యంగ్‌ ఇండియా నా బ్రాండ్‌.. మీరే నా అంబాసిడర్లు: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy says Young India is my brand | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా నా బ్రాండ్‌.. మీరే నా అంబాసిడర్లు: సీఎం రేవంత్‌

May 29 2025 1:09 AM | Updated on May 29 2025 1:09 AM

CM Revanth Reddy says Young India is my brand

గురుకుల విద్యార్థినిని ఆశీర్వదిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి, విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

గురుకుల విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్‌రెడ్డి

రూ.25 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నాం

ప్రతి ఒక్కరికి తొలి పాతికేళ్లు కీలకం.. కెరీర్‌పై దృష్టి సారిస్తే జీవితంలో మంచి స్థానం.. కులం పేరుతో అవకాశాలు రావు.. చదువే ముఖ్యం

కులవృత్తుల పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు మోసం చేసింది.. 

బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను దూరం చేసింది

మేం వచ్చాక దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి

సబ్‌ప్లాన్‌ను బీఆర్‌ఎస్‌ వదిలేస్తే.. మేం ఖర్చుచేస్తున్నాం: భట్టి

సాక్షి, హైదరాబాద్‌: పాతికేళ్లు వచ్చే వరకు కష్టపడిన ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడతారని ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు. ప్రతి మనిషికి మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్య కాలమని, అందులోనూ 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అత్యంత కీలకమైనదని తెలిపారు. ఈ సమయంలో క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉండాలని సూచించారు. రంగుల ప్రపంచానికి ఆకర్షితులు కాకుండా కెరీర్‌పై దృష్టి సారిస్తేనే జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారని విద్యార్థులకు హితబోధ చేశారు. 

బుధవారం బంజారాహిల్స్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆడిటోరియంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్వహించిన 2024–25 ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సీఎం ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహూకరించారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్, పదోతరగతి చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. 

పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు బహూకరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా గురుకులాలను తయారు చేస్తున్నామని చెప్పారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. యంగ్‌ ఇండియా తన బ్రాండ్‌ అని, గురుకుల విద్యార్థులే తన బ్రాండ్‌ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. 

కులవృత్తుల పేరుతో బీఆర్‌ఎస్‌ మోసం 
కులం పేరుతో ఎవరికీ అవకాశాలు రావని, కష్టపడి చదువుకున్న వాళ్లకు మాత్రమే అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చదువు వల్ల వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు కులవృత్తుల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదలు, బడుగుల జీవితాలు మారుతాయని అందరూ భావించారు. 

కానీ పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ అన్ని వర్గాలను అణిచివేసింది. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని తెలిసినప్పటికీ.. మెరుగైన విద్య అందించకుండా కులవృత్తులు చేసుకోవాలని.. బర్రెలు, గొర్రెలు కాయాలంటూ వాటిని పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. కష్టపడి చదువుకున్న వాళ్లు ప్రభుత్వ కొలువుల కోసం ఏళ్లపాటు నిరీక్షించారు. కానీ, గత పాలకుడి ఇంట్లో ఒక్క మనిషికి ఉద్యోగం లేకపోతే ఆరు నెలల్లోనే ఎన్నికలు పెట్టి మరీ కొలువు ఇప్పించుకున్నారు’అని ధ్వజమెత్తారు.  

దళితులకు సముచిత స్థానం ఇచ్చాం 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 65 రోజుల్లోనే 11 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రూప్‌–1 పరీక్షల ఫలితాలు ఇచ్చిన తర్వాత కొందరు ఉద్దేశపూర్వకంగా నియామకాలను ఆపారని విమర్శించారు. గ్రూప్‌–1 ఉద్యోగాలకు అర్హత సాధించిన వారిలో 89 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందినవారే ఉన్నారని తెలిపారు. 

‘వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఒక్క దళితుడు కూడా వైస్‌ చాన్స్‌లర్‌ కాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓయూకు వీసీగా దళిత మేధావిని నియమించింది. అంబేద్కర్‌ వర్సిటీ వీసీగా, ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా, విద్యా కమిషన్‌ చైర్మన్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా దళిత బిడ్డలకు అవకాశాలు వచ్చాయి. హెచ్‌సీయూలో చదివిని మేధావి భట్టి విక్రమార్క ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థను క్రమపద్ధతిలో నడుపుతున్నారు’అని పేర్కొన్నారు.  

వాళ్లు ఎగ్గోడితే.. మేము ఖర్చు చేస్తున్నాం: భట్టి 
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకువచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తుచేశారు. కానీ, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయకుండా ఎగ్గొట్టిందని విమర్శించారు. అలా ఎగ్గొట్టిన నిధులను కాంగ్రెస్‌ ప్రభుత్వం లెక్కించి క్యారీ ఫార్వర్డ్‌ చేసి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఎస్సీలకు రూ.13,223 కోట్లు, ఎస్టీలకు 1,296 కోట్లు క్యారీఫార్వర్డ్‌ చేసినట్లు వివరించారు. 

5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం ఏడాది కాలంలోనే రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 102 సమీకృత గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement