ట్రంప్‌ మరో సంచలనం.. విద్యార్థి వీసా ఇంటర్వూలకు బ్రేక్‌ | USA Govt Pauses New Student Visa Interviews Globally While It Expands Social Media Vetting, More Details Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మరో సంచలనం.. విద్యార్థి వీసా ఇంటర్వూలకు బ్రేక్‌

May 28 2025 7:13 AM | Updated on May 28 2025 10:13 AM

USA Govt Pauses new student visa interviews

వాషింగ్టన్‌: అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, హమాస్‌ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ట్రంప్‌ ప్రభుత్వం ఆందోళనల నడుమ విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక, ఇప్పటికే షెడ్యూలింగ్‌ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, ఈరోజు నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్‌ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు అత్యయిక ఉత్తర్వుపై మార్కో రూబియో సంతకం చేశారు. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్‌మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగ నిపుణులు విశ్లేషించచనున్నారు. ఎఫ్, ఎం, జే కేటగిరీ దరఖాస్తుల సోషల్‌మీడియా ఖాతాల పాత పోస్ట్‌లు, వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా గమనించనున్నారు.

అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్‌మీడియా ప్రొఫైల్, హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూలదాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్‌ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్‌ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది.  

క్లాసులు డుమ్మా కొడితే వీసా రద్దు.. 
ఇదిలా ఉండగా.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం. భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా నిబంధనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలంలో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్‌ స్టేటస్‌ కోల్పోకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement