breaking news
Funday
-
ఎప్పుడూ చేయని వెరైటీ వంటకాలు టేస్టీ.. టేస్టీగా చేసేద్దాం ఇలా..!
ఒడిశా కనికా కావలసినవి: బాస్మతి బియ్యం– ఒక కప్పు, నెయ్యి– 5 టేబుల్ స్పూన్లు, జీలకర్ర– ఒక టీస్పూన్, లవంగాలు– 5, ఏలకులు– 3 (కచ్చాపచ్చా చేసుకోవాలి), దాల్చిన చెక్క– చిన్న ముక్క, జాజికాయ పొడి– కొద్దిగా, బిర్యానీ ఆకు– 1, కిస్మిస్, జీడిపప్పు– 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు– రుచికి సరిపడా, పంచదార– 4 టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా పెంచుకోవచ్చు), పసుపు– పావు టీస్పూన్, నీళ్లు– 2 కప్పులుతయారీ: ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రం చేసి, సుమారు 30 నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత పూర్తిగా నీళ్లు లేకుండా వడకట్టుకుని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుకర్లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు బియ్యాన్ని కుకర్లో వేసి, నెయ్యిలో 2 నిమిషాలు గరిటెతో తిప్పుతూ, వేయించాలి. వేగిన బియ్యంలో పసుపు, ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నీళ్లు పోసి, ఒకసారి కలిపి, కుకర్ మూత పెట్టాలి. ఒక విజిల్ వచ్చేవరకు మీడియం మంట మీద ఉడికించాలి. విజిల్ వచ్చాక స్టవ్ ఆపి, కుకర్ లోపల ఆవిరి మొత్తం పోయేవరకు అలాగే కదపకుండా ఉంచాలి. అనంతరం కుకర్ మూత తీసి, జాజికాయ పొడి వేసి, నెమ్మదిగా అన్నం మెతుకులు విరగకుండా కలపాలి. (ఇది పూరీజగన్నాథ ఆలయ ఛప్పన్న నైవేద్యాల్లో ఒకటి). ఈ టేస్టీ కనికాను పప్పుతో కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది.నూడుల్ వెజిటబుల్ కట్లెట్స్కావలసినవి: నూడుల్స్– ఒక కప్పు (ఉడికించినవి)కూరగాయ ముక్కలు– అర కప్పు (చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి, నచ్చిన కూరగాయలు తీసుకోవచ్చు)బంగాళ దుంపలు– 2 (మెత్తగా ఉడికించి, గుజ్జులా చేసుకోవాలి. కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు– కొద్దిగాపచ్చిమిర్చి ముక్కలు– కొద్దిగాబ్రెడ్ పౌడర్– కొద్దిగా, మొక్కజొన్న పిండి– ఒక టేబుల్ స్పూన్, ఉప్పు– తగినంత, నూనె– సరిపడా,టొమాటో కెచప్– కొద్దిగాతయారీ: ఒక గిన్నెలో ఉడికి, చల్లారిన నూడుల్స్, కూరగాయ ముక్కలు, బంగాళ దుంప గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, మొక్కజొన్న పిండి, బ్రెడ్ పౌడర్, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి క్యారట్ తురుము వంటివి కలుపుకోవచ్చు. కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు కలుపుకుని కట్లెట్స్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే టొమాటో కెచప్ కలిపి తింటే చాలా బాగుంటాయి.ఇటాలియన్ టొమాటో బ్రుషెట్టాకావలసినవి: బ్రెడ్ ముక్కలు– 6 (చీజ్ బ్రెడ్ లేదా రస్క్ ముక్కలు కూడా తీసుకోచ్చు), టొమాటోలు– 3 (పండినవి ఎన్నుకోవాలి, చిన్నగా తరిగినవి), వెల్లుల్లి రెబ్బలు– 2 (చిన్నగా తరగాలి), ఆలివ్ నూనె– 3 చెంచాలు, తరిగిన తాజా తులసి ఆకులు– కొన్ని, ఉప్పు– సరిపడా, మిరియాల పొడి– కొద్దిగాతయారీ: ముందుగా ఒక గిన్నెలో చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఆలివ్ నూనె, వెల్లుల్లి తరుము, తరిగిన తులసి ఆకులు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ ముక్కలను లేదా రస్క్ ముక్కలను ఒక టోస్టర్ లేదా పాన్లో ఆలివ్ నూనెతో దోరగా బేక్ చెయ్యాలి. బ్రెడ్ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే, ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని వాటిపై రుద్దాలి. ఇది బ్రెడ్కు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అనంతరం ప్రతి బ్రెడ్ ముక్కపైన టొమాటో మిశ్రమాన్ని సమానంగా వేసి సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. వీటికి సాస్తో కలిపి తింటే ఇంకా బాగుంటాయి. -
పేరెంటింగ్ టిప్స్: స్మార్ట్ఫోన్ వాడకంలో సరిహద్దులు తప్పనిసరి..!
‘‘డాక్టర్! మా బిడ్డ ఫోన్లో కార్టూన్ పెడితేనే తింటాడు.’’ ‘‘సర్! నా భర్తకు నాతో మాట్లాడటానికి టైం లేదు. ఆయన ఎప్పుడూ వాట్సాప్లోనే ఉంటాడు. చూస్తేనే చిరాకేస్తుంది.’’ ‘‘మా అమ్మానాన్న ఎప్పుడూ రీల్స్లోనే బిజీ. వాళ్లతో మాట్లాడాలంటే కూడా వెయిట్ చేయాలి.’’ ఇవి నా కౌన్సెలింగ్ రూమ్లో ప్రతిరోజూ వినిపించే మాటలు. చాలామంది తల్లిదండ్రులు తమ పనులకు అడ్డు రాకుండా ఉంటారని పిల్లలకు ఫోన్ ఇస్తారు. ‘‘పని చేసుకోవాలి కదా’’ అని సమర్థించుకుంటారు. కాని, ఆ రెండు నిమిషాల కంఫర్ట్ వల్ల పిల్లల మనసులు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఒక సైలెంట్ గ్యాప్ వస్తోంది. ‘‘నువ్వు నాకు టైమ్ ఇవ్వవు’’ అనే మాటకు బదులు – ఇద్దరూ ఒకే మంచం మీద పక్కపక్కన పడుకుని స్క్రీన్లతో బతుకుతున్నారు. ఒకప్పుడు కుటుంబ సమస్యలంటే కుర్రాళ్ల ప్రేమలు, అత్తాకోడళ్ల గొడవలు, భార్యాభర్తల వివాదాలు, పిల్లల మార్కుల టెన్షన్లు. కాని, ఇప్పుడు కౌన్సెలింగ్ రూమ్లోకి వస్తున్న కొత్త సమస్య – స్మార్ట్ఫోన్. ఈ చిన్ని యంత్రం – ఒక వైపు మనిషికి వరం, మరో వైపు నిశ్శబ్దంగా మన కుటుంబాల్ని కాలుస్తున్న శాపం.వరం లాంటి అద్భుతంమన జీవితంలో స్మార్ట్ఫోన్ తీసుకువచ్చిన విప్లవం అపారమైనది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. · ఇది కొద్ది సెకన్లలో జ్ఞానం, విద్య, సమాచారాన్ని అందిస్తుంది. · మ్యాప్లు, మెడిసిన్, బ్యాంకింగ్ అన్నీ ఒక క్లిక్ దూరంలో. దూరంగా ఉన్నవారిని వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా దగ్గర చేస్తుంది. కరోనా కాలంలో పాఠశాలలు, ఉద్యోగాలు, వైద్య సలహాలు అన్నీ ఫోన్ ద్వారానే నడిచాయి. · ఒక్క మాటలో చెప్పాలంటే, స్మార్ట్ఫోన్ మనిషిలో భాగంగా మారిపోయింది. శాపంగా మారిన వరం‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటారు పెద్దలు. స్మార్ట్ ఫోన్ విషయంలో ఇది నూటికి నూరుపాళ్లు నిజం. అతిగా వాడటంతో మన చేతిలోని ఫోన్ ఒక డిజిటల్ జైలుగా మారిపోయింది. · పసిపాపలు తినడానికి ఫోన్ కావాలి. పిల్లలు ఆడుకోవడానికి స్క్రీన్ కావాలి. యువత రీల్స్, గేమ్స్కు బానిసలైపోయారు. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. పెద్దలకు నిద్ర, ప్రశాంతత దూరమయ్యాయి. మనిషి తల వంచి నడవడం ఇప్పుడు సిగ్గుతో కాదు – నోటిఫికేషన్ చూడటానికి. ఒకప్పుడు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని తినేవారు, ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చుని మొబైల్ స్క్రోల్ చేస్తున్నారు. ఇది ఒక సామాజిక విపత్తుగా మారింది అనడంలో ఆశ్చర్యం లేదు.అతి వాడకంతో అనర్థాలుసైకాలజిస్టుల దృష్టిలో, స్మార్ట్ఫోన్ వినియోగానికి మూడు స్థాయులు ఉన్నాయి. వాడుక – అవసరమైన పనులకే వాడటం. దుర్వినియోగం – అవసరం లేకపోయినా గంటలు గంటలు స్క్రోల్ చేయడం. వ్యసనం – చేతిలో ఫోన్ లేకపోతే ఆందోళన, కోపం, మనసంతా శూన్యంలా అనిపించడం. జనాభాలో చాలామంది ఇప్పటికే మూడో దశలో ఉన్నారు. దీనివల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అనేకానేక కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. నిరంతర నోటిఫికేషన్లతో మెదడు ఫోకస్ కోల్పోతుంది. పిల్లలు ఏకాగ్రత నేర్చుకోలేరు. సోషల్ మీడియాలో పోలికల వల్ల డిప్రెషన్, అసూయ పెరుగుతుంది. ఫోన్ వల్ల భర్త–భార్యలు, తల్లిదండ్రులు– పిల్లలు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడడం తగ్గిపోతుంది. మనిషి విలువను లైక్స్, ఫాలోవర్స్తో కొలుస్తున్నాం. · ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది, ఆందోళన పెరుగుతుంది.సరిహద్దులు తప్పనిసరిస్మార్ట్ఫోన్ ఒక వరం. కాని అది మనసు, బంధాలు, పిల్లల వికాసం కన్నా పెద్దదిగా మారితే – అదే శాపంగా మారుతుంది. అందుకే స్మార్ట్ఫోన్ ప్రభావాలు, దుష్ప్రభావాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అడిక్షన్ నుంచి తప్పించుకునే మార్గాల గురించీ వారం వారం సవివరంగా తెలుసుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. ముందుగా గ్రౌండ్ రూల్స్... రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఫోన్ అస్సలు ఇవ్వకూడదు.డైనింగ్ టేబుల్, బెడ్రూమ్ ఫోన్ ఫ్రీ జోన్లుగా మార్చాలి.వారంలో ఒక రోజు డిజిటల్ ఫాస్టింగ్ చెయ్యాలి.ఫ్యామిలీ టైమ్లో ఫోన్ పక్కన పెట్టేయాలి.ముందుగా తల్లిదండ్రులే రోల్ మోడల్స్గా నిలవాలి. · పేరెంట్స్, స్పౌసెస్, ఇండివిడ్యువల్స్– ఈ రోజు ఒక ప్రశ్న అడగండి: ‘‘నా చేతిలో ఉన్న ఫోన్ నా జీవితానికి వరమా? శాపమా? ఆక్సిజనా? జైలా?’’సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com(చదవండి: గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందలు వాడాల్సిందేనా..?) -
అవే నా స్టయిల్ ఆఫ్ లవ్: నటి చైత్ర జే ఆచార్
సింపుల్ నుంచి బోల్డ్ వరకు, ట్రెండ్ నుంచి ట్రెడిషనల్ వరకు ఏ స్టయిల్లోనైనా తన స్వాగ్ని చూపే నటి చైత్ర జే ఆచార్. జీన్స్, షార్ట్స్ ప్లస్ టీ షర్ట్ నా స్టయిల్ ఆఫ్ లవ్. బయటకు వెళ్లేటప్పుడు ఇదే లుక్ను కాస్త బోల్డ్గా స్టయిల్ చేస్తా. ప్రత్యేక సందర్భాల్లో చీరల్లో మెరుస్తాను. అవి నాకు సంప్రదాయబద్ధమైన, కంఫర్ట్ లుక్ను ఇస్తాయి. దుస్తులు ఏవైనా, మినిమల్ జ్యూలరీని ప్రిఫర్ చేస్తా అంటోంది చైత్ర జే ఆచార్. ఇక్కడ ఆమె ధరించిన చీర బ్రాండ్: ఇజాయి ధర: రూ. 3,850, జ్యూలరీ బ్రాండ్: ఫైన్ షైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్రిస్టల్ క్రష్!రాళ్ల నగలు నేటి యువత స్టయిల్కి ర్యాప్ సాంగ్లాంటి ఎనర్జీని ఇస్తున్నాయి. అందుకే, బంగారం మెరుపు కంటే, క్రిస్టల్ జ్యూలరీనే వారి ఫేవరెట్ క్రష్గా మారింది. నిజానికి, రాళ్ల ఆభరణాలకు ఫ్యాషన్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం మెరుపుతోనే కాదు, ట్రెండ్, లగ్జరీ మిక్స్ చేసిన మోడర్న్ డిజైన్లతో వస్తాయి. విశేషంగా, వైట్ స్టోన్ జ్యూలరీకి ఒక అదనపు ఆర్భాటం అందిస్తాయి. ఒక్కసారి రాళ్ల ఆభరణాలు ధరించగానే సాధారణ దుస్తులు కూడా ప్రత్యేకంగా మెరుస్తాయి. డైలీ వేర్కు, మినిమలిస్టిక్ వైట్ సఫైర్ స్టడ్స్, సింపుల్ బ్యాంగిల్స్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్ స్టయిల్కు క్లాసిక్ వైట్ స్టోన్ పీసులు, జెంటిల్ డిజైన్, ప్రొఫెషనల్ లుక్ అందిస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం పెద్ద హారాలు, చోకర్స్, గ్రాండ్ స్టేట్మెంట్ లుక్ ఇస్తాయి. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా మోడర్న్ స్టోన్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. జుట్టు పోనీగా కట్టి వెళ్ళితే రాయల్టీ లుక్, వేవీ హెయిర్ లేదా కర్ల్స్ వేసుకుంటే క్యూట్ టచ్ గ్యారంటీ. (చదవండి: beauty: ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..! కుంకుమ పువ్వుతో..) -
Diwali 2025: ఇంటికి వెలుగుల మెరుపులు తెప్పిద్దాం ఇలా..!
దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్ తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..ఆహ్లాదకరమైన ప్రకాశం: ఆధునికమైన, విలాసవంతమైన టచ్ కోసం వెచ్చని ఎల్ఈడీ లైట్లను ఉపయోగించవచ్చు. ఇంటి లోపల, మెట్ల భాగంలో ఈ లైట్లను ఏర్పాటు చేస్తే అధిక విద్యుత్తు ఖర్చు కాకుండానే పరిసరాలను ఆహ్లాదకరంగా, కాంతివంతం చేస్తాయి.లైట్ల తోరణం: ప్రకాశవంతమైన తోరణాన్ని గుమ్మానికి ఏర్పాటు చేస్తే, పండగ ముంగిట్లోకి ఇట్టే వస్తుంది. ఇక సిల్క్ టాసెల్స్, పూసలు లేదా ఫెయిరీ లైట్లతో కూడిన స్ఫటికాలనూ ఎంచుకోవచ్చు, ఇది సంప్రదాయాన్ని అధునాతనంగా చూపడంతో పాటు అతిథుల స్వాగతానికి అందమైన కాంతిని అందిస్తుంది.పేపర్ లాంతర్లు: రంగు రంగుల కాగితపు పొరలతో చేసే ఈ లాంతర్లు కాంతిని వినూత్నంగా వెదజల్లుతుంటాయి. ఈ లాంతర్లు బాల్కనీలు, ఇంటి ముందు వసారాలాంటి స్థలాల్లో వేలాడదీయాలి. మెటాలిక్ గోల్డ్, క్రీమ్ లేదా పేస్టెల్ షేడ్స్లో వీటిని మనమే తయారు చేసుకోవచ్చు. కొవ్వొత్తి స్టాండ్లు: కలప, ఇత్తడి లేదా పాలరాతి శిల్పాకృతులను పోలి ఉండే కొవ్వొత్తి స్టాండ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి వెదజల్లే అందం ఇంటికి మెరుపును తీసుకువస్తుంది. పండుగ వాతావరణానికి ఈ కొవ్వొత్తుల స్టాండ్లు మేలైన ఎంపిక. వారసత్వంగా వస్తున్న కొన్ని గృహాలంకరణ వస్తువులను, తిరిగి బాగు చేయించి కొవ్వొత్తుల స్టాండులుగా ఉపయోగించవచ్చు. మట్టి దీపాలు: టెర్రకోట దీపాలు ఆధునిక ఇంటీరియర్లను వారసత్వ సౌందర్యానికి అనుసంధానిస్తాయి. విలాసవంతమైన టచ్ కోసం వాటిని హైలైట్ చేయవచ్చు. వీటిని కిటికీలు, బాల్కనీలు, లివింగ్రూమ్లు, ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దవచ్చు. కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా తయారు చేసుకొని, ఉపయోగించవచ్చు. పర్యావరణానికి మేలు చేసేవే కాదు, రీ సైక్లింగ్ పద్ధతుల వల్ల కూడా మేలైన ఫలితాలను పొందవచ్చు. ఎన్నార్ -
ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..!
చిత్రంలోని ఈ మిర్రర్ ఒక స్మార్ట్ బ్యూటీ గాడ్జెట్. ఇది మీ అందాన్ని, చర్మ సంరక్షణను మెరుగుపరచడానికి రూపొందించబడింది. సాధారణంగా ఇంట్లో ఉపయోగించే అద్దానికి అధునాతన సాంకేతికతను జోడించి స్మార్ట్ డివైస్గా మార్చారు. ఈ అద్దం ముఖాన్ని విశ్లేషించి, చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలు, ఎర్రటి గుల్లలు, గీతలు, చర్మ రంధ్రాలు, నల్లటి వలయాలను ఇట్టే గుర్తిస్తుంది. ఇది ఒక సమగ్ర చర్మ నివేదికను అందించి, ఏ ఉత్పత్తులు వాడితే మంచి ఫలితాలు వస్తాయో సూచిస్తుంది. అలాగే ఈ మిర్రర్కి ఉన్న ఎల్ఈడీ లైట్లు చాలా ప్రత్యేకమైనవి. ఇవి వివిధ రకాల వాతావరణాలను అనుకరిస్తాయి. ఉదాహరణకు, సన్ లైటింగ్, ఆఫీస్ లైటింగ్, షాపింగ్ మాల్స్ లైటింగ్, నార్మల్ లైటింగ్, నైట్ లైటింగ్ ఇలా ఐదు రకాల లైటింగ్ మోడ్లను ఇది అందిస్తుంది. దీనితో మీరు వేసే మేకప్ వివిధ ప్రదేశాల్లో ఎలా కనిపిస్తుందో ముందే తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ డివైస్ 64జీబీ సామర్థ్యంతో ఏర్పడింది. దాంతో చర్మ ఆరోగ్య నివేదికలు, మేకప్ స్టైల్ వీడియోలు ఇలా డేటాను సురక్షితంగా నెట్ సాయంతో సేవ్ చేసుకోవచ్చు. అదనంగా, ఈ డివైస్ ఏకకాలంలో నాలుగు యూజర్ అకౌంట్లను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒకే అద్దాన్ని కుటుంబంలోని నలుగురు సభ్యులు వాడుకోవచ్చు. దీనికి ఒక వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. ఇది చాలా సౌకర్యవంతమైన ఫీచర్. ఈ అద్దాన్ని సులభంగా పోర్ట్రైట్ (నిలువుగా) లేదా ల్యాండ్స్కేప్ (అడ్డంగా) మోడ్లోకి మార్చుకోవచ్చు. దీనివల్ల ఈ డివైస్లో యూట్యూబ్ వీడియోలు లేదా ఇతర కంటెంట్ను చూస్తున్నప్పుడు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇదే స్మార్ట్ మిర్రర్స్లోని కొన్ని మోడల్స్లో వాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంటుంది. దాంతో చేతులు ఉపయోగించకుండానే వాయిస్ కమాండ్స్తో అద్దాన్ని నియంత్రించవచ్చు.కుంకుమ పువ్వు, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే ముఖానికి ప్రత్యేకమైన మెరుపునిస్తుంది. ఒక పావు టీ స్పూన్ కుంకుమ పువ్వుని, ఒక టేబుల్ స్పూన్ పాలలో రాత్రి అంతా నానబెట్టి ఉంచాలి. మరుసటి రోజు ఆ పాలలో కలబంద గుజ్జు వేసి క్రీమీగా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఎండబెట్టిన గులాబీ రేకుల గుజ్జును అర టీ స్పూన్ వేసుకుని, బాగా కలిపి ముఖానికి పట్టించాలి. అనంతరం సుమారు 30 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. -
గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందులు వాడాల్సిందేనా..?
నా వయసు 32 సంవత్సరాలు. నేను ప్రస్తుతం గర్భం కోసం ప్లాన్ చేస్తున్నాను. డాక్టర్ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు వాడమన్నారు. ఇవి నిజంగా అవసరమా? ఎప్పుడు మొదలు పెట్టాలి? దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?– దీప్తి, హైదరాబాద్ . గర్భం కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి మహిళ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. గర్భధారణ మొదటి కొన్ని వారాల్లోనే బిడ్డ మెదడు, వెన్నెముక వంటి ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో శరీరంలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే, బిడ్డలో ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్’ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వెన్నెముక లేదా మెదడు అభివృద్ధి సరిగా జరగకపోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. గర్భధారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ లోపాలను చాలా వరకు నివారించవచ్చు. ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ గ్రూపుకు చెందిన నీటిలో కరిగే విటమిన్లు. సాధారణంగా శరీరానికి అవసరమైన మోతాదులో తీసుకోవడం పూర్తిగా సురక్షితం. అదనంగా తీసుకున్న ఫోలిక్ యాసిడ్ శరీరంలో నిల్వ కాకుండా మూత్రం ద్వారా బయటకు వెళుతుంది కాబట్టి, ఎక్కువ మోతాదులో తీసుకున్నా హానికరం కాదు. రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ గర్భధారణకు ముందు నుంచే మొదలు పెట్టి, గర్భం వచ్చిన తర్వాత కనీసం మొదటి మూడు నెలలు వాడటం ఉత్తమం. ఫోలిక్ యాసిడ్తో పాటు ఐరన్ , విటమిన్ బి12, విటమిన్ డీ, క్యాల్షియం వంటి పోషకాలు కలిగిన మల్టీవిటమిన్ మాత్రలు కూడా వాడితే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. ఇవి సాధారణంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఇవ్వవు. కొందరికి స్వల్పంగా వాంతులు లేదా మలబద్ధకం అనిపించవచ్చు, అలాంటప్పుడు వైద్యుడి సలహాతో మాత్రలను మార్చుకోవచ్చు. మొత్తానికి, మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ వాడడం ప్రారంభించండి.నా వయసు 38 సంవత్సరాలు. ఇటీవలి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా వింటున్నాను. ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు?– శ్వేత, విజయనగరం. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్. బ్రెస్ట్ కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ట్యూమర్ ఏర్పడుతుంది. ఇది చికిత్స చేయకపోతే ఇతర అవయవాలకు వ్యాపించవచ్చు. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు, అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. దీని లక్ష్యం మహిళల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేయడం. వయసు పెరగడం, వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు, అధిక బరువు, శారీరక వ్యాయామం తగ్గడం, మద్యం సేవించడం, హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తల్లి, అక్క, చెల్లెలు లేదా పిన్ని వంటి బంధువులలో ఎవరికైనా బ్రెస్ట్ లేదా ఓవరీ క్యాన్సర్ ఉన్నట్లయితే, మీకు కూడా ఆ ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వైద్యుల సూచనతో హెరిడిటరీ జీన్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇవి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి మహిళా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. మొదట అల్ట్రాసౌండ్, తర్వాత మామోగ్రఫీ చేయించడం ఉత్తమం. ఇంట్లో నెలకు ఒకసారి స్వయంగా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే బ్రెస్ట్లో ఏదైనా గడ్డ, చర్మం మార్పు, నిపుల్ నుంచి స్రావం, నొప్పి లాంటివి ఉన్నాయా అని గమనించడం. ఏ మార్పు గమనించినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్ లేదా సర్జన్ను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామం, బరువు నియంత్రణ, ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, పాలిచ్చే తల్లిగా ఉండటం. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముందస్తు జాగ్రత్తలే ఆరోగ్యానికి ఉత్తమ రక్షణ.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!) -
జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!
ఉదయాన్నే వేడిగా గొంతులో ఒక టీ చుక్క పడితేనే కానీ భారతీయులకు సూర్యోదయం అయినట్లుండదు. ఫిల్టర్ కాఫీకి అలవాటు పడిన వాళ్లైతే నాసికను తాకే ఆ ప్రాణవాయువులకే లేచి కూర్చుంటారు. ఇక బిర్యానీకి వేళాపాళా ఉండదు. ఇప్పుడు సీటీల్లో 4 ఏఎం బిర్యానీలు కూడా వచ్చేశాయి! సరే, సమోసా గురించి చెప్పేదేముంది? స్నాక్స్లో సెలబ్రిటీ! వేడుకలలో జిలేబీ, గులాబ్ జామూన్.. మస్ట్, ది బెస్ట్. ఈ ఆరు రుచులు లేకుండా భారతదేశంలో తెల్లారదు, చీకటి పడదు. విశేషం ఏంటంటే, వీటిల్లో ఏ ఒక్కటి కూడా భారతీయులది కాదు! అంటే మనం కనిపెట్టింది కాదు! మరి, కనిపెట్టిన ఆ మహానుభావులెవరు? చాయ్ / టీ చైనా పానీయం∙క్రీ.పూ. 2700 ప్రాంతంలో చైనాలో ‘టీ’ ని కనిపెట్టటం, కాయటం మొదలైంది. అయితే భారతదేశానికి ‘టీ’ తాగే అలవాటు చైనా నుండి రాలేదు. బ్రిటిష్ వాళ్లు మోసుకొచ్చారు. 1800ల నుండి 1947లో దేశం విడిచి వెళ్లే వరకు బ్రిటిష్ వాళ్లు మన దగ్గర తేయాకు తోటల్ని పెద్ద మొత్తంలో పండించి, ‘టీ’ని పానీయంగా వినియోగించారు. ఆ అలవాటే భారతీయులకూ వచ్చేది. చివరికి ‘టీ’ పుట్టిల్లు భారతదేశమే అనుకునేంతగా జన జీవనంలో కలిసిపోయింది. భారతదేశంలో దాదాపు 80 శాతం కుటుంబాలు టీని సేవిస్తున్నాయి. ప్రపంచంలో నీటి తర్వాత ఎక్కువ మంది తాగే పానీయం ‘టీ’ నే! ‘కమీలియా సెనన్సెస్’ మొక్కల నుంచి (వాడుకలో తేయాకు) తెంపుకొచ్చిన ఆకులు క్రీ.పూ. 2732లో చైనా చక్రవర్తి షెన్ నుంగ్ చేతి నుంచి జారి మరిగే నీటిలో పడినప్పుడు వచ్చిన కమ్మటి పరిమళం ‘టీ’ ఉద్భవించటానికి కారణం అయిందని చరిత్రకారులు అంటారు. చైనాలో కొన్నేళ్ల పాటు తేయాకు కూడా కరెన్సీగా చలామణి అయింది! ఆయుర్వేదంలో ఔషధ ప్రయోజనాలకు తేయాకును వాడటం అన్నది నేటికీ అన్ని దేశాల్లోనూ ఉంది. ఇక ‘టీబ్యాగు’లను 1908లో న్యూయార్క్లోని ఒక టీ వ్యాపారి అనుకోకుండా కనిపెట్టారు. హోల్సేల్ కొనుగోలు దారులకు వివిధ రకాలైన తేయాకు నమూనాలను పంపేందుకు ఆయన చిన్న చిన్న టీ బ్యాగుల్లో వాటిని నింపేవారు. అలా క్రమంగా టీబ్యాగులు వచ్చాయి. సమోసా ఈజిప్టు ఫలహారంమనమెంతో ఇష్టంగా తినే ‘సమోసా’ కూడా మనది కాదు. కానీ, చాలా ప్రపంచ దేశాల్లో సమోసాకు ‘భారతీయ వంటకం’గా పేరు పడిపోయింది. చరిత్రకారులు సమోసాను క్రీ.శ. 10వ శతాబ్దపు మధ్యప్రాచ్య వంటకంగా గుర్తించారు. ఇరానియన్ చరిత్రకారుడు అబోల్ఫజల్ బెహకీ దీనిని తన గ్రంథమైన ‘తారిఖ్–ఇ బెహఘి’లో ‘సబోసా’గా పేర్కొన్నారు. పరిమాణంలో సమోసా చిన్నదిగా ఉండటంతో, ఇది సౌకర్యవంతమైన ప్రయాణ చిరుతిండిగా, సులభంగా జీను సంచుల్లో ప్యాక్ చేసుకుని తినటానికి వీలైనదిగా ప్రాచుర్యం పొందింది. 10వ శతాబ్దపు మద్యప్రాచ్య దేశాలంటే –బాగ్దాద్, ఇరాక్, పర్షియా, ఉత్తర ఆఫ్రికాలతో కూడిన బైజాంటైన్ సమ్రాజ్యం; అలాగే ప్రస్తుత టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు. ∙సమోసా వంటకం.. మధ్య ఆసియా వాణిజ్య మార్గాల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలంలో భారత ఉపఖండానికి చేరుకుంది. సమోసా త్రిభుజాకారంలో ఉండటానికి కారణం, మొదట దానిని కనిపెట్టిన వారు ఈజిప్టులో లేదా నాటి ఆసియా ప్రాంతాలలో ఉన్న పిరమిడ్ల ఆకృతిలో వాటిని తయారు చేయటమేనని అంటారు. సమోసా భారతదేశానికి వచ్చిన తొలినాళ్లలో కేవలం రాజకుటుంబాలు, ఉన్నతవర్గాల విందులలో మాత్రమే కనిపించేది. చివరికి ఇప్పుడు సామాన్యుల ఆహారంగా మారింది. పర్షియన్ భాషలో త్రిభుజాన్ని ‘సాన్బోసాగ్’ అనీ, ‘సాగోషాగ్’ అనీ అంటారు. అలా వచ్చిందే ‘సమోసా’ అనే మాట. సెప్టెంబర్ 5 వరల్డ్ సమోసా డే. జిలేబీటర్కిష్ తీపి చుట్లుజిలేబీ పశ్చిమ ఆసియా / పర్షియన్ మూలాలు కలిగిన తీపి వంటకం. ఆ ప్రాంతాలలో దీనిని ‘జలాబియా’ లేదా ‘జోల్బియా’ అని పిలుస్తారు. జిలేబీని 15వ శతాబ్దంలో పర్షియన్లు, ప్రధానంగా టర్కిష్ వ్యాపారులు దక్షిణాసియాకు రుచి చూపించారు. క్రమంగా ఇది అద్భుతమై రుచి కలిగిన, చుట్లు చుట్లుగా వేయించిన తీపి వంటకంగా పరిణామం చెందింది.∙విదేశాల నుంచి వచ్చినప్పటికీ జిలేబీ భారతీయ సంస్కృతి, వంటకాలతో లోతుగా ముడిపడి ఉంది. ప్రధానంగా పండుగలు, వివాహాలు, మతపరమైన నైవేద్యాలలో జిలేబీ కనిపిస్తుంది. క్రీ.శ. 10 వ శతాబ్దం నాటి బాగ్దాదీ వంటల పుస్తకంలో ఉన్న ప్రస్తావనను బట్టి జిలేబీ అంతకు ముందు నుంచే ఉందని, ‘జలాబియా’ అనే పురాతన మిఠాయికి ఇది ఆధునిక రూపం అని అనుకోవలసి వస్తుంది. క్రమేణా 15వ శతాబ్దం నాటికి జిలేబీ భారతదేశంలో అందరికీ నచ్చే తీపి వంటకం అయింది. అన్ని వంట పుస్తకాలలో, సందర్భాలలో చోటు సంపాదించుకుంది. బిర్యానీ పర్షియన్ పరిమళంభారతీయ వంటకంగా చాలా మంది పొరపడే బిర్యానీ, పశ్చిమ ఆసియా పాకశాస్త్ర నిపుణులు కనిపెట్టిన అద్భుతం అని చరిత్ర చెబుతోంది. పర్షియా భాష నుంచి వచ్చిన పదమే ‘బిర్యానీ’ అన్నది. పర్షియాలో ‘బిరియన్’ అంటే ‘వంటకు ముందు వేయించినది’ అని అర్థం. ‘బిరింజ్’ అంటే బియ్యం. అలా ‘బిర్యానీ’ అనే మాట స్థిరపడింది. చారిత్రక ఆధారాలను బట్టి క్రీ.శ. 1398లో తైమూర్ భారతదేశం పైకి దండయాత్రకు రావటానికి, బిర్యానీకి పుట్టుకకు మధ్య సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సైనికుల కోసం వారు బియ్యం, మాంసం కలిపిన వంటకాన్ని కుండలలో వండారని, అలా తయారైందే బిర్యానీ అని ఆధునిక చరిత్రకారులు రాశారు. ఇంకో ఆధారం... అరబ్ వ్యాపారులు, తమిళులు రాసుకున్న పుస్తకాలలో క్రీ.శ 2 నాటికే ‘ఓన్ సోరు’ అని అచ్చంగా బిర్యానీ వంటి వంటకమే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదీ బిర్యానీని ఇష్టపడే సినీ జాతీయ స్థాయి సెలబ్రిటీలకైతే లెక్కే లేదు. పేరుకు హైదరాబాదీ బిర్యానీ అయినా, బిర్యానీ షెఫ్ మహానుభావులు మాత్రం పశ్చిమ ఆసియా వాళ్లే.ఫిల్టర్ కాఫీ యెమెన్ ఘుమఘుమ16వ శతాబ్దంలో మక్కా తీర్థయాత్రకు వెళ్లిన కర్ణాటకకు చెందిన సూఫీ సాధువు బాబా బుడాన్ భారతదేశానికి తిరిగి వచ్చే మార్గంలో ఫిల్టర్ కాఫీని కనుగొన్నారనటానికి కొన్ని చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. బాబా బుడాన్ యెమన్లోని మోచా ప్రాంతం నుండి ఏడు కాఫీ గింజలను తీసుకువచ్చారు. వాటిని అప్పటి పానీయాల తయారీ విధానం ప్రకారం మద్యంలో కాకుండా; పాలు లేదా చక్కెర తోనూ కాకుండా, కేవలం వేడి నీళ్లలో కాఫీ గింజల సారాన్ని తీసి ఫిల్టర్ కాఫీ తయారు చేశారు. (మామూలు కాఫీని కనుగొంది మాత్రం 9వ శతాబ్దపు ఇథియోపియన్లు).భారతదేశంలోని మొట్టమొదటి కాఫీ హౌస్ 1936లో బొంబాయిలోని చర్చిగేట్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకే దేశ వ్యాప్తంగా కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైంది. ఇండియన్ ఫిల్టర్ కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బాబా బుడాన్.. పాలు, చక్కెర లేని ఘుమఘుమల ఫిల్టర్ కాఫీని కనిపెడితే; కాలక్రమంలో భారతీయులు పాలు, చక్కెర కలిసిన కమ్మని పరిమళ భరిత ఫిల్టర్ కాఫీని తయారు చేశారు. ఇందుకు ఫిల్టర్ కాఫీ పౌడర్ (చికోరీతో కలిసినది), ఫిల్టర్ కాఫీ డబ్బా (స్టెయిన్లెస్ స్టీల్), వేడి నీళ్లు అవసరం అవుతాయి. గులాబ్ జామున్ మొఘల్ మిఠాయిగులాబ్ జామున్ భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే ‘డెజర్ట్’లలో ఒకటి. డెజర్ట్ అంటే తెలిసిందే కదా... భోజనానంతరం తినే స్వీటు. ఈ గులాబ్ జామూన్ను ‘లుక్మత్ అల్ ఖాదీ’ అనే అరబిక్ తీపి కుడుములకు (తీపి ద్రావణంలో నానవేసిన ‘ఫ్రైడ్ పిండి ఉండలు’) ఒక కొత్త రూపంగా మొఘలులు కనిపెట్టారు. ఒక అభిప్రాయం ప్రకారం, గులాబ్ జామూన్ను మొఘల్ చక్రవర్తి ఆస్థాన షెఫ్ సృష్టించాడు. అందుకోసం ఆ షెఫ్ పర్షియన్, టర్కిష్ డెజర్ట్ల నుండి ప్రేరణ పొందాడు. ఇంకో సిద్ధాంతం ప్రకారం ఇది తీపి ద్రావణంలో నానబెట్టిన ప్రాచీన భారతీయ వంటకానికి మరొక రూపం. ఈ విధంగా చూస్తే గులాబ్ జామూన్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయనుకోవాలి. పశ్చిమ బెంగాల్లో ‘లేడీకేనీ’ రకం గులాబ్ జామూన్ ప్రసిద్ధి. 1850లలో కలకత్తాకు చెందిన మిఠాయి తయారీదారులలో ఒకరైన భీమ్ చంద్ర నాగ్కు... నాటి గవర్నర్ జనరల్ లార్డ్ చార్లెస్ కానింగ్ నుండి తన సతీమణి లేడీ కానింగ్ కోసం ఒక ప్రత్యేకమైన స్వీట్ తయారు చేయాలని ఆదేశాలు వచ్చాయి. భర్తతో ఉండేందుకు ఆమె భారతదేశానికి వస్తోంది కనుక ఒక కొత్త తియ్యని వంటకంతో ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేయాలని లార్డ్ చార్లెస్ అలాంటి ఆదేశాన్ని ఇచ్చారు. మొత్తానికి భీమ్ చంద్ర నాగ్... లేడీ కానింగ్ కోసం ఒక కొత్త గులాబ్ జామూన్ వంటకాన్ని తయారు చేయటంలో విజయం సాధించారు. ఆ తీపి పదార్థం లేడీ కానింగ్ను అమితంగా ఆకట్టుకోవటంతో ఆ స్వీట్కు లేడీ కానింగ్ అని పేరొచ్చింది. క్రమేణా ఆ మాట ‘లేడీకేనీ’గా మారింది. (చదవండి: వందేళ్ల హైకింగ్ స్టార్..! సెంచరీ వయసులో మొత్తం ఫ్యామిలీతో..) -
వందేళ్ల హైకింగ్ స్టార్..! సెంచరీ వయసులో మొత్తం ఫ్యామిలీతో..
వయసు వంద దాటాక కుర్చీలో కూర్చోవడం బోరుగా అనిపించిందట! జపాన్కు చెందిన కోకిచీ అకుజావాకు. దీంతో, వెంటనే హైకింగ్ స్టిక్ పట్టుకుని, మొత్తం ఫ్యామిలీతో ట్రెక్కింగ్ పార్టీ స్టార్ట్ చేసి, రికార్డు సృష్టించాడు. నిజానికి వందేళ్ల వయసు వరకు బతికి ఉండటమే గగనం అనుకుంటే, అప్పటికీ సజీవంగా ఉండేవారిలో చాలామంది కుర్చీలో కూర్చుని టీవీ రిమోట్ కంట్రోల్ పట్టుకోవడం తప్ప వేరేమీ చేయలేరు. కాని, 102 ఏళ్ల వయసు నిండిన ఈ బాబాయి మాత్రం రిమోట్కి బదులు హైకింగ్ స్టిక్ పట్టుకుని నేరుగా 12,000 అడుగుల ఫుజీ శిఖరాన్ని అధిరోహించాడు. అంతే కాదు, తన 70 ఏళ్ల కూతుర్ని కూడా ‘హే, లెట్స్ గో!’ అంటూ వెంట తీసుకెళ్లాడు. అలా మొత్తం ఫ్యామిలీతో కలిసి ఒక పెద్ద పిక్నిక్లా ట్రెక్కింగ్ పూర్తి చేశారు. మధ్యలో కొంచెం అలసటగా అనిపించినా, స్నేహితులు, కూతురు, మనవరాలు ఇచ్చిన మోటివేషన్ ఆయనను మళ్లీ కదిలించింది. మొత్తం రెండు రాత్రులు పర్వత మార్గంలో టెంట్ వేసి గడిపి, చివరికి శిఖరాన్ని చేరి, ఆ అపురూప క్షణాలను ఫేస్బుక్ లైవ్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విజయంతో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా వెంటనే సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఇదేం.. మొదటి రికార్డ్ కాదు.నిజానికి, అకుజావా 96 ఏళ్ల వయసులోనూ ఇదే పర్వతాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నూటారెండేళ్ల వయసులో ఫుజీ వైపు అడుగులు వేశాడు. ‘పర్వతం ముందు అందరూ సమానులే. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అసలు ఆ గేమ్’ అంటాడాయన. ప్రస్తుతం ఆయన ఒక వృద్ధాశ్రమంలో వాలంటీర్గా గడుపుతూ, ఇంట్లో పెయింటింగ్స్ వేస్తూ, ఫ్యామిలీకి కొత్త కొత్త ఆర్ట్ రిక్వెస్టులు నెరవేర్చుతూ బిజీగా ఉంటున్నాడు. (చదవండి: ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్లు, పేస్ట్రీలు ఉండవు..) -
పిప్పలుడి గర్వభంగం
కశ్యపుడి వంశంలో పిప్పలుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు శమదమాది సద్గుణ సంపన్నుడు. శీత వాత ఆతపాదులను ఒకేరీతిలో సహించగల స్థిరచిత్తుడు. వేదవేదాంగాలను అధ్యయనం చేసిన పండితుడు. పిప్పలుడు నిత్య దరహాస ముఖారవిందంతో ఉండేవాడు. నిత్య నైమిత్తిక కార్యాలను క్రమం తప్పకుండా ఆచరించేవాడు. ఒకసారి పిప్పలుడు తపస్సు ప్రారంభించాడు. అతడి తపస్సు నానాటికీ తీవ్రం కాసాగింది. అతడు తపస్సు ప్రారంభించి వెయ్యేళ్లు గడిచింది. కేవలం వాయుభక్షకుడిగా ఉంటూ నిశ్చలంగా ఒకేచోట కూర్చుని తపస్సు చేస్తుండటంతో అతడి శరీరం శల్యావశిష్టమైంది. శరీరంపై చీమల వంటి కీటకాలు పుట్టలు పెట్టాయి. వాటి చుట్టూ తీగలు, లతలు పాకాయి. పిప్పలుడి చుట్టూ ఏర్పడిన పుట్టలలోంచి అగ్నిజ్వాలలు వెలువడసాగాయి. దేవతలు అతడి తపోతీవ్రతను నివ్వెరపోయి తిలకించసాగారు. అతడి తపస్సు ఎన్నాళ్లకూ చెదరకపోవడంతో సంతోషించిన దేవతలు, అతడి మీద పుష్పవృష్టి కురిపించారు.‘విప్రోత్తమా! నువ్వు వేదవేదాంగ కోవిదుడవు. శ్రుతిస్మృతి విహిత ధర్మజ్ఞుడవు. నీ తపస్సుకు మేమంతా సంతోషించాం. ఏ వరాలు కావాలో కోరుకో! తప్పక నెరవేరుస్తాం’ అని పలికారు.దేవతల మాటలు వినిపించగానే పిప్పలుడు కళ్లు తెరిచాడు. ఎదుట కనిపించిన దేవతలకు వినయంగా నమస్కరించాడు. ‘దేవతలారా! మీ దయానుగ్రహాలకు పరవశుడనయ్యాను. నేను విద్యాధరుడనై, కామగమనుడనై, సువర్ణ రత్నఖచిత దివ్యరథంలో సకల లోకాలలో సంచరించేలా వరాన్ని అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు. దేవతలు ‘తథాస్తు’ అని వరం అనుగ్రహించి, అంతర్ధానం చెందారు.దేవతల వరప్రభావంతో పిప్పలుడు సకల విద్యావిశారదుడై, విద్యాధరుడయ్యాడు. మణిమయ స్వర్ణ విమానంలో సకల లోకాలలోనూ యథేచ్ఛగా సంచరించసాగాడు. జగమంతా తన స్వాధీనమైందని సంబరపడసాగాడు. సంకల్ప మాత్రాన ఎక్కడికైనా స్వేచ్ఛా విహారం చేయగల శక్తి సంక్రమించడంతో పిప్పలుడిలో గర్వం పెరిగింది.‘ముల్లోకాలలోనూ నన్ను మించినవాడు వేరొకడు లేడు. దేవ దానవ మానవులలో నన్ను మించినవాడు మరొకడు ఉండడు’ అనుకోసాగాడు.ఒక నదీతీరంలో నివాసం ఉండే ఒక సారసపక్షి పిప్పలుడి తీరుతెన్నులను చాలాకాలంగా గమనించసాగింది. ఒకనాడు ఆ సారసపక్షి ‘ఓ విప్రోత్తమా! జగమంతా నీ స్వాధీనమైందని, సంకల్పమాత్రాన సకలలోక సంచారం చేయగలుగుతున్నందున మహామహిమాన్వితుడవయ్యానని గర్విస్తున్నావు. ఘోర తపస్సులు చేసి, దేవతల నుంచి అనేక దివ్యవరాలు పొందినా, గర్వోన్నతి వల్ల అధోగతి పాలైన వారి గురించి నువ్వు ఎరుగవు. నువ్వు పరాపరాలను ఎరుగవు. నువ్వు మూఢుడివి. కుండలపుత్రుడైన సుకర్ముడనే విప్రుడు పరాపరాలైన ఆత్మానాత్మలను ఎరిగిన విజ్ఞుడు. అతడితో సమానుడైన జ్ఞానవంతుడు ముల్లోకాలలోనూ మరొకడు లేడు. వేదాధ్యయన సంపన్నుడు, సకల శాస్త్రకోవిదుడు అయిన సుకర్ముడు యజ్ఞయాగాదులేవీ ఆచరించలేదు. బాల్యం నుంచి అనునిత్యం మాతృపితృ సేవలో తరిస్తూ, ఆ కర్మయోగ ప్రభావంతో మహాజ్ఞానిగా ఎదిగాడు. నువ్వు జ్ఞానహీనుడివై అనవసరంగా గర్విస్తున్నావు’ అని పలికింది.సారసపక్షి మాటలకు పిప్పలుడు ఉక్రోషం చెంది, ‘పక్షి రూపంలో నన్ను నిందిస్తున్నావు. దేవ దానవ యక్ష గంధర్వాదులలో నువ్వెవరివి? పరాపరాలైన ఆత్మానాత్మలు ఏవి? వాటి స్వరూపమేది? చెప్పు’ అన్నాడు.‘కుండల పుత్రుడైన సుకర్ముడి వద్దకు వెళ్లి, అడుగు. ఆత్మానాత్మ స్వరూపాన్ని అతడే నీకు చెప్పగలడు’ అని పలికింది సారసపక్షి.పిప్పలుడు కుండలుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సుకర్ముడు తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తూ కనిపించాడు. అది చూసి, పిప్పలుడు ద్వారం వద్దనే నిలిచిపోయాడు.సుకర్ముడు ద్వారం వద్ద నిలిచి ఉన్న పిప్పలుడిని గమనించి, వెంటనే లేచి వెళ్లి అతడిని స్వాగతించి, లోనికి తీసుకువచ్చాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు.‘పిప్పలా! నీ వృత్తాంతం నాకు తెలుసు. సారసపక్షి నీ గర్వాన్ని పరిహసించి, నా వద్దకు పంపడం వల్లనే ఇలా వచ్చావు కదూ’ అన్నాడు సుకర్ముడు.సుకర్ముడి మాటలతో పిప్పలుడికి కాసేపు నోట మాట రాలేదు. కొద్దిసేపటికి తేరుకుని, ‘నువ్వు మహాజ్ఞానివని, పరాపరాలైన ఆత్మానాత్మలను నువ్వెరుగుదువని ఆ పక్షి నాతో చెప్పింది. ఆత్మానాత్మల నిజస్వరూపమేది? నాకు వివరంగా చెప్పు’ అని అడిగాడు.పిప్పలుడికి తన పట్ల శంక తొలగిపోలేదని అతడి ప్రశ్నల ద్వారా గ్రహించాడు సుకర్ముడు.అతడికి విశ్వాసం కలిగించడానికి ఇంద్రాది దేవతలను ఆహ్వానిస్తూ ఆవాహన మంత్రాలు పఠించాడు.వెంటనే అక్కడ ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ‘సుకర్మా! మమ్మల్ని ఎందుకు పిలిచావు?’ అని అడిగారు.‘దేవతలారా! ఈ పిప్పలుడికి విశ్వాసం కలిగించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను. అంతకంటే వేరే ప్రయోజనం ఏదీ ఆశించి కాదు. ఇక మీరు మీ నిజస్థానాలకు వెళ్లవచ్చు’ అన్నాడు.‘నిష్ఫలంగా వెళ్లడం మాకు తగదు. ఏదైనా వరం కోరుకో’ అన్నారు దేవతలు.‘నాకు అనవరతం మాతా పితృభక్తిని, వారికి వైకుంఠవాస ప్రాప్తిని కలిగించండి. అంతే చాలు’ అన్నాడు సుకర్ముడు.దేవతలు ‘తథాస్తు’ అని పలికి అంతర్ధానమయ్యారు.ఇదంతా పిప్పలుడు చేష్టలుడిగి తిలకించాడు.సుకర్ముడు అతడితో ‘పిప్పలా! నిన్ను నా వద్దకు పంపిన సారసపక్షి సాక్షాత్తు చతుర్మఖ బ్రహ్మ’ అని చెప్పి, ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.∙సాంఖ్యాయన -
కథాకళి: ముప్పు
భూమికి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీ నుంచి వచ్చిన ఆ వ్యోమనౌకలోంచి కొందరు దిగారు. వారందరి సగటు ఎత్తు నాలుగు అడుగుల రెండు అంగుళాలు. వారు తమ వెంట తెచ్చిన ఓ డజనుమంది ఖైదీలని భూగోళం మీద దింపారు. వారంతా జంటలే. వారి చేతులకి వేసిన బేడీలని విప్పారు. ‘‘మీరు చేసిన ఘాతుకాలకి మిమ్మల్ని మనం గ్రహం నుంచి వెలివేయడంతో ఇక్కడికి తెచ్చి వదలమనే తీర్పుని అమలు చేస్తున్నాం. చివరగా మీరు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా?’’ ఆ నౌక కెప్టెన్ అడిగాడు.‘‘మా స్వగ్రహం నుంచి ఇలా దూరంగా మమ్మల్ని పంపడం సబబు కాదని, ఇక మీదట ఎలాంటి నేరాలు చేయమని, తిరిగి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమని కోరుతున్నామని మన రాజుకి చెప్పండి.’’ ఆ డజనుమందిలోని ఒకరి భార్య ఆవేదనగా చెప్పింది.‘‘చెప్తాం. మీ సందేశం ఆయనకి చెప్పినా ప్రయోజనం ఉంటుందని అనుకోము. ప్రశాంతంగా జీవించేవారికే ఆ గ్రహం. మనలో ఎవరిలో నేరప్రవృత్తి ప్రవేశిస్తుందో వారి డీఎన్ఏ పుట్టేవారు మన గ్రహంలో ఉండకూడదని, వారిని వెలివేయాలనే చట్టాన్ని మన రాజుగారు అమలు చేశారు. ఇది మన గ్రహంలోని శాంతికి ముఖ్యమని రాజుగారు భావిస్తున్నారు.’’‘‘అక్కడ మీరు చేసిన నేరం ఘోరాతి ఘోరమైంది. మన గ్రహవాసులు అందర్నీ ఒకేసారి చంపే మారణాయుధాన్ని తయారు చేసి, మన రాజుని బెదిరించి డబ్బు కోరారు. కాబట్టి గ్రహ బహిష్కరణ శిక్షని అమలు జరిపి వెళ్ళిపోతున్నాం.’’ మరొకరు చెప్పారు.వాళ్ళు ఆ వ్యోమనౌకలోకి ఎక్కడం, అది పైకిలేచి క్రమంగా దూరమై కనపడకుండా పోవడాన్ని చూశారు. క్షణాల్లో కనుమరుగైన ఆ వ్యోమనౌకని చూశాక వారిలోని ఒకడు క్రూరంగా నవ్వి చెప్పాడు.‘‘వాళ్ళు తిరిగి వెళ్ళాక కాని మన శక్తి తెలీదు. సమయానికి మనం డీయాక్టివేట్ చేయడం లేదు కనుక ఆ మారణాయుధాలన్నీ పేలిపోయి, ఆ గ్రహానికి వెళ్ళాక వాళ్ళకి అక్కడ శ్మశానం తప్ప మరేం కనిపించకపోవడంతో మన తడాఖా అర్థమవుతుంది.’’ఆ నేరస్తులంతా చుట్టూ చూశారు. రాళ్ళు, రప్పలు, మట్టి. దూరంగా పచ్చదనం కనిపించడంతో అటువైపు నడిచారు. ఆ చెట్లకి కాసిన పళ్ళవంక చూసి వారిలోని ఒకరు ఆనందంగా చెప్పారు.‘‘అమ్మయ్య! ఈ గ్రహంలో తిండికీ, నీళ్ళకి కొరత లేదు.’’‘‘నీళ్ళేవి?’’ మరొకరు చుట్టూ చూస్తూ అడిగారు.‘‘వెదికితే కనిపిస్తాయి. నీళ్ళు లేకుండా చెట్లు జీవించలేవు కదా?’’ఆ డజనుమంది భార్యాభర్తలు ఆ గ్రహాన్నంతా తిరిగి చూడసాగారు.వందేళ్ళల్లో వారు ఏడు వందల ముప్ఫై రెండుమందిగా మారారు. మరో వందేళ్ళల్లో పదిహేను వేల ఆరువందల ఎనభై నాలుగు మందిగా... అలా ప్రతి శతాబ్దానికీ ఆ జాతి అభివృద్ధి చెందసాగింది. ఒకే భాష మాట్లాడే గ్రహం నుంచి వాళ్ళు వచ్చారు. కాని ఈ గ్రహంలోని వారు దెబ్బలాడుకుని అనేక ప్రాంతాలకి వెళ్ళడంతో అనేక భాషలు ఏర్పడ్డాయి. వాతావరణం వల్ల చర్మం రంగులో మార్పు సంభవించింది. చట్టాల్లో, ఆచార వ్యవహారాల్లో వారి మధ్య స్పష్టమైన భేదం ఉంది. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాక కాలంతో పాటు వారి మేధస్సు కూడా అభివృద్ధి చెందింది.తమ పూర్వీకులు ఓ గ్రహం నుంచి బహిష్కరించబడ్డారన్న సంగతే నేటి ఆ గ్రహవాసులకి తెలీదు. కారణం తెలీకపోయినా ఈ గ్రహానికి ఎందుకు పంపబడ్డారో సరిగ్గా ఆ నేరాన్నే వాళ్ళు కొత్త గ్రహంలో చేశారు. వారి డీఎఏ కారణంగా అలాంటి మారణాయుధాలను ఆ జీవులు కనిపెట్టి తయారు చేశారు. అప్పటికి వారి సంతతి సంఖ్య మూడు వందల డెబ్భైరెండు కోట్లకి చేరుకుంది.ఓ రోజు ఓ దేశపాలకుడు పిచ్చి ఆవేశంతో మారణాయుధాలు లేని దేశం మీదకి తమ మారణాయుధాలని ప్రయోగించాడు. దాంతో ఆ దేశం లొంగింది. ఆ తర్వాత మరో పది దేశాలు కూడా ఆ మారణాయుధాలని తయారు చేసుకున్నాయి. ఆ గ్రహం మీది జనాభా పధ్నాలుగు వందల ఏభై నాలుగు కోట్లకి చేరుకున్నాక ఓ రోజు ఉన్మాదైన మరో దేశపాలకుడు తోటి మారణాయుధాలు గల దేశం మీదకి ఆకస్మికంగా తమ మారణాయుధాలని ప్రయోగించాడు. అది తెలిసి ఆ దేశం కూడా అవి తమని చేరుకునేలోగా జవాబుగా ఆ దేశం మీదకి తమ మారణాయుధాలని కూడా ప్రయోగించింది. మొదటగా ప్రయోగించిన దేశానికి చెందిన మిత్రదేశం అదే అదనుగా భావించి అది మద్దతు ఇచ్చే తమ శత్రుదేశం మీదకి మారణాయుధాలని ప్రయోగించింది. వారం రోజులు గడవకుండానే ఆ గ్రహంలోని మారణాయుధాలన్నీ ప్రయోగించబడ్డాయి. అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరగడంతో ఓ ఖండంలోని మంచు శిలలు కరిగి ప్రవహించి, ఆ గ్రహం ఉపరితలం మీదకి ఐదు వేల అడుగుల పైకి నీరు చేరుకుని ముంచేసింది.ఏ అపరాధం వల్ల లక్షల సంవత్సరాల క్రితం ఆ గ్రహానికి ఆ జీవులు పంపబడ్డారో అదే అపరాధం వల్ల ఆ గ్రహంలోని వారి జాతి అంతరించి, ఆ గ్రహం మీద తిరిగి ప్రశాంతత నెలకొంది.జరగబోయేది ముందే గ్రహించిన, మొదటగా ఆ గ్రహం మీదకి వచ్చిన మేధావులైన ఆ డజనుమంది, జలప్రళయంతో తమ జాతి అంతరిస్తుందని చెప్పిన విషయం తరతరాలుగా కథగా చెప్పబడింది.FEED ME A STORY : మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఈ వారం కథ: సెవ్వుసాని
చుక్కపొద్దున కోళ్ళ కూతలతో తిరుపతి గోవిందరాజ స్వామి గుడి చుట్టూ ఉన్న మాడవీధుల్లోని వాళ్ళు మేలుకొని స్నాన పానాదులతో సిద్ధమౌతున్నారు. ఉత్తర మాడ వీధిలోని చిన్న జియ్యంగారు మఠం నుండి దివిటీ పట్టుకొని, తాళం పెట్టెను భుజం మీద పెట్టుకొని ఆలయ తలుపులు తెరవడానికి కైకాలరెడ్డి జియ్యంగారుతో బయలుదేరాడు. కొంచెంసేపటికి ఆలయ గుడిలో నుండి స్వామి వారిని మేలుకొలుపుతూ అర్చకులు పాడే సుప్రభాత సేవ మొదలైంది. ఎద్దుల బండ్ల మీద నుంచి వచ్చిన సుదూరప్రాంత యాత్రికులు బండ్ల వీధిలో బండ్లను నిలిపి గ్రామ చావడిలో తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు. అక్కడే వారికి అడ్డంగా మూసిన ఇనుప ప్రవేశ ద్వారాన్ని తెరిచారు. నాలుగు కాళ్ళ మంటపం వరకు గుమిగూడిన జనం ‘గోవింద! గోవిందా!!’ అంటూ గుడివైపు వెళ్ళారు. గుడితో పాటు మాడ వీధులన్నీ యాత్రికుల రాకతో సందడిగా మారిపోయాయి. స్వామివారి నైవేద్య గంటలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి. ఉత్తర మాడ వీధిలోని నమ్మాళ్వారు గుడి పక్కనుండే ఓ విశాల ప్రాంగణం కలిగిన చిన్న అంతఃపురంలాంటి భవనం ముందు దివిటీలు పట్టుకొని కొందరున్నారు. అలాగే తలకు తెల్లని పాగాలను చుట్టుకొని, మోకాళ్ళ వరకు గోచీ పంచె కట్టుకొని ఆరుగురు బలిష్టమైన బోయలున్నారు. చూడచక్కని పల్లకి ఆ భవనం ముందు ఆగి ఉంది. బాగా అలంకరించుకొని ఉన్న అందమైన స్త్రీలు భవనం నుండి బయటకొచ్చారు. తిరుపతిని కప్పేసిన చీకటి తొలగిపోలేదు. మేలిముసుగులో ఒక అప్సరలాంటి స్త్రీ అటు ఇటు చెలికత్తెలతో బయటకొచ్చింది. కాంతిపుంజంలాంటి ఆమెను చూసిన చీకటి సూర్యకాంతేమోనని భయపడినట్లు ఆ ప్రాంగణంలో చిన్నబోయింది. ఆమె ఒయ్యారంగా పల్లకీలో ఎక్కి కూర్చుంది. పల్లకీకి అటు ఇటు ఉన్న పారదర్శక పరదాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. పట్టు చమ్కీ పరదాలు మెరుపు తీగలాంటి ఆమె ముందు మెరియలేక తమ ఓటమిని అంగీకరిస్తూ తలలు వాల్చేశాయి. పున్నమి ముందు రోజు చంద్రుడు ఆమెను చూసి అసూయతో పడమటి కొండల్లోకి జారుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బోయలు ముందు ముగ్గురు, వెనుక ముగ్గురు పల్లకీ కొయ్య తండులను లేపి భుజం మీదకు ఎత్తుకొని బయలుదేరారు. పల్లకీ ముందు దివిటీ పట్టుకొన్న వ్యక్తులు కదిలారు. పల్లకి వెనుక వైపు చెలికత్తెలు, పరివార జనం కదిలారు. కత్తులు, బల్లేలు చేత పట్టుకొని చుట్టూ భటులు రక్షణగా వెంట నడిచారు. వీళ్ళు సమ్మాళ్వారు గుడికి పడమరవైపు ఆనుకొని ఉండే దారి గుండా వెళ్తూ తీర్థకట్ట వీధిలోకి ప్రవేశించారు. ‘హరోం హరహర హరహర’ అంటూ బోయలు పల్లకీని మోసుకొంటూ నాదముని అగ్రహారాన్ని దాటుకొని తీర్థకట్ట వీధిలోని కొత్త వీధి మొదటనున్న వేంకటేశ్వరస్వామి గుడి ముందు ఆపి అందరూ నమస్కారాలు చేసుకున్నాక కపిలతీర్థం రహదారి మీదకొచ్చారు. అక్కడి నుంచి జియ్యంగార్ గుడి దాటుకొని, మంగలోళ్ల బావి, అచ్యుతరాయపురం మీదుగా కపిలతీర్థం ముందుకొచ్చి ఆగారు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో కపిలతీర్థంలో పుణ్యస్నానాలు చేయడానికి కొందరు జనం అప్పటికే ఉన్నారు. పల్లకీ దిగుతూనే అరుణోదయమైంది. మెల్లగా వెలుగు రేఖలు పడుతూనే చీకట్లు తొలిగాయి. వెలుతురు విరజిమ్మింది. పల్లకీలో దిగిన స్త్రీని గుర్తుపట్టి అక్కడున్న జనం ఆమెను చూడడానికి ఎగబడ్డారు. అందాలను రాశి బోసినట్లు ఉండే ఆమె మంద గమనంతో అక్కడున్న జనానికి చిరునవ్వుతో నమస్కరిస్తూ సాయుధ భటుల సహాయంతో కపిలతీర్థంలోని కోనేరుకు పడమర వైపున్న సంధ్యావందన మంటపంలోకి అడుగు పెట్టింది. చిన్నగా వెళ్ళి దుస్తులు మార్చుకొనే గదిలోకి వెళ్ళింది. ఆమె పరివారం ఆమె ఆభరణాలను, దుస్తులను తీసి జాగ్రత్త చేసి, స్నానాలాచరించే దుస్తుల్ని ధరింపజేసి కపిల తీర్థం జలపాతం దగ్గరకు తీసుకెళ్ళారు. వారం ముందు కురిసిన వానల వల్ల జలపాతం ఆకాశగంగలా కోనేటి గట్టుమీదికి దుముకుతోంది. ఆమెను చెలికత్తెలు జలపాతంలో పవిత్ర స్నానాలు చేయించారు. ముఖానికి, చేతులు కాళ్ళకు పసుపు రాశారు. ఆమె భక్తితో నమస్కరిస్తూ కపిలతీర్థం జలపాతంలో స్నానమాచరించింది. బట్టలు మార్చుకోవడానికి చెలికత్తెలతో స్నానాల గదికి వెళ్ళింది. ‘ఇంతకీ ఎవరామె మనల్ని ఎందుకు ఇక్కడే ఆపేశారు?’ అడిగారు ఒక భక్తుడు అక్కడున్న ఆలయ సిబ్బందిలోని ఒక వ్యక్తితో. ‘ఆమె సెవ్వుసాని. గోవిందరాజస్వామి గుడి దేవదాసి. ఆమెకున్న పలుకుబడి సామంతరాజులకు కూడా లేదు. ఆమె కపిలేశ్వరస్వామి గుడిలోకెళ్ళేంత వరకు మీరు వేచి ఉండాల్సిందే’ అన్నాడు ఆలయ ఉద్యోగి వెంకటయ్య. ‘మమ్మల్ని ఈ కోనేటి ఒడ్డున నిలిపితే నిలిపారు గానీ ఒక దేవకన్యను కళ్లారా చూసినట్లైంది’ అన్నాడు ఆ గుంపులోని మరొకడు. ‘ఇంతకీ మీరు ఏ ఊరి నుండి వచ్చారు? మీ పేరేమి?’ అడిగాడు వెంకటయ్య. ‘మాది శ్రీరంగం. నా పేరు రంగరాజన్. మేము పదిమంది కలిసి బండ్ల మీద తిరుపతికొచ్చాం. కపిలతీర్థంలో స్నానం చేశాకే కదా కొండెక్కాలి. అందుకని ఇక్కడికొచ్చాం. పైగా ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఇక్కడకు వస్తారని మేము ఊహించలేదు. మేము తమిళప్రాంతం నుండి వచ్చాము కాబట్టి ఈమె గురించి మాకు తెలియదు. అందుకని ఈమె ఎవరని అడిగాం. ఇంతటి అప్సరస తిరుపతిలో దేవదాసీగా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. మా శ్రీరంగంలోని దేవదాసీ కూడా ఇంత అందంగా లేదు. ఈమె ఇక్కడే పుట్టిందా?’ అడిగాడు రంగరాజన్, ‘ఈ సెవ్వుసాని విజయనగర రాజధానిలో పుట్టి పెరిగింది. తన నృత్యంతో శ్రీకృష్ణదేవరాయలను మంత్రముగ్ధుల్ని చేసేది. రాయలవారు ఈమె పట్ల ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించేవారు. ఆమెకు ఎనలేని సంపదలను బహూకరించారు. ఆమెకు తిరుపతి అంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు చంద్రగిరిలో ఉండే అచ్యుత దేవరాయల ఆతిథ్యం తీసుకొని తిరుమలేశుని సందర్శించి, తన పరివారంతో విజయనగర రాజధానికి చేరుకొనేది. ఆమె అంటే అచ్యుతదేవరాయలకు ఎనలేని అభిమానం. అనురాగం. శ్రీ కృష్ణదేవరాయల మరణానంతరం ఆయన మరణ శాసనాన్ని అనుసరించి తమ్ముడైన అచ్యుత దేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అచ్చుత దేవరాయలు ఇరవై ఏళ్ళు చంద్రగిరిలో ఉండడం వల్ల ఆయన తరచు చంద్రగిరి చుట్టు పక్కలుండే గుళ్ళను దర్శించేవారు. ఆయన సందర్శించే గుళ్ళల్లో శ్రీ గోవిందరాజస్వామి గుడి ఒకటి. ఆ గుడి పురోభివృద్ధికి సాధ్యమైనంత వరకు తన సహాయ సహకారాలను అందించేవారు. ఉత్సవ, ఊరేగింపుల్లో గోవిందరాజస్వామికి నృత్యగానాలు లేకపోవడం వెలితిగా తోచింది అచ్యుత దేవరాయలకు. తనకు ఏదైనా మంచి జరిగితే ఒక దేవదాసీని ఆలయానికి బహూకరిస్తానని మొక్కుకున్నాడు. ఊహించని విధంగా తన అన్న కృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి తాను సమస్త విజయనగర సామ్రాజ్యానికి ప్రభువైనాడు. కొన్నాళ్ళకు తన మొక్కుబడిని గురించి అంతఃపురంలో ఉన్న నాట్యకత్తెలకు తెలియజేశాడు. అందరూ తటపటాయిస్తుంటే సెవ్వుసాని తాను దేవదాసీగా గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్తానని ముందుకొచ్చింది. విజయనగరంలోనే మేటి అందగత్తె సెవ్వుసాని సమ్మతించగానే ఆమెను తిరుపతికి పంపి గోవిందరాజస్వామికిచ్చి వివాహం చేసి ఆ దేవునికి దాసిగా మార్చారు’ అన్నాడు వెంకటయ్య.‘అప్పటి వరకు ఆమెకున్న సంపదను ఏమి చేశారు?’ అడిగాడు రంగరాజన్.‘ఆమె సకల సంపదలతో పాటు మంది మార్బలాన్ని, పరివారాన్ని, చెలికత్తెలను తిరుపతికి పంపుతూ అచ్యుతదేవరాయలు మరికొంత సంపదను ఆమె వెంట ఆనందంగా పంపాడు. త్వరలో తానొచ్చి గోవిందరాజస్వామిని దర్శిస్తానన్నాడు. అన్న ప్రకారం కొన్నాళ్ళకు జైత్రయాత్రలో భాగంగా తిరుపతికొచ్చి స్వామి వారిని దర్శించుకొన్నాడు. ఆ సందర్భంగా రెండు రోజులు ఏర్పాటు చేసిన ఉత్సవ ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. సెవ్వుసాని ధ్వజస్తంభం ముందుండే నాట్య మంటపాల్లో చేసిన నృత్యానికి పరవశించిపోయాడు. చెంతనే ఉన్న సామంత రాజులు పులకించిపోయారు. ప్రధాన వీధుల్లో స్వామి ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. ఇసుకేస్తే రాలని జనంతో తిరుపతి నిండిపోయింది. దారి వెంబడి పూలతో, మామిడి తోరణాలతో, అరటి మానులతో అలంకరించారు. మిద్దెలపై నుండి జనం పూల వర్షం కురిపించారు. అచ్యుతరాయలు సెవ్వుసాని గానంతో కూడిన నాట్యాన్ని తనివితీరా వీక్షించాడు. చివరిరోజు స్వామివారికి అనేక వజ్రవైఢూర్యాలతో కూడిన ఎన్నో ఆభరణాలను బహూకరించాడు. మరెన్నో ఇనాంలను ప్రకటించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి తనని ఇంతటి వాడిని చేశాడనే కృతజ్ఞతతో. ఆ తర్వాత ఆలయం పక్కనే ఉత్తర మాడవీధిలో ఉన్న సెవ్వుసాని భవనానికెళ్ళి ఆమెను బంగారు వరహాలతో అభిషేకించాడు. తన మాట నిలిపినందుకు విలువైన ఆభరణాలను అందజేశాడు. తర్వాత దక్షిణ దేశ జైత్రయాత్రలో విజయుడై విజయనగరానికి చేరుకొన్నాడు.‘అప్పటి నుండి సెవ్వుసాని తిరుపతిలోనే స్థిరపడిపోయిందా?’ అడిగాడు రంగరాజన్.‘అవును అప్పటినుండి ఇప్పటికీ ఆమె తిరుపతిని వీడలేదు. గోవిందరాజస్వామిని నృత్య నీరాజనాలతో ఆరాధిస్తోంది. ఆమెను చూడడానికి ఎంతో పెద్ద ధనవంతులు ఆమె ఇంటి ముందు వరుసలో నిల్చొని ఎదురు చూస్తుంటారు. ఆమె దేవుడినే తన భర్తగా భావించి, ఎలాంటి వారినీ ఇంట్లోకి అనుమతించేది కాదు. పైగా చుట్టు పక్కల సామంత రాజులకు కూడా ఆమె అంటే ఎంతో భయం. ఆమె జోలికి వెళ్ళేవారు కాదు. అంతేగాక పరిపాలనా అనుకూలతల కోసం ఆమె సహాయ సహకారాలను అర్థించేవారు. ఎందుకంటే ఆమె విజయనగర సామ్రాజ్యాధీశునికి అత్యంత సన్నిహితురాలు. ఆమె తలచుకొంటే పదవులు వూడిపోతాయి. తలలు తెగిపడతాయి. ఆమె పరపతి అలాంటిది’ అన్నాడు వెంకటయ్య.సెవ్వుసాని రాకముందే పుణ్యస్నానాలు ఆచరించిన వాళ్ళు కపిలేశ్వరస్వామిని దర్శించి వెళ్ళిపోయారు. సెవ్వుసాని పరివారంతో కలిసి కోనేటిగట్టు మీదుండే సంధ్యావందన మంటపం నుండి వయ్యారంగా నడుస్తూ రాతి మెట్లెక్కి కపిలేశ్వర స్వామిని దర్శించడానికెళ్ళింది. స్వామివారిని దర్శించాక నాగ పడిగలను ప్రదక్షిణం చేసుకొని చక్కటి ముగ్గువేసి మధ్యలో 365 ఒత్తులతో పిండి దీపం వెలిగించి దణ్ణం పెట్టుకొంది. అర్చకులు అందజేసిన ప్రసాదాలను తిని; కపిలేశ్వరస్వామి మహిమల్ని గూర్చి; కార్తీక పౌర్ణమి విశిష్టతను గూర్చి; కోనేటి ప్రవేశ ద్వారంలోని సువిశాల మంటపానికి అటు ఇటు ఉన్న లక్ష్మీ నారాయణస్వామిని గూర్చి; శ్రీకృష్ణ సమేత దేవేరులను గూర్చి అర్చకస్వాములు చెప్తుండగా ఆనందంగా వింటూ తిరుమల కొండను దగ్గర నుండి చూస్తూ పరవశించిపోసాగింది. ఇంతలో గాలులు మొదలయ్యాయి. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. తుంపర్లతో మొదలవ్వాల్సిన వాన అనుకోని ఉపద్రవంలా పెద్ద పెద్ద చినుకులతో హఠాత్తుగా దండయాత్ర చేసింది. కాసేపటికి తగ్గిపోతుందనుకున్నారంతా. కాని, రాను రాను వర్షం భీకరమైంది. మెరుపులు, ఉరుములతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మనుషుల్ని సైతం నెట్టేసే గాలులు మొదలయ్యాయి. కపిలేశ్వరస్వామి గుడి ఆవరణ నుండి కోనేటి గట్టున పెద్దగా నిర్మించి ఉన్న ముఖద్వారం మంటపానికి సెవ్వుసాని పరివారం చేరుకున్నారు.పెద్ద గాలివాన. ఉన్నట్టుండి వాతావరణం ఇంత ప్రళయంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. రెండు గడియలపాటు కుంభవృష్టి కురిసింది. జలపాతం హెూరు చెవులు చిల్లు పడేలా ఉంది. కొండల్లోని ఎర్రని మట్టితో కలిసి జలపాతం విస్తరించి దుముకుతోంది. కోనేరు అలల తాకిడితో కంపించిపోతోంది. నల్లని మబ్బులతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. అందరి గుండెల్లో గుబులు పుట్టింది. వరుణదేవుని ప్రతాపానికి ప్రముఖులు లేదు సామాన్యులు లేదు– అందరూ అటు ఇటు వాయించిన వర్షానికి కుడితిలో పడ్డ ఎలుకల్లా ముద్దయిపోయారు. ఉరుములు గుండెల్లో ఉరుము వాద్యాలు వాయిస్తున్నాయి. మెరుపులు అలముకున్న చీకట్లను చీల్చుతున్నాయి. అక్కడక్కడా పిడుగులు పడ్డ శబ్దాలు భయం గొల్పుతున్నాయి. ఇంతలో ఒక పిడుగు కపిలేశ్వరస్వామి గుడి మీద పడ్డట్టయింది. అందరూ ఆ శబ్దానికి, వెలుతురుకు భయ కంపితులైపోయారు. వణుకు మొదలైంది. కళ్ళల్లో దైన్యం ఆవహించింది. గుడిలో నుండి ఒక అర్చక స్వామి బతుకు జీవుడా అనుకొంటూ, పరిగెత్తుకొని అందరూ ఉన్న మంటపంలోకొచ్చాడు.‘కపిలేశ్వర స్వామికి ఏమీ కాలేదు. అయితే గుడి ప్రాకారాలు పడిపోయాయి. ఆగ్నేయంలో ఉండే వంటశాల మీద పిడుగు పడింది. వంటశాల ధ్వంసమైపోయింది. నేను పుట్టి బుద్ధెరిగాక ఇంత పెద్దవానను ఈ కపిలతీర్థంలో చూడలేదు’ అన్నాడు. ‘అమ్మగారూ! ప్రళయమొచ్చిందేమో? ననిపిస్తోంది’ అంది ఒక చెలికత్తె.‘ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అధైర్యపడకండి’ అని అందరికీ ధైర్యం చెప్పింది సెవ్వుసాని.‘అమ్మగారూ! కోనేట్లో నీటి ఉద్ధృతికి సంధ్యావందన మంటపం కంపించిపోతోంది. నీటి ధారలు జల ఖడ్గాలుగా విరుచుకుపడుతున్నాయి. మనమున్న ఈ మంటపాన్ని ఒరుసుకొని నీళ్ళు ప్రవహిస్తున్నాయి. ఈ మంటపానికి ప్రమాదం రాదు కదా?’ అంది మరో చెలికత్తె.‘మనం చేయగలిగిందేమీ లేదు గోవింద నామ స్మరణం తప్ప’ అంది సెవ్వుసాని.అక్కడున్న వాళ్ళంతా ‘గోవిందా గోవింద’ అని గోవిందలు పెట్టడం మొదలెట్టారు. దూరభారం నుండి వచ్చిన వాళ్ళంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమని చూస్తున్నారు. బతుకు మీద ఆశ వదిలేసుకున్నారు. మెల్లగా వాన తగ్గు ముఖం పట్టింది. ఉన్నట్టుండి తెరపి ఇచ్చింది.‘ఇక బయలు దేరుతాం అమ్మగారూ! మళ్ళీ వాన మొదలయ్యేలోగా వెళ్ళిపోదాం’ అన్నాడు రక్షణాధికారి.సెవ్వుసాని పరివార జనమంతా బయలుదేరి ముఖమంటపం వెలుపలికొచ్చారు. సెవ్వుసాని పల్లకీ ఎక్కుతుంటే పెళపెళమని చెట్టు కొమ్మ విరిగింది. అక్కడే ఉన్న ఆలయ ఏనుగు ముందుకు అడుగేయడంతో కొమ్మ ఏనుగు వీపుమీద పడింది. ఏనుగు పెద్ద ఘీంకారం చేసింది. అక్కడున్న వాళ్ళంతా భయంతో వణికిపోయారు. ‘మంచి కాలం అమ్మగారూ! ఈ ఏనుగు ముందుకు రాకపోయుంటే ఆ చెట్టు కొమ్మ సరిగ్గా మన పల్లకి మీద పడుండేది. అంతా చిత్రంగా ఉంది. బయలుదేరుదాం పదండి’ అంటూ బోయలు పల్లకీని భుజంపై ఉంచుకొని హరోం హర హర... హర హర... అంటూ తిరుపతి వైపుకెళ్ళిపోయారు. సెవ్వుసాని పరివారంతో పాటు క్షేమంగా తమ భవనానికి చేరుకున్నారు. సాయంత్రం చీకటి పడ్డాక గోవిందరాజస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా సగం కుండల్లో పెద్ద వత్తులతో వెలిగించిన దీపాలతో స్వామివారికి హారతిచ్చి; గుడి ప్రాంగణంలో, వెలుపల దీపాల ప్రదర్శన చేసి, ఆలయ నృత్య నీరాజనంలో పాల్గొని తన భవనానికి చేరుకొంది సెవ్వుసాని. భవనం మీద నుండి తన చెలికత్తెలతో పాటు కపిలతీర్థం కొండ కొమ్ముమీద వెలిగించిన దీపాన్ని దర్శించుకొని రాత్రి భోజనానంతరం సెవ్వుసాని తన పడక గదికెళ్ళింది. ఎంత దొర్లినా ఆమెకు నిద్ర పట్టలేదు. ఇదంతా ఎందుకు జరిగిందని ఆలోచించాక ఏం చేయాలో ఒక నిర్ణయానికొచ్చింది. పరోపకారార్థం ఇదం శరీరం అనుకొంది. రెండు రోజుల తర్వాత వానలు కుదుట పడ్డాక మళ్ళీ కపిలతీర్థానికి తన పరివారంతో పాటు వెళ్ళి దెబ్బతిన్న ఆలయ కట్టడాలను బాగుచేయాలనుకొంది.‘కోశాధికారీ! ఈ కపిలతీర్థం గుడి ప్రాకారాలను, వంటశాలను పునర్నిర్మించాలనుకొంటున్నాను. అలాగే దెబ్బతిన్న సంధ్యావందన మంటపాలకు మరమ్మత్తులు చేయాలి. నన్ను కాపాడిన గజరాజుకు ఏమీ కాకపోయినా, ఆ వినాయకుడే నన్ను కాపాడాడనిపిస్తోంది. అందుకని కపిల తీర్థంలోని ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వరుని చెంత వినాయకుడ్ని ప్రతిష్ఠించి ఆయన నైవేద్యాలకు దానాలు చేయాలి. ఎన్ని సొమ్ములు ఖర్చు అయినా ఫర్వాలేదు’ అంది సెవ్వుసాని‘అలాగే అమ్మగారు’‘అందుకుగాను ఈ ప్రాంత సామంతరాజు రాచవీడు నాయకుని అనుమతిని తీసుకోండి’‘అవసరం లేదమ్మా! మీరు ఇంత మంచి పని చేస్తానంటే సామంత రాజులు కాదంటారా? మీరడిగిందే మహాభాగ్యంగా భావిస్తారు’ అన్నాడు కోశాధికారి.‘అది తప్పు. మనం రాచరికపు వ్యవస్థలో ఉన్నాం. విజయనగర సామ్రాజ్యాధీశుడు మనకు ఆత్మీయులు కావొచ్చు. స్థానిక సామంత రాజును గౌరవించడం మన కర్తవ్యం’‘అలాగే అమ్మగారు’సామంతరాజు అనుమతి తీసుకొన్న సెవ్వుసాని అన్ని పనులను పూర్తి చేసింది. నేటికీ సంధ్యావందన మంటపాలు చెక్కు చెదరలేదు. కపిలేశ్వరస్వామి ఆలయ ప్రాకారాలు, వంటశాల ఆమె ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ఇక ఆలయంలో ధ్వజస్తంభం పక్కనుండే వినాయకుడు ఇప్పటికీ నిత్యం పూజలందుకుంటూ భక్తులకు కొంగు బంగారమైనాడు. సంపదలు ఉంటాయి, పోతాయి. కాని, సెవ్వుసాని ధార్మికత ఎల్లకాలం నిలిచే ఉంటుంది. ∙ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి -
ఆ రషీద్ని నేనే..!
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు 2007లో నమోదు చేసిన నకిలీ పాస్పోర్టుల కుంభకోణం కేసు దర్యాప్తులో రీల్ సీన్ను తలపించే రియల్ సీన్ జరిగింది. ఆ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్న మహ్మద్ రషీద్ అలీ లొంగుబాటు నేపథ్యంలో అది చోటు చేసుకుంది. టూరిస్ట్ సహా వివిధ వీసాలపై వచ్చి, అక్రమంగా స్థిరపడుతున్న వారిని అరికట్టడానికి అమెరికా, యూకే తదితర దేశాలు గుజరాత్కు చెందిన మహిళలు, యువతులకు వీసా ఇవ్వడం మానేశాయి. అయితే రాజకీయ నాయకుల సిఫారసుతో వారి కుటుంబీకులు, సంబంధీకులకు మాత్రం వీటిని జారీ చేసేవి. దీంతో మనుషుల అక్రమ రవాణా కుంభకోణానికి తెరలేచింది.గుజరాత్కు చెందిన వారిని అనేకమందిని ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సంబంధీకులుగా చూపించారు. అలా నకిలీ పాస్పోర్ట్స్ జారీ చేయించి, ప్రత్యేక సిఫారసులతో వీసాలు సంపాదించి అక్రమ రవాణా చేశారు. 2007 ఏప్రిల్లో నాటి బీజేపీ ఎంపీ బాబూభాయ్ కటారా ఢిల్లీ విమానాశ్రయంలో అరెçస్టయ్యారు. అలా దొరికిన ఈ మనుషుల అక్రమ రవాణా తీగ లాగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ డొంక కదిలింది. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులకు ఈ స్కామ్లో ‘దళారి’గా వ్యవహరించిన రషీద్ పేరు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని చాదర్ఘాట్కు చెందిన మహ్మద్ రషీద్ అలీ, చప్పల్బజార్ వాసి రాజు పిత్తీ 2005 నుంచి స్నేహితులు. వ్యాపారి, క్రికెట్ బుకీ అయిన రాజు– రషీద్కు అవసరమైన సొమ్మును వడ్డీకి ఇచ్చేవాడు. ఓసారి రషీద్ మనుషుల అక్రమ రవాణా వ్యవహారాన్ని రాజుకు చెప్పాడు. ఆపై గుజరాత్కు చెందిన భరత్ భాయ్ని రాజు కలుసుకున్నాడు. అతడితో కలిసి నకిలీ పాస్పోర్ట్స్ తయారీ ప్రారంభించాడు. ఈ ద్వయం అనేక మంది గుజరాతీలను ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులుగా చెబుతూ నకిలీ పాస్పోర్ట్స్ ఇప్పించే వారు. దీని కోసం సదరు నేతలకు భారీగానే ముట్టచెప్పేవారు. 2006 నవంబరులో రషీద్ నుంచి రాజు పిత్తీకి ఓ సందేశం అందింది. నేరెళ్ల, బో«ద్ నియోజకవర్గాలకు చెందిన అప్పటి ఎమ్మెల్యేలు కాసిపేట లింగయ్య, సోయం బాబూరావు తమకు సహకరించడానికి సమ్మతించారన్నది దాని సారాంశం.ఇలా ప్రారంభమైన వ్యవహారం 2007 మేలో ఢిల్లీలో బాబూభాయ్ కటారా, నగరంలో లింగయ్య, బాబూరావు అరెస్టులతో సంచలనంగా మారింది. హైదరాబాద్ సీసీఎస్లోనూ నకిలీ పాస్పోర్టు స్కామ్, మనుషుల అక్రమ రవాణాపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రషీద్ అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. ఇతడితో పాటు మహ్మద్ ముజఫర్ అలీఖాన్, భరత్భాయ్, షకీల్ల కోసం వేట ప్రారంభమైంది. ఆ కేసు నమోదైన రోజు నుంచి సీసీఎస్ కార్యాలయం హడావుడిగా మారింది. స్థానిక, జాతీయ మీడియా తాకిడితో ఉక్కిరిబిక్కిరైన సీసీఎస్ పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించవద్దంటూ గేటు వద్ద విధుల్లో ఉండే సెంట్రీకి స్పష్టం చేశారు. అయినా కొందరు మీడియా ప్రతినిధులు సెంట్రీ కళ్లుగప్పి లోపలకు వెళ్లారు. దీంతో ఉన్నతాధికారులు ఆ సెంట్రీని హెచ్చరించి, గేటుకు తాళాలు వేయించారు. రషీద్ కోసం ఢిల్లీ, సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసుల వేట ముమ్మరమైంది. అయితే అప్పటికి అతడి ఫొటో ఎవరి వద్దా అందుబాటులో లేదు. రషీద్ ఒక దశలో పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. వారి ‘ట్రీట్మెంట్’ను తప్పించుకోవడానికి కొందరు మీడియా ప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. చివరకు 2007 మే 3న అతడి లొంగుబాటుకు ముహూర్తం ఖరారైంది. ఆ రోజు రషీద్ తన న్యాయవాది, ఇద్దరు మీడియా వ్యక్తులతో కలిసి నేరుగా సీసీఎస్ వద్దకు వచ్చాడు. కాస్త దూరంలో వాహనం దిగిన వీళ్లు నడుచుకుంటూ ఆ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. రషీద్ లొంగిపోవాలనే ఉద్దేశంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ అతడితో పాటు వెంట ఉన్న వారినీ అడ్డుకున్నాడు. ‘నేను రషీద్ని... లొంగిపోతా’ అని చెబుతున్నా వినకుండా బయటకు నెట్టేసినంత పని చేశాడు. దీంతో అవాక్కైన రషీద్ వెంట వచ్చిన మీడియా ప్రతినిధులు విషయాన్ని ఫోన్ ద్వారా కేసు దర్యాప్తు అధికారికి చెప్పారు. అంతే! రెండో అంతస్తు నుంచి ఉరుకులు పరుగుల మీద వచ్చి ఆయన బృందం రషీద్ను తమ వెంట తీసుకువెళ్లింది. రషీద్ విచారణ, అరెస్టు తతంగాలు పూర్తి కావడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరెస్టు జరిగిన పుష్కర కాలం తర్వాత రషీద్ మరోసారి కటకటాల్లోకి వెళ్లాడు. ఆదాయపు పన్ను శాఖ పేరు చెప్పి ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.91 లక్షలు కాజేసిన కేసులో అదే సీసీఎస్ పోలీసులు 2018 జూన్ 20న జైలుకు పంపారు.హైదరాబాద్, ఢిల్లీలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో తనకు భారీగా ఆస్తులు ఉన్నట్లు రషీద్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. తాను ఆదాయపు పన్ను శాఖకు పన్ను బకాయి పడినట్లు, వారు నోటీసులు జారీ చేసినట్లూ నకిలీ నోటీసులు సృష్టించాడు. నోటీసులు అందుకున్నప్పటికీ తాను ఆ మొత్తం చెల్లించకపోవడంతో తనకున్న ఆస్తుల్ని ఐటీ విభాగం అధికారులు సీజ్ చేస్తూ వారు జారీ చేసినట్లు ఓ సీజర్ రిపోర్ట్ సైతం రూపొందించాడు. దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన లోగోలు, అధికారుల సంతకాలు సైతం తయారు చేశాడు. ఈ సీజర్ రిపోర్ట్తో పాటు ఆస్తుల జాబితా కూడా రూపొందించిన రషీద్ అలీ వీటితో పాటు అప్పటికే సిద్ధం చేసి ఉంచిన నకిలీ ఆస్తుల పత్రాలను జత చేశాడు. ఇలా రూపొందించిన ఫైల్ను వెంటేసుకునే ఇతగాడు ఖరీదైన కార్లతో తిరుగుతూ పరిచయస్తులతో పాటు వారి ద్వారా పరిచయమైన వారికీ చూపించాడు. కేవలం రూ.కోటి, రూ.2 కోట్ల పన్ను చెల్లించనందుకు రూ.200 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యాయంటూ నమ్మించాడు. తాను చెల్లించాల్సిన పన్ను మొత్తం ఏర్పాటు చేస్తే ఐటీ విభాగానికి జమ చేసి తన ఆస్తులు విడిపించుకుంటానని, ఆ వెంటనే కొన్నింటికి విక్రయించి అసలుతో పాటు భారీ మొత్తం వడ్డీగా ఇస్తానంటూ ఎర వేసేవాడు. ఈ పేరుతో సయ్యద్ అనీస్ హైదర్, హరీష్ కుమార్ల నుంచి రూ.91 లక్షలు తీసుకుని మోసం చేశాడనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ∙ -
కాలానికి రివైండ్ బటన్
సినిమాల్లో టైమ్ మిషన్ లోకాన్ని చూసి ‘మనకీ ఒకటి ఉంటే బాగుండేది’ అని అనుకున్నారా? అయితే, ఈసారి శాస్త్రవేత్తలు నిజంగానే టైమ్ను వెనక్కి తిప్పేశారు! అది కూడా ఒక్క సెకను. ఈ అద్భుతం రష్యా, అమెరికా, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కలయికతో సాధ్యమైంది. ఐబీఎమ్ క్వాంటమ్ కంప్యూటర్ ప్రాసెసర్పై ప్రత్యేక అల్గారిథమ్ వాడి, ఒక కణం స్థితిని రివైండ్ చేసి, మునుపటి స్థితికి తీసుకెళ్లగలిగారు. సాధారణంగా మనకు తెలిసిన ప్రపంచంలో టైమ్ ఒకే దిశలో ముందుకు వెళ్తుంది. కాని, క్వాంటమ్ లోకంలో మాత్రం వేరే నియమాలు వర్తిస్తాయి. అవే ఒకటి సూపర్పోజిషన్ , అంటే ఒకే సమయంలో కణం రెండు స్థితుల్లో ఉండటం. రెండు ఎంటాంగిల్మెంట్, అంటే రెండు కణాలు దూరంలో ఉన్నా ఒకదానిపై మరొకటి ప్రభావం చూపటం. ఇవన్నీ మ్యాజిక్లా అనిపించే కాన్సెప్ట్లు. వీటిని ఉపయోగించే శాస్త్రవేత్తలు టైమ్ని ‘ఒక్క సెకను వెనక్కి’ నెట్టగలిగారు. ఇప్పుడిది చిన్న అంచనా ప్రయోగమే అయినా, ‘పోయిందనుకున్న సమాచారం కూడా తిరిగి వస్తుంది’ అని ఇది రుజువు చేసింది. క్వాంటమ్ కంప్యూటర్లకు ఇది గోల్డెన్ ఆప్షన్ . ఎందుకంటే భవిష్యత్తులో డేటా రికవరీ, ఎర్రర్ కరెక్షన్ , సిస్టమ్ స్టేబిలిటీ అన్నీ సులభం కానున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా అయితే, త్వరలోనే టైమ్కి రివైండ్ బటన్ వచ్చే రోజులు కూడా రానున్నాయన్నమాట! -
Diwali: జగమంతా దీపావలి
ఇంటింటా దివ్వెల వరుసలతో అమావాస్య చీకటిని తరిమే పండుగ బాణసంచా రంగుల వెలుగులతో నింగీ నేలా మెరిసి మురిసే పండుగ దేశ దేశాల్లో పిన్నా పెద్దా జరుపుకొనే జగమంత పండుగ దీపావళిశరన్నవరాత్రులు ముగిశాక కొద్దిరోజుల విరామంలోనే దీపావళి సందడి మొదలవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజులు ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దక్షిణాదిలో దీపావళికి ముందు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి, అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి జరుపుకొంటారు. ఉత్తరాదిలో ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి, కార్తీక శుక్ల విదియ రోజున యమద్వితీయ జరుపుకొంటారు. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో దీపావళి వేడుకలలో మరికొన్ని ఆచార భేదాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో విలక్షణమైన వేడుకలు, పూజలు కూడా జరుపుతారు.దీపావళికి మూలమైన నరకాసుర వధ పురాణగాథ అందరికీ తెలిసినదే! వరాహమూర్తికి భూదేవికి పుట్టిన కొడుకు నరకుడు. పెరిగి పెద్దవాడయ్యాక ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. నరకుడికి శోణితపుర పాలకుడైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. బాణుడి ప్రోద్బలంతో నరకుడు దుర్మార్గం పట్టాడు. చుట్టుపక్కల రాజ్యాలపై దండెత్తి, ఆ రాజ్యాల రాజకుమార్తెలను తెచ్చి బంధించాడు. అలా పదహారువేల మందిని చెరపట్టాడు. కామాఖ్య అమ్మవారిని ఆరాధించే నరకుడు అమ్మవారి ద్వారా అనేక వరాలు పొందాడు. వరగర్వంతో ముల్లోకాలలోనూ జనాలను పీడించడం మొదలుపెట్టాడు. చివరకు స్వర్గంపై దండెత్తి, ఇంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. నరకుడి ఆగడాలు శ్రుతి మించడంతో దేవతలందరూ శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకుడితో యుద్ధం చేసి, అంతమొందించాడు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరకుడు అంతమొందడంతో ఆ వార్త తెలిసిన జనాలు మర్నాడు అమావాస్య రోజున ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. అప్పటి నుంచి దీపావళి పండుగ రోజున ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వరుసగా వెలిగించడం ఆనవాయితీగా వస్తోందనేది పురాణాల కథనం. దీపావళి వేడుకల సందర్భంగా పాటించే ఆచారాల గురించి వివిధ వ్రతగ్రంథాలు విపులంగా తెలిపాయి. వీటి ప్రకారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున– ధనత్రయోదశి నాడు అపమృత్యు భయ నివారణ కోసం దీపం పెట్టాలి. దీనినే యమదీపం అంటారు. నరకచతుర్దశి రోజున నరకభయ నివారణ కోసం వేకువ జామునే అభ్యంగన స్నానం చేయాలి. సాయంకాలం దేవాలయాలలో దీపాలు వెలిగించాలి. అమావాస్య నాడు మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు బెరళ్లను నీటిలో నానబెట్టి; ఆ నీటితో అభ్యంగన స్నానం చేయాలి. ప్రదోష కాలంలో– అంటే సూర్యాస్తమయానికి ముందు దీపదానం చేసి, ఇంటి బయట జువ్వి కొమ్మలకు మంటపెట్టి, ఆ దివిటీలు తిప్పాలి. వీటిని ఉల్కలు అంటారు. దివిటీలు తిప్పిన తర్వాత లక్ష్మీపూజ చేసి, తీపి పదార్థాలను ఆరగిస్తారు. సూర్యాస్తమయం కాగానే ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించాలి. దీపావళి అమావాస్య రోజు రాత్రి కొన్ని ప్రాంతాల్లోని స్త్రీలు ఇళ్లల్లో చేటలు, పళ్లేలు, తప్పెట్లు వాయిస్తారు. ఇలా చేయడం వల్ల అలక్ష్మి తొలగి, అషై్టశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. దీపావళి అమావాస్య రాత్రివేళలోనే ఇళ్లలో బలి చక్రవర్తిని స్థాపిస్తారు. మర్నాడు పాడ్యమి రోజున ఉదయం బలి చక్రవర్తికి ఉత్సవం చేస్తారు. బలి చక్రవర్తి పూజ ముగిశాక ఉదయం వేళలోనే జూదం ఆడతారు. బలి పాడ్యమినాడు ఆడే జూదంలో గెలిచేవారికి ఏడాది మొత్తం శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇదే రోజున కొన్ని ప్రాంతాల్లో గోవర్ధనపూజ చేస్తారు. ఆ రోజు పాడి పశువులను అలంకరించి, వాటికి ఆటవిడుపునిస్తారు. యమ ద్వితీయ రోజును భ్రాతృ ద్వితీయ అని కూడా అంటారు. ఆ రోజున సోదరీమణులు తమ సోదరులను ఇళ్లకు పిలిచి, విందుభోజనాలు పెడతారు.బాణసంచా సందడిదీపావళి రోజున బాణసంచా కాల్చడం తరతరాలుగా సాగుతోంది. చైనాలో పుట్టిన బాణసంచా అక్కడి నుంచి దేశదేశాలకు వ్యాపించింది. దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడం దాదాపు పదిహేనో శతాబ్ది నుంచి మొదలై ఉంటుందని చరిత్రకారుల అంచనా. పద్దెనిమిది, పంతొమ్మిదో శతాబ్దాలలో బాణసంచాకు ఆదరణ తారస్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ రోజున మాత్రమే కాకుండా; పెళ్లిళ్లు తదితర వేడుకల్లో కూడా బాణసంచా కాల్చడం పదిహేనో శతాబ్ది నుంచి కొనసాగుతోంది. గుజరాత్ ప్రాంతంలో 1518 సంవత్సరంలో ఒక పెళ్లివేడుకలో వీథుల్లో బాణసంచా కాల్పులతో జరిగిన సంరంభాన్ని పోర్చుగీసు యాత్రికుడు బార్బోసా విపులంగా రాశాడు. మొఘల్ సామ్రాజ్యంలో బాణసంచాకు అమితమైన ఆదరణ ఉండేది. ఔరంగజేబు మినహా మొఘల్ చక్రవర్తులందరూ బాణసంచా కాల్పులను, బాణసంచా తయారీ నిపుణులను బాగా ఆదరించారు. బ్రిటిష్ హయాంలో కూడా బాణసంచా కాల్పుల ప్రదర్శనకు మంచి ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలోనే తమిళనాడులోని శివకాశి బాణసంచా తయారీకి ప్రధాన కేంద్రంగా ఏర్పడింది. తొలిరోజుల్లో శివకాశిలో ఎవరికి వారు కుటీర పరిశ్రమలా బాణసంచా తయారు చేసేవారు. సరిగా వందేళ్ల కిందట– 1925లో అయన్ నాడద శివకాశిలో ‘నేషనల్ ఫైర్వర్క్స్’ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత శివకాశిలో ఇబ్బడి ముబ్బడిగా బాణసంచా తయారీ సంస్థలు ఏర్పడ్డాయి. శివకాశిలో తయారయ్యే బాణసంచా ఉత్పత్తులు విదేశాలకు కూడా భారీ ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. దేశంలో తయారయ్యే బాణసంచా సామగ్రిలో ఎనభై శాతం శివకాశిలోనే తయారవుతున్నాయంటే, ఈ పట్టణంలో బాణసంచా పరిశ్రమ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శివకాశిలో బాణసంచా ఉత్పత్తుల విక్రయాల విలువ ఏటా రూ.26 వేల కోట్ల మేరకు ఉంటుందని తాజా అంచనాలు చెబుతున్నాయి.పెరిగిన కాలుష్య స్పృహబాణసంచా వల్ల వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం ఫలితంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలపై గడచిన పాతికేళ్లుగా జనాల్లో అవగాహన పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు బాణసంచా తయారీ, వినియోగాలపై ఆంక్షలు విధించడం కూడా మొదలైంది. ప్రభుత్వాల ఆంక్షల వల్ల బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి పర్యావరణానికి తక్కువ హాని కలిగించే, ‘గ్రీన్ క్రాకర్స్’ తయారు చేస్తున్నాయి. బాణసంచా తయారీలో ధ్వనికాలుష్య నియంత్రణకు సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. బాణసంచా తయారీ సంస్థలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనంటూ 2001లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి దేశంలోని బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి ‘గ్రీన్ క్రాకర్స్’ తయారీని ప్రారంభించాయి. అయినప్పటికీ పలుచోట్ల పాత పద్ధతిలోనే బాణసంచా తయారీ కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ (ఎన్జీటీ) 2020లో సంప్రదాయ బాణసంచాపై పూర్తి నిషేధం విధించింది. బాణసంచా కాలుష్య ప్రమాణాలను ధ్రువీకరించే లాబొరేటరీ ఇదివరకు నాగపూర్లో ఉండేది. శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను అక్కడకు పంపేవారు. అక్కడి నుంచి ధ్రువీకరణ లభించాక మార్కెట్లోకి విడుదల చేసేవారు. శివకాశిలోనే బాణసంచా ప్రమాణాలను పరిశీలించి, ధ్రువీకరించేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) ఉమ్మడిగా ‘సీఎస్ఐఆర్–నీరి’ లాబొరేటరీని 2019 ఆగస్టులో రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఈ లాబొరేటరీ శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సత్వరమే ధ్రువీకరిస్తోంది.బాణసంచాతో ఆరోగ్య సమస్యలుబాణసంచా కాల్చడం వల్ల ఎక్కువగా చిన్నారులలో, వృద్ధులలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారితో పాటు ఇదివరకే ఉబ్బసం తదితర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి, గర్భిణులకు, అలెర్జీలతో బాధపడేవారికి ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. బాణసంచా కాల్పుల్లో వెలువడే పొగలో అత్యంత సూక్షా్మతి సూక్ష్మమైన (పీఎం2.5) పరిమాణంలోని రసాయనిక కణాలు ఊపిరితిత్తుల్లోకి చొరబడి శ్వాసనాళం వాపు, విపరీతమైన దగ్గు, ఉబ్బసం, బ్రోంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతాయి. ఈ సూక్ష్మ రసాయనిక కణాలు రక్తంలోకి చేరితే అధిక రక్తపోటు, గుండెజబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, వాటి మంటలు అంటుకుని, కాలిన గాయాలు, పేలుళ్ల శబ్దతీవ్రతకు చెవుల వినికిడి శక్తి దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బాణసంచా వెలుగులు, రంగులు ఆహ్లాదాన్ని ఇచ్చినా, తగిన జాగ్రత్తలతో కాల్చితేనే పండుగ ఆనందభరితంగా ఉంటుంది.జైనులకు, సిక్కులకు పర్వదినందీపావళి హిందువులకు మాత్రమే కాదు జైనులకు, సిక్కులకు కూడా పర్వదినం. జైనుల ఇరవైనాలుగో తీర్థంకరుడైన మహావీరుడు ఇదేరోజున నిర్యాణం పొందాడు. అందువల్ల దీపావళి రోజున జైనులు తమ మందిరాలను దీపాలతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. జైన పండితుడు ఆచార్య జినసేన క్రీస్తుశకం 705లో రచించిన ‘హరివంశపురాణం’లో దీపావళిని ‘దీపాలికాయ’ అనే పేరుతో ప్రస్తావించాడు. మహావీరుడు నిర్యాణం చెందిన ఈ రోజున దీపాలను వెలిగించే సంప్రదాయాన్ని జైనులు తప్పనిసరిగా పాటిస్తారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి నుంచి జైనులకు కొత్త సంవత్సరం మొదలవుతుంది.సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్ దివస్’గా జరుపుకొంటారు. సిక్కుల ఆరో గురువు హరగోబింద్, తన 52 మంది అనుచరులతో కలసి ఖైదు నుంచి విడుదలైన రోజు కావడంతో సిక్కులు దీపావళిని ఖైదు విమోచన దినంగా జరుపుకొంటారు. హరగోబింద్ను నాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ గ్వాలియర్ కోటలో బంధించాడు. తర్వాత 1619 సంతవ్సరం దీపావళి రోజున ఆ చెర నుంచి విడుదల చేశాడు. సిక్కులు దీపావళి రోజున గురుద్వారాలలో దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాలు జరుపుకొంటారు. రాత్రివేళ బాణసంచా కాలుస్తూ సందడి చేస్తారు.దీపావళి ముమ్మతాల పండుగదీపావళి జగమంతా వేడుకదీప ప్రశస్తిదీపం చీకటిని తరిమికొట్టి వెలుగును వెదజల్లుతుంది. దీపాన్ని జ్ఞానానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి ప్రతీకగా భావిస్తారు. దీపాన్ని లక్ష్మీస్వరూపంగా ఆరాధిస్తారు. దీప ప్రశస్తిని తెలిపే పురాణగాథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది దేవేంద్రుడు దుర్వాసుడి ఆగ్రహానికి గురికావడం వల్ల తన రాజ్యాన్ని, సంపదలను పోగొట్టుకున్న ఉదంతం. దుర్వాసుడు ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు అతడికి స్వాగత సత్కారాలు చేసి, చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి దుర్వాసుడు తృప్తిచెందాడు. స్వర్గం నుంచి తిరిగి బయలుదేరే ముందు ఇంద్రుడికి కానుకగా ఒక హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు ఆ హారాన్ని నిర్లక్ష్యంగా అందుకుని, తన పట్టపుటేనుగు ఐరావతానికి అందించాడు. ఐరావతం ఆ హారాన్ని నేలపై పడేసి, కాళ్లతో తొక్కి చిందరవందర చేసింది. ఈ దృశ్యం చూసి ఆగ్రహించిన దుర్వాసుడు ఇంద్రుడిని శపించాడు. ఫలితంగా ఇంద్రుడు తన స్వర్గాన్ని, సిరిసంపదలను కోల్పోయాడు. సర్వం కోల్పోవడంతో ఇంద్రుడు దిక్కుతోచక శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. శ్రీమహావిష్ణువు ఒక దీపాన్ని వెలిగించి, ఇంద్రుడి చేతికి ఇచ్చాడు. ఆ దీపాన్ని మహాలక్ష్మీదేవిగా తలచి, పూజించమన్నాడు. దేవేంద్రుడు ఆ దీపాన్ని పూజించాడు. మహాలక్ష్మి అనుగ్రహం పొంది; తిరిగి స్వర్గాధిపత్యాన్ని, కోల్పోయిన సమస్త సంపదలను పొందాడు. ఈ పురాణ గాథ నేపథ్యంలోనే దీపావళి రోజున దీపాలు వెలిగించి, మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసమంతా దీపారాధన చేయడం కూడా సంప్రదాయంగా వస్తోంది. దీపదానం చేయడం వల్ల నరకబాధ తప్పుతుందని కొందరు నమ్ముతారు.దేశదేశాల్లో దీపావళిదీపావళి వేడుకలు భారత్తో పాటు భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే వివిధ దేశాల్లో ఘనంగా జరుగుతాయి. దాదాపు ఇరవై దేశాలలో దీపావళి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. హిందువులు ఎక్కువగా నివసించే నేపాల్, శ్రీలంక, మారిషస్ దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సురినేమ్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్, మయాన్మార్, ఫిజి, గయానా తదితర దేశాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి. నేపాల్లో దీపావళి సందర్భంగా ‘తీహార్’ వేడుకలను ఐదురోజుల పాటు జరుపుకొంటారు. ఈ సందర్భంగా విందు వినోదాలు; బాణసంచా సంబరాలు జరుపుకోవడంతో పాటు కాకులు, శునకాలు, గోవులను పూజించి, వాటికి ప్రత్యేకంగా ఆహారం పెడతారు. సింగపూర్లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో దీపావళి వేడుకలు దేదీప్యమానంగా జరుగుతాయి. దీపావళి పండుగను ఫిజి, గయానా, మలేసియా, మారిషస్, మయాన్మార్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, సురినేమ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు అధికారిక సెలవుదినంగా పాటిస్తున్నాయి. అమెరికాలో కూడా దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించే దిశగా అక్కడ స్థిరపడ్డ భారత సంతతి ప్రజలు అమెరికన్ ప్రభుత్వంపై కొన్నేళ్లుగా ఒత్తిడి తెస్తున్నారు. అమెరికాలో దీపావళి అధికారికంగా జాతీయ సెలవుదినం కాకున్నా, పెన్సిల్వేనియా వంటి కొన్ని రాష్ట్రాలు దీపావళిని సెలవు దినంగా పాటిస్తున్నాయి. కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్హౌస్లో వేడుకలు జరుపుతున్నారు. అలాగే బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో కూడా కొన్నేళ్లుగా దీపావళి వేడుకలు జరుపుతూ వస్తున్నారు. -
రీసైకిల్ కమ్ డెకరేషన్గా.. బాటిల్ ఆర్ట్..!
మన ఇళ్లలో ఖాళీగా ఉన్న గాజు లేదా ప్లాస్టిక్ బాటిళ్లు చెత్త బుట్టలోకి చేరుతుంటాయి. కాని కొంచెం సృజనాత్మక ఆలోచన, కొంచెం కలర్, పెయింట్ లేదా క్రాఫ్ట్ ఐడియాలతో ఆ బాటిళ్లను అందమైన హోమ్ డెకరేషన్లో షో పీసులుగా మార్చుకోవచ్చు. ఇది రీసైక్లింగ్కి తోడ్పడటమే కాకుండా ఇంటికి ఒక ప్రత్యేకమైన లుక్ను ఇస్తుంది.డెకరేషన్ కోసం ఉపయోగించే మెటీరియల్స్ఆక్రిలిక్ పెయింట్స్, స్ప్రే పెయింట్స్గ్లిట్టర్, బీడ్స్, మిర్రర్ పీసెస్జూట్ రోప్స్టిక్కర్స్, టేప్ఫాబ్రిక్ పీసెస్, లేస్ డిజైన్స్బాటిల్స్ .. క్రియేటివిటీపెయింటెడ్ బాటిల్స్బాటిల్పై స్ప్రే పెయింట్ వాడి ఒకే రంగులో కలర్ చేయాలి.ఆక్రిలిక్ పెయింట్స్తో పూలు, ఆకులు లేదా జామెట్రిక్ డిజైన్స్ వేయాలి.జూట్ రోప్ ర్యాప్జూట్ తాడుతో బాటిల్ మొత్తం చుట్టి, పై భాగంలో షెల్స్ లేదా పూలు అతికిస్తే రస్టిక్ లుక్ వస్తుంది.జనపనార తాడును ఉపయోగించి, అందమైన సన్నని అమ్మాయి, అబ్బాయి బొమ్మలను తయారు చేయవచ్చు.లైట్ బాటిల్ ల్యాంప్స్ఖాళీ బాటిల్లో ఫెయిరీ లైట్స్ పెట్టి నైట్ ల్యాంప్లా వాడుకోవచ్చు.బొమ్మలుగా ఉండే సంగీత పరికరాలను అతికించి, షో పీసులుగా అమర్చవచ్చు. గ్లాస్ పేస్టింగ్ ఆర్ట్బాటిల్కు కలర్ పేపర్, గ్లిటర్, స్టోరీస ... అతికిస్తే రిచ్ లుక్ వస్తుంది. అలంకరణలో ప్రత్యేకంగా ఉంటుంది.పెయింట్తో పాటు పూసలు, అద్దాలు అతికించి మరింత అందంగా మార్చవచ్చు. ఫ్లవర్ వేజ్పెద్ద పెద్ద గాజు బాటిళ్లను పెయింట్ చేసి, అందులో తాజా పువ్వులు లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అలంకరించి లివింగ్ రూమ్, సెంటర్ టేబుల్పై పెడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బాటిల్ డెకరేష మనలోని సృజనాత్మకతను చూపించే ఒక అద్భుతమైన మార్గం. చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ వరకు, ప్రతి ఒక్కదాన్ని కళాఖండంగా మార్చుకోవచ్చు.ఎన్నార్ -
'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!
నక్కజిత్తులు, టక్కు టమారాలు, వలపు వలలు – మనుషుల్లోనే కాదు ప్రకృతిలోని అన్నీ జీవుల్లోనూ ఉంటాయి. అయితే కొన్ని రకాల మొక్కల్లో కూడా ఈ విధమైన ‘జీవన నైపుణ్యాలు’ ఉంటాయని వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడున్న మొక్కలన్నీ ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉన్నవే. కొద్దో గొప్పో తమ ప్రత్యేకతతో విస్తుగొలిపేవే. వీటిల్లో కొన్ని, కొనేందుకు దొరకొచ్చు. కొన్నింటి కోసమైతే ఏ ఆఫ్రికాకో, అమెజాన్ వర్షారణ్య ప్రాంతాలకో వెళ్లాల్సిందే! 1. హైడ్నోరా పైకి కనిపించని పరాన్నజీవి· ‘హైడ్నోరా ఆఫ్రికానా’ అనే ఈ ఆఫ్రికా మొక్క తన జీవితంలో ఎక్కువ భాగం భూగర్భంలో అజ్ఞాతంగా గడుపుతుంది, పుష్పించడానికి మాత్రమే తన గుట్టును రట్టు చేసుకుంటుంది. అంటే భూ ఉపరితలంపైన విప్పారిన పువ్వులా సాక్షాత్కరిస్తుంది. ఈ మొక్కకు ఆకులు ఉండవు. ఆకులు ఉండవు కనుక కిరణజన్య సంయోగక్రియను నిర్వహించదు. ‘కిరణజన్య సంయోగ క్రియ’ అంటే తెలిసిందే కదా. ఆకుపచ్చని ఆకులుండే మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకుని నీటిని, కార్బన్ డై ఆక్సైడ్ని... గ్లూకోజ్గా, ఆక్సిజన్గా మార్చి శక్తిని పొందటం.మరి హైడ్నోరా ఆఫ్రికానాకు శక్తి ఎలా? కిరణ జన్య సంయోగ క్రియకు బదులుగా ఇది పోషకాలను దొంగిలించడానికి భూమి లోపల ఇతర మొక్కల వేళ్లకు అంటుకుని ఉంటుంది! దీని వింత జీవనశైలి ఎలా ఉన్నప్పటికీ స్థానికులు ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను విలువైనవిగా భావిస్తారు. ఫంగస్కీ, బాక్టీరియాకు ఔషధంగా వాడతారు.2. ఫ్లైపేపర్ ప్లాంట్ జిగట ఉచ్చుల జిత్తులమారి‘పింగిక్యులా జైగాంటియా’ అనే ఈ మొక్క, పోషకాలు తక్కువగా ఉండే నేలల్లో పెరుగుతుంది. దీని జిగట ఆకులు కీటకాలను బంధిస్తాయి. ఆ కీటకాలను తిని ఈ మొక్క పెరుగుతుంది. కీటకాలను తన జిగటతో ఒకసారి పట్టుకున్న తర్వాత, ఆ కీటాకాహారం నెమ్మదిగా మొక్కకు జీర్ణం అవుతుంది. మొక్కకు ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. వేసవి నెలల్లో లేత ఊదా నుండి ముదురు ఊదా వరకు వివిధ వర్ణ ఛాయలలో ఈ మొక్కకు సన్నని పూలు పూస్తాయి. ఈ మాంసాహార మొక్క కేవలం తను బతకడానికి మాత్రమే కీటకాలను తినటం కాకుండా, పరిసరాలలో కీటకాల జనాభానూ నియంత్రిస్తుంది. కీటకాలను పట్టుకునే ఉద్దేశంలో (ట్రాప్ మోడ్) లేనప్పుడు పుప్పొడి పరాగ సంపర్కాల కోసం ఆకర్షణీయమైన పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది! ఈ మొక్కను హన్స్ లుహర్స్ అనే వృక్ష శాస్తజ్ఞుడు మెక్సికోలో కనిపెట్టారు. ఎత్తయిన పర్వత వాతావరణంలో, నిలువు సున్నపు రాతి గోడల మధ్య ఉండే తేమతో కూడిన పగుళ్లలో ఇవి వృద్ధి చెందుతాయి. 3. హ్యామర్ ఆర్కిడ్ ‘మాస్టర్స్’ డిగ్రీ మాయలాడి!డ్రాకేయా గ్లిప్టోడాన్ అనే ఈ మొక్క మాయల పకీరు వంటిది. ఇది ఆడ కందిరీగను పోలి ఉంటుంది. పోలిక మాత్రమే కాదు, ఆడ కందిరీగ ఒంటి నుంచి వచ్చే వాసన లాంటి వాసననే ఇది విడుదల చేస్తుంటుంది. ఆ వాసనకు మగ కందిరీగలు మైమరచి, దీనితో జత కట్టటానికి వచ్చి వీటిపైన వాలతాయి. ఈ వాలటంలో, పుప్పొడి ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు అంటుకుంటుంది. ఈ అద్భుతమైన మాయలాడి వ్యూహం వృక్షశాస్త్రవేత్తల అధునాతన పరిశోధనలకు చక్కగా ఉపయోగ పడుతోందని అంటారు! ఇవి పశ్చిమ ఆస్ట్రేలియాలోని నైరుతి ప్రాంతంలో కనిపిస్తాయి. వీటి పూలు మెరూన్ రంగులో ఉంటాయి. పైభాగంలో మూడింట రెండు వంతులు ‘నూగు’ ఉంటుంది. కింది భాగం జారుడుగా మెరుస్తూ ఉంటుంది. ఆగస్టు చివరి వారం నుండి అక్టోబర్ ఆఖరి వారం వరకు వీటి పూలు కనిపిస్తాయి.4. డెత్ ఆపిల్ ట్రీ వల విసిరే వగలాడి‘హిప్పోమేన్ మాన్సినెల్లా అనే ఈ మొక్క పండ్లను చూడగానే తినేయబుద్ధి అవుతుంది. కానీ అవి అత్యంత విషపూరితమైన పండ్లు. తింటే శరీరం విషమయం అవుతుంది. తక్షణ మరణం కూడా సంభవించవచ్చు. ఇవి ఉష్ణమండల ప్రాంతాలైన దక్షిణ ఉత్తర అమెరికా నుండి ఉత్తర దక్షిణ అమెరికా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మొక్కను ‘లిటిల్ ఆపిల్ ఆఫ్ డెత్’ అని కూడా అంటారు. అందంగా, పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఈ మొక్కల మోసపూరితమైన అందం జానపద కథలలో అపఖ్యాతిని సంపాదించుకుంది. ఈ చెట్టు చుట్టూ అనేక కథలు ఉన్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న ప్రమాదాలకు ఒక హెచ్చరికగా ఈ మొక్క కొన్ని కథల్లో గౌరవాన్ని కూడా పొందింది. మొదట వీటికి చిన్న ఆకుపచ్చని పువ్వుల వంటి ముళ్లు వస్తాయి. వాటి నుండి పండ్లు వృద్ధి చెందుతాయి. అవి చిన్న ఆపిల్ పండ్లలా కనిపిస్తాయి.5. మూషిక భక్షకి మాంసాహార రాక్షసి‘నెపెంథెస్ అటెన్ బరోగి’ అనే ఈ ఆగ్నేయాసియాకు చెందిన మొక్క.. వాలీబాల్ నెట్లా పెద్ద మూతితో, కాడ ఆకారపు ఆకులను తోకగా కలిగి ఉంటుంది. ఇది కీటకాలను మాత్రమే కాకుండా ఎలుకలను కూడా బంధించి తింటుంది. వీటిని పిచర్ మొక్కలు అంటారు. ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త సర్ డేవిడ్ అటెన్బరో పేరును ఈ మొక్కకు పెట్టారు. నెపెంథెస్ అటెన్ బరోగి భూమిపై నిటారుగా, లేదా ఊగులాడుతూ పెరిగే పొద. కీటకాలు గానీ, ఎలుకలు గాని ఒకసారి ‘నెట్’లో పడ్డాక ఇక బయటికి రావటం ఉండదు. మొక్క లోపలి ఆమ్ల ద్రవంలో జీర్ణమై పోతాయి. ఫిలిప్పీన్స్ ద్వీప సమూహం అంతటా కనిపించే వివిధ జాతుల పిచర్ మొక్కలను ఒక జాబితాగా తయారు చేయటానికి 2007లో వృక్షశాస్త్రవేత్తలు రెండు నెలల పాటు పరిశోధన జరిపినప్పుడు ఈ నెపెంథెస్ అటెన్బరోగి అమ్మగారు దర్శనమిచ్చారు.6. పోర్క్యుపైన్ టొమాటాముళ్లు కప్పుకున్న వయ్యారి‘సోలనమ్ పైరాకాంతోస్’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పోర్క్యుపైన్ మొక్క టొమాటా మొక్క లాగా కనిపిస్తుంది. అయితే పదునైన ముళ్లను కప్పుకుని ఉంటుంది. ఈ ముళ్లు... వేటాడే జంతువులు, కొన్ని రకాల తెగుళ్ల నుంచి ఈ ‘టొమాటా’లకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. ఆఫ్రికాలోని కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి వీలు కల్పిస్తాయి.పోర్క్యుపైన్ అద్భుతమైన రూప లావణ్యాలతో వయ్యారంగా ఉంటుంది. పూలు లావెండర్ రంగులో, ముళ్లు నారింజ రంగులో ఉంటాయి. ఇది ఉష్ణమండల మడగాస్కర్ ద్వీపానికి చెందిన మొక్క. నిత్యం పచ్చగా ఉంటూ, పొదలు పొదలుగా పెరుగుతుంది.7. డాల్స్ ఐ ప్లాంట్భయానక ‘భ్రమ’రాక్షసి ‘ఆక్టేయా పాకిపొడా’ అనే ఈ మొక్క, బెర్రీ పండ్లు అని భ్రమింపజేసే మానవ కనుగుడ్లను పోలిన పండ్లను కలిగి ఉంటుంది. పండు చుట్టూ తెల్లగా ఉంటుంది. మధ్యలో కారునలుపు ఉంటుంది. ఉత్తర అమెరికా అడవులకు చెందిన ఈ ‘బెర్రీ’లు క్షీరదాలకు అత్యంత విషపూరితమైనవి. ఆహారం కోసం వెతికే జంతువులు తమ సహజజ్ఞానం వల్ల కావచ్చు, వీటి దరిదాపులకే వెళ్లవు. అసలు వీటి రూపమే భయం గొల్పేలా ఉంటుంది. ఇవి మనుషులకు, అడవి జంతువులకు నిషిద్ధమైనవి. వీటి పండ్లు తింటే గుండె కండరాల కణజాలంపై తక్షణ ప్రభావం చూపి గుండెను ఆగిపోయేలా చేస్తాయి.8. జెల్లీ ఫిష్ ట్రీ వెల్లకిలా పడిన గొడుగు!తూర్పు ఆఫ్రికా వైపుగా హిందూ మహాసముద్రంలో ఉండే సీషెల్స్ ద్వీప సముద్రంలో మాత్రమే కనిపించే ఈ ‘మెడుసజైన్ ఆపోజిటిఫోలియా’ అనే మొక్క నేడో రేపో అంతరించి పోతుందన్నంతగా ప్రమాదంలో ఉంది. జెల్లీ ఫిష్ టెంటకిల్స్ను పోలి ఉండే దీని పండ్ల క్యాప్సూ్యల్స్ దీనిని అరుదైన మొక్కలలో ఒకటిగా నిలిపాయి. చరిత్రకు పూర్వం నుండే ఈ మొక్క జీవించి ఉందని అంటారు. దీనికి వచ్చే తక్కువ విత్తనాలు దీని అంకురోత్పత్తికి సరిపడినంతగా మాత్రమే ఉంటాయట! అలాగే తగ్గిపోతున్న ఆవాసాలు కూడా ఈ మొక్క మనుగడకు ముప్పుగా పరిణమించాయి. వీటి పండ్లు ఎండి చిట్లినప్పుడు వెల్లికిలా పడిన గొడుగుల్లా కనిపిస్తాయి.విక్టోరియా వాటర్ లిల్లీ తేలియాడే ‘శివగామి’అమెజాన్ వర్షారణ్య ప్రాంతాల్లో కనిపించే ‘విక్టోరియా అమెజోనికా’ అనే ఈ మొక్క 9 అడుగుల వెడల్పు వరకు భారీ ఆకులను ఉత్పత్తి చేస్తుంది, ఆ ఆకు చిన్న పిల్లవాడు లేదా ఒక సన్నటి మనిషి బరువును మోసేంత బలంగా ఉంటుంది. వీటిని నీటి ఆకులు అంటారు. తేలికపాటి మోడల్స్ (అమ్మాయిలు) వీటిపై కూర్చొని ఫొటో షూట్ తీసుకోవటం ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తోంది. విక్టోరియా మొక్క, జలచరాలకు ఆశ్రయం కల్పిస్తుంది. స్థానికులు దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ భారీ ‘నీటి కలువ’ ఒక సహజమైన అద్భుతం. అమెజాన్ ప్రాంతీయులకు ప్రకృతి ప్రసాదించిన సంపద. ఈ మొక్క చేసే టక్కు టమారాలు ఏమీ లేకపోయినా, వృక్షశాస్త్రజ్ఞులు దీనిని ‘అరుదైన జాతి’లో చేర్చారు.10. డెడ్ హార్స్ అరమ్ కుళ్లిన వాసన కొట్టే లిల్లీ‘హెలికోడిసెరోస్ మస్కివోరస్’ అనే ఈ మొక్క కుళ్లిన మాంసం వాసనను వెదజల్లటం ద్వారా పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. ఈ వాసన, కళేబరాలను తినే కీటకాలను రారమ్మని పిలుస్తుంటుంది. ఆ కీటకాలు ఈ మొక్కల పునరుత్పత్తికి, విస్తరణకు సహాయపడతాయి.మధ్యధరా సముద్రంలో ఈ మొక్కను కనుగొన్నారు. మనుగడ కోసం పోరాటంలో మొక్కల వ్యూహాలు ఎంత తీవ్రంగా, అసాధారణంగా ఉంటాయో తెలుసుకోటానికి ఈ మొక్క ఒక ఉదాహరణ. వీటి పూలను ఆరల్ లిల్లీస్ అంటారు. ఆ లిల్లీపూల పుష్ఫగుచ్చం, చనిపోయిన జంతువు ఆసన ప్రాంతాన్ని పోలి ఉంటుంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
మెరిసే చర్మం కోసం యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్..
చాలామంది తమలో వృద్ధాప్యఛాయలు రాకుండా చూసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందంగా, యవ్వనంగా కనిపించే చర్మం కోసం ఇప్పుడు కొత్త ‘పోర్టబుల్ హ్యాండ్హెల్డ్ యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్’ అందుబాటులోకి వచ్చింది. ఇది ఇంట్లోనే సులభంగా చర్మ సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరం చర్మ ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఈ డివైజ్ సాయంతో చర్మాన్ని లిఫ్ట్ చేసి, బిగుతుగా ఉంచుకోవచ్చు. చర్మంపై ఉండే సన్నటి ముడతలను ఈ పరికరం సమర్థవంతంగా తగ్గిస్తుంది. చర్మంపై కనిపించే రంధ్రాలు పెద్దవిగా ఉంటే, ఈ పరికరం వాటిని చిన్నవిగా చేయడానికి సహాయపడుతుంది.ఈ డివైజ్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొలాజెన్ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా మార్చి, దానిని పునరుజ్జీవింపజేస్తుంది. ఈ డివైజ్ అయానిక్ మోడ్ ఆప్షన్లతో పనిచేస్తుంది. దీనిలో హై, లో, మీడియం వంటి మైక్రో కరెంట్ పవర్ ఆప్షన్లు ఉంటాయి. దీనితో చర్మ అవసరాలకు తగినట్టుగా కరెంటు స్థాయిని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా చికిత్స సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ బ్యూటీ డివైస్కి ట్రీట్మెంట్ హెడ్స్ వేరువేరుగా ఉంటాయి. ముక్కు, కళ్లు భాగాలను మసాజ్ చేసుకోవడానికి ఒక హెడ్, ముఖానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మరో హెడ్, మొత్తం బాడీని మసాజ్ చేయడానికి ఇంకో హెడ్ ఇలా మూడు వేరువేరు హెడ్స్ లభిస్తాయి. ఈ రకమైన ఫీచర్లు ఉన్న డివైస్తో చర్మ సంరక్షణను సులభతరం చేసుకోవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. (చదవండి: Back pain during pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..) -
ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..
నేను ఆరునెలల గర్భవతిని. కొన్నిరోజులుగా నడుమునొప్పి ఎక్కువగా వస్తోంది. ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా నొప్పి పెరుగుతోంది. ఇది గర్భధారణలో సాధారణమా? లేక ఏమైనా సమస్య ఉందా? దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు?– మాలిని, గుంటూరు. గర్భధారణలో నడుమునొప్పి చాలా సాధారణం. ఎక్కువమంది గర్భిణులు ఏదో ఒక దశలో దీనిని అనుభవిస్తారు. బరువు పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, హార్మోన్ల ప్రభావం, శరీర ధారణలో మార్పులు, లిగమెంట్లు సడలడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం, వెన్నుకు సరైన ఊతం లేని కుర్చీలో కూర్చోవడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. గర్భధారణ మొదటి నెలల నుంచే ఈ సమస్య రావచ్చు, అయితే గర్భధారణ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నడుమునొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం తగ్గించుకోవాలి. వెన్నుకు ఊతం ఇచ్చే కుర్చీని ఉపయోగించడం, పక్కకు తిరిగి పడుకోవడం, మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం ఉపశమనాన్ని ఇస్తాయి. హీల్స్ వాడకూడదు, సౌకర్యవంతమైన షూలు ధరించాలి. ఎక్కువ నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, పాల ఉత్పత్తులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ వాడటం అవసరం. ఆకస్మిక నొప్పి ఉన్నప్పుడు వేడి నీటి బ్యాగ్తో మసాజ్ చేయడం, వేడినీటితో స్నానం చేయడం లేదా మృదువుగా తైలమర్దన చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పెయిన్ కిల్లర్ వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. తగినంత విశ్రాంతితో పాటు నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, ప్రెగ్నెన్సీ యోగా వంటి పద్ధతులు కూడా నడుమునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గడమే కాకుండా, ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది, ప్రసవానంతర రికవరీ సులభతరం అవుతుంది, అలాగే గర్భిణికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.నేను ఆరు నెలల గర్భిణిని. గర్భధారణ ప్రారంభంలో నా హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండగా, ఇప్పుడు అది 8 గ్రాములకు పడిపోయింది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ హీమోగ్లోబిన్ తగ్గిపోయింది. డాక్టర్ మరిన్ని పరీక్షలు చేయమని సూచించారు, అలాగే హీమోగ్లోబిన్ సరిచేయడానికి ఇంజెక్షన్లు అవసరం కావచ్చని చెప్పారు. నా బంధువులు చెబుతున్నది ఏమిటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చని, అలాగే డెలివరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుందని. ఇది నిజమేనా? – సుగుణ, మిరియాలగూడ. గర్భిణులు, ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా సాధారణమైన సమస్య. గర్భధారణ సమయంలో రక్తపరిమాణం పెరగడం వలన శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువ అవుతుంది, కాని, ఆహారంతో మాత్రమే ఆ అవసరం తీరడం కష్టం. అందువల్ల హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గిపోతాయి. కొందరిలో గర్భధారణకు ముందే రక్తహీనత ఉండి, అది గర్భధారణలో మరింత ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విటమిన్ బీ12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రావచ్చు. అరుదుగా జన్యు సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తల్లిలో అలసట, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఇన్ఫెక్షన్లు రావడం, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం, రక్త మార్పిడి అవసరం కావడం, అలాగే ప్రసవానంతరం రికవరీ ఆలస్యమవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. బిడ్డలో పెరుగుదలలో ఆలస్యం, తక్కువ బరువుతో పుట్టడం, కొన్ని సందర్భాల్లో ఐసీయూ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రక్తహీనతను త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్లు రెండవ త్రైమాసికం నుంచే ఇవ్వడం ప్రారంభిస్తారు, ఎందుకంటే మొదటి నెలల్లో వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు మరింత పెరగకుండా ఉండటానికి. మాత్రలను విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహారాలతో ఉదాహరణకు నిమ్మరసం, నారింజ లాంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మాత్రలు సరిగా పనిచేయకపోతే లేదా తట్టుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఆహారంలో ఆకుకూరలు, శనగలు, బీన్స్, పప్పులు, కిస్మిస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్, అలాగే గుడ్లు, చేపలు, కాలేయం, మాంసం వంటి నాన్వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గర్భధారణలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డెలివరీకి ముందే హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుపడితే, మీకూ, మీ బిడ్డకూ ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి. (చదవండి: సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!) -
నటి అనుకుట్టి ఇష్టపడే స్టైలిష్వేర్లు ఇవే..!
శారీలో కొత్త డ్రేపింగ్ స్టయిల్స్ ట్రై చేస్తుంటాను. ఇది శారీకి కొత్త జీవాన్ని ఇస్తుంది. సామాన్యమైన సల్వార్ను కూడా కొత్త శైలిలో ధరించడం ద్వారా ప్రత్యేకతను పొందవచ్చు. నేను ఎల్లప్పుడూ సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాను. అందుకే, నా చర్మం, జుట్టు సహజంగానే మెరుగ్గా ఉంటాయి. నిజానికి, నా అందం మొత్తం నా సహజత్వంలోనే ఉంది అని చెబుతోంది అనుమోల్అందానికి వయసుతో నిమిత్తం ఉండదనేందుకు నిదర్శనం ఆమె. అందమైన వర్చస్సుతో పాటు నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడే నటి అనుమోల్ ఫాలో అయ్యే స్టయిలింగ్ టిప్స్ నేటి యువతను కూడా ఆకర్షించి, ఫాలో అయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ అనుమోల్ ధరించిన చీరబ్రాండ్: చినాయా బెనారస్, ధర: రూ. 16,658, జ్యూలరీ బ్రాండ్: దీపాలీ డిజైన్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.స్టిచ్డ్ జ్యూలరీఆభరణాలు లేకుండా రాయల్టీ లుక్ సాధ్యమేనా? అసాధ్యం అనుకుంటున్నారా? కాని, మీ దగ్గర ఒకే ఒక్క స్టిచ్డ్ జ్యూలరీ బ్లౌజ్ ఉంటే, అసాధ్యాన్ని చాలా సులభంగా సుసాధ్యం చేయగలరు. మెడ చుట్టూ నెక్లెస్లా మెరుస్తూ, చేతులపై వంకీల్లా మెరిసిపోతూ, వెనుకవైపు పెండెంట్లా గ్లామర్ జోడించే ఈ మగ్గం వర్క్ డిజైన్లు, ‘ఎక్కడ హారం? ఎక్కడ గొలుసు?’ అని వెతికే పని, ఇతర అదనపు జ్యూలరీ అవసరం లేకుండా చేస్తాయి. ఎందుకంటే ఆభరణాలే బ్లౌజ్లో దాక్కుని ఉంటాయి. ఒక్క బ్లౌజ్తోనే మీ స్టయిల్ నేరుగా స్టార్డమ్ లెవెల్కి చేరుతుంది. సింపుల్ కలర్ చీరతో కలిపితే మగ్గం వర్క్ మరింత హైలైట్ అవుతుంది, హెయిర్ స్టయిల్ బన్ లేదా సైడ్ ప్లేట్స్ సరిగ్గా సరిపోతుంది. వీటితోపాటు, మినిమల్ మేకప్ అదనంగా అందాన్ని జోడిస్తుంది. అయితే, బ్లౌజ్ ఫిటింగ్ సరిగ్గా ఉంటే, మగ్గం వర్క్ డిజైన్ మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంది. దీపిక కొండి(చదవండి: అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!) -
ఎడారిలోన పంట పండెనెంత సందడి!
ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పచ్చని పంటలతో మెరిసిపోతోంది. కేవలం చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టీ మాయల సహాయంతోనే పరిశోధకులు ఎడారిని పచ్చని పరుపులా మార్చడం పెద్ద పనేం కాదని అంటున్నారు. ఆనకట్టలు కావు.. ఆదుకునే మంత్రాలు!ఎర్రబడిన ఎడారుల్లో కొత్త ఆశ మొలకెత్తింది. ఆ ఆశ పేరే లారా నార్మన్. అమెరికాకు చెందిన ఈ శాస్త్రవేత్త, ఇరవై ఏళ్లుగా ఎడారిలో నీటి జాడల కోసం వెతికేస్తూ చివరకు ఒక రహస్యాన్ని కనుగొన్నారు. ఆ రహస్యం పెద్ద యంత్రం కాదు, క్లిష్టమైన శాస్త్రం కాదు. ప్రకృతి ఇచ్చిన సులభ మంత్రం. పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు, కట్టెలు వంటివన్నీ కలిసి నిడ్స్ అనే సహజ అడ్డాలుగా మారతాయి. ఈ అడ్డాలు నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకుండా, నెమ్మదిగా మార్చి, నేలను తడిగా ఉంచుతాయని లారా గుర్తించింది. ఈ పద్ధతిని అనుసరించి ఆమె అరిజోనా, న్యూ మెక్సికో ప్రాంతాల్లో చిన్న చెక్ డ్యామ్లు, రాళ్ల గుట్టలు ఏర్పాటు చేసింది. మొదట ఇది కేవలం మట్టిని ఆపినట్టే అనిపించింది. కాని, కొద్ది రోజుల్లోనే ఎండిన నేల తడిగా మారింది. తడిబీడులు పుట్టాయి. పచ్చని చెట్లు మొలిచాయి. పక్షులు తిరిగి వచ్చి కూశాయి. ఇలా ఎడారి గుండెకు మళ్లీ జీవం చేరింది. మాయా మట్టీ!ఎడారి ఇసుకల్లో ఒక్కసారిగా పచ్చని పంటలు పండాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కాని, ఇది నిజమే! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నలభై రోజుల్లోనే ఇసుకమయమైన భూమి కాస్త పచ్చటి తోటగా మారిపోయింది. అంతేగాక, అక్కడి ఎండల్లో తియ్యటి పుచ్చకాయల పంట కూడా పండింది. ఈ అద్భుతానికి కారణం ‘నానోక్లే’. మట్టి, నీరు, స్థానిక ఇసుకల మిశ్రమంతో తయారైన ఈ ద్రవం ఎడారికి ప్రాణం పోసే రహస్య మంత్రంలా పనిచేస్తుంది. ఇసుకపై దీన్ని పిచికారీ చేస్తే, ప్రతి ఇసుక రేణువుకు మట్టి కవచం ఏర్పడుతుంది. ఆ కవచం నీటిని పట్టి ఉంచుతుంది. ఫలితంగా ఎండిన నేల తడిగా మారి, వేర్ల దగ్గర పచ్చని జీవం మొలుస్తుంది. ఇలా కొద్ది గంటల్లోనే ఎడారి పచ్చదనంతో మెరిసిపోతుంది. అంతేకాదు, నీటి వినియోగం సగానికి తగ్గిపోవడం, పంటలు వేగంగా పెరగడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ మధ్యనే అబూధాబీలో చేసిన ప్రయోగాల్లో పుచ్చకాయలతో పాటు జుక్కినీ, మిల్లెట్ కూడా పండించగలిగారు. కరోనా సమయంలో వచ్చిన ఆ పంటలు స్థానిక కుటుంబాల కడుపులు నింపాయి. ఇప్పటికీ ఈ ప్రక్రియకు ఖర్చు కొంత ఎక్కువే కాని, భవిష్యత్తులో ఈ సాంకేతికత చౌకగా మారితే ఎడారులన్నీ పచ్చటి పొలాలుగా మారిపోతాయి! (చదవండి: పిట్ట మైల్డ్.. వేట వైల్డ్) -
పిట్ట మైల్డ్.. వేట వైల్డ్
కాస్త వేట తెలిసిన పెద్దపెద్ద పక్షులైతే మాంసం ముక్కకోసం వెతుకుతాయి చిన్నా చితకా పక్షులు గింజలు తింటాయి. దొరికితే పురుగుపుట్రను నోట్లో వేసుకుంటాయి. అయితే ష్రైక్ అనే పక్షి క్రూరత్వాన్ని చూస్తే మాంసాహారులకు కూడా మనసు చలిస్తుంది. దీని వేటలో అంత వ్యూహం ఉంటుంది మరి! ‘లానిడే’ కుటుంబానికి చెందిన అనేక రకాల పక్షులను ష్రైక్ పక్షులు అంటారు. ఈ పక్షులు చూడటానికి చాలా మైల్డ్గా కనిపిస్తాయి గాని, వీటిని వైల్డ్ బర్డ్స్ అని కూడా అంటారు. వీటికి వేటాడే జంతువులకు ఉన్నట్లుగా బలమైన కాళ్లు, గోళ్లు ఉండవు. అందుకే ఇవి తన ఆహారాన్ని విలక్షణంగా సమకూర్చుకుంటాయి. చిన్న కీటకాలు, బల్లులు, కప్పలు, చిట్టెలుకలు, కాస్త బలహీనంగా ఉండే రామచిలుకలను వేటాడి, వాటిని నిర్దాక్షిణ్యంగా బతికి ఉండగానే ముళ్ళ పొదలపైన లేదా పదునైన కొమ్మలపైన, మొనలుదేరిన తీగలపైన గుచ్చి చంపుతాయి. మాంసం దుకాణంలో మాంసాన్ని కొక్కేలకు వేలాడదీసినట్లుగా ఈ పక్షులు తమ ఆహారాన్ని ముళ్లకంపలకు వేలాడదీస్తాయి. ఈ పద్ధతి వాటి మనుగడకు అత్యంత కీలకం. ష్రైక్ పక్షులు తమ ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, తర్వాత అవసరమైనప్పుడు ముక్కలుగా చేసి తినడానికి ఈ విధానాన్నే ఎంచుకుంటాయి. మనకు ఈ పద్ధతి క్రూరంగా అనిపించినా, ప్రకృతిలో ఈ జీవులు తమ మనుగడ కోసం అనుసరించే వ్యూహం ఇదంతా. ఇక తినే ఆహారం విషతుల్యమైందనే అనుమానం వస్తే, ఈ పక్షులు తాము వేటాడిన ఆహారాన్ని అక్కడే వదిలిపెట్టి మరునాడు వచ్చి, అప్పటికి సురక్షితంగా ఉన్నట్లయితే తింటాయట! -
సేఫ్ హ్యాండిల్స్!
డోర్ హ్యాండిల్ అంటే మనం పెద్దగా పట్టించుకోని చిన్న వస్తువు. కాని, అక్కడే నిత్యం బ్యాక్టీరియా కణాలు పార్టీ చేసుకుంటుంటాయి. తెలియకుండానే వ్యాధులను లోపలికి ఆహ్వానించే ఈ హ్యాండిల్స్ని చూసి, ‘ఇక చాలు’ అనుకున్నాడు జమైకా యువ ఆవిష్కర్త రేవాన్స్ స్టూవర్ట్ట్. వెంటనే సెల్ఫ్ క్లీనింగ్ డోర్ హ్యాండిల్కు ప్రాణం పోశాడు. జమైకా తీరం దగ్గర పుట్టిన అతడి ఆలోచన ఇప్పుడు ఆసుపత్రుల తలుపులకు చేరి వేలాది మంది ప్రాణాలను రక్షిస్తోంది. రేవాన్స్ స్టూవర్ట్.. జమైకా పర్వతాల మధ్యలోని మౌంట్ ప్రాస్పెక్ట్ అనే చిన్న ఊరిలో పెరిగిన అబ్బాయి. జమైకా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న విద్యార్థి. అయితే, కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యే విద్యార్థి కాదు, వాస్తవ సమస్యలను గమనించి, వాటికి పరిష్కారాలను వెతికే క్రియేటర్. చిన్నప్పటి నుంచి వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఆటబొమ్మలు, రేడియోలు విప్పదీసి మళ్లీ కలపడం అతని ఫేవరెట్ గేమ్. అందుకే అతని తల్లి ఎప్పుడూ అతనికి ‘రేవాన్స్ , వస్తువులను పగలగొట్టడం మానెయ్యి!’ అని చెబుతుండేది. కుటుంబంలో ఎవరికీ అక్షరాలు రాకున్నా, రేవాన్స్ యూనివర్సిటీలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఇన్నోవేషన్లపై ప్రేమ పెంచుకున్నాడు. వర్చువల్గా దుస్తులు ట్రై చేసుకునే సాఫ్ట్వేర్ను కూడా తయారు చేశాడు. కాని, అసలైన మలుపు ఒక ఆసుపత్రిలో వాలంటీర్గా పనిచేసేటప్పుడు వచ్చింది. అక్కడే గ్రహించాడు ‘డోర్ హ్యాండిల్స్ అంటే అనారోగ్యానికి నేరుగా ఫ్రీ ఎంట్రీ పాస్ల లాంటివి’. అప్పుడే ‘జెర్మోసోల్’ అనే మ్యాజిక్ డోర్ హ్యాండిల్ను తయారు చేశాడు. ఎలా పనిచే స్తుందంటే? సూర్యరశ్మిని సూక్ష్మజీవులు తట్టుకోలేవు కదా! అదే సూత్రాన్ని ఇక్కడ వాడాడు. హ్యాండిల్లో ఒక చిన్న అల్ట్రావయొలెట్ లైట్ అమర్చాడు. మనం తాకగానే అది వెలుగుతుంది. అందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి ముప్పయి సెకన్లలో హ్యాండిల్పై ఉన్న బ్యాక్టీరియాను అంతం చేస్తుంది. దాదాపు 99.9 శాతం శుభ్రత సాధ్యం! ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, కరీబియన్స్ వాతావరణానికి సరిపోయే ప్రాణరక్షక కవచం. ఆసుపత్రులు, స్కూళ్లు, ఆఫీసులు సహా ఎక్కడ తలుపులు ఉంటాయో, అక్కడ దీని రక్షణ అవసరం. ఈ అద్భుత ఆవిష్కరణ రేవాన్స్ కి జమైకా ప్రధాని చేతుల మీదుగా జాతీయ యువ శాస్త్రవేత్త అవార్డు, అలాగే కామన్వెల్త్ హెల్త్ ఇన్నోవేషన్స్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తలుపు తీయడం అంటే కేవలం లోపలికి వెళ్లడం కాదు, సూక్ష్మజీవులను బయటే వదిలేయడం కూడా! ఈ విషయమై రేవాన్స్ మాట్లాడుతూ, ‘ఎన్ని కష్టాలు వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ఒకటిగానే నిలిచింది. వాళ్లే నా బలం, వాళ్లే నా ప్రేరణ’. అని చెప్పాడు. ∙ -
అసలైన అంధుడు
సూరారంలో సుబ్బయ్య అనే ఆస్తి పరుడు ఉండేవాడు. అతను పరమ లోభి. అనేక అక్రమ వ్యాపారాలు చేసి డబ్బు కూడబెట్టాడు. దానం చేసే బుద్ధి, పరోపకార గుణం సుబ్బయ్యలో మచ్చుకైనా లేకుండేవి. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు.అయితే, అతనికి దేవునిపై నమ్మకం ఎక్కువ. వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక దేవాలయానికి వెళ్లి తన కోరికలు చెప్పుకునేవాడు.పండరిపుర పాండురంగడు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని సుబ్బయ్య చెవిన పడింది. వెంటనే పండరిపురం వెళ్లాడు. చంద్రవంక నదిలో స్నానం చేసి పుండరీకుని దర్శనం చేసుకున్నాడు. తన కోరికలు పాండురంగనికి చెప్పమని కోరుకున్నాడు. ఆ తర్వాత పాండురంగని ఆలయానికి చేరుకున్నాడు.పాండురంగని ఆలయం ఎంతో సుందరంగా ఉంది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. దైవ దర్శనానికి ఉన్న వరుస ఎంతో పొడవుగా భక్తులతో కిటకిటలాడుతోంది.సుబ్బయ్య అక్రమ బుద్ధి అక్కడ కూడా చూపించాడు. వరుసలో భక్తులు ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా పాండురంగని భజన చేసుకుంటూ వెళుతున్నారు. సుబ్బయ్య మాత్రం వెంటనే భగవంతుని దర్శనం చేసుకోవాలని వరుసలోంచి పక్కకు వచ్చి అందర్నీ తోసుకుంటూ ముందుకు పోయాడు. పాండురంగని దర్శించుకుని బయటకు వెళ్లాడు. ‘అయ్యా! దానం చేయండి!’ అంటూ బిచ్చగాళ్లు చుట్టుముట్టారు. అందర్నీ విదిలించుకుని వెళ్ళి దూరంగా ఉన్న అరుగు మీద కూర్చున్నాడు.అక్కడ కంటికి నల్ల అద్దాలు పెట్టుకుని పాండురంగని కీర్తిస్తున్న అంధురాలు ‘అయ్యా! గర్భగుడిలో ఇటుక మీద పాండురంగ స్వామి రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చున్న అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవట కదా!’ అడిగింది.సుబ్బయ్య మాట్లాడలేదు. ‘పాండురంగని పాదాలు మన చేతులతో, శిరస్సుతో స్పృశించవచ్చట కదా! మందిరంలో ఎటు చూసినా తులసి మాలలేనట కదా!?’ తిరిగి అడిగింది. ఆమెకు కళ్లు కనిపించవు. అందుకే చూడలేక అడిగింది. సుబ్బయ్యకు రెండు కళ్లున్నా వెంటనే దర్శనం చేసుకుని బయట పడాలని, ఇతర భక్తులను తోసుకు వెళ్లాడు. అందుకే ఆ అందాన్ని ఆస్వాదించలేకపోయాడు.తన కళ్ళకూ, కళాత్మకంగా చూసే కళ్లకు చాలా భేదం ఉంది. కళాత్మక హృదయం లేని తనకు గొప్ప శిల్పం కూడా బండరాయి లాగే కనిపించింది’ అనుకున్నాడు సుబ్బయ్య. పరోపకారం, దానగుణం లేని తాను కళ్లున్న అసలైన అంధుణ్ణనుకున్నాడు. అక్రమ మార్గం విడిచి సక్రమంగా జీవించాలనుకున్నాడు. అలా అనుకున్నాక పేదలకు దానధర్మాలు చేస్తూ, భగవంతుని సుందరరూపాన్ని చూడగలిగాడు సుబ్బయ్య. పువ్వులు∙ గుండాల నరేంద్రబాబుపూలమ్మా పువ్వులు రంగు రంగుల పువ్వులురంగేళీ రవ్వలురాసగుమ్మ గువ్వలురక రకాల పువ్వులురమ్యమైన పువ్వులురా రమ్మను పువ్వులురామచిలుక చిన్నెలుముద్ద ముద్ద బంతులుముద్దుల చేమంతులుమల్లెలు మందారాలుఎర్రనైన గులాబీలుఅరవిరిసిన సింగారాలు -
జిలుగుల జింజు వెలుగుల రంజు
దక్షిణ కొరియాలోని జియోంగ్సాంగ్ ప్రావిన్స్లో ఉన్న జింజు నగరంలో ఏటా జరిగే ఈ జింజు లాంతర్ ఫెస్టివల్ చాలా ప్రత్యేకంగా నడుస్తుంది. రంగురంగుల లాంతర్లతో జింజులోని నామ్గాంగ్ నది ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.ప్రతి సంవత్సరం అక్టోబర్లో వచ్చే ఈ దీపాల పండుగ.. సుమారు రెండువారాలకు పైగానే కొనసాగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 19 వరకు జింజు నగరాన్ని మెరిపిస్తుంది. ఈ పండుగ మూలాలు సుమారు 400 సంవత్సరాల నాటి పురాతన చరిత్రను చెప్పుకొస్తాయి. జింజు నగరం 1592లో సైనిక కేంద్రంగా ఉండేది. ఆనాడు జపాన్ దండయాత్ర జరిగినప్పుడు జింజు కోటను రక్షించుకోవడానికి వేలాది మంది దక్షిణ కొరియా సైనికులు ప్రాణాలను కోల్పోయారు. వారి ప్రాణత్యాగాలకు గుర్తుగా నేటికీ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. జపాన్ సైన్యం నామ్గాంగ్ నదిని దాటకుండా నిరోధించడానికి, వారిని తికమకపెట్టడానికి– కొరియన్ సైనికులు నీటిపై లాంతర్లను వదిలేవారని, అలాగే యుద్ధసమయంలో తమ కుటుంబ సభ్యులకు తమ క్షేమ సమాచారం తెలియజేయడానికి కూడా తేలియాడే లాంతర్లను ఉపయోగించేవారని చరిత్ర చెబుతుంది.ఈ వేడుకలో సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలు చక్కగా సాగుతాయి. వేలకొద్దీ రంగురంగుల దీపాలు నామ్గాంగ్ నదిపై తేలుతూ, కళ్ళకు ఇంపుగా మెరుస్తాయి. ఈ వేడుకలో పాల్గొనేవారు తమ కోరికలు రాసిన లాంతర్లను నదిలో వదలిపెట్టవచ్చు లేదా ఆ ఆర్టిఫిషియల్ బ్రిడ్జీలకు వేలాడదీయవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల మైలురాళ్లను పోలిన భారీ లాంతరు శిల్పాల ప్రదర్శన కనువిందు చేస్తుంది. పండుగ సందర్భంగా పర్యటకులకు, నదిపై తాత్కాలికంగా నిర్మించిన వంతెనలపై నడుస్తూ, లాంతర్లను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో రాత్రిపూట– కళ్లు చెదిరే బాణాసంచాలు, డ్రోన్ లైట్ షోలతో ఆకాశం కాంతిమయమవుతుంది.అరుదైన లైట్హౌస్బోనవిస్టా ద్వీపకల్పంలో తీరం వెంబడి తరతరాలుగా ప్రయాణించే నావికులకు– కేప్ బోనవిస్టా లైట్హౌస్తో గొప్ప అనుబంధం ఉంది. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో ఉపయోగించిన సీల్ (ఒక సముద్రజీవి) ఆయిల్తో మండే అరుదైన కాటోప్ట్రిక్ లైట్ ఉపకరణాన్ని ఇక్కడ చూడొచ్చు. న్యూఫౌండ్లాండ్, లాబ్రడార్లలో అత్యధికంగా ఫొటోలు తీసిన ప్రదేశాలలో ఇది ఒకటి! తిమింగలాలు, మంచు పర్వతాలు, పఫిన్ పక్షులను చూడటానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. అందుకే ఇక్కడికి పర్యాటకులు ఎగబడుతుంటారు. -
రావణుడి లంకాక్రమణ
రావణుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి వరాలు పొంది, త్రికూట పర్వతానికి వచ్చాడు.ఈ సంగతి తెలిసి, రావణుడి మాతామహుడు సుమాలి తన మంత్రులైన మారీచుడు, సుబాహుడు, ప్రహస్తుడు, మహోదరుడు, విరూపాక్షుడు సహా తన అనుచరులతో కలసి రావణుడిని కలుసుకోవడానికి వచ్చాడు.‘నాయనా! నువ్వు బ్రహ్మదేవుడి నుంచి ఉత్తమ వరాలు పొందావు. విష్ణువు వలన భయం కారణంగా మేమంతా లంకను విడిచి వెళ్లి, రసాతలంలో తలదాచుకుంటూ వస్తున్నాం. లంకానగరం మనది. ఒకప్పుడు రాక్షసులు నివసించిన నగరం అది. ఇప్పుడు నీ సోదరుడు, బుద్ధిమంతుడు అయిన కుబేరుడు లంకను తన నివాసంగా చేసుకున్నాడు. నువ్వు బుద్ధిబలంతో గాని, సామ దాన భేద దండోపాయాలతో గాని తిరిగి లంకను స్వాధీనం చేసుకున్నట్లయితే, మంచి పని చేసినట్లవుతుంది. నువ్వు లంకకు అధిపతివి కాగలవు. నువ్వు మన రాక్షసులందరికీ ప్రభువువు కాగలవు’ అని అన్నాడు.‘తాతా! కుబేరుడు మాకు అగ్రజుడు, పూజ్యుడు. నువ్విలా మాట్లాడటం తగదు’ అన్నాడు రావణుడు.ప్రహస్తుడు కలగజేసుకుని, ‘రావణా! నీ మాటలు వీరోచితంగా లేవు. శూరులకు భ్రాతృప్రేమ ఉండరాదు. తోబుట్టువులైన అదితి, దితి సౌందర్యవతులు. వారిద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలు. అదితి ముల్లోకాలకు ప్రభువులైన దేవతలను, దితి దైత్యులను కన్నారు. సాగర పర్వత వన సమన్వితమైన ఈ భూలోకంపై దైత్యులు అధికారం కలిగినవారై ఉండేవారు. విష్ణువు యుద్ధాలలో దైత్యులెందరినో చంపి, ముల్లోకాలను దేవతల వశం చేశాడు. సోదరులతో విరోధం పెట్టుకోవడం అనే విపరీతాన్ని నువ్వొక్కడివే చేయడం లేదు. పూర్వం సురాసురులు ఇదే పని చేశారు. కాబట్టి నేను చెప్పినట్లు చేశావంటే, లంకాధిపత్యమే కాదు, నీకు త్రిలోకాధిపత్యం కూడా లభించగలదు’ అన్నాడు.ప్రహస్తుడి మాటలతో రావణుడు ఆలోచనలో పడ్డాడు.కాసేపు ఆలోచించాక, ‘సరే! అలాగే చేస్తాను’ అని పలికాడు. రావణుడి మాటలతో సుమాలి, అతడి మంత్రులు, అనుచరులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.మాతామహుడితోను, అతడి మంత్రులతోను చర్చలు జరిపిన తర్వాత కుబేరుడి వద్దకు మాటకారి అయిన ప్రహస్తుడిని రాయబారిగా పంపాలని రావణుడు నిర్ణయించాడు.‘‘ప్రహస్తా! నువ్వు లంకకు వెళ్లు. ధనాధిపతి అయిన కుబేరుడితో సామ మార్గంలో ఇలా చెప్పు’ అని తన సందేశాన్ని ఇలా చెప్పాడు: ‘సౌమ్యుడైన కుబేరా! మహాత్ములైన రాక్షసులకు చెందిన లంకా నగరంలో నువ్వు నివాసం ఏర్పరచుకున్నావు. ఇది నీకు తగదు. అందువల్ల ఇప్పుడు లంకను తిరిగి మాకు ఇచ్చేసినట్లయితే, నాకు సంతోషాన్ని కలిగినవాడివి, ధర్మాన్ని పాలించిన వాడివి కాగలవు’ అని ఆదేశించాడు.రావణుడి ఆదేశంతో ప్రహస్తుడు లంకకు బయలుదేరాడు. కుబేరుడి మందిరానికి చేరుకుని, అతడితో ‘బుద్ధిశాలివైన కుబేరా! నీ సోదరుడైన దశకంఠుడు రావణుడు నన్ను నీ వద్దకు పంపాడు. రావణుడి ఆజ్ఞపై నేను చెబుతున్న మాటలు విను– పూర్వం ఈ లంకానగరాన్ని సుమాలి మొదలైన రాక్షసులు ఏలుకున్నారు. అందువల్ల సౌమ్యంగా అర్థిస్తున్న నీ సోదరుడైన రావణుడికి ఈ లంకను అప్పగించు’ అని చెప్పాడు.‘ప్రహస్తా! రాక్షసులెవరూ లేని ఈ లంకను నా తండ్రి నాకు అప్పగించాడు. ప్రజలకు తగిన దాన గౌరవాలు కల్పించడం ద్వారా దీనిని నేను నివాసయోగ్యం చేశాను. నువ్వు వెళ్లి రావణుడితో ఇలా చెప్పు’ అని– ‘రావణా! ఈ లంకానగరం, ఈ రాజ్యం నీకు చెందినదే! ఏ బాధలు లేకుండా రాజ్యాన్ని అనుభవించు. నా రాజ్యాన్ని, నా ధనాన్ని నీతో ప్రత్యేకంగా పంచుకోవలసిన పనిలేదు. ఇవి మనిద్దరమూ కలసి అనుభవించవలసినవి’ అని చెప్పి ప్రహస్తుడిని సాగనంపాడు.తర్వాత కుబేరుడు తన తండ్రి విశ్రవసుడి వద్దకు వెళ్లాడు. లంకను అప్పగించాలంటూ రావణుడు తన వద్దకు దూతను పంపిన విషయం చెప్పి, ఇప్పుడు తానేం చేయాలో చెప్పమన్నాడు.‘కుమారా! రావణుడు ఈ సంగతి నాకు కూడా చెప్పాడు. నేను మందలించాను. అయినా వాడు నా మాట పట్టించుకోవడం లేదు. దుష్టబుద్ధితో లంకను ఆక్రమించుకుంటే నశిస్తావని కూడా వాడికి చాలాసార్లు చెప్పాను. వాడికి మంచిచెడులు తెలియడం లేదు. హితవు వినే పరిస్థితిలో లేడు. కుమారా! ఈ పరిస్థితుల్లో ధర్మసమ్మతం, శ్రేయోదాయకం అయిన మార్గం చెబుతాను విను. నువ్వు నీ అనుచరులతో కలసి లంకను విడిచిపెట్టు. ఉత్తర దిశలో కైలాసపర్వత ప్రాంతంలో ఉత్తమమైన మందాకినీ నది ఉంది. ప్రశాంతమైన ఆ ప్రదేశంలో దేవ గంధర్వ కిన్నెర కింపురుషాలదులు ఆనంద విహారాలు చేస్తుంటారు. అలాంటి మందాకినీ తీరంలో నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించుకో’ అని సలహా ఇచ్చాడు.తండ్రి సలహాతో కుబేరుడు తన భార్యా పుత్రులతో, అమాత్యులతో, పరిజనంతో రథాది వాహనాలను సిద్ధం చేసుకుని, కైలాసం వైపు ప్రయాణం ప్రారంభించాడు. కుబేరుడు లంకను ఖాళీ చేసేయడంతో ప్రహస్తుడు సంతోషించాడు. వెంటనే రావణుడి వద్దకు వెళ్లి, లంకానగరం ఇప్పుడు శూన్యంగా ఉంది. నువ్వు నీ సోదరులు, అమాత్యులు, పరివారంతో చేరుకుని, లంకను యథేచ్ఛగా అనుభవించవచ్చు’ అని చెప్పాడు.రావణుడు లంకను ఆక్రమించుకుని, రాక్షసుల చేత రాజ్యాభిషిక్తుడయ్యాడు. లంకను విడిచి వెళ్లిన కుబేరుడు కైలాస పర్వతం వద్ద మందాకినీ తీరానికి చేరువలో అలకాపురి నగరాన్ని నిర్మించుకున్నాడు.∙సాంఖ్యాయన -
కాలేజీ క్రీమినల్!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న నేరగాడు బత్తుల ప్రభాకర్. కాలేజీలను టార్గెట్గా చేసుకుని, స్టూడెంట్ ముసుగులో రెక్కీ చేసి, నల్లధనాన్ని దోచుకుపోయే ఈ గజదొంగ ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో నేరాలకు పాల్పడ్డ ఈ అంతర్రాష్ట్ర నేరగాడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రూ.333 కోట్లు సంపాదించాక నేరాలు మానేయాలని, అప్పటికే తన జీవితంలో వందమంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా పెట్టుకున్న ఘరానా దొంగ ఇతడు.పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్గా చేసుకుని, చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయస్సు నుంచే చోరీల బాటపట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్లలో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు. ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారు పేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట రూ.3 వేలు చోరీ చేయడంతో తన నేరచరిత్ర మొదలైంది. అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. అందుకే బత్తుల ప్రభాకర్ తన ఛాతీ కుడివైపు 3 సంఖ్యను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని రూ.333 కోట్లకు పెంచుకున్నాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాసవంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 మందితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి గుర్తుగానే ఛాతీ ఎడమ వైపు 100 సంఖ్యను టాటూ వేయించుకున్నాడు. విలాస జీవితం గడిపే ఇతగాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముసుగుతో ఉంటాడు. గేటెడ్ కమ్యూనిటీల్లో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఇతర రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తుంటాడు. ప్రతిరోజూ ఉదయం జిమ్కు వెళ్లడం, వీకెండ్స్లో పబ్స్లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్ సెకండ్ హ్యాండ్ వాహనాలను స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. ఓ ఫ్లాట్ ఖాళీ చేసిన తర్వాత మరో దాంట్లోకి చేరే వరకు ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్లో ఉంటాడు. ఓ కాలేజీని టార్గెట్గా చేసుకున్న తర్వాత ప్రభాకర్ ముందుగా రెక్కీ చేస్తాడు. దీనికోసం ఆ కాలేజీ విద్యార్థి మాదిరిగా కొన్ని పుస్తకాలు పట్టుకుని, అందుకు తగ్గ దుస్తులు ధరించి లోపలకు ఎంటర్ అవుతాడు. క్లాసుల్లోకి వెళ్లకపోయినా.. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఆ కాలేజీకి వెళ్తాడు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆఫీస్ రూమ్, లాకర్ తదితరాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి? పరిశీలిస్తాడు. ఈ రెక్కీ పూర్తయ్యాక తన రూమ్లో ఓ పేపర్ మీద డ్రాయింగ్ వేస్తాడు. అందులో లాకర్ రూమ్తో పాటు అక్కడకు ప్రవేశించడానికి ఎంచుకోవాల్సిన మార్గాలను గీస్తాడు. లాకర్ను కట్ చేయడానికి ఎలక్ట్రిక్ కట్టర్ వాడే ప్రభాకర్... దానికి ప్లగ్ పెట్టడానికి పాయింట్ ఎక్కడ ఉందో కూడా చూసుకుంటాడు. నేరం చేశాక చేతికి చిక్కిన సొమ్ముతో జల్సాలు చేసే ప్రభాకర్, సాధారణంగా ఆ డబ్బు మొత్తం ఖర్చయ్యే వరకు మరో నేరం చేయడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వరుసపెట్టి నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. ఇతడు చోరీ చేసే డబ్బు డొనేషన్లకు సంబంధించిన నల్లధనమైతే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసే వారు కాదు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న ఇతగాడిని అనకాపల్లిలో నమోదైన కేసు విచారణ నిమిత్తం 2022 మార్చి 23న అక్కడి కోర్టుకు తీసుకువెళ్లారు. విచారణ అనంతరం వైజాగ్ తీసుకువచ్చిన ఎస్కార్ట్ పోలీసులు సంకెళ్లు తీసి జైలు అధికారులకు అప్పగిస్తుండగా తప్పించు కున్నాడు. అప్పటినుంచి సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, సూర్యాపేట్ పరిధిలో కాలేజీలలో చోరీలు చేశాడు. విశాఖపట్నం జైల్లో ఉండగా పరిచయమైన, వివాదం జరిగిన ఓ వ్యక్తిని చంపడానికి తుపాకీ తూటాలు ఖరీదు చేశాడు. వీటితో సంచరిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. ∙ -
కథాకళి: దాగుడుమూతలు
వరియార్ నా కొలీగ్. మలయాళీ అయిన అతనికి అలెప్పీ నుంచి హైద్రాబాద్కి బదిలీ అయి రెండున్నర ఏళ్లైంది. మా అందరికన్నా సీనియర్. మెయింటెనెన్స్ పనిలో అనుభవజ్ఞుడు. తన భార్య ఆరోగ్యంగా లేదని ఓసారి చెప్పాడు. మూడు నెలల క్రితం ఆమె మరణించింది. మృతదేహాన్ని ఆవిడ సొంత ఊరు ఎర్నాకులానికి తీసుకెళ్ళాడు. తిరిగి వచ్చాక వరియార్ మా ఆఫీస్లో పనిచేసే ఓ బ్రహ్మచారిని తన అపార్ట్మెంట్కి వచ్చి ఉండమని కోరాడని నాకు తెలిసింది. నేనున్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్ చాలా ఖరీదుగా ఉంది. హాస్టల్స్లో సౌకర్యాలు బాగుండవు. అందుకని వరియార్ పనిచేసే మెషి¯Œ షాప్కి వెళ్ళి అడిగాను.‘‘మీ అపార్ట్మెంట్లో నేను ఉండచ్చా?’’వరియార్ మొహం వికసించింది.‘‘తప్పకుండా. ఇద్దరిని అడిగితే రామన్నారు.’’ చెప్పాడు.‘‘నెలకి ఎంత ఇవ్వాలి?’’ అడిగాను.‘‘మీ ఇష్టం. ఇవ్వకపోయినా ఫర్వాలేదు.’’‘‘ఉచితంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను భోజనంతో కలిపి ఇప్పుడు నేను నెలకి పదిహేనువేల ఐదొందలు చెల్లిస్తున్నాను. మీకు ఏడువేల ఐదొందలు ఇస్తాను.’’ చెప్పాను.‘‘అలాగే. మీ ఇష్టం అన్నాగా. కాని సాధ్యమైనంత త్వరగా రాగలరా? వీలుంటే ఇవాళే...’’భార్య పోవడంతో కలిగిన ఒంటరితనం అతన్ని బాధిస్తోందని నాకు అర్థమైంది.ఇంటికి వెళ్ళగానే నేనున్న ఇంటి యజమానికి ఆదివారం ఖాళీ చేస్తానని చెప్పాను.∙∙ నేను వరియార్ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రెండు రోజులు వరుసగా అరుణిక వచ్చింది.‘‘ఈమె అరుణిక. మన పక్క అపార్ట్మెంట్లో ఉంటుంది.’’ పరిచయం చేశాడు.ఆ తర్వాత ఆమె రెండు మూడుసార్లు వచ్చింది. ఆమె కేరళ వాళ్ళు చేసుకోని కందిపొడో, పచ్చి పులుసో, ములక్కాడ, టొమాటోల కూరో ఇలా ఏదో ఒకటి తెచ్చిచ్చేది. ఆమెకీ, వరియార్ భార్యకి మంచి దోస్తీ ఉండి ఉంటుందని అనుకున్నాను.ఆఫీస్ అయ్యాక నేను ఏదైనా సినిమాకి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్తే దానికి తాళం ఉండేది. లోపల వరియార్ ఉండేవాడు కాదు. సెలవు దినాల్లో నేను బయటికి వెళ్తూంటే అతనూ నాతోపాటే బయటికి వచ్చేవాడు. రెండు వారాల తర్వాత అతను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదని గ్రహించాను.ఓ రాత్రి చెప్పాను.‘‘మిత్రమా. మీరు మీ ఆవిడని బాగా మిస్ అవుతున్నారు. మీ భార్యని మీరు ప్రేమించినంతగా ఎప్పుడు ఎవరూ తమ భార్యని ప్రేమించలేరు.’’అతను బదులుగా పకపక నవ్వాడు. మర్నాడు ఆదివారం అరుణిక తెచ్చిన గుమ్మడి పులుసుని అన్నంలో కలుపుకుని తింటూండగా చెప్పాడు.‘‘మీకో విషయం నిజాయితీగా చెప్పాలి. నేను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండకపోవడానికి కారణం మా ఆవిడ మీద ప్రేమ కాదు.’’‘‘మరి?’’‘‘ఇది రహస్యం. అయినా చెప్తున్నాను. ఎవరికీ చెప్పకండి. కారణం అరుణిక.’’‘‘అరుణికా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘అవును. ఆమె భర్త నించి విడాకులు తీసుకుంది. కూతురు, కొడుకుతో మన పక్క అపార్ట్మెంట్లో ఉంటోందని మీకు తెలుసుగా?’’‘‘తెలుసు?’’కొద్దిగా సందేహించాక చెప్పాడు.‘‘ఆమెతో దాగుడుమూతలాట ఆడుతున్నాను. కొన్ని నెలల క్రితం మా మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. మా ఆవిడ ఓ రెండు గంటలు బయటకి వెళ్తే మాకు ప్రైవసీ దొరకగానే రమ్మనేవాడిని. వచ్చేది. మా ఆవిడ హాస్పిటల్లో చేరినప్పుడు కూడా. ఆమె మరణించాక నాకు ప్రైవసీకి లోపం లేకపోవడంతో రోజూ వచ్చి శారీరక సంపర్కం కోరుతోంది. ఆమెకి మన అపార్ట్మెంట్ బయట తాళంకప్ప కనపడితే సరే. లేదా వచ్చేస్తుంది. ఆమె మీద నాకు ఎన్నడో మొహం మొత్తింది. రావద్దని చెప్పి ఆమెని హర్ట్ చేయలేను. ఇది మన కంపెనీ నాకు కేటాయించిన అపార్ట్మెంట్ కాబట్టి ఖాళీ చేయలేను. ఇంట్లో ఇంకొకరు ఉంటే అరుణికని దూరంగా ఉంచొచ్చని నిన్ను రమ్మన్నాను.’’ వివరించాడు.ప్రైవసీ కోసం లోకంలోని ప్రేమికులు వెతుకుతూంటే, వరియార్ దాన్ని దూరంగా ఉంచి దాగుడుమూతలాట ఆడటం నాకు నవ్వు తెప్పించింది. FEED ME A STORY : మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు క్లైమాక్స్ ఏమి రాస్తారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఈ వారం కథ: జీవన మాధుర్యం
‘‘అరేయ్ రాజూ! మాధురికి పెళ్లి కుదిరింది. అబ్బాయి పేరు జీవన్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్’’ సంతోషంగా చెప్పాడు ప్రకాష్. ‘‘ఓహ్ కంగ్రాట్స్రా ప్రకాష్! అబ్బాయి సొంత ఊరేది? అతడి అమ్మానాన్నలు ఎక్కడుంటారు?’’ అడిగాడు రాజీవ్.‘‘అబ్బాయి తండ్రి హైదరాబాద్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. తల్లి గృహిణి, వాళ్లకు మొదట అమ్మాయి, తరువాత అబ్బాయి. అమ్మాయికి పెళ్లయిపోయింది. తను కూడా అమెరికాలోనే కాపురముంటోందట!’’ అన్నాడు ప్రకాష్.‘‘చూడబోతే గొప్పింటి సంబంధంలాగా అనిపిస్తోంది. మనలాంటి మధ్యతరగతి వాళ్లకు ఎలా తూగారు?’’ అనుమానంగా అన్నాడు రాజీవ్.‘‘వాళ్ళు డబ్బుతో పాటు మంచి మనసున్న మారాజులురా! కానీ కట్నం వద్దని కచ్చితంగా చెప్పారు’’ అన్నాడు ప్రకాష్.‘‘అయితే మాధురి అదృష్టవంతురాలు. ఎప్పుడూ ఎలాంటి సంబంధం వస్తుందో, ఎంత కట్నం అడుగుతారోనని భయపడేవాడివి. కుదిరిపోయింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకో’’ అన్నాడు రాజీవ్.‘‘రాజూ! వాళ్ళు కట్నం వద్దన్నారని మనమేమీ ఇవ్వకుండా ఊరుకుంటే మర్యాదగా ఉంటుందా? మనకూ, వెళ్లిన చోట పిల్లకూ కూడా అవమానమే’’ అన్నాడు ప్రకాష్.‘‘అడిగింది ఇవ్వకపోతే అవమానం కానీ అడగకపోతే ఇవ్వడమెందుకు?’’‘‘అరేయ్ రాజూ! అడిగిన కట్నం ఇచ్చేస్తే ఎటువంటి గొడవుండదు. అడగకపోతే కట్నం లేదని మిగిలిన అన్ని లాంఛనాలు ఘనంగా పెట్టాలి’’‘‘అదీ నిజమే అనుకో! ఇంతకీ తాంబూలాలు పుచ్చుకునేది ఎప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘ప్రత్యేకంగా తాంబూలాలు మార్చుకోవడమేమీ లేదు. అమ్మాయిని చూడటానికి వచ్చిన రోజునే అమ్మాయి మెడలో అత్తగారు హారం వేశారు. అబ్బాయి తన చేతికున్న ఉంగరం తీసి అమ్మాయి వేలికి తొడిగాడు. ఇదే నిశ్చితార్థం అనుకుందాం అని మా వియ్యంకులుగారు అన్నారు.’’‘‘అదేంట్రా? ఈ రోజుల్లో ఇంత సింపుల్గా నిశ్చితార్థం జరుపుకున్నవారిని మిమ్మల్నే చూశాను. ఎంగేజ్మెంట్ పేరుతో ఇరువైపులా బట్టలు పెట్టుకోవటం; తరువాత పెద్ద హోటల్లోనో, ఫంక్షన్ హల్లోనో భారీ ఎత్తున భోజనాలు, డ్రోన్లతో రక రకాల ఫొటోలు తీయడం దాదాపు పెళ్ళి చేసినంత ఆర్భాటంగా చేస్తున్నారు. వీళ్లేంటీ అలికిడి లేకుండా మన కాలంలో చేసుకున్నట్లు ఇంట్లో క్లుప్తంగా ముగించారు? అబ్బాయి ఎవరి తాలూకా? కుటుంబం గురించి సరైన విచారణ చేశావా?’’ ఆరా తీశాడు రాజీవ్.‘‘హహ...’’ అంటూ నవ్వేశాడు ప్రకాష్.‘‘నవ్వుతావేంట్రా? అసలే అమెరికా సంబంధం అంటున్నావు. ఈ మధ్యన అమెరికా పెళ్లిళ్ల గురించి టీవీలో చాలా వింటున్నాము. ఎవరికీ తెలియనివ్వకుండా తాంబూలాలు కానిచ్చారంటే చాలా ఆలోచనలు వస్తున్నాయి’’ అన్నాడు రాజీవ్.‘‘అలాంటి అనుమానాలు నాకూ వచ్చాయి. వాళ్ళు మా అత్తగారికి కాస్త దగ్గరి బంధువులవుతారు. ఎవరిని అడిగినా మంచి కుటుంబమనే చెప్తున్నారు. వాళ్ళు రాజమండ్రిలో స్థిరపడ్డారు, అబ్బాయి చదువుకోవడానికి అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అసలు ముందుగా పెళ్లిళ్ల పేరయ్య ద్వారా ఈ సంబంధం మనకు వచ్చింది. వాళ్లకు ఫొటోల్లో మన అమ్మాయి నచ్చిందని చెప్పడంతో విషయం మనదాకా వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు చుట్టరికం బయటకు వచ్చింది. అబ్బాయి వీడియో కాల్లో అమ్మాయిని చూసి, మాట్లాడి తన అంగీకారం తెలిపాడు. తరువాత ఇరుపక్షాల మాటలు జరిగాయి. అంతా సరే అనుకున్నాక పెళ్ళికి సిద్ధపడ్డాం’’ అన్నాడు ప్రకాష్.‘‘తెలిసినవాళ్లేనా? అయితే ఇంకా కంగారు పడటానికేముంది? ఇంతకీ పెళ్లెప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘అబ్బాయి పెళ్లయ్యాక అమ్మాయిని కూడా తీసుకెళ్లాలంటే వీసా ప్రక్రియ కోసం పెళ్లి తొందరగా చేయాలని వియ్యంకుడు జగదీష్ చెప్పాడు. పెళ్లి మరో పదిహేను రోజుల్లో’’...‘‘అయితే పెళ్లి పనుల కోసం నువ్వు రేసు గుర్రంలాగా పరుగులు తీయాలి’’ నవ్వుతూ అన్నాడు రాజీవ్.‘‘అవునురా డబ్బున్నవాళ్లతో వ్యవహారం కదా ఎలా చేస్తానో అని కంగారుగా అనిపిస్తుంది. నువ్వు మాత్రం అమ్మాయి అత్తారింటికి వెళ్ళేదాకా తోడుండాలి’’...‘‘అది ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా?’’ అన్నాడు రాజీవ్.∙∙ ప్రకాష్ చిన్న వ్యాపారస్తుడు రమ అతడి భార్య, వారికిద్దరు పిల్లలు మాధురి పెద్దది, బీటెక్ పూర్తిచేసి ఊర్లో ఉన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తోంది. తరువాత మహేష్ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రకాష్ సంపాదనతో ఉండటానికి సొంత ఇల్లు కట్టుకున్నాడు. అంతకు మించి అతడికి ఎటువంటి స్థిరాస్తులూ లేవు. కూతురికి తన స్తోమతకి తగిన సంబంధాలు చూడామని పెళ్ళిళ్ళ పేరయ్యకు చెప్పాడు. ఆయన వీళ్ళు కట్నం వద్దంటున్నారు, అమ్మాయి గుణగణాలు బాగుంటే చాలంటున్నారని ఈ సంబంధం తీసుకువచ్చాడు. తీరాచూస్తే అది దగ్గరి సంబంధం కావడంతో ప్రకాష్ చాలా సంతోషించాడు. దానికితోడు బంధువులందరూ కూతురికి గొప్ప సంబంధం వచ్చిందని అతడి అదృష్టాన్ని పొగుడుతుంటే మరింత ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ‘‘రమా! మన ఇల్లు తాకట్టు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నాడు ప్రకాష్. రమ తుళ్ళిపడింది.‘‘అదేంటండీ? ఎందుకలా? మనం అమ్మాయి పెళ్లికోసం కొంత డబ్బు పక్కన పెట్టాం కదా? ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించింది రమ.‘‘పిచ్చిదానా! అప్పుడు మనం దాచిన డబ్బు మనబోటి సంబంధం కోసం. ఇప్పుడు మన తాహతుకి మించిన గొప్పవారి సంబంధం కుదిరింది. మరి వారికి నచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలిగా?’’ ప్రశ్నించాడు ప్రకాష్ . ప్రకాష్ చేతిలో డబ్బు లేక తగ్గి ఉంటాడు కాని, సహజంగా దుబారా మనిషే! రమ ఎంత నచ్చచెప్పాలని చూసినా అతడు వినలేదు. ఇంటి దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. ముందూ వెనుకా చూడకుండా ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు. తండ్రి అలా డబ్బులు గుమ్మరిస్తుంటే పిల్లలకు చిత్రంగా అనిపిస్తోంది. మహేష్ అదంతా చూసి సంబరపడినా, మాధురి మాత్రం తల్లి దగ్గర నుండి విషయం రాబట్టింది. తండ్రి చేస్తున్న అప్పు చూసి ఆమె మనసు తల్లడిల్లింది. పెళ్ళిబట్టలకు, నగలకు తాహతుకు మించి కొంటుంటే భవిష్యత్తు తలచుకుని ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.ఒకరోజు ప్రకాష్ పిల్లలను, భార్యను దగ్గరకు పిలిచాడు.‘‘మధూ! మహేష్! మీకు తెలిసిన కొత్తరకం వంటకాల పేర్లు చెప్పండి. మీకు తెలియకపోతే మీ స్నేహితులనైనా అడిగి తెలుసుకోండి. పెళ్ళిలో మనం పెట్టే భోజనాలు చూసి మగపెళ్లివారు అబ్బో భలే ఉన్నాయే అంటూ నోరు తెరవాలి’’ అన్నాడు ప్రకాష్.‘‘డాడీ! నేను చెప్తాను– మొన్న మా ఫ్రెండు అక్క పెళ్ళిలో కోవా వెరైటీస్ కొత్త రకానివి పెట్టారు. పనీర్ జిలేబీ, కోవా కజ్జికాయలు వేడి వేడిగా వేసిస్తుంటే మేమంతా బోలెడన్ని తినేశాం’’ అన్నాడు మహేష్.‘‘డాడీ! తమ్ముడు అలాగే చెప్తాడు కాని, వంటవాళ్ళని అడిగితే కొత్తగా చేస్తున్న వంటకాలు చెప్తారు. ఎక్కువ రకాలు అవసరం లేదు. రుచికరమైనవి కొన్ని చేయిస్తే సరిపోతుంది’’ అంది మాధురి.‘‘మధు సరిగ్గా చెప్పింది. మీరు అనవసరమైన ఆర్భాటాలకు పోకండి’’ అంది రమ.‘‘మనం కట్నం ఇవ్వడం లేదు, భోజనాలైనా మంచిగా పెట్టకపోతే ఎలా?’’ అన్నాడు ప్రకాష్.‘‘ముందు మనం మధూ పెళ్ళికి అనుకున్నదాని కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. పెళ్లి అవగానే సరికాదు, తరువాతే ఎక్కువ అవసరాలుంటాయి. ఇలా అయితే తరువాత ఇబ్బంది పడతాం’’ అంది రమ.ప్రకాష్కి ఆ మాటలు రుచించలేదు. స్నేహితుడిని సంప్రదించాడు. ‘‘మధ్య తరగతి వాళ్ళం చూసుకుని ఖర్చు పెట్టకపోతే పెద్ద దెబ్బ తగులుతుంది. వాళ్ళు అడగకపోయినా బంగారం, బట్టలు అంటూ చాలా డబ్బులు గుమ్మరిస్తున్నావు. చెల్లెమ్మ చెప్పినట్లు విను’’ అన్నాడు రాజీవ్.ప్రకాష్ అతడి మాటలు కూడా పెడచెవిన పెట్టాడు. వంటవాళ్లతో తనే స్వయంగా మాట్లాడి భారీ ఎత్తులో మెనూ తయారుచేశాడు. పెళ్లిరోజు దగ్గరకు వచ్చింది. పెద్ద కళ్యాణమండపం, దానికి అలంకరణ బ్రహ్మాండంగా చేయించాడు.భోజనాలకు ముందు అల్పాహారంలో పానీపూరీ. బజ్జీమసాలా, సమోసా చాట్, చిన్న పునుగు, వెజ్ కట్లెట్, పనీర్ టిక్కా, పావ్ భాజీ, చిన్న పిజ్జా, బఠాణీ చాట్, పెసర దోశ ఏర్పాటు చేశాడు. వచ్చిన జనం అక్కడ కిక్కిరిసిపోయి ఉన్నారు. ఎన్నో రకాల పదార్థాలు నోరూరిస్తూ కనిపిస్తుంటే, అందులోనూ ఉచితంగా ఆకర్షిస్తుంటే ఆపడం ఎవరి తరం?... ఒకో స్టాల్ దగ్గర ఆగడం అక్కడ ఉన్న వంటకం పెట్టించుకోవడం... కొంచెం రుచి చూడటం, అది పారేసి మళ్ళీ మరోదాని కోసం వెళ్లడం, అక్కడ మరో ప్లేట్ తీసుకుని అది వేయించుకోవడం, అది కొంచెం తినగానే మరో కొత్త వంటకం కనిపించగానే చేతిలో ఉన్నది పూర్తిగా తినకుండానే చెత్త డబ్బాలో పడేసి, అక్కడకు వెళ్లి మరో ప్లేట్ అందుకోవడంలో జనం బిజీ అయ్యారు. అల్పాహారాలు తినడంతో సగానికి పైగా పొట్టలు నిండిపోయాయి. తరువాత అందరూ కాసేపు లోపలకు వెళ్లి పెళ్లి చూస్తూ కూర్చున్నారు. కాసేపటి తరువాత మళ్ళీ భోజనాల దగ్గరకు వచ్చారు. అక్కడ సుమారు పది రకాల స్వీట్లు, ఇరవై రకాల వంటకాలు, పది రకాల ఫ్రూట్స్, పది రకాల డిజర్ట్స్ ఉన్నాయి. అన్ని వంటకాలూ వేడిగా ఉండేందుకు అన్నింటి కిందా చిన్న స్టవ్లు కూడా ఉన్నాయి. నోరూరించే ఎన్నో రకాల పదార్థాలను చూసి, అన్నీ రుచి చూడాలనే అతృతతో అన్నీ వేయించుకుని, పొట్టలో పట్టకపోవడంతో తినకుండానే వృథాగా చెత్తడబ్బాలో పారేస్తున్నారు. మనిషి తన నోటితో తను ఇక చాలని చెప్పగలిగేది ఆహారం విషయంలో మాత్రమే! ప్రకాష్ దంపతులు పెళ్ళికి వచ్చిన అతిథులను పలకరించి వేదిక మీద కూర్చున్నారు. వేదమంత్రాల సాక్షిగా మంగళవాయిద్యాల నడుమ బంధుమిత్రుల సమక్షంలో మాధురి, జీవన్ల పెళ్లి జరిగింది. తరువాత నూతన వధూవరులు, అమ్మాయి తల్లితండ్రులు, అబ్బాయి తల్లితండ్రులు భోజనాలు చేయడానికి భోజనశాల వైపుకి వస్తున్నారు. వారి వెనుక రాజీవ్ కూడా నడుస్తున్నాడు. భోజనశాలలో రెండు విభాగాలున్నాయి. ఒకటి బంతి భోజనాలు, మరొకటి బఫే భోజనాలు. వీళ్ళు బఫే భోజనాలు దాటి బంతి భోజనాల వైపుకి వెళ్తుండగా నడుస్తున్న జగదీష్ ఆగిపోయాడు. ‘‘బావగారు! బఫే భోజనం చేద్దామంటారా?’’ వెనక్కు తిరిగి వచ్చి అడిగాడు ప్రకాష్.‘‘ఆ డస్ట్ బిన్ వైపు చూశారా? అందులో ప్లేట్స్లో తినకుండా పారేసిన స్వీట్లు, హాట్లు, ఇతర ఆహార పదార్థాలు చూడండి. ఎంత ఆహారం వృథాగా నేలపాలయిందో చూశారా?’’ అన్నాడు జగదీష్.‘‘బావగారు! ఎక్కువ రకాల వంటకాలు చేయించాం కదండీ! ఒక్కసారే అన్నీ తినలేక పారేసుంటారు అంతే కాని, రుచిగా ఉండకపోవడం వల్ల కాదండీ’’ అన్నాడు ప్రకాష్.‘నా ప్రశ్న మీకలా అర్థమైందా?’ మనసులో అనుకున్న జగదీష్ ఒకసారి ఆయన వైపు అదోలా చూసి మౌనంగా వాళ్లతో నడిచాడు. ప్రకాష్ భోజనాల దగ్గర తనే స్వయంగా ‘‘బావగారు! ఈ స్వీటు తినండి బాగుంటుంది, చెల్లెమ్మా! ఈ పెసర పునుగు ఆవడ తినండి బాగుంటుంది, బాబూ! పుదీనా రైస్ రుచి చూడండి’’ అని పెట్టించబోయాడు. అతను ఎంత బలవంతం చేసినా జగదీష్, అతని భార్య, జీవన్ కొన్ని రకాల పదార్థాలు మాత్రమే తిన్నారు. అదిచూసి ప్రకాష్ ముఖం మాడిపోయింది. అప్పగింతలయ్యాక మగ పెళ్లివాళ్ళు వెళ్లిపోతున్న సమయంలో అందరూ కళ్యాణమండపం బయటకు వచ్చారు. అక్కడ ఒక పక్కన చెత్తబండి పెట్టుంది. ఫంక్షన్ హాల్ లోపల నిండిపోయిన టబ్లు తెచ్చి అందులో వేస్తున్నారు. కొంతమంది బిచ్చగాళ్ళు అందులో నుంచి ఆహార పదార్థాలు ఏరుకుని, వాళ్ళ దగ్గరున్న సత్తుగిన్నెల్లో వేసుకుంటున్నారు. కొన్ని తడిసిపోయిన వాటిని తీసి, వారి చినిగిన దుస్తులకు తుడుస్తూ గిన్నెలో వేస్తున్నారు. రెప్పవాల్చకుండా అటువైపే చూస్తున్న జగదీష్ కనుకొలకులలో నీటి బిందువులు నిలిచాయి. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని తుడుచుకున్నాడు.‘‘బావగారు! మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకు బాధపడుతున్నారు’’ కంగారుగా అడిగాడు ప్రకాష్.‘‘అదేం లేదు’’ అంటూ కారెక్కి కూర్చున్నాడు జగదీశ్.పెళ్ళికూతురుని తీసుకుని మగపెళ్లివాళ్ళు హైదరాబాద్ వెళ్లిపోయారు. వెళ్ళేముందు రెండవరోజు జరుగబోయే సత్యనారాయణస్వామి వ్రతానికి, అదేరోజు సాయంత్రం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్కి అందరినీ తప్పకుండా రమ్మని మరీ మరీ ఆహ్వానించారు. ‘‘రమా! ఎందుకో జగదీష్గారు సంతృప్తిగా ఉన్నట్లనిపించడం లేదు’’ వాళ్ళు వెళ్ళాక అన్నాడు ప్రకాష్.‘‘అదేం లేదు లెండి!’’ అంది రమ.‘‘ఎందుకో ఆయన కళ్ళు కూడా తుడుచుకున్నాడు’’ అన్నాడు ప్రకాష్. ‘‘ఇప్పుడవన్నీ ఆలోచించే వ్యవధి లేదు. రేపు మనం హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. వ్రతానికి పీటలమీద కూర్చున్నప్పుడు అమ్మాయి అల్లుడుగారికి అలాగే వాళ్ళ అత్తమామగార్లకు కూడా మనం బట్టలు పెట్టాలి. పళ్ళు, స్వీట్స్ కూడా పట్టుకెళ్ళాలి’’ అంది రమ. ‘‘రమా! మళ్ళీ చాలా డబ్బులు కావాలి... నా దగ్గరున్న డబ్బంతా అయిపోయిపోతుంది. కట్నం లేదన్న మాటే కానీ పై ఖర్చులు చాలా అయ్యాయి’’ అన్నాడు ప్రకాష్.‘‘ఆర్భాటాలకు పోతే అలాగే అవుతుందని నేనెంత చెప్పినా మీకు అర్థం కాలేదు. ఇప్పుడనుకుని ఏం లాభం? స్వీట్స్ అన్నాను కదా అని ఖరీదు ఎక్కువ వాటి జోలికి పోకండి. లడ్డు, కాజాలు చాలు’’ అంది రమ . ప్రకాష్ కుటుంబం మరి కొందరు దగ్గరి బంధువులతో కలిసి రెండవరోజు ఉదయం మగ పెళ్లివారింటిలో దిగారు. వారు మర్యాదగా ఆహ్వానం పలికారు. అల్పాహారంగా ఇడ్లీ, వడ, కొబ్బరి చట్నీ, కారప్పొడి వేసి పెట్టారు. సత్యనారాయణ స్వామి పూజకు ఇంట్లో బంధువులు మాత్రమే ఉన్నారు. వియ్యాలవారు భోజనాలు ఎంత గొప్పగా పెడతారోనని ఊహించుకున్న ప్రకాష్కి నిరాశే ఎదురైంది. పులిహోర, పూర్ణం, మిరపకాయ బజ్జీ, వంకాయ చట్నీ, ముద్దపప్పు, రసం, బెండకాయ వేపుడు, అప్పడం, గడ్డపెరుగు పెట్టారు. అందరూ శుభ్రంగా పదార్థాలన్నీ వదలకుండా తినేశారు. ‘‘అరేయ్ రాజూ! భోజనాలు మరీ ఇంత సింపుల్గా పెట్టారేంట్రా?’’ అన్నాడు గుసగుసగా ప్రకాష్.‘‘ఇప్పుడు ఇంట్లో వాళ్లకు మాత్రమే కదా! అందుకే ఇలా పెట్టుంటారు సాయంత్రం రిసెప్షన్లో బాగా పెడతారనుకుంటా. అయినా కొన్ని వంటకాలు పెట్టినా మంచి భోజనం పెట్టారు’’ మెచ్చుకుంటూ అన్నాడు రాజీవ్. సాయంత్రం అందరూ రిసెప్షన్కి వెళ్లారు. అది పెద్ద ఫంక్షన్ హాల్. సహజమైన పూలతో చాలా తేలికపాటి అలంకరణ చేశారు. చూడటానికి చాలా అందంగా అనిపిస్తోంది. బయట ఎక్కడా అల్పాహారాల స్టాల్స్ లేవు. లోపలకు వెళ్ళగానే ముందుగా అందరికీ వెల్కమ్ డ్రింక్గా బాదంపాలు ఇచ్చారు. మరే ఇతర స్నాక్స్ పెట్టలేదు. రిసెప్షన్కి వచ్చిన వాళ్లంతా వధూవరులకు అక్షింతలు వేశాక, కుటుంబ సభ్యులు డైనింగ్ హాల్ వైపు నడిచారు. అక్కడ ఎంన్లోస్ ఒక రైతు వరి కంకులు పట్టుకుని నిలబడిన చిత్రం పెట్టారు. దాని కింద ‘ఒక వరి కంకి తయారు కావాలంటే రైతు నూట ఎనిమిది రోజులు కష్టపడతాడు’ అని రాసుంది. అది దాటుకుని లోపలకు వెళ్ళగానే, అక్కడక్కడా కొన్ని పేపర్ కటింగ్స్ పుల్ల ఆధారంగా నిలబెట్టబడి ఉన్నాయి. ‘అన్నదాతా సుఖీభవ!’...‘ఆహారం వృథా చేయకండి’...‘మీరు ఏది తినగలరో అదే తీసుకోండి’‘తినలేనిది పెట్టుకుని నేలపాలు చేయకండి’...‘పారేసేముందు పంటలు పండించే రైతు కష్టాన్ని గుర్తుచేసుకోండి’...‘పిల్లల పెళ్ళిచేయడానికి ఆ తండ్రి పడే కష్టాన్ని తలచుకుంటే ఒక్క పదార్థం కూడా పారేయకుండా తింటారు’...అనే క్యాప్షన్స్ ఉన్నాయి. అందరూ వాటిని చదువుతూ మాట్లాడుకుంటున్నారు. ‘భలే రాశారు కదా?’...‘ఇలాంటివి చదివాక ఎవరైనా ఆహారం వృథా చేస్తారా?’... ‘అన్ని చోట్లా ఇలాంటి బోర్డులు పెడితే ఎవరూ తినే పదార్థాలు పొరపాటున కూడా పారేయరు’అక్కడున్న అందరూ పైకే మాట్లాడుకుంటున్నారు. ప్రకాష్, రమ, మాధురి, రాజీవ్ ఆశ్చర్యంగా చూస్తున్నారు.‘జీవన్ గారు! ఈ విధమైన ఏర్పాట్లు ఎవరి సూచనలతో చేశారు? నాకు చాలా నచ్చింది’ అంది మాధురి.ప్రకాష్ అల్లుడి జవాబు కోసం అటే చూస్తున్నాడు.‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు. అన్నపూర్ణను గౌరవించిన వారి దగ్గర ఆమె కొలువుంటుందని ఎప్పుడూ చెప్తుంటారు. ఆయన మన పెళ్లి సందర్భంగా ఈరోజు చాలామంది హోమ్లెస్ పీపుల్కి ఆహారం సరఫరా చేశారు’’ అన్నాడు జీవన్.ఆ మాటలు వినగానే ప్రకాష్ ముఖంలో రంగులు మారాయి. రమ ముఖంలో ఆనందం కనిపించింది. ‘‘మామయ్య గారి అభిప్రాయాలు చాలా ఆదర్శవంతంగా అనిపిస్తున్నాయి’’ అంది మాధురి చిన్నగా. ‘‘థాంక్స్ అమ్మా!’’ అన్నాడు జగదీష్. ‘‘బావగారు ! నేను మీ విషయంలో చాలా అపోహపడ్డాను. నన్ను మన్నించండి, ఇంత మంచి కుటుంబానికి నా కూతురిని ఇచ్చినందుకు గర్వపడుతున్నాను’’ ఆనందంగా అన్నాడు ప్రకాష్. ‘‘బావగారు! ఆడపిల్ల పెళ్ళి చేసి బరువు దించుకోవాలనే తాపత్రయంతో మీరు బరువు పెంచుకున్నారని నాకు తెలిసింది. మా అబ్బాయి మీ ఇంటి అల్లుడయ్యాడు. మీ కష్టసుఖాలలో భాగం పంచుకోవడానికి అనుమతిస్తే మన్నిస్తాను’’ నవ్వుతూ అన్నాడు జగదీష్.‘‘ఏమిటది? కొంపదీసి ఇల్లు తనఖా పెట్టిన విషయం తెలిసిందా?’’ ఆలోచిస్తున్నాడు ప్రకాష్. ‘‘బావగారూ! మీరు అంతగా ఆలోచించకండి. ఏ ఆడపిల్లయినా పుట్టింట్లో ఇబ్బందులు లేకుండా ఉంటేనే తను అత్తింట్లో సంతోషంగా ఉండగలుగుతుంది. మా కోడలి సంతోషం మాకు కావాలి. ఇకనుండి మన రెండు కుటుంబాలు ఒకటే’’ అన్నాడు జగదీష్.‘‘అరేయ్ ప్రకాష్! జీవన్, మాధురి పెళ్ళిలో నాకు జీవనమాధుర్యం అంటే ఏమిటో తెలిసిందిరా!’’ అన్నాడు రాజీవ్.ఆ మాటలకు పెళ్లివారింట్లో అందరి నవ్వులు చిచ్చుబుడ్డీలలా వెలుగులపూలు జిమ్మాయి. ‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు. ∙కె.వి.సుమలత -
అమెరికా కాదన్నా.. ఆప్షన్స్ అన్లిమిటెట్
‘టాలెంట్ ఉన్న ప్రతిచూపు అమెరికా వైపే’ అన్నట్లుగా సాగింది ఇంతకాలం. అమెరికాలో సెటిల్ అయినవారి పేరెంట్స్ దగ్గర నుంచి అమెరికన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వరకు ప్రతి ఒక్కరూ అమెరికా కాలమానానికి అనుగుణంగా నడుచుకోవడం పరిపాటి అయిపోయింది! కాని, అమెరికా తీరు మార్చింది. పొమ్మనకుండానే ఇండియన్స్కు పొగబెడుతోంది.చదువు, ఉద్యోగం, స్థిరనివాసం కోసం అమెరికా చేరుకోవడమనేది చాలామంది భారతీయుల కల! అందుకోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉంటారు. కాని, అపారమైన ఆశలతో అమెరికా వైపు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల కలలు ఇప్పుడు కరిగిపోతున్నాయి. దీనికి, అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలే కారణం! ఎన్నో ఏళ్లుగా ఇండియా–అమెరికాల మధ్య కొనసాగుతున్న బలమైన అనుబంధం ఇప్పుడు మెల్లమెల్లగా బీటలువారుతోంది. ఈ బంధానికి ప్రధాన వారధి అయిన విద్యారంగంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ఈ పరిస్థితుల్లో, విదేశీ విద్య కోసం అమెరికా తప్పితే మరో మార్గమే లేదా? మరో దేశమే లేదా?! అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాదర ఆహ్వానాలు అందుతున్నాయి.క్రమంగా అమెరికాకే కాదు జర్మనీ, కెనడా యూకే వంటి దేశాలకు ఇండియా నుంచి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమెరికాకు బ్రేక్స్ పడుతున్న తరుణంలో భారత యువత తమ విదేశీ ప్రయాణాల గమ్యాలను మార్చుకుంటూదూసుకుని పోతున్నారు. ఏటా విదేశాలకు వెళ్లే మన విద్యార్థులు హెచ్–1బీ వీసా అనేది అమెరికా– తమ దేశంలో ప్రత్యేక నైపుణ్యంతో నిర్వహించే ఉద్యోగాల కోసం– విదేశీ నిపుణులకు ఇచ్చే ఒక వలస వీసా! ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ (స్టెమ్) రంగాల్లో అమెరికాకు చెందిన నిపుణుల కొరతను తీర్చుకోవడానికి ఈ వీసాను 1990లో నాటి అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టింది. దీనివల్ల అమెరికన్ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకోగలిగాయి. ఇది అమెరికా ఆర్థిక వృద్ధికి, సాంకేతిక ఆవిష్కరణలకు ఎంతో తోడ్పడింది! ఇప్పటి వరకూ హెచ్–1బీ వీసాలు పొందినవారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ట్రంప్ నిర్ణయంతో ఎందరో భారతీయుల కలలు చెదిరిపోయాయి. ఈ క్రమంలోనే ‘అమెరికా వద్దంటే ఆగిపోనక్కర్లేదు మా దేశం రండి’ అంటున్నాయి ఎన్నో దేశాలు. ఆ లిస్ట్లో జర్మనీ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లండ్, ఫ్రాన్స్, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), పోలండ్ ఇలా చాలా దేశాలు చక్కటి భవిష్యత్ కోసం ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో చూద్దాం విదేశీయులకు సైతం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను, అది కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో దాదాపు ఉచితంగా అందించే అరుదైన దేశం జర్మనీ. ఇది కేవలం ఉన్నత ప్రమాణాలకు, ఆధునిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందడమే కాక, ప్రపంచంలోని అగ్రశ్రేణి సాంకేతిక, ఇంజనీరింగ్ కోర్సులకు కేంద్రంగా ఉంది. జర్మనీలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివే అంతర్జాతీయ విద్యార్థులకు సాధారణంగా ట్యూషన్ ఫీజులుండవు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కేవలం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఫీజు మాత్రమే ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఏడాదికి గరిష్ఠంగా 140 పూర్తి రోజులు లేదా 280 సగం రోజులు పనిచేయడానికి అనుమతి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, సెమిస్టర్ కాలంలో వారానికి 20 గంటల వరకు పనిచేయవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, అంతర్జాతీయ విద్యార్థులు తమ అర్హతకు సరిపోయే ఉద్యోగం వెతుక్కోవడానికి 18 నెలల వరకు జర్మనీలో ఉండొచ్చు. అందుకు జాబ్–సీకింగ్ రెసిడె¯ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఈ 18 నెలల కాలంలో వారు పూర్తి సమయం ఉద్యోగం వెతుక్కుంటూనే తమ ఖర్చుల కోసం తాత్కాలిక ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. గడువులోపు ఉద్యోగం సంపాదించి, దానిని వర్క్ పర్మిట్గా మార్చుకున్నట్లయితే, జర్మనీలో స్థిరపడటానికి మార్గం సులభమవుతుంది.కెనడానిజానికి కెనడియన్ విద్యార్హతలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాగే కెనడాలో ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి, ఇవి విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలనందిస్తాయి. కెనడాలో ప్రభుత్వ నిధులు పొందే విశ్వవిద్యాలయాలలో కూడా విదేశీ విద్యార్థులకు ఫీజులుంటాయి. అయితే కోర్సులను బట్టి, యూనివర్సిటీ స్థాయిని బట్టి ఫీజులు మారుతుంటాయి. స్టడీ పర్మిట్ ఉన్న విద్యార్థులు తమ చదువుల సమయంలో వారానికి గరిష్ఠంగా 20 గంటలు క్యాంపస్లో లేదా క్యాంపస్ వెలుపల పనిచేయడానికి అనుమతి ఉంటుంది. సెమిస్టర్ బ్రేక్స్ సమయంలో పూర్తి సమయం పనిచేయవచ్చు. కెనడియన్ డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అర్హత కలిగిన ప్రోగ్రామ్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ కోర్సు వ్యవధిని బట్టి గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు కెనడాలో ఉండొచ్చు. ఉద్యోగం వెతుక్కోవడానికి పనిచేయడానికి అనుమతించే పోస్ట్–గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ పొందవచ్చు. ఈ పర్మిట్ పొందిన తరువాత, ఒక సంవత్సరం కెనడియన్ గ్రాడ్యుయేట్స్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ వంటి ఇమ్మిగ్రేషన్ మార్గాలతో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కెనడా ప్రభుత్వం వలసదారులను స్వాగతిస్తుంది కాబట్టి, విద్యార్థులకు ఇది ఒక చక్కటి మార్గమవుతుంది.యూకే విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గమ్యస్థానం యునైటెడ్ కింగ్డమ్ (యూకే). బెస్ట్ కోర్సులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలు, గ్రాడ్యుయేషన్ తర్వాత సులభంగా ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే విధానాలతో యూకే అంతర్జాతీయ విద్యార్థులకు స్వర్గధామం. అక్కడి విశ్వవిద్యాలయాలు క్వాలిటీ ఎడ్యుకేషన్కు ప్రసిద్ధి. ఇక్కడి బ్యాచిలర్ కోర్సులు సాధారణంగా 3 సంవత్సరాలు, మాస్టర్స్ కోర్సులు ఒక సంవత్సరంలోనే పూర్తి అవుతాయి. యూకేలో విదేశీ విద్యార్థులకు ఫీజులు సాధారణంగా దేశీయ విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్, నగరంతో పాటు కోర్సును బట్టి ఫీజు మారుతుంది. స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, విద్యార్థి తమ ట్యూషన్ ఫీజుతో పాటు తమ జీవనానికి సరిపడా కనీస రాబడిని చూపించాల్సి ఉంటుంది. అలాగే ఎంపికైన యూనివర్సిటీ/కాలేజ్ (లైసె¯Œ ్స పొందిన స్పాన్సర్) నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ వంటి అనేక యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో రాయితీ లేదా పూర్తి స్థాయి స్కాలర్షిప్లను అందిస్తాయి. కామ¯Œ వెల్త్ దేశాలకు చెందిన ప్రతిభావంతులకు కామ¯Œ వెల్త్ స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. విద్యార్థులు ఎటువంటి తక్కువ జీతం పొందే ఉద్యోగాన్ని చేస్తున్నా స్కిల్డ్ వర్కర్ వీసాకు మారే అవకాశం కూడా ఉంటుంది.ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు చక్కటి విద్యను, అధిక జీవన ప్రమాణాలను, పట్టభద్రులైన తర్వాత గొప్ప ఉద్యోగ అవకాశాలను పుష్కలంగా అందించే దేశాలలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అంతర్జాతీయ విద్యార్థి వీసా (సబ్క్లాస్ 500) ఉన్నవారు చదువుకునేటప్పుడు ప్రతి రెండు వారాలకు 48 గంటల వరకు పని చేసుకోవచ్చు, ఇంకా చదువు విరామ సమయాల్లో అపరిమిత గంటలు పనిచేసే వెసులుబాటు కూడా ఉంది. ఇది విద్యార్థులకు తమ ఖర్చులను తాము భరించడానికి, నెట్వర్క్ను పెంచుకోవడానికి, చక్కటి అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత, విద్యార్థులు తమ అర్హతలను బట్టి, 18 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు (కోర్సుతో పాటు ప్రాంతాన్ని బట్టి) ఆ దేశంలోనే ఉండి, తగిన ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు.న్యూజీలండ్అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత సురక్షితమైన, నాణ్యమైన విద్యను అందించే దేశాల్లో న్యూజీలండ్ కూడా ప్రత్యేకమే! ఇక్కడ పర్యావరణం చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. న్యూజిలాండ్లో పలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వరల్డ్ క్యూఎస్ (కోక్వారెల్లి సైమండ్స్) ర్యాంకింగ్స్లో స్థానాన్ని పొందాయి. కాబట్టి అక్కడ విద్యాప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించొచ్చు. అంతర్జాతీయ విద్యార్థులు పీహెచ్డీ (డాక్టోరల్) కోర్సులు చదివితే, వారికి దేశీయ విద్యార్థులతో సమానమైన, చాలా తక్కువ ఫీజు వర్తిస్తుంది. ఇక విదేశీ విద్యార్థి వీసా కోసం జీవన వ్యయాలు, తిరుగు ప్రయాణ ఖర్చులు చూపించాల్సి ఉంటుంది. విరామ సమయాల్లో పూర్తి సమయం పనిచేయడానికి అనుమతి ఉంది. న్యూజీలండ్లో చదువుకున్న తర్వాత అక్కడ స్థిరపడటం కూడా సులభమే.మొత్తానికీ అమెరికా చాన్స్ పోయిందని నిరాశపడే భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా దేశాలు వెల్కమ్ బోర్డ్తో ఎదురుచూస్తున్నాయి. ఆ నిరాశను వదిలేసి చుట్టూ ప్రపంచం వైపు చూస్తే మారేదేం లేదు.. విమానాశ్రయంలో ఫ్లైట్ పేరు తప్ప అంటున్నారు అనుభవజ్ఞులు.ఉత్తమమైన దేశాన్ని ఎలా ఎంచుకోవాలి?విదేశాల్లో కెరీర్ని ప్లాన్ చేసుకునే యువతకు ఆయా దేశాల్లో చదువుకోవడానికి, ఆపై అక్కడే పని చేయడానికి, అక్కడే స్థిరపడటానికి ఏ దేశాన్ని ఎంచుకోవాలి అనేది ప్రధాన సమస్య. కొన్ని దేశాలు సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ (స్థిరనివాసం) పొందే మార్గాలను అందిస్తాయి. అయితే ఏ దేశాలను ఎంచుకుంటే మేలు జరుగుతుంది?సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, స్థిరనివాస మార్గాలు ఎక్కువగా ఉన్న దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్ వంటి దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు చాలా అనుకూలమైన వీసా విధానాలను పాటిస్తున్నాయి. దాంతో ఈ దేశాలలో పర్మనెంట్ రెసిడెన్సీ (స్థిరనివాసం)పొందే మార్గాలు కూడా సులభంగా ఉంటాయి.కెరీర్ వృద్ధి కోసం ఇంగ్లీష్ మాట్లాడే లేదా ఇంగ్లీష్ బోధించే దేశాలను ఎంచుకోవాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, యూకే వంటి ఇంగ్లిష్ మాట్లాడే దేశాలు మన భారతీయులకు భాషాపరంగా సౌకర్యంగా ఉంటాయి. అయితే జర్మనీ, నెదర్లండ్స్ వంటి కొన్ని నాన్–ఇంగ్లిష్ దేశాలు ఇంగ్లిష్ భాషలో కోర్సులను అందిస్తాయి. కాని, ఉద్యోగం పొందాలంటే మాత్రం స్థానిక భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునేవారు ఎడ్యుకేష సమయంలో స్థానిక భాష నేర్చుకోవడంపై కాస్త దృష్టిపెట్టాలి.ఏ రంగంలో చదువుకోవాలనుకుంటున్నారో దాని ఆధారంగా మనం ఎన్నుకునే యూనివర్సిటీల విషయంలో కోక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్), టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) వంటి సంస్థల ప్రపంచ ర్యాంకింగ్లను పరిశోధించుకోవాలి. ఆయా విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లకు ఎంత సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయో, వారి సగటు జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. యూనివర్సిటీల అధికారిక వెబ్సైట్లు లేదా లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫారమ్లలో ఈ వివరాలు లభిస్తాయి.ఒక దేశాన్ని ఎంచుకునే ముందు, అక్కడ అంతర్జాతీయ విద్యార్థులకు ఎంత భద్రత ఉందో తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎలాంటి సహాయక సేవలు (అకాడెమిక్ సపోర్ట్, కౌన్సెలింగ్, కెరీర్ గైడె¯Œ ్స) అందిస్తున్నాయో పరిశీలించుకోవాలి. ఆ దేశంలో జీవన వ్యయం (అద్దె, ఆహారం, రవాణా) సహా విద్యార్థి సంఘాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి.చదువుకునే సమయంలో ఆయా దేశాల్లో తమ వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకోవడానికి స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. చదువుతున్నప్పుడే ఇంటర్న్షిప్లు లేదా పార్ట్–టైమ్ ఉద్యోగాలు లభించే అవకాశాలున్న దేశాలను ఎంచుకోవడంతో వృత్తి అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, స్థానిక భాష కూడా నేర్చుకోవచ్చు. -
చిన్న బిజినెస్.. పెద్ద మ్యాజిక్!
నేటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపార యజమానులందరూ సులభంగా, వేగంగా, సురక్షితంగా పని చేయాలనుకుంటే, ఒక్కసారి ఈ స్మార్ట్ టూల్స్ ప్రయత్నించాల్సిందే!పేపర్ ప్లస్ డిజిటల్ మ్యాజిక్ఒకప్పుడు నోట్స్ రాస్తే కేవలం కాగితాలకే పరిమితం అయ్యేది. ఒక్క కాగితం మిస్ అయినా, రాసిన మాట, గీసిన డ్రాయింగ్ అంతా మాయం అవుతుంది. ఇప్పుడు ‘హుయిన్ డిజిటల్ నోట్బుక్’తో ఆ భయం పూర్తిగా తొలగింది. ఇది కేవలం ఒక నోట్బుక్ కాదు, పేపర్ ప్లస్ డిజిటల్ టాబ్లెట్. ఇందులో రాసిన ప్రతి అక్షరం, గీసిన ప్రతి లైన్ వెంటనే మీ డివైస్లో స్టోర్ అవుతుంది. ఆడియో రికార్డ్ ఫీచర్తో, మీ వాయిస్ కూడా నోట్స్తో కలిసి రికార్డ్ అవుతుంది. ఒక్క క్లిక్తో షేర్ చేసుకోవచ్చు కూడా. పేజీలను మిళితం చేయడం, విడగొట్టడం చాలా సులభం. ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయడానికి సులభమైన టూల్స్ కూడా ఉన్నాయి. ధర రూ. 7,105 ల ప్యాక్లో ఒక హుయిన్ నోట్, ఏ ఐ నోట్ ప్యాడ్, యూఎస్బీ కేబుల్, మాగ్నెటిక్ పెన్ స్లీవ్, రీఫిల్స్, ప్లాస్టిక్ పెన్ నిబ్స్, మార్గదర్శక పుస్తకంతో వస్తుంది.ఒక్క కార్డు చాలు! ఒకప్పుడు పాత పేపర్ విజిటింగ్ కార్డ్ అంటే స్టేటస్ సింబల్. ‘ఇదిగో నా కార్డ్’ అంటూ ఇచ్చేసి స్టయిల్ కొట్టేవాళ్లు. కాని, నిజం చెప్పాలంటే ఆ కార్డుల ఫ్యూచర్ బాగుండేది కాదు. రోజుల తరబడి జేబులో మురిగి, కాఫీ కప్పుల కింద నలిగి, చివరికి ఏ డస్ట్బిన్లోనో ఎండ్ అయ్యేది. అలాంటప్పుడు వాటికోసం అనవసరంగా ఖర్చు ఎందుకు చేయటం. కేవలం, ఒక్క టాప్తోనే మీ పేరు, నంబర్, వెబ్సైట్, సోషల్ మీడియా అన్నీ ఎదుటివారి మొబైల్లో బజ్ అయ్యే మాయ చేస్తుంది ఈ ‘టాప్మో స్మార్ట్ బిజినెస్ కార్డ్’. ఇందులో చిన్న లోగో, క్యూ ఆర్ కోడ్, లైఫ్టైమ్ వాలిడిటీ అన్నీ రెడీ! యాప్ డౌన్లోడ్ అనే తలనొప్పి లేదు, ‘కార్డులు అయిపోయాయి’ అనే టెన్షన్ లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు కూడా. ధర కేవలం రూ. 599 మాత్రమే!పోర్టబుల్ సర్వర్స్మాల్ బిజినెస్ ఓనర్స్కు కస్టమర్ డేటా, ఫైనాన్స్ రికార్డులు, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ రక్షించుకోవాలంటే పెద్ద సర్వర్ అవసరమా? లేనే లేదు! బిజినెస్ డీటైల్స్ అన్నీ ఒకే చోట, సురక్షితంగా ఉంచాలంటే ‘అప్రికార్న్ ఏజిస్ ప్యాడ్లాక్’ బెస్ట్ ఆప్షన్. 480 జీబీ స్టోరేజ్, 256–బిట్ ఎన్క్రిప్షన్, రగ్డ్ బాడీ, టూ స్టెప్ వెరిఫికేషన్తో ఏ ఫైల్ అయినా సేఫ్గా స్టోర్ చేస్తుంది. ఇది కేవలం స్టోరేజ్ సర్వర్ మాత్రమే కాదు, చిన్న బిజినెస్కి నమ్మకమైన డేటా గార్డు. ఆఫీస్లోనైనా, ఇంట్లోనైనా, ట్రావెల్లోనైనా సులభంగా ఉపయోగించవచ్చు. చిన్న, పోర్టబుల్ బాడీతో జేబులోనైనా పెట్టుకుని క్యారీ చేయవచ్చు. ఏకకాలంలో డేటా యాక్సెస్, బ్యాకప్, షేర్ అన్నీ సులభం. ధర రూ. 49,325. -
అభాగ్యుల పాలిటి అన్నదాత
∙విఎస్ సాయిబాబాఅతనొక మధ్యతరగతి యువకుడు. బంధువుల ఇళ్లకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినపుడు వృద్ధులు, ఆస్తి ఉన్నా పట్టెడన్నం పెట్టే దిక్కులేని, కుటుంబసభ్యులు పట్టించుకోని అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్న వైనం అతడిని ఎంతగానో బా«ధించింది. అలాంటి అభాగ్యుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడతను. అతడే మళ్ల తులసీరామ్ (రాంబాబు). అతడి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని పంజా వేమవరం.రాంబాబు ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు. నాలుగెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే సాదాసీదా యువరైతు. ఉన్న భూమిలోనే కొంత విస్తీర్ణంలో రొయ్యల సాగు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. క్రమంగా రియల్ ఎస్టేట్, రైస్మిల్లుల వ్యాపారాల్లోకి ప్రవేశించి, ఆర్థికంగా మరింత పుంజుకున్నారు. తులసీ కన్వెన్షన్ పేరుతో కల్యాణమండపం నిర్మించారు.ఆర్థికంగా బలపడటంతో అన్నార్తులు, అభాగ్యులైన వృద్ధుల కోసం ఏదైనా చేయాలనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కార్యాచరణకు దిగారు. భార్య, కుమారుడు, కుమార్తె కూడా తన సంకల్పానికి ప్రోత్సాహం ఇవ్వడంతో 2019 అక్టోబర్ నుంచి ఇంటింటికీ భోజనం క్యారియర్స్ పంపడం ప్రారంభించారు.18 గ్రామాల్లోని 160 మందికివీరవాసరంలో తాను నిర్మించిన తులసీ కల్యాణ మండపంలోనే ప్రతి రోజు ఉదయం వంట తయారు చేసి పంజా వేమవరం పరిసర గ్రామాలైన చింతలకోటిగరువు, తోకలపూడి, తోలేరు, రాయకుదురు, కొణితివాడ, జొన్నలగరువు, నవుడూరు, అండలూరు, ఉత్తరపాలెం, బలుసుగొయ్యపాలెం తదితర 18 గ్రామాల్లోని 160 మందికి ప్రతిరోజూ ఇంటి వద్దకే భోజనం క్యారియర్స్ పంపడం మొదలుపెట్టారు.వివక్షకు తావు లేకుండా...కులమత ఆర్థిక తారతమ్యాలకు తావులేకుండా, వయోభేదం లేకుండా కడుపునిండా భోజనానికి నోచుకోని వారిని ఎంపిక చేసుకుని, వారికి ప్రతిరోజూ భోజనం క్యారియర్లు పంపుతున్నారు. ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు ఉండి, తల్లిదండ్రులను పట్టించుకోని కొందరికి రాంబాబు పంపే క్యారియర్ ఒక చెంపదెబ్బ! తమ తల్లిదండ్రులకు రాంబాంబు క్యారియర్ పంపడంతో, పరువుపోతుందని భయపడిన పిల్లలు తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోవడం మొదలుపెట్టిన సంఘటనలు అనేకం!విరాళాలు నిరాకరిస్తూ..ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకే వంట తయారుచేసి క్యారియర్స్లో సర్ది, అన్నార్తుల ఇంటికి ఒక ఆటో బయలుదేరుతుంది. సుమారు ఉదయం 11 గంటల లోపుగానే రాంబాబు పంపించే భోజనం క్యారియర్ 160 మందికి చేరిపోతుంది. రోజూ ఒకే రకమైన వంటకం కాకుండా; ప్రతి సోమ, గురు, శనివారం రోజుల్లో పప్పు, మంగళ, శుక్రవారాలు కూరగాయలు, బు«ధ, ఆదివారాలు చేపలు లేదా మాంసం లేదా రొయ్యల కూరతో భోజనం కార్యియర్స్ సిద్ధం చేస్తారు. వారం రోజులపాటు రసం, మజ్జిగపులుసు, సాంబారు ఏదో ఒకటి తప్పనిసరి. మాంసాహారం తినని వారికి శాకాహార భోజనమే పంపిస్తారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, వీరందరికీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ భోజనం క్యారియర్లు వేళకు అందుతాయి. ఈ పని సజావుగా సాగడానికి ఆరుగురు పనిమనుషులను నియమించుకున్నారు. ఎప్పుడైనా వంటమనిషి రాకుంటే, రాంబాబే స్వయంగా వంట చేస్తారు. కుటుంబ సభ్యులు అతనికి సహకరిస్తారు. ఈ మహత్కార్యంలో తామూ భాగస్వాములం అవుతామని కొందరు విరాళాలు ఇస్తామంటూ ముందుకు వచ్చినా, రాంబాబు సున్నితంగా తిరస్కరిస్తారు. తన తదనంతరం కూడా ఈ కార్యక్రమాన్ని తన కుటుంబ సభ్యులు నిరంతరాయంగా కొనసాగించేందుకు వీలుగా తానే ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రాంబాబు చెబుతున్నారు.అన్నం పెట్టి ఆదుకుంటున్నారుగత రెండేళ్లుగా రాంబాబు పెట్టే భోజనంతోనే బతుకుతున్నాను. నన్ను చూసుకునేవారు ఎవరూ లేరు. గ్రామస్థులు చెప్పిన మాటతో భోజనం క్యారియర్ పంపిస్తున్నారు. భోజనం చాలా బాగుంటుంది.వరహాలు,జొన్నలపాలెం, వీరవాసరం మండలం.రాంబాబే దిక్కునా భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నా, వారు నన్ను పట్టించుకోరు. నాకు తిండిపెట్టే దిక్కులేని సమయంలో రాంబాబే నాకు దిక్కయ్యారు. ప్రతిరోజూ ఆయన పంపే భోజనం తింటున్నాను.వెంకటేశ్వరరావు, కొణితివాడ, వీరవాసరం మండలం.పదికాలాలు క్షేమంగా ఉండాలిరాంబాబు పంపించే భోజనం చాలా బాగుంటుంది. ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం కాకుండా, పండుగ రోజుల్లో మరింత ప్రత్యేంగా భోజనం అందించడం చాలా సంతోషం. అడగకుండానే అన్నంపెట్టే రాంబాబులాంటి వ్యక్తి పదికాలాలపాటు క్షేమంగా ఉండాలి.అప్పారావు, కొణితివాడ.కడుపు నింపడంలోనే సంతృప్తిసంపాదించిన దానిలో కొంతమొత్తంతో కొందరి ఆకలి తీర్చడం కన్నా సంతృప్తి మరొకటి లేదు. ఈ పని తలపెట్టినప్పుడు ఎంతో ఆలోచించాను. నా కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో ముందడుగు వేశాను. ‘కోవిడ్’ సమయంలో రెండు మూడు నెలలు మినహా ప్రారంభించిన నాటి నుంచి నిరంతరాయంగా ఈ భోజనం క్యారియర్ల పంపిణీ కొనసాగుతోంది. ఇన్నాళ్లుగా భోజనాలు పంపుతున్నా, రాంబాబు అనే పేరు తప్ప నేనెవరో క్యారియర్లు అందుకుంటున్న చాలామందికి ప్రత్యక్షంగా తెలియదు.మళ్ల తులసీరామ్(రాంబాబు), నిర్వాహకుడు, పంజా వేమవరం. -
దుర్వాసుడి నరక సందర్శనం
దుర్వాసుడు ఒకసారి పితృలోకానికి వెళ్లాడు. శరీరం నిండా విభూతిని అలంకరించుకుని, రుద్రాక్షమాలలు ధరించి, ‘శివా! శంకరా! పరమేశ్వరా! జగన్మాతా! జగదంబికా!’ అంటూ పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ అడుగుపెట్టిన దుర్వాసుడిని కవ్యవాలాదులైన పితృదేవతలు ఎదురేగి స్వాగతించారు. దుర్వాసుడిని వారు ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి, అతిథి మర్యాదలు చేశారు. కుశల ప్రశ్నలు వేశారు. కబుర్లతో వారు కాలక్షేపం చేస్తుండగా, ఎక్కడి నుంచో ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించసాగాయి.ఆ ఆర్తనాదాలకు, హాహాకారాలకు దుర్వాసుడు కలత చెందాడు. ‘హృదయవిదారకంగా ఉన్న ఈ రోదనలు, హాహాకారాలు ఎక్కడివి?’ అని అడిగాడు.‘మునీశ్వరా! ఇక్కడికి సమీపంలోనే యమలోకం ఉంది. అక్కడ పాపులను శిక్షించడానికి యమధర్మరాజు ఉన్నాడు. అతడి అధీనంలో వేలాదిగా యమదూతలు ఉన్నారు. యమలోకంలో ఎనభైఆరు నరకకూపాలు ఉన్నాయి. వాటిలో భయంకరమైనది కుంభీపాక కూపం. మహాపాపులను తెచ్చి, అందులో పడవేసి, వారిని యమదూతలు ఘోరంగా శిక్షిస్తుంటారు. వారి శిక్షల యాతనను వర్ణించడం అసాధ్యం. శిక్షలు అనుభవిస్తున్న పాపుల ఆర్తనాదాలు, రోదనలు ఇక్కడి వరకు వినిపిస్తూ ఉంటాయి. దైవనింద, గురునింద, పరపీడన, నారీపీడన, మాతృ పితృనింద, మిత్రద్రోహం, స్వామిద్రోహం వంటి మహాపాపాలు చేసి వచ్చిన వారికి శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి. శిక్షల బాధ తాళలేక ఆ పాపులు చేసే ఆర్తనాదాలు మేము రోజూ వింటూనే ఉంటాం. వారి ఆర్తనాదాలు వింటే చాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది’ అని చెప్పారు.నరకం నుంచి వినిపించే పాపుల ఆర్తనాదాలు వింటూ దుర్వాసుడు పితృలోకంలో ఉండలేకపోయాడు. చటుక్కున లేచి, వడివడిగా అడుగులు వేస్తూ నరకం వైపు బయలుదేరాడు. కొద్దిసేపటికే అతడు నరకానికి చేరుకున్నాడు. పెద్దపెట్టున ఆర్తనాదాలు వినిపిస్తున్న కుంభీపాక కూపం వద్దకు వెళ్లాడు. గట్టున నిలబడి లోనికి చూశాడు. అప్పటి వరకు మిన్నుముట్టిన ఆర్తనాదాలు ఆగిపోయి, కేరింతలు మొదలయ్యాయి. కుంభీపాక కూపంలో ఉన్న పాపులు ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆనంద కేళీ విలాసాలు సాగిస్తూ కనిపించారు. యమలోకం గురించి పితృలోకంలో తాను విన్నదొకటి, తాను స్వయంగా చూస్తున్నది వేరొకటిగా ఉండటంతో దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు.దుర్వాసుడు మాత్రమే కాదు, పాపులకు శిక్షలు అమలు చేస్తున్న యమదూతలు కూడా ఈ ఆకస్మిక పరిణామానికి నివ్వెరపోయారు. కఠిన శిక్షలకు యాతనలు అనుభవిస్తూ హాహాకారాలు చేయవలసిన పాపులందరూ కేరింతలు కొడుతూ ఆనందకేళీ నృత్యాలు చేస్తుండటం వారిని అయోమయంలో పడేసింది. కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉండటం విడ్డూరంగా తోచింది. ఎంతగా తరచి చూసినా ఈ పరిస్థితికి కారణమేమిటో కనిపించలేదు. ఇదేదో మాయలా ఉందని తలచి యమదూతలు హుటాహుటిన యమధర్మరాజు వద్దకు వెళ్లారు. ‘స్వామీ! కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉన్నారు. కొద్దినిమిషాల కిందటి వరకు హాహాకారాలు చేసిన వారే ఇప్పుడు ఉల్లాసంగా కేరింతలు కొడుతున్నారు. దీనికి కారణమేమిటో మాకు ఏమాత్రం అంతుచిక్కకుంది. మీరే ఒకసారి స్వయంగా వచ్చి పరిశీలించండి’ అని చెప్పారు.యమదూతల మాటలకు యమధర్మరాజు ఉలిక్కిపడ్డాడు. కుంభీపాకంలో ఏం జరుగుతోందో చూడటానికి వెంటనే మహిష వాహనాన్ని అధిరోహించాడు. ఎందుకైనా మంచిదని ఇంద్రుడు సహా ఇతర దిక్పాలకులకు, బ్రహ్మ విష్ణువులకు కబురు పెట్టాడు.యముడు, ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మ విష్ణువులు దాదాపు ఒకేసారి కుంభీపాక కూపం వద్దకు చేరుకున్నారు. లోపల ఉన్న పాపులు ఆనంద పరవశులై కేరింతలు కొడుతున్న దృశ్యాన్ని కళ్లారా చూశారు. ఇది నరకకూపం కాదు, పాపుల కోసం ఏర్పాటు చేసిన భోగకూపంలా ఉందని వారంతా నివ్వెరపోయారు. ఈ విడ్డూరానికి కారణమేమిటో వారెవరికీ అంతుచిక్కలేదు.బ్రహ్మ విష్ణువులు ఇంద్ర యమధర్మరాజులతో తర్జనభర్జనలు జరిపారు. ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో వారికి తోచలేదు. పరమశివుడిని అడిగితే దీనికి కారణమేమిటో చెప్పగలడని వారంతా ఏకగ్రీవంగా అనుకున్నారు. దిక్పాలకులను, ఇంద్రుడిని, యముడిని వెంటబెట్టుకుని బ్రహ్మ విష్ణువులు నేరుగా కైలాసానికి వెళ్లారు. వారంతా శివుడికి నమస్కరించారు. యమలోకపు వింతను వివరించారు. ‘మహేశ్వరా! ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో మాకు తోచకున్నది. నువ్వు సర్వజ్ఞుడివి. దీనికి కారణమేమిటో నువ్వే చెప్పాలి’ అన్నాడు విష్ణువు.‘మహావిష్ణూ! ఇందులో వింతా లేదు, విడ్డూరమూ లేదు. ఇదంతా విభూతి మహిమ. కుంభీపాకం వద్దకు దుర్వాసుడు వచ్చాడు కదా! నా భక్తుడైన దుర్వాసుడు విభూతిని ధరించాడు. కుంభీపాకం వద్ద అతడు నిలిచి, తలవంచి లోనికి చూశాడు. అప్పుడు అతడి నుంచి విభూతి రేణువులు రాలి ఆ పాపుల మీద పడ్డాయి. అవి పడిన వెంటనే పాపుల యాతనలు మటుమాయమైపోయాయి. కుంభీపాక కూపం స్వర్గతుల్యంగా మారింది. ఇకపై అది పితృలోక వాసులకు పవిత్ర తీర్థమవుతుంది. అందులో స్నానమాచరించిన పితృదేవతలు సుఖపడతారు. అక్కడ ఆలయం నిర్మించి, మా దంపతులను ప్రతిష్ఠించండి. ప్రీతీశ్వరి, ప్రీతీశ్వరులుగా అందులో కొలువుదీరుతాం. పితృలోక వాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోనూ ఇదే పవిత్ర తీర్థమవుతుంది’ అని ప్రకటించాడు శంకరుడు. దేవతలందరూ శివుడి వద్ద సెలవు పుచ్చుకుని బయలుదేరారు. పరమశివుడు చెప్పినట్లుగానే కుంభీపాకం వద్ద తీర్థాన్ని, ఆలయాన్ని నిర్మించారు. అప్పటి వరకు కుంభీపాకంలో ఉన్నవారంతా దివ్యవిమానాల్లో కైలాసానికి చేరుకున్నారు.∙సాంఖ్యాయన -
శాంతి కోసం యుద్ధం చేశారు!
మహిళలు శాంతి దూతలు. శాంతి కోసం అవసరం అయితే వారు వీధి పోరాట యోధులు కూడా కాగలరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కళ్లెదుటి వర్తమానం. నోబెల్ బహుమతులు మొదలయ్యాక ఈ 125 ఏళ్లలో ఇప్పటి వరకు 19 మంది మహిళలు శాంతి విజేతలయ్యారు. ఇది చిన్న సంఖ్యలా అనిపించినా, శాంతి సాధనలో మహిళల సంకల్ప బలానికి ఆకాశమంత సాక్ష్యం. 20 వ మహిళా శాంతి బహుమతి విజేత ఎవరన్నది (ఒకవేళ మహిళే విజేత అయితే) ఈ నెల 10 న నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. ఈసారి ‘శాంతి’ బహుమతికి 224 మంది వ్యక్తులు, 94 సంస్థలు పోటీలో ఉండగా... వాళ్లలో కొందరు మహిళలూ ఉన్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతిని పొందిన పందొమ్మిది మంది మహిళల వివరాలు.. మీ కోసం, క్లుప్తంగా.1905 బెర్తా వాన్ సట్నర్ (1843–1914) ఆస్ట్రియా యుద్ధాన్ని వ్యతిరేకించటంలో చూపిన తెగువకు బెర్తాకు ‘నోబెల్ శాంతి’ లభించింది. 19వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటైన యుద్ధ వ్యతిరేక నవల ‘లే డౌన్ యువర్ ఆర్మ్స్’ (1889) బెర్తా రాసిందే. ఈ నవల పేరు అప్పట్లో చాలామందికి రెచ్చగొట్టేదిగా అనిపించింది. బెర్తా అంతర్జాతీయ శాంతి ఉద్యమ నాయకులలో ఒకరు. 1891లో ఆస్ట్రియన్ శాంతి సమాజాన్ని స్థాపించారు. పురుషాధిక్య శాంతి సమావేశాలలో శక్తిమంతమైన నాయకురాలిగా నిలిచారు.1931జేన్ ఆడమ్స్ (1860–1935), అమెరికామానవాళిలో శాంతి స్ఫూర్తిని రగిలించడానికి చేసిన నిరంతర కృషికి జేన్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. జేన్ 1915లో ‘విమెన్స్ ్స ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ను స్థాపించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నెదర్లండ్స్లోని హేగ్లో జరిగిన మహిళల శాంతి సమావేశానికి జేన్ అధ్యక్షత వహించారు. అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్స్ అమెరికాను యుద్ధంలోకి దింపినందుకు వ్యతిరేకంగా జేన్ చాలా బిగ్గరగా నిరసన తెలిపారు. 1946ఎమిలీ గ్రీన్ బాల్చ్ (1867–1961), అమెరికానిరాయుధీకరణ, శాంతి స్థాపనల కోసం ఎమిలీ జీవితాంతం చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ ఆమెకు అమెరికా ప్రభుత్వం నుండి ఎటువంటి అభినందనలూ అందలేదు! మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె 1931 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జేన్ ఆడమ్స్తో కలిసి, యుద్ధాన్ని ఆపడానికి జోక్యం చేసుకోవాలని తటస్థ దేశాల దేశాధినేతలను ఒప్పించారు. 1935లో ఎమిలీ ‘విమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ కు నాయకత్వం వహించారు.1976 బెట్టీ విలియమ్స్ (1943–2020), యు.కె.ఉత్తర ఐర్లండ్లో ప్రొటెస్టెంట్లకు, కేథలిక్కులకు మధ్య రగులుతున్న హింసాత్మక సంఘర్షణలకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి, మైరీడ్ కొరిగన్ అనే మహిళతో పాటుగా బెట్టి విలియమ్స్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1976 ఆగస్టులో, బెల్ఫాస్ట్లో (ఉత్తర ఐర్లండ్) జరిగిన కాల్పుల ఘటనలో అమాయకులైన ముగ్గురు చిన్నారులు మరణించారు. గృహిణి అయిన బెట్టీ విలియమ్స్ ఆ విషాదాన్ని చూసి, ఉత్తర ఐర్లండ్లో ఘర్షణలు ఆపాలని నిర్ణయించుకుని, శాంతి పునరుద్ధరణకు పాటు పడ్డారు. 1976 మైరీడ్ కొరిగన్ (1944 –), యు.కె.మైరీడ్ బెల్ఫాస్ట్లో ఒక పేద కుటుంబంలో పెరిగారు. యువతిగా ‘లెజియన్ ఆఫ్ మేరీ’ అనే కాథలిక్ సంస్థలో సేవలందించారు. 1976, 1977లలో ఉత్తర ఐర్లండ్లో ఘర్షణలు, హింసకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు వేలాది మందిని ఒకచోట చేర్చారు. బెట్టీ విలియమ్స్తో కలిసి పని చేశారు. ఆమెతో నోబెల్ శాంతిని పంచుకున్నారు. 1979మదర్ థెరిసా (1910 – 1997), ఇండియామానవాళికి అసమాన సేవలను అందించినందుకు మదర్ థెరిసాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అల్బేనియా కేథలిక్ బాలిక అయిన ఆగ్నెస్ గోంక్షా బోజాక్షియు తన పన్నెండేళ్ల వయసులోనే మానవాళి సేవకు అంకితం అయ్యారు. తదనంతర కాలంలో ఇండియాకు వచ్చి థెరిస్సాగా మారిపోయారు. పేదలను ఆదుకునేందుకు ఆమె స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ కలకత్తాలో అనాథల కోసం ఇళ్లు, కుష్ఠురోగులకు నర్సింగ్ హోమ్లు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాలను నిర్మించింది.1982అల్వా మిర్డాల్ (1902–1986), స్వీడన్1962లో స్వీడిష్ పార్లమెంటుకు ఎన్నికవటానికి ముందే అల్వా మిర్డాల్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. యుద్ధానంత కాలంలో సోషల్ డెమోక్రాట్ పార్టీ ద్వారా కార్మికవర్గ పరిస్థితులను మెరుగుపరచడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. మహిళల హక్కుల ప్రచారకర్తగా ప్రసిద్ధి చెందారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రముఖ పదవులను నిర్వహించారు. ఆమె చేసిన నిరాయుధీకరణ ప్రయత్నాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1991ఆంగ్ సాన్ సూకీ (1945–) బర్మాబర్మాలో పౌర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించాలని సైనిక నాయకులతో పోరాడారు. 1990లో ఆమె పార్టీ ఎన్.ఎల్.డి. స్పష్టమైన విజయం సాధించినా, అప్పటికే గృహ నిర్బంధంలో ఉన్న సూకీని విడుదల చేయటానికి సైన్యం నిరాకరించింది. 21 సంవత్సరాలలో దాదాపు 15 సంవత్సరాలు ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. 2021 ఫిబ్రవరి 1న సైనిక దళాలు తిరుగుబాటు చేసి, సూకీకి మళ్లీ 8 సంవత్సరాల జైలు శిక్ష విధించాయి. ఆమె అహింసాయుత ప్రజా పోరాటం ఆమెకు నోబెల్ శాంతిని తెచ్చిపెట్టింది.1992రిగోబెర్టా మెంచు తుమ్ (1959–) గ్వాటెమాలారిగోబెర్టా మెంచు తుమ్ స్థానిక ఆదివాసీల హక్కుల కోసం కృషి చేసినందుకు గాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడుతున్న సైన్యం ఆమె సొంత కుటుంబంలోని అనేక మందిని చంపింది. దాంతో ఆమె 1980ల ప్రారంభంలో మెక్సికోలో తలదాచుకున్నారు. అక్కడ మానవ హక్కుల కోసం పనిచేస్తున్న యూరోపియన్ సమూహాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గ్వాటెమాలా తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వం – గెరిల్లా సంస్థల మధ్య చర్చలలో మధ్యవర్తిగా పని చేశారు. 1997జోడీ విలియమ్స్ (1950 –) అమెరికాజోడీ మందు పాతరల వ్యతిరేక ఉద్యమ నాయకురాలు. 1980లలో యుద్ధంలో దెబ్బతిన్న ఎల్ సాల్వడార్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కాలంలో మందు పాతరలు పౌర జనాభాకు నిరంతరం ముప్పుగా ఉండేవి. వాటి వల్ల చేతులు, కాళ్లు కోల్పోయిన పిల్లలకు కృత్రిమ అవయవాలను అందించే బాధ్యతను ఆమె తీసుకున్నారు. 1991 నుండి మందుపాతరలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించడంలో ముందు నిలిచారు. నోబెల్ విజేత అయ్యారు.2003షిరిన్ ఎబాది (1947–), ఇరాన్ఇస్లామిక్ ప్రపంచం నుంచి తొలి మహిళా శాంతి బహుమతి గ్రహీత. ఇరాన్ తొలి మహిళా న్యాయమూర్తులలో ఒకరు. బ్యూరోక్రసీ పీడనను వ్యతిరేకించారు. పై అధికారులను విమర్శించినందుకు జైలుపాలు అయ్యారు. కనీస మానవ హక్కుల కోసం; ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాటాన్ని చేపట్టారు. ఇందుకే ఆమెకు నోబెల్ లభించింది. మతం నుండి రాజకీయాలను వేరుచేయాలనే వాదనకు ఎబాది మద్దతుగా నిలిచారు. 2004వంగారి మాతై (1940–2011), కెన్యానోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆఫ్రికన్ మహిళ. తూర్పు, మధ్య ఆఫ్రికా నుండి డాక్టరేట్ (జీవశాస్త్రంలో) పొందిన తొలి మహిళ. స్వదేశమైన కెన్యాలో తొలి మహిళా ప్రొఫెసర్ కూడా. కెన్యా ప్రజాస్వామ్య పోరాటంలో చురుకైన పాత్ర వహించారు. 1977లో అడవుల సంరక్షణకు ఉద్యమం ప్రారంభించారు. ‘గ్రీన్ బెల్ట్’ అనే ఆ ఉద్యమం ఇతర ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది, మూడు కోట్లకు పైగా చెట్లను నాటడానికి దోహదపడింది. సుస్థిరాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషికి నోబెల్ దక్కింది. 2011ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ (1938 –), లైబీరియాఆఫ్రికాలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన తొలి మహిళా దేశాధినేత. శాంతిని ప్రోత్సహించ డానికి, మహిళల హక్కుల కోసం పోరాడారు. 2005లో అధికారంలోకి వచ్చి, దేశంలో శాంతి సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి, మహిళల హక్కుల కోసం పాటుపడ్డారు. ఇందుకే నోబెల్ పొందారు. ఇతర ఆఫ్రికన్ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ అమెరికాలో చదువుకున్నారు. అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక రాజకీయ ఉద్యమబాట పట్టారు. 2011లేమా బోవీ (1972–), లైబీరియాశాంతిని నెలకొల్పటానికి, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. 1990లో లైబీరియాలో అంతర్యుద్ధంలో గాయపడిన బాల సైనికుల సంరక్షణ కోసం ట్రామా థెరపీలో శిక్షణ పొందారు. లేమా నేతృత్వంలోని ‘విమెన్ మాస్ యాక్షన్ ఫర్ పీస్’.. క్రైస్తవ, ముస్లిం మహిళల సంయుక్త ఆధ్వర్యంలో శాంతి, అహింసల సందేశాన్ని అందించే సమావేశాలను నిర్వహించారు. 2008లో, లైబీరియన్ అంతర్యుద్ధంలో మహిళల పోరాటంపై వచ్చిన అవార్డు డాక్యుమెంటరీ చిత్రం ‘ప్రే ది డెవిల్ బ్యాక్ టు హెల్‘లో లేమా కీలక పాత్ర పోషించారు. 2011తవక్కోల్ కర్మాన్ (1979–), యెమెన్జర్నలిస్ట్. యెమెన్స్ లో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం కృషి చేశారు. అధ్యక్షుడు సలేహ్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అనేక నిరసనలకు నాయకత్వం వహించారు. ‘విమెన్ జర్నలిస్ట్స్ వితౌట్ చైన్స్ ్స’ అనే సంస్థను స్థాపించారు. ఉద్యమశీలిగా జైలు శిక్ష అనుభవించారు. హింసలకు గురయ్యారు. 2011లో షియా– సున్నీ ముస్లింల మధ్య; ఇస్లాం–ఇతర మతాల మధ్య సయోధ్యను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ప్రశంసలు అందుకున్నాయి. 2014 మలాలా యూసఫ్జాయ్ (1997–), యు.కె.ప్రతి చిన్నారికీ చదువుకునే హక్కు ఉందని పోరాడినందుకు మలాలాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె పాకిస్తాన్స్ లోని స్వాత్ లోయలో జన్మించారు. 2012లో తాలిబాన్లు పాఠశాల బస్సుపై కాల్పులు జరిపినప్పుడు మలాలా తలపై గాయమైంది. ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అవటంతో ఆమె బ్రిటన్లో ప్రవాసంలో నివసించాల్సి వచ్చింది. ఆమె తన 16వ పుట్టినరోజున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యకు సమాన హక్కుల కోసం పిలుపునిచ్చారు. 2018నాదియా మురాద్ (1993–), ఇరాక్లైంగిక హింసను యుద్ధాలలో ఆయుధంగా ఉపయోగించటంపై పోరాటం చేశారు. ఇరవై ఒక్క ఏళ్ల నాదియాను, ఇతర యువతులను ‘ఐ.ఎస్.’ ఉగ్రవాదులు అపహరించి లైంగిక బానిసలుగా చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత, నాదియా తప్పించుకుని 2015లో జర్మనీ చేరుకున్నారు. ‘ది లాస్ట్ గర్ల్‘ అనే పేరుతో ఆత్మకథను రాశారు. తనపై జరిగిన దురాగతాలను అందులో వివరించడం ద్వారా, భవిష్యత్ తరాల బాలికలు, యువతులు యుద్ధంలో లైంగిక హింసకు బాధితులుగా మారకుండా ఉంటారని ఆకాంక్షించారు.2021మరియా రెస్సా (1963–), ఫిలిప్పీన్స్పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడారు. ఫిలిప్పీన్స్ ్స డిలిమాన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన రెస్సా, సీఎన్ఎన్ స్థానిక కరస్పాండెంట్గా పనిచేశారు. ప్రధానంగా ఆగ్నేయాసియాలో ఉగ్రవాదం విస్తరించడంపై ప్రత్యేక వార్తా కథనాలు రాశారు. అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే పాలనాధికార దుర్వినియోగాన్ని, హింసాత్మకమైన నిరంకుశత్వాన్ని బహిర్గతం చేశారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి, ప్రత్యర్థులను వేధించడానికి డూటెర్టే సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారో బయటపెట్టారు.∙∙ 2023నర్గేస్ మొహమ్మది (1972–), ఇరాన్ఇరాన్స్ లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా 20 ఏళ్లకు పైగా పోరాడారు. మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసి 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ఎంపిక జరిగినప్పుడు ఆమె టెహ్రాన్స్ లోని ఎవిన్ జైలులో బందీగా ఉన్నారు. నర్గేస్ తన శాంతి బహుమతి గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వాల కోసం కృషి చేయటాన్ని నేను ఎన్నటికీ ఆపను..’’ అని వ్యాఖ్యానించారు. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
శోకగర్భ
నుదుటి మీద అరచేయి అడ్డుపెట్టి, కళ్ళు విప్పార్చి, ఆకాశంలో ఎగిరే గెద్ద వేపు చూసే పిల్లల కోడిలా దూరంగా కన్పించే వ్యక్తులను ఆందోళనగా చూడసాగేడు మజ్జి సూరపు నాయుడు...వారం రోజులుగా యేదో వేళ, యెవరెవరో వస్తున్నారు. పొలాలను పరిశీలిస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరితోనూ ఏమీ మాటాడడం లేదు. ‘వాళ్ళెవరు?’ ప్రశ్నార్థకంగా చూస్తున్న సూరపు నాయుడి చొక్కా జేబులోని సెల్ మోగింది. నుదుటి మీది అరచేయి తీసి, చొక్కా జేబులోని సెల్ తీసి పట్టుకొని... ‘‘అలో...ఎవుళూ’’ అని ప్రశ్నించాడు. అవతలి వ్యక్తి తాను ఎవరో చెప్పాడు. ‘‘నువ్వా?’’ అన్నాడు సూరపు నాయుడు. అవతలి వ్యక్తి యేమేమో చెప్తున్నాడు. నాయుడు అన్యమనస్కంగా వింటూ, దూరంగా కన్పించే వ్యక్తుల కదలికలు గమనిస్తున్నాడు.‘‘ఇంటన్నవా నా మాటలు? ఉలకవూ పలకవు. ఏటి చేస్తన్నావ్ బావా?’’ అని ప్రశ్నించాడు అవతలి వ్యక్తి.‘‘వోయ్... వోరమ్ రోజుల నించి పొలాలంట ఎవులెవులో తిరగతన్నారోయ్. ఏటో అనుమానంగా వుందోయ్. పొలాలకి గాలి వొచ్చీటట్టుగా వుందోయ్’’ – అని భయాన్ని వ్యక్తం చేశాడు నాయుడు.‘‘ఏనుగులో, ఎలుగుబంట్లో, జెంతువులేవో పొలాలంట తిరిగితే బయపడాల గాని మనుషులు తిరిగితే బయపడతావేటి బావా?’’ ‘‘జెంతువులయితే పంటల్ని తిని ఎలిపోతాయి, మనుషులు గాని అలికిడి అయితే పారిపోతాయి’’... అని బదులు చెప్తున్నాడు నాయుడు.‘‘అయితేటి ఆలెవులో పొలాల్ని వొట్టుకుపోతారా?’’‘‘వొట్టుకుపోరు, తీసీసుకుంటారు.’’‘‘ఇచ్చీ బావా, మంచి ధర గాని ఇస్తే ఇచ్చీబావా. ఏల ఏటా అప్పుల్ని పండిస్తావు? పిల్లల బతుకులు పాడు చేస్తావు. ఇచ్చీ, ఆ డబ్బు వొట్టుకొని ఇక్కడికి వొచ్చీ.’’సూరపు నాయుడిని వొచ్చేయమని పిలిచిన అవతలి వ్యక్తి సూరపు నాయుడి మేనమామ కొడుకు, పసరాపల్లి వూరివాడు.మేనమామకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఫోనులో మాటాడే అవతలి వ్యక్తి మేనమామ చిన్నకొడుకు, సూరపు నాయుడి కంటే నాలుగేళ్ళు పెద్ద. మేనమామ చనిపోయాక అతని ఇద్దరు కొడుకులు ఆస్తి వాటాలు వేసుకుని, వేరు కాపురాలు అయిపోయారు. పసరాపల్లి ప్రాంతాన థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదన రావడం, ఆ ప్రాంత భూములను సేకరించడానికి ప్రభుత్వం పూనుకోవడం, రైతులు ప్రతిఘటించడం, పోలీసు కాల్పుల్లో తన అన్న చనిపోవడం, కేసులు, కోర్టులతో విసిగి, రెండు కుటుంబాలతో హైదరాబాద్ వలస వచ్చేశాడాయన. రెండు కుటుంబాలు కూలీ, నాలీ చేసుకు బతుకుతున్నాయి. తిప్పలెన్ని పడినా, తిండికీ, గుడ్డకీ లోటు లేకుండా గడిచిపోతున్నాయి రోజులు. అందుకే ఆయన సూరపునాయుడ్ని వొచ్చేయమన్నాడు. సూరపు నాయుడు ఆ వ్యక్తితో మాటాడుతూనే పొలం నుంచి వూరి గోర్జీ తోవలోకి నడిచాడు. నడుస్తున్న వాడు ఆగి – ‘‘ఏటివోయ్? పొలం అమ్మీసి, పట్నమొచ్చి ఆ డబ్బులు తిని కూకోమంటావా?’’ అని ప్రశ్నించాడు. ‘‘తిని కూకోడం ఏల బావా? పట్నంల వొవ్వో... బోల్డు పనులు... అపార్ట్మెంట్లల్ల వాచ్మెన్, పెద్ద పెద్దోల్ల బంగ్లాల గేటు కాపలా, యేదో చిన్నా చితకా ఫేక్టరీలల్ల లేబర్ ... ఇలాటివి దొరకవా?’’ అనన్నాడు. ‘‘దొరకవా అని నన్నడుగుతావు? నాకేటి తెలుసు?’’ ప్రశ్నించాడు సూరపు నాయుడు.అవతలి వ్యక్తి, ఆ ప్రశ్నను పట్టించుకోకుండా – ‘‘కాదంటావా... తాపీ పనికో, కళాసీ పనికో యెళ్తే డయిలీ ఇన్కమ్ బావా’’ – అని ఇంగ్లీషులో చెప్పాడు సూరపు నాయుడులో ఆశలు రగిలించడానికి.‘‘వోయ్... రైతోడు చేపలాంటోడువోయ్. పొలమొదిలేస్తే వొడ్డున పడ్డ చేప అయిపోతాడు’’... అన్నాడు నాయుడు. ‘‘వోస్... నీను మరి రైతుని కానేటి? భూమి పోయినపుడు వొచ్చీలేదేటి? వొచ్చిన తొలినాళ్ళు కసింత బెంగగా వుంటాది. ఏదో పని దొరికిన తరాత అలవాటయి పోతాది – వొచ్చీవోయ్. ఒచ్చీ. భూమి ఇచ్చీవోయ్ ఇచ్చీ, పరిహారం అందుకో. అందల కొంత సొమ్ముతో, కూతురుకి పెళ్లిచేసి, అత్తోరింటికి తోలీ. మిగిలిన సొమ్ము తీసుకొని, కొడుకుని తీసుకొని వొచ్చీ. ఆడికి ఆటో ఒకటి కొనీసి ఇచ్చీ. ఇక్కడ ఆటోకి మంచి గిరాకీ. ఇంకోపక్క నువ్వు ఏదో పనికి కుదిరి పోనావనుకో, ఇంక మరి సూడక్కర్లేదు మీకు’’... అని భవిష్యత్ ఆశాజనకంగా చెప్పాడు అవతలి వ్యక్తి. రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఆశాజనకంగా చెప్తున్నారు. కంపెనీలు వొస్తే, ఉజ్జోగాలొస్తాయి. హోటళ్ళు, లాడ్జింగులు, బిల్డింగ్లు, రోడ్లుతో ప్రాంతం రూపురేఖలే మారిపోతాయ్ అంటన్నారు. సూరపు నాయుడికే ఏమీ తోచడం లేదు. నిలబడినవాడు, నడుస్తూ – ‘‘నాకు రైత్వారీ పని తప్ప, ఇంకొక పని రాదుగదా’’... అన్నాడు దిగాలుగా. ∙∙∙కొద్ది రోజులకు సూరపునాయుడు భయపడ్డట్టుగానే పొలాలను పరిశీలించిన వారు పొలాలను ఏదో కర్మాగారం కోసం తీసుకున్నారు. రైతులు కొన్నాళ్లు వ్యతిరేకించారు. పోరాడేరు గాని, కొసకు భూములు ఇవ్వక తప్పలేదు. మేనమామ చిన్న కొడుకు చెప్పినట్టే సూరపు నాయుడు ఆడపిల్ల పెళ్లి చేసి, తరవాత కొడుకుని పట్టుకొని హైదారాబాద్ వెళిపోయాడు. మిగిలిన సొమ్ము ఆటో కొనడానికి చాలలేదు, కొంత ఫైనా¯Œ ్స వాడేడు. కొడుకు ఆటో తిప్పుతూ ఫైనా ్స నక్షత్రకుడికి కిస్తీలు కడుతున్నాడు. సూరపు నాయుడు రకరకాల కూలిపనులు చేస్తూ చివరికి ఒక కోటీశ్వరుని ఇంటనున్న రెండు కుక్కల ఆలనా పాలనా చూడడానికి కుదురుకున్నాడు. పొద్దున్న ఏడో గంటకి ఆ కోటీశ్వరుని ఇంటికి చేరితే, రెండు కుక్కలూ రెడీగా ఉంటాయి షికారుకి. షికారుకి వెళ్ళినపుడే అవి ఒంటికీ, రెంటికీ కానిస్తాయి. సూరపు నాయుడే వాటిని శుభ్రం చేయాలి. రెండూ నాయుడి భుజాల దగ్గరకు ఉంటాయి. నాయుడి కంటే బలంగా ఉంటాయి. ఉండవా మరి? అవి తినేవో? మన్లాగా అంబలీ, గెంజీ తాగుతాయేటి? అనుకున్నాడు నాయుడు. తొలినాళ్ళల్లో నాయుడు వాటిని తిప్పడానికి నానా అవస్థలు పడ్డాడు. వాట్ని చూసి భయపడ్డాడు. ‘బేపుల్లాగా లేవివి, బెమ్మ రాచ్చసుల్లాగ వున్నాయి’ అనుకునీవోడు. రాన్రాను మచ్చికయినాయి. కోటీశ్వరుని ఇంటిలో విని నేర్చుకున్న ఇంగ్లీషు పదాలతో... ‘కమాన్, గో,గో, వెయిట్, వెయిట్’ వంటి ఆర్డర్లు వేస్తున్నాడు. షికారుకి కుక్కల్ని తీసుకు వెళ్ళే సమయంలో ఆపుడపుడూ వాటితో ఊసులాడుతుంటాడు. అవి కూడా సూరపు నాయుడి ‘ఊరు ఎలా ఉంటుంది? నగరంలా బాగుంటుందా? అన్నీ పూరిపాకలేనా,పెద్ద,పెద్ద భవంతులుంటాయా? అక్కడ మాలాంటి డాగ్స్ ఉంటాయా?’ అని ప్రశ్నించేవి. సూరపు నాయుడికి ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తుంటే పల్లెకూ, నగరానికీ మధ్య అంతరం తెలిసొచ్చేది. దాంతో విచారంగా మౌనంగా నడిచేవాడు. మౌనంగా నడిచే నాయుడిని – ‘మీ ఊరిలో మాలాటి డాగ్స్ లేవుకదా’, ఉండబోవన్న ధీమాగా ప్రశ్నించేవి ఆ కుక్కలు.అప్పుడు... ‘మా ఊరిలో మిమ్మల్ని డాగ్స్ అనరు. బేపులు అంటారు’... అని చెప్పి, తమ ఊరి బేపులెలాగుంటాయో, ఎంత మంచివో, ఇళ్లనీ, ఊరినీ ఎలాగ కాపలా కాస్తాయో చెప్పేవాడు. వాటిని మనుషులు ఎవులో తిప్పక్కర లేదనీ, అవే తిరగతాయనీ, తిండీ ఒకలెవులో తెచ్చి పెట్టక్కర లేదనీ, అవే సంపాయిస్తాయనీ... చెప్పేవాడు. అపుడు ఆ కుక్కలు నిసాకారంగా సూరపు నాయుడి వేపు చూసి – ‘మీ వూరి వాళ్ళు వాటికి తిండీ, తిప్పలు చూడరా? ఏం మనుషులోయ్’ అననేవి. ‘మా వూళ్ళంట బేపులకి మెడలకి బెల్టులు, గొలుసులూ కట్టరు. ఫ్రీగా వొదిలేస్తారు. ఆటి ఇష్టం ఇళ్ళల్లోకి దూరతాయి, వీధుల్లో తిరగతాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎళ్తాయి, కట్టడి వుండదాటికి. సిత్త కార్తే వొచ్చిందంటే ... సూడాల ఆటి బాగోతం’ అననేవాడు. ఆ కుక్కలకు ఆ బాగోతం ఏమిటో తెలీలేదు గానీ, ఈ నాయుడోడు వాడి వూరి బేపులు తమ కంటే గొప్పవి సుమా అని తమకు చెప్తున్నాడని భావించి, చిరాకెత్తి, కోపగించి, భౌభౌభౌ అని అరచి తమ నిరసన తెలియ జేసేవి. ∙∙∙కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది. ఒంటరితనం పోగొట్టుకోడానికి అపుడపుడూ తన మేనమామ చిన్నకొడుకుని కలుస్తుంటాడు. ఇద్దరూ కాసేపు తమ గత జీవనాన్ని, తమ తాత, ముత్తాతల తరతరాల జీవనాన్ని ఎరిగిన మేరకు కలబోసుకుంటారు. తామే కాక తమ ప్రాంత జనులంతా శాపగ్రస్తులనీ, ఒడ్డు కనిపించని ప్రవాహంలో ఈదులాడే వాళ్ళనీ... తమ ప్రాంతం చిరకాల శోకగర్భ ప్రాంతమని చింతిస్తారు.కడుపులు కెరలిపోతాయి. ఊరట కోసం సారా కొట్టు చేరుతారు. అపుడపుడూ వీరికి తోడు వీరిలాగే వలస వచ్చిన వాళ్ళు ఎవరో తోడవుతారు. వాళ్లూ లోపలి శోకాన్ని వెళ్లగక్కుతారు... అవెంతో గొప్ప అడివిలున్నాయి. సాగరతీరమా ఎక్కవే వుంది, సారవంత బూములున్నాయి... ఎందుకు మనం ఇలగ వొలసలు రావలసొచ్చింది? ఎందుకు? అక్కరకు రాని కంపెనీల బదులు నదులకి ఆనకట్టలు, పంటలకి కిట్టుబాటు ధరలందితే, జనప, చెరకు వంటి పంటల మీద మిల్లులెడితే మనకీ దుర్గతి రాదుగదా – అని విలపిస్తారు.మద్యపాన దుకాణాల్లో కడుపుల్లోకి మద్యం వెళ్తుంది, గానీ, లోపలి దుఖం బయటకు వెళ్ళదు. మత్తు ఎక్కినా, నొప్పి ఏదో మోస్తూ, తూలుతూ ఇళ్ళు చేరుతారు.అయిదేళ్లు గడిచిపోయాయి. ఎన్నికల ప్రకటన వచ్చింది. తమలాగా నగరానికి వలస వచ్చిన వారికోసం పోటీ చేసిన ప్రధాన పార్టీల వారు బస్సులు వేశారు. వోట్ల కోసం సరఫరా చేయాల్సినవన్నీ చేశారు. ఆ బస్సుల్లో సూరపు నాయుడి కుటుంబమే కాక, ఆ ప్రాంతపు కుటుంబాలు మరికొన్ని ప్రయాణించాయి. ఆ కుటుంబాలు చీపురుపల్లి, రణస్థలం, భోగాపురం తదితర ప్రాంతాల నుండి వలస వచ్చినవి. ప్రయాణం మధ్యలో భోజనాలకు ఆగినపుడు మరికొన్ని బస్సుల్లో మరికొన్ని కుటుంబాలు కలిశాయి. అవి అటు పార్వతీపురం పరిసరాల నుండి ఇటు అనకాపల్లి, చోడవరం, అరకు ప్రాంతాల నుండి వచ్చినవి. కళింగం అంతా దాదాపు వలసలు పోయిందా ఏటి అన్పించింది సూరపు నాయుడికి. ఓటు వేశాక వెంటనే బయల్దేరలేదు. రెండు రోజులు వుండిపోయాడు. ఫ్రీ బస్సులు వెలిపోయాయి. స్వంత వూరిలో ఒకరోజు వున్నారు..స్వంత వూరు రూపు రేఖలు మారిపోయాయి, ఊరినిండా ఏవేవో బిల్డింగులు, దుకాణాలు, ఆఫీసులు... ఒంటినిండా పచ్చబొట్లు పొడుచుకున్న అమ్మవారిలా వుంది ఊరు. పరాయి ఊరులా అన్పించీ, మరసటి రోజే కూతురి వూరు వెళిపోయారు.కూతురి ఊరు ఉద్దాన ప్రాంతం. అరటి, కొబ్బరి, పనస, జీడి తోటలతో ఆకుపచ్చగా ఉంటుంది. కూతురి అత్తవారికి ఒక ఎకరా తోట వుంది. అత్త, మామలు ఉన్నారు. రెండు గదుల ఇల్లుంది. అల్లుడు కష్టజీవి. తోట మీద ఫలసాయంతో ఇబ్బందులు లేకుండా బతుకుతున్నారు. కూతురికి మూడేళ్ళ కొడుకు. ఇపుడు గర్భిణీ. పలాసలో ఏవో స్వీట్స్, పళ్ళు కొని తీసుకు వెళ్లారు. రాత్రివేళ భోజనాలయ్యాక కూతురి కాపురం బాగుందని సంతోషించిన సూరపు నాయుడు – ‘‘ఎంతయినా మీ ఉద్దానం మా మడక కంటే శ్రేష్టమైనిది’’ అనన్నాడు. ‘‘నిజిమే గాని, ఇక్కడి బతుకులూ గాలిలో దీపాలే మామా, చేతులు అడ్డుబెట్టి దీపాలు ఆరకుండా సూస్తన్నాం’’ అని బదులిచ్చాడు అల్లుడు. కలుక్కుమన్నాది సూరపునాయుడి గుండె. ‘‘తుఫానులు, మార్కెట్లూ దెబ్బగొడతన్నా కాసుకుంటన్నాంలే’’ అనన్నాడు అల్లుడు. ఆ మాటతో కాస్త ఊరట చెందాడు నాయుడు.ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. మరో ఏడాది గడిచింది. రోజు పొద్దుటి పూట. కోటీశ్వరుని కుక్కలకు ఫుడ్ పెడుతుండగా సూరపు నాయుడికి ఫోన్ వచ్చింది.జేబులో ఫోన్ తీసి – అలో అన్నాడు ‘..నీను మామా...’ అన్నాడు అల్లుడు అవతల నుంచి ‘... నువ్వా? బాగున్నావా నాయినా? మాయమ్మీ,పిల్లలూ బాగున్నారా? ‘...ఆ, ఆ, అంతా బాగున్నాం, గానీ...’‘...ఆ..కానీ..?’ఆందోళనగా అడిగాడు సూరపునాయుడు. ‘మేమూ అక్కడకి వలస వొచ్చేస్తాము. మీకు తెలిసిన వోరి దగ్గిర ఏదేనా పని చూడు మామా, వొచ్చేస్తాము...’ ‘...వొచ్చెత్తారా? ఏమీ? మీ తోటలూ, దొడ్లూ ఏటి చేస్తారు?’ ‘...ఏదో పెద్ద కంపెనీ వొస్తందట, ఇంకోపక్క విమానాశ్రయం కడతారట... ఆటికి భూమి కావాలగదా? దగ్గిర, దగ్గిర మా మడకల నాలుగైదు ఊళ్లు ఖాళీ అయిపోతాయి... తొందరగా ఏదేనా పని చూడు మామా...’ ఎలుగుగొడ్డు ఏదో గోళ్ళతో తన గుండెను రక్కినట్టన్పించింది సూరపునాయుడికి. అల్లుడికి ఏమి చెప్పాలో తెలీక, మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలోనే యజమాని వచ్చి, ఏదో పేకెట్ చేత్తో పరిశీలిస్తూ – ‘‘ఓయ్, నాయుడూ, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పేకెట్ తెచ్చీసావోయ్. ఇది డాగ్స్కి పెట్టకు సుమీ. షాప్ వాడికి రిటనిచ్చేయి’’ అనన్నాడు. నాయుడికి అర్థం కాలేదు. అవతల ఫోన్లో అల్లుడు ఏదో చెప్తున్నాడు, అయోమయంగా చూశాడు యజమాని వేపు. ‘‘...ప్రతీ దానికీ కొన్నాళ్లే గడువు వుంటుంది..’’ అని యజమాని పేకెట్లో తేదీని చూపి – ‘‘ఈ తేదీ దాటినాక ఇది వాడకూడదు... వాడితే డేంజర్’’ అని విడమరిచాడు.యజమాని వివరణ, అల్లుడి సంభాషణ, నాయుడి మనసులో ప్రశ్నలు రేపాయి. –‘ఈ ఎక్స్పైరీ డేట్ అనేది మాకూ, మా వలస బతుకులకీ ఉండదా?’ నిజానికి సూరపు నాయుడు మనసులో ఆ ప్రశ్న అనుకున్నాడు కాని, అసంకల్పితంగా నోటి నుండి బయటకి వచ్చేసింది. ఆ యజమానికి ఏమీ అర్థం కాలేదు. ‘‘ఏమిటోయ్ నాయుడూ? ఏమంటున్నావ్?’’ అని ప్రశ్నించాడు.శోకంతో పూడుకు పోయిన సూరపు నాయుడి గొంతు పెగలలేదు, మౌనంగా ఉండిపోయాడు. కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది. -
తరం తడబాటు
ఈ లెక్కలన్నీ ఏం చెప్తున్నాయి?. యువత, విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రజా సమస్యగా మారుతోందని. ఇవి ఏవో కాకి లెక్కలు కాదు, ప్రతిష్ఠాత్మక జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన విస్తుగొల్పే వాస్తవాలు. విద్యాపరమైన ఒత్తిడి, తల్లిదండ్రుల ఆశలు, అధిక పోటీతో కూడిన విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో ఆందోళన, నిస్ప ృహ, ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ సంక్షోభం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది, ముఖ్యంగా యువతలో ఆత్మహత్యల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.విద్యార్థుల మానసిక ఆరోగ్య సంక్షోభంపై గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం భారతదేశంలో ఆత్మహత్యల రేటు విద్యార్థుల్లో స్థిరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అంటే ప్రతిరోజూ సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలను తీసుకున్నారు. 2022లో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యలలో విద్యార్థుల ఆత్మహత్యలు 7.6%. గత పదేళ్లలో (2013–2022) విద్యార్థుల ఆత్మహత్యలు 64% పెరిగాయి. ఈ సంఖ్య 6,654 నుండి 13,044కు చేరింది. భారతదేశంలోని 30 విశ్వవిద్యాలయాలలో 2024లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి పదిమంది విద్యార్థులలో ఒకరికి గత సంవత్సరంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి. వీరిలో మూడింట ఒక వంతు మంది ఆత్మహత్యకు ప్రయత్నించారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం పరీక్షల్లో వైఫల్యం ఆత్మహత్యలకు ఒక కారణం. రాజస్థాన్లోని కోటా సహా కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి పొందిన నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.పాఠశాల పిల్లల్లో కూడా.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోని 23% మంది పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’, సీబీఎస్ఈ సంస్థలు పాఠశాలల్లో నిర్వహించిన ఒక సర్వేలో 13–17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులలో 81% మందికి పరీక్షల ఒత్తిడి ప్రధాన సమస్యగా ఉందని వెల్లడైంది. యూనిసెఫ్ 2021 నివేదిక ప్రకారం, భారతదేశంలో 15–24 సంవత్సరాల వయస్సు గల యువతలో 14% మంది తరచుగా ఆందోళన లేదా డిప్రెషన్ వంటి వాటితో బాధపడుతున్నారు.విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు ఇలా ఉంటాయి. వీటిలో కొన్ని దీర్ఘ కాలం కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉందని అంచనా వేయవచ్చు. నిపుణుల సాయం తీసుకునేలా ప్రోత్సహించవచ్చు. భావోద్వేగ ప్రవర్తన మార్పులునిరంతర విచారం, నిస్సహాయత భావన. ఎక్కువగా చిరాకు పడడం, కోపం లేదా మూడ్ స్వింగ్స్. · ఒకప్పుడు ఆనందించిన కార్యకలాపాల పట్ల ఆసక్తి కోల్పోవడం. · స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండడం. ·సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం. · విపరీతమైన భయం, ఆందోళన లేదా ఆందోళనతో కూడిన దాడులు.మానసిక, శారీరక లక్షణాలునిద్ర, ఆకలిలో మార్పులు (ఎక్కువ నిద్ర పోవడం లేదా నిద్రలేమి, తక్కువ లేదా ఎక్కువ తినడం). ·ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సమస్యలు.గతంలో సులభంగా చేసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది.·తీవ్రమైన తలనొప్పి లేదా కడుపు నొప్పులు వంటి వివరించలేని శారీరక నొప్పులు. ఆత్మ గౌరవం కోల్పోవడం లేదా నిస్సహాయత భావన. ·ఆత్మహత్య ఆలోచనలు లేదా మరణం గురించి ఆలోచించడం.అకడమిక్, ప్రొఫెషనల్ లక్షణాలుచదువులో గణనీయమైన క్షీణత.పాఠశాల పని పట్ల ఆసక్తి తగ్గడం.తరగతులకు హాజరు కాకపోవడం.పాఠశాల పనితీరులో ఆకస్మిక మార్పులు.అవగాహన అంతంత మాత్రమే! ఓ పక్కన మానసిక ఆరోగ్య సమస్యలు యువతను కారుమబ్బుల్లా కమ్మి వేస్తుంటే, మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన రాహిత్యం కనిపిస్తోంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వహించిన 2023 సర్వే ప్రకారం, దాదాపు 70 శాతం మంది విద్యార్థులు మానసిక ఆరోగ్య సహాయం కోరితే తోటివారి నుండి ప్రతికూలతను ఎదుర్కొంటారని భయపడుతున్నారు.‘ది జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ హెల్త్’ నివేదిక ప్రకారం, కేవలం 50 శాతం మంది విద్యార్థులకు మాత్రమే తమ క్యాంపస్లో కౌన్సెలింగ్ సేవలు ఉన్నట్లు తెలుసు. ఇది కౌన్సెలింగ్ సేవల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరానికి నిదర్శనంగా నిలుస్తోంది.అసలు శత్రువు అదే! యువత, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెచ్చరిల్లడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియా వ్యసనం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ నిర్వహించిన సర్వే ప్రకారం యువతలో 70 శాతం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలకు మించి ఫోన్ వాడుతున్నారు. అందులో ఎక్కువగా సోషల్ మీడియాను చూస్తున్నారు. దీనితో ప్రతి ఐదుగురులో ఒకరు డిప్రెషన్ లేదా ఆందోళన బారిన పడుతున్నారు. వ్యసనంగా ఇలా.. మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో సోషల్ మీడియా వ్యసనం తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఈ వ్యసనం కేవలం ఒక అలవాటు కాదు, ఇది మెదడు పనితీరును మార్చే ఒక న్యూరోసై¯Œ ్స ప్రక్రియ. సోషల్ మీడియా వ్యసనానికి ప్రధాన కారణం మన మెదడులోని డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్. డోపమైన్ ఆనందం, సంతృప్తి, ప్రోత్సాహంతో ముడిపడి ఉన్న ఒక రసాయనం. మనం ఏదైనా సంతోషకరమైన పని చేసినప్పుడు, ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు లేదా ప్రశంసలు పొందినప్పుడు, మెదడులోని రివార్డ్ సిస్టమ్ డోపమై¯Œ ను విడుదల చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి లైక్, కామెంట్, షేర్, కొత్త నోటిఫికేషన్ చిన్నపాటి రివార్డ్గా పనిచేస్తుంది. ఈ రివార్డ్లు డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తాయి. యువత మెదడు ఎక్కువ డోపమైన్ పొందడం కోసం నిరంతరం సోషల్ మీడియాను చెక్ చేసుకునేలా అలవాటు పడుతుంది. ఈ నిరంతర ప్రేరణతో మెదడులో డోపమైన్ రిసెప్టర్లు సున్నితత్వాన్ని కోల్పోతాయి, దాంతో మరింత ఎక్కువ డోపమైన్ కోసం మెదడు ఆరాటపడుతుంది. ఇదే వ్యసనానికి దారి తీస్తుంది.మానసిక ఆరోగ్యం మటాష్!సోషల్ మీడియా మన జీవితాల్లో అంతర్భాగంగా మారింది. యువతపై దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇది సమాచారాన్ని పంచుకోవడానికి, స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఒక వేదికగా ఉన్నప్పటికీ, దాని ప్రతికూల ప్రభావాలు మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తున్నాయి. వివిధ సర్వేలు, అధ్యయనాలు యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తున్నాయి.ఒక సర్వే ప్రకారం, భారతదేశంలోని ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారు. దాదాపు 46 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న భారతదేశంలో ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది.యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోషల్ మీడియాలో ఇతరుల ‘పరిపూర్ణమైన‘ జీవితాలను చూసి తమను తాము పోల్చుకోవడంతో యువతలో ఆత్మన్యూనత భావన పెరుగుతోంది. ఇది అసూయ, అసంతృప్తి, ఒత్తిడికి కారణమవుతోంది. ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు యువతలో తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తున్నాయి. వీటి వల్ల వారు నిస్పృహకు, ఆందోళనకు గురవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్లో చూసే అందమైన ఫోటోలు, వీడియోల వల్ల యువత ముఖ్యంగా మహిళలు, తమ శరీర రూపాన్ని గురించి ఆందోళన చెందుతున్నారు. భారత యువతుల్లో 36 శాతం మంది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్తో బాధపడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఇది బులీమియా, అనోరెక్సియా నెర్వోసా లాంటి ఈటింగ్ డిజార్డర్స్కు దారి తీస్తోంది.యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మెదడులో మార్పులుసోషల్ మీడియా వ్యసనం మెదడులోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుంది.ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనా శక్తి, ప్రేరణ నియంత్రణ వంటి కీలకమైన విధులను నిర్వహిస్తుంది. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటుపడిన వారిలో ఈ భాగం బలహీనపడుతుంది. దీనివల్ల వారు తమ ఫో¯Œ ను వాడటాన్ని నియంత్రించుకోలేరు, త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు, ఏకాగ్రతను కోల్పోతారు.అమిగ్డాలా భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం. సోషల్ మీడియాలో చూసే ప్రతికూల విషయాలు అమిగ్డాలాను నిరంతరం ప్రేరేపిస్తాయి. ఇది ఆందోళనకు, డిప్రెష¯Œ కు దారితీస్తుంది.హిప్పోకాంపస్ భాగం జ్ఞాపకశక్తికి, నేర్చుకోవడానికి సహాయపడుతుంది. సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల హిప్పోకాంపస్ పనితీరు తగ్గుతుంది, ఇది చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.సుప్రీం కోర్టు దిశానిర్దేశంయువత మానసిక ఆరోగ్య సమస్యలకు సోషల్ మీడియాతో పాటు మారిన జీవనశైలి, సామాజిక పరిస్థితులు కూడా కారణం. దీనికి తోడు నిపుణుల కొరత, నిధుల కొరత కూడా వారికి సరైన వైద్య సేవలు అందకుండా చేస్తున్నాయి. దేశంలో మానసిక ఆరోగ్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ‘నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే’ ప్రకారం ప్రతి లక్ష జనాభాకు కేవలం సరాసరిన 0.7 శాతం మంది మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. సైక్రియాట్రిస్ట్లు 0.75 శాతం, క్లినికల్ సైకాలజిస్టులు 0.07 శాతం వరకు అందుబాటులో ఉన్నారు. మన దేశంలో సైకాలజిస్టులకు ఇప్పటి వరకు చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ లేకపోవడంతో వారికి సంబంధించిన లెక్కలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం లక్ష మందికి కనీసం ముగ్గురు ఉండాలి. ప్రపంచ సగటుతో పోలిస్తే మానసిక సేవలు మన దేశంలో చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సైకియాట్రీ, సైకాలజీ కోర్సులకు తగినంత ప్రోత్సాహం లేకపోవడం, శిక్షణ పొందిన నిపుణులు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం. ఆరోగ్య సంరక్షణలో మానసిక ఆరోగ్యానికి చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో మానసిక ఆరోగ్య సేవలకు కేవలం 1,004 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది మొత్తం ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో ఒక శాతం. ఇందులో కూడా 860 కోట్లు బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)కు, రూ. 80 కోట్లు ‘టెలిమానస్’కు కేటాయించడంతో మానసిక ఆరోగ్య సేవలు యువతకు చేరడం సాధ్యపడటం లేదు.నానాటికీ పెరిగిపోతున్న యువత, విద్యార్థుల ఆత్మహత్యలు, వారి మానసిక క్షేమంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించింది.ప్రతి వందమంది విద్యార్థులకు ఒక కౌన్సెలర్ను నియమించాలి. ఏడాదిలో రెండుసార్లు టీచర్స్కు, ఇతర సిబ్బందికి విద్యార్థుల మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలి. విద్యా సంస్థల్లో సైకలాజికల్ కౌన్సెలింగ్ సేవలను అందుబాటు ఉంచాలి, ఆ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. విద్యార్థులపై అకడమిక్ విషయంలో ఎలాంటి లేబుల్స్ వేయకూడదు. విద్యేతర విషయాల్లో ప్రోత్సహించాలి. ర్యాగింగ్, లైంగిక వేధింపులు వంటి వాటిపై సత్వరమే స్పందించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. హెల్ప్ లైన్ నంబర్స్ అందరికీ కనిపించేటట్లు బోర్డులు ఏర్పాటు చేయాలి. పేరెంట్స్తో తరచుగా సమావేశాలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు విద్యార్థుల్లో, టీచర్స్లో మానసిక ఆరోగ్య సేవలపై ఉన్న అపోహలను పోగొట్టగలిగితే స్వామి వివేకానంద చెప్పినట్లుగా వజ్ర సంకల్పం, ఉక్కు నరాలు ఉన్న యువ భారతాన్ని చూడొచ్చు. రచయిత: జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అడ్వాన్స్డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఏ ఇండియా) -
ఆహ్వానించి అపహరణ!
వీరారెడ్డి పేరుతో ఇల్లు, ఇల్లాలు, వాహనం, జైల్లో పరిచయమైన అనుచరులను సిద్ధం చేసుకున్న గౌరు సురేష్– ఆ తర్వాత ఎవరిని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలనేది ఆలోచించాడు. ఏమాత్రం ఇబ్బంది, హడావుడి లేకుండా పని జరగాలంటే, హైదరాబాద్కు చెందిన వారు కాకపోతేనే ఉత్తమమని భావించాడు. తన ‘భార్య’తో తిరుమలకు వెళ్లిన గౌరు సురేష్ అక్కడి నుంచి తిరిగి వస్తూ తిరుపతికి చెందిన వ్యాపారి గంగయ్యను టార్గెట్గా చేసుకున్నాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఓ డ్రైఫ్రూట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దానికి అతడే వైస్ ప్రెసిడెంట్గా మారి, విజిటింగ్ కార్డులు సిద్ధం చేసుకున్నాడు. మరోసారి తిరుపతి వెళ్లిన సురేష్– గంగయ్యను కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. త్వరలో హైదరాబాద్లో డ్రైఫ్రూట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నానని, తప్పకుండా రావాలని చెప్పి ఆహ్వానపత్రం అందించాడు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని గంగయ్య దీనిని మరచిపోయాడు. కిడ్నాప్ పథకాన్ని అమలులో పెట్టడానికి సురేష్– గంగయ్య పేరుతో తిరుపతి నుంచి హైదరాబాద్కు విమానం టిక్కెట్, తాజ్ కృష్ణలో ఓ గదిని బుక్ చేశాడు. ఎగ్జిబిషన్ పేరుతో ఆహ్వానపత్రిక ముద్రించి, ఇవన్నీ కొరియర్ ద్వారా గంగయ్యకు పంపాడు. గంగయ్యకు సురేష్ ఫోన్ చేసి, తప్పకుండా రావాలని, ఎయిర్పోర్టుకు కారు పంపిస్తానని చెప్పాడు. దీంతో గంగయ్య తాను హైదరాబాద్ వచ్చేటప్పుడు వీరారెడ్డి అవతారంలో ఉన్న సురేష్కు చెప్పాడు. గంగయ్య వచ్చేరోజు వెంకటరెడ్డి వద్దకు వెళ్లిన సురేష్, భార్యతో కలసి బయటకు వెళ్లడానికంటూ కారు తీసుకున్నాడు. ఆ కారులో విమానాశ్రయానికి వెళ్లి, గంగయ్యను రిసీవ్ చేసుకున్నాడు. ఎగ్జిబిషన్ పనుల్లో తలమునకలై ఉన్నానని, ఉప్పల్లో చిన్న పని చూసుకుని వెళ్దామని సురేష్ నమ్మబలికాడు. అలా అతడిని వారాసిగూడలోని మల్లారెడ్డి ఫ్లాట్కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న గ్యాంగ్కు గంగయ్యను అప్పగించి, తాను చెప్పే వరకు జాగ్రత్తగా చూసుకోవాలంటూ తన ఫ్లాట్కు వెళ్లిపోతూ వెంకట్రెడ్డికి కారు అప్పగించేశాడు. గంగయ్య నుంచి అతడి సోదరుడి ఫోన్ నెంబర్ తీసుకున్న సురేష్, ‘మీ అన్నను కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే రూ.30 లక్షలు ఇవ్వాల’ని డిమాండ్ చేశాడు. విషయం ఏమాత్రం బయటకు వచ్చినా హైదరాబాద్ శివార్లలో గంగయ్య శవం పడి ఉంటుందని భయపెట్టాడు.ఈ ఫోన్ కాల్తో భయపడిన గంగయ్య సోదరుడు విషయం పోలీసులకు చెప్పకుండా, డబ్బు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. డబ్బు సిద్ధం చేసుకోవడానికి అతడు రెండుమూడు రోజుల పాటు పలువురిని సంప్రదించాడు. ఇలా విషయం బయటకు రావడంతో చిత్తూరు పోలీసులు రంగంలోకి దిగి, గంగయ్య సోదరుడి నుంచి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించారు. అయితే తన సోదరుడికి హాని జరుగుతుందనే భయంతో విషయం పోలీసులకు చెప్పడానికి గంగయ్య సోదరుడు వెనుకాడాడు. దీంతో అతడి కదలికలపై పోలీసులు నిఘా వేసి ఉంచారు.తన అన్నను విడిపించుకోవడానికి రూ.30 లక్షలు సిద్ధం చేసిన గంగయ్య సోదరుడు ఫోన్ చేసి సురేష్కు విషయం చెప్పాడు. ఎవరికీ చెప్పకుండా ఒక్కడివే బయలుదేరి రావాలని, భారత్ ట్రావెల్స్ బస్సులో సీట్ నెం.17 బుక్ చేసుకోవాలని, జడ్చర్ల వద్ద బస్సు దిగిపోవాలని సూచనలు ఇచ్చాడు. ఏమాత్రం తేడా వచ్చినా గంగయ్య ప్రాణాలతో ఉండడని బెదిరించాడు. గంగయ్య సోదరుడు అదే బస్సులో అదే సీటు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. విషయం తెలిసిన చిత్తూరు పోలీసులు– అదే బస్సులో వెళ్లి, కిడ్నాపర్లను పట్టుకోవడానికి ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు టికెట్లు బుక్ చేశారు. గంగయ్య సోదరుడు, ఈ ముగ్గురు పోలీసులు ఒకే బస్సులో బయలుదేరారు. తనను అనుసరిస్తూ పోలీసులు వస్తున్న విషయం గంగయ్య సోదరుడికి తెలీదు. అదే రోజు రాత్రి మరోసారి వెంకట్రెడ్డి వద్దకు వెళ్లే సురేష్ మళ్లీ భార్యతో ట్రిప్ అంటూ ఇండికా కారు తీసుకున్నాడు. గంగయ్య సోదరుడు ప్రయాణిస్తున్న భారత్ ట్రావెల్స్ బస్సు జడ్చర్లకు చేరుకునే సమయానికి సురేష్ కారుతో సçహా అక్కడ సిద్ధంగా ఉన్నాడు. బస్సు అక్కడకు చేరుకున్నాక గంగయ్య సోదరుడు బ్యాగ్ పట్టుకుని దిగడంతో, అది గమనించిన ఎస్సై కూడా అతడితో పాటు కిందికి దిగారు. అతడిని చూడగానే పోలీసు అని గుర్తించిన సురేష్, దృష్టి మళ్లించడానికి క్షణాల్లో మరో పథకం వేశాడు. ఆ పోలీసుని ఉద్దేశించి ‘మీరూ హైదరాబాద్ వెళ్లాలా..? లగేజీ తెచ్చుకోండి’ అని చెప్పాడు. ఎదుటి వారికి తనపై అనుమానం రాకూడదని భావించిన సదరు ఎస్సై తన బ్యాగ్ తీసుకువచ్చి కారు ఎక్కాలని భావించారు. బ్యాగ్ కోసం బస్సు ఎక్కగా, అప్పటికే కింద ఉన్న గంగయ్య సోదరుడిని కారులో ఎక్కించుకున్న సురేష్ రాంగ్ రూట్లో ఉడాయించాడు. ఈ పరిణామంతో కంగుతిన్న చిత్తూరు పోలీసులు విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చెప్పారు. చిత్తూరు పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగింది. అయితే అప్పటికే గంగయ్య సోదరుడి నుంచి డబ్బు తీసుకుని, అతడిని శంషాబాద్ వద్ద వదిలేసిన సురేష్ నేరుగా వనస్థలిపురం వెళ్లిపోయాడు. కారు వెంకట్రెడ్డికి అప్పగించిన తర్వాత ‘తన భార్య’కు పేమెంట్ సెటిల్ చేసి పంపించేశాడు. డీసీఎం వ్యాన్లో ఫ్లాట్లోని సామాను మొత్తం సర్దుకుని, మల్లారెడ్డిని సంప్రదించి, ‘ప్యాకేజ్’ని వదిలేసి నాంపల్లికి రావాలని చెప్పాడు. గంగయ్యను తీసుకుని బయలుదేరే మల్లారెడ్డి గ్యాంగ్ అతడిని ఎంజీబీఎస్ వద్ద వదిలేసి, ఖర్చుల కోసం రూ.10 వేలు ఇచ్చింది. వీళ్లు నాంపల్లికి చేరుకునేసరికి సురేష్ డీసీఎంలోని ఇంటి సామాను మొత్తం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేసి, సిద్ధంగా ఉన్నాడు. మల్లారెడ్డి గ్యాంగ్కు కొంత మొత్తం ముట్టజెప్పి, అక్కడ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గంగయ్య, అతడి సోదరుడు బతుకు జీవుడా అనుకుంటూ తిరుపతి చేరుకున్నారు. ఈ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మల్లారెడ్డితో పాటు మిగిలిన గ్యాంగ్ను పట్టుకుని చిత్తూరు పోలీసులకు అప్పగించారు. అయితే సురేష్ మాత్రం చిక్కలేదు. తన నేర పరంపరను కొనసాగిస్తూ 2006 సెప్టెంబర్ 13న జూబ్లీహిల్స్కు చెందిన వ్యాపారవేత్త జి.కృష్ణంరాజును ఆయన పెంపుడు శునకంతో సహా కిడ్నాప్ చేశాడు. ఈ కేసులో అరెస్టు అయినప్పుడే, గంగయ్య కిడ్నాప్ స్కెచ్ బయటకు వచ్చింది. ఇలాంటి అనేక నేరాలు చేసిన గౌరు సురేష్ 2008 జూలై 18న బేగంపేటలోకి ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. (సమాప్తం) -
దసరాని ఈ పసందైన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుందాం ఇలా..!
మిరియాల పులిహోరకావలసినవి: బియ్యం– ఒక కప్పు, నీళ్లు– 2 కప్పులుచింతపండు– పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకోవచ్చుపచ్చిమిర్చి– 3 (సన్నగా తరగాలి), ఎండుమిర్చి– 4 (ముక్కలు చేసుకోవాలి), మిరియాలు– ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ (పొడి చేసుకోవాలి), ఆవాలు– ఒక టీ స్పూన్, మినపపప్పు, శనగపప్పు– ఒక టేబుల్ స్పూన్ చొప్పున, నూనె, పల్లీలు– 3 టేబుల్ స్పూన్లు చొప్పున, బెల్లం కోరు– ఒక టీ స్పూన్, పసుపు– అర టీ స్పూన్, ఇంగువ– చిటికెడు, కరివేపాకు– 2 రెమ్మలు, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి కుకర్లో ఉడికించుకోవాలి. అన్నం మరీ మెత్తగా అవ్వకూడదు. ఈలోపు చింతపండును నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మిరియాలను నూనె లేకుండా వేయించి చల్లార్చి, మెత్తని పొడిలా చేసుకోవాలి. ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంతలో ఒక పాన్లో నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినపపప్పు, పల్లీలు వేసి వేగించాలి. అనంతరం అందులో తరిగిన పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, బెల్లం తురుము, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలో తగినంత ఉప్పుతో పాటు ఈ చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా కలిపితే సరిపోతుంది.పనీర్ జిలేబీకావలసినవి: పనీర్ తురుము– 250 గ్రాములు, మైదా పిండి– ఒక కప్పుఏలకుల పొడి– అర టీస్పూన్, బేకింగ్ పౌడర్– పావు టీస్పూన్పంచదార– 2 కప్పులు, నీళ్లు– ఒక కప్పు (పాకం కోసం), నెయ్యి– సరిపడాపిస్తా, జీడిపప్పు ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా పనీర్ తురుమును బాగా మెత్తగా చేతితో నలుపుకోవాలి. ఇందులో ఎటువంటి గడ్డలు లేకుండా చూసుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో ఈ మెత్తని పనీర్, మైదా పిండి, ఏలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, జిలేబీ పిండి మాదిరిగా గట్టిగా, మందంగా ఉండేలా కలుపుకోవాలి. పిండి చాలా పల్చగా ఉండకూడదు. ఈ పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో పంచదార, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార కరిగి పాకం కొంచెం చిక్కబడిన తర్వాత, దానిని స్టవ్ నుంచి దింపెయ్యాలి. ఈలోపు ఒక వెడల్పాటి పా¯Œ లో నెయ్యి వేడి చేసుకోవాలి. జిలేబీ మేకర్లో మైదా మిశ్రమాన్ని నింపుకుని, నచ్చిన విధంగా నేతిలో జిలేబీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేడిగా ఉన్నçప్పుడే గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో ముంచాలి. ఐదు లేదా పది నిమిషాలు పాకంలో జిలేబీలు మునిగేలా ఉంచి ఆ తర్వాత వాటిపైన జీడిపప్పు, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.కేసర్ పెడాకావలసినవి: పాల పొడి– 2 కప్పులు, నెయ్యి– 4 చెంచాలు, కండెన్స్డ్ మిల్క్– ఒక కప్పు, ఏలకుల పొడి– ఒక టీ స్పూన్, ఫుడ్ కలర్– కొద్దిగా, కొన్ని పిస్తా పప్పులు– గార్నిష్ కోసం, కుంకుమ పువ్వు– కొద్దిగా, (వెచ్చని పాలలో నానబెట్టుకోవాలి)తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న మంట మీద, ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి, గరిటెతో కలుపుతూనే పాల పొడి, కండెన్స్డ్ మిల్క్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు వడకట్టి, వాటిని వేసి బాగా కలిపి మళ్ళీ ఒక నిమిషం పాటు స్టవ్ మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాసేపు స్టవ్ మీద నుంచి గిన్నె పక్కకు దించి గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా స్టవ్ మీద కాసేపు మామూలుగా కాసేపు గరిటెతో కలిపితే ఆ మిశ్రమం పాత్రకు అంటకుండా ముద్దలా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని 15 నుంచి 20 నిమిషాలు చల్లారనివ్వాలి. అనంతరం 15 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచాలి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, దాన్ని మృదువుగా చేసుకోవాలి. అనంతరం పిస్తా పప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: రుచి.. శుచి... వెంకన్న నైవేద్యం) -
నల్లటి వలయాలు, పుట్టుమచ్చలను మాయం చేద్దాం ఇలా..!
సాధారణంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, కంప్యూటర్స్ లేదా ఫోన్స్ ఎక్కువగా చూడటంతో కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్), వాపు, ముడతలు ఏర్పడుతుంటాయి. వాటిని తగ్గించుకోవాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పవు. ఇందుకోసం ఈ మెటల్ టూల్ అయిన కళ్ళ మసాజర్ లేదా క్రీమ్ స్పూన్ ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ టూల్కి ఒకవైపు బాల్ లాంటి భాగం మరోవైపు స్పూన్ లాంటి ఆకారం ఉంటాయి. క్రీమ్స్, సీరమ్స్ వంటివి వేళ్లతో కాకుండా ఈ టూల్తో అప్లై చేసుకుంటే చర్మంపై బాక్టీరియా చేరే అవకాశం తగ్గుతుంది. ఈ స్పూన్.. జింక్ అలాయ్తో తయారైంది. ఇది చాలాకాలం మన్నుతుంది. కళ్ళకు వాడే క్రీములు, ఫేస్కి వాడే క్రీమ్స్, డ్రై మాస్క్లు, లోషన్లు, ఇతర సౌందర్య ఉత్పత్తులు అప్లై చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వచ్చు. ఈ మసాజర్తో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది, డబుల్ చిన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు, బ్యాగ్స్ కూడా తగ్గుతాయి. ముఖ కండరాలు రిలాక్స్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ టూల్ చాలా తేలికైనది, చిన్నది కాబట్టి హ్యాండ్బ్యాగ్లో లేదా జేబులో సులభంగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. క్రమం తప్పకుండా దీనితో మసాజ్ చేయడంతో, ఇది చర్మాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.బెస్ట్ బ్యూటీ ట్రీట్మెంట్!కొన్ని పుట్టుమచ్చలు అందాన్ని తెచ్చిపెడితే, మరికొన్ని పుట్టుమచ్చలు గడ్డల్లా కనిపిస్తూ, ఉన్న అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి వాటిని తొలగించడానికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో షేవ్ ఎక్సిషన్ ట్రీట్మెంట్ ఒక సాధారణ వైద్య పద్ధతి. చర్మంపై ఉన్న పులిపిర్లు, పుట్టుమచ్చలు లేదా చిన్న చిన్న గడ్డలు తొలగించడానికి ఈ చికిత్స సహకరిస్తుంది. ఈ ప్రక్రియలో, ఒక పదునైన బ్లేడుతో చర్మం పైపొరలో ఉన్న పెరుగుదల భాగాన్ని జాగ్రత్తగా ‘షేవ్’ చేస్తారు. ఇది లోతైన కోత కాదు, కాబట్టి సాధారణంగా కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ప్రక్రియ ఎలా జరుగుతుందంటే.. ముందుగా, ఆ ప్రాంతానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, కాబట్టి నొప్పి తెలియదు. అనంతరం ఒక ప్రత్యేకమైన బ్లేడుతో చర్మంపై ఉన్న గడ్డను జాగ్రత్తగా షేవ్ చేస్తారు. కొద్దిగా రక్తం కనిపించే అవకాశం ఉంటుంది, దాన్ని ఆపడానికి విద్యుత్తు లేదా రసాయనాలను ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ఆ ప్రాంతాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ వైద్య నిపుణుడి సమక్షంలోనే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం. (చదవండి: World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..) -
హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..
కొన్నిసార్లు సైన్స్ కన్నా, కవిత్వమే ఎక్కువ లాజికల్గా అనిపిస్తుంది! అందుకు ఒక ఉదాహరణ... బహుముఖసృజనశీలి అయిన ఇటాలియన్ చిత్రకారుడు, ఇంజినీరు లియోనార్డో డా విన్సీ నదుల్ని మానవ శరీరంలోని ధమనులు, సిరలతో పోల్చటం! నదులు, ఉపనదులు భూగోళానికిజీవ ప్రవాహ నాళాలు అని వాటి ప్రాముఖ్యాన్ని ఈ ఒక్కమాటతోచక్కగా అర్థం చేయించారు డా విన్సీ. 51 కోట్ల, 72 వేల చ.కి. మీ. విస్తీర్ణంలో ఉన్న మన భూమిపై లక్షన్నరకు పైగా నదులు ఉన్నాయని ఒకఅంచనా. ఈ నదుల ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేందుకని గత ఇరవై ఏళ్లుగా ఏటా మనం సెప్టెంబరు నాల్గవ ఆదివారాన్ని (నేడు)‘ప్రపంచనదుల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పురాణాల్లో, సాహిత్యంలో, సినీ గీతాల్లో ఉన్న నదుల మననాలు కొన్ని.. మీ కోసం! ప్రవాహమే నది రూపంనదుల గురించి అల మాత్రంగానైనా మాట్లాడుకోవటం అంటే మహా సముద్రంలో ఈత కొట్టటమే! మొదలు–తుది; అంతము– ఆరంభమూ లేని ప్రవాహం... సమస్త మానవాళి జీవితాన్ని పెనవేసుకుని ఉన్న ఈ నదీ ప్రస్థానం. గ్రీకు తత్వవేత్త హెరాహ్లిటస్ అన్న మాట ఈ నదీ ప్రస్థానానికి, నదీ ప్రస్తావనకు చక్కగా సరిపోతుంది. ‘‘ఒకే మనిషి ఒకే నదిలో రెండోసారి అడుగు పెట్టడు. ఎందుకంటే– ఆ నది ఒకేలా ఉండదు. ఆ మనిషీ ఒకేలా ఉండడు’’ అంటారాయన. అంటే ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనిషి కూడా నదీ ప్రవాహంలా ఒకేలా ఉండడు అని అంతరార్థం.సాగిపోయే జీవిత నౌకనదుల పోలికతో పాశ్చాత్యులవే మరికొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి. లెబనీస్–అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్ ఏమంటారో చూడండి, ‘‘నది వెళ్లి సముద్రంలో కలిసినట్లే జననం వెళ్లి మరణంలో కలుస్తుంద’’ట! ఇక దివంగత బ్రిటన్ రాజనీతిజ్ఞుడు ఎనోచ్ పావెల్, ‘‘నా ఓడ కనిపించకుండాపోతే, నా ప్రయాణం ముగిసిందని కాదు. నది వంపు తిరిగిందని..’’ అని అంటారు! ఎంత చక్కగా చెప్పారు. ‘కొండగాలి తిరిగింది’ అని ఆరుద్ర అన్నట్లు – కొండగాలి మాత్రమే కాదు, నది కూడా తిరుగుతుంది. ప్రాప్తమున్న తీరానికి జీవిత నౌక సాగిపోతుంది. ఇదీ ఆరుద్ర మాటే. వయ్యారి గోదారమ్మ..!ఒక అమ్మాయికి యుక్త వయస్సు అనేది విశాలమైన నది నుండి సముద్రంలోకి తేలుతున్నట్లుగా ఉంటుంది అంటారు జి.స్టాన్లీ హాల్. 19వ శతాబ్దపు మనో వైజ్ఞానిక నిపుణుడు ఈయన. నదిలా నూత్న యవ్వనం పరవళ్లు తొక్కుతుందని చెప్పటం స్టాన్లీ ఉద్దేశం. ‘వయ్యారి గోదారమ్మ ఒళ్లంత ఎందుకమ్మ కలవరం..’ అని వేటూరి అడిగిన ప్రశ్నకు స్టాన్లీ ఆల్రెడీ సమాధానం చెప్పేసే ఉంచారన్న మాట! అమెరికన్ సంగీతకారుడు జాన్ విలియమ్స్, నదిని సంగీతంలో పోల్చారు. ‘‘సంగీతంలో నేను ఎక్కువ తక్కువల్ని చూడను. సంగీతం అన్నది మనమందరం కప్పులతో ముంచుకుని తాగ గల అమృతవాహిని అయిన నది’’ అన్నారు విలియమ్స్. ఇళయ రాజా దృష్టిలో సంగీతం అంటే ఏ ఉద్దేశమూ లేనిది! ‘‘నది ప్రవాహంలా సంగీతం సహజంగా, ఉద్దేశరహితంగా ఉండాలి’’ అంటారు ఇళయరాజా.స్వర్గలోక వెండి ప్రవాహంప్రాచీన కాలపు చైనా దేశీయులు పాలపుంతను కూడా ఒక ప్రకాశవంతమైన నదిగానే ఊహించారు. ఆ నదిని స్వర్గంగా, ఆ ప్రవాహాన్ని వెండిగా భావించారు. బౌద్ధ దార్శనికుడైన ఆచార్య నాగార్జునుడు మానవ జీవితంలోని దుఃఖం గురించి మాట్లాడుతూ, ‘‘నదిలో కలిసి, కదిలే చెక్క దుంగలు ప్రతి అల చేత విడిపోతాయి. అనివార్యంగా అలా వేరు అవటం దుఃఖానికి కారణం కాకూడదు’’ అంటారు. ప్రసిద్ధ బ్రెజిల్ నవలా రచయిత పాలో కోయెలో మరికాస్త లోతుకు వెళ్లి, ‘‘మీరు నదిలో పడటం వల్ల మునిగిపోరు, కానీ దానిలో మునిగిపోవటం వల్ల మునిగిపోతారు’’ అంటారు. జీవితాన్ని భయంతో ఈదలేమని చెప్పటం కావచ్చు. ఇంగ్లిష్ నటి జూలీ ఆండ్రుస్ (89)కు నది వాసన అంటే ఇష్టం. నది సౌమ్యత ఇష్టం. ఆమె చిన్నతనం అంతా నదితోనే గడిచింది. నది ఆమెను ప్రశాంతపరచింది. ఆమెకు ఓదార్పునిచ్చింది. ఈ విషయాన్ని జూలీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. గంగా తీరాన రిషికేశ్హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్కు భారతదేశంలోని సాయంత్రాలు అంటే చాలా ఇష్టమట. ఎందుకు ఇష్టమో ఆయన మాటల్లోనే విందాం. ‘‘సూర్యుడు ప్రపంచం అంచుకు చేరుకుంటాడు. శబ్దాలు అస్తమిస్తుంటాయి. పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సైకిళ్లపై నదీ ప్రవాహంలా ఇంటికి చేరుకుని, శ్రీకృష్ణుడి గురించి, జీవన వ్యయం గురించి ఆలోచిస్తూ ఉండే మాయా క్షణాలవి’’ అంటాడు కామెరాన్. సైకిళ్లపై ఒక ఒరవడిగా వెళ్లే శ్రామికులను ఆయన ఒక నదీ ప్రవాహంగా ఊహించుకున్నారు. మైకేల్ ఎడ్వర్డ్ లవ్ కూడా భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పకు కారణం గంగా నది. మైకేల్ అమెరికన్ సింగర్, సాంగ్రైటర్. ‘‘1968 వసంతకాలంలో, ‘ది బీటిల్స్’ బ్యాండ్కు, నాకు మహర్షి మహేష్ యోగి నుండి భారతదేశంలోని రిషికేశ్కు రమ్మని ఆహ్వానం అందింది. రిషికేశ్ అనేక సంవత్సరాలుగా లక్షలాది మందికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది హిమాలయాల నుండి గంగా నది ప్రవహించే ప్రదేశంలో ఉంది. ఆ వాతావరణంలో ఉండటం చాలా ప్రత్యేకమైనది’’ అంటారు మైకేల్. పురుష నది.. బ్రహ్మపుత్ర!భారతీయ పురాణాలలో అనేక నదులు ప్రవహించాయి. అయితే అవి కేవలం భౌతిక ప్రవాహాలు కావు. దైవత్వం పొందినవి. దేవతలతో సమానంగా గౌరవాన్ని పొందినవి. పూజలను అందుకున్నవి. గంగా, యమునా, సరస్వతి, గోదావరి నదులను స్త్రీ దేవతలుగా పూజిస్తారు. ఆ పవిత్ర జలాలలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి పురుష నదులే లేవా? లేనట్లున్నాయి. బ్రహ్మపుత్ర నదిని మాత్రం ‘పురుష నది’గా పరిగణిస్తారు. మన నదులన్నీ కూడా రుగ్వేదం, మహాభారతం, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. ‘గంగావతరణ’ ఘట్టందశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిందీ, శ్రీరాముడి అవతార పరిసమాప్తి అయిందీ ‘సరయూ’ సమీపంలోనే. రామాయణంలోని ‘గంగావతరణ’ ఘట్టం అయితే ఒక అద్భుతమైన చిత్రణ. సీతను వెదకి రమ్మని వానరులను పంపేటప్పుడు ఆమెను ఎక్కడెక్కడ వెతకాలో చెబుతూ శరావతి, కావేరి, తామ్రపర్ణి, నర్మద, కౌశికీ, యమునా నదులను ప్రస్తావిస్తాడు సుగ్రీవుడు. ఇక కవుల గురించి చెప్పక్కర్లేదు. నది ఊసు లేనిదే వారి కలాలు పరవళ్లు తొక్కవు. ‘కవుల కవిత్వంలో పొంగిన నదులు’ అంటూ రాజన్ పి.టి.ఎస్.కె. అనే రచయిత తెలుగులో ఒక పుస్తకమే రాశారు. కృష్ణవేణి.. విరిబోణి.. అలివేణినది పేరుతో అనేక తెలుగు నవలలు, కథలు వచ్చాయి. అదొక అంతే లేని జాబితా. అలాగే తెలుగు సినిమా పాటలు వందలు, వేలు! పూర్తిగా ఒక నదిపైనే వచ్చిన పాట మాత్రం బహుశా డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి / కృష్ణవేణి నా ఇంటి అలివేణి’ కావచ్చు. ఆ పాటలో కృష్ణానది విశేషాలన్నిటినీ సినారె పొందుపర1చారు. భక్తిగీతంలా మొదలై పరవళ్లు తొక్కుతూ వెళ్లి సాగర హృదయాన సంగమిస్తుంది. ఈ పాట ‘కృష్ణవేణి’ (1974) చిత్రం లోనిది.వేదంలా ఘోషించే గోదావరికృష్ణవేణికి దీటైన ఇంకో తెలుగు సినిమా పాట.. ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’. 1983 నాటి ‘ఆంధ్ర కేసరి’ సినిమా కోసం ఆరుద్ర ఈ పాటను రాశారు. అయితే ఆ పాట పూర్తిగా గోదావరి విశేషాల మీద కాకుండా, గోదావరికి అనుసంధానమై ఉన్న సుందర నగరాలు, కవులు–కావ్యాలు, ఏలిన రాజులు మీద సాగుతుంది. గోదావరి మీదే వేటూరి గారు రాసిన పాట ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’. ఇంకా.. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ’ (ఆత్రేయ–‘చక్రవాకం’), ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ (ఆరుద్ర–‘మర్మయోగి’), ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ’ (శేషేంద్ర శర్మ–‘ముత్యాల ముగ్గు’) ‘చినుకులా రాలి.. నదులుగా సాగి’ (వేటూరి–నాలుగు స్తంభాలాట), ‘గోదారి గట్టుంది.. గట్టు మీద సెట్టుంది..’ (దాశరథి కృష్ణమాచార్య–‘మూగ మనసులు’)... వంటి పాటలు పూర్తిగా నది చుట్టూ తిరిగినవి కాకపోయినా, దోసెడు నది నీళ్లను పట్టి ప్రేక్షకుల తలపులపై చిలకరించినవి. నదులపై మంచి మంచి సినిమా పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని రేణువులు మాత్రమే. నదులు కేవలం నీళ్లు కాదు, కేవలం ప్రవాహాలు కాదు, కేవలం ప్రయాణ మార్గాలు అంతకన్నా కాదు. మనిషిని బతికించే సంజీవినులు మాత్రమే కాదు. డా విన్సీ అన్నట్లు – భూగోళానికే జీవాన్ని, చేవను ఇచ్చే సిరలు, ధమనులు.శ్రీశ్రీ అనుసంధానం!‘మరో ప్రపంచం’ (1970) సినిమాలో శ్రీశ్రీ ‘అణగారిన బ్రతుకులలో..’ అనే పాట రాశారు. అందులోని ఒక చరణంలో... ‘గంగా, కావేరీ – నదులను కలుపుదాం..’ అన్నారు ఆయన. ఆ చరణం ఇలా ఉంటుంది : ‘ఈ దేశం నీదీ నాదని / ఇది ఒక్కరికే సొంతం కాదని / గంగా, కావేరి నదులు కలుపుదాం / కలిపి, సరిహద్దు చెరిపి, చెలిమి నిలుపుదాం..’ అని. యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1972లో అప్పటి కేంద్ర మంత్రి కె.ఎల్.రావు గంగ–కావేరి నదులను అనుసంధానించాలని ప్రతిపాదించారు. అంటే, శ్రీశ్రీ తన పాట ద్వారా అంతకు రెండేళ్లకు ముందే గంగ, కావేరీలను అనుసంధానించారు! అందుకే, సృజనశీలులను కాలజ్ఞానులు అని కూడా అంటారు. నదుల అనుసంధానం గురించి 1974లో కెప్టెన్ దిన్షా జె.దస్తూర్ మరో ప్రతిపాదన తెచ్చారు. హిమాలయ నదులైన గంగ, సింధు, బ్రహ్మపుత్రలను... ద్వీపకల్ప నదులైన గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, నర్మద, తపతి, పంబ వంటి వాటితో కలపొచ్చని! ఆ తర్వాత కేంద్ర జల వనరుల శాఖ ఇంకో ప్రతిపాదన తెచ్చింది. ఇవేవీ ఆచరణకు రాలేదు. సాక్షి, స్పెషల్ డెస్క్ -
అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!
నేచురల్గా మెరిసే అందం ఆశికా రంగనాథ్ సొంతం! మినిమల్ స్టయిలింగ్ టిప్స్తోనే, ఒక కొత్త లుక్ని సింపుల్గా, క్లాసీగా, కంఫర్టబుల్గా చూపిస్తూ మ్యాజిక్ చేసేస్తోంది. ఆ విషయాలే మీకోసం! బయటకు వెళ్లేటప్పుడు నా ఫేవరెట్ హాక్ బ్రెయిడ్ వేసుకోవడం. బ్రెయిడ్ని ఓపెన్ చేస్తే వచ్చే సాఫ్ట్ వేవ్స్ నాకు బాగా ఇష్టం. బ్లాక్ డ్రెస్లు, క్రాప్టాప్స్ నా ఆల్టైమ్ ఫేవరెట్. యాక్సెసరీస్ విషయానికి వస్తే సింపుల్ జ్యూలరీనే ఎంచుకుంటాను. గ్లామర్ మొత్తం సింప్లిసిటీలోనే ఉంది ఆశికా రంగనాథ్. ఇక్కడ ఆమె ధరించే చీర..బ్రాండ్: సాయి తనార్య, ధర: రూ. 22,000, జ్యూలరీ బ్రాండ్: వివంత్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కనీ కనిపించని కనికట్టుమెడలో ఒక్కసారిగా స్టోన్స్ మాత్రమే మెరుస్తూ కనిపిస్తే అదే ఇన్విజిబుల్ చైన్ మ్యాజిక్. గొలుసు కనిపించకపోయినా, పెండెంట్ మాత్రం గ్లామర్తో మెరుస్తుంది. చీర మీద క్లాసీగా, గౌన్ మీద గ్లామరస్గా, డైలీ వేర్లో క్యూట్గా ఏ లుక్కైనా ఈ ఇన్విజిబుల్ చైన్ సెట్ అవుతుంది. చిన్న పెండెంట్ వేసుకుంటే సింపుల్గా, సాఫిస్టికేటెడ్ లుక్ ఇస్తుంది. పెద్ద స్టోన్ పెండెంట్ అయితే స్పాట్లైట్లో ఉండే జ్యూలరీ అవుతుంది. ఫొటోల్లో ఈ పెండెంట్ లైట్ని క్యాచ్ చేస్తూ అదిరిపోయే గ్లో ఇస్తుంది. హెవీ జ్యూలరీ మానేసి, ఈ ఇన్విజిబుల్ చైన్ విత్ పెండెంట్ని వేసుకుంటే, నేచురల్ బ్యూటీ ఇంకో లెవెల్కి హైలైట్ అవుతుంది. జుట్టు లూజ్ వేవ్స్గా వదిలేస్తే క్లాసీ లుక్, హై బన్ చేస్తే ఎలిగెంట్ లుక్ మీ సొంతం. మార్కెట్లో గోల్డ్, సిల్వర్, కలర్ఫుల్ డిజైన్స్ లైట్వెయిట్ ఆప్షన్లతో దొరుకుతున్నాయి. ఇదొక ఆభరణం మాత్రమే కాదు, అది న్యూ ఏజ్ ట్రెండ్, స్టయిల్ సీక్రెట్ కూడా! (చదవండి: దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!) -
వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్
వయసు తొంభై ఏళ్లు దాటితే చాలామంది కూర్చుని మోకాలికి నూనె రాసుకోవడం, మనవరాళ్లకు కథలు చెప్పడం, రక్తపోటు–షుగర్ మందులు సరిగ్గా తీసుకున్నామా అని చెక్ చేసుకోవడం చేస్తుంటారు. కాని, ఈ అమ్మమ్మ మాత్రం అలా కాదు. ట్రాక్లోకి దూకి గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఆమె తొంభై మూడేళ్ల పానీదేవి. పానీదేవి కథ సాధారణం కాదు. అమ్మాయిలకు చదువూ ఆటలూ దూరమైన కాలంలో పుట్టింది. పదిహేను ఏళ్లకే పెళ్లి, యాభై ఏళ్లకే భర్తను కోల్పోయింది. ఎనిమిది మంది పిల్లలకు తల్లి, తండ్రి తానే అయి పెంచింది. చిన్న వయసు నుంచే పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. జీవితం అంతా బాధ్యతలతో నిండిపోయినా, ఆమె మనసులో ఎప్పుడూ ఒక కల మేల్కొని ఉండేది. ఆ కలను నిద్రపుచ్చాలా లేక సాకారం చేసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం ఆమె రెండేళ్ల క్రితం చెప్పింది. ఒకరోజు తన మనవడు జైకిషన్ పారా అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా, పానీదేవి ఒక్కసారిగా ‘నేనూ చేస్తాను’ అని చెప్పింది. ఇంత వయసులో విశ్రాంతి తీసుకోమని కాకుండా, మనవడు ‘పరుగెత్తు’ అని ప్రోత్సహించాడు. అలా ఆ మనవడు, అమ్మమ్మ కాస్తా గురుశిష్యులుగా మారారు. కొత్త జీవితం! ఇంటి పనులు ముగించుకుని మైదానానికి వెళ్లడం, పాదాలు నొప్పితో వణికినా ఆగిపోకుండా శిక్షణ కొనసాగించడం, చుట్టుపక్కల వాళ్ల నవ్వులు వినిపించినా తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తడంతో ఆమె కొత్త జీవితం ఆరంభమైంది. ప్రేక్షకులు మొదట ‘ఈ వయసులోనా?’ అని ఆశ్చర్యపోయినా, ఘాఘ్రా–చోళీతో ట్రాక్లోకి దూకి కేవలం 45 సెకన్లలోనే 100 మీటర్లు పూర్తి చేసేసరికి చప్పట్లతో మైదానం మార్మోగిపోయింది. ఆ పోటీకి ముందు గుంతలో పడిపోయి ఆమె మోకాళ్లు గాయపడ్డాయి. డాక్టర్లు ‘విశ్రాంతి తీసుకోండి’ అన్నారు. కాని, పానీదేవి మాత్రం ‘మహా అయితే ఓడిపోతాను. కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం అసలు చేయను’ అంటూ పట్టుదలతో ట్రాక్లోకి దిగింది. అలా 2023లో అల్వార్లో మొదటి మెడల్, 2024లో పుణేలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె ఇవన్నీ ఇంట్లో అల్మారాలో దాచేసింది! మనవడు వీడియో పోస్ట్ చేయకపోతే, దేశం మొత్తం ఆమెను అసలు చూడకపోయేది. ఇప్పుడు ఆమె కల మరింత పెద్దది. త్వరలోనే ఇండోనేషియాలో జరగబోయే ఆసియన్ మాస్టర్స్ గేమ్స్లో భారత్ తరపున పతకం గెలవడానికి సిద్ధమవుతోంది. (చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
ఒక్క క్లిక్ చాలు.. వెంటనే చేతిలో ఫొటో
మునుపటి రోజుల్లో ఫొటో అంటే ఒక్క క్లిక్ చాలు. వెంటనే ఆ ఫొటో చేతిలోనే ఉండేది. వేలకొద్దీ బ్లర్లు, సెల్ఫీ డిలీట్స్, ఎడిట్స్ ఏమీ ఉండేవి కాదు. ఆ మ్యాజిక్ను మళ్లీ మన చేతిలో తేవడానికి వచ్చింది – ఇన్టాక్స్ మినీ ఇవో ప్రీమియం ఎడిషన్! ఇది కేవలం కెమెరా మాత్రమే కాదు, ప్రింటర్ కూడా. ఒక్క క్లిక్తో ఫొటో తీయవచ్చు, అదే క్షణంలో ప్రింట్ చేసుకోవచ్చు. పది లెన్స్ ప్రభావాలు, పది ఫిల్మ్ ప్రభావాలు – మొత్తం వంద రకాల మూడ్లలో మీ ఫోటోలు తీర్చిదిద్దుకోవచ్చు. రెట్రో లుక్ డిజైన్, డయల్స్తో పాత కెమెరా ఫీల్కు కొత్త స్పర్శ ఇస్తుంది. అంతేకాదు, డైరెక్ట్ ప్రింట్ ఫీచర్తో మొబైల్ నుంచి ఫోటోలు నేరుగా ప్రింట్ చేయవచ్చు. ధర రూ. 19,999.చిన్ననాటి జాదూ బాక్స్!చిన్నప్పటి రోజుల్లో స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ మూలన పడేసి, భోజనం కూడా మరచిపోయి గేమ్ కన్సోల్ ఆన్ చేసిన క్షణాలు గుర్తున్నాయా? మారియోలో ప్రిన్సెస్ కోసం పరిగెత్తిన ఆ ఉత్సాహం, కాంట్రాలో లైఫ్ పోయినప్పుడు మనసులో పడిన ఆ బాధ– ఇవన్నీ మళ్లీ నిజం కానున్నాయి. ‘బెలోక్సీ ఎ5 హ్యాండ్హెల్డ్ గేమ్ కన్సోల్’ అంటే కేవలం ఒక గాడ్జెట్ కాదు, అది 90ల నాటి బాల్యపు మజాను తిరిగి మన చేతిలో పెట్టే జాదూ బాక్స్. ఇందులో ఏకంగా 500 క్లాసిక్ గేమ్స్. చేతిలో పట్టుకుని ఆడినా సరే, టీవీకి కనెక్ట్ చేసి పెద్ద స్క్రీన్పై ఆడినా సరే, ఆ పాత రెట్రో ఫీల్ కచ్చితంగా వస్తుంది. రాత్రిళ్లు దుప్పట్లో దాక్కుని, లైట్ ఆఫ్ చేసి ఆడిన ఆ సీక్రెట్ మజాను కూడా ఇది మళ్లీ జ్ఞాపకం చేస్తుంది. ధర కేవలం రూ.758 మాత్రమే!అప్పటి రోబో పెట్!ప్రస్తుత పిల్లలు ఆడుతున్న ఆర్టిఫిషియల్ రోబో ఫ్రెండ్స్, డిజిటల్ టాయ్స్ కంటే బెటర్గా అప్పట్లో ఒక నిజమైన డిజిటల్ ఫ్రెండ్ ఉండేది. అది అప్పటి అందరి ఫేవరెట్ పెట్– టమాగొచ్చి! అప్పట్లో అది కేవలం ఒక గేమ్ కాదు, నిజంగా మనకున్న డిజిటల్ పెట్ ఫ్రెండ్. దానికి తిండి పెట్టాలి, స్నానం చేయించాలి, బయటికి తీసుకెళ్లాలి, ఆటలు ఆడించాలి– ఇవన్నీ మన బాధ్యతే! ఇప్పుడా పెట్ కొత్త కలర్ స్క్రీన్, టచ్ బటన్స్, కెమెరా, గేమ్స్ అన్నీ కలిపి మరింత అప్డేట్ అయి మన చేతిలోకి వచ్చేసింది– బాండై అమెరికా టమాగొచ్చి పిక్స్ – స్కై పర్పుల్ ఎడిషన్! ఇందులో మీరు మీ పెట్తో సెల్ఫీలు తీయొచ్చు, వంటలు చేయించవచ్చు, ఫ్రెండ్స్ టమాగొచ్చిలతో కలసి ప్లే డేట్స్కి వెళ్లొచ్చు, గిఫ్ట్లు మార్చుకోవచ్చు. పదిహేడుకు పైగా గేమ్స్లో ఆడి పాయింట్స్ సంపాదించి, మీ పెట్కి కావలసిన ఫర్నిచర్, ఫుడ్, యాక్సెసరీస్ కొనిపెట్టొచ్చు. ధర రూ.9,831. -
అందరికీ ఒకటే రక్తం!
‘మనుషులందరిలోనూ ఒకటే నెత్తురు’... ‘ఏ మనిషిలో ఉండే నెత్తుటిదైనా ఒకటే రంగు, ఎరుపు’.. పాత సినిమాల్లో ఇంచుమించుగా ఇలాంటి డైలాగులు వినే ఉంటారు. మనుషులందరిలోనూ ఉండే నెత్తుటి రంగు ఎరుపే అయినా, నెత్తుటిలో రకాలు ఉన్నాయని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది. వైద్య శాస్త్ర ప్రకారం మనుషుల్లో ఏ, బీ, ఓ, ఏబీ బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. వీటిలోనూ ఒక్కోదానికి పాజిటివ్, నెగటివ్ రకాలు ఉన్నాయి. శస్త్రచికిత్సలు జరిగేటప్పుడు, ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులను బతికించాలంటే, నెత్తురు అత్యవసరం. అవసరంలో ఉన్నవారి ప్రాణాలను నిలబెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద ఆస్పత్రులు బ్లడ్బ్యాంకులను కూడా నిర్వహిస్తుంటాయి. ఇన్ని ఉన్నా, ఒక్కోసారి అవసరమైన వేళకు తగిన రక్తం దొరకక గాల్లో కలిసిపోతున్న ప్రాణాలెన్నో! ఒక్కొక్కరికి ఒక్కో రకం రక్తంతో పని లేకుండా, అందరికీ సరిపోయే కృత్రిమ రక్తాన్ని జపానీస్ ప్రొఫెసర్ హిరోమీ సకాయి రూపొందించారు. జపాన్లోని కషిహరాలో ఉన్న నరా మెడికల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న హిరోమీ ‘హిమోగ్లోబిన్ బేస్డ్ ఆక్సిజన్ క్యారియర్స్’ (హెచ్ఓబీసీ) ఉపయోగించి, నానో టెక్నాలజీ ద్వారా ఈ కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు. ఈ రక్తం ఏ గ్రూపు రక్తం ఉన్నవారికైనా సరిపోతుంది. ఈ కృత్రిమ రక్తం విస్తృతంగా అందుబాటులోకి వస్తే, ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. అంతేకాకుండా, రక్తదాతల అవసరం కూడా తగ్గుతుంది. (చదవండి: ప్రెగ్నెట్ టైంలో సైనటిస్ మందులు వాడితే ప్రమాదమా..?) -
ప్రెగ్నెంట్ టైంలో సైనసైటిస్ మందులు వాడితే ప్రమాదమా..?
నేను మూడు నెలల గర్భవతిని. నాకు ఎప్పటినుంచో డస్ట్ అలెర్జీ, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి. గర్భం వచ్చిన తర్వాత తరచూ జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు వాడాను. ఈ మందులు నా బిడ్డకు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనగా ఉంది. గర్భధారణ తొలి నెలల్లో మందులు వాడటం సురక్షితమా? నేను ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?– సుశీల, నాగర్కర్నూల్సుశీల గారు, గర్భధారణ తొలి నెలల్లో శరీరంలో రక్షణశక్తి, హార్మోన్లలో మార్పులు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ సమయంలో జలుబు, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రావడం సాధారణం. కొన్నిసార్లు ఫ్లూ కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తే, వాటి కారణం ఏమిటో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది. ఇలాంటి సమయంలో ముందుజాగ్రత్తలు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఫ్లూ సీజన్లో ఎక్కువ జనసమూహాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, అలెర్జీ కలిగించే పదార్థాలను తీసుకోకపోవటం, అవసరమైతే మాస్క్ ధరించడం మంచిది. ఫ్లూ వ్యాక్సిన్ గర్భధారణలో ఎప్పుడైనా సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు రక్షణ ఇస్తుంది. తేలికపాటి జలుబు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం, వేడి సూపులు తాగడం, ఇంట్లో ఆవిరి పీల్చడం లాంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, ఆక్సిజన్ స్థాయిలను ఇంట్లోనే ఉంటూ గమనించడం మంచిది. లక్షణాలు ఎక్కువైనా లేదా ఏదైనా అసాధారణంగా అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మొదటి మూడు నెలల్లో మందులు వాడడంపై మీరు ఆందోళన పడుతున్నా, నిపుణుల సూచనలో ఇచ్చే తేలికపాటి చికిత్సలు సాధారణంగా సురక్షితమే. ఇవి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవు. సమయానికి వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలు పాటిస్తే గర్భధారణలో జలుబు, తుమ్ములు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా నియంత్రించుకోవచ్చు.నాకు ఈ మధ్యనే రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. అయితే, నా మొదటి గర్భధారణలో నాకు తీవ్రమైన వాంతులు అయ్యాయి. పలుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే, ఇప్పుడు ఈ గర్భధారణను కొనసాగించడానికి భయం వేస్తోంది. ఈ గర్భధారణలో కూడా నాకు మళ్లీ అలాంటి వాంతులు వస్తాయా? వాంతులు తగ్గించుకోవడానికి నేను ఏమి చేయగలను?– కీర్తి, వరంగల్గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణంగా కనిపించే సమస్య. దీనిని ‘మార్నింగ్ సిక్నెస్’ అంటారు. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. సాధారణంగా ఆరు నుంచి ఏడవ వారంలో ప్రారంభమై, పదనాలుగు నుంచి పదహారు వారాల మధ్య తగ్గిపోతుంది. అయితే ఈ లక్షణాల తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొందరికి స్వల్పంగా మాత్రమే ఉండగా, మరికొందరికి చాలా తీవ్రమైన, రోజువారీ జీవితాన్ని ఇబ్బందిపెట్టేంతగా వాంతులు రావచ్చు. మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరమవుతుంది. ఒకే మహిళకు వేర్వేరు గర్భధారణల్లో వాంతుల తీవ్రత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం గర్భధారణ హార్మోన్ అయిన బీటా హెచ్సీజీ స్థాయి అకస్మాత్తుగా పెరగడం. అందుకే కవలలు గర్భంలో ఉన్నప్పుడు వాంతులు మరింతగా వస్తాయి. వాంతులు తగ్గించుకోవడానికి మీరు పాటించగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు తక్కువ మోతాదులో అయినా తరచు ఆహారం తీసుకోవాలి. మృదువైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినడం మంచిది. మసాలా వంటకాలకు, బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. వాంతులు ఎక్కువగా వస్తున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని వాసనల వల్ల వాంతులు పెరిగే అవకాశం ఉన్నందువలన అలాంటి వాసనల నుంచి దూరంగా ఉండాలి. అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. వాంతులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మందులు సురక్షితంగా వాడవచ్చు. ఇవి మీ డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. మీరు ఏమీ తినలేకపోతున్నా లేదా తాగలేకపోతున్నా, బరువు తగ్గడం లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల మీకు, శిశువుకు కలిగే సంక్లిష్టతలను తగ్గించవచ్చు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!) -
షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి
ప్రేక్షకుల మనసుకు దగ్గరవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు. ఎంచుకున్న పాత్రలో ఇమిడిపోయి నటించాలి. అలాంటి నటనతో మన పక్కింటి అమ్మాయిలా ఉందేంటి? మనింటి అమ్మాయిలానే ఉంది.. అనుకునేట్టుగా దగ్గరవుతున్న నటి శివాని నాగారం. ఆకర్షించే కళ్లు, ఆకట్టుకునే నటన ఈ తెలుగమ్మాయి సొంతం. ఈ లిటిల్ హార్ట్ గురించి మరెన్నో విశేషాలు మీకోసం..ఆ సినిమాతో క్లిక్అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాలో వెండితెరపై మెరిసిన నటి శివాని (Shivani Nagaram). మొదటి సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో శివాని కుర్రాళ్లకు క్రష్గా మారింది. శివాని స్వస్థలం హైదరాబాద్. విల్లా మేరీ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె మొదట ‘అంతర్గత’ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. తర్వాత ‘మిస్టర్ గర్ల్ ఫ్రెండ్’ అనే వెబ్ సిరీస్ చేసి తెలుగు యువతకు ముందుగానే పరిచయమైంది.చాలా అవకాశాలొచ్చాయి, కానీ..చిన్నతనం నుంచే శివాని సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఖాళీ సమయాల్లో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ క్లాసులు తీసుకోవడం తనకెంతో ఇష్టమట! సోషల్ మీడియాలో ఆమె తన తమ్ముడితో కలిసి పాటలు పాడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటుంది. దాన్నిబట్టి ఆమెకు సంగీతంపై ఉన్న ఇష్టం అర్థమవుతుంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ హిట్ అయ్యాక, చాలా అవకాశాలు వచ్చాయి కాని, ఒప్పుకోలేదు. ఎందుకంటే అదే తరహా క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. నాకు ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్ ఉండాలి.నిత్యవిద్యార్థినిఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా.. నేనింకా యాక్టింగ్ లో చాలా నేర్చుకోవాలి. నిత్యవిద్యార్థినిగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను. నా దృష్టిలో సినిమాలు, వెబ్ సిరీస్లు రెండూ గొప్పవే. నటిగా నన్ను మలచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాననే నమ్మకం నాకుంది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. వచ్చి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. కాలేజీ రోజుల్నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. దాన్ని మా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. వాళ్లు నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు.ఆ హీరోయిన్కు అభిమానినినేను హీరోయిన్ సమంతకు పెద్ద ఫ్యాన్. శ్రీదేవి గారు, సావిత్రి గారి నటన అంటే చాలా ఇష్టం. 'నువ్వు హీరోయిన్ కాకపోయుంటే ఏమయ్యేదానివి’ అని చాలామంది అడుగుతుంటారు. హీరోయిన్ కాకుంటే కచ్చితంగా సింగర్ అయ్యేదాన్ని. నాకు మ్యూజిక్, డ్యాన్స్ అంటే ప్రాణం. నాకు కథ, అందులో నా క్యారెక్టర్ చాలా ముఖ్యం. అవి నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. అంతే తప్ప, గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయాలని అనుకోవట్లేదు. నేను రెండు సినిమాలే చేశాను. వాటికే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతలా ప్రేమిస్తుండటం చూస్తే, చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది.చదవండి: దమ్ముంటే నాకు సైట్ కొట్టి చూడండి : హీరోయిన్ -
నేరము శిక్ష
ఆ చీకటి కేబిన్ లోని ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. దైవజ్ఞ తన చేతి గడియారాన్ని చూసుకుని లేచాడు. రో 23జి సీట్కి చేరుకుని, అందులో కూర్చుని గాఢనిద్రలో ఉన్న ఏభైపైబడ్డ ఆవిడ మెడ కింద, డిన్నర్తో ఇచ్చిన స్టీల్ కత్తితో కసుక్కున అడ్డంగా కోశాడు. ఆవిడ మెలకువ వచ్చి చిన్నగా కేకపెట్టింది. రక్తం చిందింది. కాని పూర్తిగా తెగలేదు. మరోసారి, ఇంకోసారి. గరగర శబ్దంతో పాటు ఆ మెడలోంచి ఎర్రటి గాలి బుడగలు బయటికి వచ్చాయి. దైవజ్ఞ ఆవిడ సీట్ మీది రీడింగ్ లైట్ని వెలిగించి, కాల్ బటన్ ని నొక్కాడు. నిమిషంలో ఏర్హోస్టెస్ అక్కడికి వచ్చింది. రీడింగ్ లైట్లో ఆవిడ మెడ నించి తల అతి అసహజ రీతిలో పక్కకి వేలాడటం, ఆవిడ ఛాతీ రక్తంతో తడిసి ఉండటం చూసి ఆమె భయంగా రెండు అడుగులు వెనక్కి వేసింది. దైవజ్ఞ ఆమెకి మడిచిన కాటన్ నేప్కిన్ ని ఇచ్చి చెప్పాడు.‘‘నేనే చంపాను. ఇది హత్యాయుధం.’’అయోమయంగా చూసే ఆమె తన చెవులని తనే నమ్మలేకపోయింది.‘‘మీ పైలెట్కి ఈ విషయం చెప్పండి. లాగ్ బుక్లో రాస్తారు.’’ అతను శాంతంగా చెప్పాడు.ట్రాన్ ్సలో ఉన్నట్లుగా ఆమె కాక్పిట్లోకి వెళ్ళింది. గజ గజ వణుకుతూ వగరుస్తూ మధ్య మధ్యలో ఆపి చెప్పింది.‘‘సీట్ 23జిలోని లేడీ మెడ తెగింది. ఒకతను తనే చంపానని, ఇందులో కత్తి ఉందని చెప్పి ఇచ్చాడు.’’‘‘నువ్వు చూస్తూండు.’’ తక్షణం కెప్టెన్ లేస్తూ ఫస్ట్ ఆఫీసర్తో చెప్పాడు.ఇద్దరూ 23 జి దగ్గరకి వచ్చారు. దైవజ్ఞని ఇద్దరు ప్రయాణికులు కదలకుండా చేతులు బిగించి పట్టుకున్నారు.‘‘కెప్టెన్ . నా పేరు దైవజ్ఞ. నన్ను వదలమని చెప్పండి. తలుపు తెరుచుకుని పారిపోతానా?’’ దైవజ్ఞ నవ్వుతూ సూచించాడు.‘‘ఇతను ఈవిడని పొడవడం నేను చూశాను. ఇదే వరుసలో లేప్టాప్లో పని చేసుకుంటున్నాను.’’ ఒకడు చెప్పాడు.‘‘ఎందుకు చంపావు?’’ హతురాలి మీద దుప్పటిని కప్పుతూ కెప్టెన్ అడిగాడు.‘‘ఇక్కడ చంపితే నాకు శిక్ష పడదని.’’‘‘నువ్వు నేరాన్ని ఒప్పుకున్నావు. సాక్షులు కూడా ఉన్నారు. ఎందుకు శిక్ష పడదు?’’ కెప్టెన్ అడిగాడు.‘‘నా నేరానికి నన్ను ఎవరు శిక్షిస్తారు?’’ దైవజ్ఞ ప్రశ్నించాడు.‘‘మన విమానం షికాగోలో దిగగానే అక్కడి పోలీసులు.’’‘‘వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే ఫాల్స్ అరెస్ట్కి వాళ్ళ మీద నష్టపరిహార దావా వేస్తానని కూడా చెప్పండి. చూస్తూండండి. నేను స్వేచ్ఛగా తిరుగు విమానంలో వెళ్ళిపోతాను.’’అతను పిచ్చివాడని అనుమానించిన కెప్టెన్కి కాదని, మేధావి అయుండొచ్చని అనిపించింది. చాలామంది ప్రయాణికులు లేచారు.‘‘ఈ లేడీ విలన్ ని చంపటానికి నేను ఈ ప్రదేశాన్ని, ఈ సమయాన్ని ఎన్నుకున్నాను కెప్టెన్. ప్రపంచంలో ఎవరూ నా నేరానికి శిక్షించలేరు. అందుకు సాంకేతికతలు అడ్డు వస్తాయి.’’ దైవజ్ఞ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.‘‘సాంకేతికతలా? ఏమిటవి?’’ ప్రయాణికుల్లోని ఒకరు ప్రశ్నించారు.‘‘నన్ను ఈ నేరానికి అరెస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. చేస్తే నన్ను ఎక్కడ విచారిస్తారు?’’‘‘ఇండియాలో. నేను లాయర్ని.’’ ఒకరు చెప్పారు.‘‘మీరు మళ్ళీ లా క్లాస్లో చేరండి లాయర్గారు. నేరం ఇండియా భూభాగం మీద జరగలేదు. ఇది ఇండియా విమానం తప్ప ఇండియన్ కన్సులేటో లేదా ఎంబసీనో కాదు. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో, ఆకాశంలో ఈ నేరం జరిగింది. నేరం జరిగిన స్థలం నుంచి రెండు వందల నాటికల్ మైల్స్లో ఏ దేశం లేదు. ప్రపంచంలోని ఏ దేశానికి జ్యూరిస్డిక్షన్ లేని చోటుని ఎంచుకుని మరీ ఈవిడని చంపాను.’’ దైవజ్ఞ చిరునవ్వుతో చెప్పాడు.‘‘ఎందుకు చంపారు?’’ ఏర్హోస్టెస్ ప్రశ్నించింది.‘‘ఈవిడ న్యూరాలజిస్ట్. హైద్రాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో సంవత్సరానికి కోటి రూపాయల పేకేజ్తో పని చేస్తోంది. అంత జీతం పొందటానికి ఆవిడకి నెలకి హాస్పిటల్కి ఎంత సంపాదించి పెట్టాలో టార్గెట్స్ ఉంటాయి. నా భార్యకి బ్రెయిన్ ట్యూమర్. మరణం తథ్యమని తెలిసీ హాస్పిటల్లో చేర్పించమంది. ఎన్ని టెస్టులు రాసిందో! పన్నెండు రోజులకి ముప్ఫైరెండు లక్షల బిల్ని సొంత ఇంటిని అమ్మి కట్టాను. నేను ఓ ఫేక్టరీలో టర్నర్ ఉద్యోగం చేస్తున్నాను. ఈవిడ వల్ల మా ఆవిడతో పాటు నాకు నిలువ నీడ కూడా పోయింది. నా భార్యకి ఇచ్చిన మందుల సైడ్ ఎఫెక్ట్ల వల్ల తిన్నది తిన్నట్లుగా వాంతైపోయి, ఎప్పుడూ మైకంలో ఉండేది. మా ఆవిడ బతకదని తెలిసీ మభ్యపెట్టి నన్ను దోపిడీ చేసింది. ఆ శిక్ష పడని నేరానికి, నేనూ శిక్ష పడకుండా ఈవిడని ఎలా చంపాలా అని చాలా రీసెర్చ్ చేసి, ఆవిడ విమాన ప్రయాణం కోసం ఏడు నెలలుగా వేచి చూస్తున్నాను. ఇక్కడ నా పగ తీర్చుకున్నాను. షికాగోలో దిగాక తిరిగి విమానంలో మళ్ళీ హైద్రాబాద్ వెళ్ళిపోతాను. ప్రపంచంలోని అన్ని దినపత్రికలు నా గురించి రేపు రాస్తాయని పందెం.’’ ‘‘నీ పథకంలో ఓ ఎదురుచూడని భాగం కూడా ఉంది.’’ అతన్ని పట్టుకున్న వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు.‘‘ఏమిటది?’’‘‘ఇది. నీకెంత పగ ఉందో నాకు అంతే పగ ఉంది. ఇక్కడ జరిగిన నేరానికి నీకులా నాకూ శిక్ష పడదు.’’ చెప్పి అతను ఓ సిరంజిలోని నీడిల్ని చటుక్కున దైవజ్ఞ భుజంలో గుచ్చి ఇంజెక్ట్ చేశాడు.దైవజ్ఞ తల పక్కకి వాల్చగానే ప్రయాణికులు మరోసారి దిగ్భ్రాంతి చెందారు.‘‘మీరెవరు?’’ కెప్టెన్ అడిగాడు.‘‘ఆవిడ మా అమ్మ.’’ అతను కూడా దైవజ్ఞ అంత శాంతంగా జవాబు చెప్పాడు.‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ శీర్షిక పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఆటో ఆపద్బాంధవి!
‘ఓహో.. ఈ చెన్నై అర్ధరాత్రి వీ«థుల్లో ఒంటరిగా ఏలారా వెళ్లడం!’ అని మీరు ఆలోచిస్తున్న సమయానికే, పసుపు, ఆకుపచ్చ ఆటో ఒక సూపర్ హీరో ఎంట్రీ ఇచ్చినట్టుగా బ్రేక్ వేసి మీ ముందుకు ఆగుతుంది. అదే మన రాజి అక్క!రాజి అక్కకి ఆటో అంటే వాహనం మాత్రమే కాదు, అది ఒక ఇల్లులాంటిది. అంతకంటే, ఎక్కువగా ఆ ఆటోలో ప్రయాణం కొండంత భరోసా, భద్రత! ఇరవై ఏళ్లకు పైగా ఆటో నడుపుతున్న ఆమె, ఒక డ్రైవర్ మాత్రమే కాదు; వేలమంది మహిళలకు రక్షకురాలు, ఆపద్బాంధవురాలు కూడా! ఒక భయంకరమైన ఘటన తన కళ్ల ముందే జరగడం చూసి, నిర్ణయించుకుంది ‘ఇకపై ఒక్క మహిళ కూడా భయపడుతూ ఇంటికి చేరకూడదు’ అని. అప్పటి నుంచి ఆమె ఆటో చక్రాలు కేవలం మీటరు చూపించడం మాత్రమే కాదు; భద్రత, స్నేహం, మనసులో నమ్మకం కూడా అందిస్తున్నాయి. ఆమె ఆటోలో కూర్చుంటే అందులో ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటర్ బాటిల్, బిస్కట్ ప్యాకెట్, సానిటరీ న్యాప్కిన్ అలా అలా! చాలా కనిపిస్తాయి. అప్పుడు అడుగుతారు ‘అక్కా, నువ్వు డ్రైవరా లేక ట్రావెల్ మమ్మీనా?’ అని, దానికి అక్క నవ్వుతూ ‘ఇవి ఉంటే ఎవరికైనా కష్టంలో ఉపయోగపడతాయి. అంతే, సేల్స్ కాదు, ప్రమోష¯Œ ్స కాదు మచ్చీ!’ అని చెబుతుంది. ఇలా ఆడుతూ పాడుతూ రోజుకు ముప్పై ట్రిప్స్ పూర్తి చేసి, శరీరం అలసిపోయినా సరే, అర్ధరాత్రి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేస్తే? రాజి అక్క వెంటనే ఆటో స్టార్ట్ చేస్తుంది. ‘మహిళలు సేఫ్గా ఇంటికి చేరితేనే నాకు నిద్ర వస్తుంది’ అంటుంది. అంతేకాదు సీనియర్ సిటిజన్ ఎక్కితే ఫ్రీ. పిల్లాడు స్కూల్కి ఆలస్యమైతే ఫ్రీ. ఎవరికైనా సడెన్ ఎమర్జెన్సీ అయితే ‘మీటర్ ఆఫ్, హాస్పిటల్ ఆన్!’ ఇంతా చేస్తుంది తన ఖాళీ సమయంలో కాదు, తన జీవిత పోరాటంలో భాగంగానే!ఆమె కష్టాలకు కుటుంబమే సాక్ష్యంరాజి అక్కకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇంజినీర్ అయ్యాడు, కూతురు నర్సింగ్ చదువుతోంది. భర్త అనారోగ్యం వల్ల పని మానేశాడు. అప్పటి నుంచి ఈ ఆటోనే వారికి అన్నం పెడుతోంది. కానీ రాజి అక్క ధైర్యం ముందు ఇవేమీ ఇబ్బంది కాలేదు. ‘ఈ చక్రాలు తిరిగేంత వరకు నా ఫ్యామిలీకి ఏ భయం లేదు’ అని గర్వంగా చెబుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘ఎనయుమ్ కైకల్’ అనే మహిళా ఆటో డ్రైవర్ల గ్యాంగ్ లీడర్ కూడా రాజి అక్కే! ఆమె ఆటోకి పంక్చర్ అయితే, ఐదు ఆటోలు సూపర్ ఫాస్ట్గా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టయిల్లో వచ్చేస్తాయి. మరెంతోమందికి ఉచిత డ్రైవింగ్ క్లాసులు కూడా ఇస్తుంది. ఆటో నడపడం నేర్చుకోవాలనుకునే మహిళలకు ఆమె గురువు. ప్రస్తుతం అక్క ఆటో ప్రయాణ కథలను విన్నవారంతా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని నగరాల్లోనూ ఇలాంటి అక్క ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. ఎందుకంటే, రాజి అక్క డ్రైవర్ మాత్రమే కాదు ఆపదలో ఆదుకునే అక్క, అమ్మ, ఫ్రెండ్, బాడీగార్డ్ అన్నీ. నారీ భగీరథ! కర్నాటకలోని సిర్సి దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడ ఒకప్పుడు నిత్యం నీటి కొరత, ఎండిన పంటలు, దాహంతో అలమటిస్తున్న జీవులు కనిపించేవి. అలాంటి సమయంలో చాలామంది ‘ఎవరైనా వచ్చి పరిష్కరిస్తారు’ అని చేతులెత్తేసి కూర్చుంటే, యాభై మూడు ఏళ్ల గౌరి నాయక్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. తన పంటలు పచ్చగా మారాలని తపనతో ముందడుగు వేసింది. స్వయంగా తన చేతులతో బావి తవ్వడం మొదలుపెట్టింది. యంత్రాలు లేవు, సహాయం లేదు, కేవలం ఒక గిలక, తాడు, బకెట్ మాత్రమే. రోజూ ఆరు గంటలపాటు కష్టపడి, ఆరు నెలల పాటు శ్రమించింది. పక్కవాళ్లు ‘ఇది అసాధ్యం’ అన్నారు. కాని, గౌరి మాత్రం ఆగలేదు. ఆమె పట్టుదల ఫలించింది. అరవై అడుగుల లోతులో నీరు దొరికింది. ఆ నీటితో ఆమె పంటలు తిరిగి పచ్చగా మారాయి. అక్కడితో ఆగిపోకుండా, మరో బావి తవ్వింది. ఈసారి తనకోసం కాదు– పొరుగువారి కోసం. ‘నా పంటలు బతికితే సరిపోదు, నా ఊరి ప్రజలందరికీ జీవం రావాలి’ అని అనుకుంది. పాఠశాల దగ్గర బావి తవ్వొద్దని అధికారులు ఆపినా, గౌరి వెనక్కి తగ్గలేదు. స్కూల్ పిల్లలకు కూడా నీరు అందేలా చేసింది. మధ్యలో ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, అలసట– అన్నింటినీ తట్టుకుంది. అందుకే, ఈరోజు అందరూ ఆమెను ‘లేడీ భగీరథ’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఆమె బావులు రైతులకు, పిల్లలకు, జంతువులకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఇంకా గౌరి ఆగలేదు. గ్రామస్తులు దూరంగా నడుస్తూ నీరు తెచ్చుకోకూడదనే తపనతో, మూడో బావిని కూడా తవ్వుతోంది. -
హృదయ నదులు
హృదయ నదులు కొన్నిసార్లు సైన్స్ కన్నా, కవిత్వమే ఎక్కువ లాజికల్గా అనిపిస్తుంది! అందుకు ఒక ఉదాహరణ... బహుముఖసృజనశీలి అయిన ఇటాలియన్ చిత్రకారుడు, ఇంజినీరు లియోనార్డో డా విన్సీ నదుల్ని మానవ శరీరంలోని ధమనులు, సిరలతో పోల్చటం! నదులు, ఉపనదులు భూగోళానికిజీవ ప్రవాహ నాళాలు అని వాటి ప్రాముఖ్యాన్ని ఈ ఒక్కమాటతో చక్కగా అర్థం చేయించారు డా విన్సీ. 51 కోట్ల, 72 వేల చ.కి. మీ. విస్తీర్ణంలో ఉన్న మన భూమిపై లక్షన్నరకు పైగా నదులు ఉన్నాయని ఒక అంచనా. ఈ నదుల ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేందుకని గత ఇరవై ఏళ్లుగా ఏటా మనం సెప్టెంబరు నాల్గవ ఆదివారాన్ని (నేడు)‘ప్రపంచనదుల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పురాణాల్లో, సాహిత్యంలో, సినీ గీతాల్లో ఉన్న నదుల మననాలు కొన్ని.. మీ కోసం!ప్రవాహమే నది రూపంనదుల గురించి అల మాత్రంగానైనా మాట్లాడుకోవటం అంటే మహా సముద్రంలో ఈత కొట్టటమే! మొదలు–తుది; అంతము– ఆరంభమూ లేని ప్రవాహం... సమస్త మానవాళి జీవితాన్ని పెనవేసుకుని ఉన్న ఈ నదీ ప్రస్థానం. గ్రీకు తత్వవేత్త హెరాహ్లిటస్ అన్న మాట ఈ నదీ ప్రస్థానానికి, నదీ ప్రస్తావనకు చక్కగా సరిపోతుంది. ‘‘ఒకే మనిషి ఒకే నదిలో రెండోసారి అడుగు పెట్టడు. ఎందుకంటే– ఆ నది ఒకేలా ఉండదు. ఆ మనిషీ ఒకేలా ఉండడు’’ అంటారాయన. అంటే ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనిషి కూడా నదీ ప్రవాహంలా ఒకేలా ఉండడు అని అంతరార్థం.సాగిపోయే జీవిత నౌకనదుల పోలికతో పాశ్చాత్యులవే మరికొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి. లెబనీస్–అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్ ఏమంటారో చూడండి, ‘‘నది వెళ్లి సముద్రంలో కలిసినట్లే జననం వెళ్లి మరణంలో కలుస్తుంద’’ట! ఇక దివంగత బ్రిటన్ రాజనీతిజ్ఞుడు ఎనోచ్ పావెల్, ‘‘నా ఓడ కనిపించకుండాపోతే, నా ప్రయాణం ముగిసిందని కాదు. నది వంపు తిరిగిందని..’’ అని అంటారు! ఎంత చక్కగా చెప్పారు. ‘కొండగాలి తిరిగింది’ అని ఆరుద్ర అన్నట్లు – కొండగాలి మాత్రమే కాదు, నది కూడా తిరుగుతుంది. ప్రాప్తమున్న తీరానికి జీవిత నౌక సాగిపోతుంది. ఇదీ ఆరుద్ర మాటే. వయ్యారి గోదారమ్మ..!ఒక అమ్మాయికి యుక్త వయస్సు అనేది విశాలమైన నది నుండి సముద్రంలోకి తేలుతున్నట్లుగా ఉంటుంది అంటారు జి.స్టాన్లీ హాల్. 19వ శతాబ్దపు మనో వైజ్ఞానిక నిపుణుడు ఈయన. నదిలా నూత్న యవ్వనం పరవళ్లు తొక్కుతుందని చెప్పటం స్టాన్లీ ఉద్దేశం. ‘వయ్యారి గోదారమ్మ ఒళ్లంత ఎందుకమ్మ కలవరం..’ అని వేటూరి అడిగిన ప్రశ్నకు స్టాన్లీ ఆల్రెడీ సమాధానం చెప్పేసే ఉంచారన్న మాట! అమెరికన్ సంగీతకారుడు జాన్ విలియమ్స్, నదిని సంగీతంలో పోల్చారు. ‘‘సంగీతంలో నేను ఎక్కువ తక్కువల్ని చూడను. సంగీతం అన్నది మనమందరం కప్పులతో ముంచుకుని తాగ గల అమృతవాహిని అయిన నది’’ అన్నారు విలియమ్స్. ఇళయ రాజా దృష్టిలో సంగీతం అంటే ఏ ఉద్దేశమూ లేనిది! ‘‘నది ప్రవాహంలా సంగీతం సహజంగా, ఉద్దేశరహితంగా ఉండాలి’’ అంటారు ఇళయరాజా.స్వర్గలోక వెండి ప్రవాహంప్రాచీన కాలపు చైనా దేశీయులు పాలపుంతను కూడా ఒక ప్రకాశవంతమైన నదిగానే ఊహించారు. ఆ నదిని స్వర్గంగా, ఆ ప్రవాహాన్ని వెండిగా భావించారు. బౌద్ధ దార్శనికుడైన ఆచార్య నాగార్జునుడు మానవ జీవితంలోని దుఃఖం గురించి మాట్లాడుతూ, ‘‘నదిలో కలిసి, కదిలే చెక్క దుంగలు ప్రతి అల చేత విడిపోతాయి. అనివార్యంగా అలా వేరు అవటం దుఃఖానికి కారణం కాకూడదు’’ అంటారు. ప్రసిద్ధ బ్రెజిల్ నవలా రచయిత పాలో కోయెలో మరికాస్త లోతుకు వెళ్లి, ‘‘మీరు నదిలో పడటం వల్ల మునిగిపోరు, కానీ దానిలో మునిగిపోవటం వల్ల మునిగిపోతారు’’ అంటారు. జీవితాన్ని భయంతో ఈదలేమని చెప్పటం కావచ్చు. ఇంగ్లిష్ నటి జూలీ ఆండ్రుస్ (89)కు నది వాసన అంటే ఇష్టం. నది సౌమ్యత ఇష్టం. ఆమె చిన్నతనం అంతా నదితోనే గడిచింది. నది ఆమెను ప్రశాంతపరచింది. ఆమెకు ఓదార్పునిచ్చింది. ఈ విషయాన్ని జూలీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. గంగా తీరాన రిషికేశ్హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్కు భారతదేశంలోని సాయంత్రాలు అంటే చాలా ఇష్టమట. ఎందుకు ఇష్టమో ఆయన మాటల్లోనే విందాం. ‘‘సూర్యుడు ప్రపంచం అంచుకు చేరుకుంటాడు. శబ్దాలు అస్తమిస్తుంటాయి. పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సైకిళ్లపై నదీ ప్రవాహంలా ఇంటికి చేరుకుని, శ్రీకృష్ణుడి గురించి, జీవన వ్యయం గురించి ఆలోచిస్తూ ఉండే మాయా క్షణాలవి’’ అంటాడు కామెరాన్. సైకిళ్లపై ఒక ఒరవడిగా వెళ్లే శ్రామికులను ఆయన ఒక నదీ ప్రవాహంగా ఊహించుకున్నారు. మైకేల్ ఎడ్వర్డ్ లవ్ కూడా భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పకు కారణం గంగా నది. మైకేల్ అమెరికన్ సింగర్, సాంగ్రైటర్. ‘‘1968 వసంతకాలంలో, ‘ది బీటిల్స్’ బ్యాండ్కు, నాకు మహర్షి మహేష్ యోగి నుండి భారతదేశంలోని రిషికేశ్కు రమ్మని ఆహ్వానం అందింది. రిషికేశ్ అనేక సంవత్సరాలుగా లక్షలాది మందికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది హిమాలయాల నుండి గంగా నది ప్రవహించే ప్రదేశంలో ఉంది. ఆ వాతావరణంలో ఉండటం చాలా ప్రత్యేకమైనది’’ అంటారు మైకేల్. పురుష నది.. బ్రహ్మపుత్ర!భారతీయ పురాణాలలో అనేక నదులు ప్రవహించాయి. అయితే అవి కేవలం భౌతిక ప్రవాహాలు కావు. దైవత్వం పొందినవి. దేవతలతో సమానంగా గౌరవాన్ని పొందినవి. పూజలను అందుకున్నవి. గంగా, యమునా, సరస్వతి, గోదావరి నదులను స్త్రీ దేవతలుగా పూజిస్తారు. ఆ పవిత్ర జలాలలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి పురుష నదులే లేవా? లేనట్లున్నాయి. బ్రహ్మపుత్ర నదిని మాత్రం ‘పురుష నది’గా పరిగణిస్తారు. మన నదులన్నీ కూడా రుగ్వేదం, మహాభారతం, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. ‘గంగావతరణ’ ఘట్టందశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిందీ, శ్రీరాముడి అవతార పరిసమాప్తి అయిందీ ‘సరయూ’ సమీపంలోనే. రామాయణంలోని ‘గంగావతరణ’ ఘట్టం అయితే ఒక అద్భుతమైన చిత్రణ. సీతను వెదకి రమ్మని వానరులను పంపేటప్పుడు ఆమెను ఎక్కడెక్కడ వెతకాలో చెబుతూ శరావతి, కావేరి, తామ్రపర్ణి, నర్మద, కౌశికీ, యమునా నదులను ప్రస్తావిస్తాడు సుగ్రీవుడు. ఇక కవుల గురించి చెప్పక్కర్లేదు. నది ఊసు లేనిదే వారి కలాలు పరవళ్లు తొక్కవు. ‘కవుల కవిత్వంలో పొంగిన నదులు’ అంటూ రాజన్ పి.టి.ఎస్.కె. అనే రచయిత తెలుగులో ఒక పుస్తకమే రాశారు. కృష్ణవేణి.. విరిబోణి.. అలివేణినది పేరుతో అనేక తెలుగు నవలలు, కథలు వచ్చాయి. అదొక అంతే లేని జాబితా. అలాగే తెలుగు సినిమా పాటలు వందలు, వేలు! పూర్తిగా ఒక నదిపైనే వచ్చిన పాట మాత్రం బహుశా డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి / కృష్ణవేణి నా ఇంటి అలివేణి’ కావచ్చు. ఆ పాటలో కృష్ణానది విశేషాలన్నిటినీ సినారె పొందుపర1చారు. భక్తిగీతంలా మొదలై పరవళ్లు తొక్కుతూ వెళ్లి సాగర హృదయాన సంగమిస్తుంది. ఈ పాట ‘కృష్ణవేణి’ (1974) చిత్రం లోనిది.వేదంలా ఘోషించే గోదావరికృష్ణవేణికి దీటైన ఇంకో తెలుగు సినిమా పాట.. ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’. 1983 నాటి ‘ఆంధ్ర కేసరి’ సినిమా కోసం ఆరుద్ర ఈ పాటను రాశారు. అయితే ఆ పాట పూర్తిగా గోదావరి విశేషాల మీద కాకుండా, గోదావరికి అనుసంధానమై ఉన్న సుందర నగరాలు, కవులు–కావ్యాలు, ఏలిన రాజులు మీద సాగుతుంది. గోదావరి మీదే వేటూరి గారు రాసిన పాట ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’. ఇంకా.. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ’ (ఆత్రేయ–‘చక్రవాకం’), ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ (ఆరుద్ర–‘మర్మయోగి’), ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ’ (శేషేంద్ర శర్మ–‘ముత్యాల ముగ్గు’) ‘చినుకులా రాలి.. నదులుగా సాగి’ (వేటూరి–నాలుగు స్తంభాలాట), ‘గోదారి గట్టుంది.. గట్టు మీద సెట్టుంది..’ (దాశరథి కృష్ణమాచార్య–‘మూగ మనసులు’)... వంటి పాటలు పూర్తిగా నది చుట్టూ తిరిగినవి కాకపోయినా, దోసెడు నది నీళ్లను పట్టి ప్రేక్షకుల తలపులపై చిలకరించినవి. నదులపై మంచి మంచి సినిమా పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని రేణువులు మాత్రమే. నదులు కేవలం నీళ్లు కాదు, కేవలం ప్రవాహాలు కాదు, కేవలం ప్రయాణ మార్గాలు అంతకన్నా కాదు. మనిషిని బతికించే సంజీవినులు మాత్రమే కాదు. డా విన్సీ అన్నట్లు – భూగోళానికే జీవాన్ని, చేవను ఇచ్చే సిరలు, ధమనులు.· సాక్షి, స్పెషల్ డెస్క్శ్రీశ్రీ అనుసంధానం!‘మరో ప్రపంచం’ (1970) సినిమాలో శ్రీశ్రీ ‘అణగారిన బ్రతుకులలో..’ అనే పాట రాశారు. అందులోని ఒక చరణంలో... ‘గంగా, కావేరీ – నదులను కలుపుదాం..’ అన్నారు ఆయన. ఆ చరణం ఇలా ఉంటుంది : ‘ఈ దేశం నీదీ నాదని / ఇది ఒక్కరికే సొంతం కాదని / గంగా, కావేరి నదులు కలుపుదాం / కలిపి, సరిహద్దు చెరిపి, చెలిమి నిలుపుదాం..’ అని. యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1972లో అప్పటి కేంద్ర మంత్రి కె.ఎల్.రావు గంగ–కావేరి నదులను అనుసంధానించాలని ప్రతిపాదించారు. అంటే, శ్రీశ్రీ తన పాట ద్వారా అంతకు రెండేళ్లకు ముందే గంగ, కావేరీలను అనుసంధానించారు! అందుకే, సృజనశీలులను కాలజ్ఞానులు అని కూడా అంటారు. నదుల అనుసంధానం గురించి 1974లో కెప్టెన్ దిన్షా జె.దస్తూర్ మరో ప్రతిపాదన తెచ్చారు. హిమాలయ నదులైన గంగ, సింధు, బ్రహ్మపుత్రలను... ద్వీపకల్ప నదులైన గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, నర్మద, తపతి, పంబ వంటి వాటితో కలపొచ్చని! ఆ తర్వాత కేంద్ర జల వనరుల శాఖ ఇంకో ప్రతిపాదన తెచ్చింది. ఇవేవీ ఆచరణకు రాలేదు. -
కకుత్థ్స విజయం
అయోధ్య పాలకుడు ఇక్ష్వాకుడు ఒకనాడు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తన పెద్దకొడుకు వికుక్షిని పిలిచి, శ్రాద్ధ భోజనాల కోసం అడవికి వెళ్లి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి, రథంపై అడవికి వెళ్లాడు. వరాహాలను, జింకలను, కుందేళ్లను వేటాడాడు. వేటలో అడవంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు. అలసట వల్ల ఆకలి దప్పులను తాళలేకపోయాడు. ఆకలి తీర్చుకోవడానికి వేటాడిన జంతువుల్లో ఒక కుందేలును భుజించాడు. మిగిలిన వాటిని తీసుకొచ్చి, తండ్రికి అందించాడు. ఇక్ష్వాకుడి చేత శ్రాద్ధ కర్మ జరిపిస్తున్న వసిష్ఠుడు ఆ జంతువుల మాంసాన్ని సంప్రోక్షించబోతూ, అది భుక్తశేషమని గుర్తించాడు. ‘ఈ మాంసం భుక్తశేషం. ఇది శ్రాద్ధకర్మకు పనికిరాదు’ అని కోపంగా పలికాడు.ఇక్ష్వాకుడు వెంటనే కొడుకును పిలిచి, ఏం జరిగిందో చెప్పమని నిలదీశాడు.‘వేట ముగిశాక ఆకలికి తాళలేక వేటాడిన వాటిలో ఒక కుందేలును తిన్నాను’ అని చెప్పాడు వికుక్షి.శ్రాద్ధకర్మలో విధిలోపం చేసినందున ఇక్ష్వాకుడు అతడికి దేశబహిష్కారం విధించాడు. శ్రాద్ధానికి తీసుకు రావలసిన కుందేలు మాంసాన్ని భుజించడం వల్ల వికుక్షికి శశాదుడనే పేరు వచ్చింది. తండ్రి ఆజ్ఞ ప్రకారం శశాదుడు ఇల్లు విడిచి అడవులకు వెళ్లిపోయి, అక్కడే నివసించసాగాడు.కొన్నాళ్లకు ఇక్ష్వాకుడు కాలధర్మం చెందాడు. తండ్రి మరణంతో శశాదుడు తిరిగి రాజధానికి వచ్చి, మంత్రుల సలహాతో రాజ్యభారం స్వీకరించాడు.శశాదుడికి కకుత్థ్సుడు అనే కొడుకు కలిగాడు. కకుత్థ్సుడు ఆదిపరాశక్తి అపరభక్తుడు. నిత్యం అమ్మవారిని సేవిస్తూ ఉండేవాడు. శశాదుడి మరణం తర్వాత కకుత్థ్సుడు రాజ్యపాలన చేపట్టాడు. అమ్మవారి అనుగ్రహంతో అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయసాగాడు. అతడి పాలనలో రాజ్యం సుఖశాంతులతో తులతూగుతూ ఉండేది.అయోధ్యలో కకుత్థ్సుడి పాలన కొనసాగుతున్న కాలంలో దేవదానవులకు సంగ్రామం జరిగింది. అసురుల చేతిలో దేవతలు చిత్తుగా ఓడిపోయి, స్వర్గం నుంచి పలాయనం చిత్తగించారు. దిక్కుతోచని స్థితిలో ఇంద్రాది దేవతలందరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు.‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! శరణు.. శరణు! నువ్వే మాకు దిక్కు’ అని శేషతల్పంపై చిద్విలాసంగా శయనిస్తున్న శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకున్నారు.‘దేవతలారా! దిగులు చెందకండి. అయోధ్య రాజు శశాద తనయుడైన కకుత్థ్సుడిని సాయం కోరండి. అతడికి ఆదిపరాశక్తి అనుగ్రహం అపరిమితంగా ఉంది. అతడు యుద్ధంలో మీ పక్షాన నిలబడి, పోరాడి మిమ్మల్ని గెలిపించగలడు’ అని చెప్పాడు విష్ణువు.విష్ణువు సలహాతో దేవతలందరూ అయోధ్యకు వచ్చి, కకుత్థ్సుడిని దర్శించుకున్నారు.కకుత్థ్సుడు వారికి ఉచిత మర్యాదలు చేశాడు.‘దేవతలారా! మీ రాకతో నా జన్మ ధన్యమైంది. దేవతలు స్వయంగా ఇంటికి రావడమంటే, నిజంగా అరుదైన సంఘటనే! ఆజ్ఞాపించండి! మీ కోసం నేనేం చేయాలన్నా చేస్తాను. మానవమాత్రులకు దుస్సాధ్యమైన పని అనుకున్నా మీ కోసం నేను తప్పక చేస్తాను’ అని పలికాడు.‘రాజేంద్రా! నువ్వు దేవేంద్రుడికి బాసటగా మాకు యుద్ధంలో సాయం చేయాలి. అసురులను ఓడించాలి’ అని చెప్పారు దేవతలు.‘నేను తప్పక మీ తరఫున అసురులతో యుద్ధం చేసి, వారిని ఓడిస్తాను. కాకుంటే, నాదొక షరతు. రణరంగంలో దేవేంద్రుడు నాకు వాహనంగా ఉండాలి. అప్పుడే నేను సంగ్రామంలో విజృంభించి, అసురులను తరిమికొడతాను’ అని పలికాడు కకుత్థ్సుడు.కకుత్థ్సుడి షరతుకు దేవతలు నివ్వెరపోయారు. తమలో తాము తర్జనభర్జనలు పడ్డారు. అవసరం తమది కనుక అతడి షరతుకు ఒప్పుకోమని ఇంద్రుడిపై ఒత్తిడి తెచ్చారు. చివరకు విష్ణువు కూడా అదే సలహా చెప్పాడు. చేసేదేమీ లేక ఇంద్రుడు సరేనంటూ వృషభరూపం ధరించి, కకుత్థ్సుడికి వాహనంగా మారేందుకు అంగీకరించాడు. కకుత్థ్సుడు వృషభరూపంలో ఉన్న ఇంద్రుడిపైకి అధిరోహించి, రణరంగానికి బయలుదేరాడు. వృషభాన్ని అధిరోహించిన కకుత్థ్సుడు నందీశ్వరుడిని అధిరోహించిన పరమశివుడిలా కనిపించడంతో అసురులు కొంత కంగారు పడ్డారు. అయినా, శక్తి కూడదీసుకుని, దేవతలపై యుద్ధానికి సిద్ధమయ్యారు.హోరాహోరీగా సాగిన పోరులో కకుత్థ్సుడు అసురులను చిత్తుగా ఓడించాడు. వారి నగరాన్ని స్వాధీనం చేసుకుని, ఇంద్రుడికి అప్పగించాడు.ఇంద్రుడిని వాహనంగా చేసుకున్నందుకు కకుత్థ్సుడికి ఇంద్రవాహనుడని, అసురుల నగరాన్ని స్వాధీనం చేసుకున్నందున పురంజయుడని పేరు వచ్చింది.∙సాంఖ్యాయననేను తప్పక మీ తరఫున అసురులతో యుద్ధం చేసి, వారిని ఓడిస్తాను. కాకుంటే, నాదొక షరతు. రణరంగంలో దేవేంద్రుడు నాకు వాహనంగా ఉండాలి. -
‘వీడు ఒలింపిక్స్కు వెళ్లి ఉంటే ఇండియాకు కచ్చితంగా గోల్డ్మెడల్ వచ్చేది’
నంద గోపాల్ పాత్రలో మహేష్బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమా గుర్తుందా! అందులో ఓ సీన్ ఉంటుంది. బాజిరెడ్డి (కోట శ్రీనివాసరావు) హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ (ప్రకాష్రాజ్) రంగంలోకి దిగుతాడు. బాజిరెడ్డిని కాల్చడానికి వినియోగించిన బిల్డింగ్ పైకి వెళ్లి సహచరుల నుంచి వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఆ భవనం పైనుంచి తాడు సాయంతో పక్కనే ఉన్న రైల్వేస్టేషన్లో రైలు మీదికి నంద గోపాల్ దూకాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ‘వీడు ఒలింపిక్స్కు వెళ్లి ఉంటే ఇండియాకు కచ్చితంగా గోల్డ్మెడల్ వచ్చేది’ అంటాడు. అలాంటి తెలివైన నేరగాళ్లు బయటి ప్రపంచంలోనూ ఉన్నారు. అలాంటి వారిలో గౌరు సురేష్ ఒకడు. డబ్బు కోసం కిడ్నాప్స్ చేయడంలో పేరుమోసిన ఈ నేరగాడి ప్లానింగ్కు 2005 నాటి తిరుపతి వ్యాపారి కిడ్నాప్ ఓ ఉదాహరణ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గౌరు సురేష్ బీకాం పూర్తి చేశాడు. ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో 1999లో హైదరాబాద్కు వచ్చి బద్రుకా కాలేజీలో చేరాడు. అనివార్య కారణాలతో ఆ కోర్సులో డ్రాపౌట్గా మిగిలిన సురేష్.. బతుకుతెరువు కోసం దిల్సుఖ్నగర్లో ‘మార్చ్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాడు. ఈ స్టడీ సర్కిల్ నష్టాలను మిగల్చడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాల బాట పట్టాడు. 17 దోపిడీలు, 11 బందిపోటు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. 2003 నుంచి కిడ్నాపర్గా మారి, పలువురు బడా బాబులను కిడ్నాప్ చేసి భారీ మొత్తాలు వసూలు చేసుకున్నాడు. ఈ నేరాలకు సంబం«ధించి ఆరు కేసులు నమోదు కాగా, పోలీసు రికార్డుల్లోకి ఎక్కని కిడ్నాప్లు 14 వరకు ఉంటాయి. 2008లో ఎన్కౌంటర్ అయ్యే వరకు ఇతగాడు ఉమ్మడి రాష్ట్ర పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. గౌరు సురేష్ ఏదైనా ఓ కేసులో జైలుకు వెళితే బయటకు వచ్చిన తర్వాత చేయాల్సిన నేరానికి అక్కడే స్కెచ్ వేస్తాడు. అందుకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లనూ అక్కడ నుంచే పూర్తి చేస్తాడు. 2004లో ఇలానే ముషీరాబాద్ జైల్లో ఉన్న సురేష్– బెయిల్పై వచ్చాక చేయాల్సిన కిడ్నాప్లో ‘వాడుకోవడానికి’ ఓ ముఠాను తయారు చేసుకోవాలని భావించాడు. దీనికోసం జైల్లో ఉన్న మాజీ నక్సలైట్ మల్లారెడ్డిని, అతడి అనుచరులను పరిచయం చేసుకున్నాడు. తాను త్వరలో చేయబోయే కిడ్నాప్కు సహకరించాలని కోరాడు. కథ మొత్తం తానే నడిపిస్తానని, కేవలం తాను అప్పగించిన ప్యాకెట్ను (కిడ్నాప్ చేసిన వ్యక్తి) రెండు మూడు రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని, తాను చెప్పినప్పుడు వదిలేస్తే చాలని చెప్పాడు. దీనికి మల్లారెడ్డి అంగీకరించడంతో ఓ కిడ్నాప్ స్కెచ్కు జైల్లోనే నాంది పడింది. అయితే అప్పటికి ఎవరిని కిడ్నాప్ చేయాలన్నది సురేష్ నిర్ణయించుకోకపోవడం కొసమెరుపు. ముషీరాబాద్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన సురేష్ మరో కిడ్నాప్ కోసం ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన పని ఎలాంటి ఆటంకాలు, హడావుడి, ఆర్భాటాలు లేకుండా పూర్తి కావాలంటే ఇల్లు, ఇల్లాలు, వాహనం కావాలని భావించాడు. ప్రాథమికంగా వీరారెడ్డి అనే బోగస్ పేరు, వివరాలతో గుర్తింపుకార్డులు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా కొన్ని సిమ్కార్డులు తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు. హోల్సేల్ కిరాణా వ్యాపారి అవతారం ఎత్తాడు. ఆ పేరుతోనే వనస్థలిపురంలోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కొత్తగా పెళ్లి అయిందని, త్వరలోనే భార్యను తీసుకువస్తానని చెప్పి యజమానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఓ చిన్న కుటుంబం సంసారం చేయడానికి అవసరమైన సామాన్లు ఖరీదు చేసి ఆ ఫ్లాట్లో పెట్టాడు. ఆపై కృష్ణనగర్కు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్టును సంప్రదించి నెల రోజుల పాటు తన భార్యగా నటించాలని, రోజుకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆమెను తీసుకుని వనస్థలిపురంలోని ఫ్లాట్కు వెళ్లిన గౌరు సురేష్ అలియాస్ వీరారెడ్డి ‘కొత్త కాపురం’ ప్రారంభించాడు. ఇలా ఇంటిని, ఇల్లాలిని సిద్ధం చేసుకున్న గౌరు సురేష్ తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాహనం ఇచ్చే వ్యక్తి కోసం గాలించాడు. అప్పట్లో సెల్ఫ్ డ్రైవింగ్స్ కార్స్ విధానం మొదలు కాలేదు. ఎవరికి వాహనం అవసరమైనా ట్రావెల్స్ నుంచి తెప్పించుకోవాల్సిందే! ఆ కారుతో పాటు డ్రైవర్నీ ట్రావెల్స్ నిర్వాహకులే పంపిస్తుంటాడు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఏ దిశలో దర్యాప్తు జరిగినా తన ఉనికి బయటపడకుండా ఉండటానికి అవసరమైన స్కెచ్ వేశాడు. అలా జరగాలంటే తనతో పాటు కారులో డ్రైవర్ ఉండకూడదు. ఈ కోణంలో ఆలోచించిన సురేష్ అలియాస్ వీరారెడ్డి వనస్థలిపురం పరిసరాల్లోని ట్రావెల్ ఏజెన్సీల విషయం ఆరా తీశాడు. చివరకు వెంకట్రెడ్డి అనే ట్రావెల్స్ నిర్వాహకుడిని ఎంచుకున్నాడు. ఆయన వద్ద రెండు మూడుసార్లు వాహనం బుక్ చేసుకున్న సురేష్... తన ‘భార్య’తో కలిసి శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ వెళ్లి వచ్చాడు. ఆయా సందర్భాల్లో వెంకట్రెడ్డి కారుతో పాటు డ్రైవర్నీ పంపిస్తాడు. ఇలా వెంకట్రెడ్డికి రెగ్యులర్ కస్టమర్గా మారిపోయిన సురేష్... ప్రతిరోజూ సాయంత్రం వేళ ఆయన ట్రావెల్స్ వద్దకే వెళ్లి కూర్చునేవాడు. తాను వ్యాపారినని, కొత్తగా పెళ్లి అయిందంటూ పథకం ప్రకారం మాటల సందర్భంలో చెప్పాడు. తన భార్యతో కలిసి తరచు బయటకు వెళ్లి వస్తుంటానని, అలా సరదాగా వెళ్లేప్పుడు కారులో డ్రైవర్ ఉండటం తమ ప్రైవసీకి భంగంగా ఉందంటూ వెంకట్రెడ్డికి చెప్పాడు. దీంతో సురేష్ ఇబ్బందిపడుతున్నట్లు భావించిన ఆయన... ‘మీకు డ్రైవింగ్ వచ్చా?’ అని ప్రశ్నించాడు. వచ్చంటూ సురేష్ చెప్పడంతో ఈసారి కారు కావాలంటే మీరే తీసుకువెళ్లండని ఆఫర్ ఇచ్చాడు. ఈ మాట కోసమే ఎదురు చూసిన సురేష్– రెండు సందర్భాల్లో అలానే తీసుకువెళ్లి చెప్పిన ప్రకారం తిరిగి ఇచ్చేశాడు. మరోపక్క తాను ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్మెన్కు తరచు డబ్బులు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. ఇలా సురేష్ అలియాస్ వీరారెడ్డి ఇల్లు, ఇల్లాలు, వాహనం సిద్ధం చేసుకునే సమయానికి మల్లారెడ్డితో పాటు అతడి అనుచరులు ముషీరాబాద్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే మల్లారెడ్డి తాము విడుదలైన సమాచారాన్ని సురేష్కు చేరవేశాడు. దీంతో అతడిని వనస్థలిపురం పిలిపించుకున్న సురేష్... ఎవరికీ అనుమానం రాని, ఎవరి దృష్టీ పడని ఓ సురక్షిత ప్రాంతంలో ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలని, అందులో కాస్త సెటిల్ అయ్యాక అసలు కథ మొదలుపెడదామని, ఆ ఫ్లాట్కు అద్దె, అడ్వాన్స్ కూడా తానే చెల్లిస్తానని చెప్పాడు. దీంతో మల్లారెడ్డి వారాసిగూడ ప్రాంతంలో ఫ్లాట్ ఎంపిక చేసి, ఆ విషయం సురేష్కు చెప్పాడు. దానికి అవసరమైన అడ్వాన్స్తో పాటు ఖర్చుల కోసం కొంత మొత్తం మల్లారెడ్డికి ఇచ్చిన సురేష్– అప్పుడు టార్గెట్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. (తరువాయి వచ్చేవారం) -
ఈ వారం కథ: లిఖితం
తూర్పు ఇంకా తెల్లవారలేదు. వీధి లైట్లు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి. కార్తీకమాసంలోనూ చలిగాలులు వీస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చాడు గణపతి శాస్త్రి. పంచె పైకిలాక్కుని, భుజం మీద కండువా వేసుకుని, రాగిచెంబు చేత్తో పట్టుకుని ఆ మసకచీకటిలో కేదార్ ఘాట్కేసి నడవడం మొదలుపెట్టాడు. కాశీలోని ఆ ఇరుకు రోడ్లమీద నడవడం కొత్తవాళ్ళకు సవాలే! శాస్త్రికి ప్రతి సందు తెలుసు. అతనికి తెలియని వాడ, చూడని ప్రదేశం లేదు.నెమ్మదిగా కేదార్ ఘాట్లో మెట్లు దిగాడు. మూడుసార్లు ‘హరహర మహాదేవ్’ అంటూ గంగలో మునిగి గట్టు మీదకు వచ్చాడు. కండువాతో వొళ్ళు తుడుచుకుని, పంచె పిండుకుని కట్టుకున్నాడు. నుదుట విభూతి ధారణ చేసి, శివ పంచాక్షరి మంత్రం మనసులో జపిస్తూ, రాగి చెంబులోని గంగా జలంతో శ్రీగౌరీ కేదారేశ్వరుడితో బాటు, అరుణాచలేశ్వరుడికి, దక్షిణామూర్తికి అభిషేకం చేశాడు. ఛప్పన్న గణపతిని, మీాక్షి అమ్మవారిని కూడా దర్శించుకొని, మళ్ళీ చెంబుతో గంగాజలం తీసుకుని బయల్దేరాడు. ఉత్తర వాహినిగా సాగే గంగా ప్రవాహాన్ని , నదీ జలాలమీద గిరికీలు కొడుతున్న తెల్లని కొంగల్ని చూస్తూ, నెమ్మదిగా మానస సరోవర్ ఘాట్, క్షేమేశ్వర్ ఘాట్, చౌసెట్టి ఘాట్ల మీదుగా దశాశ్వమేధ ఘాట్ చేరుకున్నాడు. అలాగే ఘాట్ల మీద నడక సాగిస్తూ మణికర్ణిక ఘాట్కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మృతిచెందిన అదృష్టవంతుల కాష్టాలు కాలుతున్నాయి.‘ఆ అదృష్టం కోసమే కదా తను పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. రిటైరయిన తర్వాత వచ్చిన డబ్బులతో కాశీలో ఇల్లు కొనుక్కున్నదే అందుకోసం. పిల్లలు ఇద్దరూ బాగా స్థిరపడ్డారు. తన శేషజీవితాన్ని విశ్వేశ్వరుని సన్నిధిలో గడపాలని, తన కాష్టం ఇక్కడే కాలాలని ఇక్కడకు వచ్చేశాడు. మానవజన్మ దుర్లభం. ఈ జన్మలో కాశీలో మరణిస్తే మోక్షమే. మళ్ళీ జన్మంటూ ఉండదు’ అనుకున్నాడు. అక్కడున్న తారకేశ్వర లింగానికి గంగాజలంతో అభిషేకం చేశాడు శాస్త్రి. మళ్ళీ రాగి చెంబుతో గంగా జలం తీసుకున్నాడు.భక్తిభావం పొంగుతుంటే తన్మయత్వంతో ‘విశ్వేశ్వరా! నా ఆఖరిశ్వాస నీ సన్నిధిలో, ఈ కాశీక్షేత్రంలోనే తీసుకునే అదృష్టం ప్రసాదించు తండ్రీ!’ అంటూ చేతులు జోడించి మనస్సులోనే ప్రార్థించి విశ్వనాథుని మందిరంలోకి అడుగుపెట్టాడు. సర్కారువారి పుణ్యమాని మందిరం దగ్గర కొన్ని ఇరుకు ఇరుకు వీధులన్నీ విశాలమయ్యాయి. భక్తులు గంగానదిలో స్నానం చేసి సరాసరి విశ్వనా«థుని దర్శనం చేసుకోవచ్చు. అక్కడి మందిరంలో పండిట్స్తో బాటు భద్రతా సిబ్బంది కూడా గణపతి శాస్త్రికి పరిచయం అయినవాళ్లే. శాస్త్రికి క్యూలతో పనిలేదు. సరాసరి అంతరాలయంలోకి వెళ్లి, అక్కడే ఎంతసేపైనా ధ్యానం చేసుకోగలడు. రాగిచెంబులో తెచ్చిన గంగాజలంతో విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకున్నాడు.బయటకు వచ్చి అన్నపూర్ణని, ఆ ప్రాంగణంలో భాస్కర రాయులవారు ప్రతిష్ఠించిన శ్రీచక్ర లింగాన్ని, విశాలాక్షిని దర్శనం చేసుకున్నాడు. గదోలియా చౌక్లో పనులు చూసుకొని, జంగంబాడి మఠ్, పాండే హవేలీ, సైకిల్ స్వామి సత్రం మీదుగా గదికి బయలుదేరాడు. ఇరుకు సందుల్లో తాపీగా తిరుగుతున్న ఆవుల్ని, భయపెట్టే కుక్కల్ని తప్పించుకుంటూ, రుద్ర జపం చేసుకొంటూ నడవడం శాస్త్రి ప్రతిభ.‘ఈ దారుల్లో ఆవులు మనుషుల్ని పొడవవు. ఆలయం మీద నుంచి గద్దలు ఎగరవు. బల్లులు అరవవు. శవాలు వాసన పట్టవు. ఇంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం ప్రపంచంలో ఉందా?’ అనుకున్నాడు శాస్త్రి.‘అయ్యా! విశ్వనాథుని గుడికి ఎలా వెళ్ళాలి?’ అన్నారు ఎవరో. కాశీలో చాలామంది తెలుగు మాట్లాడుతుంటారు. పక్కకు చూశాడు శాస్త్రి. ఓ అరవయ్యేళ్ళ పైబడిన పెద్దాయన కుటుంబంతో నిలబడి ఉన్నాడు.‘శివ శివ అనుకుంటూ వెళ్ళండి. లేకపోతే ఓం నమశ్శివాయ అనుకుంటూ వెళ్ళండి’ అన్నాడు.‘అది కాదు స్వామీ! మందిరానికి దారెటని’ అన్నాడు ఆ పెద్దాయన.‘ఎక్కడనుంచి వచ్చారు? ఎక్కడ దిగారు?’ అన్నాడు శాస్త్రి. ‘రాజమండ్రి నుంచి వచ్చామండి. ఎక్కడా ఆశ్రమాలు ఖాళీ లేవండి. గంగలో మునిగి బట్టలు మార్చుకున్నాం’ అన్నాడు ఆయన.‘సరే! ఒక పనిచేయండి. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. అక్కడ మీరు మీ సామాన్లు పెట్టుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. అదిగో అలా తిన్నగా వెళ్లి ఎడమపక్కకు తిరిగితే విశ్వనాథుని ఆలయం. నాకూడా రండి’ అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా తన ఇంటికేసి దారితీశాడు. వాళ్ళు ఆనందంగా శాస్త్రిని అనుసరించారు.‘ఇదిగో ఇదే విశ్వనాథుని మందిరం. పది నిమిషాలు నడవ గలిగితే మా ఇల్లు’ ఆన్నాడు శాస్త్రి.‘అయ్యా! తమరు పుణ్యాత్ములు. నా పేరు రామనాథం. రిటైర్డ్ స్కూల్ టీచర్ని. ఈమె నా భార్య వైదేహి. వీడు నా కొడుకు రవి. వాడి భార్య రేవతి. వాళ్ళు నా మనవలు’ అని కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశాడు. శాస్త్రి తన ఇల్లు చూపిస్తూ, ‘నాదో నాలుగు గదుల చిన్న ఇల్లు. మీకు నచ్చితే ఆ గదిలో మీ సామాన్లు పెట్టుకుని గుడులన్నీ తిరిగి రావొచ్చు. మీ గదికి తాళం వేసుకుని వెళ్ళిరండి‘ అన్నాడు గది చూపించి. అప్పుడే మిగిలిన రెండు రూముల్లో వసతి దొరకని తెలుగు వాళ్ళ కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లాయి. ‘అయ్యా! మేము ఓ నాలుగు రోజులుండి ఇక్కడ చుట్టుపక్కల ఆలయాలు అన్నీ చూసుకుంటాము. రోజుకు ఎంత ఇవ్వాలో చెప్పండి’ అన్నాడు రామనాథం.‘నేను భక్తులకు సేవ చెయ్యడం భగవంతునికి సేవ చెయ్యడంగా భావిస్తాను. బంధుమిత్రులకు, వసతి దొరకని వారికి నా గదులు ఉచితంగానే ఇస్తాను. ఇక్కడ స్టౌ, పాత్రలు ఉన్నాయి. మీ పిల్లలకు పాలు కాచి ఇచ్చుకోవచ్చు. మీరు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు తలుపుకు గొళ్లెం పెట్టి వెళ్ళిపోవచ్చు. భోజనానికి ఇక్కడ సత్రాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అందరూ ఉచితంగానే భోజనం పెడతారు. మీరు ఇవ్వాలనుకున్న డబ్బులు ఎవరైనా అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వండి’ అన్నాడు శాస్త్రి. రామనాథం కుటుంబం వారికి చూపించిన గదికి వెళ్ళిపోయారు. తన గదికి వెళ్లి మళ్ళీ స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, ప్రాణాయామం, ధ్యానం చేసి, యోగాసనాలు వేసి పది నిముషాలు మౌనంగా కూర్చున్నాడు. కరోనా సమయంలో భార్య పోవడంతో శాస్త్రి ఒంటరి వాడయిపోయాడు. ‘అందరూ పోయేవాళ్ళమే, కాస్త ముందు వెనుక. అదృష్టవంతురాలు కనుకనే అనసూయ కాశీలో పోయింది’ అని సర్దిచెప్పుకున్నాడు. కాశీ వచ్చిన వారికి సేవ చెయ్యడం అంటే విశ్వనాథుడికి సేవ చెయ్యడంలాగే భావిస్తాడు శాస్త్రి.రామనాథం వాళ్ళు సామాన్లు గదిలో పెట్టుకుని తాళం వేసుకుని గుడికి వెళ్ళిపోయారు. ఇంతలో సెల్ మోగింది. చూస్తే బెంగళూరు నుంచి పెద్దకొడుకు విశ్వనాథ్. శాస్త్రి సెల్ ఆన్ చేశాడు.‘ఎలా ఉన్నారు నాన్నా?’ అన్నాడు విశ్వనాథ్.‘భేషుగ్గా ఉన్నాను. చెప్పు’ అన్నాడు శాస్త్రి.‘మీకు చెప్పాను కదా నాన్నా కొత్తగా విల్లా తీసుకుంటున్నాను అని.. రేపు పదిహేనో తారీఖున గృహప్రవేశం. నాలుగు రోజులుండి వెళ్ళండి. రాను పోను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను’ అన్నాడు.‘ఈ భవబంధాలు తెంచుకుంటేనేగానీ నేను అనుకున్న గమ్యం చేరలేనురా. రిటైర్ అయ్యాక ఐదేళ్లు ప్రతి ఏడాదీ అమలాపురం నుంచి కాశీ వచ్చేవాడ్ని. పదేళ్ల క్రితం ఇల్లు కొన్నప్పటి నుంచి మీ అమ్మ పోయినా ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను. ఎందుకని? నా ఆఖరి శ్వాస ఇక్కడే తీసుకోవాలని, నా కాష్టం ఇక్కడే కాలాలని. నువ్వు బెంగళూరు నుంచి, చిన్నాడు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు. అప్పుడు నా మనసు అటే లాగుతుంది. మీరు జీవితాల్లో బాగా స్థిరపడ్డారు. నాకా పెన్షన్ వస్తుంది. నా గురించి ఆలోచించొద్దురా. అస్తమానూ ఫోన్లు చేసి నా ప్రస్థానానికి ఆటంకం కలిగించకండి రా! రావడానికి కుదరదు’ అన్నాడు శాస్త్రి్త. ‘అయ్యో! అదేమిటి నాన్నా! కన్నబిడ్డ శుభమాని గృహప్రవేశానికి రమ్మని పిలుస్తే కుదరదంటారేమిటి? ఈ ఒక్కసారికి నామాట వినండి. రాకపోతే మేం అంతా బాధపడతాం. మీరు రాకపోతే అసలు గృహప్రవేశమే చేసుకోము’ అన్నాడు బాధగా.‘ప్రతిదానికి ఈ ఏడుపొకటి. సరే! రెండు రోజుల కంటే ఉండటానికి కుదరదు. ఇదేఆఖరిసారి. సరేనా?’ అన్నాడు శాస్త్రి్త అయిష్టంగానే. ‘అలాగే.. థాంక్యూ! నాన్నా’ అన్నాడు విశ్వనాథ్ ఆనందంగా. సెల్ కట్ చేశాడు. కాఫీ తాగుదామని చూశాడు. పాలు లేవు. చిన్న గ్లాసుడు బియ్యం సింగిల్ బర్నర్ స్టవ్ మీద పడేశాడు. రాత్రి మిగిలిన మజ్జిగ ఉంటే వేసుకుని తిన్నాడు. ఏది ఉంటే అది తినడం, లేకపోతే పస్తుండటం; మరీ ఆకలనిపిస్తే ఏ ఆంధ్ర ఆశ్రమానికో, గాయత్రి సత్రానికో, కరివెన సత్రానికో వెళ్ళడం; అక్కడ భోజనం అయ్యిందనిపించడం; అక్కడ సత్రంవారికి, యాత్రికులకు ఏదో ఒక సేవ చెయ్యడం అలవాటయిపోయింది.మళ్ళీ సెల్ మోగింది.చూస్తే అమలాపురం నుంచి చిరకాల మిత్రుడు రామ్మూర్తి. కాల్ లిఫ్ట్ చేశాడు.‘ఒరేయ్! శాస్త్రి! నువ్వు అస్తమానూ ఫోన్ చేసి కాశీ రా, గంగలో మునుగు, విశ్వేశ్వరుని దర్శనం చేసుకో అని చెబుతున్నావు కదా! నా భార్య కూడా వెళదామండి అని గొడవ చేస్తోంది. రేపు పన్నెండో తారీఖు ఉదయం కాశీ వస్తున్నాం. మాకు ఆశ్రమంలో వసతి ఏర్పాట్లు చెయ్యరా’ అన్నాడు రామ్మూర్తి.‘అలాగే. ఎంతమంది వస్తున్నారురా?’‘నేను, నాభార్య, కొడుకు, కోడలు’ ఆన్నాడు రామ్మూర్తి.‘ఏనాడూ గుడికి వెళ్ళనివాడివి, భగవన్నామం జపించనివాడివి, శుద్ధబద్ధకస్తుడివి. ఇంటిపని, బయటపని మీ ఇల్లాలే చేస్తుందికదా! ఇన్నాళ్ళకు విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని నీకు బుద్ధిపుట్టింది. శుభం. తప్పకుండా రండి. నేను చూసుకుంటా’ అన్నాడు శాస్త్రి. ‘థాంక్స్ రా!’ అన్నాడు రామ్మూర్తి.తర్వాత నెమ్మదిగా ఆంధ్రాశ్రమం ఆఫీసులోకి వెళ్ళాడు. అక్కడ యాత్రికులకు ఆశ్రమం తరపున సేవ చేస్తూ గడిపాడు. సాయంత్రం ఆరు అయ్యింది దశాశ్వమేధ ఘాట్కు బయల్దేరాడు. గంగా హారతికి సమయం. కనుల విందుగా జరిగే హారతుల్ని చూడడానికి వచ్చిన జనాలు మెట్ల మీద కూర్చొన్నారు. మైకులో శ్రావ్యంగా భక్తి సంగీతం సాగుతోంది. కొంతమంది విదేశీయులతో బాటు మిగతా యాత్రికులు కూడా ఆ సుందర దృశ్యాలని తమ కెమెరాలలో భద్రపరచుకుంటున్నారు. అంతలో పట్టు పంచెలు కట్టుకున్న యువకులు హారతులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. నదిలో అందమైన పడవల మీద జనం కూర్చుని, తమ కనుల ముందు జరుగుతున్న గంగా హారతుల్ని భక్తి శ్రద్ధలతో గమనిస్తున్నారు.ఎప్పుడూ కూర్చునే మండపంలోనే కూర్చున్నాడు శాస్త్రి. హారతి ప్రారంభమయ్యింది. రోజూ చూసే హారతులయినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది శాస్త్రికి. హారతి అవగానే ఆశ్రమానికి వచ్చాడు. గిన్నెలు ఖాళీగా ఉన్నాయి.రెండు అరటిపళ్ళు తిని శివపురాణం తీశాడు. పది గంటల దాకా పారాయణం చేసి నడుము వాల్చాడు. శివనామ స్మరణ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రోజులు గంగా ప్రవాహంలా నెమ్మదిగా గడుస్తున్నాయి.ఉదయాన్నే ఎవరో తలుపు కొడుతూంటే తలుపు తీశాడు. ఎదురుగా రామ్మూర్తి, భార్య, కొడుకు, కోడలు చిరునవ్వుతో నిలబడ్డారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రామ్మూర్తి పన్నెండో తారీఖు వస్తానన్నాడని.‘రండి...రండి’ అంటూ ఆహ్వానించాడు.అప్పటికే శాస్త్రి గంగాస్నానం చేసి, మణికర్ణిక ఘాట్లో కాలుతున్న కాష్టాల్ని కనులనిండుగా చూసి, విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకు వచ్చి సంధ్య వార్చుకోడం ముగించాడు.రామ్మూర్తిని చూడగానే ‘రా... రా... రామ్మూర్తి! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు’ అంటూ ఆహ్వానించాడు.‘మీకు ఇంట్లోనే రెండు రూములు ఏర్పాటు చేశాను. కాలకృత్యాలు తీర్చుకుని రండి. గంగా స్నానం చేసి, విశ్వేశ్వరుని దర్శించుకుందురుగాని’ అన్నాడు శాస్త్రి.వారికి గదులు చూపించాడు.‘కార్తీకమాసంలో కాశీ వచ్చారు. మంచి పని చేశారు, త్వరగా తయారై రండి’ అన్నాడు.ఓ అరగంటలో అందరూ వచ్చారు. అందర్నీ కేదార్ ఘాట్కు తీసుకెళ్ళి, సంకల్పం చెప్పించి స్నానాలు చేయించాడు.‘ఏం చలిరా నాయనా! వణికిపోతున్నాను. నా వల్ల కాదు బాబోయ్ అంటున్నా మా అన్నపూర్ణ బలవంతంగా లాక్కొచ్చింది’ అన్నాడు రామ్మూర్తి గజగజ వణుకుతూ.‘ఈ మాత్రం చలికే ఇంత హడావిడి చేస్తున్నావ్. ఈ చలిని గులాబ్ సర్దీ అంటారు ఇక్కడ వాళ్ళు. జనవరి నెలలో చూడాలి, చలికి కాలు బయట పెట్టలేం. అయినా పుణ్యం ఊరికే రాదుగా. పుణ్యం కావాలంటే ఆమాత్రం కష్టపడక తప్పదు’ అన్నాడు శాస్త్రి. ఘాట్ల మీద నడిపిస్తూ, ఆ విశేషాలు వర్ణిస్తూ విశ్వనాథుని దర్శనం చేయించాడు. ఆ తర్వాత సహస్ర లింగేశ్వరుడు, మనోకామేశ్వరుడు, ధనేశ్వరుడు, ప్రీతికేశ్వరుడు, సాక్షి గణపతి, ఢుండి గణపతి, అన్నపూర్ణ, విశాలాక్షిల దర్శనం చేయించాడు. ‘ఇళ్ళల్లోను, షాపుల్లోనూ గుళ్ళు కట్టుకోవడమేమిటిరా? వీళ్ళ భక్తి పాడుగాను!’ అన్నాడు రామ్మూర్తి.‘కాదురా. ఒకనాటి గుళ్లనే, షాపులుగా, ఇళ్లుగా మార్చేశారు. ఏం చెయ్యగలం?’ అన్నాడు శాస్త్రి్త.రామ్మూర్తికి చాలా అలసటగా ఉంది. భారీకాయంతో నడవలేక పోతున్నాడు. ఆతని భార్యకి మాత్రం ఇంకా చూడాలని ఉంది. ఉత్సాహంగా శాస్త్రి్త ముందుకు సాగుతూ, మంగళగౌరి, మాయుఖాదిత్యుడు బిందుమాధవుడు, కాలభైరవుడు, దండపాణి, కృత్తివాసేశ్వరుని దర్శనాలు చేయించాడు.రామ్మూర్తికి కాఫీ చుక్క గొంతులో పడకపోవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. అతగాడి దృష్టి అంతా కాఫీ మీదే ఉండి చిరాకుగా ఉంది.‘ఈ ఊరేమిటిరా శాస్త్రి్త! ఈ ఇరుకిరుకు సందులు గొందులు, వాటిల్లో అడ్డంగా పడుకున్న కుక్కలు, తాపీగా సాగే ఆవులు వాటి మలమూత్రాలు, దుర్గంధం... మోటార్ సైకిళ్ళ విన్యాసాలు, కిక్కిరిసిన జనం... వాళ్ళ జరదాలు, కిళ్ళీల కంపు... అబ్బబ్బ! ఎలా ఉంటున్నావురా బాబూ? దేవుడు కాశీలోనేగాని, కూచిమంచి అగ్రహారంలో లేడా? ఆ పండిట్లు ఏమిటిరా? వాళ్ళ దౌర్జన్యం ఏమిటి? వాళ్ళ చెయ్యి తడిపితే కాని విశ్వనాథుని దర్శించుకోనివ్వరా?’ అన్నాడు రామ్మూర్తి అసహనంగా.‘నువ్వు కాశీయాత్రకు వచ్చావు. విహార యాత్రకు కాదు. ఇది మహోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రం. అందమైన ప్రదేశాలు చూడాలంటే కాశ్మీర్కు వెళ్లొచ్చు. జన్మ సార్థకం కావాలంటే కాశీకే రావాలి. దీన్ని మహా శ్మశానం అంటారు. నువ్వు చెప్పే ఈ అసౌకర్యాలన్నీ మన భక్తిని, సహనాన్ని పరీక్షించడానికి విశ్వనాథుడు పెట్టే పరీక్షలు’ అన్నాడు శాస్త్రి్త. దర్శనాలయ్యి ఆశ్రమానికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు అయ్యింది. ‘కాఫీ’ అన్నాడు రామ్మూర్తి.‘ఇక భోజనాలే. ఆంధ్రా ఆశ్రమంలో భోజనం చాలా బాగుంటుంది. భోజనాలు అయ్యాక విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం ఆరుగంటలకు హారతికి వెళ్దాం’ అని భోజనాలకు తీసుకెళ్లాడు.తను కూడా విశ్రాంతి తీసుకుని సాయంత్రం దశాశ్వమేధ ఘాట్కు తీసుకెళ్ళి హారతి చూపించాడు. రామ్మూర్తికి ఈ దర్శనాలు, హారతుల మీద ఆసక్తి లేదు. ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందా, ఎక్కడ సుఖంగా కునుకు తీయవచ్చా అన్నదాని మీదే ధ్యాస!రెండో రోజు మనిషిని తోడు ఇచ్చి, చింతామణి గణపతి, సంకట మోచన్ హనుమాన్, దుర్గా దేవాలయం, కాశీరాజు కోట, అస్సీ ఘాట్, బెనారస్ విశ్వవిద్యాలయం చూసే ఏర్పాటు చేశాడు. మూడోరోజు శాస్త్రి కారు ఏర్పాటు చేశాడు.‘ఈ కారు డ్రైవర్ జగన్నాథ్ మన కోనసీమ వాడే. ఎక్కడ ఏం చెయ్యాలో, ఎక్కడ పిండప్రదానం చెయ్యాలో అన్నీ అతనే చూపిస్తాడు. రేపు త్రివేణి సంగమం వెళ్లి రండి. ఎల్లుండి గయలో ఎక్కడ ఏది చెయ్యాలో అన్నీ చూపిస్తాడు. గయలో పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తరిస్తారు. మన జన్మ కూడా ధన్యమే అంటారు. నేను రేపు మా పెద్దాడి గృహప్రవేశానికి బెంగళూరు వెళ్లి రెండు రోజుల్లో వచ్చేస్తాను. మీరు అన్నీ చూడటానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఈలోపు నేను వచ్చేస్తాను’ అన్నాడు శాస్త్రి రామ్మూర్తి భుజం మీద చెయ్యేసి.‘నువ్వున్నావు కాబట్టి వచ్చానురా శాస్త్రి! లేకపోతే గుమ్మం దిగే ప్రసక్తే లేదు. నీకు తెలుసుగా, ఇంటి పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికే వెళ్లను. అవునూ గాయత్రి సత్రంలో భోజనాలు చాలా రుచిగా ఉంటాయని విన్నాను’... అన్నాడు రామ్మూర్తి బొజ్జ చేత్తో రాసుకుంటూ.‘నీకు భుక్తి మీద ఉన్న రక్తిలో పదోవంతు భక్తి మీద ఉంటే బాగుండేది రా! సరే అలాగే కానీయ్’ అన్నాడు శాస్త్రి్త.రామ్మూర్తి కుటుంబం కార్లో కూర్చోగానే కారు బయల్దేరి, మలుపు తిరిగింది.ఇంతలో రామనాథ కుటుంబంతో వచ్చాడు. కుటుంబం అంతా శాస్త్రికి దండం పెట్టి వెళ్ళిపోయారు.తన నివాసానికి వచ్చి పూజాకార్యక్రమాలు ముగించుకొని, ఫలహారం తిని, ఆశ్రమానికి వచ్చి యాత్రికుల సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. మర్నాడు ఉదయమే సెల్ మోగింది. కొడుకు జగన్నాథ్. ఆన్సర్ చేసి ‘చెప్ప రా!’ అన్నాడు.‘ఈరోజు సాయంత్రం ఫ్లయిట్కు టికెట్ పంపించాను. అందింది కదా! మళ్ళీ మీకు పదహారో తారీఖుకు కాశీకి టికెట్ బుక్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి నాన్నా!’ అన్నాడు విశ్వనాథ్.‘అలాగేలేరా! వస్తున్నాను’ అన్నాడు అయిష్టంగానే. ఆ సాయంత్రం ఫ్లైట్కు బెంగళూరు బయల్దేరాడు. విశ్వనాథ్ ఎయిర్ పోర్ట్కు కారులో వచ్చి తండ్రిని రిసీవ్ చేసుకున్నాడు.ఆరాత్రి కొడుకు, కోడలు మనవడితో సంతోషంగా గడిపాడు. మరునాడు గృహప్రవేశానికి బంధుమిత్రులందరూ వచ్చారు. అందరూ శాస్త్రి్త అదృష్టాన్ని, ఆధ్యాత్మిక చింతననూ పొగిడేవారే! విశ్వనాథ్ కొన్న విల్లా చాలా ఖరీదైనది. కొడుకుతో అటువంటి ఇంటిలో ఉండే అవకాశం వదులుకున్నందుకు కొందరు శాస్త్రి మీద జాలి పడ్డారు. గృహప్రవేశానికి వచ్చినవాళ్ళందరితో మంచి హడావుడిగా ఉంది. మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, తోరణాలతో, పట్టుచీరలతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంతలో శాస్త్రి్త సెల్ మోగింది. చూస్తే డ్రైవర్ జగన్నాథ్ కాల్ చేస్తున్నాడు. పక్కకు వెళ్లి ఆన్ చేశాడు.‘చెప్పు జగన్నాథ్’ అన్నాడు.‘సార్! ఘోరం జరిగిపోయింది సార్! మీ ఫ్రెండ్ రామ్మూర్తి గారిని గయలో విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేయించి, కాశీలో కేదారఖండం తీసుకురాగానే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణం వదిలేశారు సార్! బాడీని మణికర్ణికా ఘాట్కు తీసుకొచ్చాం సర్!’ అన్నాడు జగన్నాథ్. శాస్త్రి్త నిర్ఘాంతపోయాడు. స్థాణువులా నిలబడిపోయాడు. తేరుకుని ‘అయ్యో! నేను రేపు వస్తున్నాను. నువ్వు దగ్గరుండి కార్యక్రమాలన్నీ సజావుగా చేయించు’ అని సెల్ కట్ చేశాడు. టైం చూస్తే మధ్యాహ్నం రెండు అయ్యింది. ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. కొందరు భోజనాలు చేస్తున్నారు. శుభం జరుగుతున్న ఈ ఇంట్లో ఎవరికీ ఈ వార్త చెప్పడానికి లేదు. వెంటనే బాత్రూంలో దూరి తల స్నానం చేసి వచ్చాడు.‘ఇదేమిటి నాన్నా! మిట్టమధ్యాహ్నం వేళ ఈ స్నానం ఏమిటి?’ అన్నాడు జగన్నాథ్.‘నాకు కాశీలో అలవాటు రా!’ అన్నాడు. ఇంతలో కొడుకు ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు.శాస్త్రి్త ఆలోచనలో పడ్డారు.‘ఎంత అదృష్టవంతుడు రామ్మూర్తి! బాధ్యతలు తీరిపోయాయి. ఒక్కనాడు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోని వాడు కాశీలో, అందులోనూ భైరవ యాతనలకు తావు లేని కేదార ఖండంలో ఆఖరిశ్వాస తీసుకున్నాడంటే విశ్వనాథుని దయలేకుండా జరుగుతుందా? పుణ్యాత్ములు పాపాత్ములని మనం ఏవో లెక్కలు వేస్తాం. కానీ ఆ విశ్వేశ్వరుని లెక్కలు వేరే ఉంటాయి. ఎవరికి ఏది, ఎప్పుడు ఇవ్వాలో లిఖించేది ఆయనే’ అనుకున్నాడు శాస్త్రి. అతగాడికి బాధపడాలో, సంతోషించాలో అర్థం కావడం లేదు. ‘అది పూర్వజన్మ సుకృతం. ఈ జన్మలో కాకపోతే గత జన్మలో చేసుకున్న పుణ్యం’ అనుకున్నాడు. సాయంత్రానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. శాస్త్రి కుటుంబసభ్యులు మాత్రమే మిగిలారు.. ‘రేపు ఉదయమే కదా ఫ్లయిట్. బట్టలు, మందులు, పూజాసామాన్లు అన్నీ సర్డుకోవడం అయిపోయింది. పెందరాళే పడుకోవాలి. ప్రొద్దున్నే లేవాలి కదా!’ అన్నాడు శాస్త్రి.‘సరే! నాన్నా! పడుకోండి. తెల్లవారు ఝామునే లేపుతాను’ అన్నాడు విశ్వనాథ్.శాస్త్రికి మనసంతా వికలం అయిపోయింది. పడుకున్నాడన్న మాటేగాని, చిన్ననాటి మిత్రుడు అలా అకస్మాత్తుగా శివైక్యం చెందడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఏ అర్ధరాత్రికో నిద్రలోకి జారుకున్నాడు. రోజు బ్రహ్మమూహూర్తంలో లేచే శాస్త్రి్త ఇంకా లేవలేదు. విశ్వనాథ్ రెడీ అయ్యి టైమ్ చూసుకున్నాడు. ఫ్లయిట్కి టైమవుతోంది. లేపుదామని తండ్రి గదిలోకి వచ్చాడు. శాస్త్రి్త ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు.‘ప్రయాణానికి టైమవుతోంది. లేవండి నాన్నా!’ అంటూ శాస్త్రి వంటిమీద చెయ్యివేశాడు. చల్లగా మంచులా తగిలింది తండ్రి శరీరం. జరిగింది నమ్మలేక పోయాడు. తిరిగి రానిలోకాలకు తండ్రి ప్రయాణం ఎప్పుడో ప్రారంభమయ్యిందని విశ్వనాథ్కు తెలియగానే ‘అయ్యో! నాన్నా’ అని గట్టిగా అరిచాడు. ఆ కేకకి విశాలాక్షి పరిగెత్తుకొచ్చింది.దీనినే లాలటలిఖితం అంటారేమో! విశ్వనాథుని లిఖితం... అగోచరం..అదృశ్యం...అనూహ్యం. -
బతుకమ్మ వేడుకలు
మొదటి రోజున అమ్మవారిని శ్రీ బాలాత్రిపురసుందరీదేవి రూపంలో గులాబిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం సమర్పిస్తారు.రెండో రోజున శ్రీ గాయత్రీదేవి రూపంలో నారింజరంగు చీరతో అలంకరిస్తారు. కొబ్బరి అన్నం, అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.మూడో రోజున శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో నీలిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా మినప వడలు, పులిహోర సమర్పిస్తారు.నాలుగో రోజున శ్రీ కాత్యాయనీదేవి రూపంలో పసుపురంగు చీరతో అలంకరిస్తారు. పాయసం, రవ్వకేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.ఐదో రోజున శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో గులాబిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, రవ్వకేసరి సమర్పిస్తారు.ఆరో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవి రూపంలో పసుపురంగు చీరతో అలంకరిస్తారు. రవ్వకేసరి, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.ఏడో రోజున శ్రీ మహాచండీదేవి రూపంలో బంగారురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా కట్టుపొంగలి సమర్పిస్తారు.మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి రూపంలో తెలుపురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పాయసం, శాకాన్నం సమర్పిస్తారు.దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి రూపంలో ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా కదంబం సమర్పిస్తారు. మహర్నవమి రోజున శ్రీ మహిషాసురమర్దిని రూపంలో నీలిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా చక్కెరపొంగలి సమర్పిస్తారు.చివరిగా విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి రూపంలో ఆకుపచ్చ చీరతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం సహా మహానైవేద్యాన్ని సమర్పిస్తారు.దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ తొమ్మిది రోజుల వేడుకలు దసరా నవరాత్రులకు ఒకరోజు ముందుగానే, భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. బతుకమ్మ వేడుకల్లో రంగురంగుల పూలతో బతుకమ్మను వాకిళ్లలో కొలువుదీర్చి; బాలికలు, మహిళలు బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడతారు.బతుకమ్మ వేడుకల తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఈ రోజున బియ్యంపిండి, నువ్వులు కలిపిన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ. ఈ రోజున చప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు.మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యంగా సమర్పిస్తారు.నాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ. ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.ఐదో రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజున నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు.ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజున నైవేద్యం ఏమీ సమర్పించరు.ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఈ రోజున బియ్యంపిండిని బాగా వేపి, వేపకాయల్లా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు.ఎనిమిది రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ. ఈ రోజున ఐదురకాల నైవేద్యాలను సమర్పిస్తారు. బతుకమ్మ వేడుకలు ముగిశాక విజయదశమి నాడు దసరా పండుగను ఊరూరా ఘనంగా జరుపుకొంటారు. శమీవృక్షానికి– అంటే, జమ్మిచెట్టుకుపూజ చేస్తారు. ఒకరికొకరు జమ్మి ఆకులను ‘బంగారం’గా ఇచ్చుకుని, అభినందనలు తెలుపుకుంటారు. విందు వినోదాలతో దసరా పండుగను ఆనందంగా జరుపుకొంటారు. -
Vijaya Dashami: సర్వం శక్తిమయం!
ఆదిశక్తి అయిన అమ్మవారిని ఆరాధించడం తరతరాల సంప్రదాయం. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని శరన్నవరాత్రులలో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వీటినే దసరా నవరాత్రులని అంటారు. ‘దేవీభాగవతం’ వంటి పురాణగాథల ప్రకారం ఆదిశక్తి దుర్గాదేవిగా ఆవిర్భవించి, రక్తబీజ, చండ ముండ, శుంభ నిశుంభ, మహిషాసురాది రాక్షసులను సంహరించింది. దుష్టసంహారానికి ప్రతీకగా నవరాత్రులలో చివరి రోజున విజయ దశమినాడు దసరా పండుగను జనాలు వేడుకగా జరుపుకొంటారు.దసరా నవరాత్రులలో పూజాదికాలు శాక్తేయ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. సింధులోయ నాగరికత కాలం నుంచి శాక్తేయ సంప్రదాయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. సింధులోయ నాగరికతలో మొదలైన శాక్తేయ సంప్రదాయం దేశం నలువైపులకు విస్తరించింది. ఇందులో భాగంగానే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. వీటితో పాటు యాభైఒక్క శక్తిపీఠాలు ఉన్నాయి. దేవీ భాగవతం నూట ఎనిమిది శక్తిపీఠాలను పేర్కొంది. వీటిలో కొన్ని భారతదేశంతో పాటు పాకిస్తాన్, టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఉన్నాయి. ఈ శక్తిపీఠాలు ఏర్పడటానికి మూలంగా దక్షయజ్ఞం గాథను చెబుతారు. శక్తిపీఠాల మూలగాథఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం తలపెట్టాడు. ఈ యజ్ఞానికి సమస్త దేవతలను, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను, మునిగణాలను ఆహ్వానించాడు. కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు. తండ్రి మాటను కాదని సతీదేవి శివుడిని పెళ్లాడింది. అందువల్లనే దక్షుడు కూతురిని, అల్లుడిని తాను నిర్వహించే యాగానికి ఆహ్వానించకుండా విస్మరించాడు. పుట్టింటి వేడుకకు పిలుపుతో పనేముంది అనుకుని సతీదేవి భర్త వారిస్తున్నా పట్టించుకోకుండా ప్రమధగణాలను వెంటబెట్టుకుని దక్షయజ్ఞానికి వెళ్లింది. ఆమెను చూసిన దక్షుడు ఆమెను, శివుడిని దారుణంగా నిందించాడు. శివనింద భరించలేని సతీదేవి యోగాగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. సతీ వియోగంతో శివుడు జగద్రక్షణ బాధ్యతను మానేశాడు. ఆమె మృతకళేబరాన్ని భుజం మీద మోసుకుంటూ దిక్కుతోచక తిరగసాగాడు. శివుడిని తిరిగి కార్యోన్ముఖుడిని చేయాల్సిందిగా దేవతలందరూ విష్ణువుకు మొరపెట్టుకున్నారు. సతీ కళేబరం చెంత ఉన్నంత వరకు శివుడు యథాస్థతికి రావడం అసాధ్యమని తలచిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, ఆమె శరీరాన్ని ఖండించాడు. సతీదేవి ఖండితావయవాలు భూమ్మీద ఒక్కోచోట చెల్లాచెదురుగా పడ్డాయి. అవి పడిన చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వీటిలోని ప్రధానమైన పద్దెనిమిది శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తింపు పొందాయి. స్కాంద పురాణం వంటి పురాణాల ప్రకారం యాభైఒక్క శక్తి పీఠాలు ఉన్నాయి. దేవీభాగవతం ప్రకారం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల గురించి చాలామందికి తెలుసు. మిగిలిన శక్తిపీఠాలలో కొన్ని విశేషమైనవి, విలక్షణమైనవి ఉన్నాయి. వీటిలో కొన్ని అరుదైన శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం.మహామాయ పీఠం – జమ్ము కశ్మీర్మహామాయ శక్తిపీఠం జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా అమర్నాథ్లో ఉంది. ఇది గుహాలయం. బయటి నుంచి చూడటానికి సాధారణమైన కొండగుహలా కనిపిస్తుంది గాని, లోపల పురాతనమైన మహామాయ విగ్రహం ఉంటుంది. అమర్నాథ్లో శివాలయం పొందినంతగా ఇది ప్రసిద్ధి పొందలేదు. అమర్నాథ్ యాత్రికుల్లో చాలామంది ఈ మహామాయ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది సతీదేవి గొంతు భాగం పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇది పార్వతీపీఠంగా ప్రసిద్ధి పొందింది.దాక్షాయనీ పీఠం – టిబెట్దాక్షాయని శక్తిపీఠం టిబెట్లో ఉంది. కైలాస పర్వతానికి సమీపాన మానస సరోవరానికి చేరువలో ఉన్న ఒక మంచుకొండ మీద ఈ శక్తిపీఠం ఉంది. మానస సరోవరం వద్ద వెలసినందున దీనిని మానసా శక్తిపీఠం అని కూడా అంటారు. సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాల కథనం. గోపురంలా కనిపించే శిఖరం కింద సహజంగా ఏర్పడిన గుహలోని పురాతన దాక్షాయని విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. గండకీ చండీ పీఠం – నేపాల్గండకీ చండీ శక్తిపీఠం నేపాల్లో ఉంది. హిమాలయ సానువుల్లో గండకీ నదీ తీరానికి చేరువలో ముస్తాంగ్ పట్టణానికి సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రమైన ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలోనే గండకీ చండీ ఆలయం కూడా ఉంది. సతీదేవి ముఖ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో పురాతన శాక్తేయ సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటుంటారు.సావిత్రీ పీఠం – హరియాణాసావిత్రీ శక్తిపీఠం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్లో ద్వైపాయన సరోవరం ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోనే కురుపాండవ సంగ్రామం జరిగిందనే మహాభారత కథనం అందరికీ తెలిసినదే! కురుక్షేత్రలో వెలసిన సావిత్రీ శక్తిపీఠం స్థానికంగా భద్రకాళి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల విజయం కోసం శ్రీకృష్ణుడు ఇదే శక్తిపీఠంలో అమ్మవారిని అర్చించాడట! యుద్ధానంతరం పాండవులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి, కానుకగా గుర్రాలను సమర్పించారట! ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేతి చీలమండ పడినట్లు పురాణాల కథనం. దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి.గాయత్రీ పీఠం – రాజస్థాన్గాయత్రీ శక్తిపీఠం రాజస్థాన్లోని అజ్మేర్ నగరానికి చేరువలో ఉన్న పుష్కరక్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మణికట్లు పడ్డాయని పురాణాల కథనం. అందువల్ల ఈ శక్తిపీఠాన్ని మణిబంధ పీఠం, మణివేదిక ఆలయం అని కూడా ఉంటారు. గాయత్రీ మంత్రసాధనకు ఈ శక్తిపీఠం అత్యుత్తమ క్షేత్రమని, ఇక్కడ చేసే గాయత్రీ మంత్రసాధన శీఘ్రంగా ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర క్షేత్రంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది.దేవగర్భ పీఠం – హిమాచల్ప్రదేశ్దేవగర్భ శక్తిపీఠం హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా పట్టణంలో ఉంది. ఇక్కడ వెలసిన దేవగర్భదేవినే వజ్రేశ్వరి అని, స్థానికులు కాంగ్రాదేవి అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ స్తనభాగం పడినట్లు పురాణాల కథనం. వజ్రేశ్వరిని దుర్గాదేవి ఉగ్రరూపంగా భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలోని విలువైన సంపదను మహమ్మద్ ఘజనీ దోచుకున్నాడు. ఆ తర్వాత 1905లో సంభవించిన భూకంపంలో ఆలయ నిర్మాణం బాగా దెబ్బతినడంతో తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రీతిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి.త్రిపురసుందరీ పీఠం – త్రిపురత్రిపురసుందరీ శక్తిపీఠం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉదయపూర్ పట్టణంలో ఉంది. చిన్న కొండపై ఉన్న ఈ ఆలయ నిర్మాణం కూర్మాకృతిలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని కూర్మపీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి రూపంలో కొలువై కనిపిస్తుంది. సతీదేవి కుడిపాదం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో అసోంలోని కామాఖ్య పీఠం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంగా త్రిపురసుందరీ పీఠం ప్రసిద్ధి పొందింది.భవానీ పీఠం – బంగ్లాదేశ్భవానీ పీఠం బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ్ వద్ద చంద్రనాథ్ కొండపై ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ఛత్తల్ భవానీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు చంద్రశేఖరుడిగా కొలువై ఉండటంతో ఈ ప్రదేశం చంద్రకాంత్ ధామ్గా కూడా ప్రసిద్ధి పొందింది. సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకలు ఈ శక్తిపీఠంలో ఘనంగా జరుగుతాయి.శివానీ పీఠం – ఉత్తరప్రదేశ్శివానీ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా రామ్గిరిలో ఉంది. ఇక్కడ కామదగిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ఉన్న అనేక ఆలయాల్లో పురాతనమైన శివానీ పీఠం కూడా ఉంది. సతీదేవి కుడి స్తనభాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. రామాయణ కథనం ప్రకారం సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ చిత్రకూట పర్వతంపైనే కొన్నాళ్లు గడిపారట! కామదనాథుడి పేరిట శివుడు వెలసిన కొండ కావడంతో ఈ కొండకు కామదగిరి అనే పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం.హింగ్లాజ్ పీఠం – పాకిస్తాన్హింగ్లాజ్ శక్తిపీఠం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మర్కన్ తీరంలో ఉన్న హింగ్లాజ్ పట్టణంలో ఉంది. హింగ్లాజ్ నేషనల్ పార్కలో ఉన్న కొండ పైభాగంలో ఉన్న గుహలో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇక్కడి దేవతను హింగ్లాజ్ దేవి అని, హింగులా దేవి అని అంటారు. సతీదేవి లలాట భాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. పాకిస్తాన్లోని హిందువులతో పాటు మన దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దసరా నవరాత్రులతో పాటు వసంత నవరాత్రి వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. మహామాయ పీఠం – జమ్ము కశ్మీర్మహామాయ శక్తిపీఠం జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా అమర్నాథ్లో ఉంది. ఇది గుహాలయం. బయటి నుంచి చూడటానికి సాధారణమైన కొండగుహలా కనిపిస్తుంది గాని, లోపల పురాతనమైన మహామాయ విగ్రహం ఉంటుంది. అమర్నాథ్లో శివాలయం పొందినంతగా ఇది ప్రసిద్ధి పొందలేదు. అమర్నాథ్ యాత్రికుల్లో చాలామంది ఈ మహామాయ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది సతీదేవి గొంతు భాగం పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇది పార్వతీపీఠంగా ప్రసిద్ధి పొందింది.దాక్షాయనీ పీఠం – టిబెట్దాక్షాయని శక్తిపీఠం టిబెట్లో ఉంది. కైలాస పర్వతానికి సమీపాన మానస సరోవరానికి చేరువలో ఉన్న ఒక మంచుకొండ మీద ఈ శక్తిపీఠం ఉంది. మానస సరోవరం వద్ద వెలసినందున దీనిని మానసా శక్తిపీఠం అని కూడా అంటారు. సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాల కథనం. గోపురంలా కనిపించే శిఖరం కింద సహజంగా ఏర్పడిన గుహలోని పురాతన దాక్షాయని విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. గండకీ చండీ పీఠం – నేపాల్గండకీ చండీ శక్తిపీఠం నేపాల్లో ఉంది. హిమాలయ సానువుల్లో గండకీ నదీ తీరానికి చేరువలో ముస్తాంగ్ పట్టణానికి సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రమైన ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలోనే గండకీ చండీ ఆలయం కూడా ఉంది. సతీదేవి ముఖ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో పురాతన శాక్తేయ సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటుంటారు.సావిత్రీ పీఠం – హరియాణాసావిత్రీ శక్తిపీఠం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్లో ద్వైపాయన సరోవరం ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోనే కురుపాండవ సంగ్రామం జరిగిందనే మహాభారత కథనం అందరికీ తెలిసినదే! కురుక్షేత్రలో వెలసిన సావిత్రీ శక్తిపీఠం స్థానికంగా భద్రకాళి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల విజయం కోసం శ్రీకృష్ణుడు ఇదే శక్తిపీఠంలో అమ్మవారిని అర్చించాడట! యుద్ధానంతరం పాండవులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి, కానుకగా గుర్రాలను సమర్పించారట! ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేతి చీలమండ పడినట్లు పురాణాల కథనం. దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి.గాయత్రీ పీఠం – రాజస్థాన్గాయత్రీ శక్తిపీఠం రాజస్థాన్లోని అజ్మేర్ నగరానికి చేరువలో ఉన్న పుష్కరక్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మణికట్లు పడ్డాయని పురాణాల కథనం. అందువల్ల ఈ శక్తిపీఠాన్ని మణిబంధ పీఠం, మణివేదిక ఆలయం అని కూడా ఉంటారు. గాయత్రీ మంత్రసాధనకు ఈ శక్తిపీఠం అత్యుత్తమ క్షేత్రమని, ఇక్కడ చేసే గాయత్రీ మంత్రసాధన శీఘ్రంగా ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర క్షేత్రంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది.దేవగర్భ పీఠం – హిమాచల్ప్రదేశ్దేవగర్భ శక్తిపీఠం హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా పట్టణంలో ఉంది. ఇక్కడ వెలసిన దేవగర్భదేవినే వజ్రేశ్వరి అని, స్థానికులు కాంగ్రాదేవి అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ స్తనభాగం పడినట్లు పురాణాల కథనం. వజ్రేశ్వరిని దుర్గాదేవి ఉగ్రరూపంగా భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలోని విలువైన సంపదను మహమ్మద్ ఘజనీ దోచుకున్నాడు. ఆ తర్వాత 1905లో సంభవించిన భూకంపంలో ఆలయ నిర్మాణం బాగా దెబ్బతినడంతో తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రీతిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి.త్రిపురసుందరీ పీఠం – త్రిపురత్రిపురసుందరీ శక్తిపీఠం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉదయపూర్ పట్టణంలో ఉంది. చిన్న కొండపై ఉన్న ఈ ఆలయ నిర్మాణం కూర్మాకృతిలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని కూర్మపీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి రూపంలో కొలువై కనిపిస్తుంది. సతీదేవి కుడిపాదం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో అసోంలోని కామాఖ్య పీఠం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంగా త్రిపురసుందరీ పీఠం ప్రసిద్ధి పొందింది.భవానీ పీఠం – బంగ్లాదేశ్భవానీ పీఠం బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ్ వద్ద చంద్రనాథ్ కొండపై ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ఛత్తల్ భవానీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు చంద్రశేఖరుడిగా కొలువై ఉండటంతో ఈ ప్రదేశం చంద్రకాంత్ ధామ్గా కూడా ప్రసిద్ధి పొందింది. సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకలు ఈ శక్తిపీఠంలో ఘనంగా జరుగుతాయి.శివానీ పీఠం – ఉత్తరప్రదేశ్శివానీ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా రామ్గిరిలో ఉంది. ఇక్కడ కామదగిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ఉన్న అనేక ఆలయాల్లో పురాతనమైన శివానీ పీఠం కూడా ఉంది. సతీదేవి కుడి స్తనభాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. రామాయణ కథనం ప్రకారం సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ చిత్రకూట పర్వతంపైనే కొన్నాళ్లు గడిపారట! కామదనాథుడి పేరిట శివుడు వెలసిన కొండ కావడంతో ఈ కొండకు కామదగిరి అనే పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం.హింగ్లాజ్ పీఠం – పాకిస్తాన్హింగ్లాజ్ శక్తిపీఠం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మర్కన్ తీరంలో ఉన్న హింగ్లాజ్ పట్టణంలో ఉంది. హింగ్లాజ్ నేషనల్ పార్కలో ఉన్న కొండ పైభాగంలో ఉన్న గుహలో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇక్కడి దేవతను హింగ్లాజ్ దేవి అని, హింగులా దేవి అని అంటారు. సతీదేవి లలాట భాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. పాకిస్తాన్లోని హిందువులతో పాటు మన దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దసరా నవరాత్రులతో పాటు వసంత నవరాత్రి వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలుదేశ విదేశాల్లో పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. దసరా వేడుకల సందర్భంగా పలుచోట్ల వీథుల్లో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోను, తెలంగాణలో ఆలంపురంలోని శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలోను ఈ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈసారి దసరా వేడుకలు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజైన సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అక్టోబర్ 2న విజయదశమి నాటితో దసరా నవరాత్రులు పూర్తవుతాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని రోజుకో అవతారంలో రోజుకో తీరులో అలంకరిస్తారు. రోజుకో ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని నవరాత్రులలో చేసే అలంకరణలు, నైవేద్యాల వివరాలు: -
ఘాఘ్రా–చోళీలో గోల్డ్ మెడల్!
వయసు తొంభై ఏళ్లు దాటితే చాలామంది కూర్చుని మోకాలికి నూనె రాసుకోవడం, మనవరాళ్లకు కథలు చెప్పడం, రక్తపోటు–షుగర్ మందులు సరిగ్గా తీసుకున్నామా అని చెక్ చేసుకోవడం చేస్తుంటారు. కాని, ఈ అమ్మమ్మ మాత్రం అలా కాదు. ట్రాక్లోకి దూకి గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఆమె తొంభై మూడేళ్ల పానీదేవి.పానీదేవి కథ సాధారణం కాదు. అమ్మాయిలకు చదువూ ఆటలూ దూరమైన కాలంలో పుట్టింది. పదిహేను ఏళ్లకే పెళ్లి, యాభై ఏళ్లకే భర్తను కోల్పోయింది. ఎనిమిది మంది పిల్లలకు తల్లి, తండ్రి తానే అయి పెంచింది. చిన్న వయసు నుంచే పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. జీవితం అంతా బాధ్యతలతో నిండిపోయినా, ఆమె మనసులో ఎప్పుడూ ఒక కల మేల్కొని ఉండేది. ఆ కలను నిద్రపుచ్చాలా లేక సాకారం చేసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం ఆమె రెండేళ్ల క్రితం చెప్పింది. ఒకరోజు తన మనవడు జైకిష పారా అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా, పానీదేవి ఒక్కసారిగా ‘నేనూ చేస్తాను’ అని చెప్పింది. ఇంత వయసులో విశ్రాంతి తీసుకోమని కాకుండా, మనవడు ‘పరుగెత్తు’ అని ప్రోత్సహించాడు. అలా ఆ మనవడు, అమ్మమ్మ కాస్తా గురుశిష్యులుగా మారారు. కొత్త జీవితం! ఇంటి పనులు ముగించుకుని మైదానానికి వెళ్లడం, పాదాలు నొప్పితో వణికినా ఆగిపోకుండా శిక్షణ కొనసాగించడం, చుట్టుపక్కల వాళ్ల నవ్వులు వినిపించినా తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తడంతో ఆమె కొత్త జీవితం ఆరంభమైంది. ప్రేక్షకులు మొదట ‘ఈ వయసులోనా?’ అని ఆశ్చర్యపోయినా, ఘాఘ్రా–చోళీతో ట్రాక్లోకి దూకి కేవలం 45 సెకన్లలోనే 100 మీటర్లు పూర్తి చేసేసరికి చప్పట్లతో మైదానం మార్మోగిపోయింది. ఆ పోటీకి ముందు గుంతలో పడిపోయి ఆమె మోకాళ్లు గాయపడ్డాయి. డాక్టర్లు ‘విశ్రాంతి తీసుకోండి’ అన్నారు. కాని, పానీదేవి మాత్రం ‘మహా అయితే ఓడిపోతాను. కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం అసలు చేయను’ అంటూ పట్టుదలతో ట్రాక్లోకి దిగింది. అలా 2023లో అల్వార్లో మొదటి మెడల్, 2024లో పుణేలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె ఇవన్నీ ఇంట్లో అల్మారాలో దాచేసింది! మనవడు వీడియో పోస్ట్ చేయకపోతే, దేశం మొత్తం ఆమెను అసలు చూడకపోయేది. ఇప్పుడు ఆమె కల మరింత పెద్దది. త్వరలోనే ఇండోనేషియాలో జరగబోయే ఆసియ మాస్టర్స్ గేమ్స్లో భారత్ తరపున పతకం గెలవడానికి సిద్ధమవుతోంది. · -
దుబాయ్ రోడ్ల మీద డ్రైవరమ్మ జోరు!
ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా లెఫ్ట్ ఇండికేటర్ వేసి, రైట్కి తిరిగిందంటే, వెనక వున్నవాళ్లు తక్షణమే ‘లేడీ డ్రైవర్!’ అని ఫిక్స్ చేసేసుకుంటారు. కాని కొంతమంది ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చి చూస్తే, చీర కట్టుకుని, పూలు పెట్టుకుని, స్టీరింగ్పై స్పీడ్ రేస్ చేస్తున్న మహిళలని చూసి షాక్ అవుతుంటారు. ఇలా సమాజంలో మహిళల డ్రైవింగ్పై ఇంకా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కాని కేరళకు చెందిన డెబ్బై రెండేళ్ల మణి అమ్మ ఆ మాటలన్నింటినీ రోడ్డుమీద దుమ్ము దులిపేసింది. అందుకే ఆమెను అందరూ ‘డ్రైవర్ అమ్మ’ అని పిలుస్తారు. మణి అమ్మ కేవలం యాక్టివా నడిపే స్థాయిలో ఆగిపోలేదు. లగ్జరీ కార్లు, బస్సులు, ట్రక్కులు, క్రేన్లు, రోడ్ రోలర్లు ఇలా మీరు పేరు చెప్పండి, ఆమె ఆ వాహనాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉంటుంది. మొత్తం పద్దెనిమిది రకాల వాహనాలను నడిపేందుకు కావలసిన పదకొండు లైసెన్సులు ఆమె చేతిలో ఉన్నాయి. 2004లో భర్త మరణం తర్వాత అతని ‘ఏ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్’ అనే డ్రైవింగ్ స్కూల్ను మూసేయకుండా, తానే స్కూల్ నడిపించి, తన జీవితాన్నే రేస్ ట్రాక్లా మార్చేసుకుంది. ఇటీవల దుబాయ్ వీథుల్లో, సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఆత్మవిశ్వాసంగా రోల్స్–రాయిస్ ఘోస్ట్ కారును నడుపుతున్న ఆమె వీడియో వైరల్ అవ్వడంతో, అది చూసి ‘మహీంద్రా’ అధినేత ఆనంద్ మహీంద్రా కూడా ఆమెకు సెల్యూట్ చేశారు. ప్రస్తుతానికి ఈ అమ్మ ఒక్క విమానం నడపటం మాత్రమే మిగిలి ఉంది, అది కూడా నేర్చుకుని నడిపించే ధైర్యం ఉంది అంటోంది మణి అమ్మ. -
Tirumala: శ్రీవారి భక్తులకు మార్గదర్శకాలు
తిరుమలకు బయలు దేరేముందు ఇష్టదేవతలను పూజించుకోవాలి.శ్రీ వారిని దర్శించేముందు పుష్కరిణిలో స్నానంచేసి, ముందుగా వరాహస్వామిని పూజించాలి. ఆ తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించాలి.ఆలయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తూ ‘ఓం శ్రీవేంకటేశాయ నమః’ అని స్మరిస్తూ ఉండాలి.స్వామిపైనే ధ్యాసను ఉంచాలి. తిరుమల సమీపంలో ఉన్న ఆకాశగంగ, పాపవినాశనం తీర్థాలలో స్నానం చేస్తే, సకల పాపాలు హరిస్తాయి. తిరుమలలో ఉన్నప్పుడు సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విధిగా పాటించాలి.తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలి కానుకలు, ముడుపులను ఆలయంలోని స్వామి హుండీలోనే సమర్పించాలి.తిరుమలలో భక్తులు చేయకూడనివిఆలయం చుట్టూ నాలుగు మాడవీథుల్లో పాదరక్షలు ధరించరాదు. ఈ వీథుల్లోనే ఉత్సవమూర్తులు నిత్యం ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తుంటారు.విలువైన ఆభరణాలు, ఎక్కువ నగదు మీ వద్ద ఉంచుకోకూడదు.శ్రీవారి దర్శనం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతో తిరుమలకు రాకూడదు.స్వామి దర్శనం కోసం త్వరపడకుండా మీవంతు వచ్చేవరకు ఆగాలి. ఆలయార్హత లేని సందర్భాల్లో ఆలయంలోకి రాకూడదు. స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో పువ్వులు అలంకరించుకోరాదు. తిరుమల గిరుల్లోని విరులన్నీ స్వామి సేవకే.కాటేజీల్లో నీరు, విద్యుత్ వృథా చేయకూడదు. అపరిచితులను వసతి గృహాల్లోకి అనుమతించరాదు. వారిని నమ్మి, గది తాళాలను ఇవ్వకూడదు.పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు. తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం మొదలైనవి పూర్తిగా నిషేధం. పేకాట, జూదం వగైరాలు పూర్తిగా నిషేధం.శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించరాదు. వారిని ప్రోత్సహించరాదు. దళారుల నుంచి నకిలీ ప్రసాదాలను కొనుగోలు చేయరాదు. ఆలయప్రాంగణంలో ఉమ్మివేయరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధం.వివిధ రాజకీయసభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్లు మొదలైనవి నిషేధం.ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు వంటి పరికరాలు తీసుకువెళ్లరాదు. ఆయుధాలు తీసుకురాకూడదు.జంతువధ నిషేధం.భిక్షుకులను ప్రోత్సహించరాదు.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలన్న నిబంధనను టీటీడీ కచ్చితంగా అమలు చేస్తోంది.పురుషులు ధోవతి–ఉత్తరీయం, కుర్తా–పైజామా... మహిళలు చీర–రవిక, లంగా–ఓణి, చున్నీతో పాటు పంజాబీ డ్రస్, చుడీదార్ ధరించాల్సి ఉంటుంది.స్వచ్ఛంద సేవ ‘శ్రీవారి సేవ’లో పాల్గొనదలచిన వాలంటీర్లు కూడా డ్రెస్కోడ్ను విధిగా పాటించాలి. తొక్కిస లాటలకు, తోపులాటలకు తావులేకుండా ఆలయ అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు సహకరిస్తే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తుంది. తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి దర్శనానుగ్రహాలు పరిపూర్ణంగా లభించాలని కోరుకుందాం. -
కలియుగ వైకుంఠం.. తిరుమల ఆలయం
కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయం. క్రీ.పూ. 12వ శతాబ్దంలో తిరుమలలో శ్రీవెంకటేశ్వర ఆలయం నిర్మితమైంది. 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆలయ గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు.. పవిత్ర వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరచేందుకు వేరువేరు గదులు. లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగది. మొదటి ప్రాకారం..మహాద్వార గోపురంఏడుకొండల్లో కొలువైన వెంకన్న స్వామిని దర్శించుకునే ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ప్రవేశద్వార గోపురమే మహాద్వార గోపురం. పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అని వేరువేరు పేర్లు ఉన్నాయి. పెద్దవాకిలి. తమిళంలో ‘పెరియ తిరువాసల్’ అని కూడా పిలుస్తారు. ఈ మహాద్వారాన్ని గోపురంతో అనుసంధానిస్తూ నిర్మించిన ప్రాకారమే మహా ప్రాకారం అంటారు. వైకుంఠం క్యూ కంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. లోనికి అడుగుపెట్టక మునుపు పైపుల ద్వారా వచ్చే నీటితోనే భక్తులు పాదాలను శుభ్రం చేసుకుని ప్రవేశించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ వాకిలి గోడపై అనంతాళ్వారులు వినియోగించిన గునపం ఇప్పటికీ కనిపిస్తుంది.శంఖనిధి.. పద్మనిధిమహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల్లా పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. వీరే శ్రీవారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. కుడివైపున ఉన్న మరో రక్షక దేవత పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.కృష్ణదేవరాయమండపంమహాద్వారానికి ఆనుకుని లోపలివైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే శ్రీకృష్ణదేవరాయ మండపం. దీనినే ప్రతిమ మండపం అని కూడా అంటారు. ఈ మండపం లోనికి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపున రాణులు తిరుమలదేవి, చిన్నమదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మణ్ణి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు తిరుమల యాత్ర చేసి శ్రీవారికి ఎన్నో కానుకలు సమర్పించారు. అచ్యుతరాయలు తనపేరిట బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు.అద్దాల మండపంప్రతి మండపానికి 12 అడుగుల దూరంలో ఎతై ్తన అధిష్ఠానంపై నిర్మించిన దాన్నే అద్దాల మండపం లేదా ఆయినా మహల్ అంటారు. ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు. ఈ అరలు ఉన్న ప్రాంతాన్ని ప్రసాదం పట్టెడ అంటారు.తులాభారంశ్రీకృష్ణదేవరాయల మండపానికి ఎదురుగా ఉంటుంది తులాభారం. భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణా తులాభారంగా స్వామివారికి సమర్పించుకుంటుంటారు. తులాభారానికి అవసరమైన వస్తు సామగ్రిని భక్తులు తిరుమలకు మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆలయం లోపలే తులాభారంలో వేయాల్సిన వస్తువులకు తగిన నగదు రూపంలో చెల్లిస్తే టీటీడీనే ఆ వస్తువులను సమకూరుస్తుంది.రంగనాయక మండపంకృష్ణదేవరాయ మండపానికి దక్షిణం వైపుగా 108 అడుగల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో శిల్ప శోభితమై విరాజిల్లుతూ కనిపించేదే రంగనాయక మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపం అని పిలుస్తారు. ఒకప్పుడు నిత్యకళ్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలైన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వాచనంతో పాటు స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు.తిరుమలరాయ మండపంరంగనాయక మండపాన్ని ఆనుకుని పడమరవైపున ఉన్న ఎత్తైన స్తంభాలతో, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి ఈ మండపం. ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించారు. స్వామివారికి ‘అన్నా ఊయల తిరునాళ్లు’ అనే ఉత్సవాన్ని నిర్మించే నిమిత్తం క్రీశ 1473లో ఈ మండపాన్ని నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించారు. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.రాజా తోడరమల్లుఅక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉన్న లాలా ఖేమార్ము క్షత్రియ వంశస్థుడు. ఈయన రాజా తోడరమల్లుగా ప్రసిద్ధి పొందాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించేటప్పుడు ధ్వజస్తంభానికి సమీపంలో రాజా తోడరమల్లు, తల్లి మాత మోహనాదేవి, భార్య పితబీబీ విగ్రహాలు స్వామివారికి అభిముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు కనిపిస్తాయి. 17వ శతాబ్దంలో ముస్లిం పాలకుల దాడులు, బ్రిటిష్ దండయాత్రల నుంచి శ్రీవారి ఆలయాన్ని సంరక్షించిన పాలకుల్లో రాజా తోడరమల్లు ఒకరు. నాటి నుంచి వీరి లోహ విగ్రహాలు తిరుమల ఆలయంలో ఉన్నాయి.ధ్వజస్తంభంధ్వజస్తంభ మండపం వెండి వాకిలికి ఎదురుగా చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంలా ఎత్తైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం. ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండి వాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్న ధ్వజారోహణం అంటారు. బలిపీఠంధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారురేకు తాపడం ఉంటుంది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని (అన్నాన్ని) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.క్షేత్రపాలక శిలధ్వజస్తంభానికి ఈశాన్య మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే క్షేత్రపాల శిల అంటారు. ఇది రాత్రి పూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు గుడికి తాళం వేసి తరువాత ఈ శిలపై ఉంచి నమస్కరించి తాళం చెవులను తీసుకెళుతారు. మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులతో గుడి తలుపులు తెరుస్తారు. సంపంగి ప్రాకారంమహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థలవృక్షాలనేవి ఉండటం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం సంపంగి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందున ఇలా పిలువబడుతోంది. కళ్యాణమండపందక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంలో ఈ కళ్యాణమండపాన్ని నిర్మించారు. ఇందులో తూర్పుముఖంగా ఉన్న కళ్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కళ్యాణోత్సవం జరుగుతుంది.ఉగ్రాణంస్వామివారి ప్రసాదాలకు తయారయ్యే ముడిసరుకులు నిల్వ ఉంచే గది. ఇది వాయవ్య మూలగా ఉంటుంది.విరజానదివైకుంఠంలోని పరమ పవిత్రమైన ఈ నది శ్రీవారి పాదాల క్రిందగా ప్రవహిస్తుంటుందని నమ్మకం. ఆలయం లోపలి బావుల్లో ఈ నది నీరు ప్రవహిస్తుందని, అందుకే ఆలయ బావుల్లోని నీరు పరమ పవిత్రమైనదిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వినియోగిస్తుంటారు.నాలుగుస్తంభాల మండపంసంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వనరసింహ రాయలు, ఆయన భార్య, ఇద్దరు కుమారుల పేర స్తంభాలు కట్టించారు.పూలబావిపూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామివారికి ఉపయోగించిన పూలను ఇందులో వేస్తారు. దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్లేటప్పుడు ఎతైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.వగపడి భక్తులు దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది. ముఖ మండపం అద్దాల మండపానికి ముందు భాగంలో ఉంటుంది. కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు ఇక్కడ అందజేస్తారు.రెండవ ప్రాకారం..వెండి వాకిలి.. నడిమి పడికావలి ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండి వాకిలి. నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండి వాకిలి మీదుగా భక్తులు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రవేశ ద్వారమంతటా వెండిరేకు తాపడం చేసినందున దీన్ని వెండివాకిలి అంటారు. ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీవారు పాచికలాడుతున్న శిల్పం ఉంటుంది.విమాన ప్రదక్షిణంవెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అని కూడా అంటారు. సుప్రభాత సేవ జరిగే సమయంలో భక్తులు వెలుపల అంగప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో వెండి వాకిలికి ఎదురుగా శ్రీరంగనాథస్వామి, వరదరాజస్వామి ఆలయాలు ఉంటాయి. ఇంకా ప్రధాన వంటశాల, పూలబావి, అంకురార్పణ మండపం, యాగశాల, నాణేల పరకామణి, నోట్ల పరకామణి, చదనపు అర, విమాన వేంకటేశ్వరస్వామి, రికార్డులగది, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి సన్నిధి, ప్రధాన హుండి, విష్వక్సేనుల వారి ఆలయం మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్లుగా పేర్కొంటారు.బంగారు బావిదర్శనాంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడం ఉంటుంది. ఇందులో నీటినే స్వామి వారి అభిషేకాలకు, ప్రసాదాలకు వినియోగిస్తారు. ఇందులో వైకుంఠంలోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.వకుళాదేవిబంగారుబావి పక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. శ్రీవారి తల్లి. ద్వాపరయుగంలో యశోదాదేవే ఈ కలియుగంలో స్వామివారి కళ్యాణం చూడటానికి వకుళాదేవిగా అవతరించింది.అంకురార్పణ మండపంబంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు. ఇంకా గరుడ, విష్వక్సేన, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.యాగశాలహోమాది క్రతువులు నర్వహించే ప్రదేశం. ఇప్పుడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.సభ అరకైంకర్యాలకై ఉపయోగించే బంగారు, వెండి పాత్రలు, కంచాలు, గొడుగులు ఉంచే ప్రదేశం. ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విసనకర్రలను ఇక్కడే భద్రపరుస్తారు.సంకీర్తన భాండాగారంసభ అర పక్కనే ఈ గది ఉంటుంది. ఇరువైపులా తాళ్లపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్లపాక వంశం వారు రచించిన సుమారు 32వేల సంకీర్తనలను భద్రపరచారు. వేటూరి ప్రభాకర శాస్త్రి, సాధు సుబ్రమణ్యశాస్త్రి వంటి వారి విశేష కృషి వలన ఈ రోజు మనం వాటిని చూస్తున్నాం.భాష్యకార్ల సన్నిధిఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏ కైంకర్యాలు ఏ విధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి. తన 120 సంవత్సరాల కాలంలో మూడు పర్యాయాలు తిరుమలకు మోకాళ్లపై వచ్చారు. అలా వస్తున్నప్పుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ల పర్వతం. నేటికీ కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్లతో ఎక్కుతుంటారు.పోటుప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణంలో ఈ పోటు ఉంది. ఇక్కడ దద్ధోజనం, చక్కెర పొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరాతో పాటు కళ్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్ పాయసం, అప్పం మొదలైనవి తయారు చేస్తుంటారు. ఆనందనిలయ విమానంఆనందనిలయంపై ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు. గరుత్మంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుంచి భూమి మీదకు తీసుకొచ్చారని చెబుతారు. దీని మీద దాదాపు 64 మంది దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నట్లు చెబుతుంటారు. ఈ గోపురంపైనే వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామినే విమాన వెంకటేశ్వరస్వామి అంటారు.రికార్డు గదిస్వామివారి అభరణాల వివరాలు, జమ ఖర్చులు వివరాలను భద్రపరచు గది.వేదశాలరికార్డుల గది పక్కనే వేద పండితులు పఠనం చేసే గది. ఇక్కడ మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.యోగనరసింహస్వామి సన్నిధిరామానుజాచార్యులుచే శ్రీనరసింహాలయం ప్రతిష్ఠితం చేయబడింది. క్రీశ 1330–1360 మధ్య కాలంలో నిర్మించినట్లు పరిశోధకుల అభిప్రాయం. క్రీశ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. అళగియ సింగం (అందమైన సింహం) అని, వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది. చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండటం ప్రత్యేకం. ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.శంకుస్థాపన స్తంభంరాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.పరిమళ అరశంకుస్థాపన స్తంభం నుంచి తిరిగి వచ్చే మార్గంలో ఈ పరిమళ అర ఉంది. స్వామివారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.శ్రీవారిహుండీభక్తులు కానుకలు వేసే ప్రాంతం. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగినా ఇప్పటికీ ఎటువంటి మార్పు చెందని ఒకే ఒక స్థలం. దీని కింద శ్రీచక్రయంత్రం, ధనాకర్షణ యంత్రం ఉన్నాయని నమ్మకం.బంగారు వరలక్ష్మిహుండీ ఎడమగోడపై బంగారు లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఈవిడ భక్తులకు అషై్టశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.కటాహ తీర్థంఅన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టిలాంటి నిర్మాణం. ఇందులో స్వామివారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.విష్వక్సేనహుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ఘంటా మండపంబంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్య ఉన్న ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామివారి సందర్శనకు వేచి ఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు. పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయంలో వీటిని మోగించేవారు. దీనిని ఘంటపని అనేవారట. ఈ గంటలను అనుసరించే స్వామివారి ఆహారసేవలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం తీసుకునేవారట. ప్రస్తుతం రెండూ ఒకేచోటుకు చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం పక్కనే ఉంటాయి.గరుడ సన్నిధిమూలవిరాట్టుకు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారు మండపం. బంగారువాకిలి ఎదురుగా, గరుడాళ్వార్ మందిరం ఉంది. శ్రీవారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో ఉన్న గరుడాళ్వారు దర్శనమిస్తాడు. ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.ద్వారపాలకులుబంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు. మహాలఘు దర్శనం ఇక్కడే చేసుకుంటారు.మూడవ ప్రాకారం..బంగారు వాకిలిశ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లటానికి అత్యంత ప్రధానమైన ఏకైక ద్వారం బంగారు వాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారు వాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీమలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. స్నపన మండపంబంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే స్నపనమండపం. క్రీ.శ. 614లో పల్లవరాణి సామవై ఈ మండపాన్ని నిర్మించి భోగశ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించారట. ఈ స్నపన మండపాన్నే తిరువిలాన్కోయిల్ అంటారు. ఆనందనిలయం జీర్ణోద్ధరణ సమయంలో ఈ మండపాన్ని నిర్మించినట్లు చెబుతారు. ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునికి ఆరోజు పంచాంగం చెప్పే పూజారులు, క్రితం రోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు. రాములవారి మేడస్నపన మండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపులా ఎత్తుగా కనిపిస్తుంది రాములవారి మేడ. తమిళంలో మేడు అంటే ఎతై ్తన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆనంద నిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పేరుపొందింది.శయన మండపంశ్రీవారి గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయన మండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.కులశేఖరపడిశ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరపడి. పడి అనగా మెట్టు, గడప అని అంటారు.ఆనందనిలయంకులశేఖరపడి అనే బంగారు గడప దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. ఈ ఆనందనిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయం అంటారు.శ్రీవేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు)గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిల్చొని ఉన్న శిలాదివ్యమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామి. నిలబడి ఉన్నందున ఈ అర్చామూర్తిని ‘స్థానకమూర్తి’ అంటారు. అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ‘ధ్రువమూర్తి’ అని, ‘ధ్రువబేరం’ అని కూడా అంటారు. శ్రీవారు అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నారు. ఈ మూలమూర్తికి ప్రతినిధులుగా కొలువు శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్ప స్వామి అనే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా సీతారామలక్ష్మణులు, శ్రీకృష్ణ రుక్మిణులు, చక్రత్తళ్వారులు, సాలగ్రామ శిలలు ఉన్నాయి (స్వామివారికి ప్రతిరూపాలుగా వారికి నిత్య అభిషేకాలు జరుగుతుంటాయి)∙ -
Tirumala: ఆ దేవదేవుడికి కునుకే కరువు..!
కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోకవైకుంఠం తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. పూర్వం చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త దివ్యతేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. యేళ్ల తరబడి ఆ స్వామికి కంటిమీద కనుకు కష్టమైపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..!! అవును.. పూర్వం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత మంది భక్తజనం రావటంతో స్వామి దర్శనం కేవలం పగటిపూట మాత్రమే కలిగేది. రానురానూ తిరుమలకొండ మీద సౌకర్యాలు పెరిగాయి. భక్తులు పెరిగారు. క్యూలు పెరిగాయి. వారి వేచి ఉండే సమయం పెరిగింది. ఆ ప్రభావం సాక్షాత్తు మన స్వామి దర్శనం మీద పడిందనటంలో అతిశయోక్తిలేదు. కష్టాలు తొలగాలని కోర్కెల చిట్టాలతో వచ్చే భక్త జనులకు దివ్యాశీస్సులు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే అన్నట్టుగా స్వామి క్షణకాలం కూడా తీరికలేకుండా అనుగ్రహిస్తున్నారనటంలో ఆవంతైనా అనుమానం లేదు. మన స్వామికి కంటి మీద కనుకు లేకపోవడానికి కారణ విశేషాలేమిటో తెలుసుకోవాల్సిందే మరి!!నాటి కుగ్రామం నుండి ప్రపంచ స్థాయి క్షేత్రంగా విరాజిల్లుతూ..1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే నాటికి ఈ క్షేత్రం కుగ్రామమే. కనీసం మట్టిరోడ్డు కూడా లేని దట్టమైన అటవీ ప్రాంతం. తిరుమల కొండకు రెండు ఘాట్రోడ్ల ఏర్పాటుతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగాయి. ఎలాంటి మౌలిక వసతుల్లేని తిరుమలలో ప్రస్తుతం స్టార్ హోటళ్ల స్థాయి సౌకర్యాలు ఏర్పడ్డాయి.ఒకప్పుడు చేతివేళ్లపై లెక్కపెట్టగలిగేలా ఉన్న సిబ్బంది నేడు వేలసంఖ్యకు పెరిగారు. రోజూ వందల సంఖ్యలోపే వచ్చే భక్తులు నేడు 70 వేలు దాటారు. అప్పట్లో వేలల్లో లభించే ఆలయ హుండీ కానుకలు కూడా ఆ మేరకు పెరిగి రూ.2.5 నుండి రూ.3 కోట్లకు చేరుకున్నాయి. రూ.లక్షల్లో ఉన్న స్వామి ఆస్తిపాస్తులు నేడు లక్షన్నర కోట్లరూపాయలకు పైబడ్డాయి. పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామికి నేడు అర్ధరాత్రి దాటినా కూడా కునుకు దొరకని విధంగా భక్తులు పెరిగిపోయారు. ⇒ నాడు దట్టమైన అరణ్యంలో దాగిన తిరువేంగడమే నేడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం. పూర్వం తిరుమలకొండను ‘తిరువేంగడం’ అని, శ్రీవేంకటేశ్వర స్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అనీ కీర్తించేవారు. మహనీయులెందరో..!⇒తిరుమల „ó త్రానికి పల్లవులు, చోళులు, పాండ్యులు, కాడవ రాయరులు, తెలుగుచోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు విశిష్ట సేవ చేశారు. ఆలయ కుడ్యాలపై ఉన్న శాసనాలే ఇందుకు ఆధారం. ఆ తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు, అధికారులు తిరుమలేశుని కొలువులో సేవించి తరిస్తూ ఆయా కాలాల్లో ఆలయ పరిపాలనలో భక్తులకు తమవంతుగా సేవలు, సౌకర్యాలు కల్పించారు. ⇒ఇక ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, అన్నమాచార్యులు, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వంటి వారెందరో ఈక్షేత్ర మహిమను వేనోళ్ల కొనియాడారు. తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని దశదిశలా చాటారు. బ్రిటిష్ చట్టాలపైనే దేవస్థానం పునాదులురెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన తెల్లదొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులేనని చెప్పొచ్చు. దేవస్థానం పాలన కోసం వేసిన పునాదులు వారి కాలంలోనే పటిష్ఠంగా ఏర్పడ్డాయనటానికి టీటీడీ వద్ద లభించే రికార్డులే ఆధారం. ⇒1843 నుండి 1933 వరకు మహంతుల పాలన జరిగింది. ఆలయ పరిపాలన కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆలయ కమిషనర్తోపాటు ధర్మకర్తల మండలి కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టింది. ⇒ చివరి మహంతు ప్రయాగ్దాస్ దేవస్థాన కమిటీకి తొలి అధ్యక్షులుగా 1933 నుంచి 1936 వరకు సేవ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 52 మంది అ«ధ్యక్షులు, స్పెసిఫైడ్ అథారిటీ ప్రత్యేక పాలనాధికారులుగా పనిచేశారు.⇒ధర్మకర్తల మండళ్లలోని చైర్మన్, ఈవోలు ఎవరికి వారు ఆయా కాలాల్లో అవసరాలకు అనుగుణంగా భక్తుల బస కోసం సత్రాలు, కాటేజీలు నిర్మించారు. ప్రయాణ సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. తొలినాళ్లలో పగటిపూటే స్వామి దర్శనం⇒1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత కూడా తిరుమలకు నడిచేందుకు సరిగ్గా కాలిబాట మార్గాలు లేవు. తిరుమల మీద కూడా అలాంటి పరిస్థితులే కనిపించేవి. చుట్టూ కొండలు, బండరాళ్లే కనిపించాయి.⇒కొండకు వచ్చే భక్తులు ఆలయం ఎదురుగా ఉండే వేయికాళ్ల మండపం, ఆలయ నాలుగు మాడ వీథుల్లోని మండపాలు, స్థానిక నివాసాల్లో తలదాచుకునేవారు. అప్పట్లో ఎలాంటి క్యూలు ఉండేవికావు. ⇒మహాద్వారం నుండే గర్భాలయం వరకు వెళ్లేవారు. స్వామిని తనివితీరా దర్శించుకునేవారు. అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రమైన మంచు, చలి ఉండేవి. అందుకే సూర్యుడు కనిపించే సమయంలోనే ఆలయాన్ని తెరిచి ఉంచేవారు. ఘాట్రోడ్ల నిర్మాణంతోనే భక్తుల పెరుగుదల ⇒ఈ పరిస్థితులలో మద్రాసు ఉమ్మడి రాష్ట్ర బ్రిటిష్ గవర్నర్ సర్ ఆర్థ్థర్ హూప్ నేతృత్వంలో ప్రముఖ భారతీయ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘాట్రోడ్కు రూపకల్పన చేశారు.⇒1944 ఏప్రిల్ 10న మొదటి ఘాట్రోడ్డు ప్రారంభమైంది. తొలుత ఎడ్లబండ్లు, తర్వాత నల్లరంగు బుడ్డ బస్సులు (చిన్న బస్సులు) ఈ మొదటి ఘాట్రోడ్డులోనే తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. దీంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ⇒1951 నవంబర్ నెల మొత్తానికి కలిపి శ్రీవారి దర్శనానికి దేవస్థానం బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య 27,938 మంది, 1953, ఏప్రిల్లో 52,014 మంది మాత్రమే. ⇒1961, నవంబర్ మొత్తంగా తిరుమల ఘాట్రోడ్డులో 1,986 కార్లు, బస్సులు, 81 మోటారు సైకిళ్లు తిరిగాయి.⇒తర్వాత 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్రోడ్డుతో తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు మరింత మెరుగుపడ్డాయి.⇒ప్రయాణ సమయం తగ్గింది. నునుపైన తారు, సిమెంట్ రోడ్లు అందుబాటులోకి రావటం, వాటిపై వాహనాలు రివ్వున తిరగటంతో తిరుమలేశుని దర్శించే భక్తుల రాక క్రమంగా పెరుగుతూ వచ్చింది.⇒రెండో ఘాట్రోడ్డు అందుబాటులోకి రావటంతో రోజుకు పదివేల మంది భక్తులు పెరిగారు. టీటీ డీ రవాణా సంస్థ వాహనాల బదులు 10.8.1975 నుండి రెండు ఘాట్రోడ్లపై ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరగటంతో భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 500 ఆర్టీసీ బస్సులు, రోజుకు 3,200 ట్రిప్పులు సాగిస్తూ.. బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. నాడు నిమిషాల్లోనే దర్శనం.. నేడు రోజు పైబడి...∙1933 నుంచి 1970కి ముందు వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు.⇒మొదటి ఘాట్రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 5 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండవ ఘాట్రోడ్డు వచ్చేనాటికి ఈ సంఖ్య రోజుకు సుమారు 10 వేలకు పెరిగింది. ⇒తిరుమలలో పాతపుష్కరిణి కాంప్లెక్స్ నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. దీంతో 1990 నాటికి రోజుకు 20 నుంచి 25 వేలు, 1995కు 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు పెరిగింది.⇒2003 నాటికి రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు. క్యూలైన్లు పెరిగాయి. భక్తుల నిరీక్షణ సమయం రెండు రోజులకు పెరిగింది. 2010 నాటికి రోజువారీ భక్తుల సంఖ్య 60 వేలకు చేరింది.⇒ఇలా 2010 సంవత్సరంలో మొత్తం 2.14 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2011లో 2.43 కోట్లు, 2012లో 2.73 కోట్లు, 2013లో ఈ సంఖ్య 1.96 కోట్లు (సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం), 2014లో 2.26 కోట్లు, 2015లో 2.46 కోట్లు, 2016లో 2.66 కోట్లమంది భక్తులు వచ్చారు. ⇒ఇక ఈ యేడాది 8 నెలలకే సుమారు 2 కోట్లకు చేరగా, ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.⇒స్వామి దర్శనానికి రోజువారీగా పోటెత్తే భక్తులకు ఈ రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 64 కంపార్ట్మెంట్లు చాలటం లేదు. శుక్ర, శని, ఆదివారాల్లో కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో భక్తులు నిరీక్షించటం రివాజుగా మారింది. ⇒పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు రోజుల తరబడి తిరుమలలో నిరీక్షించకుండా 2000 సంవత్సరంలో దర్శనానికి సుదర్శనం కంకణ విధానం, ఆన్లైన్ రిజర్వేషన్ పద్ధతికి రూపకల్పన చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఈ–దర్శన్ కౌంటర్ల ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జితసేవా టికెట్ల కేటాయింపును చేపట్టారు. 2009వ సంవత్సరం నుండి ప్రవాస భారతీయులకు, ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డతోపాటు వారి తల్లిదండ్రులను ‘సుపథం’ ద్వారా అనుమతిస్తున్నారు. ⇒2010వ సంవత్సరంలో అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో నడచి వచ్చే భక్తులకు దివ్య దర్శనం (ప్రస్తుతం టైమ్ స్లాట్ విధానం) ఆరంభించారు.⇒అదే ఏడాదే ఎటువంటి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా టికెట్లు కొనుగోలు చేసేవిధంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆరంభించారు. ప్రస్తుతం ఆ¯Œ లైన్ టైంస్లాట్లో మాత్రమే టికెట్ల అమ్మకం చేస్తున్నారు. ⇒ఆలయ మహద్వారం నుండి (పస్తుతం దక్షిణ మాడవీ«థి నుండి) వికలాంగులు, 65 ఏళ్ల వయసు నిండిన వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులను అనుమతించారు.⇒ఇక సిఫారసులతో రూ.500 టికెట్ల వీఐపీ దర్శనాలు, అన్ని రకాల ఆర్జితసేవా టికెట్లతో ప్రత్యేక దర్శనాలు.. ఇలా అన్ని కేటగిరీల్లోని భక్తులకు ఏదో రూపంలో సుమారు పది రకాలకు పైగా దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది. కోనేటిరాయని కునుకు పదినిమిషాలే! ⇒మహంతుల కాలం (1843 నుంచి 1933)లో తిరుమల ఆలయంలో గర్భాలయ దివ్యమంగళ మూర్తికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. నిత్య ఏకాంత కైంకర్యాలన్నీ నిర్ణీత వేళల్లో సంపూర్ణంగా జరిగేవి.⇒2000వ సంవత్సరం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయి పట్టుమని పదినిమిషాలు కూడా స్వామికి విశ్రాంతి లభించటం లేదు. ⇒ఇక తప్పని పరిస్థితుల్లో లాంఛనంగా తలుపులు వేసి మమ అనిపిస్తున్నారు. ఆగమం ప్రకారం ఆరు గంటలు విరామం, ఏకాంత కైంకర్యాలుండాలి⇒వైఖానస ఆగమం ప్రకారం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి కనిçష్ఠంగా 6 గంటలపాటు విరామం ఉండాలి. అదే స్థాయిలోనే స్వామికి ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి ఏకాంత కైంకర్యాలు ఉండాలని పండితులు చెబుతున్నారు.⇒ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. 24 గంటల్లో కేవలం 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామివారి కైంకర్యాలకు కేటాయిస్తున్నారు. మిగిలిన 20 గంటలపాటు వివిధ రకాల పేర్లతో టికెట్లు కేటాయించి దర్శనం అమలు చేస్తున్నారు. ⇒ఇక నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ పేరుతో పట్టుమని పది నిమిషాలు కూడా స్వామికి విరామం ఇవ్వటం లేదు. ఏకధాటిగా 22 గంటలపాటు స్వామి దర్శనం సాగించే పరిస్థితులు పెరిగాయి. అర్ధరాత్రి దాటాక ఏకాంత సేవ, ఆ వెంటనే సుప్రభాతం నిర్వహిస్తూ స్వామి కైంకర్యాలు నిర్వహించే పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి టీటీడీ అధికారులు చెబుతున్న ప్రధాన కారణం ఒక్కటే. భక్తుల రద్దీ...రద్దీ.. భక్తుల రద్దీకి తగ్గట్టు స్వామి దర్శనం కల్పించవలసిన బాధ్యత ఎంత మేరకు ఉందో, పూర్వం నుండి ఆగమోక్తంగా అమలు చేసే స్వామి కైంకర్యాల్లో కోత విధించటం, స్వామికి విరామం లేకుండా చేయటం సమాజ శ్రేయస్కరం కాదని ఆగమ పండితుల హెచ్చరికల్ని కూడా దేవస్థానం అధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి!! -
Tirumala: తిరుమలలో అదృశ్య ఆలయం!
పచ్చని తోరణాలు, చుట్టూ ఎతైన పర్వతాలు– నలువైపులా ఎటు చూసినా ప్రకృతి రమణీయత. దైవకళ ఉట్టిపడేలా నిత్యం గోవింద నామ సంకీర్తన. స్వామివారి వైభవాన్ని చాటే ఆనంద నిలయం తిరుమల. అందుకే మహర్షులు, పురాణేతిహాసాలు పేర్కొన్నట్లుగా సకల సృష్టిలో వేంకటాచల పర్వతాన్ని మించిన పర్వతం మరొకటి లేదు. ఆపద మొక్కులవాడు, అభయప్రదాత అయిన శ్రీవేంకటేశ్వరుడు అర్చావతార మూర్తిగా కలియుగంలో ఆనంద నిలయంలో కొలువై ఉన్నాడు. సామాన్య మానవులు ఇదే ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారిని కొలుచుకుంటూ ఉంటారు. అయితే, దేవతలు, రుషుల కోసం స్వామివారు మరో ఆలయాన్ని తిరుమలపై నిర్మించుకున్నారట! సకల దేవతల నిలయమైన ఈ ఆలయానికి దేవతలు, మహర్షులు వస్తుంటారట! బ్రహ్మాది దేవతలు, సప్తర్షులు, అష్టదిక్పాలకులు ఈ కలియుగంలో శ్రీమహావిష్ణువు ధరించిన శ్రీ శ్రీనివాసుని అవతారాన్ని దర్శించి, సేవించి తరిస్తుంటారట! స్వయంభూ మన్వంతర కాలంలో ఆది కృతయుగంలో శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి శ్రీదేవీ భూదేవీ సమేతంగా వచ్చి ఇక్కడ వెలశాడట! శ్వేతవరాహ కల్పం చివరి వరకు ఇక్కడే ఉంటానని శ్రీవారు దేవతలకు చెప్పారట! స్వామివారి ఆదేశంపై దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన ఈ ఆలయం అదృశ్యంగా ఉందని, స్వామివారు ఈ ఆలయంలో సజీవంగా సకల సేవలను అందుకుంటున్నారని శ్రీ వేంకటాచల మహాత్మ్యం చెబుతోంది. భౌతిక జీవితాలను గడిపే మానవమాత్రులకు ఈ ఆలయం గోచరించదని స్థలపురాణం చెబుతుంది. -
స్వామివారి పాదాల కింద విరాజిల్లిన విరజానది
స్వామివారి పాదాల కింద ప్రవహించే విరజానది ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరజానది అంటారు. వైకుంఠంలోని ఈ దేవనది స్వామి పాదాల కింద ప్రవహిస్తోందంటారు. నదిలో కొంత భాగాన్నే బావి అంటారు. దీన్ని చతురస్రాకారంలో చెక్కిన రాళ్ళతో నిర్మించారు. రాళ్లపై నాలుగు అంచుల్లో వానరులతో కలిసి ఉన్న సీతారామలక్ష్మణులు, హనుమంత, సుగ్రీవులు, కాళీయమర్దనంలో శ్రీకృష్ణుని వేడుకుంటున్న నాగకన్యలు, ఏనుగును అదిలిస్తున్న వేంకటేశ్వరుడు, గరుడుని బొమ్మలు మలిచారు. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు బొమ్మలబావిగా పిలుస్తుంటారు.స్వామి పవిత్ర నిర్మాల్యం పూలబావికే సొంతం అద్దాల మండపానికి ఉత్తర దిశలో ఈ పూల బావి ఉంది. స్వామికి సమర్పించిన తులసి, పుష్ప, పూమాలలను ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు. అందుకే ఆ పవిత్రమైన నిర్మాల్యాన్ని ఎవ్వరూ తిరిగి వాడకుండా ఈ పూలబావిలో వేస్తారు. స్వామికి నివేదించిన అన్ని రకాల నిర్మాల్యం పూలబావి తన ఉదరంలో దాచుకుంటుందని అర్చకులు చెబుతారు. అందుకే దీనికి పూలబావిగా నామం సార్థకమైంది. దీనినే భూ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోవడంతో శ్రీనివాసుని ఆదేశంతో రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం పునరుజ్జీవం పొందిందని చెబుతారు. రంగదాసు మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి స్వామిని సేవించారని పురాణాల కథనం. అభిషేక సేవకు బంగారుబావి నీళ్లువకుళమాత కొలువైన పోటు(వంటశాల) పక్కనే బంగారు బావి ఉంది. స్వామి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపలకు వచ్చిన భక్తులకు ఎదురుగానే ఈ బంగారుబావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్నే వాడతారు. బావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో వర నిర్మించారు. దీనికి బంగారు తాపడం చేసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీతీర్థం, సుందర తీర్థం, లక్ష్మీ తీర్థం అని కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి వంట కోసం మహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారట! త్రైలోక్య దుర్లభాలుశ్రీవారి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శన భాగ్యం, కటాహ తీర్థపానం... ఈ మూడు త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. కటాహ తీర్థం శ్రీవారి హుండీకి వెలుపల ఆనుకుని తొట్టిమాదిరిగా ఎడమ దిక్కున ఉంది. దీన్ని తొట్టి తీర్థమని కూడా అంటారు. స్వామి పాదాల నుండి వచ్చే అభిషేకతీర్థం ఇది. ఈ తీర్థాన్ని స్వీకరించినప్పుడు అష్టాక్షరి లేదా కేశవాది నామాలు లేదా శ్రీవేంకటేశుని నామాలు ఉచ్చరిస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతారు.మోక్షప్రాప్తి కలిగించే పుష్కరిణి పుణ్యస్నానంబ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. శ్రీమహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుండి క్రీడాద్రితోపాటు పుష్కరిణిని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానమాచరించడం వల్ల సకల పాపాలు తొలగి ఇహంలో సుఖ శాంతులతోపాటు పరలోకంలో మోక్షమూ సిద్ధిస్తుందని నమ్మకం. ప్రతి యేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే ఇందులో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.పుష్కరిణిలో ప్రాచుర్యంలోని తొమ్మిది తీర్థాలుముక్కోటి తీర్థాల సమాహారమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ప్రధానంగా తొమ్మిది తీర్థాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. అవి: మార్కండేయ తీర్థం (పూర్వ భాగం), ఆగ్నేయ తీర్థం (ఆగ్నేయ భాగం), యమ తీర్థం (దక్షిణ భాగం), వసిష్ట తీర్థం (నైరుతి), వరుణ తీర్థం (పడమర), వాయు తీర్థం (వాయు భాగం), ధనద తీర్థం (ఉత్తర భాగం), గాలవ తీర్థం (ఈశాన్యం), సరస్వతీ తీర్థం(మధ్య భాగం). «పూర్వం శంఖనుడు అనే రాజు స్వామివారి పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించడం వల్ల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాడట! దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం పొందాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించడంతో వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించి పోగొట్టుకున్నాడట! ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగ రుగ్మతలు పోగొట్టుకుని, భోగభాగ్యాలు సంపాదించుకున్నారని పెద్దలు చెప్పే మాట! -
Tirumala: ఆనంద నిలయం అఖండ తేజోమయం
తనమీద అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని వీడిన విష్ణుమూర్తి భూలోక వైకుంఠమైన వేంకటాచల క్షేత్రానికి విచ్చేశాడు. అక్కడ స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తిగా వెలసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు. స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం. గర్భాలయంపై నిర్మించిన బంగారు గోపురమే ‘ఆనంద నిలయ విమానం’గా ప్రసిద్ధి పొందింది.⇒ శ్రీవేంకటేశ్వరస్వామి వారు గర్భాలయంలో ‘ఉపధ్యక’ అనే పవిత్రస్థానంలో కొలువై నిత్యపూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో మూడు విగ్రహాలుంటాయి. వాటినే ధ్రువమూర్తి, మూలమూర్తి, మూలవిరాట్టుగా కొలుస్తారు. యోగ, భోగ, విరహ రూపాలతోపాటు ‘వీర స్థానక’ విధానంలో నిలబడిన స్వామి ముగ్ధమనోహరంగా ప్రకాశిస్తాడు. స్థిరంగా ఉంటాడు. ఈ విగ్రహాన్నే ఆగమ పరిభాషలో ధ్రువబేరంగా సంబోధిస్తారు. ⇒ సుప్రభాతంతో వేకువజామున 2.30 గంటలకు స్వామిసేవను ప్రారంభించి, తిరిగి రాత్రి 12.30 గంటలకు జోలపాటతో నిద్రపుచ్చుతారు. వైఖానస ఆగమబద్ధంగా తోమాల, అర్చన, కొలువు ఇతర నిత్యసేవా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో మూడుపూటలా అన్నప్రసాదాలు, పిండి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తూ అర్చకులు లోకకల్యాణం కోసం శరణు వేడుతారు. ⇒ పుష్పకైంకర్యంలో భాగంగా సాలగ్రామ హారాలు, శిఖామణి, శంఖుచక్రం, శ్రీదేవి, భూదేవి కంఠహారాలు, అలంకార బిట్లు, 25 రకాల పూలకుచ్చులతో కూడిన సువాసనలు వెదజల్లే పుష్పాలతో స్వామిని అలంకరిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పుష్పకైంకర్యాలు చేస్తారు. నిత్య దిట్టం కింద 300 కేజీల పుష్పాలు వాడతారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలు, ఆస్థాన కార్యక్రమాల కోసం 10 నుంచి 20 టన్నుల వరకు పుష్పాలు వినియోగిస్తారు. ⇒ తననే శరణు వేడండంటూ కటి, వరదహస్తాలతో స్వామి తన పాదపద్మాలను చూపిస్తూ భక్తులకు హెచ్చరికతో కూడిన హితబోధ చేస్తూ దర్శనమిస్తుంటారు. అలాంటి దివ్యమైన బంగారు పాదాలను నిత్యం పుష్పాలు, తులసి సేవిస్తుంటాయి. వేకువజాము సుప్రభాత దర్శనంలో మాత్రమే తులసి, పుష్పాలు లేకుండా దర్శించవచ్చు. ఇక శుక్రవారం అభిషేకం, ఆ తర్వాత దర్శన సమయంలో మాత్రమే బంగారు పాద తొడుగులు లేకుండా స్వామి పాద పద్మాలు (నిజపాద సేవలో) దర్శించవచ్చు. ⇒ ప్రతి రోజూ నిత్యకట్ల అలంకారంలో 120 రకాల ఆభరణాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలు, పర్వదినాల్లో ప్రత్యేక అలంకారాలు చేసేందుకు అదనంగా ఆభరణాలు వాడతారు. రోజూ చేసే అలంకారాన్ని నిత్య కట్ల అలంకారమని, పండుగలు, ఉత్సవాలు, ప్రముఖుల రాక సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారమని అంటారు. స్వామికి వజ్రకిరీటం, శంఖ, చక్ర, వరద హస్తాలు, ప్రత్యేక ఆభరణాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. ⇒ శ్రీ స్వామి, ఉత్సవమూర్తుల అలంకరణలకు వాడే కిరీటాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, ఇతర నిల్వలు దాదాపుగా 11 టన్నులు ఉంటాయి. వీటితోపాటు వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాల నగలు కూడా ఉన్నాయి. ⇒ ఆకాశరాజు కిరీటం, వేంకటాద్రిని పాలించిన రాజులు, బ్రిటిష్ పాలకులు, మహంతులు, భక్తులు సమర్పించే కానుకల వివరాలను నమోదు చేసేందుకు టీటీడీ 19 తిరువాభరణ రిజిస్టర్లు నిర్వహిస్తోంది. ⇒ శుక్రవారం అభిషేకం తర్వాత స్వామికి ఊర్ధ్వపుండ్రాలు (తిరునామం) సమర్పిస్తారు. దీనినే ‘తిరుమామణికాపు’ అంటారు. ఇందుకోసం 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరి సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భాల్లో తిరుమామణికి వాడే ద్రవ్యాలు రెట్టింపు స్థాయిలో వాడతారు. ⇒ అభిషేకం తర్వాత మూలమూర్తికి అంతరీయం (ధోవతి)గా 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగా ధరింప చేస్తారు. ⇒ విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ఇతర సామాజ్య్రాలపై దండయాత్రకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ స్వామివారిని దర్శించుకునేవారు. ఆ సందర్భంగా విలువైన ఆభరణాలు, కిరీటాలు, ఖడ్గాలను బహూకరించారు. మలయప్పకు అలంకరించే గుండ్రని కిరీటం, మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక ఉత్సవాల్లో ఎదపై అలంకరించే పెద్ద పచ్చ రాయలు సమర్పించినవే. ⇒ ఆలయంలోని జయవిజయలు ఉన్న బంగారువాకిలి దాటుకున్న తర్వాత రాములవారి మేడలో ఉండే రహస్య అలమరాలో శ్రీవారికి వినియోగించే ఆభరణాలు భద్రపరుస్తారు. వీటిని ఆలయ డిప్యూటీ ఈవో, పేష్కార్ పర్యవేక్షిస్తారు. ఏ రోజు, ఏ ఉత్సవంలో ఏయే ఆభరణాలు అవసరమో అర్చకుల సూచన మేరకు వాటిని సమకూరుస్తారు. ⇒ శ్రీవారి ఆలయంలో గర్భాలయ మూలమూర్తితోపాటు భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, ఉగ్ర శ్రీనివాసుడు కొలువై ఉన్నారు.⇒ పంచమూర్తులే కాకుండా సుదర్శన చక్రత్తాళ్వార్, సీతారామ లక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు వంటి పంచలోహ మూర్తులు కూడా గర్భాలయంలోనే కొలువై ఉన్నారు. ఇక్కడే దేవతామూర్తులతోపాటు పవిత్ర సాలగ్రామాలు కూడా నిత్య పూజలందుకుంటున్నాయి.∙గర్భాలయానికి ఆగ్నేయం, ఈశాన్య దిశల్లో అటు ఇటుగా ‘బ్రహ్మ అఖండం’ నిత్యదీపారాధన వెలుగుతూనే ఉంటుంది. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ దీపాలను వెలిగించాడని విశ్వాసం.∙రాత్రి పవళింపు సేవ చివరి సమయంలో బంగారు నవారు పట్టె మంచంపై ‘మనవాళ పెరుమాళ్’ (భోగశ్రీనివాసుడు) వేంచేపు చేస్తారు. అదే సమయంలోని గర్భాలయ మూలమూర్తికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి ‘ముత్యాల హారతి’ మంగళ కర్పూర నీరాజనం సమర్పిస్తారు. ∙తెలుగు నూతన సంవత్సరాధి పర్వదినమైన ఉగాది (మార్చి/ఏప్రిల్), ఆణివార ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం (సెప్టెంబరు/అక్టోబరు), వైకుంఠ ఏకాదశి (డిసెంబరు/జనవరి) పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహిస్తారు. ∙కోయిల్ ఆళ్వారు తిరుమంజనం రోజున ఆనంద నిలయం నుంచి మహాద్వారం వరకు శుద్ధ జలంతో శుద్ధి చేస్తారు. ఈ క్రమంలో నీరు, దుమ్ము, ధూళి పడకుండా ఉండేందుకు మూలమూర్తి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళ వస్త్రాన్ని కప్పుతారు. ఈ వస్త్రాన్నే ‘మలైగుడారం’ అని అంటారు. తిరుమంజన సేవలు పూరి ్తకాగానే కురాళం అనే దీర్ఘచతురస్రాకారపు మఖమల్ వస్త్రాన్ని పైకప్పునకు కడతారు.∙గర్భాలయంలో కేవలం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పునకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. ∙తిరుమంజనానికి ముందురోజే ఎక్కువ మోతాదులో నామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారు చేస్తారు. భారీ గంగాళాల్లో సిద్ధం చేసిన ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనంగా పూస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు క్రిమికీటకాలు ఉండకుండా ప్రాకారం పటిష్ఠతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. నిత్యం సుప్రభాతసేవలో స్వామికి గోక్షీర సేవనం, నవనీత హారతి ఇస్తారు. అప్పుడే పితికిన గోవుపాలు, అప్పుడే తీసిన వెన్న, పచ్చకర్పూరపు తాంబూలంతో కూడిన పళ్లెరంతో హాథీరామ్ మఠం మహంతుల సన్యాసి/బైరాగి ఆలయానికి సమర్పించగా హాథీరామ్ మహంతు పేరుతో అర్చకులు ఈ కైంకర్యాలు నిర్వహిస్తారు. -
మాడవీథుల ప్రాశస్త్యం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి ఆలయం 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. స్వామివారి ఆలయం పక్కనే వున్న పుష్కరిణి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అటు తర్వాత లడ్డు కౌంటర్లు, బూందీ కౌంటరు, లడ్డు తయారీ కేంద్రం వంటివి రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండగా వరాహస్వామి ఆలయం మిగిలిన ప్రాంతం కలుపుకొని దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ మాడవీథులు ఏర్పడ్డాయి. తూర్పు మాడవీథి 750 అడుగుల పొడవున; దక్షిణ, ఉత్తర మాడ వీథులు ఎనిమిది వందల అడుగుల పొడవున; పడమటి మాడవీథి 900 అడుగుల పొడవున ఉంటాయి. శ్రీవారి ఆలయం చుట్టూ ఏర్పడిన ఈ మాడవీథులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు తన ఉభయ దేవేరులతో నిత్యం తిరుగాడే ప్రాంతం మాడవీ«థులు. గతంలో వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే స్వామివారి వాహన సేవలు నిర్వహించేవారు. దీనితో మాడవీథుల్లో ఏడాదికి తొమ్మిది రోజులు పాటు మాత్రమే స్వామివారి ఊరేగింపు నిర్వహించేవారు. ఆ తర్వాత వీ«థి ఉత్సవం పేరుతో స్వామివారు నిత్యం మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చేవారు. సహస్ర దీపాలంకరణ సేవను ఆలయం వెలుపలకు మార్చిన తర్వాత ప్రతినిత్యం స్వామివారు దీపాలంకరణ సేవ పూర్తయ్యాక మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఇలా మాడ వీథుల్లో నిత్యం స్వామివారి సంచారం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతుంది.మాడవీ«థుల చుట్టూ ఉన్న నిర్మాణాలను భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2004 నాటికి పూర్తిగా తొలగించి, గ్యాలరీల నిర్మాణం చేపట్టింది. దీనితో మాడవీథుల ఆధునికీకరణ కూడా చేపట్టింది. మాడవీ«థుల్లో భక్తుల తాకిడి పెరుగుతూ రావడంతో 1970 నుంచి టీటీడీ మాడవీ«థులలో ఆంక్షలు విధించడం ప్రారంభించింది. గతంలో వీవీఐపీలు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సమయంలో దక్షిణ మాడవీ«థి గుండా ఆలయం ముందు వరకు వారి వాహనంలోనే చేరుకునేవారు. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం వరకు వాహనంలో విచ్చేసే వీవీఐపీలకు అక్కడి నుంచి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికేవారు. భక్తుల సౌకర్యార్థం అప్పటి ఈవో చంద్రమౌళీశ్వర్ రెడ్డి 1970 ఫిబ్రవరి 22 నుంచి మాడవీ«థులలోకి వాహనాల అనుమతిని నిలిపివేశారు. వీఐపీల కోసం ఆలయం ఎదురుగా టీటీడీ మరో రోడ్డు నిర్మాణం చేపట్టింది. 1996 నుంచి ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వీవీఐపీలు ఈ మార్గం గుండానే మాడవీ«థుల వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, వాహనాలను మాడవీథులలోకి అనుమతించరు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వ్యక్తులు అయినా కూడా బ్యాటరీ వాహనాల ద్వారానే ప్రయాణం చేయవలసి ఉంటుంది. మాడవీథుల్లో భక్తులు పాదరక్షలు ధరించకుండా టీటీడీ 2007 నుంచి నిబంధనలను అమలు చేసింది. నిత్యం స్వామివారి వాహన ఊరేగింపులు జరిగే మాడవీ«థులను అంతే పవిత్రంగా చూడవలసిన బాధ్యత భక్తులపై కూడా ఉందంటూ ఈ నిబంధనలను టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది.∙ -
ఆపదమొక్కులతో తొలగేను చిక్కులు
దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరునికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తూ భక్తితో శరణు కోరుతుంటారు. భక్తి తత్పరులు, కోర్కెలు నెరవేరినవారు, కోర్కెలు నెరవేరాల్సిన వారు ఆపదమొక్కులవాడికి ఎన్నోరకాల మొక్కులు చెల్లిస్తారు. ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించేందుకు నిర్ణీతకాలంలో ప్రత్యేకంగా దీక్షా మార్గాన్ని ఎంచుకుంటారు. భూ శయనం, బ్రహ్మచర్య దీక్ష, ఏకభుక్తం వంటి నియమాలతో తల వెంట్రుకలు తీయకుండా దీక్షను చేపడతారు. పూర్తికాగానే కాలినడకన యాత్రగా తిరుమలకు చేరుకుంటారు. భక్తిశ్రద్ధ్దలతో తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. దివ్యమైన కాలినడకకోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తొలుత చేసేది... నడచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే. కొందరు మోకాళ్లతో, మరికొందరు పొర్లుదండాలతో ఎక్కుతూ మొక్కులు చెల్లిస్తుంటారు. ఇంకొందరు మెట్టు మెట్టుకూ పూజలు, మరికొందరు ప్రతిమెట్టుకూ çపసుపు, కుంకుమ పూసి, కర్పూరం వెలిగిస్తే, మరి కొందరు కొబ్బరికాయలు కొడుతూ తిరుమల కొండెక్కుతారు. రోడ్డు, వాహన సదుపాయాలు లేనిరోజుల్లో కాలిబాటే తిరుమలకు ఏకైక మార్గం. అధునాతనమైన రెండు ఘాట్రోడ్లు ఏర్పడి రోజుకు పదివేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా తిరుమలకు నడిచివెళ్లే భక్తుల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోందంటే ఈ మొక్కుపై భక్తులకు ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో 15 వేలు, సెలవు రోజులు, ఉత్సవాల రోజుల్లో 40 వేల మంది వరకు భక్తులు కాలినడకన కొండెక్కుతున్నారు.‘తల’ నీలాల సమర్పణవెంకన్న మొక్కులో తలనీలాల మొక్కు అత్యంత ప్రధానమైంది. అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా భక్తులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. క్రీ.శ.1830కు ముందు నుండే తలనీలాలు మొక్కుగా చెల్లించే ఆచారం ఉన్నట్టు శాసనాధారం. పుష్కరిణి పుణ్యస్నానం భక్తుల మొక్కులలో పరమ పవిత్రమైంది పుష్కరిణీ స్నానం. బ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానం ఆచరించడంతో సర్వపాపాలు తొలగి, మోక్షం సిద్ధి్దస్తుంది. ప్రతియేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే, ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. వరాహస్వామి దర్శనంతిరుమల క్షేత్రంలో ఆదిదైవం శ్రీ వరాహస్వామి. అందుకే ఈ పుణ్యతీర్థాన్ని ఆది వరాహ క్షేత్రమని పిలుస్తుంటారు. వైకుంఠం వదిలి భూలోకం వచ్చిన శ్రీనివాసునికి వరాహస్వామివారే స్థలాన్ని ప్రసాదించారు. దీనికి ప్రతిఫలంగా భక్తుల తొలి దర్శనాన్ని వరాహస్వామి పొందారు. దానితోపాటు తొలిపూజ, తొలినైవేద్యం వరాహస్వామికే! సామాన్య భక్తుడి నుండి ప్రముఖుల వరకు తొలుత వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీన్ని కొనసాగిస్తేనే ఫుణ్యఫలం దక్కుతుంది. తులా ‘భారం’.. నిలువుదోపిడీ తిరుమలేశునికి భక్తులు తులాభార రూపంలో చిల్లర, బెల్లం, పటిక బెల్లంతో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు ముడుపుల రూపంలో పోగుచేసిన నగదును హుండీలో సమర్పిస్తారు. వెంకన్నను కొలిచే భక్తుల్లో దాదాపుగా పుట్టిన ప్రతి బిడ్డనూ ఏదో ఒక సందర్భంలో స్వామివారికి ఏదో ఒక రూపంలో తులాభారం సమర్పించి మొక్కులు చెల్లిస్తుంటారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అ«ధికారులు కూడా తులాభారం సమర్పిస్తుంటారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి నిలువుదోపిడీ రూపంలో తాము ధరించిన ఆభరణాలన్నిటినీ హుండీలో సమర్పిస్తారు. వెంట తీసుకొచ్చిన నగదు, ఇతర కానుకల్ని కూడా సమర్పిస్తారు. -
రుచి.. శుచి... వెంకన్న నైవేద్యం
తిరుమలేశుడు భక్త సులభుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా! అందుకే ఆయన ప్రసాదాలు ప్రత్యేకం. తిరుమలేశుని ప్రసాదం అంటే కేవలం లడ్డు, వడలే కాదు.. దోసెలు, పోలి (పూర్ణం భక్ష్యాలు), జిలేబి, తేనెతొల, సుఖియం, అప్పం, కేసరిబాత్, పాయసం, సీరా వంటివెన్నో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాల రుచి, నాణ్యత మరెక్కడా లభించవు.మూలమూర్తికి మూడు సార్లు నైవేద్యం గర్భాలయ మూలమూర్తికి రోజుకు మూడుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 5 తర్వాత మొదటిగంటలో ఒకసారి, ఉదయం 10 గంటల్లోపే (మధ్యాహ్న నైవేద్యం అంటారు) మరోసారి, రాత్రి 7 గంటలకు ఒకసారి ప్రసాద సమర్పణ ఉంటుంది.మాతృ దధ్యోదనమంటే స్వామికి మహా ఇష్టం. కులశేఖరపడి దాటుకుని గర్భాలయంలోకి వెళ్లేది చిక్కటి మీగడతో కూడిన ‘మాతృదధ్యోదనం’ మాత్రమే. అది కూడా సగం పగిలిన కొత్త మట్టి ఓడులోనే పెడతారు. చివరగా ఏకాంత సేవ సమయంలో వివిధ ఫలాలు, చక్కెర, తేనెతో తయారు చేసిన ‘మేవా’, చక్కెర, జీడిపప్పు, బాదంపలుకులు, ఎండుద్రాక్ష, ఏలకులు, గసగసాలు, ఎండుకొబ్బరి ముక్కలతో తయారు చేసిన ‘పంచకజ్జాయం’, చక్కెరతో కలిపిన వేడిపాలను నివేదిస్తారు. వకుళ మాత సమక్షంలోనే..! గర్భాలయానికి ఆగ్నేయ మూలలోగల వంటశాల (పోటు)లో కొలువైన శ్రీనివాసుని తల్లి వకుళమాలిక విగ్రహం వద్ద కొంత సమయం ఉంచిన తర్వాతే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ‘గమేకార్లు’(వంట పరిచారకులు) భక్తిశ్రద్ధ్దలతో, శుచిగా పోటులో అన్నప్రసాదాలు వండుతారు.లడ్డు, వడ, అప్పం, దోసె, పోళి, సుఖియం, మురుకు, జిలేబి వంటి పిండి ప్రసాదాలు (పనియారాలు) వెండివాకిలికి బయట సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన ‘పోటుతాయారు’ అమ్మవారి విగ్రహం సమక్షంలో తయారు చేస్తారు. వారపు సేవల్లో భాగంగా సోమవారం విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు, బుధవారం సహస్ర కలశాభిషేకంలో ప్రత్యేకంగా క్షీరాన్నంతోపాటు మిగిలిన అన్నప్రసాదాలు, గురువారం తిరుప్పావడ సేవలో మొత్తం 450 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర, జిలేబీలు, పెద్దమురుకులు (తేనెతొల) నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక శుక్రవారం నాడు పోళీలు(పూర్ణం భక్ష్యాలు), సుఖియం (ఉండ్రాళ్లు), ఆదివారం మాత్రం ‘ఆదివారం ప్రసాదం’ అనే చలిమిడి ప్రసాదాన్ని నివేదిస్తారు. దీనినే అమృత కలశం అంటారు. స్వామి తర్వాత గరుడాళ్వారుకు సమర్పిస్తారు. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామికి దోసెలు, శెనగపప్పుతో తయారు చేసిన శుండలి(గుగ్గిళ్ళు) సమర్పిస్తారు. వీటితోపాటు పెసరపప్పు పణ్ణారం, పానకం కూడా నివేదిస్తారు. ధనుర్మాస వ్రత సమయంలో అన్నప్రసాదాలతోపాటు ప్రత్యేకంగా ‘బెల్లపు దోసె’ను ప్రియంగా ఆరగిస్తాడు స్వామి.అందువల్లే ఆ నాణ్యత, రుచి..!1951వ సంవత్సరంలో ఈ ప్రసాదాల తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ‘దిట్టం’ (కొలత) కొలమానంగా నిర్ణయించింది. తర్వాత పలుమార్లు దిట్టాన్ని సవరించారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తున్నారు. మూడు రుచుల్లో శ్రీవారి లడ్డూలు తిరుపతి లడ్డూలు మూడు రకాలుగా తయారు చేస్తున్నారు. వీటిలో ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డూ.ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలా.. అతిముఖ్యమైన వ్యక్తులు ఆలయాన్ని సందర్శించిన సందర్భాల్లో ఆస్థానం లడ్డూ తయారు చేస్తారు. దీని బరువు 750 గ్రాములు. దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు వేసి ఈ లడ్డూను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. వీటిని గౌరవ అతిథులకు అందజేస్తారు. సామాన్యులకు అంతసులువుగా లభించదు. ఇక స్వామివారి నిత్య కల్యాణోత్సవ సేవలో పాల్గొనే గృహస్తులకు ప్రత్యేకమైన కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా ఇస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే చాలా రుచిగా ఉంటుంది. మూడవది 175 గ్రాముల ప్రోక్తం లడ్డూ. ఇది భక్తులందరికీ లభించే లడ్డూ.దర్శనం తర్వాత వెండివాకిలి దాటుకుని వెలుపలకు వచ్చే భక్తులకు ఉదయం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వివిధ రకాల ప్రసాదాలు వితరణ చేస్తారు. -
ఏటేటా పెరుగుతున్న భక్తజన సందోహం
కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వరుని దర్శనానికి భక్తజన సందోహం ఏటేటా పెరుగుతోంది. గడచిన పదకొండేళ్లలో దాదాపు పాతిక కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఏడాదికి సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఎప్పటికప్పుడు క్యూలైన్లో మార్పులు చేస్తుంది. ఇప్పటికే వైకుంఠం క్యూకాంప్లెక్స్లు ఒకటి, రెండు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడుగా మరో క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది.శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ప్రతినిత్యం విచ్చేస్తుంటారు. పూర్వం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య వందల్లో ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంది. భక్తుల కోసం సౌకర్యాలు పెంచే కొద్ది తిరుమలలో భక్తుల తాకిడి కూడా పెరుగుతూ వస్తోంది. తొలినాళ్లలో తిరుమలకు చేరుకోవడానికి నడక మార్గం మాత్రమే ఉండేది. అప్పట్లో భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. తొలి ఘాట్రోడ్డును టీటీడీ 1943లో నిర్మించింది. క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతూ రావడంతో 1979లో రెండో ఘాట్ రోడ్డును కూడా నిర్మించింది. తిరుమల చేరుకోవడానికి, తిరిగి తిరుపతి చేరుకోవడానికి రెండు రోడ్డు మార్గాలు అందుబాటులోకి రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల మొదలైంది. మొదటి ఘాట్రోడ్డును నిర్మించిన తర్వాత కూడా 1951 నాటికి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజుకు ఆరువందలకు పైచిలుకుగా మాత్రమే ఉండేది. క్రమంగా ఈ సంఖ్య 1961 నాటికి రోజుకు మూడువేలకు పైచిలుకు, 1971 నాటికి రోజుకు తొమ్మిదివేల పైచిలుకు వరకు చేరుకుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 1981 నాటికి గణనీయంగా పెరిగి, రోజుకు ఇరవై ఒక్క వేల పైచిలుకుకు చేరుకుంది. ఆ ఏడాదిలో శ్రీవారిని 79.52 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆ తర్వాత 1991లో తొలిసారిగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి కోటి దాటింది. మరో దశాబ్దం గడిచేసరికి 2001 నాటికి ఈ సంఖ్య రెట్టింపై రెండుకోట్లు దాటింది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 2011లో రోజుకు డెబ్బయివేలకు చేరుకుంటే, ఆ ఏడాది 2.55 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, ‘కోవిడ్’ ప్రభావంతో 2021లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఆ ఏడాది రోజుకు సగటున ఇరవై ఎనిమిదివేల మంది, ఏడాది మొత్తంలో 1.04 కోట్ల మంది మాత్రమే ఆ దేవదేవుని దర్శించుకున్నారు.రద్దీకి అనుగుణంగా మార్పులుతిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఎప్పటికప్పుడు క్యూలైన్ల విధానంలో మార్పులు చేస్తూ వస్తోంది. మొదట్లో భక్తులను మహాద్వారం నుంచి అనుమతించే టీటీడీ, ఆ తర్వాత 1970లలో పీపీ షెడ్లను ఏర్పాటు చేసింది. వరాహస్వామి ఆలయానికి వెనుక వైపున షెడ్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించేది. ఆ తర్వాత 1985లో మొదటి క్యూకాంప్లెక్స్ను అందుబాటులోకి తెచ్చింది. మరో పదహారేళ్లకు 2001లో రెండో క్యూకాంప్లెక్స్ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. అప్పటికీ భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుండటంతో ఏడాదికి దాదాపు 150 రోజుల పాటు భక్తులు కంపార్ట్మెంట్లు దాటి వెలుపల క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో టీటీడీ తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. నారాయణగిరి ఉద్యానవనంలో 2019 నాటికి శాశ్వత ప్రాతిపదికన కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయగా, 2024 నాటికి గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లను ఏర్పాటు చేసింది. ఇలా క్యూలైన్లలోనే 65 వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేసినా, స్వామివారి దర్శనం కోసం భక్తులు 24 గంటలకు పైగా వేచి ఉండే సమయాలు ఏడాదికి వంద రోజులకు పైగానే ఉంటున్నాయి.నిరీక్షణ తగ్గించడానికి చర్యలుశ్రీవారి దర్శనం కోసం భక్తులు నిరీక్షించే సమయాన్ని తగ్గించడానికి దర్శన విధానంలో టీటీడీ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. మొదట్లో భక్తులను శ్రీవారి ఆలయంలోని కులశేఖర పడి వరకు అనుమతించేవారు. దీంతో రోజూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు ఇరవైవేలకు పరిమితం అయ్యేది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి 1983లో టీటీడీ లఘుదర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులను రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతించే ఈ విధానంలో రోజూ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సుమారు నలభైవేలకు చేరుకుంది. భక్తుల తాకిడి మరింత పెరుగుతూ వస్తుండటంతో 2005లో టీటీడీ మహాలఘుదర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులను జయవిజయుల గడప నుంచి దర్శనానికి అనుమతిస్తుండటంతో స్వామివారిని రోజుకు దాదాపు లక్షమంది దర్శించుకునే అవకాశం ఏర్పడింది. తోపులాట లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా 2014లో బంగారు వాకిలిలో మూడో క్యూలైన్ను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత మరిన్ని మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో టీటీడీ అదే విధానాన్ని కొనసాగిస్తోంది. ∙ -
కలియుగ దైవానికి కమనీయ బ్రహ్మోత్సవం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వచ్చి, భూలోక వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువుదీరాడు. కన్యామాసం (చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం) శ్రవణా నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వరస్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి! వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట! ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట! తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి.దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం (చెక్కరథం) బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది.అంకురార్పణతో ఆరంభంశ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత దేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.ధ్వజారోహణంఅంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండమీదే కొలువుదీరి ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.పెద్దశేషవాహనంమొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీథులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. భూభారాన్ని వహించేది శేషుడే! శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.చిన్నశేషవాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీ యోగసిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి.హంస వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించి వేరుచేయగల అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు.సింహ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహాన్ని బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహనసేవలోని అంతరార్థం.ముత్యపుపందిరి వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చల్లని ముత్యాలపందిరి కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.కల్పవృక్ష వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీథుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తమకు కాసిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.సర్వభూపాల వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజు అని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.మోహిని అవతారంబ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు.గరుడ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీథుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళరూప దర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు.హనుమంత వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం అవగతమవుతుంది.స్వర్ణ రథంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది.గజవాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.సూర్యప్రభ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీథుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభవాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్య, సంతాన లాభాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.చంద్రప్రభ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభవాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు విప్పారతాయి. హృదయాలలో ఆనందం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.రథోత్సవంగుర్రాల వంటి ఇంద్రియాలను మనసు అనే కళ్లెంతో అదుపు చేసే విధంగానే, రథం వంటి శరీరాన్ని రౌతు అయిన ఆత్మ ద్వారా అదుపు చేయాలని తత్త్వ జ్ఞానాన్ని స్వామివారు ఎనిమిదో రోజు ఉదయం తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథసేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉందని భక్తుల విశ్వాసంఅశ్వవాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.చక్రస్నానంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.ధ్వజావరోహణంచక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగరవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాలు వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.శ్రీవారి వాహన సేవల వివరాలు 24–09–2025సాయంత్రం 05:43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.25–09–2025ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం26–09–2025ఉదయం 8 గంటలకు సింహ వాహనం మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం27–09–2025ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంమధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం28–09–2025ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి గరుడ వాహనం29–09–2025 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథంరాత్రి 7 గంటలకు గజ వాహనం30–09–2025ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంరాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం01–10–2025ఉదయం 7 గంటలకు రథోత్సవంరాత్రి 7 గంటలకు అశ్వ వాహనం02–10–2025ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం. -
శ్రీవారి ఆలయ చరిత్ర
తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం. ఎన్నో శతాబ్దాలుగా వెలుగొందుతున్న శ్రీవారి ఆలయం వెనుక ఎంతో చరిత్ర, ఎన్నో స్థలపురాణాలు ఉన్నాయి. రాజుల పాలన నుంచి బ్రిటిష్ పాలకుల చేతిలోకి వెళ్లినప్పటికీ, శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోగలిగింది. వాటిని నేటికీ కొనసాగించగలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శేషాచలంలో ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుమల. కలియుగ వైకుంఠంగా పిలుస్తున్న ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడిగా కొలువై కోరిన కోరికలను తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం. బ్రిటిష్ ఈస్టిండియా పాలన నుంచి ప్రత్యేక బోర్డుగా ఏర్పడే వరకు ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో మద్రాసు ప్రభుత్వం ఏడవ రెగ్యులేషన్ ద్వారా 1817లో శ్రీవారి ఆలయాన్ని ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నియంత్రణలోకి తెచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం ‘బ్రూస్ కోడ్’ రూపొందించారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆలయ పరిపాలనను 1843లో హథీరామ్జీ మఠం మహంతులకు అప్పగించింది. అప్పటి నుంచి 1933 వరకు మహంతుల పాలనలోనే ఆలయం విలసిల్లింది.టీటీడీ పాలక మండలి ఏర్పాటుతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటైంది. అంతకు ముందు మహంతుల పాలనలో ఉన్న ఆలయాన్ని ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం 1933లో టీటీడీకి పాలక మండలి పరిధిలోకి తీసుకురావడం వల్ల మహంతుల వ్యవస్థ ముగిసింది. దీంతో పాలనా వ్యవహారాలు అధికారుల చేతిలోకి వెళ్ళాయి. పాలనా వ్యవహారాలు మారినా, సుదీర్ఘకాలం తిరుమల వ్యవహారాలను పర్యవేక్షించిన మహంతులకు నేటికీ ప్రత్యేక గౌరవం కొనసాగుతోంది. హాథీరామ్జీ మఠంతో అనుబంధంఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని క్రేడల్ క్రేల గ్రామంలో రామానంద మఠం ఉండేది. మఠం అధిపతి అభయ్ ఆనంద్జీ శిష్యుడు హాథీరామ్జీ దేశయాత్రలో భాగంగా వెంకటాచలానికి చేరుకున్నాడు. శ్రీవేంకటేశ్వరుడిని అయోధ్య రాముడి అంశగా భావించి, కొలుస్తూ ప్రసన్నం చేసుకునేవాడు. హాథీరామ్జీ భక్తికి ముగ్ధుడైన శ్రీవారు నిత్యం ఆనందనిలయం దాటి ఆలయానికి సమీపంలోనే ఉన్న హాథీరామ్జీ మఠానికి వచ్చి, ఆయనతో పాచికలాడుతూ, భక్తుడిని గెలిపించి, ఆనందపడేవారనే కథలు ఉన్నాయి.తిరుమలలో శ్రీవారి పేరు తరువాత వినిపించే పేరు విష్వక్సేనుడు. టీటీడీ పాలనా వ్యవహారాలు మహంతుల చేతికి ఈస్టిండియా కంపెనీ అప్పగించినప్పటికీ, ఆలయ నిత్యకలాపాల్లో లోటు లేకుండా చేశారు. అదే సమయంలో పాలనా పగ్గాలు చేతికి తీసుకున్న మహంతులు (çహాథీరామ్జీ బాబా వారసులు) తమ పాలన వ్యవహారాలలో విష్వక్సేనుడి అధికార ముద్రను వాడేవారు. మొదటి మహంతు సేవాదాస్ కాలంలోనే శ్రీవారి పుష్కరిణిలో జలకేళీ మండపోత్సవం పేరిట తెప్పోత్సవం ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి మహంతు బాబాజీ పేరుతో సుప్రభాత సేవలో గోక్షీర నివేదన, నవనీత హారతి సమర్పించే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజూ వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీవారికి సంప్రదాయబద్ధంగా హారతి అందిస్తున్నారు.ఆణివార ఆస్థానం వెనుకవందల సంవత్సరాలు కాలంలో కలిసిపోయినా, తిరుమలలో మాత్రం ఆనాటి ఆచార వ్యవహారలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా కొనసాగిస్తున్నారు. అందులో ఒకటి ఆణివార ఆస్థానం కార్యక్రమం. శాస్త్రోక్తంగా నిర్వహించడంలో టీటీడీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తిరుమలలో ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక పెద్ద కథే ఉంది.ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆర్కాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈస్టిండియా కంపెనీ పాలన సాగించింది. దీంతో 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు ఆలయ పాలన హాథీరామ్జీ మఠం మహంతుల పాలనలో సాగింది. తిరుమల ఆలయానికి మొదటి మహంతుగా1843 జూలై 10న మహంత్ సేవాదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆణివార ఆస్థానం రోజే బ్రిటిషర్లు శ్రీవారి ఆలయ ఆస్తులు, ఆభరణాలు, ఉత్సవ మూర్తులు, ఉత్సవర్లకు ఊరేగింపులో వాడే వాహనాలు, నిత్య కైంకర్యాలకు వాడే పురాతన వస్తువులు, రికార్డులు, లెక్కల అప్పగింత జరిగింది.ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తరహా సమీక్ష జరిగేది. టీటీడీ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇది వార్షిక బడ్జెట్గా మారింది. వందల ఏళ్ల నాటి సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూనే, ఆనాటి చరిత్ర మరుగున పడకుండా, మహంతుల పరిపాలనా కాలం నాటి పద్ధతుల్లోనే శ్రీవారికి ఆణివార ఆస్థానం ద్వారా లెక్కలు నివేదించే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. -
ఈ వారం కథ: హృదయ స్పర్శ
‘థాంక్యూ మేడం..! ఐ లవ్ యు మేడం..!!’ కృతజ్ఞతా ప్రేమపూర్వకంగా చెప్పాడు రాజేష్.‘ఇట్స్ ఓకే..!... బట్ లవ్..?! నా కౌన్సెలింగ్తో పూర్తిగా నయమయ్యావు కదా! ఇక జాగ్రత్తగా జీవితాన్ని గడుపు. లవ్ అంటూ మరో మానసిక రోగివి కాకు! సీరియస్గా హితవు చెప్పింది సైకాలజిస్ట్ కోమలి.‘సారీ మేడం..! నా ఉద్దేశం అది కాదు..! అదీ..!’... సంజాయిషీ ఇచ్చుకోబోతుండగా...‘స్టాప్ నాన్సె¯Œ ్స... సారీ ఒకటి..! ఒక అమ్మాయి నాలుగు రోజులు మంచిగా మాట్లాడితే అడ్వాంటేజ్గా తీసుకొని ‘లవ్’... ఆ తర్వాత ఇంకోటి అంటూ వచ్చే మగాళ్ళ తీరు అసహ్యం వేస్తుంది. వృత్తిరీత్యా సన్నిహితంగా ఉంటే, ఈ విధంగా వచ్చే వారి పట్ల ఏ విధంగా ఉండాలో నాకు బాగా తెలుసు. ‘లవ్’ అనే పేరుతో ట్రాప్ చేయాలనుకునే మనస్తత్వం గలవాళ్లను ఒక కౌన్సెలర్గా దూరం పెట్టడమూ తెలుసు.కుదుటపడిన ఆరోగ్యంతో మంచిగా బతుకు. నా ట్రీట్మెంట్ పూర్తయింది. ఇంకెప్పుడూ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. బై!’ అంటూ ఫోన్ పెట్టేసింది కోమలి. ఏదో చెబుదామనుకొని మళ్లీ కాల్ చేయాలని చూస్తే, ఎంతకూ కలవకపోవడంతో తనను బ్లాక్ చేసిందని అర్థమైంది రాజేష్కి.‘ఏమిటి..? ఈ రోజు మూడీగా ఉన్నావు. ఏమైంది..? ఏమంటున్నారు మీ పేషెంట్లు?’ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉన్న కోమలిని అడిగాడు ప్రదీప్.‘ఆ... ఏమీ లేదు లెండి..! కొందరు మగవాళ్లకు తిక్క ఎక్కువైంది. ఎవరైనా అమ్మాయి నాలుగు రోజులు మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళ పైత్యం చూపిస్తున్నారు. రాజేష్ చెప్పిన విషయం ప్రదీప్కి చెప్పింది. ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రదీప్ వెంటనే స్పందిస్తూ, నువ్వు అందరినీ సమదృష్టితో చూడాలని, కౌన్సెలింగ్పరంగా వారికి దగ్గరవుతావు కదా! ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంతకుముందు నీ కౌన్సెలింగ్ తీసుకున్న రాజీవ్, చక్రి, సురేష్.. వీళ్లంతా చివరకు లవ్ ప్రపోజల్ తెచ్చారు కదా! ఇప్పుడు అదే జాబితాలో రాజేష్ చేరాడేమో!? అవునూ! నీ పేషెంట్లను కొందరిని వాయిస్ కాల్లో, మరికొందరిని వీడియో కాల్లో కౌన్సెలింగ్ చేస్తావెందుకని?’ చికిత్స విధానం గురించి ఆరా తీశాడు ప్రదీప్.‘నేను చేసేది మానసిక చికిత్స. అది కూడా కౌన్సెలింగ్ మాత్రమే! వారి మానసిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎంచుకుంటాను. సమస్య పరిష్కారం కావాలి’ తను ప్రత్యేకంగా ఉపయోగించే చికిత్స విధానాన్ని చెప్పింది కోమలి.‘నీ కౌన్సెలింగ్ ఏమో గాని, చివరకు నాకు దక్కకుండా పోతావా ఏంది?’ నవ్వుతూ చురకేశాడు ప్రదీప్.‘నో.. నెవర్..! అంత సీన్ లేదు. ఆ పరిస్థితి నాకు రాదు. ఈ ప్రదీప్కి కాకుండా ఇంకెవరికీ నో చా ఎటాల్! అవతలి వాళ్ళ ఆటిట్యూడ్ ప్రకారం నేను వెళ్తుంటాను. వృత్తిరీత్యా ఇవన్నీ తప్పవండీ..!’‘కొందరికి కౌన్సెలింగ్ ఫీజు కూడా లేకుండా ఉచితంగా సర్వీస్ చేస్తావెందుకని?’‘ఏమండీ..! చెదిరిన వాళ్ల జీవితాలు చక్కబడితే, మానసిక వేదన, ఒత్తిడి నుంచి బయటపడి సాధారణ జీవితంలోకి వస్తే, అంతే చాలు. అదే వెలకట్టలేని ఫీజు. అది కూడా వాళ్ల స్థాయిని బట్టి పోతుంటాను. కొందరికి ఉచితం తప్పదు. అయినా నా రీసెర్చ్ పని కోసం రెండు సంవత్సరాల పాటు కౌన్సెలింగ్ ప్రాక్టీస్కి ఫుల్స్టాప్ పెడుతున్నాను’ అంటూ తన రూమ్లోకి వెళ్లి రీసెర్చ్ బుక్ ముందరేసుకుంది కోమలి.కోమలి.. పేరుకు తగ్గట్టుగానే కోమలంగా ఉంటుంది. మూడేళ్ల కిందట దంపతులైన ప్రదీప్, కోమలి ఇద్దరూ వారి వారి వృత్తులలో బిజీగా ఉంటున్నారు. ప్రదీప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, కౌన్సెలర్గా ఆన్లైన్లో కావాల్సిన వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది కోమలి. ఆమె మాట తీయదనం, సమస్యల పరిష్కార దిశలో ఓ అమ్మలా లాలించడం, సాంత్వన చేకూర్చడంతో మానసికతత్త్వ వికాస నిపుణురాలిగా మంచిపేరు తెచ్చుకొని ఎందరికో నూతన జీవితాలను అందించింది. కాని ‘లవ్’ పేరుతో కొందరి ప్రవర్తనతో విసిగివేసారింది. ఆ మాట అంటేనే హృదయం భగ్గుమంటుంది. లవ్ అంటూ శారీరక వాంఛతో దానిని పూర్తి చేసుకోవాలనుకునే వారిని తప్పిస్తూ, తన వృత్తిని కొత్త చాలెంజ్గా ఎదుర్కొంటూ మంచి కౌన్సెలర్గా రాణిస్తుంది కోమలి. వ్యక్తిగతంగా లవ్ విషయంలో తన జీవితంలో జరిగిన అనేక చేదు అనుభవాలు, మానసిక అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఒక సైకాలజిస్ట్గా తన మనసును దిటవుపరచుకొని, ఇక ‘లవ్’ని దరిచేరనీయకుండా స్ట్రాటజీస్ ఉపయోగించుకుంటూ వృత్తిని విజయవంతంగా కొనసాగిస్తోంది.‘ఏవండీ..! ఈ అసోసియేషన్ వాళ్లు వాచ్మన్ను మార్చారా? కొన్ని రోజులుగా నాగయ్య, లక్ష్మి కనిపించడం లేదు’ అనుమానంగా అడిగింది కోమలి.‘ఆ.. అవును..! వాళ్లు వాళ్ల ఊరు వెళ్లిపోయారట! కొత్త వాచ్మన్ను పెట్టారు..చంద్రయ్య అట!’‘సర్లేండి..! వర్షం వస్తోంది. టాబ్లెట్స్ తేవాలి ఎలా? వాచ్మన్కి చెప్పనా?’‘చెప్పి చూడు కొత్తవాడు కదా! వీలుంటే తెస్తాడేమో!’ఇంటర్ కమ్ నొక్కి కబురు పంపగానే, పరుగు పరుగున రెండవ అంతస్తుకు చేరుకున్నాడు చంద్రయ్య.‘నువ్వేనా కొత్త వాచ్మన్వి? సార్ వర్క్ చేసుకుంటున్నారు. గొడుగేసుకుని వెళ్లి ఈ టాబ్లెట్స్ తెస్తావా?’ మృదువుగా అడిగింది కోమలి .‘అలాగే అమ్మగారూ..!’ పీల గొంతుతో, తలూపి ఆమె ఇచ్చిన ఖాళీ స్ట్రిప్, పైసలు తీసుకుని పది నిమిషాల్లో తిరిగొచ్చాడు చంద్రయ్య.తడిసి వచ్చిన చంద్రయ్యను చూసి‘అదేంటి..? గొడుగు వేసుకొని వెళ్లలేదా పూర్తిగా తడిసిపోయావు’‘గొడుగు లేదమ్మగారూ..!’‘అవును.. నీ పేరేమిటి అన్నావ్..?’‘చంద్రయ్య.. అమ్మగారు’ అంటూ మిగిలిన చిల్లర ఇవ్వబోతుండగా,..‘ఉంచుకో..! టీ తాగు..’ అంది‘వద్దమ్మగారు..’ అంటూ వణుకుతూ వెళుతున్న చంద్రయ్య వైపు జాలిగా చూసింది కోమలి.వర్క్ చేసుకుంటూ ఇదంతా గమనిస్తున్న ప్రదీప్‘తల్లీ..! అతనికేం కౌన్సెలింగ్ అవసరం ఉండదులే..! వదిలేయ్..! నీ మంచితనంతో చస్తున్నా..!’ సరదాగా నవ్వుతూ అన్నాడు ప్రదీప్.‘సహానుభూతి ఉండాలండీ..! మనకు సాయం చేసే వాళ్లకు కనీసం మంచి మాటైనా తిరిగి ఇవ్వకపోతే, మనం మనుషులమే కాదు’ తనలో పురివిప్పిన సైకాలజిస్ట్ మాటలకు చెప్పేదేమీ లేక ‘మరి.. అంతేగా.. అంతేగా..’ అనుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు ప్రదీప్.కాసేపటికి మళ్ళీ ఏదో గుర్తొచ్చి,‘ఇంకో విషయం.. ఈ వాచ్మన్కు భార్య లేదట! రెండేళ్ల కొడుకున్నాడు. వాడితోనే ఇక్కడికి వచ్చాడు. మరి పాత వాచ్మన్ భార్య నీకు అంట్లు, బట్టలు, ఇంటి పని ఆమెనే చేసేది కదా, ఇప్పుడెలా?’ అన్నాడు ప్రదీప్.పనిమనిషి సమస్య ఎప్పుడూ రావణకాష్టమే! ‘ఒకసారి చంద్రయ్యను అడిగి చూద్దాం! ఎవరినైనా కుదురుస్తాడేమో!’ అంది.ఇస్త్రీ బట్టలు పైకి తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చిన చంద్రయ్యను ఇదే విషయం అడిగింది.‘అమ్మా! మీకు అభ్యంతరం లేకపోతే, నేనే అంట్లు, బట్టలు, ఇంటి పని చేస్తాను. చిన్నోడి ఖర్చులకు వెళుతుంది కదమ్మా! మీరు ఎంత ఇచ్చినా పర్లేదు’ బావిలో నుంచి వచ్చినట్లుగా లో గొంతుకతో అన్నాడు.‘అవును..! మా ఇద్దరికీ టైం ఉండదు. ఎంతైనా పనిమనిషి లేనిది వెళ్లదు. ఇంటి పనిలో ఇతనిని పెట్టుకుంటే పదిమంది ఏమైనా అనుకుంటారా? కాని, అతని పిల్లాడి పోషణ ఖర్చుకు పనికొస్తుంది కదా! ఎవరేమైనా అనుకోనీ! అనుకున్న వాళ్లు ఏమీ చేయరు. నా ప్రదీప్ ఓకే అంటే చాలు’ అనుకుంటూ భర్తను ఒప్పించి, ఇంటి పని మొత్తాన్ని చంద్రయ్యకు అప్పగించింది కోమలి.అప్పటì æనుంచి చంద్రయ్య వాళ్ళ కుటుంబంలో ఒకడయ్యాడు. చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏ సమస్య వచ్చినా, అందరికన్నా ముందుండేది అతనే. వాచ్మన్గా డ్యూటీ చేస్తూనే, సమయాన్ని కుదుర్చుకుంటూ కార్ డ్రైవర్గా, సర్వెంట్గా, ప్రదీప్కు అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఏమీ ఆశించడు. కల్మషం లేని చిత్తశుద్ధి. మొదటిసారి చంద్రయ్యను నిశితంగా చూడాలనిపించింది కోమలికి. ముప్పయ్యేళ్ళు వుంటాయేమో! మాసిన గడ్డం.. తెల్లగా చెదిరిన మనసుకు అద్దంలా వున్నాడు. మంచి డ్రెస్ కూడా వేసుకోకుండా బేలగా ఓ పిల్లోడిలా కనిపించాడు.వారం రోజులుగా చంద్రయ్య ఇంటి వైపుకు రాకపోవడంతో ‘మీరు కిందికి వెళ్ళినప్పుడు, చంద్రయ్యను రమ్మనమని చెప్పండి’ భయాందోళనగానే అంది కోమలి.‘ఇంకెక్కడి చంద్రయ్య! పిల్లోడిని తీసుకొని తన ఊరెళ్ళాడట! ఆరోగ్యం దెబ్బతిందని అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. మళ్ళీ మనకు మరో కొత్త వాచ్మన్.. అంతే!’చంద్రయ్య లేకపోవడంతో కోమలి మనసులో మనసు లేదు. ఏదో వెలితి ఆవరించినట్లయింది.‘ఏవండీ! మనకు ఇంత సర్వీస్ చేసిన చంద్రయ్యను వాళ్ల ఊరెళ్ళి ఒకసారి చూసొద్దాం అండీ’ బతిమాలింది కోమలి.‘ఏం చేస్తాం! కాదంటానా? నీ మాటే నా మాట. ఈ రోజే పోదాం పద’ కోమలి మాటను ఎప్పుడూ కాదనని ప్రదీప్– చంద్రయ్య ఊరు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అసోసియేషన్ వాళ్ళకు చంద్రయ్య ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంతో ఆ అడ్రస్తో ఆ ఊరికి చేరుకుని చంద్రయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి ఆరా తీయగా, ఇంట్లో వాళ్లు బయటకు వచ్చి‘చంద్రయ్య గొంతు వ్యాధితో నాలుగు రోజుల క్రితం చనిపోయాడు. మీరు కోమలి, ప్రదీప్ గారేనా?హైదరాబాద్ నుంచి వచ్చారా? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని, చనిపోయే ముందురోజు మాకు చెప్పి ఈ ఉత్తరం మీకు ఇవ్వమన్నాడు’ అంటూ ఉత్తరాన్ని ఇచ్చారు.అప్పటికే ఆ విషాద వార్త విన్న కోమలి గుండె చెరువై బరువవుతుండగా, ఆ ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది.‘ఐ లవ్ యూ.. మేడం..!’ఈ పిలుపు మీకు ఎక్కడో తాకుతుంటుంది.. నేనమ్మా..! మీ పాత పేషెంట్ రాజేష్ చంద్రను. గుర్తొచ్చానా అమ్మా! ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను మీ కౌన్సెలింగ్తో బతికించి ఊపిరి పోశారు. అంతేకాదు ఓ నెలరోజుల పాటు ప్రతిరోజూ ఫోన్లో క్రమం తప్పకుండా వేసుకునే మందులను సూచించడం, చేయాల్సిన వ్యాయామం, మంచి మాటలు, జీవన నైపుణ్యాలు, మానవ సంబంధాలను ఓ అమ్మలా చెప్పారు. ఆ విధంగా నాకు మీరు పునర్జన్మనిస్తే, చాలాకాలం తర్వాత కడుపుతో ఉన్న నా భార్య సైకోగా, హిస్టీరిక్గా చేస్తుంటే, ఆమెకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చి, మంచి డాక్టర్ తో వైద్యం చేయించి మామూలు మనిషిని చేసి.. ఇదిగో...! ఈ వారసుడి జననానికి కారణమయ్యారు. ఆ తర్వాత నా భార్య అనారోగ్యంతో పోయింది. మీకు ఈ విషయాలు చెప్పుకోవాలని తపించినా, ఎంత తాపత్రయపడినా, ఫోన్ కలవకపోవడంతో చెప్పుకోలేకపోయాను. ఒక రోజు అటక పైన ఉన్న ఆనాడు మీరు నాకు పంపిన మందుల పార్సిల్ కవర్ కింద పడటంతో దాని పైన గల ఫ్రమ్ అడ్రస్తో పిల్లాడితో ఈ సిటీకి చేరుకున్నాను. మీ అపార్ట్మెంట్లో వాచ్మన్ ఉద్యోగం కోసం నాలుగు నెలలు వేచి చూస్తే గాని ఈ ఉద్యోగం నాకు దొరకలేదు. ఆ భగవంతుడు మీ దగ్గరికి రప్పించేందుకు కూడా నాకు వరం ఇచ్చాడు తల్లి..! అదేంటో తెలుసా..? నాకు కౌన్సెలింగ్ ఇచ్చే ఆ రోజుల్లో నా గొంతు మీకు తెలిసి ఉంటుంది కదా! మరి మీ సన్నిధికి రావడానికి నన్ను గుర్తుపట్టకుండా ఉండేందుకు నాకు గొంతు వ్యాధిని ఇచ్చాడు. దాంతో పీలగా అయిన గొంతును గుర్తుపట్టలేకపోయారు. మీ తీయటి మాట, పలకరింపు, ప్రేమ, వాత్సల్యం, మానవత్వం ఫోన్కాల్లో చూశాను. దగ్గరుండి అవన్నీ మీ చల్లని చూపుల్లో, చేతల్లో చూసే అదృష్టం కలిగింది. కౌన్సెలర్గా మాలాంటి వాళ్లను బాగు చేసేంత వరకే మీ బాధ్యతగా, ఆ తర్వాత మాతో సంబంధాలను ఎంతవరకు ఉంచాలో అంతవరకే చేసే మీ విధానం నిజంగా గ్రేట్ మేడం! ఎందుకంటే కౌన్సెలింగ్ పరంగా ఏర్పడే మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకునే కొందరు వెధవల్ని దరిచేరనీయకపోవడమే కరెక్ట్. ఒక డాక్టర్, ఒక రోగికి ఉన్న సంబంధంలాగా అంతవరకే! కాని, త్వరలో చనిపోయే నాకు మీ రుణం తీర్చుకోవాలనిపించింది. ఆ రుణం తీర్చుకోవడమే ఈ ‘లవ్’ మేడం.. అంతే! మన మధ్య ఏ బంధమున్నదని ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, మా రెండు జీవితాలను బతికించి, పిల్లాడిని కూడా అందించారు చెప్పండి! పూర్వజన్మ సంగతి, మరుజన్మ సంగతి నాకు తెలియదమ్మా! కాని, ఈ జన్మలో మీరు చేసిన సహాయానికి నేను తిరిగి నా వంతుగా బాధ్యత గల సర్వీసును అందించాలని మీ చెంతకు చేరాను.నేనెలాగో ఎక్కువకాలం బతకనని తెలుసు. బతికినన్ని రోజులు మీరు చేసిన దానికి రుణం తీర్చుకునేందుకు నా చేతనైనంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీ వద్దకు చేరాను. ఈ బంధానికి పేరేమి పెడతారో తెలియదు కాని, చెదిరిపోని ‘లవ్’ ఉంటుంది. అంతే! ఆనాడు మీరు మాపై చూపించింది కూడా బాధ్యతగల ప్రేమనే!నేను చూపించేది కూడా కొందరి అవాంఛిత దృష్టి మాదిరిగా స్వార్థం, కోరికతో కూడిన ప్రేమ కాదు. ఇది బాధ్యతతో ఒక అమ్మకు చేసే సేవా ప్రేమ ఇది. కాదంటారా అమ్మా! ఒప్పుకుంటారా తల్లీ..? నిశీధిలో కొట్టుమిట్టాడుతున్న ఎందరో నాలాంటి జీవితాలకు వెలుగునిచ్చే వెలుగు దివ్వెమ్మా..! మీకు, మీ కుటుంబానికి చేసే ప్రతి పనిలో కష్టమనిపించలేదు, ఇష్టంతో చేశాను. ఎండలో వానలో, తినీ తినక అనారోగ్యాన్ని లెక్క చేయక చేసిన నా ఇష్టమైన పనులే నా ఆత్మ శాంతించడానికి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చిన్నోడి రూపంలో వున్న ఈ ఆత్మరుణానుబంధానికి మీ పేరే పెట్టుకున్నానమ్మా! వాడే ఈ కోమల్!!ఇక నా ప్రాణం పోయినా పర్లేదు. ఆత్మసంతృప్తి మిగిలింది. ఆ రాత్రి గొంతు నొప్పి ఎక్కువ కావడంతో, ఇక నేను ఎక్కువ రోజులు బతకనని తెలిసి పిల్లోడిని తీసుకొని మా ఊరు వచ్చాను. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే ఈ లేఖ ముందస్తుగా రాస్తున్నా. మీ మంచితనం, మానవత్వం పదికాలాలపాటు చెరిగిపోకుండా మరెందరో అభాగ్యులకు కొత్త జీవితాలు అందిస్తే అదే చాలు. నేను చేసిన దానికి అర్థం! పరమార్థం!ఇంకో విషయం తల్లీ! మన సార్ పాత బండికి సరిగా బ్రేకులు లేవు. ఇంజిన్ కూడా రిపేరుకు వచ్చింది. అందుకే నేను చేసిన సర్వీస్కు మీరిచ్చిన జీతాన్ని దాచుకొని, ఆ పైకంతో మన సార్కు నా గిఫ్ట్గా కొత్త బైక్ కొన్నాను. సెల్లార్లో మీ పార్కింగ్లో పెట్టాను. కీస్ వాచ్మెన్ రూమ్లో ఉన్నాయి. తీసుకోండి!ఇక... సార్..నమస్తే..! మేడంకు ఇవ్వడమే కాని, ఎవరి నుంచి ఏదీ తీసుకోదు. అందుకే నేనెవరో తెలియకుండా వచ్చి నా రుణం నేను తీర్చుకున్నాను. మీరు ఆపద్బాంధవులు. ఒకరోజు నా పిల్లోడికి జ్వరం వస్తే రాత్రికి రాత్రి మీరు ఆసుపత్రికి తీసుకెళ్లి దగ్గరుండి వైద్యం చేయించిన గుర్తులు మరువలేనివి. ఒకసారి గుర్తుందా సార్ మీకు...! మీ డ్రైవింగ్లో బైక్ పైన ఇద్దరం వెళ్తుంటే, మీ బైకుకు బ్రేకులు సరిగా లేవుగా.. అదుపుతప్పి ఇంకో బైక్కు తగిలితే పెద్ద గొడవైంది ఆరోజు.. వెంటనే మిమ్మల్ని ఆటో ఎక్కించి ఇంటికి పంపాను కదా..! ఆ తర్వాత అక్కడికి పోలీసులు వస్తే, నేనే డ్రైవ్ చేశానని చెబితే వాళ్లు కొట్టిన లాఠీ దెబ్బలు ఇంకా మానలేదు.. అయితేమాన్లే సార్..! ఇష్టంతో తిన్న దెబ్బలు కదా..! అవి తీయగా తడుముతున్నాయి.. ఈ విషయం ఎందుకు చెప్పానంటే అది యాక్సిడెంట్ కేస్ చేశారు కదా! పోలీసులు నాకోసం మీ దగ్గరికి వస్తారేమో? లేడు.. చనిపోయాడని చెప్పండి! ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నానని అనుకోకండి! కాని, చెప్పకుండా అదృశ్యమైతే మీరన్న జాబితాలో చేరిన మనిషిగానే మిగిలిపోతాను కదా సార్!ఒక్కసారి నవ్వండి సార్..! ‘చంద్రా’..! అని కేకేయండి! మీ ముందు వాలుతానేమో!ఇక ఉంటాను..! సెలవు!’చదువుతున్న కోమలి కంట నీటి ధార కారుతుండగా ఆ కాగితం తడుస్తుంటే, అక్షరాలు చెదిరిపోకుండా ఆ కాగితాన్ని మృదువుగా తడుముకుని హృదయానికి హత్తుకుంది. మెలి పెడుతున్న బాధతో వున్న కోమలిని పొదివి పట్టుకుని నిలబడ్డాడు ప్రదీప్.తల్లి, తండ్రిని కోల్పోయి బేలగా చూస్తున్న కోమల్ వైపు చూస్తూ..‘ఏవండీ! ఆ బాబు! కన్నీటితో అంటుండగా... అర్థం చేసుకున్న ప్రదీప్,‘నీ ఇష్టమే నా ఇష్టం! మన చంద్రయ్య గుర్తులు మానవ సంబంధాలకు, అనుబంధాలకు చాలా అవసరం’ అంటూ ఆ పిల్లోడిని అక్కడి వారి అనుమతితో కారులో ఎక్కించుకొని, హైదరాబాద్ బయలుదేరారు. తన వెచ్చని ఒడిలో చల్లగా నిద్రపోతున్న ఆ పిల్లోడు కోమలి తలపై నిమురుతూ, ‘ఆత్మబంధాన్నిచ్చావా.. చంద్రయ్యా! పిల్లలు లేరని బాధపడుతున్న తమకు ఆ దేవుడు ఈ రూపేణా వీడిని ప్రసాదించాడా? ఈ రుణానుబంధాన్ని బాధ్యతగా చూసుకుంటా! ఇది కదా! నిజమైన ‘లవ్ ’... ఐ లవ్ యు టూ రాజేష్..! ఐ మిస్ యు.. రాజేష్ చంద్రయ్య!’ అనుకుంటూ తన అంతరంగ తరంగాలను సముదాయించుకుంటూ, హృదయస్పర్శతో మనసులోనే చంద్రయ్య పాదాలను తడిమింది కోమలి. -
ఈ సండే సరదాగా వంకాయ–తమలపాకు బజ్జీ ట్రై చేయండిలా..!
స్పైసీ బాంబూ షూట్స్ సలాడ్కావలసినవి: వెదురు చిగుర్లు (బాంబూ షూట్స్)– ఒక కప్పుతురిమిన క్యారట్లు–ఒక కప్పుకీరదోస– అర కప్పు (సన్నగా తరగాలి)కొత్తిమీర తురుము– పావు కప్పుఉల్లిపాయ ముక్కలు– పావు కప్పుమిరపకాయలు– 2వేరుశనగలు– పావు కప్పు (దోరగా వేయించినవి) రైస్ వెనిగర్– 3 టేబుల్ స్పూన్లుసోయా సాస్– 2 టేబుల్ స్పూన్లునువ్వుల నూనె– టేబుల్ స్పూన్తేనె– టేబుల్ స్పూన్అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పేస్ట్, నిమ్మరసం– ఒక టీ స్పూన్ చొప్పునతయారీ: ముందుగా పండ్లను శుభ్రంగాకడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. ముందుగా వెదురు చిగుర్లను కడిగి సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ తాజా వెదురు చిగుర్లను ఉపయోగిస్తే, వాటిని ఉడికించి చల్లార్చాలి. ఒక పెద్ద గిన్నెలో ఈ వెదురు చిగుర్లు, కట్ చేసిన క్యారట్ ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఈలోపు ఒక చిన్న గిన్నెలో రైస్ వెనిగర్, సోయా సాస్, నువ్వుల నూనె, తేనె, అల్లం–వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల మిశ్రమంపై పోసి బాగా కలపాలి. 15 నిమిషాల తర్వాత వేరుశనగలు కూడా వేసి కలుపుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.వంకాయ–తమలపాకు బజ్జీకావలసినవి: వంకాయలు– 8 (మీడియం సైజులో ఉన్న వాటిని మధ్యలో నిలువుగా కత్తిరించుకోవాలి), తమలపాకులు– కొన్ని (పేస్ట్లా చేసి పెట్టుకోవాలి)శనగపిండి– ఒక కప్పు, బియ్యపు పిండి–2 టీ స్పూన్లు, వాము కొద్దిగానువ్వులు, కొబ్బరి పొడి– 2 టీ స్పూన్లు చొప్పున, జీలకర్ర– అర టేబుల్ స్పూన్పసుపు– పావు టీ స్పూన్, కారం– ఒక టీ స్పూన్, ఉప్పు– కావాల్సినంతవెల్లుల్లి రెబ్బలు–8, నిమ్మరసం– ఒక టీ స్పూన్, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పాన్లో నూనె వేసి వంకాయలను లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చల్లారాక కొద్దికొద్దిగా తమలపాకు గుజ్జు నింపుకుని ఉంచుకోవాలి. అనంతరం నువ్వులు, కొబ్బరి పొడి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం కలిపి కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మరో వైపు ఒక కప్పు శనగపిండిలో బియ్యపు పిండి, వాము, కారం, ఉప్పు, సరిపడా నీళ్లు కలిపి బజ్జీల పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని వేగిన పల్లీలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.జపనీస్ పొటాటో సలాడ్కావలసినవి: బంగాళదుంపలు (సుమారు ఒక కేజీ, తొక్క తీసి ముక్కలు కట్ చేసుకోవాలి)క్యారెట్–1 (కాస్త స్టీమ్ చేసి, చిన్నగా తరగాలి)కీరదోసకాయ–1ఉప్పు– ఒక టీ స్పూన్ఉల్లిపాయ–1 (బాగా తురుముకోవాలి)ఉడికించిన గుడ్డు– 1మాయొనీస్ సాస్– ముప్పావు కప్పురైస్ వైన్ వెనిగర్–1 టేబుల్ స్పూన్ఇతర కూరగాయ ముక్కలు– అభిరుచిని బట్టితయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసి బంగాళదుంప ముక్కలను మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. మరోవైపు కీరదోసకాయను ముక్కలుగా కత్తిరించి ఉప్పు చల్లి పెట్టుకోవాలి. బంగాళదుంప ముక్కలు చల్లారాక, వాటిని గుజ్జులా చేసుకోవాలి. ఇందులో కీర దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గుడ్డును వేసి బాగా కలపాలి. అభిరుచిని బట్టి ఇతర కూరగాయల ముక్కలను కూడా కలుపుకోవచ్చు. ఇక బంగాళదుంప మిశ్రమంలో మాయొనీస్ సాస్, రైస్ వైన్ వెనిగర్ వేసి నెమ్మదిగా మరోసారి కలుపుకోవాలి. అనంతరం దాన్ని ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచి, తర్వాత బౌల్స్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
బతుకుతున్న సంస్కృత నాటక పరంపర
భారత ఉపఖండంలో వేల సంవత్సరాలు సాహిత్య భాషగా వున్న సంస్కృతం సుమారు వెయ్యేళ్ళకు పైగా ఒక ప్రదర్శన కళారూపంగా కూడా బతికి ఉండటం విశేషం. అదే కేరళలోని కూడియాట్టం. కూడియాట్టం అంటే కలిసి ఆడే నాట్యం అని అర్థం. ఇది కేరళలోని నాట్య ప్రక్రియలలో ప్రాచీనమైనది. కేరళలోని ప్రాచీన దేవాలయాలలో ఈ నాట్య ప్రదర్శనకు ప్రత్యేకమైన మందిరం ‘కూతాంబళం’ ఉంటుంది. సుమారు 5వ శతాబ్దిలో ప్రారంభమైన సంస్కృత నాటకాలలో పురాణేతిహాసాలు నేపథ్యంగా ఉన్న నాటకాలను పూర్వం చాక్యార్ బ్రాహ్మణులు మాత్రమే కూతాంబళాలలో ప్రదర్శించేవారు. ఇప్పుడు ఇతర కులాల వారు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ నాట్యాన్ని యునెస్కో మౌఖిక వారసత్వ కళారూపంగా గుర్తించడంతో కొన్ని దశాబ్దాలుగా ఖండాంతరాలలో ప్రదర్శితమవుతోంది. త్రిసూర్ కళామండలం, తిరువనంతపురం మార్గి, మూడికుళం నేపథ్య వంటి సంస్థలు ఈ వ్యాప్తికి కృషి చేస్తున్నాయి.ఐదు నుండి పది అంకాల సంస్కృత నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులే పట్టవచ్చు. ఒక్కొక్క శ్లోకాన్ని దాదాపు అరగంట వరకు ప్రదర్శించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. నాటకం మొదలు పెట్టడానికి ముందు ఒకరోజు మొత్తం ప్రదర్శన అంతా ఒకే నటుడు నాటక నేపథ్యం చెప్పడం, ప్రతిరోజూ ముందు సంక్షేపం, నిర్వహణం అనే ప్రదర్శనా పద్ధతులు ఉండటం వల్ల నాటకం మొత్తం పూర్తవడానికి ఎక్కువ రోజులు పడుతుంది.ప్రదర్శన ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి పది, పదకొండు గంటలకు ముగుస్తుంది. ప్రదర్శనలో ముఖ్యమైన వాయిద్యం మిళావు. గంగాళంలాంటి రాగి పాత్రకు ఉన్న సన్నటి మూతిపై బిగుతుగా కట్టిన తోలు మీద వాయిద్యకారులు దరువులు వేస్తారు. ఈ దరువుల శబ్దం ప్రేక్షకులను తాదాత్మ్యతలోకి తీసుకువెళ్తాయి. మిళావుకి తోడుగా ఎడక్క అనే మృదంగం కూడా నాటక ప్రదర్శన సాంతం వాయిస్తూ వుంటారు. ఆడవాళ్ళు మాత్రమే తాళం వాయిస్తారు. కర్ణాటక సంగీత తాళగతులకు భిన్నంగా ఈ తాళాలు వుంటాయి. ‘ఎడక్క’ వాయిద్యకారుడే అవసరమైన సందర్భాలలో శంఖం కూడా ఊదుతాడు. ప్రదర్శనకు ముందు వేదిక ముందుభాగం మధ్యలో ఉంచిన పెద్ద దీపపు సెమ్మెలోని వత్తులు వెలిగిస్తారు. వెంటనే మిళావు ఆహ్వాన దరువుతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.కూడియాట్టంలో పాత్రలకు అనుగుణమైన ప్రత్యేక అలంకరణ వుంటుంది. సూత్రధార, దైవిక, రాజ పాత్రలకు ఒక విధంగానూ; సూత, విదూషక మొదలైన ద్వితీయశ్రేణి పాత్రలకు ఒక విధంగానూ అలంకరణ వుంటుంది. మగ పాత్రలకు దవడ మొత్తం చుట్టి వుండే ‘చుట్టి’ అనే సన్నటి తెల్లటి పట్టా వేయడం కూడియాట్టం నుండే కథాకళికి కూడా సంక్రమించింది. చుట్టి వేయడానికి ప్రదర్శనకు ముందు మూడుగంటల నుండి నటుడు సిద్ధం కావలసి వుంటుంది. స్త్రీ పాత్రలు ఎర్రటి అంచులు వుండే తెల్లటి చీరలు ధరిస్తారు.ఈ నాట్యంలో వుండే ముద్రలు ప్రత్యేకమైనవి. భరతుని నాట్యశాస్త్రానికి అనుగుణంగా ఉంటూనే ప్రత్యేక రీతిలో పాద, హస్త ముద్రలు వుంటాయి. సన్నివేశానికి అనుగుణంగా మానవ అనుభూతులకు ప్రదర్శించేటపుడు నటుల ముఖ కవళికలు, కనుబొమల విన్యాసాలు వివరణాత్మకంగా ఉండి ప్రేక్షకుని తమలో లీనం చేసుకుంటాయి. సంస్కృత శ్లోకాలను నటులు స్పష్టంగా ఒక ప్రత్యేకమైన రీతిలో పాడతారు. అవసరమైన సందర్భాలలో శ్లోకాన్ని పద విభాగం చేసి కూడా వినిపిస్తారు. ఒకసారి శ్లోకాన్ని పాడి అర్థ వివరణల ముద్రలతో నటించి మళ్ళీ శ్లోకాన్ని పాడతారు. నేపథ్యం చెప్పే సందర్భంలో వచ్చే శ్లోకాలను తాళం వాయించే నంగియార్లు పాడతారు.కాళిదాసు శాకుంతలం, భాసుని ప్రతిమ, అభిషేకం, స్వప్న వాసవదత్తం, శక్తిభద్రుని ఆశ్చర్య చూడామణి, హర్షుని నాగానంద, కులశేఖర వర్మ తపతీ సంవరణం, బోధాయనుని భగవదజ్జుకం మొదలైన నాటకాలను కూడియాట్టంలో ప్రదర్శిస్తూ వుంటారు. కాలానుగుణంగా కూడియాట్టం కూడా మార్పు చేర్పులతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక రోజు ప్రదర్శనలు, ఏక పాత్రాభినయాలు కూడా చేస్తోంది. శూద్రకుని మృచ్ఛకటికాన్ని కూడియాట్టం ప్రదర్శనకు అనుగుణంగా మార్చి వేణు.జి. ఇటీవల ప్రదర్శిస్తున్నారు. కొచ్చికి నలభై కి.మీ.ల దూరాన ఉన్న మూడికుళం గ్రామంలోని నేపథ్య థియేటర్ మధు చాక్యార్, డా.ఇందు తన బృందంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. నేపథ్య బృందం, కపిల వేణు బృందం దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్, డా. సుధా గోపాలక్రిష్ణన్, ప్రొఫెసర్ పౌలోస్ వంటివారు కూడియాట్టం మీద ఇంగ్లిష్లో పరిశోధనాత్మక గ్రంథాలు రాశారు. ఆగస్టు మొదటి వారంలో కూడియాట్టం అంతర్జాతీయ ఉత్సవాన్ని కళామండలం సంస్థ, వారం రోజుల పాటు త్రిసూర్లో ఘనంగా నిర్వహించారు. మలయాళీల పెద్ద పండగ ‘ఓణం’కు ముందు పదిరోజుల కూడియాట్టం ఉత్సవాలను మూడికుళం నేపథ్య సెంటర్ గత పదహారేళ్లుగా నిర్వహిస్తునారు.ఇజ్రాయెల్ హీబ్రూ యూనివర్సిటీ ఎమిరిటస్ ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్ ఆధ్వర్యంలోని దక్షిణాసియా విభాగపు ‘నీమ్’ ప్రాజెక్ట్, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా 7వ శతాబ్దపు పల్లవ మహేంద్రవిక్రమవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనాన్ని’ మూడికుళంలో పూర్తిగా ఆరురోజులపాటు ప్రదర్శించారు. కంచిలోని కల్లు దుకాణాల దగ్గర జరిగిన కథ ఇందులోని ఇతివృత్తం. బౌద్ధ, శైవ మత శాఖలలోని లోపాలను హాస్యభరితంగా విమర్శించిన ప్రహసనంగా ప్రఖ్యాతి పొందిన ఈ ప్రహసనం సంస్కృత ప్రహసనాల్లో మొదటిదని అంచనా. కాపాలిక, దేవసోమ, శాక్యభిక్షు, పాశుపత, ఉన్మత్తుని పాత్రలతో వున్న ఈ ఏకాంక ప్రహసనాన్ని గత కొన్ని వందల సంవత్సరాలుగా పూర్తిగా ఎక్కడా ప్రదర్శించలేదు. అందువల్ల ఈ కూడియాట్టం ప్రదర్శనను చూడటానికి దేశ విదేశాల సంస్కృత పండితులు, పరిశోధకులు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడియాట్టం చూడడానికి వీరంతా మూడికుళం వస్తూనే ఉంటారు. ∙డా. కె.రామచంద్రారెడ్డి -
అగ్గిపెట్టంత జనరేటర్!
ఒక చిన్న అగ్గిపెట్టె పరిమాణంలోని బాక్స్ జేబులో పెట్టుకొని తిరిగితే, లైటు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కంప్యూటర్, మొబైల్ వంటి వాటికి పవర్ వస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, జపాన్ సైంటిస్టుల కొత్త ఆవిష్కరణ. వారు తయారు చేసిన ఈ చిన్న మ్యాచ్బాక్స్ సైజ్ జనరేటర్ రోజుకు ఇరవై నాలుగు గంటలూ, ఏడాదంతా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం పెద్ద వనరులు అవసరం లేదు. కేవలం గాలిలో తేమ చాలు. ప్రత్యేకమైన లేయర్డ్ నానోఫిల్మ్ టెక్నాలజీ ఉపయోగించి, గాలిలోని తేమను ఇది నేరుగా విద్యుత్గా మార్చేస్తుంది. ఎలాంటి మోషన్ పార్ట్స్ లేవు, మెయింటెనెన్స్ కూడా జీరో. ఒక్కసారి సెట్ చేస్తే చాలు. ఈ మధ్యనే దక్షిణ ఆసియా పంట పొలాల్లో టెస్టులు జరిపినప్పుడు ఎటువంటి బ్రేక్డౌన్ , చార్జింగ్ అవసరం లేకుండా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసింది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. (చదవండి: చేపలంటే నోరూరించే వంటకాలు కాదు..! ఇకపై ఫ్యాషన్..)· -
కలియుగ కుంభకర్ణుడు: ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే!
రామాయణంలో కుంభకర్ణుడి సంగతి అందరికీ తెలిసిందే! కుంభాలకు కుంభాలు భోంచేశాక శుభ్రంగా ఆరునెలల పాటు ఏకధాటిగా గుర్రుపెట్టి నిద్రపోయేవాడు. సుదీర్ఘకాలం నిర్విరామంగా నిద్రపోవాలంటే, ఎంతటి బద్ధకస్తులకైనా సాధ్యమయ్యే పనికాదు. అయితే, నాగపూర్లో పుర్ఖారామ్ అనే వ్యక్తిని మాత్రం అక్కడి జనాలు కలియుగ కుంభకర్ణుడని అంటున్నారు. అతగాడు ఒకేసారి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు నిర్విరామంగా నిద్రపోగలడట! ఆయనకు ‘యాక్సిస్ హైపర్సోమ్నియా’ అనే అరుదైన నిద్ర వ్యాధి ఉంది. ఈ వ్యాధి కారణంగా శరీరం క్రమంగా అలసిపోతుంది, మెదడు వేకప్ బటన్నే మరచిపోతుంది. ఈ వ్యాధి ఫలితంగానే పుర్ఖారామ్కు నిద్రే జీవితం అయ్యింది. ఇలా ఇతను ఒక సంవత్సరం మొత్తంలో 300 రోజులు నిద్రలోనే గడిపేస్తాడు. ఇతడి కథ విన్నవారు ‘ఒకవైపు ప్రపంచం రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి అని పోరాడుతుంటే, ఇతనికి మాత్రం నిద్రలోనే జీవితం గడిచిపోతోంది’ అంటూ ఆశ్చర్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇతడి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, నిద్ర సంబంధ వ్యాధులపై అనేక చర్చలు మొదలయ్యాయి. -
జుట్టును స్టైలిష్గా మార్చడం కోసం..!
వయసుతో సంబంధం లేకుండా ఆడవారంతా తమ జుట్టును అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవాలనే కోరుకుంటారు. ట్రెండ్కు తగ్గట్టుగా, అందరినీ ఆకట్టుకునేలా తమ కురులను మార్చుకోవాలని ఆశ పడతారు. అలాంటి వారి కోసం జుట్టును స్టైలిష్గా మార్చే పరికరమే ఈ డైసన్ ఎయిర్రాప్ ఐడీ 6 ఇన్ 1 మల్టీ స్టైలర్.జుట్టు స్టైలింగ్ అంటే చాలామంది అధిక వేడి, జుట్టు చివర్లు చిట్లిపోవడం, గంటల తరబడి శ్రమ అని అనుకుంటారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని చెబుతూ డైసన్ కంపెనీ ఈ పరికరాన్ని సృష్టించింది. ఈ డివైజ్ ఎక్కువ వేడి లేకుండా కేవలం ఎయిర్ ఫ్లో సాయంతో జుట్టును స్టైల్ చేస్తుంది. అధునాతన సాంకేతికతో ఇది మీ జుట్టుకు ట్రెండీ లుక్ను అందిస్తుంది. డైసన్ ఎయిర్రాప్ పరికరం బ్లూటూత్ కనెక్టివిటీతో పని చేస్తుంది. ముందుగా ఫోన్లో మై డైసన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో మీ వెంట్రుకల తీరు, అలాగే మీరు ఎలాంటి స్టైల్ కోరుకుంటున్నారో ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలాంటి స్టైల్ సరిపోతుందో కూడా సూచనలిస్తుంది. దీంతో జుట్టును ఎలా స్టైల్ చేసుకోవాలో అనే విషయంలో క్లారిటీ వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న స్టైల్ ప్రకారం ఈ పరికరం మీ జుట్టుకు అందమైన రూపాన్ని ఇస్తుంది. డైసన్ ఎయిర్రాప్ ఆరు రకాల ఎటాచ్మెంట్స్తో లభిస్తుంది. ఈ పరికరంలో మూడు రకాల హీట్ సెట్టింగ్లు, 3 రకాల స్పీడ్ సెట్టింగ్లు ఉన్నాయి. వీటి సాయంతో మీరు తడి జుట్టును ఆరబెట్టుకోవచ్చు. జుట్టుకు బౌన్సీ కర్ల్స్, అందమైన అలల రూపాన్ని సులభంగా అందించవచ్చు. ఈ పరికరంలోని లార్జ్ రౌండ్ వాల్యూమైజింగ్ బ్రష్ జుట్టుకు మంచి ఆకృతిని ఇస్తుంది. అలాగే దీనిలోని సాఫ్ట్ స్మూతింగ్ బ్రష్ చిక్కులను తొలగిస్తుంది. ఈ పరికరంలో అత్యాధునిక హీట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది సెకెన్కు 40 సార్లు వేడిని చెక్ చేస్తుంది. దీంతో మీ జుట్టుకు వేడి కారణంగా ఎటువంటి డ్యామేజీ జరగదు. మొత్తంగా ఈ మల్టీ హెయిర్ స్టైలర్ సాయంతో బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా, జుట్టుకు ఎలాంటి డ్యామేజీ కాకుండా ఇంట్లోనే రింగులు తిరిగే ముంగురులను సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ. 45,900. (చదవండి: -
త్రిశంకుస్వర్గం
సూర్యవంశ రాజులలో త్రిశంకుడు ఒకడు. అతడు ధర్మపరాయణుడు, సద్గుణవంతుడు. ఒకసారి అతడికి చిత్రమైన కోరిక కలిగింది. తన మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనేదే ఆ కోరిక. ‘మహర్షీ! బొందితో స్వర్గానికి వెళ్లాలని నా కోరిక. అది నెరవేరడానికి తగిన యజ్ఞం నిర్వహించండి’ అని కులగురువు వసిష్ఠుడిని కోరాడు. ‘రాజా! నీ కోరిక అసమంజసమైనది, అస్వాభావికమైనది. నీ కోరిక తీర్చడానికి నేనెలాంటి సాయం చేయలేను’ అంటూ వసిష్ఠుడు నిరాకరించాడు.వసిష్ఠుడి నిరాకరణతో త్రిశంకుడు దిగులు చెందాడు. సింహాసనాన్ని విడిచిపెట్టి, దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణంలో అతడు వసిష్ఠుడి కుమారులను కలుసుకున్నాడు. తపస్సంపన్నులైన వసిష్ఠుడి నూరుగురు కుమారులు తన కోరిక ఈడేర్చగలరని భావించి, వారికి తన కోరికను తెలిపి, తగిన యజ్ఞాన్ని చేయమని కోరాడు.త్రిశంకుడి కోరిక విని వసిష్ఠ కుమారులు ఆగ్రహోదగ్రులయ్యారు.‘మా తండ్రి నిరాకరించిన తర్వాత అదే కోరికను నెరవేర్చమని మమ్మల్ని అడగటానికి నీకెంత ధైర్యం? నీ కోరిక కుర్రతనమో, వెర్రితనమో అర్థం కాకుండా ఉంది. ఇది అస్వాభావికం, అనుచితం. నువ్వు మూర్ఖుడివి, పాపాత్ముడివి. అందుకే మా తండ్రి నిరాకరించినా పట్టించుకోకుండా, అదేపనిగా పాకులాడుతున్నావు’ అని నిందించారు.వసిష్ఠ కుమారుల మాటలకు త్రిశంకుడు చిన్నబోయాడు. ‘మా కులగురువైన వసిష్ఠులవారు నిరాకరించారని, గురుపుత్రులైన మిమ్మల్ని ఆశ్రయించాను. మీరు నన్ను అర్థం చేసుకోకుండా దూషిస్తున్నారు. మీరు కూడా నా కోరికను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో నాకు ఒకటే ఉపాయం మంచిదనిపిస్తోంది. నా కోరికను నెరవేర్చగల మరో గురువు కోసం అన్వేషించడమే ఇప్పుడు నేను చేయదగిన పని’ అన్నాడు త్రిశంకుడు.త్రిశంకుడి మాటలకు వసిష్ఠపుత్రులు మండిపడ్డారు.‘పాపాత్ముడా! నువ్వు గురుద్రోహాన్ని తలపెడుతున్నావు. మీ వంశానికి తరతరాలుగా గురువైన మా తండ్రిని కాదని, మరో గురువును చూసుకుంటానని అంటున్నావు. ఈ క్షణం నుంచి నువ్వు చండాలుడివి అవుతావు’ అని శపించారు.త్రిశంకుడు విచారంతో రాజధానికి వచ్చాడు. రాత్రి అశాంతిగా నిద్రించాడు. రాత్రి గడిచేసరికి తాను చండాలుడైనట్లు కనుగొన్నాడు. బంగారు వన్నెతో ఉన్న అతడి శరీరం నల్లగా మారింది. స్ఫురద్రూపి అయిన త్రిశంకుడు కురూపిగా మారిపోయాడు. అతడి ఆకారాన్ని చూసి, మంత్రులు కూడా నమ్మలేకపోయారు. ప్రజలు హేళన చేశారు. తన పరిస్థితికి త్రిశంకుడు కుంగిపోయాడు. దీర్ఘంగా ఆలోచించాడు. తన దుస్థితిని తప్పించి, తన కోరికను తీర్చగలవాడు ఒక్కడే ఒక్కడు– మహా తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు అని తలచాడు. అతడి కోసం వెదుకులాడుతూ బయలుదేరాడు. త్రిశంకుడు విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకునే వేళకు విశ్వామిత్రుడు ధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి విశ్వామిత్రుడు కళ్లు తెరిచాడు.ఎదురుగా దీనవదనంతో కురూపిగా ఉన్న త్రిశంకుడు కనిపించాడు. అతడిని దగ్గరకు పిలిచాడు. ‘నువ్వు అయోధ్య రాజువైన త్రిశంకుడివని నాకు తెలుసు. నీ పరిస్థితి ఎందుకు ఇలాగైంది? నువ్వు ఏదో దిగులుతో ఉన్నావు, కారణమేంటి? నీకు నేను చేయగల ఉపకారమేముంది?’ అని అడిగాడు.విశ్వామిత్రుడు ఆదరంగా పలకరించే సరికి త్రిశంకుడు కన్నీళ్లు పెట్టుకుని, చేతులు జోడించాడు.‘మహర్షీ! బొందితో స్వర్గానికి వెళ్లాలనేది నా కోరిక. మా కులగురువు వసిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన పుత్రులను ఆశ్రయించాను. వారు కూడా నా కోరికను నిరాకరించారు. అంతేకాదు, నన్ను శపించారు. వారి శాపం వల్లనే ఇలా మారాను. నా కోరిక నెరవేర్చగల సమర్థులు మీరు మాత్రమే! అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. ఇక మీరే నాకు దిక్కు’ అన్నాడు.విశ్వామిత్రుడు అతడి దుస్థితికి జాలిపడ్డాడు. ‘నీ కోరికను నేను తీరుస్తాను’ అని అభయమిచ్చాడు.త్రిశంకుడి కోసం విశ్వామిత్రుడు ఒక మహాయాగం నిర్వహించాడు.విశ్వామిత్రుడి తపోబలం వల్ల త్రిశంకుడు బొందితోనే స్వర్గానికి చేరుకున్నాడు.త్రిశంకుడు స్వర్గానికి చేరడం ఇంద్రుడికి ఇష్టంలేక, ‘త్రిశంకూ! గురుపుత్రుల శాపం పొందిన నువ్వు స్వర్గంలో ఉండటానికి అనర్హుడవు. వెంటనే భూలోకానికి వెళ్లిపో!’ అన్నాడు. ఇంద్రుడి ఆజ్ఞతో దేవతలు అతడిని తోసేశారు.‘మహర్షీ! దేవతలు నన్ను తోసేశారు. నేను కిందకు పడిపోతున్నాను. కాపాడండి’ అంటూ త్రిశంకుడు ఆర్తనాదాలు చేశాడు. విశ్వామిత్రుడు ‘నువ్వు అక్కడే నిలు’ అని పలికి, తన మంత్రబలంతో త్రిశంకుడు ఉన్నచోటునే మరో స్వర్గాన్ని నిర్మించాడు. ‘త్రిశంకూ! ఇది నీ స్వర్గం. నీ పేరుతో త్రిశంకు స్వర్గంగా ప్రఖ్యాతి పొందుతుంది. ఇంద్రుడి స్వర్గం అంతరించిపోతే అంతరించవచ్చు గాని, నేను నీ కోసం నిర్మించిన స్వర్గం నిలిచి ఉంటుంది.’ అన్నాడు విశ్వామిత్రుడు.∙సాంఖ్యాయననువ్వు అయోధ్య రాజువైన త్రిశంకుడివని నాకు తెలుసు. నీ పరిస్థితి ఎందుకు ఇలాగైంది? నువ్వు ఏదో దిగులుతో ఉన్నావు, కారణమేంటి? నీకు నేను చేయగల ఉపకారమేముంది? -
సాధారణ దొంగ కాదు... సాహు
ఒక నగల దుకాణంలోకి చొరబడిన వ్యక్తిని సాధారణ దొంగగా భావించి, పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు పేరుమోసిన ‘గుడి’దొంగ ప్రకాశ్కుమార్ సాహుగా తేలడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఉదంతం 2012లో జరిగింది. ఛత్తీస్గఢ్లోని జమునాచౌక్ సమీపాన ఉన్న డాక్బంగ్లా ప్రాంతానికి చెందిన ప్రకాశ్కుమార్ సాహు 1996 నుంచి కొన్నేళ్ల పాటు దేవాలయాల్లోనే చోరీలు చేశాడు. ఇతడు ఆంజనేయస్వామి భక్తుడు కావడంతో ఆంజనేయుడి ఆలయాలు తప్ప మిగిలిన అన్ని ఆలయాల్లోనూ చేతివాటం చూపించాడు. ఎక్కువగా సాయిబాబా, అమ్మవార్ల ఆలయాలపైనే కన్నువేసేవాడు. ఇతగాడు 1998లో విజయవాడ కనకదుర్గ ఆలయంలోకి చొరబడి అమ్మవారి ముక్కుపుడక, కిరీటం సహా ఆభరణాలను చోరీ చేశాడు. ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయంలో 2001 నవంబర్ 10 అర్ధరాత్రి చొరబడి, పదమూడో శతాబ్ది నాటి మదనమోహన, అంబస్యనారాయణ విగ్రహాలను ఎత్తుకుపోయాడు. ఈ రెండు సంఘటనల్లోనూ అప్పటి ముఖ్యమంత్రులు స్పందించాల్సి వచ్చింది.తొలినాళ్లల్లో కేవలం దేవాలయాలను మాత్రమే టార్గెట్గా చేసుకునే సాహు కొన్నాళ్లకు తన పంథా మార్చుకున్నాడు. జగన్నాథస్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసులో సాహు అదే ఏడాది నవంబర్ 27న భువనేశ్వర్ రైల్వేస్టేషన్లో చిక్కాడు. ఈ విచారణ నేపథ్యంలోనే ఇతగాడు బరంపురంలోని పెద్దబజారు ప్రాంతంలో ఉన్న రెండు నగల దుకాణాలనూ లూటీ చేసినట్లు అంగీరించాడు. వీటికి ముందే భువనేశ్వర్లోని లింగరాజ్ దేవాలయంలోనూ దొంగతనానికి పాల్పడ్డాడు. జగన్నాథస్వామి, లింగరాజ్ దేవాలయాల చోరీ కేసుల్లో సాహు జైలు శిక్ష పడింది. ఇతడు ఏ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుంటాడో, అక్కడ ‘పని’ చేయడానికి ముందు భక్తుడిగా ప్రవేశించి ప్రార్థనలు చేస్తాడు. పూరీ గుడిలో చోరీకి వెళ్లిన సందర్భంలో విగ్రహాలు ముట్టుకునేప్పుడు, తీసేప్పుడు కళ్లు మూసుకుని చేశాడు. ఆపై భయపడిన సాహు మదనమోహన విగ్రహాన్ని భువనేశ్వర్ శివార్లలోని ఓ నూతిలో పడేశాడు. ఇతడు చేతివాటం ప్రదర్శించిన వాటిలో అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పురాతన ఆలయాలూ ఉన్నాయి. ఇతడు కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ నేరాలు చేశాడు. 2010లో హైదరాబాద్ను టార్గెట్ చేసిన సాహు అనేక ఆలయాల్లో చోరీలు చేశాడు. ఆపై కేపీహెచ్బీ భాగ్యనగర్ కాలనీలోని వాసవి జ్యూలర్స్, జూబ్లీహిల్స్లోని శ్రీకృష్ణానగర్లో బాబూలాల్ హీరాచంద్ జైన్ జ్యూలరీ షాపుల్లో నేరాలు చేశాడు. 2012 అక్టోబర్ 11న ఉప్పల్లోని మహాలక్ష్మీ జ్యూలర్స్ను టార్గెట్ చేసుకున్న సాహు ముందే రెక్కీ చేశాడు. ఆ రోజు అర్ధరాత్రి అక్కడకు తన అనుచరులతో కలిసి వచ్చి ‘పని’ ప్రారంభించాడు. తన వెంట తెచ్చుకున్న పరదాను జ్యూలరీ షాపు ముఖద్వారం రోడ్డుపైకి కనిపించకుండా అడ్డుగా కట్టాడు. దుకాణం పైఅంతస్తులో ఉండే యజమాని కిందికి రాకుండా దర్వాజా, గ్రిల్స్ను బిగించేశాడు. తొలుత జ్యూలరీ షాపు గ్రిల్స్కు వేసిన తాళాలను కట్టర్లతో కట్ చేశాడు. షట్టర్ మధ్య భాగంలో గ్యాస్ కట్టర్తో కట్ చేసి, ఆ భాగం తెరిచి దుకాణం లోపలికి ప్రవేశించి, రెండు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. అయితే, ఆలోపే ఒక దాంట్లో సాహు కదలికలు రికార్డు అయ్యాయి. అనంతరం ఇన్వర్టర్ను ఆఫ్ చేశాడు. లాకర్ను కట్టర్తో కట్ చేస్తుండగా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.సాహు ఈ దుకాణంలోని ఇన్వర్టర్ విషయంలో చిన్న పొరపాటు చేశాడు. యజమాని హస్తామల్ శర్మ నివసించేది షాపు పైన ఉన్న ఇంట్లోనే. దుకాణానికి, ఇంటికి కలిపి ఒకే ఇన్వర్టర్ను ఏర్పాటు చేసుకున్నారు. షాపులోకి ప్రవేశించిన సాహు గ్యాంగ్ అవసరం లేకపోయినా ఇన్వర్టర్ వైరు కట్ చేసింది. ఆ రోజు అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఉప్పల్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పటికే ఇన్వర్టర్ వైర్ కూడా తెగి ఉండటంతో అదికూడా పని చేయలేదు. ఉక్కపోతతో మెలకువ వచ్చిన శర్మ బాల్కనీలోకి వచ్చి చూశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి పొగలు కనిపించడంతో అప్రమత్తమై చుట్టుపక్కల వారితో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. శర్మ పిలుపుతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు ఇళ్లల్లో లైట్లు వేశారు. ఇది గమనించిన సాహు అనుచరులు పరారవగా, ఆ అవకాశం లేని సాహు దుకాణం మెట్ల కిందే నక్కాడు. చుట్టుపక్కల వారు దుకాణం వద్దకు చేరుకోవడంతో పాటు అదే సమయంలో పోలీసులూ వచ్చారు. అప్పటి వరకు మెట్ల కింద నక్కిన సాహు ఈ హడావుడితో కంగారు పడ్డాడు. బయటకు వచ్చి జనం మధ్య నుంచి కొంతదూరం వెళ్లి ఒక్కసారిగా పరిగెత్తడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు, పోలీసులు వెంబడించి అతడిని పట్టుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. మామూలు దొంగగా భావించిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇతడు సాహు అనే విషయం బయటపడింది. దీంతో మల్కాజ్గిరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించారు. అప్పట్లో గుడులు, జ్యూలరీ దుకాణాలు కలిపి 13 చోరీలు అంగీకరించిన సాహు ఆ సొత్తును మహారాష్ట్రలో ఉన్న మిత్రుడి వద్ద దాచినట్లు చెప్పాడు. ఆఖరుసారిగా సాహు 2023 ఫిబ్రవరిలో కేరళలోని కొచ్చి పోలీసులకు చిక్కాడు. -
ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరిన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?
నేను ఐదు నెలల గర్భవతిని, వయసు ముప్పైఏడు. డాక్టర్ రక్తాన్ని పలుచగా చేసే మందులు ఆస్పిరిన్ టాబ్లెట్లు వాడమన్నారు. ఇవి బిడ్డకు సురక్షితమేనా? అలాగే ఈ వయస్సులో గర్భధారణలో సమస్యలు రాకుండా ఉండేందుకు నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?– సుజాత, విజయవాడమీ ఆందోళన సహజమే. ముప్పై ఐదు ఏళ్లకు పైబడిన గర్భిణులను మేము అధిక ప్రమాద గర్భిణులుగా పరిగణిస్తాం. ఎందుకంటే వయస్సు పెరిగేకొద్దీ తల్లి, శిశువుకు కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు అడిగిన మందుల విషయం మొదట చెబుతాను. తక్కువ మోతాదులో ఇచ్చే ఆస్పిరిన్ టాబ్లెట్ చాలా సురక్షితం. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే గర్భధారణలో వచ్చే కొన్ని సమస్యలను తగ్గిస్తుంది. డాక్టర్ సూచించిన విధంగా తీసుకుంటే ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు చేస్తుంది. ఈ వయస్సులో గర్భధారణలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మొదటి మూడు నెలల్లో గర్భస్రావం వచ్చే అవకాశం పెరుగుతుంది. శిశువులో జన్యు సంబంధిత లోపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు తల్లికి రావచ్చు. కొన్నిసార్లు సిజేరియన్ డెలివరీ అవసరం అవుతుంది. తల్లిలో ఉన్న ఆరోగ్య సమస్యల వలన శిశువు పెరుగుదలలో లోపం రావచ్చు, ముందుగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అలా పుడితే ప్రత్యేక శిశు సంరక్షణ అవసరం అవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. క్రమం తప్పకుండా గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అప్ తప్పనిసరిగా చేయాలి. అల్ట్రాసౌండ్ స్కాన్లు చేయించుకోవడం ద్వారా శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. అవసరమైతే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ సూచించే ఔషధాలను సమయానికి తీసుకోవాలి. ఈ వయస్సులో గర్భధారణ కొంత రిస్క్ ఉన్నప్పటికీ, భయపడాల్సిన పనిలేదు.నా వయసు ఇరవైనాలుగు. ఇది నా రెండవ ప్రెగ్నెన్సీ, ప్రస్తుతం నాలుగో నెలలో ఉన్నాను. నా మొదటి కాన్పు, ముప్పై వారాల సమయంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగింది. ఈ గర్భధారణలో మళ్లీ అలాంటి సమస్య రాకుండా సర్జరీ చేయాలని డాక్టర్ సూచించారు. గర్భధారణ సమయంలో శస్త్రచికిత్స చేయించుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఇది నిజంగా అవసరమా? ఈసారి కూడా నాకు ముందుగా పుట్టిన బిడ్డ అవుతాడా? ఈ ప్రక్రియ తర్వాత నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?– వనజ, నర్సాపురంమీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. గతంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగిన మహిళల్లో, మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము ముందుగానే జాగ్రత్తలు సూచిస్తాం. గర్భాశయానికి దిగువ భాగాన్ని ‘సర్విక్స్’ అంటారు. సాధారణంగా ఇది పొడవుగా, బిగుతుగా మూసి ఉండాలి. ప్రసవ సమయం దగ్గర పడే సరికి మాత్రమే ఇది చిన్నదవుతూ తెరుచుకోవాలి. కాని, కొంతమంది మహిళల్లో, ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా నెలలు నిండక ముందే బిడ్డ పుట్టిన అనుభవం ఉన్నవారిలో, ఇది గర్భధారణ పూర్తయ్యే లోపే చిన్నదై తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. దీనిని సర్వికల్ ఇన్సఫిషియెన్సీ అంటారు. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే, మళ్లీ ప్రీటర్మ్ డెలివరీ జరగవచ్చు. ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి సర్వికల్ లెంగ్త్ స్కాన్ అనే ఒక సాధారణ వజైనల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తాం. ఇందులో సర్విక్స్ పొడవు, బిగుతు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది తక్కువగా ఉంటే లేదా బలహీనంగా కనిపిస్తే, రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రొజెస్టెరోన్ మందులు ఇవ్వడం, రెండోది సర్విక్స్ను బిగుతుగా కట్టే చిన్న శస్త్రచికిత్స చేయడం. ఇందులో సర్విక్స్ను ప్రత్యేకమైన దారంతో కట్టి, గర్భధారణ పూర్తయ్యేంత వరకు బిగుతుగా ఉంచుతాం. ఇది సురక్షితమైన పద్ధతి, అనేకమందికి మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ చికిత్స చేసిన తర్వాత మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీలైనంత వరకు బెడ్రెస్ట్ తీసుకోవాలి, భారమైన పనులు చేయకూడదు, బరువులు అస్సలు ఎత్తకూడదు. లైంగిక చర్యలు నివారించాలి. డాక్టర్ చెప్పినట్లుగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. తరచు స్కాన్లు చేయించుకోవాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నదీ లేనిదీ చూడాలి. ఈ విధంగా ముందుగానే చర్యలు తీసుకుంటే, గర్భధారణను సురక్షితంగా కొనసాగించే అవకాశం చాలా పెరుగుతుంది. నిజానికి ఈ శస్త్ర చికిత్స లేదా ప్రొజెస్టెరోన్ వాడకం తర్వాత చాలామంది మహిళలు ముప్పై ఏడు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ వరకు గర్భధారణ కొనసాగించి, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తున్నారు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!) -
స్లీప్..స్క్రీన్..స్టడీ..!
ఈతరం విద్యార్థులు ప్రతిరోజూ పరీక్షలు, అసైన్మెంట్లు, పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి, బెస్ట్ రిజల్ట్స్కు ఉపయోగపడే అంశాలు నిద్ర, స్క్రీన్ టైమ్. స్టడీ హేబిట్స్. ఏమాత్రం వ్యాయామం చేయకుండా అర్ధరాత్రి వరకూ స్క్రీన్ చూసుకుంటూ గడిపేస్తే ఫోకస్ తగ్గిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, అకడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. స్లీప్, స్క్రీన్, స్టడీ మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడే మీరు కోరుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అందుకే ఈ రోజు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుందాం. 1. నిద్రతోనే మేధస్సు పునరుజ్జీవంనిద్ర మన జీవితంలో విడదీయలేని భాగం. ఇది మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం. మానసిక శక్తి, రోజువారీ పనులు నిర్వహించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే విద్యార్థుల విజయంలో హార్డ్ వర్క్తో పాటు వారి నిద్ర కూడా ముఖ్యమైన అంశం.మనం పగలు నేర్చుకున్న అంశాలు రాత్రి నిద్రలో మెదడులో నిక్షిప్తమవుతాయి. నిద్ర తగ్గితే మెమరీ కెపాసిటీ కూడా 40 శాతం తగ్గుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనాల్లో వెల్లడైంది.నిద్ర అనేది మనం నిర్ణయాలు తీసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి అవసరమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ను ప్రభావితం చేస్తుంది. నిద్ర లేని పిల్లలు ఎక్కువగా కోపం, తీరని భావోద్వేగాలు అనుభవిస్తారు. ఇది వారి ఫోకస్ను, నమ్మకాన్ని కూడా దెబ్బతీయవచ్చు.2. నిద్ర, మార్కులు తగ్గించే స్క్రీన్ టైమ్ ఈ డిజిటల్ యుగంలో ప్రతి చోటాస్క్రీన్లు ఉన్నాయి. పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు లేదా వీడియో గేమ్స్ పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది బిడ్డ పుట్టినప్పటి నుంచీ వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. స్క్రీన్లు ఉత్పత్తి చేసే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ను కదిలించి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. నిద్రకు వెళ్లడానికి గంట ముందు వరకూ స్క్రీన్ చూస్తుంటే అది నిద్రపట్టడాన్ని 90 నిమిషాలు ఆలస్యం చేస్తుంది. రీల్స్, వీడియోలు చూడటం వల్ల సంతోషాన్నిచ్చే డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. దీంతో మళ్లీ మళ్లీ చూడాలనే కోరిక పెరుగుతుంది. స్క్రీన్కు అడిక్ట్ అవుతారు. దీంతో చదువుకునే సమయం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. పిల్లల స్క్రీన్ టైమ్ రోజుకు మూడు గంటలుంటే వారి అకడమిక్ స్కోర్లు తగ్గినట్లు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 3. ఫోకస్, రిటెన్షన్ మెరుగుపరచడంనిద్రను, స్క్రీన్ టైమ్ను సరిగా సెట్ చేస్తేనే విద్యార్థులు సరిగా చదవగలుగుతారని, మార్కులు పెరుగుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. 25 నిమిషాల చదువు తర్వాత ఐదునిమిషాల విరామం తీసుకోవడం, మానసిక అలసట నుండి రీచార్జ్ కావడం అకడమిక్ సక్సెస్లో చాలా కీలకమైన విషయం.ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం మొక్కుబడిగా చదవడం కంటే ఇష్టంగా చదవడం, చదివిన దాన్ని ఇతరులతో చర్చించడం వల్ల సమాచారం నిలుపుకోగల శక్తి 50 శాతం పెరుగుతుంది. పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. 25 నిమిషాలు ఫోకస్తో చదివి, 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఇది మెదడుకు విశ్రాంతి ఇస్తుంది.ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోండి. కనీసం7–8 గంటలు నిద్రపోవాలి.నిద్రకు ఒక గంట ముందు మొబైల్, ల్యాప్టాప్, టీవీ వాడకండి. బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనిన్ను తగ్గిస్తుంది.మల్టీ టాస్కింగ్ తగ్గించండి. ఒకేసారి ఒక్క పనిపై ఫోకస్ చేయండి. చదువుతో పాటు మొబైల్ చూడడం ఏకాగ్రతను తగ్గిస్తుంది. యాక్టివ్ లెర్నింగ్ చేయండి. సబ్జెక్ట్ను మళ్లీ మళ్లీ చదవకుండా, ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి.రోజూ వ్యాయామం చేయండి. 20–30 నిమిషాల వాకింగ్, యోగా లేదా క్రీడలు ఆడడం ఏకాగ్రతను పెంచుతుంది.చదువుల మధ్యలో ఐదునిమిషాలు మైండ్ఫుల్ బ్రేక్లు తీసుకోండి. డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.ఒకేసారి ఎక్కువగా చదవకండి. కొన్ని రోజులకు ఒకసారి రివిజన్ చేస్తే మెదడులో నిలుస్తుంది.జంక్ ఫుడ్ తగ్గించి, పళ్లు, గింజలు, కూరగాయల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తినండి. ఇవి మెదడుకు శక్తినిస్తాయి.రోజులో కనీసం రెండు గంటలు మొబైల్ లేకుండా గడపండి. ఆ టైమ్లో పుస్తకం చదవండి లేదా కుటుంబంతో మాట్లాడండి. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
థీమ్డ్ మిర్రర్స్..! అదంలా తళతళలాడేలా అలంకరిద్దాం ఇలా..
ఒకప్పుడు మన రూపాన్ని చూసుకోవడానికి మాత్రమే ఇంట్లో అద్దాలు ఉండేవి. ఇప్పుడు ఇంటి అలంకరణలో అద్దం అంతర్భాగంగా మారింది. ఇంటీరియర్ థీమ్కి అనుగుణంగా థీమ్డ్ మిర్రర్స్ను డిజైన్ చేస్తున్నారు నిపుణులు. వీటి రూపకల్పనలోనే డిజైనర్లు తమదైన ప్రతిభ చూపుతున్నారు. ఇంటికి వినూత్న కళను తీసుకువస్తున్నారు. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే డెకరేషన్ వస్తువులుగా మారిన అద్దాలను సరైన థీమ్తో ఎంపిక చేసుకుంటే, అది కేవలం అద్దం మాత్రమే కాకుండా ఒక కళాఖండంగానూ మారుతుంది. పెద్ద గదులకు థీమ్ మిర్రర్స్వింటేజ్ థీమ్ మిర్రర్ డిజైన్స్లో పాతకాలపు డిజైన్లు కనిపిస్తాయి. కార్వింగ్తో ఉండే వుడ్ లేదా బ్రాస్ ఫ్రేమ్స్ 19వ శతాబ్దపు ఛాయలు కనిపిస్తాయి. బొహిమియన్ స్టైల్లో చూపులను తిప్పుకోనివ్వని రంగులు, కార్వింగ్ డిజైన్లు కనువిందు చేస్తాయి. చిన్నగదులకు సింపుల్ మిర్రర్స్అద్దాలు అలంకరణలో కీలకం అని, నచ్చింది కదా అని మన ఇంటి గదుల నిర్మాణం గురించి ఆలోచించకుండా ఎంచుకోవచ్చు. చిన్న గదులకు క్లియర్ లైసెన్స్, సింపుల్ డిజైన్, న్యూట్రల్ కలర్స్, మెటల్ ఫ్రేమ్స్ చక్కగా నప్పుతాయి. ఇవి రూ.500 నుంచి లభిస్తున్నాయి.ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే మిర్రర్స్పువ్వులు, లతలు, ఆకులతో మిర్రర్ ఔట్ డిజైన్స్, వుడ్ టెక్స్చర్, ప్రకృతిని ప్రతిబింబించే రూపాలు వీటిలో కనిపిస్తాయి. ఇవి పెద్ద హాల్, డైనింగ్ ఏరియాలో సెట్ అవుతాయి. కార్టూన్ క్యారెక్టర్స్, యానిమల్ షేప్స్వి కిడ్ రూమ్ డెకరేషన్కు బాగా సరిపోతాయి. ఉన్నదాని కన్నా గది విశాలంగా చూపాలంటే థీమ్డ్ మిర్రర్ వర్క్ బాగా ఉపయోగపడుతుంది. ఇంటి వాల్ కలర్, ఫర్నిచర్తో సరిపోయేలా మిర్రర్ డిజైన్ ఎంచుకోవాలి. ఇలాంటివి ఆన్లైన్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. మోడల్, వింటేజ్ స్టైల్ థీమ్ను బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్కెట్లో మిర్రర్స్ లభిస్తున్నాయి. ఎన్నార్(చదవండి: చేపలంటే నోరూరించే వంటకాలు కాదు..! ఇకపై ఫ్యాషన్..) -
గగన యంత్రడికి ఘనమైన వీడ్కోలు
మనుషులకైనా, యంత్రాలకైనా ‘విధుల విరమణ’ వీడ్కోలు ఇవ్వటం అన్నది భావోద్వేగ భరితంగా ఉంటుంది. ఆగస్టు 25న మిగ్–21 యుద్ధ విమానాలకు చివరి టేకాఫ్తో లాంఛనంగా వీడ్కోలు పలకటానికి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్వయంగా ఒక మిగ్–21ను నడిపారు. ఆ క్షణాలలో అక్కడున్న వారి హృదయాలన్నీ భారమైన కళ్లతో ఆ దృశ్యాన్ని వీక్షించాయి. ‘మిగ్–21’ను కనుక మనిషి అనుకుంటే.. యుద్ధ యోధుడు అనాలి. ఆయుధం అనుకుంటే కనుక... ఆకాశపు ఏకే–47 అనాలి. ఎన్నో యుద్ధాలలో భారత్ వెన్నుదన్నుగా ఉన్న ఈ గర్జించే ‘గన్ను’, కనిపించని టార్గెట్ను సైతం ఒక్క చూపుతో భస్మం చేసే ఈ ‘కన్ను’... రూపురేఖలకు విహంగమే కాని, ఇండియన్ ఆర్మీలో సకల బలాల, దళాల ‘అక్షౌహిణి!’ ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఆరు దశాబ్దాలకు పైగా దోస్త్ మేరా దోస్త్!!పాం ర్స్... కోబ్రాస్భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్) ఈ నెల 26న మిగ్–21 యుద్ధ విమానాలకు ఘనంగా వీడ్కోలు పలకబోతోంది. దీనర్థం – ఇకపై ఈ ఫైటర్ జెట్లను మన ఆర్మీ ఏ విధమైన విధులకూ ఉపయోగించదు. 62 ఏళ్లుగా సైన్యానికి సేవలు అందిస్తున్న మిగ్–21 లకు స్వస్తి చెప్పటం కోసం భారత ప్రభుత్వం చండీగఢ్లో ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఐ.ఎ.ఎఫ్లో ప్రస్తుతం మిగ్–21 విమానాలకు చెందిన స్క్వాడ్రన్లు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి : ‘పాంథర్స్’ (23వ స్క్వాడ్రన్), రెండు : ‘కోబ్రాస్’ (3వ స్క్వాడ్రన్). రాజస్థాన్లోని బికనీర్కు సమీపంలో – ‘నల్’ ఎడారి యుద్ధ విమానాల స్థావరం నుంచి ఇవి పని చేస్తుంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ విమానాలు, నిర్వహణా సిబ్బంది, వాటిని నడిపే పైలట్లతో కూడిన విభాగాన్ని ‘స్క్వాడ్రన్’ అంటారు. వేరియంట్లలో చివరి మిగ్ఐ.ఎ.ఎఫ్. ఈ ఆరు దశాబ్దాలలో పలు రూపాంతర (వేరియంట్) రకాలైన మిగ్–21లను యుద్ధాలలో ప్రయోగించింది. అవి : మిగ్–21 ఎఫ్, మిగ్–21 పిఎఫ్, మిగ్–21 ఎఫ్.ఎల్, మిగ్–21 ఎం, మిగ్–21 బిస్, మిగ్–21 బైసన్. చివరి వేరియంట్ అయిన ఈ బైసన్ మిగ్లనే ఇప్పుడు మన వైమానిక దళం పక్కన పెట్టబోతున్నది. స్క్వాడ్రన్ 3, స్క్వాడ్రన్ 23లో కలిపి ప్రస్తుతం మొత్తం 36 మిగ్–21 బైసన్లు ఉన్నాయి. అరవై ఏళ్లకు పైగా భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలిచిన ఈ మిగ్–21 యుద్ధ విమానాలలో ఒక దానిని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గత నెలలోనే నడిపి మిగ్లకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. (పైన ఫోటోలు). రష్యన్ సంతతికి చెందిన ఈ ఫైటర్ జెట్పై శిక్షణ పొందిన పైలట్లు ఆ వీడ్కోలు క్షణాలలో భావోద్వేగానికి లోనయ్యారు. నిజానికి భారత వైమానిక దళం దశల వారీగా మిగ్–21ల వాడకాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. ఆ క్రమంలో ఇది చిట్టచివరి ఉపసంహరణ. ప్రధానంగా భద్రతా సంబంధ కారణాలతో ఐ.ఎ.ఎఫ్. వీటిని నిలిపివేస్తోంది. టెక్నాలజీ పాతపడి పోవటం, ఫైటర్ స్క్వాడ్రన్లను ఆధునికీకరించవలసిన అవసరం ఏర్పడటం వల్ల కూడా మిగ్–21 ల నుంచి భారత్ ఆధునాతన దేశవాళీ ఎల్.సి.ఎ. ఎంకె–1ఎ ఫైటర్ జెట్లకు మళ్లుతోంది. రష్యా నుంచి తొలి మిగ్మిగ్–21 అన్నది 1950లలో సోవియట్ యూనియన్ వృద్ధి చేసిన సూపర్సోనిక్ యుద్ధ విమానం. ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి అయిన జెట్గా కూడా దీనికి రికార్డు ఉంది. భారత్ మొట్టమొదట 1963లో సోవియెట్ యూనియన్ నుండి మిగ్–21ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత, రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని, విడి పరికరాలు దిగుమతి చేసుకుని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్)లో స్వయంగా మిగ్లను తయారు చేసుకోవటం మొదలుపెట్టాం. మిగ్–21లోని వేరియంట్లన్నీ భారత్ వృద్ధి చేసుకున్నవే. అంతేకాదు, ఐ.ఎ.ఎఫ్. దగ్గరున్న మొత్తం 850 మిగ్–21లలో అత్యధికంగా ‘హాల్’ ఉత్పత్తి చేసినవే. 1987 తర్వాత çహాల్లో మిగ్–21ల తయారీ వివిధ కారణాలతో ఆగిపోయింది. రష్యా 1986లోనే పూర్తి స్థాయిలో మిగ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. మిగ్–21ల ఘన చరిత్ర వియత్నాం యుద్ధం (1955–1975) : ఉత్తర వియత్నాం వైమానిక దళం మిగ్–21 లను విస్తృతంగా ఉపయోగించి అమెరికాపై విజయం సాధించింది. 1966లో అమెరికా డ్రోన్లను కూల్చేసింది! అరబ్–ఇజ్రాయెల్ ఘర్షణలు: 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో (జూన్ 5 నుంచి 10 వరకు), ఆ తర్వాతా జరిగిన ఘర్షణల్లో ఈజిప్ట్, సిరియా, ఇరాక్... ఇజ్రాయెల్పై మిగ్–21లతో తలపడ్డాయి. అయితే ఆరు రోజుల యుద్ధం ప్రారంభంలోనే చాలా వరకు మిగ్లు ధ్వంసం అయ్యాయి!ఇరాన్–ఇరాక్ యుద్ధం (1980–1988):ఇరాన్, ఇరాక్ రెండూ కూడా ఈ ఎనిమిదేళ్ల దీర్ఘ పోరాటంలో పరస్పరం మిగ్–21లను ప్రయోగించుకున్నాయి. సిరియా అంతర్యుద్ధం, లిబియా ఘర్షణలు: సిరియన్ వైమానిక దళం, లిబియా ఘర్షణల్లో లిబియా వైమానిక దళం మిగ్–21లను ఉపయోగించాయి. భారత్–పాక్ యుద్ధాలు 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో మిగ్–21ల పాత్ర పరిమితంగానే ఉంది. గగనతల దాడులేమీ జరగలేదు. 1971లో మిగ్–21 లు భారత్కు గగనతల పోరాటంలో ఆధిక్యతను చేకూర్చాయి. పాక్ విమానాలను కూల్చేశాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తా¯Œ సేనలపై భారత్ మిగ్–21 యుద్ధ విమానాలు విరుచుకుపడిన తీరు ప్రపంచ దేశాలను సైతం విస్మయపరచింది. డిసెంబర్ 13వ తేదీన ఢాకాలోని గవర్నర్ అధికార భవనంపై భారత్ మిగ్–21 బాంబులతో దాడిచేసింది. ఆ మర్నాడే గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాతి రోజే 93,000 మంది పాక్ సైనికులు భారత సైన్యం ఎదుట లొంగిపోయారు.1999 కార్గిల్ వార్లో ఎత్తయిన ప్రదేశాల నుండి ఉపరితల దాడులకు భారత్ మిగ్–21 లను సంధించింది. వైమానిక రక్షణ కార్యకలాపాల కోసం కూడా వీటిని ఉపయోగిం చింది. ఆపరేష¯Œ సఫేద్ సాగర్లో భాగంగా ఆనాడు పాకిస్తానీ అట్లాంటిక్ విమానాన్ని మిగ్ ఒక్క దెబ్బతో నేలమట్టం చేసింది. 2019లో పాక్తో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పాక్పై భారత్ జరిపిన భారీ దాడిలో మిగ్–21లు కీలక పాత్ర పోషించాయి. అత్యంత శక్తిమంతమైన ఎఫ్–16ను సైతం నేల కూల్చాయి. మిగ్కు ఆ పేరెలా వచ్చింది?మాస్కోలో 1939లో ప్రారంభమైన ‘మికోయన్’ ఏరోస్పేస్ కంపెనీ సంస్థాపకుల పేర్ల నుండి మిగ్–21 అనే మాట వచ్చింది. ఇందులో 21 అనేది మిగ్ విమానం మోడల్ నెంబరు. ‘మికోయన్’ సంస్థ.. ఆర్టెమ్ మికోయన్, మిఖాయిల్ గురేవిచ్ అనే ఇద్దరు ఏరో డిజైనర్ల ఆలోచన నుంచి ఆవిర్భవించింది. అన్నీ ఇన్నీ కాని ప్రత్యేకతలు!మిగ్లు తేలికపాటి, సూపర్సోనిక్ ఫైటర్ జెట్లు. గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుండి భూతలంలోకి ఇవి సులువుగా మెరుపు దాడులు చేయగలవు. బాంబులను, మిసైళ్లను మోసుకుపోగలవు. సెకనుకు 250 మీటర్ల వేగంతో నిట్టనిలువుగా కూడా ప్రయాణించి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయగలవు. కొన్ని సాంకేతికతలైతే అత్యంత అధునాతనమైనవి. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపైనా నేరుగా దాడి చేయగల రాడార్ వ్యవస్థ మిగ్లలో ఉంది. ప్రస్తుతం 60 కంటే ఎక్కువ దేశాల వాయుసేనల్లో 11,000కు పైగా మిగ్–21 విమానాలు పని చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దొంగిలించింది!భారత వైమానిక దళానికి చేరిన తొలి సోపర్సోనిక్ ఫైటర్ జెట్లు మిగ్–21 లు. 1960–70 ల మధ్య భారత్కు గగనతల యుద్ధంలో ఇవి శక్తిమంతమైన అదనపు బలగాలు అయ్యాయి. పశ్చిమ దేశాలకు పక్కలో బల్లెంలా మారాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ మిగ్–21ల టెక్నాలజీని దొంగిలించిందని కూడా అంటారు! ఒకసారి వీటిని నడిపిన పైలట్లు మరే విమానాన్నీ నడపటానికి ఆసక్తి చూపరనే మాటా వినిపిస్తుంటుంది. గాలిలో చురుగ్గా కదలటం, అత్యధిక వేగాన్ని అందుకోవటం మిగ్లలోని మరికొన్ని ప్రత్యేకతలు. సాధారణ యుద్ధ విమానాలు ‘ఫ్లయ్–బై–వైర్’ అనే సిస్టమ్తో వేగాన్ని నియంత్రించుకుంటాయి. మిగ్లు గేర్ సిస్టమ్తో పని చేస్తాయి. దాంతో గంటకు 2000 కి.మీ. వేగాన్ని కూడా ఇవి అందుకోగలవు! అంత వేగంలో పైలట్ పట్టు కోల్పోవటమే తరచు జరిగే మిగ్ల ప్రమాదాలకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. ‘ఎగిరే శవపేటికలు’!మొదట్లో గగన సింహాలై గర్జించి, విజయ చిహ్నాలుగా గుర్తింపు పొందిన మిగ్–21 లు తర్వాత్తర్వాత తరచు ప్రమాదాలకు గురవుతూ పైలట్లు, పౌరులు మరణిస్తుండటంతో ‘ఎగిరే శవపేటిక’లు అనే అప్రతిష్ఠను, అపకీర్తిని మోయవలసి వచ్చింది. కాలం చెల్లిన మిగ్లను ఇంకా ఎన్నేళ్లు ఉపయోగిస్తాం అనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. మరోవైపు సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాల రాకతో వీటికి ప్రాముఖ్యం తగ్గిపోయింది. భారత వాయుసేన ఆధ్వర్యంలోని 872 మిగ్ విమానాల్లో 482 విమానాలు పలు ప్రమాదాల్లో నేలకూలాయని 2012లోనే ఆనాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని రాజ్యసభలో వెల్లడించారు కూడా. ఆనాటి లెక్కల ప్రకారమే చూసుకున్నా... 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మరణించారు. పైగా భారత వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన యుద్ధ విమానాలు కూడా ఇవే. యాదృచ్ఛికంగా – 1963లో తొలిసారిగా ఎక్కడైతే భారత వాయుసేనలోకి వీటిని తీసుకుని జాతికి అంకితం చేశారో అదే వైమానిక స్థావరంలో తుది వీడ్కోలు పలకనున్నారు. మిగ్ల స్థానంలో ‘ఎంకె–1ఎ’లుభారత వాయు సేన 1963 నుండి మిగ్–21లను ఉపయోగిస్తోంది. ఇప్పుడు వీటి స్థానంలోకి, దేశీయంగా తయారౌతున్న ఎల్.సి.ఎ. తేజస్ ఎంకె–1ఎ విమానాలను వినియోగంలోకి తేబోతోంది. ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ (హెచ్.ఎ.ఎల్.) ఈ ఎంకె–1ఎ లను ఉత్పత్తి చేస్తోంది. హెచ్.ఎ.ఎల్.తో ఇప్పటికే 83 ఎంకె–1ఎ ల కోనుగోలు కోసం ఆర్డర్ పెట్టిన ప్రభుత్వం, భారత వాయుసేన ను మరింత బలోపేతం చేయటానికి ఇటీవలే మరో 93 ఎంకె–1ఎల కోసం రూ.66,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేళ్ల క్రితం తొలి విడతగా 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో ప్రభుత్వం ఆర్డరు ఇచ్చిన 83 విమానాల డెలివరీ కూడా మొదలు కావలసి ఉంది. -
ఫిష్ ఫ్యాషన్..!
చేపలను తలచుకోగానే చాలామందికి నోరూరే వంటకాలు గుర్తు రావడం సహజమే! కాని, ఇకపై న్యూ ఫ్యాషన్ గుర్తొస్తుంది. అదెలా అనుకుంటున్నారా? త్వరలోనే చేపల చర్మంతో తయారైన అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ సామగ్రి అందుబాటులోకి రానున్నాయి!అమెరికాలోని ‘కోస్టా డి పజారోస్’ అనే గ్రామానికి చేపల వేట ప్రధాన జీవనాధారం. ఈ గ్రామం పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉంది. ఈ గ్రామస్థులు చేపల వేటకు అనుసరించే ‘బాటమ్ ట్రాలింగ్’ పద్ధతి కారణంగా వీరిపై ఆంక్షలు మొదలయ్యాయి. బాటమ్ ట్రాలింగ్ అంటే పడవ అడుగుభాగంలో ఒక బరువైన వలను కట్టి, అన్ని రకాల చేపలను, సముద్ర జీవులను బయటికి లాగేస్తారు. ఈ పద్ధతి వల్ల సముద్ర ఆవాసాలు తీవ్రంగా దెబ్బతిని, సముద్ర జలాల్లోని జీవవైవిధ్యం నాశనం అవుతోంది. అందుకే ‘బాటమ్ ట్రాలింగ్’పై ఆంక్షలు పెరిగాయి. దీంతో ఆ గ్రామస్థులు ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యకలాపాలను అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగమే ఈ ఫిష్ ఫ్యాషన్!చేపల చర్మాన్ని ఉపయోగించి వినూత్న ఫ్యాషన్ ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ గ్రామస్థులు. చేపల చర్మాన్ని శుభ్రం చేసి, ఆకర్షణీయమైన తోలుగా మార్చి, దానితో చెవి పోగులు, నెక్లెస్లు, బ్యాగులు వంటి చాలా రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇది సరికొత్త ఫ్యాషన్గానే కాదు, స్థానికులకు జీవనోపాధిగా కూడా మారిపోయింది. ‘పీల్ మెరీనా’ అనే సహకార సంస్థ, స్థానిక మహిళలతో కలిసి చేపల చర్మాన్ని పలు ఉత్పత్తులుగా మారుస్తుంది. చేపల వేట ప్రధాన వృత్తిగా ఉన్న ఈ గ్రామస్థులు చేపల చర్మాన్ని పారవేయకుండా ఉపయోగించుకోవడం పర్యావరణానికి కూడా మేలు చేస్తోందంటున్నారు నిపుణులు. చేపల చర్మాన్ని తోలుగా మార్చే ప్రక్రియలో అనేక దశలుంటాయి. మొదట చేప చర్మాన్ని చేతులతో సున్నితంగా రుద్ది పొలుసులు, చర్మానికి అతుక్కున్న మాంసాన్ని తొలగిస్తారు. ఆ తరువాత, బట్టలు ఉతికినట్లు సబ్బుతో బాగా ఆ చర్మాన్ని కడుగుతారు. అనంతరం, గ్లిజరిన్, ఆల్కహాల్, సహజ రంగులను ఉపయోగించి ఆ చర్మానికి రంగులద్దుతారు. ఈ ప్రక్రియకు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల పాటు ఆ చర్మాన్ని ఎండలో ఆరబెడతారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, చేప చర్మం మృదువుగా, బలమైన తోలులా మారుతుంది. అలాగే వాటికి చేపల వాసన పూర్తిగా పోతుంది.ఇలా తయారు చేసిన చేపతోలుతో తయారు చేసిన వాటిలో బటర్ఫ్లై ఆకారంలో ఉండే చెవిపోగుల జత ధర సుమారు ఏడు డాలర్లు పలుకుతోందంటే, ఈ ఫిష్ ఫ్యాషన్ గిరాకీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేప తోలుతో తయారు చేసిన ఈ ఉత్పత్తులను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయిస్తున్నారు. అంతేకాకుండా, పంటారెనాస్లోని చిన్న తరహా వస్త్ర ఉత్పత్తిదారులకు కూడా ఈ తోలును అందిస్తున్నారు. భవిష్యత్తులో బ్యాగులు, పర్సులు, షూలను కూడా తయారుచేయాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు.చేపల చర్మాన్ని తోలుగా మార్చే ఈ సంప్రదాయం కొత్తది కాదు. అలాస్కా నుంచి స్కాండినేవియా, ఆసియా వరకు అనేక స్థానిక మత్స్యకార తెగలు వేల సంవత్సరాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. ఆన్లైన్లో కూడా ఈ ఉత్పత్తుల అమ్మకం సాగుతోంది. కోస్టా రికా కూడా ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించి, పర్యావరణ పరిరక్షణ ఉత్పత్తులను తయారుచేయడంలో ముందు వరుసలో నిలుస్తోంది. దీంతో అక్కడి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించడమే కాకుండా, వారి సృజనాత్మకతకు ఒక వేదిక దొరికింది. ఇంటి పనుల నుంచి బయటపడి, చక్కటి ఉపాధిని పొందుతున్న ఈ మహిళలు, తమ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో చూడాలని ఆశిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా చక్కని మార్గం. -
ఒకప్పుడు కల, నేడు కలిసిన వాస్తవం
ఒకప్పుడు తెరపై మాయాజాలం ప్రదర్శించిన వస్తువులు నేడు మన చేతిలోకి వచ్చేశాయి. సారథిలేని రథాలు కలల దృశ్యాల్లో నడిచేవి. ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లు రోడ్ల మీదకు వచ్చేశాయి. పురాణాల్లో అక్షయపాత్ర కోరిన భోజనాన్ని వెంటనే వడ్డించేది. నేడు ఫుడ్ డెలివరీ యాప్లు దాదాపు అదే తీరులో పనిచేస్తున్నాయి. విలన్ కోటలోని మంత్రదర్పణం నిఘా సాధనంగా ఉంటే, ఇపుడు సీసీ కెమెరాలు ప్రతిచోటా కాపలా కాస్తున్నాయి.శాస్త్ర సాంకేతికతలు ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో సినిమాలు ప్రేక్షకులకు చూపిన అద్భుత స్వప్నాలివి. మానవ మేధ వీటిని ఒక్కొక్కటిగా సాకారం చేస్తూ, వాస్తవ జీవితంలోకి తీసుకొచ్చేసింది.ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు గాల్లో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతే, కార్లు డ్రైవర్ లేకుండా పరిగెత్తితే, గడియారం తిప్పగానే కాలంలో వెనక్కు వెళ్లిపోతే – థియేటర్లో కూర్చున్న మనకు ఒక్కటే అనిపించేది: ‘అయ్యో! ఇది కలల్లోనూ జరగదు.’ కాని, జీవితం కూడా ఒక సినిమా కథలాంటిదే కదా! అందుకే, ఆ కల్పనలు ఒక్కొక్కటిగా నిజం అవుతూనే ఉన్నాయి. నేడు స్మార్ట్వాచ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాం. తెరపై కనిపించిన మాయా అక్షయపాత్రలాగా, ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ రూపంలో ఇంటి గుమ్మం వద్దకే పిజ్జా చేరుస్తోంది. వర్చువల్ కళ్లజోడు పెట్టుకుంటే మనం గదిలో కూర్చుని కూడా చంద్రుడి మీద నడుస్తున్నాం. మరమనిషి ఒకప్పుడు హీరోకి తోడుగా పోరాడితే, ఇప్పుడు మనకి ఇళ్లలో వాక్యూమ్ క్లీనర్ రూపంలో గచ్చు తుడుస్తోంది. మనుషులు, వస్తువులను మాయం చేసే అదృశ్యశక్తుల పరికరాల ఆవిష్కరణలు, ఇప్పుడు పరీక్షల్లో నిజమయ్యే ఫలితాలను చూపిస్తున్నాయి. మొత్తానికి, సినిమాల్లో కనిపించిన కలల గాడ్జెట్లు ఒక్కొక్కటిగా మన దగ్గరికి వచ్చి, మనల్ని బులిపిస్తున్నాయి, ఆశ్చర్య పరుస్తున్నాయి. రేపు తెరపై కనిపించే కొత్త గాడ్జెట్ ఏ రూపంలో మన ఇంటి లివింగ్ రూమ్లో దిగిపోతుందో! ఒకవేళ అలా దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.జెట్ప్యాక్ – థండర్బాల్ (1965)సినిమాలో హీరో జెట్ప్యాక్ వేసుకొని భవనం మీద నుంచి ఎగిరిపోతాడు. ఆ సన్నివేశం చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయి ‘ఇది అసలు సాధ్యమేనా?’ అనుకున్నారు. కాని, 1961లోనే అమెరికా రక్షణ పరిశోధన సంస్థ బెల్ ఏరోసిస్టమ్స్ కంపెనీతో కలిసి మొదటి జెట్ప్యాక్ను పరీక్షించింది. తర్వాత 2011లో ఫ్రాన్స్లో, 2019లో అమెరికాలో పర్యాటక ప్రదర్శనల్లో వాడారు. కొన్ని దేశాల సైన్యాలు కూడా శిక్షణలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నాయి. ఇంకా మన దగ్గరకు రాలేదు కాని, ఒకవేళ వస్తే? మొదటగా ట్రాఫిక్ దాటడానికి ఉపయోగించవచ్చు. లేజర్ కట్టర్ – గోల్డ్ఫింగర్ (1964)సినిమాలో హీరోను కుర్చీకి కట్టి, కింద నుంచి లేజర్ ఆన్ చేసే సన్నివేశం మరచిపోలేనిది. అప్పట్లో అది కత్తి కంటే భయంకరంగా అనిపించింది. ఆ కాలంలో లేజర్ టెక్నాలజీ కొత్తగా ఉండేది, ప్రజలు అద్భుతంగా భావించారు. కాని, 1960లో అమెరికా శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ మొదటి లేజర్ను రూపొందించారు. 1970ల నుంచి వైద్యరంగంలో కంటి శస్త్రచికిత్సలకు, 1980లలో పారిశ్రామిక రంగంలో లోహాలను కత్తిరించడానికి ఉపయోగించడం మొదలైంది. నేడు పచ్చబొట్లను తొలగించడం నుంచి ఎన్నోరకాల శస్త్రచికిత్సల వరకు లేజర్ వాడకం సాధారణంగా మారింది. రోలెక్స్ గాడ్జెట్ వాచ్ – లివ్ అండ్ లెట్ డై (1973)గడియారం అంటే అప్పట్లో సమయం చెప్పే యంత్రం మాత్రమే! కాని, బాండ్ వాచ్? శత్రువు బుల్లెట్లను దూరంగా తోసే మాగ్నెట్, తలుపులు తెరిచే లేజర్, అవసరమైతే విద్యుత్ షాక్ కూడా! అది చూసి, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ పనులన్నీ మన వాచ్ కూడా చేస్తుంది. 1972లో హామిల్టన్ కంపెనీ మొదటి డిజిటల్ వాచ్ విడుదల చేసింది. 2010లలో యాపిల్, శాంసంగ్ స్మార్ట్వాచ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒకప్పుడు బాండ్ వాచ్ శత్రువులను ఎదుర్కొంటే, ఇప్పుడున్న వాచ్ అంతకంటే ఎక్కువ పనులే చేస్తుంది. అడుగులు లెక్కపెడుతుంది, నిద్ర కొలుస్తుంది, గుండె కొట్టుకోవడమే కాదు – ‘నువ్వు ఎక్కువగా కూర్చున్నావు, ఇక లే’ అని హెల్త్ అలర్ట్ కూడా ఇస్తుంది. సబ్మరైన్ కారు – ది స్పై హూ లవ్డ్ మీ (1977)బాండ్ లోటస్ కారు నీటిలోకి దూకి సబ్మరైన్ గా మారిపోతే థియేటర్లో చప్పట్లు మిన్నంటాయి. ఆ సమయంలో ఇలాంటిది ఊహించడమే గొప్ప. ఇప్పుడు చిన్న పర్సనల్ సబ్మరైన్ ్స ఉన్నాయి. 2008లో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ కారుకు ప్రేరణగా ఒక సబ్మరైన్ కారు ప్రాజెక్ట్ ప్రకటించాడు. చిన్నపాటి వ్యక్తిగత సబ్మరైన్లు ఇప్పటికే లగ్జరీ యాట్స్లో ఆటబొమ్మల్లా వాడుతున్నారు. మన దగ్గర అయితే? పెద్ద పెద్ద చేపలు పట్టి బజారులో అమ్మడానికి కూడా వాడుతున్నారు. కమ్యూనికేటర్ వాచ్ – డిక్ ట్రేసీ (1946)హీరో తన గడియారంలోనే ఫోన్ కాల్ మాట్లాడిన సీన్ అప్పట్లో ప్రేక్షకులకు అద్భుతం. చాలామందికి అది జాదూగా అనిపించింది. ఇప్పుడేమో మనకు స్మార్ట్వాచ్లు సాధారణమే. 1970లలో మొదటి వాచ్ రేడియో వచ్చింది. 2000ల తర్వాత స్మార్ట్వాచ్లు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు వాచ్తోనే వీడియో కాల్స్ కూడా చేయగలుగుతున్నారు. దీంతోనే జీపీఎస్ ఆధారంగా లొకేషన్ షేరింగ్, అలెర్ట్ బటన్స్ వంటివి కూడా ఉపయోగించుకోగలుగుతున్నారు.స్టార్ట్రెక్ కమ్యూనికేటర్ – స్టార్ట్రెక్ (1966)చిన్న పరికరంలా కనిపిస్తూ ఓపెన్ చేసే ఫోన్. అంటే మన ఆధునిక భాషలో ఫోల్డబుల్ ఫోన్. అప్పట్లో ఫోన్ మూసే శబ్దం ‘క్లక్!’ ఒక స్టయిల్ ఐకాన్గా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఆకట్టుకున్న విషయం. ఇప్పుడు మనకు టచ్ స్క్రీన్ ఫోన్లకు డిమాండ్ ఉన్నా, ఫ్లిప్ ఫోన్ డిజైన్కే క్రేజ్ ఉంది. ట్రైకార్డర్ – స్టార్ట్రెక్ (1966)ఒక చిన్న పరికరం శరీరాన్ని స్కాన్ చేసి ఆరోగ్య ఫలితాలు చెబుతుంది. అప్పట్లో అది అద్భుతం. కాని, 2017లో అమెరికా ‘క్వాల్కమ్ ట్రైకార్డర్ ఎక్స్ ప్రైజ్’ పోటీలో కొన్ని కంపెనీలు వాస్తవికంగా రోగ నిర్ధారణ చేసే స్కానర్లు అభివృద్ధి చేశాయి. ఇప్పుడు పోర్టబుల్ మెడికల్ స్కానర్లు సాధారణం అవుతున్నాయి. మన ఇంట్లో ఉంటూనే రోజూ స్కాన్ చేసి మన ఆరోగ్య విషయాలను తెలుసుకోవచ్చు. హోవర్బోర్డ్ – బ్యాక్ టు ది ఫ్యూచర్ 2 (1989)గాల్లో ఎగిరే స్కేట్బోర్డ్ అప్పట్లో కలలా కనిపించింది. 2015లో లెక్సస్ కంపెనీ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో హోవర్బోర్డ్ను ప్రదర్శించింది. ఇప్పుడు వాటిల్లో ఎన్నో ప్రోటోటైప్లు ఉన్నాయి, అయితే ఖరీదు ఎక్కువ. వినియోగం పరిమితం. మన దగ్గర ఉంటే? ఎక్కువగా వర్షకాలంలో గుంతలు దాటడానికి ఉపయోగిస్తామేమో! ఎలక్ట్రికల్ కారు, ఎగిరే కార్లు – బ్యాక్ టు ది ఫ్యూచర్ (1985)ఇంధనంతో నడిచే కార్లు కామన్ కాని, విద్యుత్ శక్తితో నడిచే కారు– అది కూడా అవసరమైనప్పుడల్లా గాల్లో ఎగురుతుంది. ఇది చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. కాని, ప్రపంచంలోనే మొదటి విద్యుత్ కారు 1880లలోనే తయారైంది! కాలక్రమంలో పెట్రోల్ చౌక కావడంతో దాదాపు శతాబ్దానికి పైగా అవి మూలపడ్డాయి. పూర్తిగా, 1996లో అమెరికా ‘జీఎం ఈవీ1’ అనే ఆధునిక ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెచ్చింది. 2008 తర్వాత టెస్లా రాకతో విద్యుత్ కార్లు మళ్లీ పుంజుకున్నాయి. భారత్లో 2010 తర్వాత టాటా, మహీంద్రా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి. 2021లో జపాన్ ‘స్కైడ్రైవ్’ కంపెనీ ఫ్లైయింగ్ కారును విజయవంతంగా పరీక్షించింది. ఒకవేళ మన దగ్గర వస్తే? ట్రాఫిక్ టెన్షనే ఉండదు.వాయిస్ కార్ (కిట్) – నైట్రైడర్ (1982)హీరో కారుతో మాట్లాడుతూ – ‘హే కిట్, రా!’ అని పిలిస్తే వెంటనే కారు వచ్చేది. ఇప్పటి సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ ఇదే చేస్తున్నాయి. కాని, కొన్నిసార్లు ఇవి పొరపాటున తప్పు దారి చూపించడం మాత్రం ఇంకా మానలేదు. భారతీయ సినిమాలు ఎప్పటి నుంచో కేవలం వినోదం మాత్రమే కాదు, ఊహాశక్తికి అద్దం పట్టే వేదికలు కూడా. ఇక్కడ హీరో పాట పాడితే పూలు కురుస్తాయి, విలన్ చేతిలోంచి మంటలు ఎగసిపడతాయి, దేవతలు ఆకాశం నుంచి దిగిపోతారు. కాని, వీటన్నింటికంటే ఆసక్తికరమైనవి సినిమాల్లో కనిపించే గాడ్జెట్లు. ‘మాయాబజార్’లో ఘటోత్కచుడు తెరిచిన మాయాపేటిక– ప్రియదర్శిని, ‘ఆదిత్య 369’లో టైమ్ మెషిన్, జగదేకవీరుడు అతిలోకసుందరిలో కనిపించిన శ్రీదేవి ఉంగరం. ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాయి. ‘ఇలాంటివి నిజంగా ఎప్పుడైనా వస్తాయా?’అనుకున్నారు. ఆ కలలే తర్వాత ఒక్కొక్కటిగా వాస్తవ రూపం దాల్చాయి.టైమ్ మెషిన్ – ఆదిత్య 369 (1991)బాలకృష్ణ టైమ్ మెషిన్ లో కూర్చుని గతానికి, భవిష్యత్తుకి వెళ్తాడు. ఈ కాలయానం ఇప్పటికీ పూర్తిగా ఊహే. కానీ 1905లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కాంతి వేగానికి దగ్గరగా వెళ్తే కాలప్రవాహం మారుతుందని నిరూపించారు. అంటే సినిమా కల్పన అయినా, దానికి శాస్త్రీయ పునాది ఉంది. భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అదృశ్య గడియారం – మిస్టర్ ఇండియా (1987)అనిల్ కపూర్ గడియారం పెట్టుకున్న వెంటనే కనబడకుండా పోతాడు. ఇది 2006లో అమెరికాలో శాస్త్రవేత్తలు మెటా పదార్థాలు వాడి చిన్న వస్తువులను అదృశ్యం చేయగలిగారు. 2015లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మరింత మెరుగైన ప్రయోగాలు చేసి, మరికొన్ని వస్తువులను అదృశ్యం చేయడాన్ని ప్రదర్శించింది. మాయాపేటిక – మాయాబజార్ (1957)ఘటోత్కచుడు పెట్టె తెరిస్తే ఎవరు కోరుకున్నవి వాళ్లకు కనిపిస్తాయి– బంగారం కావచ్చు, భోజనం కావచ్చు. ఇప్పుడు ఒక్క బటన్ నొక్కితే భోజనం మన ఇంటి తలుపు దగ్గరే! 2010 తర్వాత ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఈ కలను వాస్తవం చేశాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా అచ్చం ఆ పెట్టెలా – మనం ఏం కోరుకుంటామో, దాన్నే చూపిస్తుంది.మరమనిషి – రోబో (2010)రజనీకాంత్ ఈ సినిమాలో ‘చిట్టి’ పాత్రలో జనాలను మెప్పించారు. ‘చిట్టి’ చదివే, ప్రేమించే, కోప్పడే మరమనిషి. 2016లో హాంకాంగ్ ‘హాన్సన్ రోబోటిక్స్’ రూపొందించిన ‘సోఫియా’ రోబో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2021లో టెస్లా కూడా మానవాకార రోబో ప్రాజెక్ట్ను ప్రకటించింది. నేడు రోబోలు ప్రధానంగా పరిశ్రమల్లో, స్మార్ట్ హోమ్లలో సహాయకులుగా ఉన్నా, మన ‘చిట్టి’లా భావోద్వేగాలు పంచుకునే రోబోలు ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు.భవిష్యత్ కళ్లజోడు – రావన్ (2011)ఈ సినిమాలో కళ్లజోడు పెట్టుకుంటే హీరో ఆటలోకి ప్రవేశిస్తాడు. 2012లో మొదటి వర్చువల్ రియాలిటీ పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని గేమ్స్, పాఠశాలలు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో వాడుతున్నారు.శక్తిమంతమైన దుస్తులు – క్రిష్ (2006)హీరో ప్రత్యేక దుస్తులు వేసుకున్న వెంటనే అద్భుత శక్తులు పొందుతాడు. 2013లో అమెరికా సైన్యం ‘ఎక్సోస్కెలిటన్ ’ సూట్లను అభివృద్ధి చేసింది. ఇవి ధరిస్తే భారాన్ని మోయడం సులభం అవుతుంది, ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. భవిష్యత్తులో ఇవి సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. మాయా పరికరం– జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)శ్రీదేవి దగ్గర ఉన్న మాయా ఉంగరం ఏ పనైనా ఇట్టే చేసేస్తుంది. 2007 తర్వాత స్మార్ట్ఫోన్లు మన జీవితంలోకి వచ్చి బ్యాంకింగ్, షాపింగ్, భోజనం ఆర్డర్, సంభాషణ – అన్నీ ఒకే పరికరంలో సాధ్యమయ్యాయి. సినిమాలో మాదిరే బటన్ నొక్కగానే ఇంట్లో తలుపులు తెరుచుకోవడం, భోజనం సిద్ధమవ్వడం, బట్టలు మడతవేయడం చూసి ప్రేక్షకులు ‘అరే వాహ్!’ అనుకున్నారు. కాని, నేడు మన ఇళ్లలోని వాషింగ్ మెషిన్ , డిష్ వాషర్, మైక్రోవేవ్, వాక్యూమ్ క్లీనర్ అన్నీ ఆటోమేటిక్. ఇంకా మొబైల్తో నియంత్రించే ‘స్మార్ట్ హోమ్’ అప్లికేషన్స్ ఎన్నో వచ్చేశాయి. ఒక్క సైగ చేస్తే లైటు వెలిగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది. సీసీ కెమెరా – రాక్షసరాజు, గజని గంధర్వుడుపాత సినిమాల్లో విలన్ కోటలోకి ఎవరెవరు వస్తున్నారో కనిపెట్టడానికి ఒక పెద్ద అద్దం ముందు కూర్చుని ‘సీసీ టీవీ’లా చూపించే సన్నివేశాలు గుర్తున్నాయా? అప్పట్లో అది మాంత్రిక ప్రభావంలా అనిపించింది. కాని, 1960లోనే మొదటి సీసీ కెమెరాలను జర్మనీలో సైనిక వినియోగానికి వాడారు. తర్వాత 1990లలో వాణిజ్య రంగంలోకి వచ్చి, 2000ల తర్వాత భారత్లో ఇళ్లలో, ఆఫీసుల్లో, రోడ్లపైకి కూడా విస్తరించాయి. ఇప్పుడు ఇవి లేకుండా భద్రత ఊహించలేము.హోలోగ్రామ్ సన్నివేశం – జీన్స్ (1998)హీరోయిన్ హోలోగ్రామ్ టెక్నాలజీని వినియోగించి సంగీతం, నృత్యం, కొన్ని విచిత్ర సందర్భాలు చూపిస్తూ నవ్వించే ప్రదర్శన ఇస్తుంది. ఆ హోలోగ్రామ్ సన్నివేశం అప్పట్లో కేవలం సినిమా మ్యాజిక్, స్పెషల్ ఎఫెక్ట్ మాత్రమే! కాని, హోలీగ్రామ్ టెక్నాలజీ నిజ జీవితంలో అంతకుముందే రూపుదిద్దుకుంది. 1960లో లేజర్ ఆవిష్కరణతో హోలోగ్రఫీ శాస్త్రానికి పునాది పడింది. 2012లో టుపాక్ షకూర్ అనే ర్యాపర్ మరణించినా, అతని హోలోగ్రామ్ ప్రదర్శన కోచెల్లా స్టేజ్పై ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ , ఎల్విస్ ప్రెస్లీ వంటి ప్రముఖుల ప్రదర్శనలకు కూడా హోలోగ్రామ్ను వినియోగించారు. నేడు హోలోగ్రామ్లు విద్య, వైద్యం, వ్యాపార సమావేశాలు, వర్చువల్ ఈవెంట్స్ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. ఇక భవిష్యత్తులో మన ఇళ్లలో, పెళ్లిళ్లలో, సమావేశాల్లో హోలోగ్రామ్ రూపంలో అతిథులకు ‘హాయ్!’ చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. డ్రైవర్ లేని కార్లు – శ్రీకృష్ణ పాండవీయమ్ (1966)ఘటోత్కచుడు తన మాయాశక్తితో రథాన్ని సారథి లేకుండానే నడిపిస్తాడు. ఇదే విధంగా మరెన్నో పాత చిత్రాల్లో రథం లేదా కారు దేవతా శక్తితో తనంతట తానే నడుస్తుంది. డ్రైవర్ లేని వాహనం అప్పట్లో కల్పన. 2010 తర్వాత గూగుల్, టెస్లా, ఊబెర్ వంటి కంపెనీలు అమెరికా, జపాన్ , యూరప్లలో స్వయంచాలిత కార్లను రోడ్లపై పరీక్షించాయి. 2020లలో కొన్ని నగరాల్లో టాక్సీ సర్వీసులుగా కూడా ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. నిన్న సినిమాల్లో కలలా కనబడినవి, నేడు శాస్త్రవేత్తల చేతుల్లో వాస్తవమయ్యాయి. రేపు మరెన్నో ఆవిష్కరణలతో, ఊహలకు కూడా అందని పరికరాలు జీవితంలో భాగమవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా రీల్ నుంచి రియల్కి ప్రయాణించే ఈ గాడ్జెట్ కథలు అంతులేని కథలా కొనసాగుతూనే ఉంటాయి! ఊహలకు అందని ఆవిష్కరణలు! భవిష్యత్తు ఊహలు ఇప్పటికీ తెరపై మాయాజాలంలా కనబడుతున్నా, రేపటికి అవి మన జీవితంలో రొటీన్ గా మారిపోవడం ఖాయం. ఒక టెలిపోర్టేషన్ మెషిన్ తో ఇంటి గుమ్మం నుంచి నేరుగా ఆఫీసు కుర్చీలో కూర్చోవచ్చు. అప్పుడు ట్రాఫిక్ అనే టెన్షన్ ఉండదు. మెమరీ ట్రాన్ ్సఫర్ గాడ్జెట్తో పరీక్ష ముందు రాత్రుళ్లు నిద్ర మానుకుని పుస్తకం చదవాల్సిన అవసరమే లేదు, సబ్జెక్ట్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు! ఆలోచన చదివే పరికరం మన మైండ్లో దాగి ఉన్న మాటల్ని బయటపెడుతుంది, అప్పుడు ‘ఏం అనుకుంటున్నావు?’ అనే ప్రశ్నే ఉండదు. రోబో–షెఫ్ మన ఇష్టం అడిగి భోజనం సిద్ధం చేస్తాడు, డ్రోన్లు కిరాణా వస్తువులను గుమ్మం ముందు పడేస్తాయి. నిద్రలో చూసిన కలలను కలల ప్రొజెక్టర్లో సినిమాలా తిరిగి చూడగలిగే రోజులు కూడా వస్తాయి. గాల్లో ఎగిరే మనుషుల్లా మారిపోతే, ట్రాఫిక్ను చరిత్రలోకి నెట్టేయవచ్చు. స్వయంచాలిత డ్రోన్ ప్యాకేజీలతో పాటు మనల్ని కూడా ఎయిర్టాక్సీలా తీసుకెళ్తాయి. ఇక ఇంట్లో పనులు? రోబో మేడ్స్, స్మార్ట్ ఫర్నిచర్ అన్నీ స్వయంగా చూసుకుంటాయి. నేడు ఇవన్నీ సైన్ ్స ఫిక్షన్ లా అనిపిస్తున్నా, నిన్న ఫోన్ లేకుండా ఊహించలేనట్టు, రేపు ఈ గాడ్జెట్లు లేకుండా కూడా జీవితాన్ని ఊహించలేకపోవచ్చు. -
నటి లావణ్య త్రిపాఠి లుక్ని యంగ్గా చూపించే ఫ్యాషన్ సీక్రెట్స్ ఇవే..!
స్టయిల్కి ఒక ఫ్రెండ్, సింపుల్ బ్యూటీకి ఒక సీక్రెట్ ఉంటే అది లావణ్య త్రిపాఠీనే! ఎక్కడ చూసినా ఆమె చిన్న చిరునవ్వు, సాఫ్ట్ గ్లో కలసి తన మొత్తం లుక్ను నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్తాయి. చిన్న స్టడ్స్, మినిమల్ జ్యూలరీ నా ఫేవరెట్. అవే నా పర్సనాలిటీని బెస్ట్గా రిఫ్లెక్ట్ చేస్తాయి. కొన్నిసార్లు ఒక్క స్టేట్మెంట్ పీస్ చాలు, లుక్ మొత్తం ఎలివేట్ అవుతుంది. డ్రెస్లలో పేస్టల్ షేడ్స్, సాఫ్ట్ కలర్స్నే నేను ఎక్కువగా ఎంచుకుంటాను. ఇవి నన్ను ఎప్పుడూ ఫ్రెష్గా, యంగ్గా చూపిస్తాయని అంటుంది లావణ్య త్రిపాఠి. ఇక్కడ లావణ్య ధరించిన డ్రెస్ బ్రాండ్ ఇస్సా స్టూడియో. ధర: రూ. 19,500, జ్యూలరీ బ్రాండ్: రియా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.చెవిపోగుల బాస్!అమ్మాయిల అలంకరణకు ప్రాణం పోయడానికి పెద్ద పెద్ద ఆభరణాలు అవసరం లేదు, సరైన చెవిపోగులు ఉంటే చాలు. మొత్తం స్టయిల్నే మరో లెవెల్కి తీసుకెళ్తాయి. అలాంటి వాటిలో ముందుండేవి ఈ లాంగ్ డ్రాప్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. గోల్డెన్ టచ్తో మెరిసే స్టోన్స్, లేయర్ డిజైన్ , చూసే వారందరినీ ఆకట్టుకునే మెరుపు – ఇవన్నీ కలిపి ఒకేసారి రాయల్గా, మోడ్రన్ గా కనిపించేలా చేస్తాయి. పొడవుగా ఉండటం వలన ముఖాన్ని సన్నగా చూపిస్తాయి, ముఖానికి ఎలిగెన్స్ ఇస్తాయి. జుట్టు వెనక్కి కట్టుకున్నా, లైట్ వేవ్స్లో వదిలినా, ఈ ఇయర్రింగ్స్ మెరుపే మొదట కనిపిస్తుంది. డీప్ వీ నెక్ లేదా బోట్ నెక్ టాప్ వేసుకుంటే చెవిపోగులు ఇంకా క్లాసీగా మెరిసిపోతాయి. మేకప్ విషయానికి వస్తే షిమ్మరీ ఐలిడ్, లైట్ మస్కారా, న్యూడ్ లిప్ షేడ్ సరిపోతాయి. స్టేట్మెంట్ పీస్ కాబట్టి నెక్లెస్ అవసరం లేదు, సింపుల్ రింగ్ లేదా బ్రేస్లెట్ చాలు. వెడ్డింగ్, రిసెప్షన్ , ఫెస్టివల్ లేదా పార్టీ ఏ సందర్భంలో వేసుకున్నా ఈ చెవిపోగులు లుక్కి ఒక స్పెషల్ స్టన్నింగ్ టచ్ ఇస్తాయి. సింపుల్ డ్రెస్పైనా కూడా ఇవి వేసుకుంటే ఆటోమేటిక్గా గ్లామరస్గా, రాయల్గా మారిపోతారు. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
నూడుల్స్ తినడమే ఒక గేమ్!
చాలా దేశాల్లో ఆడుతూ పాడుతూ ఆహారాన్ని ఆస్వాదించడం కూడా ఒక సంప్రదాయమే! తినేవారిలో గొప్ప అహ్లాదాన్నీ, అనుభూతినీ నింపే ఈ కళలకు ప్రజాదరణా ఎక్కువే! ఆయా దేశాల జీవనశైలికి తగినట్లుగా ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన ఆహారపు విధానాలు ప్రపంచదేశాల పర్యాటకుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటిదే జపాన్లోని ‘నాగాషి సోమెన్’ అనే అహ్లాదకర విధానం. ఈ విధానం అక్కడ వేసవి కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ) ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో జపాన్ వెళ్లిన పర్యాటకులు కూడా ఈ ‘నాగాషి సోమెన్’ నూడుల్స్ని రుచి చూస్తుంటారు. జపనీస్ భాషలో ‘నాగాషి’ అంటే ‘ప్రవహించేది’, ‘సోమెన్’ అంటే సన్నని నూడుల్స్ అని అర్థం. ఈ పద్ధతిలో, గోధుమతో చేసే సాఫ్ట్ నూడుల్స్ వెదురు గొట్టాల గుండా ప్రవహించే చల్లని నీటిలో వెళ్తుంటాయి. వాటిని ఇరువైపులా కూర్చున్న జనాలు చాప్స్టిక్లతో పట్టుకుని తినడం ఒక సరదా ఆటలా ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన సరదా ఆట. పట్టుకున్న నూడుల్స్ని ‘త్సుయు’ అనే సోయా డిప్పింగ్ సాస్లో ముంచుకుని తింటారు. ఈ సాస్ నూడుల్స్కు మంచి రుచిని ఇస్తుంది. వేసవిలో వేడి ధాటి నుంచి ఈ చల్లని నూడుల్స్ ఉపశమనం ఇస్తాయట. నాగాషి సోమెన్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే ఒక సామాజిక కార్యక్రమం. చాలా నాగాషి సోమెన్ రెస్టరెంట్లు ప్రకృతి ఒడిలో, నదులు లేదా అడవుల పక్కన ఉంటాయి. ఇది ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి అందాలను చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే, మీరు ఒకసారి పట్టుకోవడంలో విఫలమైతే, ఆ నూడుల్స్ కిందకు వెళ్లిపోతాయి. అందుకే ఈ వెదురు బొంగుల పక్కన కూర్చున్నవారు చాలా జాగ్రత్తగా, చురుకుగా ఉండాలి. నూడుల్స్ మొత్తం అయిపోయాయని సూచించడానికి చివరగా షెఫ్స్ ఒక గులాబీ రంగు నూడుల్ను వదులుతారు. ఇది ముగింపుకు సంకేతం. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
ఒక్కటి తగ్గినా.. పర్ఫెక్ట్గా కుదరదు
ఒక్క చూపుతోనే అందరి చూపునూ తనవైపు తిప్పుకొనే మ్యాజిక్ నిధి అగర్వాల్ది. ట్రెండ్స్ వెంట పరుగెట్టకుండా, సింపుల్ స్టయిలింగ్తోనే గ్లామర్ని క్రియేట్ చేస్తుంది. స్టయిలింగ్లో కొత్తదనాన్ని, కాన్ఫిడెన్స్ను మిక్స్ చేసే నిధి స్టయిల్ సీక్రెట్ మీకోసం. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్ బ్రాండ్: నితికా గుజ్రాల్, ధర: రూ. 2,18,500, జ్యూలరీ: బ్రాండ్ ముసలద్దీన్ జెమ్స్ అండ్ జ్యూలర్స్, ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఔట్ఫిట్ చాయిస్లో ఎప్పుడూ కంఫర్ట్, స్టయిల్ రెండూ ఉండేలా చూసుకుంటాను. ఏ ఒక్కటి తగ్గినా స్టయిలింగ్ పర్ఫెక్ట్గా కుదరదు. డ్రెస్కు సరిపోయే మేకప్ తప్పనిసరి. ఎక్కువగా మినిమల్ మేకప్, జ్యూలరీనే ప్రిఫర్ చేస్తానని చెబుతోంది నిధి అగర్వాల్.నుదుటిన మెరిసే మ్యాజిక్!నుదుటి మధ్యలో వేలాడుతూ ఉండే ఈ మాంగ్ టిక్కా ఒక చిన్న ఆభరణం మాత్రమే కాదు, అమ్మాయిలకు క్వీన్ ఫీలింగ్ ఇచ్చే మాయాజాలం. పెళ్లి, సంగీత్, మెహందీ, పార్టీ– ఏ సందర్భమైనా సరే, పాపిట బిళ్ల వేసుకున్న వెంటనే మిగతా ఆభరణాలు అన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లిపోతాయి. చీర కట్టుకుంటే గోల్డ్ లేదా కుందన్స్ పాపిట బిళ్ల మెరుస్తూ రాయల్టీ టచ్ ఇస్తుంది.లెహంగా లేదా హాఫ్శారీ అయితే పర్ల్ లేదా స్టోన్ పాపిటి బిళ్లతో మెరిసిపోతూ ప్రిన్సెస్ లుక్ గ్యారంటీ! వెస్ట్రన్ గౌన్ వేసుకున్నారా? పాపిట బిళ్ల కూడా మినిమల్ స్టయిల్కి వచ్చి మీ లుక్ను మరింత స్టయిలిష్గా మార్చేస్తుంది. మధ్య పాపట ఉండే హెయిర్ స్టయిల్స్ ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే, మధ్య భాగం జుట్టుతో పాపట బిళ్ల వేసుకుంటే ఫొటోలు సూపర్గా వస్తాయి, పెళ్లిపూల జడతో కలిపితే మాత్రం ఇక నువ్వే అసలైన మహారాణి! మార్కెట్లో ఎన్నో రూపాల్లో లభిస్తున్నాయి. గోల్డ్, వెండి, కుందన్ డిజైన్స్లోనూ. జ్యూలరీ షాపుల్లో లైట్ వెయిట్ మోడల్స్లోనూ ఉంటాయి, ఆన్లైన్లో అయితే కలర్ఫుల్ డిజైన్స్ ఒక్క క్లిక్తో ఇంటికి చేరిపోతాయి. (చదవండి: 'అద్భుత భవంతులు': వాస్తుకళా నైపుణ్యానికి సాంకేతిక జత చేసి..) -
అక్కడ చనిపోయి... ఇక్కడ బతికాడు!
అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ముప్పయ్యారు బాంబు పేలుళ్లకు పాల్పడిన డాక్టర్ బాంబ్ అలియాస్ జలీస్ అన్సారీ ప్రధాన అనుచరుడు సయ్యద్ ముసద్దిక్ వహీదుద్దీన్ ఖాద్రీ వింత కథ ఇది. ముంబైలోని ఏడు విధ్వంసాలకు బాధ్యుడైన ఖాద్రీ అక్కడి పోలీసుల రికార్డుల ప్రకారం 2003లో చనిపోయాడు. రికార్డుల్లో చనిపోయిన ఇతగాడు రహస్యంగా హైదరాబాద్కు మకాం మార్చి, 2010 వరకు గుట్టుగా బతికాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి తన అనుచరులకు ఈ–మెయిల్ పంపడంతో మహారాష్ట్ర ఏటీఎస్కు పట్టుబడ్డాడు. ప్రస్తుతం పరవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.సినిమాను తలపించే ఖాద్రీ ఉదంతం ఇదీ...ముంబైకి చెందిన డాక్టర్ జలీస్ అన్సారీ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తరవాత అతివాద భావాలు గల కొందరిని అనుచరులుగా చేసుకుని ముఠా కట్టాడు. వారిలో ఖాద్రీ కూడా ఒకడు. ఈ ముఠా 1993–94ల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడింది. వీరు టార్గెట్ చేసిన వాటిలో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువగా ఉన్నాయి. జలీస్ అన్సారీ ముఠా 1993లో హైదరాబాద్లోని నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లలో పేలుళ్లుకు ఒడిగట్టింది. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో దిట్ట అయిన జలీస్ అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్ బాంబ్’ అని పిలుస్తుంటాయి. 1994 జనవరి 3న పోలీసులకు చిక్కడంతో ఇతడి విధ్వంసాలకు పుల్స్టాప్ పడింది. జలీస్ అన్సారీకి ప్రధాన అనుచరుడు ఖాద్రీపై ముంబైలో అనేక కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న జంజీరామురాజ్ ఇతడి స్వగ్రామం. ముంబైలోని కేసులన్నీ 1998లో వీగిపోవడంతో నిర్దోషిగా బయటకు వచ్చాడు. కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన అంతర్రాష్ట్ర గజదొంగ యాడ వసంత్ గ్యాంగ్లో చేరి ఇతని ప్రధాన అనుచరుడైన గోపాల రమణ శెట్టితో కలిసి మహారాష్ట్రలో దోపిడీలకు పాల్పడ్డాడు. 2004లో హైదరాబాద్ అబిడ్స్లోని రాజ్యలక్ష్మీ జ్యూలర్స్ నుంచి రూ.1.5 కోట్లు సొత్తు దోపిడీ చేసింది ఈ ముఠానే! అయితే, ఆ కేసులో ఖాద్రీ ప్రమేయం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో జరిగిన దోపిడీల్లోనే ఇతను పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలోనే 2001లో ముంబై పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఆ తరవాతి ఏడాది బెయిల్పై విడుదలయ్యాడు. ఖాద్రీపై ముంబై ఏటీఎస్తో పాటు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిఘా పెరగడంతో ఓ పెద్ద కుట్ర పన్నాడు. పోలీసుల దృష్టిలో, ప్రభుత్వ రికార్డుల ప్రకారం తాను చనిపోయినట్లు నమ్మిస్తేనే నిరాటంకంగా తన కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుందని భావించిన ఖాద్రీ భార్యతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. 2003 ఆగస్టు 15న ముంబైలోని మీరారోడ్లో ఉన్న ఎస్ఏ అపార్ట్మెంట్స్లోని తన ఫ్లాట్కు సలీమ్ అనే అనుచరుడిని పిలిచాడు. మాటల్లో పెట్టి అతడి గొంతు నులిమి చంపేశాడు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా అదే గదిలో కాల్చేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పట్లో ఆ మృతదేహాన్ని చూసిన ఖాద్రీ భార్య అది తన భర్తదే అంటూ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ఖాద్రీ చనిపోయాడని, గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు కొలిక్కి రాకపోయినా, పోలీసు రికార్డుల్లో మాత్రం ఖాద్రీ చనిపోయాడు. తన భార్య, సోదరుడి సాయంతో తానే చనిపోయినట్లు ముంబై పోలీసులను నమ్మించిన ఖాద్రీ– తర్వాత జలీస్ అన్సారీ ముఠాలోని వ్యక్తుల సహకారంతో హైదరాబాద్కు వచ్చాడు. 2003 నుంచి 2006 వరకు సికింద్రాబాద్ ప్రాంతంలో నివసించాడు. ఆపై ఇమ్రాన్ అబు మన్సూర్ హత్మీ పేరుతో గోల్కొండలోని మొహల్లాగంజ్ ప్రాంతంలో అద్దె ఇంట్లో దిగాడు. అత్తర్లు, సుగంధ ద్రవ్యాలు విక్రయించే వ్యాపారి ముసుగు ధరించాడు. 2008లో ఇదే పేరు, చిరునామాతో డ్రైవింగ్ లైసెన్స్, 2009లో ఓటర్ గుర్తింపు కార్డు పొందాడు. తన కుటుంబాన్ని మాత్రం మహారాష్ట్రలోని చింబూర్లో ఉంచిన ఖాద్రీ తరచు అక్కడికి వెళ్లి వచ్చేవాడు. ఎప్పటికైనా మళ్లీ ముంబై వెళ్లాలని భావించిన ఇతగాడు అందుకోసం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపురేఖలు మార్చుకోవాలని భావించాడు. దీనికోసం హైదరాబాద్లోని ఓ డాక్టర్ను సంప్రదించాడు. ఇక్కడ ఉంటూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించిన ఖాద్రీ 2003 చివరలో పాకిస్తాన్ వెళ్లివచ్చాడు. అప్పటి నుంచి ఇతగాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొందరు ఉగ్రవాద సానుభూతిపరులైన వ్యక్తులతో పాటు తన అనుచరులతోనూ ఈ–మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. వీటి కోసం ఆసిఫ్నగర్లోని ఓ జిరాక్స్ అండ్ ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న కంప్యూటర్లను వినియోగించాడు. ఆ ఉగ్రవాదుల్లో కొందరి ఈ–మెయిల్స్పై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దృష్టి హైదరాబాద్ నుంచి వారికి వస్తున్న మెయిల్స్పై పడింది. తరచుగా ఇవి వస్తుండటంతో వాటిలోని సంభాషణలను అధ్యయనం చేశాయి. వీటిని పంపుతున్నది 2003లో ‘చనిపోయిన’ ఖాద్రీగా నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకుని రంగంలోకి దిగిన ముంబై ఏటీఎస్ అధికారులు ఈ–మెయిల్స్ పంపుతున్న ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ ఆధారంగా మెహదీపట్నంలోని ఇంటర్నెట్ సెంటర్ను గుర్తించారు. అక్కడ దాదాపు పది రోజులు మాటు వేసిన ప్రత్యేక బృందం 2010 ఆక్టోబర్లో ఖాద్రీని పట్టుకుని ముంబై తరలించింది. ఇతడు ఇప్పటికీ మహారాష్ట్ర జైలులోనే ఉన్నాడు. -
'అద్భుత భవంతులు': వాస్తుకళా నైపుణ్యానికి సాంకేతిక జత చేసి..
ప్రపంచంలోని కొన్నిచోట్ల ఇటీవలి కాలంలో చిత్ర విచిత్రమైన వింత భవంతులు పుట్టుకొస్తున్నాయి. వాస్తుకళా నైపుణ్యానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేసి నిర్మించిన ఈ అద్భుత భవంతులు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. వీటిలో కొన్నింటి విశేషాలను తెలుసుకుందాం.ది డ్యాన్సింగ్ హౌస్ఇది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో ఉంది. ఈ భవనం 1996లో పూర్తయింది. దీని ఆకృతి డ్యాన్స్ చేస్తున్న జంటను పోలి ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే దీన్ని మొదట్లో ‘జింజర్ అండ్ ఫ్రెడ్‘ అని పిలిచేవారు. ఆ పేరు ప్రముఖ డ్యాన్సర్లు జింజర్ రోజర్స్, ఫ్రెడ్ ఆస్టైర్ల పేర్ల నుంచి వచ్చింది. ఇది ఒక కార్యాలయ భవనం. అయితే, దీని పై అంతస్తులో ఒక రెస్టరెంట్ ఉంటుంది. ఆ రెస్టరెంట్లో కూర్చుని భోంచేస్తూ, ప్రేగ్ నగర అందాలను తిలకించడం మరపురాని అనుభూతిగా ఉంటుంది.ది వేవ్ బిల్డింగ్ఇది డెన్మార్క్లోని వెజ్లే నగరంలో ఉంది. దీనిని హెన్నింగ్ లార్సెన్ ఆర్కిటెక్ట్స్ సంస్థ డిజైన్ చేసింది. పేరుకు తగ్గట్టుగానే, ఇది వెజ్లే నౌకాశ్రయం పక్కన, సముద్ర కెరటాల ఆకారంలో ఉంటుంది. దీని నిర్మాణం 2009లో మొదలైంది. ఇది రెండు దశల్లో పూర్తయింది. మొదట ఒక వైపు నిర్మాణం పూర్తయిన తర్వాత, 2018లో రెండవ వైపు నిర్మాణం కూడా పూర్తయింది. వేవ్ బిల్డింగ్లో మొత్తం 140 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ భవనం తన డిజైన్, లైటింగ్తో ఆ ప్రాంతానికి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చింది. రాత్రిపూట ఈ భవనం విద్యుత్ కాంతులతో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ భవనం డిజైనింగ్ నైపుణ్యానికి అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.ఎలిఫెంట్ బిల్డింగ్ఇది థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఉంది. దీని నిర్మాణం 1997లో పూర్తయింది. థాయ్ ఆర్కిటెక్ట్ ఒంగ్–అర్డ్ సత్రాబంధు, ఇంజినీర్ డాక్టర్ అరుణ్ చైసెరితో కలిసి దీనిని రూపొందించారు. ఈ భవనం మూడు టవర్లను కలిగి ఉంటుంది, ఇవి ఏనుగు కాళ్లు, తొండంలా కనిపిస్తాయి. దీనికి ఏనుగు చెవులు, కళ్లు, దంతాలలాంటి డిజైన్ కూడా ఉంది. ఇది కేవలం ఒక ఆకర్షణీయమైన కట్టడం మాత్రమే కాదు, ఇందులో నివాసయోగ్యమైన అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, షాపింగ్ సెంటర్లు, బ్యాంక్, పోస్టాఫీసు వంటివి చాలానే ఉన్నాయి. ఏనుగు థాయ్లాండ్ జాతీయ జంతువు కావడంతో ఈ భవనం థాయ్ జాతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విచిత్ర, విలక్షణ భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.క్రాస్ టవర్స్ఇది దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఉంది. ఈ భవనాన్ని డానిష్ ఆర్కిటెక్ట్ సంస్థ బ్యార్కే ఇంగెల్స్ గ్రూప్ 2012లో డిజైన్ చేసింది. రెండు వేర్వేరు టవర్లు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా, వాటి మధ్యలోని కొన్ని గదులు ఒకదానితో ఒకటి కలిసేలా డిజైన్ చేశారు. ఇది బయట నుంచి చూడటానికి హ్యాష్ట్యాగ్లా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘హ్యాష్ట్యాగ్ టవర్స్’ అని కూడా అంటారు. గాలి, సూర్యరశ్మి భవనంలోకి ధారాళంగా వెళ్లేలా దీన్ని నిర్మించారు. దాంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఇందులో పలు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, నివాసయోగ్యమైన అపార్ట్మెంట్లు ఉన్నాయి.జిగ్జాగ్ టవర్స్ఇది ఖతార్ రాజధాని దోహాలో ఉంది. ఈ టవర్స్ను 2009లో నిర్మించారు. ఈ టవర్స్ రూపకల్పన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భవనం నిర్మాణం బయట నుంచి చూస్తే జిగ్జాగ్ ఆకారంలో ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. మాల్స్, రెస్టారెంట్లు, కేఫ్లు, వివిధ రకాల దుకాణాలు ఇందులో ఉంటాయి. ఈ రెండు టవర్స్లో మొత్తం 748 లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి.లాంగాబెర్గర్ బిల్డింగ్ ఇది అమెరికాలోని ఒహాయోలో ఉంది. ఈ భవనం లాంగాబెర్గర్ కంపెనీ ప్రధాన కార్యాలయం. ఈ కంపెనీ చేతితో తయారు చేసే చెక్క బుట్టలకు ప్రసిద్ధి చెందింది. తమ ప్రత్యేకతకు గుర్తుగా వారు తమ ప్రధాన కార్యాలయాన్ని ఒక పెద్ద బుట్ట ఆకారంలో 1997లో నిర్మించారు. ఇది నిజంగానే చూడటానికి బుట్టలా కనిపిస్తుంది. ఈ భవనం సుమారు 192 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 79 అడుగుల ఎత్తుతో ఉంటుంది. లాంగాబెర్గర్ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత, ఈ భవనాన్ని 2018లో అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం ఇది ఖాళీగా ఉంది, కాని, దాని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా ఇది ఇప్పటికీ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. సంహిత నిమ్మన -
ఈ సండే ఛత్తీస్గఢ్ ముఠియా, చైనా తాంగ్హుల్ క్యాండీ రెసిపీలు చేద్దాం ఇలా..!
పనీర్ బిర్యానీ బాల్స్కావలసినవి: బాస్మతి రైస్– ఒక కప్పు (ఉడికించి తీసుకోవాలి)పనీర్ కర్రీ– ఒక కప్పు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము– కొద్దికొద్దిగాబిర్యానీ మసాలా– ఒక టీ స్పూన్, గుడ్లు– 4, పాలు– ఒక టేబుల్ స్పూన్బ్రెడ్ పౌడర్, మైదా పిండి– ఒక కప్పు చొప్పున, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక గిన్నెలో బాస్మతి అన్నం తీసుకుని అందులో పనీర్ కర్రీ, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, బిర్యానీ మసాలా, మూడు కోడి గుడ్లు వేసుకుని బాగా కలిసి గుండ్రటి ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న గిన్నెలో మైదా పిండి, మరొక చిన్న గిన్నెలో మిగిలిన కోడి గుడ్డు సొన, పాలు కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో బ్రెడ్ పౌడర్ వేసి పెట్టుకోవాలి. అనంతరం ఈ బిర్యానీ ఉండలను తీసుకొని, ముందుగా గుడ్డు మిశ్రమంలో రోల్ చేసి, ఆపై మైదాపిండిలో దొర్లించాలి. ఆ తర్వాత అదే ఉండను మరోసారి గుడ్డు సొనలో రోల్ చేసి, చివరకు బ్రెడ్ పౌడర్లో రోల్ చేయాలి. అన్ని బాల్స్ను అదే విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో దోరగా వేయించి, నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు.చైనా తాంగ్హుల్ క్యాండీకావలసినవి: స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, కివీ, ఆరెంజ్, చెర్రీస్ లేదా నచ్చిన పండ్లు – కొన్ని, పంచదార– ఒక కప్పు, నీళ్లు– అర కప్పు, నూనె– కొద్దిగా, ఐస్ లేదా చల్లని నీళ్లు– పంచదార పాకం గట్టి పడటానికి, పుల్లలు– కొన్నితయారీ: ముందుగా పండ్లను శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. వాటిపై నీటి చుక్క కూడా ఉండకూడదు. తడి ఉంటే పంచదార పాకం పండ్లపై సరిగా అంటుకోదు. ఈలోపు ఒక చిన్న పాన్ లేదా గిన్నెలో పంచదార, నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను మధ్యస్థంగా ఉంచి, పంచదార పూర్తిగా కరిగే వరకు కలపాలి. పంచదార కరిగిన తర్వాత, కలపడం ఆపి, పాకం బుడగలు వచ్చి, కాస్త రంగు మారేవరకు మరిగించాలి. ఒక చల్లని నీళ్ల గిన్నెలో కొన్ని చుక్కల పాకాన్ని వేసిన వెంటనే గట్టిపడి, క్రిస్పీగా మారితే అది సరైన స్థితిలో ఉన్నట్టే గుర్తించొచ్చు. దాంతో స్టవ్ ఆఫ్ చేసుకుని పండ్లు ఉన్న పుల్లలను ఒకదాని తర్వాత ఒకటిగా పాకంలో ముంచాలి. పాకం పండ్ల మీద అన్ని వైపులా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పాకం ఉంటే గిన్నె అంచున తట్టి తీసివేయాలి. పాకం పూసిన పండ్లను నూనె రాసిన బేకింగ్ షీట్ మీద పెట్టుకోవాలి. చల్లారాక తింటే భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పండ్లు డైరెక్ట్గా తినని వారు ఇలా ట్రై చేయొచ్చు.]ఛత్తీస్గఢ్ ముఠియాకావలసినవి: బంగాళదుంపలు– 3 (మీడియం సైజ్, ఉడికించి తొక్క తీసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి), బియ్యప్పిండి– ఒకటిన్నర కప్పులు, ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరిగినవి)పచ్చిమిర్చి– 3 (సన్నగా తరిగినవి)కొత్తిమీర తురుము– కొద్దిగాఅల్లం వెల్లుల్లి పేస్ట్– ఒక టీస్పూన్కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, ఆవాలు– కొద్దికొద్దిగా, ఉప్పు,మసాలా, పసుపు– తగినంత, నూనె– కొద్దిగాతయారీ: ముందుగా ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప గుజ్జు, మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, నచ్చిన ఆకారంలో ఒత్తుకోవాలి. వాటిని ఆవిరి మీద ఉడికించడానికి ఇడ్లీ పాత్ర లేదా ఏదైనా స్టీమర్ ఉపయోగించొచ్చు. అవి ఉడికిన తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక నువ్వులు, కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర ఇలా అన్నీ వేసుకుని వేగించాలి. ఆవాలు చిటపటలాడాక, ముందుగా ఆవిరిపై ఉడికించి పెట్టుకున్న ముఠియా ముక్కలు వేసి, కొద్దిగా పసుపు వేసి, బాగా కలిపి సుమారు 2 లేదా 3 నిమిషాలు వేగించాలి. అంతే, రుచికరమైన ముఠియా వేడి వేడిగా సిద్ధం అవుతుంది. -
ఫ్లోర్కూ వాల్ పేపర్..!
పువ్వులు, లతలు, బీచ్ తీరాలు, కొలనులు వంటి ఆకర్షణీయమైన ప్రకృతి హంగులన్నీ మన కాలి కింద కొలువుదీరితే, చూడటానికి ఎంత అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. త్రీడీ ఫ్లోర్ వాల్పేపర్ ఆ హంగులన్నీ మన గదుల్లోకి తీసుకు వస్తుంది. గది వైశాల్యం, రంగు, డిజైన్కు తగిన వాటిని ఎంచుకోవడంలో శ్రద్ధ పెడితే చాలు. ప్రకృతి దృశ్యాలన్నీ మన కళ్ల ముందే నిలిచి ఉంటాయి.గది థీమ్ను మార్చేసేలా..సముద్ర తీరాలు, స్కై లైన్ వంటివి గది థీమ్నే మార్చేస్తాయి. ఆధునిక లివింగ్ రూమ్ కోసం రేఖాగణిత నమూనాలను ఎంచుకోవచ్చు. పెద్ద, బోల్డ్ డిజైన్లు విశాలమైన గదులకు, చిన్న డిజైన్లు తక్కువ స్థలం ఉన్న చోటుకు బాగా సరిపోతాయి.రంగు.. స్థలంఫర్నిచర్, గది గోడల రంగులను ఎలివేట్ చేసేలా ఫ్లోర్ డిజైన్ వాల్ పేపర్ల ఎంపిక ఉండాలి. గోడల రంగు ప్లెయిన్గా, లైట్ కలర్లో ఉండే ఫ్లోర్ డిజైన్ బోల్డ్ డిజైన్స్ ఎంపిక చేసుకోవచ్చు. గోడల రంగు గాఢత ఎక్కువ ఉంటే సాదా సీదా ఫ్లోర్ డిజైన్స్ను ఎంచుకోవచ్చు. ఫ్లోర్ వాల్ పేపర్స్ కొనుగోలుకు ముందు మీ గదుల వాస్తవ స్థలం ఎంత ఉందో చూసుకోవాలి. ఆ డిజైన్స్ ఎంత కాలం వరకు ఉంటే బాగుంటుందో ముందే నిర్ణయించుకొని, దాన్నిబట్టి ఎంపిక చేసుకోవడం మంచిది. ప్రయోజనాలుత్రీడీ ఫ్లోర్ వాల్పేపర్లు ప్రత్యేకమైన, అద్భుతమైన దృశ్య అనుభవాన్ని సృష్టిస్తాయి.త్రీడీ ఫ్లోర్ వాల్పేపర్ మన్నిక ఎక్కువ. దీర్ఘకాలం ఉంటుంది.చాలా త్రీడీ వాల్పేపర్లను శుభ్రం చేయడం సులభం. తడి క్లాత్తో తుడవడం చాలా సులువు. ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది. .ఇన్స్టాలేషన్ సులువు. నచ్చకపోతే తొలగించి, మరొక వాల్పేపర్ని అతికించవచ్చు. డిజైన్ల ఎంపిక కోసం, ఎలాంటి లోపాలు లేని త్రీడీ వాల్ పేపర్ను నిపుణుల సాయంతో ఎంపిక చేసుకోవడం తెలివైన ఎంపిక. గది వైశాల్యాన్ని బట్టి త్రీడీ వాల్ పేపర్ల ధరలు ఉంటాయి. (చదవండి: రోబో కుందేళ్ల పాముల వేట!) -
రోబో కుందేళ్ల పాముల వేట!
భయంకరమైన పాములతోనే కొన్ని కుందేళ్లు సరదా చెలగాటం ఆడుతున్నాయి. ఆశ్చర్యపోతున్నారా? ఫ్లోరిడా ఎవర్గ్లేడ్స్ అడవుల్లోని పాములు నగరంలోకి వచ్చి ఊరంతా విందు చేసుకుంటున్నాయి. వందలాది పెంపుడు జంతువులు, చిన్న చిన్న జీవులన్నీ వాటికి ఆహారమవుతుంటే, శాస్త్రవేత్తలు ఒక కొత్త ఉపాయం ఆలోచించారు. నిజమైన కుందేళ్లకు బదులు, రోబో కుందేళ్లను తయారు చేశారు. అవి బయటకు చూస్తే బొమ్మలా ఉంటాయి, కానీ లోపల చిన్న చిన్న యంత్రాలు దాచబడి ఉంటాయి. ఇవి వేడి పీల్చి వదులుతాయి, కదులుతూ నిజమైన కుందేళ్లలాగా కనిపిస్తాయి. అంతేకాదు, వీటికి నిజమైన కుందేళ్ల వాసన కూడా వచ్చేలా రూపొందించారు. అంటే వాసన, రూపం, కదలిక మొత్తం కుందేలు మాదిరే! ఒక్కసారి పాము చూసిన వెంటనే ‘ఆహా.. నా విందు రెడీ!’ అనుకుని దూకేస్తుంది. అలా పాములు బయటకురాగానే, వాటిని సులభంగా పట్టేస్తున్నారు. ఇలా శాస్త్రవేత్తలు పాముల మీద సరదా చెలగాటం ఆడుతుంటే, మోసపోయిన పాములను చూసిన మిగతావి మాత్రం ఇకపై కుందేళ్లను తినే ముందు ‘నిజమా? నకిలీనా?’ అని రెండు సార్లు ఆలోచిస్తూ అయోమయంలో పడుతున్నాయి. (చదవండి: అతి పెద్ద మేథమెటీషియన్ దేవుడే!) -
ప్రచారం లేకుండా... పేటెంట్ల పరంపర!
ఎలక్ట్రిసిటీ అంటే ఎడిసన్, టెలిఫోన్ అంటే గ్రాహం బెల్, కంప్యూటర్ అంటే ట్యూరింగ్ గుర్తొస్తారు. కాని, ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ శాస్త్రవేత్త గురుతేజ్ సంధు పేరు చేర్చాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా యూఎస్లో ఎడిసన్ పొందిన పేటెంట్ల సంఖ్యను కూడా దాటేసిన ఈ టెక్ టైగర్– ప్రపంచ టెక్నాలజీని వేగవంతం చేసిన మాస్టర్మైండ్! ఆయన పేరు ఇప్పటివరకు ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కాని, ప్రపంచవ్యాప్తంగా రోజూ వాడే టెక్నాలజీకి ఆధారం ఆయన ఆవిష్కరణలే! అమెరికాలోని మైక్రాన్ టెక్నాలజీలో పనిచేస్తూ, టెక్ రంగంలో నిశ్శబ్దంగా విప్లవం సృష్టించారు. వివిధ టెక్నాలజీలపై ఆయనకు ఇప్పటి వరకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1,380 పేటెంట్లు ఉన్నాయి. ఇది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎడిసన్ యూఎస్ పేటెంట్స్ కౌంట్ 1,093 కంటే ఎక్కువ. సాధారణంగా పేటెంట్ అనేది సాధించడమే ఓ పెద్ద విషయం. ఒక్కటి పొందటానికి సంవత్సరాలు పడుతుంది. అలాంటిది అత్యధిక పేటెంట్స్ కలిగిన భారతీయుడుగా గురుతేజ్ సంధు నిలిచారు. మన ఫోన్లు, ల్యాప్టాప్లు, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వేగం, సామర్థ్యం పెంచడంలో ఆయన పాత్ర అంచనాకు అందని స్థాయిలో ఉంది. ఆయన అభివృద్ధి చేసిన ‘అటామిక్ లేయర్ డిపాజిషన్’, ‘పిచ్ డబ్లింగ్’ లాంటి సాంకేతిక పద్ధతులు మెమరీ చిప్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. అంటే చిన్న పాకెట్లో పెద్ద ప్రపంచాన్ని నిక్షిప్తం చేయగల టెక్నాలజీని గురుతేజ్ రూపొందించారు. ప్రస్తుతం ఇవే గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఇండస్ట్రీ స్టాండర్డ్గా మారిపోయాయి. మీరు ఫోన్లో వీడియో చూస్తుంటే, ప్రతి పది సెకన్లకు ‘పాజ్’ కాకుండా స్మూత్గా ప్లే అవుతుంటే, దానికి మూల కారణం గురుతేజ్ సంధునే! ఇలానే, మరెన్నో మనం రోజూ వాడే టెక్నాలజీ పరిజ్ఞానాల్లో ఆయన మేధస్సు పనిచేస్తోంది.ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి. ఆయనకు ‘ఐఈఈఈ ఆండ్రూ ఎస్. గ్రోవ్ అవార్డ్’ అనే అత్యున్నత గౌరవం దక్కింది. అంతేకాదు, ఆయనకు అంతర్జాతీయ మైక్రాన్ సంస్థలో అతి ముఖ్య సాంకేతిక గౌరవమైన ఫెలో హోదా దక్కింది. వివిధ టెక్నాలజీ పరిశోధనల్లో అద్భుత ప్రతిభ చూపినందుకు గాను ‘జార్జ్ ఈ. పేక్’ బహుమతిని కూడా అందుకున్నారు. అయితే, ఇంతటి ఘనత ఉన్నా ఆయన పేరు బహిరంగ ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడం కొంచెం ఆశ్చర్యకరం. ఫ్యామిలీ స్టార్! ఒక మధ్యతరగతి భారతీయ కుటుంబం నుంచి ఈ మేధావి కథ ప్రారంభమైంది! లండన్లో జన్మించిన గురుతేజ్ సంధు, మూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో భారత్కు వచ్చేశారు. తండ్రి సర్జీత్ సంధు, తల్లి గురుమీత్ సంధు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసించే మేధావిగా ఎదిగాడు. అలా ఆయన మేధస్సు మొదట ఐఐటీ ఢిల్లీ గేట్లు దాటింది, అక్కడే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం అమెరికా ప్రయాణం, నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో పీహెచ్డీ సాధించారు. అప్పటి నుంచే ల్యాబ్లో సైలెంట్గా పని చేస్తూ, ప్రపంచ మెమరీ చిప్లకు మెమరబుల్ సైంటిస్టుగా మారారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు సంగీతంలో ప్రావీణ్యం పొంది డీజేగా గుర్తింపు పొందారు. మరొకరు ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఇలా ఆయన ఇద్దరు కుమారులు కూడా, ఒకరు మ్యూజిక్లో, మరొకరు మైక్రోచిప్లతో తమ తమ రంగాల్లో మ్యాజిక్ చేస్తున్నారు!. ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి. -
అతి పెద్ద మేథమెటీషియన్ దేవుడే!
‘పరీక్షలో పాస్ మార్కులు రాకపోతే దేవుడు సాయం చేస్తాడా? పోయి, చదువుకో పో..! ’ అని ఎవరైనా చెప్తే, ఇకపై ఈ ఫార్ములా చూపండి. ఎందుకంటే, ‘దేవుడు అంటే ఒక అతి పెద్ద మ్యాథమెటీషియన్ ’ అని రుజువు చేస్తూ, కేంబ్రిడ్జ్ మేధావి పాల్ డైరాక్ ఒక గణిత సూత్రంతో నిర్వచించారు. ఈ విశ్వం ఏదో యాదృచ్ఛికంగా రాలేదు. ప్రకృతిలోని ప్రతి సృష్టిని ఎవరో జాగ్రత్తగా డిజైన్ చేసి, సెట్ చేశారు. గణిత సూత్రాలతో ఆకాశాలు, నక్షత్రాలు, మన ప్రాణాలను కూడా ముందే లెక్కపెట్టేశారు. అంతేకాదు, మనకున్న వెలుగు కూడా దేవుడిచ్చిందే అని గణిత సూత్రాలతో వివరించారు. అయితే, అందరు శాస్త్రవేత్తలూ ఇలాగే ఆలోచించరు. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చివరిసారిగా రాసిన పుస్తకంలో, ‘దేవుడు అనేది ఒక నిర్వచనం మాత్రమే, సాక్ష్యం కాదు’ అని స్పష్టంగా చెప్పారు. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకరు గణితంతో దేవుని వెతుకుతుంటే, ఇంకొకరు అదే గణితంతో దేవుడే లేరని చెప్తున్నారు. అంతిమంగా చెప్పుకోవాల్సింది ఒక్కటే: దేవుడు ఉన్నాడా లేడా అన్నదానికంటే, ఆయన ఉంటే ఈ గణిత పరీక్షలో మనకు పాస్ మార్కులు ఇవ్వగలడా లేదా అన్నది పెద్ద ప్రశ్న! (చదవండి: సాహసానికి అరవై ఏళ్లు) -
టీనేజర్స్.. మూడ్స్వింగ్స్..!
రాహుల్ ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆర్నెలలుగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకే పెద్దగా రియాక్ట్ అవుతున్నాడు. పేరెంట్స్పై అరుస్తున్నాడు. చదువుపై శ్రద్ధ తగ్గింది. అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ స్క్రోల్ చేస్తున్నాడు. అదేమని అడిగితే గొడవపడుతున్నాడు. టీనేజ్లో ఇలాంటి మూడ్ స్వింగ్స్, కోపతాపాలు, తిరుగుబాట్లు సహజం. కాని, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో చాలామంది పేరెంట్స్ కు తెలియదు. అందుకే రాహుల్ పేరెంట్స్ అతన్ని కౌన్సెలింగ్కు తీసుకొచ్చారు. రెండు వారాల్లో కోపతాపాలు తగ్గాయి. మూడో వారానికి స్క్రీన్ టైమ్ సెట్ అయ్యింది. నాలుగో వారానికి తనకు ఎంత బ్రేక్ టైమ్ కావాలో చెప్పడం ప్రారంభించాడు. ఎందుకిలా ప్రవర్తిస్తారు? టీనేజర్ల తిరుగుబాటు, మూడ్ స్వింగ్స్ ఆ వయసులో వచ్చే ఒక మార్పు. అంతే తప్ప మీ పిల్లలు చెడ్డవారని కాదు. అందుకు కారణాలు తెలుసుకుంటే వారి ప్రవర్తన మీకు అర్థమవుతుంది.మెదడులో ఎమోషన్ సెంటరైన లింబిక్ సిస్టమ్ టీనేజ్లో త్వరగా యాక్టివ్ అవుతుంది. కాని, కంట్రోల్ సెంటరైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ 20 ఏళ్ల తర్వాత పరిపక్వతకు చేరుతుంది. అందుకే ముందు ఎమోషన్, తర్వాత ఆలోచన.టీనేజ్లో కొత్తదనం, థ్రిల్, తక్షణ రివార్డులకు మెదడు సులభంగా ఆకర్షితమవుతుంది. డోపమైన్,సెన్సేషన్ సీకింగ్ ఉంటుంది. అందుకే టీనేజ్లో అన్ని మూడ్ స్వింగ్స్.టీనేజ్లో మెలటోనిన్ ఆలస్యంగా విడుదలవడం వల్ల రాత్రి ఆలస్యంగా నిద్ర, ఉదయం ఆలస్యంగా లేవడం సహజం. నిద్ర తక్కువ కావడం వల్ల చిరాకు ఉంటుంది.సొంత అస్తిత్వం కోసం వెతుకులాట మొదలవుతుంది. ‘నేనెవరు?’ అనే అన్వేషణ, ‘నా మాట వినండి’ అనే అవసరం ఏర్పడుతుంది. ఆ క్రమంలోనే పేరెంట్స్పై తిరుగుబాటు. ఇక ఇతరులతో పోలిక, ఏదో కోల్పోతున్నాననే భావన భావోద్వేగాలను పక్కకు నెట్టేస్తాయి. ఎప్పుడు జాగ్రత్త పడాలి?చిన్న చిన్న విషయాలకే పెద్దగా రియాక్ట్ అవ్వడం, కేకలు, తలుపులు బిగించడం. ఏ కారణం లేకుండానే విపరీతమైన మూడ్ స్వింగ్ తన భావాలను సమర్థించుకునేందుకు మౌనంగా ఉండటంస్కూల్ను అవాయిడ్ చేయడం, నిద్ర, ఆహారంలో తీవ్ర మార్పులు. ‘సేఫ్ కాదు’ అనిపించినప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా బిగుసుకుపోవడందీర్ఘకాల దుఃఖం, స్వీయనింద, పేరెంట్స్కు దూరంగా ఉండటంఇలాంటప్పుడు ఆలస్యం చేయకండి. వెంటనే సైకాలజిస్ట్ను సంప్రదించండి. ఎమోషనల్ మెడిసిన్గా కౌన్సెలింగ్ త్వరగా పనిచేస్తుంది.B.R.I.D.G.E. ఫ్రేమ్వర్క్టీనేజర్ల భావాలు ‘సమస్య’ కాదు, సిగ్నల్స్. వాటిని అర్థం చేసుకుని స్పష్టమైన బౌండరీలు పెడితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అందుకు ఈ రోజు నుంచే B.R.I.D.G.E.., RESET మొదలు పెట్టండి. Breathe & Body Co&regulation: టీనేజర్లను టీజ్ చేయకండి, తర్కం చేయకండి. 20 శాతం గొంతు తగ్గించండి.Reflect the Feeling: ‘నీకు ఇప్పుడు ఒత్తిడి,కోపం మిక్స్డ్గా ఉన్నట్టుంది’ అని గుర్తించండి. వారి భావోద్వేగాలను మీరు గుర్తించడం వాటి తీవ్రతను తగ్గిస్తుంది. Invite Choice:: ‘ఇలా చేయాలి’ అని చెప్పకుండా, రెండు ఆప్షన్లు ఇవ్వండి. అందులో ఒకటి ఎంచుకుంటారు. Define Boundary: ‘కేకలు, వస్తువులు విసరాల్సిన అవసరంలేదు. నీకు అలసటగా ఉంటే కాసేపు బ్రేక్ తీసుకుందాం’ అని చెప్పండి. Guide with Skills:: భావోద్వేగాల నియంత్రణకు అవసరమైన టెక్నిక్స్ నేర్పించండి. Engage & Repair: కోపతాపాలు తగ్గాక, ‘ఇప్పుడు శాంతంగా ఉన్నాం. అసలేం జరిగింది? నెక్స్ట్ టైమ్ ఏం చేస్తే బాగుంటుంది?’ అని మాట్లాడండి. ఐదునిమిషాల్లో ‘రీసెట్’Regulate:: శ్వాసను నియంత్రించుకోండి. నాలుగు సెకండ్లు ఉచ్ఛ్వాస, రెండు సెకన్లు బంధనం, ఆరు సెకండ్లు నిశ్వాసEmpathize: ‘నీ మాటలు వినకపోవడమే నీ కోపానికి కారణమా?’Set Limit: ‘చర్చ ఓకే, అవమానం, విసరడం ఓకే కాదు.’Explore Trigger: ‘ఇవాళ స్కూల్లో ఏదైనా జరిగిందా?’Each Tiny Tool: 3 పాయింట్స్ రూల్–‘నీకు ముఖ్యమైన మూడు పాయింట్లు చెప్పు; తరువాత నా మూడు.’(చదవండి: భారత్లోనే బాగుంది.. అందుకే ఇక్కడ ఉండిపోయా..!) -
పట్టులాంటి జుట్టు కోసం..!
ఒత్తైన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది. ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.ఒతై ్తన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది.ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.పట్టులాంటి జుట్టుకు...పట్టులా సుతిమెత్తగా ఉండే జుట్టు అందాన్ని పెంచుతుంది. జుట్టు మృదువుగా ఉంటే స్టైలింగ్ చేయడం కూడా ఈజీ. అయితే పెరిగిన కాలుష్యం, జుట్టుపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జుట్టు పొడిబారి, రఫ్గా మారుతుంది. ఇలాంటి జుట్టుకు తగిన తేమ, పోషణను అందించే చికిత్సే డీప్ కండిషనింగ్. ఈ డీప్ కండిషనింగ్ హెయిర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టు తేమగా, ఆరోగ్యంగా మారుతుంది. దీంతో మెరిసే జుట్టును పొందవచ్చు. ఇంట్లో డీప్ కండిషనింగ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా హెయిర్ మాస్క్ ఎంపిక చేసుకోవాలి. పెరుగు–తేనె, గుడ్డు–ఆలివ్ నూనె మాస్క్ అయితే బెటర్. కండిషనింగ్ చేసుకునే ముందు తక్కువ గాఢత ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. జుట్టు ఆరిన తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే సుతిమెత్తని జుట్టు మీ సొంతమవుతుంది. ఇంట్లో డీప్ కండీషనింగ్ చేసుకోలేని వారు పార్లర్కు వెళ్లవచ్చు. బ్యూటీ పార్లర్లోని నిపుణులు జుట్టు రకాన్ని బట్టి ప్రత్యేకమైన ఉత్పత్తులతో కండిషనింగ్ చేస్తారు. అవసరం బట్టి పార్లర్లో స్టీమ్ థెరఫీ కూడా ఇస్తారు. దీనివల్ల జుట్టుకు మరింత పోషణ అందుతుంది. కురులు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి. (చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!) -
ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?
డాక్టర్గారు, నాకు 45 ఏళ్లు. దాదాపు సంవత్సరం రోజులుగా రుతుస్రావం రాలేదు. ఇది మెనోపాజ్ అనుకున్నాను కాని, ఇప్పుడు మళ్లీ రక్తస్రావం వస్తోంది. ఇది ఏదైనా పెద్ద సమస్యనా అని చాలా భయపడుతున్నాను.– లావణ్య, తూప్రాన్ఒక మహిళకు 45 ఏళ్లు దాటాక వరుసగా 12 నెలలు రుతుస్రావం లేకపోతే మెనోపాజ్ దశలో ఉన్నట్లుగా పరిగణిస్తాం. అయితే ఆ తర్వాత రక్తస్రావం వస్తే దాన్ని పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఇది తరచు కనిపించే సమస్యలలో ఒకటి. అయినప్పటికీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. సుమారు ఐదు శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. అందులో ఎక్కువగా కనిపించే కారణం అట్రోఫిక్ వెజైనిటిస్. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల యోని గోడలు పలచబడి చిన్న గాయాలు అవుతాయి. దాంతో రక్తస్రావం మాత్రమే కాకుండా, పదే పదే మూత్రపిండ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. మరికొంతమందిలో గర్భాశయం లోపల ఏర్పడే పాలిప్స్ వలన రక్తస్రావం ఉంటుంది. ఇవి గడ్డల్లా మారుతాయి. పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ ఉన్నవారిలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఇవే కారణం అవుతాయి. వీటిలో తొంభై శాతం ఫాల్స్ అయినప్పటికీ నిర్ధారణ అవసరమే! ఇంకా కొంతమందిలో ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా లేదా గర్భాశయ క్యాన్సర్కు కారణం అవుతుంది. దాదాపు పది శాతం కేసుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. హైపర్ప్లాసియాలో కూడా ఏటిపికల్ అనే రకం ఉంటే కేన్సర్గా మారే ప్రమాదం ఎక్కువ. అరుదుగా యోని లేదా వల్వా కేన్సర్లు కూడా ఈ రక్తస్రావానికి కారణం కావచ్చు. మధుమేహం ఉన్నవారు, అధిక బరువు కలిగినవారు, గర్భాశయ కేన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మెనోపాజ్ లక్షణాలను తగ్గించుకోవడానికి ఈస్ట్రోజన్ మాత్రలు తీసుకునే కొంతమందికి కూడా రక్తస్రావం కలగవచ్చు. అందుకే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వస్తే అది పెద్ద విషయం కాదని ఊహించుకోవడం తప్పు. ఎక్కువసార్లు కారణం తేలికపాటిదే అయినా, కొన్నిసార్లు తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి ఒకసారి అయినా గైనకాలజిస్ట్ను సంప్రదించి అల్ట్రాసౌండ్, ఎండోమెట్రియల్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
చాకిరీనే ఆమె నౌకరీ
భారతీయ మహిళకు ఇంటా, బయటా మోయలేనంతగా రెండింతల పని భారం ఉంటోందని తాజాగా విడుదలైన ‘టైమ్ యూజ్’ సర్వే వెల్లడించింది. ఎక్కువ చదువుకున్న, సంపన్నులైన మహిళలు సైతం ఈ విషయంలో మెరుగ్గా ఏమీ లేరని కూడా వ్యాఖ్యానించింది. పురుషులు జీతం వచ్చే పనికి బయట ఎంత సమయం వెచ్చిస్తున్నారో, అంతకుమించిన సమయాన్ని మహిళలు జీతం రాని పనికి ఇంట్లో వెచ్చిస్తున్నారని సర్వే పేర్కొంది.భారత ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఒ.) 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘టైమ్ యూజ్’ సర్వేలో – రోజువారీ పనులకు స్త్రీలు, పురుషులకంటే రెండింతలు ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. ఈ సర్వే కోసం ఎన్.ఎస్.ఒ. 1,67,000 మందిని కలిసి వివరాలు సేకరించింది. శ్రమలో అసమానతలుఉద్యోగం, నిద్ర, ఆహారం, విశ్రాంతి మొదలు.. చదవటం, షాపింగ్, వంట పని వంటి 165 రోజువారీ పనులకు స్త్రీ పురుషులు వెచ్చించిన సమయాన్ని సర్వే నమోదు చేసింది. పురుషులు, మహిళలు నిద్రించడానికి దాదాపు సమాన సమయాన్ని వెచ్చిస్తుండగా, సగటు స్త్రీ, సగటు పురుషుడు బయట నలుగురితో కలిసి గడిపే దాని కంటే కూడా ఎక్కువ సమయాన్ని ఇంటి పనులకే కేటాయిస్తోంది. నిద్రను మినహాయిస్తే, పురుషులు ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పనులలో రోజుకు సగటున గ్రామాలలో 4.6 గంటలు, పట్టణ ప్రాంతాలలో 5.3 గంటలు వెచ్చిస్తున్నారు. ఆ తరువాతనైనా వారికి విశ్రాంతి లభిస్తోంది. లేదా బయటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కాని మహిళల్లో ఇంటి పనులు సుదీర్ఘంగా ఉంటున్నాయి. ఈ ధోరణి శ్రమ చేయటంలో స్త్రీ పురుష అసమానతల్ని స్పష్టంగా చూపిస్తోంది. 2024–25లో దేశంలో 15ఏళ్లు, అంతకు పైబడిన వయసు గల మహిళల కార్మిక భాగస్వామ్య రేటు 41.7 శాతం ఉండగా, పురుషులలో ఈ శాతం 78.8 వరకు ఉంది. తక్కువ జీతం, తక్కువ అవకాశాలు స్త్రీలు ఉద్యోగం చేయటానికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి.రెండింతల రెట్టింపు పని మహిళలు విద్యలో ఎంతగా పురోగతి సాధిస్తున్నా, ఉద్యోగాలలో పెద్దగా ప్రయోజనం పొందటం లేదు. జీతం ఉన్న పని, జీతం లేని పని రెండింటినీ కలిపి, విద్యాస్థాయి లేదా సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మహిళలు పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు. నిరక్షరాస్యులైన మహిళలు సగటున రోజుకు 103 నిమిషాలకు పైగా జీతం ఉన్న ఉపాధి పనులకు, 281 నిమిషాలకు పైగా జీతం లేని పనికి వెచ్చిస్తున్నారు. డిగ్రీ ఉన్న మహిళలు సైతం ఉపాధి కోసం 106 నిమిషాలు, జీతం లేని పనికి చాలా ఎక్కువగా 323 నిమిషాలు కేటాయిస్తున్నారు. ఇది పురుషులు చేస్తున్న శ్రమ కంటే చాలా ఎక్కువ. నేటికీ నెమ్మదిగానే పురోగతిఅనేక విద్యా స్థాయులలో బాలురు, పురుషుల కంటే బాలికలు, మహిళలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఉద్యోగావకాశాలలో మహిళలింకా పురుషుల కంటే వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇంటి బాధ్యతలు తరచుగా వారిని ఉద్యోగావకాశాలకు దూరంగా ఉంచుతున్నాయని ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్న విషయమే. కాగా 2023 నోబెల్ గ్రహీత క్లాడియా గోల్డిన్, 200 సంవత్సరాల అమెరికా ఉద్యోగ రంగ డేటాను అధ్యయనం చేసి... వేతనం లేని పని భారం, ముఖ్యంగా మాతృత్వం... ఉపాధి అవకాశాలలో లింగ భేదాలకు దారి తీసిందని తెలిపారు. గర్భనిరోధక మాత్రల లభ్యత, సేవా రంగ ఉద్యోగాల ఆవిర్భావం కారణంగా పరిస్థితి కొంత మెరుగవటం కూడా క్లాడియా గమనించారు. అయితే, భారతదేశంలో ఈ పురోగతి ఇప్పటికీ నెమ్మదిగానే ఉంది. ∙∙ కాస్త బ్రేక్ తీస్కో తల్లీ! సినిమా మధ్యలో ‘విశ్రాంతి’ పడుతుంది, ప్రేక్షకుల రెస్ట్ కోసం. యుద్ధం మధ్యలో ‘కాల్పుల విరమణ’ ఉంటుంది, సైనికుల రెస్ట్ కోసం. ఆఫీస్లలో చిన్న చిన్న బ్రేక్లు ఉంటాయి, ఉద్యోగుల రెస్ట్ కోసం. ‘‘ఎటూ కదలకండి’’ అని డాక్టర్లు సలహా ఇస్తారు. పేషెంట్ల రెస్ట్ కోసం. డాక్టర్లే కాదు, ఒక పనిలో అదే పనిగా ఉండిపోతే, మన శరీరం కూడా మనకు రెస్ట్ సిగ్నల్ కొడుతుంది. ‘‘కాస్త ఆగు తల్లీ’’ అంటుంది. కానీ మనం ఆ సిగ్నల్స్ను పట్టించుకోం. పని పూర్తి చేసేస్తే ఒక పనైపోతుంది అనుకుంటాం. మన ఆలోచన ఏమిటంటే, పనిని మధ్యలోనే వదిలేయటం ఎందుకని? ఆలోచన మంచిదే కాని, ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పని మధ్యలో రెస్ట్ అవసరం అయినప్పుడు పనిని మధ్యలోనే కదా వదిలేయాలి అని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా... మహిళలకు చెబుతున్నారు. రెస్ట్ తీసుకోవటం అంటే?అలసట నుండి తేరుకోవటానికి రెస్ట్ అవసరం కనుక, అలసట తీరేవరకు పనిని పక్కన పెట్టటమే రెస్ట్ తీసుకోవటం. చేస్తున్న పనిని బట్టి, అప్పటి మీ శారీరక స్థితిని బట్టి కొన్ని నిముషాల రెస్ట్, లేదా కొన్ని గంటల రెస్ట్, లేదంటే కొన్ని రోజుల రెస్ట్ అవసరం అవుతుంది. అయితే రెస్ట్ తీసుకున్నంత మాత్రాన బాడీ, మైండ్ రెండూ రీచార్జ్ అవుతాయని చెప్పలేం. రెస్ట్ ఉంటుంది. ఉత్సాహం ఉండదు. ఉత్సాహం లేని రెస్టు కూడా మళ్లీ పనితో సమానమే. అందుకే, ముల్లును ముల్లుతోనే తీసినట్లుగా పని వల్ల వచ్చిన అలసటను పనితోనే పోగొట్టుకోవటం అవసరం. అందుకోసం ఏ రకం రెస్టు మనల్ని ఏ రకం అలసట నుంచి కోలుకునేలా చేస్తుందో తెలుసుకోవాలి. ముందు, రెస్టులోని రకాలు ఏమిటో తెలుసుకుంటే, వాటిల్లో ఏ రెస్ట్ మన స్థితికి సరిపోతుందో తెలిసిపోతుంది.రెస్టులో 7 రకాలుఫిజికల్ రెస్ట్, ఎమోషనల్ రెస్ట్, స్పిరిచ్యువల్ రెస్ట్, సోషల్ రెస్ట్, సెన్సరీ రెస్ట్, క్రియేటివ్ రెస్ట్, మెంటల్ రెస్ట్ అని ఏడు రకాలైన రెస్ట్లు ఉన్నాయి.ఫిజికల్ రెస్ట్: ఇది శారీరక విశ్రాంతి. చక్కగా నిద్రపోతే సరిగ్గా రెస్ట్ దొరుకుతుంది. ఇందుకు భిన్నంగా యోగా, బాడీనీ స్ట్రెచ్ (సాగతీయటం) వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. శరీరం తేలిపోతున్నట్లుగా ఉంటుంది. పని కోసం మళ్లీ మనసు పరుగులు పెడుతుంది. ఫిజికల్ రెస్ట్ వల్ల క్రియాశీలం అయ్యే రక్త ప్రసరణ మహిమ ఇది. ఇవి కాక.. మసాజ్, చిన్న చిన్న విరామాలు, వాకింగ్.ఎమోషనల్ రెస్ట్: ఇది భావోద్వేగ విశ్రాంతి. అంటే మీ కోపాన్ని, అసహనాన్ని, విసుగును, అసంతృప్తిని, ఆందోళనను.. ఆరోగ్యంగా వ్యక్తపరచడం. మీ మనసు లోపలి ఉద్దేశాల గురించి నిజాయితీగా బయటికి చెప్పుకోవటం. అవసరం అయితే సహాయం తీసుకోవటం. ఉద్వేగం మితిమీరకుండా నిగ్రహించుకోవటం. ఇందువల్ల మీకు మానసికమైన విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. ఒంటరిగా సమయం గడపడం, మీ గురించి మీరు శ్రద్ధ వహించటం. డైరీ రాయటం, ప్రకృతిలో గడపటం.స్పిరిచ్యువల్ రెస్ట్ : ఇది ఆధ్యాత్మిక విశ్రాంతి. దినచర్యలకు మించి జీవితానికి అర్థం, పరమార్థం కనుగొనే ప్రయత్నం చేయటం. అందుకోసం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం. హృదయంతో ఆలోచించటం. ఇవన్నీ మనసును తేటపరుస్తాయి. భౌతికమైన ఒత్తిళ్ల నుంచి విశ్రాంతిని చేకూరుస్తాయి. ఇవి కాక.. మీకు నచ్చిన ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడం, ఒక సత్కార్యం కోసం స్వచ్ఛందంగా పనిచేయడం.సోషల్ రెస్ట్: ఇది సామాజిక విశ్రాంతి. సానుకూలంగా ఉండేవాళ్లు, మనకు మద్దతుగా ఉండేవాళ్లతో సమయాన్ని గడపటం. అదే సమయంలో అలసట కలిగించే, ఒత్తిడితో కూడిన సంబంధాలకు దూరంగా ఉండటం. మనం సామాజిక జీవులం. అయినప్పటికీ అంతర్ముఖులకు ఈ సోషల్ రెస్ట్ అలసట కలిగించేది కావచ్చు. అలాంటి వారికి సోషల్ రెస్ట్ వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని గమనించాలి. ఇవి కాక.. ఒంటరిగా లేదా సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం. సోలో పిక్నిక్, టూర్ లేదా ఉన్న చోటే బయటికి వెళ్లి భోజనం చేయడం, మీ ఒంటిపై మీరు ధ్యాస పెట్టటం.సెన్సరీ రెస్ట్: ఇది ఇంద్రియ విశ్రాంతి. దేదీప్యమానంగా వెలిగే లైట్లు, రణగొణధ్వనులు; టీవీ, స్మార్ట్ఫోన్ స్క్రీన్ల వంటి వాటికి దూరంగా, డిమ్ లైట్లు, నిశ్శబ్దాల మధ్య పొందే విశ్రాంతి. ఇవి కాక.. కాసేపు కళ్లు మూసుకోవడం, నిశ్శబ్దంగా ఉండే గదిలో సమయం గడపడం, ఎక్కువసేపు స్నానం చేయడం.క్రియేటివ్ రెస్ట్: సృజనాత్మక విశ్రాంతి. ఇది మీలోని క్రియేటివిటీని తట్టి లేపుతుంది. అలసటకు ఇది దివ్యౌషధం. మెదడుకు మేత వల్ల మీ మనసు పునరుత్తేజితం అవుతుంది. ఇవి కాక.. పని నుండి విరామం తీసుకోవడం, సృజనాత్మకమైన పనులు చేయటం (డ్రాయింగ్, పెయింటింగ్, అల్లికలు మొదలైనవి)మెంటల్ రెస్ట్: ఇది మానసిక విశ్రాంతి. ఇది మీ మెదడుకు బ్రేక్ ఇస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం, సమస్య పరిష్కారం వెతకటం వంటి ఒత్తిళ్ల నుంచి తాత్కాలికంగా విరామం ఇస్తుంది. ధ్యానం వంటి అభ్యాసాలు లేదా తీవ్రమైన ఏకాగ్రత అవసరం లేని తేలిక పాటి సాధనల్లో పాల్గొనడం వల్ల మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. మీ ఫోన్ను ఆఫ్ చేయడం, సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉండటం. (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
హయగ్రీవ అవతారం
శ్రీమహావిష్ణువు ఒకప్పుడు దానవులతో పదివేల సంవత్సరాలు యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధంలో దానవులను దునుమాడిన తర్వాత అలసిన అతడు పద్మాసనంపై కూర్చుని, ధనుస్సుకు చివర తలవాల్చి, నిద్రలోకి జారుకున్నాడు.అదే సమయంలో ఇంద్రాది దేవతలు విష్ణువు సహాయంతో ఒక యాగాన్ని చేయాలని సంకల్పించుకున్నారు. ఈ సంగతిని విన్నవించుకోవడానికి దేవతలందరూ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆదమరచి నిద్రపోతూ కనిపించాడు. అలాంటి పరిస్థితిలో ఆయనకు మేల్కొలపడం ఎలాగని దేవతలు చింతాక్రాంతులయ్యారు. ‘నిద్రాభంగం చేయడం దోషం. అలా చేయవద్దు’ అన్నాడు ఇంద్రుడు.అప్పుడు బ్రహ్మ కలగజేసుకుని, ‘నేను ఒక చెదపురుగును సృష్టించి, దానిని విష్ణుధనువు నారిని కొరికేలా ఆజ్ఞాపిస్తారు. నారి తెగినప్పుడు ఏర్పడే ధ్వనికి దేవదేవుడు మేల్కొంటాడు’ అని చెప్పి, చెదపురుగును సృష్టించి, వింటినారిని కొరకమని ఆజ్ఞాపించాడు. ‘ఈ పాపకార్యం చేయడం వల్ల నాకు నరకం తప్ప ఒరిగేదేమిటి?’ అని బ్రహ్మదేవుడిని అడిగింది చెదపురుగు.‘నీకు నరకం ఉండదు. మేం తలపెట్టిన యాగంలో నీకూ కొంత భాగం ఇస్తాం’ అని మాట ఇచ్చాడు బ్రహ్మదేవుడు.చెదపురుగు వెంటనే వెళ్లి, విష్ణువు వింటినారిని కొరికింది. భీకరమైన ధ్వని ఏర్పడింది. దేవతలు చూసేసరికి కిరీట కుండలాలతో ప్రకాశించే విష్ణువు తల కనిపించలేదు. నారి తాకిడికి అతడి తల తెగిపోయింది. ఇది చూసి దేవతలు హాహాకారాలు చేశారు. బృహస్పతి జోక్యం చేసుకుని, ‘ఇప్పుడు ఇలా ఏడ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? తరుణోపాయం ఏమిటో ఆలోచించాలి గాని’ అన్నాడు. ‘ఇంతటి విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలంటే, పరదేవతను ఆశ్రయించడం తప్ప గత్యంతరం లేదు’ పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలందరూ హుటాహుటిన జగన్మాత వద్దకు వెళ్లి, ఆమెను వేనోళ్ల స్తుతించి, తమను ఈ విషమ పరీక్ష నుంచి గట్టెక్కించమని ప్రార్థించారు.‘దేవతలారా! వినండి. శ్రీహరి శిరస్సు తెగిపడటానికి ఒక కారణం ఉంది. పూర్వం అతడు తన ప్రియురాలి ముఖం చూసి నవ్వాడు. ఆమె కుపితురాలై, నీ తల తెగిపడుగాక అని శపించింది. ఆ శాపం ఇప్పుడిలా ఫలించింది. ఇందులో మరో విషయం కూడా ఉంది. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు సరస్వతీ నదీతీరంలో నా గురించి ఘోరతపస్సు చేశాడు. నేను అతడికి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, మరణం లేకుండా వరం కావాలన్నాడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు గనుక అది అసాధ్యమని చెప్పాను. దానికి బదులుగా మరో వరం కోరుకోమని చెప్పాను. తనకు గుర్రం ముఖం ఉండేవాని వల్ల తప్ప మరెవరివల్లా మరణం లేకుండేలా అనుగ్రహించమన్నాడు. నేను సరేనని వరమిచ్చాను. అతడు వరగర్వంతో లోకులను, బ్రాహ్మణులను పీడించడం మొదలుపెట్టాడు. అతడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించుతుండటంతో భక్తులు మొరపెట్టుకుంటున్నారు. అతడి అంతానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అందువల్ల ఇప్పుడు బ్రహ్మదేవుడు గుర్రం తలను తెప్పించి, శ్రీహరికి అతికించినట్లయితే, అతడు పునర్జీవితుడై, ఆ రాక్షసుడిని సంహరించగలడు’ అని జగన్మాత పలికింది.ఆమె మాటలకు దేవతలు సంతోషించి, ఆమెను మరోసారి స్తుతించారు.బ్రహ్మదేవుడు వెంటనే విశ్వకర్మను పిలిపించాడు.అతడికి జరిగినదంతా చెప్పి, తెగిపడిన శిరస్సు స్థానంలో శ్రీహరికి గుర్రం శిరస్సును అతికించాలని ఆదేశించాడు. విశ్వకర్మ ఒక గుర్రం తలను నరికి తీసుకువచ్చాడు. దానిని విష్ణువుకు అతికించాడు. అలా విష్ణువు హయగ్రీవ అవతారం దాల్చాడు. హయగ్రీవుడిగా మేల్కొన్న శ్రీహరికి ఇంద్రాది దేవతలందరూ జయజయ ధ్వానాలు పలికారు. హయగ్రీవుడనే అసురుడి ఆగడాలను తెలిపి, జగన్మాత చెప్పిన ప్రకారం అతడిని సంహరించి, లోకాలకు పీడను విరగడ చేయమని కోరారు.హయగ్రీవావతారంలో శ్రీహరి హయగ్రీవుడనే అసురుడిపై యుద్ధానికి వెళ్లాడు.హోరాహోరీగా సాగిన యుద్ధంలో శ్రీహరి తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, హయగ్రీవాసురుడిని సంహరించాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: పరోపకారార్థం ఇదం శరీరం
‘‘అన్నయ్యా! రామారావు బాబాయికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఈసారి ఆయన కండిషన్ క్రిటికల్ అన్నాడు డాక్టర్. నువ్వు చూసి వెళితే బావుంటుంది’’ సొంత బాబాయి అనారోగ్యం కబురు తెలిసిన రెండురోజుల తర్వాత ఊళ్లో ఉన్న అన్న విశ్వనాథ్కి తీరిగ్గా ఫోన్ చేశాడు తమ్ముడు శంకరం.‘‘నేను సిటీకి నిన్ననే వచ్చాను. హాస్పిటల్లో ఉన్నాను. బాబాయి ఇంతకు ముందే పోయాడు. కబురింకా ఎవరికీ చెప్పలేదు. బిల్లు డబ్బు పూర్తిగా కడితే గాని శవాన్ని ఇవ్వరట. చంద్రం డబ్బు కోసం వెళ్లాడు’’ నిర్లిప్తంగా అన్నాడు విశ్వనాథ్.‘‘ఓ నిన్ననే వచ్చావా? చంద్రం నిన్నేమైనా డబ్బు అడిగాడా?’’ ఆతృతగా అడిగాడు శంకరం.‘‘అడిగాడు. అవసరానికి నేనేమీ సర్దలేకపోయాను. సమయానికి వాడి దగ్గర డబ్బు లేదట. అప్పో సప్పో చేసి తెద్దామంటే సమయం లేదు. ఉత్త చేతులతో వచ్చాను. బిల్లు ఆరు లక్షల ప్యాకేజీ. చంద్రం ఇబ్బంది పడుతున్నాడు’’ బాధగా అన్నాడు విశ్వనాథ్ తమ్ముడు శంకరంతో.‘‘అన్నయ్యా! వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడమేమిటి? జాలి కబుర్లు! నీ దగ్గర్నుంచి ఎంతో కొంత గుంజుదామని చంద్రం ప్రయత్నం. వాడు డబ్బు తిరిగిచ్చే మనిషి కాదు. నన్నూ అడిగాడు. నిర్మొహమాటంగా లేదని చెప్పాను’’ అన్నాడు శంకరం కఠినంగా.‘‘అవేం మాటలురా! కష్టంలో సాయం చేయకపోతే ఎలా? అందునా మనకి సాయం చేసిన బాబాయి కుటుంబానికి...’’ తమ్ముడిని మందలించాడు విశ్వనాథ్.‘‘నీదంతా అమాయకత్వం. నేనన్న దాంట్లో తప్పేముంది? అందరినీ నమ్ముతావు. చంద్రం సంగతి నీకు తెలియదు. అటు ఉద్యోగం, ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. బాబాయి మాత్రం తక్కువా? బోలెడంత వెనకేసుకున్నారు. వాళ్లకేం తక్కువని మనల్ని డబ్బడగాలి?’’ తమ్ముడి మాటల్లో ఈర్షా్య ద్వేషాలు విశ్వనాథ్ని కలవరపెట్టాయి.‘‘ఎవరెంతటి వారైనా సమయానికి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. అత్యవసరమని అడిగినా సాయం చేయలేకపోయాము. ఇక ఆ విషయం వదిలెయ్’’ అసహనంగా అన్నాడు విశ్వనాథ్.‘‘అయినా నీ దగ్గర డబ్బెక్కడుంది అప్పనంగా ఇవ్వడానికి? అయినాదానికి, కానిదానికి అప్పు చేస్తావు. వడ్డీలు కడతావు. నీకలవాటేగా!’’ అన్నని రెట్టించి దెప్పుతూ అన్నాడు శంకరం.తమ్ముడి మాటలు మౌనంగా భరించాడు విశ్వనాథ్.‘‘సరేలే! ఈ వాదులాట మనకెప్పుడూ ఉన్నదేగా! నిన్ననంగా సిటీకి వచ్చినవాడివి ఇంటికి రాలేదు. నీ ఆరోగ్యం మాత్రం పట్టించుకోవు’’ నిష్ఠూరమాడాడు శంకరం.‘‘బాబాయి దగ్గర నేనొక్కడినే ఉన్నాను. ఇంకెవరూ రాలేదు. అందుకే రాలేకపోయాను’’ సంజాయిషీ ఇచ్చాడు విశ్వనాథ్.‘‘ఏం వాడింట్లో మనుషులేమయ్యారు? అన్నీ నాటకాలు..’’ ఉడుక్కుంటూ అంటుండగానే సిస్టర్ వచ్చి, ‘రామారావు పేషెంటు తాలూకు ఎవరున్నారో లోనికి రండి’ అని చెప్పి వెళ్లింది. తమ్ముడి ఫోన్ కట్ చేసి లోనికి వెళ్లాడు విశ్వనాథ్.‘‘డబ్బు కట్టి రూమ్ నంబరు పద్దెనిమిదికి వెళ్లండి. బాడీ ఎంబామ్ అవుతోంది’’ అంటూ తొందరపెట్టింది సిస్టర్.‘‘ఎంబామ్ అవుతోందా? అంటే?’’ ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘ఏం లేదు! బాడీని రెడీ చేస్తున్నాం’’ అని వివరం చెప్పకుండా లోనికి వెళ్లింది నర్సు.చంద్రం సాయంకాలం ఆరుగంటలకు వచ్చి బిల్లు కట్టాక శవాన్ని ఇచ్చారు. చంద్రం తన కారులో, విశ్వనాథ్ బాడీతో అంబులెన్సులో చంద్రం ఇంటికి బయలుదేరారు.మరుసటిరోజు రామారావు దహన సంస్కారాలు పూర్తయ్యే సరికి ఉదయం పదకొండు గంటలు దాటింది. అక్కడికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా శ్మశానం వీడి వెళుతున్నారు. స్నానం చేసి, బట్టలు ఆరేసి ఓ మూల బెంచీ మీద నీరసంగా కూర్చుని ఉన్నాడు విశ్వనాథ్.‘‘శంకరం ఇంటికి వెళుతున్నావుగా! కర్మలకు రా అన్నా!’’ అని చెప్పి వెళ్లాడు చంద్రం.‘‘పద! ఇక మనం కూడా వెళదాం’’ అన్నాడు శంకరం అన్న దగ్గరకొచ్చి.ఆరేసిన బట్టలు మడిచి సంచిలో పెట్టుకుని, ‘‘ఒంట్లో నలతగా, తల దిమ్ముగా ఉందిరా! నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. ఆకలవుతోంది. అన్నం తిని వెంటనే ఊరికి బయలుదేరాలి. తెచ్చుకున్న డబ్బు ఖర్చయిపోయింది. దారి ఖర్చుకు డబ్బులు కావాలి’’ శ్మశానం బయటకు నడుస్తూ, మొహమాటపడుతూ తమ్ముడితో మెల్లగా అన్నాడు విశ్వనాథ్.అదే సమయానికి వారి పక్కనుంచి మహాప్రస్థానం వ్యాన్ పెద్ద శబ్దం చేస్తూ వెళ్లింది. ఆ రొదలో విశ్వనాథ్ మాటలు గాలిలో కలిసిపోయాయి. తన మాటలు శంకరం వినలేదని విశ్వనాథ్ గమనించలేదు. ఇద్దరూ శ్మశానం నుంచి బయట రోడ్డు మీద ఆటో స్టాండ్కి వచ్చారు. అదే సమయానికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడాడు శంకరం.తిరిగి వస్తూనే, ‘‘అన్నయ్యా! మీ మరదలు ఫోన్ చేసింది. తనకు పట్టింపులు ఎక్కువ. శ్మశానం నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లాలట. నీకు తెలిసే ఉంటుంది. అందుకే నువ్వు సరాసరి ఊరికి వెళ్లు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు’’ అని పక్కన నిలబడి, పాసింజర్ కోసం తమనే గమనిస్తున్న ఆటోను పిలిచాడు శంకరం.‘‘సార్ని బస్టాండ్లో దింపు’’ అని ఆటో డ్రైవర్కి చెప్పి, ఇంకొక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు శంకరం నిర్దయగా.తమ్ముడేమన్నాడో సరిగ్గా అర్థమయ్యీ కాక క్షణంపాటు తొట్రుపాటుకు లోనయ్యాడు విశ్వనాథ్.తమ మధ్య జరిగిన సంభాషణ మననం చేసుకున్నాడు. తమ్ముడన్న మాట అప్పుడు అర్థమైంది.‘అవును వాడన్నది నిజమే! కొందరికి ఇలాంటి పట్టింపులు ఉంటాయి. అయినా సొంత అన్నదమ్ముల మధ్య ఇలాంటి ఆంక్షలా?’ విరుద్ధ ఆలోచనలతో విశ్వనాథ్ మనసు కళ్లెంలేని గుర్రంలా పరుగెట్టింది. అంతటి నిస్సత్తువ, అశక్తతలోను అతని పెదవులపై వెర్రి చిరునవ్వొకటి తళుక్కుమని మాయమైంది. ఇంటికి చేరాలి. ఎలా వెళ్లాలి? అన్న ఆలోచన మిగతా ఏ ఆలోచనను దరిచేరనివ్వలేదు. ఏం చేయాలో తోచడం లేదు.తెచ్చుకున్న డబ్బు బాబాయి అత్యవసర మందులకు ఖర్చయింది. ఆ డబ్బును చంద్రాన్ని అడిగి తీసుకుందామనుకున్నాడు. మనసొప్పక అడగలేదు. ఇప్పుడు బస్సు టికెట్కి కూడా సరిపడా డబ్బులు లేవు. ఎవర్ని అడగాలి? దిక్కుతోచని స్థితి. శరీరంలో సత్తువ క్షీణించింది. నాలుగు పిడచగట్టింది. మెదడు మొద్దుబారింది. చుట్టూ ఏం జరుగుతోందో, తనెక్కడ ఉన్నాడో సైతం అర్థం కావడంలేదు అతనికి. ఆలోచనా శక్తి మందగించింది. ఎవరో.. ఏదో.. అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది.‘‘ఏ బస్టాండ్కి వెళ్లాలి సార్?’’ అడుగుతున్నాడు ఆటో డ్రైవర్.సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. అతనికి మెదడు నుంచి నోటి మాటకు సంకేతం అందడం లేదు. యాంత్రికంగా జేబులు తడుముకున్నాడు విశ్వనాథ్.జేబులో మిగిలి ఉన్న ఒక్క యాభై రూపాయల నోటు, మొబైల్ ఫోను చేతిలోకి తీసుకున్నాడు.‘‘ఎక్కడికి వెళ్లాలి సార్?’’ మళ్లీ అడిగాడు ఆటో డ్రైవర్, విశ్వనాథ్ని పరికించి చూస్తూ.‘‘ఆటో వద్దు, డబ్బుల్లేవు..’’ అతని నోటి మాటలు ముద్దగా వచ్చాయి.‘‘గూగుల్ పే ఉంది సార్!’’‘‘నాకు లేదు. బస్టాండ్కి దారి చెప్పు. నడిచి వెళతాను’’ ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని అంటూనే, మొదలు నరికిన మానులా కుప్పకూలిపోయాడు విశ్వనాథ్.ఆటో అతను కంగారుపడుతూ ఆటో పక్కకు ఆపి, ఇంజిన్ ఆఫ్ చేసి, పడిపోయిన విశ్వనాథ్ని తట్టి లేపుతూ, స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్నాడు. పరుగున ఆటో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి, విశ్వనాథ్ ముఖం మీద నీళ్లు చల్లుతూ, ‘‘సార్.. సార్!’’ అంటూ తట్టి లేపే ప్రయత్నం చేశాడు.రెండు మూడు నిమిషాల తర్వాత కొద్ది తెలివి వచ్చి, మగతగా కళ్లు తెరిచాడు విశ్వనాథ్.విశ్వనాథ్ వీపు చుట్టూ చేయి వేసి, కూర్చోవడానికి సాయం చేసి, వాటర్ బాటిల్ అందించి, ‘‘కాసిని నీళ్లు తాగండి సార్’’ అన్నాడు ఆటో డ్రైవర్.నీళ్లు తాగి, ‘‘నాకేమైంది?’’ పీలగా లోగొంతుతో ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘మీరు స్పృహతప్పి పడిపోయారు. మీరు పడిపోయినప్పుడు.. మీ ఫోను, యాభై రూపాయల నోటు కింద పడ్డాయి’’ అని వాటిని, బట్టలున్న బ్యాగును విశ్వనాథ్ చేతికి అందించాడు ఆటో డ్రైవర్.ఆ నోటును అతనికే తిరిగి ఇచ్చి, తినడానికి ఏమైనా తెమ్మని సైగ చేశాడు విశ్వనాథ్.అతను పరుగున వెళ్లి, పక్కనే ఉన్న పాన్షాపులో బిస్కట్ ప్యాకెట్ తెచ్చి, ‘‘ఇవి తినండి! మీ సుగర్ లెవల్ పడిపోయినట్లుంది’’ అని పక్కనే ఉన్న పళ్ల బండి మీద నుంచి రెండు అరటిపండ్లు తెచ్చి ఇచ్చాడు.నీళ్లు తాగి, నాలుగు బిస్కట్లు, అరటిపండు తిని, రెండో పండు బ్యాగులో వేసుకుని,‘‘చాలా సాయం చేశావు. థాంక్యూ తమ్మీ! ఒంట్లో ఇప్పుడు బాగుంది. కొద్దిగా శక్తి వచ్చింది’’ అని లేచి, వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు.‘‘నిన్ను ఇందాక నా ఆటో కాడ వదిలి వెళ్లినతను ఎవరు?’’ అడిగాడు ఆటో డ్రైవర్.‘‘నా తమ్ముడు’’ అన్నాడు విశ్వనాథ్.‘‘సొంత తమ్ముడా? ఇందాక ఆయనన్న మాటలు నేను ఇన్నా. నిన్ను ఇంటికి రావద్దు. సీదా ఊరికి పొమ్మన్నడు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.మౌనంగా లేచి నిలబడి, ‘‘నేను వెళతాను’’ అన్నాడు విశ్వనాథ్.‘‘ఎలా వెళతారు? డబ్బులు లేవన్నారు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.‘‘నడిచి వెళతాను. ఎవరైనా తెలిసిన వాళ్లకి ఫోను చేద్దామన్నా ఫోన్ చార్జ్ అయిపోయినట్టుంది. నంబర్లు అందులో ఉన్నాయి. దేవుడు ఏదో విధంగా తప్పక సాయం చేస్తాడు’’ అన్నాడు విశ్వనాథ్ ఆకాళంలోకి చూస్తూ.‘‘అంతదూరం నడవడం కష్టమన్నా! నువ్వు నడిచే స్థితిలో లేవు. నిన్ను బస్టాండులో దింపి వెళతాను’’ అని విశ్వనాథ్ భుజం చుట్టూ చేయి వేసి, ఆటో దగ్గరికి నడిచాడు అతను.‘‘నీ పేరేంటి?’’ అడిగాడు విశ్వనాథ్.‘‘శంకర్’’‘‘ఓ.. నీది నా తమ్ముడి పేరే’’‘‘తమ్ముళ్లందరూ ఒకేలా ఉండరన్నా’’‘‘ఎందుకలా అన్నావు?’’‘‘మీకు తెల్వదా?.. ఇంతకీ ఏ ఊరెళ్లాలి?’’ మాట మారుస్తూ అడిగాడు శంకర్.‘‘కోదాడ వెళ్లాలి.. శంకర్! నువ్వు నా ఫోన్ తీసుకో. నాకు బస్సు చార్జి మందం మూడువందలు ఇవ్వు. ఫోను ఖరీదు పదిహేను వందలు ఉంటుంది’’ అన్నాడు విశ్వనాథ్.‘‘తప్పు సార్! అట్టా మాట్లాడొద్దు. అవసరం ఎప్పుడు ఎట్టా ఎవరికి ఎవరితో వస్తుందో ఎవరికి ఎరుకన్నా! సాయానికి వెల కట్టకూడదు’’ అన్నాడు ఆటో శంకర్.ఆటో స్పీడ్ అందుకుంది. కాసేపట్లో బస్టాండ్ ఎంట్రీ గేటు దాటి ఆటోను ఓ మూలగా పార్క్ చేశాడు శంకర్. విశ్వనాథ్ని క్యాంటీన్కి తీసుకువెళ్లి భోజనం అయ్యాక, కోదాడ టికెట్ తీసుకుని బస్సు ఎక్కించాడు.‘‘శంకర్! నీ ఫోన్ నంబరు ఒక చిట్టీ మీద రాసివ్వు. ఊరికెళ్లగానే డబ్బు పంపిస్తాను. నువ్వు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకుంటాను. నీకు కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే! మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. చిన్నవాడివైనా చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను’’ నమస్కరిస్తూ అన్నాడు విశ్వనాథ్.చిట్టీ మీద తన ఫోన్ నంబరు రాసి ఇస్తూ, ‘‘అన్నా! అట్టా చేయకు. నాకస్సలు నచ్చదు. నీ పానం బాగా లేదని కండక్టర్కి చెప్పి, నా ఫోన్ నంబరు ఇంకో చిట్టీ మీద రాసిచ్చిన. తోవలో అవసరమొస్తే నాకు ఫోన్ చెయ్యమని చెప్పిన. ఎందుకైనా మంచిది, నీ తమ్ముడి ఫోన్ నంబరు నోటికి గుర్తుంటే నాకు చెప్పన్నా’’ అడిగాడు ఆటో శంకర్.ఫోన్ నంబరు చెప్పాడు విశ్వనాథ్. నంబరు నోట్ చేసుకుని, ‘‘ఇంటికి చేరగానే ఫోను చెయ్యన్నా. నమస్తే! నేనుంట’’ అని చెప్పి బయటకు వచ్చి, బస్టాండులోని పబ్లిక్ ఫోన్ నుంచి విశ్వనాథ్ తమ్ముడు శంకరానికి ఫోన్ చేశాడు ఆటో శంకర్.‘‘హలో! సంకరం గారేనా మాట్లాడేది?’’ అన్నాడు ఆటో శంకర్.‘‘నా పేరు శంకరం.. సంకరం కాదు’’‘‘సంకరన్నా! ఇది ఇను. ఇందాక ఒక పెద్దాయన అమీర్పేట శ్మశానం బయట ఆటో స్టాండు కాడ స్పృహ తప్పి పడిపోయిండు. ఆయన ఫోను నుంచి గిదే నంబరుకి చివరి ఫోన్ చేసిండు. అందుకే నీకు ఫోన్ చేసిన. ఆయన నీకు చుట్టమో పక్కమో నాకు తెల్వదు. అంబులెన్సుకు నేనే ఫోను చేసిన. వాళ్లొచ్చి ఆయన్ని తీసుకుపోయిన్రు. ఏ హాస్పిటల్కి తీసుకుపోయిన్రో నాకు తెల్వదు. ఆ మనిషి నీకు తెలిసుంటే వివరం కనుక్కుంటావని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోను చేసిన, గంతే!’’ అని ఫోను పెట్టేశాడు ఆటో శంకర్.అన్న విశ్వనాథ్కి ఏమైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానం వచ్చి భయపడ్డాడు శంకరం. వెంటనే అన్నకి ఫోన్ చేశాడు. ఫోన్ పనిచేయడం లేదని రికార్డెడ్ మెసేజ్ వస్తోంది.‘‘రమా! అన్నయ్య శ్మశానం దగ్గర స్పృహతప్పి పడిపోయాడట! అంబులెన్స్ వాళ్లు ఏదో ఆస్పత్రికి తీసుకెళ్లారట. నీ మాట విని బుద్ధిలేని పనిచేశాను. నీకు పట్టింపని నన్ను పెంచిన అన్నని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వచ్చాను. ఇంటికి రాకూడదన్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించాను. చేతిలో డబ్బుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అన్నయ్యను ఎక్కడని వెదకాలి?’’ అని తల పట్టుకుని బాధపడుతూ వెంటనే బయలుదేరాడు.అమీర్పేట చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులన్నీ మూడుగంటల పాటు వెదికాడు.గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ చెక్ చేశాడు. జాడ తెలియలేదు. మళ్లీ అన్నకి ఫోన్ చేశాడు. ఇంకా ఫోన్ పనిచేయడం లేదని మెసేజ్ వస్తోంది. ఏం చేయాలో పాలు పోలేదు.ఊళ్లో వదినకు ఫోన్ చేశాడు. అన్న ఇంకా రాలేదని, ఆయన ఫోను పనిచేయడంలేదని వదిన చెప్పింది. శంకరానికి కంగారు ఇంకా ఎక్కువైంది. తను చేసిన పనికి శంకరం మనసు వ్రయ్యలైంది.ఇంతలో ఫోను మోగింది. ఫోను తీశాడు శంకరం. ఏదో ల్యాండ్లైన్ నుంచి ఫోను.‘‘శంకరం! ఇప్పుడే కోదాడ బస్సు దిగి, నువ్వు కంగారు పడుతున్నావేమోనని బస్టాండు నుంచి ఫోను చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్లాక నీరసంతో కళ్లు తిరిగి కూలబడ్డాను. ఎవరో ఆటో అతను.. అతని పేరు కూడా శంకరమే! సొంత తమ్ముడిలా నాకు భోజనం పెట్టించి, టికెట్ కొని బస్సు ఎక్కించి వెళ్లాడు. క్షేమంగా ఊరికి చేరానని చెప్పడానికి ఫోన్ చేశాను. ఉంటాను’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విశ్వనాథ్! -
సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం కాదు: రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్.. పేరు వినగానే, హీరోయిన్గానే కాకుండా ఫిట్నెస్ అండ్ హెల్త్ గుర్తొస్తుంది. ఆమె గురించి తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ఉంటూనే ఉంటాయి. నటిగానే కాకుండా ఆమె ఫిట్నెస్, డ్యాన్స్, స్పోర్ట్స్, సోషల్ యాక్టివిటీస్, ఆంత్రప్రెన్యూర్షిప్లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుంది. రకుల్ గురించి ఇంకొన్ని విషయాలు...నాన్న ఆర్మీ ఆఫీసర్రకుల్ ప్రీత్ సింగ్ న్యూఢిల్లీలోని సిక్కు కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి కుల్వీందర్ సింగ్ ఆర్మీ ఆఫీసర్గా పని చేసేవారు. దాంతో ఆమె ఆర్మీ స్కూల్లోనే స్కూలింగ్ చేసి, ఆపైన జీసస్ అండ్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. రకుల్ ప్రీత్ జాతీయ స్థాయి గోల్ఫ్ ప్లేయర్. అంతేకాదు, ఎంతో ఆసక్తితో భరతనాట్యం కూడా నేర్చుకుంది. అలాగే ఆమెకు గుర్రపు స్వారీ చేయడం కూడా చాలా ఇష్టం.మోడలింగ్మోడలింగ్ను కెరీర్గా ఎంచుకున్నాక, రకుల్ 18 ఏళ్లకే కన్నడ సినిమా ‘గిల్లి’ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించి.. ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ‘ఫెమినా’ మిస్ ఇండియా–2011లో రకుల్ ఐదో స్థానంలో నిలిచింది. అందులోనే పాంటలూన్స్ మిస్ ఫ్రెష్ ఫేస్, ఫెమినా మిస్ టాలెంటెడ్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, పీపుల్స్ చాయిస్ మిస్ ఇండియా టైమ్స్ వంటి టైటిల్స్ గెలుచుకుంది.కోవిడ్ టైంలో..‘మనకంటూ ప్రత్యేకంగా టైమ్ కేటాయించుకోవాలి. ఎవరి సంతోషం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. దానికోసం ఎవరిపైనా ఆధారపడొద్దు’ అన్నది రకుల్ అభిప్రాయం. రకుల్ తన సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరిచిపోలేదు. కోవిడ్ సమయంలో వంద కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా, క్రౌడ్ ఫండింగ్ చేసి పేదలకు డొనేషన్స్ అందించింది. 2017లో రకుల్ ‘తెలంగాణ బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయింది.నాన్న నుంచే వచ్చాయి..2024లో తను ప్రేమించిన జాక్కీ భగ్నానీ (Jackky Bhagnani)ని గోవాలో వివాహం చేసుకుంది. మొదట ఓవర్సీస్లో పెళ్లి వేడుకలు జరపాలనుకున్నారట! కాని, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలనే ఆలోచనతో గోవాలోనే ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ‘సక్సెస్ అంటే పేరు, డబ్బు కాదు. మనసుకు నచ్చిన పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడం. చిన్నప్పటి నుంచి నాన్న నుంచి వచ్చిన డిసిప్లిన్, పంక్చువాలిటీ నన్ను ఎప్పటికీ హ్యాపీ లైఫ్ వైపే తీసుకెళ్తాయి.ఇష్టందానివల్లే చేయాల్సిన పనిలో రెండు నిమిషాలు ఆలస్యమైనా నాకు ప్యానిక్ అటాక్ వచ్చేస్తుంది. సోషల్ ఎంటర్టైనర్స్ చేయడం నాకు చాలా ఇష్టం. వాటితో సమానంగా సోషల్ రెస్పాన్సిబుల్ సినిమాలూ చేయాలని ఉంది. ఫ్యాషన్, డ్రెస్సింగ్ విషయానికొస్తే, నాకు ఏది కంఫర్ట్ ఉంటే అదే ఎంచుకుంటాను’ అని చెబుతుందిపర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. 2047 నాటికైనా మనమంతా కాలుష్యరహిత దేశంలో ఉంటామని ఆశిస్తున్నాను. ప్రతి భారతీయ పౌరుడు బాధ్యతగా ఉంటేనే ప్లానెట్ ఎర్త్ బాగుంటుంది.– రకుల్ప్రీత్ సింగ్ -
రంగురంగుల సాలెగూడు!
ఒక్కసారి ఊహించండి! సాలీడు అల్లిన గూడు తెల్లగా కాకుండా ఎర్రగా మెరిసిపోతే ఎలా ఉంటుందో? అద్భుతంగా ఉంటుంది కదా! ఆ ఊహనే ఇప్పుడు జర్మనీ బైరోయిత్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిజం చేశారు. వెంటనే సాలెగూడు మీద ఎరుపు రంగు పూశారు అనుకుంటే పొరపాటే! ‘క్రిస్పర్’ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా వారు సాలెగూడు గుడ్లలో ఒక కొత్త ప్రొటీన్ను ప్రవేశపెట్టారు. ఫలితంగా పుట్టిన చిన్న సాలీళ్లు తమ తంతులను ఎర్రరంగులో అల్లడం మొదలుపెట్టాయి. ఇలా సహజంగా వచ్చే సాలె తంతులు ఇప్పుడు మనిషి ఆలోచనలతో కలిసిన ఒక అద్భుతంగా మారింది. ఇది కేవలం రంగుల వరకే పరిమితం కాదు, ఈ తంతులను మనిషి అవసరాలకు తగ్గట్టుగా మలచుకోవచ్చు. బలంగా కావాలంటే బలంగా, మృదువుగా కావాలంటే మృదువుగా కొత్త అవసరాలకు అనుగుణంగా ఎలాగైనా మలచుకునే వీలు ఉంది. భవిష్యత్తులో డాక్టర్లకు శరీరంలో కరిగిపోయే కుట్లకూ, డిజైనర్లకు కొత్త బట్టల మేళవింపుకూ, ఇంకా ఎన్నో రంగాల్లో వినియోగించుకునేందుకు ఈ సాలెగూడు తంతులే ప్రధాన ఆధారంగా మారనున్నాయి. ప్రస్తుతం ఇది పరిశోధన దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను తీసుకురాగలదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.(చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!) -
ల్యాబ్ మేడ్ ఫిష్
ఒకప్పుడు చేపల కోసం సముద్రంలోకి వల వేసేవారు. ఇప్పుడు ల్యాబ్లో ‘సెల్’ వేస్తున్నారు. అది కూడా ఎంతో రుచికరమైన సాల్మన్ ఫిష్ కోసం. తాజాగా అమెరికాలో ల్యాబ్ గ్రోన్ సీ ఫుడ్కి ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే, త్వరలోనే ఈ చేప వంటకాలు డైనింగ్ టేబుల్ మీదకు రావడమే తరువాయి. ‘వైల్డ్టైప్’ అనే సంస్థ 2018లో కోహో సాల్మన్ కణజాలంతో ఈ కృత్రిమ చేప మాంసం తయారీని మొదలు పెట్టింది. దానికి స్పెషల్ డైట్, ప్రొటీన్ షేక్స్, పక్కా బయో రియాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి, చేపను పెద్దదిగా తయారు చేస్తారు. ఇది జీవహింస లేని పద్ధతి, పైగా ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు తక్కువగా కూడా ఉండటంతో, చాలామంది పర్యావరణ ప్రేమికులు ‘ఇంకాస్త పరిశోధన కావాలి కానీ ఐడియా సూపర్!’ అంటున్నారు. ఈ మధ్యనే ఇలా తయారు చేసిన చేప మాంసంతోనే, ఒక రెస్టరెంట్లో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ‘ఏం తేడా లేదు, సూపర్గా ఉంది’ అని ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంతమంది రకరకాల అనుమానాలతో ‘ల్యాబ్ ఫుడ్? నో థ్యాంక్స్’ అనేస్తున్నారు. ఇది చూస్తుంటే, రేపటికి ల్యాబ్లే అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తయారయ్యే కిచెన్లుగా మారిపోతాయని కనిపిస్తోంది.కంటి శుక్లాలకు చుక్కల మందునడి వయసు దాటిన వారిలో చాలామందికి కళ్లలో శుక్లాలు ఏర్పడతాయి. వీటిని తొలగించుకోవడానికి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న మార్గం శస్త్రచికిత్స మాత్రమే! అయితే, ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు కంటి శుక్లాలను పూర్తిగా నయం చేయగల చుక్కల మందును సృష్టించారు. యూనివర్సిటీ ఆఫ్ శాన్ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లకు చెందిన శాస్త్రవేత్తలు కంటి శుక్లాలను కరిగించగల చుక్కల మందును విజయవంతంగా తయారు చేయగలిగారు. ‘లానోస్టెరాల్’ అనే ఔషధ రసాయనంతో కూడిన ఈ చుక్కల మందు త్వరలోనే కేటరాక్ట్ సర్జరీకి ప్రత్యామ్నాయం కాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు మళ్లిన వారిలో అంధత్వానికి కేటరాక్ట్ ప్రధాన కారణంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న నేపథ్యంలో ఈ చుక్కల మందు వైద్యరంగానికి ఆశాకిరణంగా మారింది.(చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!) -
‘షో కిటికీల’తో ఇంటి అలంకరణ అదుర్స్..!
వివిధ రకాల మోడళ్లలో ఉండే కిటికీలను, వాటి తెరలను చూస్తుంటాం. వాటి డిజైన్కి, అలంకరణకు, కర్టెన్ల ప్రింట్లకు ముచ్చట పడిపోతుంటాం. కిటికీలు ఇంటి లోపలికి గాలి వెలుతురు వచ్చేందుకు ఏర్పాటు చేస్తుంటారు. వాటికి అలంకరించే తెరలు దుమ్ము, గాలుల నుంచి రక్షణగా కూడా వాడుతుంటారు. కాని, ఇంటి అలంకరణ కోసం ‘షో కిటికీల’ను వాడితే.. ఎలా ఉంటుందో చూడాలంటే... కర్టెన్లు ఉన్న ఈ విండో వాల్ ఫ్రేమ్స్ను చూడాల్సిందే!అపార్ట్మెంట్ల కల్చర్ పెరిగిపోయాక పెద్ద పెద్ద లోగిళ్లు ఉన్న ఇళ్లు తగ్గిపోతున్నాయి. కిటికీలు పెట్టాలంటే అన్ని చోటలా కుదరకపోవచ్చు. లేదంటే వాల్ హ్యాంగర్స్గా ఏదైనా బాగుంటుంది అనే ఆలోచనా కావచ్చు. వీటన్నింటికీ ఒకే సమాధానంగా ‘షో విండోస్’ సరైన ఎంపిక అవుతున్నాయి. ఫ్లవర్ బాస్కెట్గా! వుడెన్ లేదా పీవీసీ మెటీరియల్తో చేసిన క్రియేటివ్ విండో షెల్ఫ్ డెకరేషన్ ఫ్లవర్ బాస్కెట్గా డిజైన్స్ బట్టి వెయ్యి రూపాయలకు పైగా ధర పలుకుతున్నాయి. దీనిలోనే వింటేజ్ విండోస్ ఫ్రేమ్ వాల్ డెకర్ ప్లాంట్ లేదా హ్యాంగింగ్ ప్లాంట్ పాట్స్ హోల్డర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవి ఇంటి లోపలి గదుల్లో గోడలకు అలంకరించవచ్చు. బుక్ షెల్ఫ్ లేదా పెన్నులు, పెన్సిల్స్ వేసుకునేలా కూడా ఉపయోగించవచ్చు. కార్వింగ్.. తెరలుచుట్టూ అందమైన వుడెన్ కార్వింగ్, మధ్యలో మిర్రర్ వచ్చేలా కూడా ఈ షోకేస్ విండోస్ హ్యాంగర్స్ లభిస్తున్నాయి. రకరకాల డిజైన్లలో ఉండే చిన్న చిన్న తెరలు ఉండే ఈ డిజైన్ హోల్డర్స్ బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్లకు అందాన్ని తీసుకువస్తాయి. ఆరుబయటఇండోర్ విండో షెల్ఫ్ హోల్డర్స్ ఒకలాంటి అందాన్ని తీసుకువస్తే, ఔట్డోర్కి మరొక అలంకరణగా మారిపోతాయి. ఔట్డోర్ గోడకు విండో షెల్ఫ్ హోల్డర్ని తగిలించి, దాని ముందు టేబుల్, ఇరువైపులా రెండు చెయిర్లు వేస్తే గార్డెన్ లేదా కేఫ్లుక్ వచ్చేస్తుంది. ఎన్నార్ (చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!) -
రాతిపై చెక్కిన అద్భుతం..!
జోర్డాన్లోని పెట్రా నగరం– పర్యాటకుల్ని ఆకర్షించే పురాతన, చారిత్రక ప్రాంతం! దీనిని నబేటియన్ తెగవారు సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ నగరం మొత్తం ఎర్రటి ఇసుకరాతి పర్వతాలను తొలిచి నిర్మించడంతో ఈ ప్రదేశమంతా చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. పెట్రా ప్రధాన మార్గంలో ఉండే ‘అల్–ఖజ్నే’ అనేది ఇక్కడున్న అతిపెద్ద కట్టడాల్లో ఒకటి. ఇక్కడున్న సిక్ అనే పొడవైన, ఇరుకైన లోయ గుండా వెళితేనే పెట్రా నగరంలోకి ప్రవేశించగలం. అలాగే ఇక్కడ కొన్ని భారీ రాతి సమాధులు ఉంటాయి. వాటిని ‘రాయల్ టూంబ్స్’ అంటారు. అవి నబేటియన్ల కళా నైపుణ్యానికి నిదర్శనం. భూకంపాలు, వర్తక మార్గాల మార్పులతో ఈ నగరం దాదాపు వెయ్యి సంవత్సరాలు మరుగునపడింది. తిరిగి 1812లో దీనిని కనుగొన్నారు. ఈ అద్భుతమైన నగరం ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.ప్రతిభకు సంబరాలు! హెల్సింకీ ఫెస్టివల్ – ఇది ఫిలండ్లోని అతిపెద్ద మల్టీ–ఆర్ట్ ఫెస్టివల్! ఇది హెల్సింకీ నగరంలో జరుగుతుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలను సెప్టెంబర్ 1 వరకు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్లో సంగీతం, డ్యాన్స్, విజువల్ ఆర్ట్స్, సినిమా వంటి వివిధ కళా రూపాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి దేశీయ, అంతర్జాతీయ కళాకారులను, ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ ఫెస్టివల్లో ప్రతి ఒక్కరికీ నచ్చేలా అనేక కార్యక్రమాలు ఉంటాయి. క్లాసికల్ సంగీతం దగ్గర నుంచి పాప్, రాక్ వంటి ఆధునిక సంగీతం వరకు వివిధ శైలులలో ప్రదర్శనలు జరుగుతాయి.అంతర్జాతీయంగా పేరు పొందిన ప్రముఖ బ్యాండ్లు ఈ ఫెస్టివల్లో పాల్గొంటాయి. థియేటర్ ప్రదర్శనలు, నత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతర్జాతీయ బందాలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తాయి. ఫెస్టివల్లో భాగంగా నగరంలోని వివిధ గ్యాలరీలలో విజువల్ ఆర్ట్స్ ప్రదర్శనలు జరుగుతాయి. ఇది స్థానిక, అంతర్జాతీయ కళాకారులకు తమ సజనాత్మకతను ప్రదర్శించడానికి మంచి అవకాశం.ఓపెన్–ఎయిర్ సినిమా ప్రదర్శనలు, సాహిత్యం ఈ ఫెస్టివల్లో భాగంగా ఉంటాయి. హెల్సింకీ ఫెస్టివల్లో అత్యంత ముఖ్యమైన, విశేషమైన భాగం నైట్ ఆఫ్ ది ఆర్ట్స్. ఇది ఈ పదిహేను రోజుల్లో ఒకే రోజు జరుగుతుంది. ఆ రోజున హెల్సింకీ నగరం కళల వెలుగులతో నిండిపోతుంది. మ్యూజియమ్లు, గ్యాలరీలు, థియేటర్లు, బుక్షాప్లు రాత్రి పొడవునా తెరిచి ఉంటాయి. ప్రజలు వీథుల్లో కళా ప్రదర్శనలను, ప్రత్యక్ష సంగీత కచేరీలను ఉచితంగా ఆస్వాదిస్తారు.(చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు) -
ఈ సండే సింగోడి హల్వా చేసేద్దాం ఇలా..!
సింగోడీ హల్వాకావలసినవి: కోవా– 2 కప్పులు, బెల్లం తురుము– రుచికి సరిపడాబాదం పొడి– 2 టేబుల్ స్పూన్లు (బాదం దోరగా వేయించి, పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి), పచ్చికొబ్బరి తురుము– పావు కప్పు, ఏలకుల పొడి– అర టీ స్పూన్, బాదం– గార్నిష్ కోసం (నేతిలో వేయించాలి)తయారీ: కోవాను మెత్తగా చేత్తో బాగా కలిపి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కళాయిలో కోవా, ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము వేసి చిన్న మంట మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగి, కోవాలో కలిసిపోయిన తర్వాత, పచ్చి కొబ్బరి తురుము, బాదం పొడి వేసి బాగా కలపాలి. తీపి సరిపోయిందో లేదో చూసుకుని, మరికాస్త బెల్లం తురుము వేసుకోవచ్చు. మళ్లీ వేసుకున్న బెల్లం తురుము బాగా కరిగి, ఈ మిశ్రమమంతా చిన్నమంట మీద బాగా ఉడకాలి. తర్వాత ఏలకుల పొడి వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మి్రÔè మం కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, వేయించిన బాదంతో కలిసి సర్వ్ చేసుకోవచ్చు.టేస్టీ మీల్మేకర్ బాల్స్కావలసినవి: మీల్మేకర్– 2 కప్పులు పైనే (శుభ్రం చేసుకుని, మెత్తగా ఉడికించి, తురుములా చేసుకోవాలి), గోధుమ పిండి– 3 టేబుల్ స్పూన్లు, గడ్డ పెరుగు– సరిపడా, ఉల్లిపాయ గుజ్జు– 2 టేబుల్ స్పూన్లు (నూనెలో దోరగా వేయించుకుని చల్లారనివ్వాలి), కారం, గరం మసాలా– 2 టీ స్పూన్లు చొప్పున, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, అల్లం తురుము– పావు టీ స్పూన్ చొప్పున, ఉప్పు– తగినంత, స్ప్రింగ్ రోల్ షీట్స్ – 2 (బాగా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)తయారీ: ముందుగా ఒక బౌల్లో మీల్మేకర్ తురుము, కారం, గోధుమ పిండి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం తురుము, వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, ఉల్లిపాయ గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని బాగా కలపాలి. అవసరం అయితే మరింత పెరుగు కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ప్రతి ఉండకు కొద్దికొద్దిగా స్ప్రింగ్ రోల్ షీట్స్ ముక్కలను చిత్రంలో ఉన్నవిధంగా చుట్టి, బాగా ఒత్తి, నూనెలో దోరగా వేయించి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.కొరియన్ ఫ్రైడ్ పొటాటోకావలసినవి: పెద్ద బంగాళదుంపలు– 3 (తొక్క తీసి, పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు– ఒక టేబుల్ స్పూన్ (సన్నగా, పొడవుగా తరగాలి), పచ్చిమిర్చి ముక్కలు– కొద్దిగా, వెల్లుల్లి తురుము– రెండు టీ స్పూన్లు, టమాటో సాస్, సోయా సాస్– 5 టేబుల్ స్పూన్లు చొప్పున, క్యారట్– ఒకటి (సన్నగా కట్ చేసుకోవాలి), పంచదార, నూనె– సరిపడా, నువ్వులు– ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు– కొన్ని(గార్నిష్కి)తయారీ: ముందుగా బంగాళదుంప ముక్కలను నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని, దోరగా వేయించుకుని, ఆ తర్వాత వెల్లుల్లి తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. వెంటనే వేగిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని కలపాలి. ఈలోపు ఒక చిన్న బౌల్లో సోయా సాస్, టమాటో సాస్, పంచదార వేసుకుని బాగా కలిపి, వేగుతున్న మిశ్రమంలో వేయాలి. ఆపై నువ్వులు జల్లి బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసి, సర్వ్ చేసుకోవచ్చు. -
సిలికాన్ ఫేషియల్ క్లీనర్ నల్లమచ్చలను ఇట్టే తొలగిస్తుంది..!
వయసు పెరిగే కొద్ది ముఖానికి మరింత సంరక్షణ తప్పనిసరి అంటారు సౌందర్య నిపుణులు. అందుకు చాలామంది సాధారణ ఫేషియల్ క్లీనర్లు, మాన్యువల్ బ్రష్లనే ఎంచుకుంటారు. అయితే, తక్కువ ఖర్చులో మంచి ఫలితాన్ని పొందాలనుకునే వారికి ఈ సిలికాన్ ఫేషియల్ క్లీనర్ చక్కగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని మరింత లోతుగా శుభ్రం చేయడానికి, మసాజ్ చేయడానికి సహాయపడుతుంది. ముఖంపై పేరుకుపోయిన మురికిని, మేకప్ను, నల్లమచ్చలను ఇట్టే తొలగిస్తుంది.ఈ క్లీనర్ చాలా సున్నితమైన సిలికాన్ కుచ్చులతో రూపొందింది. అవి చర్మాన్ని సుతారంగా శుభ్రం చేసి, ముఖాన్ని సుమనోహరంగా మెరిపిస్తాయి. ఈ బ్రష్ క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్, మసాజ్, బ్లాక్హెడ్ తొలగింపు వంటి నాలుగు రకాల పనులకు ఉపయోగపడుతుంది. చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించి, నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ఇది సులభంగా పట్టుకుని, ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. దీన్ని తేలికగా వేలికి తొడుక్కుని సులభంగా వాడుకోవచ్చు. ప్రయాణాల్లో కూడా దీన్ని సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు. దీంతో శుభ్రపరచుకోవడం కూడా తేలికే! ఇది రెండు వందల రూపాయల నుంచి ఆన్లైన్లో లభిస్తుంది. చాలా రంగుల్లో దొరుకుతున్నాయి.చిరునవ్వు మెరిసేలా!పంటి సమస్యలను పరిష్కరించడానికి అనేక రకాలుగా దంత చికిత్సలుంటాయి. అయితే వాటిలో సాధారణ చికిత్స– జనరల్ చెకప్ స్కేలింగ్. రోజుల తరబడి దంతాలపై పేరుకుపోయిన గారలను పోగొట్టే పద్ధతి ఇది. దంతాలపై ఏర్పడే బ్యాక్టీరియాతో కూడిన జిగురు లాంటి, రంగులేని పొరను బ్రష్తో సరిగ్గా క్లీన్ చేయలేప్పుడు, అది పుచ్చిపోవడం లేదా చిగుళ్ల వ్యాధికి దారి తీయడం మనకు తెలిసిందే! అలా పసుపు, గోధుమ రంగులో మారిన గారను.. డెంటల్ హైజీనిస్ట్ అల్ట్రాసోనిక్ స్కేలర్ అనే ప్రత్యేకమైన పరికరంతో శుభ్రపరుస్తారు. పంటి ఉపరితలంపై, చిగుళ్ల ఇరుకుల్లో గారను తొలగించే ఈ ప్రక్రియ– సాధారణంగా నొప్పి లేకుండానే జరుగుతుంది. ఈ స్కేలింగ్ చికిత్స తర్వాత, దంతాల ఉపరితలాన్ని నునుపుగా చేయడానికి పాలిష్ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ప్లాక్ సులభంగా పళ్లను అంటుకోకుండా ఉంటుంది. ఈ చికిత్స చేయించుకోవడంతో పళ్లు త్వరగా పుచ్చిపోకుండా, నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. (చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు) -
త్రినేత్రుడు రెడీ..!
భూమి పైనుంచి భారీ టెలిస్కోప్ ఒకటి ఈ విశ్వాంతరాళంలో కలియదిరిగేందుకు సిద్ధమౌతోంది! కొత్త గెలాక్సీలను, ప్రమాదకరమైన గ్రహ శకలాలను, ఆఖరికి గ్రహాంతర జీవుల ఉనికిని సైతం అది కనిపెట్టనుంది! ఈ ఏడాదిలో పని ప్రారంభించనున్న ఆ టెలిస్కోప్, వచ్చే పదేళ్లలో 2 వేల కోట్ల గెలాక్సీల ఆచూకీని కనిపెట్టనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే – ‘లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్’ ప్రాజెక్టులో భాగం చిలీలోని రూబిన్ అబ్జర్వేటరీ తన ‘సిమోన్యీ సర్వే టెలిస్కోప్’లో అమర్చిన అతి శక్తిమంతమైన మూడు కళ్ల కెమెరా... చుక్కల్లో చెడుగుడు ఆడబోతోంది. దిక్కుల దాగుడు మూతల్ని తెరవబోతోంది! చిలీలోని ‘వీరా సి రూబిన్’ అంతరిక్ష పరిశోధన శాల (అబ్జర్వేటరీ) తన చరిత్రాత్మకమైన ఖగోళ పరిశోధనకు చేసుకుంటున్న ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. రహస్య నక్షత్ర మండలాలు, భూమిని ఢీకొట్టగల గ్రహ శకలాలు, అంతుచిక్కని గ్రహాంతర జీవుల ఉనికిని నైతం కనిపెట్టేందుకు రూబిన్ అబ్జర్వేటరీ ఈ అండ పిండ బ్రహ్మాండమైన ప్రాజెక్టును చేపట్టింది. అందుకోసం అత్యంత శక్తిమంతమైన మూడు కళ్ల ‘ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా’ను తన టెలిస్కోప్లో అమర్చుకుంది. తొలి ప్రయోగం సక్సెస్ఈ ఏడాది జూన్ 23 న, ప్రయోగాత్మకంగా రూబిన్ కెమెరా (ఇదే ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా) ఖగోళ శాస్త్రవేత్తలనే అబ్బురపరచే ఫొటోలను తీసింది. ఆ అపూర్వమైన ఛాయా చిత్రాలలో గెలాక్సీ సమూహాలు, సుదూర నక్షత్రాలు, నెబ్యులా (ప్రకాశవంతమైన అంతరిక్ష మేఘం) ఉన్నాయి. ఒక కారు సైజులో 3.2 గిగాపిక్సెల్తో ఉండే ఆ కెమెరా తీసిన ఒక ఫొటోలో 4,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నెబ్యూలా కనిపించింది! అబ్జర్వేటరీకి ఉండే టెలిస్కోప్ వేగంగా వెంటవెంటనే చిత్రాలను తీస్తుంది కాబట్టి, అందులోని కెమెరా అంతరిక్ష మండలానికి ఆవల ఉన్న నక్షత్రాల గుంపు నుండి కూడా కదిలే వస్తువులను పట్టుకోగలదు. ఒక అంతరిక్ష శిల భూమి వైపు వస్తుంటే కనిపెట్టేయనూగలదు. హబుల్, జేమ్స్ల కన్నా పవర్ఫుల్ మానవాళిని అప్రమత్తం చేసే విషయమై ఇప్పటికే ఇతర శక్తిమంతమైన టెలిస్కోప్లు పనిలో ఉన్నాయి. ఉదాహరణకు, ‘జేమ్స్ వెబ్’ టెలిస్కోప్ భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో స్థిరంగా ఒక చోట ఉంటుంది. అంతరిక్షంలోని నిర్దిష్ట లక్ష్యాలను దగ్గరగా చూడటమే ఈ టెలిస్కోప్ ప్రధాన విధి. జేమ్స్ వెబ్ కన్నా ముందున్న ‘హబుల్ టెలిస్కోప్’ ప్రస్తుతం భూమికి 500 కి.మీ కంటే ఎక్కువ ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంది. 1995లో హబుల్ దాదాపు ఒక వారం పాటు ఛాయా చిత్రాల్ని ఒడిసిపట్టి ‘హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజ్గా’ ప్రస్తుతం ప్రసిద్ధిలో ఉన్న ఫొటోను తీసింది. విశ్వాంతరాళాల్లోని 3,000 కు పైగా గెలాక్సీలు ఆ ఫొటోలో పడ్డాయి. దానికి మించిందే తాజా రూబిన్ ప్రాజెక్ట్ కెమెరా. 40 చంద్రుళ్లు పట్టేస్తారురూబిన్ అబ్జర్వేటరీ, ఏప్రిల్లో తన మొదటి టెస్ట్ రన్ సమయంలో, కొన్ని గంటల్లోనే కోటి గెలాక్సీలను ఫొటో తీసింది. రూబిన్కు ఉన్న ప్రత్యేకత వల్లనే ఆ స్థాయిలో ఫొటో తీయటానికి సాధ్యమైంది. జేమ్స్ వెబ్, హబుల్ టెలిస్కోపులు మాదిరిగా కాకుండా, ఆకాశంలోని చిన్న భాగాలను చూడగల రూబిన్ సిమోన్యీ ఒక సర్వే టెలిస్కోప్. అంటే ఇది నిర్దిష్ట వస్తువులను కాకుండా మొత్తం పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది. ఇది తీసే చిత్రం 40 నిండు పున్నమిలకు సమానమైన ఆకాశం మొత్తాన్ని చుట్టేస్తుంది. అదే జేమ్స్ వెబ్కు ఉన్న కెమెరాలు పౌర్ణమి కంటే తక్కువ విస్తృతి కలిగిన ఆకాశ క్షేత్రానికి పరిమితం అవుతాయి. రూబిన్ నుండి తీసిన ఒక ఫొటో చాలా పెద్దదిగా ఉంటుంది. దానిని పూర్తి స్థాయిలో చూడటానికి 400 అల్ట్రా హెచ్.డి. టీవీ స్క్రీన్లు అవసరం అవుతాయి. ‘టైమ్–లాప్స్’ సాంకేతికతఆకాశంలోని అసాధారణ విశేషాలను కనిపెట్టేందుకు 10 ఏళ్ల కాలపరిమితి గల ‘లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్’ (ఎల్.ఎస్.ఎస్.టి.) అనే ఈ ప్రాజెక్టు రూబిన్ రూపొందించింది. ఇందులోని టెలిస్కోప్ 300 టన్నులకు పైగా బరువైన ఉక్కు, గాజుతో తయారైంది. కార్బన్ డైఆకైడ్తో ఒక తీరుగా శుభ్రం అవుతుంటుంది. రాబోయే దశాబ్ద కాలంలో ఈ టెలిస్కోప్, అందులోని భారీ ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా ప్రతి 3–4 రాత్రులకు దక్షిణార్ధ గోళ ఆకాశాన్ని ఫొటోలు తీస్తుంది. ఇది ఈ మహా విశ్వాన్ని మునుపెన్నడూ లేని విధంగా నిర్ణీత వ్యవధిల్లో ఫ్రేమ్ల క్రమాన్ని తీసుకునే ‘టైమ్–లాప్స్’ సాంకేతికతతో ఫొటో తీస్తుంది. ‘‘మేము ప్రతి 30 సెకన్లకు రాత్రిపూట ఆకాశాన్ని గమనిస్తుంటాము కాబట్టి ఒక్కొక్కటి 15 సెకన్ల రెండు వరుస చిత్రాలలో, దాని స్థానం లేదా ప్రకాశాన్ని మార్చుకున్న ఏ వస్తువునైనా మేము పట్టుకోగలం’’ అని రూబిన్ ఏడాది పాటు పని చేసిన క్షితిజ కేల్కర్ తెలిపారు. చిలీలోని సెర్రో పాచోన్ పర్వతంపై రూబిన్ అబ్జర్వేటరీ ఉంటుంది. దీని వల్ల– స్థానికంగా వాతావరణ పొరలోని వెచ్చని గాలుల్లో, పై నుంచి వచ్చే శీతల పవనాలు కలిసిపోయి, తద్వారా ఏర్పడే కల్లోల వాయువుల ప్రభావం అబ్జర్వేటరీ వరకు రాదు. దాంతో నత్రాలను స్పష్టంగా చూడొచ్చు. 800 మిలియన్ డాలర్ల ఖర్చుతో, 20 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న రూబిన్కు ప్రస్తుతం తుది తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి లోగా ఎప్పుడైనా రూబిన్ పని అధికారికంగా ఆరంభం కావచ్చు. భూమిపై అతి పెద్ద కెమెరా అయిన ఎల్.ఎస్.ఎస్.టి మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని అణువణువున పట్టి బంధించబోతోంది.4 వేల కోట్లువచ్చే 10 ఏళ్ల నిర్దిష్ట కాలానికి రూబిన్ అబ్జర్వేటరీ కనిపెట్టనున్న అంతరిక్ష విశేషాలు. ఇంత భారీగా ఖగోళ సమాచారాన్ని ఇప్పటి వరకు రాబట్టింది లేదు రూబిన్ అబ్జర్వేటరీలో ‘సిమోన్యీ సర్వే టెలిస్కోప్’ లోపలి ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా5 అ. 5 అం.: ఎల్.ఎస్.ఎస్.టి. ఎత్తు3 : ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా లోపల ఉన్న లెన్సులు;5 అడుగులు : మూడు లెన్సులలో పెద్ద లెన్సు వ్యాసం40 కెమెరా దృష్టి క్షేత్రంలో పట్టే పూర్ణ చంద్రుళ్లు 3,200 రూబిన్ కెమెరా మెగా పిక్సెల్స్ 12–50 మామూలు కెమెరాల మెగా పిక్సెల్స్ రూబిన్ అబ్జర్వేటరీ ఒక రౌండుకు 20 లక్షలకు పైగా చిత్రాలను తీస్తుంది. ప్రతి రాత్రి 20 టెరాబైట్ల సమాచారాన్ని సంగ్రహిస్తుంది. అది 50 ఏళ్ల మొత్తం డిజిటల్ మ్యూజిక్కి, ఒక లక్ష హై రిజల్యూషన ఆర్ట్ వర్క్లకు, లేదా 70 లక్షల 70 వేల ఇ–బుక్లకు సమానం. సాక్షి, స్పెషల్ డెస్క్(చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు) -
ఇంట్లో ఇవి ఉంటే.. టెన్షన్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్
వర్క్ ఫ్రమ్ హోమ్లో వచ్చే చిన్న చిన్న టెన్షన్లను కట్ చేసి, మీ ఫోకస్, కంఫర్ట్, పీస్ ఆఫ్ మైండ్ను కాపాడే గాడ్జెట్లే ఇవీ!జీరో డిస్ట్రాక్షన్!పక్కింటి వర్కర్ బోర్వెల్ డ్రిల్ చేస్తున్నా, ఇంట్లో పిల్లలు కార్టూన్ సాంగ్స్తో ఫుల్ జోష్లో ఉన్నా మీ పనిమీద ఫోకస్ తగ్గాల్సిన అవసరం లేదు. ఈ ‘నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్’ మీ చుట్టూ ఉన్న మొత్తం హంగామాను మ్యూట్ చేసి, మీకు సైలెన్స్ అనే లగ్జరీని అందిస్తాయి. కంఫర్ట్ ఫిట్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ఉండటంతో గంటల తరబడి వేసుకున్నా ఇబ్బంది లేదు. వైర్డ్ – వైర్లెస్ మోడ్ రెండింటినీ సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ల్యాప్టాప్, ఫోన్, ట్యాబ్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫీస్ కాల్స్ అయినా, డీప్ వర్క్ సెషన్స్ అయినా లేదా మ్యూజిక్లో మునిగిపోవడానికైనా ఇది బెస్ట్ సౌండ్ షీల్డ్. ధర రూ.3,000 నుంచి రూ.5,000 మధ్య లభిస్తుంది.వైర్లు క్రమంగా, మనసు ప్రశాంతంగా!వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలామందికి ఆనందమే కాని, టేబుల్ కింద గజిబిజిగా ఉన్న కేబుల్స్ మాత్రం టెన్షన్ పెంచుతాయి. పొరపాటున ఒక్కటి లాగితే, మిగతావన్నీ కట్టుకట్టుకుని ‘మమ్మల్ని విడదీయొద్దు’అన్నట్టే దాడి చేస్తాయి. ఈ గందరగోళానికి సింపుల్ పరిష్కారమే ‘కేబుల్ మేనేజ్మెంట్ కిట్’. బలమైన పీవీసీ మెటీరియల్తో తయారైన ఈ కిట్లో పెద్దవి, చిన్నవి అన్న తేడా లేకుండా ఒకేసారి ఎనిమిది కేబుల్స్ వరకు సర్దుకోవచ్చు. కిట్లోనే చుట్టే టైలు, వైర్ హోల్డర్లు ఉన్నందున అదనంగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు. గోడకు స్క్రూ పెట్టి లేదా అతికించుకుని, కొన్ని నిమిషాల్లోనే సెట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్, ఫైర్ప్రూఫ్ కావడంతో దీర్ఘకాలం టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. మార్కెట్లో ఇది సుమారు రూ.1,000 నుంచి రూ.1,500 మధ్య లభిస్తుంది.క్లీనింగ్ క్రష్! కాఫీ సిప్, హాట్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ టైప్ చేయడం సంతోషమే! కాని ఒక్కసారి అవి కీబోర్డ్ లోపలికి జారిపడితే, వర్క్ మూడ్ మొత్తం ఆఫ్ అవుతుంది. అప్పుడు గుడ్డతో తుడుస్తూ టైమ్ వేస్ట్ చేయకుండా, వెంటనే ఈ ‘మినీ వ్యాక్యూమ్ క్లీనర్’ను రంగంలోకి దింపండి. ఇది మీ డెస్క్టాప్ను క్షణాల్లో తళతళలాడే స్పాట్లైట్ లుక్తో మెరిసేలా చేస్తుంది. క్యూట్గా ఉండే ఈ పరికరం అరచేతిలో పట్టేంత చిన్న సైజులోనే ఉంటుంది. వైర్లెస్ కాబట్టి ఎక్కడైనా సులభంగా క్లీనింగ్ చేసుకోవచ్చు. కీబోర్డ్, టేబుల్, చిన్న మూలలు ఎక్కడ దుమ్ము, ధూళి ఉన్నా ఒక్క బటన్ నొక్కితే చాలు, చిటికెలో మాయం! లోపల ఉన్న కలెక్షన్ కంపార్ట్మెంట్ తీయడం, ఖాళీ చేయడం కూడా ఈజీ. ఒకసారి చార్జ్ చేస్తే గంటపాటు పనిచేస్తుంది. ధర రూ.800 నుంచి రూ.1,200 మధ్య ఉంటుంది. -
బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫ్యాషన్ ఫార్ములా ఇదే..!
ఆరోగ్యకరమైన ఆహారమే నా మెరిసే చర్మానికి కారణం. పైగా నాది డ్రై స్కిన్ కావడంతో రోజూ చర్మాన్ని నెమ్మదిగా శుభ్రం చేసి, మాయిశ్చరైజ్ చేయడం తప్పనిసరి. రాత్రి మేకప్ తీసేయకుండా అసలు నిద్రపోను. సాదాసీదా దుస్తులను కూడా ప్రత్యేకంగా మార్చడమంటే చాలా ఇష్టం అని అంటోంది పూజా హెగ్డే.మేకప్ తక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ.. అదే పూజా హెగ్డే ఫ్యాషన్ ఫార్ములా! రెడ్కార్పెట్ మీద మెరిసే గౌనులోనైనా, బీచ్లో బ్రీజీ డ్రెస్లోనైనా, లేదా జిమ్ బయట ట్రాక్పాంట్లోనైనా ఆమె లుక్ ఎప్పుడూ ‘వావ్!’ అనిపించేస్తుంది. ఇదే ఆమె మ్యాజిక్, ఎప్పుడూ ఆన్లో ఉండే గ్లో!. ఇక్కడ ధరించి పూజా డ్రెస్ బ్రాండ్: అరబెల్లా, ధర:రూ. 3,250, జ్యూలరీ: బ్రాండ్ : డ్రిప్ ప్రాజెక్ట్, నెక్ పీస్ ధర: రూ. 7,999, బ్రాస్లెట్ ధర: రూ. 3,999జ్యులరీ ఏమీ లేవా? ఆందోళన పడొద్దు. మీ డ్రాయర్లో ఎక్కడో పడేసిన మగవాళ్ల లింక్డ్–అప్ చైన్ను బయటకు తీయండి. అదే ఈరోజు మీ స్టేట్మెంట్ పీస్. ఔను, ఇది చాలాకాలంగా మగవాళ్ల జ్యూలరీగా చెప్పుకుంటోంది. కానీ ఫ్యాషన్లో జెండర్ అంటే కేవలం లేబుల్ మాత్రమే. ఒక్కసారి ఈ సిల్వర్ లింక్డ్ చైన్ మెడపై వేసుకున్న వెంటనే, మీరు బాస్–లెవల్ వైబ్కి షిఫ్ట్ అవుతారు. పైగా ఈ చన్కి డాలర్ లేకపోవడం అంటే బోరింగ్ కాదు – అదే దీని అసలైన మినిమల్ ఆటిట్యూడ్. చేతికి సిల్వర్ స్ట్రాప్ వాచ్ లేదా బ్రేస్లెట్ వేసుకుంటే, లుక్కి ఫుల్ కాంప్లిమెంట్. ఆఫ్–షోల్డర్ టాప్స్, ఓవర్సైజ్ షర్ట్స్, లెదర్ జాకెట్స్ లేదా ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ దాదాపు వెస్ట్రన్ దుస్తులన్నింటితో ఇది సూపర్గా సెట్ అవుతుంది. రూల్ మాత్రం క్లియర్. దీని పక్కన మరో నెక్లెస్ వేసుకోవద్దు. జుట్టు పోనీటెయిల్ వేసుకుంటే బాస్ లేడీ లుక్, లూజ్ వేవ్స్లో వదిలేస్తే క్యాజువల్ డే అండర్ కంట్రోల్ అనే ఫీలింగ్ ఇస్తుంది. మొత్తానికి, ఈ లింక్డ్ చైన్ సాదాసీదా చైన్ అనిపించొచ్చు, కాని, స్టయిల్ మాత్రం కాన్ఫిడెన్స్ను అమాంతం పెంచే ఆర్నమెంటల్ మేజిక్!.(చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!) -
తమిళ పాకానికి అమెరికా వణక్కం!
తల్లి చేతి వంట రుచి, ఊరి వీథుల్లోని మిఠాయిల తియ్యదనం– ఇవన్నీ ఇప్పుడు న్యూయార్క్ వేదికపై ప్రపంచానికి కమ్మగా వడ్డిస్తున్నాయి. ఫుడ్ ప్రపంచంలో ఆస్కార్గా పరిగణించే ‘జేమ్స్ బీర్డ్ అవార్డు’ను ఒక భారతీయుడు సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. మదురై వీథుల్లో తిరిగిన చిన్నోడు, ఈరోజు న్యూయార్క్ బిలియనీర్ల సరసన నిలిచాడు. కారణం ఒక్కటే, అతని చేతి వంట! మదురైలోని నాథం గ్రామంలో పుట్టిన విజయ్ ఇంజినీర్ కావాలని కలలు కన్నాడు. కాని, ఫీజులు కట్టలేక వంట స్కూల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఇది అతని జీవితానికి మలుపు అయినప్పటికీ, వంట మీద ఉన్న చిన్ననాటి ప్యాషన్ అతన్ని ముందుకు నడిపింది. ‘ప్రతి వంటకం వెనుక ఒక కథ, ఒక కళ ఉంటుంది’ అని నమ్మాడు. చెన్నైలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి, ‘తాజ్ కనెమారా హోటల్’లో మొదటిసారి షెఫ్గా మారాడు. తర్వాత అమెరికా ప్రయాణం అతని ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ‘దోసా’, ‘రాసా’లాంటి రెస్టరెంట్లలో పనిచేస్తూ వంటలో మరింత ప్రావీణ్యం సాధించాడు. కాని, ఆ మార్గం అంత సులభం కాలేదు. క్రూజ్ షిప్లలో వంట చేస్తూ సముద్రాలను దాటాడు, అమెరికాలో జాతి వివక్ష చేదును కూడా రుచి చూశాడు. అయినా, అతని మనసు ఎప్పుడూ ఒకటే చెప్పేది ‘వంట చేయి, నీలా చేయి, నిజంగా చేయి.’ అదే సమయానికే రోనీ, చింతన్ అనే ఇద్దరు ఫుడ్ రెబల్స్ అతని కథలోకి వచ్చారు. వారి ప్రోత్సాహంతో విజయ్ తెరిచిన ‘సెమ్మా’ కేవలం ఒక రెస్టరెంట్ మాత్రమే కాదు, అది తమిళ పాకకళకే ప్రపంచ వేదిక అయ్యింది. ఒకప్పుడు ‘ఫస్ట్ ర్యాంక్ తెచ్చి కుక్ అవుతావా?’ అని ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు అతని రెస్టరెంట్లో టేబుల్ బుకింగ్ కోసం ఏటా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ట్రఫుల్ ఆయిల్, కేవియర్ తినే వాళ్లు కూడా ఇక్కడ చేతులతో దోసె ముక్కలు సాంబార్లో ముంచి తింటూ ఆశ్చర్యపోతున్నారు. మొదట స్పైసీగా అనిపించినా, చివరికి ఆ రుచులే వారిని మళ్లీ మళ్లీ రప్పిస్తున్నాయి. సెమ్మా ప్రారంభమైన ఏడాదికే ‘మిషెలిన్ స్టార్’ దక్కించుకుంది. 2023లో న్యూయార్క్ టైమ్స్ ‘నంబర్ వన్ రెస్టరెంట్’గా గుర్తింపు పొందింది. ఇప్పుడు 2025లో ఫుడ్ ప్రపంచంలో ఆస్కార్గా భావించే ‘జేమ్స్ బీర్డ్’ అవార్డు కూడా విజయ్కుమార్ సొంతమైంది. స్టేజ్ మీద నిలబడి అతను అన్న మాటలు మరింత మనసును హత్తుకున్నాయి. ‘నల్ల చర్మం కలిగిన ఒక తమిళుడు ఇంత పెద్ద వేదికపై నిలబడతాడని ఎవరూ అనుకోలేదు. ఇది నా విజయం మాత్రమే కాదు, మా అమ్మ వేసే దోసెది, నా అమ్మమ్మ మట్టి పాత్రలో వండిన చేపల పులుసుదీ, మొత్తం భారతీయ వంటల రుచిదీ.’ అంటూ అవార్డును దేశ వంటల గొప్పతనానికి అంకితం చేశాడు. కుటుంబం కూడా! ఈ విజయానికి వెనుక అతని కుటుంబమే అండగా నిలబడి ఉంది. తల్లి, అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న వంటల జ్ఞానం, వారి వంటల్లోని బంధమే ఈరోజు విజయ్కుమార్ని ప్రపంచ వేదికపై నిలబెట్టింది. లగ్జరీ ఇన్గ్రీడియంట్స్ కంటే నిజమైన కరివేపాకు వాసన, కొబ్బరి రుచి, మసాలాలే నిజమైన లగ్జరీ అని వాళ్లే నేర్పారు. (చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!) -
ఇది నాకూ బిడ్డకూ ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదమా? ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరుగర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గర్భస్థ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) అంటారు. ఇది గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన వస్తుంది. ఎక్కువగా ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్య కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో ఓజీటీటీ పరీక్షను చేయాలని ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఇప్పుడు మీలో గర్భస్థ మధుమేహం నిర్ధారణ కావడంతో, కొంచెం ఆందోళన కలగడం సహజమే! దీనిని సరైన సమయంలో గుర్తించడం, నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. గర్భస్థ మధుమేహం నియంత్రణలో లేకపోతే తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు లేదా రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే శిశువు గర్భంలోనే బరువు ఎక్కువ కావచ్చు, ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత కొన్నిసార్లు బిడ్డకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయి లేదా స్వల్ప శ్వాస ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ సాధారణంగా సులభంగా చికిత్స చేయగలిగినవే. గర్భస్థ మధుమేహం నిర్ధారణ అయిన వెంటనే మీరు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామాలతో ఈ మధుమేహం నియంత్రణ కాకపోతే, డాక్టర్లు సురక్షితమైన మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సూచిస్తారు. ఇవి తల్లికీ, బిడ్డకీ పూర్తిగా హానికరం కాదు. సరైన నియంత్రణతో గర్భస్థ మధుమేహం సాధారణంగా ప్రసవం జరిగిన వెంటనే తగ్గిపోతుంది. కాని, కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా మందులు, ఆహార నియమాలు కొంతకాలం కొనసాగించాల్సి రావచ్చు. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రసవం తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫాలోఅప్ తప్పనిసరిగా చేయించుకోవాలి.నాకు గతంలో ఏడు వారాలలో గర్భస్రావం అయింది. ఇప్పుడు గర్భవతిని. ఈ గర్భధారణలోనూ ఇప్పటివరకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ నాకు విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. ఇది నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దయచేసి మార్గనిర్దేశం చేయండి.– రూప, కర్నూలుగర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశలో బిడ్డ ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అదే సమయంలో గర్భస్రావం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశలో రక్తస్రావం, కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ప్రతి రక్తస్రావం గర్భస్రావానికే సంకేతం కాదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, హార్మోన్ల మార్పులు, గర్భాశయంలో చిన్న మార్పుల వలన కూడా రక్తస్రావం రావచ్చు. ఇవి సాధారణంగా హానికరం కావు. కాని, రక్తస్రావం వచ్చిన ప్రతిసారీ డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ మీ వైద్య చరిత్ర తెలుసుకొని, శరీరపరీక్ష చేసి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఎక్కువగా ఆందోళన అవసరం ఉండదు. చికిత్సలో భాగంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమైనవి. కొన్నిసార్లు ప్రొజెస్టరాన్ మందులు ఇస్తారు. రక్తస్రావం అధికంగా ఉంటే ఆసుపత్రి పర్యవేక్షణ అవసరం కావచ్చు. గతంలో గర్భస్రావం అనుభవించారని, ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భస్రావం తర్వాత మళ్లీ అదే జరుగుతుందన్న నిబంధన లేదు. సమయానికి వైద్యుల సహాయం తీసుకుంటే చాలామంది మహిళలు సురక్షితంగా గర్భధారణను కొనసాగించి, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి వైద్యుల సూచనలు పాటించడం అత్యంత ముఖ్యం. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఒకేసారి పది ఆపరేషన్లు
ఫోన్ స్క్రీన్ పై మెరిసే ముఖం మాయలో పడిపోతున్నారు. నిలువుటద్దం చూపే నిజాన్ని మరచిపోతున్నారు.యాప్లు గుప్పించే భ్రాంతిలో మునిగిపోతున్నారు.అందచందాల కోసం శస్త్రచికిత్సలకు సిద్ధపడుతున్నారు.అత్యాశతో సినీ తారలు కూడా ఈ గేమ్లో బలైపోతున్నారు.తమ సహజ అందాన్ని అన్ ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు.ఒకవైపు ఇది ‘రిస్కీ రోడ్’ అని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.అయినా, యువత ఆరాటం ఏమాత్రం ఆగడంలేదు.చివరికి చేతులు కాలాక అసలు సంగతి గ్రహిస్తున్నారు. మెరుపు కోసం వెళితే, మిగిలేది మాయని మచ్చలేనని!యువతలో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే డిజిటల్ ఫేస్ కావాలనే కోరిక! రీల్స్లో ఫిల్టర్స్తో అందంగా కనిపించే విధంగా నిజజీవితంలోనూ ఉండాలని కోరుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ఫొటో యాప్స్లో కనిపించే గ్లాస్ స్కిన్ , షార్ప్ జాలైన్ , పర్ఫెక్ట్ లిప్స్ చూసి ‘ఇదే నా ముఖం కావాలి!’అంటూ బ్యూటీ పార్లర్స్కు పరుగులు తీస్తున్నారు. అప్పటికీ సంతృప్తి చెందక కాస్మెటిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. ఇరవై నుంచి ముపై ్ప ఏళ్ల వయసులో ఉన్న యువతే ఎక్కువగా రియల్ ఫేస్ ఫిల్టర్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లిప్ ఫిల్లర్స్, నోస్ రీషేపింగ్, లిపోసక్షన్ , బోటాక్స్ వంటి శస్త్రచికిత్సలు ఫ్యాషన్ గా మారిపోయాయి. అంతేకాదు, డిజిటల్ ఫిల్టర్స్ను నిజజీవితంలో దక్కించుకోవాలనే ఆశతో శరీర నిర్మాణం, చర్మంపై గరిష్ఠ హద్దులు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక యువతి లిపోసక్షన్ చేసినా ఇన్ స్టా వీడియోలో కనిపించిన ఫిల్టర్ లుక్ రాక నిరాశ చెందింది. మరో విద్యార్థిని పదికి పైగా లేజర్ సెషన్లు చేయించుకుని కూడా తాను నెట్లో చూసినట్టే ఫలితం రాలేదని స్కిన్ గ్రాఫ్ట్కే పట్టుబట్టింది. ఇవే ఉదాహరణలు ఈ ట్రెండ్ ఎంత దూరం వెళ్ళిందో చూపిస్తున్నాయి. ఇంతకుముందు అందం మెరుగుదల కోసం వచ్చేవారు, ఇప్పుడు పర్ఫెక్షన్ కోసం వస్తున్నారు. ఫిల్టర్ లుక్ అంటే ఎడిటింగ్, అది నిజజీవితంలో సాధ్యం కాదని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నప్పటికీ యువతలో మార్పు రాకపోగా, విపరీతంగా ఈ రియల్ ఫిల్టర్ ఫేస్ భ్రాంతి పెరుగుతోంది.అతి అనర్థం!అందంగా కనిపించాలనే ఆశతో బ్యూటీ పార్లర్ వెళ్లి తీసుకునే చికిత్సలు మొదట మెరిసే కాంతి ఇచ్చినా, తర్వాత సమస్యల వరదనూ సృష్టిస్తాయి. హెయిర్ స్ట్రెయిటెనింగ్తో జుట్టు మృదువుగా మారుతుంది. కాని, కొంతకాలానికి బలహీనమై రాలిపోతుంది. స్కిన్ పాలిష్, బ్లీచింగ్ వంటివి చర్మానికి తాత్కాలికంగా మెరుపునిస్తాయి. కాని తర్వాత మచ్చలు, ఎర్రదనమే మిగులుతాయి. ఇక తరచు మేకప్ వాడితే చర్మానికి ఊపిరాడక మొటిమలు, పొడిబారిన పెదవులు తప్పవు. ఐ లైనర్లు, మస్కారా ఎక్కువ వాడితే కళ్లకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. టాటూలు స్టయిల్గా అనిపించినా, జీవితాంతం అలానే ఉండిపోతాయి. తొలగించాలంటే నొప్పి, ఖర్చు, ప్రమాదం ఎక్కువ. ఇక ముక్కు, చెవులకు ఆభరణాలను పెట్టుకోవాలని అనవసరంగా అనేక రంధ్రాలు చేయించుకుంటే తరచుగా ఇన్ఫెక్షన్లు, గాయాలు రావడం సహజం. ఇలా తాత్కాలిక మెరుపు కోసం చేసే ఈ చర్యలు శాశ్వత నష్టాలను కలిగిస్తాయి.అందంగా ఉండాలని మామూలు మనుషులూ కోరుకుంటారు. అయితే, సెలబ్రిటీలకు అది బతుకుబండిని లాగించే ఆక్సిజన్ లాంటిది. కెమెరా ముందు ప్రతి ఏజ్లైన్ , ప్రతి ముడత, ప్రతి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రోజూ మిలియన్ల కళ్లు, కెమెరా లెన్సులు, పాపరాజ్జీ ఫ్లాష్లు వారిని గమనిస్తూనే ఉంటాయి. అందుకే వారు ‘ఎప్పటికీ యవ్వనంగా, నాజుకుగా కనిపించాలి’ అనే ఒత్తిడిలో జీవిస్తారు. ఈ నిరంతర ఒత్తిడి వారిని సాధారణ మనుషుల కంటే ఎక్కువగా రిస్కీ ప్రయోగాల వైపు నెట్టేస్తోంది. అందుకే ఎంతోమంది నటీనటులు, మోడల్స్, గాయకులు అందం కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో భారీ మూల్యం చెల్లించుకున్నారు. సాధారణ మనిషి చేసిన తప్పులను సమాజం పెద్దగా పట్టించుకోదు గాని, సెలబ్రిటీలు చేసిన తప్పులు మాత్రం ప్రపంచం ముందు బహిర్గతమవుతాయి. అలాంటివారిలో తీవ్రంగా నష్టపోయిన సెలబ్రిటీలు వీరే:లిన్ మే – చీప్ అందం ఖర్చు, మొత్తం జీవితంమెక్సికో నటి లిన్ మే తక్కువ ఖర్చుతో త్వరగా బాగుపడతానని నమ్మి ఇరవై డాలర్లకు ఇంజెక్షన్ వేసుకుంది. కాని, అది నైపుణ్యం లేని వ్యక్తి చేసిన మోసం. బేబీ ఆయిల్, కుకింగ్ ఆయిల్, నీరు కలిపి ఆమె ముఖంలోకి పంపించడంతో, ముఖం వాచిపోయి శాశ్వతంగా దెబ్బతింది. అనేక సర్జరీలు చేసినా ఆమె అందం తిరిగి రాలేదు.ప్రిసిల్లా ప్రెస్లీ – సిలికాన్ మోసంహాలీవుడ్ ఐకాన్ ప్రిసిల్లా ప్రెస్లీ ఒక నకిలీ వైద్యుడి వలలో చిక్కుకుంది. పరిశ్రమల్లో వాడే నాసిరకం సిలికాన్ ని ముఖంలో ఇంజెక్ట్ చేయడంతో, ఆమె అందం శాశ్వతంగా దెబ్బతింది. ఒకప్పుడు వెండితెరపై మెరిసిన ముఖం, ఇప్పుడు పశ్చాత్తాపానికి గుర్తుగా మిగిలిపోయింది.కోర్ట్నీ కాక్స్ – మితిమీరిన ఇంజెక్షన్ల తలనొప్పి‘ఫ్రెండ్స్’ సీరియల్తో ప్రపంచాన్ని అలరించిన కోర్ట్నీ కాక్స్ యవ్వనం నిలబెట్టుకోవాలన్న ఒత్తిడితో వరుసగా ఇంజెక్షన్లు వేసుకుంది. ఫలితంగా ముఖం సహజత్వాన్ని కోల్పోయింది. చివరికి ఆమె స్వయంగా ‘ఇదంతా నా తప్పే’ అని ఒప్పుకొని సహజ వృద్ధాప్యాన్ని అంగీకరించింది.డొనాటెల్లా వెర్సేస్ – శస్త్రచికిత్సల బలిప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ డొనాటెల్లా వెర్సేస్ పలు శస్త్రచికిత్సలు చేయించుకుంది. ఆ శస్త్రచికిత్సలు ఆమె రూపాన్ని సహజంగా మెరిపించకపోగా, విరూపం చేశాయి. ప్రజలు ఇప్పుడు ఆమె కొత్త ముఖాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు.హైడి మాంటాగ్ – ఒకేసారి పది ఆపరేషన్లుఅమెరికా రియాలిటీ స్టార్ హైడీ మాంటాగ్ ఒకేసారి పది సర్జరీలు చేయించుకుంది. ముక్కు సవరణ నుంచి ఫేస్లిఫ్ట్ వరకు అన్నీ ఒకేసారి. కాని, ఆ నిర్ణయం తన జీవితంలోనే పెద్ద పొరపాటు అని తర్వాత తానే ‘అవసరం లేని సమయంలో నా సహజ అందాన్ని నాశనం చేసుకున్నాను.’ అని ఒప్పుకుంది. కోయనా మిత్రా – విఫలమైన ముక్కు సర్జరీఒకప్పుడు స్పెషల్ సాంగ్స్తో ఫేమస్ అయిన కోయనా ముక్కు సర్జరీ చేయించుకుంది. కాని, అది విఫలమై, మరో పెద్ద ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ పొరపాటు ఆమె కెరీర్కే అడ్డుగీత వేసింది.అనుష్కా శర్మ – లిప్ ఇంజెక్షన్ల వివాదంఅనుష్కా శర్మ లిప్ ఇంజెక్షన్లు పెద్ద చర్చనీయాంశ మయ్యాయి. మొదట ఆరోగ్య సమస్య కోసం చేశానని చెప్పినా, తర్వాత అది అందం కోసం చేసుకున్నదేనని అంగీకరించింది.రాఖీ సావంత్ – విఫలమైన ప్రయోగాలురాఖీ సావంత్ ఎన్నో సర్జరీలు చేయించుకుంది. వాటిల్లో కొన్ని విఫలమయ్యాయి. ముఖ్యంగా లిప్, నోస్ జాబ్స్ ఆమె సహజ అందాన్ని పూర్తిగా మార్చేశాయి.శ్రుతి హాసన్ – ధైర్యంగా ముందుకుశ్రుతి హాసన్ ముక్కు సర్జరీ చేయించుకుంది. ఫిల్లర్లు వాడింది. ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్న వెంటనే ‘ఇది ప్లాస్టిక్ సర్జరీ షాప్’ అంటూ కామెంట్లు చేశారు. కానీ, ‘నేను ఏమి చేశానో నాకు తెలుసు. ఇంకా ఎక్కువ చికిత్సలు చేసుకున్నవారూ ఉన్నారు. గ్లామర్ ప్రపంచంలో చాలామంది నిజాలను దాచిపెడతారు’ అంటూ అనేక విమర్శలు ఎదురైనా, తన నిర్ణయాన్ని ధైర్యంగా సమర్థించుకుంది.అదితిరావు హైదరి – సహజ అందానికి దగ్గరగాఅదితిరావు హైదరి పలు ట్రీట్మెంట్లు చేయించు కున్నప్పటికీ, సహజమైన అందాన్ని కాపాడుకోవ డానికి ప్రయత్నించింది. అయినా రూపంలో వచ్చిన మార్పులను అభిమానులు గమనించి ట్రోల్ చేశారు. హీరోలు కూడా!హీరోలు కూడా అందం కోసం వెనకడుగు వేయడంలేదు. షాహిద్ కపూర్ చేయించుకున్న ముక్కు సర్జరీని అభిమానులు ఎగతాళి చేశారు. సైఫ్ అలీ ఖాన్ బోటాక్స్ ట్రీట్మెంట్లు తీసుకున్నట్టు బహిరంగంగానే చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ అతన్ని ఊపిరి తీసుకోనివ్వ లేదు. ఆమిర్ ఖాన్ వృద్ధాప్య రేఖలు తగ్గించుకోవడానికి చికిత్సలు తీసుకున్నాడని వార్తలు రావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ డెర్మల్ ఫిల్లర్లు చేయించుకున్నట్లు బయటపడగానే అతడూ ట్రోలింగ్ బారిన పడ్డాడు. సినిమా ప్రపంచం యవ్వనాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. కాని, అందం కోసం చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం కాకపోవచ్చు. కొన్నిసార్లు అందం కోసం చేసిన రిస్క్ పశ్చాత్తాపంగా మిగిలిపోతుందని ఈ కథలే నిరూపిస్తున్నాయి.అందమైన హాలీడే ప్యాకేజీ!మెరుగైన అందంతో పాటు ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే అందమైన హాలిడే ప్యాకేజీలు. అంటే హాలిడే ట్రిప్తో పాటు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవడం ఒకే ప్యాకేజీగా వస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ హాలీడే కమ్ కాస్మెటిక్ సర్జరీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో యువకులు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా టర్కీకి వెళ్లి సర్జరీ చేయించుకోవాలన్న ఆలోచన చాలామందికి బాగా నచ్చుతోంది, ఎందుకంటే అక్కడ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కాని, ఈ ప్యాకేజీల వెనుక నిజం మాత్రం వేరేలా ఉంటుంది. ఉదాహరణకు, హైదరాబాద్లోని గచ్చిబౌలికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఇస్తాంబుల్లో హెయిర్ ట్రాన్ ్సప్లాంట్ చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో బాధపడ్డాడు. ఆ శస్త్రచికిత్స పూర్తిగా విఫలమైంది. టర్కీని ఆకర్షణీయంగా చూపించే సోషల్ మీడియా పోస్టులు ఎంత మెరిసిపోతున్నాయో, వాస్తవంలో అనుభవాలు అంత దారుణంగా ఉంటున్నాయి. ఇలాంటి సమస్యలు చాలా దేశాల్లో తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో పోస్ట్ సర్జికల్ కేర్ లోపించడం వలన సమస్యలు మరింత పెరుగుతున్నాయి. పైగా అక్కడ చాలా సర్జరీలు అర్హతలేని టెక్నీషియన్ల చేతిలో జరుగుతున్నాయి. మొదట ఆకర్షణీయమైన ఫోటోలు చూపిస్తారు కాని, తర్వాత వచ్చే సమస్యల గురించి ఎవరూ చెప్పరు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి, ఎందుకంటే ఎక్కువమంది చికిత్స వివరాల కోసం కేవలం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు.ప్రయోజనాలు నష్టాలు!జీవితంలో ప్రతి నిర్ణయంలాగే, కాస్మెటిక్ సర్జరీ విషయంలో కూడా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉంటాయి. వాస్తవాన్ని గుర్తించి, నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే చికిత్స తీసుకుంటే ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి. కాని అత్యాశతో, విపరీతమైన చికిత్సలు తీసుకుంటే మాత్రం ప్రమాదాలు తప్పవు. ప్రయోజనాలు!ఆత్మవిశ్వాసం పెరుగుతుంది: మనసులో చాలాకాలం నుంచి ఉన్న చిన్న లోపం (ఉదాహరణకు చదునుగా కనిపించే ముక్కు లేదా పాత మచ్చ) పోయినప్పుడు, అద్దం ముందు నిలబడి చూసుకున్నప్పుడల్లా ఉత్సాహం రెట్టింపవుతుంది.వైద్యపరమైన సాయం లభిస్తుంది: కొందరికి ముక్కు ఆకారం వల్ల శ్వాస సమస్యలు లేదా యాక్సిడెంట్ వలన ఏర్పడిన మచ్చలు, ఎగుడుదిగుడులు ఉంటాయి. అలాంటివి సరిచేయడానికి శస్త్రచికిత్స శాస్త్రీయ పరిష్కారం అవుతుంది. అంటే అందం కోసమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.సహజమైన ఫలితాలు రావచ్చు: సరైన వైద్య నిపుణుల దగ్గర, సరైన పద్ధతిలో చేస్తే సర్జరీ ఫలితాలు దీర్ఘకాలం నిలిచే సహజమైన అందాన్ని తలపిస్తాయి. నష్టాలు!ఫిల్టర్ మాయాజాలం కాపీ కాదు: డిజిటల్ ఫిల్టర్ లుక్ను నిజ జీవితంలో కాపీ చేయడం అసాధ్యం. ఎంత సర్జరీ చేసినా ఫలితం ఊహించినట్టుగా రాకపోవడంతో నిరాశ తప్పదు.వైద్య సమస్యల రిస్క్: ప్రతి శస్త్రచికిత్సలోనూ ఇన్ఫెక్షన్లు, గాయాలు, శాశ్వత మచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖం అనేది వ్యక్తిత్వానికి ప్రతిబింబం కాబట్టి చిన్న తప్పిదం కూడా జీవితాంతం కనిపిస్తూనే ఉంటుంది.మానసిక ఆరోగ్యంపై ప్రభావం: ఫలితాలు కోరుకున్న మాదిరిగా రాకపోతే నిరాశ, ఆందోళన పెరిగి మానసిక సమస్యలు తలెత్తవచ్చు.అలవాటుగా మారే ప్రమాదం: మొదట పెదవులు, తర్వాత చీక్స్, ఆపై జాలైన్ – ఇలా ఒకదాని తర్వాత మరొకటి చేస్తూ నియంత్రణ కోల్పోతే, చివరికి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టమే మిగులుతుంది.ఎక్కువ చెల్లించేది సెలబ్రిటీలే!యువతలో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే డిజిటల్ ఫేస్ కావాలనే కోరిక! రీల్స్లో ఫిల్టర్స్తో అందంగా కనిపించే విధంగా నిజజీవితంలోనూ ఉండాలని కోరుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ఫొటో యాప్స్లో కనిపించే గ్లాస్ స్కిన్ , షార్ప్ జాలైన్ , పర్ఫెక్ట్ లిప్స్ చూసి ‘ఇదే నా ముఖం కావాలి!’అంటూ బ్యూటీ పార్లర్స్కు పరుగులు తీస్తున్నారు. అప్పటికీ సంతృప్తి చెందక కాస్మెటిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. ఇరవై నుంచి ముపై ్ప ఏళ్ల వయసులో ఉన్న యువతే ఎక్కువగా రియల్ ఫేస్ ఫిల్టర్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లిప్ ఫిల్లర్స్, నోస్ రీషేపింగ్, లిపోసక్షన్ , బోటాక్స్ వంటి శస్త్రచికిత్సలు ఫ్యాషన్ గా మారిపోయాయి.అంతేకాదు, డిజిటల్ ఫిల్టర్స్ను నిజజీవితంలో దక్కించుకోవాలనే ఆశతో శరీర నిర్మాణం, చర్మంపై గరిష్ఠ హద్దులు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక యువతి లిపోసక్షన్ చేసినా ఇన్ స్టా వీడియోలో కనిపించిన ఫిల్టర్ లుక్ రాక నిరాశ చెందింది. మరో విద్యార్థిని పదికి పైగా లేజర్ సెషన్లు చేయించుకుని కూడా తాను నెట్లో చూసినట్టే ఫలితం రాలేదని స్కిన్ గ్రాఫ్ట్కే పట్టుబట్టింది. ఇవే ఉదాహరణలు ఈ ట్రెండ్ ఎంత దూరం వెళ్ళిందో చూపిస్తున్నాయి. ఇంతకుముందు అందం మెరుగుదల కోసం వచ్చేవారు, ఇప్పుడు పర్ఫెక్షన్ కోసం వస్తున్నారు. ఫిల్టర్ లుక్ అంటే ఎడిటింగ్, అది నిజజీవితంలో సాధ్యం కాదని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నప్పటికీ యువతలో మార్పు రాకపోగా, విపరీతంగా ఈ రియల్ ఫిల్టర్ ఫేస్ భ్రాంతి పెరుగుతోంది.అతి అనర్థం!అందంగా కనిపించాలనే ఆశతో బ్యూటీ పార్లర్ వెళ్లి తీసుకునే చికిత్సలు మొదట మెరిసే కాంతి ఇచ్చినా, తర్వాత సమస్యల వరదనూ సృష్టిస్తాయి. హెయిర్ స్ట్రెయిటెనింగ్తో జుట్టు మృదువుగా మారుతుంది. కాని, కొంతకాలానికి బలహీనమై రాలిపోతుంది. స్కిన్ పాలిష్, బ్లీచింగ్ వంటివి చర్మానికి తాత్కాలికంగా మెరుపునిస్తాయి. కాని తర్వాత మచ్చలు, ఎర్రదనమే మిగులుతాయి. ఇక తరచు మేకప్ వాడితే చర్మానికి ఊపిరాడక మొటిమలు, పొడిబారిన పెదవులు తప్పవు. ఐ లైనర్లు, మస్కారా ఎక్కువ వాడితే కళ్లకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. టాటూలు స్టయిల్గా అనిపించినా, జీవితాంతం అలానే ఉండిపోతాయి. తొలగించాలంటే నొప్పి, ఖర్చు, ప్రమాదం ఎక్కువ. ఇక ముక్కు, చెవులకు ఆభరణాలను పెట్టుకోవాలని అనవసరంగా అనేక రంధ్రాలు చేయించుకుంటే తరచుగా ఇన్ఫెక్షన్లు, గాయాలు రావడం సహజం. ఇలా తాత్కాలిక మెరుపు కోసం చేసే ఈ చర్యలు శాశ్వత నష్టాలను కలిగిస్తాయి.అందంగా ఉండాలని మామూలు మనుషులూ కోరుకుంటారు. అయితే, సెలబ్రిటీలకు అది బతుకుబండిని లాగించే ఆక్సిజన్ లాంటిది. కెమెరా ముందు ప్రతి ఏజ్లైన్ , ప్రతి ముడత, ప్రతి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రోజూ మిలియన్ల కళ్లు, కెమెరా లెన్సులు, పాపరాజ్జీ ఫ్లాష్లు వారిని గమనిస్తూనే ఉంటాయి. అందుకే వారు ‘ఎప్పటికీ యవ్వనంగా, నాజుకుగా కనిపించాలి’ అనే ఒత్తిడిలో జీవిస్తారు. ఈ నిరంతర ఒత్తిడి వారిని సాధారణ మనుషుల కంటే ఎక్కువగా రిస్కీ ప్రయోగాల వైపు నెట్టేస్తోంది. అందుకే ఎంతోమంది నటీనటులు, మోడల్స్, గాయకులు అందం కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో భారీ మూల్యం చెల్లించుకున్నారు. సాధారణ మనిషి చేసిన తప్పులను సమాజం పెద్దగా పట్టించుకోదు గాని, సెలబ్రిటీలు చేసిన తప్పులు మాత్రం ప్రపంచం ముందు బహిర్గతమవుతాయి. అలాంటివారిలో తీవ్రంగా నష్టపోయిన సెలబ్రిటీలు వీరే:లిన్ మే – చీప్ అందం ఖర్చు, మొత్తం జీవితంమెక్సికో నటి లిన్ మే తక్కువ ఖర్చుతో త్వరగా బాగుపడతానని నమ్మి ఇరవై డాలర్లకు ఇంజెక్షన్ వేసుకుంది. కాని, అది నైపుణ్యం లేని వ్యక్తి చేసిన మోసం. బేబీ ఆయిల్, కుకింగ్ ఆయిల్, నీరు కలిపి ఆమె ముఖంలోకి పంపించడంతో, ముఖం వాచిపోయి శాశ్వతంగా దెబ్బతింది. అనేక సర్జరీలు చేసినా ఆమె అందం తిరిగి రాలేదు.ప్రిసిల్లా ప్రెస్లీ – సిలికాన్ మోసంహాలీవుడ్ ఐకాన్ ప్రిసిల్లా ప్రెస్లీ ఒక నకిలీ వైద్యుడి వలలో చిక్కుకుంది. పరిశ్రమల్లో వాడే నాసిరకం సిలికాన్ ని ముఖంలో ఇంజెక్ట్ చేయడంతో, ఆమె అందం శాశ్వతంగా దెబ్బతింది. ఒకప్పుడు వెండితెరపై మెరిసిన ముఖం, ఇప్పుడు పశ్చాత్తాపానికి గుర్తుగా మిగిలిపోయింది.కోర్ట్నీ కాక్స్ – మితిమీరిన ఇంజెక్షన్ల తలనొప్పి‘ఫ్రెండ్స్’ సీరియల్తో ప్రపంచాన్ని అలరించిన కోర్ట్నీ కాక్స్ యవ్వనం నిలబెట్టుకోవాలన్న ఒత్తిడితో వరుసగా ఇంజెక్షన్లు వేసుకుంది. ఫలితంగా ముఖం సహజత్వాన్ని కోల్పోయింది. చివరికి ఆమె స్వయంగా ‘ఇదంతా నా తప్పే’ అని ఒప్పుకొని సహజ వృద్ధాప్యాన్ని అంగీకరించింది.డొనాటెల్లా వెర్సేస్ – శస్త్రచికిత్సల బలిప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ డొనాటెల్లా వెర్సేస్ పలు శస్త్రచికిత్సలు చేయించుకుంది. ఆ శస్త్రచికిత్సలు ఆమె రూపాన్ని సహజంగా మెరిపించకపోగా, విరూపం చేశాయి. ప్రజలు ఇప్పుడు ఆమె కొత్త ముఖాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు.హైడి మాంటాగ్ – ఒకేసారి పది ఆపరేషన్లుఅమెరికా రియాలిటీ స్టార్ హైడీ మాంటాగ్ ఒకేసారి పది సర్జరీలు చేయించుకుంది. ముక్కు సవరణ నుంచి ఫేస్లిఫ్ట్ వరకు అన్నీ ఒకేసారి. కాని, ఆ నిర్ణయం తన జీవితంలోనే పెద్ద పొరపాటు అని తర్వాత తానే ‘అవసరం లేని సమయంలో నా సహజ అందాన్ని నాశనం చేసుకున్నాను.’ అని ఒప్పుకుంది. కోయనా మిత్రా – విఫలమైన ముక్కు సర్జరీఒకప్పుడు స్పెషల్ సాంగ్స్తో ఫేమస్ అయిన కోయనా ముక్కు సర్జరీ చేయించుకుంది. కాని, అది విఫలమై, మరో పెద్ద ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ పొరపాటు ఆమె కెరీర్కే అడ్డుగీత వేసింది.అనుష్కా శర్మ – లిప్ ఇంజెక్షన్ల వివాదంఅనుష్కా శర్మ లిప్ ఇంజెక్షన్లు పెద్ద చర్చనీయాంశ మయ్యాయి. మొదట ఆరోగ్య సమస్య కోసం చేశానని చెప్పినా, తర్వాత అది అందం కోసం చేసుకున్నదేనని అంగీకరించింది.రాఖీ సావంత్ – విఫలమైన ప్రయోగాలురాఖీ సావంత్ ఎన్నో సర్జరీలు చేయించుకుంది. వాటిల్లో కొన్ని విఫలమయ్యాయి. ముఖ్యంగా లిప్, నోస్ జాబ్స్ ఆమె సహజ అందాన్ని పూర్తిగా మార్చేశాయి.శ్రుతి హాసన్ – ధైర్యంగా ముందుకుశ్రుతి హాసన్ ముక్కు సర్జరీ చేయించుకుంది. ఫిల్లర్లు వాడింది. ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్న వెంటనే ‘ఇది ప్లాస్టిక్ సర్జరీ షాప్’ అంటూ కామెంట్లు చేశారు. కానీ, ‘నేను ఏమి చేశానో నాకు తెలుసు. ఇంకా ఎక్కువ చికిత్సలు చేసుకున్నవారూ ఉన్నారు. గ్లామర్ ప్రపంచంలో చాలామంది నిజాలను దాచిపెడతారు’ అంటూ అనేక విమర్శలు ఎదురైనా, తన నిర్ణయాన్ని ధైర్యంగా సమర్థించుకుంది.అదితిరావు హైదరి – సహజ అందానికి దగ్గరగాఅదితిరావు హైదరి పలు ట్రీట్మెంట్లు చేయించు కున్నప్పటికీ, సహజమైన అందాన్ని కాపాడుకోవ డానికి ప్రయత్నించింది. అయినా రూపంలో వచ్చిన మార్పులను అభిమానులు గమనించి ట్రోల్ చేశారు. హీరోలు కూడా!హీరోలు కూడా అందం కోసం వెనకడుగు వేయడంలేదు. షాహిద్ కపూర్ చేయించుకున్న ముక్కు సర్జరీని అభిమానులు ఎగతాళి చేశారు. సైఫ్ అలీ ఖాన్ బోటాక్స్ ట్రీట్మెంట్లు తీసుకున్నట్టు బహిరంగంగానే చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ అతన్ని ఊపిరి తీసుకోనివ్వ లేదు. ఆమిర్ ఖాన్ వృద్ధాప్య రేఖలు తగ్గించుకోవడానికి చికిత్సలు తీసుకున్నాడని వార్తలు రావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ డెర్మల్ ఫిల్లర్లు చేయించుకున్నట్లు బయటపడగానే అతడూ ట్రోలింగ్ బారిన పడ్డాడు. సినిమా ప్రపంచం యవ్వనాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. కాని, అందం కోసం చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం కాకపోవచ్చు. కొన్నిసార్లు అందం కోసం చేసిన రిస్క్ పశ్చాత్తాపంగా మిగిలిపోతుందని ఈ కథలే నిరూపిస్తున్నాయి.అందం వెనుక దాగున్న నేరాలు!బంగారు కాంతి లాంటి చర్మం కావాలని, వయసు నిలిచిపోవాలని కలలు కనే ధనవంతుల కోరికలే కొన్ని భయంకరమైన నేరాలకు కారణమవుతున్నాయి. బయటకు మెరిసే ప్రకాశవంతమైన సెలూన్లు, సౌందర్య కేంద్రాల లోపల ఎన్నో చీకటి రహస్యాలు దాగి ఉంటాయి. కొన్ని ఉత్పత్తుల వెనుక వాస్తవాలు విస్తుగొలుపుతాయి. ఉదాహరణకు, కొన్నిసార్లు ఫేస్క్రీమ్లలోని మెత్తదనానికి చిన్నారి చర్మపు ముక్కలే మూలమని, ఒక శాశ్వత యవ్వన ఇంజెక్షన్ వెనుక టీనేజ్ యువతుల దగ్గర నుంచి బలవంతంగా తీసిన అండాలను ఉపయోగిస్తారంటే ఎవ్వరూ నమ్మలేరు.కాని, ఇవన్నీ నిజమేనని రుజువు చేసే కథనాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రుల నుంచి దూరం చేసిన పిల్లలను బందీలుగా ఉంచి వారి శరీరాలను ప్రయోగశాలలాగా వాడేస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, లక్నో ప్రాంతాల్లో పిల్లల చర్మం, రక్తం అమ్మడం ఒక వ్యాపారంలా మారిందని బయటపడింది. ఇక నేపాల్లో అయితే, చిన్నారులు, టీనేజ్ యువతుల చర్మపు ముక్కలు కోసి కాస్మెటిక్ ఉత్పత్తులుగా అమ్ముతున్న దారుణ నేరాన్ని పోలీసులు బయటపెట్టారు. ఇలా తెలియకుండానే అందం వెనుక దాగి ఉన్న ఆ భయంకర నిజాన్ని బయటివాళ్లు గ్రహించలేరు. ఎందుకంటే బయట మాత్రం ‘అందం కోసం అద్భుత రహస్యం’ అంటూ మెరుస్తున్న బోర్డులు మాత్రమే కనిపిస్తాయి. లోపల మాత్రం నిస్సహాయుల ఆర్తనాదాలు వినిపిస్తాయి. అందం అంటే కేవలం బాహ్య రూపం కాదు. అది సహజత్వం, ఆరోగ్యం, ఆనందాల కలయిక. శరీరానికి నిజంగా అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిదే కాని, ఫొటో ఫిల్టర్స్లో కనిపించే కృత్రిమ అవతారాలను వెంబడిస్తే, చివరికి మిగిలేది నిరాశ మాత్రమే! -
ఈ వారం కథ: బుగ్గ మీద పుట్టుమచ్చ
‘ఏంటి ఇంకా పడుకున్నావ్? చుట్టూ ఉన్నదంతా చెత్తే, సమాజం కుళ్లిపోయింది. ఈ కంపులో ఎలా నిద్ర పడుతోంది? లే.. లే.. లే..’ నిద్రలో ఎవరో కుదిపినట్టు అనిపిస్తే చటుక్కున లేచాడు సీతారామారావు.మనిషి సన్నగా, బీడు భూమిలో మొలిచిన బలహీనమైన మొక్కలా ఉంటాడు. ఆ కట్ బనీన్ , లుంగీలో మరింత పీలగా కనిపిస్తున్నాడు. అశాంతి, అనుమానం తన దగ్గరి బంధువుల్లా ఎప్పుడు పడితే అప్పుడు అతని జీవితంలోకి వచ్చేస్తుంటాయి. ఎప్పుడూ ఏవేవో ఆలోచనలతో కుస్తీ పడుతుంటాడు. మనిషి ఇక్కడ, కళ్లు ఎక్కడో, మనసు ఇంకెక్కడో..?!రాత్రి బాగా పొద్దుపోయాక పడుకొన్నాడేమో నిద్ర సరిపోలేదు. మండుతున్న కళ్లతోనే అలారం వంక చూశాడు. ఆరైతే మోగేదే. ఇంకా పది నిమిషాలుంది. అలారం పెడతాడే తప్ప, ఎప్పుడూ దానికంటే ముందే మేల్కొంటాడు.టక్.. టక్.. టక్...గడియారంలో చిన్న ముల్లు గోల పెడుతోంది. మంచం మీద భార్య శాంత ప్రశాంతంగా పడుకొంది. ఫ్యాను గాలికి ముంగురులు అటూ ఇటూ కదులుతున్నాయి. దుప్పటి మెడ వరకు కప్పుకొని, ఆదమరచి నిద్రపోతోంది. మరొకరైతే కాసేపు భార్య మొహాన్ని చూస్తూ రొమాంటిక్ మూడ్లోకి వెళ్లిపోయేవారు. సీతారామారావుకు ఇవేం పట్టవు. తన ఉద్యోగం, ఎదురవుతున్న మనుషులు, అర్థమవుతున్న నిజాలు అతన్ని యాంత్రికంగా మార్చేశాయి. కాని, భార్యపై విపరీతమైన ప్రేమ. చుట్టూ ఇంత నెగటివిటీ మధ్య తానో పాజిటివ్ వైబ్రేషన్ .ఎందుకో తాను చేస్తున్న ఉద్యోగం గుర్తొచ్చింది. అది జాబ్ కాదు, అతని ఎమోషన్స్ని విచ్ఛిన్నం చేసిన న్యూక్లియర్ బాంబ్. ఆ వృత్తి ఎందుకు ఎంచుకున్నానా అనే బాధ తనని ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంది.సీతారామారావు సీక్రెట్ ఏజెన్సీలో పని చేస్తుంటాడు. సీక్రెట్ ఏజెన్సీ అనగానే ఏదేదో ఊహించుకోవద్దు. అందులో అంతా జేమ్స్బాండ్స్లా సూటూ కోటూ వేసుకొని, స్టైల్గా ఇన్వెస్టిగేషన్ చేసే ఉద్యోగులే ఉండరు. గప్చుప్గా వాళ్లకు సహాయం చేసే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. సీతారామారావు కూడా అంతే! తను బగ్ తయారు చేయడంలో స్పెషలిస్టు. చిన్న చిన్న మైక్రో కెమెరాలూ, స్పీకర్లూ అమర్చడం తన పని. పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీల కదలికలపై అనుమానం వచ్చినప్పుడు సీతారామారావు బగ్స్ అమర్చి వాళ్ల బండారాన్ని బయటపెడుతుంటాడు. రిస్ట్ వాచ్, ఫ్లవర్ వాజ్, చొక్కా గుండీ, రాళ్ల ఉంగరాలు, కూలింగ్ గ్లాసెస్– అన్నిట్లోనూ కెమెరాలే! వందలమంది నిజ స్వరూపాల్ని లోకానికి చూపించడంలోని అదృశ్య హస్తం సీతారామారావు. లేచి కిటికీ తలుపు మెల్లగా తీశాడు. సిగరెట్ వెలిగించి, ఆ పొగల మధ్య బయట ప్రపంచాన్ని చూశాడు. మనుషులు నవ్వుతూ పలకరించుకుంటున్నారు. ప్రేమతో మాట్లాడుకుంటున్నారు. ఆ నవ్వులు, ప్రేమలూ అన్నీ అవసరాల కోసమే! ఒక్కొక్కరికీ ఒక్కో సీక్రెట్ కెమెరా అమరిస్తే, వాళ్ల వికృత రూపాలు బయట పడతాయి. ఎందుకీ నటన? ఎవరి కోసం? సీతారామారావు మనసులో ఎప్పటి నుంచో నాటుకున్న ప్రశ్నలు ఇవి. వాటికి ఇంత వరకూ సమాధానం దొరకలేదు.టింగ్...సెల్ఫోన్ లో మెసేజ్ మోగింది.‘ఒకరి బుగ్గమీద పుట్టుమచ్చ పెట్టాలి. ఆఫీస్కు త్వరగా వచ్చేయ్’ తన పై ఆఫీసరు నుంచి సందేశం.‘బుగ్గమీద పుట్టుమచ్చ’– డిపార్ట్మెంట్ కోడ్ భాష. అంటే, ఎవరికో బగ్ పెట్టాలన్నమాట! ఈసారి ఎవరి నగ్నత్వం చూడాల్సివస్తుందో? కళ్లకు ఏవగింపు వచ్చింది. ఆఫీసరుకు ఫోన్ చేశాడు.‘హలో..’‘మెసేజ్ చూశా’‘ఇంకేం త్వరగా వచ్చేయ్. బోలెడు పని ఉంది. ఈ ఆపరేషన్ మనకు చాలా ఇంపార్టెంట్’.‘నా ప్రమోషన్ సంగతి ఏం చేశారు? ఈ ఉద్యోగం చేయలేకపోతున్నా. కనీసం నా భార్యకు కూడా నేనేం చేస్తున్నానో తెలీదు’.‘చూడు సీతా! ఈ డిపార్ట్మెంట్లో నీలాంటి సిన్సియర్ ఉద్యోగిని నేనింత వరకూ చూళ్లేదు. పైగా బగ్స్ పెట్టడం నీకు తప్ప ఇంకెవ్వరికీ చేతకాదు. గొడ్డులా కష్టపడతావ్. నీ వల్ల పెద్ద పెద్ద తిమింగలాలనే పట్టాం. నీకు కాకపోతే ఎవరికిస్తాం ప్రమోషన్ . ముందు ఆఫీసుకు బయల్దేరు. నువ్వు వచ్చేలోగా నీ ప్రమోషన్ సంగతి తేల్చేస్తా. క్విక్..’.ఫోన్ కట్ అయ్యింది.ఆరయ్యింది. అలారం మోగింది. శాంత బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ కళ్లు తెరిచింది.‘మీరెప్పుడు లేచారు?’‘ఇప్పుడే.. పది నిమిషాలైంది.’‘నన్నూ లేపొచ్చు కదా.. కాఫీ ఇచ్చేదాన్ని’‘పర్వాలేదు. నిద్ర సరిపోలేనట్టుంది. ఇంకాసేపు పడుకో!’‘లేదు.. శుక్రవారం కదా, గుడికెళ్లాలి. మీరూ వస్తారా?’‘నువ్వెళ్లు. నేను ఆఫీసుకు వెళ్లాలి. అర్జంటు పని పడింది.’‘ఆ.. ఆఫీసు.. పొద్దస్తమానూ ఆఫీసే. పెళ్లయి ఇంతకాలమైంది. ఏం ఉద్యోగం వెలగబెడుతున్నారో అర్థం కాదు. అప్పుడప్పుడూ మీరు నక్సలైటో, టెర్రరిస్టో అని అనుమానం కూడా వేస్తుంటుంది. ఆ కోడ్ భాషలూ మీరూనూ.. ఒక్క ముక్క కూడా బుర్రకెక్కి చావదు.’శాంత విసుక్కుంటోంది. ఏవేవో మాట్లాడుతోంది. సీతారామారావు మనసుకు పట్టడం లేదు. ఈసారి ఎవరికి బగ్ పెట్టాలి? ఎలా పెట్టాలి? ఇవే ఆలోచనలు. సగం కాలిన సిగరెట్ నడుం విరగ్గొట్టుకొంటూ యాష్ ట్రేలో పడింది.ఆఫీసులో అడుగు పెట్టగానే ఒకటే హడావుడి. బొకేలు, కేకులు, స్వీట్లూ, కంగ్రాచ్యులేషన్సూ, థ్యాంక్యూలూ. ఎందుకంటే... ప్రమోషన్ వచ్చింది. తనక్కాదు. తన కొలీగ్ ఉమా మహేశ్వరరావుకి.‘ఏంటి సార్ ఇది..’‘ఏమైంది’‘ప్రమోషన్ అన్నారు..’‘ఓ అదా.. ఉమ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. రికమెండేషన్ గట్టిగా ఉంది. అందుకే ఈసారికి తనకు ఇచ్చేశాం. నెక్ట్స్ టైమ్ నువ్వే లే’‘ఇలా ఎన్నిసార్లు మోసపోవాలి..’‘ఏంటి సీతా? మరీ ఇంత ఎమోషనల్ అయిపోతే ఎలా? డిపార్ట్మెంట్ అన్నాక ఇలాంటివి మామూలే. చెప్పా కదా, హై రికమెండేషన్ అని. మళ్లీ కలుద్దాం. అవతల చాలా పని వుంది. ఆ.. అన్నట్టు మర్చిపోయా. సాయంత్రం తాజ్ బంజారాలో ఉమకి పార్టీ ఇస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి’.ఆఫీసరు వెళ్లిపోయాడు. ఆ క్యాబి¯Œ లో సీత ఒంటరిగా మిగిలిపోయాడు. మామూలుగా అయితే ఆ మాటలకు సీతారామారావు గుండెలు బద్దలైపోవాలి. కోపం, ఉక్రోషం తన్నుకు రావాలి. కాని, ఈ సమాజం గురించి, మనుషుల గురించి తనకు అందరికంటే కాస్త ఎక్కువ తెలుసు. అందుకే ఎలాంటి ఫీలింగ్ లేదు. అగ్గిపుల్ల భగ్గుమంది. సిగరెట్ తన ఒళ్లు కాల్చుకుంటూ పొగలు కక్కింది.∙∙ తాజ్ బంజారా– కొలీగ్స్ అందరి చేతుల్లోనూ గ్లాసులు ఘల్లుమంటున్నాయి. వాటికి పోటీ పడుతూ ఉమా మహేశ్వరరావు మొహం వెలిగిపోతోంది. ఎవరో బాస్కు మైక్ ఇచ్చారు.‘హలో.. హలో... అటెన్షన్ ఎవ్రీబడీ..’అందరి కళ్లూ అటు వైపు తిరిగాయి.‘మనందరి తరపున ఉమకు కంగ్రాచ్యులేషన్స్. తన హార్డ్ వర్క్కి, డెడికేషన్ కి దక్కిన గుర్తింపు ఇది. అసలు ఉమానే లేకపోతే మనం ఇన్ని కేసులు సాల్వ్ చేసేవాళ్లం కాదు. బ్ల... బ్ల... బ్ల...’అందరూ చప్పట్లు కొడుతున్నారు. మైకు చేతులు మారుతోంది. కాని, మాటలే మారడం లేదు.‘ఉమా మహేశ్వరరావు అంత వర్క్హాలిక్ను నేను ఎక్కడా చూళ్లేదు’ ఎవరో పొగుడుతున్నారు.‘ఉమకు ఈ ప్రమోషన్ చాలా తక్కువ. రాష్ట్రపతి అవార్డు ఇచ్చినా తప్పులేదు’ తాగిన మైకంలో ఒకరి పిచ్చి వాగుడు.అటు తిరిగి, ఇటు తిరిగి మైకు సీత చేతికి వచ్చింది. సీత ఏం మాట్లాడతాడో అని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. సీత మైకు తీసుకొన్నాడు.‘నేను పెద్దగా మాట్లాడనని మీకు తెలుసు. అందుకే నా భావాల్ని విజువల్స్ రూపంలో తీసుకొచ్చా’.మళ్లీ చప్పట్లు.‘ఈ ఆలోచన నాకెందుకు రాలేదబ్బా’ బాస్ ఫీలయ్యాడు. కళ్లన్నీ తెరపైకి మళ్లాయి. ఏవీ ప్లే అయ్యింది.ఉమా మహేశ్వరరావు వస్తాడనుకుంటే స్క్రీన్ పైకి బాస్ వచ్చాడు.‘ఈ ఉమగాడు ఉన్నాడు చూశారా? వీడికి పని చేయడం చేతకాదు. ఎప్పుడు చూడూ ఆ టైపిస్టు ముందు కూర్చుని కుళ్లు జోకులు వేస్తుంటాడు..’ఉమ గురించి బాస్ ఎవరితోనో మాట్లాడుతుంటే సీత క్యాప్చర్ చేసిన వీడియో అది. బాస్ సీత వైపు గుర్రుగా చూస్తున్నాడు. ఉమ మొహం మాడిపోయింది. కొలీగ్స్ అంతా ఘొల్లున నవ్వారు.‘నాకే బగ్ పెడతావా రాస్కెల్. నీ అంతు చూస్తా’ బాసు చేతిలోని గ్లాసు భళ్లుమంది. వెంటనే మరో విజువల్.‘రికమెండేషన్ తో ప్రమోషన్ తెచ్చుకోవడం కూడా గొప్పే! ఈ ప్రమోషన్ కోసం ఉమ ఎవడెవడి కాళ్లు పట్టుకొన్నాడో, ఎవడెవడి ... (అక్కడో బూతు మాట) నాకు తెలీదా’ ఇందాక రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని మైకులో గొంతుచించుకొన్న అతగాడి నిజ ‘స్వరం’.‘ఏంట్రా.. పిచ్చి పిచ్చిగా ఉందా? మా మాటలన్నీ దొంగచాటుగా రికార్డ్ చేస్తావా? నీ అంతు చూస్తా’ ఊగుతూనే సీతపైకి వచ్చేశాడు.తరవాత ఎవరి బండారం బయట పడుతుందో అని మిగిలిన వాళ్లంతా ఆత్రంగా తెరని మింగేసేలా చూస్తున్నారు.‘ఉమ పైకి పోజులు కొడతాడు కానీ, తేడాగాడండీ’,‘బంజారాహిల్స్లో వీడికి సెకండ్ సెటప్ ఉంది తెల్సా’,‘అసలు వీడు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడని నా డౌటు’ఒకొక్కరి మెదడులోంచి ఉమ బట్టలిప్పుకొని బయటకు వస్తున్నాడు. అందరూ తెల్లమొహాలు వేసేశారు. ఉమ తాజ్ బంజారా వదిలేసి చాలా సేపయ్యింది.‘సీతా.. ఆఫీసు పరువు మొత్తం గంగపాలు చేశావ్.. ఏంటిదంతా’ ఎవరో అరుస్తున్నారు.‘ఆపరేషన్ బుగ్గ మీద పుట్టుమచ్చ’ ఎగతాళిగా నవ్వాడు సీతా రామారావు.ఆ కోపంలో ఎవరో సీత చంప ఛెళ్లుమనిపించారు. బాస్ ఓ పిడిగుద్దు విసిరాడు. ఆ మందంతా మూకుమ్మడిగా సీతారామారావు మీద పడిపోయింది. తొక్కిసలాటలో సీత చొక్కా చిరిగింది. కళ్లజోడు కిందపడి ఒంటికాలిదయ్యింది. పెదవి చిట్లి రక్తం కారుతోంది. పడుతూ, లేస్తూ, ఒగరుస్తూ మళ్లీ మైకు అందుకొన్నాడు.‘ఇవీ ఫ్రెండ్స్ మనందరి అసలు స్వరూపాలు. ఎవరూ ఎవరితోనూ నీతిగా నిజాయితీగా ఉండడం లేదు. అలాంటి మనమంతా కలిసి మరొకరి కుళ్లుని తోడుతున్నాం.. షేమ్ షేమ్..’ సీత మాటలకు అందరి మైకం వదిలిపోతోంది.‘ఒరేయ్.. పిచ్చోడా లోకం అంతా ఇలానే ఉందిరా’‘అంటే మేమంతా వెధవలం. నువ్వు పత్తిత్తువా?’‘నీ పెళ్లానికి పెట్టకపోయావా కెమెరా.. ఎవరెవరితో తిరుగుతుందో తెలిసేది’ ఎవడో కారు కూత కూశాడు. మొదటిసారి సీతారామారావుకి నిజమైన కోపం వచ్చింది.‘ఏం కూశావ్ రా..’ సీత చేయి పైకెత్తాడు. కాని, అప్పటికే నలుగురు కలిసి సీతని వెనక్కి లాగేశారు. కింద పడేసి, కాళ్లతో తన్నుతున్నారు. జరుగుతున్న తతంగం గమనించి హోటల్ మేనేజ్మెంట్ అలర్ట్ అయ్యింది. సెక్యురిటీ గార్డులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. సీతని ఎవరో లేపి కూర్చోబెట్టారు. ఒకొక్కరుగా ఆ హాలు ఖాళీ చేస్తున్నారంతా. చివరికి సీత ఒక్కడే మిగిలాడు.‘కాస్త మంచి నీళ్లు తాగండి సార్..’ హోటల్ మేనేజర్ వాటర్ బాటిల్ అందించారు.‘ఓ పెగ్ కావాలి.. ఇస్తారా’పెగ్ ఏం ఖర్మ బాటిల్ ఖాళీ అయ్యింది.‘నీ పెళ్లానికి పెట్టకపోయావా బగ్.. ఎవడెవడితో తిరుగుతుందో తెలిసేది’ఈ మాటలే గిర్రున తన చుట్టూ తిరుగుతున్నాయి.‘నా శాంత తప్పు చేస్తుందా.. ఇంపాజిబుల్’ ఖాళీ బాటిల్ నేలనేసి కొట్టాడు సీత.‘నా శాంత తప్పు చేస్తుందా.. ఇంపాజిబుల్’ సీత తన డైరీలో ఆ రోజు రాసుకున్న చివరి వాక్యం. డైరీ తనకు ఓ స్వాంతన.ఈ ప్రపంచంలో తన భార్య తరవాత తనకు అంత నిజాయితీగా కనిపించేది ఆ డైరీనే.శాంత వంక చూశాడు. ఎప్పటిలానే చాలా ప్రశాంత వదనంతో తనని చూస్తోంది. ఆ రోజు చాలాసార్లు దగ్గరకు వచ్చి లాలించింది.‘ఏంటండీ.. ఎప్పుడూ లేనంత డల్గా కనిపిస్తున్నారు. ఆఫీసులో ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా..’‘కాఫీ పెట్టనా స్ట్రాంగ్గా’‘మీకు ఇష్టమైన చిక్కుడుకాయ కూర చేయనా’టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ కేరింగ్, ఆ ప్రేమ... సీతని ఇంకా ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.‘మనం జీవితంలో ఇంకా స్థిరపడలేదు, అప్పటి వరకూ పిల్లలొద్దు’ అంటే ఆగిపోయింది.‘నేను చేస్తున్న ఉద్యోగం ఏమిటన్నది నేను చెప్పేంత వరకూ అడక్కు’ అంటే ఆ మాటకు కట్టుబడిపోయింది.తనకు షాపింగులు లేవు. సినిమాలు షికార్లు లేవు. ఓ సగటు భార్య హక్కులన్నీ ఉద్యోగం పేరుతో సీత ఏనాడో కాలరాసేశాడు. అయినా భరించింది. అలాంటి శాంత తప్పు చేయడం ఏమిటి? నెవ్వర్.కాని పార్టీలో జరిగినదంతా కళ్ల ముందు కదులుతోంది. కొలీగ్స్ అన్న మాటలే తనని బాగా డిస్ట్రబ్ చేస్తున్నాయి.‘ప్రతీ నవ్వులోనూ, ప్రేమలోనూ కల్మషమే అని నమ్మావుగా. ఇప్పుడు నీ భార్యలో నీకు నిజాయతీ మాత్రమే కనిపిస్తోందా? తనని వెంటాడితే, తన తప్పులన్నీ తెలిసిపోతే, నీ నమ్మకం వమ్ము అయిపోతుందని భయమా. ఇప్పుడు పెట్టి చూడు నీ భార్య బుగ్గపై పుట్టుమచ్చ’ అంతరాత్మ వికృతంగా నవ్వుతోంది.ఇప్పుడు సీత ముందున్న మార్గాలు రెండే. ఒకటి అంతరాత్మని ఎదిరించి భార్యని గుడ్డిగా నమ్మడం. లేదంటే... శల్య పరీక్ష చేసి, తన భార్య గుణవంతురాలే అని అంతరాత్మకు రుజువు చేయడం. ఎందుకో రెండో మార్గమే బెటర్ అనిపించింది. ఆపరేషన్ మొదలైంది.‘ఆఫీసు పనిమీద అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నా. మూడ్రోజుల వరకూ రాను. ఈలోగా ఫోన్లు కూడా ఉండవు. సరేనా..’శాంతని అబద్ధాలతో బుజ్జగించి అదే ఊర్లోని ఓ థర్డ్ క్లాస్ లాడ్జిలో దిగబడ్డాడు సీత.అప్పటికే ఇంట్లో చాలా చిన్న చిన్న సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. హాల్లో, బెడ్ రూమ్లో, మేడ మీద, వంటింట్లో, ఆఖరికి బాత్రూమ్లో కూడా. ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ మినిట్ టూ మినిట్ ఆ లాడ్జ్లో కూర్చుని లాప్టాప్ ద్వారా గమనిస్తూనే ఉన్నాడు.వంటింటికీ, పూజగదికీ సగం రోజు కేటాయిస్తోంది శాంత. టీవీ చూడడం, పడుకోవడం.. ఇదే దినచర్య.మొదటిరోజు చాలా భారంగా గడిచింది. రెండోరోజు తనపై తనకే కోపం వచ్చింది.‘ఇక చాల్లే వెళ్లిపోదాం’ అంటూ మనసు ఆరాట పడుతోంటే, ‘ఇంకెంత? ఒక్క రోజు ఆగొచ్చు కదా’ అంటూ అంతరాత్మ అడ్డుపడుతోంది.మూడోరోజు క్షణాలు యుగాల్లా దొర్లుతున్నాయి. తెల్లారితే ఇంటికి వెళ్లిపోవాలి. శాంతకు ‘సారీ’ చెప్పాలి. చెప్తాడు సరే, ‘ఎందుకు?’ అని అడిగితే, తన దగ్గర సమాధానం ఉంటుందా? కనీసం దగ్గరకు తీసుకొని గుండెకు హత్తుకోవాలి. కనీసం అలాగైనా తన గిల్టీ ఫీలింగ్ కాస్త తగ్గుతుంది. చాలారోజుల తరవాత ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు.ఆ రోజు మామూలుగా తెల్లారింది. పక్క మీద నుంచి హుషారుగా లేచాడు సీత. రెండంటే రెండు నిమిషాల్లో రెడీ అయిపోయాడు. ఇంటికి వెళ్లిపోవాలన్న ఆత్రంతో హడావుడిగా బట్టలు సర్దుకొన్నాడు. లాప్టాప్ క్లోజ్ చేసి, బ్యాగ్లో వేసుకుంటున్నప్పుడు, అంతరాత్మ ‘ఆగు...’ అంటూ బ్రేకేసింది.‘నీ ఉద్యోగ ధర్మం నువ్వు సక్రమంగానే నిర్వర్తించావా..’ అంటూ ప్రశ్నించింది.‘తప్పు జరగడానికి, దొంగ దొరకడానికి ఒక్క క్షణం చాలు.. నువ్వేమో రాత్రంతా ఆదమరచి పడుకున్నావు’ అంటూ ఇన్వెస్టిగేషన్ క్లాసుల్లో తాను నేర్చుకొన్న పాఠాలు తనని మళ్లీ అలర్ట్ చేశాయి.ఇష్టం లేకుండానే లాప్టాప్ తెరిచాడు. రాత్రి ఫుటేజీ ఒక్కసారి రివైండ్ చేశాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి.‘ఏ ఘోరం చూడకుండా కాపాడు దేవుడా’ ఎప్పుడూ నమ్మని దేవుడ్ని తొలిసారి మనసులోనే దండం పెట్టుకున్నాడు. కాని, దేవుడు మొర ఆలకించలేదు. రివెంజ్ తీర్చుకున్నాడు.తానెప్పటికీ చూడలేననుకున్న దృశ్యం ఒకటి కళ్ల ముందు ఆవిష్కృతమైంది.‘నీ భార్య ఎవడితో రంకు వెలగబెడుతుందో నీకు తెలుసా’ అనే ప్రశ్నకు దొరికిన సమాధానం అది.‘నీ పెళ్లానికి పెట్టకపోయావా కెమెరా’ అనే సవాలుకు పర్యావసానం అది.అవకాశం లేక కొంతమంది మంచివాళ్లుగా మిగిలిపోతారు అని తాను నమ్మిన సిద్ధాంతానికి మరో నిలువెత్తు సాక్ష్యం అది.‘శాంతా...’ఒక్కసారిగా అరిచాడు.సీత మనసు ఆకలిగా ఉన్న నాలుగు కుక్కలకు వీధిలో దొరికిన ఒంటరి విస్తరాకైంది.‘శాంతని చంపాలి’ ఇదే సీతారామారావు మిషన్ .తన పరిచయాల్ని వాడుకొని ఓ పిస్తోల్ తీసుకొన్నాడు. శాంత మరణానికి ముహూర్తం నిర్ణయించాడు. మరో రెండు రోజుల్లో శాంత పుట్టినరోజు. ఆ రోజే చంపేయాలి. ప్రతిరోజూ రాత్రి సరిగ్గా 12 గంటలకు పవర్ ఒక్కసారి ఆఫ్ అయి, ఆన్ అవ్వడం ఆ వీధిలో చాలా సాధారణంగా జరిగే విషయం. సరిగ్గా అప్పుడే శాంత నుదుటిమీద పాయింట్ బ్లాంక్లో పిస్తోల్ పేలాలి. అంతే. తన మనసులో శాంతపై పేరుకుపోయిన కోపం అంతా చల్లారిపోతుంది. తరవాత తాను ఏమైపోయినా పర్వాలేదు. అన్యమస్కంగానే ఇంటికి వెళ్లాడు.‘మూడ్రోజుల్లో ఇంత చిక్కిపోయారేంటండీ’‘ఈసారి మీరెక్కడికి వెళ్లినా నన్నూ తీసుకెళ్లండి. ఒంటరిగా ఉండడం నా వల్ల కాదు బాబోయ్’ శాంత నటన మొదలైంది.‘రేపే నా పుట్టిన రోజు.. ఏం గిఫ్ట్ ఇస్తున్నారు’ అంటూ పదే పదే అడుగుతుంటే,‘నీ చావు..’ అని గట్టిగా చెప్పాలనిపిస్తోంది. కాని, దాన్ని పెదవి అంచులపై అదిమి పెట్టుకొంటున్నాడు.టేబుల్ సొరుగులో ఉన్న పిస్తోల్ పదే పదే ‘నన్ను వాడేయ్.. వాడేయ్’ అంటూ గోల చేస్తోంది.సీత మనిషి మనిషిలా లేడు. ఏవో ఆలోచనలు వేధిస్తున్నాయి. ఎప్పుడూ డైరీలో ఏవో రాసుకొంటూ, గాల్లోకి పిచ్చి చూపులు విసిరేస్తున్నాడు.రాత్రయ్యింది. శాంత తలనొప్పంటూ పెందలాడే పడుకుంది. అలవాటు ప్రకారం కాసేపు డైరీ రాసుకొని, తానూ పక్కమీద వాలాడు. సమయం గడుస్తోంది.10 అయ్యింది.గడియారం 11వ గంట కొట్టింది.11.30 అయ్యింది.సరిగ్గా 12 గంటలకు కరెంట్ పోయింది. ప్లాన్ ప్రకారం ఆ గదిలో పిస్తోల్ శబ్దం వినించింది. ఓ చావుకేక గాల్లో కలిసిపోయింది. కరెంట్ వచ్చింది.కాని, చచ్చింది శాంత కాదు– సీత.చంపింది సీత కాదు– శాంత.గోడ మీద రక్తపు మరక. దుప్పటంతా ఎరుపు రంగు పులుముకుంది. పక్క మీద భర్త శవం. గదంతా నిశ్శబ్దం. శాంత కుర్చీలో కూర్చుని నిర్జీవంగా పడున్న భర్త వంక కళ్లార్పకుండా చూస్తోంది. చేతిలో పిస్తోల్ అలానే ఉంది.‘ఇందులో నా తప్పేముంది? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ . నేను బతకాలంటే మీరు చావాలి. నా దగ్గర ఇంకో మార్గం లేదు’ కళ్లతోనే భర్తతో మాట్లాడుతోంది.టక్.. టక్.. టక్ గడియారం చప్పుడు.శాంత తల తిప్పింది. డైరీ కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకొంది.‘మీ గురించి నాతో ఒక్కసారైనా చెప్పారా? ఈ డైరీ చెప్పింది. ఇతరుల డైరీ చదవడం తప్పే. కాని, మీరు నా ఇతరుల జాబితాలో లేరు’ నవ్వూ, ఏడుపూ కలగలిపిన భావోద్వేగం శాంతలో.‘ఈ పేజీలూ అక్షరాలూ నాతో మాట్లాడాయి. చస్తావా చంపుతావా అని బెదిరించాయి. ఏం చేయమంటారు’ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉంది.సడన్ గా శాంత కళ్లు డైరీలోని ఆఖరి పేజీ దగ్గర ఆగాయి. అంతకు ముందే తన భర్త రాసిన వాక్యాలు పలకరిస్తున్నాయి. ఈ డైరీలో శాంత చదవని పేజీ అదొక్కటే. శాంత కళ్లు ఆ అక్షరాల వెంట పరుగులు పెట్టాయి.‘సీక్రెట్ కెమెరా పెడితే భగవంతుడు కూడా తప్పు చేస్తూ దొరికి పోతాడని ఓ రోజు నా మిత్రుడు చెప్పాడు. అది నిజమే అని ఈరోజు అనిపిస్తోంది. నా కొలీగ్స్కి బగ్ పెట్టాను. వాళ్ల నిజ స్వరూపం వెలుగులోకి వచ్చింది. నా భార్యని రహస్యంగా వాచ్ చేశా. తన బలహీనత బయటపడింది. మరి నేనేం చేశాను? నేను శీలవంతుడ్నా? అందమైన అమ్మాయి కనిపిస్తే నా మనసు ఎన్ని వికృత చేష్టలు చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. ఆ మానసిక వ్యభిచారం బయట పెట్టే కెమెరా ఎక్కడుంది? నేనేంటో తెలుసుకోవడానికి నాకు ప్రత్యేకంగా బగ్ అవసరం లేదే? అద్దం ముందు నిలబడితే నా అంతరాత్మ నన్ను కడిగేస్తుంది. నా తప్పుల తక్కెడ వేస్తుంది. నా నిజాయితీ, ఆత్మసాక్షి దాని ముందు తూగగలవా? ఈ ప్రపంచంలో అందరూ గురువింద గింజలే. తప్పు చేయని వాడికే ఎదుటి వాళ్ల తప్పుల్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. నా భార్యని నేనెందుకు చంపాలి? ఆ హక్కు నాకు లేదు. వీలైతే మరింత ప్రేమిస్తా. రేపే ఉద్యోగానికి రాజీనామా చేస్తా. అదే నాకు నేను ఇచ్చుకొనే క్షమాభిక్ష..’తరువాత కూడా ఏదో రాసి ఉంది. అప్పటికే శాంత కళ్లని కన్నీటి పొరలు కమ్మేశాయి. ఇంకో అక్షరం చదివే ధైర్యం, ఇంకో నిమిషం బతికే అర్హత తనకు లేవనిపించాయి. భర్త వంక ఈసారి ప్రేమతో చూసింది. కళ్లతోనే క్షమాపణ అడిగింది. పిస్తోల్ నుదుటి మీద పెట్టుకొంది. అది ఆమె చివరి వీడ్కోలు.ఆ గదిలో మరో బుల్లెట్ పేలిన శబ్దం. -
క్రెడిట్ లాగితే కాల్ దొరికింది
తీగ లాగితే డొంక కదిలినట్లు క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్ గురించి ఆరా తీస్తే, అంతర్జాతీయ కాల్ డైవర్షన్ వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు 2009లో ఈ అనుభవం ఎదురైంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అసాంఘిక శక్తులకు సహకరిస్తున్న ఈ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.సాధారణంగా విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్పై భద్రతా సంస్థల నిఘా ఉంటుంది. అనుమానాస్పద కాల్స్ వచ్చే నంబర్లను అవసరమైతే టాప్ చేస్తుంటారు కూడా! అంతర్జాతీయ కాల్స్పై నిఘా కోసం వాడే ఉపకరణాలు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్వే లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్డీ) ఆపరేటర్ల వద్ద ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే కాల్స్ అక్కడి ఎక్స్చేంజ్ లేదా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్కు చేరుతాయి. అక్కడి నుంచి ఐఎల్డీ ఆపరేటర్కు వచ్చి, ఆపై ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇవి ఢిల్లీ, ముంబై, చెన్నై కోల్కతాలలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్వే ఆఫ్ ఐఎల్డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్స్చేంజీల ద్వారా ఇక్కడ రిసీవ్ చేసుకునే ఫోన్కు వస్తుంది.సర్వీస్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్వే ఆఫ్ ఐఎల్డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు నిర్ణీత మొత్తాలు చెల్లిస్తారు. ్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకునే ఈ సంస్థలు తమ ఆదాయం నుంచి నిర్దేశిత మొత్తాన్ని పన్నుగా చెల్లిస్తాయి. విదేశీ ఆపరేటర్లు ఇక్కడి వారికి డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా కొన్నేళ్ల కిందట కాల్ డైవర్షన్ పద్ధతిని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంతమందికి సోషల్ మీడియా ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తుంటారు. ఇలా ఈ బాక్సులు ఏర్పాటైన తర్వాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్వే ఆపరేటర్కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మార్చేస్తారు. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారి వద్ద ఏర్పాటు చేయించిన బాక్సులకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే Vó ట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్డబ్ల్యూటీగా పిలిచే పరికరాలకు చేరుతుంది. స్థానికంగా తీసుకున్న సిమ్కార్డులను ఈ సీడీఎమ్ఏ ఎఫ్డబ్ల్యూటీల్లో నిక్షిప్తం చేస్తారు. విదేశీ గేట్వే నుంచి డేటా రూపంలో వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్గా మారిపోయి, అందులో నిక్షిప్తం చేసిన సిమ్కార్డు నంబరు నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వ్యక్తికి చేరుతుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి కాల్ చార్జీలు తగ్గుతాయి. వాట్సాప్ నిషేధం ఉన్న దేశాల నుంచి ఈ కాల్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఫలితంగా దేశంలోని ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటాయి. దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్స్ ఆ మొత్తాన్ని మిగుల్చుకుని, ఇక్కడ పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులకు హవాలా రూపంలో కమీషన్ పంపిస్తుంటారు.విదేశాల్లో ఉంటున్న ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్తో ఈ–మెయిల్ ద్వారా పరిచయం పెంచుకున్న హైదరాబాదీలు వి.రమేష్, మహ్మద్ అబ్దుల్ ఖదీర్, ఆర్డీ శ్రీనివాస్, నజీబ్ అహ్మద్ ఖాన్ కాల్ డైవర్షన్కు సహకరించడానికి అంగీకరించారు. వీరు హైదరాబాద్లోని రెండు ప్రాంతాల్లో గేట్వేలతో కూడిన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వినియోగించే సిమ్కార్డులను మారుపేర్లతో సంగ్రహించారు. వాటి బిల్లులు చెల్లించడానికి క్లోనింగ్ చేసిన క్రెడిట్ కార్డులను వినియోగించారు. ఇలాంటి కాల్ డైవర్షన్స్ను ఎక్కువగా వాట్సాప్ నిషేధంగా ఉన్న దేశాల్లో ఉంటున్న వారితో పాటు ఉగ్రవాదులు, మాఫియా కార్యకలాపాలు సాగించేవారు వాడుతున్నారు. ఈ విధానంలో ఫోన్ ఎక్కడ నుంచి వస్తోందనేది తెలుసుకోవడం స్థానికంగా డైవర్షన్ పరికరాలు ఏర్పాటు చేసిన వారికీ సాధ్యం కాదు. ఈ ముఠా టాస్క్ఫోర్స్ పోలీసులకు చిత్రంగా చిక్కింది. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు 2009 జనవరి 29న సికింద్రాబాద్ ప్రాంతంలో తిరుగుతున్నారని, క్లోనింగ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని ఓ కానిస్టేబుల్కు సమాచారం అందింది. ఆయన ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వి.రమేష్, మహ్మద్ ఖుద్దూస్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమకు క్లోనింగ్ క్రెడిట్ కార్డులను ముంబైకి చెందిన ముగ్గురు వ్యక్తులు అందిస్తున్నారంటూ బయటపెట్టారు. వీటితో షాపింగ్స్ చేస్తున్నామని చెప్పారు. వీరిని అరెస్టు చేయడానికి సిద్ధపడ్డ పోలీసులు, వీరి వస్తువులను సోదా చేశారు. రమేష్ దగ్గర లభించిన ఓ పుస్తకంలో సీడీఎమ్ఏ ఫోన్కు చెందిన ‘9298’ సిరీస్తో సీరియల్గా 20కి పైగా నంబర్లు కనిపించాయి. వీటిని చూసి అనుమానించిన పోలీసులు కాస్త లోతుగా విచారించారు. ఫలితంగా పంజగుట్టలోని సఫైర్ అపార్ట్మెంట్స్, మాసబ్ట్యాంక్లోని మహేశ్వరి కాంప్లెక్స్ల్లో అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేసి, అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ను లోకల్స్గా మారుస్తూ జరుగుతున్న కాల్ డైవర్షన్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతాల్లో దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితులను పట్టుకుని, కాల్ డైవర్షన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.· -
విభీషణుడికి వినాయకుడి పరీక్ష
రామ రావణ యుద్ధంలో చివరకు రావణుడు హతమయ్యాడు. రావణుడి అంత్యక్రియల తర్వాత రాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ తర్వాత యుద్ధంలో తనకు సాయం చేసిన సుగ్రీవ ఆంజనేయ, అంగదాది వానర ప్రముఖులను, విభీషణుడిని వెంటబెట్టుకుని సీతా లక్ష్మణ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు.అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.పట్టాభిషేకం పూర్తయిన తర్వాత కొన్నాళ్లు రాముడి ఆతిథ్యం స్వీకరించిన వారంతా తమ తమ నెలవులకు తిరిగి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో తనకు సహకరించిన వానర ప్రముఖులందరికీ రాముడు స్వర్ణాభరణాలు సహా అనేక విలువైన కానుకలను ఇచ్చి సాగనంపాడు.రావణుడికి సోదరుడై ఉన్నప్పటికీ, యుద్ధంలో తన పక్షాన నిలిచిన విభీషణుడికి సాగనంపేటప్పుడు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్నాడు. అందుకని తమ ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు.విభీషణుడికి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని అందిస్తూ, ‘విభీషణా! ఇది మా ఇలవేల్పు శ్రీరంగనాథుడి విగ్రహం. నీ రాజ్యానికి శ్రీరంగనాథుడి అనుగ్రహం ఉండాలని దీనిని నీకు ఇస్తున్నాను. నీ ప్రయాణంలో ఈ విగ్రహాన్ని ఎక్కడా నేల మీద విడిచిపెట్టకు. అలా విడిచిపెడితే, ఈ విగ్రహం అక్కడికక్కడే పాతుకుపోతుంది. దీనిని తిరిగి తరలించడం అసాధ్యం’ అని చెప్పాడు.‘సరే’నని చెప్పి, రాముడి వద్ద వీడ్కోలు తీసుకుని, విభీషణుడు లంకకు తిరుగు ప్రయాణమయ్యాడు. దక్షిణ దిశగా లంక వైపు సాగించిన ప్రయాణంలో కావేరీ తీరానికి చేరుకున్నాడు.దారిలో ఎదురైన పవిత్ర కావేరీ నదిలో స్నానం చేయాలని తలచాడు విభీషణుడు. అయితే, విగ్రహాన్ని నేలపై ఉంచరాదని రాముడు చెప్పిన మాట అతడికి గుర్తుకు వచ్చింది. స్నానం చేసి వచ్చేంత వరకు ఎవరైనా విగ్రహాన్ని పట్టుకునేవారు దొరుకుతారేమోనని వెదకసాగాడు.విభీషణుడు అలా కావేరీ తీరం వెంబడి వెదుకుతూ నడుస్తుండగా, కొంత దూరంలో ఒక బాల బ్రహ్మచారి కనిపించాడు.విభీషణుడు ఆ బాల బ్రహ్మచారిని పిలిచాడు.అతడు విభీషణుడి దగ్గరకు వచ్చి నిలిచాడు.‘బాలకా! నేను ఈ పవిత్ర కావేరీ జలాలలో స్నానం చేసి, సంధ్య వార్చుకోవాలనుకుంటున్నాను. నా చేతనున్న ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదని నియమం ఉంది. అందువల్ల నేను స్నానం చేసి తిరిగి వచ్చేంత వరకు దీనిని పట్టుకోగలవా?’ అభ్యర్థనగా అడిగాడు విభీషణుడు.‘విగ్రహాన్ని పట్టుకుంటాను గాని, ఒక షరతు’ అన్నాడా బాల బ్రహ్మచారి దర్పంగా విభీషణుడికేసి చూస్తూ.‘ఏమిటా షరతు’ అడిగాడు విభీషణుడు.‘నాకు బోలెడు పనులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ సేపు ఉండలేను. నువ్వు త్వరగా స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని వచ్చేయాలి. నాకు కాలాతీతమైతే నిన్ను మూడుసార్లు పిలుస్తాను. నేను మూడోసారి పిలిచే సరికి నువ్వు వచ్చి, విగ్రహాన్ని తీసుకోవాలి. లేకుంటే, ఇక్కడ ఆ విగ్రహాన్ని ఉంచి వెళ్లిపోతాను’ చెప్పాడు బాలబ్రహ్మచారి.‘సరే’నంటూ విభీషణుడు విగ్రహాన్ని ఆ బాలకుడికి అప్పగించి, స్నాన సంధ్యల కోసం నదికి వెళ్లాడు.విభీషణుడు నదిలోకి ఇలా దిగాడో లేదో, ‘ఇదిగో, పెద్దమనిషీ! తొందరగా వచ్చేసేయ్. నాకు సమయం మించిపోతోంది’ అంటూ కేకవేశాడు.విభీషణుడు స్నానం ముగించుకునే లోపునే రెండోసారి కేక వేశాడు.సంధ్యవార్చుకుంటూ ఉండగా, మూడోసారి కేక వేశాడు. విభీషణుడు పరుగు పరుగున వచ్చేలోగానే ఆ బాల బ్రహ్మచారి విగ్రహాన్ని నేల మీద ఉంచి, చక చకా నడుచుకుంటూ ముందుకు సాగాడు. శ్రీరంగనాథుడి విగ్రహం అక్కడే నేలలోకి పాతుకుపోయింది.విగ్రహాన్ని పైకెత్తడానికి విభీషణుడు తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించాడు. అతడి ప్రయత్నం విఫలమైంది.రాముడు ఇచ్చిన విగ్రహాన్ని లంకకు తీసుకుపోలేని తన నిస్సహాయతకు అతడికి అంతులేని ఆవేదన ముంచుకొచ్చింది. అంతలోనే విగ్రహాన్ని నిర్లక్ష్యంగా ఉంచేసి వెళ్లిపోతున్న బాలబ్రహ్మచారి మీద పట్టరాని కోపం తన్నుకొచ్చింది. అతడిని నెత్తి మీద ఒక్కటిచ్చుకుని బుద్ధి చెప్పాలనుకుని, వడి వడిగా బాల బ్రహ్మచారిని అనుసరించాడు. అది గమనించిన బాల బ్రహ్మచారి పరుగందుకున్నాడు. విభీషణుడు కూడా పరుగున వెంబడించాడు. బాల బ్రహ్మచారి రూపంలో ఉన్న వినాయకుడు సమీపంలోని పర్వత శిఖరానికి చేరుకుని, తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. ‘విభీషణా! చింతించకు. విష్ణువు విగ్రహాన్ని దక్షిణంగా ఉంచే ఆచారం ఎక్కడా లేకున్నా, నీ లంకా రాజ్యానికి తన ఆశీస్సులు కురిపించేలా నేను విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచాను’ అని పలికాడు. విభీషణుడు తన ప్రాప్తమింతేననుకుని లంకకు బయలుదేరాడు.∙సాంఖ్యాయన -
ఫస్ట్ స్నేహం.. తర్వాతే ప్రేమ.. ప్యాకప్ అవగనే కిచెన్లో దూరేస్తా!: హీరోయిన్
తెరపై క్యూట్గా, స్టయిలిష్గా కనిపించే రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon)కు పండుగలంటే ప్రత్యేకమైన మమకారం. ముఖ్యంగా వినాయక చవితి ఆమె చిన్ననాటి నుంచే గుండె నిండా ముద్ర వేసుకున్న పండుగ. ఆ జ్ఞాపకాలే మీ కోసం..👉 నేను లండన్లో పుట్టినా, నా బాల్యం గోవా వీధుల్లో గడిచింది. అక్కడ వినాయక చవితి అంటే ఊరంతా పండుగ మూడ్లో ఉంటుంది. ప్రతి వీధిలో గణపయ్య విగ్రహాలు, రంగురంగుల అలంకారాలు, పూల సువాసనలు ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంటాయి. 👉 పండుగ రోజున మోదక్ల సువాసన వంటింట్లో నిండిపోతే, స్వర్గం కంటే మిన్నగా అనిపించేది. నైవేద్యం పెట్టాక గణపయ్యకి ఇచ్చిన మొదటి మోదక్ తప్పనిసరిగా నేనే తింటాను. ఇది నా చిన్ననాటి నుంచి కొనసాగుతున్న రొటీన్. ఈసారి వినాయక చవితి కోసం నేను ప్రత్యేకంగా గణపయ్య విగ్రహం ఆర్డర్ చేశాను. పూలతో, దీపాలతో, మోదక్లతో ఇంట్లోనే శ్రద్ధగా పూజ చేస్తాను. పండుగ రోజు చీర కట్టుకోవడం మాత్రం కచ్చితంగా చేస్తాను.👉 గణపయ్య విజయాన్ని మాత్రమే కాదు, కష్టాల నుంచి బయటపడే శక్తినీ ఇస్తాడు. అందుకే ఆయన పూజ నా జీవితంలో మొదటి స్థానంలో ఉంటుంది. అలాగే క్రిస్మస్ కూడా నాకు ప్రత్యేకమే. మా అమ్మ క్రైస్తవురాలు. క్రిస్మస్ రోజు ఎర్రని గౌను వేసుకుని, ఫొటోలు తీసి ఫ్యాన్స్తో పంచుకోవడం నాకు చాలా ఇష్టం.👉 ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. కానీ కెమెరా ముందు నిలబడ్డప్పుడు వచ్చే ఆనందం వేరే. అందుకే సినిమాల్లోనే కొనసాగుతున్నాను. నా మొదటి సినిమా కన్నడలో వచ్చింది. తర్వాత తెలుగు తెరపై నానితో కలిసి ‘కృష్ణార్జున యుద్ధం’ చేశాను. ఆ సినిమాకు వచ్చిన స్పందన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.👉 ఫుడ్ లవర్ అయినా, ఫిట్నెస్లో కాంప్రమైజ్ అవను. ఉదయం యోగా, సాయంత్రం స్విమ్మింగ్ తప్పనిసరి. చర్మం, జుట్టు కోసం పెద్దగా ఏమీ చేయను. వారంలో రెండుసార్లు కొబ్బరి నూనె మసాజ్, రాత్రిళ్లు అలోవెరా అంతే.👉 సినిమాలు ఎంచుకోవడంలో నేను చాలా సెలెక్టివ్. చిన్న పాత్రయినా గుర్తుండిపోయేలా ఉంటేనే చేస్తాను. ఒక ఈవెంట్లో ఫొటోలు తీస్తూ అసౌకర్యం కలిగించడంతో అక్కడికక్కడే ‘ఇలా చేయొద్దు’ అని ఫొటోగ్రాఫర్స్కి చెప్పాను. గౌరవం ఉన్న చోటే నేను సౌకర్యంగా ఉంటాను.👉 సెట్లో ‘ప్యాక్ అప్’ అంటే చాలు– నేను కిచెన్లో ‘యాక్షన్’ మొదలెడతాను. గోవా ఫిష్ కర్రీ నా స్పెషాలిటీ. పాన్లో కర్రీ ఉడుకుతుంటే వచ్చే వాసనతో మా వాళ్లు కిచెన్ డోర్ దగ్గర క్యూ కడతారు.👉 ప్రేమలో నా ఆలోచన సింపుల్. ముందు స్నేహం, తర్వాతే ప్రేమ. ఏదైనా టాక్సిక్ అనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆగను. లైఫ్ను మళ్లీ రీస్టార్ట్ చేస్తాను.👉 ప్రయాణాలు అంటే ప్రాణం. గోవా బీచ్ గాలి తాకితే నా మనసు పొంగిపోతుంది. కేరళ బ్యాక్ వాటర్స్లో పడవ ప్రయాణం, మసూరీ హిల్ స్టేషన్ ప్రదేశాలు అన్నీ ఫొటోల్లో కాదు, నా మదిలో ఫ్రేమ్ అయిపోతాయి.చదవండి: శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా! -
సరదా కొట్లాట..! అక్కడ వాటితో కొట్టుకోవడం ఆట..
సాధారణంగా టమాటోలు మీదకు విసిరితే అదో అవమానం అన్నట్లుగా అనిపిస్తుంది. కాని, స్పెయిన్లో టమాటాలతో కొట్టుకోవడమే అహ్లాదకరమైన ఆట! వారికి అదో పండుగ! ‘లా టమాటినా’ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం స్పెయిన్లోని బునోల్ పట్టణంలో ప్రతి ఏటా ఆగస్టు చివరి బుధవారం నిర్వహిస్తారు. ఆ ప్రకారం, ఈ ఏడాది అది ఆగస్టు 27న రానుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేవారు టన్నుల కొద్దీ టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందిస్తారు. అక్కడ ప్రతి సంవత్సరం సుమారుగా 120 నుంచి 150 టన్నుల వరకూ టమాటోలను ఉపయోగిస్తున్నారు.ఈ టమాటో ఉత్సవం 1945లో అనుకోకుండా ప్రారంభమైందని అక్కడివారు చెబుతారు. ఆ ఏడాది జరిగిన ఒక పండుగ ఊరేగింపులో, కొందరు యువకులు ఒకరిపై ఒకరు టమాటోలు విసురుకున్నారట. ఈ ఘటన తరువాత ప్రతి సంవత్సరం టమాటోలతో సరదాగా ఈ పోరాటం చేసేవారట. క్రమంగా దీనిని అధికారిక ఉత్సవంగా ప్రకటించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ వేడుకను ప్రత్యేక ఆకర్షణగా మార్చింది స్పెయిన్ ప్రభుత్వం!ఈ వేడుక ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సుమారు గంటపాటు జరిగే ఈ టమాటో పోరాటంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు. తర్వాత, పట్టణ వీధులను శుభ్రం చేస్తారు. ఈ పండుగలో సుమారు 20 వేల మందికి అనుమతి లభిస్తుంది. అందుకు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ వేడుక.ఈ ఫెస్టివల్ స్ఫూర్తితో ప్రస్తుతం ప్రపంచవాప్తంగా పలు చోట్ల నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత మార్చి 11న మన హైదరాబాద్లోని ఎక్స్పీరియం ఎకో పార్క్లో ఈ వేడుకను ‘టోమా టెర్రా’ అనే పేరుతో ఘనంగా నిర్వహించారు. అయితే అమ్మకానికి పనికిరాని, మిగిలిపోయిన టమాటోలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి ఈ వేడుక చేశారు. దీనితో రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరడంతో పాటు ఈ ఫెస్టివల్లో ఉపయోగించిన టమాటో వ్యర్థాలను వృథా కాకుండా సేంద్రియ ఎరువుగా మార్చి, ఆ పార్క్ మొక్కలకే వాడారట. దీనితో ఈ గ్లోబల్ ట్రెండీ ఫెస్టివల్ ‘జీరో–వేస్ట్’ ఈవెంట్గా మారింది.ద్వీపాల్లోనే రాజా!పశ్చిమ న్యూ గినీకి తూర్పునున్న ఇండోనేషియాలోని పశ్చిమ పాపువా ప్రావిన్స్లో ఉన్న ఒక ద్వీపసమూహమే ఈ రాజా ఆంపత్. దీన్ని ‘ఫోర్ కింగ్స్’ అని కూడా పిలుస్తారు. ఈ పేరు అక్కడి నాలుగు ప్రధాన దీవులైన వాయ్గెయో, బాటంట, సాలావటి, మీసూల్ నుంచి వచ్చింది. ఈ రాజా ఆంపత్ ప్రపంచంలో అత్యంత గొప్ప సముద్ర జీవవైవిధ్యానికి కేంద్రంగా నిలిచింది. ఇక్కడ 1,500లకు పైగా చేపల జాతులు, 500లకు పైగా రకరకాల పగడపు కీటకాలతో పాటు అనేక ప్రత్యేకమైన జీవులున్నాయి. రాజా ఆంపత్లో సుమారు 1,500 చిన్న దీవులు, ద్వీపకల్పాలున్నాయి. సున్నపురాయితో ఏర్పడిన ఈ దీవులు నీలి రంగు సముద్రంలో రమ్యమైన దృశ్యాలను కళ్లకు కడతాయి. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పియానేమో అనే వ్యూ పాయింట్ నుంచి చూస్తే నీలి సముద్రంలో అక్కడక్కడా చిన్న దీవులు తేలుతున్నట్లు కనిపిస్తాయి. అక్కడికి వెళ్తే తిరిగి రావాలనే అనిపించదట! -
బ్యాటరీ బీస్ట్!
మంచి డ్రెస్, సూపర్ హెయిర్ స్టయిల్, బ్రైట్ మేకప్ ఇలా టాప్ టు బాటమ్ ఫుల్గా రెడీ అయ్యి, ఫేవరెట్ లొకేషన్లో ఫొటోషూట్కి స్టెప్పులేస్తూ చేరుకున్నారు. అప్పుడు వెంటనే, మీ ఫోన్ లేదా కెమెరా ‘బంగారం, నా బ్యాటరీ అయిపోయింది!’ అంటే ఎలా ఉంటుంది? ఊహించుకోండి. అప్పటిదాక అవార్డు విన్నర్లా మెరిసిన మీ ముఖం, ఒక్కసారిగా లోబ్యాటరీ లైట్లా డిమ్గా మారుతుంది. ఇలా ఇంకెప్పుడు జరగకుండా ఉండాలనే, చాలా త్వరగా చార్జ్ చేసి, ఎక్కువ కాలం ఉండే ‘ఫాస్ట్ అండ్ ఫరెవర్’ అనే ఒక సూపర్ బ్యాటరీని జపాన్ ఇంజినీర్లు తయారు చేశారు. కేవలం మూడు నిమిషాల్లోనే ఈ బ్యాటరీ ఏ ఎలక్ట్రానిక్ డివైజ్నైనా పూర్తిగా చార్జ్ చేసేస్తుంది. దీనిని గాజు సిరామిక్ ఎలక్ట్రోలైట్, లిథియం వంటి ఇతర లోహాల మిశ్రమంతో తయారు చేశారు. అందుకే, అధిక ఉష్ణోగ్రత, అధిక ఒత్తిడి వంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. ఇప్పటి వరకు చేసిన పరిశోధనల్లో పదిహేనువేల సార్లు ఈ బ్యాటరీని ఉపయోగించి చార్జ్ చేసినా, ఇంకా తొంభై శాతం కెపాసిటీతో యథాతథంగా పనిచేస్తోంది. మొబైల్, ల్యాప్టాప్, కారు ఏదైనా సరే చిటికెలో చార్జ్ చేస్తుంది. దీంతో, ఈ బాటరీపై ఇప్పుడు భారీ క్రేజ్ ఉంది. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దీనిని విభిన్న పరిమాణాల్లో తయారు చేస్తున్నారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది.(చదవండి: పసిడి దేశాలు..!) -
పసిడి దేశాలు..!
డబ్బుతో దేశాన్ని కొనలేం. కాని, డబ్బు పెట్టి మనకు ఇష్టమైన దేశంలో శాశ్వతంగా ఉండిపోగలం. చేతిలో ‘గోల్డెన్ వీసా’ ఉంటే చాలు, కుటుంబంతో సహా వెళ్లి ఏ దేశంలోనైనా స్థిరపడొచ్చు. ఆ దేశ పౌరసత్వం తీసుకోవచ్చు. గోల్డెన్ వీసా ఇవ్వని దేశాలకు సైతం ఆ దేశాలు ఇచ్చే ‘గోల్డెన్ చాన్స్’తో బంగారు రెక్కలు కట్టుకుని ఎగిరిపోవచ్చు. ప్రస్తుతమైతే అందరి చూపూ, ముఖ్యంగా భారతీయుల మనసు అమెరికా మీద ఉంది. ట్రంప్ ఇస్తానంటున్న గోల్డ్ కార్డ్ మీద ఉంది. బుకింగ్స్ ఓపన్ కాలేదు!ట్రంప్ ప్రకటించిన 5 మిలియన్ డాలర్ల (43.5 కోట్ల రూపాయలు) ‘గోల్డ్ కార్డ్’ కోసం ఇప్పటి వరకు 80 వేల మందికి పైగా సంపన్న భారతీయులు క్యూలో నిలబడి ఉన్నారు. ఈ ఏడాది జూన్ నెలలోనే అమెరికాగోల్డ్ కార్డ్ అధికారిక వెబ్ సైట్ మొదలైంది. నిజానికి ఈ సైట్లో రిజిస్ట్రేషన్కు ఇంతవరకు (ఈ కథనం రాసే నాటికి) చట్టబద్ధమైన ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ ఎనభై వేల మంది ఎవరంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి రిజిస్టర్ చేసుకున్నవారు. సైట్ తెరవగానే మొదట – ‘ది ట్రంప్ కార్డ్ ఈజ్ కమింగ్’ అని కనిపిస్తుంది. దాని కింద, ‘నోటిఫికేషన్ రాగానే మీకు తెలియబరుస్తాం. మీ పేరు, మీ దేశం, మీ ఈమెయిల్ పొందుపరచండి’ అని ఉంటుంది. ఇప్పటి వరకు అలా పొందుపరచినవారే ఈ ఎనభై వేల మంది. వీరి సంఖ్య ఇంతకింతా పెరగవచ్చని ఇమిగ్రేషన్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఫస్ట్ లుక్ అదిరిపోయిందిప్రధానంగా టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాలకు చెందిన 28–45 సంవత్సరాల వయస్సు గల భారతీయ నిపుణులు అమెరికన్ గోల్డ్ కార్డ్ వీసాపై ఆసక్తి చూపుతున్నారు. ఈబీ–5 ఇన్వెస్టర్ వీసాలకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ ఈ గోల్డ్ కార్టును తెస్తున్నారు. ఈబీ–5లో మోసాలు జరుగుతుండటంతో ఈ కొత్త గోల్డ్ కార్డ్ను ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు కూడా. గోల్డ్ కార్డ్ వెబ్ సైట్ పని ప్రారంభం అయితే పూర్తి వివరాలు, విధి విధానాలు వెల్లడవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ గోల్డ్ కార్డ్ ‘ఫస్ట్ లుక్’ విడుదల చేసినప్పటికీ, ఇందుకొక చట్టం వచ్చేవరకు యూఎస్ గోల్డ్ కార్డ్ కేవలం ఒక ఆశా దీపం. ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.డబ్బున్నవాళ్లకే గోల్డెన్ వీసాలుఅత్యంత ధనికులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, వృత్తి నిపుణులు గోల్డెన్ వీసాలకు అర్హులు. అందుకు వారు భారీ మొత్తంలో రుసుము చెల్సించాల్సి ఉంటుంది. ప్రతిఫలంగా ఆ దేశ పౌరసత్వం, లేదా శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది.గోల్డెన్ వీసాలు ఇస్తున్న దేశాలుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనీసం పదిహేనుకు పైగా దేశాలు గోల్డెన్ వీసాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని : సింగపూర్, హాంకాంగ్, కెనడా, స్పెయిన్, స్విట్జర్లండ్, ఇటలీ, న్యూజీలండ్, గ్రీస్, ఆస్ట్రియా, టర్కీ, యూఏఈ, కరీబియన్ తదితర దేశాలు. ఇక అగ్రరాజ్యాలైన రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటివి గోల్డెన్ వీసాలు ఇవ్వటం లేదు!కలకలం రేపిన యూఏఈ ‘గోల్డ్’ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 2019 నుండి ఇన్వెస్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు, వృత్తి నిపుణులకు గోల్డెన్ వీసాను జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొత్త రకం గోల్డెన్ వీసాలను యూఏఈ మంజూరు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి ఆ సమాచారం మేరకు – ‘‘యూఏఈ మొదట ప్రయోగాత్మకంగా భారత్, బంగ్లాదేశ్ పౌరులకు గోల్డెన్ వీసాలు ఇస్తుంది. వీసా రుసుము లక్ష దిర్హామ్లు (దాదాపు రూ.23.30 లక్షలు) ఉంటుంది. క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా తనిఖీల అనంతరమే అర్హులైన దరఖాస్తు దారులకు కార్డును మంజూరు చేస్తారు’’. అయితే యూఏఈ ‘ఫెడరల్ అధారిటీ’ ఈ గోల్డెన్ వీసా వార్తల్ని వట్టి వదంతులుగా కొట్టిపడేసింది. థాయ్లండ్ ఎలీట్ లాంగ్–టెర్మ్ రెసిడెన్సీ వీసా (5 ఏళ్లకు రూ.5 లక్షలు, తాత్కాలిక నివాసం)పోర్చుగల్ డి7 పాసివ్ ఇన్కం వీసా(రూ.9 లక్షలు, 5–6 ఏళ్ల పౌరసత్వం) మాల్టా పర్మినెంట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్(రూ. 90 లక్షల నుంచి రూ. 1 కోటీ 35 లక్షలు. శాశ్వత నివాసం. పౌరసత్వం ఉండదు.)లాట్వియా రెసిడెన్సీ బై ఇవ్వెస్ట్మెంట్ (రూ. 54 లక్షలు, 10 ఏళ్ల పౌరసత్వం) నార్త్ మాసిడోనియా సిటిజెన్ షిప్ బై ఇన్వెస్ట్మెంట్ (రూ. 1.8 కోట్లు, 120 దేశాలకు వీసా లేని ప్రయాణ సదుపాయం)వానువాటు సిటిజెన్షిప్ బై డొనేషన్ (రూ. 1 కోటి 10 లక్షలు, పౌరసత్వం)డొమినికా సిటిజెన్షిప్ బై డొనేషన్(రూ.83 లక్షలు, పౌరసత్వం)సెయింట్ లూసియా సిటిజెన్షిప్ బై డొనేషన్ (రూ.83 లక్షలు, పౌరసత్వం) (చదవండి: ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!) -
మేని కాంతికి మెరుగైన చికిత్స..!
చాలామంది ఆడవారు తన చర్మానికి లోషన్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ మచ్చలు లేని మృదువైన చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే వయసు పెరిగే కొద్ది ట్రెండ్కి తగ్గట్టుగా ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చినా, ఎన్ని తాత్కాలిక చిట్కాలు పాటించినా కాంతిమంతమైన, మృదువైన చర్మం కావాలంటే టెక్నాలజీని నమ్ముకోవాల్సిందే! అందులో భాగమే ఈ గాడ్జెట్! దీని పేరు ‘ఆర్ అండ్ ఎఫ్ స్కిన్ టైటెనింగ్ రిజువనేషన్ మెషిన్!’ ఈ చిత్రంలోని రింకిల్ రిమూవల్ మెషిన్తో ముడతలను తొలగించుకోవడంతో పాటు చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు. డబుల్ చిన్, ఐ బ్యాగ్స్ వంటి వయసుతో వచ్చే ఎన్నో సమస్యలను తొలగించుకోవచ్చు. ఈ స్కిన్ కేర్ డివైస్తో ట్రీట్మెంట్ పొందితే వయసును దాచేయవచ్చు. యవ్వనంగా కనిపించొచ్చు.స్మూత్ రింకిల్స్, లిఫ్ట్ ఐ కాంటౌర్, కాంపాక్ట్ పోర్స్, వి–షేప్డ్ ఫేస్, సబ్ట్రాక్టివ్ డబుల్ చిన్, గో ఐ బ్యాగ్స్ అండ్ డార్క్ సర్కిల్స్, రోజీ ఫేస్ కలర్ వంటి 11 ఆప్షన్స్ ఈ డివైస్లో ఉంటాయి. అందుకు తగ్గ హెడ్స్ కూడా లభిస్తాయి. వాటిని వినియోగించుకుని చర్మాన్ని నిగనిగలాడేలా మార్చుకోవచ్చు. దీని ధర సుమారుగా 110 డాలర్లు. అంటే 9,634 రూపాయలన్న మాట! ఇందులో అదనపు టెక్నాలజీని బట్టి ఆప్షన్స్ని బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.సౌందర్య చికిత్స..మెరుగైన చర్మ సౌందర్యానికి ఎక్స్ఫోలియేషన్ చికిత్స చక్కని మార్గం. ఈ చికిత్స ముఖ్యమైన ప్రక్రియ చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచడమే! ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను, మురికిని తొలగించి, కొత్త చర్మ కణాలు పునరుజ్జీవం పొందేందుకు దోహదపడుతుంది. ఈ ట్రీట్మెంట్తో చర్మం మరింత కాంతిమంతంగా, మృదువుగా మారుతుంది. అయితే ఈ ట్రీట్మెంట్లో రెండు రకాలున్నాయి. ఒకటి ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్! ఇందులో స్క్రబ్లు, బ్రష్లు లేదా గ్లోవ్స్ వంటి వాటిని ఉపయోగించి చర్మాన్ని బాగా రుద్దుతారు. ఈ పద్ధతి సాధారణంగా ఇంట్లోనే చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఓట్ మీల్ లేదా షుగర్ స్క్రబ్లను ఉపయోగించవచ్చు. ఇక రెండవ రకం కెమికల్ ఎక్స్ఫోలియేషన్! ఈ పద్ధతిలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ లేదా బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ వంటి రసాయన పీలింగ్లను ఉపయోగిస్తారు. వీటివల్ల మృతకణాలు, జిడ్డు వంటి సమస్యలు సులభంగా తొలగిపోయి, ప్రత్యేకమైన కాంతి వస్తుంది. ఈ ట్రీట్మెంట్లను సాధారణంగా నిపుణుల పర్యవేక్షణలో పొందడమే ఉత్తమం. (చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!) -
అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!
స్నేహ అంటే సంప్రదాయంలో పుట్టిన సౌందర్య కవిత లాంటిది. దాదాపు చాలావరకు పట్టుచీర, జడలో మల్లెలు, నుదుటిన బొట్టు అన్నీ కలిసి కనిపిస్తూ ఉండే ఆమె అందం ఎప్పుడూ పండుగ వాతావరణంలా మెరిసిపోతుంది. ఆ అందాన్ని కూడా స్నేహ ఒక్క చిరునవ్వుతోనే రెట్టింపు చే స్తుంది. ప్రతిసారీ కొత్తగా, ప్రత్యేకంగా కనిపించడం అంటే చాలా ఇష్టం. ప్రింటెడ్ కాంచీపురం నుంచి మోనోటోన్ బనారసీ, ఫ్లోరల్ నుంచి బ్రోకేడ్ వరకు, ఏ చీర అయినా సరే రంగులతో మ్యాజిక్ చేస్తాను. అందుకే, చీరలంటే చాలా ఇష్టం అని చెబుతోంది స్నేహ.ఆభరణాల పండుగ! పండుగ రోజు ఉదయం చీర కట్టుకుంటూ అద్దం ముందు నిలబడి ఏ ఆభరణం వేసుకోవాలి అనుకుంటే, అది తప్పకుండా ఫెస్టివల్ జ్యువెలరీ అయి ఉండాలి. బంగారం మెరుపులో రంగురంగుల రత్నాలు, ముత్యాల గుత్తులు, చెక్కిన సున్నితమైన ఆకృతులు – ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే వైభవం పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, ప్రతి పండుగను ఒక జ్ఞాపకంగా మార్చే మ్యాజిక్. ఆ ఆభరణాలను వేసుకున్నప్పుడల్లా మనం కేవలం ఆ రోజుకే కాదు, మన పూర్వీకుల సంప్రదాయానికి, వారసత్వానికి కూడా గౌరవం ఇస్తున్నట్లే అనిపిస్తుంది. లేత రంగుల కంచీపురం చీరలపై ఈ ఆభరణాలను వేసుకుంటే రత్నాల మెరుపు ఇంకా హైలైట్ అవుతుంది. జుట్టును పొడవైన జడగా వేసి మల్లెపూలు, కనీసం రెండు పొడవైన హారాలు జుంకీలు, వంకీలు – ఇలా లేయరింగ్ చేస్తే ఆకర్షణ వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న డిజైన్లను చూస్తే, లక్ష్మీదేవి, గణేశ్ మోటిఫ్స్తో వచ్చే టెంపుల్ హారాలకు బాగా డిమాండ్ ఉంది.చీర బ్రాండ్: స్నేహాలయ సిల్క్స్, ధర: రూ. 25,000, జ్యూలరీ బ్రాండ్ : ఇతిహాస జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!) -
గణపయ్యకు టెక్నో హారం!
ఈసారి గణపయ్యకు టెక్ టచ్తో స్వాగతం చెప్పారంటే, ఇక మీ పండుగ వాతావరణం భక్తి ప్లస్ టెక్ కాంబోలో డబుల్ ఆనందంతో మెరిసిపోతుంది.వీఆర్ గణపయ్యతో రద్దీకి గుడ్బై!వినాయక చతుర్థి రాగానే ముంబయి లాల్బాగ్చా రాజా ముందు కనిపించే రద్దీ మాటల్లో చెప్పలేనిది. కాని, ఇప్పుడు బయట అడుగు పెట్టకుండానే, మీ లివింగ్రూమ్లో కూర్చొని ఆ భవ్య దర్శనాన్ని ఆస్వాదించవచ్చు. అదే ఈ ‘లాల్బాగ్ 360’ వీఆర్ దర్శనం. ఒక్క యాప్తో మీ హాల్లో కూర్చునే పూజా గంటలు, పూజారుల మంత్రోచ్ఛారణ, మండప అలంకారాలు అన్నీ కళ్లముందే ప్రత్యక్షం అవుతాయి. ఎడమ వైపు తిప్పితే పూలతో అలంకరించిన మండపం, కుడివైపు తిప్పితే గణపయ్య పాదాల వద్ద నమస్కరిస్తున్న భక్తులు అన్నీ నిజంగానే అక్కడ ఉన్నట్టు అనిపిస్తాయి. ఇదే విధంగా ‘గణేశ్ వీఆర్’, ‘విజయవిధి వర్చువల్ దర్శనం’ లాంటి యాప్లు కూడా 360 డిగ్రీల వీడియోలతో పండుగ వాతావరణాన్ని ఇంటికే తీసుకొస్తున్నాయి. వాడటం కూడా చాలా సులభం. మీ ఫోన్ లేదా స్మార్ట్ టీవీలో యాప్ డౌన్ లోడ్ చేసి, హెడ్సెట్ లేదా ఫుల్స్క్రీన్లో ఆన్ చేస్తే సరిపోతుంది. లైవ్ టైమింగ్స్, లింకులు అధికారిక వెబ్సైట్లో దొరుకుతాయి.ఒకే టచ్తో భక్తి ప్లస్డీజే మోడ్!గణేష్ మండపం అంటే వెలుగుల వేదిక! అయితే, ఇప్పుడు తీగలు, ప్లగ్లు, స్విచ్లతో ఇబ్బంది పడే రోజులు పోయాయి. ఒక వైఫై ఎల్ఈడీ బల్బు పెట్టేస్తే చాలు. మీ మండపం క్షణాల్లో ‘సినిమా సెట్’లా మెరిసిపోతుంది. ఉదయం పూజ సమయానికి పసుపు వెలుగు, మధ్యాహ్నం భక్తులు రాగానే ప్రకాశించే తెలుపు వెలుగు, రాత్రి డీజే బీట్ పడగానే గ్రీన్ , బ్లూ, రెడ్ ఫ్లాష్లతో మండపం ఫుల్ పార్టీ మూడ్లోకి మారిపోతుంది. ఇవన్నీ కేవలం ఫోన్ టచ్తోనే! ‘అలెక్సా, డివోషనల్ మోడ్ ఆన్ ’ అంటే పసుపు, ఎరుపు కాంబినేషన్ రెడీ. వాడటం కూడా సింపుల్. బల్బు పెట్టి, యాప్ డౌన్లోడ్ చేసి, వైఫై కనెక్ట్ చేస్తే సరిపోతుంది. టైమింగ్ సెట్ చేసి, పూజ సమయానికి ఆటోమేటిక్గా వెలుగులు వెలిగేలా చేసుకోవచ్చు. విప్రో, ఫిలిప్స్, హెవెల్స్ లాంటి బ్రాండ్లు మంచి ఆప్షన్లు ఇస్తున్నాయి. ఒక్క బల్బు ధర రూ. 600 నుంచి మొదలవుతుంది.ఒక్క బాక్స్లో మొత్తం పండుగ! వినాయక చవితి దగ్గర పడుతుంటే, ఇంట్లో అందరికీ ఒకటే టెన్షన్ , పూజ సామగ్రిని సర్దుకోవాలి, పత్రి తెప్పించాలి, విగ్రహం తీసుకురావాలి. వీటన్నిటికీ చివరి నిమిషంలో టెన్షన్.. టెన్షన్! కాని, ఈసారి అంతా ఈజీ! ‘ఆరాధ్య గణేశ్ చతుర్థి సంపూర్ణ పూజా కిట్’ చేతిలో ఉంటే చాలు, మీ పండుగ ఏ లోటు లేకుండా చక్కగా పూర్తవుతుంది. ఒక్క బాక్స్లోనే పన్నెండు అంగుళాల మట్టి గణపయ్య, ఇరవైఒక్క రకాల పవిత్ర పత్రి, ఒక చెక్క పాలవెల్లి సహా పూజకు కావాల్సినవన్నీ సిద్ధంగా లభిస్తాయి. కేవలం పూలు, పండ్లు, నైవేద్యం బాధ్యత మాత్రమే మీది! ఎవరైనా పూజ విధానం మరచిపోయారా? టెన్షన్ లేదు, చిన్న పుస్తకంతోపాటు, వీడియో గైడ్ కూడా వెబ్సైట్లో రెడీగా ఉంటుంది. పైగా ప్యాకేజింగ్ నుంచి విగ్రహం వరకు అంతా ప్రకృతికి నష్టం లేకుండా పర్యావరణహితంగా ఉంటుంది. ధర కేవలం రూ.1500 మాత్రమే! .(చదవండి: బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...) -
రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా..?
నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఒక కుటుంబ కార్యక్రమం ఉంది. ఆ సమయానికి రుతుక్రమం రాకుండా వాయిదా వేసే మాత్రలు వాడాలని మా ఇంట్లో అందరూ చెబుతున్నారు. కాని, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో, భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోవాలని ఉంది.– ప్రియాంక, హైదరాబాద్మీ వయసు, శరీర పరిస్థితి, రుతుక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాలను ముందుగా పరిశీలించడం అవసరం. రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు సాధారణంగా అధిక మోతాదు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో సహజంగా ఏర్పడే హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి, గర్భాశయంలో ఏర్పడిన పొర ఊడిపోకుండా అడ్డుకుంటాయి. మాత్రలు వాడుతున్నంత కాలం రుతుక్రమం రాదు. కాని, ఆపిన తరువాత గర్భాశయ పొర ఒకేసారి ఊడిపోవడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరగవచ్చు. తరచుగా వాడితే రుతుక్రమం అసాధారణంగా మారడం, గర్భసంబంధిత సమస్యలు రావచ్చు. గతంలో ఇలాంటి మాత్రలు వాడిన మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆరోగ్యకరమైన అండాల లభ్యత తగ్గడం వలన గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య సర్దుకోవడానికి కొంతమందికి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు సమయం పడుతుంది. తాత్కాలిక దుష్ప్రభావాలలో మానసిక భావప్రకటన మార్పులు, అజీర్ణం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి, స్తనాల నొప్పి, బరువు పెరగడం ఉంటాయి. అధిక బరువున్నవారు వాడితే రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు వాడకూడదు. దీర్ఘకాలంగా వాడితే శాశ్వత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుతుక్రమం వాయిదా వేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కలసి, శరీర పరిస్థితి అంచనా వేయించు కోవాలి. తక్కువ మోతాదులో ఉండే మాత్రలను, కార్యక్రమానికి ఒకటి రెండు నెలల ముందు ప్రారంభిస్తే కొంత సురక్షితంగా వాడవచ్చు. భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమవుతున్న వారు అనవసరంగా ఈ మాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భంలో శిశువు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత రుతుక్రమ స్థితి ఇవన్నీ పరిశీలించి, వైద్యుని సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.నా వయసు పద్దెనిమిదేళ్లు. మొదటి నుంచే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఈ అక్టోబర్ నెలలో దసరా పండుగకు మేము ఇంట్లో దేవుడికి పెద్దగా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి, ఆ సమయంలో పీరియడ్స్ రాకుండా పోస్ట్పోన్ లేదా ప్రీపోన్ టాబ్లెట్లు వాడవచ్చా?– స్వాతి, విజయవాడమీ పీరియడ్స్ రెగ్యులర్గా లేనందున, వచ్చే నెలలో పీరియడ్స్ ఏ తేదీన వస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఆ తేదీని ముందుకు తేవడం లేదా వెనక్కు మార్చడం ఈ పరిస్థితిలో కష్టమైన పని. సాధారణంగా, పీరియడ్స్ సరిగ్గా వచ్చే వాళ్లకి, తేదీకి కొన్ని రోజులు ముందు హైడోస్ హార్మోన్ మాత్రలు ఇస్తే పీరియడ్స్ వాయిదా వేయవచ్చు. కాని, మీలా నెలసరి క్రమం తప్పి ఉన్నవాళ్లకి ఇది సురక్షితం కాదు. ఈ మాత్రలు వాడితే వికారం, వాంతులు, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, కాలేయానికి నష్టం వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. వీటిని తరచుగా వాడితే పీరియడ్స్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మీ వయసులో పీరియడ్స్ రెగ్యులర్గా కాకపోవడం సహజం. ఎందుకంటే ఈ వయసులో శరీరం ఇంకా మార్పులు పొందుతూ ఉంటుంది. చాలా అమ్మాయిల్లో ఇది ఇరవై ఏళ్ల వరకు క్రమంగా సర్దుకుంటుంది. కాని, పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకపోతే, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, తక్కువ బరువు, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. నా సలహా ఏమిటంటే, కేవలం పూజల కోసమే హార్మోన్ మందులు వాడడం కంటే, ముందుగా మీ సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే మీ సైకిల్ సరిగా వచ్చి, భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇలాంటి మందులను స్వయంగా అసలు కొనకండి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
విలక్షణ వినాయకుడు..!
ఆదిపూజలు అందుకునే వినాయకుడికి దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. పురాతన ఆలయాల్లో విలక్షణమైన వినాయక విగ్రహాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అత్యంత అరుదైన ఆలయాలు, విలక్షణమైన విగ్రహాలు ఉన్నాయి. అలాంటి అరుదైన ఆలయాలు, విగ్రహాల విశేషాలు మీ కోసం...వినాయకుడిని భక్తులు గజాననుడిగానే ఆరాధిస్తారు. వినాయకుడు మానవ ముఖంతో కనిపించే ఏకైక ఆలయం తమిళనాడులోని తిలతర్పణపురిలో ఉంది. పార్వతీదేవి నలుగుపిండితో రూపొందించిన వినాయకుడు లక్షణంగా మానవముఖంతోనే ఉండేవాడు. తనను అడ్డగించినందుకు శివుడు కోపగించి, అతడి తలను నరికేసి, ఆ తర్వాత జరిగిన పొరపాటుకు చింతించి గజముఖాన్ని అతికించిన పురాణ కథ అందరికీ తెలిసినదే! గజాననుడిగా మారక ముందు బాలవినాయకుడి రూపంలో కొలువుతీరిన ఆలయం ఇది. వినాయకుడి తొలి రూపం ఇదే గనుక దీనికి ఆదివినాయక ఆలయంగా పేరు వచ్చింది. ఈ ఆలయం తిలతర్పణపురిలోని ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇది క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శ్రీరాముడు ఇదేచోట తన తండ్రి దశరథుడికి పితృశ్రాద్ధం నిర్వహించి, తిల తర్పణాలు సమర్పించాడనే కథనం కూడా ఉంది. అందువల్ల ఇది కాశీ, రామేశ్వరాలతో సమానమైన పుణ్యక్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. ఐశ్వర్య గణపతికలువా వినాయకుడుఅత్యంత భారీ ఏకశిలా విగ్రహం ఇది. ఆరుబయట పంట పొలాల మధ్య ఉన్న ఈ విగ్రహానికి ఆలయమేదీ లేదు. భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. ఐశ్వర్య గణపతిగా కొలువు తీరిన ఈ ఏకశిలా విగ్రహం తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 7.62 మీటర్లు. పీఠంతో కలుపుకొంటే, దీని ఎత్తు 9.14 మీటర్లు. ఈ విగ్రహం పశ్చిమ చాళుక్యుల కాలం నాటిది. సుమారు క్రీస్తుశకం పన్నెండో శతాబ్దిలో ఈ విగ్రహాన్ని రూపొందించి ఉంటారని అంచనా.అడవీయ గణపతిపురాతనమైన ఈ ఏకశిలా గణపతి విగ్రహం శ్రీలంకలోని ఉడుదుంబరలో ఉంది. అడవులకు రక్షణగా ఉంటాడని భావించి, ఈ విగ్రహాన్ని నెలకొల్పడం వల్ల ఈ గణపతికి ‘అడవీయ గణపతి’ అనే పేరు వచ్చింది. ఇది సుమారు పన్నెండో శతాబ్ది నాటిదని అంచనా.స్థానిక గిరిజన తెగ నాయకుడికి వినాయకుడు కలలో కనిపించడంతో ఆయన ఈ విగ్రహాన్ని నెలకొల్పాడని స్థానికుల కథనం. దీని ఎత్తు 6 మీటర్లు. ఇది ప్రపంచంలోని అతి ఎత్తయిన వినాయక విగ్రహాలలో మూడవ స్థానంలో నిలుస్తుంది. శ్రీలంకలోని హిందువులే కాకుండా, విదేశీ పర్యాటకులు కూడా ఈ విగ్రహాన్ని సందర్శించుకుంటూ ఉంటారు.త్రినేత్ర గణపతివినాయకుడి తండ్రి పరమశివుడు ముక్కంటి అని అందరికీ తెలుసు. మూడు కన్నులతో వినాయకుడు కొలువుదీరిన అరుదైన ఆలయం రాజస్థాన్లో ఉంది. రణథాంబోర్ కోట ప్రాంగణంలో ఉన్న ఈ త్రినేత్ర గణపతి ఆలయం క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నాటిది. రణథాంబోర్ కోటను కేంద్రంగా చేసుకుని పాలించిన రాజు హమీర్ వినాయకుడికి వీరభక్తుడు. ఆయన యుద్ధాలకు వెళ్లేటప్పుడల్లా ముందుగా ఈ త్రినేత్ర గణపతికి ప్రత్యేక పూజలు జరిపించి మరీ బయలుదేరేవాడట! ఈ ఆలయానికి చేరుకోవాలంటే, కోటలో నిర్మించిన రెండువందల యాభై మెట్ల మీదుగా మెట్ల మార్గం ఉంది. కోట లోపలి వైపునే అర కిలోమీటరు కాలిబాట కూడా ఉంది. ఈ ఆలయంలో ఇక్కడి త్రినేత్ర గణపతి తన భార్యలు సిద్ధి, వృద్ధి; కొడుకులు శుభ లాభాలతో కలసి కొలువుదీరడం విశేషం. వినాయకుడు ఇలా సకుటుంబంగా కొలువుదీరిన ఏకైక ఆలయం ఇదొక్కటే!కలువా వినాయకుడుఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వినాయక ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో రూప్కుండ్– నందాదేవి పర్వతారోహక యాత్రకు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ‘కలువా’ వినాయక ఆలయం లేదా ‘కేల్వా’ వినాయక ఆలయంగా పేరుపొందిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తున ఉంది. మంచుకొండల్లో ఒక కొండ మీద ఉన్న ఈ ఆలయం చాలా చిన్నది. దీని ఎత్తు కేవలం అరడుగులు. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిక కోరికలు ఈడేరుతాయని భక్తులు నమ్ముతారు. పర్వతారోహకులు తప్ప సామాన్యులు ఈ ఆలయాన్ని సందర్శించడం దుస్సాధ్యం.(చదవండి: గిన్నిస్లో గణపయ్య..) బ్రొమో గణపతిపురాతనమైన ఈ గణపతి విగ్రహం ఇండోనేసియాలో ఉంది. తూర్పు జావాలోని టెంగెర్ పర్వతాలకు చెందిన ‘బొమో’ అగ్నిపర్వత శిఖరంపై కొలువైన ఈ విగ్రహం ఏడు శతాబ్దాల నాటిది. ‘బ్రహ్మ’ను జావా హిందువులు స్థానిక భాషలో ‘బ్రొమో’ అంటారు. బ్రహ్మదేవుడి పేరిట ఈ అగ్నిపర్వతాన్ని ‘బ్రొమో’ అని పిలుచుకుంటారు. జావాలోని టెంగెరీ తెగకు చెందిన వారు ఇక్కడ వినాయక విగ్రహాన్ని నెలకొల్పినట్లు చెబుతుంటారు. సముద్ర మట్టానికి ఏడువేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహానికి పూజలు చేసేందుకు జావా ప్రజలు పర్వతారోహణ చేస్తుంటారు. ఈ వినాయకుడు తమను అగ్నిపర్వతాల పేలుడు నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడతాడని జావా ప్రజల నమ్మకం. (చదవండి: గిన్నిస్లో గణపయ్య..!) -
సామాన్యుడు విసిరిన సవాల్!
ప్రముఖ కంపెనీలు తమ వెబ్సైట్లు, డేటాబేస్ పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాలకు ఏర్పాటు చేసుకుంటాయి. వీటిలో నిపుణులను నియమించుకుని రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తుంటాయి. ఆయా వెబ్సైట్లలో ఉన్న లోపాలను, హ్యాకింగ్కు ఆస్కారాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దేందుకు ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ పని చేస్తుంటాయి. అలాంటిది ఏకంగా విదేశాంగ శాఖ అధీనంలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం వెబ్సైట్ను ఒక డిప్లొమా హోల్డర్ హ్యాక్ చేసి, సవాలు విసిరారు. సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం 2010లో అత్యవసరంగా పాస్పోర్టులు పొందాలనుకునే వారి కోసం తత్కాల్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీని కింద దరఖాస్తుదార్లు కేవలం ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. పెద్ద సంఖ్యలో స్లాట్స్ ఇస్తుండటంతో పనిభారం పెరిగిన పాస్పోర్ట్ కార్యాలయం ఆ ఏడాది ఫిబ్రవరిలో వాటి సంఖ్యను 350కి పరిమితం చేయడంతో తత్కాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని భావించిన చాలామందికి నిరాశే ఎదురయ్యేది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు దళారులు ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటకు చెందిన లతాధర్రావు ద్వారా హ్యాకింగ్ కథ నడిపారు. కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా పూర్తి చేసిన గోరంట్ల లతాధర్రావు అప్పట్లో నరసరావుపేటలో లలితా ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడు టీపీ వర్క్ కూడా చేస్తుండటంతో ఆ పనిలో భాగంగా అక్కడి గాంధీచౌక్లో ఆకాశ్ ట్రావెల్స్ నిర్వహించే షేక్ సుభానీతో పరిచయం ఏర్పడింది. లతాధర్కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్పోర్ట్ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి సుభానీ ఇతని సాయం తీసుకునేవాడు. ప్రతిఫలంగా ఒక్కో అప్లికేషన్కు రూ.100 చొప్పున చెల్లించేవాడు. అప్పట్లో పాస్పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ చేపట్టేది. తత్కాల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన ఆన్లైన్ స్లాట్స్ను 2010 ఫిబ్రవరి నుంచి తగ్గించారు. దీంతో ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించారు. త్వరగా ఆన్లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందుకు వచ్చేవారు. దీంతో పాస్పోర్ట్ వెబ్సైట్ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తన కంప్యూటర్ పరిజ్ఞానంతో లతాధర్ ఈ పని చేశాడు. వెబ్సైట్లోకి హ్యాకింగ్ ద్వారా ఎంటర్ అయిన లతాధర్ దాని నుంచి నేరుగా ఎన్ఐసీ సర్వర్కు కనెక్ట్ అయ్యేవాడు. రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరుల లాగాన్లో మార్పులు చేసేవాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్లోడ్ చేశాకనే మిగిలిన స్లాట్స్ను ఫ్రీ చేసేవాడు. నరసరావుపేటకు చెందిన సుభానీ, లతాధర్ల ద్వారా ఆన్లైన్ స్లాట్స్ వేగంగా దొరుకుతుండటం, పాస్పోర్ట్ అపాయింట్మెంట్స్ వస్తుండటంతో హైదరాబాద్కు చెందిన పాస్పోర్ట్ ఏజెంట్లు మహ్మద్ జహంగీర్, భూమా శ్రీహరి, గిడ్డా చిన్నా, సయ్యద్ వలీయుద్దీన్, కె.పెంచల్రెడ్డి, ఖలీమ్, శ్రీనివాస్లు వీరికి సబ్–ఏజెంట్స్గా మారిపోయారు. తత్కాల్ పాస్పోర్ట్స్ కోసం తమను ఆశ్రయించే వారి దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా వారిద్దరికీ పంపడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్నే వ్యాపారంగా చేసుకున్న ‘లతాధర్ అండ్ కో’ దరఖాస్తుదారుల నుంచి భారీగా వసూలు చేసింది. సాధారణంగా తత్కాల్ దరఖాస్తుకు అప్పట్లో రూ.2 వేలు చెల్లిస్తే సరిపోయేది. అయితే ఈ ముఠా సభ్యులు మాత్రం అదనంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసేవారు. ఈ మొత్తంలో రూ.1000 నుంచి రూ.2000 వరకు సుభానీకి ఇచ్చే వారు. అతను ముఠా సూత్రధారి అయిన లతాధర్కు రూ.500 నుంచి రూ.1000 వరకు కమిషన్ అందించే వాడు. ఈ రకంగా లతాధర్ గ్యాంగ్ కేవలం రెండు నెల్లలో మూడువేల తత్కాల్ పాస్పోర్ట్ దరఖాస్తులు అప్లోడ్ చేశారు. అప్పట్లో సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం చుట్టూ దాదాపు 20 మంది ఏజెంట్లు ఉండేవారు. ఆన్లైన్ బుకింగ్ స్లాట్స్ సంఖ్య తగ్గించినప్పటి నుంచి వీరిలో కేవలం జహంగీర్, శ్రీహరి, చిన్నా, వలీయుద్దీన్, పెంచల్రెడ్డిలకు మాత్రమే స్లాట్స్ దొరుకుతున్నాయని టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వరుసగా ఇలాగే జరుగుతుండటంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరిపై నిఘా పెంచిన టాస్క్ఫోర్స్ పోలీసులు జహంగీర్కు చెందిన కంప్యూటర్ను సైబర్ నైపుణ్యం కలిగిన పోలీసులతో తనిఖీ చేయించారు. ఈ కంప్యూటర్ను ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్లు గుర్తించేందుకు వీలు లేకుండా ప్రాక్సీ ఐపీలతో వాడుతున్నట్లు గుర్తించారు. మరోపక్క అనేక పాస్పోర్ట్ ఆన్లైన్ దరఖాస్తులు ఫార్వర్డ్ చేయకుండా ఫిల్ చేసి సిద్ధంగా ఉంచడాన్ని కూడా గుర్తించారు. దీంతో జహంగీర్ను అదుపులోకి తీసుకుని విచారించారు.పాస్పోర్ట్ దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా నరసరావుపేటకు చెందిన సుభానీకి పంపుతున్నట్లు జహంగీర్ చెప్పడంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం సుభానీని విచారించగా, లతాధర్రావు సహాయంతో చేస్తున్న పనిని బయటపెట్టాడు. లతాధర్రావును అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు విచారించగా ఆన్లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్పోర్ట్ వెబ్సైట్కు చెందిన సోర్స్ కోడ్ను హ్యాక్ చేయడం ద్వారా స్లాట్స్ బ్లాక్ చేసి, వాటిని తమ ఏజెంట్ల ద్వారా ఫిల్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు లతాధర్రావు, సుభానీ, జహంగీర్లతో సహా ఏడుగురు నిందితులకు 2010 జూన్ 4న అరెస్టు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడిన పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు వెబ్సైట్లో లోపాలు లేకుండా సరిచేసి పకడ్బందీగా తయారు చేశారు.· -
ఈ వారం కథ: ఓ కాయ కాస్తోంది!
‘తుంటిమీద కొడితే మూతి పళ్ళు రాల్తాయా?’ అని ఎవరైనా అడిగితే, ఇదివరకైతే అందరిలాగే ‘‘అలా ఎలా రాలతాయండీ’’ అంటూ దబాయించేసేది ముద్రిక. ఇప్పుడడిగితే, అనుమానంగా చూసి, ‘రాలినా రాలవచ్చు’ అంటోంది! అనుభవం అలాగుంది మరి!కాకపోతే, పుట్టింట్లో ఆమె అక్క పురుడు జరిగితే, అదే సమయంలో మెట్టినిల్లు పీలికల పందిరి అయిపోవటం ఏమిటి?అదేమని ఎవర్ని అడగటానికి ఏముందీ, వాళ్ళాయన నిర్వాకమే అలా ఉన్నప్పుడు?తల పట్టుకు కూర్చుంది ముద్రిక, తన విభుడితో తలపడేదెలాగో, తగవు తెగేదెలాగో తోచక!‘‘నాకు ఆరోగ్యం బాగుండటంలేదే. ఓ రోజు లేస్తే, రెండు రోజులు పడకేస్తున్నాను. ఇటు మీ అక్కనేమో డెలివరీ అయ్యేదాకా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు. చిన్నవాళ్ళు, మిమ్మల్ని విడదీయటం భావ్యం కాదు గాని, తప్పటం లేదు. అల్లుడుగారు ఒప్పుకుంటే, ఈ నాలుగు నెలలూ ఇక్కడికి వచ్చి, అక్క ఓ పాపని ఎత్తుకునే దాకా సాయం చేయగలవా?’’ అని నాలుగు నెలల క్రితం అడిగింది ముద్రిక తల్లి.ముద్రికకి అక్క అంటే చాలా ప్రేమ. పసివయసు నుంచి ఒక్క క్షణం విడిచి ఉండేవాళ్లు కాదు. అక్కకు పెళ్ళై, వెళ్లిపోతున్నప్పుడు ఇద్దరూ గుండెలవిసేలా ఏడ్చారు.‘‘మూడేళ్ల నుంచి, పిల్లలు కలగటంలేదని చింతలో మునిగిపోయిన అక్కకి, ఇన్నాళ్ళకి శుభ ఘడియలు వస్తుంటే, సాయం చేయకుండా ఎలా ఉంటాను? మనం కాస్త ఇబ్బంది పడదాం సుబ్బూ!’’ అంది బెంగ పడుతున్న భర్తతో.శుభప్రదమైన కార్యం కోసం వెళ్తున్నాననుకుంది గానీ, ఉపద్రవం ముంచుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.విధి విధానం అదే కదా!ఈ నాలుగూ నెలలలోనూ, రెండుసార్లు వచ్చివెళ్ళాడు సుబ్బారావు. వచ్చిన ప్రతిసారీ ఒక్క రోజు మాత్రమే ఉండి వెళ్ళాడు. ఇంకొక్క రోజయినా ఉండమని బ్రతిమాలినా, ‘అమ్మో– నీళ్ళు–నీళ్ళు’ అంటూ కాళ్ళు చెప్పుల్లో దూర్చుకుని పారిపోయేవాడు.‘‘ఎలా ఉంటున్నావ్ సుబ్బూ’’ అని శయ్యా గృహంలో గుండెల మీద తలపెట్టుకుని ముద్రిక బెంగగా అడిగితే, ‘తలపెట్టుకున్న కార్యంలో తల మునకలవుతున్నానని’ చెప్పేవాడు. ఆ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నంచేసే తీరికలేక, దొరికిన ఆ కాస్త సమయాన్నీ సద్వినియోగం చేసుకునే కార్యంలో మునిగిపోయేది ముద్రిక.కార్య నిర్వహణానంతరం, నిద్రలో కూరుకుపోయి ఏవేవో కలవరించేవాడు సుబ్రావు.‘అదిగదిగో చిగురింత’ అనేవాడు.‘బుజ్జిముండలు లుకలుకలాడుతున్నాయి’ అని నిద్రలోనే నవ్వుకునేవాడు.‘అంత బావుందా పానీయం? లొట్టలు వేస్తున్నారు?’ అనేవాడు.సగం సగం వినబడే ఈ కొత్తరకం పలవరింతలు అర్థమయ్యేవి కావు ముద్రికకి. ఆమె సీరియస్గా తీసుకోలేదు.కష్టకాలం ముంచుకొస్తుంటే, ఇష్ట సఖుడి మాటలైనా సరే, అర్థంకావు కదా!అక్కకి పండంటి కొడుకు పుట్టాక, ఘనంగా జరిగిన బాలసారెకి వచ్చిన మొగుడితో కలిసి వెనక్కు బయల్దేరింది ముద్రిక. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఏదో తేడా కొట్టింది. కిచెన్లోకి వెడుతూనే స్పష్టంగా తెలిసింది.కిచెన్ కమ్ డైనింగ్ రూమ్ సగానికి సగం కుంచించుకుపోయి దర్శనమిచ్చింది. ఆనుకుని ఉండే బాల్కనీ ‘సుబ్బ’రంగా రెట్టింపయి కనిపించింది. పెరిగిన బాల్కనీలో కాలు పెట్టే చోటు కూడా లేకుండా చిన్నవీ, పెద్దవీ మట్టికుండీలు!‘‘ఏమిటిది సుబ్బూ, ఏమిటిదంతా?’’ అయోమయంగా అడిగింది.‘‘కనిపిస్తోందిగా, కిచెన్ గోడ ఇవతలికి జరిపించి, బాల్కనీ వైశాల్యం పెంచేశాను. ఆరోగ్య మహాభాగ్యానికై పెరటి కూరల పెంపకం.’’‘‘ఇదేమిటీ కొత్త వెర్రి?’’ కోపంగా అడిగింది.‘‘నువ్వు వెళ్ళాక, నా మానాన నేను మాడిపోయిన వంట తింటున్నానా, అది చూసి జాలిపడ్డ మా కొలీగ్ మిరియాల్రావ్ నన్ను ఓ ఆదివారం లంచ్కి పిలిచాడు. భోజనంలో వాళ్ళావిడ వడ్డించిన కూరలు నా జిహ్వను గిచ్చి లేపాయి. గుత్తి వంకాయలు నోట్లో కరిగిపోయాయి. కూరలోని బెండకాయలు అంత వేపినా, ‘తగ్గేదిలే’ అంటూ ఆకుపచ్చగా నవనవలాడుతూనే ఉన్నాయి. మడిలోంచి నేరుగా పులుసులో పడితే, కొత్తిమీర ఘుమ ఘుమ అంతగా పెరిగిపోతుందని అవాళే తెలిసొచ్చింది.‘చెల్లెమ్మ వంట అదుర్స్’ అన్నాను తిని లేస్తూ.‘నాదేముంది అన్నయ్యగారూ, రుచి అంతా కూరగాయల్లోనే ఉంది’ అంది చెల్లెమ్మ చిరుగర్వానికి, వినయం చొక్కా తగిలిస్తూ. అప్పుడు తీసుకెళ్ళి చూపించాడు మిరియాల్రావ్ – పెరటి తోట వైభవం. వంగ, బెండ మొక్కలు, దొండ, బీర పాదులు! ఇంకా ఆకుకూరలు– మైక్రో గ్రీ¯Œ ్స అనబడే బుల్లి మొలకలు– ఆహా... అలాగే కోసుకుని, నోట్లో వేసుకోవాలనిపించింది! ఇలా మొత్తం లిస్టు చదివితే, కూరగాయల బండి వాడి కేక గుర్తుకు వస్తుంది నీకు. అపుడు అర్థమయింది నాకు, నా వంట ఎందుకలా అఘోరిస్తోందో! నేరం నాది కాదు – కూరలది! బజార్లో దొరికే కూరల్లో రుచి ఉండట్లేదు, పురుగులు, పుచ్చులు తప్ప. ఆకు కూరలు కొంటే వాటినిండా మచ్చలు, చిల్లులు. మిరియాల్రావ్ ఒక్క పూటే భోజనం పెట్టినా, జీవితకాల భోజనానికి తగ్గ హితబోధ చేసిపారేశాడు.‘శ్రీమతి పుట్టింటికి వెళ్ళినా, ఏ సుబ్బయ్యనీ ఆశ్రయించలేదు నువ్వు. సుబ్బరంగా వొండుకు తింటూ ‘సుబ్బ’రావనే పేరుని సార్థకం చేసుకున్నావు. అంటే, నీకు ఆరోగ్య స్పృహ నిండుగా ఉందన్నమాట. ఇంత స్పృహ ఉన్న నువ్వు ఇక రెండో స్టెప్పు తీసుకోవాలి. బయటి వంటలకే కాదు, బయటి కూరగాయలకి కూడా నీ కిచెన్లో ప్రవేశించే అవకాశం లేకుండా చేయాలి. అప్పుడే, నీ ఆరోగ్యం వంద సంవత్సరాల పాటు వర్ధిల్లుతుంది. పెరటి తోట కోసం పడే శ్రమ, మానసికంగా కూడా ఉల్లాసం ఇస్తుంది. మెంటల్ హెల్త్ అన్నమాట. ఇన్ని లాభాలూ అతి తక్కువ ఖర్చుతోనే! పనికిరావని పారేసే వ్యర్థాలు, మనం మెలకువగా పట్టుకుంటే, పని తీరు ప్రదర్శిస్తాయి! అమలు చేయి నేడు, అనుభవించి చూడు.’మిరియాల్రావ్ సలహాకి పడిపోయాను. మనకి పెరడు లేదు గనుక, బాల్కనీని డిసైడ్ చేసేశాను.ఒంటి రాతి పార్టిషన్ గోడ పడగొట్టి ఇవతలికి జరపటానికి, నాలుగు రోజులు కూడా పట్టలేదు. వెంటనే కుండీలు, మొక్కలు, విత్తనాలు సమస్తం సమకూర్చేశాను – మన వంటింటి తోట రెడీ!’చెప్పటం ఆపాడు సుబ్రావు. ముద్రిక పరిశీలనగా చూసింది. కుండీలన్నిటిలోనూ ఏవేవో మొక్కలు. కొన్ని ఎండిపోతూ, కొన్ని వంగిపోయీ!.‘‘ఇదేమిటీ? ఏ మొక్కకీ పిందెలన్నా లేవు?’’పగలబడి నవ్వాడు సుబ్రావు.‘‘వెనకటికి ఓ అమ్మాయి అశ్వత్థ ప్రదక్షిణం చేస్తూ, అడుగడుక్కీ కడుపు తడిమి చూసుకుందట! అలా ఉందినీ హడావిడి. కాస్తాయ్, కాస్తాయ్. తొందర పడితే అవుతాయా పనులు. ఎంతటి మహర్షి అయినా, తపస్సులో కూర్చోగానే వరం పొందలేడు. పుట్టలు కట్టాలి– జడలు పెరగాలి– ఎన్ని సినిమాలలో చూళ్ళేదూ?’’అతడి ధోరణి సాగిపోతూనే ఉంది.‘‘మొక్కలన్నాక తెగుళ్ళుంటాయ్. పోషణ చూసుకోవాలి. పిచ్చి మొహాలు– ఒక్క పూట నీరు పెట్టకపోతే, దిగాలు పడి చూస్తాయ్. వేళ్ళ కింది నేల గట్టిపడిపోతే, లోపలికి పాకలేక విలవిల్లాడిపోతాయి. పురుగులు పట్టుకుంటే, గిలగిల్లాడతాయి. ఎన్ని ఉంటాయి వాటికి బాధలు! అన్నీ మనమే చూసుకోవాలి.’’అతడిని అతడి ధోరణికి వదిలి లోపలికి వెళ్ళిపోయింది ముద్రిక.మర్నాడు తెల్లవారకముందే గుప్పున వస్తున్న దుర్వాసనకి మెలకువొచ్చిన ముద్రికకి.ప్రక్కనే ఉండే సుబ్రావ్ కనిపించలేదు. ముక్కుకి చున్నీ అడ్డంపెట్టుకుని వాసన వస్తున్నవైపు నడిచింది.అది బాల్కనీలోకి దారితీసింది. అక్కడ సుబ్రావు మూతికి, ముక్కుకీ కలిపి ఓ గుడ్డ చుట్టుకుని, రెండు లీటర్ల ప్లాస్టిక్ సీసాలోంచి, సదరు దుర్వాసనకి హక్కుదారు అయిన నల్లటి ద్రావకం బయటకు తీస్తున్నాడు.‘‘యాక్. ఏమిటిదీ?’’ అనడిగింది ముఖం వికారంగా పెట్టిన ముద్రిక.‘‘అయ్యో, అలా అసయ్యించుకోకూడదు. ఇదేం పరాయి పదార్థం కాదు. మన పళ్ల తొక్కులు, కూరగాయల తొక్కులు, మిగిలిపోయిన కూరముక్కలు, మనం పూజ చేసి తీసేసిన పూలు... వీటన్నిటిని ఇలా ఓ రెండువారాలు ఈ బాటిల్లో బంధించి ఉంచితే, మన మొక్కలకి ప్రియాతి ప్రియమైన పానీయం తయారవుతుంది. అదే ఇది. ఇవిగివిగో చూశావా, ఈ బాటిల్లో... లుకలుకలాడుతున్నాయి బుజ్జి ముండలు... ఇవి రైతు నేస్తం పురుగులు. ఇవి వొచ్చేశాయంటే, ఇంక మన ద్రావకం ముదిరినట్టే. నేలలోకి చొచ్చుకుపోయి, గుల్లబారుస్తూ, మొక్కల వేళ్ళకి దారి చేస్తాయి ఇవి. ఒక లీటరు నీళ్ళలో వంద గ్రాముల పానీయాన్ని గనక కలిపి, మొక్కలకి తాగించామంటే ...’’ముక్కుతో పాటు చెవులు కూడా మూసుకుని లోపలికి పరుగెత్తింది ముద్రిక. తల తిప్పుకుని, తన పనిలో పడిపోయాడు సుబ్రావు.మర్నాడు మధ్యాహ్నం కునుకు తీస్తున్న ముద్రికని బెల్లు కొట్టి లేపాడు అమెజాన్ వీరుడు.‘ఏం తెప్పించాడబ్బా ఈ మహానుభావుడు?’ అనుకుంటూ వెళ్లి సుబ్రావు పేరుమీదున్న పార్సిల్ అందుకుంది.తొమ్మిదొందల డెబ్భై రూపాయలు వసూలు చేసుకుపోయాడు వాడు. తెరిచి చూసిన ముద్రిక తెల్లబోయింది.పాకెట్లో వేపాకులు!‘వేపాకులు అమెజాన్ నుంచి? ఏం చేసుకుంటారు? ఇవీ మొక్కలకేనా?’‘‘అవును. వీటిని మిక్సీలో గ్రైండ్ చేసి, వేపాకు ముద్ద నీళ్ళలో కలిపి, ఒక రాత్రి నిద్ర చేయిస్తే, మహత్తరమైన పురుగుల మందు తయారవుతుంది. నిద్ర చేసిన వేపరసాన్ని వడగట్టి, ఆ పసరు నిలవ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి వంద గ్రాముల వేప పసరు ఒక లీటరు నీళ్ళలో కలిపి...’’సాయంత్రం రాగానే, ప్యాకెట్ విషయం చెప్పిన అర్ధాంగికి వివరించబోయిన సుబ్రావు ముద్రిక సగంలోనే నిష్క్రమించిన వైనం గమనించి నిట్టూర్చాడు –‘దీనికి మొక్కలమీద ఎప్పటికి ప్రేమ ఏర్పడేనో... ఏమో..’నాలుగు రోజుల తరవాత పొద్దునే వచ్చింది రావమ్మ ,‘‘తెచ్చావా రావమ్మా’’ అన్నాడు సుబ్రావు తలుపు తీసి.‘‘ఆయ్...’’ అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిలో తెచ్చిన ఆవుపేడ అందించింది రావమ్మ. మరో బాటిల్ విడిగా ఇస్తూ, ‘‘మూత్రవండి’’ అంది.బెడ్రూమ్లోంచి వచ్చిన ముద్రికకి చెప్పాడు సుబ్రావ్,‘‘ఏం లేదు. తాజా గోమయం, గోమూత్రం తెప్పించాను. ఈ రెండింటినీ కలిపి తొట్టెలో పోసి, ఆరారగా కర్రతో కలియతిప్పుతూ మూడు నిద్రలు చేయిస్తే, భేషయిన ఫెర్టిలైజర్ తయారౌతుంది. దాన్ని నాలుగింతల నీటిలో కలిపి....’’‘‘మనమేమైనా ఓ ఎకరం పొలం కొంటున్నామా? ఎందుకింత హడావిడి? ఒక్క మొక్క అయినా పైకి వచ్చి, కాయ కాయలేదు.’’‘‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు పెద్దలు. పెరటి తోటే కదా అని అశ్రద్ధ చేస్తే, ఫలసాయమూ అలాగే ఉంటుంది. శ్రద్ధ తీసుకోవటానికి ఎకరాలే అక్కర్లేదు. శ్రద్ధగా పెంచాలన్న మనసుంటే చాలు.’’‘‘కావచ్చు. కానీ, మన టూ బెడ్ రూమ్ ఫ్లాట్లో ఎరువుల తయారీ పెడితే, ఫ్లాటంతా కంపు కొడుతోంది కదా!’’అనునయంగా చెప్పాలని చూసింది.‘‘చూడు ముద్రీ, మన రైతన్నలు ఇలాగే కంపుకి జడిసి, దూరంగా ఉంటే, మన నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళేవా? మనం ఈ మాత్రమైనా చేసి, వారి బాట మనకి పూబాట అని చాటనవసరం లేదా?’’భర్త అంత హెవీ డైలాగులు చెప్తుంటే, భరించలేక సీన్లోంచి నిష్క్రమించింది ముద్రిక.అంతటితో ఆగలేదు. ఆ ఆదివారం పెద్ద దుకాణమే పెట్టుక్కూర్చున్నాడు సుబ్రావ్.ముద్రిక కన్నా ముందే కిచెన్లోకి దూరాడు. అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు కలిపి, నీళ్ళు పోస్తూ మిక్సీలో మెత్తగా రుబ్బాడు. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బాటిల్లో నింపి, 3ఎ సొల్యూషన్ అని రాసి పెట్టుకున్నాడు.ఆ ఘాటుకి కళ్ళు మండి, ముక్కులోంచి, చెవులలోంచి పొగలు వచ్చి, ఫ్రేమ్లోంచి పారిపోయింది ముద్రిక.తరవాత ఒక గిన్నెలో ముందే సిద్ధంగా ఉంచుకున్న అరటికాయ, పండు తొక్కల్ని, ఉల్లి పొట్టుని వేసి, నీళ్ళు పోసి, అరగంట సేపు బాగా ఉడకబెట్టాడు.మధ్యలో వచ్చింది ముద్రిక, ‘‘ ఏమిటి సుబ్బూ, ఇవేళ బ్రేక్ఫాస్ట్ నువ్వే తయారు చేస్తున్నావా?’’‘‘బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్. మనక్కాదు, మొక్కలకి. ఇవేళ్టికి కాదు, పై వారానికి.’’ సీరియస్గా చెప్పాడు సుబ్రావ్, తల తిప్పకుండా.తల కొట్టుకు వెళ్లిపోయింది ముద్రిక, స్విగ్గీకి ఫలహారాల ఆర్డరు పెట్టటానికి.అదేం పట్టించుకోకుండా, మరిగిన నీళ్ళని వడగట్టి మరో బాటిల్లో నింపాడు. ఉత్సాహంగా హాల్లోకి వచ్చి చెప్పాడు,‘‘మొక్కలకి ఊరగాయలు రెడీ! ఈ ద్రావకాలు ఏటికేడాదీ నిలవ వుంటాయి. రెండు వారాల కొకసారి లీటరు నీళ్ళలో వంద గ్రాముల ద్రావకం కలిపి, మొక్కలకి పోశామనుకో, లొట్టలేసుకుంటూ తాగుతాయి. దిట్టంగా పెరుగుతాయి.’’జవాబు చెప్పలేదు ముద్రిక – ఆ తరవాత కూడా, చాలా రోజుల దాకా! సుబ్రావు కిచెన్ తోట పెంపకం సాగుతూనే ఉంది – కిచెన్లోంచి రకరకాల పోషకాలు వెళ్తూనే ఉన్నాయి. ఇంకా తోటలోంచి వంటలోకి దిగుబడులు మాత్రం మొదలు కాలేదు, ఎప్పుడన్నా ఓ కొత్తిమీర ఆకు, నాలుగు మెంతి ఆకులు తప్ప. ఒక వంగ చెట్టు తాడెత్తున పెరిగింది గాని, అది పోతు మొక్క అన్నారు. దానికి విగ్రహపుష్టి తప్ప, ఒక్క పువ్వు కూడా పూయలేదు, ఒక్క కొమ్మక్కూడా కడుపు పండలేదు! బెండ మొక్కలు పెరిగాయి గానీ, వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే, పురుగులు ఎగరేసుకు పోయాయి – ముక్కలు గిల్లుకుంటూ. వేసిన సేంద్రియ ఎరువులు ఎటు పోయాయో తెలియదు.‘ఇలా కాదు – ఇలా కాదు’ అనుకున్నాడు సుబ్రావు, ‘ఇంకా ఏదో చేయాలి’ అని గొణుక్కున్నాడు.‘ఏదో చేయాలి’ అన్న విషయంతో ముద్రిక కూడా ఏకీభవించింది.‘పెరటి తోట పెంపకం– హరిత విప్లవం– పర్యావరణ పరిరక్షణ – ఆలోచనలన్నీ మంచివే. అయితే, వంద అడుగుల చదరంలో వెయ్యి మొక్కలు పెంచటం, లీటర్ల కొద్దీ ద్రావకాలు పొయ్యటం, ఉన్న రెండు గదుల్లోనూ కంపు కొట్టే సంచులు నింపటం... మొక్కలతో పాటు మన ఆరోగ్యం కూడా కాస్త చూసుకోవాలి కదా! కన్ను సైజుని బట్టే కదా కాటుక పెట్టుకోవాలి!’ అనుకుంది.‘తిన్నంత తేలిక కాదు కూరలు వండటం – కొన్నంత తేలిక కాదు వాటిని పెంచడం’ అన్న విషయం ఇతగాడికి ఎలా తెలియచెప్పాలబ్బా?’ఏం చేయాలో ఓ క్లారిటీ వచ్చేసరికి, కాలమూ కలిసొచ్చింది – బహు విధాలా!వారం రోజుల కోసం హెడ్డాఫీసుకి టూరు వెళ్ళిన సుబ్రావు తిరిగి వచ్చేసరికి సీను మారిపోయింది.బాల్కనీలో ఒక్క కుండీ లేదు. అంతా చదునుగా విశాలంగా ఉంది. మట్టి కొట్టుకు మాసిపోయిన పాలరాతి పలకలు బయటపడి మెరుస్తూ కనుపించాయి.‘‘మై గాడ్! నా కుండీలు, నా మొక్కలు...’’ అంటూ చిందులు తొక్కబోయాడు సుబ్రావు.గోముగా అతడి భుజంమీద తలపెట్టి, తలపెట్టిన పథకం చెప్పేసింది ముద్రిక.‘‘ఇదీ ఆరోగ్య ప్రణాళికే సుబ్బూ! రేపు వచ్చే బుల్లి సుబ్బారావు ఈ బాల్కనీలోనే పాకుతూ పెరగాలి. ఈ మట్టిలోనూ, కుండీల మధ్య ఎలా.. అందుకే నేను వీటిని తీయించేసి, బాల్కనీ కడిగించేశాను.’’ఒక్క క్షణం ఒళ్ళు మండిపోయింది– ఆనక ఆమె మాటలు స్లో మోషన్లో బుర్రలోకి చొరబడ్డాయి. కొండలమాటు చంద్రబింబంలా సుబ్రావు ముఖం మీదికి నెమ్మది నెమ్మదిగా విస్మయంతో కూడిన చిరునవ్వు ఎక్కి వచ్చింది.‘‘అహ్హో .. ఒహ్హో .. అంటే... మనకో బుల్లి సుబ్రావు...’’‘‘మరో ఏడు నెలల్లో...’’ జవాబు చెప్తూ గబుక్కున సిగ్గుపడి, సుబ్రావు ఎదనే ముఖానికి కప్పేసుకుంది ముద్రిక. సుబ్రావు ఉత్తేజితుడైపోయాడు– ‘ఓ కాయ కాస్తోంది!’ఒక వంగ చెట్టు తాడెత్తున పెరిగింది గాని, అది పోతు మొక్క అన్నారు. దానికి విగ్రహ పుష్టి తప్ప, ఒక్క పువ్వు కూడా పూయలేదు, ఒక్క కొమ్మక్కూడా కడుపు పండలేదు! బెండ మొక్కలు పెరిగాయి గానీ, వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే, పురుగులు ఎగరేసుకు పోయాయి.నాదేముంది అన్నయ్యగారూ, రుచి అంతా కూరగాయల్లోనే ఉంది’ అంది చెల్లెమ్మ చిరుగర్వానికి, వినయం చొక్కా తగిలిస్తూ. అప్పుడు తీసుకెళ్ళి చూపించాడు మిరియాల్రావ్ – పెరటి తోట వైభవం. -
జపానీ జిందగీ
మనిషై పుట్టాక ఊహించని ఉత్పాతాలు, ఉలిదెబ్బలు, ఉలికిపాటులు తప్పవు! అందుకే ‘మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి సుఖము లేదంతే’ అన్నారు ఆత్రేయ! అయితే ‘మనసు ఉండాలే కాని, సుఖశాంతులను మనంతట మనమే సొంతం చేసుకోవచ్చు’ అంటున్నారు జపనీయులు.‘మదిలో ఎంత అనురాగం నిండితే అంత వైరాగ్యం’ ఇది మనిషిని స్థిరచిత్తుడిగా మార్చగలిగే గొప్ప మంత్రం! కానీ రాగద్వేషాల నియంత్రణలో ఓటమి లేని కథలు చాలా అరుదు! కాలంతో పరుగులు తీయడం, కాలం రాయని రాతల కోసం తహతహలాడటం, గడచిపోయిన గతాన్ని పదేపదే విశ్లేషించుకోవడం, మిగిలి ఉన్న వయసుని లెక్కలేసుకోవడం ఇవే, ఇవే మనిషికి తీరని వేదనలు. వాటికి తోడు మరణ భయం! ఆ భయం ఊహ తెలిసినప్పటి నుంచి వేధించే మనోగతం! అదెప్పటికీ తప్పని, తప్పించుకోలేని జీవన చక్రం! మనిషిని, మనసునీ అతలాకుతలం చేసే ఆ నిర్వేదం నుంచి బయటపడటానికే ఇప్పుడు ప్రపంచమంతా జపనీయుల వైపు చూస్తోంది. వారు అవలంబించే కొన్ని జీవన విధానాలు మనసుని కుదుటపరుస్తాయట. మనిషిని ఆనందకేళిలో విహరింపజేస్తాయట! అసలేంటా జపాన్ సిద్ధాంతాలు? అవి అంత గొప్పవా?సంతృప్తికరమైన జీవితాన్ని పొందడానికి జపాన్ లో చాలా సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రస్తుతం ప్రపంచవాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇంచుమించు ఒకేలాంటి భావాలతో, లోతైన అర్థాలతో రూపొందిన వారి జీవిన విధానం గొప్ప తాత్వికతకు నిదర్శనం! వాటిలో కొన్ని, శతాబ్దాల నాటి సంస్కృతిలో ముడిపడినవి కాగా, మరికొన్ని ఆధునిక జీవనశైలితో తలపడేవి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆ జీవన విధానాలు వేస్తున్న బాటలేంటీ?జీవితంలో అహ్లాదాన్ని నింపుకోవడానికి జపనీస్ తత్త్వశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే.. ముందుగా అక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన ‘ఇకిగాయ్’ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఇకిగాయ్లో ‘ఇకి’ అంటే జీవితం, ‘గాయ్’ అంటే విలువ లేదా ప్రయోజనం. ఇది జీవితానికి ఒక కారణాన్ని, ఉద్దేశ్యాన్ని ముందుగానే నిర్ధేశించుకోమని చెబుతుంది. రోజు మొదలయ్యేందుకు ఒక కారణాన్ని ఏర్పరచుకుని ప్రయాణించడం ఉత్తమమని బోధిస్తుంది. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. ఆ నాలుగింటినీ ఒకదానితో ఒకటి మిళితం చేసుకోగలిగినప్పుడు మనం ఇకిగాయ్ అనే లక్ష్యాన్ని సాధించినట్లే. అందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నాలుగు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.‘మీరు దేనిని ప్రేమిస్తారు?’ అనేది మొదటి ప్రశ్న. దానికి అనుబంధంగా మీ అభిరుచులు, హాబీలు, ఏ పని చేసినప్పుడు మీరు సమయం గురించి మర్చిపోగలరు? సంతోషంగా ఉండగలరు? అనే అంశాలన్నీ ఆ ప్రశ్నతో పాటే ఉద్భవిస్తాయి. ‘మీ నుంచి ప్రపంచానికి ఏం అవసరం?’ అనేది రెండవ ప్రశ్న. దానిలో భాగంగా ‘మీ చుట్టూ ఉన్న సమాజానికి లేదా ప్రపంచానికి మీరు ఎలా సహాయపడగలరు? ఏ సమస్యలను పరిష్కరించగలరు? సమాజంలో దేన్ని సరిచేయగలరు?’ అనే అంశాలు తోడవుతాయి. ‘మీరు దేనిలో సమర్థులు?’ ఇది మూడవ ప్రశ్న. దానికి అనుబంధంగా మీ నైపుణ్యాలు, ప్రతిభ, మీకు సహజంగా వచ్చే పనులు అన్నీ లెక్కలోకి వస్తాయి.‘దేని నుంచి మీరు డబ్బు పొందగలరు? లేదా సంపాదించుకోగలరు’ ఇది నాలుగవ ప్రశ్న. ఈ ప్రశ్నతో ఇకిగాయ్ సంపూర్ణమవుతుంది. దీనిలో మీ నైపుణ్యాలు, ప్రతిభలను ఉపయోగించి మీరు జీవనోపాధిని ఎలా పొందగలరు?’ అనేది నిర్థారించుకోవచ్చు. ‘ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు దొరికి, ఒకదానితో ఒకటి కలిసే చోట, మీ ఇకిగాయ్ ఏర్పడుతుందని జపనీస్ సంస్కృతి చెబుతుంది.జపాన్ లో, ముఖ్యంగా ఒకినావా వంటి ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు నూరేళ్లకు పైగా, సంతోషంగా జీవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇకిగాయ్ అని అక్కడి వారు చెబుతున్నారు. తమ జీవితానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండటం వల్లే, వారు రోజూ ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారట.మా అనేది రెండు వస్తువుల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని లేదా రెండు సంఘటనల మధ్య ఉన్న విరామాన్ని సూచిస్తుంది. ఆ ఖాళీకి కూడా విలువ ఉంటుందని, ఇది కేవలం శూన్యం కాదని జపనీయులు నమ్ముతారు. సంగీతంలో రెండు స్వరాల మధ్య ఉండే నిశ్శబ్దం, మాటల మధ్య ఏర్పడే చిన్నపాటి విరామం.. ఇవన్నీ ఇందుకు ఉదాహరణలుగా ఈ సిద్ధాంతం చెబుతుంది. మా అనేది ఆలోచించడానికి, ప్రతిబింబించడానికి, అర్థాన్ని కనుగొనడానికి కొంత శూన్యాన్ని సృష్టిస్తుంది. ఆ శూన్యమే మనసుని తేలిక పరుస్తుందని ఈ సిద్ధాంత సారాంశం. జీవితంలో తొందరపడకుండా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించమని చెప్పడమే మా ఉద్దేశం.నూరేళ్ల జీవనంప్రపంచ ఆరోగ్య లెక్కల ప్రకారం భారతీయుల సగటు ఆయుర్ధాయం 69 నుంచి 70 సంవత్సరాలు. 80 నుంచి 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తున్న వారి దేశాల జాబితాలో జపాన్ ముందువరసలో ఉంది! అయితే మలిదశలో కూడా జపనీయులు చాలా సంతోషంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారట! అందుకు వారి జీవన విధానమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.జపనీయులు ఎల్లప్పుడూ బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ని పాటిస్తారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు ఆరోగ్య సంస్థలు పనిచేస్తుంటాయి. అవి ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి.చాలామంది జపనీయులు ఎంత రుచికరమైన ఆహారాన్ని తింటున్నా 80 శాతం కడుపు నిండాక ఆపేస్తారు. అలా చేస్తే దీర్ఘాయువు కలిగి ఉంటామని అక్కడి ప్రజలు నమ్ముతారు.జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఒల్డ్ ఏజ్ హోమ్లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం వారి సంప్రదాయంగా భావిస్తారు. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని, పెద్దలతో కలిసి జీవనం సాగిస్తే భవిష్యత్తుకి ఉపయోగకరమని అక్కడి వారు నమ్ముతారు.నిజానికి జపనీయులు అధిక పరిశుభ్రతను పాటిస్తారు. అక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యానవనాలు, రోడ్లు, పబ్లిక్ ప్రదేశాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి.జపాన్ ప్రజలు నెమ్మదిగా, నమిలి నమిలి తినే శైలిని ఇష్టపడతారు. ఒకే పెద్ద ప్లేట్లో కాకుండా చిన్నచిన్న ప్లేట్లలో లేదా చిన్నచిన్న బౌల్స్లో ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యమిస్తారు.అక్కడివారు ఎక్కువగా తినే సమయంలో టీవీ చూడటం, సెల్ ఫోన్ వాడటం వంటివి చేయకుండా కుటుంబ సభ్యులంతా కలిసి తింటుంటారు, పైగా చాలామంది డైనింగ్ టేబుల్స్, కుర్చీలు వాడకుండా నేలపై కూర్చుని భోజనం చేయడానికి ఇష్టపడతారు.జపనీస్ ప్రజలు సమతుల ఆహారాన్ని తీసుకుంటారు. పండ్లు, తృణధాన్యాలు, సోయా, ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటారు. వారు తీసుకునే ఆహారాలన్నీ తక్కువ మొత్తంలో కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. దాంతో గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వారు తీసుకునే ఆహారం వల్లే జపాన్ లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని తేలింది.జపాన్లో అన్ని వయసుల వారు నడవడానికే ఇష్టపడతారు. సమీపంలోని ఉన్న గమ్యస్థానాలకు నడిచి వెళ్లిపోతుంటారు. లేదంటే సైకిల్ వాడతారు. అలాగే బాతాఖానీ వేసేటప్పుడు ఎక్కువగా నేలపైనే కూర్చుంటారు. ఈ పద్ధతుల వల్ల పేగులకు, కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. వారి ఆయుర్దాయం పెరగడానికి అవి కూడా దోహదం చేస్తున్నాయి.మొత్తానికి జపనీయులు– సమతుల ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఇతరులకు సహాయం చేయడం, ప్రతి దానిపట్ల కృతజ్ఞతతో ఉండటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమగా కలిసి జీవించడం ఇలా ఎన్నో అంశాలు వారి ఆయుర్దాయాన్ని రెట్టింపు చేస్తున్నాయి.సమస్యల వలయంలో జపాన్ లో జననాల రేటు చాలా తక్కువగా ఉంది, అదే సమయంలో, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల పని చేసేవారి సంఖ్య తగ్గి, సామాజిక భద్రత, ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడుతోంది. 2060 నాటికి జపాన్ జనాభా 8.67 కోట్లకు పడిపోవచ్చని అంచనా!మరోవైపు వివిధ నివేదికల ప్రకారం, జపాన్లో 15 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య సుమారు 13.7 మిలియన్లు ఉండగా.. ఆ దేశప్రజలు పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల సంఖ్య కలిపి 15.9 మిలియన్లకు పైగా ఉంది. జపాన్ సమాజంలో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి పెంపుడు జంతువులను ఆశ్రయిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పక్కన పెడితే, ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తున్న వారి సంఖ్య జపాన్లో ఎక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాలు వారి జీవన విధానంపై దృష్టిపెడుతున్నాయి.యుటోరిఇది జపాన్ లో ఒక విశిష్టమైన భావన. దీనిని తెలుగులో ‘మనసుకి విశ్రాంతినివ్వడం’ లేదా ‘సమయం కేటాయించడం’ అని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలో మనం నిరంతరం పరుగులెత్తుతూ, పనిఒత్తిడిలో మునిగిపోతూ, మనసుకి అవసరమైన విరామాన్ని ఇవ్వాలని ఈ సిద్ధాంతం చెబుతోంది.యుటోరి అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడమే కాదు, ఇది జీవితంలోని ఆనందాన్ని గుర్తించడానికి ఉద్దేశపూర్వకంగా సమయం కేటాయించుకోవడం కూడా! మరి అందుకేం చెయ్యాలి?వేగాన్ని తగ్గించుకోవాలి – ప్రతి పనిని తొందరగా పూర్తి చేయాలనే ఒత్తిడిని పక్కన పెట్టి, నెమ్మదిగా చేయడం అలవరచుకోవాలి.చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించుకోవాలి– మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవితంలోని చిన్న చిన్న అద్భుతాలను గమనించడానికి మనసుకు కాస్త సమయం ఇవ్వాలి. ఉదాహరణకు, ఉదయం సూర్యోదయాన్ని చూడడం, ఒక పూలమొక్కను పరిశీలించడం, పక్షుల కిలకిలరావాలు వినడం ఇవన్నీ మనసుని ఉత్తేజపరుస్తాయి.సహజంగా శ్వాస తీసుకోవాలి– నిజానికి ఉరుకుల పరుగుల జీవనంలో కొన్ని రోజుల పాటు మనం ఊపిరి పీల్చుకునే విధాన్ని కూడా గమనించకుండా గడిపేస్తాం. ఒక్క క్షణం ఆగి ఆ పక్రియను గమనిస్తుండాలి. శ్వాస తీసుకోవడాన్ని గమనిస్తే, మనసుకు ఎనలేని హాయి కలుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం ఈ తరహాకు చెందినవే!మానసిక విరామం పొందాలి– పనికి, ఆలోచనలకు ఒక విరామమిచ్చి, మనసును ఖాళీగా ఉంచడం నేర్చుకోవాలి.వీటన్నింటినీ పాటిస్తూ మన జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రశాంతంగా మార్చుకోవడమే యుటోరీ లక్ష్యం. ఇది మనస్సుకి ప్రశాంతతను అందించి, జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది.మోటైని మోటైని అంటే ‘వృథా చేయవద్దు’ లేదా ‘విలువను గుర్తించు’ అని అర్థం. ఏదైనా వస్తువు, సమయం, శక్తి లేదా వనరులను వృథా చేయకుండా, వాటిని పూర్తిగా వినియోగించుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. సృష్టిలో ప్రతిదానిపైనా కృతజ్ఞత కలిగి ఉండాలని, ప్రతిదానికీ విలువను, గౌరవాన్ని ఇవ్వాలని ఇది చెబుతుంది. ఉదాహరణకు మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా తినడం, పాత వస్తువులను, వస్త్రాలను తిరిగి ఏదో ఒక రూపంలో వినియోగించడం వంటి ఎన్నో విలువలను ఇది నేర్పిస్తుంది.షిన్–రిన్ యోకు ఇది జపనీయుల మానసిక చికిత్సా విధానంలో ఒక పద్ధతి. షిన్–రిన్ యోకు అంటే ‘ప్రకృతిలో లీనం కావడం’ అని అర్థం. ఇది ప్రకృతిలో, ముఖ్యంగా సురక్షితమైన అటవీ ప్రాంతాల్లో గడిపే ఒకరకమైన వైద్య విధానం. ఇది అడవిలోని ప్రశాంతతను, శబ్దాలను, సువాసనలను, దృశ్యాలను మనసారా పంచుకోమని చెబుతుంది. చెట్ల సువాసనలను పీల్చడం, పక్షుల కిలకిలరావాలు వినడం, ప్రకృతి అందాలను తాకడం, ప్రకృతితో మమేకం కావడం ఇలా ప్రతి అనుభూతిని మన పంచేంద్రియాలతో పూర్తిగా ఆస్వాదించడమే దీని ముఖ్య ఉద్దేశం. అడవుల్లోని ప్రశాంత వాతావరణం, మొక్కల నుంచి వెలువడే కొన్ని రకాల సుగంధాలు ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. ప్రకృతిలో గడిపినప్పుడు మనసు తేలికపడి, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ఆధునిక జీవితంలో ఏర్పడే ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడటానికి ఒక సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.వాబీ– సాబీ అసంపూర్ణతలోనూ అందం ఉంటుందని చెప్పే గొప్ప తాత్త్వికత ఇది. ప్రతి వస్తువు, ప్రతి మనిషి అసంపూర్ణమేనని చెప్పడంతో పాటు, అందులో కూడా ఒక ప్రత్యేకమైన సౌందర్యం ఉందని, దాన్ని చూడటం నేర్చుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. నిజానికి దీని ప్రకారం పరిపూర్ణత అనేది ఒక భ్రమ. ఉదాహరణకు పాతబడిన చెక్క బల్లలోనూ, పగిలిన కప్పులోనూ అందాన్ని వెతకగలిగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలమట. ‘కాలంతో పాటు వచ్చే మార్పులు, పగుళ్లు, లోపాలు, ముడతలు ఇవన్నీ చాలా కథలను చెబుతాయి. వినగలిగితే అవెంతో అద్భుతంగా ఉంటాయి’ అని చెబుతుంది ఈ సిద్ధాంతం. దీని ప్రకారం, లోపాలను లోపాలుగా చూడకుండా వాటిని జీవితంలో ఒక భాగంగా స్వీకరించడంతో, జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుందని వివరిస్తుంది. ఈ విధానాన్ని అనుసరిస్తే మనకు జీవితంలోని మార్పులను, వృద్ధాప్యాన్ని కూడా అంగీకరించగలిగేంత ఓర్పు, నేర్పు అలవడుతుంది.షోషిన్ షోషిన్ అనే సిద్ధాంతం ‘ఎంతటి జ్ఞాని అయినా ఎల్లప్పుడూ జిజ్ఞాసతో జీవించాలి’ అని చెబుతుంది. అంటే ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలుసుకున్నా, ‘నాకు అన్నీ తెలుసు’ అని భావించకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. నిత్యం కుతూహలంతో, పూర్వపు ఆలోచనల ప్రభావం మనసుపై లేకుండా ప్రతిదాన్ని స్పష్టంగా చూడమని, తెలుసుకోమని ఈ విధానం ప్రోత్సహిస్తుంది. దాంతో సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే భయం లేకుండా కొత్తకొత్త ప్రయోగాలు చేయగలిగే సత్తా ఏర్పడుతుంది. దాని వల్ల కూడా ఒక సంతృప్తి ఏర్పడుతుంది.నిజానికి ఎంత గొప్ప నియమమైనా, ఎంత గొప్ప విధివిధానమైనా వివరించి, విశ్లేషించి, అనుభవపూర్వకంగా తెలుసుకుని సిద్ధాంతాలుగా మార్చడమే గొప్ప అనుకుంటే పొరబాటు! దాన్ని తు.చ. తప్పకుండా పాటించి, తాము పాటించిన తత్త్వాన్ని తర్వాత తరాలకు అందించడమే అసలైన గొప్పతనం! అదే చేస్తున్నారు జపనీయులు! గమాన్గమాన్ అంటే సహనం లేదా ఆత్మనిగ్రహం అని అర్థం. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా నిశ్చలంగా, గౌరవంగా ఉండమని ఈ భావన సూచిస్తుంది. సమస్యలకు కష్టాలకు నిరాశ చెందకుండా, ఎవరితో చర్చించకుండా, ఫిర్యాదులు చేయకుండా, నిశ్శబ్దంగా పరిస్థితులను ఎదుర్కోమని చెబుతుంది. జపనీస్ సంస్కృతిలో, గమాన్ అనేది ఒక బలమైన లక్షణం. ఇది వ్యక్తిగత కష్టాలను ఎదుర్కోవడానికి, సంఘంలో సామరస్యాన్ని కొనసాగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. -
గిన్నిస్లో గణపయ్య..!
గిన్నిస్లో గణపయ్యవినాయకుడు దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం. పురాతన కాలం నుంచి వినాయకుడి ఆలయాలు పలు దేశాల్లో ఉన్నాయి. గుజ్జు రూపంలో ఉండే బొజ్జ గణపయ్యను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. విలక్షణంగా కనిపించే వినాయకుని విగ్రహాలు జనాలను అమితంగా ఆకట్టుకుంటాయి. వీథుల్లో వెలిసే మండపాల్లో కనిపించేవిగ్రహాల సంగతి సరే సరి, ‘గిన్నిస్’కెక్కిన వినాయకుడి విగ్రహాల గురించి తెలుసుకుందాం.అత్యధిక వినాయక విగ్రహాల సేకరణఅత్యధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను సేకరించిన ముంబై మహిళ రమా షా గిన్నిస్ రికార్డు సాధించారు. ముంబైలోని సాయన్ భగినీ సమాజ్ భవనంలో 2014 నవంబర్14న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె తాను సేకరించిన 18,181 వినాయక విగ్రహాలను ప్రదర్శించారు. వీటిలో రకరకాల పరిణామాలకు చెందినవి ఉన్నాయి. రకరకాల ముడిపదార్థాలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ప్రదర్శనను సందర్శించి, ఆమెకు సర్టిఫికెట్ను బహూకరించారు. ఆ తర్వాత రెండేళ్లకు 2016 ఆగస్టు 23న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె ఏకంగా 1.50 లక్షల వినాయక విగ్రహాలను ప్రదర్శించి, తన రికార్డును తానే బద్దలు కొట్టారు. గిన్నిస్బుక్ ఈ రికార్డును కూడా గుర్తించి, రమా షాకు సర్టిఫికెట్ ఇచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ రికార్డును నమోదు చేసుకుంది. పదకొండేళ్ల వ్యవధిలో ఆమె ఈ విగ్రహాలను సేకరించారు. కళ్లకు గంతలు కట్టుకుని...చిన్ననాటి నుంచి కళలపై మక్కువ ఉన్న రమా షా చిత్ర, శిల్ప కళలలో సాధన చేశారు. తన పదిహేడేళ్ల వయసు నుంచి ఆమె మట్టితో వినాయకుడి విగ్రహాలను స్వయంగా తయారు చేయడం మొదలుపెట్టారు. మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేయడంలో ఆమె సాధన ఎంతటిదంటే, కళ్లు మూసుకుని కూడా సునాయాసంగా విగ్రహాలను తయారు చేయగలరు. కళ్లకు గంతలు కట్టుకుని మరీ వినాయక విగ్రహాల తయారీని ప్రదర్శించి, ముంబై జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పటి వరకు ఆమె 3.78 లక్షల వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేశారు. ఆమె పేరిట ఇప్పటికి ఆరు ప్రపంచ రికార్డులు, పదహారు జాతీయ రికార్డులు ఉన్నాయి.(చదవండి: ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!) -
బాసే రైటు
మీ బాస్ను ఎలా మేనేజ్ చేయాలో మీకు ఎవరూ నేర్పించరు. వారిని మేనేజ్ చేయడానికి, ముందుగా వారు ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీకు ఎం.బి.టి.ఐ. (మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్) సహాయపడవచ్చు. బాస్లు ఎలా పని చేస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, అనే అంశాలపై ఆధారపడి ఈ ఇండికేటర్ బాస్లను కమాండర్, విజనరీ, హార్మనైజర్, స్ట్రాటిజిస్ట్, ఎనలిస్ట్, సపోర్టర్, మ్యావరిక్, ఫ్రీ స్పిరిట్ అనే 8 రకాల వ్యక్తులుగా విభజించింది. ఈ ఎనిమిది మందిలో మీ బాస్ ఏ టైపు మనిషో కింద ఇచ్చిన ఇండికేటర్ ‘కీ’ చెబుతుంది. కనుక ఇండికేటర్ను ఫాలో అయిపోండి. ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అంటారు కనుక బాస్ తత్త్వానికి అనుగుణంగా మీరు మారండి. ప్రశాంతంగా ఉండండి. కెరీర్లో విజయం సాధించండి.కమాండర్లు వీళ్లు ఫలితాలనే నమ్ముతారు. పనిలో వేగాన్ని, స్పష్టతను కోరుకుంటారు. సామర్థ్యం, నాయకత్వం, తర్కం వీళ్లలో ముఖ్యమైనవి. వీళ్లకు సమావేశాలు, డెడ్లైన్లు ముఖ్యం. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా వ్యవహరించే ఉద్యోగులను వీరు అభిమానిస్తారు. ఇలాంటి వారితో పేరాల్లో కాకుండా బుల్లెట్ పాయింట్లలో మాట్లాడాలి. కుంటి సాకులు, భావోద్వేగాలు వీళ్లు నచ్చవు. గడుపులోపే చెప్పిన పని అయిపోవాలి. ఇలాంటి వాళ్ల దగ్గర అస్తవ్యస్తంగా, అనిశ్చితంగా ఉంటే మీ కెరీర్ దెబ్బతిన్నట్లే. విజనరీలు వీరు శక్తిమంతులు. ఐడియాల పుట్టలు. వినూత్న ఆవిష్కరణల్ని ఇష్ట పడతారు. వీరు వర్క్ప్లేస్ని శక్తిమంతంగా మార్చేస్తారు. భవిష్యత్తుపై దృష్టి ఉంటుంది. పని ఎలా జరుగుతోందో చూడరు. ఎంత జరిగిందో అడుగుతారు. వీరిని ఆకట్టుకోవడానికి ఫ్రెష్ ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనల్ని అప్పటికప్పుడు ఆచరణలో పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగి ఆఫీస్కి వచ్చేటప్పుడు, ఆఫీస్ నుండి వెళ్లేటప్పుడు ఆ ప్రయాణంలో సైతం ఆఫీస్ పని చేయవలసి వస్తుంది. రూల్స్ మాట్లాడకూడదు. స్ప్రెడ్షీట్లను కుమ్మరించకూడదు. అంతులేని ఫాలో–అప్లతో వారిని ముంచెత్తకూడదు. ఉద్యోగికి సమయస్ఫూర్తి లేకపోవడం వారిని నిరాశపరుస్తుంది.హార్మౖనైజర్లుఉద్యోగులతో వీరు స్నేహపూర్వకంగా ఉంటారు. అందర్నీ కలుపుకుని పోతారు. సామరస్యాన్ని కోరుకుంటారు. టీమ్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారు. మీ పుట్టినరోజును గుర్తుంచుకుంటారు. లేదా మీ కుటుంబం బాగోగుల గురించి అడుగుతారు. హెల్ప్ చేసేందుకు రెడీగా ఉంటారు. వీరి నాయకత్వం పరస్పర విశ్వాసం, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. వీరితో పనిచేయడానికి కమ్యూనికేటివ్గా ఉండాలి. టీమ్ కల్చర్ నిర్మాణానికి మీ సహకారాన్ని కోరుకుంటారు. ఘర్షణాత్మక ధోరణిని అస్సలు ఇష్టపడరు. టీమ్ ఒకలా ఆలోచిస్తే మీరు టీమ్కు విరుద్ధంగా ఆలోచించటం వీరిలో అసహనం కలిగిస్తుంది. స్ట్రాటెజిస్టులుఆలోచనాత్మకమైనవారు. లక్ష్యాలే ముఖ్యమైన దార్శనికులు. లోతుగా ఆలోచిస్తారు. జాగ్రత్తగా ప్రణాళిక వేస్తారు. స్వేచ్ఛ, వ్యూహాత్మకత విలువైనవిగా భావిస్తారు. నాటకీయతను ఇష్టపడరు. అన్నీ తెలుకుని ఉంటారు. పైకి వ్యక్తపరచరు. నాణ్యమైన పనిని ఆశిస్తారు. వీరి దగ్గర భావోద్వేగ ప్రకోపాలు, నిస్సారపు ఆలోచనలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు ఉద్యోగికి నష్టాన్ని తెస్తాయి. నిర్మాణాత్మక వాదనలు మాత్రమే వీరి దగ్గర చేయాలి.ఎనలిస్టులు కచ్చితమైనవారు, తార్కికంగా ఉంటారు. ప్రతిదీ వివరంగా తెలుసుకుంటారు. స్పష్టత ముఖ్యం. ఆధారాలు అవసరం. మీరు వాగ్దానం చేసిన వాటిని అమలు చేయాలని వీరు ఆశిస్తారు. అరకొర పనులను, నిర్ణయాలలో ఊగిసలాటను ద్వేషిస్తారు. డేటా, నిర్మాణం, దృఢమైన తార్కికతతో వీరికి సహాయకారిగా ఉండండి. నాటకీయత వద్దు. ప్రాక్టికల్గా ఉండండి. భావోద్వేగ విజ్ఞప్తులతో, అస్పష్టమైన నిబద్ధతలతో లేదా ఒక పనిని దాటవేయడం ద్వారా వారిని నిరాశపరచకండి.సపోర్టర్లు నిశ్శబ్దంగా ఉంటారు. నమ్మదగినవారు. సేవా దృక్పథం కలిగినవారు. స్థిరమైన జట్లకు వెన్నెముకగా ఉండాలని కోరుకుంటారు. స్థిరంగా, శ్రద్ధగా, విశ్వాసపాత్రంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాలకు విలువ ఇస్తారు. వీరి దగ్గర మీరు స్థిరంగా, సానుభూతితో, మర్యాదగా ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అదనపు పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు బాగా రాణిస్తారు. మాటలతో కాకుండా చేతలతో మీరు నమ్మకాన్ని సంపాదించాలి. మీలోని దూకుడు ప్రవర్తన, ఆకస్మిక మార్పులు, టీమ్ని విమర్శించటం వంటి పనులతో వీరికి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది.మ్యావరిక్లు చురుగ్గా, వేగంగా, వ్యూహాత్మకంగా ఉంటారు. వీరిది నో–నాన్సెన్ ధోరణి. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. పనులు పూర్తి చేసే వారిని విలువైనవారిగా భావిస్తారు. తన ఉద్యోగులు సమయాన్ని గౌరవించాలని, ఒత్తిళ్లను స్వీకరించాలని కోరుకుంటారు. మితిమీరిన ప్రణాళికల్ని ఇష్టపడరు. అధిక డాక్యుమెంటేషన్ను కూడా లైక్ చెయ్యరు. ప్రతిదానికీ నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంటే మిమ్మల్ని నిష్కర్షగా పక్కనపెట్టేస్తారు.ఫ్రీ స్పిరిట్ కలిగినవారు స్వతంత్రమైన, సృజనాత్మకమైన, హృదయపూర్వకమైన గుణాలున్నవారు. వీరికి విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. తన టీమ్కు స్వేచ్ఛను ఇస్తారు. మీలో అభిరుచి, చొరవ ఉంటే మిమ్మల్ని టీమ్ లీడర్గా గుర్తిస్తారు. వీరితో నిజాయితీగా, దాపరికం లేకుండా ఉండాలి.మీ బాస్ సరే, మీరు ఎలాంటి వారు?ఇది తెలుసుకోవాలంటే 41 క్యూ.కామ్ లేదా 16 పర్సనాలిటీస్.కామ్లో ఈ ఎం.బి.టి.ఐ. ఆన్లైన్ పరీక్ష రాయండి. ఎలాంటి బాస్ మీకు సరిపడతారో తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్· సాక్షి, స్పెషల్ డెస్క్ -
సొరకాయ, కీరదోసతో స్నాక్స్ చేసేద్దాం ఇలా..!
గోవా ప్రాన్స్ రిషాయిడోకావలసినవి: రొయ్యలు– ఒక కప్పు (శుభ్రపరిచి హాఫ్ బాయిల్ చేçసుకోవాలి)ఉల్లిపాయ– ఒకటి (చిన్నది, తరిగినది)పాలు– అర కప్పుఉప్పు, మిరియాల పొడి– రుచికి తగినంతమైదాపిండి– ఒక కప్పు పైనేనీళ్లు, నూనె– సరిపడాగుడ్లు– 2 (పగలగొట్టి, కొద్దిగా పాలల్లో కలిపి పెట్టుకోవాలి)బ్రెడ్ పౌడర్– ఒక కప్పుతయారీ: ముందుగా కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగిన తర్వాత రొయ్యలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకుని; మూతపెట్టి చిన్నమంట మీద బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మైదాపిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఉండను పూరీలా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. రొయ్యల మిశ్రమం బాగా ఉడికిన తర్వాత కాస్త చల్లారనిచ్చి, కొద్దికొద్దిగా పూరీల్లో నింపుకుని చిత్రంలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని గుడ్లు, పాల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి.సొరకాయ మంచూరియాకావలసినవి: సొరకాయ తురుము– 1 కప్పుమైదాపిండి– 4 టేబుల్ స్పూన్లు, కార్న్ పౌడర్– 1 టేబుల్ స్పూన్ , గోధుమపిండి– 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్, కారం– 1 టీ స్పూన్ , జీలకర్ర– అర టీ స్పూన్ , ఉల్లిపాయ ముక్కలు– 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి), పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి), కొత్తిమీర తురుము, కరివేపాకు– కొద్ది కొద్దిగా (అభిరుచి బట్టి), ఉల్లికాడ ముక్కలు– కొద్దిగా, టమాటో సాస్– 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్– 2 టీ స్పూన్లు, సోయా సాస్– 1 టీ స్పూన్ , నూనె– సరిపడా, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని; అందులో సొరకాయ తురుము, మైదాపిండి, కార్న్ పౌడర్, గోధుమపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని; అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.పికిల్డ్ కుకుంబర్కావలసినవి: కీర దోసకాయలు– 3 లేదా 4 మధ్యస్థ పరిమాణంలో వెల్లుల్లి– 2 రెబ్బలు (సన్నగా తరగాలి)అల్లం– ఒక చిన్న ముక్క (సన్నగా తురుముకోవాలి)సోయా సాస్, వెనిగర్– 2 టేబుల్ స్పూన్లు చొప్పుననువ్వుల నూనె– ఒక టీ స్పూన్చిల్లీ ఫ్లేక్స్– అర టీస్పూన్పంచదార పొడి– ఒక టీస్పూన్పుల్లలు– 2–3 తయారీ: ముందుగా కీర దోసకాయలను శుభ్రంగా కడిగి, చివరలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై చిత్రంలో ఉన్న విధంగా కీర దోసకాయల తొక్కతీసి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిపై ఉప్పు జల్లి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత దోసకాయలను చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, పొడిగా తుడవాలి. ఈలోపు ఒక గిన్నెలో సన్నగా తరిగిన వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, సోయా సాస్, వెనిగర్, నువ్వుల నూనె, పంచదార వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బ్రష్తో కీరాలకు పూయాలి. ఇప్పుడు వాటిని ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచి, సర్వ్ చేసుకునే ముందు వాటికి పుల్లలు గుచ్చి సర్వ్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. (చదవండి: ఈ చిరుజల్లుల్లో టేస్టీ టేస్టీ స్నాక్స్ చేసేద్దాం ఇలా..!) -
DNA బ్యూటీ ఛాతీ పైభాగంలో టాటూ.. అర్థమేంటో తెలుసా?
పెద్దగా ప్రచారంలోకి రాని ముఖమే అయినా, తెరపై కనిపించినప్పుడల్లా చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకునే నటి నిమిషా సజయన్ (Nimisha Sajayan). ప్రస్తుతం బలమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..బ్లాక్బెల్ట్నిమిషా తండ్రి సజయన్, తల్లి అనంతవల్లి ఇద్దరూ కేరళ వాసులే అయినా, కుటుంబం ముంబైలో స్థిరపడింది. ఆమె బాల్యం ముంబై వీధుల్లో గడిచింది. అందుకే ‘ఆ నగరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటుందామె. నిమిషా తైక్వాండోలో నిపుణురాలు. బాల్యంలోనే బ్లాక్బెల్ట్ సాధించింది. పాఠశాల నుంచే ఫుట్బాల్, వాలీబాల్ బృందాలకు నాయకత్వం వహించింది. యోధురాలిగా ఎదిగిన ఆమె, తెరపై మార్దవానికి నిర్వచనంగా మారింది.మేకప్ నచ్చదునటన విషయంలో పైపైమెరుపుల కంటే అభినయమే అవసరం అన్నది నిమిషా అభిప్రాయం. అందుకే ఆమె చేసిన చిత్రాల్లో గ్లామర్కు చోటు తక్కువ. ‘ఒరు కుప్రసిద్ధ పయ్యన్’, ‘చోళ’ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డులు అందుకుంది. ‘నాకు మేకప్ నచ్చదు, అవసరమైతే పాత్ర కోసమే మేకప్ చేసుకుంటాను’ అన్న ఆమె వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికప్పుడు వంట నేర్చుకుని..కానీ తను వెంటనే స్పందించి, ‘వ్యక్తిగత అభిరుచి వేరు, నటనా బాధ్యత వేరు’ అంటూ వివాదాన్ని ముగించింది. ఓ సినిమా సెట్లో వంటవాడి దగ్గర పరోటా చేయడం నేర్చుకుని, స్పాట్లో స్వయంగా పరోటా చేసి పెట్టిన సంఘటన తెర వెనక ముచ్చటగా మారి వైరల్ అయింది. చిన్నతనంలో ఇంటి ఆవరణలో నీళ్లు పోస్తున్నట్లు నటించి, తండ్రిపై నీళ్లు చల్లడమే తన మొదటి నటన అని గుర్తు చేసుకుంటుంది. GST చెల్లించలేదని ఆరోపణలుఆమెపై వేసిన పన్నుల వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ముప్పై లక్షల జీఎస్టీ చెల్లించలేదన్న ఆరోపణలపై ఆమె తల్లి ప్రత్యక్షంగా స్పందించి ఆధారాలతో సహా ఖండించారు. ‘అక్కడ నా తల్లే నిజమైన హీరో’ అని నిమిషా చెప్పింది. చిత్రలేఖనంతో పాటు ఫొటోగ్రఫీలోనూ నిమిషా ప్రతిభావంతురాలే! ఈ రెండూ ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. సంప్రదాయ వంటలు అంటే ప్రాణం. పాల పాయసం, చేపల వంటలు, సధ్యా లేకుండా ఏ పండుగ తనకు అసలైన పండుగలా అనిపించదట.రంగు అడ్డు కాదుకొందరు రంగుపై వివక్ష చూపుతూ ‘ఇలాగుంటే పాత్రలు రావు’అని విమర్శించినా, నిమిషా మాత్రం ‘ప్రతిభ ఉన్న చోట రంగు అడ్డుకాదు’ అన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. ఆమె ఛాతీపై ఉన్న సూర్యచక్రపు గుర్తు తన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి, సృజనాత్మకంగా ఉండాలి’ అని నమ్ముతుంది. ఈమె చివరగా DNA సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) చదవండి: బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్ -
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఇటీవల ఒక ట్రెండ్గా మారింది. ఈ కళలోని ప్రత్యేక ఆకర్షణ అనేక సృజనాత్మక ఆలోచనలకు రూపం ఇస్తోంది. మనసుకు నచ్చిన కళాఖండాలతో ఇంటి అలంకరణను మార్చుకోవడానికి ఈ ఆర్ట్ వీలు కల్పిస్తుంది. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్, ఫంక్షనల్ డెకర్ లేదా ఫ్యాన్సీ వస్తువులైనా ఎపాక్సీ రెసిన్ కళ ఇంటికి కొత్త అందాన్ని తీసుకురాగలదు. రెసిన్ను ప్లాస్టిక్, వార్నిష్ వంటి అంటుకునే పదార్థాలు, ఇతర ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఎపాక్సీ రెసిన్ అనేక పొరలతో కూడి ఉంటుంది.గోడ మీద ప్రకృతి అందాలుఎపాక్సీ రెసిన్తో వాల్మీదకు ప్రకృతి దృశ్యాలను తీసుకురావచ్చు. నదీ నదాల అందాన్ని, నీటి కదలికను అనుకరించేలా, మంత్రముగ్ధులను చేసేలా ఈ ఆర్ట్ ద్వారా మన ముందుకు తీసుకువస్తున్నారు కళాకారులు. వాడిపోని పూల సొగసుసున్నితమైన పువ్వులను ఈ ఆర్ట్లో ఉపయోగించవచ్చు. పువ్వులను, కొమ్మలను ఎపాక్సీ రెసిన్తో కలిపితే అందమైన రూపం మీ ముందు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన టెక్నిక్ పువ్వుల సహజ సౌందర్యాన్ని కాపాడుతుంది. అద్భుతమైన వాల్ హ్యాంగింగ్స్ను సృష్టించడానికి ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ మెటీరియల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎపాక్సీ రెసిన్తో గోడ గడియారాలు, పెయింటింగ్స్, హ్యాంగింగ్స్ వంటి ఎన్నో రకాల అలంకరణ వస్తువులను తయారు చేయవచ్చు.డిజైనర్ ఫర్నిచర్సముద్రపు గవ్వలు, గులకరాళ్లు, పువ్వులు, లతలు వంటి సహజ వస్తువులను నిగనిగలాడే ఎపాక్సీ రెసిన్తో టేబుల్ టాప్స్, చెయిర్స్కి అద్భుతమైన అందాన్ని తీసుకురావచ్చు. ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఐడియాలుఎపాక్సీ రెసిన్ ఆర్ట్ వాల్ ఆర్ట్, ఫర్నిచర్కు మాత్రమే పరిమితం కాదు. వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ట్రేలు, ఇతర డెకర్ ఉత్పత్తులను రెసిన్తో తయారు చేయవచ్చు. ఈ కస్టమైజ్డ్ డిజైన్స్కి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. (చదవండి: మెట్లు దిగితే సముద్రం..! కళ కోసం అక్కడకు వెళ్లాల్సిందే..) -
మెట్లు దిగితే సముద్రం..!
ప్రపంచంలో కడలి తీరాలు ఎన్ని ఉన్నా పర్యాటకులు మెచ్చే బీచ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గ్రీస్లోని శాంటోరిని ద్వీపంలో ఉన్న అమూడీ బీచ్ అలాంటిదే. నిజానికి ఇది ఒక చిన్న నౌకాశ్రయం. ఓయా అనే గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్కి వెళ్లాలంటే 300 మెట్లు దిగితే చాలు. నడవలేని వారు మరోదారిలో వాహనాలపైన కూడా వెళ్లొచ్చు. ఇక్కడ రాక్ జంపింగ్ ఫేమస్. ఓయా కొండ మీద నుంచి ఈ బీచ్లోకి చాలామంది ఔత్సాహికులు దూకుతుంటారు. ఇక్కడ సాయంత్రం వేళల్లో సరదాగా సేదతీరే స్థానికులతో, ప్రకృతి ఆస్వాదించే పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ అనేక ఫిష్ టావర్న్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. రుచుల ప్రియులకు తాజా చేపలను, సంప్రదాయ గ్రీకు రెసిపీలతో వండి వడ్డిస్తుంటారు రెస్టారెంట్లోని షెఫ్స్. ఇక్కడి నుంచి సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి ఒక్కసారి వెళ్తే కచ్చితంగా మరోసారి వెళ్లాలనే ఆశ పుడుతుందట! నిజానికి ఈ బీచ్కి వెళ్లిన పర్యాటకులు ఓయా గ్రామస్థుల ఆదృష్టానికి కుళ్లుకోకుండా ఉండలేరేమో!కళోత్సాహంకళాకారులు ఎప్పుడూ ‘శభాష్’ అనే ప్రశంసలను, కరతాళ ధ్వనులను కోరుకుంటారు. అలాంటి కళలను అభినందించాలన్నా, ప్రదర్శించాలన్నా ఆగస్టు నెలలో స్కాట్లండ్ వెళ్లాల్సిందే! స్కాట్లండ్ రాజధాని ఎడిన్ బర్గ్లో ఆగస్ట్ 1 నుంచి ప్రారంభమైన ఎడిన్ బర్గ్ ఫెస్టివల్ ఫ్రింజ్ వేడుకలు ఆగస్టు 25 వరకు జరగనున్నాయి.సుమారు మూడు వారాల పాటు కొనసాగుతున్న ఈ పండుగలో వేలాదిమంది కళాకారులు, నటులు, హాస్యనటులు, సంగీతకారులు, వివిధ ప్రదర్శకులు పాల్గొంటారు. ఈ ఫ్రింజ్లో నాటకాలు, కామెడీ షోలు, సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, సర్కస్లు ఇలా మరెన్నో ప్రదర్శనలు ఉంటాయి. ఎడిన్ బర్గ్లోని థియేటర్లు, పబ్లు, కేఫ్లు, వీధులలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలు సహా వందలాది ప్రదేశాలలో ప్రదర్శనలు జరుగుతాయి. ఈ పండుగ నూతన ప్రతిభను వెలికితీయడానికి, ప్రయోగాత్మక కళలను ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశం. ప్రపంచం నలుమూలల నుంచి కళాకారులు, ప్రేక్షకులు ఈ పండుగకు తరలివస్తారు.(చదవండి: దెయ్యాల కొంపలను తలపించే నిర్జన కట్టడాలు) -
బాల్యపు గాయాలే భవిష్యత్ నిర్ణేతలు!
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా తపన పడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కోచింగ్... ఇలా చేయాల్సిన దానికి మించి చేస్తారు. మార్కులు, ర్యాంకులతో పిల్లల విజయాన్ని కొలుస్తారు. కాని, మీ బిడ్డ జీవితంలో అతిపెద్ద విజయం ఎగ్జామ్ హాల్లో కాదు, తన మనసులో జరుగుతుంది. ప్రతి బిడ్డ మనసులో ఒక రిపోర్ట్ కార్డ్ ఉంటుంది. అది మార్కులకు సంబంధించినది కాదు, భావాలకు, అనుభవాలకు సంబంధించినది. ఆ రిపోర్ట్ కార్డ్లో భయం, నిర్లక్ష్యం, అవమానం లాంటివి ఉంటే, అవే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వీటినే సైకాలజీలో ‘కనిపించని గాయాలు’ అని పిలుస్తారు.గత ఏడాది ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ ఫోబియాతో కౌన్సెలింగ్ కోసం వచ్చాడు. ఆ స్టూడెంట్తో మాట్లాడాక తెలిసింది అతని భయానికి కారణం సబ్జెక్ట్ కాదు, 90 శాతం కంటే తక్కువ మార్కులు వస్తే ‘నువ్వెందుకూ పనికిరావు’ అని తండ్రి తిట్టడమని. అందుకే అతనితో పాటు తండ్రికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చాను. మూడు నెలల్లో ఫోబియా మాయమైంది. 10 జీపీఏతో పదోతరగతి పాసయ్యాడు. పరిశోధనలేం చెబుతున్నాయి?అనుభవాలను బట్టి మెదడు వైర్ అవుతుంది. సురక్షితమైన, ప్రేమతో కూడిన వాతావరణంలో ఫోకస్, డెసిషన్ మేకింగ్కు కారణమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బాగా అభివృద్ధి చెందుతుంది. నిరంతరం భయంతో ఉంటే భయాన్ని నియంత్రించే అమిగ్డాలా హైపర్ యాక్టివ్ అవుతుంది. బాల్యంలో అవమానం, నిర్లక్ష్యం, శారీరక లేదా భావోద్వేగ దౌర్జన్యం ఎదుర్కొన్న పిల్లలు నాలుగు రెట్లు ఎక్కువగా డిప్రెషన్, ఆందోళనకు గురవుతారని 17 వేల మంది పిల్లలపై జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అలాంటి పిల్లలు చదువులో వెనుక బడతారు. పెరిగి పెద్దయ్యాక, కెరీర్లో స్థిరత్వం లేక ఇబ్బందులు పడతారు. సంబంధాలలో సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు.బాల్యంలో ఎమోషనల్ కనెక్షన్ ఉన్న పిల్లలకే జీవితంలో, కెరీర్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువని హార్వర్డ్ స్టడీలో కూడా వెల్లడైంది. ఫార్చ్యూన్ 500 సీఈఓలలో 70 శాతం మందికి సురక్షితమైన బాల్యం ఉండటమే ఇందుకు పెద్ద ఉదాహరణ. కొనసాగే గురుతులు...బాల్యంలో మనసుకైన గాయాలు కనిపించవు. కాని, వాటి ప్యాటర్న్ పెద్దయ్యాక కూడా కనిపిస్తుంది.బాల్యంలో ప్రేమ షరతులతో కూడినదైతే పెద్దయ్యాక అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు. ఓటమిని అంగీకరించడం నేర్పించకపోతే, టాపర్ అయినా ఎగ్జామ్ ఫెయిల్ అవుతాననే భయంతోనే బ్రతికేస్తుంటాడు. ‘నువ్వెందుకూ పనికిరావు’ అనే మాటల మధ్య పెరిగిన బిడ్డకు ఎంత టాలెంట్ ఉన్నా పెద్ద అవకాశాలను తప్పించుకునే వ్యక్తిగా మారతాడు. 7 స్టెప్స్ప్రతి పేరెంట్ తప్పులు చేస్తారు. అలాగని అపరాధభావనతో కుంగిపోకండి. ఆ ప్యాటర్న్ను బ్రేక్ చేయండి.మీ బిడ్డను ఇతరులతో పోల్చుతున్నారా? చిన్న చిన్న విషయాలకే తిడుతున్నారా? గాయం ఇక్కడే మొదలవుతుందని గుర్తించండి.∙మీరు ఈ రోజు మాట్లాడే మాటలు, మీ బిడ్డ ఇన్నర్ వాయిస్ అవుతుంది. అందుకే ఆ వాయిస్ ‘ఐ యామ్ గుడ్’ అని చెప్పేలా చూసుకోండి.∙విమర్శను కనెక్షన్తో మార్చండి. ‘నువ్వు లేజీ’ అని కాకుండా, ‘నువ్వు అలిసిపోయినట్టున్నావ్, మళ్లీ మాట్లాడదాం’ అని చెప్పండి. కనెక్షన్ = కరెక్షన్ అని గుర్తుంచుకోండి.ఇంటిని సురక్షిత ప్రదేశంగా మార్చండి. నో జడ్జ్మెంట్ జోన్ క్రియేట్ చేయండి. ఫలితాలకే కాదు, ప్రయత్నానికీ సెలబ్రేషన్ చేయండి.ఏఐ యుగంలో మార్కులు కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ గెలిపిస్తుంది. పాత గాయాలు నయం చేయకపోతే, మీ బిడ్డ భవిష్యత్తునే సాఫ్ట్వేర్ బగ్స్తో నడుస్తుందని గుర్తించండి.మీ గతం మీ ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తుంది. మీ ప్రవర్తన మీ బిడ్డ మనసుకు గాయాలు చేయవచ్చు. అందుకే మీ గాయాలు హీల్ అయ్యేందుకు థెరపీ తీసుకోండి. ఇదేమీ బలహీనత కాదు. బలం. తల్లిదండ్రుల అపోహలుపిల్లల మంచి కోసమే తిడుతున్నాం అనుకుంటారు కాని, ప్రేమంటే భయమనే ప్రోగ్రామ్ను బ్రెయిన్లో ఇన్స్టాల్ చేస్తున్నారనేది నిజం.తిట్టినా పిల్లలు మర్చిపోతారనుకుంటారు. అది తప్పు. వాళ్లు మర్చిపోరు. అవి వారి అన్కాన్షస్లో చేరి, జీవితంలో రిపీట్ అవుతాయి.భారీ ఫీజులు చెల్లించి మంచి స్కూల్లో చేర్పిస్తే సక్సెస్ గ్యారంటీ అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. ఎమోషనల్ సేఫ్టీనే మొదటి పాఠశాల. అది పేరెంట్స్ నుంచే రావాలి. సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’) -
‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’
మీ బాస్ను ఎలా మేనేజ్ చేయాలో మీకు ఎవరూ నేర్పించరు. వారిని మేనేజ్ చేయడానికి, ముందుగా వారు ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీకు ఎం.బి.టి.ఐ. (మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్) సహాయపడవచ్చు. బాస్లు ఎలా పని చేస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, అనే అంశాలపై ఆధారపడి ఈ ఇండికేటర్ బాస్లను కమాండర్, విజనరీ, హార్మనైజర్, స్ట్రాటిజిస్ట్, ఎనలిస్ట్, సపోర్టర్, మ్యావరిక్, ఫ్రీ స్పిరిట్ అనే 8 రకాల వ్యక్తులుగా విభజించింది. ఈ ఎనిమిది మందిలో మీ బాస్ ఏ టైపు మనిషో కింద ఇచ్చిన ఇండికేటర్ ‘కీ’ చెబుతుంది. కనుక ఇండికేటర్ను ఫాలో అయిపోండి. ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అంటారు కనుక బాస్ తత్త్వానికి అనుగుణంగా మీరు మారండి. ప్రశాంతంగా ఉండండి. కెరీర్లో విజయం సాధించండి.కమాండర్లు వీళ్లు ఫలితాలనే నమ్ముతారు. పనిలో వేగాన్ని, స్పష్టతను కోరుకుంటారు. సామర్థ్యం, నాయకత్వం, తర్కం వీళ్లలో ముఖ్యమైనవి. వీళ్లకు సమావేశాలు, డెడ్లైన్లు ముఖ్యం. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా వ్యవహరించే ఉద్యోగులను వీరు అభిమానిస్తారు. ఇలాంటి వారితో పేరాల్లో కాకుండా బుల్లెట్ పాయింట్లలో మాట్లాడాలి. కుంటి సాకులు, భావోద్వేగాలు వీళ్లు నచ్చవు. గడుపులోపే చెప్పిన పని అయిపోవాలి. ఇలాంటి వాళ్ల దగ్గర అస్తవ్యస్తంగా, అనిశ్చితంగా ఉంటే మీ కెరీర్ దెబ్బతిన్నట్లే. విజనరీలు వీరు శక్తిమంతులు. ఐడియాల పుట్టలు. వినూత్న ఆవిష్కరణల్ని ఇష్ట పడతారు. వీరు వర్క్ప్లేస్ని శక్తిమంతంగా మార్చేస్తారు. భవిష్యత్తుపై దృష్టి ఉంటుంది. పని ఎలా జరుగుతోందో చూడరు. ఎంత జరిగిందో అడుగుతారు. వీరిని ఆకట్టుకోవడానికి ఫ్రెష్ ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనల్ని అప్పటికప్పుడు ఆచరణలో పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగి ఆఫీస్కి వచ్చేటప్పుడు, ఆఫీస్ నుండి వెళ్లేటప్పుడు ఆ ప్రయాణంలో సైతం ఆఫీస్ పని చేయవలసి వస్తుంది. రూల్స్ మాట్లాడకూడదు. స్ప్రెడ్షీట్లను కుమ్మరించకూడదు. అంతులేని ఫాలో–అప్లతో వారిని ముంచెత్తకూడదు. ఉద్యోగికి సమయస్ఫూర్తి లేకపోవడం వారిని నిరాశపరుస్తుంది.హార్మౖనైజర్లు ఉద్యోగులతో వీరు స్నేహపూర్వకంగా ఉంటారు. అందర్నీ కలుపుకుని పోతారు. సామరస్యాన్ని కోరుకుంటారు. టీమ్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారు. మీ పుట్టినరోజును గుర్తుంచుకుంటారు. లేదా మీ కుటుంబం బాగోగుల గురించి అడుగుతారు. హెల్ప్ చేసేందుకు రెడీగా ఉంటారు. వీరి నాయకత్వం పరస్పర విశ్వాసం, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. వీరితో పనిచేయడానికి కమ్యూనికేటివ్గా ఉండాలి. టీమ్ కల్చర్ నిర్మాణానికి మీ సహకారాన్ని కోరుకుంటారు. ఘర్షణాత్మక ధోరణిని అస్సలు ఇష్టపడరు. టీమ్ ఒకలా ఆలోచిస్తే మీరు టీమ్కు విరుద్ధంగా ఆలోచించటం వీరిలో అసహనం కలిగిస్తుంది. స్ట్రాటెజిస్టులుఆలోచనాత్మకమైనవారు. లక్ష్యాలే ముఖ్యమైన దార్శనికులు. లోతుగా ఆలోచిస్తారు. జాగ్రత్తగా ప్రణాళిక వేస్తారు. స్వేచ్ఛ, వ్యూహాత్మకత విలువైనవిగా భావిస్తారు. నాటకీయతను ఇష్టపడరు. అన్నీ తెలుకుని ఉంటారు. పైకి వ్యక్తపరచరు. నాణ్యమైన పనిని ఆశిస్తారు. వీరి దగ్గర భావోద్వేగ ప్రకోపాలు, నిస్సారపు ఆలోచనలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు ఉద్యోగికి నష్టాన్ని తెస్తాయి. నిర్మాణాత్మక వాదనలు మాత్రమే వీరి దగ్గర చేయాలి.ఎనలిస్టులు కచ్చితమైనవారు, తార్కికంగా ఉంటారు. ప్రతిదీ వివరంగా తెలుసుకుంటారు. స్పష్టత ముఖ్యం. ఆధారాలు అవసరం. మీరు వాగ్దానం చేసిన వాటిని అమలు చేయాలని వీరు ఆశిస్తారు. అరకొర పనులను, నిర్ణయాలలో ఊగిసలాటను ద్వేషిస్తారు. డేటా, నిర్మాణం, దృఢమైన తార్కికతతో వీరికి సహాయకారిగా ఉండండి. నాటకీయత వద్దు. ప్రాక్టికల్గా ఉండండి. భావోద్వేగ విజ్ఞప్తులతో, అస్పష్టమైన నిబద్ధతలతో లేదా ఒక పనిని దాటవేయడం ద్వారా వారిని నిరాశపరచకండి.సపోర్టర్లు నిశ్శబ్దంగా ఉంటారు. నమ్మదగినవారు. సేవా దృక్పథం కలిగినవారు. స్థిరమైన జట్లకు వెన్నెముకగా ఉండాలని కోరుకుంటారు. స్థిరంగా, శ్రద్ధగా, విశ్వాసపాత్రంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాలకు విలువ ఇస్తారు. వీరి దగ్గర మీరు స్థిరంగా, సానుభూతితో, మర్యాదగా ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అదనపు పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు బాగా రాణిస్తారు. మాటలతో కాకుండా చేతలతో మీరు నమ్మకాన్ని సంపాదించాలి. మీలోని దూకుడు ప్రవర్తన, ఆకస్మిక మార్పులు, టీమ్ని విమర్శించటం వంటి పనులతో వీరికి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది.మ్యావరిక్లు చురుగ్గా, వేగంగా, వ్యూహాత్మకంగా ఉంటారు. వీరిది నో–నాన్సెన్ ధోరణి. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. పనులు పూర్తి చేసే వారిని విలువైనవారిగా భావిస్తారు. తన ఉద్యోగులు సమయాన్ని గౌరవించాలని, ఒత్తిళ్లను స్వీకరించాలని కోరుకుంటారు. మితిమీరిన ప్రణాళికల్ని ఇష్టపడరు. అధిక డాక్యుమెంటేషన్ను కూడా లైక్ చెయ్యరు. ప్రతిదానికీ నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంటే మిమ్మల్ని నిష్కర్షగా పక్కనపెట్టేస్తారు.ఫ్రీ స్పిరిట్ కలిగినవారు స్వతంత్రమైన, సృజనాత్మకమైన, హృదయపూర్వకమైన గుణాలున్నవారు. వీరికి విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. తన టీమ్కు స్వేచ్ఛను ఇస్తారు. మీలో అభిరుచి, చొరవ ఉంటే మిమ్మల్ని టీమ్ లీడర్గా గుర్తిస్తారు. వీరితో నిజాయితీగా, దాపరికం లేకుండా ఉండాలి.మీ బాస్ సరే, మీరు ఎలాంటి వారు?ఇది తెలుసుకోవాలంటే 41 క్యూ.కామ్ లేదా 16 పర్సనాలిటీస్.కామ్లో ఈ ఎం.బి.టి.ఐ. ఆన్లైన్ పరీక్ష రాయండి. ఎలాంటి బాస్ మీకు సరిపడతారో తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్· సాక్షి, స్పెషల్ డెస్క్ -
దెయ్యాల కొంపలను తలపించే నిర్జన కట్టడాలు
ప్రపంచంలో ఎన్నో భారీ కట్టడాలు ఉన్నాయి. వీటిలో ప్రజల సామూహిక అవసరాల కోసం నిర్మించినవి కొన్ని, ప్రైవేటు వ్యక్తుల విలాసాల కోసం నిర్మించుకున్నవి మరికొన్ని. మనుషుల సంచారం ఉన్నప్పుడే ఎంతటి కట్టడానికైనా కళాకాంతులు ఉంటాయి. మనిషి అలికిడైనా లేని కట్టడాలు దయ్యాల కొంపలను తలపిస్తాయి. ఎంతో వ్యయప్రయాసలతో నిర్మించినా, మనిషి అలికిడి లేకపోవడం వల్ల కళ తప్పిన కొన్ని నిర్జన నిర్మాణాల గురించి తెలుసుకుందాం...ఆర్ఫియమ్ థియేటర్ప్రపంచంలో ఇంకా సినిమా ప్రభావం మొదలవక ముందు నాటక ప్రదర్శనల కోసం నిర్మించిన రంగస్థల కేంద్రం ‘ఆర్ఫియమ్ థియేటర్’. ఇది అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం న్యూబెడ్ఫోర్డ్లో ఉంది. దీనిని న్యూబెడ్ఫోర్డ్లోని ఫ్రెంచ్ షార్ప్షూటర్స్ క్లబ్ నిర్మించింది. తర్వాత దీనిని బోస్టన్కు చెందిన ఆర్ఫియమ్ సర్క్యూట్కు లీజుకిచ్చింది. సరిగా ‘టైటానిక్’ ఓడ మునిగిపోయిన రోజునే– 1912 ఏప్రిల్ 15న ఈ థియేటర్ ప్రారంభమైంది. నాటి నుంచి యాభయ్యేళ్ల పాటు 1962 వరకు ఇక్కడ విరివిగా నాటక ప్రదర్శనలు జరిగేవి. సినిమా, టెలివిజన్ ప్రభావం పెరగడంతో 1959 నాటికే దీని ప్రాభవం క్షీణించింది. నష్టాలతో నడపలేక ‘ఆర్ఫియమ్’ యాజమాన్యం 1962లో దీనిని మూసేసింది. అప్పటి నుంచి ఈ కట్టడం జనసంచారం లేక బోసిపోయి, శిథిలావస్థకు చేరుకుంది.సాథోర్న్ యూనిక్ టవర్దాదాపు ముప్పయ్యేళ్ల కిందట ‘బూమ్’ బుడగ విస్తరించినప్పుడు థాయ్లండ్ ఆర్థిక వ్యవస్థ కూడా కాసుల గలగలలతో కళకళలాడేది. స్థిర చరాస్తి రంగాల్లోకి పెట్టుబడుల ప్రవాహం ఉద్ధృతంగా సాగేది. రియల్ ఎస్టేట్ రంగం మూడు వెంచర్లు, ఆరు అపార్ట్మెంట్లలా ఒక వెలుగు వెలిగేది. ఆ కాలంలోనే బ్యాంకాక్లో ఈ నలభై అంతస్తుల కట్టడం రూపుదిద్దుకుంది. బ్యాంకాక్ నగరం నడిబొడ్డున చావోఫ్రాయా నదికి చేరువలో భారీ స్థాయిలో సంపన్నుల విలాసాలకు అనువుగా ఈ అపార్ట్మెంట్ భవన నిర్మాణాన్ని తలపెట్టారు. నిర్మాణం ఇంకా కొనసాగుతున్న దశలోనే ‘బూమ్’ బుడగ బద్దలైంది. అపార్ట్మెంట్ నిర్మాణ కార్యక్రమానికి నిధులు నిలిచిపోయాయి. సాథోర్న్ యూనిక్ కంపెనీ ఈ భవన నిర్మాణ కార్యక్రమాన్ని సిఫ్యా కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. డబ్బులు ముట్టకపోవడంతో సిఫ్యా కన్స్ట్రక్షన్ కంపెనీ 1997లో నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసింది. ఆ తర్వాత దీనిని పూర్తి చేయడానికి సాథోర్న్ యూనిక్ కంపెనీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవేవీ సఫలం కాలేదు. ఫలితంగా ఈ కట్టడం కళతప్పి, ‘ఘోస్ట్ టవర్’గా మిగిలింది.వాన్లీ యూఎఫ్ఓ విలేజ్అప్పుడపుడు ఆకాశంలో ‘అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్’ (యూఎఫ్ఓలు) కనిపించినట్లుగా వార్తలు వస్తుంటాయి. యూఎఫ్ఓలను నేల మీద ఉండగా చూసినవాళ్లు ఎవరూ లేరు. అలాంటిది యూఎఫ్ఓలో బస చేసినవారు ఉండటమనే ప్రశ్నే లేదు. యూఎఫ్ఓలు నేల మీదకు వస్తే, వాటిని చూడాలని, కుదిరితే వాటిలో కాలం గడపాలని కోరుకునేవారు తక్కువేమీ కాదు. అలాంటివారి కోరిక తీర్చాలనే ఉద్దేశంతోనే తైవాన్కు చెందిన హుంగ్ కువో గ్రూప్ రాజధాని తైపీ నగరానికి చేరువలోని సాంఝీలో యూఎఫ్లో ఆకారంలో నిర్మించిన భవంతులతో రిసార్ట్ నిర్మాణం తలపెట్టింది. ఈ రిసార్ట్లో యూఎఫ్లోను తలపించేలా గూళ్లలాంటి చిన్న చిన్న ఇళ్లను నిర్మించడానికి 1978లో పనులు ప్రారంభించింది. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తిచేసింది కూడా! ఆర్థిక ఇబ్బందులతో పాటు ఈ ప్రదేశంలో ఆత్మహత్యలు, వాహన ప్రమాదాలు వంటి వరుస దుస్సంఘటనలు ఎదురవడంతో 1980లోనే ఈ నిర్మాణాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి ఇక్కడ యూఎఫ్ఓ ఆకారంలో నిర్మించిన ఇళ్లన్నీ ఖాళీగా మిగలడంతో పాడుబడిన దశకు చేరుకున్నాయి. ఈ కట్టడాలపై అనేక వదంతులు ప్రచారంలో ఉండటంతో స్థానకులు సైతం ఇక్కడకు రావడానికి భయపడతారు.ర్యుగ్యాంగ్ హోటల్ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నగరం నడిబొడ్డున శిఖరంలా నిలిచి కనిపించే ఈ హోటల్లో ఇప్పటి వరకు అతిథులెవరూ అడుగుపెట్టలేదు. ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ ఇల్ సుంగ్ హయాంలో దేశానికే తలమానికంలా నిలిచేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నూటైదు అంతస్తుల హోటల్ భవంతి నిర్మాణాన్ని 1987లో ప్రారంభించారు. దేశానికి తరచుగా ఆర్థిక కష్టాలు ఎదురవడంతో ఈ హోటల్ నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. కుంటుతూ కుంటుతూనే ఇందులో మూడువేల గదులను, ప్రతి గదికి బయటివైపు మూడువేల గాజు పలకలను కళ్లు జిగేల్మనిపించేలా నిర్మించారు. ఇందులో ఐదు రివాల్వింగ్ రెస్టరెంట్లను కూడా నిర్మించారు. దీర్ఘకాలం పనులు నిలిచిపోయాక, కిమ్ జాంగ్ ఉన్ పాలన మొదలయ్యాక అర్ధాంతరంగా నిలిచిపోయిన దీని పనులు మళ్లీ మొదలయ్యాయి. పాతికేళ్ల కిందట మొదలైన ఆ పనుల్లో భాగంగా హోటల్ బయటివైపు నిర్మాణాన్ని కూడా పూర్తిచేశారు. అయితే, ఈ హోటల్ కార్యకలాపాలేవీ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికీ చక్కగా నివాసయోగ్యంగా ఉన్నా, మనిషి అలికిడి లేకుండా మిగిలిన ఈ హోటల్ను ‘హోటల్ ఆఫ్ డూమ్’గా అభివర్ణిస్తూ పాశ్చాత్య మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. సిటీహాల్ సబ్వే స్టేషన్ఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థానిక రైళ్ల రాకపోకల కోసం నిర్మించిన భూగర్భ రైల్వేస్టేషన్. దీనిని 1904లో నిర్మించారు. అప్పట్లో ఇది ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించేది. వంపు తిరిగిన దీని ప్లాట్ఫామ్ కారణంగా పొడవాటి రైళ్లు నిలిపేందుకు సానుకూలత లేకపోవడమే దీని లోపం. జనాభాకు తగినట్లుగా రైళ్లకు బోగీలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో 1945లోనే ఈ స్టేషన్ మూతబడింది. నాటి నుంచి ఇది నిర్మానుష్యంగా మిగిలింది. ఈ రైల్వేస్టేషన్కు అప్పట్లో జార్జ్ లూయిస్ హీన్స్, క్రిస్టఫర్ గ్రాంట్ లా ఫార్జ్ అనే ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్లు రూపకల్పన చేశారు. పైకప్పుకు వేలాడే ఇత్తడి షాండ్లియర్లు, నున్నని రాతి పలకలతో నిర్మించిన గచ్చు, విశాలమైన ప్రవేశమార్గం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆనాటి రవాణా వ్యవస్థ వైభవానికి ఆనవాలుగా నిలిచి ఉన్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాక కళ తప్పిన ఈ స్టేషన్ ఇప్పుడు కొంత శిథిలావస్థకు చేరుకుంది. (చదవండి: -
నత్త జిగురుతో కాంతులీనే చర్మం..!
ఈ అత్యాధునిక చర్మ సంరక్షణ పరికరం అందాన్ని కోరుకునేవారికి ఒక వరం. చర్మానికి ఎల్ఈడీ థెరపీలను అందించే డివైస్లు ఎన్ని అందుబాటులోకి వచ్చినా, సౌందర్యప్రియులకు ఈ మెషిన్ అందించే పర్ఫెక్షనే వేరు! దీనిలోని ఫొటో–బయోమాడ్యులేషన్ టెక్నాలజీ.. ఆన్ చెయ్యగానే ఎరుపు కాంతిని విడుదల చేస్తూ, కేవలం 12 నిమిషాల్లోనే ముఖానికి కొత్త మెరుపుని అందిస్తుంది. దీని పనితీరు క్లినికల్ పరీక్షల్లో కూడా నిగ్గుతేలింది.ఈ డివైస్ ముఖాకృతిలోనే రూపొందడంతో దీని ముందు ముఖాన్ని ఉంచినప్పుడు అన్నివైపుల నుంచి లైట్ థెరపీ జరుగుతుంది. దాంతో చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. ఈ డియోర్ స్కిన్ లైట్ థెరపీని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు అందుకున్న తర్వాత వయసుతో వచ్చే ముడతలు, మచ్చలు చాలా వరకూ తగ్గుతాయి. చర్మం యవ్వనంగా మారుతుంది.ఈ మాస్క్ డివైస్ అన్ని రకాల చర్మాలకు అనువైనదే. సున్నితమైన స్కిన్ టైప్ ఉన్నవారికి కూడా పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డివైస్ ఒక టేబుల్ ల్యాంప్లా అనిపిస్తుంది. దీని స్టాండ్ ఎటువైపు అయినా వంగుతూ, వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. దీన్ని ఆన్ చేసి లైట్ థెరపీ పొందేటప్పుడు, పడుకుని లేదా కూర్చుని కూడా ఈ ట్రీట్మెంట్ పొందొచ్చు.వినూత్నమైన బ్యూటీ ట్రీట్మెంట్స్లో ‘స్నెయిల్ క్రాల్ ట్రీట్మెంట్’ లేదా ‘స్నెయిల్ ఫేషియల్’ ఒక రకం! ఈ చికిత్సలో నత్తల నుంచి స్రవించే జిగురుతో చర్మంపై మసాజ్ చేస్తారు. ఈ విధానం ఎన్నో ఏళ్ల క్రితమే గ్రీస్లో ప్రారంభమైంది. తూర్పు ఆసియాలో, ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఈ నత్త జిగురుతో చర్మం తేమను పెంచడం, గాయాలను నయం చేయడం, కణాల పునరుద్ధరణ చేయడంతో పాటు కొన్ని రకాల చర్మ క్యాన్సర్లను కూడా నివారించవచ్చని నిపుణులు తేల్చారు. ఈ ట్రీట్మెంట్తో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముఖంపై గీతలు, ముడతలు తగ్గుతాయి. అలాగే గాయాలు, అలర్జీలు, దురదలు వంటి సమస్యలు కూడా నయమవుతాయి. ఈ చికిత్సలో నేరుగా నత్తను చర్మంపై వదులుతారు. లేదంటే నత్త నుంచి సేకరించిన జిగురు ముఖానికి పూస్తారు. నత్త జిగురుతో ఇప్పుడు ఎన్నో సౌందర్య ఉత్పత్తులు కూడా తయారవుతున్నాయి. (చదవండి: ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?) -
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..?
నాకు ఇటీవల హెపటైటిస్–బీ వచ్చిందని తెలిసింది. ఇప్పుడు నేను ఎనిమిది నెలల గర్భవతిని. మా కుటుంబంలో కొంతమందికి కూడా ఇదే వ్యాధి ఉంది. ఈ విషయం డాక్టర్కు ముందుగా చెప్పాలా? నా బిడ్డకు కూడా ఈ వ్యాధి వస్తుందా?– జ్యోతి, హైదరాబాద్ గర్భవతిగా ఉన్న మీరు ఈ హెపటైటిస్–బీ వంటి వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ఒక వైరస్ వలన కలిగే వ్యాధి. ఇది రక్తం ద్వారా వ్యాపించి, మీ లివర్ను ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో వైరస్ ఉంటే, బిడ్డ పుట్టే సమయంలో తల్లి రక్తంతో సంపర్కంలోకి వచ్చేటప్పుడు వైరస్ బిడ్డకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన విషయం. శిశువులకు వైరస్ సోకినప్పుడు దాదాపు తొంభై శాతం శాశ్వత లివర్ వ్యాధిగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే మీరు ఇప్పుడే మీ వైద్యులకు చెప్పాలి. ముందుగా సమాచారం ఉంటే తగిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. బిడ్డ పుట్టిన వెంటనే ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించేందుకు ప్రత్యేకమైన రక్షణ చికిత్సలు ఉన్నాయి. బిడ్డ పుట్టిన నాటికి రెండు పనులు చేయాలి. ఒక్కటి ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది వైరస్ను వెంటనే అడ్డుకుంటుంది. రెండు, హెపటైటిస్–బీ టీకా మొదటి మోతాదును ఇవ్వాలి. ఈ రెండు కూడా బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపల చేయాలి. తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరు మోతాదుల టీకా షెడ్యూలును పూర్తి చేయాలి. మొదటి మోతాదు పుట్టిన వెంటనే, రెండవ మోతాదు నాలుగు వారాల్లో, మూడవది ఎనిమిది వారాల్లో, నాల్గవది పన్నెండు వారాల్లో, ఐదవది పదహారు వారాల్లో, ఆరవది ఇరవై నెలల్లో వేయాలి. ఆరు మోతాదులు పూర్తయిన తర్వాత బిడ్డకు రక్తపరీక్ష చేయాలి. అప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి ఏర్పడిందో లేదో తెలుస్తుంది. తల్లి ఈ సంగతిని వైద్యులకు ముందుగానే చెప్పడం వల్లే సాధ్యమవుతుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డను సంపూర్ణంగా రక్షించవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా తగిన సమాచారం డాక్టర్కి ఇవ్వండి. నేను గర్భధారణకు ప్లాన్ చేస్తున్నాను. కొంతమంది రుబెల్లా వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని చెబుతున్నారు. కాని, ఇదివరకు నాకు ఈ వ్యాధి వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పండి.– అనిత, రాజమండ్రిమీరు గర్భధారణ కోసం సిద్ధమవుతుంటే, రుబెల్లా వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రుబెల్లా అనేది ఒక వైరస్ వలన వచ్చే వ్యాధి. ఇది దగ్గుతో, తుమ్ముతో గాలిలోకి వచ్చే జలకణాల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది తేలికపాటి జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో కనిపిస్తుంది. కాని, గర్భధారణ సమయంలో ఈ వైరస్ సోకితే, బిడ్డకు తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు కలగవచ్చు. ఈ వ్యాధి గర్భంలో ఉన్న శిశువుకు సోకితే, చెవిటితనం, కాటరాక్ట్ వంటి కంటి లోపాలు, గుండెకు సంబంధించిన లోపాలు, మెదడు ఎదుగుదలపై ప్రభావం, లేదా గర్భస్రావం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ తొలి మూడు నెలల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నివారించడానికి ముందుగా ఒక రక్త పరీక్ష చేయించుకోవాలి. రుబెల్లా ఐజీజీ అనే పరీక్ష చేసి, మీ శరీరంలో ఇప్పటికే ఈ వైరస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉన్నాయా లేదా తెలుసుకుంటారు. యాంటీబాడీలు ఉన్నట్లయితే, మీ శరీరానికి రక్షణ ఉంది కాబట్టి టీకా అవసరం ఉండదు. యాంటీబాడీలు లేనట్లయితే, తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఎమ్ఎమ్ఆర్ (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) రూపంలో ఇవ్వబడుతుంది. ఒక మోతాదుతో ప్రారంభించి, అవసరమైతే రెండో మోతాదును కొన్ని వారాల గ్యాప్లో వేయొచ్చు. అయితే, వ్యాక్సిన్ వేసిన తరువాత కనీసం రెండు నెలల పాటు గర్భం ధరించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో శరీరం రక్షణ ఏర్పరచుకుంటుంది. ఇది శిశువును రక్షించడంలో కీలకంగా పనిచేస్తుంది. టీకా వల్ల కొన్నిసార్లు తేలికపాటి జ్వరం రావచ్చు. మీరు ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్ వేసుకున్నారా అనే విషయం స్పష్టంగా గుర్తులేనట్లయితే, పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. టీకా అవసరమైతే ఇప్పుడే వేయించుకుని, రెండు నెలలు గడిచిన తరువాత గర్భధారణకు ప్లాన్ చేసుకోండి. ఇలా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఎలాంటి హానికి గురికాకుండా, ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉంటుంది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్(చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్టాపిక్గా ఊబకాయం..) -
ఓ చూపు చూశారు!
పెళ్లి, పెళ్లి చూపులు... ఈ రెండు సందర్భాల్లోనూ ఇరుపక్షాలు తమ స్థాయిని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ వీక్నెస్నే క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన ఓ గ్యాంగ్ 2011లో దేశ వ్యాప్తంగా అనేక కుటుంబాలను ఓ చూపు చూసింది. వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చి, పెళ్లి చూపులకి రమ్మంటూ ఆహ్వానించి, మత్తుమందు కలిపిన పానీయాలు ఇచ్చి అందినకాడికి దోచుకుపోయిన ఆ ముఠా ఆరు రాష్ట్రాల్లో హడలెత్తించింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అన్నదమ్ములు శ్రీనివాస్, రుషికేశ్లతో పాటు అదే ప్రాంతానికి చెందిన రమేష్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. 2003లో నాలుగేళ్ల బాలుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేసి జైలుకు వెళ్లడంతో నేర జీవితం ప్రారంభించారు. 2010లో హైదరాబాద్ శివారులోని ఓ పంచాయతీ సర్పంచ్ని డబ్బు కోసం బెదిరించారు. ఇలాంటి నేరాలు చేస్తే పోలీసులకు దొరికిపోయి జైళ్లు, బెయిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని భావించింది. అందువల్ల పోలీసులకు చిక్కే అవకాశాలు తక్కువగా ఉండే లాభసాటి నేరాలు చేయాలనుకున్న ఈ ముఠా తమను గుర్తుపట్టని ప్రాంతాలకు వెళ్లి, అప్పటికే సంబంధం తెగిపోయే టార్గెట్లను ఎంచుకుని, పక్కా పథకం ప్రకారం నేరాలు చేయాలని నిర్ణయించుకుంది. తమ పథకాన్ని అమలులో పెట్టడంలో భాగంగా వీళ్లు వేసిన ఎత్తే డమ్మీ పెళ్లి చూపులు. దీనికోసం ఈ ముగ్గురూ ఇంటర్నెట్ నుంచి అందమైన యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకున్నారు. వీటి ఆధారంగా తయారు చేసిన బయోడేటాల్లో ఆ యువతి ఉన్నత విద్యనభ్యసించినట్లు, పెద్ద సంస్థలో పని చేస్తున్నట్లు ఆకర్షణీయమైన వివరాలు చేర్చి, అలాంటి యువతికి అదే స్థాయి సంపన్నుడైన వరుడు కావాలంటూ వివిధ మేట్రిమోనియల్ సైట్స్లో పోస్ట్ చేసింది. సంప్రదింపుల కోసం బోగస్ వివరాలతో రూపొందించిన ఈ–మెయిల్ ఐడీలను పొందుపరచేది. కొన్ని పత్రికల్లోనూ ఇదే తరహాలో ప్రకటనలు ఇచ్చింది. వీటికి ఆకర్షితులై సంప్రదించిన వారిని మాటలతో ముగ్గులోకి దింపేది. వాళ్లు పెళ్లి కుమార్తె వివరాలు కోరితే... తక్షణం చెప్పే వాళ్లు కాదు. అలా చేస్తే ఎదుటి వారికి పూర్తిగా నమ్మకం రాదనే భావనతో కొత్త కథ నడిపే వాళ్లు. అంతకు ముందే యువతిని చూసి వెళ్లిన ఐఏఎస్/ఐపీఎస్ అధికారి అభిప్రాయం చెప్పడానికి రెండుమూడు రోజుల సమయం కోరారని, వారి నుంచి సమాధానం రాకుండా మీకు ఏ విషయం చెప్పలేమంటూ నమ్మబలికే వాళ్లు. ఈ సంప్రదింపులన్నీ ఈ–మెయిల్స్ ద్వారానే జరిపేవాళ్లు. అలా కొన్ని రోజులు గడిచాక వరుడి తరఫు వారికి సదరు ఐఏఎస్/ఐపీఎస్ అధికారికి తమ అమ్మాయి నచ్చిందని చెప్పారని, అయితే ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో పని చేస్తున్నందున పెళ్లి చేయమని చెప్పామని నమ్మబలికే వాళ్లు. ఆపై తమ ఆస్తిపాస్తులు వివరాలు తెలుసుకోవడానికి, అమ్మాయిని చూడటానికి, తమ ఆతిథ్యం స్వీకరించడానికి వివిధ ప్రాంతాలకు రావాలంటూ ఆహ్వానించేది. ఇలా పెళ్లి చూపులకు వచ్చే ముందు ఆ వరుడి తరఫు వాళ్లు భారీగా బంగారు నగలు తీసుకుని వచ్చే వాళ్లు. వీళ్లు రావడానికి ముందే ‘జస్ట్ డయల్’ సాయంతో అక్కడి అనువైన ప్రాంతంలో సర్వీస్ అపార్ట్మెంట్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లు సైతం అద్దెకు తీసుకునేది. అవి తమ సొంతమే అన్నట్లు నమ్మించడానికి అనువుగా ఏర్పాటు చేసేది. కొన్ని సందర్భాల్లో రిసార్టుల్లో సూట్స్ బుక్ చేసి సిద్ధం చేసేది. ‘అతిథుల’ కోసం ఖరీదైన కార్లనూ ‘జస్ట్ డయల్’ సహాయంతోనే బుక్ చేసి.. వాటిలోనే ఎయిర్పోర్టుకు వెళ్లి వారిని రిసీవ్ చేసుకునేది. అక్కడ నుంచి వారిని సిద్ధం చేసి ఉంచిన సర్వీస్ అపార్ట్మెంట్లు, రిసార్టులకు తీసుకువెళ్లి, కాబోయే వియ్యంకుల మాదిరి బిల్డప్ ఇస్తూ రెండు మూడు రోజుల పాటు అతిథి మర్యాదలు చేసేది. ఆపై అదను చూసుకుని వారు తినే/తాగే పదార్థాల్లో మత్తుమందు కలిపి వారివద్ద ఉన్న బంగారం, డబ్బు తీసుకుని ఉడాయించేది. మత్తు వదిలాక నిద్రలేచే అతిథులు నిలువు దోపిడికీ గురయ్యామని తెలుసుకుని గొల్లుమనే వాళ్లు. ఈ గ్యాంగ్ ఓ పక్క ఈ పంథాలో దోపిడీలు చేస్తూనే, మరోపక్క ట్రావెల్స్ కార్లపైనా పంజా విసిరేది. ‘జస్ట్ డయల్’ నుంచి ట్రావెల్స్ నిర్వాహకులకు ఫోన్ నెంబర్ తీసుకుని సంప్రదించేది. వివిధ పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలంటూ వాహనాన్ని బుక్ చేసుకుని, ప్రయాణాల్లో కొన్ని చోట్ల లాడ్జిల్లో బస చేసేది. అక్కడ కారు డ్రైవర్కు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి, అతడు స్పృహతప్పాక, కారు తాళాలు తీసుకుని, కారుతో ఉడాయించేది. మత్తు వదిలాక డ్రైవరే లాడ్జి బిల్లు చెల్లించి బయటపడాల్సి వచ్చేది. ఇలా కార్లు చోరీ చేసే ఈ ముఠా, వాటిని బోగస్ పత్రాల సాయంతో అమ్మి సొమ్ము చేసుకునేది. ఈ ముఠా హైదరాబాద్, జహీరాబాద్, కేరళ, కర్నూలు, తిరుపతి, ఏలూరు, కర్ణాటక, ముంబై, తమిళనాడు, పాండిచ్చేరీల్లో 24 నేరాలు చేసింది. ఈ ముఠా ఇదే పంథాలో 2003 నుంచి నేరాలు సాగిస్తున్నా, 2011 వరకు ఎక్కడా చిక్కలేదు. పెళ్లి చూపులు, అద్దెకు కార్లు పేరుతో జరుగుతున్న నేరాలపై 2011లో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు సమాచారం అందింది. బాధితులను మత్తులోకి దించేందుకు టాబ్లెట్లు వినియోగించినట్లు తేలడంతో ఆ నేరాలన్నీ ఒకే గ్యాంగ్ పనిగా అనుమానించింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కేజీ బంగారం, ఐదు వాహనాలు, చోరీ సొమ్ముతో కొన్న ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఈ ముఠాపై నమోదైన కేసుల్లో అత్యధికం కోర్టుల్లో రుజువు కాలేదు. కేసులు నమోదులో జాప్యం, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే కాకుండా, ఫిర్యాదుదారులూ ధైర్యంగా ముందుకు రాకపోవడంతో వీగిపోయాయి. -
ఈ వారం కథ: పునీతులు
పొద్దెక్కుతోంది. మబ్బుల్నే లేచిన ఈశ్వరి చకచకా బీడీల ఆకు కత్తిరిస్తోంది. పక్కనే ఉయ్యాలలో పడుకోబెట్టిన పాప ఉలిక్కిపడి లేచి ఏడుపందుకుంది. తప్పదన్నట్లు లేచి, బిడ్డకు పాలిస్తూ ‘ఇంకొంచెంసేపు పడుకోవే తల్లీ!’ అంటూ మురిపెంగా పాప బుగ్గలు నిమిరింది. పాప మెరిసే కళ్ళతో తల్లినే నిటారుగా చూస్తోంది. ఆడపిల్ల అయినా తండ్రి కళ్లే వచ్చాయి. అచ్చం రాజేష్ చూస్తున్నట్లే ఉంది అని మురిసిపోతున్న ఆమె మనసు భర్త వైపు మళ్లింది.ప్రసవానికి వచ్చిన ఈశ్వరికి బిడ్డ పుట్టి ఆరు నెలలైనా తల్లిగారింట్లోనే ఉంటోంది. తన ఇంటికి వెళితే తనూ, తన భర్తనే. ఇక్కడైతే తనకు, పసిపిల్లకు తోడుగా తల్లి, తమ్ముడు ఉన్నారు. ఎమ్మెస్సీ చదివిన రాజేష్ తమ ఊర్లోనే ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెబుతున్నాడు. రెండు ఊర్ల మధ్య గంట బస్సు ప్రయాణం. అందుకే శని, ఆదివారాలు తానే వచ్చిపోయేవాడు. అలా హాయిగా ఉంటున్న వారి మధ్య ఏడాది పరీక్షలు వచ్చి అడ్డుగా నిలిచాయి. ఉదయం, సాయంత్రం కాలేజీలో స్పెషల్ క్లాసులు నడుస్తున్నాయి. ఆదివారాల్లో కూడా భార్య, కూతురును చూసి వచ్చేంత తీరిక లేని పని. రాజేష్ రాక దాదాపు నెల రోజులవుతోంది.పాలు తాగుతూ నిద్రపోయిన బిడ్డను హమ్మయ్య అనుకుంటూ ఈశ్వరి మెల్లగా ఉయ్యాలలో వేసి మళ్ళీ ఆకును ముందేసుకుంది. డెలివరీ అయిన నెల రోజులు తప్ప వచ్చిన్నుంచి రోజుకు వేయి బీడీలు చేస్తోంది. తమ్ముడిది బీడీ కంపెనీలో గుమస్తా కొలువు. తన డెలివరీకి అయిన ఖర్చులైనా ఇంటికి ముట్టజెప్పాలని ఆమె ఆరాటం.అప్పుడే దూరం నుంచే ‘అక్కా!’ అని అరుచుకుంటూ వస్తున్నాడు ఆమె తమ్ముడు.‘ఏందిరా శ్రీనూ.. మెల్లగరా!’ అని ఆయన్నే చూస్తోంది.‘బావను పోలీసులు పట్టుకుపోయిండ్రట’ అంటూ ఇంట్లోకి వచ్చాడు.‘ఎందుకురా!’ అంటూ లేచి నిలబడింది ఒక్కసారిగా.తమ్ముని వెనుకే కాలేజీ వాచ్మన్ మల్లన్న కూడా వచ్చాడు.‘ఏంటిదే మల్లన్నా.. సారుకేమైందే?’ అని ఎదురెళ్ళింది.లోపలున్న తల్లి అరుగు మీదికి వచ్చింది.మల్లన్న నోరిప్పటానికి కిందిమీద అయితున్నాడు.‘చెప్పే అన్నా.. ఏమైంది!’ అని ఏడుస్తూ ఆయన భుజాలు పట్టి కుదిపింది ఈశ్వరి.‘సారు కాలేజీల ఆడపిల్లను పాడు చేసిండట’ అని మెల్లగా అని, ఇంకేమీ చెప్పలేకపోయాడు.‘ఎప్పుడు. ఎక్కడ!’ అంది నమ్మబుద్ధికాక.‘నిన్న పొద్దుగూకంగ. కాలేజీలనేనట!’ అంటూ తనకు తెలిసింది చెప్పాడు.‘నేనత్తపా!’ అని బిడ్డను చంకలో వేసుకుంది.‘అక్కడేమున్నది. కోపంతోటి ఊరోళ్లు మీ సామాన్లను బజార్లేసి కాలవెట్టిన్రు. నువ్వు ఊర్లెకస్తే ఊకోరు’ అన్నాడు ఊర్లోని తీవ్రత ఆమెకు అర్థమయేలా.‘ఇదెక్కడి అన్యాలముల్లో..’ అని రాగం తీస్తూ కూలబడింది.‘ఇప్పుడు బావ ఎక్కడున్నడు?’ అని శ్రీను మల్లన్నను అడిగాడు.‘జగిత్యాల పోలీసులచ్చి తీసుకపోయిండ్రు’ అన్నాడు.ఏడుస్తూనే ఈశ్వరి బిడ్డని చంకనేసుకొని తమ్ముణ్ణి తీసుకోని బయలుదేరింది. వాకిట్లోకి వచ్చినంక ‘మల్లన్నా.. అన్నం తిని పో!’ అని తల్లివైపు చూసి, ముందుకు నడిచింది.జగిత్యాల పాత బస్టాండులో దిగి పిల్లను భుజం మీద వేసుకొని ఈశ్వరి దబదబా నడుచుకుంటూ పోలీస్స్టేషన్ గేటు ముందట నిలబడింది. ఆమె వెనుకాలే వచ్చిన శ్రీను– జవాన్తో ‘పొద్దుగాల్ల పూడూర్ నుంచి మా బావను పోలీసులు పట్టుకచ్చిండ్రు’ అన్నాడు.‘రేప్ కేసోడా! ఆన్ని ఇప్పుడే జైలుకు తీసుకపోయిండ్రు’ అని రోడ్డుకు ఆ వైపున్న జైలు వైపు చేయెత్తి చూపాడు.ఈ మాట వినగానే ఏడ్చుకుంటూ రోడ్డు దాటి కోర్టు వెనుకాల ఉన్న జైలు గేటు వైపు ఉరికింది ఈశ్వరి.‘అక్కా ఆగే.. గిట్లురుకుతే బస్ కిందవడి సత్తవ్!’ అంటూ ఆమె వెనుక నడిచాడు శ్రీను.జైలు గేటు దగ్గరికి పోగానే ‘ఏయ్! దూరం జరుగు’ అని గదమాయించాడు జైలు పోలీస్.శ్రీను ఆయనకు తమ పరిస్థితిని శాంతంగా వివరించాడు.‘ఇప్పుడే తెచ్చిండ్రు. గింత జల్ది ములాఖత్ ఇయ్యరు’ అన్నాడు జవాన్. ‘ఈమె మా అక్క, ఆయన పెండ్లాం. మా బావ మంచోడు. అట్ల చదువుకొనే పిల్లను పాడు చేసేటోడు కాదు. ఒక్కసారి మేం మాట్లాడాలె. గంతే! లోపలికి పంపిత్తే నూర్రూపాలిత్త’ అని జేబులో చేయి పెట్టిండు శ్రీను.‘ఓయ్ గదంత నడవదిక్కడ’ అని జవాన్ అంటుండగా మోటార్ సైకిల్ మీద ఒకాయన సరాసరి ఈశ్వరి, శ్రీనుల దగ్గరికి వచ్చి, ‘నా పేరు రాజేందర్. వకీలును. మా బావ పూడూర్ సర్పంచ్. మీ గురించి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండు’ అన్నాడు.‘యాళ్ళకచ్చిండ్రు. మా బావను చూడాలే!’ అన్నాడు శ్రీను దండం పెడుతూ.‘సరే!’ అనుకుంటూ ఆయన లోపలి పోయాడు. ఈశ్వరి, శ్రీను కూడా ఆయన వెంట వెళ్లి లోపల ఓ చెట్టు కింద నిలబడ్డారు.వకీలు వెంట రాజేష్ వస్తున్నాడు. దూరం నుంచే ఆయన ముఖం కమిలిపోయినట్లు కనబడుతోంది. బహుశా ఊర్లో దెబ్బలు బాగానే కొట్టినట్లున్నారు.ఈశ్వరి కళ్ళల్లో నీళ్లు అప్పటికే ఏడ్చి ఏడ్చి ఎండిపోయాయి. ఇప్పుడామెకు రాజేష్లో తన భర్త కనబడ్తలేదు. ఒక పిల్లను బలాత్కారం చేసిన మృగాడు అగుపడుతున్నాడు.రాజేష్ దగ్గరికి రాగానే, ‘పాపపుముండ కొడుకా! నీ బతుకు చెడ. నిన్ను నమ్మి చదువుకోనికి వచ్చిన పిల్లను పాడు జేస్తవా! అంత మదమెక్కిందా! ఆగలేకపోతే నేనే వస్తుంటి కదా! నిను నమ్మి పోతే బతుకే ఆగం చేసినవ్ గద! పో బాడకవ్, నీ సావు నువ్వు సావుపో!’ అని ముఖం మీద ఉమ్మేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఎంతో దిగులుగా భర్తను చూడ్డానికి వచ్చిన మల్లీశ్వరి ఇట్లా ఆడపులి అవుతుందని ఎవరూ అనుకోలేదు. వకీలు ఇదంతా చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు.రాజేష్ను లోపలికి తీసికెళ్లారు.కాసేపటికి కోలుకున్న వకీలు ‘ఏందయ్యా మీ అక్క అట్ల జేసింది?’ అన్నాడు శ్రీనుతో.‘అక్క అట్లంటదని నేను కూడా అస్సలు అనుకోలేదు సార్. మీదవడి ఏడుస్తదనుకుంటే ఇట్లజేసింది. దానికి బావ అంటే మస్తు ఇష్టం. అసుంటోడు ఇట్ల జేసేసరికి దానికి వశం కాని కోపమచ్చినట్లుంది. అది సల్లవడ్డంక నేను సముదాయిస్తా గని ఇప్పుడు మనం ఏంజెయ్యాలె?’ అన్నాడు శ్రీను.‘మీ బావ చేసింది పెద్ద తప్పు. బెయిల్ దొరకుడు కష్టం. అయితే ఆ పిల్లతోటి మా సారుది తప్పేం లేదు. అంత నా ఇష్ట ప్రకారమే జరిగింది అని కోర్టుల చెప్పించాలె. పోలీసులతోని ఎఫ్ఐఆర్ల వేరే సెక్షన్లు పెట్టించాలె. బాగనే ఖర్చయితది. అంతా లక్ష దాక..’ అంటూ ఆగాడు వకీలు.‘అట్లయితే మా బావ బయిటికస్తడా?’ అన్నాడు శ్రీను ఆశగా.‘కోషిష్ చేద్దాం. చేతుల పైసలుంటె..’ అని మళ్ళీ సగమే మాట్లాడాడు వకీలు.‘పైసల సంగతి నేను చూసుకుంటా!’ అని వకీలుకు భరోసా ఇచ్చి, అక్కను వెతుక్కుంటూ శ్రీను బస్సెక్కి ఇంటికి వచ్చాడు.ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రోజుటి తీరే ఈశ్వరి బీడీలు చేస్తూ కూచుంది. పాప నిద్రపోతోంది.ఏమైందిరా అన్నట్లు తల్లి శ్రీను మొకం చూసింది. కొంచెం ఆగమన్నట్లు సైగ చేశాడు.కొద్దిసేపటికి ‘అక్కా! బావను బయటికి తేవచ్చు అని వకీల్ సాబ్ అన్నడు. పైసలు ఖర్చయితయట లక్ష రూపాయల దాకా’ అని ఆగాడు.ఈశ్వరి ఏమీ మాట్లాడలేదు.‘మాట్లాడవేమే! మొగాడు జైల్ల ఉంటె ఇట్లనేనా చేసేది?’ అంది తల్లి.‘అట్ల జేసినంక ఆడు నా మొగడే కాదు. ఉంచుకుంటే మీతోటి ఉంటా. ఎల్లగొడితే నా బతుకు నేను బతుకుత’ అంది ఈశ్వరి మొండిగా.‘అది గట్లనే అంటది గని నువ్వు అప్పోసప్పోజేసి బావనైతే బయటికిదే. అటెనుక అన్ని సుదురాయిస్తయి’ అంది తల్లి ఇంటి పెద్దగా.ఓ రోజు బాధితురాలి వాంగ్మూలం జడ్జి రూములో రికార్డు అయింది.‘ఆ రోజు ఏం జరిగింది.. రాజేష్ నిన్ను ఏం చేశాడో చెప్పు’ అని జడ్జి శాంతంగా అడిగాడు. తడుస్తున్న కళ్ళను తుడుచుకోవడం తప్ప నోరిప్పలేదు.‘క్లాసులో మీ సార్ నిన్ను ఏం చేశాడు? అప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా?’ అడిగాడు జడ్జి మరింత ఓపిగ్గా.ఏడుపే సమాధానం.‘ఆయన ఏం చేశాడో నీ మెడికల్ రిపోర్ట్స్లో ఉంది. అది ఎలా జరిగిందో నీ నోట చెబితే కేసు ముందుకు పోతుంది’ అన్నాడు కొంత అసహనంగా.ఆమె ఏడ్పు ఆపకపోవడంతో ‘ఈ మాటకైనా సమాధానం చెప్పు.. రాజేష్ నీపై చేయి వేస్తే వద్దని చెప్పవా?’ అన్నాడు.దించి ఉన్న తలను నిలువుగా, అడ్డంగా ఊపింది.కేసు కాగితాల్లో జడ్జి ఆమె వయసును చూశాడు. పద్దెనిమిదేళ్ళకు నెల రోజులు తక్కువగా ఉంది. ఇంకేమీ అడగకుండా ‘సరే.. వెళ్లు’ అంటూ ఆమెను పంపించేశాడు.‘బెయిల్ పిటిషన్ వేయాలి’ అని వకీలు శ్రీను వంక చూశాడు.ఆయన చూపులు పసిగట్టి ‘అయిదు వేలు ఉన్నయ్!’ అన్నాడు శ్రీను.‘సరే తే!’ అని డబ్బులు పాకెట్లో పెట్టుకొని వకీల్ వెళ్ళిపోయాడు.బెయిల్ రోజు కేసు తిరగబడింది.అంతా ముందే తెలిసినట్లు జడ్జి ‘ఇది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కిందికి వస్తది. అది నాన్ బెయిలెబుల్ అఫె. కరీంనగర్లో పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది. ఈ కేసును అక్కడికి బదిలీ చేస్తున్న’ అని చెప్పి ఫైలును పక్కన పెట్టేశాడు.రాజేష్ను పోలీసులు తీసికెళ్లారు.ఏమీ అర్థం కాక శ్రీను వకీల్ దగ్గరికి వెళ్ళాడు.‘పోక్సో కేసయింది. కరీంనగర్ కోర్టుకు పోవాలే. ఆన్నే ఫ్రీ లీగల్ సెల్ ఉంటది. వకీలును ఇస్తరు’ అని శ్రీనుకు ఓ చీటీ రాసిచ్చి, నా పని అయిపోయింది అన్నట్లుగా వకీలు జారుకున్నాడు.తెల్లారే శ్రీను కరీంనగర్ వెళ్లి కోర్టులో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని కలిశాడు. వాళ్లు వివరాలు తీసుకొని, ఒక వకీలు దగ్గరికి పంపారు. ‘పోక్సో కేసు కాబట్టి నెల రోజుల్లోపలే తీర్పు వస్తది’ అన్నాడు కొత్త వకీలు.ఆయన అన్నట్లే పదిహేను రోజులకే విచారణకు వచ్చింది.జడ్జి ప్రశ్నలకు రాజేష్ తల వంచుకొని మౌనమే నా సమాధానం అన్నట్లు నిలబడ్డాడు.‘మైనర్ బాలికపై లైంగిక అత్యాచారం చేసిన ముద్దాయి రాజేష్కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష, యాభై వేల రూపాయల జరిమానా విధిస్తోంది’ అని ఒకే వాక్యంలో జడ్జి తీర్పు చెప్పేశారు. స్పీడ్ కోర్టు తన పవర్ చూయించింది.నిజామాబాద్ జైల్లో చోటు లేదని రాజేష్ను చర్లపల్లి జైలుకు పంపారు.రాజేష్ కాలం మౌనంగా, విచారంగా సాగుతోంది. భార్య ఘాటైన తిరస్కారంతో ఆయన మనసు మరింత కుంచించుకు పోయింది. జైలులో బతకడానికి పర్వాలేదు కాని, చావడానికే మార్గం లేదని విషాదంగా నవ్వుకున్నాడు. బయట చావడానికి ఎన్నో దారులు. ఉరి వేసుకోవచ్చు, రైలు కింద పడవచ్చు, విషం తాగవచ్చు, కత్తితో కోసుకోవచ్చు. ఇక్కడ అవేవీ కుదురవు. ఖైదీ చస్తే నేరం జైలు అధికారులు మోయాలి. అందుకే చావనీయరు.చర్లపల్లి జైలు అధికారుల్లో శోభన్ ఒకరు. ఆయన మనిషికి ఎక్కువ, పోలీసుకు తక్కువ. తన బ్యారక్లోని ప్రతి ఖైదీనీ ఆయన కళ్లు స్కాన్ చేస్తుంటాయి. కోర్టు శిక్ష వేసినా, మనిషిలోని మంచి చెడులను ఆ కళ్లు వేరు చేసి చూడగలవు. కొన్నాళ్లుగా రాజేష్ ఒంటరితనాన్ని గమనించిన శోభన్ ఓ రోజు అతన్ని తన ఆఫీసుకు పిలిపించాడు.‘రా! కూచో.. కోర్టుకు సాక్ష్యాలు కావాలి కాని, జైలుకు వాటితో పనిలేదు. మాతో ఏదైనా మాట్లాడచ్చు’ అన్నాడు.జైలర్ ఇచ్చిన చొరవతో రాజేష్ చాలా రోజుల తర్వాత నోరు విప్పాడు.‘నేను కాలేజీలో మ్యాథ్స్ చెప్పేవాణ్ణి. డెలివరీకి వెళ్లిన భార్య, పుట్టిన పాప ఇంకా అత్తవారింట్లోనే ఉన్నారు. ఈలోగా ఈ సంఘటన జరిగింది. ఒక టీచర్గా నేను చేసింది తప్పే. కారణమేదైనా విధి నిర్వహణకు నాది నమ్మక ద్రోహమే. పోక్సో చట్టం దృష్టిలో నాది నేరమే. అంతా నా ఇçష్ట ప్రకారమే జరిగింది అని పదిహేడేళ్ల అమ్మాయి జడ్జికి చెప్పినా మగాడే నేరస్తుడు అని బొంబాయి కోర్టు శిక్ష వేసింది. మంచీ చెడూ అని గీత గీసి వేరుచేయలేని సున్నితమైన విషయం ఇది. నా విషయంలో మాత్రం నా కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. ఐదేళ్ల తరవాత బయటికి వెళ్లినా, మళ్ళీ నా వాళ్ల ముందు నిలబడే మొకం నాకు లేదు’ అన్నాడు తల దించుకుంటూ.తప్పు ఎలా జరిగిందో చెప్పకున్నా జరిగిన నష్టాన్ని రాజేష్ లెక్కేస్తున్న తీరు శోభన్ను కదిలించింది. స్త్రీ పరువు, వృత్తి ధర్మం, కుటుంబ బాధ్యతలకు విలువిచ్చే మనిషి కూడా ఓ ఉద్రేక క్షణాన విచక్షణ కోల్పోవడం దురదృష్టమే అనిపించింది. ఎమ్మెస్సీ చదవాడని తెలిశాక రాజేష్కు జైలు స్కూల్లో పని దొరికింది. తన చదువు నలుగురికి పనికొస్తున్నందుకు రాజేష్కు కొంత తృప్తిగా ఉంది.అలా రెండేళ్లు గడిచాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా రాజేష్ను కలవడానికి ఎవరూ రాలేదు. అసలు అక్కడి పరిస్టితి ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో శోభన్ ఓ సెలవు రోజు సరాసరి రాజేష్ అత్తవారింటికి వెళ్ళాడు.తానెవరో చెప్పగానే శ్రీను ‘నమస్తే సార్!’ అంటూ కుర్చీ వేశాడు.గోడవారగా కూచొని బీడీలు చుడుతున్న ఈశ్వరి తలెత్తి ఆయన్ని చూడలేదు. ఆమె పక్కనే పాపను ముందేసుకుని అమ్మమ్మ కూచుంది.‘ఏమయ్యా మీ బావను చూడ్డానికి రావచ్చు కదా!’ అన్నాడు శోభన్ చొరవగా.‘ఎవరూ పోవద్దని మా అక్క ఒట్టేయించుకుంది సార్!’ అన్నాడు శ్రీను.అప్పుడాయన ఈశ్వరి వైపు తిరిగి ‘నీ భర్త తప్పే చేశాడు కాని చెడ్డవాడు కాదమ్మా!’ అన్నాడు శాంత స్వరంలో.ఆమె జవాబీయలేదు.‘తప్పు చేసినంక మంచోడెట్లయితడు అంటది. బావ గురించి ఇంకో మాటే మాట్లాడది’ అన్నాడు శ్రీను.‘జైల్లో బతుకుతున్నవాళ్లకు తమవారిని కలవడమే పరమానంద క్షణాలు. తమ కోసం ఎవరు రాని ఖైదీలు భోజనం కూడా సరిగా చేయరు. నలుగురిలో కలవరు. రాజేష్ పరిస్థితి అలాగే ఉంది. అందుకే నేను ఇక్కడి దాకా వచ్చాను.’ అన్నాడు శోభన్.ఈశ్వరిలో కదలిక లేదు. ఆ మాటలు విననట్లే ఉంది.‘అది చాలా మొండిది సార్.. మేం చెప్పి చెప్పి చాలించుకున్నాం’ అన్నాడు శ్రీను.‘తమ వారు జైల్లో ఉంటే ఏ కుటుంబానికైనా నలుగురి ముందు తలవంపే! ఓ రకంగా కుటుంబమంతా శిక్ష అనుభవిస్తున్నట్లే! కాలాన్ని వెనుకకు తిప్పలేం. కాబట్టి ఏదో తోవ పట్టుకొని మనమే ముందుకు నడవాలి’ అని ఆగి, జవాబు కోసం ఈశ్వరి వైపు చూశాడు. షరా మామూలే. ఆమెలో ఏ మార్పు లేదు. అంతలో ఒకామె టీ తీసుకోని వచ్చింది.కప్పు అందుకుంటూ ‘ఈమె ఎవరు?’ అన్నాడు శోభన్. ‘అదే పిల్ల, విమల. మా బావకు శిక్ష..’ అని ఆగాడు శ్రీను.ఆ మాట వినగానే చేయి కాలినట్లు కప్పు వెంటనే పక్కన పెట్టాడు.‘ఈ ఊరేనా?’‘‘కాదు. దూరమే. కాని, కోర్టు తీర్పు వచ్చినంక ఊర్లె కుల పంచాయతీ పెట్టిండ్రు. ‘దీని బతుకు ఖరాబు చేసినోనికి ఐదేండ్లు జైలు శిక్ష, యాభై వేలు జుల్మానాతో సరిపోయింది. మరి దీన్ని ఎవడు చేసుకుంటడు’.. అని విమల నాయన అడిగిండు. ‘కోర్టులనే పంచాయతీ తెగింది. ఇంకేముంటది’ అని పెద్దమనుషులు అన్నరు. అప్పుడు విమల నాయన మా అక్కతోటి ‘అవునే ఈశ్వరీ.. నువ్వు ఆడదానివే కదా.. ఆడు నీ మొగడే కదా.. న్యాయం నువ్వే చెప్పు. నీ మాటే ఖరారు’ అన్నడు. అప్పుడు అక్క లేచి విమల చేయి పట్టుకోని.. రాజేష్ వచ్చినంక సంసారం చేసేది విమలతోనే’ అని ఈమెను ఇంటికి తెచ్చింది’’ అన్నాడు శ్రీను.ఈశ్వరి శిల్పంలా అలాగే ఉంది. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో శోభన్ బుర్రకు తట్టడం లేదు. ఈశ్వరి పట్ల గౌరవం పెరిగినా, ఆమెను కరిగించే విద్య తన వద్ద లేదనుకున్నాడు. ప్రత్యర్థి చెక్ పెట్టాక దారి తెలియని ఆటగాడిలా లేచి నిలబడ్డాడు.‘సరే.. వెళ్ళొస్తా!’ అంటూ బయటికి వచ్చాడు. ఈశ్వరి గంభీర మౌనాన్ని ఛేదించలేక శోభన్ వాగ్బాణాలన్నీ విరిగిపోయాయి. ఆయన మనసంతా గందరగోళంగా ఉంది.ఊరి బయట ఉన్న చిన్న హోటల్లో టీ తాగుతూ కాసేపు గడిపాడు. చేసేదేమి లేక కొంత గ్యాప్ తీసుకోని మళ్ళీ రావాలని అనుకుంటూ బయటికి వచ్చాడు. కారు డోర్ తెరుస్తుండగా కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టు కింద విమల నిలబడి ఈయన్నే చూస్తూ కనబడింది. ఆమెను గుర్తు పట్టి అక్కడే ఉండు అని చేయి ఊపి కారును తీసికెళ్ళి ఆమె ముందు ఆపాడు.కారు దిగుతూ ‘ఏంటమ్మా ఈమె ఎవరికీ అర్థం కాకుండా ఉంది’ అన్నాడు తాను చెట్టు కిందికి వెళుతూ.‘పట్టింపులు ఎక్కువైనా.. ఈశ్వరక్క చాలా మంచిది. నన్ను మా ఇంట్లో కన్నా మంచిగా చూసుకుంటది. డిగ్రీ కూడా చదివిస్తానంటున్నది. తర్వాత ఏదైనా ఉద్యోగం చేస్తాను. అయితే..’ అని విమల అటు ఇటు చూసింది.‘నీకేం కాదమ్మా.. నేను ఉన్నాను కదా! మనసులో ఉన్నదంతా చెప్పేయ్!’ అన్నాడు.‘నాకు శ్రీను అంటే ఇష్టం’ అంది మెల్లగా.ఈ ట్విస్టుకు అడ్జస్టు కావడానికి శోభన్కు కొంత సమయం పట్టింది.‘జరిగింది ఓ పీడకల అనుకుంటా సార్! దాన్నే తలుచుకుంటూ ఏడుస్తూ కూచుంటే ఇక్కడ కొన్ని జీవితాలు, కుటుంబాలు కోలుకోలేని దెబ్బ తింటున్నాయ్’ అంది.విమల మాటలు ఆయనకు ఎన్నడూ చదవని పాఠంలా అనిపించాయి. గాయపడిన పక్షి ఎగరడానికి రెక్కలను టపటప ఆడిస్తున్నట్లుగా ఉన్నాయి.‘మరి శ్రీను..’ అన్నాడు విషయంలోకి వస్తూ.‘శ్రీనుకు కూడా ఇష్టమే. అసలైతే రాజేష్ సార్ జైలు నుంచి రాగానే మేమిద్దరం దూరంగా వెళ్లిపోదామనుకున్నాం. అయితే ఈశ్వరక్క నమ్మకాన్ని దెబ్బ తీశామనే బాధ వదిలేది కాదు. మీరు తలుచుకుంటే మా నలుగురి బతుకుల్ని సరిదిద్దగలరని ఆశ పుడుతోంది’ అంది చేతులు జోడిస్తూ. ఆ మాటలకు ఈశ్వరి వేసిన కటికముడి కొద్దిగా విచ్చుకుంటున్న ఆశ శోభన్ మనసులో కదిలింది.‘గుడ్ విమలా! మీ నిర్ణయం వండర్ ఫుల్. నా సర్వీసులో ఇదొక డిఫరెంట్ చాలెంజ్. వదిలి పెట్టను. మళ్ళీ వస్తాను. మళ్ళీ మళ్ళీ వస్తాను. విజయం మనదే. ఆల్ ది బెస్ట్!’ అంటూ కారులో కూచున్నాడు.‘మెనీ మెనీ థాంక్స్ సార్. బై బై!’ అంటూ విమల వీడ్కోలు చెప్పింది. -
ఏఐ కారణంగా... వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి?
ప్రతి నాణేనికీ బొమ్మ బొరుసులు ఉంటాయి; ప్రతి పరిణామానికీ మంచి చెడులు ఉంటాయి; కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) కూడా ఉభయ కోణాలూ ఉంటాయి. ఏఐ దెబ్బకు ఇప్పటికే ఉన్న అనేక ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ సాంకేతికత కొత్త ఉద్యోగాలకు ఊపిరి పోస్తుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఏఐ కారణంగా...వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి? ఏఐ కాయిన్కి అటూ ఇటూ ఒకసారి పరిశీలించి చూద్దాం.ఏఐ దెబ్బకు ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు పోయిన మాట నిజమే! సమీప భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకూ ఎసరొచ్చే పరిస్థితులు కూడా నిజమే! కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన తర్వాత టైపిస్టుల ఉద్యోగాలు క్రమంగా తెరమరుగైపోయాయి. చిన్నా చితకా పట్టణాల్లోనూ కనిపించే టైప్ ఇన్స్టిట్యూట్లు శాశ్వతంగా మూతబడ్డాయి. కొత్త సాంకేతికత ఏదైనా విరివిగా వాడుకలోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. నిజానికి లెక్క చూసుకుంటే, కంప్యూటర్ల వల్ల పోయిన ఉద్యోగాల కంటే కొత్తగా వచ్చిన ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన కొత్తలో టైపిస్టుల ఉద్యోగాలు పోయినా, కనీస నైపుణ్యాలు కలిగినవారికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చాయి. కంప్యూటర్ల వాడకం పెరిగాక రకరకాల అవసరాల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. అదే రీతిలో ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు లేకుండా పోయినా, ఇంకొన్ని కొత్త తరహా ఉద్యోగాలు రానున్నాయి. ఏఐ కారణంగా పోయే ఉద్యోగాల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అమెరికన్ కంపెనీ ‘ఆంత్రోపిక్’ సీఈవో, ‘క్లాడ్’ ఏఐ మోడల్ రూపకర్త డేరియో అమోడీ ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు సగానికి సగం తగ్గిపోతాయని చెబుతుంటే, ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ వంటి అంతర్జాతీయ సంస్థలు భిన్నమైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఈ సంస్థలు చెబుతున్నాయి.కోట్లలో కొత్త ఉద్యోగాలుఈ ఏడాది పూర్తయ్యేలోగా ఏఐ వల్ల వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 9.7 కోట్ల ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొస్తాయని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ అంచనా వేస్తోంది. వైద్యరంగంలో రోగనిర్ధారణ చేయడంలో ఏఐ మానవ వైద్యులను మించిన పనితీరును ఇప్పటికే ప్రదర్శిస్తోంది. అకౌంటింగ్, భాషానువాదం వంటి రంగాల్లోనూ ఏఐ తన సత్తా చాటుకుంటోంది. ఏఐ ఎన్ని సేవలకు ప్రత్యామ్నాయం కాగలిగినా, అంతిమ నిర్ణయం తీసుకునే శక్తి మాత్రం మానవులదే! మానవ నిర్ణయాత్మక శక్తికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు. రానున్న కాలంలో ఏఐ మరింతగా అభివృద్ధి చెంది, పరిశ్రమల తీరుతెన్నులను మార్చేస్తుందని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఆరోగ్య, ఆర్థిక, సాంకేతిక తదితర రంగాల్లో ఏఐ ప్రభావం వల్ల 2030 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు5 కోట్ల వరకు కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘మెక్ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్’ అంచనా వేస్తోంది. సాంకేతిక నైపుణ్యానికి తోడు మానవ కౌశలం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధాశక్తి అవసరమయ్యే ఉద్యోగాలు పలు రంగాల్లో కొత్తగా పుట్టుకొస్తాయని, వీటికి తగినట్లుగా శరవేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలను సాధించగలిగితే, ఏఐ ఆధారిత ఉద్యోగాలను దక్కించుకోవడం అంత కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా వచ్చే ఉద్యోగాలుఏఐ వాడకం పెరగడం వల్ల పలు రంగాల్లో కొన్ని సాంకేతిక, సాంకేతికేతర ఉద్యోగాలు రానున్నాయి. ఆ కొత్త ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల్లోపనిచేసేవారు నిర్వర్తించే విధుల గురించి సంక్షిప్త సమాచారండేటా సైంటిస్ట్డేటా సైంటిస్టులు సంస్థకు అవసరమైన డేటాను విశ్లేషించి, అందులోని సమాచారాన్ని సంస్థ నిర్ణయాలకు ఉపయోగపడేలా క్రోడీకరించి అందిస్తారు.మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్: మెషిన్ లెర్నింగ్ మోడల్స్కు రూపకల్పన చేయడం, వాటిని వాస్తవ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. వీరు డేటా సైంటిస్టులకు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు మధ్య వారధిలా పనిచేస్తారు.రోబోటిక్స్ ఇంజినీర్: రోబోల రూపకల్పన, నిర్మాణం, ఆటోమేటెడ్ సిస్టమ్స్తో రోబోలను అనుసంధానం చేయడం రోబోటిక్స్ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్స్ ఇంజినీరింగ్ విభాగాల సమ్మిళిత పరిజ్ఞానంతో వీరు పనిచేస్తారు.ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్: ఏఐ రీసెర్చ్ సైంటిస్టులు కొత్త ఆల్గోరిథమ్స్ను, ఏఐ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చేసేందుకు కావలసిన మెలకువలను రూపొందించడం; డిజైనింగ్ ప్రయోగాలు చేయడం; నమూనాలను రూపొందించడం; వాటికి అవసరమైన పరిశోధనలు సాగించడం వంటి పనులు చేస్తారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) ఇంజినీర్: ఎన్ఎల్పీ ఇంజినీర్లు– మనుషుల భాషను అర్థం చేసుకుని, విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందిస్తారు. మనుషుల భాషలోని ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేలా కంప్యూటర్లను తీర్చిదిద్దుతారు.కంప్యూటర్ విజన్ ఇంజినీర్: ఫొటోలు, ఇతర చిత్రాలు, వీడియోలను చూసి, వాటిని అర్థం చేసుకుని విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందించడంలో కంప్యూటర్ విజన్ ఇంజినీర్లు కీలకంగా పనిచేస్తారు.ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్: ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించుకునే సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందిస్తారు. సంస్థ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తారు.ఏఐ ఆర్కిటెక్ట్: సంస్థకు అవసరమైన ఏఐ సిస్టమ్స్ను రూపొందించడంలోను, వాటిని వినియోగంలోకి తేవడంలోను ఏఐ ఆర్కిటెక్ట్లు కీలకంగా పని చేస్తారు. ఏఐ సాంకేతిక ఉపయోగానికి అవసరమైన అవకాశాలను గుర్తించడంలోను, ఏఐ సాంకేతికతకు తగిన సాధనా సంపత్తిని సమకూర్చడంలోను వీరిదే ప్రధాన పాత్ర.ఏఐ ట్రైనర్: ఏఐ సిస్టమ్స్కు శిక్షణ ఇవ్వడం ఏఐ ట్రైనర్ల పని. డేటాను, ఫీడ్బ్యాక్ను అర్థం చేసుకుని, పనితీరును మెరుగుపరచుకునేలా ఏఐ సిస్టమ్స్ను వీరు అభివృద్ధి చేస్తారు.ప్రాంప్ట్ ఇంజినీర్: జెనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి ఆశించిన ఔట్పుట్ను రాబట్టేందుకు అవసరమయ్యే ఆదేశాలను, సూచనలను రూపొందించడంలో ప్రాంప్ట్ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఏఐ అప్లికేషన్ల పనితీరును గరిష్ఠస్థాయిలో మెరుగుపరచే దిశగా వీరు వాటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటారు.ఏఐ ఎథిసిస్ట్: ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఏఐ ఎథిసిస్టుల అవసరం కూడా పెరుగుతుంది. ఏఐ వల్ల జరిగే అనుకోని పొరపాట్లను, వాటి కారణంగా ఎదురయ్యే నైతిక సమస్యలను నివారించేందుకు తగిన రీతిలో ఏఐ సిస్టమ్స్ను తీర్చిదిద్దడం, ఏఐ వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఏఐ ఎథిసిస్టుల ప్రధానమైన పనులు.ఎక్స్ప్లెయినర్స్ఏఐ డెవలపర్స్కు, ఏఐ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థల యాజమాన్యాలకు మధ్య ఎక్స్ప్లెయినర్స్ వారధిలా పనిచేస్తారు. ఏఐ విధానాలు పారదర్శకంగా ఉండేలా చూడటం, వాటి పనితీరును, ప్రయోజనాలను వ్యాపార సంస్థల యాజమాన్యాలకు వివరించడంలో ఏఐ డెవలపర్స్ కీలక పాత్ర పోషిస్తారు. మార్పులకు లోనయ్యే ఉద్యోగాలుఏఐ ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న పలు ఉద్యోగాల్లో మార్పులు ఇప్పటికే మొదలయ్యాయి. ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఈ ఉద్యోగాల్లో మరిన్ని మార్పులు కూడా జరగనున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పని ఏఐ వల్ల మరింత సులభతరం అవుతుంది. కోడింగ్ వంటి కొన్ని పనులను ఏఐ చేసేయగలుగుతుంది. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పనిభారం తగ్గుతుంది. అంతమాత్రాన వారి అవసరం పూర్తిగా లేకుండాపోదు. సంక్లిష్టమైన పనులు సజావుగా జరిగేలా చూడటంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్ర కొనసాగుతుంది. డేటా అనలిస్టుల పని కూడా ఏఐ వల్ల సులభతరం అవుతుంది. డేటా సేకరణ, విశ్లేషణ వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మార్కెట్ ధోరణులను గుర్తించడం, డేటా ఫలితాలను విశ్లేషించడం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో డేటా అనలిస్టులు మరింత సమర్థంగా పనిచేసేందుకు వీలు చిక్కుతుంది. ఏఐ వల్ల సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ ఉద్యోగుల పని కూడా చాలా వరకు తేలికవుతుంది. టార్గెటెడ్ యాడ్స్ గుప్పించడం వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మనుషులతో నేరుగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ఉద్యోగులు స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది.కనుమరుగయ్యే ఉద్యోగాలుఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు అతి త్వరలోనే తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలైతే దాదాపుగా కనుమరుగైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. టైపింగ్, కాపీయింగ్, పేస్టింగ్ వంటి పనులను ఏఐ స్వయంగా చేయగలుగుతోంది. దీనివల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐతో పనిచేసే అధునాతన డ్రైవర్లెస్ వాహనాలు ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి పెద్దసంఖ్యలో వాడుకలోకి వస్తే, ఇక డ్రైవర్ ఉద్యోగాలు కూడా కనుమరుగైపోతాయి. కర్మాగారాల్లో బరువులు ఎత్తడం, బరువైన వస్తువులను ఒకచోటి నుంచి మరొక చోటికి చేర్చడం వంటి పనులను సునాయాసంగా చేయగలిగే ఏఐ రోబోలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వాడుకలోకి వచ్చాయి.ఇవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేటట్లయితే, కర్మాగారాల్లో పనిచేసే నైపుణ్యాలు లేని కార్మికుల ఉద్యోగాలు అంతరించిపోతాయి. ఈ–కామర్స్ రంగంలో ఏఐ వాడకం మెల్లగా పెరుగుతోంది. ఇది మరింతగా పెరిగితే, రిటైల్ సేల్స్ ఉద్యోగులు ఇతర ఉపాధి మార్గాలను వెదుక్కోక తప్పదు. అకౌంటింగ్ రంగంలో బుక్ కీపింగ్ సహా ప్రాథమిక అకౌంటింగ్ పనులన్నీ ఏఐ సాయంతో ఆటోమేషన్ ద్వారా జరిగిపోతున్నాయి. దీనివల్ల కిందిస్థాయి అకౌంటింగ్ ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐ ద్వారా అందుబాటులోకి వచ్చిన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సిస్టమ్స్ పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో త్వరలోనే పత్రికా సంస్థలు, ప్రచురణ సంస్థల్లో ప్రూఫ్ రీడర్స్, ట్రాన్స్లేటర్స్ ఉద్యోగాలు ఇకపై ఉండకపోవచ్చు. ఏఐ ప్రభావం వల్ల మనుషులు చేసే ఉద్యోగాల్లో చాలావరకు అంతరించిపోతాయని, ఉద్యోగాల్లో మనుషుల అవసరం గణనీయంగా తగ్గిపోతుందనే వాదనలు జనాల్లో గందరగోళం రేపుతున్నాయి. ఏఐ ప్రభావం వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నా, అంతకు మించి కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏఐ సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోగలిగే వారికి సమీప భవిష్యత్తులోనే పుష్కలంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయని ప్రపంచస్థాయి ప్రీఎమినెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ‘గోల్డ్మన్ సాక్స్’ అంచనా వేసింది. ఏఐ కారణంగా 25 శాతం వరకు నైపుణ్యాలు లేని కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఉన్నట్లు చెబుతోంది. మరోవైపు ఏఐ కారణంగా 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అమెరికన్ బహుళజాతి ఆర్థిక సంస్థ ‘జేపీ మోర్గాన్ చేజ్’ అంచనా వేస్తోంది. ఏఐ ప్రభావంతో వచ్చే ఉద్యోగాలు, పోయే ఉద్యోగాల పరిస్థితులు ఎలా ఉన్నా, ఏఐ ప్రభావం వల్ల ప్రపంచం మరింత ముందుకు పురోగమించడం మాత్రం ఖాయం. -
పిడకల ధూపం.. ఆరోగ్య ధూమం
ఆవుపేడకు ఉన్న ప్రశస్తి తెలిసినదే! ఆవుపేడతో తయారు చేసిన పిడకలను ఇదివరకటి కాలంలో పొయ్యి రాజేసుకోవడానికి వంటచెరకుగా వినియోగించేవారు. ఇప్పటికీ ఆవుపేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్, అగరొత్తులు, జపమాలలు, కుండీలు, దేవుళ్ల ప్రతిమలు, ప్రమిదలు, బొమ్మలు, విభూది, పళ్లపొడి వంటి వాటి తయారీకి ఉపయోగిస్తున్నారు. అయితే, రైతు సుబ్బరాజు ఆవుపేడకు వనమూలికలను జతచేసి, అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నారు.పర్యావరణ పరిరక్షణే లక్ష్యంచిత్తూరు జిల్లా నగరి మండలం, రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు విలక్షణమైన పద్ధతిలో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలను సాగుచేసిన రైతుగా, పాడి రైతుగా తనకు గల అనుభవంతో పర్యావరణ రక్షణ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఆయుర్వేద గ్రంథాలను అధ్యయనం చేయడమే కాకుండా, ఆయుర్వేద నిపుణులను కలుసుకొని, వారి సూచనలతో అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. ఇంటి వద్దనే ఒక పాక వేసుకుని, ఈ అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు.ఆయుర్వేద మూలికలతో... దేశవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతి, తామర మొదలైన సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాంసి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, సుగంధిపాల, గ్రంథి, చెంగల్వకోష్టు, పచ్చకర్పూరం వంటి మూలికలు, ఆయుర్వేద ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి, కావలసిన ఆకారంలో పిడకలను తయారు చేసి ఎండబెడతారు. వీటి తయారీకి కావలసిన సామగ్రిని సమకూర్చుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులూ అందుబాటులో ఉంటే ఒక మనిషి రోజుకు మూడువందల వరకు పిడకలను తయారుచేసి, ఎండబెట్టవచ్చు. ఈ పిడకలను హోమద్రవ్యంగా అగ్నిహోత్రంలో వినియోగించవచ్చు. అలాగే, వీటి పొగను ఇంట్లో ధూపంగా కూడా వేయవచ్చు. ఈ పిడకల నుంచి వెలువడే పొగ సుగంధభరితంగా ఉండి, ఇంట్లోని వాతావరణాన్ని ఆధ్యాత్మికతతో నింపుతుంది. పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చి పలువురు ఈ అగ్నిహోత్ర పిడకలను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఒకసారి ఈ పిడకలను వాడి, వాటి నాణ్యతను తెలుసుకున్నవారు మళ్లీ మళ్లీ వాటిని వినియోగిస్తున్నారు.ఆరోగ్యం కోసం చేస్తున్నా...ఆరోగ్యకరమైన పంటలను అందించడానికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అలాగే గాలిని కూడా వీలైనంత మేరకు ఆరోగ్యకరంగా మార్చాలనే ఆలోచనతోనే ఈ పిడకల తయారీని ప్రారంభించాను. పూర్వీకులు ఉదయాన సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ను నిర్మూలించేందుకు ఆవు పేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఇటీవలి ప్రయోగాల్లో కనుగొన్నారు. ఒక పిడక మీద సెల్ఫోన్ ఉంచినపుడు దాని నుంచి వెలువడే రేడియేషపరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాల్లో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకుని, కొందరు ఆయుర్వేద నిపుణుల సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నాను. వీటి తయారీకి కావలసిన వస్తువులను సేకరించడం చాలా కష్టతరంగా మారింది. పది కిలోల పేడతో పిడకలు తయారు చేయాలంటే, మూడు కిలోల నెయ్యి అవసరం. వీటి తయారీకి వాడే పాలు, పెరుగు, పంచితంతో పాటు వీటిలో వేసే మూలికలు ఇక్కడ లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపులకు వెళ్లి తీసుకువచ్చా. ఇలా తయారుచేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోంది. నేను రూ. 30కే విక్రయిస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నా.– సుబ్బరాజు, పాడిరైతు, రాజులకండ్రిగ, నగరి మండలం. కోనేరి చంద్రమోహన్, నగరి(చదవండి: మట్టి నుంచి విద్యుత్తు!) -
అదితి శంకర్ ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
డైరెక్టర్ కూతురే అయినా, ఆమెను కెమెరా ముందు నిలిపింది కేవలం తన టాలెంటే! అందుకే, ప్రతిభను నమ్ముకుని ముందుకెళ్లే అదితి శంకర్ అందానికి కారణం కూడా ఆమె ఆత్మవిశ్వాసమేనట!నాకు బ్యూటీ సీక్రెట్లు ఏవీ లేవు! ప్రతిరోజూ స్నానం చేయడం, బాగా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, అంతే! సంప్రదాయ దుస్తులు అంటే ఇష్టం. ముఖ్యంగా చీరల్లో నేను రాణిలా మెరిసిపోతుంటాను. అందుకే ప్రత్యేక సందర్భాల్లో నా మొదటి ఎంపిక చీరలే. ఇవి నాకు అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తాయని అంటోంది అదితి శంకర్. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్ బ్రాండ్ నిరాలీ, ధర రూ. 35,000, జ్యులరీ బ్రాండ్: ఎమిథిస్ట్, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. డబుల్ చెయిన్... డబుల్ ఇంపాక్ట్!ఫంక్షనేమో చిన్నదే కాని, అది చాలా దగ్గరి వారిది. పెద్దగా తయారవకుండానే, ప్రత్యేకంగా కనిపించాలి. అయితే, ఒక్కసారి మెడలో ఈ డబుల్ లేయర్డ్ చెయిన్ వేసుకోండి. తళతళలాడే భారీ నగలు లేకుండానే, ఈ ఒక్క ఆభరణమే అందరి చూపులను ఆకర్షించేలా చేస్తుంది. సింపుల్ అయినా సాఫిస్టికేటెడ్, క్యూట్ అయినా కిల్లర్ లుక్కి చిరునామా డబుల్ లేయర్డ్ చెయిన్తో అందుకే దీని ప్రభావం కూడా రెట్టింపుగా ఉంటుంది. అయితే, ఈ హారం వేసుకునేటప్పుడు కొన్ని స్టయిలింగ్ చిట్కాలు గుర్తుంచుకోవాలి. చెయిన్ స్పష్టంగా మెడపై మెరిసిపోవాలంటే వీ–నెక్ లేదా ఓపెన్ నెక్ బ్లౌజ్ ఉండేలా చూసుకోవాలి. పెద్ద చెవిపూసలు వేసుకుంటే ఈ చెయి తో పోటీ పడతాయి. అందుకే చిన్న స్టడ్స్ లేదా చిన్ని జుమ్కీలు సరిపోతాయి. చేతికి తక్కువ గాజులు, ముఖానికి మినిమల్ మేకప్ అంతే, సిద్ధం! జుట్టు విషయంలో కూడా సహజంగా వదిలిన లైట్ కర్ల్స్ ఉంటే మెడ బాగా కనిపిస్తుంది, చెయిన్ మరింత మెరిసిపోతుంది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిన్న డబుల్ చెయన్తో మీ లుక్కి ఒక డబుల్ ఇంపాక్ట్ గ్యారంటీ!. డ్రెస్..బ్రాండ్: నిరాలీధర: రూ. 35,000జ్యూలరీ:బ్రాండ్ : ఎమిథిస్ట్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
ఏ వానకా అడుగు!
వర్షాకాలంలో అడుగు జారకుండా ఆటలు ఆడేందుకు, పాదాలు తడవకుండా తిరగడానికి.. ఇవే సరైన జోళ్లుజల్లుల్లో జంపింగ్ ఫ్రెండ్స్! చినుకుల్లో తడుస్తూ మురిసిపోవాలనేది చిన్నారులకుండే సరదా! కాని, అదే సమయానికి పాదాలను స్లిప్పరీ చెప్పులు ఉంటే? చినుకుల ఆనందం కాస్త చిటపట చిరాకుగా మారిపోతుంది. అడుగు జారిందంటే, వెంటనే అమ్మ చేసిన వడలు చేతిలో కాదు, చెంప మీద వేడి వేడిగా ఉంటాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, మీ దగ్గర తప్పకుండా ఈ ‘స్లిప్ ఆన్ క్యాజువల్ షూస్’ ఉండాలి. చూడగానే వావ్ అనిపించే కలర్, డిజైన్స్తో ఎంతో స్టయిల్గా ఉంటాయి. లేసులూ లేవు, హడావిడీ లేదు. ఇవి వేసుకొని అడుగు బయట పెడితే, ఇక ఎలాంటి వర్షమొచ్చినా జారిపడే ప్రమాదం ఉండదు. మట్టిలో దూకినా, బూట్లు ఏమాత్రం గోల చేయవు. పిల్లల వయసుకు తగ్గట్టు, వివిధ సైజుల్లో లభిస్తాయి. ధర రూ.799 మాత్రమే! వర్షంలో వంకరలేని స్టయిల్!వర్షాకాలం వచ్చింది అంటే, ఫ్యాషన్ ఫ్రీక్స్కి రోజూ ఒకే ప్రశ్న ‘చక్కగా కనిపించాలా? లేక తడవకుండా ఉండాలా?’ ఇవి రెండూ కాకుండా మూడో ఆప్షన్ ఉంది. ఆ రెండూ ఒకటే చోట ఉండటం. అదే, ఈ ‘క్రాక్స్ క్యాజువల్ స్లిపాన్స్’ ప్రత్యేకత! వీటిని వేసుకున్న ప్రతిసారీ అడుగులు కంఫర్ట్గా, లుక్ క్లాసీగా ఉంటుంది. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. ఎవరికైనా ఇవి ఫర్ఫెక్ట్ ఫిట్. మెరిసే క్రాక్ లైట్ మెటీరియల్, స్మూత్ ఫినిష్తో ఉంటాయి కాబట్టి, తడికి జారిపోయే పరిస్థితి రాదు. అంతేకాదు, మురికి నీరు, మట్టి, బురద ఇలా చెప్పులకు ఏది అంటినా, టిష్యూతో తుడిచేస్తే చాలు. శుభ్రంగా, ఫ్రెష్గా ఉంటాయి. ధర రూ. 5,395.షూ తప్పనిసరి అయితే, ఇవి అవసరం! కాలేజ్లో ‘షూ తప్పనిసరి!’ అని నోటీసు చూశారా? ఆఫీస్ ఫార్మల్స్లోకి షూస్ తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదా? కాని, బయట చూస్తే బురద, మట్టి, మురికి నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా? ఇలా భయపడకండి! ఒక్కసారి ఈ ‘హిల్సన్స్ హై యాంకిల్ షూస్’ ట్రై చేయండి. ఇవి స్టూడెంట్కైనా, స్టాఫ్కైనా, ఎవరికైనా చక్కగా సరిపోతాయి. ఫుల్ రఫ్ అండ్ టఫ్గా వాడుకునేలా దీని పీవీసీ సోల్ మెటీరియల్, కంఫర్ట్ కోసం లోపల కాటన్ లైనింగ్తో వీటిని డిజైన్ చేశారు. లైట్ వెయిట్ కూడా. స్టయిలిష్ లుక్ కంటే, వర్షంలో జారిపోని గౌరవమే మిన్న అనుకునేవారు తప్పకుండా వీటిని ట్రై చేయండి. ధర రూ. 514 మాత్రమే! -
ఈ చిరుజల్లుల్లో టేస్టీ టేస్టీ స్నాక్స్ చేసేద్దాం ఇలా..!
మిల్క్ కేక్ బిట్స్కావలసినవి: చిక్కటి పాలు– రెండు లీటర్లు, పంచదార లేదా బెల్లం కోరు– అర కప్పు, నిమ్మరసం– ఒక టీ స్పూన్, బాదం పేస్ట్– పావు కప్పు (బాదం నానబెట్టి, తొక్క తీసి మిక్సీ పట్టుకోవాలి), దాల్చినచెక్క పొడి– కొద్దిగాతయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక పాత్రలో పాలు పోసి, చిన్న మంట మీద బాగా మరిగించి సగం అయ్యేలా చేసుకోవాలి. కాసేపటి తర్వాత నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి, మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. ఒకేసారి పోస్తే పాలు విరిగిపోతాయి అందుకే స్లోగా వెయ్యాలి. అనంతరం బాదం పేస్ట్, దాల్చిన చెక్క పొడి వేసి పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార లేదా బెల్లం కోరు కలపాలి. తర్వాత కూడా కోవాలా అయ్యే వరకు మరిగించాలి. కోవాలా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి లేదా రెండు అంగుళాలు లోతున్న బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి, ఈ కోవా మిశ్రమాన్ని వేసుకుని, చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.జపనీస్ యాకిమోచికావలసినవి: బియ్యప్పిండి– ఒక కప్పు (కొత్తబియ్యం తీసుకోవాలి), పంచదార పొడి– పావు కప్పు+2 టేబుల్ స్పూన్లు, నీళ్లు– ఒక కప్పు, బటర్– ఒక టీ స్పూన్, కార్న్ పౌడర్– కొద్దిగా (నీళ్లు లేదా పాలు పోసుకుని క్రీమ్లా చేసుకోవాలి), సోయాసాస్– కొద్దిగాతయారీ: ముందుగా బియ్యం నానబెట్టి, కాసేపటికి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో బియ్యం, నీళ్లు పోసుకుని, దానిలో బటర్ వేసుకుని, చిన్నమంటపై ఉడికించుకోవాలి. కాస్త పలుకు ఉన్న సమయంలో తీసి మిక్సీలో వేసుకోవాలి. పావు కప్పు పంచదార పొడి, కార్న్ మిశ్రమం వేసుకుని బాగా మెత్తగా సాగేట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేక్ ట్రేలో వేసుకుని, ఓవెన్లో ఉడికించుకుని, నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద సోయాసాస్, 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, కొద్దిగా నీళ్లు వేసుకుని పాకంలా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కేక్ ముక్కలకు కొద్దిగా మైదాపిండి అద్ది, గ్రిల్ లేదా ఓవెన్ మీద బేక్ చేసుకోవాలి. అనంతరం వాటిని సోయాసాస్ మిశ్రమంలో ముంచుకుని తింటే చాలా రుచిగా ఉంటాయిఆనియన్ భక్రీకావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు, పెద్ద ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి– ఒకటి (చిన్నగా తరగాలి), కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు– ఒక టీస్పూన్ (వేయించినవి), పసుపు– అర టీస్పూన్, కారం– తగినంత ఉప్పు, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, నువ్వులు, పసుపు, తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పడు దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల వరకూ ఆ ముద్దను బాగా పిసకాలి. అనంతరం 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని, నిమ్మకాయంత ఉండలు చుట్టుకుని, చపాతీలా కాకుండా, కొద్దిగా మందంగా ఉండేలా, గుండ్రంగా చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకుని, కొద్దికొద్దిగా నూనె వేసుకుని, వాటిని దోరగా వేయించుకుంటే సరిపోతుంది. (చదవండి: బ్రహ్మజెముడు మొక్కతో ప్లాస్టిక్ తయారీ..!) -
మార్క్స్ వర్సెస్ మైండ్సెట్..! గెలిచేదెవరు..?
‘‘సర్, మా అబ్బాయికి 75 శాతం మార్కులు మాత్రమే వస్తున్నాయి. 95 శాతం వచ్చేలా మీరు ట్రైనింగ్ ఇవ్వగలరా?’’‘‘సర్, మా అమ్మాయిని బెస్ట్ కోచింగ్ సెంటర్లో చేర్పించాం. కాని, అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ లేదు. ఎలాగైనా నీట్లో సీట్ వచ్చేలా మైండ్ సెట్ మార్చగలరా?’’ ఇలా చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేసి అడుగుతుంటారు. కొంతమంది సెషన్లో అడుగుతుంటారు. ‘‘మీ బిడ్డ ఎగ్జామ్లో సక్సెస్ అయితే చాలా లేక లైఫ్లో కూడా పాసవ్వాలని అనుకుంటున్నారా?’’ అని అడుగుతా. ‘‘లైఫ్లో పాసవ్వాలంటే మంచి మార్కులు రావాలి కదా సర్?’’ అని అడుగుతుంటారు అమాయకంగా. చాలామంది తల్లిదండ్రుల్లో ఇలాంటి అభిప్రాయమే ఉంది. మార్కుల విలువ... ఐఐటీ, ఎన్ఐటీ, నీట్లలో సీటు రావాలంటే మార్కులు కావాల్సిందే! కాని, ఒక బిడ్డ ప్రతిభకు మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు. మార్కులు విద్యార్థి నేర్చుకున్న విషయాలలో రాసే సామర్థ్యం, మీ జ్ఞాపకశక్తిని కొలుస్తాయి. కాని, మీ బిడ్డలోని సృజనాత్మకత, నాయకత్వం, భావోద్వేగ ప్రజ్ఞ, నిర్ణయ సామర్థ్యం, ఇన్నోవేషన్లను కొలవలేవు. ఇప్పుడు ప్రపంచం ఈ నైపుణ్యాలనే కోరుకుంటుంది.ఐక్యూ వల్లనే సక్సెస్ రాదని హార్వర్డ్ పరిశోధన కూడా చెబుతోంది. విజయంలో తెలివితేటలు 15 శాతం పాత్ర పోషిస్తే, సోషల్ స్కిల్స్ 85 శాతం పాత్ర పోషిస్తాయని ఆ పరిశోధనలో తేలింది.సైన్స్ ఏం చెబుతోంది?స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టు డాక్టర్ కరోల్ డ్వెక్ చేసిన గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ప్రకారం రెండు రకాల మైండ్ సెట్లు ఉంటాయి. 1. ‘నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను’, ‘నాకు ఇన్నే మార్కులు వస్తాయి’ అనుకునే ఫిక్స్డ్ మైండ్ సెట్. 2. ‘ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు’, ‘తప్పుల వల్ల నష్టంలేదు, నేర్చుకోవచ్చు’ అనుకునే గ్రోత్ మైండ్ సెట్.. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని, లాంగ్ టర్మ్ సక్సెస్ సాధిస్తారు. మైండ్ సెట్ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో, ఆత్మవిశ్వాసంలో 40 శాతం మెరుగుదల చూపించారు. మైండ్ సెట్తోనే అసలైన విజయంకొన్నేళ్ల కిందట ఓ విద్యార్థి కోచింగ్ కోసం వచ్చాడు. అతను ఇంటర్మీడియట్లో 60 శాతం మాత్రమే సాధించాడు. దాంతో పేరెంట్స్ చాలా అసంతృప్తితో ఉన్నారు. కాని, అతనిలో నాకు కసి, ఉత్సుకత కనిపించాయి. దాంతో అతనికి జీనియస్ మైండ్ సెట్ కోచింగ్ మొదలు పెట్టా. ఇప్పుడతను బెంగళూరులో ఒక స్టార్టప్ ఫౌండర్. ఐఐటీల్లో చదివినవాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎందుకంటే అతనికి నేర్పించింది సిలబస్ కాదు, సెల్ఫ్–బిలీఫ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జీనియస్ మైండ్ సెట్. జీనియస్ పుడతాడనేది భ్రమ, జీనియస్ డెవలప్ అవుతాడనేది సైన్స్2030లో క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టాప్ స్కిల్స్గా ఉంటాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చెబుతోంది. ఉత్తమ ఉద్యోగుల్లో కమ్యూనికేషన్, కొలాబరేషన్, అడాప్టబిలిటీ ముఖ్యమైన లక్షణమని గూగుల్ చేసిన ప్రాజెక్ట్ ఆక్సిజన్ రీసెర్చ్లో కూడా వెల్లడైంది. జీనియస్ మేట్రిక్స్ కోచింగ్లో నేర్పేవి ఇవే!పేరెంట్స్ ఏం చేయాలి..ఐక్యూ కాకుండా ప్రాసెస్ను ప్రశంసించండి. ‘నువ్వు స్మార్ట్’ అని కాకుండా ‘నువ్వు కష్టపడి ప్రయత్నించిన తీరు నచ్చింది’ అని చెప్పండి. దీనివల్ల పిల్లల్లో ప్రేరణ కలుగుతుంది. మెదడులో కొత్త మార్గాలు ఏర్పడుతాయి. తప్పు చేసినప్పుడు శిక్షించకుండా ‘ఈ తప్పు నీకు ఏం నేర్పింది?’ అని అడగండి. తప్పులను నార్మలైజ్ చేయండి. ‘నేను లెక్కలు చేయలేను’ అని కాకుండా, ‘నేను ఇప్పటికీ లెక్కలు చేయలేను’ అని చెప్పండి. ఈ చిన్న పదం అద్భుతం చేస్తుంది. మీ పరాజయాలను, వాటి నుంచి ఏం నేర్చుకున్నారో, ఎలా తిరిగి నిలదొక్కుకున్నారో పిల్లలతో పంచుకోండి. మీ పిల్లలు దాన్ని పాటిస్తారు. ‘‘ఎన్ని మార్కులు వచ్చాయి?’’ అని కాకుండా, ‘‘ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’’, ‘‘ఈ తప్పు నీకు ఏం నేర్పించింది?’’ అని అడగండి. మార్కుల గురించి కాదు, ప్రయత్నం ఆపేయడంపై టెన్షన్ పడండి. సెల్ఫ్ బిలీఫ్ ఉన్నవాడు ఎక్కడైనా గెలుస్తారు. మార్కులు మాత్రమే ఉన్నవాడు మైండ్ సెట్ లేకపోతే ఆగిపోతారు. (చదవండి: డాల్ డామినేషన్! ఈ బొమ్మ ధర తెలిస్తే షాకవ్వుతారు) -
అందమైన ముఖాకృతికి ఈ ఫేషియల్ మేలు..!
ఆకట్టుకునే సౌందర్యానికి మృదువైన చర్మంతో పాటు ఎద ఆకృతి అవసరమే అని నమ్ముతారు చాలామంది మహిళలు. అలాంటి వారి కోసమే ఈ ‘బ్రెస్ట్ ఎన్హాన్సర్ మసాజర్ బ్రా’! పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత, వయసు పెరుగుతున్న క్రమంలో వక్షోజాల్లో వచ్చే మార్పులను సరి చేసుకోవడానికి ఈ డివైస్ సహకరిస్తుంది. ఈ మసాజర్ చార్జింగ్ బేస్, పవర్ అడాప్టర్లతో పాటుగా లభిస్తుంది. దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా మసాజ్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. ఇది చాలా స్పీడ్ మోడ్స్తో పని చేయగలదు. దాంతో వినియోగదారులు నచ్చిన విధంగా మసాజ్ వేగాన్ని సర్దుబాటు చేసుకోగలరు. ఈ డివైస్ ముందువైపు ఆన్, ఆఫ్ బటన్స్ ఉంటాయి. చిత్రంలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ చెస్ట్ మసాజర్– మృదువైన సిలికాన్ హెడ్స్తో చర్మానికి ఎలాంటి హాని కలిగించని విధంగా రూపొందింది. అలాగే ఇది వాటర్ప్రూఫ్ డిజైన్ కావడంతో వీటిని శుభ్రపరచుకోవడం కూడా సులభమే. దీనిలో వార్మింగ్ ఆప్షన్ కూడా ఉంది. దాంతో దీన్ని పీరియడ్స్ సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు. దాని వల్ల ఆ సమయంలో వచ్చే కడుపునొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ డివైస్ రొమ్ము కణజాలాలను ఉత్తేజపరుస్తుంది. దాంతో ఆ భాగం ఆరోగ్యవంతంగా మారుతుంది. అలాగే ఈ మసాజర్తో స్త్రీలు తమ ఫిట్నెస్కు తగినవిధంగా చక్కటి పరిమాణాన్ని, ఆకృతిని పొందవచ్చు. కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఈ డివైస్ ఎవరికి తగ్గట్టుగా వాళ్లు అడ్జట్స్ చేసుకునే వీలుంటుంది. అందుకు అనువైన విధంగా, బ్రా వెనుకవైపు హుక్ స్ట్రిప్ ఉంటుంది. దాంతో దీన్ని టైట్గా లేదా లూజ్గా ధరించొచ్చు. క్వాలిటీని బట్టి, మోడల్స్ని బట్టి ఈ మెషిన్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.కళాకాంతులు సొంతం‘చర్మానికి తేమను అందించి, పొడిబారకుండా కాపాడుకోవాలంటే గాల్వానిక్ క్లీన్–అప్ ఫేషియల్ చేయించుకుంటే మేలు’ అంటున్నారు చాలామంది బ్యూటీషియన్స్. ఇది ఒక అధునాతన పద్ధతి. సాధారణ ఫేషియల్స్ కంటే లోతైన శుభ్రతను, మెరుగైన పోషణను అందిస్తుంది. ఈ ప్రక్రియను కొన్నిరకాల ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ సాయంతో చేస్తారు. దీనిలో డిసిన్క్రస్టేషన్, అయోంటోఫోరెసిస్ అనే రెండు ప్రక్రియలు ఉంటాయి. మొదటి ప్రక్రియలో చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి దుమ్ము, ధూళి, జిడ్డు, మృతకణాలను తొలగిస్తారు. రెండవ ప్రక్రియలో పోషకాలు సమృద్ధిగా ఉన్న సీరమ్లను చర్మానికి పట్టిస్తారు. ఇంకా ఈ ఫేషియల్తో రక్త ప్రసరణ మెరుగై, చర్మం కాంతిమంతంగా మారుతుంది. మొటిమలు, బ్లాక్హెడ్స్ తగ్గుతాయి. చర్మం బిగుతుగా మారి, ముడతలు తగ్గుతాయి. నిపుణుల పర్యవేక్షణలోనే ఈ చికిత్స జరగడం సురక్షితం. గర్భవతులు, చర్మ సమస్యలు ఉన్నవారు ఈ ఫేషియల్కి దూరంగా ఉండాలి. (చదవండి: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకంగా తారురోడ్డు కంటే..!) -
డాల్ డామినేషన్!
ఆ బొమ్మ మొహం చూస్తేనే ‘అమ్మో! బొమ్మ!’ అని భయపడిపోతాం. కాని, చూసే కొద్దీ ప్రేమలో పడిపోతూనే ఉంటాం. అదే లబుబు మ్యాజిక్! ఒక వైపు దెయ్యంలా మొహం, మరోవైపు క్యూట్నెస్! ఇది చిన్న పిల్లల బొమ్మలా కనిపిస్తుంది. కానీ, ఇప్పుడిది ప్రపంచం మొత్తాన్ని చుట్టబెట్టేస్తోంది.హాంకాంగ్ కళాకారుడు కాసింగ్ లంగ్ 2015లో ఈ లబుబు బొమ్మను సృష్టించాడు. నార్డిక్ పురాణాల ప్రేరణతో రూపొందించిన ‘ది మాన్స్టర్స్’ అనే కామిక్ షో ఆధారంగా ఈ బొమ్మ పుట్టింది. పుట్టాక మూడేళ్లు ఇంట్లోనే ఉండిపోయింది. కానీ, 2019లో చైనా టాయ్ కంపెనీ ‘పాప్ మార్ట్’ దీన్ని మొదటిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎలా అంటే బ్లైండ్ బాక్స్లుగా– ఏ బొమ్మ వస్తుందో తెలియని థ్రిల్తో పాపం పిల్లల జేబుల్ని ఖాళీ చేస్తూ మార్కెట్ను ముంచెత్తింది. దీనికి తోడు 2024లో కొరియన్ పాప్ సింగర్ లీసా దీన్ని సోషల్ మీడియాలో చూపించడంతో, థాయ్లండ్లోని పాప్ మార్ట్ స్టాల్స్ వద్ద లబుబు కోసం మానవ సముద్రమే కనిపించింది. దాని క్రేజ్ అక్కడితో ఆగలేదు, ఖండాలు దాటి, మార్కెట్లో వేలాకోట్ల డాలర్ల టర్నోవర్ను ఒక్క ఏడాదిలోనే దాటేసింది. ఎందుకంటే, లబుబు అప్పటికే సెలబ్రిటీల చేతుల్లోకి కూడా చేరిపోయింది హాలీవుడ్ సెలబ్రిటీలు రిహానా, డువా లిపా, లిజ్జో లాంటి వాళ్లు దీన్ని చేతిలో పట్టుకుని ఫొటోలు తీసుకున్నారు. చాలామంది లబుబుని ఓ స్నేహితురాలు, మూడ్ బస్టర్ అంటూ వారి బ్యాగ్కి తగిలించుకుని తిరగడం ఫ్యాషన్గా మారింది. వీరిలో కొందరు లబుబుకి పేర్లు పెడతారు. డ్రస్సులు మార్చేస్తారు. ఫొటోషూట్లు కూడా చేస్తారు. దీనిని కేవలం బొమ్మగా కాదు, తమ చిన్న ప్రపంచంలో స్పెషల్ వీఐపీలా చూసుకుంటూ సంబరపడిపోతున్నారు. ఇప్పుడిప్పుడే ఇండియాలో! లబుబు ఫీవర్ ఇప్పుడు బాలీవుడ్కు కూడా వచ్చింది. నటి అనన్యా పాండే ఈ మధ్యనే తన పింక్ లబుబుతో జెన్జీ స్టయిల్ని సెట్ చేసింది. నటి శార్వరీ వాఘ్ క్యాజువల్గా కీచెయిన్లా వాడుతూ ట్రెండ్ సెట్టర్గా మారింది. సింగర్ నేహా కక్కర్– తన స్ట్రీట్ స్టయిల్ ఫ్రెండ్ అంటూ బ్లూ లబుబును చేతిలోనే తిప్పుకుంటూ తిరుగుతోంది. ఇక నటి ఉర్వశి రౌతేలా అయితే, ఏకంగా ఒకేసారి నాలుగు లబుబులతో షాక్ ఇచ్చింది, ట్రెండ్కు ఏజ్తో సంబంధం లేదని నటి ట్వింకిల్ ఖన్నా తన లబులును చూపించింది. అలా ఇప్పుడిది సెలెబ్రిటీ హ్యాండ్బ్యాగ్లలో మెరిసే క్యూట్ లగ్జరీ స్టేటస్గా మారిపోయింది. బొమ్మే కాదు, బిల్లు చూస్తే భయం! పాప్ మార్ట్ స్టోర్ ధరల ప్రకారం, సాధారణ బాక్స్ లబుబు ధర రూ. 1,200 నుంచి రూ. 1,800. అదే స్పెషల్ ఎడిషన్లు అయితే రూ. 2,500 నుంచి రూ. 5,000. కానీ అదృష్టం ఉంటే రేర్ బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మకు అయితే రూ. 40,000 కూడా తక్కువే! ఇక హ్యూమన్ సైజ్ లబుబు కావాలంటే? ఏకంగా రూ. 1.25 కోట్లు! ఔను, కోట్లే! దీన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే, ముందు మీ ఇంటిని అమ్ముకోవాలి! ఇక బ్లాక్ మార్కెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లబుబు దొరక్కపోతే ధర పదిరెట్లు కూడా కడుతున్నారు. ఇది చూసి చాలామంది, ‘వీళ్లు బొమ్మలు అమ్ముతున్నారా లేక బంగారమా!’ అంటూ నోరెళ్లబెడుతున్నారు. క్రేజ్తో క్యాష్ !అసలు లబుబు దొరకక ఇబ్బంది పడుతున్నఫ్యాన్స్, ఇప్పుడు ప్రత్యామ్నాయ లబుబు బొమ్మలతో పండగ చేసుకుంటున్నారు. ఈ క్రేజ్నే చాలా వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నాయి! మార్కెట్లోకి ఇప్పటికే వివిధ రకాల వస్తువులు లబుబు టచ్తో రిఫ్రెష్ అయ్యాయి. లబుబు డిజైన్స్తో ఉంటే డాల్స్, కీచెయిన్లు, బ్యాగ్స్, స్టికర్లు, స్టేషనరీ, బెడ్ షీట్లు, కుషన్లు వంటి వస్తువులన్నీ వచ్చేశాయి. చిన్న బొమ్మగా మొదలైన లబుబు, ఇప్పుడు వాల్ నుంచి వాచ్ వరకు మారిపోయి, ఇంటినిండా సందడి చేస్తోంది. ఈ ఎక్స్ట్రీమ్ డిమాండ్కి తగ్గట్టు ధరలు కూడా అలాగే ఉన్నాయి. చిన్న స్టికర్కైనా సరే కేవలం ‘ఇది లబుబు బ్రాండ్’ అన్న ట్యాగ్ తో ధరల్లో కొండెక్కి కూర్చుటోంది. లబుబు బొమ్మ కాదు, ఒక కమర్షియల్ సంచలనం!(చదవండి: బ్రహ్మజెముడు మొక్కతో ప్లాస్టిక్ తయారీ..!) -
ఇది అది కాదు..! అదే ఇది..
పర్యావరణ పరిరక్షణకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు మెక్సికన్ శాస్త్రవేత్తలు. వీరు బ్రహ్మజెముడు నుంచి పూర్తిగా మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్ను సృష్టించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో అల్లాడుతున్న ప్రపంచానికి ఇది ఒక మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. గ్వాడలజారా విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ సాంకేతిక నిపుణురాలు శాండ్రా పాస్కల్– ఈ అద్భుతమైన ఆవిష్కరణకు నాయకత్వం వహించారు. ఆమె బృందం బ్రహ్మజెముడు మొక్క నుంచి సేకరించిన రసంతో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఒక పదార్థాన్ని తయారు చేసింది. ఈ కొత్త పదార్థం ప్లాస్టిక్ మాదిరిగానే దృఢంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు. బ్రహ్మజెముడు తక్కువ నీటితో, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా పెరిగే మొక్క. దీని నుంచి ప్లాస్టిక్ తయారీకి అవసరమైన ముడి పదార్థాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఈ మొక్కలో ఉండే సహజ పాలిమర్లు, ఇతర సమ్మేళనాలు ప్లాస్టిక్ తయారీకి అనుకూలంగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. సాధారణ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది, తీవ్రమైన పర్యావరణ సమస్యలను సృష్టిస్తుంది. దీనికి విరుద్ధంగా, బ్రహ్మజెముడు ప్లాస్టిక్ కేవలం కొన్ని నెలల్లోనే పూర్తిగా భూమిలో కలిసిపోయి, ఎటువంటి విషపూరిత అవశేషాలను విడుదల చేయదని ఈ బృందం చెబుతోంది.(చదవండి: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకంగా తారురోడ్డు కంటే..!) -
ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకంగా తారురోడ్డు కంటే ..!
‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ రాజగోపాలన్ వాసుదేవన్ గురించి చాలామందికి తెలియదు. తమిళనాడు మధురైకి చెందిన ఆయన వినూత్న ప్రయోగాలకు పెట్టింది పేరు! తిరువనంతపురంలోని త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కెమిస్ట్రీ బోధకుడిగా ఉన్న వాసుదేవన్, 2002లో ఒక గొప్ప ప్రయత్నం చేసి ప్రపంచాన్నే అవాక్కయ్యేలా చేశారు. తమ కళాశాల ప్రాంగణంలోనే ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒక రోడ్డును నిర్మించారు. అది తారురోడ్డు కంటే చాలా దృఢంగా, ఎక్కువకాలం చెక్కచెదరకుండా ఉండటంతో 2006లో ఆ ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. ఇలాంటి రోడ్లు వేయడంతో ప్లాస్టిక్ వ్యర్థాలను గణనీయంగా నియంత్రించడంతో పాటు రోడ్లకు తరచు మరమ్మత్తులు చేయాల్సిన సమస్య కూడా ఉండదు. ఎందుకంటే, ప్లాస్టిక్ వ్యర్థాలతో వాసుదేవన్ నిర్మించిన రోడ్డు సుమారు పదేళ్లకు పైగానే చెక్కు చెదరకుండా ఉంటుందని తేలింది.ఆయన అభివృద్ధి చేసిన ఈ పద్ధతిలో, ముందుగా తడిలేని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, శుభ్రం చేసి, చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ ముక్కలను 170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కరిగించి, వేడి చేసిన కంకరలో కలుపుతారు. ఈ మిశ్రమం రోడ్ల నిర్మాణానికి చక్కగా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ కలిపిన రోడ్లు సాధారణ తారు రోడ్ల మాదిరిగా నీటిని లోపలికి పీల్చుకోవు, దాంతో రోడ్లు్ల చాలాకాలం చెక్కు చెదరవు.ప్రొఫెసర్ వాసుదేవన్ కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లనే కాదు ఫ్లోరింగ్ కోసం ‘ప్లాస్టోన్’లను తయారు చేశారు. వీటిని ప్లాస్టిక్, రాళ్ల సాయంతో చిన్న చిన్న ఇటుకల్లా తయారు చేస్తారు. ఇవి చాలా దృఢంగా, నీటిని పీల్చుకోకుండా ఉంటాయి. ఒక్కో ప్లాస్టోన్ ఇటుక తయారీకి సుమారు 300 ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, 6 పీఈటీ బాటిళ్లు అవసరం అవుతాయట. ఆరుబయట సిమెంట్ ఇటుకలు పరిచే కంటే ఈ ప్లాస్టోన్స్ పరిస్తే మన్నికగా ఉంటాయి. పైగా సిమెంట్ ఇటుకల కంటే వీటిని చాలా చౌకగా సిద్ధం చేసుకోవచ్చని తేలింది. వాసుదేవన్ అందించిన సేవలకు గుర్తింపుగా 2018లో ఆయనకు ‘పద్మశ్రీ’ లభించింది. మరుసటి ఏడాది ‘ఆసియన్ సైంటిస్ట్ 100’ ఎంపికలో భాగంగా– ఆయన ఆసియన్ సైంటిస్ట్ పురస్కారం పొందారు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి వాసుదేవన్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.(చదవండి: ఇవోరకం పూతరేకులు..!) -
35 ఏళ్లు.. ఎన్నో హార్ట్ బ్రేక్స్.. నొప్పితో బాధపడుతుంటే ఆ డైరెక్టర్..
పైలట్ కావాలని కలలు కని, అనుకోకుండా కెమెరా ముందు ల్యాండ్ అయింది! సినిమాల్లో గ్లామర్ కంటే టాలెంట్తో స్క్రీన్పై మెరుస్తోంది హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen). ఆ విషయాలే మీ కోసం...అలా కెరీర్లో..తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరైన నటి నిత్యా మీనన్. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు తెరపై చెరగని ముద్ర వేసింది. ఎన్టీఆర్తో ‘జనతా గ్యారేజ్’, అల్లు అర్జున్తో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, పవన్ కల్యాణ్తో ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు చేసినా, గ్లామరస్ కమర్షియల్ హీరోయిన్గా కాకుండా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఉత్తమ నటిగా జాతీయ అవార్డుమలయాళీ అయినా, పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. పైలట్ కావాలనేది చిన్ననాటి కల. అయితే ఏవియేషన్ ఫీల్డ్ ఆకర్షణీయంగా లేదని భావించి, మనసు సినిమాలవైపు మళ్లింది. పూణెలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సు చేసింది. కానీ డైరెక్టర్ నందిని రెడ్డి పరిచయంతో హీరోయిన్ అయింది. గత ఏడాది ధనుష్తో నటించిన ‘తిరు’ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించింది.ఐదు భాషలు మాట్లాడగలదునిత్యా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడగలదు. ‘సినిమా రంగంలో నటీనటుల, యూనిట్ సభ్యుల అనారోగ్యాలపై చాలామంది పట్టించుకోరు, కాల్షీట్స్ ప్రకారం పనిని పూర్తి చేయాలనుకుంటారు. కానీ, నేను మాత్రం సహచర నటులు, సహవాసుల పట్ల కొద్దిగా అయినా మానవత్వం చూపించాలని నమ్ముతాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పీరియడ్స్ టైంలో అలా..మిస్కిన్ దర్శకత్వంలో ‘సైకో’ సినిమాలో నటించేటప్పుడు, షూటింగ్ మొదటి రోజే తాను పీరియడ్స్లో ఉన్నానని, నొప్పితో బాధపడుతూ మిస్కిన్ దగ్గరకు వెళ్లి చెప్పిందట! ‘మిస్కిన్ ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. అతను అర్థం చేసుకుని ప్రవర్తించిన తీరు మరచిపోలేను’ అని తెలిపింది. దాదాపు ముఫ్పై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు. ఎన్నోసార్లు హార్ట్బ్రేక్దీనికి నిత్యా స్పందిస్తూ – ‘చాలాసార్లు హార్ట్ బ్రేక్ అయ్యింది. అందుకే నాకు ఇంకా కొంత టైం కావాలి‘ అని చెప్పింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – చిన్నతనంలోనే ‘హనుమాన్’ అనే సినిమాలో బాల నటిగా నటించింది. ఆ సినిమాలో టబు చెల్లెలుగా కనిపిస్తుంది.చదవండి: అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీతో..రమ్యకృష్ణ స్పీచ్ -
అందాల నటి కయాదు లోహార్ ఫ్యాషన్ సీక్రెట్ ఇదే
ఫిల్టర్ లేకుండా ఫేస్ గ్లో, మేకప్ లేకుండా మెరిసిపోయే అందం కయాదు సొంతం! నిజమైన చర్మకాంతే అసలైన సౌందర్యం అని నమ్మే ఆమె, స్టయిలింగ్లోనూ మినిమలిస్ట్ టచ్తోనే ట్రెండ్ను తిరగరాస్తోంది. సింపుల్ బ్యూటీ, సోబర్ కలర్స్ ఇవే ఆమె ఫ్యాషన్ మంత్రాలు. బ్రాండ్: దేవరాగ్ ధర: రూ. 5,500జస్ట్ స్కిన్, నో సీక్రెట్స్’ అన్నదే నా బ్యూటీ సీక్రెట్. రోజూ ముఖానికి మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ , జుట్టుకు లైట్ హెయిర్ స్ప్రే అంతే. ఎంత తక్కువ ప్రొడక్ట్స్ వాడితే, అంత అందంగా, ఆరోగ్యంగా ఉంటాం. డ్రెస్ల విషయానికి వస్తే, సోబర్ కలర్స్, క్లీన్కట్ స్టయిల్ నాకు బాగా నచ్చుతాయని చెబుతోంది కయాదు లోహార్జ్యూలరీ: స్టయిలింగ్: అరుణ్ దేవ్ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.సింగిల్ లైన్ స్టయిల్చీర కట్టుకున్నాక వడ్డాణం పెట్టుకోవాలి అనుకుంటున్నావా? ఆ ఆలోచనకు కాస్త బ్రేక్ ఇచ్చి, ఇదీ చూడండి! సాధారణ చీర, పాత మోడల్ బ్లౌజ్ వేసుకున్నా, ఈ రేకు వడ్డాణం పెడితే లుక్ వెంటనే బ్రైట్ అవుతుంది. ఈ రేకు వడ్డాణాలు రకరకాల లోహాలతో, ట్రెండీ లుక్స్తో దొరుకుతున్నాయి. చీరే కాదు, ఏ డ్రెస్ అయినా సరే, ఈ రేకు వడ్డాణాన్ని నడుముకు చుట్టుకుని, అద్దం ముందు నిల్చుంటే... ‘ఒక చిన్న మెటల్ లైన్ ఎంత మాయ చేస్తుందో!’ అనిపించకుండా ఉండదు. కుచ్చిళ్లు జారిపోతాయనే టెన్షన్ లేకుండా, ఒక్క బెల్ట్తో అంతా కంట్రోల్లోకి వస్తుంది. అయితే, ఈ వడ్డాణం ధరించాక భారీ ఆభరణాలు వేసుకోవద్దు. ఇదొక్కటే ప్రధాన ఆకర్షణగా ఉండాలి. చేతికి చిన్న ఉంగరం, జుట్టు సైడ్ బన్ లేదా వేవీ హెయిర్లో వదిలేస్తే చాలు. ఇక, ఒక్క రేకు వడ్డాణం మీ ఆకర్షణను అమాంతం మార్చేస్తుంది. (చదవండి: అతిపెద్ద ఏకకణ జీవి..!)