డీలా పడ్డ ఓలా!.. ఊహించని రీతిలో.. | Ola Electric Slips to Number Three in EV Two Wheeler Market | Sakshi
Sakshi News home page

డీలా పడ్డ ఓలా!.. ఊహించని రీతిలో..

May 28 2025 1:36 PM | Updated on May 28 2025 2:56 PM

Ola Electric Slips to Number Three in EV Two Wheeler Market

అమ్మకాల్లో అగ్రగామిగా దూసుకెళ్లిన దేశీయ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్.. మే నెలలో కొంత వెనుకపడింది. టీవీఎస్ మోటార్ అగ్రస్థానంలోనూ.. బజాజ్ ఆటో తరువాత స్థానంలోనే నిలవడంతో.. ఓలా ఎలక్ట్రిక్ మూడోస్థానంలో నిలిచింది. చాలా రోజుల నుంచి భారీ అమ్మకాలతో తిరుగులేని కంపెనీగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టింది.

భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్.. మే నెల మొదటి 26 రోజుల్లో 20 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఏప్రిల్‌లో నెలతో పోలిస్తే ఈ వాటా చాలా తక్కువ. మే 1వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యకాలంలో కంపెనీ 15,211 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసింది. 2024 మే నెలలో కంపెనీ 37,388 యూనిట్ల రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. 2024తో పోలిస్తే 2025లో సేల్స్ 60 శాతం తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ నెలలో టీవీఎస్ మోటార్ 25 శాతం మార్కెట్ వాటాను నమోదు చేయగా.. బజాజ్ ఆటో 22.6 శాతం వాటాను నమోదు చేశాయి. ఈ కంపెనీల సేల్స్ కొంత తగ్గినప్పటికీ.. ఓలా ఎలక్ట్రిక్ కంటే కూడా ముందంజలో ఉన్నాయి. ఏథర్ ఎనర్జీ మార్కెట్ వాటా కూడా మే నెలలో 14.9% నుంచి 13.1%కి తగ్గింది, ఈ కాలంలో వాహన రిజిస్ట్రేషన్లు 13,287 యూనిట్ల నుంచి 9,962 యూనిట్లకు తగ్గాయి.

ఓలా రోడ్‌స్టర్‌ ఎక్స్‌ బైక్‌ డెలివరీలు
తొలి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 ఆఫర్‌తో రోడ్‌స్టర్‌ ఎక్స్‌ పోర్ట్‌ఫోలియో మోటార్‌ సైకిళ్ల డెలివరీలను ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. ‘‘మోటార్‌ సైకిల్‌ విభాగంలోకి ప్రవేశించే క్రమంలో ‘రోడ్‌స్టర్‌ ఎక్స్‌’ అనేది ఒక సాహసోపేతమైన ముందడుగు. ఈ డెలివరీతో ద్విచక్రవాహన కేటగిరిలో ఈవీ సామర్థ్యం అన్‌లాక్‌ అవుతుంది. ఈవీల వినియోగం, మరింత పుంజుకుంటుంది’’ అని ఓలా ఎలక్ట్రిక్‌ చైర్మన్‌ ఎండీ భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఓలా కంపెనీ రోడ్‌స్టర్‌ ఎక్స్‌ సిరీస్‌లో మోటార్‌సైకిల్స్‌ను 2.5కేడబ్ల్యూహెచ్, 3.5కేడబ్ల్యూహెచ్, 4.5కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ వేరియంట్‌లలో అందిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ.99,999, రూ.1,09,999, రూ.1,24,999గా ఉన్నాయి. రోడ్‌స్టర్‌ ఎక్స్‌ ప్లస్‌లో సిరీస్‌లో 4.5కేడబ్ల్యూహెచ్‌ వేరియంట్‌ ధర రూ.1,29,999, మరో వేరియంట్‌ 9.1కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ మోటార్‌ సైకిల్‌ ధర రూ.1,99,999గా ఉన్నాయి.

పెరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్
ఇటీవలి కాలంలో ఈవీల జోరు పెరగడం.. ఎక్కువ మంది ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఎంచుకోవడంతో టూవీలర్‌ విభాగం పుంజుకోవడానికి దోహదపడుతోందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. 2025 - 26లో అమ్ముడైన మొత్తం టూవీలర్లలో ఈవీల వాటా 6 శాతానికి పైగా నమోదైంది.

‘రాబోయే కాలంలో ఈవీల ధరలు దిగొచ్చే అవకాశం ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలతో స్కూటర్‌ పరిశ్రమలో ఈవీల వాటా మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది’ అని టీవీఎస్‌ మోటార్స్‌ సీఈఓ కేఎన్‌ రాధాకృష్ణన్‌ తాజాగా పేర్కొన్నారు. 2024–25లో తొలిసారి ఈ–టూవీలర్లు 10 లక్షల అమ్మకాల మైలురాయిని దాటాయి. మొత్తం 11.4 లక్షలకు పైగా సేల్స్‌తో ఈ–టూవీలర్‌ విభాగంలో ఏకంగా 21 శాతం వృద్ధి నమోదైంది.

అందుబాటులో విభిన్న మోడళ్లు
టీవీఎస్‌ మోటార్స్, బజాజ్‌ ఆటో, హీరో మోటో వంటి టూవీలర్‌ దిగ్గజాలతో పాటు నవతరం ఎలక్ట్రిక్‌ వాహన సంస్థలైన ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌ ఎనర్జీ వంటివి కొంగొత్త మోడళ్లతో ఈవీ మార్కెట్లో వాటా కోసం పోటీపడుతున్నాయి. స్కూటర్లలో విభిన్న వర్గాల అవసరాలకు, విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండడం కూడా ఎకానమీ బైక్‌లకు మించి స్కూటర్‌ అమ్మకాలు పుంజుకోవడానికి మరో ముఖ్య కారణమని రాధాకృష్ణన్‌ చెప్పారు. 2021–22లో టీవీఎస్‌ టూవీలర్‌ సేల్స్‌లో స్కూటర్ల వాటా 25 శాతం ఉండగా.. 2024–25లో ఇది 40 శాతానికి దూసుకెళ్లింది. గతేడాది కంపెనీ మొత్తం 47.4 లక్షల ద్విచక్రవాహనాలను విక్రయించింది. ఇదిలాఉంటే, టీవీఎస్‌ స్కూటర్‌ విక్రయాల్లో 15 శాతం ఎలక్ట్రిక్‌ ఐక్యూబ్‌దే కావడం మరో విశేషం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement