‘మిస్‌ వరల్డ్‌’ మళ్లీ భారత్‌లోనే..? | Plans to hold Miss World pageants in India again | Sakshi
Sakshi News home page

‘మిస్‌ వరల్డ్‌’ మళ్లీ భారత్‌లోనే..?

May 29 2025 12:48 AM | Updated on May 29 2025 6:00 AM

Plans to hold Miss World pageants in India again

హైదరాబాద్‌ సహా మరో పది నగరాలపై మిస్‌ వరల్డ్‌ సంస్థ ఆసక్తి 

అన్ని విధాలా అనుకూలంగా ఉండటమే కారణం 

నిర్వహణ వ్యయం తక్కువ, ఆదాయం, స్థానిక ప్రభుత్వాల సహకారం 

పోటీలను అంతగా పట్టించుకోని అమెరికా, యూరప్‌ దేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి పోటీలను వరసగా మూడోసారి భారత్‌లోనే అందునా మళ్లీ హైదరాబాద్‌లోనే నిర్వహించాలన్న దిశలో మిస్‌వరల్డ్‌ సంస్థ యోచిస్తోంది. గతేడాది జరిగిన 71వ ఎడిషన్‌కు ముంబై వేదిక కాగా, ఈ ఏడాది 72వ ఎడిషన్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు భారత్‌ అనువుగా ఉందనే ఉద్దేశంతో 73వ ఎడిషన్‌కు కూడా భారత్‌నే ఎంచుకోవాలని మిస్ట్‌ వరల్డ్‌ సంస్థ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభిస్తోంది. 

మరోసారి హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనుందని సమాచారం. అదే సమయంలో హైదరాబాద్‌ సహా దేశంలోని పది నగరాలను పరిశీలించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ మేరకు తన మనసులోని మాటను మిస్‌ వరల్డ్‌ సంస్థ చైర్‌ పర్సన్‌ జూలియా మోర్లే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 ప్రస్తుతం జరుగుతున్న 72వ ఎడిషన్‌ కోసం దేశంలోని మరో పది రాష్ట్రాలు పోటీలో నిలిచా యి. ఇప్పుడు కూడా ఆయా రాష్ట్రాలు తదుపరి ఎడిషన్‌ నిర్వహణ కోసం అడుగుతున్నాయని మిస్‌ వరల్డ్‌ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని ఇతర దేశాలు కూడా రేసులో చేస్తున్నప్పటికీ, మరోసారి భారత్‌లోనే నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయంతో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం.  

భారత్‌లోనే ఎందుకు..? 
» యూరప్, అమెరికా దేశాలు, చైనాతో పోలిస్తే నిర్వహణ వ్యయం భారత్‌లో చాలా తక్కువ. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న పోటీల నిర్వహణ వ్యయం రూ.57 కోట్లుగా అంచనా వేసినట్టు ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇందులో మిస్‌ వరల్డ్‌ భరించే మొత్తం రూ.28.5 కోట్లు మాత్రమే. అంటే దాదాపుగా సగం మాత్రమే. మిగతా దాదాపు సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. 

ఇలా భారత్‌లోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సగం మొత్తాన్ని భరిస్తున్నాయి. చాలా విదేశాల్లో ఈ వెసులుబాటు లేదు. మొత్తం ఖర్చు మిస్‌ వరల్డ్‌ సంస్థనే భరించాల్సి వస్తోంది. ఇక యూకే సహా యూరప్‌ అమెరికాల్లో ఈ వ్యయం మూడు నాలుగు రెట్లు ఎక్కువ.  

»   స్పాన్సర్‌షిప్‌ రూపంలో మిస్‌ వరల్డ్‌ సంస్థకు భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కలను ఆ సంస్థ పూర్తి గోప్యంగా ఉంచుతున్నప్పటికీ, ఆ మొత్తం రూ.వందల కోట్లలో ఉంటుందనే అభిప్రాయం ఉంది. స్థానికంగా చారిటీ కార్యక్రమాలు, కొన్ని వితరణలు మినహా మిగతా మొత్తం ఆ సంస్థనే తీసుకుంటుంది. కానీ కొన్ని దేశాల్లో అయితే, స్థానిక ప్రభుత్వాలకు ఇందులో వాటా ఇవ్వాల్సి వస్తోంది. భారత్‌లో ఈ సమస్య లేకపోవటంతో ఆ సంస్థకు బాగా కలిసి వస్తోంది.  

» గత ఎడిషన్‌ పోటీలప్పుడు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సహకరించాయి. ఆ పోటీల నిర్వహణకు గౌరవంగా భావించాయి. పోటీదారులు పర్యటించిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతో చేపట్టాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి లేదు. అవి మిస్‌ వరల్డ్‌ పోటీలను వ్యాపార కార్యక్రమంగానే పరిగణిస్తున్నాయి. ఈ పోటీల రూపంలో అయ్యే ఖర్చును మిస్‌ వరల్డ్‌ సంస్థే భరించాల్సిన పరిస్థితి ఉంది.  

» యూరప్, అమెరికా, యూకేలాంటి చోట్ల పర్యాటక రంగం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందింది. దీంతో ఆ దేశాలు ఈ పోటీల కోసం పెద్దగా పాకులాడటం లేదు. కానీ భారత్‌.. ఈ పోటీల నిర్వహణ ద్వారా లభించే ప్రచారంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఆలోచనతో ఉంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలో ఉంటున్నాయి.  

»  మిస్‌ వరల్డ్‌ పోటీలకు కావాల్సిన మౌలిక వసతులు మన దేశంలోని చాలా నగరాల్లో ఉన్నాయి. పోటీలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వాలు కంకణం కట్టుకుని పనిచేస్తున్నాయి. ఇది ఆ సంస్థకు బాగా కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఫైవ్‌/సెవన్‌ స్టార్‌ హోటళ్లు, ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు సరిపడా వేదికలు, పోటీదారులు పర్యటించేందుకు అనువైన ప్రాంతాలకు కొదవ లేదు. హోటళ్లు, వేదికల అద్దెలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.   

»  ముఖ్యంగా వరసగా రెండు పర్యాయాలు నిర్వహించినప్పటికీ, ఇండియాలో పోటీలపై పెద్దగా నిరసనలు వ్యక్తం కాలేదు. కొన్ని దేశాల్లో నిరసనల వల్ల అప్పటికప్పుడు పోటీలను వేరే చోటకు మార్చుకున్న సందర్భాలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement