మెగాస్టార్ చిరంజీవి మరో బృహత్తర కార్యక్రమానికి ముందడుగు వేయబోతున్నారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన ఆయన.. ఇప్పుడు నిరుపేదలకు ఉచితంగా విద్య అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
అందుకే బ్లడ్ బ్యాంక్
ఉగాది పర్వదినం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. ప్రజలే. నన్ను ఇంతటివారిని చేశారు. అలాంటి వారికోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. సమయానికి రక్తం దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి ఆనాడు బ్లడ్ బ్యాంక్ స్థాపించాను. అక్కడితోనే ఆగిపోవడం నాకిష్టం లేదు. ఇంకా సేవ చేయాలనుంది.
నన్ను స్ఫూర్తిగా తీసుకుని..
నిరుపేద చిన్నారులకు ఉచితంగా విద్య ఎలా అందించాలని ఆలోచిస్తున్నాను. పిల్లలకు మంచి విద్య అందితే ఆ కుటుంబమే బాగుపడుతుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నాను. తమిళనాడులో హీరో సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకుని అగరం ఫౌండేషన్ స్థాపించినట్లు ఎన్నోసార్లు చెప్పారు. ఆ సంస్థ ద్వారా ఎంతోమందికి ఉచిత విద్య అందించారు.
ఇప్పుడు తనే నాకు ఇన్స్పిరేషన్
అలా ఆయన చేస్తున్న విద్యాదానం నన్నెంతగానో మోటివేట్ చేసింది. ఒకప్పుడు ఆయనకు నేను ఇన్స్పిరేషన్.. కానీ ఇప్పుడు నేను సూర్య నుంచి స్ఫూర్తి పొందుతున్నాను. నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే నా భవిష్యత్తు కార్యాచరణ అని చిరంజీవి పేర్కొన్నారు.
చదవండి: 32 ఏళ్ల తర్వాత.. మోహన్బాబు బర్త్డే స్పెషల్ వీడియో


