హైదరాబాద్: మాసబ్ట్యాంక్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు వెలుస్తున్నాయి. ఓల్డ్ మల్లేపల్లిలో ఏకంగా 30 గజాల స్థలంలో 5 అంతస్తుల భవనం నిర్మిస్తుండటం గమనార్హం. ఈ అక్రమ నిర్మాణానికి నోటీసులు జారీ చేయడంతో పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. మాసబ్ట్యాంక్ సర్కిల్–34 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన 36 మంది బిల్డర్లకు నోటీసులు జారీ చేశారు. డబుల్ సెల్లార్ తవ్వకాలు, సెట్బ్యాక్ నిబంధనలను అతిక్రమణ, అనుమతుల కంటే ఎక్కువ అంతస్తులు నిర్మించడం, అనుమతులు తీసుకోకుండానే బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం, నాలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి నోటీసులు ఇచ్చారు.
ఏకంగా 6 మెమోలు..
అనుమతి పొందిన అంతస్తుల కంటే ఎక్కువ అంతస్తులు నిర్మించిన భవనాలను అధికారులు గుర్తించారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలసత్వం వహించిన సెక్షన్ అధికారికి తాఖీదులు ఇచ్చారు. కొద్ది కాలంలోనే అతను ఏకంగా 6 మెమోలు అందుకున్నట్లు సమాచారం. సెక్షన్ అధికారి స్థాయిలో అధికంగా మెమోలు పొందడం మాసబ్ట్యాంక్ సర్కిల్ పరిధిలో ఇదే తొలిసారి. క్షేత్రస్థాయి పరిశీలనలు చేయకుండా చైన్మెన్లు, షాడో చైన్మెన్లు, టెక్నికల్ సిబ్బందిని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
రెండో దఫా నోటీసులు జారీ చేసినా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్న సదరు బిల్డర్లు.. టౌన్ప్లానింగ్ అధికారులకు సరైన సమాధానం ఇవ్వకుంటే మూడో దఫా నోటీసులు జారీ చేసి కూలి్చవేతలకు సిఫారస్ చేయాలి. కానీ మాసబ్ట్యాంక్ సర్కిల్ టౌన్ప్లానింగ్ అధికారులు ఆయా నిర్మాణాలపై తాత్సారం చేయడం, వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడం, విజిలెన్స్ అధికారులు ఆరా తీయడంపై హాట్ టాపిక్గా మారింది.


