మీపై కేసు ఎందుకు పెట్టకూడదు? | High Court notices to Holagunda SI Kurnool district | Sakshi
Sakshi News home page

మీపై కేసు ఎందుకు పెట్టకూడదు?

Jul 4 2026 5:30 AM | Updated on Jul 4 2026 5:30 AM

High Court notices to Holagunda SI Kurnool district

కర్నూలు జిల్లా హొళగుంద ఎస్‌ఐకి హైకోర్టు నోటీసులు 

దళిత బాధితుని ఫిర్యాదు తారుమారు చేసిన నేపథ్యం 

టీడీపీ వర్గీయులను కాపాడబోయి ఇరుక్కున్న పోలీసు అధికారి 

ఎస్‌ఐతోపాటు హోంశాఖ, డీజీపీ, డీఐజీ తదితరుల వివరణకూ ఆదేశాలు

ఆదోని: తనను రక్షించమంటూ దళితుడు పెట్టుకున్న ఫిర్యాదును తారుమారు చేసి టీడీపీ వర్గీయులను రక్షించాలనుకున్న కర్నూలు జిల్లా హొళగుంద ఎస్‌హెచ్‌ఓ,  ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. సదరు ఎస్‌ఐపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆయనతోపాటు ప్రతివాదులైన హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీజీపీ, కర్నూలు డీఐజీ, ఎస్‌పీ, పత్తికొండ డీఎస్‌పీ, కానిస్టేబుల్‌ అనిల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

పిటిషనర్‌ గిరిమల్ల దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ ప్రకారం.. హొళగుంద మండలం నెరణికి గ్రామానికి చెందిన దళిత గిరిమల్ల కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. గత మే 20న గ్రామంలోని చెరువు కట్ట వద్ద మట్టిని తవ్వుకుంటూ ట్రాక్టర్లో నింపుకుంటున్నాడు. ఈ సందర్భంలో అదే గ్రామానికి చెందిన పింజారి అల్లావలి అకారణంగా  గిరిమల్లను అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషిస్తూ మట్టిని ఎలా తవ్వుతావని గట్టిగా అరుస్తూ, గొడ్డలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. తల మీద తగలాల్సిన గొడ్డలికి గిరిమల్ల  చెయ్యి అడ్డు పెట్టడంతో అతనికి రక్తగాయమైంది.  

అధికార పార్టీ వర్గీయులను ప్రశ్నించినందుకే.. 
గ్రామంలో సచివాలయం పక్కన అధికార పార్టీ అనుచరుడు పీర్‌సాబ్‌ నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ విషయంలో గ్రామస్తులతో కలిసి గిరిమల్ల తీవ్రంగా వ్యతిరేకించాడు. న్యాయపోరాటం చేస్తూ వచ్చాడు. ఆ నిర్మాణాలను ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అదే గ్రామానికి చెందిన పింజారి పీరుసాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్‌ సాబ్‌ ప్రోద్బలంతో పింజారి అల్లావలి దాడికి పాల్పడటంతో వారందరిపై గిరిమల్ల హొళగుంద పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దళితుడినైన తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు. 

అయితే ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ గిరిమల్లను బెదిరించి అనిల్‌ అనే కానిస్టేబుల్‌ చేత ఫిర్యాదును తిరగరాయించారు. ఆ ఫిర్యాదులో పింజారి పీరుసాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్‌ సాబ్‌ పేర్లు లేకుండా కేవలం పింజారి అల్లావలి పేరు మాత్రమే ఉండేలా చేశారు.  ఆ మేరకు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. పైగా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదులో తీవ్ర ఆలస్యం అయ్యింది.  ఆ దీంతో న్యాయం కోసం బాధితుడు గిరిమల్ల సీనియర్‌ అడ్వకేట్‌ డాక్టర్‌ బి.పురుషోత్తమ రెడ్డి ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. కాగా,  ఫిర్యాదులో పేర్లు లేకుండా చేసుకున్న వాళ్లంతా టీడీపీ వర్గీయులు కావడంతో పెద్దల ఒత్తిడితో ఎస్‌ఐ ఫిర్యాదు నుంచి వారి పేర్లను తీసివేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement