Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Means Telugu Drama Party Says YS Jagan1
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్‌ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్‌ అన్నారు... చంద్రబాబు.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్‌ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్‌ఈ, టోఫెల్‌, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్‌ కార్పొరేషన్లు, రేషన్‌ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్‌ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్‌సీ లేదు. మూడు డీఏలు పెండింగ్‌, బకాయిలు పెండింగ్‌. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్‌, రాజధాని పనులు.. లిక్కర్‌ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్‌ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్‌ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్‌ అన్నారు.క్లిక్‌ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన

Jagan Gollaprollu Penukonda YSRCP Leaders Meeting Key Comments Updates2
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్‌సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్‌సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్‌ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్‌ ఉండి ఉంటేనా..

CM Revanth Reddy says Young India is my brand3
యంగ్‌ ఇండియా నా బ్రాండ్‌.. మీరే నా అంబాసిడర్లు: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: పాతికేళ్లు వచ్చే వరకు కష్టపడిన ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడతారని ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు. ప్రతి మనిషికి మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్య కాలమని, అందులోనూ 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అత్యంత కీలకమైనదని తెలిపారు. ఈ సమయంలో క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉండాలని సూచించారు. రంగుల ప్రపంచానికి ఆకర్షితులు కాకుండా కెరీర్‌పై దృష్టి సారిస్తేనే జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారని విద్యార్థులకు హితబోధ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆడిటోరియంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్వహించిన 2024–25 ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సీఎం ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహూకరించారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్, పదోతరగతి చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు బహూకరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా గురుకులాలను తయారు చేస్తున్నామని చెప్పారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. యంగ్‌ ఇండియా తన బ్రాండ్‌ అని, గురుకుల విద్యార్థులే తన బ్రాండ్‌ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. కులవృత్తుల పేరుతో బీఆర్‌ఎస్‌ మోసం కులం పేరుతో ఎవరికీ అవకాశాలు రావని, కష్టపడి చదువుకున్న వాళ్లకు మాత్రమే అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చదువు వల్ల వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు కులవృత్తుల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదలు, బడుగుల జీవితాలు మారుతాయని అందరూ భావించారు. కానీ పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ అన్ని వర్గాలను అణిచివేసింది. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని తెలిసినప్పటికీ.. మెరుగైన విద్య అందించకుండా కులవృత్తులు చేసుకోవాలని.. బర్రెలు, గొర్రెలు కాయాలంటూ వాటిని పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. కష్టపడి చదువుకున్న వాళ్లు ప్రభుత్వ కొలువుల కోసం ఏళ్లపాటు నిరీక్షించారు. కానీ, గత పాలకుడి ఇంట్లో ఒక్క మనిషికి ఉద్యోగం లేకపోతే ఆరు నెలల్లోనే ఎన్నికలు పెట్టి మరీ కొలువు ఇప్పించుకున్నారు’అని ధ్వజమెత్తారు. దళితులకు సముచిత స్థానం ఇచ్చాం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 65 రోజుల్లోనే 11 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రూప్‌–1 పరీక్షల ఫలితాలు ఇచ్చిన తర్వాత కొందరు ఉద్దేశపూర్వకంగా నియామకాలను ఆపారని విమర్శించారు. గ్రూప్‌–1 ఉద్యోగాలకు అర్హత సాధించిన వారిలో 89 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందినవారే ఉన్నారని తెలిపారు. ‘వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఒక్క దళితుడు కూడా వైస్‌ చాన్స్‌లర్‌ కాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓయూకు వీసీగా దళిత మేధావిని నియమించింది. అంబేద్కర్‌ వర్సిటీ వీసీగా, ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా, విద్యా కమిషన్‌ చైర్మన్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా దళిత బిడ్డలకు అవకాశాలు వచ్చాయి. హెచ్‌సీయూలో చదివిని మేధావి భట్టి విక్రమార్క ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థను క్రమపద్ధతిలో నడుపుతున్నారు’అని పేర్కొన్నారు. వాళ్లు ఎగ్గోడితే.. మేము ఖర్చు చేస్తున్నాం: భట్టి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకువచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తుచేశారు. కానీ, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయకుండా ఎగ్గొట్టిందని విమర్శించారు. అలా ఎగ్గొట్టిన నిధులను కాంగ్రెస్‌ ప్రభుత్వం లెక్కించి క్యారీ ఫార్వర్డ్‌ చేసి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఎస్సీలకు రూ.13,223 కోట్లు, ఎస్టీలకు 1,296 కోట్లు క్యారీఫార్వర్డ్‌ చేసినట్లు వివరించారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం ఏడాది కాలంలోనే రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 102 సమీకృత గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

ocean color is changing as a consequence of climate change4
కాటుక రంగులోకి కడలి! 

ఆ చల్లని సముద్రగర్భం.. అంటూ సాగే దాశరథి పాట వినే ఉంటారు. ఇప్పుడు ఆ నల్లని సముద్రం అని కూడా పాడుకోవాలేమో. ప్రపంచవ్యాప్తంగా భూమినంతటినీ చుట్టేసిన సాగరజలం నెమ్మదిగా నీలి రంగు నుంచి నలుపు వర్ణంలోకి మారిపోతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ధరణిపై దాదాపు 71 శాతం ఉపరితలాన్ని సముద్రజలాలే కప్పేస్తున్నాయి. అంటే భూమిపై దాదాపు 36.1 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర సముద్రనీరే ఉంది. ఇందులో 21 శాతం అంటే 7 కోట్ల చదరపు కిలోమీటర్ల సముద్రజలాలు గతంలో ఎన్నడూలేనంతగా కొత్తగా నల్లగా మారిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మార్పు కేవలం గత 20 సంవత్సరాల్లో జరిగిందని గణాంకాలు స్పష్టంచేశాయి. సంబంధిత వివరాలు గ్లోబల్‌ చేంజ్‌ బయోలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సముద్రజలాలు నలుపు రంగులోకి మారడంతో సూర్యరశ్శి సాగర జలాల్లోకి సులభంగా చొచ్చుకెళ్లడం సాధ్యపడట్లేదు. దీంతో సముద్ర ఉపరితల జలాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. కాంతిమయ పరిస్థితులే 90 శాతం సముద్రజీవుల మనుగడకు ప్రాణాధారం. సూర్యరశ్శి సముద్ర ఉపరితల జలాలపై కొంతమేరకే పరిమితమైతే ఎన్నో రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌ విశ్వవిద్యాలయం, ప్లైమౌత్‌ మెరైన్‌ లేబొరేటరీలోని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2003 ఏడాది నుంచి 2022 ఏడాది దాకా అంతర్జాతీయంగా పలు ఉపగ్రహాల నుంచి సేకరించిన డేటాను సంఖ్యాశాస్త్ర నమూనాలతో సరిపోల్చి ఈ విపరిణామాన్ని కనుగొన్నారు. వేడినిచ్చే సూర్యకాంతితోపాటు చల్లని వెలుతురునిచ్చే చంద్రకాంతి సైతం పరోక్షంగా సముద్రజీవుల జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. లోతైన సముద్రజలాలతోపాటు తీరం వెంట జీవుల ఉనికికీ ఈ రెండు కాంతులూ ముఖ్యమే. భారీగా తగ్గిన కాంతి లోతు అలజడులు లేని, ప్రశాంతంగా ఉన్న సముద్రజలాల్లో తేటగా ఉన్న సందర్భాల్లో సూర్యకాంతి చాలాలోతుదాకా వెళ్లగలదు. కానీ గత 20 ఏళ్లలో గమనిస్తే ఆఫ్రికా ఖండం అంత పరిమాణంలో అంటే 9 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి చొచ్చుకెళ్లే ప్రాంతాలు బాగా తగ్గిపోయాయి. ఇక్కడ గతంతో పోలిస్తే సూర్యకాంతి 50 మీటర్లు తక్కువలోతుకే వెళ్లగల్గుతోంది. మరో 2.6 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి వెళ్లగలిగే లోతు ఏకంగా 100 మీటర్లు తగ్గిపోయింది. అయితే ఒక 10 శాతం సముద్రజలాల్లో మాత్రం గతంలో కంటే ఎక్కువ లోతులకు సూర్యకాంతి చొరబడగల్గుతోంది. సూర్యకాంతిలోనే మనగలిగే సముద్రజీవులు చాలా ఉంటాయి. ఎన్నో రకాల జలచరాల ఉనికి, పునరుత్పత్తి, ఆహారానికి ప్రత్యక్షంగా సూర్యకాంతి అత్యావశ్యకం. ‘‘కొన్ని చోట్ల సూర్యకాంతి లభ్యత తగ్గిపోవడంతో వేరే చోట్లకు జీవులు వలసపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆయా జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అని ప్లైమౌత్‌ విశ్వవిద్యాలయంలోని సముద్ర సంరక్షణ విభాగ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ థామస్‌ డెవిస్‌ చెప్పారు.నల్లగా ఎందుకు మారుతోంది?పర్యావరణానికి సంబంధించి ఎన్ని దేశాల్లో ఎన్నెన్నో కఠిన చట్టాలున్నా అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఆయా సంస్థలు గుట్టుచప్పుడుకాకుండా నేరుగా నదుల్లో పారబోస్తున్నాయి. గరళంగా మారిన నదీజలాలు నేరుగా సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటికి వ్యవసాయ వ్యర్థాలూ తోడవుతున్నాయి. వీటితో పోషణ సంబంధ మూలకాలు సముద్రంలోకి పోటెత్తుతున్నాయి. ఈ పోషకాలను సంగ్రహించిన నాచు వంటి అతిసూక్ష్మ మొక్కలు సముద్ర ఉపరితల జలాలపై ఏపుగా పెరుగుతున్నాయి. గనుల తవ్వకం తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను వర్షపు నీరు నదుల ద్వారా సముద్రాల్లోకి కొట్టుకొచ్చేలా చేస్తోంది. ఇవికాక సూర్యకిరణాలను అడ్డుకునే జీవజాలం సముద్రఉపరితలంపై మరింతగా పేరుకుపోతోంది. ఇవన్నీ కలగలిసి సాగరాలను కాంతిహీనం చేస్తున్నాయి. అలా అవి నల్లరంగులోకి మారిపోతున్నాయి. శైశవాల పెరుగుదల, భూతాపోన్నతి కారణంగా అధికమవుతున్న సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రత సైతం తమ వంతుగా ఈ దుష్ప్రభావానికి ఆజ్యం పోస్తున్నాయి.మత్స్య పరిశ్రమకూ పెనుముప్పు లోతైన సముద్రాల వద్ద సూర్యకాంతి తగ్గిపోయి ఆహార లభ్యత కృశించిపోవడంతో దిక్కులేక పలు రకాల జలచరాలు తీరాలకు చేరి అక్కడి జీవులతో కలిసి ఆహారం కోసం పోటీపడుతున్నాయి. దీంతో ఆయా జీవుల ఆహార వనరుల కొరత ఏర్పడుతుంది. సముద్రచేపలు, రొయ్యలు, ఇతర జలచరాల లభ్యత తగ్గిపోయే వీలుంది. దీని ప్రభావం భవిష్యత్తులో అన్ని సముద్రతీర దేశాల మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘‘లోతైన సముద్ర ప్రాంతాల్లో సూర్యకాంతి చొచ్చుకుపోయే సామర్థ్యం మరో 50 మీటర్లు తగ్గిపోతే అక్కడి జీవులు తమ ఆవాసాలను సముద్రతీరాలకు మార్చుకుంటాయి. అప్పుడు యావత్‌ సాగర జీవావరణ వ్యవస్థలో శాశ్వత మార్పులు సంభవించే ప్రమాదం దాపురిస్తుంది’’అని ప్లైమౌత్‌ మెరైన్‌ లే»ొరేటరీలో ప్రొఫెసర్‌ టిమ్‌ స్మిత్‌ విశ్లేíÙంచారు. ‘‘సముద్రాల్లో సూర్యకిరణాలు లోపలికి వెళ్లలేకపోతే మనకొచ్చే నష్టమేమీ లేదని నింపాదిగా కూర్చునే కాలం కాదిది. ప్రభుత్వాలు తక్షణం మేల్కొనాలి. సముద్రాల్లోకి చేరే నదీజలాలు వీలైనంత వరకు పారిశ్రామిక వ్యర్థాలకు ఆవాసంగా మారకుండా చూసుకోవాలి. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యవస్థను మరింత పటిష్టంగా అమలుచేయాలి. వ్యర్థాల పారబోతపై పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Sakshi Guest Column On China Predominance Growing5
పెరుగుతున్న చైనా ప్రాబల్యం

పహల్‌గామ్‌లో ఉగ్రదాడిపై భారత్‌ స్పందించిన తీరు, తదనంతర పరిణా మాలు ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మౌలికంగా తీసుకొచ్చిన మార్పులేమీ లేకపోవచ్చు. కానీ, దక్షిణాసియాలో రూపు దిద్దుకుంటున్న ప్రాబల్య సమతూకానికి సంబంధించి అవి కొన్ని ముఖ్యమైన దృక్కోణాలను బయటపెట్టాయి. ఈసారి భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న తాజా సైనిక ప్రతిష్టంభన మునుపటి దృష్టాంతాలకు భిన్నమైంది. భారత్‌ –పాక్‌ల మధ్య సైనిక ఘర్షణ పరస్పరం అణ్వాయుధాలను ప్రయో గించుకోగల స్థితికి చేరుతోందని అమెరికా పొరపడింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా రెండు దేశాల నాయకులకూ రాత్రికి రాత్రి అమె రికా ఫోన్లు చేసి ఉండవచ్చు. కానీ, ఒకటి మాత్రం స్పష్టం. ఇది ప్రాంతీయ ఆధిపత్య సమతూకపు స్థితిగతులను మార్చి వేసింది. సూటిగా చెప్పాలంటే, దక్షిణాసియాను అత్యంత ప్రభావితం చేయగలి గిన శక్తిగా అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించిందని చెప్పడం సబబు.ఇండియాకు గట్టి మద్దతివ్వని రష్యాప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక శక్తిగా అమెరికా ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయాలను ప్రభా వితం చేయగల అవకాశం సదరు దేశపు శక్తితోపాటు అభిమతంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించి స్పష్టమైన వ్యూహాత్మక ప్రయోజనం అమెరికాకు కొరవడినట్లుగా కని పిస్తోంది. ఫలితంగా, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శాసించగల శక్తిగా ఉన్న అమెరికా ఇపుడు నామమాత్రపు పాత్రధారి స్థాయికి కుంచించుకుపోయింది. అటూఇటూగా వాషింగ్టన్‌ స్థానాన్ని బీజింగ్‌ ఆక్ర మించింది. ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న చైనా దౌత్యపరమైన యుక్తిని ప్రదర్శిస్తూ ఆయుధాల సరఫరాదారుగా, మధ్యవర్తిగా ఈ ప్రాంతపు పరిణామాలను నిర్దేశించగల స్థితిలో ఉంది. ప్రాంతీయ సైనిక ఘర్షణలు, దౌత్యపరమైన ప్రతిష్టంభనలు, రాజకీయ వాద వివాదాలకు తీర్పరిగా వ్యవహరించాలని చైనా కోరు కుంటోంది. ఇటీవల పాక్‌కు అందించినట్లుగానే హైటెక్‌ ఆయుధాల సరఫరా ద్వారా, లేదా దౌత్యపరంగా ప్రత్యక్షంగా జోక్యం చేసు కోవడం, ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకురావడంతో అది ఆ యా పను లను చక్కబెట్టాలని భావిస్తోంది. దక్షిణాసియా, ఇండో–పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం ఇప్పటికే కనిపిస్తోంది. కానీ, అది సైనికపరంగా వత్తాసు ఇస్తానని పాక్‌కు చెప్పడం, తాజా భారత–పాక్‌ ఘర్షణలో ప్రధానాంశం.అలాగే, భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా అండగా నిలవడంలో రష్యా సామర్థ్యం తగ్గిన సంగతిని గమనించవలసిఉంది. ఇటీవలి ప్రతిష్టంభనలో రష్యా వైఖరి సాధారణంగా ఇతర దేశాలు చూపే మాదిరిగానే ఉంది. అది భారతదేశానికి బాహాటంగా మద్దతు ప్రకటించలేదు. పాకిస్తాన్‌ పేరును నేరుగా ప్రస్తావించలేదు సరికదా, భారత సైనిక చర్యలకు ఆమోదం కూడా తెలుపలేదు. ‘‘ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. అవి ఏ రూపంలో వ్యక్తమైనా వ్యతిరేకిస్తోంది. ఈ రాక్షసత్వంపై సమర్థంగా పోరాడటా నికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా ప్రయత్నాలు సాగించవలసిన అవసరం ఉందని భావిస్తోంది’’ అని రష్యా విదేశీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘర్షణలు మరింత ముదరకుండా సంయమనం పాటించవలసిందని రష్యా రెండు పక్షాలనూ కోరింది. ఒక రకంగా, రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య ఘర్షణ సందర్భంలో భారత్‌ ఏం చెప్పిందో, భారత్‌–పాక్‌ ఘర్షణపై రష్యా అదే చెప్పింది. రష్యా–పాశ్చాత్య దేశాల మధ్య భారత్‌ సమతూకం పాటించినట్లు గానే, భారత్‌–చైనాల మధ్య సమతూకం పాటించేందుకు రష్యా ప్రయత్నించింది. దక్షిణాసియాలో రష్యాకున్న ప్రయోజనాలు పరిమితమే కావచ్చు. కానీ, ఇస్లామాబాద్‌తో బీజింగ్‌ అంటకాగుతోంది. బీజింగ్‌తో సన్నిహితంగా మెలిగే మాస్కో, తీరా చైనా ప్రయోజనాలు పణంగా ఉన్నపుడు భారతదేశానికి వీలైనంత తక్కువ సహాయాన్నే అందిస్తుంది. దానర్థం – భారత్‌ ప్రాంతీయ ప్రయోజనాలకు భంగం కలిగించాలని రష్యా కోరుకుంటోందని కాదు. చైనా ప్రయోజనాలను తక్కువ చేసేదిగా కనబడటం రష్యాకు ఇష్టం లేదు. ఏమైతేనేం, అది పాకిస్తాన్‌కే ప్రయోజనకారి అవుతుంది. రష్యాతో ఉన్న దోస్తీని ఉపయోగించుకుని చైనా నడవడికలో మార్పు తేగలమని మనం ఒకప్పుడు అనుకున్న రోజులున్నాయి. బహుశా ఇప్పుడు భారత దేశంతో రష్యాకున్న మైత్రిని నిగ్రహించగల శక్తి తనకుందని చైనా చాటుకోవడాన్ని మనం చూస్తున్నాం. రష్యా పట్ల భారత ఆసక్తి సన్నగిల్లుతున్నట్లుగానే, భారత్‌ పట్ల రష్యా ఆసక్తి కూడా రంగు, రుచి కోల్పోతోంది. ఇది మనం అంగీకరించక తప్పని వాస్తవం. క్షీణిస్తున్న ఈ స్నేహ బంధాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఉన్న మార్గాలను మనం గుర్తించవలసి ఉంది. ఒంటరిగానే పోరాడగలగాలి!ఇక భారతదేశానికున్న బాహ్య సమతూక (అంటే ఇతర దేశాలతో చెప్పించడం లేదా వాటిని పావులుగా వాడుకునేందుకు ఉన్న) అవకాశాలు అంతర్నిహితంగా పరిమితంగానే ఉండటం ఇటీ వలి ప్రతిష్టంభనలో వెలుగు చూసిన మరో గణనీయమైన అంశం. దక్షిణాసియాలో అణు యుద్ధం సంభవించవచ్చనే (అటువంటి అవకాశం లేశ మాత్రంగానే ఉన్నప్పటికీ) భయాలు అంతర్జాతీయంగా భారతదేశంతో స్నేహంగా మెలిగే చాలా దేశాలకున్నాయి. ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మనం ఉక్రెయిన్‌ విషయంలో చెబుతూ వస్తున్నాం. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు అదే పల్లవి అందుకుంటున్నాయి. ఇతరుల సంక్షోభ సమయాల్లో మనం ఎలా వ్యవహరిస్తామో వారూ మన పట్ల అలానే వ్యవహరిస్తారని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎటువంటి సైనిక కూటమిలోనూ చేరకూడదని మనం ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకుని ఉండవచ్చు. బహుశా, అది సక్రమమైన నిర్ణయమే కావచ్చు కూడా! కానీ, దాని పర్యవసానాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన యుద్ధాలను మనమే చేయాలి. అందుకు అనుసరించవలసిన విధానం స్పష్టమవుతూనే ఉంది. జాతీయ భద్రత సన్నద్ధతకు గణనీయమైన మొత్తాలను వెచ్చించడం ద్వారా మనం మొదట అంతర్గత సమతూకానికి ప్రయత్నించాలి. ప్రైవేటు సంస్థలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత ప్రోత్సాహం, అనువైన వాతావరణం అవసరం. స్థానిక, అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేసుకోవాలి.ఉగ్రవాదంపై మనం స్పందించే తీరు ఇకపై ఇదే మాదిరిగా ఉండబోతోందని లిఖితపూర్వకంగా కాకపోయినా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది కనుక, ఆపరేషన్‌ సిందూర్‌ను వివిధ కోణాల నుంచి నిష్పక్షపాతంగా మదింపు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కర్తవ్య నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో పాటించవలసిన రక్షణ సన్నద్ధత, నిఘా, వ్యూహ్మాతక కమ్యూనికేషన్లు, ఇతర కీలక అంశాలపై ఈ బృందం అవసరమైన చర్యలను సూచిస్తుంది. ఇటీవలి పరిణామాలను నిష్పాక్షికంగా పరిశీ లించి, భవిష్యత్తుకు వ్యూహాత్మక దిశా నిర్దేశాలు చేసేందుకు కార్గిల్‌ సమీక్షా కమిటీ తరహాలో పహల్‌గామ్‌ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసేందుకు సమయం ఆసన్నమైంది. చివరగా, ఇంత తీవ్రతతో కూడిన ఈ తరహా సైనిక ప్రతిష్టంభనలు దేశపు విశాల వ్యూహాత్మక లక్ష్యాలను కూడా పక్కనపెట్టేవిధంగా మన దృష్టిని మళ్ళించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేటి భారతదేశం దక్షిణాసియాకు మాత్రమే పరిమితమై ఉండలేదు. కేవలం పాక్‌ పైనే మన దృష్టినంతటినీ నిలిపి ఉండలేం. ఇప్పటికే పరిమితంగా ఉన్న రాజకీయ, దౌత్య, సైనిక వనరులను ఇతర విశాల లక్ష్యాల వైపు మళ్ళించడానికి లేకుండా సతమతమవుతున్నాం. పాక్‌నే బూచిగా చూస్తూ కూర్చుంటే ఆ సామర్థ్యాలు మరింత పరిమిత మవుతాయి. పాక్‌ నుంచి తరచూ ఎదురుకాగల ఉద్రిక్తతల వలయంలో చిక్కుకుపోకుండా నిలవడమే భారత్‌ ముందున్న అతి పెద్ద వ్యూహాత్మక సవాల్‌!హ్యాపీమాన్‌ జాకబ్‌ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా విదేశాంగ విధాన బోధకులు (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Former Cm KCR Focus to appear before Justice Ghosh Commission6
కేసీఆర్‌ ‘కాళేశ్వరం’ కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు జూన్‌ 5న హాజరు కావాలని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు. బుధవారం కేసీఆర్‌ ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూన్‌ 5న కేసీఆర్, 9న హరీశ్‌రావు కమిషన్‌ ముందు హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ వినిపించాల్సిన వాదనలు, ఇవ్వాల్సిన వివరణపై వారు చర్చించినట్లు సమాచారం. కమిషన్‌ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణ తీరుతెన్నులను కేసీఆర్‌ సమీక్షించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అందులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు క్రోడీకరించి నివేదిక సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి కొందరు సాగునీటి రంగ నిపుణులు, సాంకేతిక నిపుణుల నుంచి కూడా వివరాలు కోరినట్లు తెలిసింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో లోపాలపైనా చర్చ నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదిక అశాస్త్రీయంగా ఉందని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ చేసిన ప్రకటనపైనా ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు తెలిసింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదికలోని డొల్లతనాన్ని కమిషన్‌ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయించినట్లు సమాచారం. కమిషన్‌కు అరకొర సమాచారం ఇవ్వకుండా పూర్తి స్థాయి ఆధారాలతో వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి గోదావరి నదుల విషయంలో పాలకులు చూపిన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా తాము అన్ని విషయాలు వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కూడా కమిషన్‌ను కోరాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. రాజకీయ దురుద్దేశంతో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశారని మొదట్నుంచీ పేర్కొంటున్న నేపథ్యంలో.. తమ వాదన వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వకపోతే అనుసరించాల్సిన వైఖరిపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. నేడో రేపో పీపీ ప్రజెంటేషన్‌! విచారణ కమిషన్‌ ఎదుట హాజరవడానికి ముందే మీడియాకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలు, స్థితిగతులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని హరీశ్‌రావును కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించే పనిలో హరీశ్‌ ఉన్నట్లు సమాచారం. కాగా ఒకటీ రెండు రోజుల్లోనే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు సంబంధించిన తేదీని బీఆర్‌ఎస్‌ ప్రకటించే అవకాశముంది.

Sakshi Editorial On Western countries about Gaza7
పాశ్చాత్య దేశాల ‘ప్రాయశ్చిత్తం’

గాజాలో కళ్లముందు 19 నెలలుగా మారణహోమం సాగుతున్నా గుడ్లప్పగించి చూసిన పాశ్చాత్య దేశాలు ఇప్పటికి తెలివి తెచ్చుకున్నాయి. ఇజ్రాయెల్‌ సాగిస్తున్న ఊచకోత ‘నైతికంగా సమర్థించ లేనిది, పూర్తిగా అసమతౌల్యమైనద’ంటూ కొత్త రాగం అందుకున్నాయి. మొదట బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు ఇజ్రాయెల్‌ తీరును వ్యతిరేకిస్తూ ప్రకటన చేయగా, కాస్త ఆలస్యంగా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), జర్మనీ శ్రుతి కలపడం కొత్త పరిణామం. ఇన్నాళ్ల పాపానికిది ప్రాయశ్చిత్తం అనుకోవచ్చా? అనుమానమే. గాజాలో ఏణ్ణర్ధం నుంచి అదే పనిగా బాంబుల వర్షం కురి పిస్తూ వేలాదిమంది ప్రజలనూ... వారికి తిండి నీళ్లూ ఇచ్చేందుకూ, చికిత్స అందించేందుకూ వచ్చినవారిని సైతం హతమారుస్తుంటే ఈ దేశాల్లో ఎవరికీ నోరు పెగల్లేదు. ఇప్పటికీ వాటి వైఖరి పెద్దగా మారినట్టు కాదు. ఎందుకంటే... ఊచకోత సమర్థనీయం కాదంటూనే ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని ఎప్పటిలా మర్కట తర్కానికి దిగుతున్నాయి. 2023 అక్టోబర్‌ 7న పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు ప్రారంభించింది మొదలు పాశ్చాత్య దేశాలు ఈ వాదనే చేస్తున్నాయి. హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 1,200 మంది ఇజ్రాయెల్‌ పౌరుల్ని కాల్చిచంపి, 251 మందిని అపహరించుకు వెళ్లినప్పటి నుంచీ ఇజ్రాయెల్‌ ప్రతీకారం మొదలైంది. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి దేశానికీ వుంటుంది. కానీ దానికుండే పరిమితి మాటే మిటి? ఎన్ని నెలలపాటు బాంబుల వర్షం కురిపిస్తే... ఎన్ని వేలమందిని చంపితే ఆత్మరక్షణ చేకూరు తుంది? 2,000 పౌండ్ల (907 కిలోల) బంకర్‌ బస్టర్‌ బాంబులు ఒక చిన్న ప్రాంతమైన గాజాపై ప్రయోగిస్తుంటే, ఆ దాడుల్లో వేలాదిమంది అమాయక పౌరులూ, ముఖ్యంగా పిల్లలూ, స్త్రీలూ చని పోతుంటే ఎవరూ మాట్లాడలేదు. ఇజ్రాయెల్‌ దళాలు మూడు నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించి అక్కడికి అంతర్జాతీయ సహాయ బృందాలు అడుగుపెట్టకుండా పహారా కాస్తున్నాయి. తామే ఆ సాయాన్ని అందిస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రకటించాయి. అదెంత బూటకమో తరచూ మీడియాలో వస్తున్న కథనాలే చెబుతున్నాయి. రోజుల తరబడి ఆహారం, మంచినీరూ లభించక వేలాదిమంది మృత్యుముఖంలో వున్నారని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆకలికి తాళలేక వాహ నాల వెంబడి పరుగులు తీస్తున్నవారిని కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన ఉదంతాలు వెలుగులో కొచ్చాయి. చివరకు అమెరికా–ఇజ్రాయెల్‌ సహాయ బృందాలను పర్యవేక్షించే చీఫ్‌ జేక్‌ ఉడ్‌ ఆ బాధ్య తల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ బృందాల సాయమంతా కూడా ఇజ్రాయెల్‌ అధీనంలోని దక్షిణ గాజాలో నాలుగు శిబిరాల ద్వారా మాత్రమే అందుతోంది. సాయం కావాల్సిన వాళ్లు కిలోమీటర్ల దూరం నడిచిపోవాల్సి వస్తోంది. ఉత్తర గాజాకు ఆ మాత్రం సాయం కూడా లేదు.నదురూ బెదురూ లేకుండా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండపై సంపన్న రాజ్యాలు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాయి? ఒక నెత్తుటి హోమానికి తాము మౌన సాక్షులుగా మిగిలిపోయా మన్న నింద పడకూడదని, తమ చేతులు కూడా నెత్తుట తడిశాయని చరిత్రలో నమోదు కారాదని అవి తహతహలాడుతున్నాయి. ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు ఎడాపెడా సైనిక సామగ్రి తరలించినవే. కోట్లాది డాలర్లు కుమ్మరించినవే. భద్రతా మండలిలో దాన్ని సమర్థించినవే. ఇప్పుడు బ్రిటన్‌ ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలుపుదల చేసింది. పాలస్తీనా ఏర్పాటు అంశంపై వచ్చే నెలలో సౌదీ అరేబియాతో కలిసి సదస్సు నిర్వహించ నున్నట్టు ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఇవి నిజానికి కంటి తుడుపు చర్యలు. కానీ ఈమాత్రం చర్యలు కూడా సమ్మతం కాదంటోంది ఇజ్రాయెల్‌. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు పరోక్షంగా హమాస్‌ బలపడేందుకు దోహదపడుతున్నాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఆరోపించారు. ఇప్పటికి 594 రోజులుగా ఏకపక్షంగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న నరమేథానికి ఇంతవరకూ 61,700 మంది మరణించగా, అందులో 20,000 మంది పసివాళ్లని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద కన్నుమూసిన వారెందరో ఇంకా తెలియలేదు. వేలాదిమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోగా, మరిన్ని వేలమంది పిల్లలు కాళ్లూ చేతులూ పోగొట్టుకుని వైద్యసాయం సక్రమంగా అందక రోదిస్తున్నారు. ఈ మారణహోమానికి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రోజుల తరబడి ధర్నాలు సాగాయి. పాశ్చాత్య దేశాల్లో పాలస్తీనా ప్రధాన చర్చనీయాంశమైంది. కానీ ఇవేవీ ఇజ్రా యెల్‌నుగానీ, దానికి అండగా వుంటున్న సంపన్న రాజ్యాల పోకడలనుగానీ మార్చలేకపోయాయి. ఇజ్రాయెల్‌ వాణిజ్యంలో మూడోవంతు వాటా యూరప్‌ దేశాలదే. ఆ దేశాలు తల్చుకుంటే, చిత్త శుద్ధితో ఆంక్షలు అమలు చేస్తే ఇజ్రాయెల్‌ మనుగడ ఇబ్బందుల్లో పడుతుంది. మొదటి నుంచీ అండగా ఉంటున్న అమెరికా ఆ దేశాలతో చేతులు కలిపితే దాని పరిస్థితి మరింత దిగజారుతుంది. కనీసం అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ఆదేశాలను పాటిస్తే ఇజ్రాయెల్‌కు ఊపిరాడదు. కానీ అవి నిజంగా అంత పని చేస్తాయా? అసలు ఇజ్రాయెల్‌లోనే నెతన్యాహూపై తీవ్ర వ్యతిరేకత బయల్దేరింది. ఇప్పుడు ఆయన్ను సమర్థించేవారు 25 శాతం మించరని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ను ఏమాత్రం తక్కువ చేసినా అది ఇరాన్‌కు బలం చేకూరుస్తుందన్న భయం పాశ్చాత్య దేశాలకుంది. ఆ దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధానంతర రాజకీయాలన్నీ ఇజ్రాయెల్‌తో ముడిపడి వున్నాయి. దాన్ని తెంచుకోవటమంటే ఒక కొత్త ఒరవడికి తెరతీయడమే. అంత సాహసం చేయలేక కంటితుడుపు చర్యలు ప్రకటించాయి. కానీ ఇప్పటికే సమయం మించిందని ఆ దేశాలు గ్రహిస్తే మంచిది.

Punjab Kings vs Royal Challengers Bangalore in Qualifier 18
ఫైనల్‌ వేటలో...

ముల్లాన్‌పూర్‌: ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న రెండు జట్లు... 18వ సీజన్‌ ఫైనల్‌ చేరేందుకు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) గురువారం క్వాలిఫయర్‌–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ ఆరంభం నుంచి ఆడుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఇరు జట్లు... ఈ సారి నిలకడైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరాయి. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్‌ కింగ్స్‌ 9 విజయాలు, 4 పరాజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. 2014 తర్వాత పంజాబ్‌ జట్టు ‘ప్లే ఆఫ్స్‌’కు చేరడం ఇదే తొలిసారి కాగా... అప్పుడు కూడా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన పంజాబ్‌... తుదిపోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 4 పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు సాధించిన బెంగళూరు రన్‌రేట్‌లో కాస్త వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు జరగగా... చెరొకటి గెలిచాయి. బెంగళూరులో జరిగిన పోరులో పంజాబ్‌ గెలవగా... ముల్లాన్‌పూర్‌లో జరిగిన పోరులో బెంగళూరు పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌–2 రూపంలో మరో అవకాశం ఉండనుంది. టాప్‌–3పైనే ఆశలు... ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్‌ ‘ప్లే ఆఫ్స్‌’కు చేర్చిన కెప్టెన్‌గా ఘనత సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌... పంజాబ్‌కు ప్రధాన బలం కానున్నాడు. మైదానం బయటి నుంచి రికీ పాంటింగ్‌ సలహాలు... లోపల శ్రేయస్‌ వ్యూహాలతో ఇప్పటికే పంజాబ్‌ కింగ్స్‌ అభిమానుల మనసులు గెలుచుకుంది. ముందుండి నడిపించే వాడే నాయకుడు అనే విధంగా శ్రేయస్‌ బ్యాట్‌తోనూ దుమ్మురేపుతున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 51.40 సగటుతో అతడు 514 పరుగులు చేసి జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ వస్తున్న శ్రేయస్‌ 171.90 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇక యువ ఓపెనర్లు ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ 499 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 424 పరుగులతో సత్తా చాటారు. ఈ ఇద్దరు అందిస్తున్న శుభారంభాలతోనే పంజాబ్‌ భారీ స్కోర్లు చేయగలిగింది. ఈ సీజన్‌లో పంజాబ్‌ నిలకడైన విజయాలకు ఈ ముగ్గురి ఫామే ప్రధాన కారణం. ఇన్‌గ్లిస్‌ మంచి టచ్‌లో ఉండగా... నేహల్‌ వధేరా, శశాంక్, స్టొయినిస్‌ అవసరమైన సమయంలో సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌లో అర్ష్ దీప్ సింగ్, కైల్‌ జేమీసన్, అజు్మతుల్లా కీలకం కానున్నారు. జాతీయ జట్టు అవసరాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ స్వదేశానికి తిరిగి వెళ్లడం జట్టుకు కాస్త ఇబ్బంది కాగా... గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేని చాహల్‌ రాకతో స్పిన్‌ విభాగం పటిష్టమైంది. విరాట్‌పై పెను భారం లీగ్‌ ఆరంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్‌ కోహ్లి... 18వ సీజన్‌లో అయినా ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా... అనధికారిక కెపె్టన్‌గా కోహ్లిపైనే జట్టు అధికంగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విరాట్‌... 13 మ్యాచ్‌ల్లో 60.20 సగటుతో 602 పరుగులు చేశాడు. 147.91 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టిన కోహ్లి... 8 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తన వికెట్‌ విలువ అర్థం చేసుకొని ఆడుతున్న కోహ్లి... ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు ముల్లాన్‌పూర్‌లోనే పంజాబ్‌పై నమోదు చేసుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కోహ్లి, సాల్ట్‌ జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా... మయాంక్‌ అగర్వాల్, రజత్‌ పాటీదార్, జితేశ్‌ శర్మ చక్కటి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో అద్భుత ప్రదర్శన చేసిన జితేశ్‌ శర్మ నుంచి ఫ్రాంఛైజీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. గాయం కారణంగా టిమ్‌ డేవిడ్‌ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారగా... అతడి స్థానంలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఫినిషర్‌ పాత్ర పోషించనున్నాడు. ఫిట్‌నెస్‌ సాధించిన జోష్‌ హాజల్‌వుడ్‌ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎలాంటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెట్టగల హాజల్‌వుడ్‌ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. భువనేశ్వర్, యశ్‌ దయాళ్‌తో కలిసి అతడు పేస్‌ భారాన్ని మోయనుండగా... సుయాశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) పంజాబ్‌ కింగ్స్‌: శ్రేయస్‌ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, ఇన్‌గ్లిస్, నేహల్‌ వధేరా, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్, అర్ష్ దీప్, చాహల్‌. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, మయాంక్‌ అగర్వాల్, జితేశ్, కృనాల్‌ పాండ్యా, లివింగ్‌స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్‌ దయాళ్, హజల్‌వుడ్, సుయాశ్‌ శర్మ. పిచ్, వాతావరణం ముల్లాన్‌పూర్‌ మైదానంలో ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగగా... అందులో మూడు ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు 200 దాటాయి. మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం పిచ్‌ ఎలా స్పందిస్తుందనేది కీలకం. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఐపీఎల్‌లో నేడు (క్వాలిఫయర్‌ –1)పంజాబ్‌ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

Plans to hold Miss World pageants in India again9
‘మిస్‌ వరల్డ్‌’ మళ్లీ భారత్‌లోనే..?

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి పోటీలను వరసగా మూడోసారి భారత్‌లోనే అందునా మళ్లీ హైదరాబాద్‌లోనే నిర్వహించాలన్న దిశలో మిస్‌వరల్డ్‌ సంస్థ యోచిస్తోంది. గతేడాది జరిగిన 71వ ఎడిషన్‌కు ముంబై వేదిక కాగా, ఈ ఏడాది 72వ ఎడిషన్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు భారత్‌ అనువుగా ఉందనే ఉద్దేశంతో 73వ ఎడిషన్‌కు కూడా భారత్‌నే ఎంచుకోవాలని మిస్ట్‌ వరల్డ్‌ సంస్థ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభిస్తోంది. మరోసారి హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనుందని సమాచారం. అదే సమయంలో హైదరాబాద్‌ సహా దేశంలోని పది నగరాలను పరిశీలించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ మేరకు తన మనసులోని మాటను మిస్‌ వరల్డ్‌ సంస్థ చైర్‌ పర్సన్‌ జూలియా మోర్లే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న 72వ ఎడిషన్‌ కోసం దేశంలోని మరో పది రాష్ట్రాలు పోటీలో నిలిచా యి. ఇప్పుడు కూడా ఆయా రాష్ట్రాలు తదుపరి ఎడిషన్‌ నిర్వహణ కోసం అడుగుతున్నాయని మిస్‌ వరల్డ్‌ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని ఇతర దేశాలు కూడా రేసులో చేస్తున్నప్పటికీ, మరోసారి భారత్‌లోనే నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయంతో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం. భారత్‌లోనే ఎందుకు..? » యూరప్, అమెరికా దేశాలు, చైనాతో పోలిస్తే నిర్వహణ వ్యయం భారత్‌లో చాలా తక్కువ. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న పోటీల నిర్వహణ వ్యయం రూ.57 కోట్లుగా అంచనా వేసినట్టు ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇందులో మిస్‌ వరల్డ్‌ భరించే మొత్తం రూ.28.5 కోట్లు మాత్రమే. అంటే దాదాపుగా సగం మాత్రమే. మిగతా దాదాపు సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇలా భారత్‌లోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సగం మొత్తాన్ని భరిస్తున్నాయి. చాలా విదేశాల్లో ఈ వెసులుబాటు లేదు. మొత్తం ఖర్చు మిస్‌ వరల్డ్‌ సంస్థనే భరించాల్సి వస్తోంది. ఇక యూకే సహా యూరప్‌ అమెరికాల్లో ఈ వ్యయం మూడు నాలుగు రెట్లు ఎక్కువ. » స్పాన్సర్‌షిప్‌ రూపంలో మిస్‌ వరల్డ్‌ సంస్థకు భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కలను ఆ సంస్థ పూర్తి గోప్యంగా ఉంచుతున్నప్పటికీ, ఆ మొత్తం రూ.వందల కోట్లలో ఉంటుందనే అభిప్రాయం ఉంది. స్థానికంగా చారిటీ కార్యక్రమాలు, కొన్ని వితరణలు మినహా మిగతా మొత్తం ఆ సంస్థనే తీసుకుంటుంది. కానీ కొన్ని దేశాల్లో అయితే, స్థానిక ప్రభుత్వాలకు ఇందులో వాటా ఇవ్వాల్సి వస్తోంది. భారత్‌లో ఈ సమస్య లేకపోవటంతో ఆ సంస్థకు బాగా కలిసి వస్తోంది. » గత ఎడిషన్‌ పోటీలప్పుడు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సహకరించాయి. ఆ పోటీల నిర్వహణకు గౌరవంగా భావించాయి. పోటీదారులు పర్యటించిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతో చేపట్టాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి లేదు. అవి మిస్‌ వరల్డ్‌ పోటీలను వ్యాపార కార్యక్రమంగానే పరిగణిస్తున్నాయి. ఈ పోటీల రూపంలో అయ్యే ఖర్చును మిస్‌ వరల్డ్‌ సంస్థే భరించాల్సిన పరిస్థితి ఉంది. » యూరప్, అమెరికా, యూకేలాంటి చోట్ల పర్యాటక రంగం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందింది. దీంతో ఆ దేశాలు ఈ పోటీల కోసం పెద్దగా పాకులాడటం లేదు. కానీ భారత్‌.. ఈ పోటీల నిర్వహణ ద్వారా లభించే ప్రచారంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఆలోచనతో ఉంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలో ఉంటున్నాయి. » మిస్‌ వరల్డ్‌ పోటీలకు కావాల్సిన మౌలిక వసతులు మన దేశంలోని చాలా నగరాల్లో ఉన్నాయి. పోటీలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వాలు కంకణం కట్టుకుని పనిచేస్తున్నాయి. ఇది ఆ సంస్థకు బాగా కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఫైవ్‌/సెవన్‌ స్టార్‌ హోటళ్లు, ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు సరిపడా వేదికలు, పోటీదారులు పర్యటించేందుకు అనువైన ప్రాంతాలకు కొదవ లేదు. హోటళ్లు, వేదికల అద్దెలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. » ముఖ్యంగా వరసగా రెండు పర్యాయాలు నిర్వహించినప్పటికీ, ఇండియాలో పోటీలపై పెద్దగా నిరసనలు వ్యక్తం కాలేదు. కొన్ని దేశాల్లో నిరసనల వల్ల అప్పటికప్పుడు పోటీలను వేరే చోటకు మార్చుకున్న సందర్భాలున్నాయి.

Monsoons moving actively in Telangana10
రాష్ట్రమంతా నైరుతి!

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 26న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా... బుధవారం సాయంత్రానికి తెలంగాణ అంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో రాష్ట్ర భూభాగం అంతటా విస్తరించేవి. కానీ ఈసారి కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే విస్తరించడం గమనార్హం.ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించిన వాతావరణ శాఖ... ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జూన్‌ నెలలో విస్తారంగా వర్షాలు... కాగా, జూన్‌ నెలలో రుతుపవనాల గమనానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసింది. నైరుతి సీజన్‌లో జూన్‌ నెలలో రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఐఎండీ అంచనాల ప్రకారం జూన్‌ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని.. సగటున 111 శా­తం వర్షపాతం నమోదు కావొచ్చని వివరించింది.గతేడాది జూన్‌ నెలలో 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణంకంటే 23 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా... ఈసారి అంతకుమించి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 4.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌లో 3.0 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 2.75 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా గుండ్లపల్లెలో 2.28 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement