హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూ కేటాయింపుల అంశం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ భూముల కేటాయింపులు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపణలకు దిగింది. అయితే ఈ ఆరోపణలతో కూడిన ఓ వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ పోస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.
టీ-హబ్ను నిజమైన స్టార్టప్ల అభివృద్ధి కోసం నిర్మించాం. కానీ రేవంత్ రెడ్డి ‘ఎనుముల హబ్స్’ను రూపొందిస్తున్నారు. కుటుంబ ఆధారిత, కుటుంబ ప్రయోజనాల కోసం నడిచే వ్యవస్థ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
“జీరో ఇన్వెస్ట్మెంట్తో.. వందల కోట్ల లాభాలు?”
కేటీఆర్ తన వ్యాఖ్యల్లో ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి అత్యంత తక్కువ ధరకు విలువైన ప్రభుత్వ భూమి కేటాయించారంటూ ఆరోపణలు చేశారు. “జీరో ఇన్వెస్ట్మెంట్తో డిఫెన్స్ కంపెనీ నిర్మించి, రాత్రికి రాత్రే రూ.200 కోట్ల లాభాలు సాధించిన ఆవిష్కర్తగా అనుముల కొండల్ రెడ్డిని గుర్తించాలి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
అలాగే మంత్రి శ్రీధర్బాబు, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ యువతకు ప్రభుత్వ భూములు ఎలా పొందాలో ఈ “మ్యాజిక్ ట్రిక్” నేర్పించాలని ఎద్దేవా చేశారు.
While we built T-Hub to ensure that real startups’ thrive, Revanth Reddy is busy devising “Anumula Hubs” - family-run, family-driven, zero-innovation, zero-employee scam…err scheme.!
If you are one of the Anumula brothers, you get land allotted for dirt cheap. No questions… https://t.co/jZjt65VZvm— KTR (@KTRBRS) August 12, 2026
బీఆర్ఎస్ తన ప్రచారంలో దీనిని “ఎనుముల బ్రదర్స్ రూ.200 కోట్ల భారీ భూ స్కాం”గా అభివర్ణించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కుటుంబానికి చెందిన వారికి విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించారంటూ ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య భూ కేటాయింపుల అంశం మరోసారి రాజకీయ పోరుకు కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.


