భారతదేశంలో కార్లను కొనుగోలు చేస్తున్న వారిలో ఇంధన ఎంపికలు మారుతున్నాయి. ఫాడా విడుదల చేసిన జూలై 2026 రిటైల్ డేటా ప్రకారం.. పెట్రోల్/ఇథనాల్ కార్ల వాటా 41.68 శాతానికి తగ్గింది. జూన్లో ఇది 43.15 శాతంగా ఉండగా.. గతేడాది జూలైలో 47.62 శాతంగా ఉంది. మరోవైపు డీజిల్ కార్ల వాటా జూన్లో 16.32 శాతం నుంచి జూలైలో 17.73 శాతానికి పెరిగింది.
గతేడాదితో పోలిస్తే డీజిల్ కార్ల వాటా కూడా స్వల్పంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ20 పెట్రోల్పై వినియోగదారుల్లో ఉన్న సందేహాలు కూడా ఈ మార్పుకు ఒక కారణమని ఫాడా చెబుతోంది.
పెట్రోల్/ఇథనాల్పై ఆసక్తి తగ్గుతున్న తరుణంలో.. సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. జూలైలో సీఎన్జీ వాహనాల వాటా 24.67 శాతం, హైబ్రిడ్ కార్ల వాటా 8.02 శాతం, ఈవీల వాటా 7.90 శాతంగా ఉంది. ఈ మూడు కలిపితే 40.59 శాతం మార్కెట్ వాటా వస్తుంది. అంటే పెట్రోల్/ఇథనాల్ వాహనాల కంటే కేవలం 1.09 శాతం పాయింట్లు మాత్రమే తక్కువ. దీన్నిబట్టి చూస్తే వాహన కొనుగోలుదారులు పెట్రోల్ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా జూలైలో రికార్డు స్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా 3,27,901 ఈవీలు అమ్ముడైనట్లు నివేదిక వెల్లడించింది. ఇది మొత్తం ఆటో మార్కెట్లో 12.7 శాతం వాటా అన్నమాట. మొత్తం మీద డీజిల్ కార్ల వాటా పెరగడం కంటే.. పెట్రోల్/ఇథనాల్ నుంచి సీఎన్జీ, హైబ్రిడ్, ఈవీల వైపు వినియోగదారుల ఆసక్తి పెరగడమే ప్రధాన మార్పుగా కనిపిస్తోంది. రాబోయే పండుగల సీజన్లో ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.


