రేపు తెరుచుకోనున్న శబరిమల.. భారీ భద్రత! | Sabarimala temple reopens on Monday | Sakshi
Sakshi News home page

Nov 4 2018 6:11 PM | Updated on Nov 4 2018 6:17 PM

Sabarimala temple reopens on Monday - Sakshi

శబరిమల : మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకూ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సన్నిధానం తెరుచుకోవడం ఇది రెండోసారి. గతనెల మాసపూజల సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో... శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 నుంచి 50ఏళ్ల వయసు మధ్య మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు.  మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడ్డారు. సన్నిధానానికి వెళ్లేందుకు ప్రయత్నించిన 10మందికిపైగా మహిళలను బలవంతంగా వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో రేపు ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో కేరళ పోలీసులు భద్రతను కట్టుదిట్టంచేశారు. శబరిమల పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు.

శబరిమల పరిసరాల్లో 2,300మంది పోలీసులు పహారా కాస్తున్నారు. నీలక్కల్‌, ఎలవున్కల్‌, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. నీలక్కల్‌ నుంచి పంబ బేస్ క్యాంప్ వరకూ ఉన్న అటవీ ప్రాంతంలోనూ పోలీసులు ప్రత్యేక పికెటింగ్స్ ఏర్పాటుచేశారు. కొండపైకి వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. ఆందోళనకారులు సన్నిధానం వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులతోపాటు 20మంది సభ్యుల కమాండో టీమ్‌ను కూడా సన్నిధానం వద్ద మోహరించారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ, పందలం రాజకుటుంబంతో చర్చలు జరిపేందుకు పినరయి విజయన్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement