సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామనాథపురం జిల్లాలో రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన వాళ్లు అని పోలీసులు ప్రకటించారు.
ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు.
గాయపడిన వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, మరుపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు.
మృతులు వీళ్లే..
1) వంగర రామక్రిష్ణ(51) కొరప కొత్తవలస
2)మార్పిన అప్పలనాయుడు(33) కొరప కొత్తవలస
3)మరాడ రాము(50) కోరప కొత్తవలస
4)బండారు చంద్ర రావు(35) మరుపల్లి గ్రామం, గజపతినగరం మండలం

మృతుల కుటుంబాలకు తమిళనాడు పోలీసులు ఇప్పటికే సమాచారం అందించారు. పోస్ట్మార్టం పూర్తైన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామన్నారు. మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంతో మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.



