దత్తత పేరుతో శిశువుల విక్రయం | Selling babies in the name of adoption | Sakshi
Sakshi News home page

దత్తత పేరుతో శిశువుల విక్రయం

May 29 2025 12:42 AM | Updated on May 29 2025 12:42 AM

Selling babies in the name of adoption

సూర్యాపేటలో 13 మంది ముఠా అరెస్టు 

ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి స్థానికంగా విక్రయం.. ఒక్కో శిశువుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు 

నల్లగొండ బాలల సంరక్షణ కేంద్రానికి శిశువుల తరలింపు

సూర్యాపేట టౌన్‌: ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేటకు చెందిన భార్యాభర్తలు నక్క యాదగిరి, ఉమారాణితోపాటు మరో 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ మీడియాకు వెల్లడించారు. ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల నుంచి కొన్ని ముఠాల ద్వారా శిశువులను తీసుకొచ్చి ఒక్కో శిశువును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. 

వీరు ఇప్పటివరకు టేకుమట్లలో ముగ్గురు మగశిశువులను, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు ఆడ శిశువులను, పెన్‌పహాడ్‌లో ఒక మగ శిశువు, ఉప్పలపహాడ్‌లో ఇద్దరు మగ శిశువులు, తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రామంలో ఒక ఆడశిశువు, హైదరాబాద్‌లో ఒక మగ శిశువును విక్రయించినట్టు గుర్తించారు. పిల్లలందరినీ రక్షించి నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. 

అరెస్టయినవారిలో నక్క యాదగిరి, ఉమారాణి, కోరె నాగేంద్రకుమార్, కొట్టె రామలక్ష్మి, పిల్ల పావని, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, నాగర్‌కర్నూల్‌కు చెందిన ముడావత్‌ రాజు, హైదరాబాద్‌కు చెందిన ఎండి.షాహానా, ఇస్తా శోభారాణి, సబావత్‌ శ్రీనివాస్, ఏర్పుల సునీత, రాజస్తాన్‌కు చెందిన ఖాన్‌ షాహీనా ఉన్నారు. ఈ ముఠాపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగామ, ముంబైలో కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. 

శిశువుల విక్రయం ఇలా.. 
యాదగిరి, ఉమారాణి దంపతులు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి విజయవాడకు చెందిన కోరె నాగేంద్రకుమార్‌ మధ్యవర్తిత్వంతో దత్తత పేరుతో విక్రయిస్తున్నారు. సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్య పిల్లల కోసం నక్క యాదగిరిని సంప్రదించారు. వారికి 15 రోజుల మగ శిశువును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీరిపై నిఘా పెట్టిన సీసీఎస్‌ పోలీసులు శిశువును అప్పగించే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. 

వారిని విచారించగా సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో మరో 11 మంది ముఠా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే వారిని అరెస్టు చేశారు. కొనుగోలుచేసిన వారినుంచి శిశువులను పోలీసులు తీసుకురావటంతో వారంతా సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. పిల్లలను ఇవ్వకపోతే స్టేషన్‌ ముందు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement