17న ‘సర్’ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ
73,39,234 మంది ఓటర్ల పేర్లు తొలగింపే..
ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకపోవడమే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న ప్రకటించనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,87,214కు తగ్గిపోనుంది. మిగిలిన 73,39,234 మంది (21.70 శాతం) ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించనున్నారు. ‘సర్’ షెడ్యూల్ ప్రకారం ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి తిరిగి బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ)కు ఈ నెల 10లోగా అందజేస్తేనే వారి పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చుతారు.
వలస, మరణం తదితరాలతో..
ఫారాలు ఇవ్వడంలో విఫలమైన 73,39,234 మంది ఓటర్ల పేర్లను తొలగించి ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. గైర్హాజరు, చిరునామా మార్పు, డూప్లికేట్, మరణం (ఏఎస్డీడీ) అనే కారణాలతో ఈ ఓటర్ల నుంచి ఫారాలను సేకరించలేకపోయామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 9,22,230 మంది ఓటర్లు మృతి చెందారని, 11,25,546 మంది ఆచూకీ తెలియరాలేదని, 45,18,961 మంది చిరునామా శాశ్వతంగా మారిందని, 6,70,203 మంది మరో చోట నమోదయ్యారని, మిగిలిన 1,02,294 మంది నుంచి ఇతర కారణాలతో ఫారాలు సేకరించలేకపోయినట్టు వెల్లడించారు.
ఫారం ఇవ్వకపోతే మరో చాన్స్
సర్ నిర్దేశిత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేకపోయారా? అయితే మీకు మరో అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన నాటి నుంచి వచ్చే నెల 16 వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 దరఖాస్తులను స్వీకరించి అర్హులకు తుది ఓటర్ల జాబితాలో చోటు కల్పించనున్నారు. రాష్ట్ర ఓటర్ల జాబితాను ఆన్లైన్లో స్తంభింపజేసిన నేపథ్యంలో ప్రస్తుతం కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించడం లేదు. అయితే ఈ నెల 17 నుంచి ఇందుకు అవకాశం కల్పిస్తున్నారు.దరఖాస్తు చేసుకున్న వారిని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వో) నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. విచారణలో అర్హులని తేలితే ‘సర్’ తుది ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తారు.


