పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్‌ఆర్టీసీ సేవలకు అనుమతి | Sabarimala: KSRTC to start interstate services from Pamba | Sakshi
Sakshi News home page

పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్‌ఆర్టీసీ సేవలకు అనుమతి

Nov 26 2025 4:48 PM | Updated on Nov 26 2025 5:47 PM

Sabarimala: KSRTC to start interstate services from Pamba

సాక్షి శబరిమల: పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్‌ఆర్టీసీ బస్ సర్వీసులకు అనుమతి లభించింది. ఈ మేరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చారు. ముఖ్యంగా తమిళనాడులో ఏడు కేంద్రాలకు కొత్త సర్వీసులు అనుమతించగా, మొత్తం 67 బస్సులకు అనుమతులు లభించినట్లయ్యింది. వాటిలో చెన్నై, కోయంబత్తూర్, పళని, తేంకాశి, కన్యాకుమారి, కంబం, తిరునెల్వేలి తదితర ఏడు ప్రాంతాలలో త్వరలో సర్వీసులు ప్రారంభంకానున్నాయి.

అలాగే కర్ణాటకలోని బెంగళూరుకు కూడా కొత్త సర్వీసు ప్రారంభంకానుంది. శబరిమల అయ్యప్ప సన్నిధానం తెరుచుకుని వారం రోజులు కావడంతో..ఈ నేపథ్యంలోనే కేఎస్‌ఆర్టీసీ శబరిమలకు వచ్చే యాత్రికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు పంపాకు వెళ్లి-రావడానికి యాత్రికుల కోసం సుమారు  3,710 సర్వీసులు నడిపింది. 

గత ఆదివారం నాటికి రికార్డు స్థాయిలో రూ. 4 కోట్లుపైన ఆదాయం రావడం విశేషం. ఇక పంపా నుంచి నిలక్కల్‌కు  1,831 సర్వీసులు నడపగా, వివిధ ప్రాంతాల నుంచి 1,879 బస్సులు పంపాకు చేరాయి. నిలక్కల్–పంపా చైన్ సర్వీసులు కూడా విజయవంతంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 15,860 చైన్ సర్వీసులు నిర్వహించారు. అంతేగాదు చెంగన్నూరు, ఎర్నాకుళం, కోట్టాయం, తిరువనంతపురం వంటి ప్రాంతాలకు ఎక్కువ బస్సులు నడుస్తున్నాయి. 

మొత్తం 15 బస్ స్టేషన్ల నుంచి 502 బస్సులు పంపాకు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. అలాగే వీటితోపాటు కేఎస్‌ఆర్టీసి అంబులెన్స్ వాన్ కూడా సేవలందించేందుకు అందుబాటులో ఉంది. కాగా, ఈ సీజన్‌ ప్రారంభమైన వారం రోజుల్లోనే ఆరున్నర లక్షలకు పైగా యాత్రికులు ఈ కేఎస్‌ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. పైగా ఈసారి పంపా డ్యూటీకి కూడా ఆసక్తి ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మద్యం అలవాటు లేనివారిని, పనితీరు నిరూపించుకునేవారినే నియమించింది.

(చదవండి: ఇలా బుక్‌ చేసుకుంటే.. కన్నిస్వాములకు శబరిమల యాత్ర ఉచితం..!)

 

Advertisement
 
Advertisement
Advertisement