breaking news
Sabarimala Ayyappa Temple
-
16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే.
సాక్షి శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్లో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కేవలం 16 రోజుల్లోనే రూ.92 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంటే ఈ సీజన్ తొలి 16 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. గతేడాది ఇదే సీజన్తో పోలిస్తే ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగినట్లు టీడీబీ పేర్కొంది. అయితే గతేడాది కేవలం రూ.69 కోట్లు మాత్రమే వసూలైనట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఈ ఏడాది ఆదాయంలో అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచే వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు దాదాపు రూ.47 కోట్లు ప్రసాదాల విక్రయాల ద్వారే సమకూరినట్లు బోర్డు వివరించింది. ఇక మండల-మకరవిలక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు(16 రోజుల తర్వాత) సుమారు పదమూడున్నర లక్షల మందికి పైగా భక్తుల అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. శని, ఆదివారాల్లో రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ..సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. సోమవారం గురుపవనపురి ఏకాదశి సందర్భం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 90 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. అలాగే కేరళ అన్నదాన సద్య పథకం నేడు ప్రారంభం కాదని దేవస్వం బోర్డు తెలిపింది. కాగా, పంపా నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలో 12 ప్రదేశాల్లో తాగునీరు, స్నాక్స్, అత్యవసర ఆరోగ్య సేవలను ఏర్పాటు చేశారు.(చదవండి: శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!) -
శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!
సాక్షి శబరిమల: మొన్నటివరకు జసందోహంతో కిటకిటలాడిన శబరిమల ఈ రోజు చాలా ఖాళీగా దర్శనమిచ్చింది. వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకున్న వారిలో దాదాపు 15% మంది దాక రాలేదు. అందువల్ల గత రెండు రోజులుగా అయ్యప్ప స్వామి దర్శనానికి రద్దీ తగ్గింది. స్పాట్ బుకింగ్ పరిమితిని పెంచుకోవచ్చని కేరళ హైకోర్టు చెప్పినా.. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి సన్నిధానంలోని నడపండాల్, పదునెట్టాంబడి(18 మెట్లు), అయ్యప్ప ఆలయ ప్రాంగణం, మాలికాపురోత్తమ్మ మంజుమాత ఆలయం వద్ద రద్దీ తక్కువగా ఉండటం గమనార్హం. అలాగే 18వ మెట్టు ఎక్కడానికి క్యూలైన్ నిన్నమొన్నటి వరకు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. సగటున నిమిషానికి 85 మంది భక్తులు 18 మెట్లను అధిరోహించారు. సోమవారం మాత్రం ఇక్కడి క్యూలైన్లలో భక్తులు తక్కువగా కనిపించారు. పంపా నుంచి వచ్చిన వారు వేచి ఉండకుండా నేరుగా మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు ఉదయం 7.30 గంటలకు పూజ సమయం కావడంతో 18వ మెట్టు ఎక్కడానికి అరగంటపాటు నిలిపివేసినా కూడా అంతగా రద్దీ లేదు. ఇదిలా ఉండగా, డిసెంబరు 27తో వర్చువల్ క్యూబుకింగ్ పూర్తయింది. ఒకవేళ బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. అక్కడ ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది. అంటే దీని అర్థం మండలకాలం ముగిసేవరకు ఎవరూ కొత్త స్లాట్ బుక్ చేసుకోలేరు. ఇక ప్రతి రోజు శబరిమల సన్నిధానం రద్దీ ఆధారంగా స్పాట్ బుకింగ్లకు అనుమతివ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నీలక్కల్లో, వండిపెరియార్ వద్ద మాత్రమే స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. ఈ స్పాట్ బుకింగ్ అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. అదంతా గంటలోపు పూర్తవుతుంది. దాంతో ఇరుముడితో వచ్చే యాత్రికులు నిరాశతో నీలక్కల్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాగా, గతేడాది ఇరుముడితో వచ్చే భక్తులను ఎవ్వరిని వెనక్కి పంపకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆ వైఖరిని మార్చడం గమనార్హం..! దీనివల్ల యాత్రికులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయి. అయితే దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మాత్రం తగ్గుతోంది. ఈ ఉదయం వరకు ఉన్న గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 12.13 లక్షల మంది అయ్యప్పలు ఆలయాన్ని సందర్శించారు.(చదవండి: ఆ హరిహరసుతుడికి పిండిచేసిన పాయసం నుంచి నువ్వుల పాయసం వరకు..!) -
కొచ్చి ఎయిర్పోర్టులో అయ్యప్పలకు ఉచిత బస
కొచ్చి: కొచ్చి విమానాశ్రయంలో అయ్యప్ప భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏసీ ఉచిత వసతి, స్పాట్ బుకింగ్, రవాణా సౌకర్యాలు అందిస్తున్నారు. కొచ్చి విమానాశ్రయంలో శబరిమల యాత్రికుల కోసం దేశంలోనే మొదటి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. యాత్రికులు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే శబరిమల దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.రాత్రి 8 గంటలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30కి పంబా చేరతాయి. భక్తుల కోసం మార్గమధ్యలో ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రాల(ఎడతవలం) వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆహారం, నీరు అందిస్తున్నారు.కాగా, విమానంలో శబరిమలకు వెళ్లే స్వాములకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చెక్ఇన్ లగేజీగా పంపేలా ఇంతకాలం ఉన్న ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కేబిన్ బ్యాగేజీగా తమ వెంట తీసుకెళ్లడానికి స్వాములకు వీలు కలగనుంది. తాజా నిర్ణయంతో.. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకువెళ్ళవచ్చు. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ.. సంబంధిత భద్రతా శాఖలతో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. జనవరి 20వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని అన్నారాయన.శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ కారణంగానే చాలామంది స్వాములు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు. -
పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్ఆర్టీసీ సేవలకు అనుమతి
సాక్షి శబరిమల: పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్ఆర్టీసీ బస్ సర్వీసులకు అనుమతి లభించింది. ఈ మేరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చారు. ముఖ్యంగా తమిళనాడులో ఏడు కేంద్రాలకు కొత్త సర్వీసులు అనుమతించగా, మొత్తం 67 బస్సులకు అనుమతులు లభించినట్లయ్యింది. వాటిలో చెన్నై, కోయంబత్తూర్, పళని, తేంకాశి, కన్యాకుమారి, కంబం, తిరునెల్వేలి తదితర ఏడు ప్రాంతాలలో త్వరలో సర్వీసులు ప్రారంభంకానున్నాయి.అలాగే కర్ణాటకలోని బెంగళూరుకు కూడా కొత్త సర్వీసు ప్రారంభంకానుంది. శబరిమల అయ్యప్ప సన్నిధానం తెరుచుకుని వారం రోజులు కావడంతో..ఈ నేపథ్యంలోనే కేఎస్ఆర్టీసీ శబరిమలకు వచ్చే యాత్రికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు పంపాకు వెళ్లి-రావడానికి యాత్రికుల కోసం సుమారు 3,710 సర్వీసులు నడిపింది. గత ఆదివారం నాటికి రికార్డు స్థాయిలో రూ. 4 కోట్లుపైన ఆదాయం రావడం విశేషం. ఇక పంపా నుంచి నిలక్కల్కు 1,831 సర్వీసులు నడపగా, వివిధ ప్రాంతాల నుంచి 1,879 బస్సులు పంపాకు చేరాయి. నిలక్కల్–పంపా చైన్ సర్వీసులు కూడా విజయవంతంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 15,860 చైన్ సర్వీసులు నిర్వహించారు. అంతేగాదు చెంగన్నూరు, ఎర్నాకుళం, కోట్టాయం, తిరువనంతపురం వంటి ప్రాంతాలకు ఎక్కువ బస్సులు నడుస్తున్నాయి. మొత్తం 15 బస్ స్టేషన్ల నుంచి 502 బస్సులు పంపాకు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. అలాగే వీటితోపాటు కేఎస్ఆర్టీసి అంబులెన్స్ వాన్ కూడా సేవలందించేందుకు అందుబాటులో ఉంది. కాగా, ఈ సీజన్ ప్రారంభమైన వారం రోజుల్లోనే ఆరున్నర లక్షలకు పైగా యాత్రికులు ఈ కేఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. పైగా ఈసారి పంపా డ్యూటీకి కూడా ఆసక్తి ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మద్యం అలవాటు లేనివారిని, పనితీరు నిరూపించుకునేవారినే నియమించింది.(చదవండి: ఇలా బుక్ చేసుకుంటే.. కన్నిస్వాములకు శబరిమల యాత్ర ఉచితం..!) -
ఇలా బుక్ చేసుకుంటే.. కన్నిస్వాములకు శబరిమల యాత్ర ఉచితం..!
మండలం-మకరవిలక్కు పూజలతో శబరిమల జనసందోహంగా మారింది. భక్తులు నిరంతరం పంపాలో స్నానం చేసి శబరిగిరిపైకి చేరుతారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివస్తారు. ముఖ్యంగా మొదటి సారి మాలధారణ చేసి, ఇరుముడితో కొండకు వచ్చే కన్ని స్వాములు శరణ్గుత్తిలో బాణం/శరం గుచ్చి, అయ్యప్పను దర్శించుకున్నాక.. మాలికపురోత్తమ మంజుమాత ఆలయానికి చేరుకుంటారు. ఇందుకు అనేక కారణాలున్నాయి.మహిషిని అయ్యప్ప సంహరించాక.. ఆమె మాలికాపురోత్తమ(మాలికాపురం) లేదా మంజుమాతగా అవతరించినట్లు చెబుతారు. ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆజన్మ బ్రహ్మచారి అయిన అయ్యప్ప.. ఆమె ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అయితే.. మాలికాపురోత్తమ నొచ్చుకోవడంతో.. ఏటా తన దర్శనానికి కన్నిస్వాములు రాని సంవత్సరం తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కన్ని స్వాములు ఏటా ఎరుమేలిలో వేటతుళ్లి ఆడేప్పుడు శరం/బాణం తీసుకుని, దాన్ని తమవద్దే భద్రపరుచుకుంటారు. పంపాస్నానం తర్వాత శబరిపీఠం దాటాక.. శరణ్గుత్తి వద్ద గుచ్చుతారు. ఏటా మకరవిళక్కు పర్వదినానికి ముందు మంజుమాత అయ్యప్ప సన్నిధి సమీపంలోని ఆలయం నుంచి ఏనుగు అంబారీపై శరణ్గుత్తి వరకు రావడం.. కన్నిస్వాములు వచ్చారనడానికి గుర్తుగా అక్కడ బాణాలు ఉండడం చూసి, నిరాశగా వెళ్లడం ఏటా జరిగే తంతులో భాగమే.అందుకే కన్నిస్వాములకు అయ్యప్ప యాత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) కూడా కన్నిస్వాముల కోసం ప్రత్యేక సేవలు అందిస్తోంది. కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకునే కన్ని స్వాములకు కేవలం ఒక్కరూపాయి చార్జీతో.. తిరువనంతపురం సెంట్రల్ నుంచి పంపాబేస్ వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ బస్సు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది. (చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!) -
శబరిమలలో వర్చువల్ ఆన్లైన్ బుకింగ్ సంఖ్య మళ్లీ పెంపు
సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో రేపటివరకు (24వ తేదీ) తక్షణ దర్శనానికి అనుమతించే బుకింగ్ సంఖ్యను 5 వేలుగా పరిమితం చేయాలని కేరళ హైకోర్టు ముందుగా ఆదేశించింది. దీనిపై దేవస్వం బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు, పరిస్థితులను బట్టి తక్షణ బుకింగ్ సంఖ్యను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీన్ని అనుసరించి నిన్నటి నుంచి వర్చువల్ బుకింగ్ సంఖ్య పెంచింది. ప్రస్తుతం ఒక నిమిషానికి 85 మంది భక్తులు వరకు 18వ మెట్టుకు ఎక్కడానికి అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది దేవస్వం బోర్డు.(చదవండి: శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం) -
ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!
ఒకప్పుడు వాళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. సాధారణంగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత..ఉన్నత చదువుల రీత్యా లేదా మరేదైనా కారణాల వల్ల విడిపోవడం అనేది కామన్. అలానే ఈస్నేహితులు వారి లక్ష్యాల దృష్ట్యా వేరయ్యారు ఆ మిత్రులు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు శబరిమల సన్నిధానంలో తారసపడి..వేర్వేరుగా విధులు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకరు భద్రతా బాధ్యతలైతే మరొకరు స్వామి సేవలో తరిస్తుండటం విశేషం.ఆ స్నేహితులే ప్రసాద్ నంబూద్రి, షోజులు. ఎరన్నూర్లోని చాలకుడికి చెందిన ప్రసాద్ నంబూద్రి, మేలూర్కి చెందిన షోజులిద్దరూ. 1997 నుంచి 99 వరకు ఐటీఐలో కలిసి చదువుకున్నారు. రెండు సంవత్సరాల అనంతరం పై చదువుల దృష్ట్యా ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. కట్ చేస్తే..26 ఏళ్లకు అదే స్నేహితులు అయ్యప్పస్వామి సేవలో తరిస్తుండటం చూస్తే..ఎవరిని ఎప్పుడూ కలపాలో అప్పుడే కలుపుతాడు అనేందుకు ఈ ఫ్రెండ్సే ఉదాహరణ. ఈ ఇద్దరు యాదృచ్ఛికంగా శబరిమలలోనే విధులు నిర్వరిస్తుండటం అత్యంత ఆసక్తికర అంశం. ఇక్కడ షోజు ఏఎస్ఐగా శబరిమలలో భద్రతా బాధ్యతలు చూసుకుంటే..నంబూద్రి యాత్రికులను నియంత్రించడం, స్వామి దర్శనం అయ్యేలా చూసే మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంటే ఇక్కడ షోజు తన స్నేహితడు మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్న నంబూద్రికే భద్రత కల్పిస్తూన్నాడు. ప్రస్తుతం షోజు త్రిస్సైర్ జిల్లా స్పెషల్ బ్రాంచ్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తుండగా, అదేసమయంలో నంబూద్రి శబరిమల మేల్శాంతిగా ఎన్నికయ్యారు. దాంతో ఆయనకు సెక్యూరిటీగా యాదృచ్ఛికంగా చిన్ననాటి స్నేహితుడు షోజునే నియమాకం అయ్యాడు. అలాగే నంబూద్రి వచ్చే ఏడాది వరకు ఈ పదివిలో కొనసాగనున్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత విధుల రీత్యా ఒకచోటే ఆ ఇద్దరు నేస్తాలు కలిసి ఉండటం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కాదు కదూ..!. తంత్రి, మేల్శాంతి అంటే..'తంత్రి', 'మేల్శాంతి' అనే పదాలు ఆలయ పూజలో అత్యున్నత స్థానాలను సూచిస్తాయి. ముఖ్యంగా శబరిమల వంటి ఆలయాలలో. 'తంత్రి' అంటే ప్రధాన పూజారి. ఆయన ఆలయ నిర్వహణ, నియామకాల తోపాటు ముఖ్యమైన క్రతువులకు బాధ్యత వహిస్తారు. 'మేల్శాంతి' అంటే ప్రధాన పూజారి సహాయకుడు లేదా ముఖ్య పూజారి అని అర్థం. ఈయన ప్రధాన పూజారి సమక్షంలో రోజువారీ పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.Source: manorama news(చదవండి: శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం) -
శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం
సాక్షి పథనంతిట్ట: మండల మకరవిళక్కు(మండల దీక్ష) మహోత్సవం సందర్భంగా శబరిమల యాత్రికులు ప్రయాణించే వాహనాలకు మోటారు వాహనాల శాఖ(MVD) అత్యవసర సహాయం అందించనుంది. ఆ నిమిత్తమైన ఎంవీడీ రహదారుల పక్కనే సేవను ప్రారంభించింది కూడా. పథనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల ద్వారా శబరిమలకు ప్రయాణించే యాత్రికుల వాహనం చెడిపోయినా లేదా ప్రమాదం/ఇంకేదైన అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవను పొందవచ్చునని ఎంవీడీ పేర్కొంది. అంతేగాతు 24 గలంటల హైల్ప్లైన్ నంబర్లను ప్రారంభించింది. ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్ర మార్గంలో భక్తులకు ఎలాంటి అవాంతరాలు ఎదుర్వకుండా ఉండేలా సహాయం చేయడానికి ఎంవీడీ సదా సన్నద్ధంగా ఉంటుందని వెల్లడించింది. దీంతోపాటు ఎంవీడీ 24 గంటల శబరిమల సేఫ్ జోన్ హెల్ప్లైన్ నంబర్లను కూడా ప్రారంభించింది. ఇలవుంకల్, ఎరుమేలి, కుట్టిక్కనం వంటి ప్రాంతాల్లో MVD కంట్రోల్ రూమ్ల నుంచి నిరంత అత్యవసర సహాయం అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. అలాగే వాహనాల బ్రేక్లు విఫలమై ప్రమాదాలు జరిగినప్పుడూ తక్షణ క్రేన్ సహాయం, అంబులెన్స సేవలు అన్నివేళలా అందుబాటులో ఉంటాయని తెలిపింది. పైగా ఈ తీర్థయాత్ర సీజన్ను సజావుగా సురక్షితంగా చేయడానికి అందరం కలిసి పనిచేయడమే గాక, సురక్షితమైన తీర్థయాత్రగా సిద్ధం చేద్దాం అంటూ పిలుపునిచ్చింది కూడా. ఇక శబరిమలలో ఆయా సేప్జోన్ కంట్రోల్ రూమ్ నంబర్లు... ఇలవుంకల్: 9400044991, 95623181, ఎరుమెలి: 9496367974, 8547639173 కుట్టిక్కనం: 9446037100, 8547639176'. అలాగే యాత్రికుల సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం..మెయిల్ ఐడీ safezonesabarimala@gmail.comని సంప్రదించవచ్చు.(చదవండి: శబరిమల యాత్రికుల భద్రతపై..కేరళ ప్రధాన కార్యదర్శికి లేఖ..) -
శబరిమల గోల్డ్ కేసు: ఏపీకి లింకు..! నటుడు జయరాంను ప్రశ్నించే చాన్స్
పథనంతిట్ట: శబరిమల బంగారం దొంగతనం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆంధ్రప్రదేశ్ లింకులను ఆరా తీస్తోంది. అంతేకాకుండా.. ఈ కేసులో సినీనటుడు, జయరాం వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. సిట్లోని అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. శబరిమల బంగారం తస్కరణ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి చెన్నై, బెంగళూరులోని శ్రీరాంపూర్లోని అయ్యప్ప ఆలయాలకు బంగారు పూత పనులు చేయించారు. చెన్నైలోని ఆలయానికి బంగారు పూతకు అయిన ఖర్చును ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఖర్చు చేసినట్లు సిట్ గుర్తించింది. ఆలయ కుటీర ద్వారాలను కూడా ఆంధ్రప్రదేశ్లోనే తయారు చేసినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులకు.. ఈ కేసుకు సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు చెన్నై ఆలయంలో బంగారు పూత చేయించాక జరిపిన పూజాకార్యక్రమాల్లో సినీనటుడు జయరాం పాల్గొన్నట్లు సిట్ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో నటుడు జయరాం వాంగ్మూలం సేకరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో జయరాంను సంప్రదించింది. విచారణకు ఆయనకు అనుకూలమైన తేదీలను చెప్పాలని కోరింది. ఆ తేదీల్లో జయరాంను ప్రశ్నిస్తామని పేర్కొంది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే ఉన్నికృష్ణన్తోపాటు.. తొమ్మిది మంది అరెస్టయ్యారు. దేవాదాయ శాఖ మాజీమంత్రి సురేంద్ర పాత్రపైనా సిట్ ఆరా తీస్తోంది. ఈ కేసులో తాజాగా అరెస్టయిన దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ పాస్పోర్టును సిట్ సీజ్ చేసింది. ఆయన ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను సీజ్ చేసింది.బీజేపీ సీరియస్..శబరిమల బంగారం చోరీ అంశంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ కేసులో నిందితులెవరినీ అయ్యప్ప స్వామి వదిలిపెట్టబోరని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ అన్నారు. ఇప్పటి వరకు అరెస్టయిన వారంతా కమ్యూనిస్టులు, నాస్తికులేనని వ్యాఖ్యానించారు. దేవాలయాలను ధ్వంసం చేసినప్పుడే తమ మనుగడ ఉంటుందని కమ్యూనిస్టులు భావిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. కోళికోడ్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ప్రకటించారు. ఆదివారం ఆయన పథనంతిట్టలో మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు సదుపాయాలు కల్పించడంలో సీఎం పినరయి విజయన్ విఫలమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శబరిమల బంగారం చోరీ అనేది పినరయి విజయన్కు తెలియకుండా జరిగిన అంశమేమీ కాదన్నారు. ఇదో రాజకీయ కుట్ర అని విమర్శించారు. శబరిమలకు సంబంధించి గడిచిన 30 ఏళ్ల ఆడిట్ రిపోర్టును విజిలెన్స్తో తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. -
శబరిమలలో నెట్వర్క్ను పెంచిన వొడాఫోన్ ఐడియా
భక్తులకు సౌకర్యార్ధం శబరిమల మార్గంలో కనెక్టివిటీని పెంచే దిశగా తమ నెట్వర్క్ను మరింత పటిష్టం చేసినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. అలాగే, యాత్రకు వచ్చే బాలల సంరక్షణ కోసం వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్ను మరింతగా అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది.శబరిమల యాత్రలో భక్తులు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబీకులు, సంబంధీకులతో పంచుకునేలా శబరిమల మార్గంలోని సన్నిధానం, పంపా, నీలక్కల్ అంతటా కనెక్టివిటీని పెంచినట్లు టెల్కో తెలిపింది. ఇందుకోసం వొడాఫోన్ ఐడియా ఎల్ 900, ఎల్ 1800, ఎల్ 2100, ఎల్ 2300, ఎల్ 2500తో సహా వివిధ బ్యాండ్లలో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను మోహరించింది. అలాగే పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.యాత్రీకుల భారీ రద్దీలోనూ మెరుగైన డేటా, వాయిస్ సేవలు అందించేలా మాసివ్ మిమో టెక్నాలజీతో అధునాతన ఎఫ్డీడీ, టీడీడీ లేయర్లను కూడా మోహరించినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. దీంతో గణపతి కోవిల్, నడప్పంతల్, పరిపాలన కార్యాలయాలు, పంపా-సన్నిధానం ట్రెక్కింగ్ మార్గం, నీలక్కల్ పార్కింగ్, బస్టాండ్ వద్ద వొడాఫోన్ ఐడియా ద్వారా కనెక్టివిటీ గణనీయంగా బలోపేతం చేసినట్లు వివరించింది.ఇక పిల్లల వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్కు సంబంధించి ప్రీ–రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది. వీఐసురక్ష పోర్టల్తో పాటు కేరళవ్యాప్తంగా 25 వీఐ స్టోర్స్, 103 మినీ స్టోర్స్ మొదలైన వాటిల్లో రిజిస్టర్ చేసుకుని, పంబాలో ఏర్పాటు చేసిన వీఐ సురక్షా కియోస్క్ల నుంచి వీటిని పొందవచ్చని వివరించింది. -
కేరళ వెళ్లే భక్తులకు అలర్ట్.. మెదడులోకి ప్రాణాంతక అమీబా
తిరువనంతపురం: కేరళలో అయ్యప్ప దర్శనాలు జరుగుతున్న వేళ బ్రెయిన్ ఫీవర్ టెన్షన్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కేరళలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వైద్యులు సైతం తగు సూచనలు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా బ్రెయిన్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో, అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం, వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. దర్శనం సమయంలో స్నానాలు చేసే ముందు భక్తులు జాగ్రత్తా ఉండాలి. నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడులోకి చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ అమీబా మొదడులోకి చేరితే ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే, ఈ ఇన్ఫెక్షన్ మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు వెల్లడించారు. అధిక జ్వరం ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.Advisory for Sabarimala Pilgrims !! Kerala has reported cases of Amoebic Meningoencephalitis (Brain Fever). As a precaution, all devotees are advised to follow basic water-safety measures during the pilgrimage:🔸 Prevent river water from entering the nose🔸 Use only boiled… pic.twitter.com/o7rbMaeria— Sreekanth B+ve (@sreekanth324) November 17, 2025ఇదిలా ఉండగా.. కేరళలో గత 11 నెలల్లో దాదాపు 170 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో 41 మంది మరణించారు. ఇక, ఒక్క నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారినపడగా.. వారిలో ఎనిమిది మంది మృతి చెందినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమీబా వల్ల కలిగే మరణాలకు మూలాన్ని కనుగొనడానికి ఆరోగ్య శాఖ అధ్యయనం ప్రారంభించినట్టు వైద్యశాఖ తెలిపింది. ఈ అధ్యయనం మలప్పురం, కోజికోడ్, కొల్లం, తిరువనంతపురం వైద్య కళాశాలలపై నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ బ్రెయిన్ ఫీవర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అధిక జ్వరం.తీవ్రమైన తలనొప్పి, వాంతులు.నిద్రలేమి సమస్య.ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఉడికించిన లేదా సురక్షితమైన తాగునీటిని మాత్రమే తీసుకోవాలి.భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. -
శబరిమల: 18 మెట్ల వద్ద నల్ల త్రాచు.. పట్టుకున్న అటవీ బృందం
-
శబరిమల యాత్రికుల భద్రతపై..కేరళ ప్రధాన కార్యదర్శికి లేఖ..
శబరిమలలో భక్తుల భద్రతను నిర్థారించాలని కోరుతూ కేరళ ప్రధాన కార్యదర్శికి కర్ణాటక ప్రభుత్వం లేఖ పంపింది. శబరిమల వచ్చే భక్తులకు తగిన భద్రత,రవాణా సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొంది. లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు కర్ణాటకకు వస్తున్నారని, అందువల్ల వారి భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాట ప్రభుత్వం లేఖలో కోరింది. ఈ లేఖను కర్ణాటక కార్యదర్శి కేరళ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఇదిలా ఉండగా, శబరిమల యాత్ర నిమిత్తమై దేవస్వం బోర్డుభక్తులకు ఎలాంటి ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించ లేదంటూ అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం విమర్శలు ఎక్కుపెట్టింది. అంతేగాదు భక్తుల భద్రతా విషయమై ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేపోయిందని దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది. గతంలో అఖిల కేరళ అయ్యప్ప సేవా సంఘం దాదాపు 4 వేల మంది వాలంటీర్లతో శబరిమలలో తాగునీరు, ఉచిత ఆహారం ఇతర సేవలను అందించింది. అయితే, దేవస్వం బోర్డు కోర్టును ఆశ్రయించిన తర్వాత రెండేళ్లుగా ఇది నిలిపేశారు. అవినీతికి మార్గం సుగమం చేయడానికి అయ్యప్ప సేవా సంఘాన్ని అక్కడి నుంచి బహిష్కరించాలని కొంతమంది దేవస్వం బోర్డు అధికారులు కోర్టును ఆశ్రయించారని వాదనలు కూడా వినిపించాయి. అయితే అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం మాత్రం అవకాశం ఇస్తే..ఇప్పుడైనా అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని పేర్కొనడం గమనార్హం.(చదవండి: శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం..) -
శబరిమల: 18 మెట్ల వద్ద నల్ల త్రాచు.. పట్టుకున్న అటవీ బృందం
పథనంతిట్ట: ఓవైపు శబరిమల సన్నిధానం భక్తులతో కిక్కిరిసిపోగా.. ఓ నల్లత్రాచు పాము 18 మెట్లను అధిరోహించేందుకు ప్రయత్నించిన ఉదంతమిది..! ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్ అటవీ అధికారుల కథనం ప్రకారం.. మంగళవారం శబరిమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. సాయంత్రం వేళల్లో ఆ రద్దీ పెరగడంతో నిమిషానికి 80 మంది స్వాములు 18 మెట్లను అధిరోహించారు.ఈ క్రమంలో పద్దెనిమిది మెట్ల సమీపంలో ఓ నల్లత్రాచు కలకలం రేగింది. అటుగా వచ్చిన పాము.. మెట్లపైకి ఎక్కేందుకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు పైనుంచి కేకలు వేస్తూ.. అదిరించడంతో ఆ పాము మెల్లిగా వెనక్కి మరలి.. గణపతి హోమం వైపు వెళ్లింది. సమాచారం అందుకున్న అటవీ బృందం.. కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న స్నేక్ క్యాచర్లను అక్కడకు పంపింది.అటవీ శాఖ స్నేక్ క్యాచర్లు క్షణాల్లో చాకచక్యంతో ఆ పామును ఓ బ్యాగులో బంధించారు. ఈ వీడియోను రాష్ట్ర అటవీశాఖ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. శబరిమలలో మండల సీజన్కు ముందే అటవీశాఖ పంపాబేస్, నీలిమల, శరణ్గుత్తి, సన్నిధానం, నీలక్కల్ ప్రాంతాల్లో స్నేక్ క్యాచర్ల బృందాలను మోహరించింది. ఇప్పటి వరకు ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో 10కి పైగా విషసర్పాలు, మరో పాతిక దాకా సాధారణ సర్పాలను పట్టుకున్నట్లు వివరించింది. -
శబరిమలలో ఏపీ యాత్రికుల బస్సు ప్రమాదం.. 11 మందికి గాయాలు
పథనంతిట్ట: ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల బస్సు కేరళలోని మావత్తుపుళ సమీపంలోని త్రికలత్తూర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ నుంచి శ్రీదుర్గా ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సులో ఇద్దరు చిన్నారులు సహా.. 33 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు బయలుదేరారు.వీరి బస్సు గురువారం తెల్లవారుజామున త్రికలత్తూర్లోని ఎంసీ రోడ్డు మీదుగా వెళ్తుండగా.. అటుగా వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలక్కాడ్కు చెందిన లారీ డ్రైవర్ రెమీ, బస్సు డ్రైవర్ గౌతమ్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు వైపు సీట్లలో కూర్చున్న అయ్యప్ప భక్తులు బాలాజీ, వెంకటేశ్, మోహన్ బాబు, గోవింద్, చంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఉమాపతి, ఉదయ్కుమార్, దీపికలకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను అలువాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. యాత్రికులంతా ఆంధ్రప్రదేశ్కు చెందినవారని వెల్లడించారు.తప్పిన పెను ప్రమాదంలారీ బస్సును వేగంగా ఢీకొనడంతో.. బస్సు డ్రైవర్ నియంత్రణను కోల్పోయి, పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టారు. దాంతో విద్యుత్తు స్తంభం సగానికి విరిగిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు వెంటనే పోలీసులు, విద్యుత్తు శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. అధికారులు వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనతో ఉదయం వరకు ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు గురువారం ఉదయం క్రేన్ సాయంతో లారీని రోడ్డు నుంచి తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం..
శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీ విషయమై ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శబరిమలలో తొలి జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF) విధుల్లోకి చేరింది. ఈ మేరకు ప్రాంతీయ రిస్పాన్స్ సెంటర్కు చెందిన 4వ బెటాలియన్లోని 30 మంది సభ్యుల బృందం నవంబర్ 19న సన్నిధానానికి చేరుకుంది. ప్రస్తుతం వారు మెట్లు ప్రాంతం మరియు నడక మార్గాల వద్ద మోహరించారు. ఒకేసారి ప్రతి ప్రాంతంలో ఐదుగురు చొప్పున విధుల్లో ఉన్నారు. చెన్నై నుంచి వచ్చిన 38 మంది సభ్యుల మరో బృందం కూడా నిన్న రాత్రి చేరుకుంది. యాత్రికులకు సీఆర్పీ సహా అత్యవసర వైద్య సహాయం అందించేలా ప్రత్యేక శిక్షణ తీసుకున్న బృందం. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, స్ట్రెచర్లు తదితర సామగ్రిని సిద్ధం చేశారు కూడా. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడంతో పాటు, రక్షణ కార్యక్రమాలను సమన్వయం చేసేలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఈ బృందం శబరిమల ఏడీఎం పోలీసుల ప్రత్యేక అధికారి ఇచ్చే సూచనల మేరకు పనిచేస్తుందని ఇన్స్పెక్టర్ జీసీ ప్రసాద్ తెలిపారు. కట్టుదిట్టమైన ఆంక్షలు..ప్రస్తుతం శబరిమలలో మరిన్ని ఆంక్షలు విధించారు. స్పాట్ బుకింగ్ 20 వేల మందికి పరిమితం చేశారు. పంపా చేరుకున్న భక్తులు తమ శబరిమల దర్శనాన్ని పూర్తి చేసుకుని నిర్ణీత సమయంలోపు తిరిగి వస్తారు. అధికంగా వచ్చే వారికి మరుసటి రోజు దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారుల పేర్కొన్నారు. నీలక్కల్ నుంచి పంపా వరకు ప్రవేశం పరిమితం చేసినట్లు తెలిపారు. భక్తులకు నీలక్కల్లో వసతి సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొంది ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు.(చదవండి: ఒక్క నిమిషంలో 80 మంది.. జరగరానిది జరిగితే ఏం చేస్తారు?) -
శబరిమల బస్సులు: కేరళ వర్సెస్ తమిళనాడు
చెన్నై: శబరిమలకు నడిచే ప్రైవేటు బస్సుల విషయంలో తమిళనాడు వర్సెస్ కేరళ అన్నట్లుగా పరిస్థితులు మొదలయ్యాయి. దీంతో 10 రోజుల పాటు కేరళకు బస్సులను నడిపేది లేదంటూ తమిళనాడు ప్రైవేటు బస్ ఆపరేటర్లు భీష్మించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పటికే తమకు రూ.22 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రైవేట్ బస్ ఆపరేటర్లు చెబుతున్నారు. వివాదమేంటి??శబరిమల సీజన్ ప్రారంభం కావడంతో.. ఎప్పటిలాగే తమిళనాడు ప్రైవేటు బస్ ఆపరేటర్లు కేరళకు సర్వీసులను ప్రారంభించారు. నిజానికి ప్రభుత్వ రవాణా సంస్థలు నడిపే బస్సుల సంఖ్య డిమాండ్కు అనుగుణంగా లేకపోవడంతో.. ఆ భర్తీని ప్రైవేటు బస్ ఆపరేటర్లు తీరుస్తున్నారు. 150 వరకు బస్సులు తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులను శబరిమలకు తీసుకువస్తుంటాయి. అయితే.. ఈసారి సీజన్ ప్రారంభమైనా.. తమిళనాడు బస్ ఆపరేటర్లకు కేరళ రాష్ట్ర రవాణా శాఖ పర్మిట్లు ఇవ్వలేదు. పర్మిట్లు లేకుండా.. ఆల్-ఇండియా టూరిస్టు అనుమతి పత్రాలతో తమ రాష్ట్రంలోకి వచ్చే బస్సులకు భారీ జరిమానాలు విధించింది. దీంతో.. బస్ ఆపరేటర్లు కేరళకు బస్సులు నడిపేది లేదని తేల్చిచెప్పారు. 10 రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు ఎన్.అంబలగన్ మీడియాకు తెలిపారు. కేరళీయులకూ ఇబ్బందులే..అయ్యప్ప భక్తులను శబరిమలకు తీసుకువచ్చే ప్రైవేటు బస్సులు.. తిరుగు ప్రయాణంలో తమిళనాడుకు వచ్చే కేరళీయులకు సేవలు అందిస్తున్నాయి. తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ విషయంలో భక్తులు, ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని, కేరళ సర్కారు ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని, ప్రైవేటు బస్ ఆపరేటర్లపై వేధింపులను ఆపాలని అంబలగన్ డిమాండ్ చేశారు. భక్తుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని, మినీ బస్సులకు కూడా అనుమతినివ్వాలని కోరారు. ఇందుకోసం కేరళ సర్కారుతో చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. -
శబరిమలలో.. చిన్నారుల ట్రాకింగ్కు ‘వీఐ బ్యాండ్’
పథనంతిట్ట: శబరిమలలో రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు కేరళ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గడిచిన నాలుగు రోజుల్లో శబరిమలకు వచ్చిన భక్తుల్లో చిన్నారుల వాటా 15శాతంగా ఉండడంతో.. వారి భద్రతకు వొడఫోన్-ఐడియా(వీఐ)తో కలిసి సురక్ష బ్యాండ్లను ప్రవేశపెట్టారు. తప్పిపోయిన చిన్నారులను ట్రాక్ చేసేందుకు ఈ బ్యాండ్ ఉపయోగపడుతుంది. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులు, వీఐ ప్రతినిధులు ఆ బ్యాండ్లను ఆవిష్కరించారు. మండల, మకరవిళక్కు సీజన్లో సెల్ సిగ్నల్స్ మెరుగుపరిచేందేకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వీఐ ప్రతినిధులు తెలిపారు. నీలక్కల్, పంపా, శబరిమల, సన్నిధానం ప్రాంతాల్లో ప్రత్యేకంగా 13 సెల్టవర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో వేగవంతమైన డేటా కనెక్టివిటీ ఉంటుందన్నారు. ఎక్కడా సెల్ సిగ్నల్ డ్రాపవ్వకుండా.. కనెక్టివిటీ ఉంటుందన్నారు. పిల్లల భద్రతకు ఇలా..చిన్నారులతో కలిసి వచ్చే అయ్యప్ప భక్తులు పంపాలోని ‘వీఐ సెక్యూరిటీ కియోస్క్’ల వద్ద సెక్యూరిటీ బ్యాండ్ను తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఈ బ్యాండ్ల కోసం రిజిస్టర్ అవ్వొచ్చు.కేరళలోని ప్రతి వీఐ స్టోర్లో చిన్నారుల సురక్ష బ్యాండ్లు లభ్యమవుతాయి.ఈ బ్యాండ్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి బ్యాండ్కు ప్రత్యేక డిజిటల్ కోడ్/ఐడీ ఉంటుంది.ఒకవేళ ఈ బ్యాండ్ ఉన్న చిన్నారులు తప్పిపోతే.. వారిని ట్రాక్ చేసి, గుర్తించవచ్చని పథనంతిట్ట ఎస్పీ ఆనంద్ వెల్లడించారు.గత ఏడాది శబరిమల సీజన్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ బ్యాండ్లను ప్రవేశపెట్టామని, అవి సత్ఫలితాలనివ్వడంతో ఈ సారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. -
శబరిమల రద్దీ: నియంత్రణలో సర్కారు విఫలం- మండిపడ్డ విపక్షాలు
తిరువనంతపురం: శబరిమలలో భక్తుల రద్దీ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు ఈ విషయంపై పినరయి విజయన్ సర్కారును దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం ఊమెన్ చాందీ పంపాకు వెళ్లి మరీ.. పరిస్థితిని సమీక్షించారని, వేర్వేరు శాఖలను సమన్వయపరిచి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శబరిమలలో ప్రస్తుత పరిస్థితి భయంకరంగా ఉందని దేవస్వం బోర్డు అధ్యక్షుడే స్వయంగా అన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘గ్లోబల్ అయ్యప్ప సంగమం’ పేరుతో లాభాల వేట ప్రారంభించిన పినరయి సర్కారు.. భక్తుల సమస్యలను గాలికొదిలేసిందన్నారు.‘‘భక్తులకు తాగునీరు లేదు. మరుగుదొడ్డ సౌకర్యం లేదు. క్యూలైన్లలో 10-15 గంటల పాటు నిలబడి.. ఇబ్బందులపాలవుతున్నారు. స్వాములు నడిచే దారిలో మురుగునీరు ప్రవహిస్తోంది. పంపానది మురికికూపంగా మారుతోంది. సీజన్ ప్రారంభానికి వారం ముందు నుంచే సన్నాహాలు చేయాల్సిన సర్కారు.. భక్తుల సదుపాయాలను గాలికొదిలేసింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే శబరిమల సీజన్ను గందరగోళం చేస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు. శబరిమల అభివృద్ధికి నిధులను ప్రకటించినా.. విడుదల చేయడం లేదని, స్వాములు నడిచే మార్గంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం జోక్యం తప్పనిసరి: బీజేపీశబరిమలలో భక్తులు అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.మురళీధరన్, ఆ పార్టీ నేత పీకే కృష్ణదాస్ అన్నారు. శబరిమల చరిత్రలోనే తొలిసారి పరిస్థితులు దారుణంగా మారాయని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని విమర్శించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం శబరిమల విషయంలో కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోంది. త్వరలో శబరిమలకు బీజేపీ ప్రతినిధి బృందం వెళ్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు సమాచారం అందజేశాం’’ అని వారు వివరించారు. నీలక్కల్ పార్కింగ్ ప్రదేశం మురికి కూపంగా తయారైందని, పంపాలో నీళ్లు నలుపురంగుకు మారిపోయాయని విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రిని విచారించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి విజయన్ యుద్ధప్రాతిపదికన ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. -
శబరిమలలో జనమేజనం..! భక్తులపై ఆంక్షలు
పథనంతిట్ట: ముందెన్నడూ లేనివిధంగా మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం సన్నిధానంలో అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా.. సోమవారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు ఆ హరిహరపుత్రుడిని దర్శించుకున్నారు. నిజానికి ఆన్లైన్ (www.sabarimalaonline.org)లో రోజుకు 70 వేల మందికి స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు. అదనంగా 20వేల మందికి స్పాట్ బుకింగ్కు ఏర్పాట్లు చేశారు. అయితే.. సోమవారం ఏకంగా 37 వేల మంది భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకున్నారని, అందుకే రద్దీ విపరీతంగా పెరిగిందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు చెబుతున్నారు. భారీ క్యూలైన్లుసోమవారం నుంచి నీలక్కల్, పంపాబేస్, శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా.. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కనిపిస్తున్నారు. పంపా కంట్రోల్ రూమ్ వద్ద బస్సు దిగిన భక్తులు త్రివేణీ బ్రిడ్జిని దాటడానికి అరగంట పట్టిందని, అక్కడి నుంచి పంపా గణపతి ఆలయానికి చేరుకోవడానికి గంట సమయం పట్టిందని కర్ణాటకలోని చిక్బళ్లాపూర్కు చెందిన సుందరేశ అనే భక్తుడు ‘సాక్షి డిజిటల్’కి వివరించారు. ఇక శరణ్గుత్తి ప్రాంతంలోనూ నిమిషానికి నాలుగు అడుగులు వేసేలా రద్దీ ఉందని హైదరాబాద్కు చెందిన పవన్ కుమార్ గురుస్వామి వివరించారు. మారక్కూటం నుంచి 18 మెట్ల వరకు గంట సమయం.. పదునెట్టాంబడిని అధిరోహించాక.. అయ్యప్ప స్వామి దర్శనానికి మరో గంట పడుతోందని పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులను నేరుగా ధ్వజస్తంభం నుంచి అయ్యప్ప దర్శనానికి వదులుతున్నా.. 18 మెట్లను చేరేవరకు వారికి ఇబ్బందులు తప్పడం లేదని సైదాబాద్కు చెందిన రవికుమార్ గురుస్వామి తెలిపారు. నీలిమలను అధిరోహించినప్పటి నుంచి భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి 6 గంటల సమయం పడుతున్నట్లు వివరించారు. నీలక్కల్లోనే నిలిపివేతభక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పంపాలో స్పాట్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను 7కు పెంచినట్లు అధికారులు తెలిపారు. అయితే.. పంపా బేస్లో రద్దీని బట్టి ఆన్లైన్ బుకింగ్ లేని భక్తులను నీలక్కల్లో నిలిపివేస్తున్నామన్నారు. నీలక్కల్లో భక్తులకు వసతి సదుపాయాలున్నాయని వెల్లడించారు. అటు పంపాబేస్ నుంచి నీలిమలను అధిరోహించాక శరణ్గుత్తి, మారక్కూటం క్యూకాంప్లెక్సుల్లో తాగునీరు, స్నాక్స్, టీ, కాఫీ అందజేసే వెసులుబాట్లు కల్పిస్తామన్నారు. ప్రతిచోట సిబ్బందిని నియమించామన్నారు. రద్దీని అదుపుచేయడానికి ఎక్కడికక్కడ పోలీసులను మోహరించినట్లు అదనపు డీజీపీ ఎస్.శ్రీజిత్ వివరించారు. భక్తులు పరిస్థితిని అర్థం చేసుకుని, పోలీసులకు సహకరించాలని కోరారు. ‘‘సోమవారం 20 వేల మందికి స్పాట్ బుకింగ్కు ఏర్పాట్లు చేశాం. అయితే.. 37 వేల మంది భక్తులు వచ్చారు. అందుకే.. బుధవారం నుంచి 20 వేల స్పాట్ బుకింగ్ నిబంధనను కచ్చితంగా పాటిస్తాం. అదనంగా వచ్చే భక్తులకు తర్వాతి రోజు స్లాట్లను కేటాయిస్తాం’’ అని ఆయన వెల్లడించారు. ఈ సీజన్లో మంగళవారం మధ్యాహ్నం వరకు 1.97 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు తెలిపారు. నీలక్కల్ వద్ద భారీగా ట్రాఫిక్శబరిమలకు వ్యక్తిగత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో.. ఎరుమేలి-పంపా, రాణి-పంపా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు నెలకొంటున్నాయి. ముఖ్యంగా ప్లాపల్లి, నీలక్కల్ వద్ద వాహనాలు నత్తనడకను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా.. అప్పాచిమేడు ప్రాంతంలో ఓ భక్తురాలు కుప్పకూలి మృతిచెందారు. ఆమెను కోళిక్కోడ్ జిల్లా కోయిలాండికి చెందిన సతీ(58)గా పోలీసులు గుర్తించారు. భారీ క్యూలైన్ల కారణంగా ఆమె ఊపిరి ఆడక.. ఉక్కిరిబిక్కిరి అయ్యి.. మరణించినట్లు తెలుస్తోంది. -
నేడు శబరిమలలో తొలి నెయ్యాభిషేకం రాష్ట్రపతిదే
పథనంతిట్ట: మండల సీజన్లో భాగంగా ఆదివారం శబరి ఆలయం తలుపులు తెరుచుకోగా.. సోమవారం ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు ప్రారంభమయ్యాయి. అయితే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట సోమవారం ఉదయం తొలి నెయ్యాభిషేకం జరిగింది. అదేంటి? ఇరుముడిలోని ముద్ర టెంకాయల్లో ఉండే నేతినే కదా అభిషేకం చేయాల్సింది?? గత నెల ముర్ము వస్తే.. ఇప్పుడు అభిషేకం ఎలా జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా.. అందుకు కారణముందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు చెబుతున్నారు.శబరిమల సన్నిధానంలో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు నెయ్యాభిషేకాలు జరుగుతాయి. అయితే.. అక్టోబరు నెలలో 22వ తేదీ వరకు సన్నిధానం ఓపెన్ ఉంది. రాష్ట్రపతి ముర్ము సరిగ్గా అక్టోబరు 22న శబరిమలను దర్శించుకున్నారు. అప్పటికే నెయ్యాభిషేకం సమయం దాటిపోయింది. దాంతో ప్రధాన తంత్రి/మేల్శాంతి ఆమె ఇరుముడిని భద్రపరిచారు. మండల సీజన్ కోసం ఆదివారం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోగా.. సోమవారం ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు మొదలయ్యాయి. దీంతో.. ముర్ము ఇరుముడిలోని ముద్ర టెంకాయలోని నేతితో తొలుత అయ్యప్పకు అభిషేకం చేశారు. అలా.. మండల సీజన్లో తొలి నెయ్యాభిషేకం రాష్ట్రపతి ముర్ము చేయించినట్లయిందని టీడీబీ అధికారులు చెబుతున్నారు. -
శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!
శబరిమల దేవాలయాన్ని సన్నిధానం అని కూడా అంటారు. సన్నిధానం అనేది దివ్య స్థలం లేదా దేవుడు నివసించే ప్రదేశం. శబరిమల ఆలయం భూమి మట్టం నుంచి 40 అడుగుల ఎత్తులో పీఠభూమిపై ఉంది. దీనిలో బంగారు పూతతో కూడిన పైకప్పుతో ప్రధాన ఆలయం (గర్భగుడి), దాని పైన నాలుగు గోపురాలు, రెండు మండపాలు (గాజెబో లాంటి నిర్మాణాలు), బలిపీఠం (యజ్ఞ శిలా పీఠాలు), బలికల్పుర (పూజా నైవేద్యాలు చేయడానికి రాతి నిర్మాణం) బంగారం తాపడం చేసిన ధ్వజస్తంభం తదితరాలు ఉంటాయి. అలాగే ఈ సన్నిధానానికి దారితీసే పతినెట్టాంపడి లేదా పద్దెనిమిది మెట్లు బంగారంతో తాపడం చేసి ఉంటాయి. పద్దెనిమిది మెట్ల అడుగు భాగంలో ఇద్దరు ద్వారపాలకులు - వలియ కడుత స్వామి, కరుప్ప స్వామి ఉంటారు. వావర్ నడ కూడా దీనికి సమీపంలోనే ఉంది. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని దర్శంన చేసుకునేందుకు పెద్దసంఖ్య మాలధారులు ప్రతి ఏటా పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్నవారి సంఖ్య అధికంగా ఉంటుందనేది అధికారిక వర్గాల సమాచారం. మరి ఈ నేపథ్యంలో శబరిమల సన్నిధానంలో యాత్రికుల పూజ, వసతి నిమిత్తమై ఎలాంటి వసతి సౌకర్యాలు ఉంటాయి వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!. శబరిమల సన్నిధానం వద్ద వసతి సౌకర్యాలు ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు, అలాగే దేవస్వం బోర్డు గుర్తింపు పొందిన కేంద్రాలలో స్పాట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉంది. భక్తులు ఆన్లైన్లో దర్శనం స్లాట్లు, పూజలు, వసతిని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సమీపంలో అనేక హోటళ్ళు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి కూడా.శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాలుసన్నిధానంలో యాత్రికుల బస కోసం వివిధ భవనాల్లో 540 గదులు ఉన్నాయి.శబరి గెస్ట్ హౌస్లో మాత్రమే 56 గదులు ఉన్నాయి, వీటితో పాటు 5 కాటేజీలు, 12 విడిషెడ్లు ఉన్నాయి.వివిధ విభాగాల అధికారులకు మొత్తం 146 గదులు కేటాయించగా, పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక బ్యారక్ నిర్మించారు.ఎలా బుక్ చేసుకోవాలంటే..www.onlinetdb.com ద్వారా ఆన్లైన్లో గదులు, ప్రసాదాలను (వాళిపాడు) బుక్ చేసుకోవచ్చు.దాంతోపాటు పూజకు సంబంధించి.. ఇలాంటి ఆఫర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. అవేంటంటే..ఉదయాస్తమాన పూజపడి పూజసహస్రకలసంకలశాభిషేకంఉష పూజఉచ్ఛ పూజఅథాళ పూజనెయ్యాభిషేకంవీటిని వర్చువల్ క్యూ టికెట్ తోపాటు బుక్ చేసుకోవచ్చు.ముఖ్య గమనిక: 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బుకింగ్ అవసరం లేదు.దర్శన సమయాలుదర్శనం కోసం ఆలయం తెల్లవారుజామున 3:00 గంటలకు తెరుచుకుంటుంది.ఉచ్ఛ పూజ తర్వాత మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడుతుంది.మధ్యాహ్నం 3:00 గంటలకు తిరిగి తెరుచుకుంటుంది.రాత్రి 11:00 గంటలకు హరివరాసనం పారాయణంతో చివరి ముగింపు.ఈ ఆలయం రోజుకు 18 గంటలు దర్శనం కోసం తెరిచి ఉంటుంది.మధ్యాహ్నం 1 గంటలకు ఆలయం మూసివేసినప్పుడూ.. అలాగే రాత్రి మూసివేత తర్వాత కూడా..అప్పటికే క్యూలో ఉన్న యాత్రికులు 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. తర్వాత ఆలయం దర్శనం కోసం తిరిగి తెరిచినప్పుడు వారు ఉత్తర ద్వారం గుండా వెళ్ళవచ్చు. ఇది భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేశారు.యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన పథకాలు..గుండెపోటు ఉపశమన పథకంతీర్థయాత్ర సమయంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణించే యాత్రికుల కుటుంబాలకు దాదాపు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వర్చువల్ క్యూ బుకింగ్లో రూ.5 రుసుము అదనంగా జోడించారు. అయితే ఈ చెల్లింపు తప్పనిసరి కాదు.కేరళ అంతటా బీమా కవరేజ్వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకునే యాత్రికులందరికీ ఎటువంటి ప్రీమియం లేకుండా రూ. 5 లక్షల ప్రమాద మరణ బీమా కవరేజ్ లభిస్తుంది.ఒక యాత్రికుడు మరణిస్తే :కేరళలో అంబులెన్స్ ఖర్చులు: రూ. 30,000 వరకుఇతర రాష్ట్రాలకు అంబులెన్స్ ఖర్చులు: రూ. 1,00,000 వరకు ఈ ఖర్చులను దేవస్వం బోర్డు భరిస్తుంది.నీలక్కల్ వద్ద పార్కింగ్ పంప నుంచి 23 కి.మీ దూరంలో ఉన్న నీలక్కల్ శబరిమల యాత్రికులకు ప్రధాన పార్కింగ్ హబ్. ఇక్కడ సుమారు 8,500 వాహనాలకు స్థలం ఉంది.పంపా వద్ద , హిల్స్ స్టాప్, చక్కుపాలెం వద్ద పరిమిత పార్కింగ్ అందుబాటులో ఉంది.ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపు వ్యవస్థనిలక్కల్ , చక్కుపాలెం, హిల్టాప్ వద్ద పార్కింగ్ ఫీజులను ఫాస్టాట్యాగ్ ద్వారా చెల్లించవచ్చు:బస్సులు: రూ. 100మినీ బస్సులు: రూ. 7514 సీట్ల వరకు వాహనాలు: రూ. 504 సీట్లు రూ. 30ఆటో - రిక్షాలు: రూ.15చివరగా శబరిమలలో వసతి రూ.80 నుంచి అదుబాటులో ఉంది. గది స్థాయిని బట్టి రూ.2,200 వరకు ఫీజు వసూలు చేస్తారు.గదులు బుక్ చేసుకోవాలను కునే యాత్రికులకు ఆన్లైన్ సేవల కోసం నమోదు చేసుకోవడానికి మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా అవసరం.గదిని ఆన్లైన్ బుకింగ్ సమయంలో మీరు అందించిన అదే ఫొటో సహా IDని తీసుకెళ్లాలి. అలాగే ఒక రోజులో గరిష్టంగా 20వేల మంది భక్తులకు రియల్ టైమ్ బుకింగ్ ద్వారా దర్శనం అవకాశం కల్పిస్తోంది ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఒకే సమయంలో ఎక్కువమంది వెబ్సైట్లో లాగిన్ అవ్వడం వల్ల ఒక్కోసారి సర్వర్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని, దీన్ని భక్తులందరు గమనించగలరు అంటూ..ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విన్నవించింది. (చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..) -
తెరుచుకున్న శబరిమల.. భక్తులకు సూచనలివే..!
పథనంతిట్ట: శబరిమలలో కొలువైన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధానం ఈరోజు (నవంబరు 16) సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మేల్శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానం చేరుకున్నారు. పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తర్వాత ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయం తలుపులును తెరిచారు. ఆ వెంటనే.. ‘స్వామియే.. శరణం అయ్యప్పా’ అనే భక్తుల శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.మండల పూజ సీజన్లో శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు మౌలిక సదుపాయాలను కల్పించింది. అదేవిధంగా కేరళ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వైద్య కళాశాల ప్రొఫెసర్లు మొదలు.. పీజీ విద్యార్థులను రంగంలోకి దింపి.. శబరిమల మార్గంలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంపాబేస్లో 24 గంటలూ పనిచేసేలా వైద్య కేంద్రం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. వైద్య శిబిరాలు ఎక్కడెక్కడున్నాయి? భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై దీర్ఘకాలిక వ్యాధులు, కొమార్బరిటీస్తో బాధపడే భక్తులు అత్యవసర స్థితిలో ఎవరిని సంప్రదించాలి? అనే అంశాలపై మళయాలంతోపాటు.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పైన పేర్కొన్న భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.ట్రెకింగ్ మార్గంలో..పంపాబేస్ నుంచి శబరిమల సన్నిధానం వరకు పలు చోట్ల అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్రమట్టానికి ఎత్తులో వెళ్తున్నప్పుడు శ్వాస ఇబ్బందులు ఎదురయ్యే భక్తుల కోసం ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో కొన్ని వైద్య కళాశాలలు బేస్ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కార్డియాలజీ ట్రీట్ మెంట్, క్యాథ్ ల్యాబ్ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపాబేస్ వద్ద అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. పంపాకు సమీపంలో ఉన్న అన్ని ఆస్పత్రులలో డీఫిబ్రిలేటర్లు, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్లు ఉంటాయని తెలిపారు. నీలక్కల్ బేస్ వద్ద పూర్తిస్థాయి ల్యాబ్లను ఏర్పాటు చేశారు. శబరిమల చరిత్రలోనే తొలిసారి పంపాబేస్, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. అటు అయ్యప్పస్వామి వంశస్తుల రాజ్యంగా పేర్కొనే పందలం వద్ద కూడా తాత్కాలిక డిస్పెన్సరీలు ఏర్పాటయ్యాయి. శబరిమలకు వచ్చే మార్గాల్లో అడూర్, వడసేరిక్కర, పథనంతిట్టల్లోనూ 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు ప్రభుత్వ సూచనలుప్రస్తుతం వివిధ వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు తమ వైద్య రికార్డులను వెంట తెచ్చుకోవాలిశబరి యాత్రకు కొద్దిరోజుల ముందు నుంచి నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలిపంపాబేస్ నుంచి కొండను ఎక్కేప్పుడు వేగం పనికిరాదు. నిదానంగా కొండను అధిరోహించాలి. అవసరమైతే.. తరచూ విశ్రాంతి తీసుకోవాలికొండను అధిరోహించేప్పుడు అలసట, ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. తక్షణం వైద్య సాయం కోసం 04735 203232 నంబరుకు కాల్ చేయాలికాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలివివిధ వ్యాధులతో బాధపడేవారు బహిరంగ ప్రదేశాల్లో లభించే చిరుతిళ్లను తినకూడదునీలిమల, శరణ్గుత్తి ప్రాంతాల్లో పాములను పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ విషకీటకాలు కరిస్తే.. వెంటనే 04735 203232 నంబరుకు కాల్ చేయాలి. తాత్కాలిక వైద్య శిబిరాల్లో పాముకాటుకు విరుగుడు ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి -
కేరళకు భారీ వర్ష సూచన.. అయ్యప్ప భక్తులకు అలర్ట్
తిరువనంతపురం: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దీంతో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది(IMD). శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల పూజల కోసం తెరుచుకోనున్నాయి. వేలాది మంది భక్తులు పంబా, నిలక్కల్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం భక్తులను అప్రమత్తం చేస్తోంది. రాబోయే మూడు రోజులు నవంబర్ 16 నుంచి 18 దాకా కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఐఎండీ పేర్కొంది. ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచనలు:భక్తులు రెయిన్కోట్, టార్చ్లైట్, మెడికల్ కిట్ వంటి అవసరమైన వస్తువులు వెంట ఉంచుకోవాలివర్షాల కారణంగా మార్గాల్లో మట్టి జారే ప్రమాదం ఉండవచ్చు.. అప్రమత్తంగా ఉండాలిపంబా, ఎరుగుమలై, నిలక్కల్ ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలిఅంతేకాదు.. కల్లకడల(Kallakkadal) కారణంగా(సముద్రంలో అలజడి) ఆలప్పుఝా, ఎర్నాలకుం, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ తీరప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉందని, అలలు ఎగసిపడే నేపథ్యంలో మత్య్సకారులు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల-మకరవిళక్క యాత్రా కాలానికిగానూ తలుపులు తెరుచుకోనుంది. ఈ పవిత్ర యాత్రా కాలం జనవరి 20 వరకు కొనసాగనుంది. అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టింది. దేశంలో వరుసగా తొక్కిసలాట ఘటనలు జరుగుతున్న క్రమంలో.. భక్తుల ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. రోజుకు 90,000 భక్తులకు రోజువారీ పరిమితి విధించారు. నిలక్కల్, పంబా ప్రాంతాల్లో తాత్కాలిక గుడిసెలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. -
శబరిమల, ఎరుమేలిలో.. రసాయనాల కుంకుమపై నిషేధం: హైకోర్టు
పథనంతిట్ట: హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలో.. ధర్మశాస్తాకు నిలయమైన ఎరుమేలిలో రసాయనాల కుంకుమ విక్రయాలకు కేరళ హైకోర్టు కళ్లెం వేసింది. భక్తుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, కెమికల్స్తో తయారైన కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ వి.రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కేరళ ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది.కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఇటీవల కేరళ ప్రభుత్వం పంపానదిలో సబ్బులు, షాంపూలను నిషేధించింది. అదేవిధంగా రసాయనాలతో తయారైన కుంకుమను ఎరుమేలి, శబరిమలలో విక్రయించడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. సహజసిద్ధంగా తయారైన కుంకుమ విక్రయాలకు మాత్రమే అనుమతి ఉంటుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది. శబరిమల, ఎరుమేలిలో వ్యాపారులకు కుంకుమను సరఫరా చేసే హోల్సేల్ వ్యాపారి ఒకరు ఈ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశారు. మండల, మకరవిళక్కు సీజన్ను దృష్టిలో పెట్టుకుని, రూ.లక్షలు ఖర్చు చేసి.. కుంకుమ స్టాక్ తెచ్చుకున్నామని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో నిషేధం విధిస్తే తాము నష్టపోతామని వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తమకు భక్తుల ఆరోగ్యమే ముఖ్యమని, కెమికల్స్తో తయారైన కుంకుమను అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. కేరళ సర్కారు ఉత్తర్వులను సమర్థించింది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది. -
శబరిమల యోగదండం మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఈడీ
పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఉండాల్సిన యోగదండం, ఏకముఖీ రుద్రాక్షల మాల మిస్సింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగప్రవేశం చేసింది. ఈ అంశం అంర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాలతో ముడిపడి ఉన్నట్లు అనుమానిస్తున్న ఈడీ, మనీల్యాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్)ను నమోదు చేసింది. దీంతోపాటు.. బంగారు తాపడం కేసులోనూ మనీల్యాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తోంది. బంగారు తాపడం కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారికి బంగారాన్ని అమ్మేసి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. దీంతో.. కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తులో ముందుకు సాగాలని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో తాజాగా రాణి మెజిస్ట్రేట్ కోర్టులో.. ఆ ఎఫ్ఐఆర్ కాపీని అందజేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. కేసు హైకోర్టు పరిధిలో ఉండడంతో.. ఈడీ అప్పీల్కు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.ఎప్పుడు మిస్సయ్యాయి?2018 నుంచే శబరిమల అయ్యప్ప ఆలయంలోని యోగదండం, ఏకముఖీ రుద్రాక్షల మాల మిస్సయినట్లు క్రైమ్ బ్రాంచఠ్ భావిస్తోంది. అప్పట్లో యోగదండాన్ని బంగారు పూత కోసం తరలించారు. అలా తరలించడం ఆలయ ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్(మజహర్ రికార్డు)లో నమోదు కాలేదు. అప్పట్లోనే అత్యంత ఖరీదైన పురాతన ఏకముఖీ రుద్రాక్షల మాలను కూడా బంగారు పూతకు తీసుకెళ్లారు. హైకోర్టు అనుమతి లేకుండానే.. ఓ అధికారి వీటిని బయటకు పంపేందుకు అనుమతినిచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యోగదండం విశిష్టత ఇదీ..!మండల-మకరవిళక్కుతోపాటు.. నెలవారీ పూజలు, ప్రత్యేక సందర్భాలలో జరిగే పూజల తర్వాత.. హరివరాసనాన్ని ఆలపించి, ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత అయ్యప్ప యోగనిద్రలో ఉంటారని భక్తుల విశ్వాసం. ఆలయాన్ని మూసివేసే ముందు.. అయ్యప్ప వద్ద యోగదండం పెడతారు. ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాలను స్వామిని అలంకరిస్తారు. భస్మాభిషేకంతో విగ్రహాన్ని మూసివేస్తారు. సాధారణంగా ఏకముఖీ రుద్రాక్ష అనేది అత్యంత ఖరీదైనది. ఇప్పుడు కనిపించకుండా పోయినది ఏకంగా ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాల. అదేవిధంగా యోగదండం అనేది అత్యంత పురాతనమైనది. దీని వెల అమూల్యమని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. -
వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..
అయ్యప్ప దీక్షలో అతి ముఖ్యమైన ఘట్టం వనయాత్ర. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ హరిహరసుతుని సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదే ప్రధానమైనది. ఇరుముడిని తలపై పెట్టుకుని.. ఇరుముడితోటి నిను మదినింపి కదిలేము స్వామిఅండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా….'పల్లికట్టు శబరిమలైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయిస్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియేపళ్లికట్టు శబరిమళైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయిస్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే'అంటూ ఉత్సాహంగా సాగుతుంది ఈ వనయాత్ర. అయ్యప్ప దీక్షలో ముఖ్యంగా వనయాత్ర సమయంలో, "స్వామియే శరణం అయ్యప్ప" అని భక్తులు చెప్పే ఒక నినాదమే ఈ "కల్లుం ముల్లుం కాలికి మెత్తై". దీని అర్థం ఈ కఠినమైన వనయాత్ర మార్గంలో ఉన్న రాళ్ళు, ముళ్ళు కూడా అయ్యప్ప దీక్షలోని భక్తి, శ్రద్ధ వల్ల వారికి మెత్తగా అనిపిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక ఈ యాత్రలో భాగంగా పుణ్య నదుల్లో స్నానం ఆచరించి...దట్టమైన వృక్షాల మీదుగా వచ్చే ఔషధ గాలులను పీల్చుకుంటూ ఏదో తెలియని భక్తిపారవశ్యంతో ముందుకు సాగిపోతారు. ఇది సాక్షాత్తూ అయ్యప్పస్వామి నడిచివెళ్లిన మార్గం అని చెబుతుంటారు..వాస్తవానికి మాలధారులు అయ్యప్ప దర్శనంకోసం పెద్దపాదం మార్గంలో కొందరు..చిన్నపాదం మార్గంలో మరికొందరు వెళతారు. అయితే ఈ పెద్దపాదం మార్గం భక్తులకు పలు సవాళ్లును విసురుతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది భక్తి, ఓర్పు, ఆత్మనిర్భరత ప్రాముఖ్యతలను తెలియజేసే గొప్ప ఆధ్యాత్మిక యాత్రగా పేర్కొనవచ్చు. మరి పెద్దపాదంగా పిలిచే ఈ వనయాత్ర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!నిజానికి అయ్యప్ప భక్తులు జీవితకాలంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలని అంటుంటారు. పెద్దపాదం అంటేనే వనయాత్ర. ఇది ఎరుమేలి దగ్గర ప్రారంభమయ్యే యాత్ర.. సుమారు 58 కిలోమీటర్ల దూరం కాలినడకన భక్తులు స్వామివారి సన్నిధి చేరుకుంటారు. అడవి గుండా సాగే పెద్దపాదం యాత్ర... రాళ్లు, రప్పలతో నిండి ఉంటుంది..ఎక్కడా రోడ్డు కనిపించదు. మధ్య మధ్యలో పక్షులు, జంతువులు, సెలయేర్లు, లోయలు కనిపిస్తాయి. ఈ దారి మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లితే ఆ ఫీల్ వేరేలెవెల్.ఎందుకు వనయాత్ర చేయాలంటే..ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామిని ( అయ్యప్ప స్నేహితుడు..అనంతరకాలంలో భక్తుడు) ముందుగా దర్శించుకుని అక్కడ పేటతుళ్లై అనే నత్యం ఆడతారు. పేటతుళ్లై తర్వాత ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్భాణధారియై అయ్యప్పను దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి భక్తుల వనయాత్ర మొదలవుతుంది.అప్పటి రోజుల్లో శబరిమల చేరుకునేందుకు వనయాత్రనే అనుసరించేవారు. ఆ తర్వాత మారిన పరిస్థితులు, భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని చినపాదం యాత్రను ప్రారంభించింది దేవస్థానం. అనంతరం కేరళ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించింది.ఈ ప్రాంతం మొత్తం ఎన్నో వన మూలికలు ఉంటాయి. నడక మార్గంలో ఆ మూలికల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఒక్కసారైనా వనయాత్ర చేయాలంటారు. రాళ్లు విసరడానికి రీజన్..పెదపాదం మార్గంలో భాగంగా అళుదా నదినుంచి రెండు రాళ్లు తీసుకుని..ఆ రాళ్లను కళిద ముకుండ అనే ప్రదేశంలో వేస్తారు. పురాణాల ప్రకారం..నిజానికి ఈ మార్గంలో భక్తులు పెరూర్తోడు, కాలైకట్టి వంటి ప్రదేశాలను దాటుతారు. మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తున్నప్పుడు శివకేశవులు కాలైకట్టి వద్ద నిలబడి చూశారని ఇతిహాసం. ఆ నేపథ్యంలోనే భక్తులు అళుదా నదిలో స్నానం చేసి, అక్కడ లభించిన ఒక రాయిని తమతో తీసుకువెళ్లి, మహిషి కళేబరాన్ని పూడ్చిన "కళిడం కుండ్రు"లో వేస్తారుఈ మార్గంలో అన్నిటికన్నా కష్టమైన శిఖరాలంటే కరిమల, నీలిమల. అత్యంత కష్టమైన ఈ మార్గాన్ని దాటేందుకు స్వయంగా స్వామివారు సహాయం చేస్తారని భక్తుల విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం..ఈ వనయాత్ర చేసే భక్తులు, ముఖ్యంగా తొలిసారి వెళ్లే కన్నిస్వాములు, తలపై ఇరుముడి ధరించి మాత్రమే వెళ్లాలి. శబరిమల ఆలయం తెరిచిన ప్రతిసారీ పెదపాదం మార్గం ఓపెన్ చేయరు. కేవలం మకరవిళక్కు సమయంలో ఓపెన్ చేసి...తిరిగి సంక్రాంతి మకర జ్యోతి తర్వాత పెదపాదం మార్గం మూసివేస్తారు.ఈసారి గట్టి భద్రతతోపాటు అసౌకర్యానికి ఆస్కారం లేకుండా..ఇక ఈ ఏడాది మండల కాలం ఈ నెల నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. కేరళ ప్రభుత్వం ఈ అటవీ మార్గం గుండా భద్రతా ఏర్పాట్లు కోసం పది లక్షల టెండర్ని కేటాయించింది. ఈసారి మాత్రం రాత్రిపూట నిషేధం, పగటిపూట కొన్ని ఆంక్షలతో ఈ యాత్రకు కావల్సిన సన్నహాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. కాలినడకన వచ్చే భక్తులకు ఈ అటవీ మార్గాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. అడవి జంతువుల బెడద రీత్యా రహదారిపై రాత్రి ప్రయాణం, పగటిపూట ప్రవేశ పరిమితులు కొనసాగుతాయని ఎరుమేలి అటవీ రేంజ్ ఆఫీసర్ హరిలాల్ తెలిపారు. అంతేగాదు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటaల వరకు ప్రయాణానికి అనుమతి ఉంది. అలాగే అడవి జంతువులు ఉనికిని ముందుగా తెలియజేసేలా హెచ్చరికలు, జాగ్రత్తలు వంటి భద్రతా చర్యలు తీసుకునేలా ప్రత్యేకంగా అటవీశాఖకు చెందిన స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అటవీ సంరక్షణ కమిటీ (VSS, పర్యావరణ అభివృద్ధి కమిటీ(EDC) నేతృత్వంలో అటవీ శాఖ పర్యవేక్షణలో వ్యాపారులకు భద్రత కల్పిస్తామని పేర్కొంది. ఈసారి దారిలో ఆక్సిజన్ పార్లర్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే కలయకెట్టులో ఆరోగ్య శాఖ చికిత్సా కేంద్రం ప్రారంభిస్తామని తెలిపింది. గత సీజన్లలో పాములు, సరీసృపాల దాడుల కారణంగా చాలామంది ప్రమాదాల బారిన పడ్డారు. ఈసారి అలాంటివి తలెత్తకుండా తక్షణ వైద్య సాయం అందేలా పర్యవేక్షించనున్నారు అధికారులు. కలయకెట్టూ, అలుదాలో ఆస్పత్రి అందుబాటులో లేకపోవడం వల్ల సత్వర చికిత్స అందక భక్తులు ప్రమాదాల బారినపడుతున్నారనేది వాదన. అదీగాకుండా ఎరుమేలి ఆసుపత్రికి తరలించడానికి సత్వరమే వాహనం అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చింది. (చదవండి: శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!) -
శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!
శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంది, కానీ ఇది పరిమిత సంఖ్యలో ఉంటుంది. భక్తులు దేవస్వం బోర్డు గుర్తించిన కేంద్రాలలో తమ గుర్తింపు కార్డు చూపించి స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ స్పాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి. రోజుకు గరిష్టంగా దాదాపు 20 వేల మంది స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనానికి నమోదు చేసుకోవచ్చు. బుకింగ్ కేంద్రాల వివరాలు..ఎరుమేలి (Erumeli)అయ్యప్ప భక్తుల యాత్రలో ఆచారప్రాముఖ్యమున్న పవిత్ర స్థలం.వండిపెరియార్ – పుల్మేడు (Vandiperiyar - Pulmedu)నిర్దిష్ట మార్గం ద్వారా దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటు.నీలక్కల్ (Nilakkal)యాత్రికుల ప్రధాన విశ్రాంతి స్థలం, దర్శనానికి ప్రవేశించే మొదటి దశ.పంబ (Pamba)ఆలయానికి ఎక్కే మెట్లు ప్రారంభమయ్యే ముందు ఉన్న చివరి యాత్రా కేంద్రం.గుర్తించుకోవాల్సినవి..రోజుకు పరిమత స్థానాలు: కేవలం 20,000 స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.గుర్తింపు కార్డు: చెల్లుబాలు అయ్యే గుర్తింపు పత్రం(ఆధార్ కార్డ్ తప్పనిసరి)బుకింగ్ సమయం: ఆన్లైన్ స్లాట్ల రోజువారీ కోటా ఫుల్ అయిన తర్వాత మాత్రమే స్పాట్ బుకింగ్ ప్రారంభమవుతుంది.(చదవండి: ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్) -
శబరిమల యాత్రకు KSRTC ప్రత్యేక ఏర్పాట్లు
కేరళ: శబరిమల యాత్ర సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) అయ్యప్ప భక్తుల రవాణా కోసం కొట్టాయం డిపో నుండి 90 బస్సులను శబరిమలకు ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా పంబ సర్వీసు కోసం ఈ బస్సులు అందుబాటులోకి తీసుకురాబడ్డాయి. అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలను కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ప్లాన్ చేసింది మరియు శబరిమల యాత్ర సమయంలో బస్సు బ్రేక్డౌన్లను తగ్గించడానికి త్వరిత మరమ్మతు బృందాన్ని మంచి అనుభవం ఉన్న డ్రైవర్లను నియమిస్తూ తగిన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. -
శబరిమల సీజన్: ఎరుమేలిలో చకచకా అభివృద్ధి పనులు
పథనంతిట్ట: శబరిమలలో మండల, మకరవిళక్కు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించారు. శబరియాత్రకు తొలిమెట్టుగా భావించే ఎరుమేలిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎరుమేలిలోని ధర్మశాస్తా ఆలయ ద్వారానికి రంగులు వేస్తున్నారు. అదేవిధంగా టీడీబీకి చెందిన భారీ పార్కింగ్ ప్రదేశంలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో ఈ పార్కింగ్ ప్రదేశంలో ఎలాంటి ఫ్లోరింగ్ ఉండేది కాదు. దాంతో.. చినుకు పడితే.. చిత్తడిగా మారిపోయేది. భక్తులు పాదరక్షలు లేని కాళ్లతో ఇక్కడ నడవడం ఇబ్బందిగా మారేది. వాహనాలు కూడా బురదలో కూరుకుపోవడం, స్కిడ్ అవ్వడం జరిగేది. ఈ సారి కేరళ ప్రభుత్వం శబరిమల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయడంతో.. వాహన పార్కింగ్ ప్రదేశంలో ఇంటర్లాక్ బ్లాకులతో ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎరుమేలి యాత్ర కీలకంశబరిమల యాత్రికులు ఎరుమేలిని తొలుత దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. పెద్దపాదం మార్గంలో వెళ్లేవారు.. ఎరుమేలి ధర్మశాస్తా ఆలయం నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి అలుదానది, అలుదామేడు. కరిమల కొండ మీదుగా పంపాబేస్ క్యాంప్నకు చేరుకుంటారు. ఇక పంపాబేస్ నుంచి చిన్నపాదం మార్గంలో నీలిమల మీదుగా శబరిమల సన్నిధానానికి వెళ్లే భక్తులు సైతం ఎరుమేలిని దర్శించుకుని, ఇక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో నీలక్కల్ శివాలయం మీదుగా పంపాబేస్కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, అధికారులు రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. లోయలు, ప్రమాదకరమైన మలుపులు ఉన్నచోట రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా కంట్రోల్ రూమ్ ద్వారా రియల్టైమ్ ట్రాఫిక్ను పర్యవేక్షించేలా సన్నాహాలు పూర్తిచేశారు. 17 నుంచి పెద్దపాదం ప్రారంభంసాధారణంగా శబరిమల యాత్రలో పెద్దపాదం మార్గాన్ని మకరవిళక్కు సీజన్(డిసెంబరు చివరి వారం) ప్రారంభానికి ముందు తెరుస్తారు. కొందరు భక్తులు పెద్దపాదం మీదుగా వస్తానని మొక్కుకుంటారు. ఈ నేపథ్యంలో మకరవిళక్కు సీజన్లో పెద్దపాదం మార్గంలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. పైగా జాతీయ హరిత ధర్మాసనం(ఎన్జీటీ) ఆదేశాలు, వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలనే కేరళ హైకోర్టు ఆదేశాలతో పెద్దపాదం మార్గంలో రాత్రిళ్లు ప్రయాణంపై నిషేధం విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే భక్తులను అనుమతిస్తున్నారు. ఈ చర్యలతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో.. మూడేళ్లుగా మండలం సీజన్లో కూడా పెద్దపాదం మార్గాన్ని తెరుస్తున్నారు. ఈ నెల 17న పెదపాదం మార్గాన్ని తెరిచేలా చర్యలు తీసుకుంటున్నామంటూ పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డైరెక్టర్(వెస్ట్) కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సీజన్లోనే పులిమేడు మార్గంఇడుక్కి జిల్లాలోని వండిపెరియార్ నుంచి దట్టమైన పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సత్రం, అక్కడి నుంచి పులిమేడు మీదుగా శబరిమలను చేరుకునే మార్గాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి సీజన్ ప్రారంభం కావడంతో.. ఆన్లైన్ స్లాట్ బుకింగ్లో కూడా ఈ మార్గాన్ని చేర్చారు. ఇక్కడ కూడా ఉదయం 7 గంటల తర్వాతే భక్తులను అనుమతిస్తామని, సత్రం సుబ్రమణ్య స్వామి ఆలయం వద్ద పోలీసులు స్లాట్ ఎంట్రీ చేసుకుంటారని అధికారులు వివరించారు. -
శబరిమల దర్శనానికి రూ. 5 తప్పనిసరి
శబరిమల వెళ్లే భక్తులకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) షాకిచ్చింది..! ఇకపై www.sabarimalaonline.orgలో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే భక్తులు రూ.5 చొప్పున వెల్ఫేర్ ఫండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఆ మేరకు మండల, మకరవిళక్కు సీజన్కు సంబంధించి శనివారం సాయంత్రం స్లాట్ బుకింగ్ ప్రారంభమవ్వగా.. రూ.5 వెల్ఫేర్ ఫండ్ నిర్ణయాన్ని అమలు చేసింది. అంటే.. ఇకపై ఒక్కో స్లాట్ బుకింగ్కు రూ. 5 చెల్లించాల్సిందే. వెల్ఫేర్ ఫండ్ చెల్లిస్తేనే స్లాట్ బుక్ అవుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు యాత్రికులకు సహాయం చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వెల్ఫేర్ ఫండ్ను తెరపైకి తీసుకువచ్చినట్లు టీడీబీ పేర్కొంది. పేమెంట్ గేట్వేలో సమస్యలు:శనివారం సాయంత్రం స్లాట్ బుకింగ్కు యత్నించిన భక్తులకు పేమెంట్ గేట్వేలో సమస్యలు తలెత్తాయి. ఒకేసారి వేల సంఖ్యలో భక్తులు స్లాట్ బుకింగ్కు యత్నించడంతో ఈ సమస్య నెలకొని ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: శబరిమలకు నేటి నుంచి వర్చువల్ బుకింగ్ -
శబరిమలకు నేటి నుంచి వర్చువల్ బుకింగ్
పత్థనంతిట్ట: కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల–మకరవిలక్కు పూజలకు సమయం సమీపిస్తున్న వేళ ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్(టీడీబీ) దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ను అందుబాటులోకి తెచి్చంది. నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఇది మొదలవుతుంది. sabarimalaonline.org ద్వారా రోజుకు గరిష్టంగా 70 వేల మంది దర్శనం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉందని టీడీబీ తెలిపింది. ఇది కాకుండా, స్పాట్ రిజి్రస్టేషన్ల కోసం వండిపెరియార్, ఎరుమెలి, నిలక్కల్, పంబలోనూ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామంది. ఇక్కడ రోజుకు 20వేల మంది వరకు బుక్ చేసుకుని, దర్శనానికి వెళ్లవచ్చని తెలిపింది. -
ఇరుముడి కట్టిన రాష్ట్రపతి!
President Droupudi Murmu Sabarimala Visit Updates..శబరిమలకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము..శబరిమల సన్నిధానానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.అనంతరం ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు.. ఇరుముడితో శబరిమలకు రాష్ట్రపతి అయ్యప్ప ఇరుముడి ముడుపుతో రాష్ట్రపతి ముర్ము శబరిమలకు బయలుదేరారు. பம்பா கணபதி கோவிலில் இருமுடி கட்டிக்கொண்டு, சபரிமலை சன்னிதானம் நோக்கி புறப்பட்டார் இந்திய குடியரசுத் தலைவர் திரௌபதி முர்மு! #DroupadiMurmu #Sabarimala #Kerala pic.twitter.com/H0b2QOibyr— Harish M (@chnmharish) October 22, 2025 కాసేపట్లో శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మురాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతంశబరిమల దర్శనానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో ఘన స్వాగతంప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన రాష్ట్రపతికి దేవస్వం మంత్రి వీఎన్ వాసవన్ స్వాగతం పలికారు.కాసేపట్లో రాష్ట్రపతి ముర్ము శబరిమలకు వెళ్లనున్నారు.రాష్ట్రపతి ఉదయం 11.55 నుండి మధ్యాహ్నం 12.25 వరకు శబరిమలలో ఉండనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్కు సమస్యకేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు సమస్య తలెత్తింది. ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ తర్వాత ఓ వైపు కూరుకుపోయిన హెలికాప్టర్గుంతలో ఇరుక్కుపోవడంతో అక్కడే ఆగిపోయిన ఆర్మీ హెలికాప్టర్దానిని నెట్టేందుకు పోలీస్, అగ్నిమాపకశాఖ ప్రయత్నం.కొత్తగా వేసిన కాంక్రీట్ కావడంతో అందులో ఇరుక్కుపోయిన హెలికాప్టర్ చక్రం. #WATCH | Kerala: A portion of the helipad tarmac sank in after a chopper carrying President Droupdi Murmu landed at Pramadam Stadium. Police and fire department personnel deployed at the spot physically pushed the helicopter out of the sunken spot. pic.twitter.com/QDmf28PqIb— ANI (@ANI) October 22, 2025👉రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్భవన్ నుంచి శబరిమలకు బయలుదేరారు. #WATCH | Thiruvananthapuram, Kerala: President Droupadi Murmu leaves from Raj Bhavan for Sabarimala darshan. pic.twitter.com/3HXjQtwMIJ— ANI (@ANI) October 22, 2025👉రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తిరువనంతపురం చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం పినరయి విజయన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో తిరువనంతపురంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. రాజ్భవన్కు ఆమె వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటారు.👉ఇక, ఉదయం హెలికాప్టర్లో నీలక్కల్ చేరుకుని, రోడ్డు మార్గంలో పంపకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గూర్ఖా వాహనంలో(ప్రత్యేక ఫోర్ వీలర్ వాహనం) సన్నిధానం చేరుకుంటారు. శబరిమల సందర్శించిన తర్వాత సాయంత్రం తిరువనంతపురం తిరిగి వస్తారు. ఈ క్రమంలో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు ఏర్పాటు చేశారు.👉రేపు ఉదయం 10.30 గంటలకు రాజ్ భవన్లో మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత, మధ్యాహ్నం 12.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా శివగిరి చేరుకుని, శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు పాలలోని సెయింట్ థామస్ కళాశాలలో ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు వేడుకను ప్రారంభిస్తారు. 24న సాయంత్రం 4.15 గంటలకు కొచ్చిలోని సెయింట్ థెరిసా కళాశాలలో జరిగే శతాబ్ది ఉత్సవాల కోసం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరుతారు. -
శబరిమలైలో మరో ట్విస్ట్.. యోగదండం మిస్సింగ్!
పతనంతిట్ట: శబరిమలై బంగారం అంశంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. శబరిమల గర్భగుడిలో ఉండాల్సిన అమూల్యమైన యోగదండాన్ని(పవిత్ర దండం) బంగారు పూత కోసం తీసుకెళ్లిన, తిరిగి ఇవ్వలేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పురాతన యోగదండాన్ని 2018లో బంగారు పూత కోసం తీసుకెళ్లారు. ఆ తర్వాత, కొత్తగా తయారు చేసిన యోగదండం తిరిగి తీసుకువచ్చారు. కానీ, అసలు యోగదండాన్ని మాయం చేశారు. ఈ యోగదండం వివరాలు ఎన్నడూ ఆలయ ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్లో ఎంట్రీ కాలేదని సమాచారం.2018లో..2018లో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) శబరిమల గర్భగుడిలోని అయ్యప్పస్వామి యోగదండానికి బంగారు పూత పూయించాలని నిర్ణయించింది. అక్కడే ఉండే రుద్రాక్ష మాలకు కూడా బంగారు పూత పూయించేందుకు తరలించారు. అయితే, ఈ వస్తువులను ఆలయం నుంచి బయటకు తీసుకెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలోని ఒక సీనియర్ అధికారి ఈ వస్తువులను బయటకు తీసినప్పుడు తూకం, అధికారిక మహజర్ (తనిఖీ రికార్డు)లో నమోదు చేయలేదని వెల్లడించారు .ఇప్పటికీ దేవస్వం బోర్డు అధికారులకు యోగదండం, రుద్రాక్షకు ఎంత బంగారం పూశారు? అసలు వెండి భాగాలను తిరిగి ఉపయోగించారా? అనే సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. వాటిని తిరిగి ఇచ్చినప్పుడు వాటి బరువుకు సంబంధించిన రికార్డులు కూడా లేవు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, యోగదండం అత్యంత పురాతనమైనది. కనిపించకుండా పోయిన రుద్రాక్ష మాల కూడా దశాబ్దాల క్రితం నాటిది అని తెలుస్తోంది. ఇదీ.. యోగదండం విశిష్టతమండల-మకరవిళక్కుతోపాటు.. నెలవారీ పూజలు, ప్రత్యేక సందర్భాలలో జరిగే పూజల తర్వాత.. హరివరాసనాన్ని ఆలపించి, ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత అయ్యప్ప యోగనిద్రలో ఉంటారని భక్తుల విశ్వాసం. ఆలయాన్ని మూసివేసే ముందు.. అయ్యప్ప వద్ద యోగదండం పెడతారు. ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాలను స్వామిని అలంకరిస్తారు. భస్మాభిషేకంతో విగ్రహాన్ని మూసివేస్తారు. సాధారణంగా ఏకముఖీ రుద్రాక్ష అనేది అత్యంత ఖరీదైనది. ఇప్పుడు కనిపించకుండా పోయినది ఏకంగా ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాల. అదేవిధంగా యోగదండం అనేది అత్యంత పురాతనమైనది. దీని వెల అమూల్యమని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. -
శబరిమల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు
పత్థనంతిట్ట: శబరిమల అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడతామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా యాత్ర సజావుగా, సురక్షితంగా సాగేందుకు చర్యలు చేపడతామన్నారు. ట్రావన్కోర్ దేవస్వోమ్ బోర్డు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన గ్లోబల్ అయ్యప్ప సంగం కార్యక్రమంలో విజయన్ మాట్లాడారు. ప్రపంచ దేశాల నుంచి భక్తులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మదురై, తిరుపతి మాదిరిగా శబరిమలకు ప్రముఖ తీర్థయాత్రాస్థలంగా తీర్చుదిద్దుతామన్నారు. శబరిమల, పంప, నీలక్కల్లతోపాటు అయ్యప్పస్వామి ఆలయానికి చేరుకునే మార్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం వివరించారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, బీజేపీలను సీఎం విజయన్ విమర్శిస్తూ..దేనినీ ద్వేషించనివాడు, అందరితో స్నేహపూర్వకంగా, దయతో ఉండేవాడు, సుఖదుఃఖాల పట్ల ఉదాసీనంగా ఉండేవాడు. సహనం కలిగి ఉండేవాడే నిజమైన భక్తుడని భగవద్గీతను ఉటంకించారు. భగవద్గీత నిర్వచించిన ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా భక్తులేనని ఆయన పేర్కొన్నారు. మిగతా వారు విశ్వాసులుగా నటిస్తూ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకున్నందుకు సుప్రీంకోర్టుకు సీఎం విజయన్ ధన్యవాదాలు తెలిపారు. అన్ని మతాల వారు దర్శించుకునే శబరిమల కుల, మతాలకు అతీతమన్నారు. హరివరాసనమ్ గేయాన్ని లాలిపాటగా దేవరాజన్ మాస్టర్ స్వరపర్చగా క్రైస్తవుడైన ఏసుదాస్ పాడారన్నారు. అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఆయన సహచరుడిగా భావంచే వావర్కు అంకితం చేసిన మసీదు వావర్ నాడ మీదుగా వెళతారని సీఎం విజయన్ తెలిపారు. ఈ క్షేత్రం ప్రాశస్త్యం ప్రపంచమంతా తెలియాలంటే భక్తులను ఆకర్షించే విధంగా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. శబరిమల ఆలయ సముదాయమున్న సన్నిధానంను మూడు దశల్లో రూ.778కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. -
అక్టోబర్ 16న శబరిమలకు ద్రౌపది ముర్ము
పతనంతిట్ట: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెలలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు గ్లోబల్ అయ్యప్ప సంగమం ముగింపు కార్యక్రమంలో కేరళ దేవస్వామ్ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు.అక్టోబర్ 16న ప్రారంభమయ్యే 'తులం' పూజల చివరి రోజున రాష్ట్రపతి పర్యటన. ముందుగా మే నెలలో అనుకున్న ఈ పర్యటన భారతదేశం - పాకిస్తాన్ సరిహద్దు వివాదం కారణంగా రద్దు చేయబడింది.గ్లోబల్ అయ్యప్ప సంగమం సందర్భంగా ప్రతిపాదించిన సిఫార్సులను అమలు చేయడానికి 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి వాసవన్ వెల్లడించారు. దేవస్వం మంత్రి అధ్యక్షతన, దేవస్వం బోర్డు అధ్యక్షుడు కన్వీనర్గా ఉండే ఈ కమిటీ వెంటనే తన పనిని ప్రారంభిస్తుంది.ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా శబరిమలశబరిమల యాత్రను సమగ్ర ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చడంపై సంగం ఎక్కువగా దృష్టి పెట్టింది. శబరిమల యాత్రకు అనుసంధానించబడిన వివిధ మతపరమైన ప్రదేశాలను ఏకీకృతం చేసే సమగ్ర తీర్థయాత్ర ప్రణాళిక అవసరాన్ని పాల్గొన్నవారు నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి, చర్చకు మోడరేటర్ అయిన టికెఎ నాయర్ ప్రస్తుత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, భక్తులకు సౌకర్యవంతమైన "దర్శనం" అందించడం తమ లక్ష్యంగా ఈ సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి ,దేవస్వం బోర్డుకు పంపుతామని స్పష్టం చేశారు.గ్లోబల్ అయ్యప్ప సంగం చర్చలకు సానుకూల స్పందనభారతదేశం మరియు కేరళ యువతరానికి శబరిమల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి కొత్త మీడియాను ఉపయోగించడం, ఉత్తర భారత రాష్ట్రాలకు దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రాజెక్టులను అమలు చేయడం గురించి కూడా చర్చలు జరిగాయి. క్యూ నిర్వహణ, పార్కింగ్ నియంత్రణ, రద్దీ తగ్గింపు కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించడం సూచనలలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో యాత్రికుల సంఖ్య పెరుగుతుందని ఓ అంచనా. రవాణా సౌకర్యాలు, పారిశుద్ధ్య వ్యవస్థలలో మెరుగుదల కూడా కీలకమైనవిగా పరిగణించబడ్డాయి.గ్లోబల్ అయ్యప్ప సంగం చర్చలకు సానుకూల స్పందన వచ్చిందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సభ్యుడు ఎ. అజికుమార్ ప్రశంసిస్తూ చర్చను ముగించారు. ఈ చర్చల నుండి ఫలవంతమైన ఫలితాలను ఆశిస్తూ, లేవనెత్తిన అన్ని డిమాండ్లు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారు. -
గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. ఇదే ప్రధాన లక్ష్యం
మహిషి సంహారం కోసం ఈ లోకంలో ఉద్భవించిన హరిహర పుత్రుడు అయ్యప్పకు కేరళ సర్కారు ప్రపంచ వ్యాప్త పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గల్ఫ్లోని అబుధాబి సహా.. వేర్వేరు దేశాల్లో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయాలున్నా.. అమెరికా నుంచి ఆచంట వరకు అయ్యప్ప భక్తులు ఏటా శబరిగిరీశుడిని దర్శించుకుంటున్నా.. కేరళలోని శబరి కొండపై కొలువుదీరిన అయ్యప్పను విశ్వవ్యాప్తం చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)తో కలిసి సంకల్పించింది. ప్రభుత్వాలు శబరిమలను ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారంటూ ఇంతకాలం కొనసాగుతున్న అపవాదులను తుడిచిపెట్టేందుకు కేరళ సర్కారు ప్రపంచ అయ్యప్ప భక్తులను ఏకం చేస్తోంది. ఏటా మండల, మకరవిళక్కు సీజన్లలో శబరిమలకు వచ్చే భక్తుల సాధకబాధకాలను వినేందుకు తొలిసారి ‘గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్’ (global ayyappa conclave) పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దేవుడు అంటే నమ్మకం లేని, కరడుగట్టిన కమ్యూనిస్టుగా పేరున్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపడం గమనార్హం..!ఎన్నారైలు మొదలు.. సామాన్యులకూ ఆహ్వానం3 వేల మంది అయ్యప్ప భక్తులకు సరిపడేలా పంపానది తీరంలో టీడీబీ, కేరళ సర్కారు భారీ కాన్క్లేవ్కు ఏర్పాట్లు చేశాయి. భారతీయులు స్థిరపడ్డ దాదాపు అన్ని దేశాలకు చెందిన అయ్యప్ప భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించాయి. ఇక సామాన్య భక్తులకు కూడా చాలా సులభంగా అవకాశం కల్పించి, పాసులను జారీ చేశాయి. శబరిమల వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా ఏటా ఏదో ఒక సీజన్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకైతే.. సెల్ఫోన్లకు సందేశాలు పంపి మరీ ఆహ్వానించాయి. ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి, ఐడీకార్డులను జారీ చేశాయి. అలా ఐడీకార్డులు డౌన్లోడ్ చేసుకున్న వారికి పేరుపేరునా ఫోన్ చేసి.. ‘‘మీరు తప్పకుండా వస్తున్నారు కదా? సెప్టెంబరు 20వ తేదీన మీరు ఉండాల్సిందే.. ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరిచిపోవొద్దు’’ అని కాన్క్లేవ్ తేదీని గుర్తుచేస్తున్నాయి. అయ్యప్ప ముందు అందరూ సమానమే అన్నట్లుగా.. సామాన్య భక్తులకు కూడా సభాస్థలి వద్ద ముందు వరసలో చోటు కల్పించాయి.ఇప్పుడే ఎందుకు?ఇప్పుడే ప్రభుత్వం, టీడీబీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తులను కేటగిరీలుగా విభజించి, ఆదాయమార్గంగా మలచుకోవాలనేదే పినరయి సర్కారు ప్లాన్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ‘‘ఇది ఆరంభమే. సెక్యూలరిజాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మాకు అంతా సమానమే. త్వరలో మైనారిటీలకూ గ్లోబల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తాం’’ అని చెబుతోంది.ఇదే ప్రధాన లక్ష్యంశబరిమల అయ్యప్ప స్వామి కీర్తిని ప్రపంచానికి చాటడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీబీ, ప్రభుత్వం చెబుతున్నాయి. అదే సమయంలో ఏటా మాసపూజలు, ఓనం, మండల, మకరవిళక్కు(మకరజ్యోతి) సీజన్లో అయ్యప్ప కొండకు వచ్చే భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే ధ్యేయమని వివరిస్తున్నాయి. అయ్యప్ప భక్త సంఘాల ప్రతినిధులు చెప్పే సమస్యలను శ్రద్ధగా విని, రాబోయే సీజన్ నుంచే వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొంటున్నాయి. శబరిమల అభివృద్ధికి ఇటీవలి బడ్జెట్లో రూ.1,300 కోట్ల కేటాయింపు మొదలు.. కేంద్రం ఆమోదించిన రోప్వే ప్రాజెక్టు, పథనంతిట్టలో కొత్త విమానాశ్రయానికి, రైల్వే మార్గానికి చేస్తున్న ఏర్పాట్లు, త్వరలో పరిచయం చేయనున్న హెలిట్యాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు వివరించనున్నట్లు కేరళ పర్యాటక శాఖ చెబుతోంది.స్వాగతం ఇలా..ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తులకు పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. శబరిమలకు దారితీసే మార్గాలు- సీతాథోడ్, పెరునాడ్, పంపా ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భక్తులకు వసతి సదుపాయాలను సిద్ధం చేసింది. ఆహూతులందరికీ సెప్టెంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి హిల్ టాప్ వద్ద పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పంపా వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించింది. ఇక పారిశుద్ధ్యం మొదలు.. తాగునీటి సదుపాయం, భోజనాలు వంటి ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తును సిద్ధం చేసింది.బాలారిష్టాలెన్నెన్నో..గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్ అనే భావన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. అయితే.. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఉంటుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ నాయర్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ కోర్టు మెట్లెక్కారు. దీని వల్ల రాణి ఫారెస్ట్, పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్లలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలతో కేరళ హైకోర్టు ఏకీభవించడంతో.. ఓ దశలో కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. కేరళ సర్కారు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.చదవండి: రూ.కోటి వ్యయంతో అతి పురాతన వైష్ణవాలయానికి పూర్వవైభవంపందళ రాజకుటుంబం దూరంగ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్కు తాము దూరంగా ఉంటున్నట్లు పందళం రాజకుటుంబం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో పందళ రాజమాత మృతి చెందిన నేపథ్యంలో.. ఈ నెల 27 వరకు తాము దైవదర్శనానికి రాకూడదని పందళం ప్యాలెస్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించింది. తాము కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. దీంతో.. నీలక్కల్ను దాటి తాము పంపావైపు రాలేమని తెలిపింది.శబరిమల అభివృద్ధికి దోహదం: ఎస్.శ్రీజిత్, అదనపు డీజీపీ''గ్లోబల్ కాన్క్లేవ్ ద్వారా శబరిమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతుంది. ఇది భవిష్యత్ని ఉద్దేశించి చేపట్టిన ఓ ప్రాజెక్టు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు అయ్యప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా కృషి చేస్తున్నాం.''అయ్యప్ప అందరివాడు: నాగ మల్లారెడ్డి, గురుస్వామి''అయ్యప్ప ముందు అందరూ సమానమే. స్వామి దగ్గర తరతమబేధభావాలుండవు. ఆయన అందరివాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలవాడు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''స్వామి మహిమలెన్నెన్నో: వైవి సుబ్బారెడ్డి, గురుస్వామి(కడప)''అయ్యప్ప మహిమలు ఎన్నో.. ఎన్నెన్నో..! నమ్మినవారి కొంగు బంగారం ఆ మణికంఠుడు. ఉదాహరణకు ఎరుమేలి నుంచి పంపాకు పెద్దపాదం మార్గం(45 కిలోమీటర్లు) ఎత్తైన కొండల మీదుగా ఉంటుంది. కఠిన దీక్షలు చేసి, భక్తిప్రపత్తులతో వస్తున్న వారికి ఈ దూరం ఒక లెక్కే కాదు. అలాంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా వనయాత్రను పూర్తిచేసుకుంటారు. భక్తితో కాకుండా.. బలముందనే అహంకారంతో వచ్చేవారు 2 కిలోమీటర్లు నడిచినా.. 15 కిలోమీటర్ల దూరం నడిచామా? అనే భావన కలుగుతుంది. భక్తులకు కరిమల కొండ కఠిన పరీక్షలు పెడుతుంది. వాటిని అధిగమించి, స్వామిని చేరేవారి జన్మ ధన్యం.'' -
స్నేహితుడి కోసం నాడు పూజలు.. ఫోటోతో గుడ్న్యూస్ చెప్పిన 'మోహన్ లాల్'
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఆరోగ్యంపై గతంలో రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో తన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆ వార్తలు నిజమేనని చెప్పారు. అయితే, ఆందోళన చెందాల్సినంత అనారోగ్య సమస్యలు కాదని చెప్పారు. తాజాగా మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మమ్ముట్టి ప్రాణ స్నేహితుడు మోహన్ లాల్ కూడా వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. దానికి లవ్ సింబల్ను ఇచ్చి షేర్ చేయడంతో ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు.ఇప్పటికే మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారని త్వరలో మళ్లీ షూటింగ్లో పాల్గొంటారంటూ మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మోహన్ లాల్ ఫోటో షేర్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. అక్కడి నిర్మాతలతో పాటు నటి మంజు వారియర్ కూడా తన ఇన్స్టాలో ఓ ఫొటో షేర్ చేశారు. వెల్కమ్ బ్యాక్ టైగర్ అంటూ ఆమె ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన మేకప్ మ్యాన్ జార్జ్ కూడా మమ్ముట్టి కోలుకున్నట్లు తెలిపారు. అందరి ప్రార్థనలు ఫలించాయని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.మలయాళ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు అంటే ఎవరికైనా మోహన్ లాల్, మమ్ముట్టి పేర్లే గుర్తొస్తాయి. మమ్ముట్టి పూర్తిగా కోలుకోవాలని ఈ ఏడాది మార్చిలో శబరిమలలో మోహన్ లాల్ పూజలు జరిపించారు. ఆ సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని చెప్పడంతో కొంతమంది తప్పుపట్టారు. అలా ఎలా చేస్తారని మోహన్ లాల్ను ప్రశ్నించారు. దీంతో ఆయన కూడా సమాధానం చెప్పారు. 'అతని కోసం పూజలు చేస్తే తప్పేంటి..? ఆయన స్వల్ప అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే చేపించాను' అంటూ తెలిపారు. తర్వాత వారి స్నేహం పట్ల ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అందరికీ దేవుడు ఒక్కడే అంటూ నాడు కామెంట్లు చేశారు. ఇప్పుడు మమ్ముట్టి కోలుకోవడంతో అంతా అయ్యప్ప ఆశీస్సులు అంటూ చెబుతున్నారు. -
శబరిమల అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన హీరో కార్తీ (ఫోటోలు)
-
శబరిమల అయ్యప్పని దర్శించుకున్న మోహన్ లాల్
మన దగ్గర కొత్త సినిమా రిలీజ్ ఉందనగా చాలామంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. చాలామంది హీరోలకు ఇది సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఇలానే ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. కేరళలోని శబరిమల కొండని కాలినడకన ఎక్కారు. భుజాన ఇరుముడి కూడా కనిపించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)18 మెట్లు ఎక్కి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న మోహన్ లాల్.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అయితే ఇదంతా కూడా త్వరలో రిలీజ్ కాబోతున్న తన సినిమా 'ఎల్ 2: ఎంపురన్' కోసమే అని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ భారీ స్థాయిలో మార్చి 27న రిలీజ్ కానుంది.గతంలో 'లూసిఫర్' అనే సినిమా వచ్చింది కదా! దీనికి సీక్వెల్ 'ఎల్2' మూవీ. సలార్ ఫేమ్ పృథ్వీరాజ్.. దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలోనూ నటించాడు. ఈ సినిమాపై అటు మోహన్ లాల్, ఇటు పృథ్వీరాజ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?)శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ప్రముఖ నటుడు మోహన్లాల్.#Mohanlal #Aadhantelugu #Sabarimala #AyyappaTemple pic.twitter.com/MXkX48lfra— Aadhan Telugu (@AadhanTelugu) March 19, 2025சபரிமலைக்கு திடீர் விசிட் அடித்த நடிகர் மோகன்லால்; நடிகர் மம்முட்டி பெயரில் சிறப்பு பூஜை! #Mohanlal #Mammootty #Sabarimala #Kerala pic.twitter.com/2YMtwZYgrj— Idam valam (@Idam_valam) March 19, 2025 -
దర్శనమిచ్చిన మకరజ్యోతి..అయ్యప్ప భక్తుల పరవశం
తిరువనంతపురం: అయ్యప్ప భక్తులు ఏడాదిపాటు ఎదురు చూసిన క్షణం మళ్లీ వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన మంగళవారం(జనవరి14) సాయంత్రం 6గంటల 44 నిమిషాలకు కేరళలోని శబరిమల ఆలయ సమీపంలోని పొన్నాంబళమేడు కొండపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి రూపంలో అయ్యప్పస్వామి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్పస్వామిని తిరువాభవరణలతో అలంకరించారు.జ్యోతి దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శబరిమల కొండల్లోని పంబ, హిల్టాప్, సన్నిధానం సహా పలు చోట్ల భక్తుల కోసం వ్యూపాయింట్లు ఏర్పాటు చేసింది. జ్యోతిని సుమారు లక్షన్నర మంది దాకా అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించినట్లు సమాచారం. జ్యోతిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్లో కొన్ని కోట్ల మంది జ్యోతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు శబరిమల కొండపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. . ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి లేదా మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. -
ఆయనకు వీఐపీ దర్శనం ఎలా ?.. కోర్టు ఆగ్రహం
శబరిమల స్వామి దర్శనానికి అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్ష పూర్తి చేసి భక్తితో వెళ్తారు. కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా, శ్రామికుడైనా సరే స్వామి దర్శనం విషయంలో సమానమే... అయితే, మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు ఉన్న దిలీప్కు శబరిమలలోని అయ్యప్ప క్షేత్రంలో వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ఇదే సమయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ)పై మండిపడింది.డిసెంబర్ 4న నటుడు దిలీప్ శబరిమలలోని అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సమయంలో టీడీబీ అధికారులు ఆయనకు వీఐపీ దర్శనం కల్పించారు. దీంతో సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ విషయంపై అక్కడి మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దిలీప్కు వీఐపీ దర్శనం కల్పించడం వల్ల భక్తులు ఇబ్బందులకు గురయ్యారని, కొందరైతే దర్శనం కూడా చేసుకోకుండానే వెనుదిరిగారు అంటూ కథనాలు వచ్చాయి. దీంతో ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించింది.నటుడు దిలీప్ను ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతిచ్చారని కేరళ కోర్టు ప్రశ్నించింది. టీడీబీ చేసిన పొరపాటు వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కోర్టు వెళ్లడించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారే ఇలాంటి తప్పులు చేస్తే.. భక్తులు ఎవరితో చెప్పుకుంటారని తప్పబట్టింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే అక్కడ వీఐపీ దర్శనం ఉంటుందని ఈమేరకు కోర్టు గుర్తుచేసింది. ఇతరులు ఎవరైనా సరే ఆ అవకాశం కల్పించడం విరుద్ధం అంటూ న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్రన్, జస్టిస్ మురళీకృష్ణలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
శబరిమలలో హరివరాసనం: అద్వితీయంగా చిన్నారి నృత్యాభినయం
ప్రసిద్ధ గాయకుడు కే జే ఏసుదాసు నోట అత్యంత అద్భుతంగా పలికిన ‘‘హరివరాసనం విశ్వమోహనం హరిహరాత్మజం దేవమాశ్రయే’’ అయ్యప్పస్వామి పాటను వింటే ఎలాంటి వారికైనా అద్భుతం అనిపిస్తుంది. ఇక అయ్యప్ప భక్తులైతే భక్తిపరవశంతో తన్మయులౌతారు. ఈ పాటకు చిన్నారి చేసిన నృత్యాభినయం విశేషంగా నిలుస్తోంది.శబరిమలలో హరివరాసనం పఠిస్తున్నపుడు చిన్నారి అద్భుతంగా నృత్యం చేసింది. ఆ పాటకు చక్కటిన హావభావాలు, అభినయానికి అందరూ మంత్ర ముగ్ధులవుతున్నారు. ‘‘ఆమె అభినయం, చూపించిన భావాలు చాలా బావున్నాయి. ఈ చిన్నారికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప!’’ అంటూ నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు.Harivarasanam with a small Ayyappa Devotee girl dancing to the song .Ayyappa Sharanam1/2 pic.twitter.com/2XyE5Lrme7— @Bala (@neelabala) March 30, 2024ఇటీవల స్వామి వారి సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, రాత్రి 10 గంటలకు, విష్ణుప్రియ ఈ మధురమైన పాటకు, లయకు అనుగుణంగా నృత్యం చేయడం ప్రారంభించింది. దీన్ని చూసిన భక్తులు చిత్రీకరించడంతో అది తరువాత వైరల్గా మారింది.కాగా స్థానిక మీడియా మాతృభూమి కథనం ప్రకారం విష్ణుప్రియ కేరళలోని ఎడపల్లిలోని అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కొచ్చిలోని అమృతా టెక్నాలజీస్లో పని చేస్తున్నారు. ఆమె తల్లి పలరివట్టం వెక్టర్ షేడ్స్ కంపెనీలో ఇంజనీర్. ఆమె సోదరుడు 1వ తరగతి విద్యార్థి. -
శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం మీకు ఇష్టమా? ఇలా చేసుకోవచ్చు
శబరిమల అనగానే గుర్తొచ్చేది ముందుగా అయ్యప్ప ఆలయం, ఆ తర్వాత స్వామి ప్రసాదం. ఏటా శబరిమల అయ్యప్పస్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్న అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులకు కోసం తప్పకుండా ప్రసాదం తీసుకెళ్తుంటారు. తిరుపతి లడ్డూ తర్వాత ఆ స్థాయిలో శబరిమలలో దొరికే అరవణి ప్రసాదానికి కూడా అంత పేరుంది. ఈ ప్రసాదాన్ని అరవణ ప్రసాదం అంటారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి చేసే ఈ ప్రసాదం తినడానికి రుచిగా ఉండటంతో పాటు చలికాలంలో తింటే ఆరోగ్యానికి మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి. కేరళలో కొన్ని ప్రత్యేక వేడుకల్లో అరవణ పాయసాన్ని తయారు చేసుకుంటారు. మరి దీని తయారీ విధానం చూసేద్దాం. కావల్సిన పదార్థాలు ఎర్రబియ్యం: ఒక కప్పు నల్ల బెల్లం: రెండు కప్పులు శొంటిపొడి: 1 టీస్పూన్ పచ్చి కొబ్బరి: ఒక కప్పు నెయ్యి: తగినంత జీడికప్పులు: పావు కప్పు నీళ్లు: ఆరు కప్పులు అరవణ ప్రసాదం తయారీ ముందుగా పాన్ మీద నల్ల బెల్లం వేసి కరిగించాలి. మరో పాన్లో ముందుగా పచ్చికొబ్బరి, జీడిపప్పులు వేయించి పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎర్రబియ్యం బాగా శుభ్రంగా కడిగి అన్నంలా వండుకోవాలి. ఉడికించే సమయంలోనే కాస్త నెయ్యి వేసుకోని కాస్త మెత్తగా వండుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి ఉడికించుకోవాలి. తర్వాత శొంటి పొడి, నెయ్యి వేస్తూ దగ్గరకు పడుతున్నంత సేపు ఉడికించుకోవాలి. చివరగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టేగీ ఉండే అవరణ పాయసం రెడీ. -
శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనం కాకుండానే వెనక్కి!
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. దర్శనం లేట్ అవుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్లు సమాచారం. వివరాల ప్రకారం.. శబరిమలలో క్యూలైన్ల నిర్వహణలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం వహించారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అయ్యప్ప దర్శనానికి ఎక్కువగా సమయం పడుతుండటంతో కర్ణాటకకు చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. VIDEO | Sabarimala pilgrims blocked the Erumeli-Pamba road overnight demanding that their vehicles be allowed to go till Pamba. #Sabarimala pic.twitter.com/IpsOonzRRU — Press Trust of India (@PTI_News) December 13, 2023 మరోవైపు.. శబరిమలకు వెళ్లే రహదారుల్లో మంగళవారం కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐదు రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు. తమ వాహనాలను అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కాగా, రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. Extremely dangerous situation at #Sabarimala with unmanageable crowd. Less police force deployed to control the crowd as major force is diverted to CM's and Minister's program.@narendramodi @PMOIndia @AmitShah @rajnathsingh Kindly intervene and avert a potential disaster🙏🙏 pic.twitter.com/ksoGsa5B0z — നചികേതസ് (@nach1keta) December 12, 2023 ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకు భారీ సంఖ్యలోనే భక్తులు వెళ్లినట్టు సమాచారం. వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్టు తెలుస్తోంది. #SwamiSharanam Salutes to @TheKeralaPolice Team in #Sabarimala. Heavy crowd and they are simply rocking. Helping young Malikappurams inconvenienced in the crowd to get some fresh air pic.twitter.com/mejM0qSWQj — Suresh 🇮🇳 (@surnell) December 12, 2023 Usually we hear Swamy Saranam Ayyappa Nama japam in the queue lines but due to heavy rush and poor management pilgrims were chanting down down police and CM. Yesterday was worst day in life. Never travel with kids. Too much suffocation in Q lanes#Sabarimala pic.twitter.com/1CMFk0NwVD — నేనుఎవరు (@NenuYevaru) December 10, 2023 ప్రత్యేక రైళ్లు.. ఇదిలా ఉండగా.. అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రత్యేక రైళ్లు.. డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి. Sabarimala Season Special Trains #Sabarimala #SCR @drmhyb @drmsecunderabad @drmvijayawada @drmgnt @drmgtl @drmned pic.twitter.com/OX7NYNjOcR — South Central Railway (@SCRailwayIndia) December 12, 2023 The Travancore Devaswom Board has completely failed in managing the crowd in Sabarimala. If this continues, it could result in serious issues. #Sabarimala #Kerala pic.twitter.com/blfkwrtyfg — Harish M (@chnmharish) December 10, 2023 -
Travancore Devaswom Board: శబరిమలలో భారీ రద్దీ.. దర్శన సమయం గంట పెంపు
పత్తనంతిట్ట: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మాలధారుల తాకిడి పెరిగింది. దీంతో దర్శన సమయాన్ని గంట పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు(టీడీబీ)ఆదివారం ప్రకటించింది. సాయంత్రం దర్శనం 4 బదులు 3 గంటల నుంచే మొదలవనుంది. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్లు, 30 వేల స్పాట్లో బుకింగ్స్ ఉంటున్నాయని ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతోందని వివరించారు. దర్శనానికి 15 నుంచి 20 గంటల వరకు భక్తులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. -
శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
-
శబరిమల వెళ్లే ప్రతి స్వామి తెలుసుకోవాల్సిన విషయాలు
-
శబరిమలకు పోటెత్తిన భక్తులు
-
శరణకీర్తనం భక్త మానసం
-
స్వామియే శరణం అయ్యప్పా
-
శబరిమలకు పోటెత్తిన భక్తులు
-
శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..
-
16 నుంచి అయ్యప్ప దర్శనం
సాక్షి, అమరావతి: నిర్దిష్ట వేళల్లో మాత్రమే కొనసాగే శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ వరకు ఈ విడత దర్శనాలు కొనసాగుతాయి. కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి రాష్ట్రం నుంచి ఈసారి 5 లక్షలకు పైగా భక్తులు తరలివెళ్తారని అంచనా. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యల్లో భాగంగా ఏటా శబరిమల యాత్ర ప్రారంభానికి ముందు కేరళ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వివిధ దక్షిణాది రాష్ట్రాల దేవదాయ శాఖ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన ఏర్పాట్లపై కేరళ మంత్రి రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల అధికారులతో మూడు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే దర్శనం కరోనా నేపథ్యంలో మూడేళ్లగా శబరిమల ఆలయానికి సంబంధించిన ‘వర్చువల్ క్యూ సిస్టమ్’ ప్రత్యేక వెబ్ పోర్టల్లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే ఆలయ అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ ఏడాది కూడా ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారినే అనుమతిస్తున్న విషయాన్ని ఏపీలోని భక్తులకు తెలిసేలా ప్రచారం చేయాలని కేరళ మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం శబరిమలకు వచ్చే మార్గంలోని నిలక్కల్, ఎడతావళం ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆలయాల్లో ప్రత్యేక బోర్డులు శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు పాటించాల్సిన నిబంధనల్ని తెలియజేసేలా రాష్ట్రంలోని పెద్ద ఆలయాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసేలా రాష్ట్ర దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. రూ.25 లక్షలకు పైబడి ఆదాయం వచ్చే దాదాపు 270 ఆలయాల్లో ఈ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కేరళ ప్రభుత్వం చేసిన సూచనలతో తెలుగులో బుక్లెట్ రూపొందించి, వాటిని ఆయా ఆలయాల వద్ద ఆయ్యప్ప భక్తులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నిబంధనలు తప్పనిసరి ► దర్శనాలకు వచ్చే భక్తులు వైద్యుడు ఇచ్చే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ► భక్తులు ప్లాస్టిక్, వాడి పడేసే కొన్ని రకాలైన పేపర్లు వంటివి కలిగి ఉండకూడదని.. కప్పులు, గ్లాస్లు వంటివి ఒకసారి వాడిన తర్వాత కడుక్కొని తిరిగి వాడుకోవడానికి అవకాశం ఉండేవి మాత్రమే వెంట తీసుకెళ్లాలి. అన్నిరకాల ప్లాస్టిక్ వస్తువులు, యూజ్ అండ్ త్రో కవర్ల వినియోగంపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ► గుడ్డ సంచులను మాత్రమే భక్తులు వెంట తీసుకువెళ్లాలి. ► పంబ, అయ్యప్పస్వామి ఆలయ సన్నిధానం ప్రాంతాల్లో సెల్ఫోన్ల వాడకంపై నిషేధం అమలులో ఉంటుంది. -
డోలీలో వెళ్లి అయ్యప్పను దర్శించుకున్న చిరంజీవి
ఇటీవలే కరోను జయించిన మెగాస్టార్ చిరంజీవి ఆధ్యాత్మిక యాత్రలో నిమగ్నమయ్యారు. సతీమణ సురేఖతో కలిసి పలు దేవాలయాలను చుట్టుస్తున్నారు. ఈ క్రమంలో వీరు ఆదివారం నాడు శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చాలా కాలం తర్వాత శబరిమల స్వామిని దర్శించుకున్నానంటూ చిరంజీవి ట్విటర్లో ఫొటో షేర్ చేశారు. 'చాలాకాలం తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాను. భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా, అందరినీ అసౌకర్యానికి గురి చేయకుండా డోలీలో వెళ్లవలసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార పోస్తున్న శ్రమైక సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి కుటుంబాల తోడు మంచి అనుభూతినిచ్చింది' అని చిరంజీవి పేర్కొన్నారు. తనను డోలీలో మోసుకెళ్లిన శ్రామికులకు చేతులెత్తి నమస్కరించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Visiting #sabarimalatemple #feelingblessed pic.twitter.com/kdtfxXszcl — Chiranjeevi Konidela (@KChiruTweets) February 13, 2022 -
Sabarimala Temple: నేటి నుంచి అయ్యప్ప దర్శనం
-
నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయం నేడు తెరచుకోనుంది. తులామాసం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరవనున్నామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చదవండి: (దసరా ఉత్సవాల్లో కారు బీభత్సం.. నలుగురు మృతి) -
స్పీడ్పోస్ట్లో శబరిమల ప్రసాదం
తిరువనంతపురం: ఈ సీజన్లో మాత్రమే దొరికే శబరిమల అరవణ పాయసం భక్తులకు ఎంతో ప్రీతిదాయకం. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో శబరిమల సందర్శించే వారి సంఖ్య లక్షల నుంచి వందలకు పడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శబరిమల భక్తులకు స్వామి ప్రసాదం ఇంటి వద్దకే అందజేయాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. ఆ వెంటనే శబరిమల ప్రసాదాన్ని భక్తులకు డెలివరీ చేసేందుకు కేరళకు చెందిన పోస్టల్ సర్కిల్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రసాదం పంపిణీ కోసం సమగ్ర బుకింగ్, డెలివరీ ప్యాకేజీని అభివృద్ధి చేసినట్లు మంగళవారం అధికారికంగా పత్రికా ప్రకటన చేసింది. చదవండి: (మంచు కొండల్లో పెరిగిన పొలిటికల్ హీట్..) ప్రసాదం కిట్ ధర రూ.450 గా ప్రకటించింది. ఇందులో అరవణ పాయసం, విభూతి, కుంకుమ, పసుపు, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయని తెలిపారు. ఒక వ్యక్తి ఒకేసారి 10 వరకు ప్రసాదం కిట్స్ని ఆర్డర్ చేయవచ్చని, అంతకన్నా ఎక్కువ కావాలంటే మరో రిసిప్ట్ పైన బుక్ చేయాలని పేర్కొన్నారు. స్పీడ్ పోస్ట్లో ప్రసాదం బుక్ అయిన వెంటనే, స్పీడ్ పోస్ట్ నంబర్ ఎస్ఎంఎస్ ద్వారా భక్తుడికి వస్తుంది. ఆ నంబర్తో ఇండియా పోస్టల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ప్రసాదం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని వివరించారు. ఈ సేవను నవంబర్ 16 నుంచి ప్రారంభించామని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. ఇప్పటికే దేశమంతటా 9,000 ఆర్డర్లు బుక్ చేయబడ్డాయని, ఈ సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుందన్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏడు నెలలుగా మూసివేసిన ఆలయాన్ని కొన్ని నిబంధనలతో అక్టోబర్ 16 నుంచి తెరిచారు. నవంబర్ 16 నుంచి అయ్యప్ప మాల వేసుకునే వారిని అనుమతించారు. అయితే రోజు వారీగా పరిమిత సంఖ్యలో అనుమతించడం, కఠినమైన ఆంక్షలు నేపథ్యంలో శబరిమలను సందర్శించే వారి సంఖ్య బాగా తగ్గిందని పేర్కొన్నారు. -
శబరిమల ఆలయంలోకి భక్తులకు అనుమతి
-
‘శబరిమల’పై సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: శబరిమల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గురువారం తన తీర్పును రిజర్వ్లో ఉంచింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష సందర్భంగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం మత వ్యవహారాలకు సంబంధించిన కొన్ని అంశాలను విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కక్షిదారుల తరఫు న్యాయవాదులు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని విస్తృత బెంచ్ గురువారం కేసును విచారించింది. రోజంతా సాగిన ఈ విచారణ తరువాత జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే తీర్పును రిజర్వ్లో ఉంచారు. ‘ఆదేశాలు సోమవారం జారీ చేస్తాం. విస్తృత ధర్మాసనం చర్చించాల్సిన అంశాలను కూడా అదే రోజు ఖరారు చేస్తాం’ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారుల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్తో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఢిల్లీ న్యాయాధికారుల కేసును ప్రస్తావించారు. ఆ కేసులో నారీమన్ ఇంగ్లాండ్ న్యాయశాస్త్ర గ్రంథం హాల్స్బరీలోని ఓ నిబంధనను ప్రస్తావించారని, దాని ప్రకారం సుప్రీంకోర్టుకు ఏ రకమైన ఆంక్షల్లేని న్యాయపరిధి లభిస్తుందని... శబరిమల కేసుకు అది వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. ఒక తీర్పుపై సమీక్ష జరిపే సమయంలో న్యాయ సంబంధిత ప్రశ్నలను లేవనెత్తరాదన్నది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల వాదనగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: ఏప్రిల్లో మందిర నిర్మాణం!) -
శబరిమల: మహిళా కార్యకర్తపై కారంపొడితో దాడి
తిరువనంతపురం: కేరళలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మహిళా హక్కుల నేత తృప్తి దేశాయ్తోపాటు మొత్తం ఆరుగురు మహిళలు శబరిమల కేరళ వచ్చారు. శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భద్రత కల్పించాలంటూ కొచ్చి సిటీ పోలీసు కమిషనర్ను వారు ఆశ్రయించారు. అయితే, వారి బృందంలో ఒకరైన బిందు అమ్మినిపై సీపీ కార్యాలయం ఎదుటే దాడి జరిగింది. హిందూ సంస్థల కార్యకర్త ఒకరు కారంపొడి స్ప్రేతో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గత జనవరిలో హిందూ సంస్థల కళ్లుగప్పి బిందు అమ్మిని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తాజాగా కూడా తృప్తి దేశాయ్తో కలిసి మరోసారి అయ్యప్పను దర్శించుకోవడానికి ఆమె వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో బిందుతోపాటు తృప్తి దేశాయ్ బృందాన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టు సమీక్షకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రచారం కోసం శబరిమలకు వచ్చే మహిళలకు భద్రత కల్పించలేమంటూ కేరళ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాకే తాము కేరళను వీడి వెళతామని తృప్తి దేశాయ్ చెప్తున్నారు. దేశంలో అందరికీ సమాన హక్కులుంటాయని రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇవాళ.. మమ్మల్ని ఇలా అడ్డుకోవడం, దాడులు చేయడం తమను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. -
బంగారం మాయం; తెరచుకోనున్న స్ట్రాంగ్రూంలు
తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామి ఆలయ బంగారం వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. స్వామి వారి బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం స్ట్రాంగ్ రూంలు తెరుచుకోనున్నాయి. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారుల ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి ఆడిట్ జరుగనుంది. కాగా స్ట్రాంగ్ రూముల్లోని స్వామి వారి బంగారం మాయమైదంటూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు విజలెన్స్ వింగ్కు ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా స్ట్రాంగ్ రూముల్లో బంగారం భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో బంగారం విషయమై దర్యాప్తు జరపాల్సిందిగా బీజేపీ నేతృత్వంలో హిందూ సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. ఈ వ్యవహారంపై విచారణకు కేరళ హైకోర్టు ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. దీంతో సోమవారం ఆడిట్ జరుగునుంది. ఇక ఈ విషయంపై స్పందించిన బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్ బంగారం మాయమైందన్న విషయాన్ని కొట్టిపారేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు పాత కమిటీ బంగారానికి సంబంధించిన వివరాలు అందించలేదని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఇలాగే జరుగుతుందని.. ఒకవేళ ఆడిట్లో గనుక తేడాలు వచ్చినట్లైతే బాధ్యులపై బోర్డు తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. -
ట్రావెన్కోర్ బోర్డు యూటర్న్
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుస్రావ వయసున్న (18 నుంచి 50 ఏళ్లలోపు) మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు బుధవారం అనూహ్యంగా మనసు మార్చుకుంది. శబరిమల ఆలయంలోకి రుతుస్రావ మహిళల ప్రవేశంపై గతేడాది ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు బోర్డు తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది కోర్టుకు తెలిపారు. జీవసంబంధమైన లక్షణాల ఆధారంగా మహిళలపై వివక్ష చూపించడం సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అన్నిపక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ బోర్డు గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించగా, నాయర్ సర్వీస్ సొసైటీ, ఆలయ తంత్రి తదితరులు తీర్పును సమీక్షించాలని కోరారు. మతపరమైన సంస్థలకు వర్తించదు.. మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నాయర్ సర్వీస్ సొసైటీ(ఎన్ఎస్ఎస్) తరఫున సీనియర్ న్యాయవాది కె.పరశరణ్ వాదిస్తూ.. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 దేశంలోని అన్ని లౌకికవాద సంస్థలకు వర్తిస్తుంది. కానీ మతపరమైన సంస్థలకు ఇది వర్తించదు. ఆర్టికల్ 15 నుంచి మతపరమైన సంస్థలకు స్పష్టమైన మినహాయింపు దొరుకుతోంది. అంటరానితనం నిర్మూలనకు ఉద్దేశించిన ఆర్టికల్ 17ను సుప్రీంకోర్టు పొరపాటున తన తీర్పులో ఉదాహరించింది. ఎందుకంటే కొందరు మహిళలకు కులాల ఆధారంగా ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం లేదు. శబరిమల అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి. ఈ విషయాన్ని తీర్పు సందర్భంగా కోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది’ అని తెలిపారు. మరోవైపు అయ్యప్పస్వామి ఆలయంలోకి కులం, మతం ఆధారంగా మహిళలు, పురుషులపై నిషేధం లేదని బోర్డు మాజీ చైర్మన్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. మహిళల్లోని ఓ వర్గాన్ని మాత్రమే నిషేధిస్తున్నందున ఆర్టికల్ 17(అంటరానితనం నిర్మూలన) దీనికి వర్తించదని పేర్కొన్నారు. -
కేరళ సంస్కృతికి అవమానం
త్రిస్సూర్/కొచ్చి: కేరళ సంస్కృతిని ఆ రాష్ట్రంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలా అవమానించిందో శబరిమల అంశం ద్వారా స్పష్టమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విమర్శించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలు వెళ్లవచ్చునంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించడం, ఈ అంశం కేరళలో తీవ్ర ఆందోళనలు, హింసకు దారితీయడం తెలిసిందే. అనంతరం పోలీసు భద్రత నడుమ ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం కూడా పెనుదుమారం రేపింది. కేరళలోని త్రిస్సూర్లో జరిగిన యువ మోర్చా సభలో మోదీ మాట్లాడుతూ ‘శబరిమల అంశం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేరళ సంస్కృతిని సీపీఎం నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎంతలా అవమానపరిచిందో దేశ ప్రజలు చూశారు. కేరళ సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? దురదృష్టవశాత్తూ కేరళ సాంస్కృతిక విలువలపై దాడి జరుగుతోంది. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వమే ఆ పని చేస్తోంది’ అని ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష పార్టీల వారు తనను ఎంత దూషిం చినా ఫరవాలేదనీ, కానీ వారు రైతులను తప్పుదోవ పట్టించకూడదని మోదీ పేర్కొన్నారు. యువతకు లభిస్తున్న అవకాశాలకు విపక్షాలు అవరోధాలను సృష్టించకూడదని కోరారు. కొచ్చిలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కోసం నిర్మించిన కాంప్లెక్స్ను మోదీ జాతికి అంకితమిచ్చారు. ఈ కర్మాగారంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్కు, ఎట్టుమనూర్లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన ఎల్పీజీ సిలిండర్లను నింపే ప్లాంటులో కొత్త నిల్వ సదుపాయాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వంటగదులను పొగరహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందనీ, తాము అధికారంలోకి వచ్చే నాటికి 55 శాతం కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 90 శాతానికి చేర్చామని అన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఓ పెద్ద జోక్ అని మోదీ విమర్శించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త నంబి నారాయణన్ను గూఢచర్యం కేసులో ఇరికించింది నాడు కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వమేనని మోదీ ఆరోపించారు. తమ పార్టీ నాయకుల రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అలా చేశారన్నారు. తమ ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ను ఇచ్చిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. విపక్షం అంటే అవినీతి గృహమని మోదీ అన్నారు. తనను తాను కాపలాదారుడిగా మరోసారి చెప్పుకున్న ఆయన, తాను అధికారంలో ఉన్నంతవరకూ అవినీతిని అనుమతించనని తెలిపారు. ఎట్టుమనూర్లో శంకుస్థాపన కార్యక్రమానికి గవర్నర్ పి.సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు హాజరయ్యారు. సంపూర్ణ ఆరోగ్యానికే ఆయుష్మాన్ భారత్.. సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై సమీపంలోని థోప్పూర్లో రూ. 1,264 కోట్లతో నిర్మించ తలపెట్టిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్–ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. 750 పడకలతో నిర్మిస్తున్న ఈ వైద్యశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల కూడా ఉండనుంది. మదురైలో మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఆరోగ్య సమస్యలకు సంపూర్ణంగా పరిష్కారం చూపేందుకే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఏడు ఎయిమ్స్ వైద్యశాలలు పనిచేస్తుండగా ఇవన్నీ ఉత్తర భారతంలోనే ఉన్నాయి. మరో 14 ఎయిమ్స్ను ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్మిస్తోంది. మదురైలో నిర్మిస్తున్న ఎయిమ్స్తో తమిళనాడు ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుతాయని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న వివిధ ఆరోగ్య పథకాల గురించి ఆయన వివరించారు. వెనుకబడిన రామనాథపురం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి మోదీని కోరారు. కాగా, కావేరీ నదీ జలాలు సహా అనేక అంశాల్లో మోదీ తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరించి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపిస్తూ ఎండీఎంకే కార్యకర్తలు తమ పార్టీ అధినేత గైకో నేతృత్వంలోని ఎయిమ్స్ శంకుస్థాపన స్థలం వద్ద ఆందోళనకు దిగాయి. నల్ల జెండాలు చేతబట్టి నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రక్షణ హబ్గా మారుస్తాం.. తమిళనాడును రక్షణ ఉత్పత్తుల, విమాన రంగ హబ్గా మార్చడమే కేంద్రం లక్ష్యమని మోదీ అన్నారు. పరిశ్రమల పరంగా దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎయిమ్స్ శంకుస్థాపన అనంతరం మదురైలోనే బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. తమిళనాడుకు మంజూరైన రక్షణ పరిశ్రమల కారిడార్ వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తూత్తుకుడి నౌకాశ్రయం దక్షిణ భారతంలో మరింత పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడగలదని మోదీ అన్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ఏ ప్రమాదమూ లేదనీ, వారంతా నిశ్చింతగా ఉండాలని మోదీ వివరించారు. అవినీతిని అంతం చేయడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందనీ, ఆర్థిక నేరగాళ్లను చట్టం ముందుకు నిలబెట్టి తీరుతామని పేర్కొన్నారు. ప్రధాని కానుకల వేలం ప్రారంభం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి కానుకలుగా వచ్చిన వస్తువుల వేలం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ) మ్యూజియంలో ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు రూ.1,000 ప్రారంభ ధర కలిగిన ఛత్రపతి శివాజీ విగ్రహం రూ.22 వేలకు అమ్ముడుపోయింది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగా నది శుద్ధి ప్రాజెక్టు ‘నమామీ గంగా’కు వెచ్చించనున్నారు. వేలంలో అందుబాటులో ఉంచిన వస్తువుల వివరాలు, వాటి ప్రారంభ ధరల్ని జ్టి్టp://pఝఝ్ఛఝ్ఛn్టౌట.జౌఠి.జీn అనే వెబ్సైట్లో సందర్శకులు చూడొచ్చు. ఈ వస్తువుల ప్రారంభ ధరల్ని రూ.100 నుంచి రూ.30 వేల మధ్య నిర్ధారించినట్లు సాంస్కృతిక శాఖ ప్రకటించింది. తొలిరోజు వచ్చిన ఆదాయం ఎంత? ఏ వస్తువుకు అధిక ధర లభించిందో తెలియరాలేదు. సోమవారం నాటికి అమ్ముడుపోని వస్తువుల్ని 29, 30, 31 తేదీల్లో ఆన్లైన్లో వేలం వేస్తారు. దేశవిదేశాల్లో మోదీ కానుకలుగా స్వీకరించిన శాలువాలు, టోపీలు, చిత్రపటాలు, జాకెట్లు, జ్ఞాపికలను వేలానికి ఉంచారు. మాజీ ఎంపీ నరసింహన్ సమర్పించిన 2.22 కిలోల వెండి ప్లేట్కు అత్యధికంగా రూ.30 వేల ప్రారంభ ధర నిర్ణయించారు. ఓటు హక్కు వినియోగించుకోండి! న్యూఢిల్లీ: ఓటు హక్కు పవిత్రమైందనీ, ప్రజాస్వామ్యానికి కీలకమైన ఈ హక్కును వినియోగించుకోలేని వారు ఆ తర్వాత బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాసాంతపు మనస్సులో మాట(మన్కీ బాత్) కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన ఆకాశవాణిలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహాయజ్ఞంలో తన విధిని ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్ను ప్రశంసించారు. గత నాలుగేళ్లలో అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించిన భారత్ త్వరలోనే చంద్రునిపై తన ఉనికిని చాటబోతోందని ప్రధాని తెలిపారు. నేతాజీకి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. 21వ శతాబ్దంలో జన్మించిన వారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారన్న ప్రధాని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ‘ఎవరైనా ఏదైనా కారణంతో ఓటు వేయలేకపోతే, అది చాలా బాధాకరమైన విషయం’ అని ఆయన అన్నారు. ‘దేశంలో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు అయ్యో, అప్పుడే ఓటు వేయలేకపోయామే.. ఓటు వేయని ఫలితంగానే ఇలాంటి చెడు ఘటన జరిగింది కదా.. అంటూ బాధపడతారు’అని ప్రధాని వ్యాఖ్యానించారు. నేతాజీ పత్రాలను వెల్లడించాం స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ను సాహసికుడైన సైనికుడు, అద్భు తమైన నాయకుడుగా అభివర్ణించిన ప్రధాని .. బోస్కు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఆయనకు సంబంధించిన వస్తువులతో ఎర్రకోట వద్ద ‘క్రాంతి మందిర్’ మ్యూజియంను ప్రారంభించామన్నారు. త్వరలోనే చంద్రునిపైకి.. చంద్రయాన్–2 కార్యక్రమం ద్వారా త్వరలోనే భారతీయులు చంద్రునిపై అడుగుపెట్టనున్నారని ప్రధాని మోదీ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాలతో సమాన సంఖ్యలో గత నాలుగేళ్లలో చేపట్టిన అంతరిక్ష కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ప్రధాని తెలిపారు. -
క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తాం
-
ఆమెను ఇంటి నుంచి గెంటేశారు!
తిరువనంతపురం : అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది. ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు. ఆమెను ఇంట్లోకి రానివ్వడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసుకొని.. లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తామని తెగేసి చెబుతున్నారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా తమ కుటుంబం పరువును కనకదుర్గ గంగలో కలిపిందని.. సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఇంట్లోకి రావడానికి వీల్లేకుండా.. ఇంటికి తాళం వేసి ఆమె భర్త బంధువుల దగ్గరకు వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో పోలీసులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం కనకదుర్గ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోంలో తలదాచుకుంటోంది. జనవరి 2న బిందు (40) అనే మరో మహిళతో కలిసి కనకదుర్గ (39) శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో అయ్యప్ప సన్నిధానం చేరుకున్న నిషిద్ధ వయసున్న తొలి మహిళల్లో ఒకరిగా ఆమె నిలిచింది. వాస్తవానికి అంతకు ముందే డిసెంబర్ 24 ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు. దీంతో పోలీసులు రక్షణ మధ్య వారిని ఇళ్లకు పంపించేశారు. మళ్లీ జనవరి 2న ఆలయంలోకి వెళ్లారు. మరోవైపు తిరువనంతపురంలో మీటింగ్ ఉందని అబద్దం చెప్పి శబరిమలకు వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మలప్పురం జిల్లా అరిక్కోడెకు చెందిన కనకదుర్గ దళిత్ యాక్టివిస్ట్. తన స్నేహితురాలు కనకదుర్గను ఇంట్లోకి రానీయకపోవడానికి కొందరి ఒత్తిడే కారణమని, న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని బిందు తెలిపింది. ఇక బిందు కూడా ఈ తరహా వేధింపులు ఎదుర్కొంది. ఆమెకే కాకుండా తన కూతురుకు కూడా ఈ వేధింపులు ఎదురయ్యాయి. ‘నువ్వు మీ అమ్మలా కావద్దు’’అంటున్నారట. మా అమ్మాయి క్లాస్లోని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయితో మాట్లాడొద్దని, డిస్టెన్స్ మెయిన్టైన్ చేయమని వాళ్ల పిల్లలకు చెప్తున్నారట. ఈ అవమానంతో మా అమ్మాయి ఇప్పుడు స్కూల్కి వెళ్లడానికే ఇష్టపడట్లేదు’’ అని బిందు మీడియాతో ఆవేదన వ్యక్తం చేసింది. -
కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు.. ఇదిగో సాక్ష్యాలు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న హిందూత్వ, జాతీయవాదాన్ని ఎలా త్రిప్పికొట్టాలో తెలియక కాంగ్రెస్ పార్టీ తికమక పడుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీకి పునాదులుగా ఉన్న లౌకికవాదం, జాతీయవాదం, లింగ సమానత్వం, మానవ హక్కులకు తిలోదకాలిస్తోంది. అధికారం కోసం అంగలారుస్తూ బీజేపీకన్నా ఎక్కువగా ఆత్మవంచనకు పాల్పడుతోంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఓ విధానం, రాష్ట్రాల స్థాయిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా మరో విధానం అంటూ కొత్త పాటను అందుకుంది. కాంగ్రెస్ పార్టీలో పేరుకుపోతున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు మొట్టమొదటిసారిగా ప్రజల ముందు జనవరి మూడవ తేదీన బయటపడ్డాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి యాభై ఏళ్లకు లోపున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పాటిస్తున్న ‘నిరసన దినం’లో భాగంగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు నల్లబ్యాడ్జీలు ధరించి పార్లమెంట్కు వచ్చారు. పార్లమెంట్ ఆవరణలోనే వారిని సోనియాగాంధీ అడ్డుకుని ఆ బ్యాడ్జీలను తీసి వేయించారు. అయ్యప్ప ఆలయానికి సంబంధించిన నిరసన కేరళ వరకే పరిమితం కావాలని, జాతీయస్థాయిలో ఆడ, మగ మధ్య లింగ వివక్ష చూపకూడదని ఆమె హితవు చెప్పారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకే తీరుగా స్పందించాయి. ఇరు పార్టీలు తీర్పును హర్షించాయి. కేరళ భక్తులు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో బీజేపీ ముందుగా ప్లేటు ఫిరాయించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ప్లేటు ఫిరాయించింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల లోపు మహిళలను అనుమతించరాదనే అయ్యప్ప ఆలయ సంప్రదాయాన్ని తాను గౌరవిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఒకటవ తేదీన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదే విషయమై రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించగా మహిళల పట్ల వివక్ష చూపకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, కేరళ కాంగ్రెస్ ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నదని, పార్టీ అభిప్రాయమే తనదని చెప్పారు. దీన్నే ద్వంద్వ ప్రమాణాలంటారు. వ్యక్తిగతంగా గాంధీల అభిప్రాయం ఏదైనా ఉండవచ్చు. దాన్ని ఎవరూ కాదనరు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒకే అభిప్రాయం ఉండాలి. ఓటు రాజకీయాల కోసం ఏకాభిప్రాయాన్ని వదిలిపెట్టడమే ద్వంద్వ ప్రమాణాలను దగ్గరికి తీసుకోవడం అవుతుంది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతి నెల మొదటి రోజు రాష్ట్ర సచివాలయంలో ‘వందేమాతరం’ గీతాలాపనను రద్దు చేశారు. గీతాలాపన చేయడమే దేశభక్తికి రుజువు కాదంటూ 2005 సంవత్సరం నుంచి బీజేపీ ప్రభుత్వం ఆచరిస్తున్న సంప్రదాయాన్ని ఆయన పక్కన పడేశారు. ఇక ప్రతినెల బీజేపీ శాసన సభ్యులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ ప్రకటించగానే కమల్ నాథ్ మాట మార్చారు. మరింత మెరుగ్గా ‘వందేమాతరం’ గీతాలాపన ఉండాలన్న ఉద్దేశంతోనే తాను దీన్ని వాయిదా వేశానంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు బ్యాండుతో ఓ కిలోమీటరు మార్చింగ్తో వందేమాతరం గీతాలాపనను ప్రవేశపెట్టారు. రాజస్థాన్లో పశువులను అక్రమంగా తరలించారన్న అనుమానంపైన సాగిర్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని ఇటీవల ఓ హిందూత్వ మూక అన్యాయంగా కొట్టి చంపేస్తే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ మౌనం పాటించింది. గతంలోనయితే కాంగ్రెస్ నాయకులు బాధితుడి ఇంటికెళ్లి పరామర్శించేవారు, నిరసన యాత్ర జరిపేవారు. హిందూ అగ్రవర్ణాలను ఆకట్టుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ తన సిద్దాంతాలకు తిలోదకాలిస్తోందని అర్థం అవుతోంది. కానీ ద్వంద్వ ప్రమాణాల వల్ల కొత్త వర్గాల మద్దతు లభిస్తుందో, లేదో చెప్పలేంగానీ ఉన్న వర్గాల మద్దతు ఊడిపోయే ప్రమాదం ఉంటుందన్నది మరచిపోరాదు. -
మీ అమ్మలా కావద్దు!
బిందు తెలుసుకదా. జనవరి 1న శబరిమల అయ్యప్పను దర్శించుకుని వచ్చిన ఇద్దరు మహిళల్లో ఒకరు. (ఇంకొకరు కనకదుర్గ). దళిత్ యాక్టివిస్ట్. నిజానికి ఆమె అక్టోబర్ నెలలోనే శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. కాని నిరసనకారులు అడ్డుకోవడంతో వెనక్కి తిరిగారు. ఆ నిరసన ఆమెకు దైవర్శనం కానివ్వకుండా అడ్డుకోవడం వరకే ఆగలేదు. బిందు ఇంటిదాకా, ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవరకూ వెంటాడింది. తొలిసారి దర్శనానికి వెళ్లి విఫలమై వచ్చినప్పటి నుంచే బిందు సంప్రదాయవాదుల వేధింపులను ఎదుర్కొంటూ ఉన్నారు. బిందు కుటుంబం కోళికోడ్లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఆ ఇంటి యజమాని ముందస్తు సమాచారం, తగిన సమయం ఇవ్వకుండా అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయించారు. చేసేదిలేక ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకుంటుంటే అక్కడా వేధింపులు తప్పలేదు. అక్కడినుంచీ ఆమె వెళ్లిపోయేలా చేశారు. బిందుకు పదకొండేళ్ల కూతురు ఉంది. ఆ అమ్మాయి ప్రస్తుతం అగాలీ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుతోంది. వచ్చే యేడాది కోసం కూతురిని విద్యావనమ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేర్పించాలనుకున్నారు బిందు. దాని తాలూకు ఇంటర్వ్యూ, పేరెంట్స్ మీటింగ్నూ పూర్తి చేశారు. అమ్మాయికి అడ్మిషన్ ఇస్తున్నాం అని కూడా స్కూల్ యాజమాన్యం కూడా చెప్పింది. మొన్న సోమవారం.. అంటే జనవరి ఎనిమిదో తారీఖున అడ్మిషన్కు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తిచేసుకోవాల్సి ఉంది. బిందు స్కూల్కి వెళ్లారు.‘‘నా కూతురితో స్కూల్లోకి అడుగుపెట్టాను. అక్కడ దాదాపు అరవై మంది గుమిగూడి ఉన్నారు. వాళ్లంతా స్థానికులు, మగ వాళ్లు. మమ్మల్ని ఏమీ అనలేదు. ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తుంటే కూడా ఏమీ అడ్డుకోలేదు. తీరా లోపలికి వెళ్లాక చూస్తే.. ప్రిన్సిపలే వింతగా ప్రవర్తించారు. ‘‘నేను మీలాగా యాక్టివిస్ట్ని కాను. కాని ఎడ్యుకేషనల్ యాక్టివిస్ట్ని’’ అంటూ సందర్భంలేకుండా మాట్లాడారు. నేను వెళ్లింది మా అమ్మాయి అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం కోసం. ఆ ఊసెత్తకుండా ప్రిన్సిపల్ ఏవేవో మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. చివరకు ‘‘మీ అమ్మాయికి అడ్మిషన్ ఇచ్చి ఈ స్కూల్ వాతావరణాన్ని పాడు చేయదలచుకోలేదు మేము’’ అంటూ అసలు సంగతి చెప్పారు. గది నుంచి స్కూల్ ఆవరణలోకి వస్తుంటే ఓ టీచర్ చెప్పారు అక్కడున్న అరవై మంది మగవాళ్లను చూపిస్తూ ‘‘మీ అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వద్దని వీళ్లంతా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు’’ అని. పాత స్కూల్లో కూడా టీచర్స్ మా అమ్మాయితో ‘‘నువ్వు మీ అమ్మలా కావద్దు’’అంటున్నారట. మా అమ్మాయి క్లాస్లోని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయితో మాట్లాడొద్దని, డిస్టెన్స్ మెయిన్టైన్ చేయమని వాళ్ల పిల్లలకు చెప్తున్నారట. ఈ అవమానంతో మా అమ్మాయి ఇప్పుడా స్కూల్కి వెళ్లడానికే ఇష్టపడట్లేదు’’ అని చెప్పారు బిందు. -
‘శబరిమల ఆలయంలోకి 8 మంది మహిళలు’
తిరువనంతపురం: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటివరకు 8 మంది మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్నవారు) శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని కేరళ పోలీసులు వెల్లడించారు. అయితే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన విషయం మాత్రమే అందరికి తెలిసింది. 42 ఏళ్ల బిందు అమ్మిని, 41 ఏళ్ల కనకదుర్గ.. బుధవారం (రెండో తారీఖు) తెల్లవారుజామున అయ్యప్పను దర్శించుకోవడం పెను వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై కేరళలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. (ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు) సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న పోలీసుల వాదనను శబరిమల కర్మ సమితి తోసిపుచ్చింది. ఎక్కువ మంది మహిళలు శబరిమలకు తరలిరావాలన్న కుట్రలో భాగంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు శ్రీలంక మహిళ శశికళ చేసిన ప్రయత్నాన్ని ప్రహసనంగా వర్ణించింది. ఎందుకు శుద్ధి చేశారు? ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన ప్రధాన పూజారి రాజీవరు కందరావ్ను ట్రావెన్కోర్ దేవస్థానం పాలకమండలి వివరణ కోరింది. బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆయనను పాలక మండలి వివరణ అడిగింది. (వారు చివరి మెట్టును చేరగలిగారు) -
ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు
కన్నూర్: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న అలజడి ఇంకా చల్లారలేదు. ఆందోళనలు, దాడులతో కేరళ అట్టుడుకుతోంది. కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తలాసరీ ప్రాంత ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు ఏఎన్ షమీర్, బీజేపీ ఎంపీ వి మురళీధరన్ నివాసాలతో పాటు పలుచోట్ల శుక్రవారం రాత్రి బాంబు దాడులు జరిగాయి. షమీర్ ఇంటిపైకి దుండగులు నాటు బాంబులు విసిరారు. ఇరిట్టి ప్రాంతంలో సీపీఎం కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యాడు. రాష్ట్రంలో దాడులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కుట్రలు చేస్తోందని షమీర్ ఆరోపించారు. కల్లోల పరిస్ధితులను సృష్టించి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తన ఇంటిపై దాడి వెనుక సీపీఎం హస్తం ఉందని మురళీధరన్ ఆరోపించారు. ఆందోళనకారుల దాడుల్లో 99 ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది. ధ్వంసమైన బస్సులతో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కన్నూరు జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని భద్రతా బలగాలను తరలించారు. హింసాత్మక ఘటనలు కొనసాగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాని మోదీ ర్యాలీ వాయిదా కేరళలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ‘జనవరి 6న పతాన్మత్తిట్టాలో జరగాల్సిన ప్రధాని మోదీ పర్యటన ఇతర కార్యక్రమాల కారణంగా వాయిదా పడింది. కేరళలో ప్రస్తుత పరిస్థితులకు, ప్రధాని పర్యటన వాయిదా పడటానికి సంబంధం లేద’ని బీజేపీ ప్రకటించింది. ఈ ఏడాది దక్షిణాదిలో ప్రధాని మోదీ పాల్గొనబోయే మొదటి రాజకీయ ర్యాలీ ఇదే. -
సన్నిధానంలో శ్రీలంక మహిళ
శబరిమల: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. దేవస్థానం బోర్డు సభ్యుడి ఇంటితో పాటు మరికొన్నిచోట్ల ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరి అలజడి సృష్టించారు. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామిని శ్రీలంకకు చెందిన శశికళ(47) అనే మహిళ దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి శశికళ గుడిలోకి చేరుకుని పూజలు నిర్వహించినట్లు కేరళ సీఎం కార్యాలయం తెలిపింది. భర్త శరవణ్, కుమారుడు దర్శన్తో కలిసి ఆమె ఆలయానికి వచ్చారని వెల్లడించింది. మరోవైపు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారన్న వాదనల్ని శశికళ ఖండించారు. తాను స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు యత్నించినప్పటికీ పోలీసులు అనుమతించలేదని అన్నారు. ఆలయానికి రాకముందు తాను 41 రోజుల వ్రతం పాటించానని వెల్లడించారు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు భక్తుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదురుకాలేదని పేర్కొన్నారు. ‘పోలీస్ అధికారులు నన్ను ఎందుకు అనుమతించలేదు? మీరంతా(మీడియా) నా చుట్టూ ఎందుకు నిలబడ్డారు? నేను ఎవరికీ భయపడను’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కుమారుడితో కలిసి తాను మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకున్నానని శశికళ భర్త శరవణ్ స్పష్టం చేశారు. మరోవైపు భద్రతా కారణాలతోనే శశికళ అలా చెప్పి ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. అయ్యప్పస్వామి దర్శనానికి శుక్రవారం శబరిమల వచ్చిన కయాల్ అనే ట్రాన్స్జెండర్ను భక్తుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు వెనక్కి పంపారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి నిరసనగా కొందరు దుండగులు శుక్రవారం తెల్లవారుజామున మలబార్ దేవస్థానం బోర్డు సభ్యులు కె.శశికుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి పరారయ్యారు. అలాగే పతనంతిట్ట ప్రాంతంలోని ఓ మొబైల్ షాపుపై పెట్రోల్బాంబు దాడి జరిగింది. 200 మంది అరెస్ట్! సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య హింస తీవ్రంగా చెలరేగుతున్న కన్నూర్లో 200 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లు, గొడవల నేపథ్యంలో 801 కేసులు నమోదుచేసిన పోలీసులు.. 1,369 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పాలక్కడ్తో పాటు కసర్గోడ్ జిల్లా మంజేశ్వరమ్లో నిషేధాజ్ఞలు విధించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు
-
శబరిమల ఆలయంలోకి మహిళలు
-
మహిళల ప్రవేశం.. ఆలయం మూసివేత
తిరువనంతపురం : శబరిమల ఆలయ ప్రవేశంపై మహిళల పంతం నెగ్గింది. 50ఏళ్ల కన్న తక్కువ వయసు ఉన్న ఇద్దరు మహిళలు బుధవారం శబరిమల ఆలయ ప్రవేశం చేశారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. బుధవారం తెల్లవారు జామున3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు హహిళలు అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.(అన్ని వయసుల వారికి అనుమతి) పోలీసుల సంరక్షణలో బిందు, కనకదుర్గ నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ బయటకు వచ్చి కేరింతలు కొడుతూ అయప్ప స్వామిని దర్శించుకున్నామని ఆనందంగా చెప్పారు. వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళలుగా(50ఏళ్లలోపు) వీరు చరిత్రకెక్కారు. ఆలయ మూసివేత ఇద్దరు మహిళా భక్తులు శబరిమల ఆలయంలోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని ఆలయాన్ని మూసివేశారు. శుద్ది చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని ప్రధాన పూజారి చెప్పారు. భక్తుల కళ్లు కప్పి మహిళలు ఆలయంలోకి ప్రవేశించారన్నారు. పోలీసుల సహకారంతో అయప్ప స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. మహిళల ప్రవేశాన్ని అయప్ప భక్తులు, సాంప్రదాయవాదులు తప్పుబట్టారు. అలయంలో అపచారం జరిగిందని గుడిని మూసివేశారు. సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని చెబుతున్నారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12.40గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. 12.40గంటల తర్వాత ప్రత్యేక పూజలు చేసి, ఒంటి గంటకు భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. మరో వైపు మహిళల ప్రవేశం నిజమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేయడంతో సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబరు 28ను సుప్పీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుతో కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు. ఇటీవల కొంత మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత కల్పించినప్పటికీ భక్తులు మహిళలను ఆలయంలోకి వెళ్లనివ్వలేదు. అయితే ఈ సారి ఎలాంటి ఘర్షనలు లేకుండా నిశ్శబ్దంగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.(శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు) -
తెరుచుకున్న శబరిమల దేవాలయం
శబరిమల: భారీ భద్రత నడుమ మకర సంక్రాంతి(మకరవిలక్కు) వేడుకల కోసం శబరిమల అయ్యప్ప దేవాలయం ఆదివారం తెరుచుకుంది. ప్రధాన పూజారి వీఎన్ వాసుదేవన్ నంబూద్రి ఆలయ తలుపులు తెరిచి పూజలు చేశా రు. తొలి రోజే భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మకర సంక్రాంతి జనవరి 15న జరుగుతుంది. ఆలయాన్ని తిరిగి జనవరి 21న మూసివేస్తారు. 41 రోజుల పాటు జరిగిన మండల పూజ అనంతరం 27న ఆలయాన్ని మూసివేశారు. అన్ని వయసుల మహిళల్ని ఆలయంలోనికి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం భద్రతను పటిష్టం చేసింది. -
అయ్యప్పకు ముస్లిం–క్రైస్తవ స్నేహితులు
తిరువనంతపురం: కఠినమైన అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, చర్చి కొలనులో స్నానాలు చేయడాన్ని ఎవరైనా విశ్వసిస్తారా? ఇది మత సామరస్యానికి సంబంధించిన కల్పిత కథ అనుకుంటే పొరబడినట్లే. శబరిమల అయ్యప్పస్వామి కొలువైన కేరళలో చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మండాలం–మకరవిలక్కు యాత్రకు వచ్చే స్వాములు శబరిమలకు 60 కిలోమీటర్ల దూరంలో కొట్టాయం జిల్లాలో ఉన్న ఎరుమేలి నాయనార్ జుమా మసీదు(వావర్పల్లి మసీదు) చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తిరుగు ప్రయాణంలో ఆ పక్కనే అలప్పుజలో ఉన్న ఆర్థంకల్ సెయింట్ అండ్రూస్ బాసిలికా చర్చి ఆవరణలోని చెరువులో స్నానాలాచరిస్తారు. నవంబర్–జనవరి నెలల మధ్య ఎన్నో ఏళ్లుగా ఇదొక ఆనవాయితీగా కొనసాగుతోంది. దీని వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నమాజ్.. ప్రదక్షిణలు పండాలం రాజు దత్తపుత్రుడైన స్వామి అయ్యప్పకు హజ్రత్ వావర్ షా అనే ముస్లిం, ఆర్థంకల్ వెలుథచన్ అనే క్రైస్తవ బోధకులు మంచి స్నేహితులుగా ఉండేవారని ఇక్కడి వారు చెప్పుకుంటుంటారు. వారి మధ్య స్నేహానికి, మత సామరస్యానికి గుర్తుగా అయ్యప్ప దీక్షాపరులు వావర్ పేరుతో ఉన్న మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కేరళతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా స్వాములు వస్తుంటారని వావర్ మసీదు జాయింట్ సెక్రటరీ హకీం తెలిపారు. ‘స్వాములు మసీదు ప్రార్థన మందిరం లోపలికి మాత్రం ప్రవేశించరు. మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేసి, టెంకాయ కొట్టి, కానుకలు సమర్పించి శబరిమల సందర్శనకు బయల్దేరుతారు. మసీదు లోపల నమాజ్ జరుగుతుండగా వెలుపల అయ్యప్ప భక్తులు శరణం అయ్యప్ప అంటూ ప్రదక్షిణలు చేయడం ఓ అరుదైన దృశ్యం. అయ్యç ప్ప, వావర్ల మధ్య స్నేహగాథ కేరళలో మత సామరస్యం, లౌకికత ఎంతగా ఉందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’ అని హకీం అన్నారు. ఈ మసీదు వద్దే వావర్ స్వామి అనే ఆలయం కూడా ఉంది. యాత్ర ముగించుకున్న భక్తులు అర్థంకల్ బాసిలికా చర్చి వద్దకు చేరుకుంటారు. ‘చర్చి ఆవరణలోని చెరువులో లేక సమీపంలోనే ఉన్న సముద్రంలో స్నానాలు చేసి, స్వాములు దీక్షను విరమిస్తారు. చర్చిలోని సెయింట్ సెబాస్టియన్ విగ్రహం వద్ద పూజలు చేస్తారు’ అని ఫాదర్ క్రిస్టోఫర్ ఎం.అర్థస్సెరిల్ తెలిపారు. -
ఇక వారిని ‘అయ్యప్పే ఆదుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘అప్పుడు నాకు పాతికేళ్లు. యవ్వనంతో దృఢంగా ఉన్నా. సైన్యంలో చేరేందుకు కసరత్తు చేసి బలంగా తయారయ్యాను. అయినప్పటికీ సైన్యం శారీర దారుఢ్య పరీక్షలో పాస్కాలేక పోయాను. కొల్లాం జిల్లా పునలూరులోని మా గ్రామానికి వచ్చి పడ్డాను. ఇక చాలు, వచ్చి నా ఉద్యోగంలో చేరంటూ నా తండ్రి ఆదేశించాడు. చేసేదేమీలేక పుణ్యమూ, పురుషార్థమూ రెండూ దక్కుతాయనుకొని వచ్చి ఈ వృత్తిలో చేరాను. ఇప్పుడు నాకు 53 ఏళ్లు. దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కొండలెక్కేటప్పుడు భరించలేని ఒళ్లు నొప్పులు వస్తాయి. పంటి బిగువున నొప్పిని భరిస్తాను. అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. విశ్రాంత వేళలో కూడా కీళ్ల నొప్పులు, వెన్నుముక నొప్పి వేధిస్తాయి. ప్రతి రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకొనిదే నిద్రరాదు’ శబరిమల ఆలయం వద్ద డోలి సర్వీసులో పనిచేసే సత్యన్ తెలిపారు. ఇక్కడ డోలి అంటే రెండు కర్రల మధ్య ఓ వెదురు కుర్చీని బిగిస్తారు. ఆ వెదురు కుర్చీలో భక్తులను కూర్చో బెట్టుకొని నలుగురు కూలీలు తీసుకెళ్లడమే డోలీ సర్వీసు. దానిలో భక్తులను పంబా నది నుంచి నాలుగు కి లోమీటర్ల దూరంలోని సన్నిధానం అయ్యప్ప ఆలయానికి తీసుకెళతారు. సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో సన్నిధానం ఉంది. అక్కడికి భక్తులు చెప్పులకు పాదరక్షలు లేకుండా అడ్డదిడ్డంగా ఉండే అటవి బాటలో వెళ్లాల్సి ఉండేది. శారీరకంగా బలహీనంగా ఉండే భక్తులకు అలా వెళ్లడం కష్టం కనుక 1966లో కేవలం పది డోలీలతో ఈ సర్సీసు ప్రారంభమైంది. అప్పటి ‘ట్రావన్కోర్ దేవసం బోర్డు’ చైర్మన్ ప్రక్కులం భాసి ఈ డోలి సర్వీసును ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డు ఆధ్వర్యంలోనే ఈ డోలి సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 500 డోలీలు ఉండగా, వాటిని లాగేందుకు 2000 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి డోలీ సర్వీసు కింద 4,200 రూపాయలను వసూలు చేస్తారు. అందులో 200 రూపాయలు దేవసం బోర్డుకు వెళుతుంది. నాలుగు వేల రూపాయలను నలుగురు కూలీలు సమంగా పంచుకోవాలి. సీజన్లో ఒక్కో కూలీకి 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సీజనంటే ప్రస్తుతం నడుస్తున్న మండల సీజన్. ఈ సీజన్లో 41 రోజులు అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. ఇది మలయాళం క్యాలండర్ ప్రకారం వృశ్చిక మాసంలో వస్తుంది. ఆ తర్వాత మకరవిలక్కసు సీజన్ వస్తుంది. అదో 20 రోజులు, రెండు సీజన్లు కలిసి 61 రోజులు ఆలయం తెరచి ఉంటుంది. ఈ సీజన్లోనే డోలీ కూలీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం ఏడాదిలో 126 రోజులు మాత్రమే అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. డోలీ కూలీలు బస్టాండుకు వెళ్లి భక్తులను అక్కడే ఎక్కించుకొని పంబా నది తీరానికి రావాలి. నదిలో స్నానమాచరించాక మళ్లీ వారిని ఎక్కించుకొని కొండపైన అయ్యప్ప ఆలయానికి తీసుకెళ్లాలి. ఆ భక్తులే అదే రోజు వెనక్కి వస్తానంటే తీసుకరావాలి. మరుసటి రోజు వస్తానంటే మరుసటి రోజే తీసుకరావాల్సి ఉంటుంది. వారు భక్తులను రెండు గంటల్లో కొండపైకి తీసుకెళతారు. మార్గమధ్యంలో పది నిమిషాల చొప్పున మూడుసార్లు ఆగుతారు. వారికి గతంలో పంబా నది తీరాన విశ్రాంతి మందిరం ఉండేది. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదల్లో అది కాస్త కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆరు బయటే వారి విశ్రాంతి. కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన డోలీ కూలీలు సీజనంతా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వారు దేవసం బోర్డు పరిధిలో కాంట్రాక్టు కూలీలుగా పనిచేస్తున్నందున వారికి సెలవులు లేవు. రోగమొస్తే, నొప్పొస్తే ఉచిత వైద్య సౌకర్యం లేదు. మంచాన పడినా పింఛను సౌకర్యం లేదు. ఒకప్పుడు ముళ్ల పొదలు, కొనదేలి కోసుకుపోయే రాళ్ల మీది నుంచి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు సిమ్మెంట్ రోడ్డు మీద వెళుతున్నారు. భక్తులులాగే వీరు కూడా పాద రక్షలు లేకుండానే వెళ్లాలి. రావాలి. వృత్తి కారణంగా వారికి కీళ్ల నొప్పులే కాకుండా ‘డిస్క్ పొలాప్స్’ లాంటి వెన్నుముఖ జబ్బులు కూడా వస్తున్నాయి. 53 ఏళ్లు వచ్చినా మన సత్యన్ ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు కనిస్తున్నాడుకానీ చాలా మంది కూలీలు 50 ఏళ్లకే చనిపోతారట. ఇప్పుడు వారికి నిరుద్యోగం భయం పట్టుకుంది. యాత్రికుల తాకిడి ఎక్కువవడం, వారి నుంచి టీడీబీకి వస్తున్న ఆదాయం కూడా పెరగడంతో భక్తుల సౌకర్యార్థం పంబా నది నుంచి సన్నిధానం వరకు ‘రోప్ వే’ను ప్రవేశ పెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో డోలీ సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పుడు తాము రోడ్డున పడతామని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ పాలక, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక తమకు అయ్యప్పే దిక్కని, ఆయన ఎలా కాపాడుతారో చూడాలి అని వారు మొరపెట్టుకుంటున్నారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై రాష్ట్ర అసెంబ్లీలో కుమ్ముకుంటున్న పాలక, ప్రతిపక్షాలకు వీరి గురించి పట్టించుకునే తీరికెక్కడిది! సోమవారం కూడా కేరళ అసెంబ్లీ స్తంభించిపోయింది. -
‘వారికి గాడిదలకున్న దయ కూడా లేదు’
శబరిమల : గాడిదలు బరువులు మోస్తూ బండ చాకిరీ చేస్తాయి కానీ వారిలా(పూజారుల్లా) నిరసన తెలపవంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేరళ పీడబ్ల్యూడీ మంత్రి జీ సుధాకరన్. గత కొద్ది కాలంగా శబరిమల ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఆందోళనల గురించి తెలిసిందే. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈనేపథ్యంలో కేరళ ప్రభుత్వం, సుప్రీం తీర్పును అమలు చేయడానికి ప్రయత్నించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైట్ వింగ్ కార్యకర్తల చేస్తోన్న ఆందోళనలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆలయ పూజారులు వారం రోజుల పాటు విధులు బహిష్కరించి.. నిరసన తెలుపుతున్నారు. దాంతో పూజారులను విమర్శించే ఉద్దేశంతో సుధాకరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాడిదలు బరువులను మోస్తూ.. పంబా నది తీరంలో విశ్రాంతి తీసుకుంటాయి. అవి చాలా కష్టపడతాయి కానీ ఆందోళన చేయవు. కానీ శబరిమల పూజారులకు గాడిదలకున్న దయ కూడా లేదు. అందుకే వారు ఆలయాన్ని మూసి వేసి భక్తులకు ఇబ్బంది కల్గిస్తున్నారంటూ విమర్శించారు. -
‘అయ్యప్ప’కు పొంచి ఉన్న పెను వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి మరో పెను వివాదం పొంచి ఉంది. ఆ వివాదానికి కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులే కారణం అవుతాయనడంలో సందేహం లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రస్తుతం వివాదం రగులుతున్న విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగానే సుప్రీం కోర్టు అయ్యప్ప ఆలయానికి సంబంధించి జారీ చేసిన మరో ఉత్తర్వులు మరుగున పడిపోయాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని జస్టిస్ మదన్ బీ లోకుర్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ నవంబర్ 2వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. మొదటి వివాదం భక్తుల నమ్మకానికి సంబంధించినది కాగా, పొంచి ఉన్న వివాదం పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది. ఒకప్పుడు సన్నిదానంలో శబరిమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడు దాని చుట్టూ 63.5 ఎకరాల పరిధిలో చెట్లుపోయి కాంక్రీటు జంగిల్ ఆవిర్భవించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటే ఈ కాంక్రీటు జంగిల్లో 90 శాతం కట్టడాలను కూల్చాల్సిందే. శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణ పరిస్థితులను పరిరక్షించాలంటూ కోజికోడ్కు చెందిన సామాజిక కార్యకర్త శోభీంద్రన్ నాలుగేళ్ల క్రితం సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దాంతో శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే అక్రమ కట్టడాలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఓ కేంద్ర కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. అటవి ప్రాంతాల్లో గనులు, పరిశ్రమలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించే కమిటీయే ఇది. ఈ కమిటీ ఇటీవలనే సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో అనేక భయానక వాస్తవాలు బయట పడ్డాయి. శబరిమల ఆలయం భక్తుల నుంచి వస్తున్న భారీ ఆదాయానికి ఆశపడి 1998లో కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఆలయం మాస్టర్ ప్లాన్నే కాకుండా ఆ తర్వాత 2007లో తీసుకొచ్చిన సవరణ ప్లాన్ను కూడా ఉల్లంఘించి కేరళ దేవసం బోర్డు పలు అక్రమాలను నిర్మించిన విషయాన్ని కమిటీ నివేదిక వెల్లడించింది. శబరిమల ఆలయ పరిసర కొండల్లో పుడుతున్న పంబా నదీ ప్రవాహాన్ని దెబ్బతీసేలా నది ఒడ్డునే కాకుండా నది ప్రవహించే ప్రదేశంలో కూడా అక్రమ కట్టడాలు నిర్మించారట. అందుకనే గత ఆగస్టులో వచ్చిన పంబా వరదల వల్ల రెండంతస్థుల మురుగుదొడ్ల భవనాలు, భక్తుల క్లాక్రూమ్లు, ఓ రెస్టారెంట్ కూలిపోయాయని నివేదిక తెలిపింది. ఆ మరుగుదొడ్ల స్థానంలో మరోచోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదు. పర్యవసానంగా భక్తులు భహిర్భూమిని ఆశ్రయిస్తున్నారట. పంబా నది కాలుష్యం కాకుండా నియంత్రించేందుకు రెండు సివరేజ్ ప్లాంట్లను నిర్మించినా అందులో ఒకదాన్నే ఆపరేట్ చేస్తున్నారు. దానికి కూడా అన్ని మరుగు దొడ్ల కాల్వలను అనుసంధానించలేదు. కొన్ని కాల్వలు నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పైగా ఆగస్టులో వచ్చిన వరదల్లో ఈ రెండు సీవరేజ్ ప్లాంట్లు, మరుగుదొడ్డి కాల్వలు దెబ్బతిన్నాయి. ఆ కాల్వలు కూడా ఒవర్ ఫ్లోఅయి నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పర్యవసానంగా నీటిలో ‘ఫేకాల్ కోలిఫామ్ బ్యాక్టీరియా’ కనీసం ఊహకు కూడా అందనంతగా పెరిగిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్నానం చేయడానికి పనికి వచ్చే నీటిలో ‘ప్రతి 100 ఎంఎల్ నీటికి 2,500 ఎంపీఎన్’ కన్నా ఈ బ్యాక్టీరియా తక్కువ ఉండాలట. 2014–2015లో సేకరించిన శాంపిల్ నీటిలోనే ‘100 ఎంల్ నీటికి బ్యాక్టీరియా 13,20,000 ఎంపీఎన్’ ఉందట. అంటే ఉండాల్సిన దానికన్నా 500 రెట్లు ఎక్కువ. సీవరేజ్ ప్లాంటులు, మురుగు కాల్వలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లోబ్యాక్టీరియా మరింత ప్రమాదకరంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అడవి పందులు వచ్చి నీటిని తాగుతున్నాయంటేనే అందులో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని అర్థం అట. అయ్యప్ప ఆలయంకు వచ్చే భక్తులు విధిగా ఈ పంబా నదిలో స్నానం ఆచరిస్తారు. అంతేకాకుండా పట్టణం మిట్ట, అలప్పూజ, కొట్టాయం జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. నవంబర్ 17వ తేదీన ప్రారంభమైన ‘మండల మకరవిలక్కు’ సీజన్లో భక్తుల రద్దీ మరింత పెరగడం వల్ల పంబా నదికి వాటిల్లే కాలుష్యాన్ని అంచనా కూడా వేయలేకపోతున్నామని పంబా పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి నక్కే సుకుమారన్ నాయర్ లాంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా నది ఒడ్డుకు 50 మీటర్ల దూరంలోనే కేరళ దేవసం బోర్డు పనుల నిర్వహణా భవనాన్ని కూడా నిర్మించారని ఆయన తెలిపారు. నీలక్కల్ వద్ద భక్తుల సౌకర్యాల కోసం 2007లో సవరించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 250 ఎకరాలను కేరళ ప్రభుత్వం కేటాయించినా పట్టించుకోకుండా సన్నిధానంలోనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నాయర్ ఆరోపించారు. గత నెలలోనే సన్నిదానంలో 52 గదుల అతిథి గృహాన్ని కేరళ దేవసం మంత్రి కే. సురేంద్రన్ ప్రారంభించారు. సన్నిదానం, పంబా ప్రాంతాల్లోనే కాకుండా నీలక్కల్ వద్ద కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కేంద్ర కమిటీ పేర్కొంది. వాటన్నింటిని కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం తన కర్తవ్యమని అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్న కేరళ ప్రభుత్వం కూల్చివేతల విషయంలో కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉంటుందా? కూల్చివేతల వల్ల భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటుంది? భక్తులుగానీ, భక్తుల తరఫున హిందూ సంఘాలుగానీ కూల్చివేతలను అనుమతిస్తాయా? -
అర్ధరాత్రి అరెస్టులు
శబరిమల/కోజికోడ్: శబరిమలలో ఆదివారం అర్ధరాత్రి కలకలం. పోలీసులు 69 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీం తో బీజేపీ, ఆరెస్సెస్ సోమవారం కేరళ వ్యాప్తం గా ఆందోళనలు నిర్వహించాయి. అయితే వారంతా శబరిమలలో అలజడి సృష్టించేందుకు వచ్చారన్న సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నామనీ, నిజమైన భక్తులను ఇబ్బంది పెట్టలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో అయ్యప్ప భక్తులెవరూ లేరనీ, వారంతా శబరిమలలో నిరసనలకు దిగి పరిస్థితిని దిగజార్చేందుకు వచ్చినవారేనని సీఎం పినరయి విజయన్ చెప్పారు. కోజికోడ్లో సీఎం మాట్లాడుతూ ‘వారెవరూ అయ్యప్ప భక్తులు కారు. అంతా ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలే. సమస్యలు సృష్టించేందుకే సన్నిధానం వద్దకు చేరుకున్నారు’ అని చెప్పారు. ఆలయం మూసివేశాక రాత్రి 11 గంటల తర్వాత కూడా వారంతా గుంపుగా చేరి అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూ నిరసనలకు దిగడంతోనే పరిస్థితి మరింత దిగజారకుండా ముందస్తుగా 69 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నెయ్యాభిషేకం చేయించడం కోసం వచ్చి, రాత్రి అక్కడే ఉన్న భక్తులను తాము ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. అయితే బీజేపీ పోలీసుల చర్యను ఖండించింది. కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కణ్నాంథనమ్ సోమవారం నిలక్కళ్, పంబ, సన్నిధానం వద్ద పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని యుద్ధక్షేత్రంగా మార్చింది. భక్తులేమీ తీవ్రవాదులు కారు. యాత్రికులను బందిపోటు దొంగల్లా ఈ ప్రభుత్వం చూస్తోంది’ అని పేర్కొన్నారు. మరోవైపు శబరిమలలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అధికారంతో పోలీసులు భక్తులను అదుపులోకి తీసుకొని సన్నిధానం నుంచి పంపించేశారని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సీఎం ఇంటి ముందు ధర్నా అరెస్ట్లకు నిరసనగా ఆరెస్సెస్, బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంస్థ యువ మోర్చాల కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఇద్దరు కార్యకర్తలు కోజికోడ్లో సీఎం కాన్వాయ్కు అడ్డు తగిలారు. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని తిరువనంతపురంలో కొందరు కార్యకర్తలు సచివాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టగా, మరికొందరు సీఎం అధికారిక నివాసం ముందు ధర్నాకు దిగారు. సుప్రీంకోర్టులో టీడీబీ పిటిషన్ అన్ని వయసుల మహిళలనూ శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పును అమలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ గుడి నిర్వహణను చూసుకునే ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు (టీడీబీ) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆగస్టులో సంభవించిన భారీ వరదల కారణంగా ఇప్పటికే ఆలయ పరసరాల్లో వసతులు దెబ్బతిన్నాయనీ, సరైన సౌకర్యాలు లేనందున ఇప్పుడు యాత్రకు వస్తే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని టీడీబీ పిటిషన్లో పేర్కొంది. రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకూడదన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న ఎత్తివేయడం తెలిసిందే. -
అర్థరాత్రి శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత
-
శబరిమలకు పోటెత్తిన భక్తులు
పంబ/సన్నిధానమ్: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయా నికి శనివారం భక్తులు పోటెత్తా రు. పలువురు నేతలు శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపుని చ్చినప్పటికీ భక్తుల సంఖ్య తగ్గలేదు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య శుక్రవారం ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. నిషేధిత సమయంలో ఆలయ పరిసరాల్లో ఉన్నారనే కారణంతో ‘ఐక్యవేది’ రాష్ట్ర అధ్యక్షురాలు కేపీ శశికళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలియగానే ఐక్యవేది నేతలు 12 గంటల బంద్కు పిలుపునిచ్చారు. చెదురుమదురు ఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, అన్ని వయస్సుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చన్న తీర్పుపై గడువు కోరేందుకు సోమవారం (19న) సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్ తెలిపారు. -
ఆలయం వద్ద హైడ్రామా
శబరిమల: శబరిమల అయ్యప్ప ఆలయంలో శ్రీ చిత్ర పెరుమాళ్ పూజ సందర్భంగా మంగళవారం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పూజ చేసేందుకు వచ్చిన మహిళను కొందరు భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు అడ్డుకోగా తోపులాట చోటుచేసుకుంది. నిరసనలను చిత్రీకరిస్తున్న మలయాళ టీవీ న్యూస్ చానల్ కెమెరామన్పై దాడి జరిగింది. పూజ కోసం సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు, తిరిగి మంగళ వారం ఉదయం 5 నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించిన అధికారులు అనంతరం ఆలయాన్ని మూసివేశారు. పూజ సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో గత నెలలో ఆలయం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. కాగా, మండల పూజల కోసం ఈనెల 17వ తేదీ నుంచి రెండు నెలలపాటు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు. కొనసాగిన నిరసనలు.. త్రిసూర్కు చెందిన లలితా రవి(52) రాగా సన్నిధానం వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు. పోలీసులు ఆమెను ఆలయంలోకి తీసుకెళ్లి, పూజలు చేయించారు. నిరసనలను చిత్రీకరిస్తున్న టీవీ చానల్ కెమెరామన్పై కొందరు దాడి చేశారు. పంబ వద్దకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు 50 ఏళ్లలోపు మహిళలు నిరసనల కారణంగా వెనుదిరిగారు. ఆంధ్రప్రదేశ్కే చెందిన 50 ఏళ్లు పైబడిన మరో మహిళా బృందం ఇరుముడి లేకుండా నడప్పనండాల్ వద్దకు రాగా పోలీసు భద్రత కల్పించి, దర్శనం చేయించారు. ఇరుముడి లేకుండానే ఆర్ఎస్ఎస్ నేత వల్సన్ తిల్లంకేరి ‘పతినెట్టం పడి’ మెట్లపైకి వచ్చారంటూ టీవీ చానళ్లు ప్రసారం చేసిన దృశ్యాలు కలకలం రేపాయి. -
అయ్యప్ప వివాదం: ‘మెట్టు’ దిగని కేరళ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం దిగిరావడం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను విధిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆ ఉత్తర్వుల అమలుకే ప్రాధాన్యం ఇస్తామని పినరయి విజయన్ స్వయంగా ప్రకటించారు. ఆయన ఈ విషయమై పలు ప్రాంతాల్లో సభలు.. సమావేశాలు నిర్వహించి ప్రజలకు నచ్చజెప్పేందుకు తీవ్రంగా కషి చేస్తున్నారు. ఎల్డీఎఫ్ ఆధ్వర్యాన తిరువనంతపురం, కొల్లాం, పట్టణంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, పలక్కాడ్ నగరాల్లో నిర్వహించిన సభలో పినరయి విజయన్ ప్రసంగించారు. ముందుగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ, ఆరెస్సెస్ సంఘాలు ఆ తర్వాత ఓట్ల రాజకీయాల కోసం ఆందోళన సాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన హెచ్చరికపై ఆయన ఘాటుగా స్పందించారు. కేరళ విషయంలో ఆయన పన్నాగాలు సాగవని చెప్పారు. మత కలహాలను సృష్టించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మూడువేల మంది భక్తులను అరెస్ట్ చేయడంపై అమిత్ షా స్పందిస్తూ కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని హెచ్చరించిన విషయం తెల్సిందే. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కూడా ప్రభుత్వం తరఫున గట్టిగా నిలబడి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆరెస్సెస్ శబరిమల కర్మ సమితి పేరిట దాదాపు 50 హిందూ సంఘాలను కూడగట్టి సుప్రీం ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది. ఆరెస్సెస్ వెన్నంటే బీజేపీ నడుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు ప్రభుత్వం పక్షంగానీ, అటు బీజేపీ పక్షంగానీ వహించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప భక్తుల సంఘం నిర్వహిస్తున్న ఆందోళనల్లో పాల్గొంటోంది. ఇప్పటికే దళితులు, మైనారిటీల మద్దతున్న సీపీఎం ఆందోళనల్లో పాల్గొనని జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ ఆలయల్లో పూజారులుగా నియమించేందుకు ఏడుగురు ఎస్సీలు సహా 54 మంది బ్రాహ్మణేతరుల జాబితాను ఎల్డీఎఫ్ ఖరారు చేసింది. గతేడాది కూడా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆరుగురు దళితులు సహా 36 మంది బ్రాహ్మణేతరులను నియమించింది. ఈ నియామకాలు కూడా రానున్న ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుస్తాయని ఎల్డీఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం అయ్యప్ప ఆలయం వద్ద ప్రతిష్టంభన కొనసాగుతోంది. -
అయ్యప్పపై మరో తీవ్ర వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ పక్క రాదాంతం జరుగుతుండగా మరో వివాదం రాజుకుంది. ఈ ఆలయం తరతరాలుగా తమదని, తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని, అలా జరగక పోయినట్లయితే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి సాధించి తీరుతామని కేరళకు చెందిన మాల ఆర్యులు డిమాండ్ చేస్తున్నారు. ‘12 శతాబ్దానికి చెందిన శబరిమలలోని అయ్యప్ప ఆలయం మాల ఆర్యులది. పండలం రాజ కుటుంబం 1800లో దీన్ని ఆక్రమించుకున్నారు. ఆలయంలోని పలు దేవతా విగ్రహాలను తొలగించి వాటిని అడవుల్లో విసిరేశారు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. చరిత్రగతిలో అడవుల్లో పడేసిన విగ్రహాలు కరిమల, పొన్నంబాల్మేడు, కొత్తకుతితార, నీలక్కల్, తలపరమల అడవుల్లో దొరికాయి. 1904లో పండలం రాజు ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజమన్ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు ద్రావిడ పద్ధతిలో జరిగిన పూజాది కార్యక్రమాలను మార్చివేసి బ్రాహ్మణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. గతంలో అయ్యప్పకు పూజారులుగా వ్యవహరించిన మాల ఆర్యులు తేనతోనే అభిషేకం చేసేవారు. ఆ స్థానంలో బ్రాహ్మణ పూజారులు పాలతోని అభిషేకం చేయడం ప్రారంభించారు. 1950లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆలయ పాలనా బాధ్యతలను స్వీకరించింది. ‘మాకు ఈ ఆలయాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఆ తర్వాత అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి న్యాయం సాధిస్తాం. అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం మా మంచికే జరిగిందేమో! మా గొంతును కూడా ఈ ప్రపంచానికి వినిపించేందుకు అవకాశం దొరికింది. మాకు ఆలయాన్ని అప్పగించినట్లయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తాం. మా గుండెల నిండా ఎప్పుడూ గూడుకట్టుకొనే ఉండే మా అయ్యప్ప మహిళల పట్ల ఎప్పుడూ వివక్షత లేదు’ అని ఐక్య మాల ఆర్య మహా సభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్ చెప్పారు. ఆయన అయ్యప్ప ఆలయంపై విస్తృత పరిశోధనలు జరిపారు. అయ్యప్ప ఎవరి పుత్రుడు ? శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబాలమేడు గుహలో కందన్, కారతమ్మ దంపతులకు అయ్యప్ప జన్మించారన్నది మాల ఆర్యులు నమ్మకం. అయ్యప్ప ఆలయం మొట్టమొదటి పూజారి కరిమల ఆర్యన్ అని, ఆయన్నే ఆలయానికి శంకుస్థాపన చేశారని, ఆఖరి పూజారి కోచుకుట్టి కోచురామన్ అని, వారి బంధువులు ఇప్పటికీ కొట్టాయం జిల్లా ముండక్కయమ్లో నివసిస్తున్నారని సజీవ్ తెలిపారు. దక్షిణ కేరళలోని పట్టణంతిట్ట, కొట్టాయం, ఇదుక్కి ప్రాంతాల్లోని ఎత్తైన పర్వతాల వాలున దాదాపు 30 వేల మంది మాల ఆర్యులు నివసిస్తున్నారు. వారి రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలుగా పరిగణిస్తోంది. వారి ఇళ్లన్నీ విసిరేసినట్లుగా దూర, దూరంగా కొండ చెరియ వాలుకు ఆనుకొని ఉన్నాయి. అలా వాళ్ల ఊళ్లన్ని ఎత్తైన కొండ శిఖరాల వాలునే ఉండేవని, అందుకే వారికి మాల ఆర్య (కింగ్ ఆఫ్ ది మౌంటేన్) అని పేరు వచ్చిందని 1883లోనే ప్రచురించిన ‘నేచర్ లైవ్ ఇన్ ట్రావెంకోర్’ పుస్తకంలో శామ్యూల్ మతీర్ రాశారు. ఇప్పటికే కరిమల, పొన్నంబాలమేడు, నీలక్కల్ మహదేవ్ ఆలయాలపై హక్కుల కోసం పోరాడుతున్న ఐక్య మాల ఆర్య మహా సభ ఇప్పుడు అయ్యప్ప ఆలయాన్ని తమ పోరాటంలో భాగం చేసింది. కేరళలో దాదాపు వంద ఆలయాలపై ఆదివాసీ, దళిత సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. బ్రాహ్మణ పూజారులకు ముందు మాల ఆర్య పూజారులు ఉండేవారని, వారు అయ్యప్పకు తేనాభిషేకం చేసేవారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 23వ తేదీన పట్టణంతిట్టలో జరిగి బహిరంగ సభలో వ్యాఖ్యానించడం గమనార్హం. చరిత్రగతిలో ఆదివాసీల ఆలయాలు అన్యాక్రాంతం అవడం, ధ్వంసమవడం తెల్సిందే. తూర్పు గోదావరి జిల్లా తలుపులమ్మా, కొడగులోని తాళకావేరి, చిక్మగలూరులోని బాబా బుడాన్ గిరి టెంపల్, తిరుపతిలో వేంకటేశ్వర స్వామి ఒకప్పడు గిరిజన దేవాలయాలన్న వివాదం ఉంది. తమ దేవుళ్ల పక్కన అన్య మతస్థులను పేర్కొనే సంస్కృతి ద్రవిడులదని, గిరిజనులు లేదా ఆదివాసీల సంప్రదాయం కూడా ద్రవిడ సంస్కృతికి దగ్గరగా ఉంటుందని చరిత్రకారులు చెబుతారు. అందుకేనేమో అయ్యప్ప ముస్లిం మిత్రుడు వావర్ మసీదు అయ్యప్పకు దగ్గరలోనే ఉంది. అయ్యప్పను సందర్శించే భక్తుల్లో 80 శాతం మంది 40 కిలోమీటర్ల దిగువనున్న వావర్ మసీదు సందర్శించాకే అయ్యప్ప వద్దకు వెళతారు. వేంకటేశ్వరుడి భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ అన్న విషయం తెల్సిందే. వేంకటేశ్వరుడు ఒకప్పటి చెంచుల ఆరాధ్య దైవంగా చరిత్రకారులు చెబుతారు. శబరిమల; కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు -
శబరిమల; కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
తిరువనంతపురం : శబరిమల ఆలయ ప్రాంగణంలో ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శ్రీ చితిర అట్ట తిరునాళ్ పూజ నిమిత్తం నేడు(మంగళవారం) మరోసారి శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తున్న మహిళలను, మీడియాను నిరసనకారులు అడ్డుకుంటున్నారు. ఈ ఘటనలో ఓ వీడియో జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. త్రిసూరుకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కొంతమంది నిరసనకారులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా తనను ఆలయంలోకి ప్రవేశించకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆమె ప్రతిఘటించడంతో వారు మరింత రెచ్చిపోయారు. తన వయస్సు 52 ఏళ్లు అని పేర్కొనడంతో, తాను కచ్చితంగా దర్శనం చేసుకునే తీరతానని ఆమె పట్టుబట్టారు. దీంతో నిరసనకారులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. కాగా ట్రావెన్కోర్ సంస్థాన చివరి మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ జన్మదినం సందర్భంగా శబరిమల ఆలయాన్ని నేడు తెరవనున్నారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అయ్యప్ప సన్నిధానం తెరుచుకోవడం ఇది మూడోసారి. గతనెల మాసపూజలు, నిన్న(సోమవారం) మకరవిలక్కు పూజ సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. -
శబరిమల చరిత్రలోనే తొలిసారి..!
శబరిమల : మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సన్నిధానం తెరుచుకోవడం ఇది రెండోసారి. గతనెల మాసపూజల సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో... శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం 15 మంది మహిళా పోలీస్ ఉద్యోగులను ఆలయం వద్ద భద్రతా విధుల నిర్వహణ కోసం నియమించింది. అయితే వీరంతా 50 ఏళ్ల పైబడిన వారు కావడం గమనార్హం. ఆలయ సాంప్రదాయం ప్రకారం 10 సంవత్సరాల లోపు బాలికలు.. 50 ఏళ్ల పైబడిన మహిళలను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా 50 ఏళ్ల పైబడిన మహిళా పోలీసు అధికారులను నియమించింది. వీరిలో చాలా మంది ఇప్పటి వరకు ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకోలేదని తెలిపారు. మరోక ఉద్యోగిని ఆమె చిన్నతనంలో అయ్యప్ప దర్శనం చేసుకున్నానని చెప్పారు. ఈ విషయం సదరు ఉద్యోగినులు మాట్లాడుతూ ‘మేము ఇక్కడ మాకు కేటాయించిన విధులు నిర్వహించడానికి వచ్చాము. ఆలయ నిబంధనలు ఉల్లంఘించి దర్శనం కోసం ప్రయత్నించే మహిళలను అడ్డుకోవడమే మా ప్రధాన బాధ్యత’ అని తెలిపారు. అయితే ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి ప్రస్తావించగా ‘నో కామెంట్స్’ అంటూ సమాధానమిచ్చారు. మకరవిలక్కు పూజల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. రేపు సాయంత్రం 10 గంటలకు వరకూ తెరుచుకుని ఉంటుంది. -
రేపు తెరుచుకోనున్న శబరిమల.. భారీ భద్రత!
శబరిమల : మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకూ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సన్నిధానం తెరుచుకోవడం ఇది రెండోసారి. గతనెల మాసపూజల సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో... శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 నుంచి 50ఏళ్ల వయసు మధ్య మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడ్డారు. సన్నిధానానికి వెళ్లేందుకు ప్రయత్నించిన 10మందికిపైగా మహిళలను బలవంతంగా వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో రేపు ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో కేరళ పోలీసులు భద్రతను కట్టుదిట్టంచేశారు. శబరిమల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. శబరిమల పరిసరాల్లో 2,300మంది పోలీసులు పహారా కాస్తున్నారు. నీలక్కల్, ఎలవున్కల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. నీలక్కల్ నుంచి పంబ బేస్ క్యాంప్ వరకూ ఉన్న అటవీ ప్రాంతంలోనూ పోలీసులు ప్రత్యేక పికెటింగ్స్ ఏర్పాటుచేశారు. కొండపైకి వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. ఆందోళనకారులు సన్నిధానం వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులతోపాటు 20మంది సభ్యుల కమాండో టీమ్ను కూడా సన్నిధానం వద్ద మోహరించారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నాయర్ సర్వీస్ సొసైటీ, పందలం రాజకుటుంబంతో చర్చలు జరిపేందుకు పినరయి విజయన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. -
అసలు లక్ష్యం అయోధ్యేనా?
ప్రజలను మతపరంగా చీల్చే సాంప్రదాయిక ధోరణి నుంచి బయటకు వచ్చి.. భక్తి, విశ్వాసాలకు సంబంధించిన మరింత ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తి వాటిని రగుల్కొల్పే అవకాశాన్ని శబరిమల ఉదంతం బీజేపీకి చక్కగా అందించింది. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ’అమలు చేయదగిన తీర్పులనే ఇవ్వాలని, ప్రజల విశ్వాసాలను వమ్ము చేసే తీర్పులను, ఆదేశాలను అవి జారీ చేయకూడద’ని అమిత్ షా చేసిన ప్రకటన కేరళకే పరిమితం అవుతుందా? అమిత్ షా సూచన శబరిమల విషయంలోనే కాకుండా రేపు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతున్న అయోధ్య విషయంలోనూ వర్తించబోతున్నదా? అన్నదే అన్నిటికంటే పెద్ద ప్రశ్న. రాజ్యసభ సభ్యుడిగా 2017 ఆగస్టు నెలలో తన ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా అమిత్ షా చేసిన ప్రమాణంలో ఇది కొంత భాగం: ‘అమిత్ షా అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’. కానీ గత శనివారం కేరళలోని కన్నూర్లో, శబరిమలలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమిత్ షానే మాట్లాడుతూ, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ‘అమలు చేయదగిన తీర్పులనే ఇవ్వాలని’ సూచిస్తూ మరికాస్త జోడించారు. అదేమిటంటే, ‘ప్రజల విశ్వాసాలను వమ్ము చేసే తీర్పులను, ఆదేశాలను అవి జారీ చేయకూడదు’. బీజేపీ అధ్యక్షుడు ఈ భిన్న ప్రకటనల ద్వారా తన్ను తాను ఖండించుకుంటున్నారా? విశ్వాసాలతో, మతంతో ముడిపడివున్న సున్నితమైన అంశాలకు సంబంధించి భారత రాజ్యాంగం విధించిన శాసనాలకు కోర్టులు పూర్తిగా కట్టుబడకూడదని ఆయన సూచిస్తున్నారా? మనుషులందరినీ లింగ భేదం లేకుండా సమాన దృష్టితో చూడటానికి బదులుగా, శబరిమల ఉదంతంలో ప్రజల విశ్వాసం, సున్నితమైన మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నదే అమిత్ షా అభిమతమా? శబరిమల ఆందోళనకారులకు పూర్తి మద్దతు ఇస్తూ, బీజేపీ కార్యకర్తలు వారికి అన్ని విధాలా అండదండలుగా ఉంటున్న వైనం గమనిస్తే ఈ అంశంలో బీజేపీ వైఖరి ఆశ్చర్యం కలిగించదు. అక్టోబర్లో అయిదురోజులపాటు అయ్యప్ప మందిరాన్ని తెరిచి ఉంచినప్పుడు, 10 నుంచి 50 సంవత్సరాలలోపు వయసున్న మహిళలను ఆలయ సందర్శనకు అనుమతించబోమని బీజేపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు. వయసు, లింగభేదంతో పనిలేకుండా ప్రతి భక్తుడిని, భక్తురాలినీ అయ్యప్ప ఆలయ సందర్శనకు అనుమతించాలంటూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ బీజేపీ కార్యకర్తలు దానికి తలొగ్గలేదు. శబరిమలలో అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి అని పేర్కొంటూ, శతాబ్దాలుగా అయ్యప్పను సందర్శించడానికి రుతుక్రమంలోకి వచ్చిన ఆడవారిని అనుమతించడం లేదు. కానీ మహిళా ఉద్యమ కార్యకర్తలు మాత్రం దీన్ని వివక్షాపూరితమైనదిగానూ, పితృస్వామిక చర్యగానూ చూస్తున్నారు. ఈ అంశంలో బీజేపీ చేస్తున్నదేమిటంటే, అయిదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కంటే అయ్యప్ప స్వామిని అత్యున్నతంగా భావిస్తున్న భక్తులకు బాసటగా నిలబడటమే. అయ్యప్ప ఎలాంటి శాసనాధికారానికైనా అతీతమైనవాడని వీరు చెబుతున్నారు. అమిత్ షా కూడా దీనికి వంతపాడుతూ ‘తమ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చూస్తున్న’ భక్తుల పక్షాన తమ పార్టీ గట్టిగా నిలబడుతుందని చెప్పారు. కేరళలో రాజకీయ పునాదిని బలపర్చుకునే లక్ష్యంతోనే బీజేపీ–ఆరెస్సెస్ శక్తులు అయ్యప్ప ఉదంతంపై అలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యమే. బీజేపీని ఆదరించి, అక్కున చేర్చుకోవడానికి కేరళ ఓటర్లు ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అధికంగా 5,000 ఆరెస్సెస్ శాఖలు కేరళలో ఉన్నప్పటికీ కేరళ అసెంబ్లీలో బీజేపీ ఇంతవరకు ఒక్క స్థానం మాత్రమే గెల్చుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఒ. రాజగోపాల్ 2016 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ రాష్ట్రం నుంచి బీజేపీ ఇంతవరకు ఒక్క ఎంపీ స్థానాన్నీ గెలుపొందలేదు. ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ కూటముల మధ్య చీలిపోయిన కేరళలో రాజకీయాల్లో, బలమైన మూడో పక్షంగా బీజేపీ ఇంతవరకు ఆవిర్భ వించలేకపోయింది. కేరళలో రాజకీయంగా బలపడటానికి ప్రస్తుత మార్గమే సరైనదని బీజేపీ పసిగట్టింది. ఇంతవరకు ఎల్డీఎఫ్ కూటమికి సాంప్రదాయికంగా ఓటేస్తున్న అధిక సంఖ్యాకులైన హిందూ ఓటర్లకు బీజేపీ ఇప్పుడు చెబుతున్నది ఏమిటంటే, హిందువుల లక్ష్యసాధనకు, ఆగ్రహ ప్రదర్శనకు, ఆందోళనలకు బీజేపీ శిబిరం ఇప్పుడు అందుబాటులో ఉన్నదనే. గొడ్డు మాంసం వాడకం, లవ్ జిహాద్, మహాబలి చక్రవర్తి జయంతికి బదులుగా ఓనమ్ పండుగ రోజున వామన జయంతి గురించి మాట్లాడటం వంటి అంశాలపై ఆరెస్సెస్ శాఖలు.. ప్రజలను మతపరంగా చీల్చే ధోరణి నుంచి బయటకు వచ్చి.. భక్తి, విశ్వాసాలకు సంబంధించిన మరింత ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తి వాటిని ప్రేరేపించే అవకాశాన్ని శబరిమల ఉదంతం బీజేపీకి చక్కగా అందించింది. శబరిమల సమస్య కేరళ రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారనుందని బీజేపీ సరిగ్గానే గుర్తించింది. అందుకే హిందూ మలయాళీ ఓటు బ్యాంకును ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో కేరళ సరిహద్దులకు అవతల కూడా తనకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉన్నట్లు బీజేపీకి స్పష్టమైంది. లడ్డులాగా దొరికిన ఈ అవకాశాన్ని బీజేపీ వదులుకోవడానికి సిద్ధపడదు కూడా. కానీ కేరళపై, భారత రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కేరళ కాంగ్రెస్.. సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వాని స్తున్న తమ జాతీయ నాయకత్వం పం«థాకు కట్టుబడితే హిందూ ఓటును కొల్లగొట్టనున్న బీజేపీ ముందు తాను ప్రేక్షకుడిలా చూస్తుండిపోవలసిం దేనని గ్రహించింది. వామపక్ష కూటమి పట్టులో ఉన్న హిందూ నియోజకవర్గాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలని కూడా కేరళ కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీన్ని అవకాశవాద బేరసారాలుగా విమర్శలు వస్తున్నప్పటికీ అది లెక్కచేయడం లేదు. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం కోర్టు తీర్పును అమలుచేయడమే తన ప్రభుత్వ ధర్మమనే వైఖరిని చేపట్టారు. పైగా, ఆలయంలోకి మహిళలందరినీ అనుమతించాలని ఆయన ప్రభుత్వం తొలినుంచి వాదిస్తోంది. అయితే మహిళా భక్తులను ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల నుంచి దింపేయడం, నిషిద్ధ వయస్సులోని ఆడవారు అయ్యప్ప ఆలయంవైపు పయనిస్తుంటే వారిని వెదికి మరీ దింపేయడం వంటి ఘటనలతో వామపక్ష కూటమిలోనే కొంతమందిలో సందేహాలు నెలకొన్నాయి. దేవాదాయ మంత్రి కె సురేంద్రన్ సైతం డైలమాలో పడ్డారు. ఆలయం అనేది కార్యకర్తల బలప్రయోగ వేదిక కాదని కూడా ఆయన ప్రకటించారు. మరోవైపున రాజకీయాలతో సంబంధం లేని హిందూ మలయాళీలు అయితే శబరిమలపై జరుగుతున్న దాడిని చూసి అసౌకర్యంగా భావిస్తున్నారు. ఆలయ సందర్శనకు వస్తున్న మహిళలకు వేలాది పోలీసులు రక్షణగా రావడం చాలామంది సాంప్రదాయిక భక్తులను బాధించింది. ఇక అయ్యప్ప భక్తుల విషయానికి వస్తే ఆచారాన్ని అతిక్రమించి ఆలయ సందర్శనకు వచ్చే ప్రతి మహిళా అయ్యప్ప స్ఫూర్తిని ధిక్కరిస్తున్నట్లే భావిస్తున్నారు. అయితే ప్రదర్శనకారులు హింసకు దిగడం మాత్రం నిస్సందేహంగానే తప్పు. 3,500 మంది నిరసనకారులు ఇంతవరకు అరెస్టయ్యారు. కోర్టు తీర్పుపై వ్యతిరేకతను సహించబోనని, నవంబర్ మధ్యలో తిరిగి తెరుచుకునే అయప్ప ఆలయాన్ని హింసకు దూరంగా ఉంచుతానని ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరోవైపున ఈ తరహా అరెస్టులు బీజేపీకి ఊపిరి పోస్తున్నాయి. అయ్యప్ప భక్తుల విశ్వాసాలను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తోందంటూ అమిత్ షా నిందించారు. ఒకవైపున ధర్మానికీ, విశ్వాసానికీ, భక్తికీ మరోవైపున కేరళ ప్రభుత్వ అణచివేతకు మధ్య పోరాటంగా శబరిమల ఉదంతాన్ని వర్ణిస్తూ షా ట్వీట్ చేశారు కూడా. వామపక్ష ప్రభుత్వాన్ని అయ్యప్ప, హిందూ వ్యతిరేక సంఘటనగా చిత్రించడమే దీని లక్ష్యం. నవంబర్లో అమిత్ షా స్వయంగా శబరిమల యాత్రను చేపట్టే అవకాశం కనిపిస్తుండటంతో ఇది కేరళలో మరిన్ని ఘర్షణలకు తావీయవచ్చు కూడా. నిస్సందేహంగానే, 2019లో కేరళ ఎన్నికల్లో శబరిమల అత్యంత ప్రధాన సమస్యగా మారనుంది. ఇటీవలి కేరళ వరదలను నివారించడంలో పినరయి విజయన్ సమర్థత పక్కకు వెళ్లి, ఎన్నికల నాటికి మతం, విశ్వాసం కీలక పాత్ర వహించనున్నాయి. బీజేపీ రాజకీయ క్రీడను గ్రహించిన వామపక్ష కూటమి ఎదురుదెబ్బ తీయడం మొదలెట్టింది. శబరిమలలో జరిగిన గొడవలన్నింటికీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఎల్డీఎఫ్ విశ్వసిస్తోంది. అయ్యప్ప ఆలయం సమీపంలోకి నవంబర్లో మహిళలను అనుమతించడం సాధ్యపడగానే పరిణామాలు కుదురుకుంటాయని కూటమి భావిస్తోంది. శబరిమల పేరిట సమాజంలో చీలికలకు నారాయణ గురు వంటి సాంఘిక సంస్కర్తలు పుట్టిన కేరళ గడ్డ అనుమతించదని ప్రభుత్వం నమ్ముతోంది. శబరిమలలో విశ్వాసాలను ముందుకు తెస్తున్న బీజేపీ ట్రిఫుల్ తలాక్ని కూడా విశ్వాసాలకు సంబంధించిన సమస్యగా ఎందుకు చూడదని ప్రశ్న. లైంగిక సమానత్వం పేరిట ముస్లిం మహిళల గురించి మోదీ, షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు, అయ్యప్ప భక్తులైన హిందూ మహిళల విషయంలో ఆ మద్దతును వారు ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్న తలెత్తకమానదు. రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికనే బీజేపీ లైంగిక న్యాయం ప్రదర్శితమవుతుందన్న వాదన కూడా ఇప్పటికే మొదలైంది. అయోధ్యపై తీర్పు కూడా తమకు వ్యతిరేకంగా వస్తే మత ఛాందస వాదులు ఎలా స్పందిస్తారు అనేందుకు షా ప్రస్తుత వైఖరిని ఉదాహరణగా చాలామంది చూస్తున్నారు. ముస్లిం సంస్థలు ఇప్పటికే ఈ కేసుపై పోరాడుతుండగా, అయోధ్యలో రాముడు జన్మించాడు అనే విశ్వాసం ప్రాతిపదికన హిందూ ప్రజానీకం వివాదాన్ని ప్రేరేపించక మానదు. దక్షిణ భారతదేశం మొత్తంలో బీజేపీకి శబరిమల ఒక ఆలయ సమస్యను నిక్షేపంగా అందించనుంది. అయితే ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేసే చట్టపరమైన తీర్పులను కోర్టులు ఇవ్వకూడదంటూ అమిత్ షా చేస్తున్న సూచన శబరిమల విషయంలోనే కాకుండా రేపు అయోధ్య విషయంలోనూ వర్తించబోతున్నదా? అన్నదే అన్నిటికంటే పెద్ద ప్రశ్న. వ్యాసకర్త: టీఎస్ సుధీర్, సీనియర్ జర్నలిస్టు, tssmedia10@gmail.com -
‘సుప్రీం’ను ఖాతరు చేయని బీజేపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అయ్యప్ప భక్తులను అరెస్ట్ చేస్తున్నారంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. అవసరమైతే కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా భాగం కాకపోయినా అధికార పార్టీ అధ్యక్షుడైనందున ఆయన మాటలను కేంద్రం వైఖరిగానే పరిగణించాల్సి ఉంటుంది. కేరళ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామంటూ హెచ్చరించడం అంటే ఆయన ప్రభుత్వంలో భాగంగా మాట్లాడుతున్నట్లే. అలాంటి వ్యక్తి శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిన అవసరం లేదని మాట్లాడడం అంటే సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయక పోవడమే. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఆరెస్సెస్, బీజేపీ పార్టీలు భక్తులను సమీకరిస్తుంటే వారికి మద్దతుగా అమిత్ షా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. శబరిమలలోలాగా అయోధ్య–రామమందిరం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయలేదుగానీ, ఈ రెండు మందిరాల అంశాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారనేది స్పష్టం అవుతుంది. రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాలకు సుప్రీంకోర్టు వక్రభాష్యం చెబుతూ కార్యనిర్వాహక అధికారాల పరిధిలోకి జొరబడుతోందని కేంద్రంలోని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బహిరంగంగానే సుప్రీంకోర్టును విమర్శించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును బీజేపీ నేతలు విమర్శిస్తుంటే సుప్రీం కోర్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావడం లేదు. -
ఇక శబరిమల కోసం ‘రథయాత్ర’
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించడంపై బీజేపీ నిరసన గళం మరింత పెంచింది. అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించాలనే నినాదంతో రథయాత్రను ప్రారంభించాలని నిర్ణయించింది. అయ్యప్ప భక్తుల నిరసనలకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షా మాట్లాడిన మరునాడే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఎన్డీఏ పక్షాల మద్దతుతో నవంబర్ 8 నుంచి కాసర్గోడ్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర నవంబర్ 13న పత్తనంతిట్టలో ముగియనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై తెలిపారు. కాగా, శనివారం రాత్రి అమిత్షా నేతృత్వంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్, ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు, కేపీసీసీ సభ్యుడు రామన్ నాయర్ బీజేపీలో చేరారు. -
శబరిమలలోకి మహిళలు.. 13న సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల అనుమతిని సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నవంబర్ 13న విచారించనుంది. జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం సహా 19మంది దాఖలుచేసిన రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం... వాటిని నవంబర్ 13న విచారిస్తామని ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్కే కౌర్లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం శబరిమలలోని అయ్యప్ప ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని, ఈ అంశంపై సత్వరమే విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై 19 పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్టు తెలిపిన జస్టిస్ గొగోయ్.. ఈ వ్యాజ్యాలను నవంబర్ 13న విచారిస్తామని తెలిపారు. శబరిమలలో మహిళల నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువడినప్పటి నుంచి శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించగా భక్తులు అడ్డుకున్నారు. -
నిరసనల శబరిమల
పంబా: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున మహిళా భక్తుల అడ్డగింపుల పర్వం ఐదో రోజూ కొనసాగింది. ఆదివారం ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆరుగురు తెలుగు మహిళా భక్తులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బాలమ్మ(47) అనే మహిళ కుటుంబంతో కలసి శబరిమల కొండ ఎక్కుతుండగా సన్నిధానం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే 4 కిలోమీటర్ల మేర కొండ ఎక్కి వచ్చిన ఆమెను చుట్టుముట్టి వయసు ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు చూపాల్సిందిగా కోరారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బాలమ్మ స్పృహ కోల్పోయారు. దీంతో వెంటనే ఆమెను అంబులెన్స్లో పంబాలోని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు బంధువులతో వచ్చిన 40 ఏళ్ల వయసు ఉన్న మరో ఇద్దరు మహిళా భక్తులను కూడా కొండపైకి రానివ్వకుండా ఆందోళనకారులు నిలువరించారు. దీంతో పోలీసులు వారిరువురిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం నిలక్కల్ బేస్ క్యాంప్నకు వచ్చిన ఆ ఇద్దరు ఆలయ సాంప్రదాయాన్ని అతిక్రమించటానికి తాము ఇక్కడికి రాలేదని రాతపూర్వకంగా తెలిపారు. వారిరువురిని ఆంధ్రప్రదేశ్కు చెందిన వాసంతి (41), ఆదిశేషి (42)గా గుర్తించారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన రెహానా ఫాతిమాను ఇస్లాం నుంచి బహిష్కరించినట్లు కేరళ ముస్లిం జమాత్ మండలి వెల్లడించింది. -
శబరిమల ఆందోళనకారులకు రజనీ మద్దతు
శబరిమల/చెన్నై/పంబా: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగాయి. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆలయంలోకి వెళ్లవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అయ్యప్ప భక్తులు నిరసన పెరిగింద. 50 ఏళ్లలోపు వయసున్న మహిళ ఒకరు ఆలయానికి వచ్చారన్న వదంతుల నేపథ్యంలో శనివారం పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడితో వచ్చిన ఓ మహిళను ఆందోళనకారులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దీంతో తనకు 50 సంవత్సరాలు దాటాయంటూ సదరు మహిళ ఆందోళనకారులకు నచ్చజెప్పి స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు వెళ్లింది. ఈ విషయమై పతనంతిట్ట జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ మాట్లాడుతూ..‘ఓ మహిళ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చింది. కొన్ని వార్తా చానళ్లు ఆమెను వెంబడించాయి. దీంతో అక్కడ జనం గుంపుగా ఏర్పడ్డారు. అంతకుమించి ఏమీ జరగలేదు’ అని తెలిపారు. 50 ఏళ్లలోపు మహిళ ఒకరు ఆలయ ప్రవేశానికి వచ్చారన్న వార్తలు వదంతులేనని ఆయన స్పష్టం చేశారు. ఐదు రోజుల మాస పూజల కోసం ఈ నెల 17న శబరిమల ఆలయాన్ని తెరిచారు. మరోవైపు శుక్రవారం అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా(46) ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కాగా, దళిత మహిళా ఫెడరేషన్ నేత మంజు పంబా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా శబరిమల దర్శనాన్ని శనివారం వాయిదా వేసుకున్నారు. ఆందోళనకారులకు రజనీ మద్దతు.. శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సూపర్స్టార్ రజనీకాంత్ ఆందోళనకారులకు మద్దతు పలికారు. చాల సంవత్సరాలుగా పాటిస్తున్న ఆలయ సంప్రదాయాలు, ఆచారాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోరాదని వ్యాఖ్యానించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అగౌరపర్చడం తన ఉద్దేశం కాదని రజనీ స్పష్టం చేశారు. మతం, ఆచారాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ఉండాల్సిందన్నారు. దేశంలో రాజకీయ, మీడియా, సినీ రంగాలకు విస్తరిస్తున్న ‘మీ టూ’ ఉద్యమం మహిళలకు మంచిదని రజనీ అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. తాను స్థాపించబోయే రాజకీయ పార్టీకి సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయనీ, సరైన సమయంలో వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. మరోవైపు ఈ వివాదంపై స్పందించేందుకు మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు, విలక్షణ నటుడు కమల్హాసన్ నిరాకరించారు. శబరిమల వివాదంపై తన అభిప్రాయాన్ని కోరడం సరైంది కాదన్న కమల్, తాను ఎవ్వరికీ మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. అయ్యప్ప ఆలయాన్ని తానెప్పుడూ సందర్శించలేదనీ, అయ్యప్ప భక్తుల ఆందోళన ఉద్దేశం ఏంటో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు శబరిమల విషయంలో స్పందించడం సరైనది కాదని కమల్ అభిప్రాయపడ్డారు. -
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం తీర్పుపై రివ్యూ పిటిషన్లు
-
‘శబరిమల’ తీర్పుపై రివ్యూ పిటిషన్లు
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రెండు సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ నేషనల్ అయ్యప్ప డివోటీస్ అసోసియేషన్, నాయర్ సర్వీస్ సొసైటీలు రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. ‘సంతానం పొందగలిగే మహిళలపై తన ధ్యాస మళ్లకూడదని అయ్యస్వామి కోరుకున్నారు. శాస్త్రీయ, హేతుబద్ధ కారణాల పేరు చెబుతూ మత విశ్వాసాలలో జోక్యం చేసుకోవడం సరికాదు. ఇటీవల శబరిమలపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో మహిళల రుతుస్రావంపై నెలకొన్న భయాలు, నమ్మకాలు తొలగిపోయాయనడం నిజం కాదు. టీవీ చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే, వార్తల్లో నిలిచేందుకు ఆరాటపడే మోసగాళ్లు మాత్రమే సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అంగీకరించదగ్గది కాదు’ అని అయ్యప్ప అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజా విజయన్ పిటిషన్లో తెలిపారు. అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి అనీ, అందువల్లే ఆయన ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు ప్రవేశం లేదని నాయర్ సర్వీస్ సొసైటీ తెలిపింది. దీన్ని మహిళల ప్రవేశంపై నిషేధంగా పరిగణించరాదనీ, ఈ విషయంలో సుప్రీంకోర్టు పొరపాటుపడిందని పిటిషన్లో పేర్కొంది. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యత, లౌకికతత్వాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. -
ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదు
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేంత వరకూ ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదని ఆలయ పూజారులు తేల్చిచెప్పారు. ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని, స్వామి సన్నిధానంలో మహిళా పోలీసులను నియమిస్తామన్న కేరళ ప్రభుత్వం నిర్ణయంపైనా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప ఆలయంతో సంబంధాలున్న పూర్వపు రాజులు పండాళం రాయల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై సోమవారం మాట్లాడేందుకు పండాళం రాయల్స్ కుటుంబ సభ్యులు, ఆలయ పూజారులను కేరళ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనంతవరకూ చర్చల ప్రసక్తే లేదని ఆలయ ప్రధాన పూజారుల్లో ఒకరైన కందరారు మోహనారు తెలిపారు. -
శబరిమల: ‘మైలాచారాన్ని’ మరచిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : మతాచారాలను పాటించడంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉంటాయని, పితృస్వామ్యం పెత్తనాన్ని అనుమతించలేమంటూ శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహళలందరికీ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. ఇలా అనేక సందర్భాల్లో ముఖ్యంగా మతా విశ్వాసాల్లో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని ఎండగడుతూ సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చింది. దేశంలోని పలు పవిత్ర మందిరాల్లో మహిళల్ని ఎందుకు అనుమతించడం లేదంటూ మహిళల హక్కుల కార్యకర్తలు న్యాయపోరాటాలు జరిపి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. మహారాష్ట్రలోని శని షింగ్నాపూర్ ఆలయంలోని గర్భగుడిలోకి, త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను ఎందుకు అనుమతించరంటూ భూమాతా మహిళా బ్రిగేడ్కు చెందిన నాయకురాలు తృప్తీ దేశాయ్ 2016లో సుప్రీంకోర్టుకెక్కి విజయం సాధించారు. అదే సంవత్సరం ముంబైలోని హాజీ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించకపోవడంపట్ల ముస్లిం మహిళా హక్కుల సంఘం కూడా సుప్రీంకోర్టులో విజయం సాధించింది. ఇదే వరుసలో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల ఆడవాళ్లను అనుమతించాలంటూ సుప్రీంతీర్పు చెప్పింది. రుతుస్రావం సందర్భంగా మహిళలు మైలబడతారన్న కారణంగా పదేళ్లపైన, 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై ఆలయ పూజారులు ఆంక్షలు కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన హక్కులుంటాయన్న మూలసూత్రం కారణంగా దేశంలోని ప్రతి ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ వస్తోంది. ఐదుగురు సభ్యులుగల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పుతో జస్టిస్ హిందూ మల్హోత్రా ఒక్కరే విభేదించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో మతానికి ఒక్కోరకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయని, అవన్నీ స్థానిక ప్రజల నమ్మకాలనీ, వాటిల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేవని ఆమె వాదించారు. పైగా అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడం వల్ల దాని ప్రభావం దేశంలోని అన్ని ఆలయాల ఆచార వ్యవహారాలపై ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆమె అభిప్రాయంలో అన్ని ఆలయాలపై ప్రభావం ఉంటుందనే పాయింట్ ఒక్కటే తర్కబద్ధంగా ఉంది. ఈ విషయాన్నైనా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని దేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉంటుందని ఒక్కసారే తీర్పు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడే సుప్రీంకోర్టు మరో ముఖ్యమైన విషయాన్ని విస్మరించింది. రుతుస్రావం వల్ల మహిళలు మైలపడతారనే సాంఘిక దురాచారాన్ని పట్టించుకోకపోవడం. ఈ దురాచారం ఇక చెల్లదని ప్రకటించకపోవడం. మైల సందర్భంగా మహిళలను ఒక్క దేవాలయాలకే కాకుండా సాంఘిక, సామాజిక కార్యక్రమాలకు కూడా అనాదిగా దూరం ఉంచుతూ వస్తున్నారు. రుతుస్రావం సందర్భంగా షియా మసీదుల్లోకి మహిళలను అనుమతించరు. భారత్లోని సున్నీ మసీదుల్లోకి ఎల్లవేళల మహిళలను అనుమతించరు. పార్శీ అగ్ని దేవాలయాల్లోకి కూడా మహిళలను అనుమతించరు. ఇక ఇళ్లలో రుతుస్రావం సందర్భంగా పూజ గదుల్లోకి మహిళలు వెళ్లరాదు. పవిత్ర గ్రంధాలను తాకరాదు. దైవ స్త్రోత్రాలను చదవరాదు. వంటింట్లోకి వెళ్లరాదు. వంట చేయరాదు. పొరుగింట్లో శుభకార్యాలయాలకు హాజరుకారాదు. హిందూ కుటుంబాలతోపాటు జైన కుటుంబాల్లోనూ ఈ ఆచారం ఇప్పటికీ ఉంది. ఈ మైల అన్న కారణంగానే పండిట్లు, పూజారులు, కాజీలు, ఇమామ్ల పదవులు మహిళలకు ఇవ్వడం లేదు. మహిళల వివక్ష చూపే ఇలాంటి ఆచారాలు సోషల్ మీడియా విస్తరించిన నేటిరోజుల్లో కూడా కొనసాగడం అనాగరికం. ఈ ఏడాది దుర్గా పూజలో మహిళలందరూ పాల్గొనాలని, రుతుస్రావం వచ్చిన వాళ్లూ పాల్గొనవచ్చని శనివారం నాడు ఓ ఫేస్బుక్ రీడర్ పిలుపునివ్వగా, ఎంతోమంది నుంచి చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చి పడ్డాయి. మారే కాలం మరెప్పుడో! -
అయ్యప్ప బ్రహ్మచర్యానికి రాజ్యాంగ రక్షణ
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ ప్రధాన దైవం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగంలో నిబంధనలున్నాయని నాయర్ సర్వీస్ సొసైటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఈ సొసైటీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ సంస్థ తరఫు లాయర్ కె.పరాశరన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరిశీలించదగ్గ అంశం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యమే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘ ఆలయంలోకి వచ్చే వారు యువతులు, మహిళలను వెంట తీసుకురావొద్దు. పిల్లలు, తల్లి, సోదరికి మినహాయింపు ఉంటుంది. సందర్శకులు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని దీనర్థం కాదు. కానీ వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లు కనిపించాలి. దేవాలయాల్లోకి అన్ని వర్గాలను అనుమతించాలన్న రాజ్యాంగ నిబంధన 25(2) సామాజిక సంస్కరణలకే పరిమితం. 26(బి) నిబంధన కింద చేర్చిన మత వ్యవహారాలకు వర్తించదు’ అని పరాశరన్ అన్నారు. మహిళలను ఆలయాల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తే పరిస్థితి ఏంటని బెంచ్ ప్రశ్నించగా..చాలా ఏళ్ల నాటి ఇలాంటి సంప్రదాయాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తున్న సమయంలో అక్కడి ప్రధాన దైవం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకోవాలని బదులిచ్చారు. వాదనలు నేడు కూడా కొనసాగనున్నాయి. దివ్యాంగుల సౌకర్యం పట్టదా? రవాణా సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాల్లో దివ్యాంగులకు అనుకూలంగా మార్పులు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి గత డిసెంబర్లో తాము జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన కేంద్రానికి చీవాట్లు పెట్టింది. ఇప్పటి దాకా తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రమాణపత్రం దాఖలుచేయాలని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ల ధర్మాసనం ఆదేశించింది. తమ ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాల తీరుపై కూడా బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. -
ఆ నిషేధం కొనసాగాల్సిందే: ట్రావెన్కోర్ దేవస్థానం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప గుడిలోకి రుతుచక్రదశలో ఉన్న మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టినా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) దీన్ని సమర్థించుకుంది. నిషేధం ఆలయ సంప్రదాయాల్లో భాగమని, కొనసాగాల్సి ఉందని పేర్కొంది. ఈ కేసులో కక్షిదారుగా చేరి సుప్రీంకోర్టుకు వైఖరిని తెలియజేస్తామని టీడీబీ చీఫ్ ప్రయార్ గోపాలకృష్ణన్ తెలిపారు. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నప్పుడు 2006లో యంగ్ లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పలు అభిప్రాయాలు వ్యక్తం చేసిందని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు. ఆలయ, అయ్యప్పస్వామి విషయంలో పాటించే ఆచారాల ప్రత్యేకత గురించి అవగాహన లేకే సుప్రీంకోర్టు ఈ రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిందన్నారు. మత విశ్వాసాల ప్రకారం ఆలయాన్ని సందర్శించే భక్తులు కొన్ని ఆచార, సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సైతం ఈ కేసులో కక్షిదారుగా చేరి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సమర్థించాలనుకుంటోంది.


