శ్రీరంగం కామేష్
సుశిక్షితులైన వేలాది మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారంటూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ చేసిన ప్రసంగం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఉగ్రవాది కొన్నేళ్ల క్రితం కశ్మీర్లో అరెస్టు అయ్యాడు. ఇతడిని విడిపించడానికే ‘కాందహార్ హైజాక్’గా పిలిచే ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ 814 విమానం హైజాక్ జరిగింది. అజహర్ జైల్లో ఉండగా ఏర్పడిన పరిచయాలతోనే కోల్కతాలో ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్ జరిగింది.
బర్మన్ను విడుదల చేయడానికి డిమాండ్ చేసిన రూ.3 కోట్లు హైదరాబాద్ నుంచే చేతులు మారాయి. ఈ మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడుల కోసం వినియోగించారు. బర్మన్ కిడ్నాప్లో పాల్గొన్న ముఠా నుంచే కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పుట్టింది. గోకుల్చాట్– లుంబినీ లేజేరియంల్లో 2007, దిల్సుఖ్నగర్లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ల్లో 2013ల్లో జరిగిన విధ్వంసాలకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థే. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ మూలం– అజహర్ మసూద్ భారత్ రావడం, తిరిగి వెళ్లడమే!
పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న బహవల్పూర్కు చెందిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కుమారుడు. పాఠశాల విద్యను ఎనిమిదో తరగతిలోనే వదిలేసిన ఇతగాడు కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియాలో చేరాడు. 1989లో ఆలీమ్గా పట్టభద్రుడై ఓ మదర్సాలో ఉపాధ్యాయుడిగా మారాడు.
పాకిస్తాన్కు చెందిన జిహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీ అప్పట్లో అఫ్గానిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో జిహాదీ శిక్షణ శిబిరాలు నిర్వహించింది. ఇలాంటి ఓ శిబిరంలో చేరిన మసూద్ ఆ శిక్షణ పూర్తి కాకుండానే సోవియట్–అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నాడు. తీవ్రంగా గాయపడి పాకిస్తాన్ చేరిన అజర్ హర్కత్లో యువత చేరేలా ప్రేరేపించే విభాగాన్ని పర్యవేక్షించాడు. ఆపై పాకిస్తాన్కే చెందిన ఉగ్రవాది ఫజల్ ఉర్ రెహ్మాన్ ఏర్పాటు చేసిన హర్కత్ ఉల్ ముజాహిదీన్లో (హెచ్యూఎం) చేరాడు. ఇక్కడే అజర్ భారత్లోకి రావడానికి మార్గం ఏర్పడింది.
అప్పట్లో కశ్మీర్లో వేర్పాటు వాదాన్ని ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థ హర్కత్–ఉల్–అన్సార్లో విభేదాలు ఏర్పడతాయి. దీంతో ఇది హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్–ముజాహిదీన్ అనే రెండు గ్రూపులుగా మారింది. వీరి మధ్య స్పర్థలు 1993లో తారస్థాయికి చేరాయి. ఫలితంగా కశ్మీర్లో తన ఆపరేషన్స్ కుంటుపడ్డాయని హర్కత్ ఉల్ అన్సార్ భావించి, ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను అజర్కు అప్పగించింది. దీంతో 1994లో పోర్చుగీస్ పాస్పోర్టు తీసుకున్న అజర్, నేరుగా ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్, అయోధ్య సహా అనేక ప్రాంతాల్లో తిరిగాడు. చివరకు కశ్మీర్ చేరుకుని రెండు గ్రూపుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేసి సయోధ్య కుదిర్చాడు. అత్యంత కీలక ఉగ్రవాది అయిన అజర్కు హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ కశ్మీర్లో ఓ గన్మెన్ను కేటాయించింది.
అజర్ అదే ఏడాది ఫిబ్రవరి 11న ఓ కారులో హెచ్యూఎం చీఫ్ కమాండర్ సజ్జద్ అఫ్గానీ, తన గన్మ్యాన్తో కలిసి కారులో ప్రయాణిస్తుంటే, అనంత్నాగ్లోని కనాబాల్ చౌక్ వద్ద కారు పాడయింది. దీంతో అక్కడ నుంచి వీళ్లు ఆటోలో బయలుదేరారు. ఆటో అక్కడి కప్రాన్ అటవీ ప్రాంతం వద్దకు చేరుకునే సమయానికి జమ్మూ–కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా వాహన తనఖీలు నిర్వహిస్తున్నాయి. అక్కడ అది నిత్యం జరిగేదే అయినా, హడావుడి చూసి భయపడిన అజర్ గన్మ్యాన్ తుపాకీతో కాలుస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు.
దీంతో ఆర్మీ అప్రమత్తమై అతడితో పాటు అజర్, సజ్జద్లను అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ తరలించి విచారణ ప్రారంభించింది. తొలుత వీరితో పాటు స్థానిక పోలీసులూ అజర్ను సాధారణ వేర్పాటువాదిగా భావించారు. కొందరు అనుమానితులు పట్టుబడిన విషయం శ్రీనగర్ చేరుకునే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) టీమ్ చేపట్టిన విచారణలోనే అజర్ పూర్వాపరాలు బయటకు వచ్చాయి. దీంతో అరెస్టు చేసిన పోలీసులు కొన్నాళ్లు జమ్మూలోని కోట్ భల్వాల్ జైలులో ఉంచి, తర్వాత ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.
అజర్ను విడిపించడం హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ ఇల్యాస్ కశ్మీరీ, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్లను రంగంలోకి దింపింది. ఈ ద్వయం 1994లోనే ‘ఆపరేషన్ అల్–హదీద్’ పేరుతో ప్రత్యేక ఉగ్రవాద చర్య చేపట్టింది. ఢిల్లీలో ఇద్దరు గైడ్స్తో పాటు నలుగురు విదేశీ పర్యాటకులను అపహరించి, నిర్బంధించింది. వారిని సురక్షితంగా విడుదల చేయడానికి మసూద్ అజర్ సహా మరికొందరు ఉగ్రవాదుల్ని వదలాలంటూ షరతు విధించింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు వీరి స్థావరంపై దాడి చేశాయి. ఫలితంగా ఒమర్ సయీద్ షేక్ గాయపడి చిక్కగా, ఇల్యాస్ కశ్మీరీ తప్పించుకుని పారిపోయాడు. బందీలుగా ఉన్న టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ పోలీసులు ఒమర్ సయీద్ షేక్ని కూడా తీహార్ జైలుకు తరలించింది.
(తీహార్ జైలు నుంచే మరో కథ మొదలైంది. అక్కడే తరచు కలుసుకున్న అజర్, ఒమర్ సయీద్ షేక్ సాధారణ కొందరు నేరగాళ్లను ఉగ్రవాదం వైపు మళ్లించారు. వీళ్లే ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన ‘పార్ట్–2 ‘జైల్ టు జీహాద్’ వచ్చే వారం)


