బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..! | Lal Bihari Mritak, The Man Who Was Declared Dead Fought For 19 Years For Justice, Read His Story Inside | Sakshi
Sakshi News home page

బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..!

Mar 1 2026 11:58 AM | Updated on Mar 1 2026 12:31 PM

Lal Bihari Mritak Who Was Declared Dead Fought for 19 Years for Justice

‘నేను జీవించే’ ఉన్నాను.. నమ్మండి..‘దెయ్యాన్ని’ కాదు.. మీలా మనిషినే.. అంటూ ఓ వ్యక్తి ‘తన ఉనికి’ కోసం  వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించాడు.. గుర్తింపు కోసం అభ్యర్థించాడు... ఛీత్కారాలు.. చీదరింపులకు గురయ్యాడు. అయినా తన పోరాటం.. ఆపలేదు.  కోర్టు మెట్లెక్కాడు.. చివరికి తాను బతికే ఉన్నానని నిరూపించుకున్నాడు. వ్యవస్థలో లోపాల్ని లోకానికి ఎలుగెత్తి చాటాడు.. డబ్బులకు  కక్కుర్తిపడి కొంతమంది ఉద్యోగులు బతికున్నోడ్ని ‘కాగితాల్లో’ ఎలా చంపేస్తున్నారో బహిర్గతం చేశాడు.. ఇది బతుకు కోసం చేసిన పోరాటం కాదు. ‘నేను బతికే ’ ఉన్నానని ఓ వ్యక్తి రెండు దశాబ్దాల పాటు సాగించిన ‘గుర్తింపు’ పోరాటం. అతడే లాల్‌ బిహారి.  

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖలీలాబాద్‌కు చెందిన లాల్‌ బిహారి సన్నకారు రైతు. వారసత్వంగా వచ్చిన అతని భూమిని కొట్టేసేందుకు బంధువులు అతడు చనిపోయినట్టు రికార్డులు సృష్టించారు. అవినీతి అధికారులు వారికి సహకరించారు. డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు.  దీంతో బిహారి ‘లీగల్‌’గా చనిపోయాడు. 

ఎలా బయటపడింది
అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలనుకున్నాడు లాల్‌ బిహారి. 1976లో తన 22వ ఏట ఓ చిరు వ్యాపారం కోసం బ్యాంకులో లోన్‌ తీసుకోవాలనుకున్నాడు. నివాస ధ్రువపత్రం కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అప్పుడే అతనికి ‘తాను చనిపోయాననే ‘చావు కబురు ’ తెలిసింది. అధికారి చెప్పిన ఆ మాట విని గుడ్లు తేలేశాడు.. 

భయం.. భయంగా
బిహారి ‘చనిపోయాడనే’ వార్త ఊరంతా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల వారు అతన్నో దెయ్యంలా, బతికే ఉన్నాడా.. అనే అనుమానపు చూపులతో వేధించేవారు. చిన్న పిల్లలు సైతం ఆట పట్టించేవారు. బంధువులు అతన్ని దూరం పెట్టారు. 

న్యాయ పోరాటం  
తాను బతికే ఉన్నట్టు నిరూపించుకునేందుకు లాల్‌ బిహారి ప్రయత్నాలు ప్రారంభించాడు. స్థానిక అధికారిని కలిసి రికార్డులు సరిచేయాలని కోరాడు. తమ తప్పును సరిదిద్దేందుకు వారు ససేమిరా అన్నారు. తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో రికార్డులను సరి చేయాలని, తాను జీవించే ఉన్నానని అధికారికంగా ప్రకటించాలని కోర్టు మెట్లెక్కాడు. 

కేసు వాయిదాలు పడుతూనే ఉంది. ఏళ్లు గడిచినా ఎటూ తేలకపోవడంతో  ఉద్యమ బాట పట్టాడు. అధికారుల తీరుకు నిరసనగా తన పేరు చివరిలో ‘మృతక్‌’ (చనిపోయిన) అని తగిలించుకున్నాడు. అప్పటి నుంచి ‘లాల్‌ బిహారి మృతక్‌’ అని పిలవడం మొదలు పెట్టారు. తాను చనిపోయాను కాబట్టి తన భార్యకు వితంతు పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తన సమస్యను వెలుగులోకి తెచ్చేందుకు మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ,  వీపీ సింగ్‌లపై ఎన్నికల్లో పోటీకి సైతం దిగాడు.  ఇలా అయినా తన ‘బతుకు’ పోరాటం చర్చనీయాంశం అవుతుందని భావించాడు. 

‘మృతక్‌’ సంఘం ఆవిర్భావం
ఇది తనొక్కడి సమస్యే కాదని, ఉత్తరప్రదేశ్‌లోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా తనలాంటి అనేకమంది ‘రికార్డుల్లో’ చనిపోయారని అతనికి తెలిసింది. దీంతో ‘మృతక్‌ సంఘం’(అసోసియేషన్‌ ఆఫ్‌ ది డెడ్‌) ఏర్పాటు చేశాడు. బతికే ఉన్నా, రికార్డుల్లో చనిపోయిన వారి హక్కుల కోసం ఈ సంఘం పోరాటం ప్రారంభించింది. వందలాది మంది ఈ సంఘంలో చేరారు.  జాతీయ/అంతర్జాతీయ మీడియా సైతం ఈ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. 

మీడియాలో వార్తలు.. మానవహక్కుల సంఘాల ఆందోళనలు.. ఇలా అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అలుపెరగని అతని పోరాటం చివరికి ఫలించింది. ‘అతడు బతికే ఉన్నాడు’ అని 1994లో ప్రభుత్వం గుర్తించింది. ‘లైవ్‌’ సర్టిఫికెట్‌  జారీ చేసింది. కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. ఇది అతనొక్కడి విజయం కాదు, తనలా పోరాటం చేస్తున్న అనేక మందికి ఆ విజయం దక్కింది. అయితే బిహారి తన పోరాటాన్ని ఇంతటితో ముగించలేదు. తనలా నష్టపోయిన వారికి అండగా పోరాటాన్ని కొనసాగించాడు. 

లాల్‌ బిహారి కేసు ఓ వ్యక్తి బతుకు పోరాటంగా మాత్రమే మనం చూడకూడదు.  సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, కోర్టుల్లో కేసుల సాగదీత.. న్యాయం కోసం ఏళ్లతరబడి ఎదురుచూపులు.. వంటి వైకల్యాల్ని తేటతెల్లం చేస్తోంది. అవమానాలు..అడ్డంకులు, ప్రతికూలతలు ఎదురైనా న్యాయం కోసం ఓ సామాన్యుడు సాగించిన పోరాటం, సాధించిన విజయం బాధితులకు, సమాజానికి స్ఫూర్తిదాయకం.

తెరకెక్కిన ‘కాగజ్‌’
లాల్‌ బిహారి కేసు ఎంతోమందిని ఆకర్షించింది. పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంతోమందికి అతని పోరాట గాథను కథలుగా మలిచారు. డాక్యుమెంటరీలు రూపొందించారు. సతీష్‌ కౌశిక్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడు ‘కాగజ్‌’ పేరుతో 2021తో బిహారి పోరాటగాథను వెండి తెరకెక్కించారు. 
దిలీప్‌ మాదిరెడ్డి 

(చదవండి: సామాన్యురాలిలా కనిపించే అసామాన్య 'సువర్ణ'..! ఆమె ఆత్మవిశ్వాసానికి సలాం కొట్టా‍ల్సిందే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement