సాక్షి శబరిమల: శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శబరిమల పరిసరాల్లో నకిలీ పత్రాలతో.. గుర్తింపు కార్డులతో సేవకు వచ్చే వారి కోసం తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంపాబేస్ నుంచి సన్నిధానం వరకు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా పెంచినట్లు వెల్లడించారు.
అలాగే భద్రత దృష్టా అధికారులు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో సహా తాత్కాలిక ఉద్యోగుల పత్రాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కొందరు నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయా వ్యక్తుల కోసం పోలీసులు, బోర్డు సమాచారాన్ని పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాని చెప్పారు.
అయితే ఒక్కోసారి నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారి పరిస్థితి దృష్ట్యా సాధారణంగా ప్రశ్నించి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, శబరిమల అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నాయి. "రద్దీ పెరిగినప్పుడు దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులు , యాచకులు తరచుగా శబరిమలకు వస్తారు. వారు పోలీసులను, అటవీ శాఖను పట్టించుకోకుండా శబరిమల మార్గంలోని అడవుల్లోనే ఉంటారు. అలాంటివారు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు వంటి పత్రాలతో వస్తారు. వారి రాక భద్రతా ముప్పుని సృష్టిస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. అయ్యప్ప భక్తులను మోసగించి రద్దీ సమయాల్లో అడవిలోకి ప్రవేశించడం వారి నేరశైలి అని తెలిపారు. ఈ నేపథ్యంలో నీలిమల, అప్పచిమేడు, శరణ్గుత్తి తదితర ప్రాంతాల పరిసర అడవులలో డ్రోన్ నిఘాను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే పోలీసుల రిజిస్టర్లలో నమోదుకాని కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంపా, సన్నిధానంలో రెవెన్యూ శాఖ స్క్వాడ్, పోలీసు షాడో బృందం 24 గంటలు మోహరించి ఉంటాయని వెల్లడించారు.
(చదవండి: శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే)


