సైలెంట్‌ మ్యారేజ్‌ కిల్లర్‌ | The Silent Killer of Marriage Nobody Talks About | Sakshi
Sakshi News home page

సైలెంట్‌ మ్యారేజ్‌ కిల్లర్‌

Nov 30 2025 4:46 PM | Updated on Nov 30 2025 4:46 PM

The Silent Killer of Marriage Nobody Talks About

కిషోర్‌ మంచం మీద ఫోన్‌లో స్క్రోల్‌ చేస్తున్నాడు. ఆనంది తనతో మాట్లాడాలనుకుంటుంది, అతను ‘ఒక్క నిమిషం’ అన్నాడు. ఆ ‘ఒక్క నిమిషం’తో రాత్రంతా గడిచిపోతుంది. ఇది ఇప్పుడు ప్రతి ఇంటిలో కనిపించే సైలెంట్‌ డ్రామా. ఇప్పుడు కాపురాలు విడిపోవడంలేదు. కాని, విడిపోయిన రెండు మనసులు ఒకే ఇంట్లో రెండు స్క్రీన్‌ల మధ్య బతుకుతున్నాయి.

కొత్త మూడో వ్యక్తి...
ఒకప్పుడు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి అంటే అనుమానం. ఇప్పుడు ఆ మూడో వ్యక్తి పేరు ‘స్మార్ట్‌ఫోన్‌.’ పనికోసం, కాంటాక్ట్‌ కోసం, వినోదం కోసం ఇంట్లోకి ప్రవేశించిన స్మార్ట్‌ ఫోన్‌ మెల్లగా మనుషుల మధ్యకు చేరి మనసుల్ని వేరు చేసింది.

ఇప్పుడు జంటలు రోజుకు సగటున మూడుగంటలకు పైగా ఫోన్‌లో గడుపుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కాని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కనీసం 30 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. గతంలో దంపతుల మధ్య ‘దూరం’ శారీరకంగా ఉండేది. ఇప్పుడు ఆ దూరం ‘డిజిటల్‌’గా మారింది. మనుషుల మధ్య ‘మొబైల్‌ సిగ్నల్‌’ ఉన్నా, ‘మానసిక సిగ్నల్‌’ ఉండటం లేదు. 

ఎమోజీలు ఎక్కువ... ఎమోషన్లు తక్కువ...ఒకప్పుడు భోజనాల వద్ద మాట్లాడుకునేవారు. ఇప్పుడు భోజనం ముందు ఫొటో తీస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఫోన్‌ స్క్రీన్‌నే ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పటి దంపతులు ఎక్కువగా ‘టెక్ట్స్‌’ చేస్తారు, కాని తక్కువగా ‘టచ్‌’ చేస్తారు. మెసేజ్‌లు ఎక్కువ, మాటలు తక్కువ. ఎమోజీలు ఎక్కువ, ఎమోషన్లు తక్కువ. దీనివల్ల భావోద్వేగ దూరం పెరుగుతోంది. 

దగ్గరున్నా దూరమే... 
ప్రేమంటే ఒకరితో ఒకరుండటం. కాని, ఇప్పుడు జంటలు ఫిజికల్లీ ప్రెజెంట్, మెంటల్లీ ఆబ్సెంట్‌. ‘‘నువ్వు నాతో ఉన్నావు కాని, నీ మనసు ఫోన్‌లో ఉంది’’ అని భార్య అంటోంది. ఇదేమీ జోక్‌ కాదు. ఎమోషనల్‌ నెగ్లిజెన్స్‌ అనే సైలెంట్‌ సమస్య. మనం ఒకరిని ప్రేమిస్తున్నా, ఫోన్‌ నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఆ ప్రేమను ‘పాజ్‌’ చేస్తున్నాము. ఒక సర్వే ప్రకారం, రాత్రిళ్లు ఫోన్‌ వాడటం వల్ల మాట్లాడుకోవడం తగ్గిందని 65శాతం జంటలు చెప్పారు. దీనివల్ల చాలా జంటల మధ్య ఎమోషనల్‌ డిస్కనెక్షన్, అటెన్షన్‌ డెఫిషిట్, జెలసీ, నిద్ర సమస్యలు, ఇంటిమసీ తగ్గిపోవడం వంటి మానసిక లక్షణాలు కనిపిస్తున్నాయి. 

సోషల్‌ మీడియా ప్రేమలు...
ప్రేమకు ప్రైవసీ అవసరం. కాని, ఇప్పుడంతా పబ్లిసిటీగా మారింది. ఇంట్లో ఎలా ఉన్నా, ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలున్నా, సోషల్‌ మీడియాలో ‘హ్యాపీ కపుల్‌’ పోస్టులు పెడుతుంటారు. ఇదో కొత్తరకం మానసిక మాయ. 

సోషల్‌ మీడియాలో ఇతరుల జీవితం చూసి మన జీవితం తక్కువగా అనిపించడం ‘కంపేరిజన్‌ బర్నవుట్‌’ను పెంచుతుంది. అది ఈర్ష్య, కోపం లేదా విరక్తిగా బయటపడుతుంది. కాపురంలో ప్రేమ చనిపోదు, దాన్ని చంపేది మౌనం. మాటలు తగ్గిన చోట ఊహలు పెరుగుతాయి. ఆ ఊహల వెనుక అభద్రత ఉంటుంది. సైకలాజికల్‌గా చెప్పాలంటే, జంటలు రోజూ కనీసం 20 నిమిషాలు మనసువిప్పి మాట్లాడుకోకపోతే ఎమోషనల్‌ డ్రైనెస్‌ పెరుగుతుంది.

జంటలేం చేయాలి?

రాత్రి భోజనం తర్వాత ఫోన్‌ పక్కన పెట్టేయండి. కనీసం గంటైనా ఫోన్‌ పూర్తిగా దూరంగా ఉంచండి.

నిద్రకు ముందు కనీసం పది నిమిషాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అలవాటుగా మార్చుకోండి. ఫోన్‌లో స్క్రోల్‌ చేయడం కాదు, హృదయాన్ని స్క్రోల్‌ చేయండి.

సోషల్‌ మీడియాలో ఒక వారం ‘ఫొటోలెస్‌ చాలెంజ్‌’ పెట్టండి. జంటగా గడిపిన సమయాన్ని మీరు మాత్రమే అనుభవించండి.

రోజుకు కనీసం ఐదు నిమిషాలు కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. స్క్రీన్‌ కన్నా కళ్లు చూడటం ఇంటిమసీని తిరిగి తెస్తుంది.

ఫోన్‌ రహస్యాలు పెరగడమంటే దూరం పెరగడం. స్మార్ట్‌ఫోన్‌లను కాకుండా, మనసులను ట్రాన్స్‌పరెంట్‌ చేయండి.

ఫబ్బింగ్‌ సిండ్రోమ్‌... 
మనిషి మెదడు అనుబంధం కోరుకుంటుంది. మనం ‘చూస్తూ మాట్లాడే’ జీవులం. కాని, ఇప్పుడు మన కళ్ళు స్క్రీన్‌కు, మనసు నోటిఫికేషన్లకు అతుక్కుపోయింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఎసెక్స్‌ పరిశోధన ప్రకారం ఫోన్‌ టేబుల్‌పై పెట్టినా కూడా జంటల మధ్య మాటల్లో భావోద్వేగ గాఢత 30 శాతం తగ్గిపోతుంది. 

దీన్నే ‘ఫబ్బింగ్‌ సిండ్రోమ్‌’ అని పిలుస్తారు. అంటే భాగస్వామిని పట్టించుకోకుండా ఫోన్‌ను ఎక్కువగా పట్టించుకోవడం. ఈ స్థితిలో ఉన్నామని చాలామందికి తెలియదు కాని, దీనివల్ల జంటల మధ్య ఆప్యాయత, నమ్మకం, సహానుభూతి తగ్గిపోతున్నాయి.
సైకాలజిస్ట్‌ విశేష్‌ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌  

(చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?)

Advertisement
 
Advertisement
Advertisement