అయ్యప్ప దీక్షలో అతి ముఖ్యమైన ఘట్టం వనయాత్ర. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ హరిహరసుతుని సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదే ప్రధానమైనది. ఇరుముడిని తలపై పెట్టుకుని..
ఇరుముడితోటి నిను మదినింపి కదిలేము స్వామి
అండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా….
'పల్లికట్టు శబరిమలైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే
పళ్లికట్టు శబరిమళైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే'
అంటూ ఉత్సాహంగా సాగుతుంది ఈ వనయాత్ర. అయ్యప్ప దీక్షలో ముఖ్యంగా వనయాత్ర సమయంలో, "స్వామియే శరణం అయ్యప్ప" అని భక్తులు చెప్పే ఒక నినాదమే ఈ "కల్లుం ముల్లుం కాలికి మెత్తై". దీని అర్థం ఈ కఠినమైన వనయాత్ర మార్గంలో ఉన్న రాళ్ళు, ముళ్ళు కూడా అయ్యప్ప దీక్షలోని భక్తి, శ్రద్ధ వల్ల వారికి మెత్తగా అనిపిస్తాయని భక్తుల విశ్వాసం.
ఇక ఈ యాత్రలో భాగంగా పుణ్య నదుల్లో స్నానం ఆచరించి...దట్టమైన వృక్షాల మీదుగా వచ్చే ఔషధ గాలులను పీల్చుకుంటూ ఏదో తెలియని భక్తిపారవశ్యంతో ముందుకు సాగిపోతారు. ఇది సాక్షాత్తూ అయ్యప్పస్వామి నడిచివెళ్లిన మార్గం అని చెబుతుంటారు..
వాస్తవానికి మాలధారులు అయ్యప్ప దర్శనంకోసం పెద్దపాదం మార్గంలో కొందరు..చిన్నపాదం మార్గంలో మరికొందరు వెళతారు. అయితే ఈ పెద్దపాదం మార్గం భక్తులకు పలు సవాళ్లును విసురుతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది భక్తి, ఓర్పు, ఆత్మనిర్భరత ప్రాముఖ్యతలను తెలియజేసే గొప్ప ఆధ్యాత్మిక యాత్రగా పేర్కొనవచ్చు. మరి పెద్దపాదంగా పిలిచే ఈ వనయాత్ర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!
నిజానికి అయ్యప్ప భక్తులు జీవితకాలంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలని అంటుంటారు. పెద్దపాదం అంటేనే వనయాత్ర. ఇది ఎరుమేలి దగ్గర ప్రారంభమయ్యే యాత్ర.. సుమారు 58 కిలోమీటర్ల దూరం కాలినడకన భక్తులు స్వామివారి సన్నిధి చేరుకుంటారు. అడవి గుండా సాగే పెద్దపాదం యాత్ర... రాళ్లు, రప్పలతో నిండి ఉంటుంది..ఎక్కడా రోడ్డు కనిపించదు. మధ్య మధ్యలో పక్షులు, జంతువులు, సెలయేర్లు, లోయలు కనిపిస్తాయి. ఈ దారి మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లితే ఆ ఫీల్ వేరేలెవెల్.
ఎందుకు వనయాత్ర చేయాలంటే..
ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామిని ( అయ్యప్ప స్నేహితుడు..అనంతరకాలంలో భక్తుడు) ముందుగా దర్శించుకుని అక్కడ పేటతుళ్లై అనే నత్యం ఆడతారు. పేటతుళ్లై తర్వాత ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్భాణధారియై అయ్యప్పను దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి భక్తుల వనయాత్ర మొదలవుతుంది.
అప్పటి రోజుల్లో శబరిమల చేరుకునేందుకు వనయాత్రనే అనుసరించేవారు. ఆ తర్వాత మారిన పరిస్థితులు, భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని చినపాదం యాత్రను ప్రారంభించింది దేవస్థానం. అనంతరం కేరళ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించింది.ఈ ప్రాంతం మొత్తం ఎన్నో వన మూలికలు ఉంటాయి. నడక మార్గంలో ఆ మూలికల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఒక్కసారైనా వనయాత్ర చేయాలంటారు.
రాళ్లు విసరడానికి రీజన్..
పెదపాదం మార్గంలో భాగంగా అళుదా నదినుంచి రెండు రాళ్లు తీసుకుని..ఆ రాళ్లను కళిద ముకుండ అనే ప్రదేశంలో వేస్తారు. పురాణాల ప్రకారం..నిజానికి ఈ మార్గంలో భక్తులు పెరూర్తోడు, కాలైకట్టి వంటి ప్రదేశాలను దాటుతారు. మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తున్నప్పుడు శివకేశవులు కాలైకట్టి వద్ద నిలబడి చూశారని ఇతిహాసం. ఆ నేపథ్యంలోనే భక్తులు అళుదా నదిలో స్నానం చేసి, అక్కడ లభించిన ఒక రాయిని తమతో తీసుకువెళ్లి, మహిషి కళేబరాన్ని పూడ్చిన "కళిడం కుండ్రు"లో వేస్తారు
ఈ మార్గంలో అన్నిటికన్నా కష్టమైన శిఖరాలంటే కరిమల, నీలిమల. అత్యంత కష్టమైన ఈ మార్గాన్ని దాటేందుకు స్వయంగా స్వామివారు సహాయం చేస్తారని భక్తుల విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం..ఈ వనయాత్ర చేసే భక్తులు, ముఖ్యంగా తొలిసారి వెళ్లే కన్నిస్వాములు, తలపై ఇరుముడి ధరించి మాత్రమే వెళ్లాలి. శబరిమల ఆలయం తెరిచిన ప్రతిసారీ పెదపాదం మార్గం ఓపెన్ చేయరు. కేవలం మకరవిళక్కు సమయంలో ఓపెన్ చేసి...తిరిగి సంక్రాంతి మకర జ్యోతి తర్వాత పెదపాదం మార్గం మూసివేస్తారు.
ఈసారి గట్టి భద్రతతోపాటు అసౌకర్యానికి ఆస్కారం లేకుండా..
ఇక ఈ ఏడాది మండల కాలం ఈ నెల నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. కేరళ ప్రభుత్వం ఈ అటవీ మార్గం గుండా భద్రతా ఏర్పాట్లు కోసం పది లక్షల టెండర్ని కేటాయించింది. ఈసారి మాత్రం రాత్రిపూట నిషేధం, పగటిపూట కొన్ని ఆంక్షలతో ఈ యాత్రకు కావల్సిన సన్నహాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. కాలినడకన వచ్చే భక్తులకు ఈ అటవీ మార్గాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.
అడవి జంతువుల బెడద రీత్యా రహదారిపై రాత్రి ప్రయాణం, పగటిపూట ప్రవేశ పరిమితులు కొనసాగుతాయని ఎరుమేలి అటవీ రేంజ్ ఆఫీసర్ హరిలాల్ తెలిపారు. అంతేగాదు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటaల వరకు ప్రయాణానికి అనుమతి ఉంది. అలాగే అడవి జంతువులు ఉనికిని ముందుగా తెలియజేసేలా హెచ్చరికలు, జాగ్రత్తలు వంటి భద్రతా చర్యలు తీసుకునేలా ప్రత్యేకంగా అటవీశాఖకు చెందిన స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే అటవీ సంరక్షణ కమిటీ (VSS, పర్యావరణ అభివృద్ధి కమిటీ(EDC) నేతృత్వంలో అటవీ శాఖ పర్యవేక్షణలో వ్యాపారులకు భద్రత కల్పిస్తామని పేర్కొంది. ఈసారి దారిలో ఆక్సిజన్ పార్లర్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే కలయకెట్టులో ఆరోగ్య శాఖ చికిత్సా కేంద్రం ప్రారంభిస్తామని తెలిపింది. గత సీజన్లలో పాములు, సరీసృపాల దాడుల కారణంగా చాలామంది ప్రమాదాల బారిన పడ్డారు.
ఈసారి అలాంటివి తలెత్తకుండా తక్షణ వైద్య సాయం అందేలా పర్యవేక్షించనున్నారు అధికారులు. కలయకెట్టూ, అలుదాలో ఆస్పత్రి అందుబాటులో లేకపోవడం వల్ల సత్వర చికిత్స అందక భక్తులు ప్రమాదాల బారినపడుతున్నారనేది వాదన. అదీగాకుండా ఎరుమేలి ఆసుపత్రికి తరలించడానికి సత్వరమే వాహనం అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చింది.
(చదవండి: శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!)


