సాక్షి, న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ విక్రయిస్తున్న ‘హెరిటేజ్ ఫ్రెష్ పనీర్’ ఉత్పత్తిపై కేంద్ర ఆహార భద్రతా, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్పత్తి లేబులింగ్, బ్రాండింగ్లో ‘ఫ్రెష్’, ‘హెల్తీ’ వంటి పదాలను వినియోగించడం ఆహార భద్రతా నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006లోని నిబంధనల ప్రకారం ఈ ఉత్పత్తికి ‘ఫ్రెష్’ అనే పదాన్ని ఉపయోగించే అవకాశం లేదని నోటీసుల్లో పేర్కొంది.
అయినప్పటికీ ‘హెరిటేజ్ ఫ్రెష్ పనీర్’ పేరుతో విక్రయించడం ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా, ట్రేడ్ మార్క్ లేదా బ్రాండ్ పేరులో ‘హెల్తీ’ అనే పదాన్ని వినియోగించడంపైనా ఎఫ్ఎఫ్ఎస్ఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వరై్టజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్–2018లోని రెగ్యులేషన్ 8(3) ప్రకారం ఇటువంటి పదాల వినియోగం వినియోగదారుల్లో ఆ ఉత్పత్తి ఆరోగ్యానికి ప్రత్యేక ప్రయోజనం కలిగిస్తుందనే అభిప్రాయాన్ని కలిగించే అవకాశముందని, ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 నిబంధనల ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హెరిటేజ్ ఫుడ్స్ను ఆదేశించింది.


