స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..! | Hyderabad Iconic Birla Mandir Marks 50 Glorious Years, Golden Jubilee Celebrations From Feb 24 | Sakshi
Sakshi News home page

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

Feb 11 2026 4:54 PM | Updated on Feb 11 2026 5:05 PM

Golden jubilee glow up for Birla Mandir Hyderabad

ఇప్పుడంటే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు చాలా తేలికగా వెళ్లగలుగుతున్నాం. సరైన రవాణా సౌకర్యం లేనందున కొన్ని దశాబ్దాల క్రితం శ్రీవారి దర్శనభాగ్యం నగర వాసులకు చాలా  కష్టంగా ఉండేది. ఇలాంటి సమయంలో ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన బిర్లా మందిర్‌ ఆ కొరత తీర్చింది.  సిటీ జనులే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వారికి ఫేవరెట్‌గా మారింది. వివాహం తర్వాత, శుభకార్యాలు, పుట్టిన రోజుల సందర్భంగా అందరూ బిర్లా మందిర్‌కే రావడం... ఇక్కడి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. 

కొత్తగా పెళ్లయినవారికైతే బిర్లామందిర్‌కు వెళ్లాల్సిందే అన్న రీతిలో ఖ్యాతికెక్కింది. అలాంటి బిర్లా మందిర్‌ 50 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు తొలిసారిగా 1976 ఫిబ్రవరి 13న తొలిసారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

చారిత్రక కట్టడాల సరసన ఆధ్యాత్మిక వైభవం 
భాగ్య నగరం అంటే చారిత్రక కట్టడాలే కాదు. ఆధ్యాతి్మక వైభవం అని చాటుతోంది బిర్లా మందిర్‌. నౌబత్‌ పహాడ్‌ కొండపై పాలరాయితో కొలువుదీరిన ఈ ఆలయం కేవలం ఆధ్యాతి్మక ప్రదేశమే కాదు.. అద్భుత శిల్పకళా వేదిక కూడా. సిటీ నడిబొడ్డున జన కోలాహలం మధ్య ఉన్న ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే కలిగే ప్రశాంతత అటు భక్తులు, ఇటు పర్యాటకులను మంత్రముగ్థులను చేస్తోంది.

పాలరాతి సొగసుల మందిరం... 
పూర్తిగా రాజస్థాన్‌ నుంచి తెప్పించిన 2000 టన్నుల పాలరాయితో బిర్లా మందిర్‌ను నిర్మించారు. పదేళ్లపాటు నిపుణులైన శిల్పుల చేత తీర్చిదిద్దారు. ఉత్తర, దక్షిణ భారత వాస్తు శిల్పి రీతుల (గోపుర, రాజస్థానీ) కలయికతో  విలక్షణంగా కనిపిస్తుంది. 

బిర్లా మందిర్‌లో శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహం 11 అడుగుల ఎత్తులో తిరుమల శ్రీవారిని తలపిస్తూ భక్తిపారవశ్యం కలిగిస్తుంది. శివుడు, గణపతి, హనుమంతుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ, మహాభారత ఘట్టాలు భారతీయ సంస్కృతికి అద్దంపడతాయి. సాయంత్రం తర్వాత విద్యుత్‌ కాంతులతో మెరిసిపోయే బిర్లా టెంపుల్‌ పర్యాటకులనూ కనువిందు చేస్తుంది. ఇక్కడి నుంచి హుస్సేన్‌ సాగర్, బుద్ధుడి విగ్రహం, నగర అందాలు కనువిందు చేస్తుంటాయి. ప్రశాంతత కోరుకునేవారికి, ఫొటోగ్రఫీ ప్రేమికులకు (ఆలయం వెలుపల) బిర్లా మందిర్‌ మంచి స్పాట్‌.

హైదరాబాద్‌ ఎక్స్‌కర్షన్‌...! 
అందులో బిర్లా మందిర్‌ విజిటింగ్‌..! ఇదీ స్కూల్‌ పిల్లలకు కొన్నేళ్లపాటు తప్పనిసరిగా కొనసాగిన సంప్రదాయం. అంతేకాదు, టెక్ట్స్‌ బుక్స్‌లోనూ బిర్లా మందిర్‌ విశిష్టత గురించి చెప్పేవారు. దీంతో ఆ టెంపుల్‌ను చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తహతహలాడేవారు. 

కొత్త జంటలకు ఫేవరెట్‌ 
కొత్తగా పెళ్లయినవారికి సిటీలో ఫేవరెట్‌ స్పాట్‌ బిర్లా మందిర్‌. భక్తి, ప్రశాంతత రెండూ లభించే ప్రదేశం కావడంతో యువ జంటలు ఇక్కడికి రావడాన్ని ఓ కార్యక్రమంగా పెట్టుకునేవారు. వీకెండ్‌లో హార్ట్‌ బీట్‌ అసలే వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఆపై శనివారం..! 
ఇంకేం వీకెండ్‌ వస్తే చాలు సిటీ జనులు బిర్లా మందిర్‌కు పొలోమంటూ పోటెత్తుతుంటారు. వైకుంఠ ఏకాదశి వంటి రోజుల్లో కిక్కిరిసినట్లే. శని, ఆదివారాల్లో అత్యధిక శాతం నగరవాసుల ఆధ్యాత్మిక కేంద్రం ఇదే.

ప్రత్యేకతలు ఇవి 
1966లో ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్‌ బిర్లా కలలోకి ఈ కొండ, శ్రీ వేంకటేశ్వరస్వామి కనిపించారని చెబుతారు. సమీపంలోని హోటల్‌ గది నుంచి చూస్తున్న ఆయనకు కొండపై వేంకటేశ్వరస్వామి ఆహా్వనిస్తున్నట్లు అనిపించిందని.. దీంతో బిర్లా మందిర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే రూ.2 కోట్లతో ఏడెకరాలలో హిందూస్థాన్‌ చారిటీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నౌబత్‌ పహాడ్‌పై బిర్లామందిర్‌ నిర్మించారు. 50 ఏళ్లలో 15 కోట్ల మందిపైగా భక్తులు, పర్యాటకులు సందర్శించారు. సోమ–శుక్రవారం వరకు రోజుకు 5–6 వేలమంది భక్తులు, సందర్శకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 9–11 వేలకు చేరుతుంది.  

24 నుంచి స్వర్ణోత్సవాలు 
శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచి 27 వరకు స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నాం. హోమాలు, అభిషేకాలు, పల్లకీ సేవ, కలశపూజ, పూర్ణాహుతి, శోభాయాత్ర చేపడతాం.
– సీఏ శ్యాం కొఠారి, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement