పెళ్లికి ఇండియాకు రావాల్సిన టెకీ గుండెపోటుతో | Software Engineer To Ends Her Life In East Godavari | Sakshi
Sakshi News home page

విషాదం: పెళ్లికి ఇండియాకు రావాల్సిన టెకీ గుండెపోటుతో

May 27 2025 12:47 PM | Updated on May 27 2025 1:31 PM

Software Engineer To Ends Her Life In East Godavari

 విదేశంలో గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి 

స్వగ్రామానికి చేరిన మృతదేహం 

తూర్పు గోదావరి జిల్లా: మరో మూడు వారాల్లో ఆ ఇంట వివాహ వేడుకలు జరగాల్సి ఉంది. ఆనంద డోలికల్లో తేలియాడాల్సిన బంధుగణమంతా.. ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. కాబోయే పెళ్లి కొడుకుగా రావాల్సిన కుమారుడు.. నిర్జీవంగా ఇంటికి చేరడంతో ఆ తల్లిదండ్రుల విషాదానికి అంతులేకుండా పోయింది. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న మామిడికుదురు గ్రామానికి చెందిన ఎండీ తురాబ్‌ అలీ(28) ఈ నెల 17న గుండెపోటుతో మరణించారు. 

వచ్చే నెల 15న అతని వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులుండగా, ఈ విషాద వార్త ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వాస్తవానికి తురాబ్‌ అలీ సోమవారం ఇంటికి రావాల్సి ఉంది. యాదృచ్చికంగా అదే రోజు అతని మృతదేహం ఇంటికి చేరిన సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. అతని తండ్రి రిజ్వానుల్‌ హసన్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, తురాబ్‌ అలీ పెద్దవాడు. తురాబ్‌ అలీ తాతయ్య తురాబ్‌ హుస్సేన్‌ ఓ స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన పేరునే తురాబ్‌ అలీకి తల్లిదండ్రులు పెట్టారు. 

పెళ్లి ఏర్పాట్లలో.. 
మరికొద్ది రోజుల్లో తురాబ్‌ అలీ వివాహం జరగాల్సి ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కల్యాణ మంటపం బుక్‌ చేసి, పెళ్లికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. బంధుమిత్రులకు శుభలేఖలు పంచడంలో బిజీగా ఉన్నారు. ఈలోగా తురాబ్‌ అలీ మరణవార్త చేరడంతో.. పెళ్లింట కాస్తా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు నడుమ మామిడికుదురు ఖబర్‌స్థాన్‌లో తురాబ్‌ అలీ అంత్యక్రియలు జరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement