
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన వీఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు (హైవ్ స్టూడియోస్) కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ను డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు. డీటీడీసీ డెలివరీ రికార్డుల ప్రకారం పార్శిల్ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకుంది. పార్శిల్ అందుకున్న ఆఫీస్బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించాడు.
కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్డ్రైవ్ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే చరిత హార్డ్డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోంది. కొందరు వ్యక్తుల మార్గదర్శకత్వంలో పని చేస్తున్న చరిత సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయిందంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రెడ్డి విజయ్కుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కారణంగా తమ సినిమా ప్రాజెక్టుకు తీవ్ర అంతరాయం కలిగించిందన్నారు. సదరు హార్డ్డ్రైవ్లో కన్నప్ప చిత్రానికి సంబంధించి విడుదల చేయని, గోప్యమైన, అత్యంత సున్నితమైన డేటా ఉందన్నారు. ఈ కంటెంట్ను లీక్ చేయడం లేదా, డిలీట్ చేయడం ద్వారా తమ సంస్థ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే హార్డ్డ్రైవ్ను రికవరీ చేసి తమకు అప్పగించాలని కోరారు.
