శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇష్టపడని వారుండరు. అంతటి ప్రత్యేకత కలిగిని అరవణ ప్రసాదం ఇంటి వద్దకే నేరుగా వచ్చేస్తుంది. అదికూడా శబరిమలకు వెళ్లక్కర్లేకుండానే అయ్యప్ప ప్రసాదాన్ని నేరుగా పొందొచ్చు. అదెలాగంటే..
మనం ఉన్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే సులభంగా శబరిమల అరవణ ప్రసాదం పొందొచ్చు. దీనికోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పోస్టల్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తోంది. శబరిమలలోని పోస్టాఫీస్ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తుల కోసం ఇంటి నుంచే అరవణ ప్రసాదం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది.
భారతదేశంలో అన్ని పోస్టాఫీసులు నుంచి ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదం కొనుగోలు చేసుకోవచ్చని దేవస్వం బోర్డు పేర్కొంది. భారతదేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల అయ్యప్ప ప్రసాదం అందేలా చేయడమే తమ లక్ష్యమని శబరిమల పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. దీనికోసం ప్రసాదాన్ని ఇంటింటికి చేరవేసే ప్రాజెక్టును పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. ఈ ప్రసాదంలో నెయ్యి, అరవణ ప్రసాదం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం తదితరాలు ఉంటాయి.
ధరల వివరాలు..
టిన్ కవర్తో కూడిన ప్రసాదం కిట్ కొనడానికి రూ.520లు రుసుము చెల్లించాలి
4-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.960లు
10-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.1,760 చెల్లించాలి
పోస్టాఫీసులో ప్రసాదం ధర చెల్లస్తే..రాబోయే కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం స్వయంగా మీ ఇంటికి వచ్చి తీరుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది అయ్యప్ప ఆలయం మకర సంక్రాంతి జ్యోతి దర్శనం నిమిత్తం తెరిచి..కొద్దిరోజుల అనంతరం మూతబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేయబడుతుంది.
అలాగే వచ్చిన స్టాంప్లను పంపాలో సురక్షితంగా ఉంచుతారు. అంతేగాదు భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత ప్రత్యేకమైన పిన్కోడ్ (689713) కలిగి ఉన్న ఏకైక దైవం శబరిమల అయ్యప్ప స్వామి. వార్షిక మకరజ్యోతి ప్రారంభం కాగానే శబరిమల అయ్యప్ప ఆలయానికి వివిధ లేఖలు అందుతాయి. ఆ భక్తుల లేఖలు అయ్యప్ప పాదాల వద్ద ఉంచడం అనేది అక్కడొక ఆచారం. ఇక్కడి పోస్టాఫీసు ద్వారానే భక్తుల ఇళ్లకు ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.
(చదవండి: అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..)


