వెంటాడి.. వేటాడి... | Maoists fought for 60 hours to save Kesava Rao | Sakshi
Sakshi News home page

వెంటాడి.. వేటాడి...

May 29 2025 12:26 AM | Updated on May 29 2025 7:22 AM

Maoists fought for 60 hours to save Kesava Rao

ఈనెల 18న సాయంత్రం క్యాంప్‌ ఖాళీ చేసిన నంబాల బృందం 

దట్టమైన అడవి.. ఎత్తైన కొండలపై నిర్విరామ ప్రయాణం 

ఛత్తీస్‌గఢ్‌లోని గుండెకోట్‌ అడవిలో కొద్దిసేపు విరామం... అక్కడే ఎన్‌కౌంటర్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రతాదళాలు చుట్టుముట్టడంతో మావోయిస్టు పార్టీ చీఫ్‌ కమాండర్‌ నంబాల కేశవరావును కాపాడుకునేందుకు తిండీతిప్పలు లేకుండా 60 గంటలపాటు మావోయిస్టులు పోరాటం సాగించారు. ఎత్తైన కొండలు ఎక్కి దిగారు.. వాగులు, వంకలు దాటారు. చివరకు అలసిపోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. విరామం నుంచి తేరుకునేలోగా తీవ్ర నష్టం జరిగిందని.. అదే అబూజ్‌మఢ్‌ ఎన్‌కౌంటర్‌కు కారణమైనట్లు తాజాగా వెలుగుచూసింది.  

ఇద్దరు పారిపోవడంతో... 
నంబాల కేశవరావు రక్షణ దళం, అబూజ్‌మఢ్‌లో విప్లవ విస్తరణలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు పోలీసులకు లొంగిపోవడంతో నంబాల టీమ్‌ అడవిలో ఎక్కడ ఉందనే విషయం పోలీసులకు సమాచారం అందింది. దీనికి తోడు ఈనెల 17న రాత్రి నంబాల టీమ్‌లో ఉన్న ఇద్దరు (భార్యాభర్తలు) క్యాంప్‌ను విడిచి పారిపోయారు. దీంతో అప్రమత్తమైన నంబాల టీమ్‌ అదేరోజు సాయంత్రం క్యాంప్‌ను ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతానికి కాలినడకన ప్రయాణం మొదలెట్టింది. దీంతో తమ వెంట అత్యవసర వస్తువులు తప్పితే ఆహారం, ఇతర వస్తువులు ఎక్కువగా తెచ్చుకునే వీలు చిక్కలేదు. 

ఈనెల 18న నాలుగు జిల్లాలకు చెందిన భద్రతా దళాలు ఓర్చా వైపు నుంచి సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలెట్టాయి. ఈనెల 19న ఉదయం 9 గంటల సమయంలో పోలీసులు తమ సమీపానికి వచి్చనట్టుగా గమనించిన నంబాల టీమ్‌ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. జట్లూరు–బోటేర్‌ అటవీ ప్రాంతంలో ఇరువర్గాల నడుమ ఉదయం 10 గంటలకు మొదలైన కాల్పులు ఆ రోజంతా కొనసాగాయి. అయితే ఎలాంటి నష్టం లేకుండా తప్పించుకున్న మావోలు గుండెకోట్‌ గ్రామం వైపుగా అటవీ మార్గంలో వెళ్లారు. 

కొండ దగ్గర విరామం 
చివరకు 20వ తేదీ సాయంత్రానికి గుండెకోట్‌ సమీపంలోని అడవికి చేరుకుంది. కాసేపటికే మరో ఎత్తయిన కొండ ఎదురవడంతో కొంతమేర ఎక్కి వెదురు వనాల మధ్యకు చేరుకున్నాక కాసేపు విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. దట్టంగా ఉండే వనాల్లో ఉంటే పోలీసులకు కనిపించడం అసాధ్యమని.. ఒకవేళ కనిపించినా తప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేసినట్లు సమాచారం. 

అప్పటికే 60 గంటలుగా నిద్రహారాలు లేకుండా అడవుల్లో ప్రయాణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మావోయిస్టుల మార్గాలపై పట్టున్న డీఆర్‌జీ బలగాలు అదే దిశలో సెర్చ్‌ ఆపరేషన్‌ సాగిస్తూ.. గుండెకోట్‌ గ్రామానికే చేరుకున్నాయి. ఈనెల 20న రాత్రి గుండెకోట్‌ అడవిలో నంబాల టీమ్, భద్రతా దళాలు కేవలం కిలోమీటరు దూరంలోనే బస చేసినట్టు సమాచారం. 

చిమ్మచీకటిలో చడీచప్పుడు చేయకుండా రాత్రంతా ఇరువర్గాలు గడిపాయి. తెల్లవారాక గుట్టపైకి చేరుకుని సురక్షిత ప్రాంతంలోకి వెళ్లాలనేది మావోయిస్టుల ఆలోచన. ఇదే సమయాన మావోలను వెంటాడుతూ వారున్న ప్రాంతంలోకి వెళ్తే ఆంబుష్‌ వలలో చిక్కుకుంటామనే సందేహాలు భద్రతా దళాలను ముసురుకున్నాయి.

వ్యూహం ఫలించక..
గుండెకోట్‌ అటవీ ప్రాంతంపై మావోలకు పట్టున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న భద్రతా దళాలు.. 21వ తేదీ తెల్లవారుజామునే మరింత ముమ్మరంగా సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలెట్టాయి. ఉదయం 7 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. భద్రతాదళాలకు దారి చూపుతున్న డీఆర్‌జీ జవాన్‌పై దాడి చేయడం ద్వారా ప్రభుత్వ బలగాలను ఆత్మరక్షణలోకి నెట్టాలన్న మావోల వ్యూహం ఫలించలేదు. చివరకు ఈ కాల్పుల్లో పార్టీ చీఫ్‌ నంబాలతోపాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement