
ముందస్తు టిప్ల పేరుతో వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్న క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. "అడ్వాన్స్ టిప్" డిమాండ్ చేస్తున్నందుకు ఓలా, ఉబెర్, రాపిడో సహా నాలుగు క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థలు అవలంబిస్తున్న అనైతిక కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషి ఇటీవల స్పందించారు.
సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తొలుత మే 21న ఉబెర్పై ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించింది. ఆ తర్వాత మిగతా సంస్థలపైనా సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓలా, రాపిడోలపై కూడా దర్యాప్తును విస్తరించింది. అయితే కొన్ని వర్గాలు నమ్మ యాత్రి యాప్ కూడా ఇలాంటి ఫీచర్ను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నాయి. కానీ ఇంతవరకు దానికి నోటీసు జారీ కాలేదు.
మరోవైపు తమకు ఇంతవరకు ఎలాంటి ఫార్మల్ నోటీసు అందలేదని రాపిడో తెలిపింది. తాము ఆటోలు, క్యాబ్ల కోసం జీరో-కమిషన్ మోడల్ను అనుసరిస్తున్నామని, బైక్ రైడ్ల కోసం స్పష్టంగా అదనపు ఛార్జీలను వినియోగదారులకు ఎంపికగా అందిస్తున్నామని వివరించింది. ఈ సంస్థలు వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అని సీసీపీఏ పరిశీలిస్తోంది. నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఉబెర్కు 15 రోజుల సమయం ఇచ్చింది.
గతంలో కూడా ఓలా, ఉబెర్లు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ల ఆధారంగా ధరలలో వ్యత్యాసం చూపినందుకు దర్యాప్తును ఎదుర్కొన్నాయి. ఈ తాజా చర్య వినియోగదారుల హక్కులను కాపాడేందుకు కేంద్రం తీసుకుంటున్న కఠిన చర్యలను సూచిస్తుంది. రైడ్ను త్వరగా అందుకునేందుకు ఈ సంస్థలు వినియోగదారుల నుండి ముందస్తు టిప్లు చెల్లించమని కోరడం అనైతికమని, దోపిడీ స్వభావమని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి విమర్శించారు. టిప్ అనేది స్వచ్ఛందంగా, సేవ అనంతరం ఇవ్వాల్సినదిగా ఉండాలి కానీ, వేగవంతమైన రైడ్ల కోసం ముందస్తు షరతుగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.