్రలకు గురైంది. క్రీ.శ. 1024లో గజనీ మహమ్మద్ దండయాత్రలో ఆలయం తీవ్ర నష్టానికి గురైంది. అనంతరం స్థానిక పాలకులు తిరిగి నిర్మించారు. దిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ, మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలోనూ ఆలయంపై దాడులు జరిగాయి. జునాగఢ్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన తరువాత ఉక్కుమనిషి, భారతదేశ ప్రథమ హోంమంత్రి వల్లభాయ్పటేల్ ఆలయాన్ని సందర్శించి పునర్ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. నాటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించారు. ఇది జరిగి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సోమనాథేశ్వరునికి అమృత మహోత్సవాలను జరిపించాలని సంకల్పించడమే కాదు... అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.సోమనాథునికి ప్రధాని ప్రత్యేక పూజలు1951లో బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ జరిగిన నాటి నుండి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో పాల్గొననున్నారు. అంతేకాదు, సోమనాథునికి స్వయంగా అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలు నిర్వహించనున్నారు. నిత్యం పూజలు, హారతులు, సౌండ్ అండ్ లైట్ షోలతో ఆలయం సందడిగా ఉంది. ఆలయ దర్శనం ఉదయం 6:00 నుండి రాత్రి 10:00 వరకు ఉంటుంది, మధ్యాహ్నం 1:00 నుండి 5:00 వరకు దర్శనం ఉండదు. – డి.వి.ఆర్. -
తిరుపతి గంగజాతర: వారు మాత్రమే ఆ వేషాలు వేస్తారు!
‘తిరుపతి కొండంత కొండ, పేరూరు గుట్టంత గుట్ట, తిరుపతి గంగజాతరంత జాతర’ లేవని తిరుపతి ప్రాంతీయుల నమ్మకం. నేడు తిరుపతి గంగజాతర రాష్ట్ర స్థాయి జాతర. ఇందులో 20 దున్న పోతుల్ని, 400 మేకపోతుల్ని, 700 కోళ్లని బలి ఇచ్చే సంప్రదాయం ఉన్నట్టు 1881 నాటి ఆర్కాట్ మాన్యువల్లో ఆర్థర్ ఎఫ్ కాక్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం దున్నపోతు బలి నిషేధితం. జాతరకి చిత్రి మాసంతో కత్రి కార్తెతో సంబంధం ఉంది. తిరుపతి గంగజాతర చాటింపు చిత్రి నెల నాలుగో మంగళవారం (మే 5, 2026). జాతర ముగింపు తర్వాతి మంగళవారం రాత్రి.చాటింపునకు ముందు అవిలాల గ్రామం (Avilala Village) నుంచి ఆడబిడ్డ సాంగ్యం తేవడం ఆనవాయితీ. ఇచ్చేది ముళ్లపూడి పెదరెడ్డి కుటుంబీకులు. తెచ్చేది తాళ్లపాక గంగమ్మ గుడి పూజారులైన కైకాల కుటుంబీకులు. అవిలాల ఆడబిడ్డ సాంగ్యంలో భాగంగా అమృతపళ్లెం, గండదీపం, పసుపు కుంకుమ, వేపాకు, నిమ్మకాయలు, ఆకు వక్కలు, పానకం, ఒడిబియ్యం, పచ్చిపిండి (బియ్యపుపిండి) తప్ప నిసరి. చాటింపులో పానకం దుత్త, పసుపు ముంతకు ప్రాధాన్యం ఉంది. చాటింపుకు ముందు అందరికీ నానబియ్యంతో పాటు పానకం ఇస్తారు, ఆడవారికి పసుపు పంచుతారు. వేపాకు, తమల పాకు, అరటి పండు దోసిట్లో పట్టుకొని పోతురాజు ముందు ఎర్నీళ్లు లేదా వసంతం నీళ్లు పూజారి పోస్తుండగా వదిలి, వెనక్కి చూడకుండా వెళ్తారు. కైకాల, తోటివారు పంబ పలకలు అనుసరిస్తుండగా చాటింపు వేసే ప్రాంతానికి వెళ్తారు.వేషాల వరుసచాటింపు మర్నాడు నుంచి గుడి తరపున మిరాశీ దారులు వేసే వేషాలు... వేషాలమ్మ గుడి నుంచి ప్రారంభమై మిరాశి ఉన్న ఇళ్లకు వెళ్లి చాటు దాటకుండా తిరిగి వేషాలమ్మ గుడికి చేరుకుంటాయి. బుధవారం పొద్దున వచ్చే బైరాగి వేషం మొదటిది. సాయంత్రం పాముల వేషం, బేస్తవారం పొద్దున గొల్ల, సాయంత్రం బండ వేషాలు ఉంటాయి. శుక్రవారం పొద్దున కోమటి, సాయంత్రం తోటి వేషాలు. శనివారం పొద్దున్నే ఒకప్పుడు జంగం వేషం వచ్చేది కాని ఇపుడు రావడం లేదు. సాయంత్రం దొర లేదా రాజు వేషం, బంటు వేషాలు. రాజు పాళెగాణ్ణి వధించి ‘బండిపీనుగు’ అని పాళెగాని శవాన్ని ఊరేగిస్తారు.ఆదివారం మాతంగి, పోతురాజు వేషాలు కాని ఇపుడు పోతురాజు వేషం రావడం లేదు. సోమవారం రెండు పసుపు కుండల వేషాలు. మంగళవారం పేరంటాలు వేషం ఊరు తిరుగు కుంటూ బుధవారం తెల్లవారు జామున గుడిలో ప్రత్యేకంగా తయారు చేసిన గంగమ్మ బొమ్మ చెంప నరుకుతుంది. తోటి వేషం నుంచి వేపాకు తప్పనిసరి. భక్తులు ఎక్కువ ఇష్టపడే వేషం తోటి వేషం. పాళెగాణ్ణి పట్టుకోవడానికి గంగమ్మ వేషాలు వేస్తుందనీ, దొర వేషంలో పట్టుకొని చంపివేస్తుందనీ కొన్ని కథలు చెప్తాయి.బైరాగి వేషం గొడుగు, పాముల వేషం కావడి, గొల్ల వేషం మజ్జిగ దుత్తతో వస్తే; బండ, తోటి వేషాలు కొత్త చేటతో వస్తాయి. దొర చేతిలో కత్తి, పేరంటాలు చేతిలో గంగమ్మ అద్దం, కోమటి వేషం మెడలో కరవాళ్ల జందెం ఉంటాయి. వేషాలు ఇంటి గుమ్మం తొక్కి ఆశీర్వదించడంలో కూడా ఒక వ్యవస్థ ఉంది. మాతంగి హారతి పళ్లెంలో ఒడిబాల బియ్యం వేసి, సున్నపుకుండలు, పసుపు ఇచ్చి, పేరంటాలు పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదిస్తే; తోటి వేషం చేటతో, పొరకతో కొట్టి ఆశీర్వదిస్తుంది.చదవండి: భవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు?గంగజాతరలో గుడి తరపు వేసే వేషాల్ని కైకాల వారు, మేకల తూరి, మంగపతి ఇంటిపేరు కల్గిన చాకలి వారు మాత్రమే వేస్తారు. చాకలి వారు బైరాగి నుంచి రాజు వేషం దాకా వేస్తే... మాతంగి, పసుపుకుండలు, పేరంటాలు వేషాలు కైకాలవారు వేస్తారు. ప్రస్తుతం ప్రతి వేషంతో పాటు ఆడవేషం కూడా వస్తోంది. వేషాల్లో చాకలి వారు వేసేవి ఒక వర్గంగా, కైకాలవారు వేసేవి మరో వర్గంగా విభజించి చూసినపుడు వాటి మధ్య ఒక అడ్డురేఖ ఉన్న విషయం గుర్తించవచ్చు. మగ వేషాలు మిరాశీ లేదా పూర్వం నుంచి పోతున్న కుటుంబాల దగ్గరికే పోతాయి. ఆడవేషాలు ప్రతి ఇంటి గడప తొక్కు తాయి. వేషధారణ, దీవెనలో కూడా తేడా ఉంది. మగ వేషాలకు ప్రత్యేక పాటలున్నాయి, బూతు పాటలున్నాయి. మగ వేషాలు గంగమ్మ గుడి దగ్గరకు పోతాయి కాని గుడిలోకి పోవు. రాజు మంత్రి వేషాలు వేశాలమ్మ గుడి దగ్గరకు పోతాయి గాని గుడిలోకి పోవు.- ప్రొఫెసర్ నాగపట్ల భక్తవత్సల రెడ్డి జానపద విజ్ఞాన పరిశోధకులు -
భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు?
Tallapaka Annamacharya Jayanthi భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు? ఇది తరతరాల ప్రశ్న.. ప్రతి యుగం లోని సరి అయిన జవాబు దొరికినా మళ్ళీ అదే ప్రశ్న!.. అలవైకుంఠపురంలోని మూల సౌధంబు లోంచి బయలు దేరాడు విష్ణువు శరణు కోరిన కరిరాజుని రక్షించడానికి.. తక్కువ కులస్థుడైనా గుహుడిని అక్కున చేర్చుకున్నాడు, రామచంద్రుడు.. శబరి ఎంగిలి పళ్ళు తిన్నది ఆ రాముడే.. ఉడత చేసిన సహాయానికి ఉడతని స్పృశించినది ఆ ఉత్తమోత్తముడే.. భారతంలో విదురుణ్ణి విజ్ఞానిగా పరిగణించారు, కులంతో నిమిత్తం లేకుండా. కర్ణుడి వ్యధ ఏకలవ్యుడి కధా కులరహిత సమాజం కోసమే. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు నేను నాల్గు వర్ణాలనే సృష్టించాను అని స్పష్టంగా చె΄్పాడు. వేద వేదాంగాలు, ఉపనిషత్తులు ముక్తకంఠం తో ఘోషించాయి కులం లేదని.. ‘ఇదంతా బ్రహ్మమే’ అని...పురాణాల్లో ఉదాహరణలు తీసుకోలేదు కానీ వాటి సారాన్ని తన ‘తత్వ బోధన’ మధురంగా, మనోరంజకంగా మనకు సులువైన తెలుగు భాష లో అందించాడు అన్నమయ్య.... 600 సంవత్సరాల క్రితమే ఇప్పటి మన రాజ్యాంగంలో కుల మత ప్రసక్తి ఉండ కూడదన్న విషయానికి ఊపిరి ΄ోశాడేమో అన్నమయ్య...అన్నమయ్య కోశం నుండి జాలు వారిన ఆధ్యాత్మిక ఆణిముత్యాల సారం కులం కన్నా భక్తి మిన్న అని... సమదృష్టి సక్రమ మార్గం అని. సకల శాస్త్రాల సారాన్ని అందమైన భాషలో అనంతమైన భావాన్ని రాగవంతంగా మేళవించి వేదాంత ధోరణిలో సంఘానికి ‘సమ దృష్టి’ తో ఉండాలని సలహా ఇచ్చాడు.... ‘బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే’ అని ఎలుగెత్తి చాటుతూ, హీనం, అధికం లేవని, ఎక్కువ తక్కువలు లేనే లేవని, జంతువులు, మనుషులు అనే భేదం లేకుండా, కుల మత భేదం లేకుండా ఉండాలని, అందరిలో ని శ్రీహరి ఉన్నాడని, శ్రీ హరే పరబ్రహ్మస్వరూపం అని చెప్పాడు.‘తందనాన ఆహి తందనాని పురె’ లో కూడా అదే భావాన్ని జోప్పించాడు.. అందరికి శ్రీ హరే అంతరాత్మ అని అంటాడు.. రాజు గారి నిద్రకి బంటు నిద్రకి తేడా లేదంటాడు.. భౌతికంగా చూడొద్దు, భేదభావాలు వద్దని చె΄్తాడు. చని΄ోయాక బ్రాహ్మణుడైన, చండాలుడైన చేరవలసింది ఒకచోటుకే అని చె΄్తాడు.. ప్రకృతికి తారతమ్యాలు లేవంటూ ఎండకు ఏనుగైనా, శునకమైనా సమానమే అని సెలవి స్తాడు..‘చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు’ అని ప్రశ్నిస్తూ సమ బుద్ధితో సంకీర్తనం చెయ్యండి. వేషభాషలతో విష్ణువుకు దగ్గర కాలేరని చెబుతాడు.వేదవట్టి యికనేమి వేదకేరు చదివేరు’ అని వెటకారం చేస్తూ వేదాలు చదివినా భగవంతుని తెలుసుకోజాలరని, భక్తి ముఖ్యమని, చదువు, కులం జ్ఞానం కన్నా భక్తి ముఖ్యమని ముక్తాయింపు చేస్తాడు.‘ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడ’ని నిజమైన భక్తి, నిక్క మైన జ్ఞానం ఉన్నవాడే గొప్పవాడని ఘోషిస్తాడు.‘వేదాలు వచ్చినా హరిభక్తి లేని సోమయాజి కన్నా విష్ణుపాదాలని వదలని కుల హీనుడే ఘనుడు’ అని ఘంటాపదంగా నొక్కి వక్కాణించాడు.‘ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు’ అంటూ తుది ఘడియల్లో హరినే స్మరిస్తే హరిని చేరుకుంటారని భక్తిమార్గం చూపిస్తున్నాడు.ఇలా ఎన్నో కీర్తనల్లో జీవరాశుల పట్ల సమదృష్టి ఉండాలని బోధించాడు... కొంగు బంగారమైన స్వామిని కొలవమన్నాడు.. అదివో అల్లదిగో, కొలువై ఉన్నాడు గోవిందరాజు, వేడుకుందామా అని శరణు వేడుకుంటున్నాడు, ఎందుకంటే ఇందరికి అభయమిచ్చు చేయి కాబట్టి...చివరగా... గాలికి కులమేది, నేలకి కులమేదని డా. సి నారాయణ రెడ్డి ప్రశ్నిస్తే, ఏ కులము నీదంటే, గోకులం నవ్విందని వాపోయారు వేటూరి సుందర రామ మూర్తి గారు. కులమతాలు వద్దంటూ వెంకటేశ్వరునిలో ఐక్యమైన అన్నమయ్య కుల మతాలతో చిచ్చువద్దని, అవి జాతి ఐక్యతని దెబ్బ తీస్తాయనీ పరోక్షంగా పలికాడు.. ఈ కీర్తనలను స్ఫూర్తిగా తీసుకుని కుల మత చిచ్చులో పడకుండా మన జాతిని మనం రక్షించు కుందాం..– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
సహజ యోగంతో సహజ ప్రవర్తన : అద్వితీయ ఘట్టం
మనిషి ధ్యాసను అంతర్ముఖంగా తీసుకువెళ్లి వారి చిత్తాన్ని వారి శరీరంలోనే వున్న పరమాత్మ శక్తి అయిన ఆత్మ మీదకు మళ్లించగలిగితే మనిషి ఆధ్యాత్మికత పరిపక్వం చెంది, అతనిలో పరివర్తన వచ్చి చిన్నతనంలో తనలో స్వాభావికంగా వున్న దైవికమైన పసితనపు అమాయకత్వాన్ని తిరిగి స్థిర పరచవచ్చు, తద్వారా అతనిని సమతుల్యతలో ఉంచవచ్చు అని తలచారు మాతాజీ నిర్మలాదేవి.అదెలా సాధ్యపడుతుందంటే మన శరీరంలోనే అంతర్గతంగా భగవంతుని శక్తి ఒకటి నిక్షిప్తమై ఉంది. అదే కుండలినీ శక్తి. తల్లి గర్భంలో సుమారు 2–3 నెలల వయస్సు వున్న సమయంలో పసిపిల్లవాని తల మాడుభాగాన వున్న బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ శక్తి ప్రవేశించి వెన్నెముక భాగాన 3 నాడులుగాను, 7 చక్రాలుగాను ఏర్పడి మిగిలిన శక్తి వెన్నెముక చివరన వున్న త్రికోణాకారపు ఎముక (సాక్రమ్ బోన్)లో మూడున్నర చుట్లు చుట్టుకుని ఉంటుంది. అదే కుండలినీ శక్తి. పిల్లలలోని ఆ శక్తి వారికి 9–10 సం. వయసు వరకు వారి వెన్నెముక ద్వారా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తూ బాహ్యపరంగా ఉన్న పరమాత్మ ప్రేమ శక్తితో అనుసంధానమవుతూవుంటుంది. ఆ వయసులో పిల్లలు భగవంతుని రక్షణలోనే వుంటారు. క్రమేపీ అది తిరిగి సాక్రమ్ బోన్ లోకి వెళ్ళి నిద్రాణ స్థితిలో వుండిపోతుంది.అలా నిద్రాణ స్థితిలోకి వెళ్ళి΄ోయిన ఈ కుండలినీ శక్తిని తిరిగి జాగృతి చేసి ఉత్థానపరచి శిరస్సుమీద వున్న సహస్రార చక్రాన్ని ఛేదించి బాహ్యపరంగా వున్న పరమాత్మ ప్రేమశక్తి అయిన విశ్వవ్యాపిత పరమ చైతన్యశక్తితో అనుసంధానపరచగలిగితే మనిషి మరలా తనలో దైవత్వాన్ని నింపుకోగలుగుతాడు. అప్పుడిక మానవులు ఎదుర్కొనే ఈ శారీరిక, భౌతిక, మానసిక, భావోద్వేగ, సమస్యలకు తావే వుండదు. వారిలో వివేకం, మంచి చెడుల విచక్షణా జ్ఞానం స్థిరపడి, వారి ఆలోచనలలో, జీవన విధానంలో, ప్రవర్తనలో, అవగాహనలో సమతుల్యత ఏర్పడి ప్రపంచమంతా మనం కోరుకున్న విశ్వమానవ సౌభ్రాతృత్వం, వసుదైక కుటుంబం ఏర్పడి విశ్వనిర్మల ధర్మం స్థిరపడుతుంది అని శ్రీమాతాజీ నిర్మలాదేవి ఒక నిర్ణయానికి వచ్చారు. మానవులు తమ మూర్ఖత్వం వలన లేక అంధ విశ్వాసాల వలన భగవంతుని సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి వస్తే చాలా ప్రమాదానికి, భవంతుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది అని గ్రహించి అందుకు ఒకే ఒక పరిష్కారం మనిషి లోని కుండలినీ శక్తిని తిరిగి జాగృత పరిచి తద్వారా ఆత్మసాక్షాత్కారానికి పాదుకొల్పడం సాధ్యమవుతుందని తెలుసుకున్నారు. ఇంతకు పూర్వం కుండలినీ జాగృతి కావాలంటే సర్వస్వం త్యాగం చేసి అడవులకో, హిమాలయాలకో వెళ్ళి వందల సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తేగాని దొరకని భాగ్యం అది. ఈ ఆధునిక కాలంలో అది అసాధ్యం. మనిషి ఏ త్యాగమూ చేయనవసరం లేకుండా, దేనినీ పరిత్యజించనవసరం లేకుండా తన రోజువారీ జీవితానికి ఏ ఆటంకం లేకుండా ఈ కార్యం నిర్వహించడానికి, ఆత్మసాక్షాత్కారం ΄÷ందడానికి ఏదైనా మార్గం కనుగొనాలని శ్రీమతి నిర్మలాదేవి నిశ్చయించుకున్నారు. అది కూడా 1970వ సంవత్సరం మే 6వ తారీఖు లోపునే జరగాలని అనుకున్నారు. వెంటనే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న నార్గోల్ సముద్రతీరాన ఓ సరుగుడు చెట్టు చెంతనకూర్చుని ఒక రాత్రంతా సుదీర్ఘ ధ్యానం (తపస్సు)లో వున్నారు. అంతే! మే నెల 5వ తేదీ తెల్లవారు ఝామున శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం ఒక్కసారిగా తెరుచుకుంది. భూమినుండి ఒక్కసారిగా భూగర్భజలం ఉవ్వెత్తున ఆకాశం వైపు అతి వేగంగా లేచినట్లుగా తనలోని కుండలినీ శక్తి ఉత్థానం జరిగి మాడు మీద బ్రహ్మరంధ్రం ఛేదించుకుని ఆకాశంలోకి ఒక కాంతిపుంజం చక్రాల గుండా ప్రయాణించి 7 రంగుల హరివిల్లులా వెదజల్లబడింది. శ్రీమాతాజీ మాటల్లో చెప్పాలంటే ఒక రాకెట్టును అంతరిక్షంలోకి పంపినప్పుడు అది ఒక్కొక్క ఛాంబర్ను నెట్టుకుంటూ అత్యంత వేగంతో, నిప్పులు కక్కుకుంటూ, రంగురంగుల వెలుగులు విరజిమ్ముతూ ఆకాశంలోనికి ఎలా దూసు కెళుతుందో అలాంటి అనుభూతే కలిగిందన్నారు. ఇది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అద్వితీయ, అపురూప ఘట్టం. మానవ మాత్రులకు ఇది అసాధ్యం అనుకున్న కార్యం సుసాధ్యం అయ్యిందని శ్రీ మాతాజీ నిర్మలాదేవి పేర్కొన్నారు.ఇంతకుముందు చెప్పినట్లుగా 1970 మే 5 తేదీన ముంబైకి దగ్గరలో గుజరాత్ రాష్ట్రం పరిధిలో వున్న నార్గోల్ సముద్ర తీరాన శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం తెరచిన సహస్రారధామ్ అనే ఆ స్థలాన్ని పుణ్యస్థలిగా భావించి ప్రతి ఏటా మే 5 తేదీన ప్రపంచవ్యాప్తంగా సహజయోగ సాధకులందరు దీనిని సహస్రార దినోత్సవంగా జరుపుకుంటారు. సహజయోగ సాధన చేస్తున్నవారు తమ శారీరిక, మానసిక, భావోద్వేగ బాధలనుండి, సమస్యలనుండి సునాయసంగా స్వాంతన పొందుతున్నారు. సహజయోగం పూర్తిగా ఉచితం.– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు -
మైసూరు మహాదేవి చాముండేశ్వరి
మనం మైసూర్ వెళ్తే 1008 మెట్లకి పసుపు కుంకుమ రాస్తూ మహిషాసుర మర్దినీ స్తోత్రాన్ని భక్తితో స్మరిస్తూ మెట్లు ఎక్కుతుంటారు భక్తులు. ఇలా మెట్లెక్కి దేవి దర్శనం చేసుకోవడం అనేది అమ్మ అనుగ్రహం ఉంటే కానీ జరగదని భక్తుల నమ్మకం. అలాగే దేవి నవరాత్రులు రోజులు వస్తే దేశం అంతటా వినబడే పేరు మైసూరు చాముండేశ్వరి ఉత్సవాలు. విదేశాల నుంచికూడా యాత్రికులు వచ్చి ఆసక్తితో చూస్తారు. ఏనుగు అంబారీ మీద మైసూరు రాజుల ఊరేగింపు ఎంతో ప్రసిద్ధి. మైసూరు మహా నగరంలో చాముండా పర్వతం మీద కొలువై ఉన్నారు చాముండేశ్వరీ దేవి. ఈ పర్వతాన్ని మొదట్లో మహాబల గిరి అని పిలిచేవారట. జగన్మాత చాముండేశ్వరి అవతారం ఎత్తి మహిషాసురుడిని వధించడంతో చాముండ పర్వతంగా పేరు పడింది. అమ్మచేతిలో మరణించే ముందు – ముందుగా తనకే దేవి భక్తులు పూజ చేసి దేవి దర్శనానికి వెళ్లాలని వరం పొందాడు మహిషాసురుడు. ఇప్పటికి జగన్మాత చాముండేశ్వరి దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు ముందుగా మహిషాసురుని దర్శించుకుని ఒక పుష్పాన్ని సమర్పిస్తారు. చాముండేశ్వరి దేవాలయం పక్కనే మహిషాసురుడి భయంకరమైన ప్రతిమ ఉంటుంది.శ్రీ చాముండేశ్వరి దేవాలయానికి మెట్ల దారి గుండా నడిచి వెళ్ళవచ్చు. బస్సు సౌకర్యం కూడా ఉంది. ఏడు అంతస్తులతో నిర్మించిన ఈ దేవాలయం శిల్ప కళా వైభవంతో అద్భుతంగా ఉంటుంది. ఏడవ అంతస్థు అర్ధ వృత్తాకారంగా ఉంటుంది. కలశ గోపుర ప్రతిష్ట గావించారు. ఆలయ ప్రవేశ ద్వారం అంతరాలయం దాటి గర్భగుడిలో వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవిని చూడడానికి రెండు కన్నులు చాలవు. దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు అరటి పండ్లు, పువ్వులు, పచ్చ రంగు చీర గాజులు కుంకుమ బియ్యం మల్లెపూల దండ దేవి సమర్పించి భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటారు. ఆ తరువాత ఉద్దనహళ్లి వెళ్లి చాముండేశ్వరి దేవి సోదరి జ్వాలాముఖి త్రిపుర సుందరీ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ దేవి ఉగ్రరూపిణిగా దర్శనం ఇస్తారు. శ్రీ చాముండేశ్వరి దేవాలయం దగ్గర మహా నందీశ్వరుని పెద్ద శిల్పం జీవ కళ ఉట్టి పడుతుంటుంది. దేవాలయాన్ని పెద్ద పెద్ద నల్లని రాతి పలకలతో నిర్మించారు. సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఇది. మొదట్లో రాజ వంశస్థులకి మాత్రమే దేవి దర్శనం ఉండేది. ఆ తరువాత ప్రజలకి జగన్మాత దర్శనం అనుగ్రహం లభించింది. మైసూరు రాజులూ చామరాజ, ఒడయార్ వంశస్థులు దేవి దాసులు అయ్యారు. ఇప్పటికి రాజవంశీకుల ఆధ్వర్యంలోనే దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ చాముండేశ్వరి దేవిని దర్శించుకుని కొల్లూరు శ్రీ మూకాంబిక దేవి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. ఆ ఆలయం ఇక్కడకు దగ్గర కూడా.– ఈఎస్ మాధవన్, విశాఖపట్నం (చదవండి: సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..) -
సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..
తిరుపతి సమీపంలోని రాయలచెరువులో ఉన్న శ్రీ శక్తి పీఠం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని ఈ శ్రీ శక్తి పీఠాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పీఠం భారతీయ సనాతన సంస్కృతి, యోగ విద్యలకు నిలయంగా అలరారుతోంది. ఈ పీఠాన్ని మాతాజీ రమ్యానందభారతీ స్వామిని (సిద్ధాశ్రమ యోగి) నిర్వాహిస్తున్నారు. ఆమె ధర్మాచరణ ప్రచారంలో భాగంగా మన భాగ్య నగరానికి విచ్చేసిన నేపథ్యంలో మన సాక్షి ఆ అమ్మతో సంభాషించి..మన పాఠకులుకు కలిగే ఎన్నో దర్మసందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. మరి అవేంటో సవివరంగా చూద్దామా.."శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్న రీతిలో సామాన్యులు సైతం సులభంగా ఆ భగవంతుని కృపకు ఎలా పాత్రులు కాగలరు, అలాగే శ్రీ విద్యా ఉపాసన, సులభంగా ఇంట్లోనే చేయడం, యజ్ఞ యాగ క్రతువులు ఏవిధంగా చేయొచ్చు, ఇంకా..మరకతవర్ణ కాళిదేవి విశిష్టత, క్షుద్ర పూజలు ఉన్నాయా..? తదితర ధర్మ సందేహాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!తిరుపతి శ్రీశక్తి పీఠాధిపతి మాతాజీ రమ్యానందభారతీ స్వామిని జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామివారి ప్రధాన శిష్యులలో ఒకరు. ఆమెను స్వయంగా సిద్ధేశ్వరానందభారతీ స్వామివారే "సిద్ధాశ్రమ యోగి"గా అభివర్ణించారు. మాత రమ్యానంద భారతీ స్వామి ప్రస్థానం డాక్టర్గా మొదలైన ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసిన గొప్పయోగి ఆమె. సామాన్య భక్త జనం మదిలో మెదిలో ఎన్నో సందేహాలను చిరుదరహాసంతో నివృత్తి చేసేలా అద్భుతమైన పరిష్కార మార్గాలను అందించారు. అవేంటంటే.సువాసిని పూజ ప్రధానోద్దేశ్యం? ఎందుకోసం?లలితాదేవిని "సువాసినర్చన ప్రీత" అని లలితా త్రిశతి మంత్రల్లో ఉంటుంది. అంటే దీని అర్థం సువాసినులను (భర్తతో కూడిన స్త్రీలను) పూజించడం (అర్చించడం) వల్ల సంతోషించే దేవత అని. ఇక్కడ సువాసినీ: అంటే సౌభాగ్యవతి, పసుపు కుంకుమలతో ఉన్న స్త్రీ. లలితా దేవిని సువాసినీ పూజ ద్వారా ఆరాధిస్తే, ఆమె అత్యంత ప్రసన్నురాలై భక్తుల కోరికలను నెరవేరుస్తుందని లలితా త్రిశతి తెలియజేస్తుంది. అలాగే ఎక్కడ యత్ర నార్యంతు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! అన్న ఆర్యోక్తిని చాటి చెప్పేలా ఈ పూజలను నిర్వహిస్తున్నామని చెప్పారు అమ్మ రమ్యానంద భారతీ. అదీగాక జనవరిలో తిరుపతి క్షేత్రంలో కలియుగ వేంకటేశ్వరుడు, పద్మావతి దేవి వకుళమాత ఉన్న ఆ పుణ్యక్షేత్రంలో దశసహస్ర సువాసినీ పూజ జగడమే గాక గిన్నిస్ రికార్డులకెక్కిన సంగతి కూడా తెలిసిందే. స్తీల గొప్పతనం, వారిని గౌరవించటం గురించి సమాజానికి తెలియజేయడమే ఈ పూజ ప్రదానోద్దేశ్యమని అన్నారామె.పంచాయతన పూజ..పంచాయతన సమేత/పూజ అంటే..?హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా స్మార్త సంప్రదాయంలో పంచాయతన పూజ (ఐదుగురు ప్రధాన దేవతల ఆరాధన) చాలా ముఖ్యమైనది.పంచాయతన 'పంచ' (ఐదు) + 'ఆయతన' (స్థానం/నివాసం). ఐదుగురు ప్రధాన దేవతల సమూహం.దేవతలు: శివుడు, విష్ణువు, శక్తి (దేవి), గణపతి, మరియు సూర్యుడు.ఉద్దేశ్యం: ఆది శంకరాచార్యులచే ప్రచారం చేయబడిన విధానం ఇది. వివిధ ఆరాధనా మార్గాల (శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలైనవి) మధ్య ఐక్యతను తెస్తుంది.పంచాయతన సమేతపైన పేర్కొన్న ఐదుగురు దేవతలను ఒకే సమయంలో, నిర్దిష్టమైన స్థానాల్లో ఉంచి పూజించటం. క్తుడు తన ఇష్ట దైవాన్ని (శివుడు, విష్ణువు మొదలైనవారు) మధ్యలో ఉంచి, మిగిలిన నలుగురిని నాలుగు దిక్కులలో ఉంచి పూజిస్తారు. ఉదాహరణకు, శివుడు ప్రధానమైతే, అది "శివ పంచాయతనం" అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇష్టం దైవం మధ్యలో ఉంచి మిగిలిన వారిని పరివార దేవతలుగా పూజించటం. తంత్రం అంటే..తంత్రం అంటే.. మనల్ని రక్షించేదాన్ని తంత్రం అంటారు. అవి చాలా రకాలు ఉదాహరణకు శ్రీ విద్యా తంత్రం మేరుశాస్త్ర తంత్రం అని పలు రకాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో. అదీగాక సమస్త శాస్త్రంలో తంత్ర శాస్తం ఉత్తమం అని, వేద సమ్మతమైనదని మన పురాణాలే నొక్కి చెబుతున్నాయి. దేవతకు ఎటువంటి పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, ఏవిధంగా ఆరాధించాలి వంటివే ఈ తంత్రాలు. ఏ సమయంలో పూజ చేయాలి, ఎలాంటి హోమాలు చేయాలి. వీటి గురించి వివరించేది తంత్ర శాస్త్రం.కాళి అంటే అరుణ వర్ణం, శ్యామ వర్ణం మరకతవర్ణ కాళి అంటే..?కాలంతో ప్రకాశించే దేవి కాబట్టి నలుపు అని అంతా భావించి అందరూ ఆ మాతను నల్లనిదిగా చెప్పారు. కానీ ప్రతీదేవతకు సత్వ, తామస, రాజస లక్షణాలు ఉంటాయి. తామస లక్షణం కలిగింది నల్లటి కాళి, శ్యామా కాళీ. ఇక శ్రీశక్తిపీఠంలో కొలువుదీరిన మరకతవర్ణం కాళి అంటే..అక్కడ అమ్మ మరకతవర్ణంతో ప్రకాశించాలని ఆదేశింంచిదని, అందువల్ల ఈ ఏర్పాటు చేశామని మాత రమ్యానంద భారతీ చెప్పారు. అదీగాక ప్రకృతి రూపమే మరకతవర్ణం. ఇక్కడ మరకతవర్ణం అంటే చిరునవ్వుతో ప్రేమ స్వరూపిణీగా కనిపించే కాళిమాత. త్వరగా భక్తులను గ్రహిస్తుంది. మరకతవర్ణశిలపై చెక్కిన దేవత. ఇక్కడ కొలువుదీరిన సిద్ధేశ్వరుడు సైతం మరకతవర్ణమే. అంతేగాదు ఈ మరకతవర్ణం ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని అందిస్తుంది. కోరుకున్న సంకల్పం నెరవేరడానికి మరకతవర్ణంలోని దేవతలను పూజించే ఆచారం మన పురాణాల్లో కూడా ఉంది.శ్వేత పాతాళ వారాహి అంటే..?హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయాడు. ఆయన బ్రహ్మదేవుడి గురించి తప్పస్సు చేసినట్లు పురాణాల్లో విన్నాం, చదివాం. కానీ ఆయన వారాహి దేవి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే. మరణం లేని వరం కావాలని కోరాడు. అందుకు అమ్మ సమ్మతించకపోవడంతో హిరణ్యాక్షుడు తెలివిగా నువ్వే సంహరించాలి..అలాగని ఆమెనే స్వయంగా సంహరించకుండా ఉండేలా వరం కోరతాడు. అమ్మ ప్రసన్న వదనంతో తథాస్తు అంటుంది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూమిని పాతాళలోకంలో దాచే ప్రయత్నం చేస్తాడో అప్పుడు మానవులకు దేవతాలకు భూ కష్టాలను నివారించేందుకు విష్ణువు సమాయక్తమవుతాడు. అప్పుడు వారాహి దేవిలోని శ్వేత వరాహం విష్ణువులో ప్రవేశింపచేస్తుంది. దాంతో విష్ణువు వరాహరూపం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. అలా వచ్చిందే శ్వేత వరాహం. ఆమె వ్యవసాయ దేవత కూడా. అందువల్ల భూ సంబంధమైన కష్టాలు, ఆస్తి తగదాలతో సతమతమయ్యే వాళ్లు ఈ అమ్మ పూజించి ఆ సమస్యలను పోగొట్టుకుంటారని చెప్పారు. ఇంట్లోనే హోమాలు, యాగాలు చేయొచ్చా?అయితే ఇలాంటి క్రతువులు ఇంట్లోనే చేయడం అనేది సులభం కాదని అన్నారు. అలాగే మన పురాణాల్లో చూసినా కూడా ఎక్కడా కూడా.. పలాన పర్వతం, దేవాలయం, అడవుల్లో చేసినట్లే ఉంటాయి. పైగా ఓ క్షేత్రం, పీఠం అని కూడా ఉంటుంది. అంటే అక్కడ ప్రాణ ప్రతిష్ట చేసి ఎంతో నిష్టతో పూజలు కైంకర్యలు నిర్వహిస్తారు. పైగా అక్కడ అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. అందుల్లో అలాంటి పీఠాలలో లేదా దేవాలయాలు, ప్రుమఖ పుణ్యక్షేత్రాల్లోనే హోమాలు, యాగాలు చేయడం శ్రేష్టమని అన్నారామె. అలాగే అంత ఖర్చు పెట్టలేని వారు, తమ శ్రీశక్తిపీఠంలో చేయించుకోవచ్చని, ఇక్కడ ఉచితంగానే నిర్వహిస్తామని, అన్ని తామే ఇస్తామని చెప్పారామె.శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా?ఎలా పూజించాలి?యంత్రంలలోకెల్లా గొప్పది శ్రీయంత్రం..విగ్రహాన్ని గానీ, యంత్రాన్ని గానీ తెచ్చి ప్రాణప్రతిష్ట చేస్తే నిత్య పూజలు, నైవేద్యం పెట్టాలి. ప్రాణ ప్రతిష్టలేకుండా విగ్రహం, యంత్రం పూజించినా ఎలాంటి దోషం లేదు. ఎప్పుడైతే ప్రాణప్రతిష్టం చేస్తామో అక్కడ అమ్మవారి వచ్చి కూర్చోంటుంది కాబట్టి అనునిత్యం పూజ చేయాలి. అయితే గృహస్థులకు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆటంకాలు వస్తాయి. అలాంటి సందర్భంలో బియ్యం డబ్బాలో ఉంచుకుంటే సరిపోతుంది. కానీ ఇంట్లో మాత్రం ప్రాణప్రతిష్ట చేయకుండా పెట్టుకుని పూజించొచ్చు. ఎలాంటి సమస్య లేదన్నారామె.క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయా? అది నిజమేనా?ప్రకృతి ఉంటే వికృతి ఉంటుంది. దైవం ఉంటే దెయ్యం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అంత నిష్టగా క్షద్రప్రయోగాలు చేయడం లేదు గానీ మనుషులంతా కేవలం తమ నెగిటివ్ వైబ్రేషన్స్తో అవతవాళ్లపై ప్రయోగాలు చేస్తున్నారని చమత్కరించారామె. తపస్సుకి, మంత్రానికి అధిదేవతలు దేవుళ్లు. దేవతా సాధన చేసేవాళ్లు, మానసిక పరిస్థితి స్ట్రాంగ్గా ఉన్నవాళ్లపై ఇలాంటి ప్రయోగాలు అంతగా పనిచేయవన్నారు. ఆందోళనలు, బలహీన మనస్సు ఉన్నవారు సులభంగా ఆ ప్రభావానికి గురవ్వుతారని అన్నారు. ఎవ్వరూ ఎలాంటి ప్రయోగాలు చేసినా..మీరు తట్టుకునేలా స్ట్రాంగ్గా మారండి. భగవంతుడి సాధన చేయండని పిలుపునిచ్చారామె. మరి ఎవరైనా ప్రయోగాలు చేస్తే..వాటి లక్షణాలు కనిపిస్తాయా? అంటే ఈజీగా తెలుసుకోవచ్చన్నారు. కొన్నింటికి పరిష్కారమార్గం తెలుసుకునే వ్యవధి ఉండదని, కొన్నింటికి మాత్రం సమయం ఉంటుందని అన్నారు కావున సకాలంలో మంచి గురువులని ఆశ్రయించి వాటి నుంచి సులభంగా బయటపడొచ్చని అన్నారు.వామాచారం అంటే..ఏకశ్వేరోపాసనే అసలైన వామాచారం. ఒకే దేవుడిని పూజిస్తా అనేదే వామాచారం. ఇందులో సరైన గురువు దొరికితే ఫలితం రావొచ్చు. మన పురాణాల్లో నరకాసురుడి దీన్ని అనుసరించి శక్తులు ఎన్ని సంపాదించినా కామాఖ్య దేవి వెళ్లిపోయింది అన్న విషయాన్ని గుర్తుచేశారామెడాక్టర్ కమ్ ఆధ్యాత్మిక వేత్తగా మంత్రం అనారోగ్యం నుంచి రక్షించగలదా?ఆధ్యాత్మికతలోనే ఎన్నో వైద్య రహస్యాలు ఉన్నాయి. మణి మంత్ర, ఓషధులతో ఎన్నో రోగాలను నయం చేయొచ్చని అన్నారు. తాను వైద్యాన్ని మంత్ర సారాన్ని అనుసంధానిస్తు..కొన్ని పుస్తకాలను సైతం రాశానని చెప్పారు. మరింత పూర్తివివరంగా ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి. (చదవండి: ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!) -
ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిరోజుల ముందు తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం(ఏప్రిల్ 28, 2026) తెల్లవారుజామునే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్న ఆయన, అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన విజయ్, స్వామివారి ‘విశ్వరూప దర్శనం’లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రసాదంతో పాటు వెండి ‘వేల్’ను బహుకరించారు. ఇది మత విశ్వాసాలకి సంబంధించినది మాత్రమే కాదు..సర్వమత సామరస్యానికి అతీతంగా చేసిన ఒక సంజ్ఞ కూడా. ఈ నేపథ్యంలో ఆ ఆలయం ప్రత్యేకత, ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ తిరుచెదూర్ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంది. సుబ్రమణ్యస్వామి పిలవబడే మురుగన్ దేవునికి చెందినదే ఈ తిరుచెందూర్ ఆలయం. మరుగన్ ఆరు నివాసాలో ఒకటిగా పేరొందిన మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ గుడి తమిళ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికత వంటి అపార ప్రాముఖ్యత కలిగిన ఆలయం. చరిత్ర..ఈ ఆలయం చరిత్ర ప్రాచీన కాలం నాటిది. దీని ప్రస్తావన తమిళ సంగం సాహిత్యం కనిపిస్తుంది ఇక్కడ మురుగన్ దేవుడు రాక్షసుడైన సూరపద్మన్తో పోరాడి ఓడించాడని నమ్ముతారు. ఈ పౌరాణిక ఘట్టాన్ని సూరసంహారంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా, పాండ్య, చేర, చోళ, విజయనగర పాలకులతో సహా వివిధ తమిళ రాజవంశాలు దీని అభివృద్ధికి దోహదపడ్డారు. అలాగే, 17వ శతాబ్దంలో డచ్ వారి దండయాత్ర సమయంలో, కొన్ని విగ్రహాలను తీసుకువెళ్లారు, కానీ తరువాత వాటిని భక్తులు తిరిగి కనుగొనడం విశేషం.ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పానికి నిలయం. ఇందులో విస్తృతమైన శిల్పాలు, స్తంభాల మండపాలు, ఎత్తైన గోపురాలు ఉంటాయి. ఇక్కడ సుమారు 137 అడుగుల ఎత్తులో ఉన్న 9-అంచెల రాజగోపురం నుంచి సముద్రాన్ని వీక్షించడం ప్రధాన ఆకర్షణ. అలాగే ఇక్క ప్రధాన గర్భగుడిలో యోగ భంగిమలో ఉన్న మరుగన్ దేవుడు వల్లి, దేవసేన సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. అంతేగాదు ఇక్కడ మురుగన్ వల్లి వివాహాల గాథలతో ముడిపడి ఉన్న ఒక గుహ కూడా సమీపంలో ఉంది. అలాగే సముద్రానికి సమీపంలో ఉన్న సహజ మంచినీటి ఊట నాజికినారును కూడా భక్తలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వెనక్కి తగ్గిన సునామీ..2004 డిసెంబర్లో వచ్చిన సునామీ తమిళనాడు తీరంపైనా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సునామీ కారణంగా మిగతా ప్రాంతాల్లో సముద్ర జలాలు ముందుకు రాగా.. తిరుచెందూర్లో మాత్రం సముద్రుడు వెనక్కి తగ్గాడు. దీంతో సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నీటి వల్ల ఈ ఆలయానికి ఎలాంటి హాని జరగదనే వరం ఉందని చెబుతారు.ఆలయ ఆచారాలు..ఆలయం సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.సాంప్రదాయబద్ధంగా రోజుకు ఆరుసార్లు మురుగన్ పూజ నిర్వహిస్తారు.దేవుడికి పాలు, చందనం, పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు.ఆలయంలో భక్తులు భక్తికి చిహ్నంగా వేల్స్ సమర్పించి, తలనీలాలు సమర్పించుకుంటారు.ఎలా చేరుకోవాలంటే..సమీప విమానాశ్రయం - తూత్తుకుడి విమానాశ్రయం (సుమారు 40 కి.మీ.), మదురై విమానాశ్రయం (సుమారు 190 కి.మీ.) ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.తిరుచెందూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన పట్టణాలతో అనుసంధానించబడి ఉంది.మదురై, తిరునెల్వేలి, తూత్తుకుడి నుంచి ఈ పట్టణానికి బస్సుల ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
మంచుకొండల్లో.... మహాన్నదానం
చుట్టూ మంచుకొండలు... ఓ వైపు నది... మరోవైపు లోయ... అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇబ్బంది. తీవ్రమైన చలిలో సాగే కేదార్నాథ్ యాత్రలో తెలుగు రాష్ట్రాల భక్తులకు ఆహారం దొరకడం అంత సులభం కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాకు చెందిన కొందరు భక్తులు భక్తికి సేవనే మార్గంగా ఎంచుకుని కేదార్నాథ్కు వచ్చే భక్తులకు ఉచితంగా భోజనం, అల్పాహారం, వసతి అందించాలని సంకల్పించి ‘కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి’ పేరుతో మంచుకొండల్లో తెలుగు భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. 2015 సంవత్సరంలో సిద్దిపేటకు చెందిన భక్తులు కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు. అక్కడ భోజనం లభించక వారు చాలా ఇబ్బంది పడ్డారు. డబ్బులు పెట్టినా సరైన ఆహారం లభించని పరిస్థితి. దీంతో తాము పడ్డ ఇబ్బందులు మిగతా భక్తులు పడకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట కు చెందిన మిత్రులు కొందరు 31 మంది సభ్యులతో కేదార్నాథ్ సేవా సమితి పేరిట ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కేంద్రాల ద్వారా మూడుచోట్ల అన్నదానం అందిస్తున్నారు. అన్నదాన సేవలో సమితి ప్రతినిధులు తమవంతు పాత్ర పోషిస్తూనే రోజూ 10 వేల నుంచి 12వేల మందికి భోజనాన్ని అందిస్తున్నారు. అలాగే దాదాపు 400 మందికి ఉచిత వసతి సైతం ఏర్పాటు చేశారు.ఆహారం... అందించే వేళలుతెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ జరుగుతున్న ఈ సేవలో ఉదయం 7 నుంచి 11 వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు భోజనం అందిస్తారు. సాటి భక్తుల కడుపు నింపడంలోనే తమ ఆనందాన్ని, ఆధ్యాత్మికతను వెతుక్కుంటున్నారు సమితి ప్రతినిధులు. అన్నదానం... దైవ సంకల్పంఅన్ని దానాలలో అన్నదానం మిన్న. మానవ సేవతో మనిషి జీవితానికి పరిపూర్ణ సార్థకత లభిస్తుంది. సిద్దిపేటకు చెందిన పలువురి సహకారంతో 2019లో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితిని ఏర్పాటు చేశాం. దక్షిణ భారతదేశంలోనే తొలి లంగర్ను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు ఇతర భక్తులకు భోజనాన్ని అందిస్తున్నాం. మహాపుణ్య క్షేత్రమైన కేదార్నాథ్లో అన్నదానం చేయడం దైవ సంకల్పంగా భావిస్తున్నాం.– చీకోటి మధుసూదన్, కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట -
కర్ణుని చావుకి కారణాలెన్నో..!
మహాయోధుడిగా... దానకర్ణుడుగా పేరు పొందిన‘కర్ణుని చావుకు కారణాలెన్నో...’ అనే నానుడి ఎలా వచ్చిందో తెలుసుకుందాం....మహాభారత యుద్ధంలో కర్ణుడు 17వరోజున తన తమ్ముడైన అర్జునుని చేతిలో వీరమరణం పొందాడు. అర్జునుడు ఎంతో గర్వంగా శ్రీకృష్ణునితో మహాయోధుడైన కర్ణుని అంతమొందించానని చెప్పడంతో... నీవు చంపడమేమిటి... నీకన్నా ముందు ఆరుగురు వ్యక్తుల వల్ల కర్ణుడు మరణించాడని శ్రీకృష్ణుడు చెప్తాడు.విద్య నేర్చుకునే సమయంలో గురువైన పరశురామునితో తాను బ్రాహ్మణుడనని, తనకు బ్రహ్మాస్త్రంతో పాటు ఇతర అస్త్రాల ప్రయోగాలన్నీ నేర్పమని కర్ణుడు కోరాడు. అందుకు సమ్మతించిన పరశురాముడు అన్ని అస్త్రాల ప్రయోగాలను నేర్పించాడు. అయితే ఒకరోజు పరశురాముడు, కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తుండగా ఒక కీటకం అతని తొడను తొలచసాగింది. రక్తం ఏరులై పారుతున్నప్పటికీ కర్ణుడు బాధను దిగమింగి కదలక ఉండిపోయాడు. అయితే ఆ రక్తప్రవాహానికి మెలకువ వచ్చిన పరశురాముడు, విషయాన్ని అడగటంతో, తాను బ్రాహ్మణుడు కాదని నిజం చెబుతాడు కర్ణుడు. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన పరశురాముడు నువ్వు నేర్చుకున్న అస్త్రాలన్నీ నిష్ప్రయోజనమవుతాయని, సరియైన సమయానికి పనికిరాకుండా పోతాయని శాపం ఇచ్చాడు. అలాగే మహాభారత యుద్ధంలో అతను నేర్చుకున్న అస్త్రాలు ఏవీ జ్ఞాపకానికి రాక కర్ణుని మరణానికి ఒక కారణం అయింది.... కర్ణుడు విలువిద్య అభ్యసిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక బాణం ఆవుకి తగిలింది. అదే సమయంలో ఆవు యజమాని అక్కడికి వచ్చి తన ఆవు పడుతున్న బాధను చూసి ఆక్రోశంతో నీవు కూడా యుద్ధ సమయంలో రోదిస్తూ నిస్సహాయంగా మిగిలిపోయి చనిపోతావని శాపం ఇచ్చాడు.... కర్ణుడు తన రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక చిన్నపిల్ల మట్టికుండలో తీసుకెళ్తున్న నెయ్యి ఒలికి పోయిందని, ఇంటికి వెళ్తే తన తల్లి తిడుతుందని తనకు అదే నెయ్యి కావాలని ఏడుస్తూ కర్ణుని అడిగింది. భూమిని పిండి నెయ్యిని తీసి ఇవ్వడంతో గాయాలతో బాధపడిన భూదేవి యుద్ధ సమయంలో నీ రథచక్రం నేలలో దిగిపోతుందని శపించింది.... కర్ణుడు తన పుత్రుడే అని తెలుసుకున్న కుంతి శ్రీ కృష్ణుని సలహా మేరకు యుద్ధం జరుగుతున్న సమయం లో ఒక రాత్రివేళ కర్ణుని వద్దకు వెళ్లి జన్మవృత్తాంతం తెలిపి, నీ సోదరులను చంపవద్దని కోరగా అర్జునుడు మినహా మిగిలిన నలుగురిని వదిలివేస్తానని మాట ఇస్తాడు కర్ణుడు.....సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుని చంపడం ఎవరివల్లా కాదని గ్రహించిన ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుని కోసం ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో కర్ణుని వద్దకు వెళ్లి కవచ కుండలాలు దానం చేయమని కోరగా, ప్రాణాలకు తెగించి వాటిని కర్ణుడు కోసి ఇచ్చాడు. ఇది కూడా కర్ణుని మృతికి కారణమైంది.... అన్నిటికన్నా ముఖ్యంగా మహాభారత సంగ్రామం లో ఒంటరివాడై నిస్సహాయంగా ఉన్న కర్ణునిపై బాణం సంధించమని అర్జునుని ప్రేరేపిస్తాడు శ్రీకృష్ణుడు. ఇది న్యాయం కాదని, అర్జునుడు చెప్పినప్పటికీ అభిమన్యుని ఒంటరివాడిగా చేసి చంపడం న్యాయమా... అని ప్రశ్నిస్తూ యుద్ధనియమాలు పక్కనపెట్టి కర్ణుని సంహరించమని సూచిస్తాడు.... ఏది ఏమైనా అధర్మం వైపు నిలబడడం వల్లే కర్ణుని మరణం సంభవించిందని చెప్పుకోవచ్చు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
ముక్తి మార్గం... ఒక ఆధ్యాత్మిక ప్రయాణం
సాధారణంగా మనిషి తనను తాను శరీరం, పేరు, కులంతో గుర్తుంచుకుంటాడు. దీనివల్ల రాగద్వేషాలు, భయం, దుఃఖం కలుగుతాయి. ముక్తి అనేది కేవలం మరణానంతరం లభించేది కాదు, జీవించి ఉండగానే పొందే స్థితి (జీవన్ముక్తి). వైరాగ్యం– లౌకిక విషయాల పట్ల మోహం తగ్గించుకోవడం. ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవడం. ఇతరులకు హాని చేయకుండా జీవించడం. సరైన దిశానిర్దేశం చేసే గురువును ఆశ్రయించడం. ముక్తి అంటే ఎక్కడికో వెళ్లడం కాదు, మనలోని దైవత్వాన్ని మనం గుర్తించడం. మన ప్రవృత్తికి ఏ మార్గం సరిపోతుందో దానిని ఎంచుకుని సాగడమే ముక్తికి అసలైన బాట.ముక్తి లేదా మోక్షం అంటే పునర్జన్మ లేని స్థితిని పొందడం. దేహం ముసలిదవుతుంది, మనస్సు మారుతుంటుంది, కానీ వీటన్నింటినీ గమనిస్తున్న ‘సాక్షి’ ఒకరు ఉన్నారు. ఆ సాక్షి లేదా ఆ చైతన్యమే అసలైన దైవత్వం. దైవత్వానికి., మనకు మధ్య ఉన్న అతిపెద్ద అడ్డుగోడ ‘అహం’ ‘నేను చేస్తున్నాను’, ‘ఇది నాది’ అనే భావన తగ్గినప్పుడు, మనలోని అనంతమైన దైవశక్తి వెలుగులోకి వస్తుంది. సముద్రంలోని అల నేను సముద్రాన్ని కాదని భావిస్తే అది అహంకారం, తాను సముద్రంలో భాగమే అని గుర్తిస్తే అది జ్ఞానం. గంగా, యమునా వంటి నదులు వేర్వేరుగా ప్రవహించినా, సముద్రంలో కలిసిన తర్వాత అవి సముద్రమే అయిపోతాయి. అలాగే జీవులన్నీ వేర్వేరుగా కనిపించినా, వాటి మూలం ఆ పరమాత్మే. మట్టితో చేసిన కుండ, ప్రమిద, బొమ్మలు.. పేర్లు వేరైనా వాటన్నింటిలో ఉన్న అసలు వస్తువు మట్టే. అలాగే జగత్తులోని రూపాలు వేరైనా, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నతో మొదలై, దేహం అనిత్యమని, ఆత్మ శాశ్వతమని తెలుసుకోవడం. పరమాత్మపై పరిపూర్ణ మైన ప్రేమను, శరణాగతిని కలిగి ఉండటమే భక్తి మార్గం. కలియుగంలో ఇది అత్యంత సులభమైన మార్గంగా చెప్పబడింది. ‘దైవత్వాన్ని గుర్తించడం’ అనే మాట వినడానికి సరళంగా అనిపించినా, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. దీనిని సాకారం చేసుకోవడానికి మన గ్రంథాలు కొన్ని ఆచరణాత్మక మార్గాలను సూచించాయి. అదేమంటే... రమణ మహర్షి బోధించినట్లుగా ‘నేను ఎవరు?’ అనే విచారణ చేయడం. చెరువు నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే అందులో చంద్రుని ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే దైవత్వం ప్రతిఫలిస్తుంది. షరతులు లేని ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా దైవానికి దగ్గరవ్వవచ్చు. ‘తత్వమసి‘ అంటే ‘దైవం నీవే’. తత్వమసి అనేది కేవలం చదవడానికి వాక్యం కాదు, అది ఒక అనుభూతి. ‘నేను పరిమితమైన వాడిని’ అనే అజ్ఞానం నుంచి ‘నేను అనంతమైన వాడిని’ అనే జ్ఞానం వైపు నడిపించే మహా మంత్రం ఇది. ఈ సత్యాన్ని గ్రహించిన మనిషి జీవన్ముక్తుడు అవుతాడు.మనం దైవాన్ని గుడులలో, గోపురాలలో వెతుకుతాము, కానీ అసలైన దేవుడు మన హృదయస్థానంలో ఉంటాడు. ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చుని, ఆలోచనలను గమనిస్తూ ఉంటే, ఆ నిశ్శబ్దంలోనే దైవత్వం అనుభవంలోకి వస్తుంది. బాహ్య ప్రపంచపు సందడిని తగ్గించి, అంతరంగంలోకి ప్రయాణించడమే దీనికి మార్గం. ‘అందరిలోనూ ఉన్నది ఒకే దైవం‘ అని గుర్తించడం. ఎదుటి వారిని చూసినప్పుడు వారి రూపం కంటే, వారిలో ఉన్న జీవాన్ని (దైవత్వాన్ని) గౌరవించడం నేర్చుకోవాలి. ‘అద్వైతం’ అంటే ఇదే. ఇది ఏదో ఒక రోజులో జరిగేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
లిటిల్స్ కు బుద్ధ స్టోరీస్
‘సకల సౌకర్యాలూ ఉన్నాయి. మనఃశాంతి లేదు’ ‘ఎంత ప్రయత్నించినా కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నాను’ ‘చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడుతుంటాను’‘ఆత్మన్యూనతతో ఏ పనీ చేయలేకపోతున్నాను’... ఇలాంటి మాటలు ఎక్కడో ఒకచోట వినబడుతుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారాలు వ్యక్తిత్వ వికాసనిపుణులు, మోటివేషనల్ స్పీకర్స్ మాటల్లోనే వెదుక్కుంటాం. అయితే బుద్ధుడి కథల్లో ఎన్నో సమస్యలకు, ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. వాటిని పిల్లలతో చదివిస్తే... నైతిక విలువలతో కూడిన వారి భవిష్యత్కు ఆ కథలు పునాదిగా పనిచేస్తాయి. మచ్చుకు కొన్ని కథలు...సూత్రాలు కాదు... స్ఫూర్తి ముఖ్యంబుద్దుడు తన శిష్యుడితో కలిసి దట్టమైన అడవి గుండా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. వారికి ఎదురుగా ఒక నది వచ్చింది. వారు నదిలోకి అడుగుపెట్టబోతుండగా ఒక యువతి పరుగెత్తుకుంటూ వచ్చి నది దాటడానికి సహాయం చేయాల్సిందిగా వేడుకుంది. బుద్ధుడు క్షణం కూడా సంకోచించకుండా ఆ యువతిని తన వీపుపై ఎత్తుకొని నదిని దాటాడు. ఆ తరువాత... తనను వేధిస్తున్న ప్రశ్నను బుద్ధుడిని అడిగాడు శిష్యుడు....‘ఓ మహర్షి! మనం బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాం. అయినా మీరు ఆ స్త్రీని మీతోపాటు నదిలోకి తీసుకెళ్లారు. ఇది మన సూత్రాలకు విరుద్ధం కాదా?’బుద్దుడు నవ్వి ఇలా అన్నారు: ‘కుమారా! నేను అవసరంలో ఉన్న తోటి మనిషికి సహాయం చేయడానికి ఆ స్త్రీని ఒడ్డున వదిలి పెట్టాను. నువ్వే ఆమెను ఇంకా నీ మనసులో మోస్తున్నావు’ చివరకు శిష్యుడు గ్రహించాడు. దీక్షలోని పదాలు ముఖ్యం కాదు అందులోని స్ఫూర్తి ముఖ్యం అని. మనకు ఉండే భౌతిక భారం కన్నా మన ఆలోచనలే పెద్ద భారం అని.వజ్రాల కంటె విలువైన సందేశంఒక శిష్యుడు బుద్దుడి దగ్గరకు వచ్చి ‘పేదరికంతో విసిగివేసారి పోయాను. నాకు సంపద కావాలి’ అన్నాడు. అప్పుడు బుద్దుడు ‘ఈ చెట్ల వరుసను చూడు. ప్రతి చెట్టు కింద ఒక నిధి పెట్టె పాతిపెట్టి ఉంది. నువ్వు దానిని తీసుకొని ధనవంతుడివి కావచ్చు’ అన్నారు. ఆ శిష్యుడు చాలా సంతోషించి తవ్వడానికి సిద్ధమయ్యాడు. మొదటి చెట్టును తవ్వడం మొదలు పెట్టిన కొద్దిసేపటికి వెండి ఉన్న నిధి పెట్టె దొరికింది.అతను కాసేపు ఆలోచించి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రెండవ చెట్టు కింద తవ్వగా బంగారంతో నిండిన ఒక పెట్టె దొరికింది. అతడు కాసేపు ఆలోచించి ఇంకా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టుకింద ఇప్పటివరకు చూసిన వాటిలోకెల్లా అతి పెద్ద పెట్టె ఉంది. తన జీవితంలో ఎన్నడూ చూడని విలువైన వజ్రాలు అందులో ఉన్నాయి. అయినా, అతనికి ఇంకా కావాలనిపించింది.చివరి చెట్టు దగ్గరికి వెళ్లి తవ్వాడు. అతడికి ఆశ్చర్యం కలిగేలా ఒక చిన్నపెట్టె కనిపించింది. ఆ పెట్టెలో ఇలా రాసి ఉంది...‘అవకాశాలు నీ దారిలోకి వస్తూనే ఉంటాయి. వాటిని నువ్వు అందిపుచ్చుకోవచ్చు. కానీ మితిమీరిన దురాశ ఎల్లప్పుడూ పతనానికి దారితీస్తుంది’ ఈ సందేశంతో శిష్యుడు గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ తరువాత ఎప్పుడూ దురాశకు లోనుకాలేదు.యానిమేటెడ్ కథలుబుద్ధుడి కథలు యానిమేటెడ్ వీడియోల రూపంలో యూట్యూబ్లో ఉన్నాయి. ‘మ్యాజిక్బాక్స్ ఇంగ్లీష్ స్టోరీస్, ‘గీతాంజలి–కార్టూన్ ఫర్ కిడ్స్’... మొదలైన యూట్యూబ్ చానల్స్లో బుద్ధ స్టోరీస్ ఫర్ కిడ్స్ విభాగాలు ఉన్నాయి. లిటిల్ బుద్ధ: ఏ పీస్ఫుల్ జర్నీ, బుద్దా’స్ లెస్సన్స్, 28–లైఫ్ చేంజింగ్ బుద్దిస్ట్ స్టోరీస్(దట్ విల్ రీషేప్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్), ది బుద్ధ అండ్ ది హోమ్లెస్ మ్యాన్ స్టోరీ, లెజెండ్ ఆఫ్ బుద్ద...ఇలా ఎన్నో యానిమేటెడ్ వీడియోలు (యూట్యూబ్)లో, బుద్ధ విజ్డమ్ స్టోరీస్, బుద్ధ మోటివేషన్ స్టోరీ... మొదలైనవి ఇన్స్టాగ్రామ్లో అందుబాటులో ఉన్నాయి.శంకర ‘మంచి కథలు’తెలుగులో రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి ఉపయోగపడే పుస్తకం...అమరావతి కథలు. సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు పెద్దలకే కాదు పిల్లలకూ బాగా నచ్చుతాయి. ఈ పుస్తకంలో ‘కానుక’ అనే అద్భుతమైన కథ ఉంది. రాకుమారుడు బుద్దుడై తిరిగి వచ్చిన నాటి కథ ఇది. ‘మంగళ వాద్యాలు మోగాయి. వీథుల్లో జనం కిక్కిరిసి ఉన్నారు. అల్లడుగో బుద్దుడు! అల్లదే వెలుగు! వీథుల నిండా వెన్నెల!’ ‘రాజ్యమేలవలసిన రాజు లోకాన్నంతా ఏలుతున్నాడంట!’‘అంత సుకుమారుడు అడవుల ఏ ఎండకాసెనో, ఏ వాన తడిసెనో, ఏ ముళ్లబాట నడిచెనో, ఏ కసరుకాయ కొరికెనో...’ ‘రాజకుమారుడు సన్యాసి అయ్యాడు. రత్నకిరీటం లేదు. మణిహారాలు లేవు. కాషాయాంబరాలతో, చిరునవ్వుతో అందరి కళ్ళలోకి చూస్తున్నాడు. ఆకాశంలోంచి కాంతిగోళం భూమిని తాకినట్టుంది’.. ఇలాంటి వాక్యాలెన్నో మనసుకు హత్తుకుపోతాయి. మనస్సుకు కొంత సమయం ఇవ్వు!ధ్యానం ముగిసిన తరువాత బుద్దుడి దగ్గరకు వచ్చిన ఒక శిష్యుడు ఆయనతో ఇలా అన్నాడు... ‘ఈరోజు నాకు చాలా కోపంగా ఉంది. వృద్ధురాలైన మా తల్లిని చూసుకోవడానికి మా అన్న తిరస్కరిస్తున్నాడు. అతనికి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు’ శిష్యుడు చెప్పింది విన్న బుద్దుడు... ‘దయచేసి దగ్గరలో ఉన్న చెరువు నుండి నా కోసం గిన్నెడు నీళ్లు తీసుకురాగలవా?’ అని అడిగారు. అతడు వెంటనే చెరువు దగ్గరికి వెళ్లాడు. అక్కడ కొన్ని జంతువులు చెరువును దాటి వెళ్లడం వల్ల నీళ్లు మురికి అయ్యాయి. ఆ శిష్యుడు బుద్ధుడి దగ్గరకు వచ్చి ‘చెరువు నీరు తాగడానికి యోగ్యంగా లేవు’ అని చెప్పాడు. ‘మనం ధ్యానం చేద్దాం’ అన్నాడు బుద్దుడు. కొద్దిసేపటి తరువాత...శిష్యుడిని నీళ్లు తీసురమ్మని అడిగాడు బుద్దుడు. చెరువు దగ్గరికి వెళ్లాడు శిష్యుడు. నీళ్లు స్వచ్ఛంగా ఉండడంతో బుద్ధుడికి ఈసారి నీళ్లు తీసుకురాగలిగాడు. నీళ్లు తాగిన బుద్దుడు ఇలా అన్నాడు... ‘నీ మనసు ఒక చెరువులాంటిది. నీకు కోపపూరితమైన ఆలోచనలు వచ్చినప్పుడు బురద నీళ్లలాగే మనసు కూడా నిరూపయోగకరంగా మారుతుంది. మనస్సుకు కొంత సమయం ఇవ్వు. కోపం శాంతించనివ్వు. అప్పుడు నీ మనస్సే నీకు సమాధానం ఇస్తుంది’ -
విశిష్ట ఫలదాయకం... వైశాఖ పూర్ణిమ
వైశాఖ శుద్ధ పూర్ణిమ (వైశాఖ పౌర్ణమి) హిందూ, బౌద్ధ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు. దీనిని ‘బుద్ధ పూర్ణిమ’ అని, ‘మహా వైశాఖి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును కూర్మావతారంలో పూజించడం, నదీస్నానం చేయడం, అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును ఆరాధించడం వల్ల అక్షయ పుణ్యఫలం లభిస్తుందని, చేతనైనంత దానధర్మాలు చేయడం వల్ల నరఘోష తొలగిపోతుందని శాస్త్రోక్తి.విశిష్టతలు: బుద్ధ పూర్ణిమ/జయంతి: సిద్ధార్థుడు జన్మించడం, జ్ఞానోదయం పొందడం, మహా పరినిర్వాణం చెందడం అనే మూడు ముఖ్యమైన ఘట్టాలు ఇదేరోజు జరగడంతో దీనిని ‘త్రివిధ పుణ్యదినం’గా బౌద్ధులు జరుపుకుంటారు.శ్రీ కూర్మ జయంతి: శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన రోజుగా కూర్మ పురాణం చెబుతోంది.ఈ రోజు కూర్మనారాయణుని ఆరాధించడం సత్ఫలితాలనిస్తుంది.సముద్ర/నదీ స్నానం: ఈ రోజున సముద్రంలో లేదా గంగానదిలో స్నానం చేయడం అత్యంత పవిత్రం. కరక్కాయను సముద్రంలో వేసి స్నానం చేస్తే నరదిష్టి, నరఘోష తొలుగుతాయని నమ్మకం.చదవండి: మంచుకొండల్లో ఓంకార నాదంరావి చెట్టు పూజ: వైశాఖ మాసంలో రావిచెట్టుపై విష్ణుమూర్తి కొలువై ఉంటాడని, ఈ పూర్ణిమ రోజు రావి చెట్టును పూజిస్తే శని, బృహస్పతుల అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు లభిస్తాయని పెద్దల మాట.అన్నమాచార్య జయంతి: సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుల వారు జన్మించిన రోజు కావడంతో దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. దానధర్మాలు: ఈ రోజున చేసే జలదానం, వస్త్రదానం, ఆహార దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పురాణోక్తి.– డి.వి.ఆర్. -
నా దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను.. స్వీకరిస్తారా?
ఆమ్రపాలి క్రీ.పూ. 500 సంవత్సర ప్రాంతానికి చెందినది. గౌతమ బుద్ధుని సమకాలికురాలు. ఆమ్రపాలి అంటే ‘మామిడి చిగురు’ అని అర్థం. ఆమ్రపాలికి అంబపాలిక, అంబపాలి, ఆమ్ర అనే నామాంతరాలూ ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులెవరో తెలియదు. వైశాలి నగరంలో మామిడి తోటలో ఒక చెట్టు కింద పసిపిల్లగా ఏడుస్తూ పడి ఉంటే సోమదత్తుడు అనే ఆయన ఇంటికి తెచ్చుకొని ఆ పాపను పెంచి పెద్ద చేశాడు. కౌమార దశలోనే ఆమ్రపాలి అపురూప సౌందర్యవతిగా, అద్భుత నాట్య కళాకారిణిగా ఖ్యాతి గడించింది.లిచ్ఛవి జాతికి చెందిన రాజులకు వైశాలి నగరం రాజధానిగా ఉండేది. ఆ కాలంలో అందమైన స్త్రీలు పెండ్లిచేసుకొని కేవలం ఒక వ్యక్తితో జీవించడం కాక, తమకు నచ్చిన పురుషునితో రోజుకు ఒకరితో గడిపే ఆచారం వైశాలిలో ఉండేది. ఆమ్రపాలి తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అయిన పుష్ప కుమారుని వివాహం చేసుకోవాలనుకొంది. కానీ వైశాలి రాజు మనుదేవుని కన్ను ఆమ్రపాలిపై పడింది. ఆమె పెండ్లి రోజునే పుష్పకుమారుని హత్యచేసి మనుదేవుడు ఆమ్రపాలిని వైశాలి ‘నగర వధు’ (వేశ్య)గా అధికారికంగా ప్రకటించాడు.ఆమ్రపాలి రాజనర్తకిగా నియమింప బడింది. ఆమె జగన్మోహన సౌందర్యం, అసమాన నాట్య కౌశలం ఎంతోమంది రాజులను, ధనవంతులను ఆకర్షించింది. ఆమె నాట్యం చూడటానికి, ఆమెతో గడపటానికి యాభై ‘కార్షపణములు’ వెలగా నిర్ణయింపబడింది. స్వల్పకాలంలోనే ఆమ్రపాలి సంపద ఏ రాజు కోశాగారంలో లేనంతగా పెరిగి పోయింది. అలా రాజనర్తకి, సౌందర్యరాశి అయిన ఆమ్రపాలి రాజాధిరాజుల, ధనవంతుల ప్రాపకంలో అత్యంత ధనవంతురాలై, సుఖంగా జీవించ సాగింది. గౌతమ బుద్ధుడు వైశాలి నగరానికి వచ్చాడు. ఆయన గొప్పదనం గూర్చి చెలికత్తెల ద్వారా విని, ఆయన తన వద్దకు ఎందుకు రాలేదా అని ఆశ్చర్య పడింది ఆమ్రపాలి.ఒకరోజు బుద్ధుడు వచ్చి, ఆమె భవనం ముందు నిలబడి భిక్ష కోరాడు. సమస్త ఆభరణాలూ ధరించి, ద్విగుణీకృత అలంకారాలతో ఆమ్రపాలి బయటకు వచ్చి, తన సౌందర్యవంతమైన రూపలావణ్యాలను ప్రదర్శిస్తూ బుద్ధుని ముందు నిలబడి, ‘‘నా ఈ దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను. స్వీకరిస్తారా’’ అని వగలొలికిస్తూ అడిగింది. ఆమె మాటలు విని కొంతసేపు కండ్లు మూసుకొని, తర్వాత కండ్లను తెరిచి, బుద్ధుడు ఆమ్రపాలితో ‘అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ భిక్షను తప్పక స్వీకరిస్తాను. అందాకా సెలవు‘ అని చెప్పి వెళ్ళిపోయాడు.కొంతకాలానికి ఆమ్రపాలి శరీర పటుత్వం తగ్గింది. వేశ్యావృత్తి వలన ఆమె శరీరాన్ని అనేక రోగాలు చుట్టుముట్టాయి. క్రమంగా ఆమె కుష్ఠురోగి అయ్యింది. కురూపి అయ్యింది. విటులతోబాటు దాసదాసీ జనమంతా దూరమయ్యారు. సంపద నశించి పోయింది. ఆమె వికార రూపం అందరితో అసహ్యించుకోబడింది. సమాజంచే బహిష్కరింపబడిన ఆమ్రపాలి ఊరి బయట ఒక చిన్న కుటీరంలో దుఃఖభూయిష్ట జీవితం గడపసాగింది. ఒకరోజు వర్షం పడుతూండగా సాయంత్రంవేళ, చిరుచీకట్లు అలుముకొంటున్న సమయంలో, తన కుటీర ఆవరణలో కూర్చొని ఉన్న ఆమ్రపాలికి ’అమ్మా’ అన్న పిలుపు వినబడింది. ఒక ఆజానుబాహువు తన దగ్గరకు వస్తూండడం చూసి, బుద్ధుడు అని గ్రహించి, ‘అక్కడే ఆగు. సమీపానికి రావద్దు. నేనొక కుష్ఠు రోగిని’ అనింది ఆమ్రపాలి.‘అమ్మా, మరిచావా నన్ను. ఒకరోజు భిక్షకోరి మీ ఇంటికి వస్తే మీ శరీరాన్నే భిక్షగా ఇస్తానన్నారు. అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు తప్పక స్వీకరిస్తానని అన్నాను. ఇప్పుడు ఆ భిక్షను ఇవ్వమ్మా’ అని ఆర్ద్రంగా పలికాడు బుద్ధుడు. ‘ఆ రోజు నేను నీకు ఇస్తానన్నది అందం, ఆరోగ్యం, యవ్వనంతో కూడిన శరీరాన్ని. ఈ రోజు ఆ దేహం వ్యాధిగ్రస్తమయ్యింది’ అంటూ దూరం జరిగింది ఆమ్రపాలి. చదవండి: సంకల్పం ముందు వైకల్యం ఎంత!దయామయుడైన బుద్ధుడు ‘అమ్మా, అందచందాలతో మాకు అవసరంలేదు. భయంకరమైన రోగంతో దేహం శిథిలమైనా పరివర్తన చెందిన మనసు మీది’ అంటూ మరింత దగ్గరగా రాసాగాడు. ఆయన నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళే ప్రయత్నంలో కిందపడిపోయిన ఆమ్రపాలిని తన రెండు చేతులతో ఎత్తుకొని ‘నా కన్నతల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమెకు సేవ చేసే భాగ్యం నాకు లేక పోయింది. నీలో నా కన్నతల్లిని చూసుకుంటూ సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ’ అంటూ ఆమెను మెల్లగా కుటీరంలోకి చేర్చి, ఆమె తుది శ్వాస విడిచే వరకూ సేవలు చేశాడు కరుణామూర్తి బుద్ధ భగవానుడు.బుద్ధం శరణం గచ్ఛామి– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
144 ఏళ్ల క్రితం కేదార్నాథ్ ఆలయం ఎలా ఉండేదో తెలుసా..!
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ యాత్ర ప్రారంభకానుంది. ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ హిమాలయాలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం, నెలల తరబడి శీతాకాలపు మూసివేత తర్వాత మరోసారి భక్తుల కోసం తలుపులు తెరుచుకోనుంది. ఛార్ధామ్ యాత్ర పేరుతో ఇక్కడకు వచ్చి ఆ మహాదేవుడిని కొలుస్తుంటారు భక్తులు. అయితే ఇప్పుడు ఆధునికత యాత్రను కొంచెం సులభతరం చేయగలిగింది. కానీ వందేళ్ల క్రితం ఈ కేదార్నాథ్ ఎలా ఉండేదో అందుకు సంబంధించిన ఫోటోని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఎలా ఉందంటే..1882లో తీసిన కేదార్నాథ్ ధామ్కు సంబంధించిన మొట్టమొదటి ఛాయాచిత్రాలలో ఒకటిగా భావిస్తున్న ఒక చిత్రాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి రోడ్లు, రైల్వే స్టేషన్లు, హెలికాప్టర్లు ఏవీ లేవని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రయాణం సౌలభ్యం అయిపోయాక..అక్కడున్న అందాల్ని ఆస్వాదించడం మర్చిపోతున్నాం అంటూ ఆలోచింపచేసే ప్రశ్నను లేవనెత్తారు. టెక్నాలజీ సౌలభ్యతను అందివ్వాలేగానీ..ఏదో వచ్చాం, వెళ్లిపోయాం అన్నట్లు కాదు కదా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహీంద్రా. ఆ మంచు కొండల మధ్య కొలువైన ఆ మహా దేవుడి చుట్టుతా ఉన్న అద్భుతాలు, ప్రకృతి రమ్యతను తనివితీరా ఆస్వాదించడం ఓ కళ. అప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణమయ్యేది అనేది పలువురి ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. ఆ విషయాన్నే గుర్తుచేసేలా ఇలా నాటి ఫోటోని షేర్ చేశారు మహీంద్రా. కాగా, కేదార్నాథ్ యాత్ర ఊపందుకుంటున్న తరుణంలో మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. యాత్ర ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లోనే 1.1 లక్ష మందికి పైగా భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సీజన్లో యాత్రికుల రాకపోకలు సజావుగా సాగడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ప్రణాళికే కారణమని ఆలయ అధికారులు అన్నారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సుమారు 3,584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్, శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే దేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. అక్కడి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ప్రతి ఏడాది పరిమిత కాలం వరకు మాత్రమే(ఆరు నెలలు) సందర్శనకు అందుబాటులో ఉంటుంది.Apparently, this is one of the earliest known photographs of the sacred Kedarnath Dham, taken in 1882.Couldn’t take my eyes off it. No roads. No railheads. No helicopters.Just the abode of Lord Shiva, cradled by the HimalayasBack then, the yatra demanded time, endurance,… pic.twitter.com/UfvWVsmLnf— anand mahindra (@anandmahindra) April 26, 2026 (చదవండి: పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...) -
శల్య సారథ్యం అంటే..?
మహాభారత సంగ్రామంలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక శైలి. వారిలో శల్యుడు ఒకరు. ఒకరిపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సాయం చేసే నెపంతో చేతులారా చెడగొట్టడంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడాన్ని శల్య సారధ్యం అంటారు.శల్యుడు మద్ర దేశానికి అధిపతి, పాండురాజుకు రెండవ భార్య అయిన మాద్రికి సోదరుడు. మాద్రి సంతానమైన నకుల, సహదేవులకు మేనమామ. శల్యుడు అస్త్రవిద్య, గదా యుద్ధం, ముఖ్యంగా రథసారథిగా గొప్ప నేర్పరి. అలాంటి శల్యుడు పాండవుల పక్షాన ఉంటే వారిని గెలవడం కష్టమని గ్రహించిన దుర్యోధనుడు ఒక పథకం పన్నాడు. పాండవులను కలవడానికి వెళుతున్న శల్యుడికి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అక్కడక్కడా పెద్దపెద్ద గుడారాలు వేయిస్తాడు. ఆ గుడారాలు పాండవులవేనని అనుకొన్న శల్యుడు వాటిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి సేవకులు శల్యునికి ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి, గౌరవ మర్యాదలు చేసి అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. ఇదంతా పాండవులు తన కోసమే చేశారనుకున్న శల్యుడు విందు ఆరగించి, వెంటనే సేవకునితో తక్షణమే వెళ్లి మీ యజమాని పిలుచుకొని రా... రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతును తెలుపుతానని చెప్పాడు.సేవకులతో పాటు దుర్యోధనుడు రావడంతో ఆశ్చర్యపడ్డ శల్యుడు జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోలేక మహా భారత సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. అనంతరం శిబిరం నుండి బయలుదేరిన శల్యుడు పాండవులను కలుసుకొని జరిగిన సంఘటన వివరించాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడితో మాట్లాడుతూ, కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని, కానీ ఒక సహాయం చేస్తాననే మాట ఇమ్మని శల్యుణ్ణి అడిగాడు. అలాగే, అదేమిటో చెప్పమన్న శల్యుడితో ‘‘రథం తోలడంతో నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని రథాన్ని తోలే అవకాశం వస్తే ఆ సమయంలో కర్ణుని అడుగడుగునా అవహేళన చేస్తూ, మానసికంగా, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాలి’’ అని ధర్మరాజు కోరాడు. అందుకు అంగీకరించాడు శల్యుడు.ఊహించిన విధంగానే మహాభారత సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి అప్పగించారు. కర్ణుని పరాక్రమాన్ని గమనించిన శల్యుడు అడుగడుగునా కర్ణుని అవహేళన చేస్తూ సూటిపోటి మాటలతో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఒక సమయంలో కర్ణుడు వదిలిన అస్త్రాన్ని అర్జునుని తలపైకి కాకుండా గుండెల వైపు గురి పెట్టమని శల్యుడు సూచిస్తాడు. అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడ్డ కర్ణుడు అస్త్రాన్ని తలవైపునకే గురిపెట్టడం, అర్జునిని రథ సార థ, జగన్నాటక సూత్ర ధారి అయిన శ్రీ కృష్ణుడు రథాన్ని కిందకు తొక్కడంతో ఎంతో శక్తిమంతమైన అస్త్రం అర్జునుని తలపై నుండి వెళ్ళిపోయి వ్యర్థ మైపోయింది. ఈ లోగా కర్ణుని శాపాలు అన్నీ కలిసి రావటంతో అర్జునుడు విడిచిన అస్త్రంతో కర్ణుడు మరణిస్తాడు. అప్పటి నుండి శల్య సారథ్యం అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.– సి. ఎన్. మూర్తి,సీనియర్ పాత్రికేయులు -
కొండ హారతి
అది శేషాచలం కొండలకు కూత వేటు దూరంలో ఉన్న గ్రామం. ఆ ఊరి అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి కేరళ అమ్మాయితో పెళ్ళి జరిగింది. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి.మొదటిసారిగా ఆ అమ్మాయి అత్తగారింటికి కారులో బయల్దేరింది. ఆ ఊర్లో ప్రతి ఇంటి ముందరో, వెనకాలో కొబ్బరిచెట్లు ఉండటం గమనించింది. చిన్నపిల్లలాగా గంతులేస్తూ కారును ఆపమని కోరింది. గబగబా ఒక కొబ్బరిచెట్టు దగ్గరకు వెళ్ళి చేత్తో తడిమి పరవశించిపోయింది. ‘మా కేరళలో లాగా ఇక్కడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా సంతోషం. ఈ నేల కొబ్బరిచెట్లకు అనుకూలమైనదా’ అని అడిగింది. ఆమెను ఎప్పుడూ అంత ఆనందంగా ఉండటం చూడలేదు భర్త. పక్కనే ఉన్న భర్త ‘అంత అనుకూలమైన నేల కాదు కానీ, మా ఊర్లో ఈ కొబ్బరి చెట్లను పెంచడానికి ఓ కారణం ఉంది. మా నాన్నగారు వేంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడు. నుదుటిన నామం పెట్టేవాడు. ఆ రోజు ఉదయం శేషాచలం కొండలకి నేతి దీపాల హారతి ఇచ్చే వాడు. దాంతోపాటు కొబ్బరికాయ కూడా కొట్టేవాడు.ఒక్కోసారి, పట్టణం నుంచి కొబ్బరికాయ తెచ్చేది మరిచే వాడు. అలా కొబ్బరికాయ తీసుకురాని రోజు మా అమ్మ చాలా బాధపడేది. ఆ వారమంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండేది.అది గమనించిన మా నాన్న ‘ఇంట్లోనే కొబ్బరి చెట్టు నాటితే ఆ సమస్యనుంచి బయటపడవచ్చు కదా’ అని భావించాడు. అనుకున్నట్లే చేశాడు. ఇది చిన్న ఊరు కాబట్టి, ఒకర్ని చూసి మరొకరు కొబ్బరి చెట్లు నాటడం మొదలయ్యింది. అలాగే ప్రతి శనివారం కొండకి హారతి పట్టి టెంకాయ కొట్టడం అందరి ఇండ్లలోనూ అలవాటుగా మారింది’’ అని చెప్పాడు.‘అలాగా’ అని ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.ఇద్దరూ ఇంటికి వెళ్ళి కాళ్ళూచేతులూ కడుక్కుంటూ ఉండగా– ఇంతలో ఆమె అత్తమామలు పిలవడంతో మిద్దెమీదకు వెళ్ళారు. వారు అప్పటికే నేతి దీప హారతికి అంతా సిద్ధం చేసి ఉన్నారు. పళ్ళెంలో దీపం వెలిగించి కొండకి హారతి ఇచ్చి, టెంకాయ కొట్టి గోవింద నామస్మరణలు చేశారు. ‘ఎంత అదృష్టవంతులు ఇక్కడి వారు, ఆదిశేషుడి రూపంలో ఉన్న శేషాచలం కొండని రోజూ చూసే భాగ్యవంతులు’ అని వారితో పాటు గోవింద నామస్మరణలు చేసింది. దైవభక్తి కల్గిన కోడలు దొరికిందని అత్తమామలు మురిసిపోయారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
దౌర్జన్యానికి దైవశిక్ష తప్పదు!
మానవ సంబంధాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ’సహోదరత్వం’. అయితే నేటి సమాజంలో స్వార్థం, అహంకారం పెరిగిపోయి ఇతరుల హక్కులను కాలరాయడం, బలహీనులపై దౌర్జన్యం చేయడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఇస్లామీయ బోధనల ప్రకారం దౌర్జన్యం (జులుమ్) అనేది అల్లాహ్ దృష్టిలో క్షమించరాని మహాపరాధం.దౌర్జన్యం అంటే ఏమిటి?అరబీలో ’మజాలిమ్’ అంటే అకారణంగా ప్రజలను వేధించడం, ఒకరి ఆస్తిని అక్రమంగా కబళించడం మరియు ఒకరి హక్కులను బలవంతంగా లాక్కోవడం. వివేకవంతులైన విశ్వాసులు అల్లాహ్ హెచ్చరికను గుర్తుంచుకోవాలి: ‘దుర్మార్గులు చేస్తున్న దానిని అల్లాహ్ పట్టించుకోవడం లేదని భావించకండి. ఆయన వారిని శిక్షించే రోజును వాయిదా వేస్తున్నాడు మాత్రమే.‘ ఆనాడు ఏ అధికార బలగం, ఏ సంఖ్యా బలం వారిని రక్షించలేదు.పరలోకంలో శిక్షా రూపంప్రవక్త ముహమ్మద్ (సఅసం) హెచ్చరించినట్లుగా, ఈ లోకంలో ఇతరులపై చేసే దౌర్జన్యం ప్రళయదినాన దట్టమైన చీకటిగా మారుతుంది. పీడితుని ఆక్రందనకూ, అల్లాహ్ కీ మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. ఒక వ్యక్తి వేరొకరి జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే, ప్రళయదినాన ఏడు భూభాగాల గుదిబండను అతని మెడలో వేయడం జరుగుతుంది. ఇది కేవలం భూమికే కాదు, ఇతరుల మాన మర్యాదలను మంటగలిపేవారికి కూడా వర్తిస్తుంది.అసలైన సహాయం: బాధితునికీ, దౌర్జన్యపరునికీ!మత సామరస్యం, సామాజిక న్యాయం వెల్లివిరియాలంటే ముస్లింలు తమ తోటి సోదరులకు అండగా ఉండాలి. ప్రవక్త (సఅసం) ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు: ‘మీ సోదరునికి అతను దౌర్జన్యపరుడైనా, బాధితుడైనా తోడ్పడండి. బాధితునికి సహాయం చేయడం అంటే అతనికి న్యాయం జరిగేలా చూడటం. మరి దౌర్జన్యపరునికి సహాయం చేయడం అంటే ఏమిటి? అతను అన్యాయం చేయకుండా అతని చేతిని పట్టుకోవడం, అతన్ని తప్పు నుండి మళ్ళించడం.క్షమ – ప్రాయశ్చిత్తంఒక వ్యక్తి చేసిన పాపాలను అల్లాహ్ క్షమిస్తాడేమో కానీ, తోటి మనిషికి చేసిన అన్యాయాన్ని ఆ బాధితుడు క్షమించే వరకు అల్లాహ్ కూడా క్షమించడు. అందుకే పారలౌకిక విచారణ రాకముందే, ఈ లోకంలోనే బాధితుని వద్ద క్షమాపణ పొంది, వారి హక్కులను తిరిగి చెల్లించాలి. లేదంటే, పుణ్యాలన్నీ బాధితుని ఖాతాలోకి వెళ్లిపోయి పాపాలే మిగిలే ప్రమాదం ఉంది.ఆక్రందనలు అరణ్య రోదనలు కావులోకంలో పీడితుల ఆక్రందనలు అరణ్య రోదనలు కావు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పక జరుగుతుంది. ఒక విశ్వాసి మరో విశ్వాసికి భవనంలోని ఇటుకల వలె ఒకరికొకరు బలం చేకూర్చుకోవాలి. అప్పుడే సమాజంలో శాంతి, అల్లాహ్ కారుణ్యం లభిస్తాయి. క్షమించడం, సర్దుకుపోవడం అనేది కేవలం బలహీనత కాదు, అది ఒక గొప్ప సాహసం, దృఢ సంకల్పం.– ముహమ్మద్ ముజాహిద్ -
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు : ముస్తాబైన మఠం
భారతదేశం ఎందరో గురుదేవుళ్ల పుణ్యధామం. వారు సమాజంలో జ్ఞాన దీప్తులు వెలిగించారు. అలాంటి వారిలో సుప్రసిద్ధులు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బ్రహ్మంగారి మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో స్వామి చరిత్ర, ఉత్సవ విశేషాలపై ప్రత్యేక కథనం. శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి గొప్ప కాలజ్ఞానిగా భూ మండలంపై కీర్తి గడించారు. అంతేకాక ఆయన రాజయోగి, హేతువాది, తత్త్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. రాబోయే కాలంలో జరిగే విపత్తులపై కాలజ్ఞానం ద్వారా వివరించి.. మానవాళికి ఎన్నో సూచనలు, హెచ్చరికలు చేశారు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. కావున మిగతావి కూడా జరుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే.. సన్మార్గంలో నడవాలని బోధించారు. ఎన్నో మహిమలు చూపి మహిమాన్వితుడిగా విరాజిల్లారు. కులమతాలను రూపుమాపేందుకు కృషి చేసి సంఘ సంస్కర్తగా పేరు పొందారు. కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసి జగద్గురువుగా ప్రఖ్యాతి గాంచారు. చివరికి దైవ స్వరూపులుగా వినుతి కెక్కారు. సజీవసమాధి నిష్ట పొంది భక్తులను అనుగ్రహిస్తు న్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో నేటి నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.సన్మార్గంలో నడిపించడం కోసం...మానవులకు జ్ఞాన బోధ చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. తెలుగు నేల నలుచెరగులా సంచరించి బోధనలు చేసి 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. (ఆ ్ర΄ాంతంలోనే ప్రస్తుతం శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి క్షేత్రం ఉంది.) నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది.ఏటా వేడుకలుస్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సాతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలిరానున్నారు. స్వామి మాల ధరించిన భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారితో కందిమల్లాయపల్లె కళకళలాడుతోంది. ఆరాధనోత్సవానికి ఇంకా పెద్ద ఎత్తున రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు.. మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఉత్సవాలు ఇలా..శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్యబృందం, భక్తులు.. ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిషేకం, సహస్ర నామార్చన కార్య్రçకమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న శేషవాహనోత్సవం, 24న గజవాహనోత్సవం, 25న నరనంది ఉత్సవం, 26న నంది ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 26న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామి వారు దీక్షాబంధన అలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 28న మహాప్రసాదం నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయి.– వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, వైఎస్ఆర్ కడప జిల్లాఘనంగా ఏర్పాట్లుశ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల ఆరాధనోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. వసతి, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.– శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వాముల వారు, మఠాధిపతులు, బ్రహ్మంగారిమఠం -
సైంధవుడిలా అడ్డు పడ్డట్టు....
ఎవరైనా ఏదైనా పనికి అడ్డుపడితే ‘సైంధవునిలా అడ్డు పడుతున్నాడు‘ అనే నానుడి సమాజంలో ఉంది. ఇందుకు సంబంధించి ఈ నానుడి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.మహాభారతంలో కౌరవుల ఏకైక సోదరి దుస్సల అని అందరికీ తెలిసిందే. ఆమె భర్తే సైంధవుడు. ఇతడి అసలు పేరు జయద్రథుడు. సింధు దేశాన్ని పాలించిన రాజు కాబట్టి సైంధవుడు అని పేరు వచ్చింది. సైంధవునికి దుస్సలతో పాటు మందాకిని, కుముద్వతి అనే ఇరువురు భార్యలున్నారు.పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న రోజులలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని వావి వరసలు మర్చిపోయి బలవంతంగా రథం పైకి తీసుకువెళ్లడానికి సైంధవుడు ప్రయత్నించాడు. భీముడు సైంధవుని బంధించి ధర్మరాజు ముందు ప్రవేశపెట్టాడు. తమ చేతులతో అతడి ప్రాణాలు తీసి, చెల్లెలికి వైధవ్యం కలిగించకూడదనే ఉద్దేశంతో అందుకు సమానమైన శిక్షగా.. శిరోముండనం చేసి వదిలి పెట్టారు. దీంతో పాండవులపై పగతో సైంధవుడు శివుని గురించి తపస్సు చేసి అర్జునుడు మినహా మిగిలిన పాండవులను ఒక్కరోజు అడ్డుకునే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజున ద్రోణుడు రచించిన పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశించగా అతని వెనక పద్మవ్యూహంలోకి ప్రవేశించే అర్జునుడు మినహా మిగిలిన నలుగురు పాండవులను శివుని వరం వల్ల సైంధవుడు అడ్డుకున్నాడు. దీనివల్ల పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఒంటరివాడై అసువులు బాసాడు. ఇదిలా ఉండగా అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుడిని ఆ మర్నాడు సూర్యాస్తమయంలోగా చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుని ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు సూర్యాస్తమయానికి ఇంకా సమయం ఉండగానే శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, యోగమాయతో సూర్యునికి అడ్డువేశాడు. దీంతో చీకట్లు కమ్మడంతో సూర్యాస్తమయం అయిపోయిందని సైంధవుడు భావించి బయటకు రాగా అర్జునుడు సైంధవుడిని పాశుపతాస్త్రంతో వధించి అతని తల నేలపై పడకుండా అతని తండ్రి అయిన వృద్ధక్షతుడి చేతిలో పడేలా చేయమని శ్రీ కృష్ణుడు చెబుతాడు. ఎందుకంటే సైంధవుడి తల ఎవరి చేతిలోనుంచి కింద పడుతుందో వారి తల నూరు చెక్కలవుతుందన్న వృద్ధక్షతుడి శాపం అతనికే తగిలి అతడు కూడా మరణిస్తాడు. అప్పటినుంచి ఎవరైనా ఏ పనికైనా అడ్డుపడుతుంటే సైంధవుడిలా అడ్డు పడుతున్నాడన్న సామెత వ్యాప్తిలోకి వచ్చింది. – సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
రామ చరిత మానసం
బంగారు వ్యాపారం చేసే ఒక యువకుడు తన భార్యా బిడ్డలతో కలిసి అయోధ్య వెళ్ళదలిచాడు. మూడు నెలల ముందే రైలు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణించే రోజు రానే వచ్చింది. భార్యా పిల్లలతో పాటు లగేజీ తీసుకుని రైల్వే స్టేషన్ చేరాడు. వారు ఎక్కాల్సిన రైలు వచ్చి ప్లాట్ మీద ఆగింది. వెంటనే పిల్లల్ని ఎక్కించి తను ఎక్కాడు.భార్య ప్లాట్ ఫాం మీద నిలబడి ఒక్కొక్క లగేజీ అందిస్తోంది. అతడు అందుకుంటున్నాడు. ఇంతలో రైలు కదిలింది. భార్య ప్లాట్ ఫాం మీదనే ఉంది. అమ్మకోసం పిల్లలు ఏడవటం ప్రారంభించారు. అతడిలో గాబరా మొదలయ్యింది. రైలు మరింత వేగం పుంజుకుంది. ఏం చేయాలో తెలియలేదు అతడికి. చైనులాగి రైలు ఆపమని తోటి ప్రయాణీకులు కొందరు సలహా ఇచ్చారు. అతడు అలాగే చేశాడు.రైలు ఆగింది. భార్య పరుగులు తీస్తూ వచ్చి రైలు పెట్టెలోకి వచ్చి చేరింది. వారి పక్క సీటులోనే ఒక వృద్ధ జంట కూర్చుని ఉంది. వృద్ధుడు సుందరకాండ చదువుతూ ఉన్నాడు. వృద్ధురాలు– ‘మన పక్క సీటు ఆమె, రైలు ఎక్క లేకపోవడం, ఆమె భర్త చైను లాగడం లాంటి హడావుడి జరుగుతున్నా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదు. రైల్వే సిబ్బంది కూడా వచ్చి వెళ్ళారు’ అని నిష్టూర పోయింది. ఆ వృద్ధుడు చిన్న నవ్వు నవ్వి ‘అంతా గమనించాను. ఈ యువకుడు భక్తి భావంతో అయోధ్యకు బయలుదేరాడు కానీ, రామ చరిత మానసం చదివినట్లు లేడు’ అన్నాడు. పక్కనే ఉన్న ఆ యువకుడు ‘అలా అంటున్నారేమిటి? దానికీ దీనికీ సంబంధం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. యువకుడి కళ్ళలోకి చూస్తూ ఆ వృద్ధుడు ‘అరణ్య వాసం వెళ్ళేటప్పుడు గంగానది దాటే సమయంలో పడవలోకి మొదటగా సీతను, తర్వాత లక్ష్మణుడినీ ఎక్కించి ఆ తర్వాత రాముడు ఎక్కుతాడు. మనం రామాయణం చదివితే ఇలాంటి మంచి మంచి సూక్ష్మ విషయాలెన్నో తెలుసుకోవచ్చు. వాటిని మన నిత్యజీవితంలోకి అన్వయించుకుని సుఖమైన జీవితాన్ని అనుభవించవచ్చు’ అన్నాడు. ‘నిజమే... ఎప్పుడూ రైలు ప్రయాణాల్లో ఆడవారిని మొదటగా ఎక్కించి మగవారు ఆ తర్వాత ఎక్కాలి. చీరలు కట్టుకునే స్త్రీలు రైలు వెనుక పరుగులు తీసి వాహనాన్ని అందుకోలేరు కదా’ అని వృద్ధురాలు హితవు మాటలు చెప్పింది.అప్పుడు గుర్తుకొచ్చింది ఆ యువకుడికి– చాలా నెలల క్రితం గోస్వామి తులసీదాస్ రచించిన రామ చరిత మానసం తెలుగు అనువాదం ఇంట్లో తెచ్చి పెట్టుకున్న విషయం. ప్రయాణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చదివి తీరాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు. అందరూ రామ నామ స్మరణలు చేస్తూ అయోధ్య ప్రయాణం కొనసాగించారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
సనాతన సారథి ఆదిశంకరులు
‘దేవుడనే వాడున్నాడా ‘అని వితండవాద నాస్తికవాదులకు ఎదురుగా అగుపడే వ్యక్తి దేవుడే అయితే అంత కన్నా సరి అయిన ఋజువు, సమర్థన మరేం కావాలి? కథల్లో, పురాణాల్లో భగవంతుడు వచ్చాడని, రక్షించాడని విన్నాం, నమ్మాం.. నిజంగా నిలబడి నడిచొస్తూ నాస్తికత్వాన్ని ఖండించి అద్వైత తత్త్వాన్ని సుస్థిరం చేసి అద్వైత వాదిగా అరుదెంచి హిందూమతాన్ని రక్షించి జాతిని నడిపించే దేవుడే శంకర భగవత్పాదులు.. పరమాచార్య శంకరాచార్యులు...శివుడే శంకరులుగా...హిందూమతం క్షీణదశలో ఉన్నప్పుడు ఆ మత పరిరక్షణకై పుణ్యదంపతులు శివగురు, ఆర్యాంబలు చేసిన తపః ఫలంగా కాలాడి అగ్రహారంలో సాక్షాత్తు ఈశ్వరుడే శంకరులుగా జన్మించాడు.. ఆవేళ ప్రకృతి పరవశించింది. ప్రపంచంలో పరమశాంతి పరిమళించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ బాలుడిలో చంద్రవంక, మూడవ నేత్రం, శూలం ఉన్నాయి. తెల్లని కాంతి.. లక్షణాల్లో సూర్యుడు.. మేరు పర్వతం.. సరస్వతీదేవి పోలిక.. ఈశ్వర వర ప్రసాదుడు. తోటి బాలురు తప్పటడుగులు వేస్తుంటే శంకరాచార్యులు సర్వ భాషలందు ప్రావీణ్యం, ప్రజ్ఞ సాధించి అసాధారణ బుద్ధితో వేద, వేదాంగాల్లో బ్రహ్మని, బృహస్పతిని మించి΄ోయాడు. శివ రహస్యంలోనూ, కూర్మ పురాణం లోనూ ఈ అవతార ప్రస్తావన ఉంది.అద్వైత తత్వ స్థాపన –జైత్రయాత్రశంకరాచార్యుల తన ప్రజ్ఞాపాటవాలతో, వాగ్ధాటితో నాస్తిక మతాన్ని మట్టుపెట్టటానికి విద్వాంసులతో వాద ప్రతి వాదనలకు దిగి అందరినీ ఓడించారు. ఒకసారి వేయిమంది పండితులను అవలీలగా జయించారు. విష్ణు సముడైన వ్యాసభగవానుడినే తన వాదనతో మెప్పించారు. దేశంలో నలు మూలల్లో పీఠాలు స్థాపించి సనాతన మత పునరుద్ధరణలో భాగంగా తత్వ, వేదాంత పూజాది నియమాలు, సంప్రదాయాలు నెలకొల్పి జ్ఞాన జ్యోతులను వెలిగించారు.ఎన్నెన్నో రచనలు – నిత్య సాధనలుబ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గిత, విష్ణు సహస్ర నామం, గాయత్రి మంత్రానికి భాష్యాలు రచించారు. వీటివల్ల మనకి దైవ సన్నిధి, పెన్నిధి ఏర్పడ్డాయి. పలు ప్రకరణ గ్రంథాలు రచించారు. మనం రోజు చదివే స్తోత్రాలలో ఎక్కువ వారు రాసినవే. వివేక చూడామణి, నిర్గుణ మానస పూజ, శివానంద లహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, కనకధార స్తోత్రం.. ఇలా ఎన్నెన్నో. తాను నడుస్తూ మన అందరిని మంచి ద్రోవలో నడిపిస్తున్న ఆ దేవుడికి జేజేలు. ఇదీ చదవండి: Ramanuja Jayanthi 2026 ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా? – డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
రామానుజ జయంతి : ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా?
మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పుటి కట్టుబాట్లను దాటి మానవు లందరికీ భగవంతుని చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. శ్రీ మహావిష్ణువు శేషపానుపే రామానుజులుగా ఈ భూమిపై అవతరించి వెయ్యేళ్లు దాటింది. ఈ నెల 22న రామానుజ జయంతి. ఈ సందర్భంగా రామానుజులవారి జీవిత విశేషాలు...రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరు అనే ఉరిలో కలియుగం మొదలైన 4118 అంటే సామాన్యశకంలోని 1016 వ సంవత్సరంలో.. భారతీయ కాలమానంలో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి, శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రా నక్షత్రంలో ఆసూరి కేశవ సోమయాజి, కాంతిమతి అనే పుణ్యదంపతుల నోముల పంటగా జన్మించారు..గురువుకే గురువు శ్రీరామానుజాచార్యులవారు 16 సంవత్సరాల వరకూ శ్రీపెరంబుదూరులో, ఆ తర్వాత 8 ఏళ్లపాటు తిరుప్పుట్ కుళిలోనూ, పదేళ్లపాటు కంచిలో వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. రామానుజులవారి ప్రజ్ఞ గురువుకు, ఇతర శిష్యులకు కంటగింపుగా మారింది. వారిని చంపడానికి గురుశిష్యులంతా పన్నాగం పన్నారు. సాక్షాత్తూ కంచి వరదరాజస్వామివారే రామానుజులును ఆ ప్రాణాపాయం నుంచి తప్పించారు. చివరికి కంచికి చేరారు. ఆనాటి నుంచి నిత్యం వరదరాజ పెరుమాళ్ కోవెలలో తిరుమంజన, తిరువారాధన కైంకర్యాలు చేసుకుంటూ వచ్చారు రామానుజులు.విశిష్టాద్వైతం అంటే? దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం. ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటమే విశిష్టాద్వైతం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో కలిసి ఒకటిగా ఉండవచ్చని తెలిపారు.పాండిత్యం... ప్రాచుర్యంరామానుజులవారు శ్రీ భాష్యమనే పేరుతో ప్రస్థాన త్రయానికి భాష్యం రచించారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్టసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ద్రవిడ వేదంపట్ల అందరూ గౌరవ ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు.మూర్తీభవించిన సమతభగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షానికి అర్హులే అంటూ సర్వమానవ సమానత్వ భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించారు రామానుజులు. ఆయన పాతికేళ్ల వయస్సులో గార్హస్థ్యాన్ని వీడి యతిగా మారారు. దేశమంతటా సంచరిస్తూ... తన వాదం ద్వారా ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు. 125 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో సమతామూర్తిగా పేరు పొంది తన అవతార పరమార్థాన్ని నిరూపించుకున్నారు. – డి.వి.ఆర్. -
పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...
కృష్ణా... గురువాయురప్పా..! ఈ ఒక్క మాట మనకి బాగా పరిచయం ఉన్న కేరళంలో ఎక్కువ వినిపిస్తుంటుంది. కేరళం పేరు వింటే మనకి గుర్తుకు వచ్చే దేవాలయం గురువాయూర్. శ్రీ కృష్ణ దేవాలయాలలో కేరళలో ఉన్న గురువాయురప్పన్ దేవాలయం ఎంతో విశిష్టమైనది.ఆయనను బాలగోపాలుడిగా భక్తితో కొలుస్తారు. ఆర్ద్రతతో కృష్ణా... గురువాయురప్పా అనిపిలిస్తే పలుకుతాడని కేరళవాసుల నమ్మకం. ఎంతో మంది కృష్ణ భక్తులు భక్తితో పలవరిస్తుంటారు. బాలగోపాలుడు ఇక్కడ అల్లరి చేస్తూ తిరుగుతాడు అని చూసిన వాళ్ళు చెప్తుంటారు. కురూరమ్మ బిల్వమంగళుడు వీరి ఇంట్లో అల్లరి కన్నయ్య తిరుగాడేవాడని ఇక్కడివారి నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తామే కురూరమ్మ బిల్వమంగళుడిగా భావిస్తుంటారు. మన తెలుగు వారు అయ్యప్ప మాల వేసుకుని దర్శనం తరువాత లేదా ముందు ఇక్కడ అల్లరి కన్నాయని గురువాయూర్ లో దర్శనం తప్పనిసరిగా దర్శనం చేసుకుంటారు. తాము రాధాకృష్ణులమని భావించి తులసి మాలలు వేసుకుని గురువాయూర్లో వివాహం చేసుకోవడం గొప్ప అనుభూతి. అలాగే అల్లరి కన్నయ్యకి నృత్యం, ఆటపాటలు అంటే ఇష్టం. అందుకే ప్రతిరోజు అరంగేట్రం సంగీత కచేరీలు జరుగుతుంటాయి. కన్నయ్యకి పాలు, బియ్యం పంచదార వేసి పాయసం చేసి నైవేద్యం పెడతారు. పసిపిల్లలను తులాభారం చేయిస్తారు. అలాగే మొక్కు తీర్చడానికి ఏనుగులు సమర్పించేవారు. ఆ విధంగా సుమారు 38 ఏనుగులతో పునాథూర్ కోటలో చూడవచ్చు. విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఏనుగులతో పరుగు పందాలు, ఏనుగులకు విందు కార్యక్రమాలు ఉంటాయి మరి కృష్ణష్టామి రోజు విశేషమైన పూజలు జరుపుతారు. కేరళ వాళ్ళ కొత్త సంవత్సరాది రోజు ఉదయం ఈ కన్నయ్యని ముందుగా చూస్తారు. దానిని విషు కని అంటారు. గురువు, వాయువు కలిసి నదిలో దొరికిన విగ్రహం ఇక్కడ బాల గోపాలుడి దర్శనం. ఈ ఆలయం త్రిచూర్ రైల్వే స్టేషన్కి 20 కిలోమీటర్లు లేదా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉంది. – ఈఎస్. మాధవన్ (చదవండి: శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?) -
శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?
హిందూ ధర్మంలో దేవతా ఆరాధనకు, క్షేత్ర సందర్శనకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. భక్తులు పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు ‘శక్తిపీఠం’, ‘సిద్ధపీఠం’ అనే పదాలను తరచుగా వింటుంటారు. సామాన్య భక్తులకు ఇవి రెండూ ఒకేలా అనిపించినప్పటికీ, వీటి వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వేర్వేరు. శక్తిపీఠాలు మాతా సతీదేవి త్యాగానికి చిహ్నాలైతే, సిద్ధపీఠాలు ఋషులు, మునులు సాధించిన తపఃఫలానికి నిదర్శనాలు. శరీర భాగాలు పడినచోట శక్తి ఆవిర్భవిస్తే.. తపస్సు పండిన చోట సిద్ధి చేకూరుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న పౌరాణిక, ఆధ్యాత్మిక వ్యత్యాసాలేమిటో తెలుసుకుందాం..!భారతీయ ఆధ్యాత్మిక భూమికలో శక్తిపీఠాలు, సిద్ధపీఠాలు రెండూ అత్యంత మహిమాన్వితమైనవిగా పరిగణించినప్పటికీ, వాటి ఆవిర్భావం వెనుక భిన్నమైన పౌరాణిక నేపథ్యాలు ఉన్నాయి. శక్తిపీఠాలు ప్రధానంగా మాతా సతీదేవి దేహ త్యాగానికి చిహ్నాలు; శివుడు ఆమె భౌతిక కాయాన్ని మోసుకెళ్తున్న తరుణంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించగా, భూమిపై ఆ శరీర భాగాలు పడిన 51 ప్రదేశాలు కొన్ని పురాణాల ప్రకారం..108 శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి దేవి భౌతిక అవశేషాల శక్తిని కలిగి ఉండి, భక్తులకు పాప ప్రక్షాళనను, దేవి సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. ఈ శక్తిపీఠాలలో ఆ దేవి ప్రత్యక్షంగా, తన నిజ స్వరూపంలో కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ శక్తితోపాటు భైరవుడు అంటే శివుడు కూడా ఉంటాడని భావిస్తారు.తపఃఫల సిద్ధి క్షేత్రాలు..సిద్ధపీఠం అంటే ఒక ఋషి, సాధువు, సిద్ధుడు లేదా సాక్షాత్తు ఒక దేవత సుదీర్ఘకాలం పాటు కఠోరమైన తపస్సు ఆచరించి, పరమాత్మ అనుగ్రహాన్ని ΄÷ందిన ప్రదేశం. ఇక్కడ దేవత ఆవిర్భావం దైహికమైన భాగాల వల్ల జరగదు. కేవలం సాధన, ధ్యానం, మంత్రబలం ద్వారా జరుగుతుంది. సిద్ధపీఠాలలో ఆధ్యాత్మిక తరంగాలు అత్యంత బలంగా ఉంటాయి. సాధకులు ఇక్కడ సాధన చేయడం వల్ల త్వరగా ’సిద్ధి’ అంటే జ్ఞానం లేదా శక్తులు పొందుతారు. భక్తుల కోరికలు త్వరగా నెరవేరే ప్రదేశాలుగా వీటిని భావిస్తారు. ఉదాహరణకు, మార్కండేయ మహర్షి తపస్సు చేసిన చోటో లేదా మాతా వైష్ణోదేవి లాంటి క్షేత్రాలను సిద్ధపీఠాలుగా పరిగణించవచ్చు.సిద్ధపీఠాలు దైహికమైన అవశేషాలతో సంబంధం లేకుండా, కఠోరమైన తపస్సు, సాధన ద్వారా ప్రాశస్త్యం పొందిన పుణ్యక్షేత్రాలు. ఒక ఋషి, ముని లేదా దేవత ఏ ప్రదేశంలోనైతే సంవత్సరాల తరబడి ధ్యానం చేసి దైవత్వాన్ని సిద్ధింపజేసుకుంటారో, ఆ ప్రదేశమే సిద్ధపీఠంగా విరాజిల్లుతుంది. వీటికి నిర్ణీత సంఖ్య అంటూ ఉండదు. తపస్సు పండిన ఏ చోటైనా ఇది సాధ్యమే. ఇక్కడ కేంద్రీకృతమై ఉండే తపఃశక్తి, సంకల్ప బలం భక్తులకు అపారమైన మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా, వారు తలపెట్టిన కార్యాలు త్వరితగతిన సిద్ధించేలా అనుగ్రహిస్తాయి. క్లుప్తంగా చె΄్పాలంటే, శక్తిపీఠం దైవస్వరూపాన్ని దర్శింపజేస్తే, సిద్ధపీఠం ఆ దైవత్వాన్ని పొందే మార్గాన్ని సాధనను గుర్తుచేస్తుంది.శక్తిపీఠమైనా, సిద్ధపీఠమైనా అంతిమంగా లభించేది ఆ జగన్మాత అనుగ్రహమే. శక్తిపీఠాలు మనకు ‘త్యాగాన్ని’, ‘భక్తిని’ గుర్తుచేస్తాయి. ఒక దేహాన్ని త్యజించినా ఆ శక్తి అక్షయంగా ఉంటుందని చాటిచెబుతాయి. సిద్ధపీఠాలు మనకు ’క్రమశిక్షణను’, ‘సాధనను’ బోధిస్తాయి. మనం కూడా ఏకాగ్రతతో తపస్సు చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ క్షేత్రాలు నిరూపిస్తాయి. ఈ క్షేత్రాలను సందర్శించేటప్పుడు భౌతికమైన ఆడంబరాల కంటే, ఆధ్యాత్మిక చింతనతో వెళ్లడం ముఖ్యం. అప్పుడే ఆ పీఠాల నుంచి వెలువడే దివ్యశక్తి మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది.– పసుపులేటి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక) -
కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక
అనంత్, రాధికా అంబానీ హెలికాప్టర్లో మహారాష్ట్రలోని నేరల్కు చేరుకుని అక్కడ కృష్ణ కాళి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆయన పుట్టిన రోజు వేడుకులకు ముందు అనంత్ రాధికలు ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 10న అనంత్కు 31 ఏళ్లు నిండనున్నాయి. పూజ అనంతరం ఆలయంలో ఆవులకు అన్నదనం చేసి, గోసేవ కూడా చేశారు. ఆ తర్వాతక రాధిక అంబానీ భక్తులను పలకరిస్తూ..మిఠాయిల, దుస్తులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణ కాళి అమ్మవారి ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Deepender Thakur (@deepender_thakur)కృష్ణుడు, కాళి మాత ఒక్కరేనా..బృందావనంలో ఉండే కృష్ణుడు, కాళీ దేవి ఒక్కరేనా అంటే..ఒక్కరేనే చెబుతున్నాయి పురాణాలు. కృష్ణకాళిగా, కృష్ణ స్వరూప కాళిగా అమ్మవారి ఆరాధన కనిపిస్తుంది కలకత్తా, పశ్చిమబెంగాల్లో బాగా కనిపిస్తుంది. అందుకు ఒక పురాణ గాధ కూడా ఉంది. యశోద సోదరుడు శతగోపుడు. ఆయన భార్య రాధ (బృందావనేశ్వరి, గోలోక నాయిక అయిన రాధాదేవి వేరు. కృష్ణుని మేనమామ భార్య పేరు కూడా రాధ. అందుకే చాలా మంది రాధ అంటే కృష్ణుని మేనత్త అనుకుంటారు. కానీ ఆమె వేరు. ఆ స్వామి ప్రాణాధిక అయిన రాధాదేవి వేరు). ఆమె చిన్నప్పుడు కృష్ణుని ఎత్తుకొని పెంచింది. చిన్నికృష్ణుని సౌందర్యాన్ని ఆరాధించింది. ఆయన అనుగ్రహం పొందింది. అందుకే కృష్ణుడు ఆమె కోసం యువకుడిగా మారి విహరిస్తూ ఉండేవాడు. అది చూసి కొందరు శతగోపునికి ఆ విషయం చెప్పారు. ఒకసారి రాధతో కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది శతగోపుని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి చూస్తే.. రాధాదేవి కాళీ దేవి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా కనపడింది. దీంతో వారంతా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిన తర్వాత కాళీదేవి విగ్రహం కృష్ణునిగా మారిపోయింది. శతగోపుని రాకను గుర్తించిన కృష్ణుడు రాధను రక్షించడం కోసం అలా కాళిగా మారాడు. ఈ కథ బృందావన గాథలలో చాలా ప్రసిద్ధమైనది. అలాగే.. నరకాసురుని జీవితంలో కూడా కాళీదేవి ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది.నరకుని ఆరాధ్య దైవం కామాఖ్య కాళి. ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది ఎన్నో అద్భుతమైన శక్తులు సాధించాడతడు. కానీ.. అతడు అధర్మబద్ధమైన సాధనలు చేయడం వల్ల కాళీ దేవి అతడి వద్ద నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ తల్లి నరకునికి కనిపించలేదు. నరకుని మరణ సమయంలో మాత్రం.. కృష్ణుడిలో కాళి కనిపించింది. అధర్మాన్ని నశింపజేయడానికి అలా కృష్ణ కాళిగా వచ్చి నరకుని సంహరించిందన్నమాట. కృష్ణ కాళిగా అమ్మవారిని భక్తితో, ప్రేమ భావనతో పూజిస్తే ఆమె కృష్ణ స్వరూపిణిగా, ప్రేమ స్వరూపిణిగా, కృష్ణునిగా అనుగ్రహిస్తుంది. బృందావనంలో ప్రవేశించిన ఎందరో సిద్ధులు కృష్ణుడే కాళి అని తెలుసుకుని కృష్ణ కాళిగా పూజించి అనుగ్రహం పొందారు.(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..) -
అశ్వత్థామ హతః ధర్మరాజు చెప్పిన అబద్ధం
అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. యమధర్మరాజు అంశతో కుంతీదేవికి జన్మించినవాడు. ధర్మకోవిదుడు, నీతిపరుడు, సత్యవంతుడు... ఇన్ని సుగుణాలు కలిగిన ధర్మరాజు అబద్ధం ఆడాడా..?? అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఆపద్ధర్మం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అబద్ధం ఆడించాడు. లేకుంటే పాండవ వంశానికే ప్రమాదం వచ్చి ఉండేది. మహాభారత యుద్ధంలో పాల్గొన్న వ్యక్తులు అతిరథ మహారధులని చెప్పుకోవచ్చు. వారిలో అశ్వత్థామ ఒకరు. అశ్వత్థామ మహారథి కోవకు చెందుతాడు. యుద్ధరంగంలో అడుగుపెట్టాడంటే ఏకకాలంలో ఏడు లక్షల 20 వేల మందితో యుద్ధం చేయగలడు. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుని కుమారుడు.ద్రోణాచార్యుడు, కృపి దంపతులకు పరమేశ్వరుడి వరప్రసాదంగా జన్మించిన వాడే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా ఉండడంతో ఆ బాలునికి అశ్వత్థామ అని పేరు పెట్టారని, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అశ్వత్థామ నుదుటిపై శివుని మూడో కన్నులా అనిపించే ఒక దివ్యమైన మణి ఉండటం వల్ల అశ్వత్థామకు ఏ ఆయుధం వల్ల కానీ, ఎవరి వల్ల కానీ భయం, పరాజయం ఉండవని వరం.. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు మహాభారత యుద్ధంలో వీరవిహారం చేస్తూ పాండవ సైన్యాన్ని మట్టు పెడుతున్న సమయంలో ద్రోణాచార్యుని నిలువరించేందుకు ధర్మరాజుచే శ్రీ కృష్ణుడు అబద్ధం చెప్పిస్తాడు. ఎంతో సత్యవంతుడైన ధర్మరాజు చెప్తేనే అబద్ధాన్ని సైతం నిజమని నమ్ముతాడు ద్రోణాచార్యుడు. తాను అబద్దమాడనని ధర్మరాజు చెప్పినప్పటికీ ఆపద్ధర్మం కోసం అబద్ధమాడితే తప్పులేదని, శ్రీ కృష్ణు్ణడు ధర్మరాజుకు బోధించడంతో అయిష్టంగానే ధర్మరాజు అంగీకరిస్తాడు. ద్రోణాచార్యునికి వినబడేటట్లు అశ్వద్ధామ హతః... కుంజరహః అన్న సమయంలో కుంజరహః అనే మాట ద్రోణాచార్యునికి వినబడకుండా యుద్ధభేరీలు మోగించేటట్లు పథకం రూపొందించాడు శ్రీ కృష్ణుడు. ధర్మరాజు అన్న అశ్వత్థామ హతః అనే మాటను విన్న ద్రోణాచార్యుడు నిజంగానే తన కుమారుడైన అశ్వత్థామ మరణించాడని భావించి అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే అదునుగా భావించిన ధృష్ట్యద్యుమ్నుడు ద్రోణాచార్యుల తలనరికి అంతమొందిస్తాడు.కాగా ధర్మకోవిదుడైన ధర్మరాజు ఒక చిన్నపాటి అబద్ధం ఆడటం వల్ల అప్పటివరకు మహాభారత యుద్ధంలో ధర్మరాజు పయనించిన రథం భూమికి నాలుగు అంగుళాలు పైన వెళ్లేదని, ఈ చిన్న అబద్ధం ప్రభావం వల్ల ధర్మరాజు రథం నేలను తాకిందని, మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు ఒకేఒక్కసారి నరకలోకాన్ని సందర్శించవలసి వచ్చిందని, ఆపై నేరుగా స్వర్గానికి వెళ్ళాడనే మరో కథనం కూడా వ్యాప్తిలో ఉంది.కాగా ప్రస్తుత కలియుగంలో అశ్వత్థామ హతః కుంజరహః అనే మాటను రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రచారంలో వినియోగిస్తున్నారు. అంటే వారు ప్రజలకు ఇచ్చే హామీలలో కొన్ని మాత్రమే వినిపించేలా మిగిలినవి మెల్లగా చెప్తున్నప్పుడు ఈ నానుడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
డోలీ
అదొక చిన్న మండల కేంద్రం. దానికి కూత వేటు దూరంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊర్లో గులాబీ తోటలున్నాయి. ఆ తోటల యజమానుల నుంచి గులాబీలు తీసుకుని మండల కేంద్రానికి వెళ్ళి పూలమ్ముతుంది ఓ ముసలవ్వ.ఆ మండల కేంద్రంలో ఒక గ్రామీణ బ్యాంకు ఉంది. రిటైర్ మెంట్ కు దగ్గరున్న ఓ మహిళా మేనేజర్ ఆ బ్యాంకుకు బదిలీ మీద వచ్చింది. నెత్తి మీద గంప పెట్టుకుని ఇంటింటికీ వెళ్ళి పూలమ్మే అవ్వ ఆ రోజు బ్యాంకు మేనేజర్ ఇంటికి వెళ్ళింది. పూలు తీసుకొమ్మని అడిగింది. పూలు తీసుకునే సమయంలో అవ్వ, ‘కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ ఆమే’ అని తెలుసుకుంది.‘నాకు పదివేలు అప్పు కావాలి, నా దగ్గర కుదవ పెట్టడానికి ఏమీ లేదు. మీ బ్యాంకు నన్ను నమ్మి అప్పు ఇస్తుందా?’ అని అడిగింది. ‘అప్పు చేయాల్సిన అవసరం నీకేమి వచ్చింది?’ అని అడిగింది మేనేజర్. ‘నా వయసు డెబ్భై ఏళ్ళు. నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నాను. కొండ ఎక్కడం ఇన్నాళ్ళూ సాధ్యమయ్యింది. ఈసారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొండ ఎక్కడం అసాధ్యమనిపిస్తోంది. ఎలాగైనా ఈసారి కూడా స్వామిని చూడాలని కోరికగా ఉంది. కాబట్టి పంబ నదినుంచి సన్నిధానం వరకు డోలీలో వెళ్ళాలనుకుంటున్నాను. నలుగురు మగ మనుషులు నన్ను మోయాలి కదా. దానికి కనీసం పదివేల రూపాయల అవసరం ఉంటుంది. నేను దాచిపెట్టుకున్న డబ్బు ప్రయాణానికి మాత్రమే సరిపోతుంది. మీరు మేనేజర్ కాబట్టి నాకెలాగైనా సహాయం చేయండి. మీ ఋణం పెట్టుకోను. నాకు రావాల్సిన డబ్బు రెండు నెలల్లో వస్తుంది. వెంటనే తీర్చేస్తాను’ అని వేడుకుంది.ఆ అవ్వ భక్తి భావానికి మేనేజర్ ఆశ్చర్యపోయింది. చిన్నగా తేరుకుని ‘నాక్కూడా చాన్నాళ్ళుగా శబరిమలై వెళ్ళాలని ఉంది. స్వామి దర్శనం చేసుకోవాలని ఉంది. కొండపైకి నడిచి వెళ్ళే శక్తి నాకుంది. నువ్వు ఇప్పటికే నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నావు కాబట్టి ఎలా వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో నీకు బాగా తెలుసు. ఆ దీక్షకు కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి కదా. ఆ విషయంలో నాకు సహకరించు. ఒకరికొకరు తోడుగా వెళ్ళి వద్దాం. నీ డోలీ డబ్బులు నేను కడుతాను. అప్పు ఆలోచన పక్కన పెట్టేయ్’ అని బదులిచ్చింది. ఆ ముసలవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మేనేజర్కి ఇవ్వాల్సిన పూలకంటే మరి కొన్ని పూలు అదనంగా ఇచ్చి నమస్కరించి అక్కడినుంచి కదిలింది. నెల తర్వాత వచ్చిన కార్తీక మాసంలో ఇద్దరూ నల్ల వస్త్రాలు ధరించి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ కొట్టాయం రైలెక్కారు. – ఆర్సి. కృష్ణస్వామి రాజు -
వైరాగ్యం ఆధ్యాత్మికతకు ఆసరా
ఆధ్యాత్మిక పథంలో పయనించే ప్రతి సాధకుడికి ‘వైరాగ్యం’ అనేది ఒక బలమైన పునాది. సాధారణంగా లోకంలో వైరాగ్యం అంటే అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవడం అని పొరబడుతుంటారు. కానీ, నిజమైన వైరాగ్యం అంటే వస్తువులను వదలడం కాదు, వస్తువుల పట్ల ఉన్న ‘మమకారాన్ని’ లేదా ‘ఆసక్తిని’ వదలడం. ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటాడు, కానీ పెద్దయ్యాక వాటిని వదిలేస్తాడు. అది బొమ్మల మీద కోపంతో కాదు, వాటికంటే విలువైనది ఏదో తెలిసిందనే అవగాహనతో. ఆధ్యాత్మిక వైరాగ్యం కూడా అటువంటిదే.వైరాగ్యం అంటే ‘రాగ రహిత స్థితి’. మనసు దేనినైనా చూసి ఆకర్షింపబడితే దానిని ‘రాగం’ అంటారు. ఆ ఆకర్షణ వల్ల కలిగే బంధం నుండి మనసును విముక్తం చేయడమే వైరాగ్యం. ఇది విరక్తి కాదు, ఒక రకమైన పరిణతి. ఇంద్రియ విషయాల నుండి మనసును మళ్ళించడానికి చేసే ప్రాథమిక ప్రయత్నం (యతమాన సంజ్ఞ ), కొన్ని విషయాల మీద నియంత్రణ సాధించి, కొన్నింటిపై ఇంకా పట్టు కోల్పోని స్థితి (వ్యతిరేక సంజ్ఞ), బాహ్యంగా కోరికలు లేకపోయినా, మనసులో మాత్రం సూక్ష్మంగా ఆ కోరికలు మిగిలి ఉండటం(ఏకేంద్రియ సంజ్ఞ). ఇక నాలుగోది ‘వశీకార సంజ్ఞ’ అత్యున్నత స్థితి. ఇక్కడ మనసు పూర్తి నియంత్రణలో ఉంటుంది. ఏ బాహ్య వస్తువూ మనసును చలింపజేయదు.సంస్కృతంలో ‘రాగ’ అంటే రంగు లేదా ఆకర్షణ అని అర్థం. ‘వైరాగ్య’ అంటే ఆ ఆకర్షణ లేని స్థితి. నీటిలో ఉన్నా కూడా తామర ఆకుకు నీరు అంటనట్లుగా, సంసారంలో ఉంటూనే దేనికీ అతిగా బందీ కాకుండా ఉండటమే వైరాగ్యం. సాధారణంగా వైరాగ్యాన్ని రెండు స్థాయులలో చూడవచ్చు. ప్రాపంచిక విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని చూసి లేదా భయం వల్ల కలిగే తాత్కాలిక వైరాగ్యం (ఉదాహరణ – శ్మశాన వైరాగ్యం). ఇది ఎక్కువ కాలం నిలవదు. పర వైరాగ్యం అత్యున్నతమైనది. ఆత్మజ్ఞానం వల్ల, సత్యాన్ని గ్రహించడం వల్ల కలిగే స్థిరమైన స్థితి. ప్రపంచంలోని ఏ వస్తువూ శాశ్వతం కాదని గ్రహించినప్పుడు ఇది కలుగుతుంది.వైరాగ్యం సిద్ధించాలంటే రెండు ముఖ్యమైన పద్ధతులు అవసరమని భగవద్గీత చెబుతోంది. ‘అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే’. ఏది నిత్యం (శాశ్వతం), ఏది అనిత్యం (తాత్కాలికం) అని వేరు చేసి చూసే తెలివితేటలు. మనసుని పదే పదే ప్రాపంచిక కోరికల నుండి మళ్ళించి, అంతరాత్మ వైపు తిప్పుకోవడం. దేని మీద ఆశ లేనప్పుడు, అది దక్కలేదనే మానసిక ప్రశాంతత, కోల్పోతామనే భయం లేకపోవడం వైరాగ్యం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు.వైరాగ్యం అనేది ఒక మందు వంటిది. అది సంసార వ్యాధిని నయం చేసి, మనిషిని తన నిజ స్వరూపమైన ఆనందం వైపు నడిపిస్తుంది. జీవితాన్ని త్యజించడం వైరాగ్యం కాదు, జీవితాన్ని సరైన దృక్పథంతో దర్శించడమే నిజమైన వైరాగ్యం. జీవితం పట్ల సరైన అవగాహన. ఒక పక్షి పండును తింటున్నప్పుడు ఆ రుచికి బానిస కావచ్చు. కానీ మరొక పక్షి అదే చెట్టు మీద ఉండి, పండును తినకుండా కేవలం చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఈ ‘సాక్షి భూత’ స్థితిలో ఉండటమే వైరాగ్యానికి సంకేతం. భగవద్గీత ప్రకారం వైరాగ్యం అంటే పనులను వదలడం కాదు, ఫలాపేక్షను వదలడం. వైరాగ్యం వల్ల మనిషికి నిర్భయత్వం కలుగుతుంది. ‘వైరాగ్యమేవ అభయం’ అని భర్తృహరి సుభాషితం చెబుతోంది. భోగంలో రోగ భయం ఉంటుంది, కులంలో పతనం ఉంటుందనే భయం ఉంటుంది, ధనంలో రాజుల భయం ఉంటుంది.. కానీ వైరాగ్యంలో మాత్రం ఎటువంటి భయం ఉండదు. ఇది మనిషికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. వైరాగ్యం అంటే కేవలం బాహ్య ప్రపంచాన్ని లేదా బాధ్యతలను వదిలేసి అడవులకు వెళ్లడం కాదు. ఇది మనసుకి సంబంధించిన ఒక స్థితి. వస్తువుల మీద, వ్యక్తుల మీద లేదా ఫలితాల మీద ఉండే అతివ్యాప్తిని వదిలివేయడమే నిజమైన వైరాగ్యం.– ఆనంద ‘మైత్రేయ’మ్


