బాంబే హైకోర్టు వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం, సుప్రీంకోర్టు టెలికాం ఆపరేటర్లైన భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు నోటీసులు జారీ చేసింది.
2008 నుంచి 2012 మధ్య 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ కలిగి ఉన్న కంపెనీల నుంచి ప్రభుత్వం వన్టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలంటూ బాంబే హైకోర్టు జూన్లో తీర్పు ఇచ్చింది. దీంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది.
అయితే.. హైకోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. స్పెక్ట్రమ్ అనేది పరిమితమైన వనరు కాబట్టి, కంపెనీలు 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ ఉపయోగించినందుకు ఛార్జీలు చెల్లించాల్సిందేనని కేంద్రం వాదిస్తోంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు టెలికాం కంపెనీల వివరణ కూడా తీసుకోవాలని నిర్ణయించింది. అందుకే రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దీంతో హైకోర్టు తీర్పు ప్రస్తుతానికి కొనసాగుతోంది. అయితే.. కేసు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తే.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలపై భారీగా ఛార్జీల భారం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికాం కంపెనీలకు ఇది మరింత కష్టమవుతుంది.


