సాక్షి, న్యూఢిల్లీ: పైరసీ సినిమాలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్న వ్యవహారంపై టెలిగ్రామ్ యాప్నకు భారత ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఛానెల్స్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) నోటీసులు పంపింది.
ప్రభుత్వం తాజా నోటీసులో టెలిగ్రామ్ను కేవలం ఒక్కో ఛానల్ను తొలగించే విధానానికి పరిమితం కాకుండా, ప్లాట్ఫామ్ స్థాయిలోనే పైరసీని నియంత్రించే సమగ్ర వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించింది. పైరసీ కంటెంట్తోపాటు ఓటీటీ కంటెంట్ పంచుతున్న ఛానెల్స్, గ్రూప్స్, బాట్స్, అడ్మిన్స్, సంబంధిత అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
అలాగే.. సినిమా నిర్మాతలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల కోసం సమర్థవంతమైన గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం వివరాలను కూడా సమర్పించాలని సూచించింది. సమాచారం సాంకేతిక చట్టం 2000, ఐటీ రూల్స్ 2021 ప్రకారం మధ్యవర్తిగా టెలిగ్రామ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుందని కేంద్రం గుర్తు చేసింది.
పైరసీ కేవలం సివిల్ వివాదం మాత్రమే కాకుండా, కాపీరైట్ చట్టం 1957, సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 ప్రకారం క్రిమినల్ నేరంగా కూడా పరిగణించబడుతుందని ఆ నోటీసుల్లో టెలిగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే 3,000కిపైగా పైరసీ ఛానెల్స్పై చర్యలు తీసుకున్నప్పటికీ.. ఇంకా కంటెంట్ కొనసాగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా వివరణతో పాటు ‘యాక్షన్ టేకన్ రిపోర్ట్’ (ATR) సమర్పించాలని స్పష్టంగా సూచించింది.
ఇదిలా ఉండగా.. భారత్లో టెలిగ్రామ్కు 15 కోట్ల యూజర్లు ఉన్నట్లు ఓ అంచనా. అయితే కొంతకాలంగా ఈ యాప్ కష్టాలు ఎదుర్కొంటోంది. ఇందుకు ముందు కూడా నియంత్రణ చర్యల బారినపడింది. మొన్నీమధ్యే నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఘటనల నేపథ్యంలో తాత్కాలికంగా బ్యాన్ ఎదుర్కొంది. తాజాగా యూజర్నేమ్ ఫీచర్ విషయంలోనూ కేంద్రం వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.


