హైదరాబాద్: ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సైదాబాద్లో నివాసం ఉండే పల్లవి షిండే (26) ఇటీవల 8న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్ కమర్షియల్ కాంప్లెక్స్లోని కోడ్ జెన్స్ టెక్నాలజీలో ఉద్యోగంలో చేరింది.
9న ఉదయం 9.20 గంటలకు ఉద్యోగం నిమిత్తం విధులకు హాజరయ్యేందుకు ఇంట్లో నుంచి వెళ్లింది. సాయంత్రం 8 గంటలకు ఫోన్ చేసి.. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని, ఇంటికి వస్తున్నానని చెప్పింది. అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో మంగళవారం కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


