కేరళ శబరిమల సన్నిధానం పర్యవేక్షణకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. సన్నిధానం పరిసరాల్లోని షాపింగ్ కాంప్లెక్స్లు, ఫుడ్ కాంప్లెక్స్లు ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేఫ్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకపోవడంతో పాటు సరైన నిబంధనలు పాటించిన వ్యాపార సముదాయాలకు జరిమానా విధించారు.
అయ్యప్ప సన్నిధాన పవిత్రతను కాపాడడానికి దేవస్థానం బోర్టు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇది వరకే శబరిమలలో ప్లాస్టిక్ వాడకంపై పూర్తిగా నిషేదం విధించారు. ఈ నేపథ్యంలో శబరిమలలోని హోటళ్లు, ఫుడ్కోర్టులు, ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేప్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకుండా నిబంధనలకు అనుగుణంగా లేని వాటిపై దాదాపు రూ. 98 వేల జరిమానా విధించారు.
భక్తులు రద్దీని దృష్టిని ఉంచుకొని అధిక ధరలకు వస్తువుల అమ్మడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం తదితర అంశాలను ఆరా తీశారు. ఆహార పదార్థల ధరలను పట్టికలో పొందుపర్చాలని వాటిని ఎట్టి పరిస్థితుల్లో అధిక ధరలకు అమ్మకూడదని తెలిపారు. చలి తీవ్రత దృష్ట్యా భక్తులకు కచ్చితంగా వేడినీటినే సరఫరా చేయాలని కూల్ వాటర్ ఇవ్వకూడదని తెలిపారు. అదే విధంగా దేవస్థానం ఉద్యోగస్థుల పేరుతో మోసం చేసే వారిపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు.


