breaking news
Funday
-
ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే ఆఫీస్ పని అవ్వదు భారం!
ఆఫీసు అంటేనే బోరింగ్గా, ఆఫీసు పని చాలా భారంగా అనిపిస్తోందా! అయితే, ఒక్కసారి ఈ టెక్ కొలీగ్స్ను కలవండి, అప్పుడు మీ ఆఫీస్ పని ఆటలాగా మారుతుంది.మ్యాజిక్ మౌస్!ఇప్పటి వరకు మౌస్ అంటే కేవలం క్లిక్లు కోసమే అనుకున్నారా? అయితే మీరు ఈ ‘చీర్డాట్స్ 2’ గురించి తెలుసుకోవాల్సిందే! ఇది ఒక మల్టీ టాలెంట్ కాంబినేషన్. ఎయిర్ మౌస్, టచ్ప్యాడ్, క్లికర్, ఏఐ చాట్, డేటా సమ్మరీ ఇచ్చే అడ్వైజర్ అన్నీ ఇదే! ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్క్రీన్ మీద దీనితో ఇలా ఊపేస్తే, అలా స్లైడ్స్ మారిపోతాయి. ఒక బటన్తో స్క్రీన్పై స్పాట్లైట్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. ఇంకా చెప్పాలంటే, మీరు మాట్లాడిన మాటలను ఈ మౌస్ ఏఐ సాయంతో రికార్డ్ చేసి, సింపుల్ సమ్మరీలుగా మార్చేస్తుంది. మొబైల్, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని కూడా దీనిని వాడుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఇరవై రోజులు పాటు పనిచేస్తుంది. ధర 99 డాలర్లు (రూ. 8,475).ట్రిపుల్ ట్రీట్ చార్జ్!ఆఫీస్ అంటే ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎయిర్పాడ్స్ వంటి చాలా రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రోజూ ఫుల్ చార్జ్ అవ్వాల్సిందే! కాని, ఒక్కోటి వేర్వేరు వైర్లు అడిగితే, ఆఫీస్లో మేనేజర్ కన్నా మనకే ఎక్కువ టెన్షన్! ఈ సమస్య తీర్చడానికే వచ్చింది ఈ ‘జీహూ క్యూబ్ ట్రిక్ ఎక్స్’. ఇది ఒక త్రీ ఇన్ వన్ చార్జర్. ఇది ఉంటే ఇక మీ డెస్క్ మీద ఒక్క కేబుల్ కూడా కనిపించదు. ఫోన్, వాచ్, ఎయిర్పాడ్స్ అన్నింటిని ఒకేచోట, ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ మిమ్మల్ని మరింత స్మార్ట్గా చేసేస్తుంది! ధర 55 డాలర్లు (రూ. 4,708)డేటా గార్డ్ఆఫీస్ ఫైల్స్ అంటే మామూలు విషయం కాదు, అవి ప్రమోషన్కి టికెట్ లాంటివి. ఒక్కసారైనా సిస్టమ్ సడన్గా క్రాష్ అయ్యిందంటే? అంతే సంగతులు. ఇక మీరు మీ కొత్త రెజ్యూమే రెడీ చేసుకోవాల్సిందే! పైగా హ్యాకర్లు, వైరస్లు, సాఫ్ట్వేర్ బగ్స్– అన్నీ డేటాపై పంజా విసురుతున్న ఈ రోజుల్లో డిజిటల్ ఫైల్స్ను భద్రంగా ఉంచడం అంటే, ఫ్రిజ్లో పిల్లలకు కనిపించకుండా ఐస్క్రీమ్ దాచినంత కేర్ తీసుకోవాలి. అందుకే వచ్చింది ఈ ‘కింగ్స్టన్ ఐరన్ కీ వాల్ట్ ప్రైవసీ 80’. ఇది డ్రైవ్ కాదు, డేటాకు ఒక డిజిటల్ బౌన్సర్ లాంటిది. టచ్ స్క్రీన్తో, పాస్వర్డ్, పిన్లాంటి లాకింగ్ సిస్టమ్తో వస్తోంది.ఏకంగా 3.8 టీబీ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదేళ్ల ఆఫీస్ ఫైల్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు అన్నీ ఇందులో భద్రంగా దాచుకోవచ్చు. ఒకే డ్రైవ్ను మల్టిపుల్ యూజర్లుగా వాడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో పాస్వర్డ్ కూడా ఇవ్వవచ్చు. హ్యాకర్ ట్రై చేస్తే వెంటనే రిడ్–ఓన్లీ మోడ్ ఆన్ చేసి ‘బాబూ, కాస్త పక్కకు వెళ్లి ఆడుకోమ్మా!’ అంటూ అడ్డుపడుతుంది. అంత భద్రంగా డేటాను చూసుకుంటుంది. ధర 729 డాలర్లు (రూ. 62,422). -
త్రిప్తి డిమ్రి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమెలాగే హెయిర్కట్..
‘ఆ ఛాన్స్ నాకు ఎక్కడ దక్కుతుంది?’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన త్రిప్తికి.. కొన్ని రోజుల్లోనే ఆ అవకాశం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చుట్టూ తిరిగి చివరకు ఆమెనే వరించింది. దీపికా పదుకొణే ప్లేస్ని భర్తీ చేసిన త్రిప్తి తాజా జర్నీ ఆసక్తికరమే కాదు, ఆశ్చర్యకరమైనది కూడా!టాలీవుడ్లోనూ గుర్తింపుబాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి (Tripti Dimri).. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో నటించి టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడదే దర్శకుడు ప్రభాస్తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకొని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. త్రిప్తి.. దీపికా పదుకొణెకు పెద్ద అభిమాని. చిన్నతనంలో ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమాలో దీపికా లుక్ చూసి, అదే స్టయిల్లో హెయిర్ కట్ చేసుకుందట!మందు జోలికి వెళ్లనుమొన్నటి వరకు టీ ఎక్కువగా తాగే త్రిప్తి, ఇప్పుడు కాఫీ మీద మక్కువ పెంచుకుందట. టీ, కాఫీ తప్ప... ఇప్పటివరకు ఎప్పుడూ ఆల్కహాల్ టేస్ట్ చేయలేదని, భవిష్యత్తులో చేయాలనే ఆలోచన కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇండియన్ సినిమాల్లో న్యూడ్గా నటించేందుకు ధైర్యం చేసిన అరుదైన నటీమణుల్లో త్రిప్తి ఒకరు. ‘యానిమల్’లో బోల్డ్ సీన్లు చేసిన తర్వాత స్టార్ అయింది. అయితే ఆ సీన్లు చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని ఒప్పుకుంది. అయినా కెరీర్ కోసం ఇలాంటి సాహసాలు అవసరమే అంటోంది.యానిమల్ మూవీతో దశ తిరిగిందిత్రిప్తి 2017లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ‘లైలా మజ్ను’, ‘బుల్ బుల్’ వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ రాలేదు. చిన్నప్పటి నుంచే టాప్ హీరోయిన్ కావాలని కలలు కన్న త్రిప్తి, అవి నెరవేరక మొదట్లో చాలా డిజప్పాయింట్ అయిందట! సరిగ్గా అలాంటి సమయంలో ‘యానిమల్’ ఛాన్స్ రావడంతో వదులుకోలేకపోయింది. ఆ సినిమా ఆమె కెరీర్ను ఊహించని ఎత్తులకు చేర్చింది. రష్మిక మందన్నా కన్నా త్రిప్తికి ‘ఛోటా భాభీ’గా ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ సినిమాలుఆ తర్వాత కూడా బోల్డ్ కథలే త్రిప్తిని వెతుక్కుంటూ వచ్చాయి. ‘బ్యాడ్ న్యూస్’ చిత్రంలో ఇద్దరు బాయ్ఫ్రెండ్స్లో ఎవరి వల్ల గర్భం దాల్చిందో తెలియని యువతి పాత్రలో నటించింది. అలాగే, ‘విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో’ అనే సినిమా హాలీవుడ్ సెక్స్ టేప్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. కొత్తగా పెళ్లైన జంట తమ మొదటి రాత్రిని షూట్ చేయడం, ఆ వీడియో లీక్ కావడం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది.విమర్శలుత్రిప్తి నటనపై, డ్యాన్స్పై కొన్ని విమర్శలు వచ్చినా.. గ్లామర్, టాలెంట్, సక్సెస్ వల్ల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ‘యానిమల్’లో న్యూడ్ సీన్ తీసే సమయంలో డైరెక్టర్, హీరో ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపింది. ఆ సీన్ను చాలా అందంగా చూపించారని, ఏ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినా షూటింగ్ ఆపేస్తామని మాట ఇచ్చిన తర్వాతే షూట్ చేశారని చెప్పింది త్రిప్తి.స్పిరిట్లో నేనా?ఒకసారి ఓ జర్నలిస్టు త్రిప్తిని ‘స్పిరిట్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుందా?’ అని అడిగినప్పుడు ‘ఒక్క శాతం కూడా అవకాశం లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్లోకి ఎలా వస్తాను?’ అని ఆశ్చర్యంగా అంది. పైగా సందీప్ రెడ్డి వంగా తనకే మళ్లీ ఛాన్స్ ఇస్తాడా? అంటూ ఎదురు ప్రశ్నించింది. కానీ, విధి, సినిమా రంగం రెండూ మాయామయం! చివరకు దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి వచ్చి చేరింది.చదవండి: షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్? -
దారపు నరాలు..ఇట్టే నయం..!
చర్మంపై నరాలు తేలి అవి పైకి కనిపిస్తే అందవిహీనంగా కనిపిస్తుంది. నిజానికి ఈ సమస్యను దారపు నరాలు లేదా స్పైడర్ వీన్స్ అంటారు. ఇవి ఎక్కువగా కాళ్లు, తొడల భాగాల్లో నరాలు చర్మంపైకి నల్లటి లేదా ఎర్రటి చారల్లా కనిపిస్తాయి. సమస్య తీవ్రతను బట్టి అవి ముఖంపై కూడా వస్తుంటాయి. వాటికి సమర్థమైన చికిత్స ‘లిక్విడ్ స్క్లెరో థెరపీ’. ఈ ప్రక్రియలో, ఒక ప్రత్యేక రసాయనిక ద్రావణాన్ని, నేరుగా ప్రభావిత నరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. చిన్న చారల నుంచి మధ్యస్థాయి చారల వరకు, ఈ చికిత్స చేస్తే ఫలితం ఉంటుంది. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ సెషన్స్ అవసరం కాకపోవచ్చు. చికిత్స తర్వాత స్వల్ప అసౌకర్యం, వాపు ఉండవచ్చు కాని, అదంతా త్వరగా తగ్గిపోతుంది. ఈ థెరపీ చాలా సురక్షితం.చర్మ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి వేర్వేరు పరికరాలను ఉపయోగిస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. ‘మైట్రెక్స్ ప్రూవ్ టోటల్ లిఫ్ట్’ అనే ఈ పరికరంలో ముఖం, తల, శరీర సంరక్షణకు అవసరమైన అన్ని ఫీచర్స్ కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్తో హై పవర్ పల్స్తో చర్మాన్ని ఉత్తేజపరచి, కండరాలను బలోపేతం చేస్తుంది. దాంతో చర్మాన్ని బిగుతుగా మార్చి, నిగారింపునిస్తుంది.అలాగే ఈ మెషిన్ మూడు విభిన్న అటాచ్మెంట్లతో రూపొందింది. దీనికున్న బ్రష్ అటాచ్మెంట్ తలకు మసాజ్ చేసి, జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది. దీని కర్వ్డ్ అటాచ్మెంట్ ముఖంపై చర్మాన్ని బిగుతుగా మార్చి, ముడతలను నివారిస్తుంది. ఫ్లాటర్ అటాచ్మెంట్ శరీర భాగాలైన చేతులు, కాళ్లు వంటి వాటిపై చర్మాన్ని మెరుగుపరుస్తుంది.ఇది వాటర్ప్రూఫ్ డివైస్ కావడంతో తడి చర్మంపై కూడా సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఐదు లెవల్స్, రెండు మోడ్స్ ఉండటంతో అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. దీనికి ఒక్కసారి చార్జ్ పెడితే 7 నుంచి 11 గంటల వరకు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం, నిరంతరాయంగా పని చేస్తుంది. 15 నిమిషాల తర్వాత ఆటో–ఆఫ్ టైమర్ ఉండటంతో దీనిని వినియోగించడం చాలా తేలిక. (చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?) -
బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే..?
మన శరీర భాగాల్లో ఎక్కువ శ్రమపడేది– మెదడు. ఇది అద్భుతమైన శక్తులతో కూడినది. కాని, దానికి ఇచ్చే విశ్రాంతి, శ్రద్ధ మాత్రం చాలా తక్కువ. మెదడును పదిలంగా ఉంచుకోవాలంటే గంటల తరబడి యోగా, వ్యాయామం అవసరమేమీ కాదు. రోజుకు ఐదు నిమిషాల ‘చిన్న అలవాట్లు’ మన మెదడును శక్తిమంతంగా మార్చగలవని తాజా న్యూరో సైన్స్ పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ఐదు నిమిషాల అలవాట్లు కేవలం ప్రస్తుతానికే కాక, భవిష్యత్తులో వృద్ధాప్యంలో మెదడు మందగించడం నుంచి మిమ్మల్ని రక్షించే సాధనాలవుతాయి. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం. 1. ముక్కుతోనే పీల్చాలిమనం బతకాలన్నా, మెదడు బతకాలన్నా శ్వాస కావాలి. అయితే మనం ఎలా ఊపిరి పీలుస్తున్నామన్నది మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. ముక్కు ద్వారా పీల్చే శ్వాస నేరుగా ‘అల్ఫ్యాక్టరీ బల్బు’కు అనుసంధానమై ఉంటుంది. దీని వల్ల మెమరీ సెంటర్లు యాక్టివేట్ అవుతాయి. ముక్కు ద్వారా ఊపిరి తీసుకునే సమయంలో మెదడు స్మృతి కేంద్రాలను ప్రేరేపించే ‘సబ్టల్ ఎలక్ట్రికల్ రిథమ్స్’ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్లనే నోటిద్వారా శ్వాస తీసుకునే వారికంటే ముక్కుద్వారా శ్వాసతీసుకునేవారు 40శాతం మెరుగైన మెమరీ చూపించారు.2. బాక్స్ బ్రీతింగ్నాలుగు సెకన్లు శ్వాస తీసుకొని, నాలుగు సెకన్లు శ్వాస నిలిపి, నాలుగు సెకన్లు విడిచి, మరో నాలుగు సెకన్లు ఖాళీగా ఉండటం. ఈ విధానాన్ని రోజుకు ఐదు నిమిషాలు పాటిస్తే, మీ మెదడు ముందు భాగంలో (ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్) 25శాతం అదనపు ఆక్సిజన్ చేరుతుంది. ఇది నిర్ణయం తీసుకోవడం, ఫోకస్, మెమరీ వంటివి మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఇది మీ పారా సింపథటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తూ, కార్టిసాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఒక్క రోజు బాక్స్ బ్రీతింగ్ చేయడం, ఫోకస్ను పదిశాతం పెంచుతుంది. అదే అలవాటు 30 రోజులు కొనసాగితే మీ మెదడు పనితీరులో 40శాతం మెరుగుదల ఉంటుంది. 3. డెస్క్ వర్కవుట్స్... అధిక తీవ్రత గల వ్యాయామం చేసిన వారు రెండు గంటలపాటు మెరుగైన మెదడు పనితీరు చూపారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.. దీనివల్ల బ్రెయిన్ అండ్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) విడుదల అవుతుంది, ఇది మెదడు న్యూరాన్ల వృద్ధిని పెంచుతుంది. కేవలం మీ డెస్క్ దగ్గరే ఐదు నిమిషాల్లోనే సాధ్యమయ్యే వ్యాయామాల ఉదాహరణ: 30 సెకన్లు బాడీ వెయిట్ స్క్వాట్స్, 30 సెకన్లు ఆర్మ్ సర్కిల్స్, 30 సెకన్లు హై నీస్, 30 సెకన్లు వాల్ పుషప్స్– ఈ చర్యలతో మెదడులో రక్తప్రసరణ పెరిగి, మీ ఫోకస్, శక్తి, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి.4. విభిన్న మేధా కార్యకలాపాలుపజిల్స్, బ్రెయిన్ గేమ్స్ కాకుండా, మీ మెదడుకు ‘కొత్త’ అనుభవాలు ఇవ్వడం వల్ల అత్యంత ప్రభావం ఉంటుంది. రోజుకు ఒక కొత్త పదాన్ని నేర్చుకొని మూడు వేర్వేరు సందర్భాలలో ఉపయోగించడం, చిన్న గణిత సమస్యలను కాగితం–పెన్సిల్ లేకుండా లెక్కించడం, లేదా సాధారణ వస్తువులకు అసాధారణ ఉపయోగాలను కనుగొనడం వంటివి మెదడులో క్రియేటివ్, భాగాలను కలుపుతూ డైవర్జెంట్ థింకింగ్ను మెరుగుపరుస్తాయి. మళ్లీ మళ్లీ అదే ఆటలు ఆడే కన్నా, చిన్న కొత్త విషయాలే మెరుగైన న్యూరోప్లాస్టిసిటీని అందిస్తాయి.5. సంగీతంతో సరళతసంగీతం మనసుకు సాంత్వననిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గిటార్, పియానో లాంటి వాయిద్యాలను వాయించడం వల్ల మెదడులోని అనేక భాగాలు ఒకేసారి ఉత్తేజితమవుతాయి. ‘అరె... నాకే వాయిద్యమూ రాదండీ’ అని బాధపడకండి. బీట్కు సరిపడేలా వేలితో ట్యాప్ చేయడం వల్ల మెదడులోని మోటార్ కార్టెక్స్, ఆడిటరీ కార్టెక్స్, అటెన్షన్ భాగాలు యాక్టివ్ అవుతాయి. ఇది మీకు గణనీయమైన కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది.6. నలుగురితో మాట్లాడండిఐదు నిమిషాల సామాజిక సంభాషణలు మీ మెదడు పనితీరు, విశ్లేషణ సామర్థ్యం, వర్కింగ్ మెమరీని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో, కొత్త విషయాలపై చేసిన సంభాషణలు మీ మెదడుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. పాత పరిచయాల కన్నా వయస్సులో తేడా గలవారితో సంభాషణ వల్ల మెదడు కొత్త దృక్కోణాలనూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సరదా కబుర్ల కన్నా లోతైన సంభాషణలు మెరుగైన కాగ్నిటివ్ బెనిఫిట్స్ను అందిస్తాయి. వీడియో, ఫోన్ సంభాషణలు టెక్స్ట్ మెసేజెస్ కంటే నేరుగా మాట్లాడటమే మెరుగైన ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?) -
గాల్లో ఎగిరే బైక్..! 'స్కై స్కూటర్'..
రోజూ ట్రాఫిక్లో గంటసేపు వేచి ఉండి, రెండు సార్లు హారన్ కొట్టి, మూడోసారి ఆరెంజ్ లైట్లో బ్రేక్ వేసి, చివరికి కాళ్లు బైక్ పెడల్స్పై కంటే నేలపైనే పెట్టుకుంటూ ప్రయాణం చేస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ప్రయాణ కష్టాలన్నింటికీ ఓ సింపుల్ జెట్ ఇంజిన్ పరిష్కారం చూపుతోంది. ఇది ‘హోవర్ బైక్’. పోలండ్కు చెందిన ‘వోలోనాట్’ అనే సంస్థ, అచ్చం ‘స్టార్ వార్స్’ సినిమాలో స్కైవాకర్ వాడిన స్పీడర్ బైక్ మాదిరిగా, చక్రాలు లేకుండా, ప్రొపెల్లర్లు లేకుండా, గాల్లో తేలిపోయేలా ఈ బైక్ను రూపొందించింది. గంటకు 200 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లే ఈ హోవర్ బైక్ స్టార్ట్ చేసిన క్షణమే, నేలను తాకకుండా నేరుగా గాల్లోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఇంకా అసలు మజా ఏంటంటే.. దీనికి స్టీరింగ్ ఎలా ఉందో? బ్రేకులు ఎక్కడ పెడతారో? ధర ఎంతవుతుందో? ఇవన్నీ ఇంకా మిస్టరీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ట్రయల్ రైడ్లో మాత్రమే కనిపించింది. కాని, ఇప్పటికే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తే, ఇక మన ట్రాఫిక్ పోలీసులు గాలిలో ఎగిరే ఈ బైక్ల వెంబడి డ్రోన్లు పంపించి ఫైన్ వేయాల్సిన రోజులు వస్తాయేమో! (చదవండి: అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..! ప్రకృతిని, స్త్రీ శక్తిని..) -
వావ్.. బాంబూ గ్రోవ్..
ప్రకృతి ప్రియులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు తప్పక సందర్శించాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం ‘అరాషియామా బాంబూ గ్రోవ్’. జపాన్లోని కియోటో నగరానికి పశ్చిమాన ఉన్న అందమైన వెదురు వనం ఇది. ఈ వనంలో వేలాది వెదురు మొక్కల మధ్య నుంచి కాలిబాట ఉంటుంది. ఆ దారిన నడిచి వెళ్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన వాతావరణానికి నిలయం. సన్నని వెదురు కాండాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎత్తుగా పెరిగి, పచ్చని గుడిసెలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. వెదురు ఆకుల గుండా ప్రసరించే సూర్యకాంతి భూమిని చేరే తీరు, తేలికపాటి గాలికి వెదురు కాండాలు ఒకదానికొకటి తాకుతూ సృష్టించే మృదువైన శబ్దం మనసుని మైమరపిస్తుంటాయి. ఈ మార్గంలో నడుస్తున్న కొద్దీ, వెదురు కాండాలు వివిధ కోణాల నుంచి కనిపిస్తాయి. ప్రతి మలుపులోనూ కొత్త దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. (చదవండి: అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..! ప్రకృతిని, స్త్రీ శక్తిని..) -
అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..!
అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్ 22న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది.ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు. (చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!) -
అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ ఏడాదికోసారి వస్తుంది. ఏటా డిసెంబర్ 25న వివిధ దేశాల్లోని క్రైస్తవులు ఈ వేడుకను ఘనంగా జరుపుకొంటారు. కాని, ఒకచోట మాత్రం ఏడాది పొడవునా– ప్రతిరోజూ క్రిస్మస్ వేడుక జరుగుతుంది. అదెక్కడి వింత ప్రదేశం అనుకుంటున్నారా? ఇక అసలు కథలోకి వచ్చేద్దాం.అదొక థీమ్ పార్కు. ఇంగ్లండ్లోని చెసింగ్టన్ పట్టణంలో ఉంది. ఏడాది పొడవునా– ప్రతిరోజూ జరిగే క్రిస్మస్ వేడుకలకు ఇదే కేంద్ర బిందువు. దీని పేరు ‘చెసింగ్టన్ వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్స్’. ఈ థీమ్ పార్కులో కూడా మిగిలిన థీమ్ పార్కుల్లో మాదిరిగానే అన్ని రకాల క్రీడా వినోద విలాసాలన్నీ ఉంటాయి. రంగుల రాట్నాలు, ఇతర వినోద క్రీడా సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇదే పార్కు ప్రాంగణంలో ఒక ఫోర్స్టార్ సఫారీ హోటల్ కూడా ఉంది. ఈ హోటల్లోని కొన్ని గదుల్లో నిత్యం క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి.ఈ హోటల్లోని ఓరియో, జుమాంజీ, గ్రఫాలో అనే ప్రత్యేక గదుల్లో ప్రతిరోజూ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్ పండుగ రోజున ఇళ్లల్లో అలంకరించినట్లుగానే ఈ గదులు నిత్యం క్రిస్మస్ అలంకరణతో కళకళలాడుతూ కనువిందు చేస్తాయి. గదుల మూలల్లో క్రిస్మస్ ట్రీలు, గదుల్లో పైనుంచి వేలాడే రంగురంగుల బెలూన్లు, బంగారు రంగులో ధగధగలాడే నక్షత్రాలు, కిటికీలకు ఎర్రని కర్టెన్లు సహా కళ్లుచెదిరే రంగుల అలంకరణలతో ఈ గదుల్లోకి అడుగుపెడుతూనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. గదుల్లోని మంచాలపై ఎర్రని దుప్పట్లు, ‘మెర్రీ క్రిస్మస్’ అని రాసి ఉన్న దిండు గలీబులు పండుగ వాతావరణాన్ని మరింతగా ఇనుమడింపజేస్తాయి. ఈ ఆకర్షణ కోసమే చాలా కుటుంబాలు పిల్లలతో కలసి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి, రోజుల తరబడి బస చేస్తుంటాయి. ఈ హోటల్ గదుల కారిడార్లో ప్రతి సాయంత్రం క్రిస్మస్ బ్యాండ్ సంగీతం అతిథులను ఉర్రూతలూపుతుంది. ఇక్కడ బసచేసే వారికి క్రిస్మస్ మెనూ వంటకాలనే వడ్డిస్తారు. పిల్లలకు ప్రత్యేకంగా చాక్లెట్లు, బాణసంచా, బెలూన్లు వంటివి పంచిపెడతారు. క్రిస్మస్ టోపీలు, పూలగుత్తులు వంటివి కూడా ఇస్తారు. శాంటాక్లాజ్ వేషధారులు పిల్లలకు సర్ప్రైజ్ గిఫ్టులు ఇచ్చి, వారిని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతారు. ఈ హోటల్లో నిత్యక్రిస్మస్ గదులను బుక్ చేసుకుంటే, ఉచితంగా థీమ్పార్కు టికెట్లు ఇస్తారు. (చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..) -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..
చిరునవ్వుతో ట్రెండ్ సెట్ చేయడమే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టయిలింగ్ టెక్నిక్! మేకప్ కాదు, ఫిట్నెస్, ఫన్ , ఫ్యాషన్ ఈ మూడింటి మిక్స్తో తన లుక్ని మెరిపిస్తుండటం ఆమె అలవాటు. అయితే, ఆమె లుక్లో అసలైన మెరుపు చిరునవ్వులోనే దాగి ఉందట!నేను ఫాలో అయ్యే స్టయిలింగ్ రూల్ ‘ఒకటి ఎక్కువ అయితే, మరొకటి తక్కువ’. అంటే, చెవిపోగులు హెవీగా ఉంటే, మెడలో జ్యూలరీ ఉండదు. డ్రెస్ హైలైట్ అయితే, మేకప్ మ్యూట్గా ఉంటుంది. ఇది నా ఫ్యాషన్ సీక్రెట్! కానీ ఇన్నాళ్ల ఫ్యాషన్ జర్నీలో నేర్చుకున్న అసలైన విషయం ఏంటంటే, ఏది ధరించినా హ్యాపీగా ఉంటే చాలు, అదే బ్యూటీ! అంటోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్అందాన్ని రెట్టింపు చేయాలంటే ముందుగా చేతులనే ముస్తాబు చేయాలి! దానికి బెస్ట్ ఆప్షన్ ఈ ‘హాథ్ ఫూల్’ జ్యూలరీ. ఇది బ్రేస్లెట్ కాదు, రింగ్ కాదు... చేతి మణికట్టు నుంచి వేళ్ల చివరి వరకు సాగే ఒక గొలుసు. ఇది వేసుకున్నాక చూసే వాళ్లు చేతులను చూడకుండా ఉండలేరు. అంతలా అట్రాక్ట్ చేస్తుంది. పూర్వం రాజకుమార్తెలు, మహారాణులు వేసుకునే ఈ ఆభరణం, ఇప్పుడు మోడ్రన్ పెళ్లికూతుర్లకు, ఫ్యాషన్ లవర్స్కి ఫేవరెట్గా మారింది. అయితే, ఇది వేసుకున్నాక చేతులను చాలా జాగ్రత్తగా స్టయిలింగ్ చేసుకోవాలి. హాథ్ ఫూల్ పెద్దదైతే చేతిని వేరే ఏ జ్యూలరీతోనూ స్టయిల్ చేయొద్దు.లేదంటే మీ చెయ్యి ఒక డిజైనర్ షోరూమ్లా కనిపిస్తుంది. సింపుల్ మేకప్, లైట్ జ్యూలరీ, మల్లెపూల బన్ దీనికి బెస్ట్ కాంబినేషన్. అప్పుడు చీర, లెహంగా, అనార్కలీ డ్రెస్ ఏదైనా హాథ్ ఫూల్ వేసుకుంటే లుక్కే మారిపోతుంది. ముఖ్యంగా ఫొటో షూట్స్, మెహందీ ఫంక్షన్లు, సంగీత్ పార్టీల్లో ఇది ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ జాక్వెలిన్ ధరించిన జ్యూలరీ బ్రాండ్: కోహార్ బై కనికా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆమె ధరించిన చీర బ్రాండ్: ఎకయాధర: రూ. 40,075.(చదవండి: సైలెంట్ డీ హైడ్రేషన్..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
అమరజీవి ఆత్మశోకం
అవి 20వ శతాబ్దం తొలి దశకాల రోజులు. జాతీయోద్యమం ఊపందుకుంటోంది. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో నిత్యం జాతీయవాదులు చర్చలు, ప్రణాళిక రచనల్లో మునిగిపోయేవారు. వారిలో అంకితభావంతో పని చేస్తున్న కొందరిని ఎంపిక చేసి ‘మీమీ ప్రదేశాలకు వెళ్లి జాతీయోద్యమం పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయండి’ అని సూచించారు గాంధీజీ. వారిలో ఒకరు పొట్టి శ్రీరాములు. మద్రాసులోని మెరీనా బీచ్లో గాంధీజీ ఉపన్యసిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని ఉన్నారు. అప్పుడు శ్రీరాములుగారిని వేదిక మీదకు ఆహ్వానించి గాంధీజీ ప్రశంసా పూర్వకంగా ‘శ్రీరాములు వంటి మరో పదకొండుమంది ఉంటే ఏడాదిలో స్వాతంత్య్రం వస్తుంది’ అన్నారు. ఆ తర్వాత కూడా శ్రీరాములుగారు గాంధీజీకి ఉత్తరాల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమం గురించి వివరిస్తూ ఉత్తరాలు రాసేవారు. శ్రీరాములు సంస్కరణలుపొట్టి శ్రీరాములు స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం(1930), క్విట్ ఇండియా ఉద్యమంతోపాటు అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మూడు దఫాలు జైలు పాలయ్యారు. దళితుల అభ్యున్నతి కోసం ప్లకార్డులు పట్టుకుని నెల్లూరు పట్టణంలో ఎర్రటి ఎండలో పాదరక్షలు లేకుండా నడిచారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం కోసం దీక్ష చేశారు. నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలోకి అనుమతించిన తరవాత దీక్ష విరమించారు. శ్రీరాములు తలపెట్టిన మరొక మహోన్నత ఘట్టమే తెలుగు వాళ్ల కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు వారికి ఎదురవుతున్న వివక్ష ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే! శ్రీరాములు గారు మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష చేపట్టారు. అమరుడి అంతియ యాత్ర‘ఆంధ్ర రాష్ట్ర సాధనకై అక్టోబర్ 19న ప్రాయోపవేశ దీక్ష పూనిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు 15 తేదీ రాత్రి 11.23 గంటలకు పరమపదించారు’ అని 1952, డిసెంబర్ 16వ తేదీన ప్రముఖ దినపత్రిక ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. పొట్టి శ్రీరాములుగారు అమరుడు కావడంతో తెలుగు ప్రజల్లో భావోద్వేగాలు పెల్లుబికాయి. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న వేలాదిమంది అభిమానులు ‘ప్రతి అరవ వాడు మరణించాలి, మాకు ఆంధ్రరాజ్యం కావాలి’ అని నినదించారు. ఆయన త్యాగానికి గౌరవం 1953, అక్టోబర్ 1న దక్కింది. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలను వేరు చేసి కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956, నవంబర్ 1న ఆంధ్రరాష్ట్రానికి తెలంగాణను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ అవతరించింది. శ్రీరాములు జ్ఞాపకార్థం ఆయన పేరును ఆయన సొంత జిల్లాకు పెట్టాలని అనేక ఉద్యమాలు జరిగాయి. ఎట్టకేలకు 2008 జూన్ 4న నెల్లూరు జిల్లాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేసింది. ఇవన్నీ గుండెను బరువెక్కించే వాస్తవాలు. నేటి చేదు నిజాలుపొట్టి శ్రీరాములు సొంతూరు జువ్వలదిన్నె గ్రామంలో ఆయన ఇంటిని స్మారక భవనంగా మార్చారు. దానికి నిత్యం తాళం వేసి ఉంటుంది. అది కాకుండా జువ్వలదిన్నెలో సముద్ర తీరానికి వెళ్లే దారిలో ఆయన పేరు మీద పర్యాటక శాఖ మరొక స్మారక భవనాన్ని నిర్మించింది. ఆ భవనం తలుపులకు తాళాలు లేవు. నిర్వహణ లేదు. ఆ స్మారక భవనంలో జరుగుతున్న అకృత్యాలకు ఆయన ఆత్మ రోజుకొకసారి మరణిస్తోంది. స్మారక భవనానికి ఎదురుగా రోడ్డుకు అవతల మద్యం దుకాణం. మద్యం ప్రియులు ఆ దుకాణంలో మద్యం కొని స్మారక భవనంలోకి తెచ్చుకుని సేవిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. మద్యసేవనంతో పాటు పేకాట ఆడుతున్న ఆనవాళ్లు కూడా కనిస్తుంటాయి. పర్యాటక శాఖ నిర్మించిన స్మారక భవనం ప్రాంగణంలో శ్రీరాములు విగ్రహం ఉంది. తన కళ్ల ముందే జరుగుతున్న అకృత్యాలకు అమరజీవి ఆత్మ రోదిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.∙వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
2198 కిలోమీటర్ల వేట!
హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో నివసించే రియల్టర్ ఖాదర్ ఖాద్రీ కుమారుడు ఉస్మాన్ ఖాద్రీ (10) 2009లో కిడ్నాప్ అయ్యాడు. బాలుడి తండ్రికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు రూ.3 లక్షలు పౌండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవడానికి టాస్క్ఫోర్స్కు చెందిన అన్ని బృందాలు రంగంలోకి దిగాయి. ప్రధాన నిందితుడి కదలికలపై చిన్న ఆధారం లభించడంతో ఢిల్లీ వెళ్లిన పోలీసులు– అక్కడ నుంచి మొదలు పెట్టి గుజరాత్లోని భరూచ్ చెక్పోస్టు వరకు ఏకబిగిన 2,198 కిలోమీటర్లు వేటాడి పట్టుకున్నారు. శాలిబండకు చెందిన ఖాదర్ ఖాద్రీ, కామాటిపుర ప్రాంతానికి చెందిన ఖాజీ అనీసుద్దీన్ అలియాస్ అనీస్ భాగస్వాములుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఖాదర్ తనను మోసం చేసి నష్టాలు మిగులుస్తున్నాడని భావించిన అనీస్ అతనిపై కక్ష కట్టాడు. ఖాదర్ ఇంట్లో కూడా తిరిగే చనువు ఉన్న అనీస్ అతని కుమారుడు సయ్యద్ ఉస్మాన్ మహ్మద్ ఖాద్రీని కిడ్నాప్ చేసి, డబ్బు వసూలు చేయాలని భావించాడు. దీనికోసం తన సోదరులు ఖాజా షంషుద్దీన్ అలియాస్ అక్రం, ఖాజీ హఫీజుద్దీన్ అలియాస్ అస్లంలతో కలిసి రంగంలోకి దిగాడు. 2009 మే 20న ఖాదర్ ఇంటికి వెళ్లిన అనీస్.. ఆ సమయంలో ఖాదర్ కుటుంబం ఖాజీపురకు వెళుతోందని తెలుసుకున్నాడు. వారి కంటే ముందే ఖాజీపుర చేరుకున్న అనీస్ అక్కడ కాపు కాశాడు.ఆ ఇంటి వద్దకు చేరుకున్న ఉస్మాన్ను బైక్ రైడింగ్ పేరుతో అనీస్ బయటకు తీసుకువచ్చాడు. తన పల్సర్ వాహనంపై ఎక్కించుకుని బహదూర్పుర చేరుకున్న తర్వాత మారుతీ వ్యాన్ తీసుకురమ్మని తన సోదరుడైన అక్రమ్కు సందేశం ఇచ్చాడు. అతడు వచ్చాక ఇద్దరూ బాలుడిని వ్యానులోకి మార్చి శంషాబాద్ వైపు తీసుకువెళ్లారు. బాలుడు కనిపించట్లేదని భావించిన ఖాదర్ అదే రోజు రాత్రి శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఖాదర్కు లండన్ ఫోన్ నంబర్ కనిపించేలా ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసిన అనీస్... ఉస్మాన్ను తామే కిడ్నాప్ చేశామని, రూ.3 లక్షల మొత్తాన్ని పౌండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆ నెల 22 నుంచి మొదలైన ఈ ఫోన్లు 25 వరకు కొనసాగడంతో మిస్సింగ్ నుంచి కిడ్నాప్గా ఆ కేసు మారింది. ఓపక్క ఇలా ఫోన్లు చేస్తూనే అనీస్... ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి రెండు మూడు రోజుల పాటు ఉస్మాన్ కుటుంబంతో కలిసి బాలుడి కోసం గాలిస్తున్నట్లు నటించాడు. ఆపై హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. నగరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లిన అనీస్ అక్కడ బోగస్ వివరాలతో రెండు సిమ్కార్డులు తీసుకుని ఢిల్లీ చేరుకున్నాడు. బాలుడి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ బృందం అనీస్ ఇంటిపై దాడి చేసి సోదాలు చేసింది. ఆమె సోదరి రహస్యంగా దాచి ఉంచిన ఈ సెల్ఫోన్ బయటపడింది. దీన్ని వినియోగించి ఆమె అనీస్తో సంప్రదింపులు జరుపుతోందని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అతడికి చెప్తోందని గుర్తించారు. మరికొందరిని విచారించగా, ఉస్మాన్ను మారుతీ వ్యాన్లో కిడ్నాప్ చేసినట్లు బయటపడింది. దీంతో అనీస్ బాలుడిని తీసుకుని సంచరిస్తున్నాడని భావించిన పోలీసులు అతడు వాడుతున్న సెల్ఫోన్ నంబర్ లోకేషన్ చూసి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ముగ్గు్గరు అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందం హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీ చేరుకుంది. ఇలా వెళ్లిన అధికారులు సాధారణంగా అక్కడి ఏపీ భవన్లో బస చేసే వాళ్లు. ఈ టీమ్ను రిసీవ్ చేసుకుని, ఏపీ భవన్లో దింపడానికి వీరిలో ఓ అధికారి స్నేహితుడైన ట్రావెల్స్ యజమాని బల్బీర్ సింగ్ స్వయంగా వచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి కేవలం 14 కి.మీ. ఉన్న ఏపీ భవన్లో దింపేసి, తన దైనందిన విధుల్లో నిమగ్నం అవ్వాలని ఆయన భావించారు. ఈ టీమ్ ఏపీ భవన్కు చేరుకునే లోపే హైదరాబాద్ నుంచి మరో అప్డేట్ అందింది. అనీస్ లోకేషన్ రాజస్థాన్లోని జైపూర్ అన్నది దాని సారాంశం. దీంతో బల్బీర్ సింగ్ వాహనంలోనే టాస్క్ఫోర్స్ బృందం జైపూర్ వెళ్లింది. అనీస్ లోకేషన్ అజ్మీర్ మీదుగా అహ్మదాబాద్ చేరుకోవడంతో పోలీసులూ అనుసరించాల్సి వచ్చింది. అనీస్ లోకేషన్ సూరత్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్టాండ్ వద్ద చూపిస్తుండటంతో పోలీసులు అక్కడకు చేరుకుని కాపు కాశారు. హఠాత్తుగా బయలుదేరిన అనీస్... వడోదరా వైపు వెళ్తున్నట్లు హైదరాబాద్లో ఉన్న అధికారులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి అక్కడి టీమ్కు సమాచారం ఇచ్చారు.కేవలం ఏపీ భవన్ వరకే అనుకుని వచ్చిన బల్బీర్సింగ్ సైతం బాలుడిని రక్షించాలనే ఉద్దేశంతో తన వాహనంతో సహా పోలీసులతో కలిసి ప్రయాణించాడు. అహ్మదాబాద్–వడోదరా మధ్య 81.1 కిమీ పొడవునా ఓ ఎక్స్ప్రెస్ హైవే ఉంది. దీనికి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు ద్వారా అనీస్ ప్రయాణిస్తున్నట్లు అతడి సెల్ఫోన్ లోకేషన్ ద్వారా పోలీసులు గుర్తించారు. తాము ఎక్స్ప్రెస్ హైవే మీదుగా వెళ్తే ముందే వడోదరా చేరుకుని కాపు కాయవచ్చని, అక్కడకు మారుతీ వ్యాన్లో వచ్చే అనీస్ను పట్టుకుని బాలుడిని రెస్క్యూ చేయవచ్చని భావించారు. దాదాపు 30 కి.మీ. ప్రయాణించిన తర్వాత అనీస్ లోకేషన్ మళ్లీ అహ్మదాబాద్ వచ్చినట్లు టీమ్కు తెలిసింది. వాహనం ఈ హైవేలో ఓసారి ప్రవేశించిన తర్వాత చివరి వరకు వెళ్లి తిరిగి రావాల్సిందే తప్ప ఎక్కడా యూటర్న్స్ ఉండవు. అంత సమయం లేకపోవడంతో అధికారులు డివైడర్కు అటు–ఇటు రాళ్లు పెట్టి వాటి మీదుగా, అత్యంత ప్రమాదకర రీతిలో యూ–టర్న్ తీసుకుని వెనక్కు వచ్చారు. అనీస్ వద్ద ఉన్న ఫోన్ స్విచాఫ్ కావడంతో అక్కడే వేచి చూస్తూ ఉండాల్సి వచ్చింది.కొన్ని గంటల తర్వాత అనీస్ లోకేషన్ మళ్లీ వడోదరా వైపు హైవే మీద కదలడం మొదలుపెట్టింది. దీంతో అతడి దాంతో పాటు ఈ టీమ్ లైవ్ లోకేషన్లు ఒకేసారి చూసేలా ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. వీరి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఒకరి లోకేషన్ను మరొకరు నాలుగుసార్లు క్రాస్ చేసినట్లు బయటపడింది. అయితే తమ మార్గంలో తమకు ఎక్కడా మారుతీ వ్యాన్ తారసపడకపోవడంతో అనీస్ వేరే వాహనంలో ప్రయాణిస్తున్నట్లు గ్రహించారు. దీంతో ఆ మార్గం చివరలో ఉన్న భరూచ్ టోల్ప్లాజా వద్దకు వెళ్లి కాపు కాశారు. కొద్దిసేపటికి అహ్మదాబాద్లోని నీతా ట్రావెల్స్కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు రావడాన్ని గమనించి టోల్ప్లాజా సిబ్బంది సహకారంతో దాన్ని ఆపారు. అప్పటి వరకు పోలీసుల వద్ద అనీస్ ఫొటో కూడా లేదు. కేవలం గుర్తులు, లొకేషన్, వాహనం ఆధారంగానే గాలిస్తున్నారు. ఆ బస్సు లోపలకు వెళ్లిన ఒక అధికారి గుజరాత్ పోలీసుగా పరిచయం చేసుకుని, రొటీన్ చెకింగ్ మాదిరిగా ఒక్కో ప్యాసింజర్ వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు చూపాల్సిందిగా అడిగారు. ఈ అధికారి అనీస్ వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు అడగ్గా ‘మేరే పాస్ నయ్యే సాబ్’ అంటూ హైదరాబాదీ హిందీలో సమాధానం ఇచ్చాడు. దీంతో అతడే అనీస్ అని నిర్ధారించిన ఆ అధికారి ‘బహుత్ హోగయా... చల్ రే అనీస్’ అనడంతో తాను చిక్కినట్లు తెలుసుకున్న అతగాడు ‘చలో సాబ్’ అంటూ బస్సు దిగాడు. అక్కడే ఉన్న మిగిలిన ఇద్దరు టాస్క్ఫోర్స్ అధికారులు అతడిని చుట్టుముట్టి మిగిలిన నిందితులు, బాలుడి విషయం ప్రశ్నించగా..వాళ్లు హైదరాబాద్లోనే ఉన్నారని, తాను మాత్రం పోలీసుల దృష్టి మళ్లించడానికి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నానని సమాధానం ఇచ్చాడు. అనీస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భరూచ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు బయల్దేరారు. అప్పటికి మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఏకబిగిన 1197 కి.మీ. ప్రయాణించినా, బాలుడిని సురక్షితంగా రక్షించాలనే ఉద్దేశంతో విశ్రాంతి విషయం మర్చిపోయి హైదరాబాద్కు పయనయమయ్యారు. టాస్క్ఫోర్స్ బృందంలో కేవలం ఒక్కరికే డ్రైవింగ్ వచ్చి ఉండటంతో ఆ అధికారితో పాటు బల్బీర్ సింగ్ డ్రైవ్ చేసుకుంటూ మరో 1001 కిమీ ప్రయాణించి మర్నాడు హైదరాబాద్ చేరుకున్నారు. అనీస్తో పాటు పోలీసులకు ఇక్కడ వదిలి ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. బాలుడి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్. నిందితుడు అనీస్ తన చిన్నప్పటి ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసులను వాడుకున్నాడు. అదెలాగో వచ్చేవారం తరువాయి భాగంలో చదవండి.∙శ్రీరంగం కామేష్ -
జానశ్రుతి మహారాజు – రైక్వుడు
పూర్వం జానశ్రుతి అనే మహారాజు ఉండేవాడు. దానధర్మాలలో ఆయనకు సాటి వచ్చే రాజులెరూ లేరు. జానశ్రుతి ధర్మపరాయణుడు. నిత్యం పండిత గోష్ఠి నిర్వహిస్తూ సాధు సత్పురుషుల ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించేవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. పండితులను ఘనంగా సత్కరించేవాడు. తరచుగా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, విప్రులకు విరివిగా దానాలు చేస్తూ ఉండేవాడు. జానశ్రుతి పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండేది.ఒకనాడు సాయంత్రం జానశ్రుతి మహారాజు తన ఏడంతస్తుల రాజసౌధం పై అంతస్తులో డాబాపై తూగుటుయ్యాలలో కూర్చుని, విశ్రమిస్తున్నాడు. అదే సమయంలో రెండు రాజహంసలు ఆకాశంలో ఎగురుతూ తమలో తాము సంభాషించుకున్న మాటలు జానశ్రుతి చెవిన పడ్డాయి. ఒక రాజహంస జానశ్రుతి దానశీలతను, ధర్మపరాయణతను పొగడసాగింది. ‘ఇదిగో! ఇదే జానశ్రుతి మహారాజు రాజధాని. భూలోకంలో ఆయనంతటి దాత, ధార్మికుడు, జ్ఞాని మరొకరు లేరు’ అంది.అంతలో మరో హంస ఆ మాటలను కొట్టి పారేస్తూ, ‘చాలు చాల్లే! నీ జానశ్రుతి మహారాజు సంగతి ఎవరికి కావాలోయ్! ముల్లోకాలలోనూ రైక్వుడికి మించిన మహానుభావుడు మరొకడు లేడు. జానశ్రుతి మహారాజు ఎన్ని దానధర్మాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, బండివాడైన రైక్వుడి పాదాలను కడగడానికి కూడా అర్హుడు కాడు’ అని పలికింది.ఆ రాజహంసలు నిజానికి దేవతలు. భూలోకంలో అసలైన ధార్మికుడు ఎవరో కనిపెట్టే ఉద్దేశంతో రాజహంసల రూపంలో ప్రపంచ సంచారానికి బయలుదేరారు.జానశ్రుతి తల పైకెత్తి ఆ హంసలను గమనించసాగాడు. అవి రెండూ వాదించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ‘రైక్వుడి ముందు జానశ్రుతి మహారాజు ఎందుకూ కొరగాడు’ అందొక హంస.జానశ్రుతి చూస్తుండగానే, అవి దూరంగా ఎగురుతూ కనిపించకుండా పోయాయి.‘రైక్వుడి ముందు ఎందుకూ కొరగాడు’ అనే మాటలు జానశ్రుతి మహారాజులో కలత రేపాయి.ఆనాటి రాత్రి జానశ్రుతికి సరిగా నిద్రపట్టలేదు.మర్నాడు వేకువనే జానశ్రుతి నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, త్వర త్వరగా సిద్ధమై సభాంగణానికి చేరుకున్నాడు. వెంటనే సారథిని పిలిపించాడు.‘సారథీ! రైక్వుడు అనే పేరు గల మహాజ్ఞాని ఎవరో ఉన్నాడట, ఆయన బండివాడట! ఆయన ఎక్కడ ఉన్నాడో వెదికి తీసుకురా! నేను ఆయన పాదపూజ చేసి, ఆయన ద్వారా బ్రహ్మజ్ఞానం పొందుతాను’ అని చెప్పాడు.రాజాజ్ఞతో సారథి రాజధాని నలువైపులా సంచరించి, గాలించాడు. మరోవైపు జానశ్రుతి ఇంకొందరు భటులను కూడా రైక్వుని వెదుకులాట కోసం పంపించాడు. వారు కూడా వెదుకులాట సాగించారు. కొన్నాళ్ల వెదుకులాట తర్వాత రాజధానికి వెలుపల చాలా దూరంలో ఒక బండి కింద గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్న వ్యక్తి ఒకరు కనిపించాడు. ఎండ వేడికి అతడి శరీరం చెమటోడుతూ ఉంది. అతడి దుస్తులు మురికిగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనూ అతడి ముఖంలో దివ్యతేజస్సు కనిపిస్తూ ఉంది.రాజభటులు అతడిని సమీపించి, ‘మహానుభావా! తమరేనా రైక్వ నామధేయులు?’ అని అడిగారు.‘ఔను! నా పేరు రైక్వుడు’ అన్నాడు.భటులు వెంటనే జానశ్రుతి మహారాజు వద్దకు వెళ్లి, రైక్వుడి తాము ఎక్కడ కనుగొన్నదీ చెప్పారు.జానశ్రుతి మహారాజు వెంటనే బళ్లు సిద్ధం చేయించి, విలువైన బంగారు హారాన్ని, ఆరువందల గోవులను తీసుకుని రైక్వుడి వద్దకు చేరుకున్నాడు.రైక్వుడికి ప్రణామం చేసి, ‘మహానుభావా! నేను జానశ్రుతి మహారాజును. నేను తెచ్చిన ఈ కానుకలను స్వీకరించి, దయతో నాకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించండి’ అని వినయంగా అభ్యర్థించాడు.రైక్వుడు ఆ కానుకల వంక ఒకసారి చూసి, వెంటనే చూపు తిప్పేసుకున్నాడు. ‘నువ్వు తగిన దాతవు కాదు. నీ కానుకలను నేను పుచ్చుకోను. వచ్చిన దారినే తిరిగి వెళ్లు’ అని కటువుగా పలికాడు.అప్పటికే బ్రహ్మజ్ఞానం పొందిన రైక్వుడు, ఇకపై సంసారయాత్ర ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్నాడు. జానశ్రుతి మహారాజు తీసుకొచ్చిన కానుకలు అతడి సంసారయాత్రకు సరిపోవు. జానశ్రుతి మహారాజు రాజధానికి తిరిగి వచ్చి, కాస్త ఆలోచించాడు. అతడికి రైక్వుడి మనోగతం కొంత అర్థమైంది.ఈసారి రకరకాల తినుబండారాలను, వెయ్యి గోవులను, విలువైన ఆభరణాలను, ఒక కన్యను కూడా తీసుకుని రైక్వుని వద్దకు పోయాడు. ‘మహానుభావా! నా కానుకలను స్వీకరించి, ఈ కన్యారత్నాన్ని వివాహమాడి గృహస్థాశ్రమం స్వీకరించండి. నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి’ అని కోరాడు.ఈసారి రైక్యుడు ప్రసన్నుడయ్యాడు. జానశ్రుతి తీసుకువచ్చిన కన్యను పరిగ్రహించి, అతడి కానుకలను స్వీకరించి, అతడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. బ్రహ్మజ్ఞానం పొందిన జానశ్రుతి రాజులలో అగ్రగణ్యుడిగా వెలుగొందాడు.∙సాంఖ్యాయన -
ఇసుకను చూసి ఉప్పందిస్తారు!
డిటెక్టివ్ ‘షెర్లాక్ హోమ్స్’ పేరు మీరు వినే ఉంటారు. బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన పాత్ర అతడు. నేర పరిశోధనలో అతడిది డేగ దృష్టి! రాలిన వెంట్రుకలు, నేలపై పడి ఉన్న సిగరెట్ పీకలు, ఆఖరికి ఆ... నుసి నుంచి కూడా అతడు నేరస్థుడి జాడల్ని, నీడల్ని కనిపెట్టగలడు. ఆ డిటెక్టివ్ హెర్లాక్ హోమ్స్ని మించిన వారే... ‘పాగీ’లు! గుజరాత్లో, మూడు ఎడారి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తుండే ఈ పాగీలు... ఇసుకలో పాదముద్రలను బట్టి చొరబాటు దారుల వివరాలను చెప్పటంలో సిద్ధహస్తులు. మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాగీలు భారత సైన్యానికి సహాయపడ్డారు.అలా చెప్పేస్తారంతే! సరిహద్దుల్లో శత్రువు కదలికల్ని పసిగట్టేందుకు భారత్ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. హైటెక్ గాడ్జెట్స్ ఉన్నాయి. సైనికులు నిరంతరం మూడంచెలుగా గస్తీ కాస్తుంటారు. చీమ చిటుక్కున్నా మన తుపాకులు మేల్కొనే శాటిలైట్ వ్యవస్థ ఉంది. ఇవేమీ అవసరం లేకుండానే ‘పాగీ’లు తమ సహజ పరిశీలనా శక్తితో ఎడారిలో ఇసుక ముద్రల్ని డీకోడ్ చేసి సైన్యానికి ఉప్పందించగలరు. పాగీల దగ్గర వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వస్తున్న ప్రాచీన అపరాధ పరిశోధనా నైపుణ్యం తప్ప, సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. అయినా, ఇసుకపై ముద్రల్ని బట్టి అటువైపు ఎవరు నడిచారు, ఎంతమంది నడిచారు అన్నది విశ్లేషించి చెప్పేయగలరు. కాలం చెల్లినట్లుగా కనిపించే ఈ పాగీలు ఒక విధంగా ఇంటెలిజెన్స్ సిబ్బందికి దీటైనవారు.పేగుల్ని లెక్కపెట్టే వేగులుఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చి చూస్తే పాగీలు ఆదిమానవుల కింద లెక్క. కానీ ఈ మానవ ‘ట్రాకింగ్ వ్యవస్థలు’ ఎడారి చొరబాట్ల వివరాల విశ్లేషణల్లో అత్యంత విశ్వసనీయమైనవి. ఉదాహరణకు : సరిహద్దును ఎవరు దాటారు అన్నదొక్కటే కాకుండా, ఎంత మంది దాటారు? వారు ఏమి మోసుకెళ్లారు? వారి లక్ష్యం ఏమిటి? అన్నవి కూడా పాగీలు అంచనా వేయగలరు. మాదకద్రవ్యాల స్మగ్లర్ల కదలికలను కనిపెట్టటం దగ్గర్నుండి, పూర్తిస్థాయి యుద్ధాల సమయంలో సైనికులకు అత్యవసర సమాచారం అందించటం వరకు ఈ సరిహద్దు సంరక్షకులు దేశం ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. 1965, 1971లో పాకిస్తా¯Œ తో జరిగిన యుద్ధాలలో భారత సైన్యం శత్రు భూభాగాలలో చొచ్చుకు వెళ్లటానికి, శత్రువుల కదలికలను గుర్తించడానికి పాగీల నుండి కీలకమైన సహాయం తీసుకుంది. తరచు యుద్ధాల గమనాన్ని నిర్ణయించటంలో కూడా పాగీల భాగస్వామ్యం ఉంటుంది. మెడలిస్టులు కూడా ఉన్నారుబనస్కాంత, కచ్, పటాన్ జిల్లాల్లో ఉండే పాగీలు ఇటీవలి భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి మళ్లీ కీలకం అయ్యారు. పారంపర్య జ్ఞానమే తప్ప, ఎలాంటి శిక్షణా ఉండని పాగీలు సాధారణ నేత్రాలకు కనిపించని ప్రమాద సూచనలను గుర్తించటంలో అత్యద్భుతమైన ప్రావీణ్యం గలవారు. బనస్కాంత జిల్లాలోని సుయిగామ్ తాలూకా, జలోయా గ్రామానికి చెందిన రేవాజీ రాథోడ్ ఇందుకొక నిదర్శనం. 1927లో జన్మించిన ఆయన 1962 ఆగస్టు 4న పాగీగా పోలీసు దళంలో చేరారు. సుయిగామ్, వావ్, ధనేరా సరిహద్దు ప్రాంతాల వెంబడి 28 ఏళ్లపాటు, రెండు యుద్ధాల సమయంలో భారత దళాలకు భూభాగాలపై మార్గ నిర్దేశం చేశారు. ఆ నైపుణ్యాలు ఆయనకు ‘సంగ్రామ్ మెడల్’ ‘వెస్ట్రన్ స్టార్’ పురస్కారాలతో సహా కీర్తి ప్రతిష్ఠల్ని, గుర్తింపును సంపాదించి పెట్టాయి. రంగంలోకి దూకేందుకు సిద్ధంగుజరాత్ సరిహద్దులో కొన్ని చోట్ల కంచె లేకపోయినప్పటికీ ఆ ప్రాంతాలు సురక్షితంగా ఉండటానికి ఒక కారణం.. పాగీల నిరంతర నిఘా. వారు కేవలం పాదముద్రలను గుర్తించడమే కాదు, వాటిని అర్థం చేసుకుంటారు కూడా. శత్రువు ఎలాంటి బూట్లు వేసుకున్నాడు, ఏ మార్కెట్లలో ఆ బూట్లు అమ్ముడవుతాయి, అలాగే – ఎంత బరువుతో వారి నడక సాగింది, ఆ వెళ్లినవారు స్త్రీలా, పురుషులా అనేది కూడా పాగీలు కనిపెడతారు. అవసరం అయిన వెంటనే భద్రతా దళాలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న 5–10 మంది శిక్షణ పొందిన పాగీలు, వారికి సహాయంగా ఉండే 20 మంది యువకుల బృందం ప్రస్తుతం సైన్యానికి అందుబాటులో ఉంది. ఇరవై ఐదు మందికి ఉద్యోగాలుకొంతమంది పాగీలను అధికారికంగా సైన్యంలోకి తీసుకున్నప్పటికీ, వారి సంఖ్య తక్కువగానే ఉంది. ‘‘వారు ట్రాకర్లు మాత్రమే కాదు, అపరాధ పరిశోధకులు కూడా..’’ అని గుజరాత్ పోలీసు సరిహద్దు పరిధి ఐజీపీ చిరాగ్ కొరాడియా అంటారు. ‘‘పాదముద్రలను బట్టి వారు ఒక వ్యక్తిని గుర్తించగలరు. వారిలో ఎవరైనా బరువులు మోస్తున్నారా, వారి వద్ద జంతువులు ఉన్నాయా అని కూడా తెలుసుకోగలరు. ఇంకా అనేక ఇతర వివరాలను అందించగలరు. 2013 హోమ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించి 2014లో క్లాస్ 4 పే గ్రేడ్లో 25 మంది పాగీలను శాశ్వతంగా నియమించుకున్నాం’’ అని కొరాడియా తెలిపారు. యూనిఫాం ఉండని సైనికులుపాగీలు కేవలం చారిత్రక యోధులు కారు. వారి అవసరం నేటికీ కొనసాగుతోంది. కచ్కు చెందిన 70 ఏళ్ల పాగీ తేజ్మల్జీ సోధా 2001 – 2017 మధ్య సైన్యానికి సహాయంగా పనిచేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణానే కాక, అనేకానేక చొరబాట్లను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు. ‘‘వారు ఎంత దూరం వెళ్లినా, నేను కచ్చితంగా ట్రాక్ చేయగలను..’’ అని ఆయన అంటారు. పాగీలు ఇప్పుడు తమకు గుర్తింపును, తగిన పరిహారాన్ని, తర్వాతి తరానికి శాశ్వతకాల ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘మేము యూనిఫాం ధరించం. అయినప్పటికీ మాతృభూమిని కాపాడతాం’’ అని అంటున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ఫీల్డ్ మార్షల్ జనరల్ శామ్ మానెక్షాపాగీలలో అత్యంత పురాతన వ్యక్తులలో దివంగత రణ్ ఛోడ్ పాగి ఒకరు. ఆయన అసలు పేరు రణ్ ఛోడ్ రబారి. తన 100వ యేట వరకు ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. యుద్ధాల సమయంలో భారత దళాలకు సహాయంగా ఉన్నారు. జనరల్ శామ్ మా¯ð క్షా స్వయంగా రణ్ ఛోడ్ సేవల్ని గుర్తించి 1971లో రూ. 300 వ్యక్తిగత నగదు బహుమతిని కూడా అందజేశారు. రణ్ ఛోడ్ పాగి 2013లో తన 112 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత బి.ఎస్.ఎఫ్. ఆయన గౌరవార్థం బనస్కాంత ఔట్పోస్టులలో ఒకదానికి ఆయన పేరు పెట్టింది. -
ఈ వారం కథ: బతకటానికి భయం ఎందుకు?
ప్రతిరోజూ ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరే ముందు, అద్దంలో నా మొఖం చూసుకోవటం ఎంత పరిపాటో, జేబులోని పర్సులో డబ్బులున్నాయా లేదా అని చూసుకోవటం కూడా అంతే పరిపాటి.పర్సులో కనీసం పది పచ్చ కాగితాలు లేనిదే కాలు బయట పెట్టను. పర్సులో డబ్బులుంటే నా వెంట ఓ వందమంది సైన్యం వున్నంత ధైర్యం ఉంటుంది .నాకే కాదు, ఈ దేశంలో చాలామందికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవి రెండే: ఒకటి మందు, రెండోది మనీ. మందు కొడితే మన ఎదురుగా మహారాజులున్నా బలాదూర్! అదే మనీ మన జేబుల్లో వుంటే మనమే మహారాజులం. రెండూ వుంటే ఇంక తిరుగేముంది, ఆ కిక్కే వేరు!కాని, ఏం చేస్తాం ప్రతి మధ్య తరగతి మనిషి జీవితం, నెలలో మొదటి పదిహేను రోజులు కృష్ణపక్షంలా, మిగిలిన రోజులు శుక్లపక్షంలా గడచి పోతుంది. నా జీవితం కూడా అంతకన్నా గొప్పగా ఏమీ లేదు.ఫస్టు తారీఖున చేతిలో జీతం పడగానే, ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్లా అనిపిస్తాను నాకు నేను. నెల చివరకు వచ్చే సరికి చేతిలో చిల్లి గవ్వ లేక గుడి ముందు బిచ్చ గాడిలా అనిపిస్తాను. అందుకే అడుగు బయట పెట్టాలంటే భయం వేస్తోంది. జీతం వచ్చి పదిరోజులు అవుతోంది. ముందు జేబులో పర్సు మందం కూడా ఇంకా తగ్గలేదు. అందుకని ఆఫీసుకు వెళ్ళటానికి కారు బయటకు తీశాను. దారిలో బస్టాపు దగ్గర శంకరరావుగారు కనపడ్డారు. ఆయన ఎదురుగా కారు ఆపి, ‘‘రండి సార్! ఎక్కండి. ఆఫీసుకేనా?’’ పలకరిస్తూ ఆయన్ని కారులోకి ఆహ్వానించాను.కాని, అయన మాత్రం సున్నితంగా, ‘‘పర్లేదండి, సిటీ బస్సు వస్తుంది’’ అన్నాడు పొడిపొడిగా, నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ.అలా తిరస్కరించటం అది మొదటిసారి కాదు , చివరసారి కాదు. అడిగిన ప్రతిసారి అదే సమధానం.శంకరరావుగారు ఆఫీసులో నాకన్నా బాగా సీనియర్ ఆఫీసర్. నాకన్నా జీతం ఓ లక్ష దాకా ఎక్కువే! కారు కొనుక్కోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు, కాని ఎందుకో రోజు బస్సులోనే వస్తారు ఆఫీసుకి. మనిషి కూడా చాలా సాదాసీదాగా వుంటారు. పైజమా లాల్చీ, కాళ్ళకు హవాయి చెప్పులు, భుజాన ఓ చేతి సంచితో.ఆయనకు సెల్ఫోన్ కూడా లేదు. ఈ రోజుల్లో ప్రతి పనికిమాలిన వెధవ దగ్గర ఓ పదివేల సెల్ఫోన్ ఉంటోంది. ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారు అని చాలాసార్లు అనుకున్నా మనసులో. అలా అని ఆఫీసు ఫోన్ కూడా ఆయన స్వంత పనులకు ఎప్పుడూ వాడినట్లు నేను చూడలేదు. ఆయన కేడర్కు ఆఫీసు వాళ్ళు కారు ఇస్తారు, కాని ఆయన ఏనాడూ ఆఫీసు కారు వాడుకోలేదు.ఇదే విషయం ఆయన్ని ఓ రోజు కదిలించి చూశాను.‘‘నా ఒక్కడికి కారు ఎందుకు? పెట్రోల్ దండగ. పైపెచ్చు మన ఆఫీసు నష్టాల్లో ఉంది’’ అనేవాళ్ళు.‘‘మరి సెల్ఫోన్ ఎందుకు వాడట్లేదు అంటే?’’‘‘సెల్ఫోన్ వాడాల్సినంత అర్జంటు పనులు మనకు ఏముంటాయి చెప్పు’’ అంటూ నవ్వారు.నిజమే! ఆయన మాటల్లో చాలా నిజం వుంది. నాకు కూడా సెల్ఫోన్తో పెద్దగా అవసరం లేదు. కాని, ఓ ఐఫోన్ కొన్నా. నిజానికి నాకొచ్చే జీతానికి ఐఫోన్ కొనటం కష్టమే, కాని ఆఫీసులో నా ఫ్రెండ్స్ కొంటుంటే నేను కొన్నా, వాళ్ళ ముందు లోకువ అవ్వటం ఇష్టం లేక.ఇదే మాట నా స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తే, ‘‘ఆయనో చాదస్తపు మనిషి. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. కాలం ఎంతో విలువైనది. కాలాన్ని కొనలేము, కాని కొత్త కొత్త సాంకేతిక వస్తువులను కొని కాలాన్ని మిగుల్చుకోవచ్చు’’ అంటూ నాకు క్లాసు పీకాడు వాళ్ళలో ఒకడు.నిజమే స్నేహితులు చెప్పింది కరక్టే కాని, అంత పెద్దాయనకి కాలం విలువ తెలియకుండా వుంటుందా?‘‘చాదస్తమే కాదురా బాబు, పిసినారి కూడా! ఆయన శ్రీమతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరు. ఆవిడకి ఓ రెండు లక్షల దాకా జీతం వస్తుంది. ఆయనకి, ఆయన భార్యకి కలిపి ఎలా లేదన్నా నెలకు ఓ మూడు నాలుగు లక్షలు వస్తాయి. బస్సుల్లో వేలాడక పోతే ఓ కారు కొనుక్కోవచ్చు కదా? ఎన్నైనా చెప్పు, రోజూ బస్సులోనే వస్తాడు. అదేమంటే, ‘అందరం కార్లు కొంటే వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, సహజవనరులు కరిగి పోతాయి’ అంటూ మెట్ట వేదాంతం చెబుతాడు. బహుశా, డబ్బు మొత్తం ఏ వడ్డీకో తిప్పుతూ ఉండి ఉండాలి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారమన్నా చేస్తూ ఉండాలి’’ అంటూ ఆయన మీ అభాండాలు వేశాడు మరొకడు.‘‘జీవితం అనుభవించటం చేతకాని మనిషి. ఏమి చేస్తాం జాలి పడటం తప్ప!’’ అంటూ పెదవి విరిచారు అందరూ.నాకెందుకో వాళ్ళు అంటున్న మాటలు కరెక్టు కాదు అనిపిస్తోంది. కాని, కళ్ళెదురుగా కనబడేవి చూస్తుంటే వాళ్ళ మాటలు నిజమే అనిపిస్తోంది. వాళ్ళ మాటల్లో నిజమెంతో తెలుసుకుందామని ఒకసారి ఆయన ఇంటికెళ్లాను.∙∙ ఇల్లు చూడగానే నా స్నేహితుల మాటలే నిజమనిపించాయి. నేనే అమాయకంగా ఆయన్ని ఎక్కువ మంచిగా ఊహించుకున్నాను. ‘బయట చాల సాదాసీదాగా ఉంటాడు కాని, గురుడు చాలా పెద్ద ఇల్లు కట్టాడు’ అని అనుకున్నా మనసులో.అది ఓ రెండంతస్తుల మేడ. లిఫ్ట్ కుడా ఉంది. ఇంటి బయట ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నారు.శంకరరావుగారి గురించి అడిగాను. పైన రెండో అంతస్తు అని చెప్పగానే, లిఫ్ట్లో పైకి వెళ్లాను. బయట నుంచి కాలింగ్ బెల్ నొక్కగానే, ‘‘ఎవరూ..’’ అంటూ ఆయనే వచ్చి తలుపు తీశారు.నన్ను చూడగానే, ‘‘సురేష్, నువ్వా! ఏమిటి చెప్పా పెట్టుకుండా వచ్చావు.. రా లోపలికి’’ అంటూ లోపలికి ఆహ్వానించాడు. లోపలికి అడుగు పెడుతూ ఇల్లంతా ఒకసారి తేరిపార చూశాను. లోపల అంతా చాలా సాదాసీదాగా ఉంది. ఎటువంటి ఖరీదైన సోఫాలు, ఫర్నిచర్, షోకేసులు వంటివి కనపడలేదు. ఓ మూల మాత్రం పాతకాలం నాటి చెక్కతో చేసిన ఓ రాతబల్ల, దానికెదురుగా రెండు చెక్క కుర్చీలు ఉన్నాయి.ఆ రెండు కుర్చీలను హాలు మధ్యలోకి లాగి, ‘‘కూర్చో..’’ అంటూ ఒక దానికి నాకు చూపించారు.నేను కుర్చీలో కుర్చుంటూ ఉండగా, ఓ పెద్దావిడ బహశా శంకరంగారి శ్రీమతి అనుకుంటా మా దగ్గరకు వచ్చి, ‘‘ఏమండి కింద పేషంట్స్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చి మీకు కాఫీ ఇస్తాను’’ అంటూ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది.ఒక్క క్షణం ఆమె వైపు చూశాను. చాలా సాదాసీదాగా ఉంది మనిషి. ఒంటిమీద నలిగిపోయిన కాటన్ చీర, చేతులకి మట్టిగాజులు, మెడలో సన్నటి మంగళసూత్రం. ఓ దిగువ మధ్యతరగతి మనిషి భార్య ఎలా ఉంటుందో అలా ఉంది. ఆమె వెళ్ళిన వంకే నేను చూస్తూ ఉంటే, ‘‘ఆవిడ నా శ్రీమతి . తను డాక్టర్, కింద హాస్పిటల్ రన్ చేస్తోంది’’ అన్నారు పొడి పొడిగా.‘అంటే కింద హస్పిటల్ అన్నమాట, అయితే స్నేహితులు అన్నట్లు రెండు చేతులేమి ఖర్మ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు’ అని మనసులో అనుకుంటూ ఉండగా– ‘‘సురేష్.. మంచినీళ్ళు తాగుతావా’’ అనే పిలుపు చెవిన బడటంతో, ‘‘అబ్బే వద్దండి’’ అన్నాను, ఆలోచనల నుండి బయటకు వస్తూ. ‘‘ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పావు కాదు’’ అంటూ అడిగారు శంకరం గారు. ఏం జవాబు చెప్పాలో ముందు అర్థం కాలేదు.‘‘ఏమీ లేదు సార్! మిమ్మల్ని చూస్తుంటే ఒకోసారి నాకే అసూయ వేస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా చిరునవ్వుతో నడుచుకుంటూ ఓ సామాన్యుడిలా వెళుతుంటారు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. అందుకే మిమ్మల్ని, మీ ఇంటిని చూద్దామని వచ్చాను’’ అంటూ సమాధానం ఇచ్చాను‘‘చూశావుగా! ఏమనిపించింది?’’ అని అడిగారు‘నీ అంత పీనాసివాడు ఇంకొకడు లేడు’ అని అరుద్దామనిపించింది. కాని సంస్కారం అడ్డు వచ్చి, ‘‘మీరు డబ్బు ఖర్చు పెట్టరనుకుంటా’’ అన్నాను వ్యంగ్యంగా.నా అంతర్యం అర్థం అయ్యిందో ఏమో , ‘‘డబ్బు సంపాదించడం గొప్ప కాదు సురేష్, దాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకుండా సద్వినియోగం చెయ్యటం గొప్ప’’ అన్నారు శంకరంగారు.‘సద్వినియోగం అంటే వడ్డీలకు తిప్పటం, మూడంతస్తుల మేడలు కట్టటం అన్నమాట’ అని మనసులో అనుకుంటూ, ‘‘అవును సార్... మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను’’ అంటూ ఓ జీవంలేని నవ్వు నవ్వాను.‘‘ఏమి తెలుసుకున్నావు..?’’ అంటూ ప్రశ్నించారు.ఏమి జవాబు చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాను.‘‘సరే... నా వెంటరా’’ అంటూ నన్ను వెంట బెట్టుకుని కింది అంతస్తుకు తీసుకు వెళ్ళారు.అక్కడ ఓ చిన్నసైజు కార్పొరేట్ హాస్పిటల్ దర్శనం ఇచ్చింది. ఓ పదిమంది పేషంట్స్ బయట రిసెప్షన్ దగ్గర కూర్చుని ఉన్నారు.‘‘ఇది మా స్వంత హాస్పిటల్. నా శ్రీమతే వైద్యం చేస్తుంది. పగలు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తుంది. సాయంత్రం ఇక్కడ.’’వాళ్ళని దాటుకుని లోపలకి వెళ్ళాం ఇద్దరం. అక్కడ ఓ పెద్ద హాలు ఉంది. అందులో బెడ్స్ వరసగా వేసి ఉన్నాయి.వాటి మీద పేషంట్స్ పడుకుని ఉన్నారు.మమ్మల్ని చూడగానే అక్కడున్న వాళ్ళందరూ లేచి నమస్కారం చేశారు. వాళ్ళని శంకరరావుగారు ‘‘ఎలా వున్నారు..’’ అంటూ పలకరించసాగారు.‘‘బాగున్నాను అయ్యా! మీ దయ వల్ల జబ్బు తగ్గిపోతోంది’’ అంటూ ఓ పెద్దావిడ నమస్కారం చేసింది.‘‘సురేష్! వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు. ఒక పూట భోజనానికి కూడా నోచుకోని వాళ్ళు. వీళ్లందరికీ ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తున్నాము’’ అంటూ చెప్పుకుపోతున్నారు.‘‘అవునయ్యా! మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు’’ అంటూ నమస్కారం చేశాడు మరో నడి వయస్కుడు.‘‘వైద్యమే కాదండి.. ఉచితంగా భోజన సదుపాయాలు కూడా అందిస్తున్నారు.. దేవుళ్ళు’’ అంటూ మా దగ్గరకి వచ్చాడు మరో ముసలాయన.‘‘నాదేముంది, ఆ భగవంతుడు ఇస్తున్నాడు. అదే మీకు ఖర్చు పెడుతున్నాను’’ అంటూ నవ్వేశారు.బయటకొస్తుంటే ఒక పేషంట్ ఎదురు పడ్డాడు, అతని వాలకం చూస్తుంటే డిశ్చార్జ్ అయినట్టున్నాడు.అతన్ని చూస్తూ, ‘‘డబ్బు తీసుకున్నావా? ఆరోగ్యం జాగ్రత్త. జబ్బు తగ్గే దాక అట్టే కష్టపడకు’’ అన్నారు శంకరంగారు. ‘‘అలాగే సార్..’’ అంటూ ఆయనకు నమస్కారం చేశాడు.‘‘సురేష్ కిందకి వెళ్దాం రా’’ అంటూ గ్రౌండ్ ఫ్లోరుకు దారితీశారు.అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయాను. అంతా ఒక కలలా వుంది. నేను నా స్నేహితుల మాట విని ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమయ్యింది ఆ క్షణాన.‘‘ఏమిటి సురేష్ ఆగిపోయావ్ ..’’ అన్నారు నా వంక చూస్తూ.‘‘అబ్బే, ఏమీ లేదు.. వస్తున్నా సార్ ’’ అంటూ ఆయన వెనకాలే నడుస్తూ ‘‘సార్! ఉచితంగా వైద్యం చేస్తున్నారు, భోజనం కూడా పెడుతున్నారు. మళ్ళీ డబ్బులిస్తున్నారేమిటి పేషంట్లకి?’’ అనుమానంగా అడిగాను.‘‘జబ్బు నయం అయినంత మాత్రాన, పని చేసుకోవటానికి ఓపిక ఉండాలి కదా? అందుకనే ఓ నాలుగు రోజులకు సరిపడ సరుకులు, వాళ్ళ ఊరు వెళ్ళటానికి చార్జీలు ఇచ్చి పంపుతాను’’ అన్నారు నవ్వుతూ.ఆయన మాటలు విన్న నేను, ఆయన పెద్ద మనసుకు మనసులోనే జోహార్లు అర్పించాను.కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద డైనింగ్ హాలు, పక్కనే వంటశాల ఉంది. పక్కనే దానికి ఆనుకుని స్టోర్ రూము. స్టోర్ రూము నిండా సరుకులున్నాయి. డైనింగ్ హాలులో చాలామంది కూర్చొని ఉన్నారు. బహుశా భోజనం కోసం అనుకుంటా!ఆయన వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తూ, నేరుగా వంటగదిలోకి వెళ్ళి, ‘‘ఇవాళ ఏమి వండుతున్నారు..’’ అంటూ అక్కడి వంట వాళ్ళను పలకరించారు‘‘ముక్కల పులుసు, బీట్రూట్ కూర సార్’’ అన్నాడు వంటవాళ్ళలో ఒకడు.వంటగదిలో నుంచి బయటకు వచ్చి,‘‘రోగుల కూడా వచ్చిన బంధువులకు ఇక్కడ ఉదయం టిఫిన్తో సహా రెండు పూటలా భోజనం పెడతాము, ఉచితంగా’’ అన్నారు.ఆయన మాటలు వింటుంటే నా కళ్ళలో నుంచి అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చాయి. ‘ఇంత మంచిమనిషిని అనవసరంగా అపార్ధం చేసుకున్నాను’ అని నన్ను నేను నిందించుకున్నాను.నా కన్నీళ్లు చూసి, ‘‘ఏమిటి సురేష్? ఏమైయ్యింది.. ఎందుకా కన్నీళ్ళు..’’ కంగారుగా అడిగారు.‘‘మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నా సార్! నన్ను క్షమించండి’’ అంటూ ఆయన చేతులు పట్టుకున్నా.‘‘ఛఛ.. అవేం మాటలు.. ఊరుకో! నువ్వే కాదు, నా గురించి తెలియని చాలామంది నీలానే అనుకుంటారు’’ అంటూ అనునయించారు.‘‘మీరు దేవుడు సార్..’’ అన్నాను గద్గద స్వరంతో.‘‘అంత పెద్ద మాటలు వద్దు సురేష్. ఆ భగవంతుడు నాకేదో ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన దాంట్లో కొంత నలుగురికీ పంచుతున్నా అంతే!’’అన్నారు చాలా నెమ్మదిగా.‘‘అది అందరి వల్లా సాధ్యం కాదు సార్..’’ అన్నాను ఆయన కళ్ళలోకి చూస్తూ.‘‘ఎందుకు సాధ్యం కాదు? కాస్త నాది, నేను అనే స్వార్థం వీడితే అది సాధ్యం అవుతుంది. కాని, చాలామందికి బతుకు మీద భయం. రేపు ఏమవుతుందో అని లక్షలకు లక్షలు వెనకేస్తుంటారు.. పిరికివాళ్ళు’’ ‘‘అవును సార్! వాళ్ళలో నేనూ ఒకడిని’’‘‘చూడు సురేష్! నేను ఏనాడూ నా జేబులో డబ్బు లేదని బాధపడలేదు, భయపడలేదు. ఎవ్వరి ముందూచెయ్యి చాచలేదు. నేను ఈ హాస్పిటల్ ఉచితంగా నడపకుండా, ఆ డబ్బు వెనకేస్తే మరో రెండు మేడలు కట్టేవాడిని. మా ఆవిడ మెడలో మరో నాలుగు నెక్లెస్సులు వేలాడదీసేవాడిని లేదా హాయిగా నాలుగు కార్లలో తిరిగేవాడిని. కాని అదే డబ్బుతో ఓ పది మంది ప్రాణాలు నిలుపుతున్నా. ఓ పది కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తున్నా. అదే గొప్ప తృప్తిని, గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మనం సంపాదించిన డబ్బుకు అప్పుడే నిజమైన విలువ ఏర్పడుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు‘‘అవును సార్! డబ్బు విలువ అంటే ఏమిటో ఇప్పుడే నాకు అర్థం అవుతోంది’’ అన్నాను.‘‘అంతేకాదు సురేష్, మనం సుఖంగా బతకటానికి కావలసిన వస్తువులన్నీ కొంటే భౌతికమైన భద్రత దొరుకుతుందేమో కాని, మానసికంగా మాత్రం అభద్రత వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే, మనం కొన్న వస్తువులు, కార్లు, ఫోన్లు ఇవేవీ మనకు తోడు రావు. మనం సాయం చేసిన మనుషుల్లో కొంతమందైనా మన వెనక వస్తారు. వాళ్ళు మన వెనక ఉన్నారు అనేది మనకు కొండంత మానసిక ధైర్యం ఇస్తుంది’’అప్పటికి గాని నాకు అర్థం కాలేదు ఓ సెల్ఫోన్ లేకుండా, సొంత కారు లేకుండా, జేబులో పది రూపాయలు కూడా లేకుండా ధైర్యంగా ఎలా మనగలుగుతున్నారో!‘‘మరొక మాట సురేష్ , నువ్వు నిజాయితీగా ఉన్నంత కాలం నువ్వు ఎవ్వరికీ భయపడక్కరలేదు. మనం చేసే తప్పులే మనకు శత్రువులు. అవే మనల్ని వెంటాడుతూ భయపెడుతుంటాయి. చాలామంది స్తోమతకు మించి అప్పులు చేసి, ఖర్చు పెట్టి వాటిని తీర్చలేక భయపడుతుంటారు. నిజానికి మనకి ఎవ్వరూ శత్రువులు లేరు సురేష్. మనకు మనమే శత్రువులం’’ అంటూ ముగించారు‘‘నిజం సార్! మీరు మానసికంగా చాలా ధైర్యవంతులు. మీలా ఉండగలనా..?’’ అంటూ ప్రశ్నించా.‘‘ఎందుకు ఉండలేవు? నాలో ఉన్నదేమిటి, నీలో లేనిదేమిటి? ప్రయత్నించి చూడు, తప్పక ధైర్యవంతుడివి అవుతావు’’ అన్నారు నవ్వుతూ.వచ్చిన పని అయిపోవటంతో ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను.మరుసటి రోజు ఆఫీసుకు బయలుదేరే ముందు నన్ను నేను అద్దంలో చూసుకున్నా. ఎందుకో కొత్తగా అనిపించా. అలా ఎందుకు అనిపించానో నాకు అర్థమయ్యింది. అందుకే జేబులోని పర్సును మాత్రం బయటకు తియ్యలేదు. డబ్బుతో ఓ పదిమంది ప్రాణాలు నిలుపుతున్నా. ఓ పది కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తున్నా. అదే గొప్ప తృప్తిని, గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మనం సంపాదించిన డబ్బుకు అప్పుడే నిజమైన విలువ ఏర్పడుతుంది. -
అతి చేరువలో అమరత్వం!
అమరత్వం మానవాళి పురాకాంక్ష.. ఇంతవరకు అది ఒక అపూర్ణస్వప్నం..అమరత్వం అసాధ్యమైనదేమీ కాదు, అచిరకాలంలోనే సాధ్యమవుతుందట!అపూర్ణస్వప్నంగా మిగిలిన అమరత్వం అచిరకాలంలోనే సాధ్యమవుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రకటనలు మానవాళిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. భౌతిక శరీరంతో యథాతథంగా అమరత్వం పొందడానికి ఇంకా చాలాకాలమే పట్టవచ్చు గాని, సాంకేతిక అమరత్వం సాధించడానికి అట్టేకాలం పట్టదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరణం తర్వాత శరీరం నుంచి వేరుపడిన మానవ చేతనను కంప్యూటర్లలోకి అప్లోడ్ చేయడం ద్వారా సాంకేతిక అమరత్వం సాధించే ప్రక్రియ మరో పాతికేళ్లలోనే అందుబాటులోకి రాగలదని అంచనా వేస్తున్నారు. ఇప్పటి ప్రమాణాల ప్రకారం ఒక మనిషి వందేళ్లు బతకడమే చాలా గొప్ప. అయితే, ఇదివరకటితో పోల్చుకుంటే, ప్రపంచవ్యాప్తంగా శతాయుష్కుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. మరో పాతికేళ్లలో వైద్యరంగం సాధించే అభివృద్ధి మానవుల ఆయుఃప్రమాణాన్ని గణనీయంగా పెంచగలదని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. మనుషులు భౌతిక అమరత్వం సాధించడానికి ఇంకెంత కాలం పడుతుందో ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నా, మనుషులు శతాయుష్షును అధిగమించడం త్వరలోనే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక పురోగతి మరింత వేగం పుంజుకుంటే, మనుషులు దాదాపుగా భౌతిక అమరత్వం సాధించడం కూడా అసాధ్యమేమీ కాదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ భావన గురించి, అమరత్వ సాధన దిశగా శాస్త్ర సాంకేతిక పరిశోధకులు సాగిస్తున్న పరిశోధనలు, శాస్త్రవేత్తల అంచనాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం.నాలుగేళ్లలోనే యంత్రాలతో అనుసంధానం‘మరో నాలుగేళ్లలోనే కృత్రిమ మేధ పూర్తిగా అభివృద్ధి చెంది, మానవ మేధకు దీటుగా తయారవుతుంది. మానవులు యంత్రాలతో అనుసంధానమయ్యే కొత్త శకం ప్రారంభమవుతుంది. కంప్యూటర్లు, ఆండ్రాయిడ్ శరీరాల ద్వారా మనుషులు అమరత్వం పొందే పరిస్థితులు 2045 నాటికే సాధ్యమవుతాయి. ఈ సాంకేతికత మరింతగా అభివృద్ధి చెంది 2050 నాటికి అపర కుబేరులకు అందుబాటులోకి వస్తుంది’ అని గూగుల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ రే కర్జ్వీల్ చెబుతున్నారు. ఇదివరకు ఆయన వేసిన సాంకేతిక అంచనాలు పూర్తిగా నిజయం కావడంతో మనుషుల అమరత్వంపై ఆయన తాజా అంచనాలు కూడా నిజం కాగలవని ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిశోధకుల్లో చాలామంది విశ్వసిస్తున్నారు. కంప్యూటర్లు చదరంగం చాంపియన్లను ఓడించగలవని, స్మార్ట్ఫోన్లు సామాన్యుల చేతుల్లోకి రాగలవని కర్జ్వీల్ దశాబ్దాల కిందటే అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా అంచనాలపై శాస్త్ర సాంకేతిక రంగంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.పన్యాల జగన్నాథదాసుఅమరత్వం పొందాలనేది మనిషి చిరకాల స్వప్నం. ఎంతటి ధైర్యశాలి మనిషినైనా భయపెట్టేవి రెండే రెండు: అవి జరా మరణాలు. పురాణకాలం నుంచే జరా మరణాలను జయించాలనే తపన మనుషుల్లో ఉంది. ప్రాక్ పాశ్చాత్య పురాణాలలో ఇందుకు సంబంధించిన గాథలు కనిపిస్తాయి. అమరత్వం కోసమే దేవ దానవులు క్షీరసాగర మథనం చేశారు. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతాన్ని సేవించడం వల్లనే దేవతలు అమరులయ్యారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి గాథ పురాతన గ్రీకు పురాణాల్లోనూ ఉంది. ‘అంబ్రోజియా’ అనే ఆహార పదార్థాన్ని ఆరగించి, ‘నెక్టర్’ అనే అమృతంలాంటి పానీయాన్ని సేవించడం వల్లనే ఒలింపస్ పర్వతంపై నివసించే దేవతలు అమరులుగా మారారని గ్రీకు పురాణాల కథనం. ప్రపంచంలోనే ఆది పురాణమైన ‘గిల్గమేష్’లో కూడా అమరత్వ భావనకు ఉంది. ‘గిల్గమేష్’ క్రీస్తుపూర్వం 2100 సంవత్సరాల నాటిది. అంటే, అప్పటి నుంచే అమరత్వం సాధించాలనే తపన మనుషుల్లో ప్రబలంగా ఉండేదనడానికి ఇదొక నిదర్శనం.ఆ తర్వాత వచ్చిన కాల్పనిక సాహిత్యంలోనూ అమరత్వంపై అనేక కల్పనలు ఉన్నాయి. ఆంగ్లో–ఐరిష్ రచయిత జొనాథన్ స్విఫ్ట్ రాసిన ‘గలివర్స్ ట్రావెల్స్’లో ‘లుగ్నాగ్’ అనే కాల్పనిక ద్వీపరాజ్యంలో ఉండే ‘స్ట్రల్బ్రగ్స్’ అనే మనుషులు ఎంత వృద్ధులైపోయినా, మరణం లేకుండా ఉంటారు. అమరత్వం చుట్టూ ఎన్ని కల్పనలు ఉన్నా, చాలామంది దానిని ఎప్పటికీ నెరవేరని కలగానే భావిస్తూ వచ్చారు. పుట్టిన వారికి మరణం తప్పదని, అది ప్రకృతి సహజ ధర్మమని చెబుతూ వచ్చారు. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని ‘జాతస్య హి ధ్రువో మృత్యుః’ అని చెప్పింది. అయినా మనిషికి అమరత్వం మీద ఆశ చావలేదు. అమరత్వ సాధనకు ప్రయత్నాలనూ మానుకోలేదు.శాస్త్రవేత్తల ప్రయత్నాలుమరణానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. వీటిలో అతి సాధారణమైన కారణం వార్ధక్యం. ఇప్పటికీ చాలామంది వార్ధక్యాన్ని జీవితంలో ఒక సహజమైన దశగానే పరిగణిస్తున్నారు. కొందరు వైద్య శాస్త్రవేత్తలు మాత్రం వార్ధక్యాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఎలాంటి వ్యాధికైనా నివారణ మార్గాన్ని కనుగొనడమే శాస్త్రవేత్తల పని. అంతకంటే ముందుగా వ్యాధి మూలకారణాన్ని కనుగొనడం ముఖ్యం. శరీరంలోని జీవకణాలకు వయసు మళ్లకుండా నిరోధించగలిగితే, వార్ధక్యాన్ని నివారించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. కనీసం శరీరంలోని జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియను నెమ్మదించేలా చేయగలిగితే గణనీయంగా ఆయుర్దాయాన్ని పొడిగించడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు. జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియ నెమ్మదించేలా చేయడానికి, కుదిరితే పూర్తిగా వయసు మళ్లే ప్రక్రియను నిలిపివేయడానికి సాధ్యమయ్యే మార్గాలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇందుకు అనేక ప్రయోగాలను సాగిస్తున్నారు. బ్రిటిష్ ఫ్యూచరాలజిస్ట్ ఇయాన్ పియర్సన్, గూగుల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ రే కర్జ్వీల్, బ్రిటిష్ జన్యుశాస్త్ర నిపుణుడు అబ్రీ డి గ్రే వంటి శాస్త్రవేత్తలు 2050 నాటికల్లా కంప్యూటర్లలోకి, రోబోలలోకి మెదడులోని ఆలోచనలను అప్లోడ్ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని, అప్పుడు ప్రపంచంలోని అపర కుబేరులు ఈ ప్రక్రియ ద్వారా అమరత్వాన్ని పొందగలరని అంచనా వేస్తున్నారు. మరో పాతికేళ్లలో ప్రపంచంలోని సంపన్నులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, మరణానంతరం తమ చేతనను కంప్యూటర్లలోకి లేదా రోబోల వంటి ఆండ్రాయిడ్ శరీరాల్లోకి అప్లోడ్ చేయడం ద్వారా అమరత్నాన్ని సాధించగలరని ఇయాన్ పియర్సన్ చెబుతున్నారు. మరో నాలుగేళ్లలోనే– అంటే, 2029 నాటికల్లా మానవ మేధకు దీటుగా కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతుందని అబ్రీ డి గ్రే చెబుతున్నారు. మానవ మేధకు దీటైన స్థితికి కృత్రిమ మేధ చేరుకున్నాక మనుషులకు, యంత్రాలకు మధ్య అనుసంధానం తేలికవుతుందని, ఈ ప్రక్రియ ద్వారా 2045 నాటికే మనుషులు అమరత్వం సాధించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అంతేకాదు, రానున్న పాతికేళ్లలో వైద్యరంగం కూడా శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని, 2050 నాటికి వార్ధక్యాన్ని నయం చేయగలిగే పరిస్థితులు ఏర్పడతాయని, ఫలితంగా 2050 తర్వాత మనుషులు వెయ్యేళ్లకు పైగా ఆయుర్దాయాన్ని పొందగలుగుతారని కూడా గ్రే అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని అమిత సంపన్నులు 2050 నాటికల్లా తమ భౌతిక మరణం తర్వాత కూడా అమరులుగా ఉండటానికి సాంకేతికతను వినియోగించుకుంటారని, తమ చేతనను కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్ శరీరాల్లోకి అప్లోడ్ చేయడం ద్వారా అమరత్వాన్ని సాధించగలుగుతారని పియర్సన్ చెబుతున్నారు. తొలినాళ్లలో ఈ సాంకేతికత చాలా ఖరీదుగా ఉంటుందని, మరో దశాబ్దం తర్వాత ఎగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్ శరీరాల్లోకి మేధా చేతనను అప్లోడ్ చేసే సాంకేతికత 2060 నాటికల్లా కొంత తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి రాగలదని చెబుతున్నారు. ఇదేకాలంలో వైద్యరంగం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని; క్యాన్సర్, గుండెజబ్బులు వంటి ప్రాణాంతకమైన వ్యాధులను పూర్తిగా నయం చేయగలిగే చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తాయని; జన్యు సవరణ పద్ధతులు మరింతగా అభివృద్ధి చెంది, వయసు మళ్లిన కణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించగలిగే స్థాయికి చేరుకుంటుందని పియర్సన్ చెబుతున్నారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా కృత్రిమ అవయవాల తయారీ, కృత్రిమ మేధ సహాయంతో రూపొందే చికిత్స పద్ధతులు రానున్న కొద్ది దశాబ్దాల్లోనే మనుషుల ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించగలవని ఆయన అంటున్నారు.‘మ్యూటంట్’ మానవులుమనుషులకు మానవాతీత శక్తులు ఉండటం కాల్పనిక సాహిత్యంలోను, సినిమాల్లోను మాత్రమే చూసి ఉంటాం. ఇలాంటి మానవులు త్వరలోనే మన మధ్య సంచరిస్తారని, మరో ఐదేళ్లలోగా ‘మ్యూటంట్’ మానవులు మన మధ్య తిరుగాడుతారని లండన్కు చెందిన ఫ్యూచరిస్ట్, టెక్నాలజీ ఇన్వెస్టర్ హెర్బర్ట్ సిమ్ చెబుతున్నారు. కొత్తగా రాబోయే ఈ ‘మ్యూటంట్’ మానవజాతిని ‘ఎక్స్–మెన్’గా అభివర్ణిస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనల ద్వారా రూపొందే ఈ ‘పరివర్తిత’ మానవులు లేదా ‘మ్యూటంట్’ మానవుల శక్తి సామర్థ్యాల ముందు ప్రస్తుతం ఉన్న మానవుల శక్తి సామర్థ్యాలు ఎందుకూ కొరగావని సిమ్ చెబుతున్నారు. త్వరలోనే ‘మ్యూటంట్’ మానవుల రాకతో ఇప్పటి ఆధునిక మానవులు వాడుకలో పనికిరాకుండా పోతారని ఆయన అంచనా వేస్తున్నారు. ‘మ్యూటంట్’ మానవుల రూపకల్పన కోసం చేపట్టే పరిశోధనలకు హెర్బర్ట్ సిమ్ భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు. హెర్బర్ట్ సిమ్ తన స్టార్టప్ సంస్థ ‘న్యూరోచిప్ డాట్ కామ్’ ద్వారా ‘మ్యూటంట్’ మానవుల రూపకల్పన కోసం ప్రయోగాలు సాగిస్తున్నారు. మెదడులోని ఆలోచనలను చదవగల హెల్మెట్పై ఆయన ప్రయోగాలు చేపడుతున్నారు. ‘మ్యూటంట్’ మానవులు ప్రాణాంతక వ్యాధులను సైతం తట్టుకుని, సులువుగా ఐదువందల ఏళ్లు బతకగలరని సిమ్ చెబుతున్నారు.అమరత్వంపై నైతిక మీమాంసలుఅమరత్వం చేరువలోనే సాధ్యమవుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ సాధన ఎలా ఉన్నా, మానవుల ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని పలువురు శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. ఈ పరిణామాలు సంభవిస్తే, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మానవులు అమరత్వం సాధించినా, కనీసం శతాబ్దాల తరబడి బతకగల స్థితికి చేరుకున్నా, ప్రపంచం మరింత జటిలంగా మారుతుందని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రపంచ జనాభా అదుపు తప్పి పెరుగుతుందని, అప్పుడు వనరుల పంపిణీలో మరిన్ని వ్యత్యాసాలు తలెత్తి, మనుషుల మధ్య కీచులాటలు, నేరాలు పెరుగుతాయని, దేశాల మధ్య యుద్ధాలు పెచ్చరిల్లుతాయని వారు హెచ్చరిస్తున్నారు. మనుషులు అమరులైతే, జనాభా మరింతగా పెరగడం తప్ప ప్రపంచానికి ప్రయోజనం ఉండదని, పైగా పర్యావరణానికి తీరని హాని జరుగుతుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జీవితంలో మరణం ఒక సహజ పరిణామమని, మరణం ఉన్నప్పుడే మనుషులకు జీవితం విలువ అర్థమవుతుందని, మరణమే లేకుండాపోతే జీవితానికి విలువ ఉండదని, అలా ఎంతకాలం జీవించినా దండగేనని కొందరు తత్త్వవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఎవరు ఏమన్నా, ‘అమరత్వం అతి చేరువలోనే’ అని ఊరిస్తున్న శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనలను మరింత ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నారు.త్వరలో జరగబోయే పరిణామాలుఅమరత్వ సాధన దిశగా త్వరలోనే పలు పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఎప్పుడెప్పుడు ఏయే మార్పులు జరుగనున్నాయో చూద్దాం.. 2029ఈ ఏడాది నాటికి మానవులకు, యంత్రాలకు అనుసంధానం ఏర్పడుతుంది. మనుషులు తమ మేధా చేతనను కంప్యూటర్లలోకి లేదా ఆండ్రాయిడ్ శరీరాల్లోకి ఎక్కించగలుగుతారు. ఆ విధంగా భౌతిక మరణం తర్వాత కూడా జీవితాన్ని కొనసాగించగలుగుతారు.2050ఈ ఏడాది నాటికి వైద్యరంగం వార్ధక్యాన్ని ఇతర వ్యాధుల మాదిరిగానే నయం చేయగలదు. జన్యు సవరణ పరిజ్ఞానం వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే స్థాయికి అభివృద్ధి చెందగలదు. అబ్రీ డి గ్రే చెబుతున్న ప్రకారం వెయ్యేళ్లు బతకగల మనుషులు ఇప్పటికే పుట్టి ఉంటారు. జీవకణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే పద్ధతులపై పరిశోధనల కోసం డి గ్రే ‘లాంజివిటీ ఎస్కేప్ వెలాసిటీ ఫౌండేషన్’ నెలకొల్పి, ఇతర శాస్త్రవేత్తలతో కలసి విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు.2030మనుషులకు, యంత్రాలకు మధ్య దాదాపుగా ఏకత్వం ఏర్పడుతుంది. మరణం వల్ల మనుషుల భౌతిక శరీరం అంతరించిపోయినా, యంత్ర శరీరాల ద్వారా మనుగడ సాగించగల సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. మనుషులకు, యంత్రాలకు మధ్య ఏకత్వం చేరువలోనే ఉందంటూ, సరిగా ఏడాది కిందట– 2024 జూన్లో రే కర్జ్వీల్ ‘ది సింగులారిటీ ఈజ్ నియరర్’ పేరుతో పుస్తకం రాశారు.2045ఈ ఏడాదిలోగా మనుషులు మరణానంతరం ‘సైబోర్గ్’లుగా మనుగడ కొనసాగించగలరు. కంప్యూటర్లలోకి అప్లోడ్ చేసిన మేధాచేతనను ఇతర అధునాతన సాంకేతికతతో రూపొందించిన యంత్ర శరీరాల్లోకి డౌన్లోడ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ యంత్ర శరీరాలు మనుషుల మాదిరిగానే పని చేస్తాయి.వార్ధక్య నివారణ సుసాధ్యంకొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా 2050 నాటికి అమరత్వ సాధన మాట ఎలా ఉన్నా, ‘సెనోలైటిక్’ ఔషధాలతో వార్ధక్య నివారణ సుసాధ్యమవుతుందని బ్రిటిష్ శాస్త్రవేత్త ఆండ్రూ స్టీల్ చెబుతున్నారు. ఈ అంశంపై ఆయన ‘ఏజ్లెస్’ అనే పుస్తకం రాశారు. ‘సెనోలైటిక్’ ఔషధాలు శరీరంలోని మృతకణాలను, జోంబీ కణాలను తొలగించి, జీవకణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వార్ధక్య లక్షణాలను వెనక్కు మళ్లించడంతో పాటు ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించడానికి ఉపయోగపడతాయి. వార్ధక్యం వల్ల మరణం సంభవించడమనేది 2050 తర్వాత చరిత్రగానే మిగిలిపోతుందని ఆండ్రూ స్టీల్ చెబుతున్నారు. -
సేఫ్టీ గాడ్జెట్స్.. ఈ టైంలో హెల్ప్ అయ్యే సేఫ్టీ గాడ్జెట్స్
స్కూల్ బెల్ మోగింది. పిల్లలు కొత్త బుక్స్, బ్యాగ్స్తో రెడీ. కాని, పిల్లలకు చదువుతో పాటు వారి సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. అందుకే, ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్లో పుస్తకాలతో పాటు, ఇలాంటి కొన్ని చిన్న చిన్న సేఫ్టీ గాడ్జెట్స్ గిఫ్ట్ చేయండి!క్యూట్ ఫ్రెండ్! స్కూల్లో హోంవర్క్, టెస్టులు, ప్రాజెక్టులతో కొన్నిసార్లు ఒత్తిడిగా, ఒంటరిగా అనిపించవచ్చు. అప్పుడు పక్కన ఓ సపోర్టివ్ ఫ్రెండ్ ఉంటే ఎంతో బాగుంటుంది కదా? అలాంటి ఓ మిత్రుడే ఇప్పుడు వచ్చేశాడు. పేరు ‘ఎంకరేజింగ్ పిక్కల్’. ఇది బొమ్మ అయినా, దీని నవ్వు, రంగుల కళలు, మృదువైన స్పర్శతో పిల్లల మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఓ టెస్టులో తక్కువ మార్కులొచ్చినా, ప్రాజెక్ట్ ఆలస్యం అయినా, ఈ పిక్కల్ను చూసి ఒక్కసారి మాట్లాడితే చాలు. మనసులో ఈ మాటలు వినిపిస్తాయి: ‘ఇంకొంచెం ట్రై చెయ్య్, నువ్వు చాలా గ్రేట్’ అని. ఒక చిన్న సైజు మానసిక మిత్రుడు అనే చెప్పొచ్చు. కార్న్, క్యాబేజీ, హనీపీచ్ లాంటి ఇతర ఆకారాల్లోనూ దొరుకుతుంది. ఎవరి స్టయిల్కి తగ్గట్టు వారు సెలెక్ట్ చేసుకోవచ్చు. ధర డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది.నో‘లాస్’స్కూల్ టైమ్ వచ్చేసింది! బ్యాగ్, బాటిల్, టిఫిన్ , బాక్స్– ఇలా వీటిలో ఏ ఒక్కటి మిస్ అయ్యినా అమ్మానాన్నలకు టెన్షన్ గ్యారంటీ! ‘అమ్మా, నా బాటిల్ పోయింది’, ‘నాన్నా, బ్యాగ్ మర్చిపోయా’ అన్న డైలాగ్స్తో వాటిని తిరిగి తెచ్చే వరకు పిల్లలు విసిగిస్తూనే ఉంటారు. ఇందుకు పరిష్కారమే ఈ ‘ఎయిర్ ట్యాగ్’. ఇది చిన్న బిళ్లలాగ ఉండే మాయపరికరం. దీనిని పిల్లల వస్తువులకు తగిలించండి. ఇకపై వారు ఏది ఎక్కడ మరచిపోయినా, దీనికి అనుసంధానమైన యాప్ ద్వారా ఫో¯Œ లో వాటి లొకేషన్ కనిపెట్టచ్చు. ధర రూ.11,900 కి నాలుగు ట్యాగ్స్ వస్తాయి.బాడీగార్డ్ బర్డీ! ఇప్పటివరకు ప్రమాదం వచ్చిన ప్రతిసారి ‘అమ్మా! నాన్నా!’ అని ఒక్క అరుపుతో పరుగులు తీసే చిన్నారులు, స్కూల్కు వెళుతున్నారంటే, తమను తాము కాపాడుకునే స్టేజ్కి వచ్చేశారని అర్థం. అందుకే, కండబలం కంటే ముందు బుద్ధిబలంతో సమస్యను పరిష్కరించేలా నేర్పించాలి. ఇందుకోసం, పిల్లలతో పాటు స్కూల్కి ఈ బాడీగార్డ్ను కూడా పంపించండి. పేరు ఈ ‘బర్డీ’. చిన్న కీ చైన్లా ఉంటుంది. కాని, ప్రమాదం వచ్చినప్పుడు పిల్లలు ఒక్కసారి దీనికున్న బటన్ నొక్కితే చాలు. ఇక అది చేసే శబ్దంతో దొంగలు పారిపోవాల్సిందే! వెంటనే, ఒక పెద్ద అలారం చెవుల్లో మెగాఫోన్ పెట్టినట్టు అరుస్తుంది. ఇంకా చీకట్లో కూడా ఈ బర్డీ టార్చ్ మోడ్లో వెలుగుతూ, ‘ఇదిగో లైట్ ఉంది, నువ్వు కామ్గా పో’ అనే వార్నింగ్తో దొంగలను తరిమి కొడుతుంది. ఇది పిల్లల బ్యాగ్కు వేలాడే ఒక మినీ సూపర్ హీరో! (చదవండి: ఆ కుంటుంబంలో 56 ఏళ్ల తర్వాత పండంటి పాపాయి..! ఏ రేంజ్లో స్వాగతం పలికారంటే..) -
ఆ తండ్రి ప్రాణం నిలుపుతుంటే..కుమార్తె ప్రాణం పోస్తోంది..
నాన్న.. అమ్మతో పోల్చితే నాన్నెందుకో కాస్త వెనుకబడ్డారు అంటుంటారు. కానీ తన పిల్లలు ముందుండాలని తపనతో నాన్న కాస్త వెనుకబడి ఉంటారు, వారి వెనకే ఉంటారు. పిల్లల ప్రతి విజయం వెనక, వారి ప్రతి లక్ష్యం వెనుక కనిపించని నా అన్న కృషే నాన్నది. నాన్న ఒక బాధ్యత, ఒక ముందు చూపు. అలాంటి నాన్నకి ఏం చేస్తే రుణం తీరుతుంది అనుకున్నారో ఏమో.. తన తండ్రి ఒక్కసారి ప్రాణం పోసి జన్మనిస్తే, తాను మాత్రం అనేక సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలుస్తున్నారు డా.సంపత్ కుమార్. ఎన్ని గొప్ప పనులైనా చేయ్యి.. రక్తదానానికి మించింది లేదు అని తన తండ్రి చెప్పిన మాట నుంచి స్ఫూర్తి పొంది.. అనేక సార్లు రక్తదానం చేసి తండ్రి పై తన ప్రేమను చాటుకుంటున్నారు. నేటి ఫాదర్స్ డే నేపథ్యంలో తండ్రికి తనంటే ప్రాణం.. ప్రాణం పోయడం అంటే తనకి ఇష్టం అంటున్నారు సంపత్ కుమార్. తండ్రికి తగ్గ తనయుడు.. సుమారు 25 ఏళ్ల క్రితం రక్తదానం గురించి తన తండ్రి కోట మోహన్ రావు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందన్నారు నగరానికి చెందిన సంపత్ కుమార్. నాన్న నింపిన స్ఫూర్తితో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక మరణించిన వ్యక్తి చావుతో ఒక ఉద్యమంగా రక్తదానాన్ని చేస్తూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 10, 50, 100 కాదు.. ఏకంగా 322 సార్లు రక్తంతో పాటు ప్లేట్లెట్స్, ప్లాస్మా, డబ్ల్యూబీసి దానం చేసి ప్రాణదాతగా నిలుస్తున్నారు. నాన్న నాకు పోసిన ప్రాణం కొన్ని వందల మందికి ప్రాణాలు నిలిపే వారధిగా నిలవడమే తన లక్ష్యమని, ఇదే తన తండ్రికి తీర్చుకునే రుణమని చెబుతున్నారు. ప్రతి ఏడాది ఫాదర్స్ డే రోజు ఒక గొప్ప కొడుకుగా సంతృప్తిగా ఉండడానికి ఈ రక్తదానం కారణంగా నిలుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను ప్రాణం నిలుపుతా, తాను ప్రాణం పోస్తుంది.. నాన్న కోరికకు అనుగుణంగా అనేక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. రక్తదానంతో ప్రాణదాతగా నిలిస్తే.. అసలు ప్రాణదాత డాక్టర్ అని నా నమ్మకం. అందుకే నేను డాక్టర్ కాలేకపోయినా నా కూతురిని డాక్టర్ని చేసి అటు ఒక తండ్రికి కొడుకు గానూ, ఇటు ఒక కూతురికి తండ్రిగానూ నా వంతు బాధ్యతను నిర్వహించాను. నా కోరికకు అనుగుణంగా నా కూతురు కోట శృతి మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్గా ఎంతో మంది ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. – సంపత్ కుమార్, హైదరాబాద్. (చదవండి: -
ఆధునిక ఇంటికి గిరిజన కళ..!
ఇల్లు రిచ్గా ఉండాలా, కళాత్మకంగా ఉండాలా అనే ఆలోచన యువతలో కలుగుతుంది. అందుకు తగినట్టుగా ఇంటి అలంకరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిచ్నెస్ తగ్గకుండా కళాత్మకంగానూ కనిపించాలనే అభిరుచి గలవారికి గిరిజన జీవనశైలిని ప్రతిబింబించే కళాత్మక వస్తువులు, ప్రింట్లు ఆధునిక గృహాలంకరణలో వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయి.సరైన నమూనాలుగిరిజన కళ ఉట్టిపడాలి కదా అని ఉన్న స్థలంలో మొత్తం అవే డిజైన్స్తో ముంచెత్తకుండా సంప్రదాయ, ఆధునిక అలంకరణతో బ్యాలెన్స్ చేయాలి. సోఫా కవర్లు లేదా కుషన్లు, బొమ్మలు.. వంటి చిన్న గిరిజన వస్తువులతో ప్రారంభించవచ్చు. రగ్గులు, లాంప్షేడ్లు, గిరిజన మోటిప్స్ ఉన్న టేబుల్వేర్ వంటివి అలంకరణను అద్భుతంగా మార్చేస్తాయి. రంగులు, అల్లికలతో బ్యాలెన్స్అలంకరణలో గిరిజన ప్రింట్లను ప్రవేశపెట్టేటప్పుడు, రంగుల గురించి కూడా ఆలోచించాలి. గోధుమ, ఆకుపచ్చ, మట్టి టోన్లతో ఆ కళను తీసుకురావచ్చు. నేత ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన కర్టెన్లు, కుషన్ కవర్లు, బెడ్షీట్లు వంటివి ఎంపిక చేసుకోవచ్చు. వాల్ హ్యాంగింగ్స్గా అల్లికలను జోడించవచ్చు. గిరిజన కళాఖండాలను చేర్చడంగిరిజన కళాఖండాలలో ప్రధానంగా చెప్పుకోదగినవి శిల్పాలు. ఇవి గదికి ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. అయితే, ఇవి ఇతర డిజైన్ అంశాలను అధిగమించేంత ఎక్కువ ఉండకూడదు. గిరిజన కళాఖండాలను గాజు అల్మరాల్లో ఉంచడం లేదా వాల్ ఆర్ట్గా ఉపయోగించడం వల్ల అలంకరణలో కొత్తదనాన్ని తీసుకురావచ్చు.ఎన్.ఆర్ (చదవండి: హలో మూవీ కళ్యాణి ప్రియదర్శిని బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
'లక్ష'ణమైన గ్రంథాలయం
ఆధునిక దేవాలయాలుగా భావించే గ్రంథాలయాలకు ఘన చరిత్రే ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాయి. అలాంటి వాటిలో విజ్ఞాన కాంతులు వెదజల్లే సరస్వతీ నిలయం– శత వసంతాల సారస్వత నికేతనం అతి పురాతనమైనది. ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో కొనసాగుతున్న ఈ పుస్తక భాండాగారానికి 1918 అక్టోబరు 15న విజయదశమి రోజున బీజం పడింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా వేటపాలెంలో కొంతమంది యువకులు హిందూ యువజన సంఘంగా ఏర్పడి గ్రంథాలయాన్ని నెలకొల్పారు. రెండు దినపత్రికలు, మూడు వారపత్రికలు, వంద పుస్తకాలతో ప్రారంభించగా ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నిర్వహణ వ్యయం భరించలేక నాలుగేళ్లకే తాళం వేశారు. అప్పట్లో సాహితీ ప్రియుడైన ఊటుకూరు వెంకట సుబ్బరాయ శ్రేష్ఠి సంస్థకున్న అప్పులు తీర్చి, రూ.3 వేలతో మూలనిధి ఏర్పాటు చేశారు. మరో రూ.2 వేలు విరాళంగా అందించారు. 1923లో వేటపాలెం నడిబొడ్డున పెంకుటిల్లు కొని 1924 సెప్టెంబర్లో తిరిగి ప్రారంభింపజేశారు. దానికి ‘సుబ్బరాయ మహల్’గా నామకరణం చేశారు. 1929 ఏప్రిల్ 4న నూతన భవన నిర్మాణానికి మహాత్మాగాంధీ పునాది రాయి వేశారు. ఆ సందర్భంగా ఆయన తన చేతికర్రను జ్ఞాపకంగా ఇక్కడ వదిలివెళ్లారు. సందర్శకులు దాన్ని ఒకమారు తాకి బాపూజీని తాకిన అనుభూతికి గురవుతుండడం విశేషం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, జమునాలాల్ బజాజ్ చేతుల మీదుగా ప్రారంభమైన నూతన గ్రంథాలయం సారస్వత నికేతనంగా పేరు మార్చుకుంది.స్మారక మందిరాలు1933లో బాబూ రాజేంద్రప్రసాద్ భవనం ఎదుట ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. తదుపరి కాలంలో మీనాక్షి కోటిలింగం స్మారక మందిరం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, శారదాదేవి స్మారక మందిరం నిర్మించారు. శ్రేష్ఠి మరణానంతరం ఆయన సతీమణి కమలమాంబ గ్రంథాలయ బరువు బాధ్యతలు స్వీకరించారు. ఎం.కామయ్య, ఎం.ఆంజనేయశర్మ, కె.సుబ్రహ్మణ్యం గ్రంథ పాలకులుగా వ్యవహరించారు. మహిళలు, వయోజనులు, పాత్రికేయుల కోసం శిక్షణ తరగతులు నిర్వహించేవారు. ముద్రణ, సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో ఆరితేరినవారితో ప్రసంగాలు, చర్చలు ఇక్కడే జరిగేవి.వేల అక్షరాలు.. లక్ష పుస్తకాలువంద పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయంలో ఇప్పుడా సంఖ్య లక్షా ఇరవై వేలకు చేరింది. 1942 నుంచి 2025 వరకు అన్ని ప్రధాన తెలుగు దినపత్రికలు లభ్యమవుతాయి. పాత పత్రికలను బైండింగ్ చేసి మరీ భద్రపరచడం విశేషం. వార పత్రికలు, ప్రాచీన, ఆధునిక కవులు, రచయితల సాహిత్యం, గాంధీజీ రచనలు, తాళపత్ర గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. పింగళి వెంకయ్య, ఆచార్య ఎన్జీ రంగా, కొండా వెంకటప్పయ్య, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం, రావూరి భరద్వాజ, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, ఊటుకూరి లక్ష్మీకాంతం, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, అడివి బాపిరాజు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కట్టమంచి రామలింగారెడ్డి, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, వావిలాల గోపాలకృష్ణయ్య, వెలగా వెంకటప్పయ్య. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, స్వామి విద్యాప్రకాశనందగిరి, సి.నారాయణరెడ్డి వంటి ప్రముఖులు సారస్వత నికేతనాన్ని సందర్శించారు. పాత్రికేయ సుప్రసిద్ధులు పొత్తూరి వెంకటేశ్వరరావు, నార్ల వెంకటేశ్వరరావు, తుర్లపాటి కుటుంబరావు, నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ తదితరులు ఇక్కడి పుస్తకాలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.ఉద్యోగార్థులకు వరండిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల వేటలో ఉన్న యువతకు వేటపాలెం గ్రంథాలయం ఒక వరమనే చెప్పాలి. అనేక రకాలైన పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ప్రతిరోజూ ఇక్కడికొచ్చి పుస్తక పఠనంలో నిమగ్నమవుతారు. ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి దాదాపు 50 మంది వరకు వస్తుంటారు. పరిశోధనలు చేసే కొందరు విదేశీయులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తారు. మార్కెట్లో దొరకని ఎలాంటి పాత పుస్తకమైనా ఇక్కడ లభ్యం కావడం తథ్యం. ముగ్గురు సిబ్బంది సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సాహితీప్రియులు ఒక్కసారైనా ఈ గ్రంథాలయాన్ని సందర్శించి తీరాలి.డిజిటలైజేషన్ దిశగా అడుగులుమా గ్రంథాలయంలో తెలుగు, ఆంగ్లం, హిందీ, సంస్కృతం, ఇంకా ఇతర భాషలకు సంబంధించి లక్షా ఇరవై వేల పుస్తకాలున్నాయి. ప్రాధాన్యత క్రమంలో పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నాం. ఇందుకుగాను ఇండెక్స్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యాం. ప్రధానంగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు నిత్యం చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చి పుస్తక పఠనం గావిస్తారు. పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు కూడా అధ్యయనం సాగిస్తుంటారు. గ్రంథాలయం రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. శుక్రవారం సెలవు.పి.శ్రీవల్లి, గ్రంథాలయాధికారి (చదవండి: ఇంట్లోనే స్పా సౌకర్యం..! పట్టులాంటి చర్మం కోసం..) -
హలో మూవీ కళ్యాణి ప్రియదర్శిని బ్యూటీ సీక్రెట్ ఇదే..!
‘ఫ్యాషన్ అంటే హంగులు కాదు, ఫ్యాషన్ అంటే వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది.’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ, సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తూ ఎంతోమంది మనసులు దోచుకున్న అమ్మాయి నటి కళ్యాణి ప్రియదర్శిని. ఆమె శైలి, సౌందర్య రహస్యాలే ఇప్పుడు మీ ముందుంది.నటి కళ్యాణి ప్రియదర్శిని ధరించిన డ్రెస్ బ్రాండ్: పింక్సిటీ బై సారిక ధర: రూ. 38,500 కాగా, జ్యూలరీ బ్రాండ్: కళ్యాణ్ జ్యూవెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. తేనె, నెయ్యి కలిపిన ప్యాక్, పసుపు ఫేస్ మాస్క్, తగినంత నిద్ర, జుట్టుకు కొబ్బరి నూనె మసాజ్ – అంతే! ఇవే నా బ్యూటీ సీక్రెట్. అయితే, ప్రతి అమ్మాయిలోనూ ఒక అందం ఉంటుంది. అది వెలుగులోకి రావాలంటే, సరైన శ్రద్ధ అవసరం. అప్పుడు మీరు సహజంగా మెరుస్తారు. ఇలా సహజమైన చిట్కాలను పాటిస్తూనే అందాన్ని వెలికితీయొచ్చు అని చెబుతోంది కళ్యాణి ప్రియదర్శినినెత్తికెక్కిన అందంమెడలో కాదు, చెవుల్లో కాదు, ఈ ఆభరణం దక్కించుకున్న స్థానం తలమీదే! అన్నింటి కంటే పైస్థాయి అంటే ఇదే. నెత్తిమీదకు ఎక్కిందంటే అది అహంకారం వల్ల కాదు, ఆత్మవిశ్వాసంతో. చూశారంటే సింపుల్గా ఉంటుంది, ‘ఇది ఎలాంటి జ్యూలరీ?’ అనిపిస్తుంది. కాని, వేసుకుంటే చూసే వారి చూపులను ఆకట్టుకోగల సత్తా ఉంది ఈ అభరణానికి. ఈ మినిమలిస్ట్ హెడ్ బ్యాండ్ ఒకవైపు ఆధునికత, మరోవైపు సంప్రదాయాల కలబోత. ఇప్పటి ఫ్యాషన్ భాషలో దీన్ని ‘హెడ్ బ్యాండ్ జ్యూలరీ’ అంటారు. కాని, మన పూర్వీకులు దీనిని ‘తలమిన్న’, ‘శిరోభూషణం’ అని పిలిచేవారు. పేర్లు పాతవైనా స్టయిల్ మాత్రం పక్కా ట్రెండీ! ఇది తలపై ధరించిన వెంటనే మీ లుక్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మామూలు చీర, కుర్తా, లెహంగా ఏదైనా సరే దీన్ని జత చేస్తే మీరు కేవలం రెడీ అవ్వరు రాయల్గా రెడీ అయిపోతారు. మేకప్ లేకపోయినా, ఈ తలమిన్న ఒక్కటే ముఖాన్ని గ్లో మోడ్లోకి మార్చేస్తుంది. లైట్ మేకప్, వదిలేసిన జుట్టు దీని స్టయిలింగ్కు బెస్ట్ కాంబో. ఇంత తక్కువ బరువుతో, ఇంత ఎక్కువ ఫ్యాషన్ ఎఫెక్ట్ ఇచ్చే జ్యూలరీ ఇంకా ఏదీ దొరకదు! (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు) -
బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..
దేవుడు పిలిస్తే పలుకుతాడు. ప్రార్థిస్తే స్పందిస్తాడు అనేది చాలామంది భక్తుల నమ్మకం. ఆశ్చర్యకరంగా ఈసారి తల మీద అభయహస్తం ఉంచి ఆశీర్వదిస్తూ కెమెరాకు చిక్కాడు. నిజం, ఫొటోలో కనిపిస్తున్న చేయి, మామూలు చేయి కాదని, ఇది స్వర్గం నుంచి వచ్చిన దేవుని అభయహస్తమని నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగతి ఏంటంటే, కెంటకీ అమాండా అనే మహిళ, ఎనిమిది నెలల గర్భవతి. అంతా మూములుగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోకుండా ఒక చేదునిజం, రోజూ ఆమెను కలతకు గురిచేసింది. కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో, ఆ తల్లి ప్రతి స్కాన్కి ముందు దేవుడిని ఒక్కటే అడిగేది– ‘దేవుడా! నా బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించు’ అని. అలా ఒకరోజు అల్ట్రాసౌండ్ స్క్రీన్పై బిడ్డ తల మీద ఒక పెద్ద చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించి దేవుడు ఆమె ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ‘దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు’ అంటూ సంతోషంలో మునిగిపోయింది. ‘ఇది ఫొటో కాదు, ఆకాశం నుంచి వచ్చిన దేవుని ప్రేమ. దేవుడు నా ప్రార్థనకు ఇచ్చిన సమాధానం’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది ‘అది బిడ్డ చేయే’ అని వాదించినా, చాలామంది ఇది నిజంగానే దేవుడి ఆశీర్వాదంగా... ‘ఈ ఫొటోలో దేవుడి చేయి మాత్రమే కనిపించలేదు. నీ బిడ్డను తాకాడు. భరోసా ఇచ్చాడు. తన ప్రేమను చూపాడు. ’ అంటూ ఆమె నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నారు. (చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?) -
పీసీఓఎస్తో మానసిక సమస్యలు..
నేను గర్భవతిని అని మూత్రపరీక్ష ద్వారా తెలిసింది. డాక్టర్ను ఎప్పుడు కలవాలి?– రమ్య, గుంటూరుగర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్ను కలవాలి. ఎందుకంటే శరీరంలో థైరాయిడ్, సుగర్, రక్తపోటులాంటి సమస్యలు ఉంటే, శిశువుపై వాటి ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ను కలిసిన వెంటనే వారు రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేస్తారు. అలాగే, శరీర పరిస్థితిని బట్టి ఫోలిక్ యాసిడ్, విటమిన్ –డి వంటి మాత్రలు సూచిస్తారు. ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. మొదటి వారాల్లోనే శుభ్రమైన, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు తగిన ఆహార నియమాలు కూడా డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు, జన్యుపరమైన లోపాలు భర్తవైపు లేదా భార్యవైపు ఉన్నా, అవి శిశువుకు వచ్చే అవకాశముంటుంది. అందుకే ప్రారంభ దశలోనే ఆయా సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, దానికి తగిన వైద్యం తీసుకోవాలి. సాధారణంగా గర్భం ఎనిమిదో వారం వచ్చేసరికి మొదటి స్కాన్ చేస్తారు. దానితో బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తర్వాతి స్కా మూడో నెలలో చేస్తారు. ఈ స్కానింగ్, మొదటి దశ రక్తపరీక్షల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను గుర్తించవచ్చు. అవసరమైన మందులు, తీసుకోవాల్సిన చికిత్సలు కూడా సూచిస్తారు. శరీర బరువు, రక్తపోటు స్థాయిని బట్టి ప్రారంభ దశలో చేయవలసిన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తారు. ఆహార నిపుణుల సలహాలు, జన్యుపరమైన కౌన్సెలింగ్ కూడా ఇప్పటి నుంచే తీసుకోవాలి. అందుకే ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ప్రసూతి నిపుణులను తప్పనిసరిగా కలవాలి.పీసీఓఎస్తో మానసిక సమస్యలుప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మహిళలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, ముఖంపై మొటిమలు ఎక్కువగా రావడం, తల మీద జుట్టు పల్చబడిపోవడం వంటి శారీరక సమస్యలే కాకుండా పలు మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నడివయసుకు చేరుకునే సరికి మతిమరపు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఒక్కోసారి మానసిక కుంగుబాటుకు లోనవడం వంటి లక్షణాలతో బాధపడతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీదర్ హడల్స్టన్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలో తేలింది. అలాగే, పీసీఓఎస్తో బాధపడే మహిళలకు టైప్–2 డయాబెటిస్ ముప్పు సాధారణ మహిళల కంటే రెట్టింపుగా ఉంటుందని కూడా ఈ పరిశోధనలో బయటపడింది. ఈ సమస్యల కారణంగానే పీసీఓఎస్తో బాధపడే మహిళలు నడివయసులో కెరీర్లోను, ఆర్థిక వ్యవహారాల్లోను వెనుకబడిపోతారని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన సారాంశం ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురితమైంది.ఆత్మహత్యా ధోరణులు కూడా..పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆత్మహత్యా ధోరణులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే, పీసీఓఎస్తో బాధపడే మహిళలు ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడే అవకాశాలు మూడు శాతం ఎక్కువగా ఉన్నట్లు తైవాన్లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ము హాంగ్ చెన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు) -
మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు
తల్లిదండ్రుల మాటలు పిల్లల్లో భద్రతనివ్వాలి, బలమవ్వాలి, ఉత్సాహాన్ని నింపాలి. కానీ చాలా సందర్భాల్లో అవే మాటలు పిల్లల్లో భయాన్ని నాటేస్తాయి. దాంతో పిల్లలు తమ తప్పులను భయంతో దాచడం నేర్చుకుంటారు. లేదా మౌనంగా తిరగబడతారు. చివరకు తల్లిదండ్రుల ప్రేమకూ, పిల్లల బాధకూ మధ్య ఓ అఘాతం ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, పిల్లల వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే మాటలు; ప్రేమను బెదిరింపుగా మార్చే పదాలు; పిల్లల వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించే వ్యాఖ్యల గురించి తెలుసుకోవాలి. వాటిని మార్చుకుని పిల్లల్లో ఆశనూ, ఆశయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. ‘‘నీకు అన్నీ కొనిపెడుతున్నాం, చదివిస్తున్నాం. ఇంకేం కావాలి?’’చాలామంది తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని ప్రేమతో, బాధ్యతతో, త్యాగాన్ని గుర్తుచేసే కోణంలో చెబుతారు. కాని, పిల్లలకు ఇది లావాదేవీలా అనిపిస్తుంది. ప్రేమ అనేది కేవలం తినిపించడం, చదివించడం వంటి బాహ్య సౌకర్యాలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. దాంతో, వారు తమ ఎమోషనల్ అవసరాలను తల్లిదండ్రుల నుంచి కాకుండా, బయటి ప్రపంచం నుంచి పొందాలని ప్రయత్నిస్తారు. కొంచెం సానుభూతి చూపినా వారికి దగ్గరవుతారు. (చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)‘‘నీకు అన్నీ సమకూర్చడం పేరెంట్స్గా మా బాధ్యత. నువ్వు ఆనందంగా ఉన్నావా?’’ అని అడిగితే చాలు. తల్లిదండ్రులు తనతోనే ఉన్నారనే అనుభూతిని పెంచుతుంది. ‘నా భావాలు తల్లిదండ్రులకు ముఖ్యం’ అనే భద్రతా భావన పెరుగుతుంది. కంగారు పడకుండా తమ బాధలను, కలలను, భయాలను పంచుకుంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, అనుబంధం, కృతజ్ఞత లాంటి భావాలు పెరుగుతాయి. ‘‘నీ కోసమే బతుకుతున్నా!’’ఈ వాక్యం తల్లిదండ్రుల త్యాగాన్ని చెప్పేదే అయినా, బిడ్డ వల్లనే తన బతుకు భారమైపోయిందన్న సందేశాన్ని పంపిస్తుంది. ‘‘అమ్మ, నాన్న నాకోసం జీవితాన్నే వదిలేశారు. మరి నేను నా కోరికల కోసం బ్రతికితే ఎలా?’’ అనే భావనను నాటుతుంది. కోర్సులు, కెరీర్, పెళ్లి నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోలేరు. ప్రేమ అనేది త్యాగం కావాలన్న తప్పుడు నమ్మకం వారిలో చెరగని చిహ్నంలా మిగిలిపోతుంది. తర్వాత కూడా ఇతరులతో సంబంధాల్లో తామే త్యాగం చేయాలన్న కండిషనింగ్తో బతకాల్సి వస్తుంది. ‘‘నీతో జీవించడం నా జీవితంలో అతి గొప్ప భాగం. నువ్వు నీ పంథాలో నడవాలి, నేను నీ వెంటే ఉంటాను’’ అని చెప్పి చూడండి. ఈ ఒక్క వాక్యంలో ఆత్మీయత, స్వేచ్ఛ, అనుబంధం మూడూ వ్యక్తమవుతాయి. తల్లిదండ్రుల ప్రేమ నిబంధనలపై ఆధారపడదన్న నమ్మకంతో వారు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలుగుతారు. కొడుకు/కూతురు అనే పరిధిలో కాకుండా తమ వ్యక్తిగతమైన గమ్యాన్ని అన్వేషించే బలమైన వ్యక్తిగా ఎదుగుతారు.‘‘నీ మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది!’’ఈ వాక్యం తల్లిదండ్రుల భావోద్వేగ బాధను వ్యక్తపరుస్తోంది అనిపించినా, నిజానికి ఇది పిల్లల వ్యక్తిత్వ అభివ్యక్తిని అణచివేసే వాక్యం. తమ మాటలు పెద్దవాళ్లకు బాధ కలిగించవచ్చని, కాబట్టి నిశ్శబ్దంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని నాటుతుంది. దీంతో పిల్లలు తమ అసలు భావాలను పంచుకోకుండా దాచేస్తారు. ఫేక్ పర్సనాలిటీలో జీవించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలంలో ఇది యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా కోపానికి దారి తీస్తుంది. దీనికి బదులుగా ‘‘నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకోవాలనుంది. అదేమిటో చెప్పడం వల్ల మనం నిజంగా దగ్గర కావచ్చు’’ అని చెప్పడం వల్ల పిల్లలలో భద్రతను, విశ్వాసాన్ని, స్పష్టతను నాటుతుంది. ఎలాంటి భావాలనైనా తల్లిదండ్రులతో పంచుకోవాలనిపిస్తుంది. వారు తమ నిజమైన భావాలను అంగీకరించడంలో సామర్థ్యం, ఆత్మగౌరవం పెరుగుతుంది.‘‘నువ్విలా ఉంటే నీతో ఎవ్వరూ కలవరు!’’ఈ వాక్యం ఇతర మాటలకంటే తీవ్రంగా పిల్లల ఆత్మగౌరవంపై తీవ్రమైన దెబ్బ తీస్తుంది. తమ వ్యక్తిత్వం పట్ల అసహనం, తమలో మారలేని లోపాలు ఉన్నాయన్న అపోహ, భవిష్యత్తులో ఒంటరిగా ఉండిపోతామన్న భయం నాటుతుంది. దీనివల్ల సోషల్ యాంగ్జయిటీ మొదలవుతుంది. వారిని బంధాలకు దూరంగా ఉంచుతుంది. ఇతరులకు నచ్చేందుకు తమ అసలైన భావనలను, అభిరుచులను దాచిపెడతారు. ‘‘నేను కలవదగిన వ్యక్తిని కాను’’ అన్న కోర్ బిలీఫ్ బలపడుతుంది.‘‘నువ్వు మారాలనుకునే క్షణం నుంచే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారటం మొదలవుతుంది’’ అని చెప్తే మార్పును శిక్షగా కాక, శక్తిగా చూపుతుంది. ‘నాలో మార్పు సాధ్యమే’, ‘నేను మారగలను’ అనే గ్రోత్ మైండ్ సెట్ను నాటుతుంది. దీనివల్ల నా జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయనే భావన చిగురిస్తుంది. మార్పు అవకాశం బయట ఎక్కడో లేదని, తనలోనే మొదలవుతుందనే ఇంట్రాస్పెక్షన్తో పిల్లలు ఎదుగుతారు. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్) -
అక్షర భ్రమణం
రశ్మిరేఖ రచయిత్రి. ఇప్పటికి వరకు నాలుగు నవలు రాశారు. మొదటిది 2013లో. నాల్గవది 2023లో. అస్సామీ భాషలో ఉండే ఆ పుస్తకాలలో ఏముందో, ఆ పుస్తకాల టైటిల్స్కు అర్థం ఏమిటో అస్సామీని చదవటం రాని వారికి తెలియకపోవచ్చు. కానీ, రశ్మిరేఖ జీవితం గురించి తెలుసుకుంటే మాత్రం ఆ పుస్తకాల్లో ఆమె ఏం రాసి ఉంటారో కొంతైనా ఊహించవచ్చు.రశ్మి వయసు 39. రోజంతా వీల్ చెయిరే ఆమెను తిప్పుతూ ఉంటుంది. ఉత్తర అస్సాంలోని సూటీ ప్రాంతంలో తను పాఠాలు చెబుతుండే ఖానగురి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు తిప్పుతుంటుంది, అస్సాంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట జరుగుతుండే సాహితీ సభలూ సమావేశాలకూ తిప్పుతుంటుంది. చిన్నప్పుడే చెప్పేశారు!రశ్మి ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ (ఎస్.ఎం.ఎ.) పేషెంట్. అందుకే వీల్ చెయిర్ ఆమె శరీరంలో ఒక భాగం అయిపోయింది. చిన్నప్పుడే ఆమె గురించి వైద్యులు ఆమె తల్లిదండ్రులకు చెప్పేశారు... మీ అమ్మాయికి పెద్దయ్యాక ఎస్.ఎం.ఎ. వస్తుందని, అందుకు ఆమెను మానసికంగా సిద్ధం చేయమనీ! ఆ ఎరుకతో రశ్మి తన జీవితంలో పూర్తి ‘పాజిటివిటీ’ని అలవాటు చేసుకుంది. ‘అంతా మన మంచికే’ అనే ధోరణి అది. టీచర్లు ప్రోత్సహించారుఖానగురికి కాస్త దగ్గర్లో ఉండే రశ్మి ఇల్లు, ఇంటి పరిసరాలు ఆమె చిన్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉండేవి. అందమైన భావాలు రశ్మిలో అక్కడ పూతలు వేసేవి. ఆమె ఆలోచనల్లోని మార్దవాన్ని, సృజనశీలతను ఆమె తల్లిదండ్రులతో పాటు, టీచర్లూ గమనించి ఆమెను రచన వైపు ప్రోత్సహించారు. ఆ తర్వాత నెమ్మదిగా అస్సామీ దినపత్రికల్లో, వార పత్రికల్లో, మేగజీన్స్ లలో ఆమె వ్యాసాలు రావటం మొదలైంది. చివరికి అవి ఆమెను నవలా రచనకు ప్రేరేపించాయి. ఆమె రాసిన ‘మేఘే ధోక అకక్సార్ జూన్స్ ’, ‘జీబన్స్ మీనార్ సుర్’, ‘గిగోలో’, ‘మటి ఈశ్వర్’ అనే నవలలు అస్సాంలో ఆమెను ప్రముఖ రచయిత్రిని చేశాయి. పుస్తకాలు స్ఫూర్తినిచ్చాయిఇంటి వాతావరణంతో పాటు, 750 వరకు పుస్తకాలు రాసిన 72 ఏళ్ల అస్సామీ రచయిత రంజూ హజారికా కూడా రశ్మికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన పుస్తకాలను, 88వ యేట 2021లో కన్నుమూసిన అస్సామీ రచయిత హోమెన్స్ బోర్గోహెయిన్స్ రచనల్ని కూడా రశ్మి ఇష్టంగా చదివేవారు. హోమెన్స్ ను ఆమె పెదనాన్న అని పిలిచేవారు. ఆమెను ఆత్మకథ రాయమని ప్రోత్సహించింది ఆయనే. ‘‘మమోని బైద్యు (ఇందిరా గోస్వామి) పుస్తకాలు కూడా నాలో రాసే ధైర్యాన్ని నింపాయి’’ అంటారు రశ్మి. హోమెన్, బైద్యు 2011లో చనిపోయినప్పుడు ఆ విషాదం నుంచి త్వరగా తేరుకోలేకపోయారు రశ్మి. రాష్ట్రం మొత్తం మీద నలుగురే!రశ్మి గువాహటి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ్సలో పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశారు. ఆ సమయంలోనే బైద్యు, హోమెన్, రంజూ హజారికా పుస్తకాలను ఎక్కువగా చదివారు. తర్వాత టీచర్గా ఉద్యోగం. ఆ తర్వాత 2020లో రశ్మి పెళ్లి. ఇప్పుడు ఎనిమిది నెలల కూతురు. ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ ఉండి, తల్లి అయిన తొలి అస్సామీ మహిళ రశ్మి. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ వ్యక్తులు నలుగురు మాత్రమే ఉన్నారు. తక్కిన ముగ్గురిలో ఒకరు రశ్మి చెల్లెలు ఛాయానిక. ఇంత పెద్ద కష్టంలోనూ మామూలు జీవితాన్ని గడుపుతున్నారు ఈ అక్కచెల్లెళ్లు. ‘‘ఆ మాటే నాకు నచ్చదు’’అయితే ఈ మాటే అనొద్దంటారు రశ్మి! ‘‘మామూలు జీవితం అంటే ఏంటి? వీల్ చెయిర్లో ఉంటే మాత్రం మామూలు జీవితం కాకుండా పోతుందా? ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అనే మాటైతే నాకు అస్సలు నచ్చదు. వికలాంగుల్ని వికలాంగులు అనకుండా ఆ సొగసైన భాష ఏమిటి.. కృత్రిమంగా!’’ అంటారు రశ్మిరేఖ. ‘‘ఎవరైనా సరే సానుభూతి చూపకూడదు. సానుభూతి కోరుకోకూడదు’’ అన్నది ఆమె భావన. ఆమె అభ్యర్థన. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
మ్యూజియంలలో బస చేస్తారా?
మ్యూజియంలు సాధారణంగా పగలు తెరుచుకుంటాయి. రాత్రి మూతబడతాయి. ఒక్కో ప్రదేశంలో ఉన్న మ్యూజియంలకు ఒక్కో నిర్దిష్ట వేళలు ఉంటాయి. వేళ ముగిశాక మ్యూజియంలలో ఎవరినీ ఉండనివ్వరు. అలాంటిది మ్యూజియంలలో బస చేయడమేంటి? అవేమైనా హోటళ్లా, లాడ్జింగులా అనుకుంటున్నారా? ప్రపంచంలో తొమ్మిది మ్యూజియంలు మాత్రం రాత్రి బస చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో, వాటి విశేషాలేమిటో తెలుసుకుందాం.స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీఈ మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. రాత్రి ఇక్కడ బస చేసేవారు ఇందులోని డేవిడ్ కోచ్ హాల్ ఆఫ్ ఫాసిల్స్లోను, దానికి దగ్గరలోనే ఉన్న సాంట్ ఓషన్ హాల్లోను థీమ్ పార్టీలు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది. రాత్రంతా ఇక్కడ బస చేయాలంటే, ఒక్కొక్కరు 150 డాలర్లు (సుమారు రూ.12,900) చెల్లించాల్సి ఉంటుంది. పదిమంది లేదా అంతకు మించిన జనాలు బృందాలుగా వెళితే, ఒక్కొక్కరికి 120 డాలర్లు (సుమారు రూ.10.300) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ అవకాశం అన్నిరోజుల్లోనూ ఉండదు. ఈ ఏడాది జూన్ 20, 28 తేదీల్లోను; జూలై 11, 19 తేదీల్లోను; ఆగస్టు 1, 8 తేదీల్లోను మాత్రమే ఇక్కడ బస చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.మేరీలండ్ సైన్స్ సెంటర్అమెరికాలోని మేరీలండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ఉంది ఈ మ్యూజియం. ఏడాదిలో రెండుసార్లు రెండేసి రోజుల చొప్పున రాత్రివేళ బస చేసేందుకు ఈ మ్యూజియం అనుమతిస్తుంది. ఏటా మే, జూన్ నెలల్లో ‘స్టార్వార్స్’ థీమ్ నైట్ పార్టీ నిర్వహిస్తుంది. అలాగే, ‘పైజమా పార్టీ’ నిర్వహిస్తుంది. ఏటా రెండేసి రోజులు సాగే ఈ పార్టీలలో ఐదేళ్లకు పైబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొనవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయవచ్చు. ఈ పార్టీలలో పాల్గొనే పిల్లలకు స్లైమ్, బ్లాక్ బిల్డింగ్ సహా రకరకాల హస్త కళలు, ప్లానెటేరియం షో, ఐమాక్స్ షో కూడా ఉంటాయి. ఇందులో బస చేసేవారు ఒక్కొక్కరు 71 డాలర్లు (రూ.6,104) చెల్లించాల్సి ఉంటుంది.ఇంట్రెపిడ్ మ్యూజియంఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులోని విమానవాహక నౌకలో డిన్నర్ పార్టీలు చేసుకోవడానికి, రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల లోపు వయసు గల పిల్లలు ఆస్వాదించడానికి అనువుగా ఇందులో రకరకరాల వినోద విజ్ఞాన కార్యక్రమాలను రూపొందించారు. ఫ్లాష్లైట్ గైడెడ్ టూర్లు, అపరిమితంగా రకరకాల సిమ్యులేషన్ రైడ్లు ఇందులోని ప్రత్యేక ఆకర్షణలు. బస చేసేవారికి ఇక్కడ అల్పాహారం, చిరుతిళ్లు, భోజనం అన్నీ ఉచితం. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఒక్కొక్కరు 130 డాలర్లు (రూ.11,182), బసతో పాటు పార్టీలు చేసేకునేవారు ఒక్కక్కరు 145 డాలర్లు (రూ.12,472) చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వచ్చేటట్లయితే, ఒక్కొక్కరు 99 డాలర్లు (రూ.8,515) చెల్లించాల్సి ఉంటుంది. ఫీల్డ్ మ్యూజియంఇది అమెరికాలోని షికాగో నగరంలో ఉంది. పురాతన డైనోసార్ల శిలాజాలను భద్రపరచిన ఈ మ్యూజియం రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. భూగ్రహ పరిణామానికి చెందిన అనేక ఆధారాల అవశేషాలను ఈ మ్యూజియంలో భద్రపరచారు. రాత్రివేళ బస చేసే వారికి ఇక్కడ పలు వినోద, విజ్ఞాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఉపన్యాసాలు, వైల్డ్లైఫ్ డిటెక్షన్ పోటీలు, థీమ్డ్ చాలెంజెస్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పిల్లలతో కలసి కుటుంబాలు, పదిహేను మంది లోపు బృందాలు ఇందులో రాత్రి బస చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఇందులో వారు ఎంపిక చేసుకునే ప్యాకేజీలను బట్టి ఒక్కొక్కరు 95–200 డాలర్లు (రూ.8,171–రూ.17,203) వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బస చేసేవారికి అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, మరునాటి ఉదయం మ్యూజియం సందర్శనకు ప్రవేశం పూర్తిగా ఉచితం.యూఎస్ఎస్ హార్నెట్ మ్యూజియంఈ మ్యూజియం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యాలమీడాలో ఉంది. ఇది ఏటా ఒకరోజు ‘హిస్టరీ మిస్టరీ ఓవర్నైట్’ పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమాల సందర్భంగా రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కుటుంబాలు, బృందాలు పాల్గొనవచ్చు. పదహారేళ్ల వయసు పైబడిన వారికోసం ఇందులో అర్ధరాత్రివేళ రెండో ప్రపంచయుద్ధం నాటి విమానవాహక నౌక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మ్యూజియం ప్రతినిధులు సందర్శకులకు దీని విశేషాలను వివరిస్తారు. రాత్రివేళ ఇందులో నిద్రించే అవకాశం కూడా కల్పిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అతీంద్రియ శక్తుల అన్వేషణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏడేళ్ల నుంచి పదహారేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా వినోదాత్మక వైజ్ఞానిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే బృందాలు పదిమంది వరకు ఉంటే వెయ్యి డాలర్లు (సుమారు రూ.86 వేలు), పదిమందికి పైబడి ఇరవైమంది వరకు ఉంటే రెండువేల డాలర్లు (సుమారు రూ.1.72 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.ఓరెగాన్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని పోర్ట్లండ్ నగరంలో ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక అభివృద్ధికి ఎలా దోహదపడిందో వివరించే రకరకాల వస్తువులను ఇందులో భద్రపరచారు. విద్యార్థులు బృందాలుగా వారి ఉపాధ్యాయులతో కలసి ఈ మ్యూజియం సందర్శించడంతో పాటు రాత్రివేళ ఇక్కడే బస చేసేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కో విడతలో యాభైమందికి లోపుగా వచ్చే బృందాలను మాత్రమే అనుమతిస్తారు. మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ఇందులోకి అనుమతి ఉంటుంది. మ్యూజియం సందర్శనకు వచ్చే బృందాలు తమకు అనువైన తేదీలను చెప్పి, ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. బృందంలో ముప్పయి మంది వరకు ఉంటే 3300 డాలర్లు (రూ.2.83 లక్షలు), ముప్పయి మందికి మించి ఉంటే, అదనంగా ఉండేవారు ఒక్కొక్కరికి 90 డాలర్ల (రూ.7,737) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బృందంలోని సభ్యుల సంఖ్య యాభైమందికి మించరాదనే పరిమితి ఉంది. ఇక్కడ బస చేసేవారికి అల్పాహారం, భోజనం ఉచితం. ఆరుబయట నిద్రించేవారికి టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు కూడా ఉచితంగానే అందిస్తారు.మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఉంది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకునే స్కౌట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అనుమతిస్తుంది. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన రకరకాల ఆవిష్కరణలను పొందుపరచిన ఈ మ్యూజియంలో బస చేయడానికి ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో అనుమతి ఉంటుంది. బస కోసం బృందాలుగా వచ్చేవారు ముందుగానే సంప్రదించి, బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముప్పయి మంది వరకు ఉండే బృందాలు 1300 డాలర్లు (రూ.1.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. బృందంలో ముప్పయిమందికి అదనంగా ఉంటే పిల్లలు ఒక్కొక్కరికి 48 డాలర్లు (రూ.4,126), పెద్దలు ఒక్కొక్కరికి 36 డాలర్లు (రూ.3,094) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.ప్లిమత్ ప్యాటక్సెట్ మ్యూజియంఇది అమెరికాలోని బోస్టన్ నగరానికి చేరువలో ఉంది. ఇంగ్లండ్లోని పదిహేడో శతాబ్దినాటి జనజీవనానికి అద్దంపట్టే వస్తువులను భద్రపరచే ఈ మ్యూజయంలో అప్పటి కాలంలో మాదిరిగానే గడపడానికి వీలుగా వసతులు ఉన్నాయి. ఇందులో రాత్రి బస చేయడానికి స్కౌట్స్కు, పాఠశాలల విద్యార్థి బృందాలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియంలో హిస్టారిక్ ప్యాటక్సెట్ హోమ్సైట్, ప్లిమత్ కాలనీ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఇరవైమందికి పైబడిన బృందాలు ఇక్కడ బస చేయవచ్చు. ఇందులోని ఒకే విభాగంలో గడపాలనుకునే బృందాల్లో కనీసం ఇరవైమంది ఉండాలి. నలభై మందికి పైగా ఉండే బృందాలకు రెండు విభాగాల్లోనూ గడిపేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో బసకు ఒక్కొక్కరు 81 డాలర్లు (రూ.6,963) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో బస చేసేవారికి అల్పాహారం, భోజనం, ఇతర వసతులు పూర్తిగా ఉచితం.నేచురల్ హిస్టరీ మ్యూజియంరాత్రి బసకు వీలు కల్పించే మ్యూజియంలు ఎక్కువసంఖ్యలో అమెరికాలో ఉంటే, ఇది యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్లో ఉంది. డైనోసార్ల శిలాజాలు సహా ప్రకృతి పరిణామాలకు, చరిత్రకు సంబంధించిన పలు వస్తువులను భద్రపరచిన ఈ మ్యూజియం విద్యార్థులకు రాత్రి బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియం పిల్లల కోసం ప్రత్యేకంగా ‘డైనోస్నోర్స్’ అనే ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఏడేళ్ల నుంచి పదకొండేళ్ల లోపు వయసుగల విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో కలసి ఇక్కడ రాత్రి బస చేయవచ్చు. రాత్రి బస చేసే విద్యార్థులకు ఈ మ్యూజియంలో పలు వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో బస చేయడానికి పిల్లలు ఒక్కొక్కరికి 114 డాలర్లు (రూ.9,800), పెద్దలు ఒక్కొక్కరికి 197 డాలర్లు (రూ.16,935) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ఈ ఏడాది జూన్ 13, జూలై 4, జూలై 18, ఆగస్టు 1, ఆగస్టు 22, సెప్టెంబర్ 30 తేదీల్లో ఈ అవకాశం కల్పిస్తోంది.స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీఈ మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. రాత్రి ఇక్కడ బస చేసేవారు ఇందులోని డేవిడ్ కోచ్ హాల్ ఆఫ్ ఫాసిల్స్లోను, దానికి దగ్గరలోనే ఉన్న సాంట్ ఓషన్ హాల్లోను థీమ్ పార్టీలు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది. రాత్రంతా ఇక్కడ బస చేయాలంటే, ఒక్కొక్కరు 150 డాలర్లు (సుమారు రూ.12,900) చెల్లించాల్సి ఉంటుంది. పదిమంది లేదా అంతకు మించిన జనాలు బృందాలుగా వెళితే, ఒక్కొక్కరికి 120 డాలర్లు (సుమారు రూ.10.300) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ అవకాశం అన్నిరోజుల్లోనూ ఉండదు. ఈ ఏడాది జూన్ 20, 28 తేదీల్లోను; జూలై 11, 19 తేదీల్లోను; ఆగస్టు 1, 8 తేదీల్లోను మాత్రమే ఇక్కడ బస చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.మేరీలండ్ సైన్స్ సెంటర్అమెరికాలోని మేరీలండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ఉంది ఈ మ్యూజియం. ఏడాదిలో రెండుసార్లు రెండేసి రోజుల చొప్పున రాత్రివేళ బస చేసేందుకు ఈ మ్యూజియం అనుమతిస్తుంది. ఏటా మే, జూన్ నెలల్లో ‘స్టార్వార్స్’ థీమ్ నైట్ పార్టీ నిర్వహిస్తుంది. అలాగే, ‘పైజమా పార్టీ’ నిర్వహిస్తుంది. ఏటా రెండేసి రోజులు సాగే ఈ పార్టీలలో ఐదేళ్లకు పైబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొనవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయవచ్చు. ఈ పార్టీలలో పాల్గొనే పిల్లలకు స్లైమ్, బ్లాక్ బిల్డింగ్ సహా రకరకాల హస్త కళలు, ప్లానెటేరియం షో, ఐమాక్స్ షో కూడా ఉంటాయి. ఇందులో బస చేసేవారు ఒక్కొక్కరు 71 డాలర్లు (రూ.6,104) చెల్లించాల్సి ఉంటుంది.ఇంట్రెపిడ్ మ్యూజియంఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులోని విమానవాహక నౌకలో డిన్నర్ పార్టీలు చేసుకోవడానికి, రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల లోపు వయసు గల పిల్లలు ఆస్వాదించడానికి అనువుగా ఇందులో రకరకరాల వినోద విజ్ఞాన కార్యక్రమాలను రూపొందించారు. ఫ్లాష్లైట్ గైడెడ్ టూర్లు, అపరిమితంగా రకరకాల సిమ్యులేషన్ రైడ్లు ఇందులోని ప్రత్యేక ఆకర్షణలు. బస చేసేవారికి ఇక్కడ అల్పాహారం, చిరుతిళ్లు, భోజనం అన్నీ ఉచితం. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఒక్కొక్కరు 130 డాలర్లు (రూ.11,182), బసతో పాటు పార్టీలు చేసేకునేవారు ఒక్కక్కరు 145 డాలర్లు (రూ.12,472) చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వచ్చేటట్లయితే, ఒక్కొక్కరు 99 డాలర్లు (రూ.8,515) చెల్లించాల్సి ఉంటుంది. ఫీల్డ్ మ్యూజియంఇది అమెరికాలోని షికాగో నగరంలో ఉంది. పురాతన డైనోసార్ల శిలాజాలను భద్రపరచిన ఈ మ్యూజియం రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. భూగ్రహ పరిణామానికి చెందిన అనేక ఆధారాల అవశేషాలను ఈ మ్యూజియంలో భద్రపరచారు. రాత్రివేళ బస చేసే వారికి ఇక్కడ పలు వినోద, విజ్ఞాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఉపన్యాసాలు, వైల్డ్లైఫ్ డిటెక్షన్ పోటీలు, థీమ్డ్ చాలెంజెస్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పిల్లలతో కలసి కుటుంబాలు, పదిహేను మంది లోపు బృందాలు ఇందులో రాత్రి బస చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఇందులో వారు ఎంపిక చేసుకునే ప్యాకేజీలను బట్టి ఒక్కొక్కరు 95–200 డాలర్లు (రూ.8,171–రూ.17,203) వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బస చేసేవారికి అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, మరునాటి ఉదయం మ్యూజియం సందర్శనకు ప్రవేశం పూర్తిగా ఉచితం.యూఎస్ఎస్ హార్నెట్ మ్యూజియంఈ మ్యూజియం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యాలమీడాలో ఉంది. ఇది ఏటా ఒకరోజు ‘హిస్టరీ మిస్టరీ ఓవర్నైట్’ పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమాల సందర్భంగా రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కుటుంబాలు, బృందాలు పాల్గొనవచ్చు. పదహారేళ్ల వయసు పైబడిన వారికోసం ఇందులో అర్ధరాత్రివేళ రెండో ప్రపంచయుద్ధం నాటి విమానవాహక నౌక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మ్యూజియం ప్రతినిధులు సందర్శకులకు దీని విశేషాలను వివరిస్తారు. రాత్రివేళ ఇందులో నిద్రించే అవకాశం కూడా కల్పిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అతీంద్రియ శక్తుల అన్వేషణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏడేళ్ల నుంచి పదహారేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా వినోదాత్మక వైజ్ఞానిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే బృందాలు పదిమంది వరకు ఉంటే వెయ్యి డాలర్లు (సుమారు రూ.86 వేలు), పదిమందికి పైబడి ఇరవైమంది వరకు ఉంటే రెండువేల డాలర్లు (సుమారు రూ.1.72 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.ఓరెగాన్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని పోర్ట్లండ్ నగరంలో ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక అభివృద్ధికి ఎలా దోహదపడిందో వివరించే రకరకాల వస్తువులను ఇందులో భద్రపరచారు. విద్యార్థులు బృందాలుగా వారి ఉపాధ్యాయులతో కలసి ఈ మ్యూజియం సందర్శించడంతో పాటు రాత్రివేళ ఇక్కడే బస చేసేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కో విడతలో యాభైమందికి లోపుగా వచ్చే బృందాలను మాత్రమే అనుమతిస్తారు. మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ఇందులోకి అనుమతి ఉంటుంది. మ్యూజియం సందర్శనకు వచ్చే బృందాలు తమకు అనువైన తేదీలను చెప్పి, ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. బృందంలో ముప్పయి మంది వరకు ఉంటే 3300 డాలర్లు (రూ.2.83 లక్షలు), ముప్పయి మందికి మించి ఉంటే, అదనంగా ఉండేవారు ఒక్కొక్కరికి 90 డాలర్ల (రూ.7,737) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బృందంలోని సభ్యుల సంఖ్య యాభైమందికి మించరాదనే పరిమితి ఉంది. ఇక్కడ బస చేసేవారికి అల్పాహారం, భోజనం ఉచితం. ఆరుబయట నిద్రించేవారికి టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు కూడా ఉచితంగానే అందిస్తారు.మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఉంది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకునే స్కౌట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అనుమతిస్తుంది. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన రకరకాల ఆవిష్కరణలను పొందుపరచిన ఈ మ్యూజియంలో బస చేయడానికి ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో అనుమతి ఉంటుంది. బస కోసం బృందాలుగా వచ్చేవారు ముందుగానే సంప్రదించి, బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముప్పయి మంది వరకు ఉండే బృందాలు 1300 డాలర్లు (రూ.1.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. బృందంలో ముప్పయిమందికి అదనంగా ఉంటే పిల్లలు ఒక్కొక్కరికి 48 డాలర్లు (రూ.4,126), పెద్దలు ఒక్కొక్కరికి 36 డాలర్లు (రూ.3,094) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.ప్లిమత్ ప్యాటక్సెట్ మ్యూజియంఇది అమెరికాలోని బోస్టన్ నగరానికి చేరువలో ఉంది. ఇంగ్లండ్లోని పదిహేడో శతాబ్దినాటి జనజీవనానికి అద్దంపట్టే వస్తువులను భద్రపరచే ఈ మ్యూజయంలో అప్పటి కాలంలో మాదిరిగానే గడపడానికి వీలుగా వసతులు ఉన్నాయి. ఇందులో రాత్రి బస చేయడానికి స్కౌట్స్కు, పాఠశాలల విద్యార్థి బృందాలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియంలో హిస్టారిక్ ప్యాటక్సెట్ హోమ్సైట్, ప్లిమత్ కాలనీ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఇరవైమందికి పైబడిన బృందాలు ఇక్కడ బస చేయవచ్చు. ఇందులోని ఒకే విభాగంలో గడపాలనుకునే బృందాల్లో కనీసం ఇరవైమంది ఉండాలి. నలభై మందికి పైగా ఉండే బృందాలకు రెండు విభాగాల్లోనూ గడిపేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో బసకు ఒక్కొక్కరు 81 డాలర్లు (రూ.6,963) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో బస చేసేవారికి అల్పాహారం, భోజనం, ఇతర వసతులు పూర్తిగా ఉచితం.నేచురల్ హిస్టరీ మ్యూజియంరాత్రి బసకు వీలు కల్పించే మ్యూజియంలు ఎక్కువసంఖ్యలో అమెరికాలో ఉంటే, ఇది యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్లో ఉంది. డైనోసార్ల శిలాజాలు సహా ప్రకృతి పరిణామాలకు, చరిత్రకు సంబంధించిన పలు వస్తువులను భద్రపరచిన ఈ మ్యూజియం విద్యార్థులకు రాత్రి బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియం పిల్లల కోసం ప్రత్యేకంగా ‘డైనోస్నోర్స్’ అనే ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఏడేళ్ల నుంచి పదకొండేళ్ల లోపు వయసుగల విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో కలసి ఇక్కడ రాత్రి బస చేయవచ్చు. రాత్రి బస చేసే విద్యార్థులకు ఈ మ్యూజియంలో పలు వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో బస చేయడానికి పిల్లలు ఒక్కొక్కరికి 114 డాలర్లు (రూ.9,800), పెద్దలు ఒక్కొక్కరికి 197 డాలర్లు (రూ.16,935) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ఈ ఏడాది జూన్ 13, జూలై 4, జూలై 18, ఆగస్టు 1, ఆగస్టు 22, సెప్టెంబర్ 30 తేదీల్లో ఈ అవకాశం కల్పిస్తోంది. -
ఈ వారం కథ: టైగర్
మంచం మీద అసహనంగా కదులుతున్నాడు నిమ్మయ్. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రావటం లేదు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యాపారి మనసులో మెదులుతున్నాడు. ఓ పెద్ద రాజకీయ నేతను ఎదిరించి ధైర్యంగా అతను మాట్లాడటం నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంకెవరయినా ఈ విషయం చెబితే నమ్మేవాడు కాదేమో, కాని తన కళ్ల ముందు జరిగిన సంఘటనను ఎలా కాదనగలడు? ఆ నిమిషంలో తన ఆఫీసు గుర్తొచ్చింది. తను రోజూ గాడిద చాకిరీ చేసినా స్పెషల్ సెక్రటరీ తనను అవమానకరంగా ఏదో ఒక మాట అంటుంటాడు. ఆ రోజు కూడా తన మహిళా పీఏ ఎదుట తనను అతను తిడుతుంటే, ఆమె చిరునవ్వులు చిందిçస్తుండటం చూసి తలకొట్టేసినట్టయ్యింది. ‘అసలు ఆ అధికారిగాడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? వెధవ హైడ్రా మొహం వాడూనూ– ఉదయం 11 గంటలకు తాపీగా ఆఫీసుకొచ్చి కాఫీలు, టీలు, సిగరెట్లతో మధ్యాహ్నం 1 వరకూ కాలక్షేపం చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి తగలడి మళ్లీ 3 గంటలకు ఆఫీసు మొహం చూస్తాడు. సాయంత్రం 5 గంటలకు స్టెనోని పిలిచి డిక్టేషన్ మొదలుపెడతాడు. సరిగ్గా ఆ సమయానికే నిమ్మయ్ని పిలిచి ఏదో ఒక సాకుతో తిట్టటం మొదలుపెడతాడు’ ఆలోచించసాగాడు నిమ్మయ్. ఆ అధికారి ఆఫీసులో మరెవరినీ ఇలా తిట్టటం లేదన్న విషయం నిమ్మయ్ దృష్టికి వచ్చింది. ‘నువ్వెలా పరీక్ష రాసి ఈ ఉద్యోగానికి ఎంపికయ్యావో నేను కూడా పోటీ పరీక్షలు రాసి ఈ ఉద్యోగానికి వచ్చాను. నన్ను తిట్టటానికి నీకేం అధికారం ఉందని నిలదీయాలని అనిపించేది. కాని, భార్యా పిల్లలు, ఊళ్లో మంచం పట్టిన నాన్న కళ్ల ముందు మెదిలేవారు. దాంతో ఆ తిట్లన్నింటినీ మౌనంగా భరించడం అలవాటయ్యింది. కాని ఎంత చిత్రం! ఓ మామూలు కూరగాయల వ్యాపారి తనలా కాదు. నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థి కృపాసాగర్ పట్నాయక్పైన తిరగబడ్డాడు. ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోయాడు తప్ప వ్యాపారిని ఏమనలేదు. బహుశా ఈ కూరగాయలతని దగ్గర ఏవో శక్తులు ఉండొచ్చు. అదేమిటో తెలుసుకుంటే తనకు కూడా ఉపయోగపడతాయన్న ఆలోచన వచ్చింది. ‘ఇప్పుడు బాగా పొద్దు పోయింది.రేప్పొద్దున వెళ్లి ఆ రహస్యం తెలుసుకోవాలి’ అనుకున్నాడు. దాంతో ప్రశాంతంగా నిద్రపట్టింది.మరుసటి రోజు దినచర్య పూర్తి చేసి, కాయగూరల బ్యాగు డిక్కీలో పెట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చాడు నిమ్మయ్. కాలనీ మార్కెట్లో అతను కూరగాయలు అమ్ముతున్నాడు. తలచుట్టూ తువ్వాలు చుట్టుకుని ఉన్నాడు. ఎదురుగా తట్టల్లో రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఎవరి కోసమో బంగాళదుంపలు త్రాసులో తూస్తున్నాడు. పక్కకు చూడనయినా చూడకుండా, ‘అలా బెండకాయల చివర్లని విరవకండి. అలా చేస్తూపోతే సరుకు అమ్ముడుపోవటం కష్టం’ గట్టిగా అరిచి చెప్పాడు. బహుశా ఇతనికి ఒళ్లంతా కళ్లు ఉన్నాయేమో అని మనసులో అనుకుని బెండకాయల మీద నుంచి చేతులు వెనక్కి తీశాడు నిమ్మయ్. గబగబా ప్లాస్టిక్ బుట్టలో కొన్ని బెండకాయలు వేసి అతని చేతికిచ్చాడు.‘ఎంత కావాలి?’‘పావు కేజీ’ నిమ్మయ్ చెప్పాడు.అతను వాటిని తూచి బుట్ట అందించాడు. పర్సులోంచి డబ్బులు తీసి అతని చేతికందిస్తూ కాస్తంత దగ్గరగా జరిగాడు నిమ్మయ్. ‘మీ దగ్గర ఏదో మంత్రం ఉంది’ అన్నాడు నర్మగర్భంగా. ‘అలాంటిదేమీ లేదు’ తేలిగ్గా నవ్వేస్తూ చెప్పాడు ఆ వృద్ధుడు. ‘అయితే నీ ఒంటి మీద ఏదైనా ఉంగరమో, తాయెత్తో, లేకపోతే మంత్రించిన నెక్లెస్సో ఏదో ఒకటి ఉండి తీరాలి’ అన్నాడు.‘సార్! అలాంటివేవీ లేవు. ఏదో కూరగాయలు అమ్ముకునేవాడిని.’‘ఇవేం లేకపోతే కృపాసాగర్ని ఎలా ఎదిరించగలవు? ఆయన మామూలు వాడా? వందలాది అనుచరులున్న పెద్ద రాజకీయ పార్టీ నేత. అలాంటి వాడిని ఎదిరించేవంటే, నీ దగ్గర ప్రత్యేకమైనది ఏదో ఉండి ఉండాలి. లేకపోతే ఈ పాటికి నిన్ను అతను శవంగా మార్చి ఉండేవాడు’ అన్నాడు.అంతలోనే ఆఫీసు వాతావరణం గుర్తొచ్చి, ‘నేను పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. నువ్వే నన్ను కాపాడాలి’ అన్నాడు దీనంగా.దాంతో ఆ కూరగాయల వ్యాపారి రామేశ్వర్ సింగ్ చలించిపోయాడు. ‘నిన్ను చూస్తే 30, 35 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నావు. నీకు నాలాంటి వృద్ధుడు ఏం సాయం చేయగలడు. నువ్వేదో కష్టాల్లో ఉన్నావన్న విషయం మాత్రం అర్థమైంది. అదేంటో చెప్పు?’ అనడిగాడు.నిమ్మయ్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆఫీసులో బాస్ వేధింపుల గురించి వివరించాడు. అంతా విన్న తర్వాత, ‘సాయంత్రం మా ఇంటికి రా! ఆ ఫ్లాట్ వెనకాల మామిడి చెట్టు పక్కనున్న ఇంట్లో ఉంటా. ఈ లోపుగా నేను నీకు ఏదైనా పరిష్కారం ఆలోచించి ఉంచుతా’ హామీ ఇచ్చాడు రామేశ్వర్. నిమ్మయ్కి ఏదో బరువు దించుకుంటున్నట్టుగా అనిపించింది. కచ్చితంగా రామేశ్వర్ ఏదో మంత్రదండం ఇస్తాడు. దానితో స్పెషల్ సెక్రటరీకి తను గుణపాఠం చెబుతాడు. ‘నీ పని నువ్వు చేసుకో’ అని ఆయన మొహం మీదనే తను అంటే ఆయన మొహం ఎలా మాడిపోతుందో ఊహిస్తే గమ్మత్తుగా అనిపించింది.నిమ్మయ్ రౌత్ మనసారా నవ్వాడు చాలారోజుల తర్వాత. బ్యాగును ఊపుకుంటూ స్కూటర్ దగ్గరకు నడిచాడు. ఆ తర్వాత ఆఫీసుకు వెళుతుంటే రోడ్డుకిరువైపులా ఉన్న ప్రపంచం అంతా కొత్తగా కనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు రాగానే ఎర్రలైటు వెలిగింది. దానితో తలమీద ఉన్న హెల్మెట్ను తీసి ఆకాశం వైపు తలెత్తి చూశాడు. పక్షులు రివ్వున ఎగురుతూ కనిపించాయి. ‘రేపటి నుంచి నేను కూడా మీలాగే స్వేచ్ఛగా విహరిస్తాను. రెక్కలు లేకపోయినా’ అని మనసులో అనుకున్నాడు.సెక్రటేరియట్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. సిగ్నల్ లైటు ఎరుపు నుంచి ఆకుపచ్చకు మారి ట్రాఫిక్ కదులుతూండగా, స్పెషల్ సెక్రటరీ కారు పక్కనుంచి సాగిపోయింది. అందులో వెనక సీట్లో కూర్చున్న జీనా సాహెబ్ను చూడగానే అతనిలో ఉత్సాహం నీరుగారిపోయింది.సాయంత్రం 4 గంటలకు జీనా సాహెబ్ నుంచి పిలుపు వచ్చింది. ‘ఎలక్షన్ రోజులు దగ్గర పడుతున్నాయి. మన ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్లు ఎందరికి అందాయో వాటి వివరాలు నాకు కావాలి’ అన్నాడు. ఓ నిమిషం ఆగి మళ్లీ అన్నాడు. ‘పదిహేను రోజుల క్రితం ఈ పని పూర్తి చేయమని నీకు చెప్పాను. ఇంత వరకూ ఎందుకు పూర్తి చేయలేదు?’ నిలదీశాడు. నిమ్మయ్ మౌనంగా నిలబడ్డాడు.‘నీ మొహం చూపించటానికి ఇక్కడకు వచ్చావా?’ గట్టిగా అరిచాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్ నోరు మెదపలేదు. ‘ఎక్కడ చదువుకుని వచ్చి తగలబడ్డావ్?’నిమ్మయ్ జవాబు చెప్పలేదు. ‘నీలాంటి పనికిమాలిన వెధవలంతా ప్రభుత్వం పరువు తీస్తున్నారు. మా ఖర్మ’నిమ్మయ్లో దుఃఖం తన్నుకొచ్చింది.‘గెటవుట్’ సెక్రటరీ ఉరుము ఉరిమినట్టుగా అన్నాడు. ‘రేపు ఉదయం 11 గంటలకల్లా ఈ వివరాలు నా ముందు ఉండాలి. అర్థం అయ్యిందా ఈడియట్..’నిమ్మయ్ కాళ్లు వణికాయి. స్పెషల్ సెక్రటరీ చాంబర్ నుంచి నిస్సత్తువగా బయటకు వచ్చాడు. తలుపు దగ్గర పీటమీద కూర్చుని కనిపించాడు ప్యూన్. అతనికి కన్నీళ్లు కనిపించకుండా వాటిని దాచుకుంటూ మెల్లగా వాష్రూంలోకి అడుగుపెట్టాడు. అద్దంలో తన ముఖం ఓడిపోయిన వ్యక్తిలా వాడిపోయి కనిపించింది. గట్టిగా రెండుసార్లు శ్వాస విడిచి వదిలాడు. సెక్రటరీ మాటలు గుర్తొచ్చాయి. నిజానికి ఆ పని అప్పగించింది తనకు కాదు. ఆ పని చేయవలసింది బలరాంబాబు. అది తెలిసి చెప్పలేని తన బలహీనతను తిట్టుకున్నాడు. నిమ్మయ్ తన సీటు దగ్గరకు వచ్చాడు. ఈవెంట్ మేనేజర్ ఎవరో తన డిపార్టుమెంట్కు వచ్చాడు.అందరికీ వడ, సమోసా, టీ సిద్ధం చేసి ఉంచాడు.తనను ఎవరో పిలిచారు. ‘వడ తీసుకోండి’ అన్నారు. ‘నాకు తినాలని లేదు’ నిమ్మయ్ బలహీనంగా చెప్పాడు. ‘అవునవును. ఇప్పుడే జీనా చాంబర్కి వెళ్లొచ్చాడు. ఆయన కడుపు నిండా పెట్టుంటాడు. ఇక మిగతావి ఏం తినగలడు’ అని ఎవరో వేళాకోళమాడితే మిగతావాళ్లంతా ఫక్కుమని నవ్వారు. ఇక అక్కడ ఉండలేక బయటకొచ్చేశాడు. ‘నీ కోసం నేను ప్రత్యేకంగా ఒకటి సిద్ధం చేశాను. నీకు కావలసినన్ని రోజులు దాన్ని ఉంచుకోవచ్చు’ అన్నాడు రామేశ్వర్ తన ఇంటికి వచ్చిన నిమ్మయ్ని చూడగానే. ‘కానీ నీ పనయిన తర్వాత మాత్రం నువ్వు దాన్ని తిరిగి ఇవ్వాలి’‘అలాగే తప్పకుండా’ అన్నాడు నిమ్మయ్.‘ఇది మా నాన్న ఆస్తి. తను నమ్ముకున్న ఆస్తి’‘నాన్నా! ఆయన ఎక్కడున్నారు?’ గబుక్కున అడిగాడు నిమ్మయ్. అంతలోనే తను ఎంత పిచ్చి ప్రశ్న వేశాడో అర్థమైంది. ఓ 70, 75 ఏళ్ల వ్యక్తి తండ్రి జీవించి ఉండే అవకాశం ఉంటుందా?’అంతలోనే అతని భార్య టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. అప్పుడు నిమ్మయ్ గది అంతా పరికించి చూశాడు. రెండు గదుల ఇల్లు. ఒక ఇంట్లో ఉన్న ఔట్ హౌస్ అది. ‘ఇంతకీ ఆ వస్తువు ఎక్కడ?’ ఎప్పుడెప్పుడు దాన్ని తీసికెళదామా అన్న ఆత్రంగా ఉంది. ‘ఒక్క నిముషం. ఆ మనిషికి కబురుపెట్టాను, ఈపాటికి వస్తూండాలి’ అన్నాడు రామేశ్వర్. ‘మీరు ఎంత ఇవ్వమన్నా అంత ఇస్తాను. నా జీవితకాలంలో మీరు చెల్లించమన్న మొత్తం చెల్లించేస్తా’. ‘అదేం అవసరం లేదు. మీ పని అయ్యాక నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. టైగర్ మంత్రంతో అది తయారయ్యింది. ఆ విషయం ఎవరితోనూ పంచుకోవద్దు’ హెచ్చరించాడు రామేశ్వర్. ‘అయితే ఒక్క విషయం. మీరు దాన్ని దుర్వినియోగం చేస్తే అది ప్రతికూలతలకు దారి తీస్తుంది’‘టైగరా?’ ఆశ్చర్యానికి లోనయ్యాడు నిమ్మయ్.‘అవును. టైగరే!’ అంతలో ఎవరో బయట నుంచి పిలిచారు. రామేశ్వర్ బయటకు వెళ్లి ఓ పాలిథీన్ బ్యాగ్తో లోపలకు వచ్చాడు. ‘ఈ బ్యాగును ఇంటికి తీసికెళ్లు. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆఫీసుకు వెళ్లేటప్పుడు వేసుకో. మార్పు నీకే అర్థం అవుతుంది’మళ్లీ చెబుతున్నాను. ఇందులో ఓ మనిషి గాని, మంత్రంగాని, తంత్రంగాని ఏవీ లేవు. ఇదంతా నడిపేది ఓ టైగర్ మాత్రమే’ అని ఇంకోసారి చెప్పాడు. ఇంటికి వెళుతూ టైగర్.. టైగర్.. టైగర్ అని మనసులో అనుకోసాగాడు.మరుసటి రోజు ఆఫీసుకు వెళుతుండగా, దారిలో ఓ గుంపు కనపడింది. ట్రాఫిక్ పోలీసు ఎవరో సైక్లిస్టు చొక్కా కాలర్ పట్టుకుని బూతులు తిడుతున్నాడు. కొట్టటానికి సిద్ధం అవుతున్నాడు.‘దయచేసి నన్ను వదిలేయండి. రెడ్ సిగ్నల్ చూసుకోలేదు’ ఆ సైకిలు కుర్రాడు బతిమాలుతున్నాడు.‘కళ్లు పోయాయా?’ కానిస్టేబుల్ అరిచాడు.అది చూస్తూ ఊరుకోలేకపోయాడు నిమ్మయ్. ‘ఎందుకు అంత గట్టిగా అరుస్తారు. చూసుకోలేదని చెబుతున్నాడు కదా, వదిలెయ్యండి. కావాలంటే అతనికి జరిమానా వేయండి’ స్కూటర్ మీద కూర్చునే గద్దించినట్టుగా అన్నాడు.పక్కన ఉన్న నలుగురైదుగురు నిమ్మయ్కి మద్దతిచ్చారు. దాంతో కానిస్టేబుల్ ఆ కుర్రాడిని వదిలేశాడు.హఠాత్తుగా నిమ్మయ్కి ఓ విషయం అర్థమైంది. తను కోపాన్ని ప్రదర్శించగలిగాడు. తనలో మార్పు వచ్చింది. రామేశ్వర్ తనకిచ్చిన జాకెట్ను చూసుకున్నాడు. ఖాదీ, గోధుమరంగు, కింద కొంచెం ఎర్రగా ఉంది. అది రక్తమా? లేకపోతే పెయింటా? అనేది నిమ్మయ్కి అర్థం కాలేదు.అతను ఆఫీసుకు వెళ్లేసరికి 10.30 అయ్యింది. తన విభాగంలో ఉన్న సీనియర్ క్లర్క్ ప్రతిమా మొహంతి ఎవరినో గట్టిగా తిడుతోంది. ఆ వ్యక్తి ఏదో చెప్పాలని ప్రయత్నించినా ఆమె వినటం లేదు. ఆమె మొహం తను రోజు చూసే జీనా సాహెబ్లాగా ఉంది. ‘మేడమ్’ గట్టిగా పిలిచాడు నిమ్మయ్. కుర్చీని వెనక్కి లాక్కుని కూర్చుంటూ ‘మనకు జీతం ఇచ్చేది సామాన్యులకు సేవలందించటానికే తప్ప వాళ్లను తిట్టటానికి కాదు’ అన్నాడు.ఆ మాటలకు ప్రతిమా మొహంతి మొహం మాడిపోయింది. తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని కూర్చోమని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి నిమ్మయ్ వంక కృతజ్ఞతగా చూశాడు. మధ్యాహ్నం టీ తాగుతున్నప్పుడు సెక్షన్ ఆఫీసరు పలకరించాడు.‘నిమ్మయ్.. కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వు వేసుకున్న జాకెట్ నీ ఒంటికి అతికినట్టు సరిపోయింది. ఎక్కడ తీసుకున్నావ్?’‘టైగర్’ అని చెప్పబోయి గబుక్కున ఊరుకున్నాడు. ‘సర్! వ్యక్తిగత విషయాలు ఆఫీసులో అవసరమా?’ అని గట్టిగా అన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నిమ్మయ్ ఇలా మాట్లాడటం అతను చూడలేదు.మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో నిమ్మయ్కి చీఫ్ సెక్రటరీ నుంచి పిలుపొచ్చింది. నిమ్మయ్ జాకెట్ను నెమ్మదిగా స్పృశించాడు. ఒక చేత్తో పాడ్, పెన్ను, రెండో చేత్తో జాకెట్ను పట్టుకుని తలుపు నెట్టుకుంటూ లోపలకు అడుగుపెట్టాడు.నిమ్మయ్ని చూడగానే స్పెషల్ సెక్రటరీ గట్టిగా కేకలు ప్రారంభించాడు. ‘పొద్దున 11 గంటలకల్లా లబ్ధిదారుల జాబితా ఇవ్వమని అడిగాను కదా? ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడ?’‘మీరు ఆ పనిని అప్పగించింది నాకు కాదు’ నిమ్మయ్ కూల్గా అన్నాడు. బలరాం నాయక్.. అతన్ని పిలిచి మాట్లాడితే మీకు సరైన సమాధానం లభిస్తుంది’‘నాకే ఎదురు సమాధానం చెబుతావా? ఈడియట్’నిమ్మయ్ అంతరంగంలో పులి నిద్ర లేచింది. ‘నాకు అదేం తెలియదు. ముందు ఆ ఫైల్ పట్టుకొచ్చి చావు’ గద్దింపుగా అన్నాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్ ఇక నిగ్రహించుకోలేకపోయాడు. స్పెషల్ సెక్రటరీ ఎదురుగా ఉన్న కుర్చీల్లో ఒకదాన్ని వెనక్కి లాక్కుని దర్జాగా కూర్చున్నాడు. ఆ తర్వాత స్వరాన్ని పెంచి స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ ‘మీరు కావాలనే నన్ను అవమానిస్తున్నారు. మీకు అలా మాట్లాడే హక్కులేదు’ అన్నాడు సూటిగా. దాంతో కోపంతో ఊగిపోయాడు స్పెషల్ సెక్రటరీ. ‘ఒక సాధారణ క్లర్క్ నన్ను సవాల్ చేస్తాడా? వీడికి బుద్ధి చెప్పాలి’ అనుకున్నాడు. ‘ఇంటికి పోయి నీ పెళ్లాం ముందు ఈ ఫోజులు కొట్టు.నా దగ్గర కాదు’ఆ మాటలకు నిమ్మయ్ లొంగలేదు సరికదా, ‘మీరు మాట్లాడేది చాలా దురుసుగా ఉంది’ అని ఓ నిముషం ఆగి, ‘నా భార్య దగ్గర ప్రదర్శించటానికి కొత్తగా నా దగ్గర ఏదీ లేదు. మీ ఇంట్లోలా నా భార్య నన్ను వదిలి వెళ్లలేదు. భగవంతుడి దయవల్ల మేం ఇద్దరం సుఖంగా జీవిస్తున్నాం’ అన్నాడు. ‘మీ విడాకుల కేసు విచారణ సందర్భంగా మీ అబ్బాయిని మీతో కలిసి జీవించాలని అడిగారు. దానికి వాడు మీ కొడుకేనని నమ్మకం ఏమిటని మీ ఆవిడ మిమ్మల్ని నిలదీశారు. అదృష్టవశాత్తు నా జీవితంలో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి లేదు’ అని కూడా అన్నాడు.దీనితో జీనా సాహెబ్ హతాశుడయ్యాడు. అతనికి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది. కోపం, బాధ ఒకేసారి అతనిపై దాడిచేశాయి. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. అదీ ఆపకుండా. ఒక అంబులెన్స్ ప్రాంగణలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అక్కడ ఏర్పడింది.దాంతో గది బయట నిలబడిన ప్యూన్ ఒక్క అంగలో లోపలకొచ్చాడు. నిమ్మయ్ని బయటకు పంపమని సైగ చేసి చెప్పాడు జీనా సాహెబ్. ప్యూన్ నిమ్మయ్ చేతిని పట్టుకుని వెళ్లమని మెల్లగా బతిమాలాడు. ఆ చేతుల్ని విదుల్చుకుని స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ అన్నాడు నిమ్మయ్. ‘నీలాంటి ఆఫీసర్లు ఎందుకూ కొరగారు. అందరూ తాడిచెట్లలాంటి వాళ్లు. ఇతరులకు ఫలాలు ఇవ్వరు లేదా కోరుకున్నట్టుగా చెట్టు నీడా దొరకదు’ అని, కాసేపు ఆగి, ‘ఇతరులను గౌరవించటం నేర్చుకో. అప్పుడు కూడా నీకు గౌరవం లభిస్తుంది. మన దేశంలో రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. దాని ద్వారా అందే హక్కులకు సుప్రీం కోర్టు నుంచి రక్షణ లభిస్తుంది. ఆ సంగతి మరిచిపోకు’ పులిలా గర్జిస్తూ జీనా సాహెబ్ చాంబర్ నుంచి బయటపడ్డాడు నిమ్మయ్. ఎన్నో సంవత్సరాల నుంచి దిగమింగుకుంటున్న కోపం, అసహనం ఆ నిమిషంలో ఆవిరైపోయి, శరీరం బాగా తేలికగా అనిపించింది. మళ్లీ తన సీటు దగ్గరకు వెళ్లి యథావిధిగా పనిలో లీనమయ్యాడు.ఆ రోజు సాయంత్రం ఆఫీసు ముగిసే సమయానికి ఓ వార్త దావానలంలా సెక్రటేరియట్ అంతా వ్యాపించింది.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటులో పనిచేసే క్లర్క్ నిమ్మయ్ రౌత్ స్పెషల్ సెక్రటరీకి మాటకి మాట సమాధానం చెబితే ఆయన వారం రోజులు సెలవు మీద వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని అందరూ విచిత్రంగా చెప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఆఫీసు మొత్తానికి హీరో అయిపోయాడు. ప్యూన్ నుంచి ఆఫీసర్ల వరకూ అందరూ అతన్ని గౌరవించటం మొదలుపెట్టారు. ఏదయినా పని మీద వేరే డిపార్టుమెంటులోకి అడుగుపెడితే వాళ్లంతా లేచి నిలబడి స్వాగతం చెప్పటం మొదలుపెట్టారు.ఇదంతా రామేశ్వర్ అందించిన టైగర్ జాకెట్ మహిమ అని గుర్తించాడు నిమ్మయ్. వారం రోజుల తర్వాత సెలవు నుంచి తిరిగొచ్చిన స్పెషల్ సెక్రటరీ నిమ్మయ్ని పిలిపించాడు. తన దురుసు ప్రవర్తనకు క్షమాపణలు కోరటమే కాదు. బీపీ కారణంగా తను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయేవాడినని, నిమ్మయ్ ఇదంతా మరచిపోవాలని ప్రాధేయపడ్డాడు.బయట, మార్కెట్లో కూడా నిమ్మయ్కి సరికొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ఊళ్లోనే పెద్ద గూండాగా, అందరినీ చందాలు ఇవ్వమని పీక్కుతినే వాడుగా పేరున్న యువ సంఘ సెక్రటరీ అతని దగ్గరకు వచ్చి వినయంగా చేతులు జోడించి, ‘ఈ ఏడాది చందాలు వసూళ్లను నిలిపివేయమని డీజీపీ చెప్పారు. దసరా సంబరాలకు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేకపోతే లేదు’ అంటూ వెళ్లిపోయాడు.నిమ్మయ్ జీవితం పూర్తిగా పరివర్తన చెందింది.ఇప్పుడతను పెద్ద నాయకుడయిపోయాడు. ఊళ్లో ఏ చిన్న పని కావాలన్నా నిమ్మయ్ని కలిస్తే చాలు అన్న అభిప్రాయం బలపడిపోయింది. కాలనీ యువకులంతా అతని ప్రభావంలో పడిపోయారు. పూజ కమిటీ అతన్ని నాయకునిగా ఎంచుకోవాలని నిర్ణయించింది. రామేశ్వర్ని కలిసి అప్పటికి మూడు నెలలు గడిచాయి. పని పూర్తి కాగానే జాకెట్ను తిరిగి ఇవ్వమని అతను చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అతనికి దాన్ని ఇచ్చేయాలనే అనిపించింది. వెంటనే కొన్ని స్వీట్లు కొని, జాకెట్ ధరించి రామేశ్వర్ ఇంటికి వెళ్లాడు. అది పౌర్ణమి రాత్రి. చందమామ వెలుగు ముందు వీధి దీపాలు వెలవెలపోతున్నాయి. వాన కురిసి వెలిసింది. భాద్రపద మాసపు గాలులు చల్లగా వీస్తున్నాయి. ‘నేనెక్కడికీ పోవటం లేదు. ఈ జాకెట్ను ఇంకో నెలా రెండు నెలలు ఉంచుకో’ రామేశ్వర్ సలహా ఇచ్చాడు. ‘ఈ జాకెట్ లేకపోయినా ధైర్యంగా ఉండగలనని నువ్వు భావించినప్పుడు దాని తిరిగి ఇవ్వు’‘నేను మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను. అడగొచ్చా?’‘దానిదేం ఉంది. అడుగు. నాకు తెలిస్తే సమాధానం చెబుతాను’ ‘నిజంగా ఇది పులి జాకెట్టేనా?’‘అవును. ఎందుకంత సందేహం?’ రామేశ్వర్ నవ్వుతూ అడిగాడు. ఆ తర్వాత ‘మాది బిహార్. మా తండ్రి చనిపోయేనాటికి నాకు రెండేళ్లు’ తన కథ చెప్పటం ప్రారంభించాడు. ‘అప్పట్లో మా తండ్రి లాల్గఢ్ జమీందారు దగ్గర పని చేసేవాడు. ఆ జమీందారు అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రైతులకు అప్పులిచ్చి వాళ్లు సకాలంలో చెల్లించకపోతే వాళ్లను వేధించేవాడు. అలాగే వాళ్ల కూతుళ్లను, కోడళ్లను, భార్యలను ఇలా ఆడవాళ్లందరినీ లైంగికంగా లొంగతీసుకునేవాడు. నిమ్మయ్ చెవులు రిక్కించి వింటున్నాడు. ‘ఒకసారి ఎందుకో ఆ జమీందారుకు మా నాన్నపైన కోపం వచ్చిందట. దానితో పులికి ఆహారంగా వేయమని ఆదేశాలిచ్చాడట. రెండు రోజులపాటు పులికి ఎలాంటి ఆహారం పెట్టలేదు. ఒక పంజరంలో నుంచి మా నాన్నను, ఇంకో పంజరంలో నుంచి మేకను ఒకేసారి పులి ఉన్న ప్రదేశంలోకి వదిలారు. పులి ఇద్దరినీ తింటుందా? ఒక్క మా నాన్ననేనా అనేది ఆసక్తిగా చూశారు.అయితే అక్కడ ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది.పులి మేకను ఆహారంగా చేసుకుని మా నాన్నను వదిలేసిందట. అప్పటికే చిగురుటాకులా వణికిపోతూ బిక్కచచ్చిపోయిన మా నాన్న దగ్గరకు వచ్చి మేకరక్తంతో తడిసిన తన పంజాను మా నాన్న జాకెట్కు తాకించింది. ఆ జాకెట్ మరేదో కాదు. ఇప్పుడు నువ్వు వేసుకున్నదే! ఆ తర్వాత జమీందారు మనుషులు మా నాన్నను వదిలి పెట్టారు. కాని, ఆయన ఇంటికి తిరిగి రాలేదు. అడవుల్లోకి వెళ్లిపోయి సాధువుగా మారాడని కొందరు, పిచ్చి పట్టిందని కొందరు, చనిపోయాడని మరి కొందరు చెప్పుకున్నారు గాని, ఆయన ఆచూకీ తెలియలేదు. ఆయన ధరించిన జాకెట్ మాత్రం మా ఇంటికి చేరింది. తర్వాత మేం ఆ గ్రామం విడిచి వచ్చేశాం. ఈ జాకెట్ను నాకందిస్తూ మా అమ్మ ఈ కథ అంతా నాకు చెప్పింది.‘అప్పుడు ఏమైంది?’ ఆసక్తిగా అడిగాడు నిమ్మయ్.‘నేను ఆ జాకెట్ను ధరించినప్పుడల్లా నాలోకి కొత్త శక్తి ప్రవేశించేది. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి.నీకు కూడా అనుభవం అవుతోంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు,‘అంతే కాకుండా ఈ జాకెట్కి అతీంద్రయ శక్తులు ఉన్న మాట నిజం. కానీ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా? దాన్ని నిందించావంటే దాని శక్తి హరించుకుపోతుంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా వినియోగించుకో. పనయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వు’ అని ముగించాడు రామేశ్వర్.సరికొత్త జీవనోత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చాడు నిమ్మయ్. ఆ రోజు నుంచి సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం భార్యా, పిల్లలతో గడుపుతున్నాడు. కాలనీలోనూ, ఆఫీసులోనూ అందరికీ ఇష్టుడయ్యాడు. అలా రోజులు గడుస్తున్నాయి.అంతలో మునిసిపల్ ఎన్నికల ప్రకటన విడుదలయ్యింది.ఆ రోజు ఆదివారం. ఉదయం టీ తాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు నిమ్మయ్. అంతలోనే ఓ పదిమంది యువకులు కార్లు దిగి గబగబా గేటు తోసుకుని లోపలకు వచ్చారు.వాళ్లు కూర్చోవటానికి కూడా ఆ ఇంట్లో తగినన్ని కుర్చీలు లేవు. ఇంటి ప్రాంగణంలోనే పెద్ద జామచెట్టు ఉంది. దానికి చుట్టూతా చప్టా చేసి ఉంది. వాళ్లను అక్కడే కూర్చోమని చెప్పాడు. ‘నిమ్మయ్ భాయ్. మేం మీ సమయం ఎక్కువ తీసుకోం. రాజు భాయ్ ఓ విషయం చెప్పి రమ్మని మమ్మల్ని పంపారు’ బ్లూ జీన్స్, తెల్ల చొక్కా ధరించి ఉన్న వ్యక్తి మాట్లాడటం ప్రారంభించాడు. ‘వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో నువ్వే మా పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి దిగాలి. ఈ పరగణాలో నీలాంటి సమర్థుడు మరొకడు లేడు. అందుకే నిన్ను ఎంపిక చేశాం. నువ్వు కాదనుకూడదు. ఇదిగో నా కార్డు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి నిన్ను పార్టీ అధ్యక్షుని దగ్గరకు తీసికెళతాను’అతనికి ఎలా సమాధానం చెప్పాలో నిమ్మయ్కి అర్థం కాలేదు. ఆలోచనలో పడ్డాడు. తను ఓ పేద కుటుంబంలో పుట్టాడు. సాధారణమైన క్లర్క్గా జీవిస్తున్నాడు. తన నెలజీతం రూ.40వేలు కూడా లేదు. ఇంకా చెప్పాలంటే అన్ని కోతలు పోను తన చేతికి వచ్చేది కేవలం రూ.26 వేలు మాత్రమే. గ్రామంలో తనకి భూమిలాంటి ఆస్తిపాస్తులేం లేవు. మొత్తం కుటుంబం– ఆఖరికి మంచం పట్టిన తండ్రితో సహా అందరూ తన నెలజీతంపైనే ఆధారపడి ఉన్నారు. తనలాంటి వాడికి రాజకీయాలు అవసరమా? అనిపించింది.‘నాకు ఆలోచించుకోవటానికి కొంత సమయం ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపేశాడు. ఈ రాజకీయాలు తనకు నప్పేవి కాదనిపించింది. అంతలోనే రామేశ్వర్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. జాకెట్ను కనుక దుర్భాషలాడితే శక్తులు మొత్తం నశిస్తాయి. ఇప్పటి వరకూ జరిగింది చాలు. ఈ జాకెట్ను తిరిగిచ్చే సమయం వచ్చేసింది అనుకున్నాడు. ఒంటి పైన టీషర్టు ధరించి స్కూటర్ బయటకు తీశాడు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆలోచనలన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి.రామేశ్వర్ సమావేశంలో కృపాసాగర్ పైన తిరగబడటం, ‘నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావని నిందించటం, తన రోజువారీ జీవితం హీనంగా సాగటం, తనకు రామేశ్వర్ పరిచయం కావటం, చివరకు టైగర్ జాకెట్తో తన జీవితం మొత్తం మారిపోవటం అంతా అద్భుతంగా అనిపించింది.మనసు అంతరాంతరాల్లో రామేశ్వర్ పట్ల అభిమానం, కృతజ్ఞత పెల్లుబికింది. ఓ రకంగా అతను తనకు అకస్మాత్తుగా తారసపడిన గురువుగా అనిపించాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ జాకెట్ తిరిగిచ్చే సమయం వచ్చేసింది.రామేశ్వర్ ఇంటి ముందు జనం గుంపుగా కనిపించారు. నిమ్మయ్ స్కూటర్ ఆపి అక్కడున్న వ్యక్తిని పలకరించే ప్రయత్నం చేశాడు. అతను వినిపించుకోనట్టు అక్కడి నుంచి కదిలిపోయాడు. నిమ్మయ్ స్కూటర్ను పక్కన నిలిపివేసి, హడావుడిగా రామేశ్వర్ ఇంట్లోకి పరుగుపెట్టాడు.వరండాలో రామేశ్వర్ భార్య ఏడుస్తూ కనిపించింది. ఆమె ఎదురుగా నేల మీద నిర్జీవంగా రామేశ్వర్ శరీరం. తెల్లటి దుప్పట్లో చుట్టి ఉంది. నిమ్మయ్ నిర్ఘాంతపోయాడు. మౌనంలోకి జారిపోయాడు. ‘ఇప్పుడు తను ఆ జాకెట్ను ఎవరికి అందించాలి?’ మనసులో గుంజాటన మొదలయ్యింది. ∙ఒడియా మూలం: గౌరహరి దాస్∙అనువాదం: డాక్టర్ పార్థసారథి చిరువోలు -
చిన్న కాగితంతో పెద్ద కుట్ర భగ్నం
ఎలాంటి నిఘా హెచ్చరికలు లేవు, ఎలాంటి అనుమానాస్పద ఉదంతాలు జరగలేదు; పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రయత్నించలేదు. అయినా 2004 ఆగస్టులో భారీ కుట్రను సిటీ టాస్క్ఫోర్స్ భగ్నం చేయగలిగింది. సికింద్రాబాద్లోని గణేశ్ దేవాలయం పేల్చివేతతో పాటు నగరాన్ని సందర్శిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టుల హత్యకు ఉగ్రవాదులు పన్నిన పథకం వెలుగులోకి వచ్చింది. ఓ వాహనచోరుడి వద్ద యాదృచ్ఛికంగా లభించిన చిన్న కాగితం ఈ పెద్ద కుట్రను బట్టబయలు చేసింది.నగర టాస్క్ఫోర్స్ విభాగం నిత్యం అసాంఘికశక్తులపై నిఘా ఉంచి, నేరగాళ్లను పట్టుకోవడానికి పని చేస్తుంటుంది. భారీ నేరాల కోసమే కాదు, కొన్ని సందర్భాల్లో చిన్నా చితకా కేసుల కోసమూ ఈ టీమ్స్ పరుగులు పెడుతుంటాయి. 2004 ఆగస్టులో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు– అది నెలలో ఆఖరి వారం కావటంతో ఏదో ఒక ముఠా లేదా నేరగాడిని పట్టుకుని ఉన్నతాధికారులకు చూపించడానికి కసరత్తులు చేస్తున్నారు. అప్పుడే ఓ వేగు ద్వారా అందిన చిన్న సమాచారం అధికారుల్లో కోటి ఆశలు రేపింది. ఓ వాహనచోరుడి సంబంధించిన ఆ సమాచారం ఆధారంగా టీమ్ వర్కౌట్ చేయడం మొదలెట్టింది. నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చి పహాడీషరీఫ్లోని హఫీజ్బాబానగర్లో మెకానిక్గా స్థిరపడిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్కు పలు వాహన చోరీలతో ప్రమేయం ఉందన్నది ఆ వేగు అందించిన సమాచారం. దీంతో టాస్క్ఫోర్స్ అతడి కోసం ముమ్మరంగా గాలించి అదుపులోకి తీసుకుంది. అప్పటి వరకు తాను చేసిన వాహనచోరీలను అతడు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేయాలని టాస్క్ఫోర్స్ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ తతంగంలో భాగంగా చోరీ వాహనాలతో పాటు నిందితుడి వద్ద లభించిన వస్తువులను సీజ్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఖదీర్ను తనిఖీ చేసిన అధికారులు అతడి జేబుల్లో ఉన్న కాగితాలను సైతం తీసి పరిశీలించారు. అన్నీ మామూలుగానే ఉన్నా, ఓ చిన్న స్లిప్లోని వివరాలు మాత్రం అనుమానాస్పదంగా కనిపించాయి. అతడి వద్ద లభించిన స్లిప్లో కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన నంబర్లు ఉండటమే పోలీసుల అనుమానానికి కారణం. దీంతో లోతుగా విచారించగా, అతడి స్నేహితుడైన ఒమర్ ఫారూఖ్ షరీఫ్ (స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల), లంగర్హౌస్లకు చెందిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ పేర్లు వెలుగులోకి రావడంతో పాటు వారిద్దరూ బండ్లగూడలోని గౌస్నగర్లో ఓ ఇంట్లో డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపెట్టాడు. తాను చోరీ చేసిన వాహనాల్లో కొన్ని వారికి ఇచ్చానని, ఆ నంబర్లు వారికి సంబంధించినవే అని అంగీకరించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో విషయం ‘పెద్దదని’ అనుమానించిన టాస్క్ఫోర్స్ బృందాలు హుటాహుటిన గౌస్నగర్లోని డెన్పై దాడి చేశాయి. అక్కడ ఫారూఖ్ చిక్కగా, అజీజ్ తప్పించుకున్నాడు. అప్పటికే అజీజ్ ఆయుధ చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ఉండటం, ఇప్పుడు పారిపోవడంతో పోలీసులు ఇది కచ్చితంగా ‘పెద్ద విషయం’ అని నిర్ధారించుకున్నారు. ఖదీర్, ఫారూఖ్లను కలిపి విచారించడంతో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. సిటీలో ఘర్షణలు రెచ్చగొట్టాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ పథకం వేసినట్లు బయటపడింది. గణేశ్ నిమజ్జనం రోజు సికింద్రాబాద్లోని గణేశ్ దేవాలయం పేల్చివేతకు కుట్ర పన్నినట్లు బయటపడింది. దీనికోసం ‘లష్కరే తోయిబా’ నగరానికి చెందిన తెహరీక్ తెహఫూజ్ షరియా ఓ ఇస్లామీ (టీటీఎస్ఐ) నేత మౌలానా నసీరుద్దీన్ (2020లో చనిపోయాడు), గులాం యజ్దానీలతో (2006లో ఢిల్లీ ఎన్కౌంటర్లో హతుడయ్యాడు) పాటు మరో 12 మందిని రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అందించింది. వినాయక నిమజ్జనం రోజు ఈ గ్యాంగ్కు చెందిన కొందరు ఇతర మతస్థులుగా వేషం వేసుకుని గణేశ్ దేవాలయంలోకి ప్రవేశించి బాంబు పెట్టాలని పథకం సిద్ధం చేసుకున్నారు. గులాం యజ్దానీ ఆదేశాల మేరకు ఈ పేలుడు హడావుడి సద్దుమణగక ముందే సిటీలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టులనూ చంపాలని భావించారు. అందుకు అవసరమైన పేలుడు పదార్ధాలు, వాహనాలు సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో వరుస దాడులు చేసిన పోలీసులు 2004 ఆగస్టు 28న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కొందరు నిందితులు పరారీలోనే ఉన్నారు. ఈ కేసు తొలుత నగర నేర పరిశోధన విభాగంలో నమోదైంది. దీనికి సంబంధించి అప్పట్లో టాస్క్ఫోర్స్ విభాగం అత్యంత వివాదాస్పదమైంది. అమాయకులను కేసుల్లో ఇరికించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అన్ని కోణాల్లోనూ లోతుగా ఆరా తీసిన సీఐడీ పోలీసులు అరెస్టుల్లో ఎలాంటి కుట్ర లేదని తేల్చారు. ఆపై కేసు సీఐడీకే బదిలీ అయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో తుది విచారణలో ఉంది. భవానీనగర్కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్–కానిస్టేబుల్గా పని చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి గిడ్డా అజీజ్ తృటిలో తప్పించుకున్నాడు. అప్పటికే తన వద్ద ఉన్న బోస్నియా పాస్పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్ది నకిలీ పాస్పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్గా ఉన్న అజీజ్పై 2008లో ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్కు బలవంతంగా తిప్పి పంపించారు. 2001 నాటి విధ్వంసాల కుట్ర కేసులో అజీజ్కు 2022లో పదహారేళ్ల శిక్ష పడటంతో జైలులో ఉన్నాడు. -
ఇంద్రద్యుమ్నుడి కథ
పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలకు కష్టం తెలియనివ్వకుండా పరిపాలించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. యజ్ఞయాగాలు చేశాడు. తనువు చాలించిన తర్వాత పుణ్య ప్రభావం వల్ల స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అనేక సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు. ఏళ్లు గడిచాక భూలోకంలో అతడి కీర్తి అంతరించింది. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడనే సంగతిని కూడా ప్రజలు మరచిపోయారు. భూలోకంలో అతడి కీర్తి అంతరించిపోవడంతో దేవతలు ఇంద్రద్యుమ్నుడిని తిరిగి భూలోకానికి తోసేశారు. స్వర్గం నుంచి తిరిగి భూమ్మీద పడ్డ ఇంద్రద్యుమ్నుడు జరిగిన దానికి బాధపడుతూ, అడవులలో సంచరిస్తూ ఒకనాడు మార్కండేయ మహర్షిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నేనెవరో మీకు తెలుసు కదా! నా పేరు ఇంద్రద్యుమ్నుడు’ అన్నాడు.మార్కండేయుడు అతడిని తేరిపార చూసి, ‘నాయనా! నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు ఎన్నడూ వినలేదు. అయినా నేను తాపసిని. రాజులతోను, వారి చరిత్రలతోను నాకు పనిలేదు’ అని బదులిచ్చాడు.‘మహర్షీ! మీకంటే ముందుగా పుట్టినవారు, సజీవులుగా ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? తెలిస్తే, వారెక్కడ ఉంటారో చెప్పండి. కనీసం వారికైనా నేను తెలుసేమో కనుక్కుంటాను’ అభ్యర్థించాడు ఇంద్రద్యుమ్నుడు.‘మంచుకొండ మీద ఒక గుడ్లగూబ ఉంది. అది నా కంటే ముందు పుట్టింది. దాని పేరు ప్రావారకర్ణుడు. దానిని అడిగి చూడు’ అన్నాడు మార్కండేయుడు.ఇంద్రద్యుమ్నుడు తనతో మార్కండేయ మహర్షిని వెంటబెట్టుకుని, మంచుకొండ వద్ద గుడ్లగూబ దగ్గరకు వెళ్లాడు. ‘ఓ ఉలూకమా! నేను ఇంద్రద్యుమ్నుడిని. నీకు నేను తెలుసునా?’ అని అడిగాడు.తెలీదని బదులిచ్చింది గుడ్లగూబ.కాస్త నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు, ‘పోనీ! నీ కన్నా ముందుగా పుట్టి సజీవులుగా ఉన్నవారు ఎవరైనా నీకు తెలుసునా?’ అని అడిగాడు.గుడ్లగూబ కాసేపు ఆలోచించి, ‘ఇక్కడకు దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో నాడీజంఘుడు అనే కొంగ ఉంది. ఆ కొంగ నాకంటే ముందు పుట్టింది’ అని చెప్పింది. ఇంద్రద్యుమ్నుడు ఈసారి మార్కండేయుడిని, గుడ్లగూబను వెంటబెట్టుకుని సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ కొంగను కలుసుకుని, ‘నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.‘నాకు తెలీదు గాని, నా కంటే ముందుగా పుట్టిన తాబేలు ఇదే సరస్సులో ఉంటోంది. దానికి తెలుసేమో’ అంది కొంగ.‘దయచేసి, ఆ తాబేలుని పిలుస్తావా? కనుక్కుంటాను’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలుకు కబురు పంపింది కొంగ.ముసలి తాబేలు నెమ్మదిగా తడబడుతూ సరస్సు ఒడ్డుకు వచ్చింది. ‘కచ్ఛపరాజమా! నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.తాబేలు కాసేపు ఆలోచించి, ‘ఆ మహారాజు తెలియకపోవడమేంటి? చల్లని మహారాజు. వెయ్యి యజ్ఞాలు చేశాడు. గొప్ప దానాలు చేశాడు. ఆయన పాలన సాగినన్నాళ్లూ రాజ్యంలో నిత్య సంతర్పణలు జరిగేవి. ఆ మహారాజు భూసురులకు వేలాది గోవులను దానం చేయడం వల్ల, ఆ గోవులు తొక్కుతూ సంచరించడం వల్లనే ఇక్కడ ఈ సరోవరం ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరు ఏమిటనుకున్నావు? ఇది ఇంద్రద్యుమ్న సరోవరం’ అని బదులిచ్చింది.‘హమ్మయ్య! నా గురించి తెలిసిన జీవి ఒకటి ఇంకా ఈ భూమ్మీద జీవించి ఉంది’ అని మనసులో సంతోషించాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలు మాటలకు ఆనందపరశుడయ్యాడు. ‘కచ్ఛపరాజమా! నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజును’ అని చెప్పి, ఆ తాబేలుకు నమస్కరించాడు.ఇంద్రద్యుమ్నుడి కీర్తి ఇంకా భూమ్మీద మిగిలే ఉండటంతో దేవతలు దివ్యవిమానంలో అక్కడకు చేరుకున్నారు.‘ఇంద్రద్యుమ్నా! నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నువ్వు వెంటనే మాతో వచ్చి, స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ముక్తకంఠంతో పలికారు దేవతలు.ఇంద్రద్యుమ్నుడు వారితో పాటు దివ్యవిమానమెక్కి స్వర్గానికి తిరిగి బయలుదేరాడు.∙సాంఖ్యాయన -
చెంచా రాయుడు!
రోబో సినిమాలో విలన్స్ వెపన్స్ అన్నింటినీ మ్యాగ్నెట్ మోడ్లో మారి చిట్టీ లాగేసుకున్నట్లు, ఇరాన్ లోని ఓ వ్యక్తి స్పూన్ మ్యాగ్నెట్ మనిషిగా మారాడు. పేరు అబోల్ఫజ్ సాబిర్ ముఖ్తారీ. కాని, అతని పేరు కన్నా అతను చేసిన పనే పవర్ఫుల్! అతను ఏం చేశాడంటే, తన శరీరంపై ఏకంగా 96 చెంచాలను అంటించుకొని గిన్నిస్ రికార్డు సాధించాడు. అవును, తక్కువేం కాదు, అంటే రౌండ్ ఫిగర్కి ఇంకా నాలుగు మాత్రమే మిగిలిందంటే, అతని స్పూన్ ఫిక్షన్ లెవెల్ ఆ రేంజ్లో ఉంది మరి. 2021లో ముఖ్తారీ మొదటిసారి 85 చెంచాలతో రికార్డు చేశాడు. 2023లో ‘ఇదేం సరిపోదు’ అనుకున్నాడేమో 88 చెంచాలతో మళ్లీ తనదైన మార్క్ వేశాడు. ఇప్పుడేమో ‘ఇంకో స్పూన్ స్పెషల్స్ కలపాలి’ అని, నేరుగా 96 చెంచాలతో రికార్డే కాదు, నమ్మకాలకే చాలెంజ్ విసిరాడు. ‘చెంచాలు కూడా మనుషుల్ని ప్రేమించగలవా?’ అన్న ప్రశ్నకి ఔననే సమాధానాన్ని తన శరీరంతో చెప్పాడు!. ఇతని శరీరంపై చెంచాలు అతుక్కునే తీరు చూస్తే, చెంచాలకి మార్గం చూపించే గూగుల్ మ్యాప్లా ముఖ్తారీ కనిపిస్తాడు. ఈ విషయమై ముఖ్తారీ మాట్లాడుతూ, ‘నేను ఏ వస్తువునైనా నా శరీరానికి అతికించుకోగలను. ప్లాస్టిక్, గాజు, రాయి, చెక్క– ఇంకా ఎన్నో వస్తువులతో ప్రయోగాలు చేస్తున్నాను. త్వరలోనే మరో కొత్త రికార్డు చేస్తాను’ అని చెప్పాడు. -
దేవుడు ముడివేసిన బంధం
లోకం తెలియని పసితనం బుడిబుడి అడుగులతో నాన్నను అనుసరించే దృశ్యం, ఎప్పుడూ మురిపెంగానే ఉంటుంది. చూసేందుకే అంత ముచ్చటగా ఉండే ఆ బంధం, స్వయంగా తన చేతినే తాకినప్పుడు.. ఆ తండ్రి పొందే ఆనందం.. అమితం, అమరం, అనిర్వచనీయం! అలాంటి అనుభూతిని కోరే నాన్న ఎప్పుడూ ఉన్నతమైన ఆదర్శాలనే తలకెత్తుకుంటాడు. గొప్ప తండ్రిగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంటాడు. తనతో పాటు తన పిల్లల్ని కూడా ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేస్తాడు. దైవత్వాన్ని నింపుకుని, వారి తలరాతలను తనే రచిస్తాడు. అందుకే ‘డాడ్ ఈజ్ గాడ్’పితా ధర్మః పితా స్వర్గః పితా హి పరమం తపఃపితరి ప్రీతిమాపన్నే ప్రీయతే సర్వదేవతాః‘తండ్రి దైవ సమానుడు, ధర్మ స్వరూపుడు. తపస్సుకు అత్యుత్తమ మార్గం ఏదైనా ఉందంటే అది తండ్రికి సేవ చేయడమే. తండ్రిని సంతోషపెడితే సమస్త దేవతలు సంతోషిస్తారు’ ఇది కుటుంబవ్యవస్థ మెచ్చే ధర్మం! అయితే ఎందరో తండ్రులు, తమ పిల్లల నుంచి అవేమీ ఆశించకుండా కేవలం వారి క్షేమం కోసమే అహర్నిశలు తపిస్తుంటారు. జీవితాన్ని, కాలాన్ని అంకితమిస్తూ స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమవుతున్నారు. ఒకసారి బరాక్ ఒబామా, తండ్రి గురించి స్పష్టమైన కొటేషన్ చెప్పారు. ‘మగతనం ఉంటే చాలు, ఎవరైనా బిడ్డను కనగలరు! కాని, అది వారిని తండ్రిని చేయలేదు. బిడ్డను పెంచడానికి ధైర్యంగా అడుగులు వేసేవారే నిజమైన తండ్రి’ అంటారాయన. దానిలో ఎంత అర్థముంది! నాన్న కనబడితే– గౌరవంతో తలుపు చాటున దాక్కునే అలనాటి రోజుల నుంచి నాన్న కనబడితే– గారాబంతో సరదాగా పోట్లాడుకునే ఈనాటి రోజుల వరకూ, ప్రతి జీవితంలోనూ ఆయనే హీరో! కాలం విసిరిన సవాళ్లకు జీవితాన్ని పణంగా పెట్టే ప్రతి నాన్న చేతుల్లోనూ ఓ చిట్టి చేయి దాగుంటుంది. ఆ చేయి ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి, తన ఆదర్శవంతమైన కథను సగర్వంగా పరిచయం చేస్తుంది. తన కోసం, తన తండ్రి కన్న కలలన్నింటినీ గొంతెత్తి చాటుతుంది. నిజానికి ఈలోకంలో నాన్న అనే పిలుపు కోసం తపించే నాన్నలు కొందరైతే, నాన్నగా గెలిచిన నాన్నలు ఇంకొందరు. ఏదేమైనా నాన్న అనే పిలుపే ఓ ఎమోషన్. ఆ ఎమోషన్స్ కి త్యాగం తోడైతే? తెలియకుండానే గుండె తడవుతుంది. ఫాదర్స్డే సందర్భంగా అలా గెలిచి, నిలిచిన కొన్ని నిజజీవిత విజయగాథలు మీకోసం. లోకం మెచ్చిన తండ్రులుఈ అద్భుతమైన సృష్టిలో హద్దులు లేని ఆప్యాయతే అసలైన అమ్మతనం. నిస్వార్థమైన ప్రేమకు అదో మారు గుణం. అలాంటి అమ్మతనాన్ని అందించే నాన్న దొరకడం మహా వరం. ప్రేమను పంచడంలో, పిల్లల్ని పెంచడంలో తండ్రి పాత్రకు వీరంతా సజీవ నిదర్శనం!దేవుడు ముడివేసిన బంధంమధ్యప్రదేశ్, ఇండోర్లోని ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనాథాశ్రమం సాక్షిగా మొదలైన ఈ తండ్రీ కొడుకుల కథ చాలా ప్రత్యేకం. 2014 సెప్టెంబర్ 13 ఉదయాన్నే 27 ఏళ్ల ఆదిత్య తివారీ.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చెయ్యాలనే ఉద్దేశంతో, ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఆ చారిటీకి వెళ్లాడు. అక్కడ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న ఆరు నెలల అవనీశ్ను తొలిసారి చూసి, ఏమైందని ఆరా తీశాడు. ఆ బాబుకున్న ఆరోగ్య సమస్యల గురించి విని అల్లాడిపోయాడు. డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న అవనీశ్ను ఎవ్వరూ దత్తత తీసుకోవడం లేదని తెలిసి, ఆ బాబుకి తానే తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అధికారులతో చర్చించాడు. అయితే అధికారులు అందుకు అభ్యంతరం చెప్పారు. దత్తత తీసుకునే ఒంటరి పురుషుడికి 30 ఏళ్లు నిండాలనే రూల్స్ని ముందుంచారు. దాంతో ఆ రూల్స్ మార్చాలని న్యాయపోరాటం మొదలుపెట్టాడు ఆదిత్య. అవనీశ్ లాంటి స్పెషల్ చిల్డ్రన్ని దత్తత తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తూనే, అవనీశ్ దత్తత కోసం సుమారు రెండేళ్లు ఫైట్ చేశాడు. అయితే ఒక ఒంటరి పురుషుడు, ఇలాంటి వికలాంగుడైన బిడ్డను చూసుకోవడం కష్టమనే వారు ఎక్కువయ్యారు. ఆ మాటలకు ‘బిడ్డ తండ్రివైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు’ అనే హెచ్చరికలు తోడయ్యాయి. అయినా వెనక్కు తగ్గని ఆదిత్య ఈ ప్రయత్నంలో తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చివరికి దత్తత తీసుకోవడంలో సింగిల్ ఫాదర్కి ఉండాల్సిన వయసును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు మార్పించగలిగాడు. అలాగే 2016 జనవరి 1న అవనీశ్కి అధికారికంగా తండ్రి అయ్యి, దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఒంటరి తండ్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్థిక, సామాజిక సవాళ్లు ఎదుర్కొంటూ బాబుకి మంచి ఆహారం, మంచి వైద్యం ఇప్పించగలిగాడు.అయితే రెండేళ్ల పోరాటక్రమంలో అర్పిత అనే అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారేముందు అవనీశ్ తల్లిగా అర్పిత పాసైంది. వీరి పెళ్లికి పదివేల మంది నిరాశ్రయులు అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం అవనీశ్ ఆరోగ్యవంతుడిగా మారుతూ, పాఠశాలకు వెళ్తూ, చదువులో చురుకుగా ఉంటున్నాడట. ఆదిత్య తివారీ అంకితభావానికి గుర్తింపుగా, 2020లో ఆయనకు ‘వరల్డ్స్ బెస్ట్ మామీ’ అవార్డు లభించింది. తల్లి ప్రేమ ఒక లింగానికే పరిమితం కాదని, తండ్రి కూడా ఆ ప్రేమను చూపగలడని నిరూపించినందుకు అతడికి ఈ గౌరవం దక్కింది.అవనీశ్లాంటి పిల్లలున్న 10 వేల మంది తల్లిదండ్రులకు ఆదిత్య కౌన్సెలింగ్ ఇచ్చాడు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇప్పటివరకు దేశంలో 22 రాష్ట్రాల్లో పర్యటించారు. సెమినార్లు, వర్క్షాపులు అంటూ ఇలా ఎక్కడికి వెళ్ళినా అవనీశ్ను ఆదిత్య వెంటబెట్టుకునే వెళ్తాడు. ఐక్యరాజ్య సమితిలో సైతం, వైకల్యమున్న పిల్లల పెంపకం గురించి ఆదిత్య ప్రసంగించారు. జెనీవాలో జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’లో కూడా ఈ తండ్రీ కొడుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అవనీశ్కి ఇంకా కొన్ని సర్జరీలు జరగాల్సి ఉందని, అవి చేయించడానికి తగిన వయసు కోసం ఎదురు చూస్తున్నామని ఆదిత్య తెలిపారు. ఇది దేశానికే ఆదర్శవంతమైన కథ. అన్నిటినీ చిన్నబుచ్చిన ప్రేమ!ముంబైలోని ఓ చిన్న ఇంట్లో, నాలుగేళ్ల సుశాంత్ దివిగికర్ కార్లు, బ్యాట్లతో ఆడుకోకుండా, తల్లి చీర కొంగులతో, ఆమె మేకప్ సామాగ్రితో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. స్టేజ్ డ్రామాలు, నృత్యాలు ఇష్టమంటూ ఆ దిశగానే అడుగులు వేశాడు. ఇక యవ్వనంలోకి వచ్చేసరికి అమ్మాయిలపైన కాకుండా అబ్బాయిలపై ఆకర్షితుడయ్యాడు. అప్పుడే తను ఒక గే అని, తనలో స్త్రీ లక్షణాలు కూడా ఉన్నాయని గ్రహించాడు. రహస్యంగా గే పార్టీలకు అటెండ్ అయ్యేవాడు. 2008లో ఒకరోజు సుశాంత్ కజిన్ కరణ్.. సుశాంత్ని ‘గే’లతో తిరగడం చూసి షాకయ్యాడు. వెంటనే సుశాంత్ తండ్రి ప్రదీప్ దివిగికర్కి చెప్పేశాడు. విషయం తెలిసిన ప్రదీప్.. సుశాంత్ని ఆరా తియ్యగా భయపడుతూనే తండ్రికి నిజం చెప్పాడు. వెంటనే ప్రదీప్ కొడుకుని హత్తుకుని.. ‘నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే.. ఈ ప్రపంచం నిన్ను ఏమైనా అననీ.. నేను మాత్రం నీకు అండగానే ఉంటాను’ అని మాటిచ్చాడు. అప్పుడు సుశాంత్కి 18 ఏళ్లు. వెంటనే ప్రదీప్.. తన కొడుకు గే అనే విషయాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పారు. తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ‘మిస్టర్ గే ఇండియా’ 2014 టైటిల్ను గెలుచుకున్నాడు. ‘మిస్టర్ గే వరల్డ్’ చరిత్రలో అత్యధిక సబ్–టైటిల్స్ గెలుచుకున్న ఏకైక ఇండియన్ తనే. అదే ఏడాది సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఉన్న మహారాష్ట్ర ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్గా వెళ్లి, ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీకి ఆఫర్ వచ్చినా.. ‘అదో డర్టీ గేమ్’ అని అభివర్ణించి ఆఫర్ని తిరస్కరించాడు. తర్వాత కాలంలో తండ్రి ప్రోత్సాహంతోనే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. ‘రాణీ కోహినూర్’ అనే పేరుతో ప్రస్తుతం సుశాంత్కి ఇన్స్టాగ్రామ్లో 3.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.‘బిడ్డ బిడ్డే అయినప్పుడు లింగంతో సంబంధం ఏంటీ? ఒకే బిడ్డలో కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని’ అంటుంటారు ప్రదీప్. కలలను వదులుకునేంత బాధ్యతముంబైకి చెందిన లహర్ జోషీ చిన్నప్పటి నుంచి కెరీర్ గురించి ఎన్నో కలలు కన్నాడు. 2015 నాటికి కోరుకున్నట్లే సొంతంగా బ్రాండింగ్ ఏజెన్సీని స్థాపించి, విజయవంతంగా నడపసాగాడు. అయితే ఆ సమయంలోనే అతడి భార్య రుతుమ గర్భవతి అయ్యింది. స్కానింగ్లో కవలలు అని తెలిసినప్పటి నుంచి పట్టలేని ఆనందంతో పాటు రెట్టింపు కానున్న బాధ్యతలు అతణ్ణి కుదురుగా ఉండనివ్వలేదు. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి భార్యభర్తలిద్దరికీ పిల్లలకోసం సమయాన్ని కేటాయించడం కూడా సమస్యగానే మారింది. పిల్లల కోసం ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉండటంతో పాటు ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు లహర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య రుతుమతో పోలిస్తే తన నెల సంపాదన తక్కువ ఉండటంతో, విజయవంతంగా సాగుతున్న తన బ్రాండింగ్ ఏజెన్సీని మూసివేసి, పూర్తిస్థాయిలో పిల్లల సంరక్షణకు అంకితం కావాలని ఫిక్స్ అయ్యాడు. అలా, లహర్ జోషీ ఒక ‘స్టే–ఎట్–హోమ్ డాడ్’గా మారారు.ఈ నిర్ణయం సమాజంలో మిశ్రమ స్పందనలను తెచ్చింది. కొందరు ఆయన్ని అభినందిస్తే, మరికొందరు ఆశ్చర్యంగా చూశారు. కానీ లహర్కు తన తండ్రి నుంచి పూర్తి మద్దతు లభించింది. అది ఆయనకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.పిల్లల్ని ఇంటి వద్దే ఉండి పెంచిన అనుభవం తనను మరింత మంచి వ్యక్తిగా మార్చిందని లహర్ బలంగా నమ్ముతాడు. తొలినాళ్లలో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త కష్టంగా అనిపించినా, వారి ఎదుగుదలను దగ్గరగా చూసే అనుభూతి అద్భుతమని ఆయన గర్వంగా చెబుతుంటాడు. లహర్ తన ఈ ప్రయత్నంతో దేశంలో పాతుకుపోయిన లింగ వివక్షను సవాలు చేస్తున్నారు. ఒక తండ్రి పాత్ర కేవలం డబ్బు సంపాదించడమే కాదు, పిల్లలకు ఓ మార్గదర్శిగా, కోచ్గా ఉండటం కూడా అంటారు ఆయన. ఈరోజు, లహర్ జోషీ తన కవలలను ఎంతో ఆనందంగా పెంచుకుంటూ, సమాజానికి ఓ కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. తండ్రి ప్రేమ, సంరక్షణ పిల్లల ఎదుగుదలకు ఎంత అవసరమో వివరిస్తూ, లహర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మలా పెంచిన నాన్నగుజరాత్, అహ్మదాబాద్కి చెందిన ప్రముఖ గాయని ‘శైలీ షా’ను కదిలిస్తే ఆదర్శవంతమైన తన తండ్రి ‘రాజేష్ షా’ కథను ప్రత్యేకంగా చెబుతుంది. శైలీకి పదేళ్లు కూడా నిండకుండానే ఆమె తల్లి ఆశ మరణించింది. ఆరోజు నుంచి తన అన్న నిసర్గను, తనని కంటికి రెప్పలా పెంచి పోషించారు రాజేష్. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినలేదు. ప్రేమించి పెళ్లాడిన భార్య మరణంతోనే జీవితం శూన్యం అనుకున్న రాజేష్.. కేవలం పిల్లల కోసమే బతికారు. అయితే అతడి భార్య ఆశా తన కూతురు శైలీని సింగర్ చేయాలని ఆశపడింది. అందుకే అహర్నిశలు శ్రమించి కూతుర్ని సింగర్ని చేశారు రాజేష్. శైలీ షా కేవలం గాయని మాత్రమే కాదు. ఆమె ‘మోర్తంత్ర’ అనే బొటిక్ జ్యూలరీ బ్రాండ్తో విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్రాండ్ గుజరాత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఇక నిసర్గ, ప్రింటింగ్ కేంద్రాన్ని నడపుతూ తండ్రికి అండగా ఉంటున్నాడు.‘నాన్నే మాకు జీవిత పాఠాలు నేర్పించారు, అమ్మలా పెంచారు. ఆయనే మాకు స్ఫూర్తి’ అని శైలీ గర్వంగా చెబుతుంది.నాన్న అనే పిలుపు కోసం ఏళ్ల పోరాటంయూసఫ్ ఖాన్తో కబీర్, డా.కేదార్ పడ్తేఅది 2007. యూసఫ్ ఖాన్ అనే 26 ఏళ్ల మ్యూజిక్ టీచర్.. పుణే చారిటీల చుట్టూ తిరగడం అప్పుడప్పుడే మొదలుపెట్టాడు. దుబాయ్లో ‘ద మ్యూజిక్ బాక్స్’ అనే మ్యూజిక్ స్కూల్ను నడుపుతున్న యూసఫ్.. వైవాహిక జీవితంపై ఆసక్తి లేకపోవడంతో, పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే పిల్లల మీద ఉన్న ఇష్టంతో అనాథను దత్తత తీసుకోవాలని ఆశపడ్డాడు. అందుకే భారత్ వచ్చి చారిటీలకు తన విన్నపాన్ని తెలిపి, దత్తత కోరినప్పుడు.. అందుకు రూల్స్ అంగీకరించలేదు. తాను తండ్రి కావాలనే బలమైన కోరికతో సుమారు పదేళ్ల పాటు దత్తత కోసం దుబాయ్కి, ఇండియాకి తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఫలితం లేకపోవడంతో 2017 నుంచి సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు. సుమారు పదకొండు సార్లు సరోగసీ విధానం ఫెయిల్ అయ్యింది. అయినా తన కలను చంపుకోవడానికి యూసఫ్ అంగీకరించలేదు. విసుగు చెందలేదు. పదే పదే ఎదురైన వైఫల్యాలు, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి ఏవీ తనని నిరాశపరచలేదు. చివరికి సరోగసీలో 12వ ప్రయత్నం ఫలించి, 2019 డిసెంబర్ 3న పనాజీలో కబీర్ అనే పండంటి మగబిడ్డను పొందాడు. గోవాకు చెందిన డా. కేదార్ పడ్తే పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. ప్రస్తుతం కొడుకుతో సహా దుబాయ్లోనే ఉంటున్నాడు యూసఫ్. వీరికి సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందుబాటులో లేవు. అయితే ఎన్నో కష్టాలకు ఓర్చి, ఏళ్లపోరాటం చేసి పొందిన బిడ్డను యూసఫ్ ఎలా పెంచుతాడనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతులేని అన్వేషణచైనా తూర్పు తీరంలోని షాన్స్ డాంగ్ ప్రావిన్స్కు చెందిన ‘గువో గ్యాంగ్టాంగ్’ అనే తండ్రి కథ యావత్ ప్రపంచానికీ భావోద్వేగాలను నింపింది. ఈ కథ 1997, సెప్టెంబర్ 21న మొదలైంది. ఆ రోజు ఆదివారం. స్కూల్స్ లేక పిల్లలంతా ఇంటి బయటే ఆడుకుంటున్నారు. గువో రెండో కొడుకు రెండున్నరేళ్ల జిన్స్ జెన్స్ ను ఎవరో లాక్కెళ్లారని పెద్ద కొడుకు పరుగున లోపలికి వచ్చి చెప్పాడు. అప్పటికే కిడ్నాపర్ల వీరంగం గురించి చాలాసార్లు విన్న గువో.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో కడు నిరుపేదైన గువో.. కష్టపడి ఓ పాత మోటర్ సైకిల్ కొనుక్కుని, దాని వెనుక మిస్ అయిన కొడుకు ఫొటోను బ్యానర్గా కట్టుకుని, తనే స్వయంగా వెతకడం మొదలుపెట్టాడు. అదే బండి మీద చాలా దూరం వెళ్లాడు. సుమారు 24 ఏళ్ల పాటు కిడ్నాప్ అయిన కొడుకును అలా వెతుకుతూనే ఉన్నాడు. వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. తన ఆర్థిక స్తోమతను బట్టి పాత మోటర్ సైకిళ్లనే కొంటూ, మార్చుకుంటూ.. తిరగని చోటు లేదన్నంతగా తిరిగాడు. అన్నేళ్ల ప్రయాణంలో కొన్నిసార్లు తినడానికి తిండి దొరికేది కాదు. కొన్ని రాత్రులు వంతెనల కింద, రోడ్ల మీద పడుకోవాల్సి వచ్చేది. అయినా విసుగు చెందలేదు. పిచ్చివాడని కొందరు, దొంగ అయి ఉంటాడని ఇంకొందరు అనుమానించినా, అవమానించినా తగ్గలేదు. అతడి పట్టుదలను చూసిన ఎందరో చైనీయులు అతడ్ని ‘సింబల్ ఆఫ్ ది సెర్చింగ్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్’ అనే పేరుతో కీర్తించడం మొదలుపెట్టారు. అతడి ప్రయత్నం నాయకులను, అధికారులను కూడా కదిలించింది. చివరికి 2021 జూలై 11న, గువోకు చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికి అతడి వయసు 61 ఏళ్లు. ‘న్యూ డీఎన్ఏ టెక్నాలజీతో జిన్ జిన్ ను కనుగొన్నామని, అతడు హేనాన్ ప్రాన్స్లో ఒక దత్తత కుటుంబంతో నివసిస్తున్నాడు’ అని గువోతో అధికారులు చెప్పారు. అతడి 24 ఏళ్ల ఆవేదన ఒక్కసారిగా ఆనందంగా మారింది. 2021 జూలై 13న జిన్స్ జెన్ 26ఏళ్ల యువకుడి రూపంలో గువో కళ్లముందుకు వచ్చినప్పుడు అతడి కన్నీళ్లు చూసి ప్రపంచమే కంటతడి పెట్టింది. వారి కౌగిలిలో ఏళ్లనాటి నిరీక్షణ, ప్రేమ, ఆనందం అన్నీ కళ్లకు కట్టాయి. గువో కథ ‘లస్ట్ అండ్ లవ్’ అనే సినిమాగా మారి, ఎందరో మనసులను కదిలించింది.నిజానికి ఈ కథలన్నీ చూస్తుంటే ‘లియో బుస్కాగ్లియా’ అనే అమెరికా రచయిత మాటలు గుర్తు రాక మానవు. ‘అమరత్వం అనేది మనం వదిలి వెళ్లే ప్రేమలో మాత్రమే ఉంటుంది. అంతటి ప్రేమను పంచే తండ్రులకు ఎప్పటికీ చావు ఉండదు’ అన్నారు ఆయన. అలాంటి తండ్రులందరికీ పాదాభివందనం!హ్యాపీ పాదర్స్ డే! -
వర్షం వచ్చిందంటే ఈ గాడ్జెట్స్ ఉండాల్సిందే..
వానొచ్చిదంటే ఎన్నో సరదాలను తెస్తుంది. వాటితో పాటు ఎన్నో సమస్యలను కూడా! అయితే, వాన తెచ్చే తిప్పల్లో అన్నీ కాకపోయినా కొన్నింటికి చెక్ పెట్టే స్మార్ట్ సొల్యూషన్సే ఈ గాడ్జెట్స్!వాటర్ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్వాన పడుతుంటే చాలామంది చాయ్లో బిస్కట్ ముంచేస్తారు. కాని, అంతకంటే ఎక్కువమంది వానలో మంచి మ్యూజిక్తో మూడ్ని మిక్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగని, వర్షంలో స్పీకర్ పెడితే అప్పుడు అది సింకింగ్ షిప్ అయిపోతుంది. ఇందుకోసమే ఓ అద్భుతమైన ఆవిష్కరణ వచ్చేసింది. వాటర్ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్. దీనిని బయటపెట్టి మ్యూజిక్ ప్లే చేస్తే రెయిన్ డాన్స్ పార్టీని క్రియేట్ చేయొచ్చు. ధర వివిధ బ్రాండ్స్, డిజైన్స్ బట్టి ఉంటుంది. ఆన్లైన్లో లభ్యం.ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు..వర్షం వచ్చిన వెంటనే కాఫీ చేతిలో పట్టుకొని, ఓపెన్ టెర్రస్ మీద సరదాగా ఓ సెల్ఫీ తీసుకోవాలనిపించిందా? కాని, ఫోన్ జారిపోతుందేమోననే భయంతో, కేవలం కాఫీనే ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు అవన్నీ పాత కథలు! ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది ‘ఇస్టా 360’. ఈ చిన్న గాడ్జెట్ తీసే ఫొటోలు, వీడియోలు హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. అన్ని యాంగిల్స్ల్లోనూ అద్భుతంగా తీయగల ఈ చిన్న కెమెరా ఉంటే ఇక పెద్ద పెద్ద కెమెరాలతో పని ఉండదు. పైగా ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు. ఇది తానే నీళ్లలోకి దూకేస్తుంది. అంటే పది మీటర్ల లోతు వరకు వాటర్ ప్రూఫ్ అన్నమాట. చక్కగా షర్ట్కి అంటించి పెట్టుకొని వాడుకోవచ్చు. పైగా కెమెరాను ఎక్కడైనా మర్చిపోతే, మీ ఫోన్ మాత్రం ‘ఏయ్, ఇక్కడ ఉంది కెమెరా’ అని ఇందులోని అలర్ట్ సిస్టమ్ చెప్తుంది. ధర. 599 డాలర్లు (రూ. 51,003). వాన జాడ చెప్పే గొడుగు..‘వాన వస్తుందా లేదా? గొడుగు తీసుకెళ్దామా? వద్దా?’ అని ఇలా మీలో మీరు ప్రశ్నలు వేసుకునే ముందు ఒక్కసారి ఈ ‘డ్యావెక్ అలర్ట్ గొడుగు’ను అడిగి చూడండి. వాతావరణం ఎలా ఉండబోతుందో ఈ గొడుగే చెప్తుంది. పైగా దీనిని ఫోన్కు కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇందులోని అలెర్ట్ సిస్టమ్ ఎప్పుడైనా గొడుగును తీసుకెళ్లడం మర్చిపోయారో, వెంటనే, టింగ్ అని ఫోన్కి మెసేజ్ వస్తుంది ‘నన్ను మర్చిపోయావ్ బాస్’ అని గొడుగు మీకు గుర్తుచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గొడుగు కాదు. బ్రహ్మానందం లెవల్ కామెడీ ప్లస్ స్మార్ట్నెస్ను కలిపిన వస్తువు. పైగా ఇది సాధారణ గొడుగులా కాకుండా చాలా బలంగా ఉంటుంది. ఈదురు గాలులకు కూడా కదలదు. ఇక దీని స్టయిల్లో చూసుకుంటే, పెద్ద పెద్ద డిజైనర్ గొడుగులు కూడా దీనితో పోటీ పడలేవు. ధర 69 డాలర్లు (రూ. 5,870). -
దీపకుని గురుసేవ
ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను పూర్వం దీపకుడు అనే బ్రహ్మచారి ఉండేవాడు. అతడు పరమ నైష్ఠికుడు. శాస్త్రాలలో చెప్పిన ‘శిశువుకు తల్లిదండ్రులు, శిష్యుడికి గురువును మించిన దైవం లేరు. వారి సేవను మించిన తీర్థ యజ్ఞాదులు లేవు. జన్మను తరింపజేసుకోవడానికి మాతాపితరుల సేవ, గురుసేవను మించిన మార్గం లేదు’ అనే సూక్తిని చదివి, గురువు కోసం అన్వేషణ ప్రారంభించాడు.ఇంటి నుంచి దీపకుడు కాలినడకన బయలుదేరాడు. దారిలో కనిపించిన వారిని తగిన గురువు కోసం వాకబు చేయసాగాడు. గోదావరి తీరంలో వేదధర్య మహర్షి వేదవేదాంగ పారంగతుడని, గురుకులం నిర్వహిస్తూ ఎందరికో విద్యాబోధన చేస్తున్నాడని చాలామంది చెప్పారు. వేదధర్యుడి ఆశ్రమం ఎక్కడ ఉన్నదో బాటసారులను కనుక్కొని తన ప్రయాణం కొనసాగించాడు. కొద్దిరోజుల ప్రయాణం తర్వాత ఆశ్రమానికి చేరుకున్నాడు. శిష్యులతో వేదం వల్లె వేయిస్తున్న వేదధర్యుడిని చూసి, నేరుగా ఆయన వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేశాడు.దీపకుడి వినయశీలతకు వేదధర్యుడు ముచ్చటపడ్డాడు. అతడిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. దీపకుడు గురుసేవ చేసుకుంటూ, విద్యాభ్యాసం కొనసాగించాడు. అనతికాలంలోనే వేద శాస్త్ర పురాణాలన్నింటినీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. శిష్యుడి విద్యాతేజస్సుకు వేదధర్యుడు అబ్బురపడ్డాడు. ఒకనాడు ఆయన దీపకుడిని పిలిచి, ‘కుమారా! నేను గత జన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. రెండు భయంకరమైన పాపాలకు మాత్రం ఫలితాన్ని ఇంకా అనుభవించాల్సి ఉంది. చేసిన కర్మమే చెడని పదార్థం కదా! సాక్షాత్తు విశ్వనాథుని ధామమైన పవిత్ర కాశీక్షేత్రంలో నేను ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోదలచాను.పుణ్యక్షేత్రంలో ఏ పనికైనా ఫలితం రెండింతలుగా ఉంటుంది. నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తం కోసం ఆవాహన చేయగానే నాకు భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ ఉంటుంది. వికార రూపం వస్తుంది. కొన్నాళ్లకు అంధత్వం వస్తుంది. అలాంటి పరిస్థితిలో కఠినాత్ముడినై, ఇతరుల సేవ కోసం దీనంగా ఎదురుచూస్తుంటాను. నేను ఆ దుస్థితిలో ఉన్నప్పుడు నాకు సేవ చేయగలవా?’ అని అడిగాడు.‘గురువర్యా! నేను మీ పాపాలను ఆవాహన చేసుకుని, వాటి ఫలితాన్ని అనుభవిస్తాను. దయచేసి నాకు అనుమతి ప్రసాదించండి’ అని వేడుకున్నాడు దీపకుడు.‘దీపకా! నువ్వు నీ వంశానికే కులదీపకుడవు. అయినా, ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను’ చెప్పాడు వేదధర్యుడు.గురువు ఆనతి ప్రకారం దీపకుడు ఆయనను కాశీకి తీసుకువెళ్లాడు.కాశీలోని మణికర్ణికకు ఉత్తరాన ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరుకుని, అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు.గురువు చెప్పినట్లే జరిగింది. కాశీకి చేరుకున్న కొద్దిరోజులకే వేదధర్యుడి కుష్ఠువ్యాధి సోకింది. క్రమక్రమంగా అతడి శరీరం క్షీణించసాగింది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ, వేళ్లు తెగిపోయి, వికృతాకారుడిగా మారాడు. ఇంకొన్నాళ్లకు అంధుడైపోయాడు. గురువు పరిస్థితికి దీపకుడు చాలా దుఃఖించాడు. గురువును కంటికి రెప్పలా చూసుకుంటూ, నిత్యం ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ, పరిచర్యలు చేసేవాడు. భిక్షకు వెళ్లి, దొరికిన భోజనాన్ని గురువుకు పెట్టేవాడు. ప్రతిరోజూ దీపకుడు తెచ్చిన భిక్షను తానొక్కడే తినేస్తూ, ‘ఇంత కొంచెమే తెచ్చావెందుకు?’ అంటూ దుర్భాషలాడేవాడు. గురువు కోపతాపాలను సహిస్తూనే దీపకుడు ఆయనను అంటిపెట్టుకుని ఉంటూ సేవలు చేసేవాడు.దీపకుడి అచంచల గురుభక్తికి కాశీ విశ్వనాథుడు ముగ్ధుడయ్యాడు. రోజూ మాదిరిగానే ఒకనాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడికి ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ గురుభక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘స్వామీ! నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప మరేదీ తెలియదు. మా గురువు అభీష్టమేదో కనుక్కొని చెబుతాను’ అన్నాడు. ఆశ్రమానికి వెళ్లాక గురువుకు ఈ విషయం చెప్పాడు. ‘గురుదేవా! మీకు స్వస్థత కోరుకుంటాను’ అన్నాడు.‘నాయనా! ఎవరి పాపాలకు ఫలితాన్ని వారు అనుభవిస్తేనే పోతాయి’ అని చెప్పాడు వేదధర్యుడు.మరునాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడు పరమేశ్వరుడిని ఏ వరమూ కోరుకోలేదు.పరమేశ్వరుడు దీపకుడి సంగతిని పార్వతీదేవికి, ఆ తర్వాత శ్రీమన్నారాయణుడికి, సమస్త దేవతలకు చెప్పి సంబరపడిపోయాడు.శ్రీమన్నారాయణుడు దీపకుడికి ప్రత్యక్షమై, ‘వత్సా! సాక్షాత్తు పరమేశ్వరుడినే మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యం. ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు.‘స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు, చాలు’ అని పలికాడు దీపకుడు.‘తథాస్తు’ అని అనుగ్రహించాడు శ్రీమహావిష్ణువు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: దృశ్యమాలిక
గలగలా మాట్లాడుతూ చైతన్యానికి ప్రతీకలా ఉండే అమ్మని ఇలా చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు. కష్టసుఖాల్లో నా వెన్నంటే ఉన్న ఆవిడ నాకు అమ్మ మాత్రమే కాదు; స్నేహితురాలూ, గురువూ, దైవం అన్నీనూ! భర్తతోనూ, పిల్లలతోనూ, స్నేహితురాళ్ళతోనూ, మరెవ్వరితోనూ చెప్పుకోలేని విషయాలని అమ్మతో పంచుకుంటుండే నాకు ఏ ఒక్కరోజైనా అమ్మతో మాట్లాడలేకపోతే ఆ రోజంతా ఎంతో వెలితిగా వుండేది. నిన్న రాత్రి కూడా అమ్మతో దాదాపు గంటసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడాను. అలాంటిది తెల్లవారు జాముకల్లా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందన్న దుర్వార్తని వినవలసి వస్తుందని నేను కలలోనైనా ఊహించలేదు. ‘జాతస్య మరణం ధ్రువం’ అని తెలిసినా, నాకు అత్యంత ఆత్మీయురాలైన అమ్మ విషయంలో మాత్రం నేను దాన్ని అన్వయించుకోలేకపోతున్నాను. ‘చదువుకో తల్లీ నీకు సౌఖ్యమబ్బేను, ఆడుకోవమ్మా నీకు హాయి కలిగేను’ అంటూ అమ్మ చల్లని గొంతుతో పాడే జోల నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే వుంది.‘చిన్నా, చిన్నా’ అంటూ అమ్మ నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తోంది. ఒకటా, రెండా– ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు. నా మదిలో అలలు అలలుగా కదులుతూ నన్ను ఒక రకమైన సుషుప్తిలోకి నెట్టేస్తున్నాయి. ‘అమ్మా, చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు’ అని చెప్పగానే, ‘ఎవరమ్మా నా చిట్టితల్లిని కొట్టిందీ, హన్నా’ అంటూ నా తరఫున వకాల్తా పుచ్చుకొని, అన్నయ్యకి రెండు అంటించి మురిపెంగా నన్ను ఎత్తుకుని ముద్దాడిన అమ్మ! ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో చివరి పరీక్షకి ముందురోజున ‘నేను ఈ సబ్జెక్టు సరిగ్గా చదవలేదు, ఫెయిలయిపోతాను’ అంటూ అమ్మ ఒళ్లో తల పెట్టుకుని భోరుమని ఏడుస్తుంటే, ‘ఊరుకో చిన్నా, ముందు కాసేపు ప్రశాంతంగా నిద్రపో’ అంటూ తన ఒళ్లో నన్ను నిద్రబుచ్చి, రెండుగంటల తర్వాత ‘చిన్నా, ఇంక మేలుకోమ్మా’ అంటూ నా చేతిలో కాఫీ పెట్టి నేను చదువుకుంటున్నంతసేపూ నాతో పాటే తనూ ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోవడమే కాకుండా, ఆ మరుసటి రోజు నన్ను వెంటబెట్టుకుని కాలేజీ వద్ద దిగబెట్టి, నేను పరీక్ష రాసి బైటకి వచ్చేదాకా కాలేజీ గేటు పక్కనే నా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ నిలుచున్న అమ్మ!సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్లో నెగ్గాక ఇంటర్వ్యూ ముందు రోజున ‘అమ్మా బోర్డులో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఏమో’ అని నేను భయపడుతుంటే, ‘ఏడాది పాటు ఒకే లక్ష్యంగా, అకుంఠిత దీక్షలా, అహర్నిశలూ చదివిన నీకు ఈ ఇంటర్వ్యూ ఒక లెక్కా? అంతా సవ్యంగానే జరుగుతుంది, ధైర్యంగా వుండమ్మా’ అంటూ నాపై నాకు నమ్మకాన్ని పెంచిన అమ్మ! ఐఏఎస్కి సెలక్టయి ట్రైనింగ్కి వెళ్ళాక ‘అమ్మా, ఇక్కడ అంతా నార్త్ ఇండియన్సే వున్నారు. వాళ్ళతో నేను కలవలేక పోతున్నాను. హాస్టల్లో భోజనం కూడా అస్సలు బావుండడం లేదు. పుల్కాలు, మసాలా కూరలూ తినలేక పోతున్నాను’ అంటూ ఫోన్లో నా కష్టాలని ఏకరువు పెట్టిన పదిహేను రోజుల్లోనే ఆవకాయ, మాగాయ జాడీలు పట్టుకుని నా దగ్గరకు వచ్చేసి, నా ట్రైనింగ్ పూర్తయ్యేదాకా నాకు వండి పెడుతూ, నా దగ్గరే ఉండిపోయి, వచ్చీరాని హిందీలో అక్కడ అందరితో మాట్లాడుతూ వాళ్లకి మన వంటలనీ, ఆప్యాయతనీ రుచి చూపిస్తూ మెల్లిమెల్లిగా వాళ్లందరినీ నాకు ఫ్రెండ్స్ని చేసేసిన అమ్మ! ‘అమ్మా, ఎప్పుడూ నా తోడూనీడగా ఉండేదానివి. ఇలా ఉన్నట్టుండి నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? లేమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నన్ను ఒక్కసారి చిన్నా అని పిలువమ్మా’ అంటూ పెద్దగా ఏడ్చేస్తున్నాను.∙∙ ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ పిల్లలు గట్టిగా కుదుపుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.ఎదురుగా చేతిలో పుష్పగుచ్ఛం పట్టుకుని మా పిల్లలు మన్వి, తన్వి.‘ఏమిటి సిరీ, అత్తయ్యగారుగాని మళ్ళా కలలోకి వచ్చారా?’ అన్న మావారి మాటలకు అవునన్నట్టుగా తలుపాను.పిల్లలిద్దరూ కలిసి నా చేతిలో పుష్పగుచ్ఛం పెట్టి ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అంటుంటే వాళ్లవైపు నిరాసక్తంగా చూశాను. దాంతో పిల్లల్లోని ఉత్సాహం అంతా నీరు కారిపోవడం గమనించిన మా వారు వెంటనే ‘మీరు వెళ్లి హాల్లో ఏర్పాట్లు చేస్తుండండి. నేను అమ్మని తీసుకొస్తాను’ అని చెప్పి వాళ్ళని పంపించారు.‘అలాగే డాడీ’ అంటూ పిల్లలు హాల్లోకి వెళ్ళాక ‘ఇప్పుడు ఈ వేడుకలు ఎందుకండీ’ అంటున్న నన్ను మధ్యలోనే ఆపేసి, ‘అత్తయ్యగారు పోయి ఇంతకాలమైనా నువ్వింకా ఇలాగే ఉంటే ఎలా సిరీ? రోజుల తరబడి నువ్విలా నిస్తేజంగా ఉంటుంటే నిన్ను చూసి పిల్లలు ఎంత బెంగ పడుతున్నారో నీకేమైనా తెలుస్తోందా అసలు?’ అన్న ఆయన మాటలకి నాలో కోపం ఉవ్వెత్తున పొంగుకొచ్చింది.‘అదేమిటండీ, అలా మాట్లాడతారు? పోయింది ఎవరో దూరపు బంధువు కాదు, మా అమ్మ. ఆవిడతో నాకున్న అనుబంధం తెలిసీ మీరిలా...’ అంటుంటేనే నా గొంతు గద్గదమైంది.అది చూసి మా వారు తగ్గిపోయారు.‘నిన్ను బాధపెట్టాలని కాదు సిరీ. నిజమే, తల్లి లేని లోటు ఎవరూ తీర్చేది కాదు. అలాగని నీ విధుల్ని నువ్వు మర్చిపోకూడదు కదా! నీపై ఆధారపడ్డ ఒక కుటుంబం ఉంది. నువ్వు ఇద్దరు పిల్లలకి అమ్మవి, నాకు భార్యవి’ అన్నారు.‘మీకు చేయవలసిన వాటిలో నేను ఏ విధమైన లోటు చేశానండీ? మనసులో బాధ పొంగి పొర్లుతున్నా వేళకి అందరికీ అన్నీ అందిస్తూనే ఉన్నానుగా’ ఉక్రోషంగా అన్నాను.‘నిజమే, అన్నీ చేస్తూనే ఉన్నావు. కాని, ఇలా మొహంలో కళాకాంతులు లేకుండా, జీవితంలో సర్వం కోల్పోయినదానికి మల్లే తిరుగుతున్న నిన్ను చూసి పిల్లలు కూడా దిగాలుగా, మొహాలు వేళ్ళాడేసుకుని వుంటున్నారు. వాళ్ళల్లో హుషారు రోజురోజుకీ తగ్గిపోతుందన్న విషయం నువ్వు గమనించావా? అయినా పుట్టినరోజు పూట మన మధ్య ఇటువంటి వాదనలు వద్దుగాని, నీకోసం పిల్లలిద్దరూ కలిసి నీ పుట్టినరోజుని ప్రత్యేకంగా చేసి నిన్ను సంతోషపెట్టాలని చూస్తున్నారు సిరీ. నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంచారు. నువ్వు కాదంటే వాళ్ళు బాధపడతారు, పద’ అంటూ హాల్లోకి తీసుకెళ్లారాయన.అక్కడ టేబుల్పైన అందంగా అలంకరించిన కేకు, క్యాండిల్స్, ఇంకా రకరకాల గిఫ్టులు.వాటిని చూసిన నా మొహం విప్పారలేదు. ఎందుకంటే, పుట్టినరోజు అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే! నెలరోజుల ముందునుండే పిల్లలకి ఫోన్ చేసి, ‘పిల్లలూ, ఈసారి అమ్మ పుట్టినరోజు ఎలా చేస్తున్నారూ, అమ్మకి ఏం బహుమతులిస్తున్నారూ’ అంటూ హడావిడి చేస్తూండేది అమ్మ! ఇంక ఆరోజునైతే అందరికంటే ముందే ఫోన్ చేసి, ‘చిన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నా ఆయుష్షు కూడా పోసుకుని పదికాలాల పాటు చల్లగా ఉండు చిట్టితల్లీ’ అంటూ ఆశీర్వదించేది. అలాంటి అమ్మ లేని పుట్టినరోజు పండుగా, ఒక పండుగేనా ! అమ్మ ఆశీస్సులతో మొదలయ్యే వేడుకని అమ్మ లేకుండా జరుపుకోవడం నాకేమాత్రం ఇష్టం లేకున్నా, ఆయన చెప్పినట్టుగా పిల్లల మనసుల్ని కష్టపెట్టకూడదన్న ఉద్దేశంతో కేకు కట్ చేసి పిల్లలకీ, ఆయనకీ నా చేత్తో తినిపించాక, నిర్లిప్తంగా వంటింట్లోకి నడవబోతుంటే, ‘ఉండమ్మా, అసలైన సర్ప్రైజ్ పైనుంది, రా’ అంటూ పిల్లలిద్దరూ నా చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లారు. మాది రెండంతస్తుల మేడ. పై అంతస్తులో మేమంతా క్రికెట్ మ్యాచ్లూ, సినిమాలూ చూసే హోమ్ థియేటర్ ఉంది.అక్కడ స్విచ్ ఆన్ చేయగానే చిరునవ్వుతో కనిపించిన అమ్మని అబ్బురంగా చూస్తుండిపోయాను.‘చిన్నా, ఎలా ఉన్నావురా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నిండునూరేళ్లు సుఖశాంతులతో ఆనందంగా జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష’ అన్న అమ్మ మాటలకి నాలో ఆనందం పరవళ్ళు తొక్కింది.శివసాన్నిధ్యాన్ని చేరుకున్న అమ్మ ఇలా నా ఎదురుగా నిలుచుని ఎలా మాట్లాడగలుగుతోందో అర్థంకాక నేను తెల్ల మొహం వేస్తే, పిల్లలిద్దరూ ముసిముసిగా నవ్వుతూ, ‘ఇంకా ఉంది చూడమ్మా’ అన్నారు.దాదాపు గంట నిడివి ఉన్న ఆ త్రీడీ వీడియోలో అమ్మతో నా మధురస్మృతులని పొందుపరచిన ఎన్నో ఫొటోలు, మేమిద్దరం కలిసి వెళ్లిన టూర్లలో, ఫంక్షన్లలోని చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు, అక్కడక్కడ అమ్మ స్వయంగా తన గళంతో చెబుతున్న కబుర్లూ!అదంతా చూశాక చెప్పలేనంత ఆనందంతో నా మనసు నిండిపోయింది. ఇన్నాళ్ళుగా నా హృదయాన్ని కలచివేస్తున్న బాధంతా ఒక్కచేత్తో తీసేసినట్టుగా బుగ్గలపై నుండి జాలువారుతున్న అశ్రువులను తుడుచుకుంటూ ‘ఎప్పుడు చేశారమ్మా ఇవన్నీ?’ అని నేను అడుగుతుంటే మా వారు నా వెనక నుండి ముందుకొచ్చి, ‘దాదాపు నెలరోజుల పైనుండి పిల్లలు ఎంతో కష్టపడి ఈ వీడియోని తయారు చేశారు. ఇప్పుడొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా త్రీ డీ టెక్నాలజీ సాయంతో అత్తయ్యగారు నీ ఎదురుగా నిలబడి, నీతో మాట్లాడుతున్నట్టుగా వీడియో క్లిప్పింగులు, స్పెషల్ ఎఫెక్ట్లు జత చేసి తయారుచేశారు. ఇదంతా కూడా నిన్ను ఆనందపెట్టాలన్న తపనతో చేశారు వాళ్ళు. అలాంటిది, నువ్విలా ఏడుస్తుంటే ఎలా చెప్పు?’ అంటూ తన చేత్తో నా కన్నీళ్ళని తుడిచారు.‘ఇవి కన్నీళ్ళు కావండీ, ఆనందభాష్పాలు. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళేగా వచ్చేది’ అంటూ పిల్లలిద్దరినీ దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో పిలవడం ఆలస్యం, మొహాలు చాటంత చేసుకుని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారిద్దరూ.వాళ్ళ నుదుటిన ముద్దాడుతూ, ‘థాంక్యూ సో మచ్ బుజ్జి కన్నలూ. మీ అమ్మమ్మకి తిరిగి ప్రాణం పోసి నా కళ్ళ ముందు నిలిపారు’ అన్నాను.నా మాటలకి వాళ్ళ మొహాలు మతాబుల్లా వెలిగిపోగా ‘అక్కా, ఎన్ని రోజులయింది కదా అమ్మ మనల్ని ఇలా ‘బుజ్జికన్నలూ’ అని పిలిచి’ అన్న మన్వి మాటలకి ‘అవును తన్వీ, ఇంకా కొన్నాళ్ళయితే మనం ఆ పిలుపే మర్చిపోయేవాళ్ళమేమో’ అంది తన్వి.ఆ మాటలు వింటుంటే ‘అయ్యో, నా నిరుత్సాహంతో పిల్లలని నేను ఇంత బాధపెట్టానా’ అనిపించింది. అదే మాట మా వారితో అనగానే, ఆయన వెంటనే ‘తల్లి పోతే బాధ ఉండడం సహజమే సిరీ. అందులోనూ నువ్వు ఆవిడ గారాల కూతురివి కాబట్టి ఆ బాధ నుండి బయటపడేందుకు నీకు మరింత సమయం కావాల్సి వచ్చింది, అది నేను అర్థం చేసుకోగలను. నిజానికి, మనుషులు చనిపోవడం అంటే భౌతికంగా వాళ్ళు ఇక్కడ మనతో లేకపోవడం. అంతే! వాళ్లతో మనకున్న అనుబంధమూ, వారి జ్ఞాపకాలూ ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి, వాటికి మరణం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతకాలం వారు వదిలి వెళ్ళిన ఆ మధురస్మృతులని నెమరేసుకుంటూ మనసులో మరింత ఆనందాన్ని పోగేసుకుంటూ, వాటిని తరగని ఆస్తిగా మలచుకుని రాబోయే తరాలకి అందివ్వాలే తప్ప, వాళ్ళు మన మధ్యన లేరన్న విషయాన్ని అదేపనిగా తలుచుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు’ అన్నారు.ఆయన చెబుతున్నదాన్ని శ్రద్ధగా వింటున్న నాకు, ఆ మాటల్లో ఆ క్షణాన ఏదో అంతర్లీనమైన సందేశం వున్నట్టనిపించింది.∙∙ ఆ మరుసటి రోజున మన్వి స్కూల్కీ, ఇంకా తన్వి దాని స్నేహితురాలి ఇంటికీ వెళ్ళాక అమ్మతో కలిసి దిగిన ఫొటోలున్న ఆల్బమ్స్ అన్నింటినీ మంచంపై పరచుకుని తీరిగ్గా ఒక్కో ఫొటో తిరగేయసాగాను. ప్రతి ఫొటో వెనకా మరచిపోలేని అందమైన జ్ఞాపకాలు నా ఎదుట నిలిచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ‘ఈ స్మృతులన్నింటినీ దృశ్యమాలికలుగా నిక్షిప్తం చేస్తే కలకాలం సజీవంగా వుంటాయి కదా’ అన్న ఆలోచన తళుక్కుమనగానే వెంటనే లేచి అల్మారాలో వున్న డిజిటల్ కెమెరాని బయటకి తీశాను.ఒక్కో ఫొటోపై కెమెరాని ఫోకస్ చేస్తూ ఆ ఫొటోకు సంబంధించిన సందర్భాన్ని చక్కటి మాటల్లో నాకు తోచినట్టుగా అర్థవంతంగా వివరించడం మొదలెట్టాను. అలా చేస్తూ ఎంతసేపున్నానో తెలియదు.కాలింగ్ బెల్ మోగడంతో లేచొచ్చి తలుపు తీస్తే ఎదురుగా మన్వి !‘అప్పుడే స్కూల్ అయిపోయిందా’ అంటూ గోడగడియారం వైపు చూసి, ‘అమ్మో, సాయంత్రం నాలుగు గంటలు దాటింది. పనిలో పడి టైం చూసుకోలేదు. మీకోసం నేనింకా టిఫిన్ కూడా తయారు చేయలేదు’ అని నేను కంగారుపడుతుంటే తన్వి కూడా లిఫ్ట్ తలుపు తెరుచుకుని రావడం కనిపించింది.దాంతో ‘కాళ్ళూ చేతులూ కడుక్కురండి. ఈలోగా నేను మీకోసం స్నాక్స్ చేస్తాను’ అంటూ గబగబా వంటింట్లోకి నడిచాను.ఫ్రిజ్లో నుంచి దోసెపిండిని బయటకి తీసి, ఉల్లిపాయలూ, పచ్చి మిరపకాయలూ సన్నగా తరిగి కలిపి వాటితో వేడి వేడిగా పొంగనాలు వేసి ప్లేట్లలో సర్ది హాల్లోకి తీసుకోచ్చేటప్పటికి అక్కడ నేను పరిచిన ఫొటోలని తదేకంగా చూస్తూ కనిపించారు పిల్లలు.నా చేతుల్లో నుండి టిఫిన్ ప్లేట్లు అందుకుంటూ ‘అమ్మా, ఈ ఫొటోల్లో అమ్మమ్మ ఎంత చిన్నగా, సన్నగా వుందో! అన్నట్టు, కెమెరాతో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఫొటోలని డిజిటలైజ్ చేస్తున్నావా?’ అని అడిగిన పిల్లలకి నేనేం చేస్తున్నదీ వివరించాను.‘నువ్వు బ్యాక్ గ్రౌండ్లో ఉంటూ నీ గొంతు మాత్రమే వినిపించేకంటే, నువ్వు కూడా ఫొటో పక్కనే కనిపిస్తుంటే బాగుంటుంది కదమ్మా! ఫొటోని చూపిస్తూ నువ్వు మాట్లాడుతుంటే నేను వీడియో తీస్తాను’ అంది ఫొటోగ్రఫీ మీద మక్కువున్న నా చిన్నకూతురు మన్వి.‘మన్వి చెప్పింది బావుందమ్మా. ఎప్పటికప్పుడు ఒక వీడియో అయిపోగానే అది నాకు ఇచ్చేశావంటే నేను దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెరుగులు దిద్దుతాను’ అంది ఇంజినీరింగ్ చదువుతున్న నా పెద్ద కూతురు తన్వి. ఆ వెంటనే ‘నేను ఎలాగో నెలరోజుల తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఈ వీడియోలని చూసుకుంటే నువ్వు నా దగ్గరే ఉన్నట్లుగా ఉంటుంది’ అని కూడా అంది.దాని మాటలకి ఆలోచనలో పడ్డాను.‘పిచ్చిపిల్ల, ఇప్పుడైతే హాస్టల్లో దూరంగా ఉంది కాబట్టి అమ్మని తన దగ్గరే చూసుకోవాలని అనుకుంటోంది, అదే ఆ తర్వాత, మా అమ్మలాగే నేనూ ఈ లోకాన్ని వీడిపోయాక? ఎప్పుడోకప్పుడు నేను కూడా వెళ్ళిపోవలసిన దాన్నేగా! ఎవరి ఆయుష్షు ఎన్నాళ్ళో ఎవరికి తెలుసు?’నా మనసు పరిపరివిధాలు పోసాగింది.‘తన్వి మనసు చాలా సున్నితం. చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుంటుంది. నేను ఎప్పుడైనా ఆఫీసు పనిపై ఊరు వెళ్ళవలసి వస్తే నాలుగురోజుల ముందునుండే దిగులు పడుతుండేది. ఇంజనీరింగులో చేరి సంవత్సరంన్నర దాటినా ఇంకా దానికి హోం సిక్నెస్ పోలేదు. సెలవులకి ఇక్కడి వచ్చీ తిరిగి వెళ్ళిపోయే రోజున చాలా అయిష్టంగా హాస్టల్కి వెళ్తుంది. ఇంక మన్వికైతే ఇంకా చిన్నతనం పోలేదు. పసిపిల్లకి మల్లే మారాం చేస్తుంటుంది నా దగ్గరా, వాళ్ళ అక్క దగ్గరా! నేను కాస్త దిగులుగా ఉంటేనే తట్టుకోలేని ఈ పిల్లలు నేను ఏకంగా ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే, ఆ బాధని తట్టుకోగలరా? మా అమ్మని తలచుకుంటూ నేను ఇంతలా బాధపడుతున్నాను కదా, మరి నేను వెళ్లిపోయాక నా పిల్లలూ నాలాగే నా గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో! అమ్మో, అలా అస్సలు కాకూడదు’అలా అనుకోగానే నా మదిలో చటుక్కున ఒక ఆలోచన అంకురించింది .‘నేను పోయాక, ఆ బాధ నుంచి పిల్లలు త్వరగా కోలుకునేందుకుగానూ వాళ్ళతో వర్తమానంలో నాకున్న అనుబంధం గురించే కాకుండా, భవిష్యత్తులో వాళ్లకి ఎదురయ్యే వివిధ సమస్యలకి నా అనుభవంతో నేను ఇచ్చే సలహాలనీ, సూచనలనీ నా మాటలతో వివరించే వీడియోలను చేస్తే, అవి పిల్లలకి సాంత్వనని కలిగించడమే కాకుండా ముందుముందు వాళ్లకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి.’అలా అనుకున్నాక నా మనసు కాస్త ఊరటపడింది. ∙∙ ఆ రాత్రి నా ఆలోచనని ఆయన ముందుంచుతూ ‘యాభైఏళ్లకే నేనిలా ఆలోచించడం అశుభం అంటారా? నా ఆలోచనా విధానంలో లోపం ఉందంటారా, నేను నెగటివ్గా ఆలోచిస్తున్నానంటారా?’ అని అడిగాను.‘అదేం లేదు సిరీ. జీవితం క్షణభంగురం. ఎవరికైనా సరే నుదుటిన రాసిపెట్టి ఉన్నంత కాలమే ఈ పృథ్విపై స్థానం ఉంటుంది. పోయిన వాళ్లతో కలిసి మనమూ పోలేము కాబట్టి వాళ్ళతో పంచుకున్న అనుభూతులని పదిలపరుచుకోవడమూ, అలాగే మనమూ ఎల్లకాలమూ ఇక్కడ ఉండబోమన్న అవగాహనతో మన పిల్లలతో ముడిపడి వున్న బాంధవ్యాన్ని పదిలంగా భద్రపరుచుకోవడమూ చక్కటి ఆలోచనే. కాబట్టి మనసులో ఏ శంకలూ పెట్టుకోకుండా గో ఎహెడ్. అలాగే నువ్వు కూడా ఇంక ఆఫీసుకి వెళ్ళడం మొదలెడితే కాస్త త్వరగా మనుషులలో పడతావు. నీ చదువు, ఉద్యోగం వెనకాల అత్తయ్యగారి ప్రోత్సాహం అంతా ఇంతా కాదనీ, ఆవిడే లేకపోతే జీవితంలో నువ్వేమీ సాధించలేకపోయే దానివనీ నాతో నువ్వే చాలాసార్లు చెప్పావు. అలాంటిది ఇప్పుడు ఆవిడ ఈ లోకంలో లేదన్న బాధతో నువ్వు నీ శక్తిసామర్థ్యాలని కుదించేసుకుని ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆవిడ ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా నీ సెలవుని రద్దు చేసుకుని ఆఫీసులో చేరిపోయి మనుషుల్లో పడేందుకు ప్రయత్నం చేయి సిరీ’ ఆయన మాటలతో నా ఆలోచనకి బలం కలగడమే కాకుండా నా కర్తవ్యం కూడా నాకు బోధపడింది..∙∙ ఆ మరుసటి సోమవారమే ఆఫీసులో చేరిపోయాను. ఇంక అప్పటి నుంచి తీరిక సమయాల్లో అమ్మతో, పిల్లలతో ఇంకా మావారితోనూ నా అనుబంధాన్ని దృశ్యమాలికలుగా మలుస్తూ , మా అమ్మ జ్ఞాపకాలకి ప్రాణం పోస్తూ ఆవిడ ఈలోకంలో లేదన్న బాధనుంచి మెల్లిమెల్లిగా తేరుకోవడం మొదలెట్టాను. దాంతో, మావారూ హ్యాపీ, పిల్లలూ హ్యాపీ, వెరసి కుటుంబమంతా హ్యాపీ. కాలం అన్ని గాయాలనీ మాన్పుతుంది. నిజమే కాని, దానికి మనవంతు కృషి మనమూ జోడిస్తే గాయం కాస్త త్వరగా నయమవుతుంది కదూ! -
కొండవీడు కత్తుల బావి
పర్యాటక ప్రాంతాల్లో అలనాటి రాజుల కోటలు ముందు వరుసలో ఉంటాయి. వాటి చరిత్ర, శిల్పకళ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. దేశంలో అనేక కోటలు పర్యాటక కేంద్రాలుగా మారి, చరిత్ర ప్రేమికులను, సాహస యాత్రికులను, సాధారణ పర్యాటకులను కూడా అలరిస్తున్నాయి. అలాంటి కోవకు చెందినదే ఈ కొండవీడు కోట.ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ కోటల్లో ఒకటి. కోటకు వెళ్లేమార్గం, పాములా వంకర్లు తిరిగిన ఘాట్ రోడ్డుపై ప్రయాణం ఉత్సాహభరితంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకంగా కొండవీడు నూతన శోభను సంతరించుకుంటోంది. ఒకప్పటి ఈ అద్భుత నిర్మాణం నేడు శిథిలావస్థకు చేరింది. అయినా ఆనాటి కట్టడాలు, ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో కొండవీటి కొండపై ఉంటుందీ కోట. రెడ్డి రాజుల్లో మొదటి వాడైన ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం అతని కుమారుడు అనపోతారెడ్డి రాజయ్యాక, అద్దంకి నుంచి రాజధానిని కొండవీడుకు మార్చాడు. శత్రుమూకల దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడటానికి ఈ కోటను నిర్మించాడు.2010లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రుచీ సింగ్, హిస్టరీ ప్రొఫెసర్ కేవీ రావులు కొండవీడును సందర్శించారు. అదే సమయంలో శివాలయం గర్భగుడి కింద బౌద్ధ చైత్యం వెలుగు చూసింది. శాతవాహనుల కాలంలోనే కొండవీడు బౌద్ధక్షేత్రంగా విరాజిల్లిందని చరిత్ర చెబుతోంది.ఆ బురుజులే కాపలాకేంద్రాలు కొండవీడు దుర్గంలో 72 కోట బురుజులతో పాటు ప్రాకారాలు, ధాన్యాగారాలు, దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, మసీదు, ఖజానా వంటి నిర్మాణాలు నాటి చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. తారా బురుజు, జెట్టి బురుజు, నెమళ్ల బురుజులు వీటిలో ప్రత్యేకమైనవి. ఈ బురుజులే నాటి సైనికుల కాపలా కేంద్రాలుగా ఉండేవి. శత్రువులు కొండ వరకు రాకుండా కొండల దిగువ చుట్టూ కందకాలను వెడల్పుగా తవ్వి, ఆ నీటిలో మొసళ్లను వదిలారు.నీటి సమస్య రాకుండా..కోట పరిసరాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు జరపగా రెండువేల ఏళ్లనాటి బౌద్ధస్థూపం, మట్టిపాత్రలు, చైనాకు సంబంధించిన పింగాణీ పాత్రల ముక్కలు బయటపడ్డాయి. నీటి అవసరాల కోసం కొండమీద ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల అనే మూడు గొలుసుకట్టు చెరువులు తవ్వారు. ఈ మూడూ సుమారు 12 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ మూడూ పూర్తిగా నిండితే కొండలమీదుగా కింది ప్రాంతాల్లోకి ప్రవహించి అక్కడి చెరువులు నిండేలా ఏర్పాటు చేసిన వ్యవస్థ నేటి తరానికి ఆదర్శప్రాయం.కత్తుల బావి నేపథ్యమిదీ!కొండవీడు కోట పేరు ప్రస్తావించగానే ముందుగా గుర్తుకొచ్చేది కత్తుల బావి. దీని వెనుక ఓ పెద్ద కథే వినిపిస్తుంది. ఆనాటి రెడ్డిరాజ్యంలోని 72 మంది సామంత రాజులను మట్టుబెట్టేందుకు ఓ బ్రాహ్మణుడు ఈ ఆలయం నిర్మించాడని ప్రతీతి. గర్భగుడి చెంతనే ఓ బావిని తవ్వించి, అందులో కత్తులు దాచి, సామంతరాజులను విందుకు ఆహ్వానించారని, బాలకృష్ణుని ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన సామంత రాజులంతా హత్యకు గురయ్యారని ఓ కథ ప్రచారంలో ఉంది. అలా ఆ బావిలో కత్తులు దాచినందువల్ల కత్తుల బావిగానూ, ఆ ప్రాంతం చీకటిగా ఉన్నందున చీకటి కోనేరుగానూ పేరొచ్చింది.విజయానికి చిహ్నంఈ ఆలయానికి అభిముఖంగా 45 అడుగుల ఎత్తులో ఏకశిలా విజయస్థూపం ఉంది. విజయనగర రాజులు కొండవీడును హస్తగతం చేసుకున్న విజయానికి సూచికగా ఈ ఏకశిలా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డిరాజుల పతనానంతరం కోట విజయనగర ప్రభువుల పరమైంది. అనంతరం గోల్కొండ సుల్తానుల చేతుల్లోకి వెళ్లింది.యునెస్కో గుర్తింపు లభిస్తే!2016లో తొలిసారిగా కొండవీడును చారిత్రక ప్రదేశంగా గుర్తించి, యునెస్కో జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై సమగ్రంగా పరిశీలించి నివేదిక పంపించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కొండవీడు సమగ్ర స్వరూపాన్ని వివరించే బ్లూప్రింట్ పనులు నిర్వహించేందుకు హైదరాబాద్లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్కిల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక దీన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడ జాబితాలో చేర్చితే ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కట్టడాలకు పునరుజ్జీవం లభిస్తుంది. కోట పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకంగా అభివృద్ధికి నోచుకుంటాయి. -
దొంగను పట్టుకుంటే ఘోరం వెలుగులోకి
సాధారణంగా పోలీసులు ఓ దొంగని పట్టుకుని విచారిస్తే ఏమవుతుంది? అప్పటి వరకు అతడు చేసిన చోరీల చిట్టా బయటకు వస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఆ చోరుడితో పాటు అతడికి తెలిసిన దొంగల జాబితాలు బహిర్గతం అవుతాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం పోయిన సొత్తు, సొమ్ముకు సంబంధించి యజమానులు తమ ఫిర్యాదుల్లో చెప్పిన తప్పుడు లెక్కలు తెలుస్తుంటాయి. 2002లో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోని షాహినాయత్గంజ్ పోలీసులు సాజిద్ అనే ఘరానా దొంగను పట్టుకున్నారు. ఇతడి విచారణలో కుందన్బాగ్ ప్రాంతంలో జరిగిన తల్లీ, ఇద్దరు కూతుళ్ల సామూహిక ఆత్మహత్య విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జయప్రదకు హైదరాబాద్కు చెందిన బడా వ్యాపారవేత్తతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కలిగిన తరవాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగా, జయప్రద తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కుందన్బాగ్లోని రెండంతస్తుల సొంత భవనంలో నివసించేది. కొన్నాళ్ల పాటు కుమార్తెలు తమ చదువుల కోసం కాలేజీలకు వెళ్లివెళ్లేవారు. కానీ, హఠాత్తుగా మానేశారు. తల్లితో పాటు ఇంట్లోనే ఉండిపోయారు. బయట నుంచి అందంగా కనిపించే ఆ భవంతి ప్రాంగణం మాత్రం పట్టించుకునే వాడు లేకపోవడంతో పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోయింది. పోర్టికోలో మాత్రం ఎప్పుడూ ఓ కారు ఆగి ఉండేది. తాను బయటకు వచ్చి పరిచయస్తులతో సంప్రదింపులు జరిపినా, ఇరుగుపొరుగు వారితో మాట్లాడినా తన గతం ప్రస్తావన వస్తుందనే ఉద్దేశంతో జయప్రద బాహ్యప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. అదే భావనతో తన పిల్లల్నీ ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసింది. ఫలితంగా ఈ కుటుంబానికి చుట్టుపక్కల వారితో పరిచయాలు, స్నేహాలు లేకుండా పోయాయి. ఈ ఇంటికి రాకపోకలు సాగించే వారు కూడా ఎవ్వరూ ఉండేవారు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట గడప దాటని ఈ కుటుంబం అప్పుడప్పుడు అర్ధరాత్రి వేళ మాత్రం బయటకు వచ్చి క్యాండిల్ వెలుగులో ఇంటి చుట్టూ సంచరిస్తుండేవారు. అలా వాళ్లు ఎందుకు చేస్తున్నారనే దానిపై స్థానికులు కొన్నాళ్లు ఆరా తీసినా విషయం తెలియలేదు. దీంతో కొందరు వీరి విషయం పట్టించుకోవడం మానేశారు. మరికొందరు భయంతో జయప్రద కుటుంబానికి, ఆ ఇంటికి దూరంగా ఉండిపోయారు. మిస్టరీగా మెలిగే ఈ కుంటుంబం అన్ని చెల్లింపులు ముందస్తుగానే చేసేది. కరెంట్ బిల్ ఏకంగా రెండుమూడేళ్లకు అడ్వాన్స్ కట్టేసేది. పాలు పోసే వ్యక్తికి, పేపర్ బాయ్కి దాదాపు ఏడాదికి సరిపడ డబ్బు ముందే ఇచ్చేది. ఏడాదికి అవసరమైన సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టుకునేది. ఎవ్వరి కంటా పడకూడదనే ఉద్దేశంతో ఇంటికి సమీపంలో ఉన్న చెత్తడబ్బా దగ్గరకీ తమ కారులో వెళ్లి చెత్తను పడేసి వచ్చేది. ఎవరికీ పట్టని, ఎవరినీ పట్టించుకోని ఈ కుటుంబంతో సమీపంలో ఉండే ఓ కాలేజీ విద్యార్థులు మాత్రం ఓ సందర్భంలో ఘర్షణపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రపంచానికి దూరంగా జయప్రద కుటుంబం నివసిస్తున్న ఈ ఇంట్లో 2002 జూన్ నెల నుంచి నిశ్శబ్దం నెలకొంది. అయినా ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పట్టించుకుని పోలీసులకు సమాచారం అందించలేదు.షాహినాయత్ గంజ్ పోలీసులు అదే ఏడాది సెప్టెంబర్ 15న ఇళ్లల్లో దొంగతనాలు చేసే ఘరానా దొంగ మహ్మద్ సాజిద్ను పట్టుకున్నారు. ఇతడి విచారణలో అనేక నేరాలు వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటే లోకం చూడని సామూహిక ఆత్మహత్యల సమాచారమూ వెల్లడైంది. కుందన్బాగ్లోని ఓ బంగ్లాలో తాను చోరీకి వెళ్లానని, ఆ ఇంటి ప్రధాన ద్వారం లోపలి నుంచి తాళం వేసి ఉండగా, పక్క ఉన్న మరో తలుపు తీసి ఉండటంతో లోపలకు ప్రవేశించానని చెప్పాడు. ఆ ఇంట్లోని బెడ్రూమ్లో మంచంపై ముగ్గురు మహిళల మృతదేహాలు పడి ఉన్నాయని, దీంతో తొలుత కాస్త భయపడినా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పదేపదే ఆ ఇంట్లోకి వెళ్లి వస్తూ అందినకాడికి సొత్తు ఎత్తుకుపోయానని బయటపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న షాహినాయత్గంజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కుందన్బాగ్ ప్రాంతం పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఆ అధికారులకు సమాచారం ఇచ్చి, వారితో కలిసి చోరుడిని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అతగాడు వరుస చోరీలు చేసిన ఇంటిని చూపించమని కోరారు. సాజిద్ నేరుగా తీసుకువెళ్లి జయప్రద ఇంటిని చూపించాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో, బెడ్రూమ్లో మంచంపై ఉన్న మూడు మృతదేహాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంటి వరండాలో గుట్టగా పడి ఉన్న వార్తాపత్రికలను సేకరించి పరిశీలించారు. అవి ఆ ఏడాది జూన్ 21 తేదీ నుంచి ఆ రోజు వరకు (సెప్టెంబర్ 15) సంబంధించినవిగా తేలడంతో 2002 జూన్ 20 రాత్రి ఈ ఆత్మహత్యలు జరిగినట్లు అంచనా వేశారు. ఆ గదిలో దొరికిన గుర్తుతెలియని విషం ఫినాయిల్గా తేలింది. మృతదేహాలకు సమీపంలోనే ఫినాయిల్ బాటిల్ సైతం పోలీసులకు లభించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుందన్బాగ్తో పాటు హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సామూహిక ఆత్మహత్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. -శ్రీరంగం కామేష్ -
అన్వేషణ
మృగరాజు సింహం చిట్టికూన గుహ ముందు ఆడుకుంటూ తప్పిపోయింది.మధ్యాహ్నం బయటకి వెళ్లి ఇంటికి రాలేదు. చిట్టికూన బుల్లి ఎలుగు, గున్న ఏనుగుతో ఆడుకునేది. మృగరాజు వాటిని పిలిచి విచారించాడు. ‘రాజా! ఇప్పటి వరకు ఇక్కడే కలిసి ఆడుకున్నాం!’ అంది బుల్లి ఎలుగు. ‘చెరువుకు వెళ్లి నీళ్లు తాగి ఎవరింటికి వాళ్లం వెళ్లాం!’ అంది గున్న ఏనుగు. మృగరాజు వెంటనే చెరువుకు వెళ్లి వెతికాడు. కాని, చిట్టికూన కనిపించలేదు.మృగరాజు వద్ద ఎంతోకాలంగా కొంగ, గుడ్లగూబలు గూఢచారులుగా కొలువు చేస్తున్నాయి.అవి అడవంతా తిరుగుతూ మృగరాజుకు రహస్య సమాచారాలు అందించేవి. మృగరాజు వెంటనే కొంగ, గుడ్లగూబలను పిలిపించాడు. మృగరాజు చెప్పేది వింటూనే కొంగ తన పొడవాటి మెడను నలుదిక్కులా తిప్పి పరిశీలించింది. వెంటనే ఎగిరి చెరువుకు పోయింది. చెరువు నుంచి గుహకు వస్తూ మర్రిచెట్టు దగ్గర ఆగింది.తన పదునైన నేత్రాలతో చుట్టూ పరికించి చూసింది. ఒక్క క్షణం ఆలోచించి వెంటనే గుహకు వచ్చి ‘ప్రభూ! చిట్టికూన తప్పిపోలేదు. ఎవరో ఎత్తుకు పోయారు!’ అంది కొంగ. ‘ఎత్తుకు పోయారా?’ లేచి నిలుచుంది సింహం.‘వేగులుగా మా ప్రతిభ మీకు తెలియంది కాదు. చిట్టికూన జాడ చిటికెలో కనిపెడతాం! మీరు నిశ్చింతగా ఉండండి!’ అంటూ గుడ్లగూబతో కలిసి గాలిలోకి ఎగిరింది కొంగ.అవి రెండూ వెళ్లి మర్రిచెట్టు మీద వాలాయి. ‘మిత్రమా! చిట్టికూనను నక్క ఎత్తుకుపోయి ఉండవచ్చు. నక్క పాద ముద్రలు మృగరాజు గుహ చుట్టుపక్కల కనిపించాయి. నాకు అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లాను. అవే పాదముద్రలు చెరువు దగ్గర కనిపించాయి. ఇక చిట్టికూన పాదముద్రలు, నక్క పాదముద్రలు పక్కపక్కనే ఈ మర్రిచెట్టు వరకే ఉన్నాయి. మర్రిచెట్టు దగ్గర చిట్టికూన పాదముద్రలు మాయమయ్యాయి. ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా కేవలం నక్క పాదముద్రలు ఉన్నాయి!’ పాదముద్రలు చూపిస్తూ వివరించింది కొంగ. పాదముద్రల వైపు పెద్ద పెద్ద కళ్లతో పరిశీలనగా చూసి చదునైన గుండ్రని తలను ఊపింది గుడ్లగూబ.‘మిత్రమా! చీకటి పడింది. నేను చీకట్లో ప్రయాణించలేను. చీకట్లో నీ దృష్టి, వినికిడి శక్తి అసాధారణం. ప్రత్యేకమైన నీ ఈకలతో నిశ్శబ్దంగా ఎగరగలవు. పాదముద్రల వెంట నక్క ఇంటికి వెళ్లి తనఖీ చేసిరా! పో..!’ అని పంపింది కొంగ.పాదముద్రలు పట్టుకొని నక్క గుహ దగ్గరకు చేరింది గుడ్లగూబ. గుహ బయట చిట్టికూన మల మూత్రాలను గమనించింది.గుహ లోపల గుర్రు పెట్టి నిద్రపోతుంది నక్క పక్కనే కట్టేసిన చిట్టికూన కనిపించింది.ఇంతలో తెల్లారింది. గుడ్లగూబను వెతుక్కుంటూ. మృగరాజు వెంట కొంగ రానే వచ్చింది. ‘రాజా! పక్క అడవి పులిరాజు చిట్టికూనను తెచ్చి ఇస్తే ఆ అడవికి మంత్రిని చేస్తానంటే ఆశతో ఎత్తుకొచ్చాను! నన్ను చంపొద్దు! మన్నించండి!’ అని కాళ్లు పట్టుకుంది. మృగరాజు నక్కకు అడవి బహిష్కరణ శిక్ష విధించాడు. వేగులైన కొంగ, గుడ్లగూబలు వేగంగా అన్వేషించి చిట్టికూనను కాపాడినందుకు అభినందించాడు మృగరాజు.-భార్గవి -
ఏమేమి తినచ్చు?
నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను. ఇంట్లో చాలామంది రకరకాల ఆహారపదార్థాలు తినొద్దు, బిడ్డకు సమస్య అవుతుంది అని అంటున్నారు? ఏ విధమైన ఆహారం, మందులు పాలిచ్చే తల్లులకు సురక్షితమో చెప్పండి? – దేశీత, అమరావతి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న తల్లులు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పత్యం ఉండాల్సిన అవసరం లేదు. కాని, మరీ ఎక్కువ పరిమితిలో ఆహారం తీసుకోకూడదు. డైట్లో మాంసం, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, పండ్లు, గింజలూ ఉండాలి. సమతుల ఆహారం అవసరం. కొన్ని చేపల్లో ఎక్కువగా పాదరసం ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి. ఆల్కహాల్ వద్దు. కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోవద్దు. టీ, కాఫీ, చాకొలేట్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కోల్డ్ అండ్ ఫ్లూ మెడిసిన్స్ వాడకూడదు. ఎక్కువ కాఫీ తాగితే బేబీకి నిద్ర సమస్యలు వస్తాయి. మీకు టీ, కాఫీ అలవాట్లు ఉంటే డీకెఫీనేటెడ్ కాఫీ, టీ తాగొచ్చు. లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకోవచ్చు. జలుబు, దగ్గు వస్తే యాంటీబయోటిక్స్ బదులు సింపుల్ కాఫ్ సిరప్ వాడాలి. మలబద్దకానికి హై ఫైబర్ డైట్ అవసరం. ఇందుకు లాక్టులోజ్ సిరప్ వాడొచ్చు. పైల్స్ ఉంటే ఆయింట్మెంట్స్ లేదా సపోజిటరీస్ వాడొచ్చు. తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలి లేదా పారాసెటమాల్ టాబ్లెట్స్ వాడొచ్చు.నాకు డెలివరీ అయి ఒకనెల అవుతుంది. నెల తర్వాత మళ్లీ చెకప్ కోసం రమ్మన్నారు. కాని, నేను మా ఊరిలో ఉన్నాను. ఈ సమయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? – జాగృతి, శ్రీకాకుళం. డెలివరీ తరువాత రెండు నెలలు లేదా ఆరు వారాల్లో గైనకాలజిస్ట్ని తప్పనిసరిగా కలవాలి. నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా ఆరు వారాల్లో శరీరం కోలుకుంటుంది. బేబీకి ఆరు వారాల్లో వ్యాక్సినేషన్ కూడా ఇవ్వాలి. కుట్లు వేసిన చోట హీలింగ్ ఎలా ఉందో, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉందో, యూటిరస్ సైజు తగ్గిందో లేదో, వెజైనల్ హీలింగ్, యూరిన్, మోషన్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయా, మల్టీ విటమిన్స్ అవసరమా, బీపీ, షుగర్ లేదా ప్రెగ్నెన్సీ నుంచి ఇస్తున్న మెడిసిన్స్ ఇంకా అవసరమా అనేది టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే పాప్ స్మియర్ లేదా సర్వికల్ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని డాక్టర్ చెప్తారు. ఈ టెస్ట్ ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి చెయ్యాలి. హెచ్ పీవీ వ్యాక్సిన్ లేదా సర్విక్స్ కేన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ ఈ టైమ్లో సజెస్ట్ చేస్తారు. వ్యాయామం చేయటం ఇప్పుడే మొదలుపెట్టాలి. పెల్విక్ ఫ్లోర్ వ్యాయామం అవసరమని చెప్తారు. అబ్డామినల్ బెల్ట్ను సజెస్ట్ చేస్తారు. బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ లేదా నిపుల్ ఇన్ఫెక్షన్ను చెక్ చేస్తారు.బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ లేదా నిపుల్ డిశ్చార్జెస్ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీ తరువాత కూడా అవసరం ఉంటే ఇస్తారు. యూరిన్ లీక్, మోషన్ లీక్ ఉంటే రక్తం, మూత్ర పరీక్షలు చేయాలి. ఓవులేషన్ స్టార్ట్ అయిన తర్వాత కాంట్రాసెప్షన్ అవసరం ఉంటుంది. డిఫరెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయాలి. కాపర్–టి వంటి లాంగ్ టెర్మ్ కాంట్రాసెప్టివ్స్ ఇవ్వొచ్చు. బేబీ బర్త్ రిజిస్ట్రేషన్ కూడా చెక్ చేయాలి. ఆరు వారాల తరువాత డెలివరీ విజిట్ చాలా ముఖ్యం. కాబట్టి, తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లి డాక్టరును సంప్రదించండి. -డా‘‘ భావన కాసు-గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ , హైదరాబాద్ -
దెయ్యప్పిల్ల
పాపం మంచమ్మాయే! ‘దెయ్యప్పిల్ల’ అని పేరొచ్చేసిందంతే. అసలు పేరు జో రోత్(Girl Zoe Roth). ఆమె నాలుగేళ్ల వయసులో తండ్రి తీసిన ‘విపత్తు’ ఫొటోపై ఇరవై ఐదేళ్లుగా ఇంటర్నెట్లో ‘మీమ్స్’ వస్తూనే ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా పెద్ద విపత్తు సంభవించింది అనుకుందాం. ఆ విపత్తు ఫొటోను, ఈ పాప ఫొటోను జాయింట్ చేసి ఇంటర్నెట్లోకి వదిలేస్తుంటారు ‘మీమర్స్’. టైటానిక్ నౌక ఎప్పుడో వందేళ్ల క్రితం కదా మునిగిపోయింది.ఆ ఫొటోక్కూడా ఈ పాప ఫొటోను తగిలించేశారు. సరదాకే అనుకోండి. ఆ చిన్నారి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. ఇటీవలే తన చిన్నప్పటి ‘విపత్తు ఫొటో’లో తనెక్కడైతే నిలబడి ఉందో సరిగ్గా అక్కడే నిలబడి ఫొటో తీయించుకుని ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది. సీన్ని రీక్రియేట్ చేసిందన్నమాట! ఇదంతా సరే, అసలు పాతికేళ్ల క్రితం నాటి జో రోత్ ఫొటోపై సోషల్ మీడియాలో ఇప్పటికీ మీమ్స్ ఎందుకు వస్తున్నాయి?ఓసారి 2005లోకి వెళ్దాం. ఇయర్ సరే. ప్లేస్ ఎక్కడ? అమెరికాలోని నార్త్ కరోలినా. అప్పుడు జో రోత్ వయసు 4 సంవత్సరాలు. ఆ రోజు.. వీధిలో ఏదో కాలిపోతున్నట్లు పొగలు వస్తుంటే చుట్టు పక్కల వాళ్లు ఇళ్లల్లోంచి బయటికి వచ్చారు. జో రోత్ ఇంట్లోంచి ఆమె తండ్రి డేవ్, ఆమె వచ్చారు. డేవ్ ఫొటోగ్రాఫర్. అతడి మెడలో ఎప్పుడూ కెమెరా వేలాడుతూ ఉంటుంది. ఇంట్లోంచి వాళ్లొచ్చి చూసేటప్పటికి బయట ఎవరిదో ఇల్లు కాలిపోతోంది! అగ్ని మాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. డేవ్కు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. కెమెరాను సెట్ చేసుకుని, ‘‘తల్లీ.. ఫొటోకు పోజ్ ఇవ్వరా..’’ అన్నాడు.బ్యాక్ డ్రాప్లో కాలిపోతున్న ఇంటి మంటలు. వాటి ముందు రోత్. ఇదీ యాంగిల్. తండ్రి చెప్పినట్లే రోత్ పోజ్ ఇచ్చింది. ‘‘కొంచెం నవ్వు ముఖం పెట్టు’’ అన్నాడు! తనకేం తెలుసు. తండ్రి స్మైల్ అన్నాడు కాబట్టి స్మైల్ ఇచ్చింది. ఇల్లు కాలిపోతుంటే నవ్వుతున్నట్లుగా ఉంది జో రోజ ఆ ఫొటోలో!జో రోత్ సీన్ రీక్రియేషన్ ఫొటో ఐదు లక్షల డాలర్ల ఫొటో!ఆ ఫొటోలో రోత్ నవ్వు ‘డెవిలిష్’గా ఉంది. అంటే దెయ్యప్పిల్ల నవ్వుతున్నట్లు! రెండేళ్ల తర్వాత ఆ ఫొటోను ఏదో పోటీకి పంపుతూ ‘డిజాస్టర్ గర్ల్’ అనే పేరు పెట్టాడు డేవ్. ప్రైజ్ వచ్చింది. అలా ఆ ఫొటో ప్రపంచానికంతటికీ తెలిసింది. అప్పట్నుంచీ జో రోత్ ‘డిజాస్టర్ గర్ల్’ అయింది. ప్రపంచంలో ఎక్కడైనా ఘోరం జరిగితే ఫొటోషాప్ తెలిసిన సృజనశీలురు ఆ ఘటనకు, రోత్ చిరునవ్వు ఫొటోను కలిపి సోషల్ మీడియాలో పెట్టేవారు.అలా ఆ ఫొటో ఇంకా పాపులర్ అయింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలితే రోత్ ఫొటో. సునామీలు వస్తే రోత్ ఫొటో. ఘోర ప్రమాదాలు జరిగితే రోత్ ఫొటో. అలా నెట్లో, వార్తాపత్రికల్లో తరచు తన చిన్ననాటి ఫొటోని చూస్తూ పెరిగింది రోత్. ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. అప్పటి చిరునవ్వులో మాత్రం మార్పులేదు. అన్నట్లు – ఐదేళ్ల క్రితం ఆ ‘విపత్తు ఫొటో’ ఒరిజినల్ ఐదు లక్షల డాలర్లకు వేలంలో అమ్ముడైంది. రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడన్నట్లు – ఆ రోజు రోత్ తండ్రి డేవ్ ఎందుకు అలా వెనుక మంటలు, ముందు కూతురి చిరునవ్వులు కలిపి ఫొటో తీసినట్లు! ఎప్పటికైనా ఆ ఫొటో భారీ ధరకు అమ్ముడుపోతుందని ముందే ఊహించాడా? లేదు లేదు. ఊరికే అతడికో సరదా ఆలోచన వచ్చింది.ఆ సరదా ఆలోచన కూడా ఎందుకొచ్చిందంటే.. పొగని చూసి హడావిడిగా బయటికి వచ్చారు తండ్రీ కూతుళ్లు.. అయితే అది అగ్ని ప్రమాదం కాదనీ, అగ్ని మాపకదళం వారే ట్రైనింగ్లో భాగంగా ఒక సెట్టింగ్ను తగలబెట్టి మంటల్ని ఆర్పుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, ఆ సంతోషంలో కూతురి ముఖంలో నవ్వుల్ని పూయించాడు డేవ్. ఆ ఫొటోని చూస్తే ఎవరికైనా వెంటనే వచ్చే ఆలోచన.. ‘‘ఏంటీ పిల్ల.. ఇల్లు తగలబడిపోతుంటే నవ్వుతూ చూస్తోంది!’’... అనే కదా. అలాంటి ఆలోచన రప్పించడం కోసమే డేవ్ అలా ఫొటో తీశాడు. అనుకోకుండా ఫొటోగ్రాఫర్గా ఆయనకు పేరు, ఫొటోలో ఉన్న చిన్నారిగా రోత్కు భారీగా డబ్బూ వచ్చాయి. -
బెస్ట్ టూరిస్ట్ స్పాట్
రియో డి జనీరో– బ్రెజిల్లోని ఒక పెద్ద, అందమైన నగరం. ఇది అద్భుతమైన బీచ్లకు, పర్వతాలకు, ఉత్సాహభరితమైన కార్నివాల్ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కోపాకబానా, ఇపనేమా అనే బీచ్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఇవి అందమైన ఇసుక తిన్నెలతో, అహ్లాదకరమైన వాతావరణానికి నిలయమనే చెప్పుకోవాలి. కోర్కోవాడో పర్వతంపైనున్న ఈ భారీ జీసస్ విగ్రహం రియోకు ఒక చిహ్నం.ఇది 2007లో న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో స్థానం దక్కించుకుంది. అక్కడి షుగర్లోఫ్ మౌంటైన్ మీదున్న కేబుల్ కార్ ఎక్కితే ఆ నగరాన్ని మొత్తం వీక్షించవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రైస్తవ కార్నివాల్ ఈ నగరంలోనే ఘనంగా నిర్వహిస్తుంటారు. అలాగే ఈ నగరం ప్రపంచమే మెచ్చే.. సాంబా నృత్యాలకు పుట్టినిల్లు.చెప్పుకోదగ్గ పోటీలుఆస్ట్రేలియాకు చెందిన ‘డార్విన్ బీర్ క్యాన్ రిగటా ఫెస్టివల్’ ఒకటి. ప్రతి ఏడాది జరిగే ఈ వేడుకను చాలా వినోదాత్మకంగా నిర్వహిస్తారు. ఖాళీ బీర్ బాటిళ్లు, ప్లాస్టిక్ సీసాలు, పాల డబ్బాలు ఇలా ఉపయోగం లేనివాటిని ఉపయోగించి తయారుచేసిన పడవలతో బీచ్లో పోటీపడటం ఈ వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పోటీలను 1974లో లయన్స్ క్లబ్ ఆఫ్ డార్విన్ కమ్యూనిటీ సభ్యులైన లట్జ్ ఫ్రాంకెన్ ఫెల్డ్, పాల్ రైస్–చాప్మాన్ అనే వ్యాపారవేత్తలు ప్రారంభించారు. ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలోని డార్విన్ వీధుల్లో చెల్లాచెదురుగా ఉన్న చెత్తను శుభ్రం చేయడానికి సరైన మార్గంగా ఈ పడవల తయారీ, పోటీ అనే ఆలోచన వచ్చింది. దాన్ని ప్రారంభించినప్పుడే మంచి స్పందన రావడంతో దాన్ని ప్రతి ఏడాదీ కొనసాగిస్తున్నారు. మిండిల్ బీచ్లో జరిగే ఈ పండుగలో పాల్గొనేవారు వేలాది డబ్బాలతో సృజనాత్మకంగా పడవలను తయారు చేస్తారు. కొన్ని పడవలు పోటీ మధ్యలో విరిగిపోతుంటాయి. దానితో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందే జాగ్రత్తపడటంతో విరిగిపోవడం కూడా వినోదాన్ని పండిస్తుంది.ఇక ఈ ఏడాది ఈ పండుగ జూన్ 8న జరుగుతోంది. పడవ పోటీలతో పాటు, ఇసుక కోటల నిర్మాణం, థాంగ్ త్రోయింగ్ వంటి ఇతర సరదా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. లయన్స్ క్లబ్ ఆఫ్ డార్విన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనితో వచ్చే నిధులు స్థానిక కమ్యూనిటీ ప్రాజెక్టులకు ఉపయోగపడతాయి. ఈ సంబరాల్లో ‘థాంగ్ త్రోయింగ్ కాంపిటీషన్’ కాస్త వింతైన కామెడీ పోటీ. ఈ పోటీలో పోటీదారులు తమ తేలికపాటి చెప్పు(ఫ్లిప్ఫ్లాప్)లను దూరంగా విసురుతారు. ఎవరు ఎంత ఎక్కువ దూరం తమ చెప్పును విసరగలిగితే వాళ్లే గెలిచినట్లు. ఇక ఈ వేడుకలో భాగంగా ఐరన్ పర్సన్ కాంపిటీషన్, టగ్–ఆఫ్–వార్ ఇలా మరిన్ని పోటీలు జరుగుతుంటాయి. పైగా ఈ పోటీలను జూనియర్లకు వేరుగా, సీనియర్లకు వేరుగా, గ్రూప్ పోటీలు వేరుగా నిర్వహిస్తారు. దాంతో ఈ వేడుకలో వీక్షకులు, పోటీదారులతో సందడి మామూలుగా ఉండదు. -
ఓ మై డాగ్స్!
ఒక అసాధారణమైన స్నేహానికి మూడడుగుల ఎత్తు తేడా ఏమాత్రం అడ్డు రాలేకపోయింది. ఒకటి టీ కప్పు సైజులో పరిగెత్తే పిల్లోడు, ఇంకొకటి సోఫాను బెడ్డుగా వాడే బలమైన కుర్రాడు, కాని, ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం చూస్తే – ఇది శునకాల స్నేహం కాదు, నిజమైన ప్రేమపాఠం అనిపిస్తుంది. ఈ స్నేహం ఐడహోలో గిన్నిస్ వరల్డ్ రికార్ట్స్ అధికారుల కారణంగా మొదలైంది.ప్రపంచంలోనే అతి పొడవైన శునకం రెజీకి (39.6 అంగుళాలు), అతి చిన్నదైన కుక్క పెర్ల్ను (3.59 అంగుళాలు) మొదటిసారి పరిచయం చేసినప్పుడు, ఎవరూ ఊహించని విధంగా కళ్ల ముందు ఒక డిస్నీ మ్యాజిక్ కనిపించింది. రెజీ, పెర్ల్ కలిసింది మొదటిసారే అయినా, ‘ఓయ్ బాస్, ఈ ప్రపంచంలోనే మేమే గ్రేట్ బెస్ట్ ఫ్రెండ్స్’ అని అందరిని నమ్మించేశాయి! రెజీ భారీ ఆకారం చూసి పెర్ల్ భయపడకుండా ధైర్యంగా దాని చుట్టూ తిరుగుతూ ఆటలాడుకుంటుంటే, రెజీ తన భారీ కాళ్లను నెమ్మదించి, చిట్టి స్నేహితుడితో కలిసి నడిచింది.ఈ అందమైన కలయికకు కారణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కావొచ్చు కాని, ఫలితంగా ప్రపంచం నిండా నవ్వులు పూశాయి, సోషల్ మీడియా హ్యాష్ట్యాగ్లతో నిండిపోయింది. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎత్తుల్లో తేడా రావచ్చు, రకాలు భిన్నంగా ఉండొచ్చు కాని, ఒక స్నేహానికి ఇవేమీ అవసరం లేదు, ఒక మంచి మనసే చాలు అని ఈ జంట మరోసారి నిరూపించింది. -
ఆ.. డిస్కషన్స్ రావు
స్టార్ హీరోయిన్గా మామూలు వెలుగు వెలగలేదు కాజల్ అగర్వాల్. పెళ్ళయిన తర్వాత కెరీర్ ముగింపుకి వచ్చినట్లే అని అనుకున్న వాళ్ల నోరు మూయించేలా మళ్లీ తెరపైకి రాబోతోంది.⇒ ఈ ఏడాది కాజల్ అగర్వాల్కి ఓ రకంగా స్పెషల్ ఇయర్. జూన్ 19న 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది.⇒ 2020లో పెళ్ళయిన తర్వాత ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణతో కలిసి నటించింది. ‘ఆచార్య’లో చిరంజీవితో కలిసి నటించే చాన్స్ వచ్చినా, మొదట్లోనే ఆ క్యారెక్టర్ని స్క్రిప్టులో నుంచి తీసేశారు. చిత్రీకరించిన సీన్స్, సాంగ్ కూడా డిలీట్ చేసేశారు.⇒ హీరోయిన్ ఓరియెంటెడ్ జోనర్ సినిమా ట్రై చేసి, ‘సత్యభామ’తో మంచి రిజల్ట్స్ అందుకోలేకపోయింది.⇒ సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ సినిమా డిజాస్టర్ అనే మాట అటుంచి, అసలు ఏ మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్ చేసి, అందరిని షాక్కి గురి చేసింది కాజల్ అగర్వాల్.⇒ ఇటువంటి దశలో – కాజల్కి అద్భుతమైన అవకాశం వచ్చింది. విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీదేవిగా నటిస్తోంది. కాజల్కి ఇది మొదటి పౌరాణిక పాత్ర.⇒ కాజల్ అగర్వాల్ పార్వతీదేవి గెటప్ చూసే, మండోదరి పాత్ర ఆఫర్ వచ్చింది. సాయి పల్లవి, రణ్బీర్ కపూర్ – సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణం’ సినిమాలో యశ్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని సరసన మండోదరిగా కాజల్ అగర్వాల్ నటించబోతోందని సమాచారం.⇒ విష్ణు మంచుకి ట్విన్ సిస్టర్గా ‘మోసగాళ్ళు’ సినిమాలో నటించింది కాజల్ అగర్వాల్. ఆ పరిచయం కారణంగానే పార్వతీదేవి పాత్ర వచ్చింది.⇒ అక్షయ్ కుమార్ శివుడు క్యారెక్టర్ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే! కొన్నేళ్ళ ముందు అక్షయ్ కుమార్ కాంబినేషన్లో ‘స్పెషల్ ఛబ్బీస్’ సినిమాలో చేసింది కాజల్ అగర్వాల్ .⇒ వ్యక్తిగత విషయాలకొస్తే, భర్త గౌతమ్ ఇంటీరియర్ డెకార్స్కి సంబంధించిన ఇ కామర్స్ బిజినెస్ చేస్తుంటాడు. భర్త ఆదాయం కన్నా– కాజల్ అగర్వాల్ ఆస్తి పాస్తులు ఎక్కువ. తామిద్దరి మ«ధ్య ఫైనాన్షియల్ మేటర్స్ గురించి డిస్కషన్స్ రావని చెప్పింది కాజల్.⇒ నటిగా ఎంత బిజీగా ఉన్నా, బాబు ఆలనా పాలనకి ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పింది. ‘సత్య భామ’ షూటింగ్కి కొడుకుని ముంబై నుంచి తనతో పాటు తీసుకొచ్చింది. ప్రైవేట్ హౌస్లో ఉండి, బాబుతో టైమ్ స్పెండ్ చేసింది.⇒ పెళ్ళయిన తర్వాత హీరోయిన్లకి కెరీర్ ముగిసి పోయిందనేది ఇప్పుడు కరెక్ట్ కాదని, కొత్తదారులకు తలుపులు తెరుచుకుంటాయని అంటుంది కాజల్ అగర్వాల్. -
కడలి కబుర్లు
అగాధ జలనిధి కడలి.. అది అనంత జీవరాశికి ఆలవాలం... నేలపై ఉండే జీవులకు ప్రాణవాయు ప్రదాత.. సాగరగర్భం అనేక వింతలకు నిలయం... సముద్రాలను కాపాడుకోవడం మానవాళి కర్తవ్యం.. సముద్రాలను కాపాడుకుంటేనే మనకు మనుగడ. సముద్రం ఒక వేదికైతే... అందులో చేపల నాటకం.. ఆక్టోపస్ డాన్స్.. డాల్ఫిన్ పాటలు.. ఇలా మరెన్నో కళాకారులతో నిండుతుంది. అయితే, ఆకతాయులు వేసే ప్రతి ప్లాసిక్ బాటిల్కు ఒక రంగురంగుల చేప ఊపిరి ఆగిపోతోంది. అలలు నవ్వడం మానేస్తున్నాయి. అందుకే, ప్రతి ఏటా జూన్ 8న జరుపుకునే ‘ప్రపంచ సాగర దినోత్సవం’(World Oceans Day) రోజునైనా, సముద్రం అంటే సరదా కాదు, ఒక జీవనిధిగా గుర్తించి కాపాడుకుందాం.సముద్రం అంటే ఒక పరిగెడుతున్న చేపల రాజ్యమని, అందులో నీళ్లు, చేపలు, బోట్లు తప్పే మరేం ఉంటాయ్! అని చాలామంది అనుకుంటుంటారు. కాని, సముద్రం ఎంత గొప్పది అంటే సముద్రమంత! ‘సాగరః సాగరోపమః’ అని వాల్మీకి మహర్షి చెప్పాడు. అంటే.. సముద్రం సముద్రమంత గొప్పదని అర్థం. సముద్రాన్ని మరోదానితో పోల్చడం సాధ్యం కాదు. అంతటి మహాసముద్రం లోపల వేలాది ర హస్యాలు. భయంకరమైన నిజాలు, వింతలు, విశేషాలు ఎన్నో దాగున్నాయి. వాటిలో బయటకు తెలిసినవి కొన్నే! కాని, సముద్రంలో ఒక చిన్న వినోదం కూడా ఉంటుంది.అది ఒక చక్కని కామెడీ కథల వేదిక. అక్కడి చేపలు చేసే శబ్దాలు రేడియోలో కంటే ఎక్కువగా మాట్లాడతాయి, ఆ శబ్దాలు మనకు వినపడవంతే! ఆక్టోపస్లు ఎనిమిదేసి చేతులతో మాయాజాలం చూపిస్తాయి. జెల్లీఫిష్ సిల్లీ విన్యాసాలు చేస్తూ ఉంటుంది. ఒకపక్క తాబేలు స్లో మోషన్ డాన్స్ చేస్తుంటే మరోపక్క డాల్ఫిన్లు, తిమింగలాలు ‘ప్లాస్టిక్ తినకురా! ఓ నీలి నేస్తమా!’ అంటూ రీమిక్స్ చేస్తూ ర్యాప్ పాడుతుంటాయి. ఇక సముద్రపు స్టార్ షార్క్ని సెల్ఫీ అడిగి, దాని నవ్వు చూసిన అలలు పరుగెడుతుంటాయి.ఇలా సముద్రంలో ఎన్నో వింతలు.. విడ్డూరాలు ఉన్నాయి. అలాగే జీవం కూడా ఉంది. అందుకే, మనుషులు ఆనందంగా ఉండాలంటే సముద్రం కూడా ఆనందంగా ఉండాలి. అలా ఆనందంగా ఉండాలంటే మనం సముద్రానికి ప్లాస్టిక్ బ్యాగ్లను టోపీలుగానూ, బాటిళ్లను సీ డెకరేషన్లగానూ చేయకూడదు. సముద్రాన్ని ప్రేమించడం అంటే, మన భవిష్యత్తును మనం ప్రేమించడమే! పుడమికి ప్రాణవాయువును అందిస్తున్న సాగరునికి ప్రతి ఒక్కరూ ‘థ్యాంక్స్’ చెప్పుకునేలా.. ఈ ప్రత్యేక కథనం.. అలా మొదలైంది... ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచం నీలికడలి గురించి ఒక నిలువెత్తు నిజాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సముద్రాలు మనకు ఒక ముఖ్య జీవనాధారం అని. ఆక్సిజన్ లేకుంటే ఎంత ప్రమాదమో, సముద్రాలు లేకున్నా కూడా అంతే ప్రమాదం. ఒకరకంగా చెప్పాలంటే మనం పీల్చుకునే ఊపిరిలో సగానికి సగం సముద్రాల నుంచే వస్తుంది. ఇంతటి ముఖ్యమైన వనరును కూడా మానవులు కాలుష్యంతో నింపి నాశనం చేస్తున్నారు. అందుకే, 1992లో బ్రెజిల్లో జరిగిన ‘ఎర్త్ సమ్మిట్’లో కెనడా మొదటిసారి ‘సముద్రాలకు ఒక ప్రత్యేక దినోత్సవం కావాలి’ అని చెప్పింది. ఆ కలను 2008లో ఐక్యరాజ్యసమితి సాకారం చేసింది. ఇక అప్పటి నుంచి ఏటా జూన్ 8న ‘ప్రపంచ సాగర దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. సముద్రంలో సినిమా.. అద్భుతమైన సముద్ర ప్రపంచాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చిన సినిమా ‘అండర్ ది సీ 3డీ’. ప్రముఖ సంస్థ ఐమాక్స్ తెరకెక్కించిన ఈ సినిమా మామూలు సినిమా కాదు. ఇదొక డాక్యుమెంటరీగా తీసుకొచ్చిన సముద్ర మాయాజాలం. ప్రముఖ డైరెక్టర్ హవర్ట్హాల్ దర్శకత్వం వహించగా, మిచెల్ హాల్ దీనికి రచన అందించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరూ సముద్రం లోతుల్లో తేలియాడుతూ, చుట్టూ రంగురంగుల చేపలను, నిగనిగలాడే పగడాల దిబ్బలను, నెమ్మదిగా కదిలే వివిధ సముద్రపు జీవులను చూస్తున్నట్లు ఉంటుంది.ఈ సినిమా కేవలం రంగుల బొమ్మలనే కాదు, ప్రకృతి చేసే అలజడి, వాతావరణ మార్పులు, పెరిగే ఉష్ణోగ్రతలు, మానవ తప్పిదాలు– ఇలా ఇవన్నీ సముద్రానికి చేస్తున్న ముప్పును చక్కగా చూపిస్తూనే, మనుషుల్లో ‘ఇక కొంతకాలంలో ఈ అందాలను చూసే అవకాశం లేకుండా పోతుందా?’ అనే ప్రశ్నను రేకెత్తించేలా చేస్తుంది. ఇందుకోసం ‘కర్ల్ ట్రయాంగిల్’ అనే సముద్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన సముద్ర జీవులు నివాసం ఉండే ప్రాంతం. అక్కడ చిత్రీకరణ అత్యంత ప్రమాదకరం.ఒక తప్పు జరిగినా అక్కడి జీవ వ్యవస్థ మొత్తానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే, ఈ ఇద్దరు ప్రతి ఫ్రేమ్ను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఒక పెద్ద కెమెరాను ఉపయోగించారు. దాని బరువు సుమారు ఆరువందల కిలోలు ఉంటుంది. వివిధ ప్రత్యేక అనుమతులు తీసుకొని సుమారు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేశారు. అలా ఒక అద్భుత ప్రపంచాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.సంభ్రమపరచే సాగర వాస్తవాలు⇒ సముద్రం లోపల ఏకంగా 37 ‘భారలోహాలు’ ఉన్నాయి. లిథియం, కోబాల్ట్, మాంగనీస్, టైటానియం ఇలా మరెన్నో మినరల్స్ ఉన్నాయి.⇒ సముద్రంలో ఉన్న మొత్తం ఉప్పుని ఉపయోగిస్తే, భూమిపై నేల అంతటినీ ఐదు వందల అడుగుల ఎత్తుతో కప్పేయొచ్చు.⇒ మనకి సముద్రపు లోతుల గురించి కంటే అంతరిక్షం గురించి ఎక్కువ తెలుసు. ఇంకా 90 శాతం సముద్రం మ్యాప్ కూడా గుర్తించలేదు. సముద్ర గర్భంలో ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు ఎన్నో ఉన్నాయి.⇒ సముద్రపు నీటి స్థాయి అప్పుడప్పుడు పైకి, కిందికి ఊగుతుంది. శీతాకాలం వస్తే నీరు మంచుగా మారుతుంది. అలాగే, తాపం పెరిగితే భూమి మీదకు వస్తుంది.⇒ సముద్రం భూమి మీద 71% విస్తీర్ణాన్ని కలిగి ఉంది. సముద్రాల్లోని నీటిని కలిపితే 320 మిలియన్ క్యూబిక్ మైళ్ల నీళ్లు! అంతేకాదు, సముద్రాల్లో నీళ్లు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. అవి ఎక్కడో వర్షంగా పడతాయి, మరెక్కడో మంచుగా మారతాయి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ⇒ సముద్రం అంటే ఉప్పు నీరు మాత్రమే ఉండదు. ఉప్పు లేని సముద్రాలు ఉన్నాయి. వాటిని ‘గ్రేట్ లేక్స్’ అంటారు. అంటే సముద్రం కాదు. కాని, ఈ సరస్సులు సముద్రాల్లో ఉంటాయి.⇒ సముద్రంలో ఏకంగా 2.2 మిలియన్ జాతుల జీవులు ఉన్నాయని అంచనా. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇప్పటి వరకు కనుక్కోగలిగాం.⇒ సముద్రపు నేల ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది! అగ్నిపర్వతాల వలన వచ్చిన మాగ్మా ఎత్తైన పర్వతాలను సృష్టిస్తుంటుంది. వీటిపై అక్కడక్కడ ఉండే ‘బ్లాక్ స్మోకర్స్’ అనే పగుళ్లు సముద్రంలో పొగను కూడా వదులుతాయి. హద్దుల్లేని భజంత్రీలుఒకప్పుడు పెళ్లి అంటే పందిరి, లైట్ల మెరుపులు, మైక్ పట్టుకుని చేసే ‘వేదపారాయణం’. కాని, ఈ స్టయిల్ పెళ్లిళ్లను ఈ కాలపు జంటలు అసలు ఒప్పుకోవడం లేదు. అన్నింటికంటే ముందు పెళ్లికి కచ్చితంగా కావాల్సింది అంతులేని తీరాలతో ఉండే ప్రేమ అని కొందరు అంటున్నారు. అంటే పెళ్లి వేదికలుగా సముద్ర తీరాలకు ఓటు వేస్తున్నారు. కాబట్టి పెళ్లి అనగానే పురోహితుడి కంటే ముందు ప్యాకేజీలో బీచ్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్యాకేజీలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో ది బెస్ట్ ఇవి.గోవా: గోవాలో పెళ్లంటే.. పెళ్లి కంటే ముందు పెళ్లి విందు మిన్న అన్నట్లే! శుభ ముహూర్తానికి ముందే ‘సన్సెట్ క్లిక్స్’, ‘బీచ్ బేస్డ్ బంగ్లా’ బుక్ అయిపోతాయి. వేదమంత్రాల పక్కనే డీజే ప్లే అవుతుంది. పక్కా ఎంజాయబుల్ పెళ్లికి వెళ్లాలంటే గోవాలో జరిగే పెళ్లికి పిలవకుండా వెళ్లినా తప్పులేదు.అండమాన్: జీవిత ఖైదీని అందంగా బంధించాలంటే అండమాన్లో పెళ్లి చేసుకోవాలి. వధువు వస్తే ఫ్లవర్స్ కాకుండా, టైడల్ షవర్ ఫీల్స్ వస్తాయి.కేరళ: వరుడు బోటులో వస్తే, వధువు కొబ్బరి చెట్టు కింద నిలబడి ‘నన్ను తీసుకెళ్తావ్ కదా’ అని చెప్పే ఓ చక్కని సన్నివేశంలాంటిది కేరళ పెళ్లి.గోకర్ణ: గోకర్ణలో పెళ్లంటే ఒక చిన్న పండగలాంటిది. ఓం కారంతో శుభారంభం పలికి, పెళ్లి, తర్వాత సంగీతం, చివర్లో బీచ్ ఫైర్ డాన్స్తో అలరించేదే ఈ పెళ్లి.పుదుచ్చేరి: ఫ్రెంచ్ వీధుల్లో ప్రేమగా నడుస్తూ, బీచ్ సరసన ప్రేమ పంచుకుంటే, ఫొటోల్లోనే కాదు, జీవితమే ఒక రొమాంటిక్ సినిమాలా కనిపిస్తుంది. అటువంటి సినిమాటిక్ ఫీల్ కోసం పుదుచ్చేరి బెస్ట్ ప్లేస్.డయ్యూ: తక్కువ ఖర్చుతో హైవోల్టేజ్ బీచ్ పెళ్లి కావాలంటే ఇది బెస్ట్. ఓ వైపు పోర్చుగీస్ ఇళ్లు, మరోవైపు బ్రైట్ లైట్స్తో ఉంటుంది. ఈ పెళ్లిని చూసిన తర్వాత పెళ్లికాని అబ్బాయిలు కూడా తమ పెళ్లి ఇక్కడే చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు.మహారాష్ట్ర: ఇక్కడ బీచ్ వెడ్డింగ్ అంటే పక్కనే కోటలు, వెనుక సముద్రం, ముందు మేకప్ ఫెయిల్ అయిన వధూవరులు. ఎందుకంటే, ఇక్కడ సూర్యుడు తన శక్తిని కొంచెం ఎక్కువే చూపిస్తాడు. అయినా కూడా అందంగానే ఉంటారు.లక్షద్వీప్: ఇది పెళ్లి కాదు బాస్, అడ్వెంచర్! ఇక్కడ పెళ్లి చేసుకుంటే పంచభూతాలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎందుకంటే, ఇక్కడ చాలామంది స్కూబా డైవింగ్ చేస్తూ, ‘ఐ లవ్ యూ’ చెçప్పుకుంటారు. బంధువులు ఎవరైనా రావాలంటే, ముందే స్విమ్మింగ్ తెలిసుండాలి.కాబట్టి పెళ్లి అంటే ‘పెద్దవాళ్ల దీవెనలు, బంధుమిత్రులతో విందుభోజనాలు’ అనుకునే రోజులు పోయాయి! ఇప్పుడు పెళ్లి అంటే– ‘ఐలాండ్ ప్యాకేజీ బుక్ చేసి, టెంట్లు వేసుకుని, సముద్రపు హోరుకు హార్ట్బీట్ జోడించి, ప్రేమను చాటాలి అనుకుంటున్న రోజులివి. అయితే, ఈ సముద్ర సంబరాలకు వెళ్లడానికి ముందు సన్స్క్రీన్ను రాసుకెళ్లడం మర్చిపోకండి.సముద్రంలో మిస్టరీగా మిగిలిన ప్రదేశాలు.. సముద్రాల్లో కొన్ని ప్రదేశాల గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా, అవి ఇప్పటికీ ప్రశ్నలు, సమాధానాల కంటే అర్థం కాని కథల్లానే మిగిలిపోయాయి. అలాంటి ఐదు అత్యంత రహస్యమైన సముద్ర ప్రదేశాలు ఇవే..బెర్ముడా ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో విమానాలు, నౌకలు చాలా అదృశ్యమయ్యాయి. అవన్నీ ఎక్కడికి పోయాయి? కారణం ఏమిటి? ఇంకా తెలియలేదు. ఇది సాంకేతిక సమస్యా? లేక ఏదైనా భౌతిక శక్తుల మాయాజాలమా అనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు.మారియానా ట్రెంచ్ మనం సముద్రాన్ని కేవలం ఐదు శాతమే అన్వేషించాం. కానీ అంతకంటే లోతైన ప్రదేశం కూడా ఉంది. అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ‘చాలెంజర్ డీప్’ అనే ప్రదేశం. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని అంచనా. ఇందులో కంటికి చిక్కని లోకం ఉండవచ్చు అనే అనుమానం శాస్త్రవేత్తల్లో ఉంది. సర్గాసో సముద్రం ఈ సముద్రంలో ప్రవాహాలు కనిపించవు. కానీ అందులో తేలే సర్గాసం అనే సముద్రపు మొక్కలు, అక్కడి జీవవైవిధ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాయి. ఇది సముద్రానికి మధ్యలో ఉన్న, అతిపెద్ద సర్గాసం మొక్కల రాజ్యం లాంటిది.బాల్టిక్ సీ అనోమలీ సోనార్ స్కాన్లలో కనిపించిన ఒక నిర్మాణం చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇది ఏలియన్స్ నిర్మించారా లేదా సహజంగానే ఏర్పడిందా లేక మానవ నిర్మాణమా అనేది ఇప్పటికీ ఎవ్వరూ తేల్చలేకపోయారు.గ్రేట్ బ్లూ హోల్ బెలీజ్ సమీపంలో ఉన్న అతిపెద్ద సింక్ హోల్ ఇది. ఈ సముద్ర గుంత లోతుల్లో దిగుతున్న కొద్దీ నీటి ఉష్ణోగ్రత, పీడనం మారుతూ ఉంటుంది. ఇవి చూపుతున్న ప్రభావాలు శాస్త్రవేత్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇలా సముద్ర గర్భం ఒక్కొక్క చోట ఒక్కో విధంగా విశేషమైన ప్రత్యేకతతో ఉంటుంది. ఇవే కాకుండా సముద్ర గర్భం ఎన్నో రాజ్యాలను తనలో దాచుకుందని చరిత్ర చెప్తుంది.అలాంటి అతిపెద్ద నగరాల్లో శ్రీకృష్ణుడి నగరంగా చెప్పుకునే ‘ద్వారక’ ఒకటి. టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు జరుగుతున్న ప్రతిసారి ఎంతో కొంత భూమి సముద్రంలోకి దిగిపోతుంది. అలాగే కొంత భూమి సముద్రం బయటికి చొచ్చుకొని కూడా వస్తుంది. అలా మనకి ఒక ఖండమే మునిగిపోయినట్లు కూడా చరిత్ర చెప్తుంది. అందుకే, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ మనిషి పరిశోధన చేయాలంటే భయపడే అతిపెద్ద అంశం ఒక్క సముద్రం మాత్రమే!సముద్రపు వింత జీవులు...సముద్రంలోని కొన్ని నమ్మలేని, వింత జీవులు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. క్రిస్మస్ ట్రీ వర్మ్: ఈ చిన్న జంతువుల శరీరంపై ఉండే స్పైరల్ ఆకారాల ‘ప్లూమ్స్’ క్రిస్మస్ ట్రీలలా కనిపిస్తాయి! ఇవి శ్వాస తీసుకోవడానికి, ఆహారం సేకరించడానికి ఉపయోగ పడతాయి.లీఫీ సీ డ్రాగన్: ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో కనిపించే ఈ జీవి, సీ హార్స్ కుటుంబానికి చెందినది. దాని శరీరంపై ఆకుల్లా కనిపించే చేతులు ఉంటాయి. వీటిని శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఒక ఆయుధంలా ఉపయోగిస్తుంది.ఆంగ్లర్ ఫిష్: సముద్రం లోలోతుల్లో ఉండే జీవి ఈ ఆంగ్లర్ ఫిష్, దాని నోటిపైన మెరిసే గ్లో లైట్తో మామూలు చేపలను ఆకర్షించి వెంటనే చంపి, తినేస్తుంది.నార్తర్న్ స్టార్గేజర్: ఈ చేప మట్టిలో దాగి, తన కళ్లతో పైకి చూస్తూ, చిన్న చేపలు ఎప్పుడొస్తాయా అని వేచి చూసి చంపి తినేస్తుంది. ఒక్కసారిగా పైకి దూకి, శత్రువును హడలెత్తిస్తుంది.రెడ్హ్యాండ్ ఫిష్: ఈ జీవి ఈత కొట్టదు, నడుస్తుంది. రెడ్హ్యాండ్ ఫిష్ అనే ఈ చేప, టాస్మానియా సముద్ర తీరానికి ఆవల కనిపిస్తుంది. ఇది చేతుల్లా ఉండే మొప్పలతో సముద్రం అట్టడుగు నేలమీద నడుస్తూ తిరుగుతుంది.సముద్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చూస్తే, ప్రకృతి మనకేదో బలమైన సంకేతాలను పంపుతున్నట్లు అనిపిస్తోంది. కాని, మనం వాటిని గమనిస్తున్నామా? సముద్రపు లోతుల్లో నివసించే కొన్ని జీవులు అకస్మాత్తుగా భూమి మీదకు రావడం మనకు సమాధానం కావాల్సిన ప్రశ్నలు. ఈ మధ్యే ఆస్ట్రేలియాలో ఒకేసారి 150 కిల్లర్ వేల్స్ చనిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఇవి చాలా తెలివైన, సమూహంగా జీవించే జలచర జీవులు. ఒక్కసారిగా ఈ స్థాయిలో వీటి మరణం సంభవించడం సాధారణ విషయం కాదు.ఇక ‘బ్లాక్ డెవిల్ ఫిష్’ గురించి చెప్పాలంటే, ఇది ఆరువేల మీటర్ల లోతుల్లో ఉండే జీవి. అలాంటి జీవి ఒడ్డుకి వచ్చి చనిపోవడం అత్యంత అరుదైన ఘటన. అలాగే ‘ఓర్ ఫిష్’ లేదా ‘డూమ్స్ డే ఫిష్’ అనే చేప కూడా, సాధారణంగా మూడు నుంచి ఐదువేల మీటర్ల లోతులో జీవిస్తుంది. ఇది భూకంపాల ముందు ఉపరితలానికి వస్తుందన్న నమ్మకాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి, ముఖ్యంగా జపాన్ లో. 2011 సునామీకి ముందు ఈ చేపలు ఎక్కువగా కనిపించాయి. ఇలా ఈ మధ్య కాలంలో సముద్రంలో అట్టడుగున ఉండే చాలా జీవులు బయటకు వస్తున్నాయి.శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, భూమి లోతుల్లో జరిగే టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు, ఈ జీవులను పైకి తేలుస్తున్నాయేమో అని భావిస్తున్నారు. అయితే, ఇలా ఒకేసారి మూడు రకాల సంఘటనలు ఓర్ ఫిష్ ఉపరితలానికి రావడం, బ్లాక్ డెవిల్ ఫిష్ మరణం, కిల్లర్ వేల్స్ గుంపుగా నశించడం అన్నీ దాదాపుగా ఒకే సమయంలో చోటు చేసుకోవడం అనేది ప్రళయానికి సంకేతం అని, ఇది ప్రకృతి మనకు ‘జాగ్రత్త పడండి,’ అని హెచ్చరిస్తున్నట్లు చాలామంది భావన. త్వరలోనే దాదాపు అన్ని మతాల పురాణాల్లో ఉండే అతిపెద్ద జలచర జీవి ‘లేవియతాన్’ కూడా నిద్ర లేచిందని కథలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే, త్వరలోనే యుగాంతం జరగక మానదనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, సముద్రాల్లో వేసే ప్లాస్టిక్ను తగ్గించడం అనేది పెద్ద మార్పు కాదు కాని, మంచి ఫలితాన్ని ఇచ్చే అతిపెద్ద విషయం. -
జోర్ హుషార్.. సిమ్లా సమ్మర్
‘సిమ్లా–ప్రకృతి అందాలకే కాదు, ప్రత్యేక వేడుకలకూ నిలయమే’ అంటోంది హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం. దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే క్రమంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సిమ్లా సమ్మర్ ఫెస్టివల్’ నేటి (జూన్ 1) నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 1960 నుంచి ప్రతి ఏటా జరుగుతూ వస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఈ సంబరాల్లో పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, ప్రముఖ విద్వాంసుల సంగీత కచేరీలు, సంప్రదాయ జానపద కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. స్థానిక కళాకారులు కూడా ఈ ఉత్సవాల్లో ఏర్పాటయ్యే వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. జోరుగా హుషారుగా సాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి పెద్దసంఖ్యలో దేశ విదేశాల పర్యాటకులు వస్తుంటారు. గతంలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటి లెజెండరీ కళాకారులు ఈ వేడుకల్లో తమ గాత్ర మాధుర్యంతో శ్రోతలను ఓలలాడించారు.హిమాచలీ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, స్థానిక చేతివృత్తులు, ఉన్ని దుస్తులు, ఇతర ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇక్కడ అనేక స్టాళ్లు ఏర్పాటవుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జనం పోటెత్తుతారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన సంప్రదాయ దుస్తులను ప్రదర్శించే ఫ్యాషన్ షోలు కూడా జరుగుతాయి. సంగీత, నృత్య ప్రదర్శనలతో ఈ వేడుక పర్యాటకులకు ఆటవిడుపుగా నిలుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక మరపురాని అనుభూతి కలిగిస్తుందంటారు వీక్షకులు. ఈ సంబరాలు జూన్ 5న ముగియనున్నాయి. (చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..) -
ఈ సండే వెరైటీగా విదేశీ వంటకాలు ట్రై చేద్దాం ఇలా..
అమెరికన్ ఫ్రైడ్ స్ట్రాబెర్రీస్కావలసినవి: గుడ్డు– ఒకటి, పాలు– ఒక కప్పు, పంచదార– 3 టేబుల్ స్పూన్లు, నూనె– ఒక టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్– ఒక టీస్పూన్, మైదాపిండి– ఒకటిన్నర కప్పులుబేకింగ్ పౌడర్– ఒక టేబుల్ స్పూన్స్ట్రాబెర్రీలు– 10 లేదా 15తయారీ: ముందుగా ఒక గిన్నెలో గుడ్డు, పాలు, పంచదార, నూనె, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పౌడర్ వేసికలుపుకోవాలి. ఇప్పుడు మైదా మిశ్రమంలో పాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ, ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా లేదా మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి, తొడిమలను తొలగించి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బాణలిలో నూనె వేడి చేసుకుని, డీప్ ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఒక్కో స్ట్రాబెర్రీని మైదా– పాల మిశ్రమంలో ముంచి మళ్లీ నూనెలో వేయించుకోవాలి. కాస్త చల్లారగానే, నచ్చిన విధంగా కట్ చేసుకుని, చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.ఇటాలియన్ కాన్నోలికావలసినవి: గుల్లల కోసం: మైదాపిండి– 2 కప్పులు, పంచదార పొడి– పావు కప్పు, దాల్చినచెక్క పొడి– అర టీస్పూన్, వెన్న– 3 టేబుల్ స్పూన్లు, మార్సాలా వైన్– అర కప్పు, నీళ్లు– 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్– ఒక టేబుల్ స్పూన్, నూనె– డీప్ ఫ్రైకి సరిపడా, గుడ్డు– 2 క్రీమ్ కోసం: రికోటా చీజ్– 500 గ్రాములు, పంచదార పొడి– అర కప్పు, వెనీలా ఎసెన్స్– ఒక టీస్పూన్, దాల్చినచెక్క పొడి– అర టీస్పూన్, నిమ్మతొక్క తురుము– కొద్దిగాగార్నిష్ కోసం (అభిరుచిని బట్టి): చాక్లెట్ చిప్స్– కొన్నిపంచదార పొడి– కొద్దిగా, పిస్తా తరుగు– కొద్దిగా చెర్రీలు– కొన్నితయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, పంచదార పొడి, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. వెన్న కరిగించి, మైదా మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా చేసుకుని, మధ్యలో గుంతలా చేసుకోవాలి. అనంతరం దానిలో మార్సాలా వైన్, నీళ్లు, వెనిగర్, గుడ్లు (ఒక తెల్లసొన తీసి పక్కనపెట్టుకోవాలి) వేసుకుని బాగా ముద్దలా కలుపుకోవాలి. అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమానికి క్లాత్ చుట్టి రెండుగంటలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, కాస్త కోలగా చపాతీలు మాదిరి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక్కో చపాతీని కాన్నోలి ట్యూబ్కి చుట్టి, రెండు అంచులు అతుక్కునే చోట గుడ్డు తెల్లసొన కొద్దిగా రాస్తే అది ఊడిపోదు. ఇప్పుడు అన్నీ చపాతీలు అలానే చేసుకుని మరుగుతున్న నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. చల్లారాక కాన్నోలి ట్యూబ్లను తొలగిస్తే, చిత్రంలో కనిపిస్తున్న గుల్లల మాదిరి ఉంటాయి. అనంతరం ఒక గిన్నెలో రికోటా చీజ్ను హ్యాండ్ బ్లెండర్తో క్రీమీగా చేసుకుని దానిలో పంచదార పొడి, వెనిల్లా ఎసెన్స్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమంతో తయారుచేసిన గుల్లల్లో ఈ మిశ్రమం నింపుకుని, పిస్తా ముక్కలు, చాక్లెట్ చిప్స్, పంచదార పొడి, చర్రీస్ ఇలా నచ్చిన వాటితో, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. (చదవండి: Jamai Sasthi: కొత్త అల్లుడికి కొసరి..కొసరి..) -
పులిలా కనిపించే పిల్లి..!
ఈ పిల్లి వాక్ చేస్తే ఫర్నిచర్ వణుకుతుంది. ఓరకంట ఒక్క చూపు చూస్తే మొరుగుతున్న కుక్కలు కూడా గప్చిప్గా నోరు మూసుకుంటాయి. అది పిల్లి కాదు, పులి అని అనుకుంటున్నారా? కానేకాదు, నిజంగానే అది పిల్లే, పేరు జ్యూస్. చూడ్డానికి పెద్దపులిలాగా కనిపిస్తుంది. పదమూడు కిలోల బరువు, నాలుగు అడుగుల మూడు అంగుళాల పొడవుతో ఎదుగుతున్న పులిపిల్లలా ఉంటుంది. దానికున్న భారీ ఆకారమే జ్యూస్ను తమ వీథిలోని పెంపుడు జంతువులకు డాన్గా మార్చేసింది. ఆహారం కూడా దాని సైజుకు తగ్గట్టుగానే రోజుకు రెండు కిలోల మాంసం, టాప్ బ్రాండ్ ట్రీ ట్స్తో స్పెషల్ డైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో దీనికున్న క్రేజ్ మామూలుగా ఉండదు. జ్యూస్ నిద్రపోయే వీడియోకు కూడా మిలియన్స్లో లైక్స్ వస్తాయి. జ్యూస్ గురించి దాని యజమానురాలు డానియేలా మాట్లాడుతూ ‘నాకు ఇది చిన్న పిల్లికూనగా వీథిలో దొరికింది. ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటుంటే, రోజు రోజూకు భారీగా పెరిగిపోయింది. ఇది ఇంత పెద్దగా మారుతుందని అసలు అనుకోలేదు. మీరెవరైనా ఇకపై పిల్లిని పెంచుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి.’ అని చెప్పింది. (చదవండి: ఈ సాలీడు టాలెంట్కి సాటిలేరెవ్వరూ..! కటౌట్తో పనిలేదు బ్రదర్..) -
నటి మడోన్నా సెబాస్టియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
చక్కని చిరునవ్వుతో మనసు గెలుచుకునే నటి మడోన్నా సెబాస్టియన్. తెరమీద కనిపిస్తే ఆ ఫ్రేమ్కే అందం తెచ్చిపెట్టగలిగేంత అందంగా ఉంటారు. అలా తెరమీదనే కాదు, తెరవెనుక కూడా కనులవిందుగా ఉంటుంది ఆమె స్టయిలింగ్. ఇందుకోసం ఆమె సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్సే ఇవి.చెవి దగ్గర మొదలై మెడ చుట్టూ తిరిగి జడలో ముగిసే అందమైన కథే చెంపసరాలు. ఇవి కేవలం ఆభరణాలే కాదు. జడలోకి దిగి వచ్చే పూల గొలుసులు. ఇవి పెట్టుకున్న అమ్మాయి ఎక్కడ కనిపించినా ఆ ఫ్రేమ్ మొత్తం అందంగా మెరిసిపోతుంది. చెంపసరాల ట్రెండ్ కొత్తేమీ కాదు. కాని, ఇప్పుడు వీటి ప్రెజెంటేషన్, స్టయిలిష్గా మారడంతో మళ్లీ వీటికి రీబర్త్ వచ్చింది. మోడర్న్ వన్ పీస్ డ్రెస్స్ల్లోకి కూడా అమ్మాయిలు స్టేట్మెంట్ లుక్గా వీటిని వేసుకుంటున్నారు. ముత్యాలు, కుందన్, రుబీ, టెంపుల్ ఇలా రకరకాల డిజైన్లలో లభించే చెంపసరాలను వేసుకుంటే, చుట్టూ ఉన్నవాళ్ల చూపులన్నీ మీ చెవులవైపు తిప్పేలా చేస్తాయి. చీర, లెహంగా, లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ఏదైనా, వీటిని వేసుకోవడానికి కమ్మలను మాత్రం పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, బోసిగా ఉంచిన మెడ, చెంపసరాలకు తగ్గట్టుగా ఉండే హెయిర్ స్టయిల్, సింపుల్ గాజులు ఇవన్నీ కలిస్తేనే అందం. అప్పుడే చెంపసరాలకు, వాటిని వేసుకున్న మీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అచ్చం నటి మడోన్నా లుక్లాగా.అందం అందులో ఉండదు..అందం అంతా క్రీమ్స్, మేకప్స్లో ఉండదు. మంచి స్కిన్ కేర్లోనే ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ మసాజ్, నేచురల్ ప్రాడక్ట్స్, హైడ్రేటింగ్ స్కిన్ కేరే నా బ్యూటీ సీక్రెట్. దుస్తుల్లో కూడా ‘ఇది నాకు నప్పుతుందా?’ అని కాకుండా ‘ఇది నేను కంఫర్ట్గా వాడతానా?’ అని ఆలోచించి సెలక్ట్ చేస్తానని చెబుతోంది మడోన్నా సెబాస్టియన్. -దీపిక కొండి(చదవండి: ఘనంగా ముగిసిన మిస్ వరల్డ్ అందాల పోటీలు) -
చూడటానికి అదొక దేవాలయం..! కానీ కింద చూస్తే..
అదొక పుస్తక నిలయం. లక్షల సంఖ్యలో గ్రంథాలతో కళకళలాడే జ్ఞానభాండాగారం. కాని, అక్కడికి వెళితే, అక్కడ ఒక దేవాలయం మాత్రమే గోచరిస్తుంది. గుడిలోకి ప్రవేశించాక నేలమాళిగలోకి వెళ్లేందుకు భూగర్భమార్గం కనిపిస్తుంది. అలా మెట్ల మార్గంలో కిందికిపోతే, అరుదైన భూగర్భ గ్రంథాలయం ఆశ్చర్యపరుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ గ్రంథాలయమది. అత్యంత అరుదైన ఈ భూగర్భ గ్రంథాలయం కథా కమామిషు తెలుసుకుందాం...పదహారడుగుల లోతులో...రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లా భడారియా గ్రామం చుట్టూ ఎడారి వాతావరణం. ఊరిలో భడారియా దేవాలయం ప్రత్యేక ఆకర్షణ కేంద్రం. కారణం ఈ ఆలయం భూ ఉపరితలానికి పదహారడుగుల కింద కొలువైన భూగర్భ గ్రంథాలయం. విశాలమైన వరండాలు, గాజు అలమరాలలో భద్రపరచిన పుస్తకాలు, పెద్దపెద్ద ర్యాకులు, ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం ప్రత్యేకతలు. భడారియా గ్రంథాలయాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఒకటి అధ్యయన భవన్, మరొకటి సంగ్రహణ భవన్. అధ్యయన భవన్లో వందలాది మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విశాలమైన గదులను నిర్మించారు. సంగ్రహణ భవన్లో పలు అరుదైన గ్రంథాలను అందుబాటులో ఉంచారు. వీటికోసం 562 అలమరాలు, 16వేల అడుగుల పొడవులో ర్యాక్స్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ప్రాచీన ప్రతులు, రాష్ట్రపతులు, ప్రధానుల ప్రసంగాలు లభిస్తాయి. భడారియా మహారాజు కృషి ఫలితంభడారియా మహారాజు 1960లో శక్తిపీఠమైన భడారియామాత మందిరాన్ని సందర్శించి. అక్కడే స్థిరపడిపోయారు. ఆయన అసలు పేరు హరివంశ్సింగ్ నిర్మల్. ఇక్కడి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడ గ్రంథాలయాన్ని నెలకొల్పాలని అనుకున్నారు. 1983లో నిర్మాణానికి సంకల్పించారు. బయట ఎడారి వాతావరణం కాబట్టి పాఠకులకు, సందర్శకులకు ఇబ్బంది లేకుండా దీనిని నేలమాళిగలో నిర్మించారు. దీనివల్ల లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఎలాంటి అసౌకర్యానికి గురికారు. మహారాజు పదిహేనేళ్ల కృషికి ఫలితంగా 1998లో ఈ గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. దీని నిర్మాణం ప్రారంభం నుంచే పుస్తకాల సేకరణ ప్రారంభించారు. అలా ఇప్పటికి తొమ్మిది లక్షల పుస్తకాలను ఇందులో అందుబాటులో ఉంచారు. వీటిలో ప్రపంచస్థాయిలోని పలు మత గ్రంథాలు, చారిత్రక, భాషా, న్యాయ శాస్త్రాలకు సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. వీటితోపాటు వినోద, విజ్ఞానాలను పంచే పుస్తకాలనూ ఉంచారు. ఇక్కడికి వచ్చే పరిశోధకులు, విజ్ఞానార్థులు వేరేచోట అన్వేషించాల్సిన అవసరం లేకుండా సకల గ్రంథాలూ లభించేలా సమకూర్చారు. విశాలమైన భోజనశాలలుపలు అంశాలపై అధ్యయనం చేయడానికి వచ్చే వారికోసం పద్దెనిమిది గదులు నిర్మించారు. అలాగే విశాలమైన భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఎడారి ప్రాంతమైనా, ఈ గ్రంథాలయంలో ఎక్కడా వేడి వాతావరణం కనిపించదు. పాలరాతి గోడలతో చుట్టూ చల్లటి వాతావరణం ఉండేలా దీనిని నిర్మించారు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుంచే కాదు, యూరోప్ నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా అధికంగా ఉంటుందని గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిఆసియాలో పేరున్న భూగర్భ గ్రంథాలయాల రెండే ఉన్నాయి. వాటిలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని స్టార్ ఫీల్డ్ లైబ్రరీ ఒకటి కాగా రెండోది మన భడారియా గ్రంథాలయం. ఈ రెండిటిలో భడారీయా పుస్తక నిలయమే పెద్దది కావడం విశేషం. తిరుమలరావు కరుకోల(చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!) -
సినిమా హిట్టయినా అవకాశాలు నిల్.. దానిపైనే ఫోకస్ పెట్టిన బ్యూటీ
కృతి శెట్టి అంటే చటుక్కున గుర్తు రాకపోవచ్చు. కాని, బేబమ్మ అంటే ‘సి’ సెంటర్ ప్రేక్షకుడు కూడా గుర్తు పట్టేస్తాడు. పక్కించి అమ్మాయిలా కనిపించే కృతి చెప్పిన ముచ్చట్లు కొన్ని మీకోసం... తెలుగులో కృతి శెట్టి (Krithi Shetty) మొదటి సినిమా ‘ఉప్పెన’లో బేబమ్మగా అందరినీ మైమరపింపజేసింది. ఆ తర్వాత వరుసగా ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల సక్సెస్తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. లక్ ఫ్యాక్టర్ ఎంతోకాలం పని చేయలేదు. రామ్ పోతినేనితో నటించిన ‘వారియర్’, నితిన్తో నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, నాగ చైతన్యతో నటించిన ‘కస్టడీ’ అన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గాయి. మాతృ భాష ఏదంటే?అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్, పూజా హెగ్డేలాంటి అందాల భామలు వచ్చిన మంగుళూరు ప్రాంతం నుంచే కృతి శెట్టి కూడా వచ్చింది. తుళు ఆమె మాతృభాష. కృతి శెట్టి తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గర కావడానికి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు భాష మీద గ్రిప్ సంపాదిస్తే, క్యారెక్టర్ని ఇంకా బాగా పండించవచ్చని కృతి శెట్టి నమ్ముతుంది.ఆచితూచి..‘ఉప్పెన’ సూపర్ హిట్ తర్వాత రెమ్యునరేషన్ విపరీతంగా పెంచిన కృతి శెట్టి – ఇప్పుడు మాత్రం ఆచి తూచి అడుగేస్తోంది. ‘లవ్ టు డే’, ‘డ్రాగన్’ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయిన ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తున్న– ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా మీదే కృతి శెట్టి ఆశలన్నీ పెట్టుకుంది. నయనతార ఈ సినిమాకి నిర్మాత కాగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. అయితే ఈ సినిమా రిలీజ్, రిజల్ట్ కోసం ఇంకో నాలుగు నెలలు ఆగాల్సిందే!హిట్ అయినా అవకాశాలు నిల్మలయాళంలో టొవినో థామస్తో చేసిన ‘ఎఆర్ఎమ్’ హిట్ అయినా, మలయాళంలో అవకాశాలు రాలేదు. తనతో జీవితం పంచుకునేవాడిలో నిజాయితీ, దయ ఉండాలని, అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. భరించరాని ఒత్తిడికి లోనయినప్పుడు, ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు నిద్రపోతానని, ఏ ఆర్టిస్టుకి అయినా తగినంత గాఢ నిద్ర అవసరం అని చెప్పింది. మోహన్లాల్ కుమారుడు ప్రణవ్ యాక్ట్ చేసిన ‘హృదయం’లోని ‘దర్శనా’ సాంగ్ అంటే పిచ్చి. కారులో ట్రావెల్ అవుతున్నంత సేపు అదే పాట వింటూ ఉంటానంది.చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే? -
కింగులా బతికాడు సింగిల్గా..!
రోజూ పొద్దునే లేస్తాడు. ఆకలైతే తింటాడు. వ్యవసాయం తన వృత్తి. ఇంటి ముందే కొన్ని పండ్లు, కూరగాయల మొక్కలను పెంచుకుంటుంటాడు. మనుషులెవ్వరితోనూ మాట్లాడడు. మూగజీవాలు, పక్షులే అతని ఫ్రెండ్స్. కాలక్షేపం కోసం ఇంటి పనులు, మరమ్మతులు, నీటి గుంటలు తవ్వటం వంటివి చేస్తాడు. అన్ని పనులూ పూర్తి చేసుకున్నాక అలసట వస్తే, స్వయంగా నిర్మించుకున్న తన తాటాకుల గుడిసెలో సేద తీరుతాడు. అతన్ని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా, ప్రతిసారి పెద్ద యుద్ధమే చేసి, విజయం సాధించాడు. అడగకుండా ఎన్ని ఇచ్చినా పుచ్చుకోకుండా, చేయి చాచని మహారాజులా నిలబడేవాడు. ఆఖరుకు ఎక్కడికైనా చేరగల ఇంటర్నెట్ కూడా అతని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అతన్ని మచ్చిక చేసుకోలేక పోయాయి. ఇలా హాయిగా తన పని తాను చేసుకునేవాడు. ఇంతే! ఇదే తన జీవితం. ఎంతో అందమైన, ప్రశాంతమైన జీవితం. ఇలా అందరూ బతకలేరు. ఎవరికీ సాధ్యం కాని పనికూడా! అయినప్పటికీ అతను ఈ సూపర్ సింగిల్ లైఫ్ని గత మూడు దశాబ్దాలుగా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ అతనెవ్వరో కాదు, 1996లో తొలిసారి అమెజాన్ అటవీ అధికారులు గుర్తించిన ఒంటరి గిరిజనుడు. అతని తెగ మొత్తం అంతరించిపోయినా, అతను మాత్రం ఒక్కడే అడవిలో జీవిస్తున్నాడని తెలిసింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం అతన్ని 2018లో కెమెరాలో రహస్యంగా వీడియో తీసి, వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ మధ్యనే అధికారులకు అతని శరీరం గుడిసెలో కనిపించింది. నిద్రలో ప్రశాంతంగా మరణించాడు. ఇరవై ఆరేళ్లపాటు ఎవ్వరితోనూ మాట్లాడకుండా, కలవకుండా, ఒంటరిగా మహారాజులా బతికి, అంతే రాజసంగా లోకం నుంచి నిష్క్రమించాడు. (చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!) -
పాలిచ్చే తల్లులూ..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...!
నాకు త్వరలో తొమ్మిదో నెల నిండుతుంది. మొదటి ప్రెగ్నెన్సీ కావటంతో చాలా భయంగా ఉంది. మా ఊరి నుంచి దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రికి వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. అందుకే, ముందుగానే ఆసుపత్రికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లాలి?– రమణి, శ్రీకాకుళం. మొదటి ప్రెగ్నెన్సీలో కొంచెం గందరగోళం ఉంటుంది. ఏ సమయంలో నొప్పులు వస్తాయో తెలియదు కాబట్టి, తొమ్మిదో నెల వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్స్, బ్యాగ్ ఎప్పుడూ సిద్ధంగా ఒక చోట పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. మీకు వెన్నునొప్పి లేదా కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా, ఉమ్మనీరు పోతున్నా వెంటనే ఆసుపత్రికి బయలు దేరాలి. నొప్పులు మొదటి డెలివరీలో అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కొంతమందికి టైమర్ పెట్టుకొని పది నిమిషాల్లో ఎన్నిసార్లు పొట్ట గట్టిగా అవుతుందో నోట్ చెయ్యమని చెప్తాం. పది నిమిషాల్లో మూడుసార్లు టైట్గా అయినా, నొప్పి ఎక్కువ అయినా, అవి డెలివరీ పెయిన్స్ అని అర్థం. ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు ముప్పయి సెకండ్ల నుంచి ఒక నిమిషం ఉంటుంది. కొంతమందికి నొప్పులు ప్రతి అర్ధగంటకొకసారి ఎక్కువ అవుతుంటాయి. అంటే కాన్పు సమయం దగ్గరకు వచ్చిందని అర్థం. కేవలం నొప్పి ప్రతి అర్ధగంటకొకసారి వస్తుంటే రెండు నుంచి మూడు గంటలు చెక్ చేసుకొని, నొప్పి ఎక్కువ అవుతుంటే ఆసుపత్రికి వెళ్లండి. కొంతమందికి నొప్పి వచ్చి ఒక గంటలో తగ్గిపోతుంది. అంటే అది ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని అర్థం. అందుకే నొప్పి అనిపించిన తరువాత రెండు నుంచి మూడు గంటలు ఆగాలి. మొదటి ప్రెగ్నెన్సీలో నొప్పి మొదలైన పన్నెండు నుంచి ఇరవైనాలుగు గంటలకు కాని, కాన్పు కాదు. అందుకే, హడావిడి పడనవసరం లేదు. కాని, బ్లీడింగ్ లేదా వాటర్ లీక్ అవుతుంటే మాత్రం, నొప్పి లేకపోయినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్ మొత్తం తీసుకొని వెళ్లాలి. మీరు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ పల్స్, బీపీ, బేబీ హార్ట్బీట్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తారు. వాటిని బట్టే ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. ఫాల్స్ లేబర్ అయితే కొన్ని పరీక్షలు చేసి ఇంటికి పంపిచేస్తారు.నాకు డెలివరీ అయి రెండు నెలలు అవుతోంది. చాలాసార్లు నిపుల్ క్రాక్స్ వస్తున్నాయి. బ్లడ్ కూడా వస్తోంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – లావణ్య, తిరుపతి. బేబీకి ఒక సంవత్సరం వచ్చేవరకు తల్లిపాలు చాలా అవసరం. అందుకే, బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చే సమస్యలకు చాలా త్వరగా చికిత్స తీసుకోవాలి. పాలు తగ్గినా, నిపుల్ క్రాక్స్ ఉన్నా బేబీకి పాలు తాగటం కష్టం అవుతుంది. మీకు కూడా చాలా నొప్పి ఉంటుంది. పుండు లేదా పగిలిన చనుమొనలకు చికిత్స తీసుకోవడానికి ముందు చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఇందుకు మాయిశ్చరైజర్ సబ్బులని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. కాటన్ లోదుస్తులను వేసుకోవాలి. దానితో రొమ్ములకు మంచి ఎయిర్ సర్కులేషన్ వస్తుంది. వ్యాసలిన్ లేదా పారాఫిన్ లేదా ప్యూరిఫైడ్ లోషన్తో నిపుల్ మీద మసాజ్ చెయ్యాలి. ఇలా ప్రతి ఫీడ్ తరువాత చెయ్యండి. మళ్లీ ఫీడ్కి ముందు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, ఫీడింగ్ ఇవ్వండి. బ్రెస్ట్ ప్యాడ్స్ వాడుతున్నవారు, వాటిని ప్రతి ఫీడ్ తరువాత మార్చుకోవాలి. ఇలా క్రాక్స్ కాకుండా ప్రివెంట్ చెయ్యడానికి ఫీడ్ అయిన వెంటనే కొంచెం బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి నిపుల్ మీద రాసి, తరువాత కవర్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి చేస్తే అసలు క్రాక్స్ రాకుండా ఉంటాయి. నిపుల్ షీల్డ్ అని మెడికల్ షాప్స్లో రబ్బర్ కవరింగ్స్ దొరుకుతాయి. ఒకవేళ క్రాక్స్ ఎక్కువ ఉండి, బ్లీడింగ్ అవుతుంటే క్రీమ్స్ రాసి దాని తరువాత సరైన సైజ్లోని షీల్డ్ పెట్టి ఫీడింగ్ ఇస్తే నిపుల్కి విశ్రాంతి దొరికి, బ్లీడింగ్ అవకుండా ఉంటుంది. బేబీకి నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, నిపుల్ క్రాక్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి, ఒకసారి పిల్లల డాక్టర్కి బేబీని చూపించండి. తరచు క్రాక్స్కి ఇది కారణం కావచ్చు. బేబీ సకింగ్ పొజిషన్ కూడా చాలా ముఖ్యం. రొమ్ముల ఐరోలా, నిపుల్ మొత్తం నోటిలో పెట్టుకొని బేబీ సక్ చెయ్యాలి. అప్పుడే పాలు బాగా వస్తాయి. నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. నిపుల్ ఒక్కటే పట్టుకొని సక్ చేస్తే క్రాక్స్ ఎక్కువ అవుతాయి. ఒకసారి లాక్టేషన్ కన్సలెంట్ని కలసి మీకు పొజిషన్స్ ఫర్ ఫీడింగ్ గురించి తెలుసుకోండి. ఇవి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఫీడింగ్ బాగా వస్తుంది, నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: '2 పర్ 20 వాకింగ్ రూల్' అంటే..! వ్యాయామాలు చేయకుండానే..) -
ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!
మయాన్మార్లోని బాగన్ ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. ఒకప్పుడు పేగన్ సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన ఈ ప్రాంతం, వేలాది పురాతన బౌద్ధ దేవాలయాలు, స్థూపాలు, పగోడాలకు ప్రసిద్ధి చెందింది. 11 నుంచి 13 శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ నిర్మాణాలు బర్మీస్ నిర్మాణ కళకు అద్భుతమైన సాక్ష్యాలుగా కనిపిస్తాయి.విస్తారమైన మైదానంలో ఎటు చూసినా కనిపించే ఈ ఆలయాల దృశ్యం గొప్ప అనుభూతినిస్తుంది. సంధ్యవేళలో బంగారుకాంతితో మెరిసే ఈ నిర్మాణాలు, సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆనంద టెంపుల్, శ్వేదగాన్ పగోడా, థాబ్యిన్యు టెంపుల్ వంటి ముఖ్యమైన ఆలయాలు అక్కడి చరిత్రను చాటి చెబుతాయి.బాగన్ అందాలను ఆస్వాదించడానికి ‘హాట్ ఎయిర్ బెలూన్ రైడ్’ భలేగా ఉంటుంది. ఆ రైడ్తో ఆకాశంలో గిరికీలు కొడుతూ ఎత్తయిన ప్రదేశం నుంచి ఈ పురాతన నగరంలోని విశాలమైన ఆలయాల దృశ్యాన్ని చూడటం ఒక మరపురాని అనుభవం కలిగిస్తుందంటారు పర్యాటకులు. కాలక్రమేణా ఇక్కడ కొన్ని ఆలయాలు శిథిలమైనప్పటికీ, బాగన్ చారిత్రక ప్రాముఖ్యతతో పాటు ఆధ్యాత్మిక వైభవం మాత్రం చెక్కుచెదరలేదు. ఇది చరిత్ర, సంస్కృతిని ప్రేమించే వారు, తప్పక చూడవలసిన ప్రదేశం. (చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్కే అందని మిస్టరీ..!) -
వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! నెటిజన్లు ఫిదా
వందేళ్లు దాటిన అందాలబామ్మ ఆమె. ‘ఆన్లైన్’లో ఈ బామ్మ పేల్చే బ్లష్ బ్లాస్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత ఆమె చెప్పే పాఠాలు వింటే వెంటనే మీరు కూడా మేకప్ బ్రష్ పట్టుకొని అద్దం ముందుకు వెళ్తారు. బామ్మలు అంటే కుకీస్ చేయటం, కథలు చెప్పడమే కాదు; సౌందర్య పోషణతో సోషల్ మీడియాను షేక్ చేయవచ్చని నిరూపించింది ఇంగ్లండ్కు చెందిన జోన్ పార్ట్రిడ్జ్. ఈమె వయసు 103.సరదా సరదాగా బ్యూటీ పాఠాలురోజూ ఉదయం కాఫీ కప్పు చేతిలో పట్టుకోవడం కంటే ముందు ఈ బామ్మ మేకప్ బ్రష్ పట్టుకుంటుంది. ఆపై మొబైల్ కెమెరా ఆన్ చేసి, టిక్టాక్లో మేకప్ ట్యూటోరియల్ వీడియోలు చేస్తుంది. బామ్మ చెప్పే పాఠాలు బోరింగ్ అనుకోకుండా సుమారు రెండున్నర లక్షల మంది చాలా శ్రద్ధగా వింటారు. ఒకరోజు బ్లష్ బ్రష్ తీసుకొని చెంప మీద మెల్లగా తిప్పుతూ ‘బ్లష్ ఎప్పుడూ నవ్వుతూ వేయమంటారు. కాని, నేను నవ్వితే ముడతలే కనిపిస్తాయి.’ అనే పంచ్ వేసింది. ఈ మాట వినగానే స్క్రీన్ ముందు ఉన్న జనాలంతా నవ్వుల వర్షం కురిపించేశారు. ఈ ఒక్క వీడియోకి లక్షల్లో లైక్స్, కామెంట్లు, షేర్లు! ఇక అప్పటి నుంచి ఆమె మేకప్ టెక్నిక్స్ చూసి కొంతమంది ఫిదా అయితే, బామ్మ కామెడీకి చాలామంది డబుల్ ఫిదా అయ్యారు. ‘ఇలా కాజల్ వేయాలి, ఇలా బ్రష్ తిప్పాలి, ఇలా బ్లష్ టచప్ చేయాలి’ అని అందరికీ అర్థమయ్యేలా చక్కగా బోధపరుస్తుందీ బామ్మ. ఏ టిప్ అయినా, సీరియస్గా చెప్పదు, చెణుకులు వేస్తూ సరదాగా చెప్తుంది. ‘టిక్టాక్’లో ఈ బామ్మ హవా తెలుసుకున్న టీవీ చానళ్లు కూడా ఇంటర్వ్యూల కోసం ఈమె ముందు క్యూ కడుతున్నాయి. బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానళ్లు ఈమెను ఇప్పటికే ఇంటర్వ్యూ చేశాయి.వరుస గిఫ్ట్ హ్యాంపర్లు దీనికి తోడు, ఆమె ఉపయోగించే మేకప్ ఐటమ్స్ను కొంతమంది ఫాలోవర్స్ ఫ్యాషన్ బ్రాండ్స్కు ట్యాగ్ చేశారు. బ్రాండ్స్ వాళ్లు కూడా బామ్మ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయి, వెంటనే గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారు. ఇక ఆ హ్యాంపర్స్ వచ్చాకే అసలు మజా మొదలైంది. బామ్మ మేకప్ ప్రాడక్ట్స్ ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. వందేళ్ల వయసులోనూ బామ్మ టిక్టాక్లో వైరల్ స్టార్, మేకప్ గురు, బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. ఈ బామ్మని చూసిన తర్వాత ‘మా అమ్మమ్మకు, బామ్మకు ఫేస్బుక్ ఖాతా లేదని సిగ్గేస్తోంది’ అని అనిపించకుండా ఉండదు. కొంతమంది యువత వాళ్ల అమ్మమ్మలకూ, బామ్మలకు ఈ బామ్మ వీడియోలను షేర్ చేస్తున్నారు. బ్లష్ ఎలా వేయాలో నేర్చుకోవటానికి కాదు, వాళ్ల అమ్మమ్మలు, బామ్మలు కూడా టిక్టాక్ స్టార్లుగా రెడీ అవ్వడానికి! (చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..) -
ఇంటర్ తర్వాత... మీ దారి కనిపెట్టాలి!
ఇంటర్మీడియట్ పూర్తవగానే విద్యార్థి జీవితంలో మొదలయ్యే అసలైన టెన్షన్– ‘ఇప్పుడేం చేయాలి?’ పేరెంట్స్, టీచర్స్, బంధువులు, ఫ్రెండ్స్ రకరకాల సలహాలిస్తుంటారు. ‘‘ఇంజినీరింగ్ చెయ్, ఫ్యూచర్ బాగుంటుంది.’’‘‘నీట్ రాయి, ఎంబీబీఎస్ అయిపోతే జీవితం సెట్ అవుతుంది.’’‘‘బీకామ్ తీసుకుని సీఏ చెయ్యి, ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు.’’ఈ సలహాలు విని గుడ్డిగా ఒకదాన్ని ఎంచుకోవడం కాదు. మీకు సరిపోయే దారి కనిపెట్టడమే అసలైన విజయం.మీ మనసేం చెప్తోంది? ఇంటర్ తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదంటే అది మీ తప్పు కాదు. ఎవరూ సరైన ప్రశ్నలు అడగలేదని మాత్రమే. అందుకే మీ మనసేం చెప్తుందో అడగండి. ఇది నిజంగా నా దారేనా? నేను నేనుగా ఉండే దారేది? నాలోని విజేతను వెలికితీసే కోర్సు ఏది? నాలో నిద్రిస్తున్న టాలెంట్ను తట్టి లేపే దిశ ఏది? వీటికి సమాధానం దొరకలేదా, కెరీర్ కౌన్సెలింగ్ మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని మెప్పించే దారి కాకుండా, మీరు గర్వపడే దారిని చూపిస్తుంది. కొత్త దారిలో నడవండి...ఇంటర్ తర్వాత అనేక ప్రవేశపరీక్షలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో జయాపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. పరీక్షలు ఆటల్లాంటివి. మీ గెలుపు ఆటలో కాకుండా, మీ ఆట మీరే రాసుకున్నప్పుడు వస్తుందని గుర్తించండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తీసుకోకుంటే జీవితం వృథా అనే సలహాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులు కాకుండా, కొత్త దారిలో నడిచేందుకు ధైర్యం చేయండి. బైపీసీ తర్వాత మెడిసిన్ తప్ప మరేం చేసినా వేస్ట్. బైపీసీ తర్వాత మెడిసిన్ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్ సై, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపీసీ అంటే బీటెక్, లెక్కలే!ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్ (ఎన్డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కామర్స్ అంటే సీఏ తప్ప దారిలేదుకామర్స్ స్ట్రీమ్లో సీఏ ఒక్కటే కాదు. మరెన్నో కోర్సులు, అవకాశాలు ఉన్నాయి. ఫిన్ టెక్, బిజినెస్ అనలిటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్రాండింగ్, క్రిప్టో స్ట్రాటజీ వంటి అధునాతన కెరీర్స్ ఇప్పుడు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాయి. ఆర్ట్స్ తీసుకుంటే స్కోప్ ఉండదు.. ఇది ఒక పెద్ద అపోహ. ఏ స్ట్రీమ్ చదువుతున్నామనే దానికంటే అందులో ఏ స్థాయిలో చదువుతున్నామనేది ముఖ్యం. సైకాలజీ, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, మీడియా, కాగ్నిటివ్ సైన్స్ లాంటి సృజనాత్మత, మేధా రంగాలు కొత్త దారులు చూపిస్తున్నాయి. దారి చూపించే మూడు ప్రశ్నలు...ముఖ్యమైన విషయమేమిటంటే, నిజానికి ఇది కోర్సు ఎంచుకునే దశ కాదు. ఇది జీవితాన్ని డిజైన్ చేసుకునే దశ. వందల కోర్సులు ఉన్నా, మీకు సూటయ్యే కోర్సు ఒక్కటే. అది మీకు ప్యాషన్ కలిగించాలి.అది మీకు పర్పస్ నేర్పించాలి.అది మీకు అవకాశాలను తెచ్చిపెట్టాలి.అందుకే ఈ దశలో సమాజం చూపించే మార్గాల కన్నా, మీ లోపల ఉన్న ఓపిక, ఊహ, ఉత్సాహం ఏ దిశ చూపుతుందో వినాలి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకోసం మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. నాకు నచ్చేది ఏంటి? ఏ పని చేస్తుంటే కాలం తెలియకుండానే గడిచిపోతుంది? అదే మీ ఫ్యాషన్. నాకు బాగా వచ్చేది ఏంటి? ఇంకొకరికి వదలకుండా చేయగలిగే పని ఏది? అదే మీ బలం. నాకు ఎలాంటి జీవితం కావాలి? స్వేచ్ఛా? గౌరవమా? సృజనాత్మకతా? ప్రభావమా? అదే మీ విజన్. ఈ మూడు సమాధానాలు కలిసి మీలోని గందరగోళాన్ని తుడిచేసి స్పష్టమైన వ్యూహంగా మార్చుతాయి. సెల్ఫ్ అండ్ అవేర్నెస్ స్కిల్ అండ్ మ్యాపింగ్ + ఫ్యూచర్ విజన్= రైట్ కెరీర్. ఈ ఫార్ములాతో నడిస్తే కోర్సు మాత్రమే కాదు, జీవితం మారుతుంది. డిగ్రీ కాకుండా డైరెక్షన్ వస్తుంది. కేవలం ఉద్యోగం కాకుండా ఊపిరిలాంటి పని వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్! -
ఇదో టైపు ఇంటరాగేషన్ !
పోలీసు ఇంటరాగేషన్ ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలిసిందే! థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, నిందితులను కొట్టడం, వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం వంటివి కూడా తెలిసిందే! హైదరాబాద్ గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్లు జరిగాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) అధికారులు ఒక పేలుడు పదార్థాల తయారీ కంపెనీ యజమానికి రొటీన్కు భిన్నంగా ఇంటరాగేట్ చేశారు. పోలీసు రికార్డులకెక్కని ఈ ఉదంతంతో సంబంధం ఉన్నవారి పేర్లు గోప్యంగా ఉంచడం అనివార్యం.హైదరాబాద్ మక్కామసీదులో 2007 మే 18 మధ్యాహ్నం బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనలను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి పేలింది. మరోదాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనలో 11 మంది మరణించారు, 19మంది గాయపడ్డారు. దీనిపై హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్లో నమోదైన ఈ కేసు హైదరాబాద్ సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి, తర్వాత సీబీఐకి బదిలీ అయింది. ఈ పేలుడు కోసం గ్రెనేడ్స్ డిజైన్లో పోతపోసి ప్రత్యేకంగా తయారు చేసిన షెల్స్ను వినియోగించారు. ఇందులో నింపిన పేలుడు పదార్థం ఆర్డీఎక్స్గా తేలింది. అదే ఏడాది ఆగస్టు 25 సాయంత్రం కోఠీలోని గోకుల్చాట్, లుంబినీపార్కు లేజేరియంలో రెండు బాంబులు పేలాయి. దిల్సుఖ్నగర్లోని వెంకటాద్రి థియేటర్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపం నుంచి పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పేలుళ్లలో 42 మంది మరణించగా, 68 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు చెక్కపెట్టెలో అమోనియం నైట్రేట్ స్లర్రీని నింపి పేల్చినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ఈ పేలుళ్లకు, పేలని బాంబులకు సంబంధించి సుల్తాన్బజార్, సైఫాబాద్, మలక్పేట పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు కొన్నాళ్లకు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) బదిలీ అయ్యాయి. ఈలోగా ఈ కేసుల దర్యాప్తుకు హైదరాబాద్ పోలీసులు ‘సిక్’ ఏర్పాటు చేశారు.‘సిక్’ అధికారులు వివిధ కోణాలను విశ్లేషిస్తూ ముందుకు వెళ్లారు. మక్కా మసీదులో పేలిన బాంబులో ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ వినియోగించారు. అది కేవలం పాకిస్తాన్ నుంచి సరఫరా కావడానికి, రక్షణ శాఖ నుంచి అక్రమంగా బయటకు రావడానికి మాత్రమే అవకాశం ఉండటంతో ఆర్డీఎక్స్ సరఫరాలో స్థానిక సహకారం ఉంటుందని పోలీసులు అనుమానించలేదు. అయితే, జంట పేలుళ్లకు వినియోగించిన బాంబులు అమోనియం నైట్రేట్తో తయారు చేసినవి కావడంతో ‘సిక్’ అప్రమత్తమైంది. క్వారీల్లోను, నిర్మాణరంగంలోను వినియోగించడానికి అమోనియం నైట్రేట్ తయారు చేసే కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. గతంలో మావోయిస్టులు సైతం విధ్వంసాల కోసం దీనినే వాడారు. అందువల్ల అమోనియం నైట్రేట్ సరఫరాలో ‘సిక్’ అధికారులు స్థానికుల పాత్రను అనుమానించారు.ఈ కేసుల దర్యాప్తులో వందల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కొందరిని ప్రశ్నించి విడిచిపెట్టగా, మరికొందరిని లోతుగా ఇంటరాగేట్ చేశారు. ఇందులో అనేకం అక్రమ నిర్బంధాలు కావడంతో, ఇలా కస్టడీలోకి తీసుకున్న వారిని రహస్య ప్రదేశాల్లో ఉంచి విచారించారు. రహస్య విచారణ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్హౌస్లు, గెస్ట్ హౌస్లు, ఖాయిలా పరిశ్రమలు, మూతపడిన కంపెనీలను వినియోగించారు. అప్పట్లో అలా వినియోగించిన ఓ కంపెనీ హైదరాబాద్కు దక్షిణ దిక్కులో ఉంది. నగర శివార్లలో ఉంటూ, శివారు జిల్లాలో అమోనియం నైట్రేట్ స్లర్రీ తయారీ కంపెనీ నిర్వహిస్తున్న ఒక బడా వ్యాపారి అప్పట్లో ‘సిక్’ విచారణ ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. ఆయన వయసు, ప్రొఫైల్ తదితరాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు రొటీన్ కు భిన్నంగా, ఏమాత్రం హింసకు తావు లేకుండా అతడి నోరు విప్పించాలని భావించారు.ఓ రోజు ఉదయం ఆ వ్యాపారి ఇంటికి వెళ్లిన సిక్ బృందం, అతణ్ణి అదుపులోకి తీసుకుని, దక్షిణాన ఉన్న కంపెనీకి తీసుకువచ్చింది. అక్కడ ఒక గదిలో నిర్బంధించింది. దాదాపు 15 రోజుల పాటు ఇలా ఉంచినా, కనీసం ఒక్కరోజు కూడా ఏ పోలీసూ అతనితో మాట్లాడలేదు. ఈ పక్షంరోజుల్లో రెండుసార్లు మాత్రమే బ్రష్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కోటీశ్వరుడైన ఆ వ్యాపారిని అన్ని రోజులు స్నానం చేయనీయలేదు. ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం నుంచి ఒక గార్డును ఏర్పాటు చేశారు. అతడితో మాట్లాడకూడదని సిక్ అధికారులు నిర్ణయించుకున్నారు. గార్డులకూ ఇదే ఆదేశాలు జారీ చేశారు. ఒకటి రెండు రోజుల తర్వాత గార్డుకు అతనితో పరిచయం ఏర్పడి, మాట్లాడే అవకాశం ఉంటుందని అధికారులు అనుమానించారు. దీంతో ప్రతి రోజూ అక్కడ పనిచేసే గార్డును మార్చేవారు. కేవలం ఆహారం అందించడం, కాలకృత్యాలకు తీసుకువెళ్లడమే అతడి డ్యూటీ. ఇలా ఈ ‘ఇంటరాగేషన్ ’ నాలుగు రోజులు సాగిన తర్వాత ఆ వ్యాపారి పోలీసులను బతిమాలుకోవడం మొదలెట్టాడు. ఎవరైనా వచ్చి తనతో మాట్లాడాలని, ఏవైనా ప్రశ్నలు అడగాలని, అవసరమైతే కొట్టాలని వేడుకున్నాడు. ఈ మౌనం కంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించినా తట్టుకోగలనంటూ నెత్తినోరు బాదుకున్నాడు. అతడు ఉన్న గది నుంచి ఆ కంపెనీ వెనుక వైపు కొండపై ఉన్న ఓ చిన్న దేవాలయం కనిపిస్తుండేది. శారీరక, మానసిక వైకల్యం లేకుండా అక్కడ నుంచి బయటకు వస్తే ఆ దేవాలయాన్ని పెద్దగా కడతానంటూ దాన్ని చూస్తూ మొక్కుకునే వాడు. ఒక దశలో తనంతట తానే పెద్దగా అరుస్తూ, గతంలో మావోయిస్టుల నుంచి బెదిరింపులు రావడంతో తప్పనిసరై వారికి అమోనియం నైట్రేట్ అక్రమంగా సరఫరా చేశానని, ఈ పేలుడుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మొత్తుకున్నాడు. ఇలా పక్షం రోజుల తర్వాత సదరు వ్యాపారి ఆ కంపెనీ నుంచి, సిక్ కస్టడీ నుంచి బయటకు రాగలిగాడు. నెల రోజులకే తాను మొక్కుకున్నట్లు ఆ దేవాలయం అభివృద్ధి పనులు ప్రారంభించాడు.ఈ జంట పేలుళ్ల కేసుల్ని దర్యాప్తు చేసిన ఎన్ ఐఏ అధికారులు పేలుడు పదార్థమైన స్లర్రీ కర్ణాటకలో ఉగ్రవాదులకు అందినట్లు తేల్చారు. అక్కడే బాంబుల్ని తయారు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది రియాజ్ భత్కల్ బస్సులో ఇక్కడకు పంపినట్లు నిర్ధారించారు. ఈ విధ్వంసానికి సూత్రధారులైన రియాజ్ భత్కల్, అమీర్ రజా ఖాన్ ఇప్పటికీ పరారీలోనే ఉండగా, మిగిలిన నిందితులకు 2018లో న్యాయస్థానం శిక్ష విధించింది. -
కాలకల్పుని కథ
పూర్వం మథురా పట్టణంలో సోమశేఖరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. విశాలాక్షి అనే యువతిని వివాహమాడి గృహస్థ జీవనం గడపసాగాడు. వేదవేదాంగ పారంగతుడైన సోమశేఖరుడు ధర్మబద్ధంగా జీవిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఉండేవాడు. నిత్య నైమిత్తిక కార్యక్రమాలను నియమం తప్పక ఆచరిస్తూ ఉండేవాడు. నిత్యాగ్నిహోత్రుడై దేవ ముని పితృదేవతారాధన క్రమం తప్పక సాగించేవాడు. కొన్నాళ్లకు సోమశేఖరుడు, విశాలాక్షి దంపతులు పుణ్య సముపార్జన కోసం తీర్థయాత్రలు చేయాలని తలచారు. ఒక సుముహూర్తాన తీర్థయాత్రలకు బయలుదేరి, గంగా తీరానికి చేరుకున్నారు. గంగానదిలో స్నానమాచరించారు. సోమశేఖరుడు గంగానది ఒడ్డున సంధ్యావందనం చేసుకునేలోగా, విశాలాక్షి కలశంతో గంగాజలాన్ని నింపుకొని వచ్చింది. అందులో తులసిదళాలను వేసింది. సోమశేఖరుడి సంధ్యాదికాలు పూర్తి కాగానే దంపతులిద్దరూ గంగాకలశంతో కాలినడకన బయలుదేరారు.వారు అలా నడక సాగిస్తుండగా, పశ్చిమదేశం నుంచి ఎడ్లబండిపై సరుకులు నింపుకొని పోతున్న వర్తకుడు ఒకరు ఎదురయ్యాడు. కాలకల్పుడు అనే చోదకుడు ఆ బండి తోలుతున్నాడు. బండికి కట్టిన ముసలి ఎద్దు సరుకుల భారాన్ని లాగలేక లాగలేక భారంగా ముందుకు కదులుతోంది. కొద్దిసేపటికి అది బండిని మరి లాగలేక మొండికేసి ఆగిపోయింది.కదల్లేని మొండిఎద్దు తీరుకు కాలకల్పుడికి కోపం ముంచుకొచ్చి, దానిని కర్రతో బాదాడు. ముసలి ఎద్దు ఆ బాధ భరించలేక నేలమీద పడిపోయింది. బండి పక్కకు ఒరిగిపోయింది. బండి బరువు మీద నుంచి తొలగిపోవడంతో ఆ ఎద్దు విదిలించుకుని పైకిలేచి, తనను మళ్లీ కొట్టడానికి వస్తున్న కాలకల్పుడిని కసితీరా కొమ్ములతో పొడిచింది. కాలకల్పుడు ఆ పోటు భరించలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తగని బాధతో విలవిలలాడుతూ విలపించసాగాడు. సోమశేఖరుడు, విశాలాక్షి ఈ దృశ్యాన్ని చూసి విచలితులయ్యారు. కాలకల్పుడి దుస్థితికి వారు జాలిపడ్డారు. శ్రీహరిని పూజించి కలశంలో తీసుకువస్తున్న గంగాజలాన్ని సోమశేఖరుడు అతడి నోట్లో పోశాడు. అతడి శరీరంపై గంగాజలాన్ని చల్లి, తులసిదళాన్ని వేశాడు. తర్వాత సోమశేఖరుడు, విశాలాక్షి తమ దారిన తాము ముందుకు నడవసాగారు. కొంతసేపటికి కాలకల్పుడు అక్కడే ప్రాణాలు విడిచాడు.కాలకల్పుడిని విడిచిపెట్టి, సోమశేఖరుడు, విశాలాక్షి ముందుకు సాగుతుండగా, దారిలో వారికి కొందరు క్షతగాత్రులు కనిపించారు. కాళ్లు చేతులు విరిగిపోయి, నడవలేక, నెత్తురు కక్కుకుంటూ మూలుగుతూ అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నారు వారు. వారిని చూసి కలవరపడిన సోమశేఖరుడు, ‘అయ్యా! మీరంతా ఎవరు? ఎందుకిలా బాధపడుతున్నారు? ఎవరైనా మీ మీద దాడి చేశారా?’ అని ఆందోళనగా ప్రశ్నించాడు.‘విప్రోత్తమా! మేము యమదూతలం. మాకు, విష్ణుదూతలకు పెద్ద వాదం వచ్చింది. వారిని మేము ఎదిరించలేకపోయాం. వారు మమ్మల్ని ఇలా శిక్షించారు’ అని చెప్పారు.‘విష్ణుదూతలు మిమ్మల్ని ఎందుకు దండించారు?’ ప్రశ్నించాడు సోమశేఖరుడు.‘ఒక వర్తకుడి సేవకుడు అయిన కాలకల్పుడి ప్రాణాలను కొనితెమ్మని మా ప్రభువు యమధర్మరాజు మమ్మల్ని ఆదేశించారు. జీవితాంతం అతడు చేసినవన్నీ పాపకార్యాలే! చివరిదశలో కూడా బండి లాగలేని ముసలి ఎద్దును నిర్దాక్షిణ్యంగా హింసించాడు. ఇదే సంగతిని మేము విష్ణుదూతలకు చెప్పాము. అతడి ప్రాణాలను కొనిపోతున్న మమ్మల్ని అడ్డుతొలగమన్నాం. వారు ఒప్పుకోలేదు. అందుకే వారితో వాదం జరిగి, యుద్ధంగా మారింది’ అని వివరించారు యమకింకరులు.‘విష్ణుదూతలు ఎందుకు ఒప్పుకోలేదు?’ అడిగాడు సోమశేఖరుడు.‘ఇతడు పాపాత్ముడు కాదు, మహాపుణ్యాత్ముడు. ఎద్దు కుమ్మడంతో గాయపడి, అంత్యదశలో ఉన్నప్పుడు పవిత్ర గంగాజలాన్ని తులసిదళాలతో సేవించాడు. అంతేకాదు, ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో నారాయణ నామస్మరణాన్ని ఆలకించాడు. అంతటితో ఇతడి పాపాలన్నీ నశించాయి. ఇంక ఇతడికి పాపాలు ఎక్కడ ఉన్నట్లు? అందువల్ల మీరు ఇతడిని యమపురికి తీసుకుపోవడానికి వీల్లేదు’ అని చెప్పారు.‘మా యమధర్మరాజు ఆదేశాన్ని మేము పాటించాల్సిందే! అడ్డుతప్పుకోండి అని హెచ్చరించాం. వారు వినలేదు. మాతో పోరుకు దిగారు. ఇదిగో ఫలితం! విష్ణుదూతల చేతిలో చావుదెబ్బలు తిని మేమిలా మిగిలాం’ అని గద్గదస్వరంతో చెప్పారు యమకింకరులు. పవిత్ర గంగాజల మహిమను, తులసి మహాత్మ్యాన్ని, అంత్యకాలంలో హరినామస్మరణ వల్ల దక్కే ఫలితాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలిగినందుకు సోమశేఖరుడు, విశాలాక్షి సంతోషించారు. వారు మనసులోనే శ్రీహరికి వందనాలు సమర్పించారు.గంగాతీరం వెంబడి సాగుతూ, శ్రీహరి క్షేత్రాలను సందర్శించుకుని, శాస్త్రోక్తంగా పూజాదికాలు చేస్తూ కొన్నాళ్లకు వాళ్లు తీర్థయాత్రలను ముగించుకుని, సంతోషంగా ఇంటికి చేరుకున్నారు.∙సాంఖ్యాయన -
వజ్రాలు ఉచితం
ధగధగలాడే వజ్రాల మెరుపులు కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. వజ్రాల మెరుపులే కాదు, వాటి ధరలు కూడా కళ్లు చెదిరేట్లు చేస్తాయి. వజ్రాల విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ధర చెల్లిస్తే గాని, రవ్వంత వజ్రమైనా కొనడం సాధ్యం కాదు. అలాంటిది వజ్రాలు ఉచితం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా?ప్రపంచంలో వజ్రాలు ఉచితంగా దొరికే చోటు ఒకే ఒక్కటి ఉంది. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది ఇదే! ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంది. మర్ఫ్రీబరో గ్రామానికి చేరువలో ఉన్న ఈ వజ్రాల ఆలవాలం పేరు ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’. దాదాపు 37.5 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు వజ్రాల గని. దీనిని 1972లో స్టేట్ పార్కుగా మార్చారు. అప్పటి నుంచి ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కులో 35 వేలకు పైగా వజ్రాలు దొరికాయి. వీటిలో కొన్ని అరుదైన రకాలకు చెందినవి కూడా ఉన్నాయి.ఈ పార్కులోకి ప్రవేశించడానికి, ఇందులో టెంట్లు ఏర్పాటు చేసుకుని బస చేయడానికి మాత్రమే డబ్బు చెల్లించాలి. ఇక్కడ ఎవరైనా నేల తవ్వుకుని, వజ్రాలను ఏరుకోవచ్చు. చాలామంది సెలవురోజుల్లో ఇక్కడకు కుటుంబ సమేతంగా వచ్చి, తవ్వకాలు జరుపుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. మట్టిని, ఇసుకను జల్లెడపడుతూ గంటల తరబడి ఓపికగా వెదుకులాట సాగిస్తుంటారు. తవ్వకాల్లో ఎవరికైనా ఒక్క వజ్రం దొరికినా, వారి పంట పండినట్లే! ఈ పార్కులో గడపడానికి పెద్దలకు రోజుకు 15 డాలర్లు (రూ.1285), పన్నెండేళ్ల లోపు పిల్లలకు 7 డాలర్లు (రూ.600) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కొందరు ఇక్కడ టెంట్లు వేసుకుని రోజుల తరబడి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు. పార్కు బయట టెంట్లను అద్దెకు ఇచ్చే దుకాణాలు, తవ్వకాల కోసం ఉపయోగించే పనిముట్లు, పరికరాలను అద్దెకిచ్చే దుకాణాలు కూడా ఉంటాయి. ఇంటి నుంచి పలుగు పార వంటివి తెచ్చుకోనివారు వాటికి ఈ దుకాణాల్లో అద్దెకు తీసుకోవచ్చు. ఇక్కడ వజ్రాలు దొరికినట్లయితే, వాటిని ఎలాంటి మూల్యం చెల్లించాల్సిన పనిలేదు. చక్కగా వాటిని ఉచితంగానే ఇంటికి తీసుకుపోవచ్చు.మిన్నెసోటా ప్రాంతానికి చెందిన డేవిడ్ డికుక్ అనే వ్యక్తికి ఇక్కడ అరుదైన బ్రౌన్ డైమండ్ దొరికింది. గత నెల అతడు ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తుండగా, చాక్లెట్ రంగులో «మెరుస్తున్న రాయి కనిపించింది. దానిని పరీక్షించి చూస్తే, అది 3.81 కేరట్ల బ్రౌన్ డైమండ్గా తేలింది. ఈ పార్కులో ఇప్పటి వరకు దొరికిన వజ్రాల్లో ఎక్కువ శాతం పారదర్శకమైన తెల్లవజ్రాలే అయినా, కొందరికి అరుదైన బ్రౌన్ డైమండ్స్, యెల్లో డైమండ్స్ కూడా దొరికాయి. ఈ పార్కులో వజ్రాలు మాత్రమే కాకుండా కొంత తక్కువ విలువ కలిగిన అమెథిస్ట్, జాస్పర్, ఎగేట్, క్వార్ట్జ్ వంటి రత్నాలు కూడా దొరికాయి. అర్కాన్సాస్–టెక్సస్ సరిహద్దులో ఉన్న ఈ పార్కు సెలవురోజుల్లో జనాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. -
ఈ వారం కథ: ప్రేమించేందుకు వీలులేదా?
ఆ ఉదయం ఇంకా తెల్లవారలేదు. ఫోన్లో చిన్ని పిచ్చుక పిల్ల పలకరింపు.ఆ చప్పుడుకి నిద్ర కళ్ళతో పక్కన టీపాయ్పై తడిమి, ఫోన్ అందుకుని మెసేజ్ తెరిచి చూశాడు.పచ్చటి ఆకుల మధ్య నుండి తొంగి చూస్తున్న విచ్చుకున్న మల్లెపూవు ఫోటో, ఆ కింద ‘‘మా ఇంట్లో మల్లె తీగకి పూసిన మొదటి పూవు. ఇది నీ కోసం. ఈ ఉదయం తోటలోకి రాగానే, ఆ పువ్వును చూడగానే, ఎంత ఆనందం వేసిందో. నువ్వు గుర్తొచ్చావు. నిద్రలేవగానే చూస్తావని’’ ఆమె. ఇలాంటి పిల్లపై నిద్రపాడుచేసింది అని ఎట్లా కోపం తెచ్చుకోగలడు. అతని పెదవులపై చిన్న నవ్వు.‘‘ ఒకే పూవు. మరి అక్కడ నేను లేనుగా’’‘‘సరిగ్గా చూడు. ఆ పక్కన ఓ చిన్న మల్లె మొగ్గ వుంది. ఈ పూచిన పూవు రాలిపోతుంది కదా. అప్పుడు దానికి వికసించడానికి చోటు దొరుకుతుంది’’అతనికి కొంచం దిగులనిపించింది. రెండు పూలూ ఒకేసారి పూసి, ఒకేసారి రాలిపోవచ్చు కదా అనుకున్నాడు మనసులో.‘‘ఈ మల్లె ఏ జాతిదో, ఎక్కడ నుండి వచ్చిందో తెలీదు. ఎంత పరిమళం వెదజల్లుతూ వుందో! రెండు సీతాకోక చిలుకలు వాలాయి ఆ కొమ్మపై. ఆ అదురుకో, వీచిన గాలికో, పూవు రాలిపోయింది’’ ఒక కన్నీటి చుక్క ఎమోజీ. కాసేపటికి ‘‘ఆ రాలిన పూవు చూడు, కొంచెంసేపు బుద్ధుడి ఒడిలో, ఈ మొక్కల మధ్య... దానిది కాని చోటైనా, ఎంతో అందంగా లేదూ!’’చిన్ని చిన్ని పక్షులతో అలంకరించిన వేలాడే పింగాణీ కుండీలో ఆకుల మధ్య ఆ మల్లెపూవు.అతనికి అప్పుడా పిల్ల దగ్గరికి పరుగెత్తుకెళ్ళి గుండెలకు హత్తుకోవాలని అనిపించింది.‘‘ఇవ్వాల్టి ఉదయపు చిన్ని, చిన్న ఆనందాలు ఇవి. ఇప్పటికి ఇక బై’’‘‘అప్పుడేనా’’ అన్నాడు అతను.అటుపక్క నవ్వు.‘‘నీకు ఇక ఎప్పటికీ తెల్లవారదు. నాకోసం కలలు కనడంలోనే సమయం గడిచిపోయిందని అంటావు కదూ’’మరో నవ్వు ఎమోజీతో సంభాషణ ఆగిపోయింది.అతను లేచాడు. తలుపు తెరిచి ఆకాశం కేసి చూశాడు.అది ఎప్పటిలానే వుందా? అతనికి అది గాఢనీలంలోకి మారినట్లు అనిపించింది నిన్నటి కన్నా. అక్కడ రెండు తెల్లటి మేఘాలు ఒకదాన్ని ఒకటి అందుకునేందుకు చేతులు చాస్తునట్లు. ఆ రెండు చాచిన చేతులు ఒకటి ఆమె, రెండు నేను అనిపించి సంతోషంగా కలిగింది.అతనికి తెలుసు, కాసేపు అయితే ఆ దృశ్యం మారుతుందని.అందుకని అతను ఆఖరున చూసిన ఆ మేఘాలను తన లోపల అలానే నిలుపుకుని లోనికి వెళ్ళాడు.కాఫీ తాగి, స్నానించి, టిఫిన్ తిని ప్రతిరోజు వలే అతను తనదైన పనిభారపు భేతాళుడిని భుజానికి వేసుకొని వేటకు బయలుదేరాడు.ఆమె పిల్లలకు పాఠం చెబుతూ వుంటే వైబ్రేషన్ మోడ్లో వున్నా, ఫోన్ ఒక్కసారి కదలి ఆగిపోయింది. ఆమెకి తెలుసు క్షణకాలం, రెండు రింగ్స్కే ఆగిపోయిన ఆ కాల్ ఎవరిదో. ఆ రింగ్టోన్ మిగిలినవాటి కన్నా భిన్నంగా వుంటుంది. ఆమె ఏమీ తొందర పడలేదు. అతను మళ్ళీ తాను పలకరించే దాకా మౌనంగానే ఉండగలడని ఆమెకి తెలుసు.స్టాఫ్ రూమ్లోకి వచ్చి, ఫోన్ తీసి చూసింది.నీలాకాశంలో చేతులు చాచిన చేతుల్లా అగపడే రెండు తెల్లటి మేఘాలు. ‘‘ పొగ మేఘాలు కదూ, అవి తేలి విడిపోయి, ఎటో వెళ్లిపోయేలోగా ఇలా నీకు మేఘ సందేశం’’ఆమె ఒక హృదయపు గుర్తును అతనికి పంపింది. ‘‘నువ్వు ఎందుకు గుర్తుకొస్తావో ఇలా నాకు? ఇప్పుడీ సిస్టం ముందు కూర్చుని నాకు ఎన్నడూ ఏ మాత్రం ఆసక్తి లేని పనులు చేస్తూ... ఇదంతా బతకడం కోసం కదూ?’’‘‘తప్పదు బతకాలి కాదా’’ అందామె క్లుప్తంగా.‘‘అవుననుకో, నీకూ తెలుసు కదా! ఇదంతా ఎంత నరకంగా వుంటుందో?నాకు పారిపోవాలని అనిపిస్తుంది’’‘‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా! ఏడు సముద్రాలూ ఈది, ఏడు పర్వతాలూ దాటి? నిన్ను నువ్వు కట్టేసుకున్న రాటను ఊడ బెరుక్కొని... ఎటుపోతావ్? ఎచటికి పోతావ్ ఈ రాత్రి’’ అందామె చిన్ని నవ్వుతో.‘‘అవును. వెళ్ళాలి అని వున్నా వెళ్ళలేను’’‘‘సరే, పని చేసుకోవాలి నువ్వూ నేనూ. కూలి ముట్టాలి అంటే పని చేయలి కదా!’’‘‘సరే’’ఆమె దిద్దాల్సిన పిల్లల పరీక్ష పేపర్లు ముందేసుకు కూర్చుంది. ఏమి తెలుసు అతని గురించి ఆమెకి?ఆమె గురించి అతనికి ఏమి తెలుసు?అట్లా తెలుసుకోవాలని ఇద్దరికీ ఎందుకనిపించలేదో తెలీదు?తాము ఒకరికొకరు ఏనాటి నుండో, తెలిసినట్లు ఎందుకు అనిపించిందో కూడా వాళ్ళకి తెలీదు. లేదా తమ గత కాలాలు ఏవో, అన్నీ రద్దయిపోయి, జీవితం ఆ క్షణం నుండే మొదలైనట్లుగా వుంది. అతను ఒక సంగీత కచేరీలో పరిచయం అయ్యాడు.సంగీతం మన లోలోపల, మనకే తెలియని భావోద్వేగాలను తట్టిలేపుతుంది.సమూహానికి కాస్త ఎడంగా ఒక్కతీ కూర్చుని వింటోంది. ‘‘ఆజా బాలమ్ పరదేశీ’’ అంటూ పాడుతూవుంది కౌశికీ చక్రబర్తి, భైరవిలో. రాగానికి అనుగుణంగా గాలిలో కదులుతున్న ఆమె సన్నటి పొడవాటి చేతివేళ్ళ విన్యాసాన్ని చూస్తోంది ఆమె. అందంగా, సుకుమారంగా వున్న ఆమె, మరేదో లోకంలో ఉన్నట్లు, తన చుట్టూ ఏమి జరుగుతోందో, ఎవరున్నారో, లేరో తనకేం ప్రమేయం లేనట్లు ఎంత తాదాత్మ్యతతో పాడుతున్నదో. ఆమె స్వరం ఎంత మధురంగా ఉందంటే, ఆ పాట విన్న ఆ పరదేశీ ఎవడో, ఆమె చెంత అలా వశీకరణ చెందినవాడుగా కూర్చుండి పోడూ అనుకుందామె.పాడుతున్న ఆ గాయనిని, అరమోడ్పు కళ్ళతో, తలూపుతూ వింటున్న ఆమెనీ చాలసేపటి నుండి మార్చి, మార్చి చూస్తూ వున్న అతను ‘‘మీరు కూడా పాడతారా?’’ అన్నాడు. ఆ అపరిచిత వ్యక్తి కేసి చూసి, తల అడ్డంగా ఊపి ‘‘ఇష్టం. వినడం’’ అంది.అడక్కుండానే ‘‘నాక్కూడా! కర్ణాటక సంగీతంలో కొంచెం ప్రవేశం వుంది’’ అన్నాడు.కొన్ని మాటలు కలిసి, ఇష్టాలు కలిసి కాఫీని ఆస్వాదించి, సంగీతం గురించి అతనికి తెలిసిన సంగతులు చెబుతుంటే, ఆసక్తిగా విని, అట్లా మొదలైంది వాళ్ళ పరిచయం.ఆమె పని చేసే కాలేజీకి దగ్గరలోనే అతని ఆఫీసు. ఏదో కమర్షియల్ బ్యాంకులో ఉద్యోగి. మద్రాసు నుండి డిప్యుటేషన్ మీద వచ్చాడు ఏడాది కాలానికి.ఇద్దరికీ కుదిరినప్పుడు సాయంత్రాలు కలిసి కాస్త దూరం నడిచి, ఏ కాఫీనో తాగి, ఆమెతో పాటూ ఆటో ఎక్కి, మరి కాసేపటిలో శ్రీనగర్ కాలనీలో ఆమె ఇల్లు వస్తుందనగా, కాస్త దూరంలోనే దిగి పోయేవాడు. అతనికి తెలుసు ఆమె ఎక్కడ వుంటుందో. ఆమె అతడిని ఇంటికి రమ్మని ఎన్నడూ పిలవలేదు. వెళ్ళాలని అతనూ అనుకోలేదు.యూసఫ్గూడలో వున్న నిసిట్ (ఎన్ఐఎస్ఈటీ) క్యాంపస్ గెస్ట్హౌస్లో వుండేవాడు. ఎప్పుడన్నా వీలు దొరికినప్పుడు ఆమె అతని దగ్గరకు వచ్చేది.అతని గదిలోనో, ఆరుబైట చెట్ల కిందో కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళ మాటల్లో అనేక విషయాలు దొర్లినా, వ్యక్తిగతమైన సంగతులు వచ్చేవి కావు. బహుశా అలాంటి సంభాషణ మొదలవుతే అది ఎక్కడికి దారి తీస్తుంది? మనుషులు ఒంటరి జీవులు కాదనీ, అనేకానేక సంబంధాల మధ్య వాళ్ళు జీవిస్తారని వాళ్ళకు తెలుసు.జీవితంలోని ఆ పొరలను విప్పినప్పుడు ఊపిరాడక, తమ ఇద్దరికీ ఎంతో శాంతిని, నిశ్చింతను ఇస్తున్న ఇప్పటి ఈ బంధం, ఏ మురికి కాలువలోకో ప్రవహించి, అసహ్యాన్నో, అవమానాన్నో మిగిల్చి చివరకు అంతం అవుతుందన్న భయం కూడా వాళ్ళను మాట్లాడనివ్వలేదు.వాళ్ళ ఇద్దరి మధ్య కలిగిన అద్భుతము, అపురూపము అని వాళ్ళు అనుకునే ఈ పేరు లేని ప్రేమయో, బంధమో అనుకునే ఆ భావన, గాలి బుడగవలే టప్పుమని పగిలి పోతుందేమో అన్న భయం వాళ్ళకి లోలోపల వుండి వుండాలి. కొన్ని నెలల తరువాత, ఇదంతా ఎక్కడి దాకా పోతుందో అనిపించి, ఆమె అన్నది ‘‘మనం మాట్లాడుకోవాలి’’‘‘మాట్లాడి? నీ స్థితిని నువ్వూ, నా స్థితిని నేనూ మార్చగలమనే అనుకుంటున్నావా?’’ అన్నాడు అతను ఒకసారి. తాము ఇద్దరం ఎప్పటికీ ఇట్లానే వుండగలమన్న ఈ భ్రమని నమ్మినంత కాలం, ఇలా సాగినంత కాలం ఇట్లా సాగనివ్వాలనే వాళ్లకు వుంది.అతను అన్నాడు ఒకసారి ఆమె చేతి వేళ్ళతో ఆడుకుంటూ ‘‘ఆనందం అనిపించిన ప్రతిదాన్నీ మనం శాశ్వతంగా స్వంతం చేసుకోవాలి అనుకుంటాం. అది అప్పటికి కలిగించిన సంతోషం.అట్లా అది మనకి అప్పుడు మనం వున్న స్థితి, కాలం వల్ల కలిగిన ఆనందమో, హాయో! ఈ మనిషి కావాలి శాశ్వతంగా నాకు, అని ఎంతో ఇష్టపడి, ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళలోనూ, వాళ్ళతోనే, ఆ బంధంలోనే వున్నా, ఆ ఇద్దరు మనుషులలో చాలా సందర్భాలలో చెప్పరానంత డిసపాయింట్మెంట్ వుంటుంది ఎందుకో’’‘‘అవును. అది వాళ్ళు గుర్తించినా, అప్పటికే వాళ్ళ చుట్టూ అనేక కొత్త బంధాలు బిగుసుకుపోతాయి. ముఖ్యంగా పిల్లలు. అప్పుడు అది దాటడం కష్టం’’ అందామెఅతను మౌనంగా విన్నాడు.‘‘ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. ఇట్లా మరొక మనిషి నా హృదయానికి ఇంత దగ్గరగా వస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు.’’‘‘ఆడమనిషి’’ అని సవరించి నవ్వింది.‘‘ఉహు, నాకు మనిషే. ఇద్దరు మనుషులు.అంతే’’ అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దుపెడుతూ.అతని వొడిలో పడుకున్న ఆమె లేచి కూర్చుని ‘‘ఏం? ఎందుకింత ఇష్టం? ఎందుకింత మోహం నీకూ, నాకూ మధ్య? మనం ఒక ఆడ, మగ మనుషులం. మన ఇద్దరికీ మనసులే కాదు, శరీరాలు కూడా వున్నాయి మరిచిపోకు’’ అంది ఆమె.‘‘అవును ఈ శరీరాలు కూడా ఒకరికి ఒకరు కావాలని కోరుకుంటాయి’’ అని, ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఆమె దూరంగా జరిగింది అతనికి. ‘‘ఈ దాగుడుమూతలు ఎందుకు నీకూ నాకూ మధ్య’’ అన్నాడు.‘‘భయం. నిజంగా భయం నాకు. నా మనసును, దేహాన్నంతా నీకు ఇచ్చేసి, నాకు నేను కాకుండా పోతానని భయం. నా ఉద్వేగాలను నా లోపలే దాచుకోలేనితనపు భయం. హు, ఇంకా, లోకభయం, నా కుటుంబ భయం, ఈ దాటలేని అగడ్తల మధ్య పడి, మనుషుల తీర్పుల మధ్య పడి నలిగి నువ్వూ, నేనూ చచ్చిపోతామేమోననే భయం’’ఆ తరువాత అతన్ని ఆనుకొని, అతని చేయి గట్టిగా పట్టుకుని, ఆమె ఒక్క మాటన్న మాటలాడకుండా అతనికేసి నీళ్ళు నిండిన కళ్ళతో చూసింది.కాస్సేపటికి ‘‘నువ్వు చెప్పాలి అనుకుంటున్నదంతా చెప్పేయి ఇవ్వాళ’’ అన్నాడు అతను. ‘‘నాకే తెలీదు. ఈ ద్వైదీభావం ఏమిటో. నువ్వు కావాలి, వద్దు కూడా, నువ్వు పూర్తిగా కావాలి. అట్లా వద్దు కూడా. కొంచెం, నీ చేయి పట్టుకుని, నీ భుజం మీద తలవాల్చి, నువ్వు అట్లా నా కళ్ళ మీద ముద్దు పెట్టి ..’’అతను ఆమె తలను దగ్గరికి లాక్కొని కళ్ళ మీద ముద్దు పెట్టాడు.ఆ నీటి తడి అతడి పెదవులకు కొంచెం ఉప్పగా తాకింది.‘‘నీకు కష్టం కలిగించే, నీకు ఇష్టంలేని పని ఏమీ జరగదు మన మధ్య’’ అన్నాడు. ‘‘నేను ఇది చెప్పడం మన మధ్య ఏర్పడిన ఈ బంధపు తప్పు, ఒప్పుల గురించి, నీతో మాట్లాడటానికి కాదు, నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. బయట హాస్టల్లో వుంటారు. మా అమ్మ, నాన్న, ఒక మానసిక వైకల్యం వున్న చెల్లి ఇంట్లో’’‘‘అతను? అదే మీ ఆయన’’‘‘వున్నాడు, కానీ వుండీ లేనట్లే’’‘‘అంటే’’‘‘చాలా ఆస్తులు తగలేశాక, ఎన్నో గొడవలయ్యాక, ఆ మిగిలినవి ఏవో మా అత్తింటి వాళ్ళు పిల్లల పేర్లపై పెట్టాక, మమ్మల్ని గాలికి వదిలేసి, అతను ఎక్కడెక్కడో తిరిగి, ఆ మిగిలిన ఆస్తి కోసం నన్నూ, అతని తల్లిదండ్రులను కూడా చాలా వేధించడం మొదలు పెట్టాక, వాళ్ళు కూతురు దగ్గరికి అమెరికాకి వెళ్ళిపోయారు. నేను మా అమ్మా వాళ్ళ దగ్గరికి వచ్చేశాను.’’‘‘మరి అతను’’‘‘నేను విడాకులు అడిగాను. ఆడపిల్లలు కదా. తండ్రి లేకపోతే కష్టం అట. పెద్దవాళ్ళు వద్దన్నారు. పిల్లలు అనే పేరుతో వస్తాడు. వుంటాడు. కొన్నాళ్ళు. చాలా కోపం, అసహ్యం నాకు. నన్ను ముట్టుకునే సాహసం చేయడు. అతను నా మేనబావే. ఆస్తులు, బంధుత్వాలు అంటూ నాకు ఇష్టం లేకుండానే చేసిన పెళ్లి ఇది’’‘‘చాలా కష్టం కలిగింది కదూ!’’ అతను ఆమె తలనిమురుతూ అన్నాడు.ఆమెకి నిజంగా చాలా దుఃఖం కలిగినా అతనికేసి చూసి, ‘‘అందుకే మరింత దుఃఖాన్ని మోయలేనని అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ, నాన్న, మానసికంగా ఎదగని చెల్లి, ఆ, ఇంకా నా పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇదంతా దాటి నీ కోసం వచ్చేయాలి అనుకున్నా, నిజంగా చేయగలనా? ఇక దుఃఖం వద్దు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఒక కొత్త దుఃఖాన్ని తెచ్చేలా ఉన్నావు’’ అని నవ్వింది.‘‘నువ్వు నమ్మవేం? అట్లా చేయను. అంటే, నీకు దుఃఖం కలిగంచే పని. అలా అయితే వెళ్ళనా’’ అతడు ఆమె చేయి విడిపించుకుని లేచి నిలబడ్డాడు.ఆమె నవ్వి, అతని చేయి పట్టి లాగి కూర్చోబెట్టి ‘‘మరి నీ సంగతి ‘‘ అని అతని మొఖంకేసి చూసి, కళ్ళు తమాషాగా ఎగరేసింది.‘‘నీ అంత దుఃఖభాజిత కుటుంబ కథాచిత్రం కాదులే నాది. కొంచం ప్రేమించే చేసుకున్నాం. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం.’’‘‘కొంచం ప్రేమించుకోవడం ఏమిటి?’’‘‘మరి? అప్పుడు చాలా ఎక్కువనుకున్నాంలే. తరువాత పెళ్లి చేసుకుని కలిసి జీవించడం మొదలుపెట్టాక అది కొంచెమే అని తెలిసిందిలే’’ అని నవ్వాడు.‘‘ఊ, చెప్పు?’’‘‘బహుశా, ఈ దేశంలో పిల్లలని పుట్టించడం అంత సులువైన విషయం మరోటి లేదనుకుంటా’’‘‘అర్థం అయింది. నేను చేసిందీ అదేగా’’‘‘కలిసి ఉండటానికి ప్రయత్నం చేశాం. నా కొడుక్కి అప్పుడు ఐదేళ్ళు. తనకి ఈ ఇల్లూ, సంసారం ఇదంతా ఊపిరాడనితనంగా అనిపించడం మొదలైంది. తను ఓవర్ యాంబిషస్ అనుకున్నాను నేనప్పుడు. తను ఇంకా పైకి ఎదగాలి, ఏ ఆక్స్ఫర్డ్లోనో పైచదువులు చదవాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో వుండాలి అనుకుంది. ఇదంతా ఎందుకు వున్నదాంట్లోనే వుండచ్చు కదా అనిపించేది నాకు’’‘‘అట్లా నువ్వు అనుకోవడం ఆమెపై నీకు చాలా ప్రేమ ఉండటం వల్లా, లేక నువ్వు, నేను, నా కుటుంబం కోసమే ఆమె అనుకునే నీ స్వార్థం వల్లా’’‘‘పెళ్ళంటే బాధ్యత కదా?’’ అని ఒక్క క్షణమాగి, ‘‘స్వార్థం కూడానేమో! కొంచెం చాలా ఎక్కువ. ఇంకొంచెం ప్రయాస లేకుండానే దొరికేసే దేహసుఖం, ఇంకా నిలకడ, నిశ్చింతతో పాటూ, ఆడ, మగ ఆ ఇద్దరు మనుషుల, కట్టడి చేసే లోకం స్వార్థం కూడా ఉంటుందేమో, మనం గుర్తించం కానీ’’‘‘నిజమే’’ అంది ఆమె ‘‘మేము అప్పుడు దిల్లీలో వుండేవాళ్ళం. మా అమ్మకి తెలిసింది మా ఘర్షణ. బహుశా తను మా అబ్బాయి ‘అనిరు«ద్ కీ మా’ అని చిన్నగా నవ్వి, ‘‘నా భార్య చెప్పినట్టు వుంది. అమ్మే అనింది పట్టి ఉంచేవి బంధాలు ఎలా అవుతాయి, బందిఖానాలు అవుతాయి కానీ అని. మేము విడిపోయాం.’’‘‘మరి బాబు?’’‘‘తనకి బాబు పట్ల ప్రేమ చాలానే వున్నా, మేం మాట్లాడుకున్నాం, ఒక నిర్ణయానికి వచ్చాక స్నేహితుల్లా వుందాం అనుకున్నాం. బాబు బాధ్యత నేను తీసుకున్నాను. తను యూకే వెళ్ళింది. తను అనుకున్నట్లుగానే చదువుకుంది. మంచి పొజిషన్లో వుంది. అక్కడే స్థిరపడింది. వీలైనప్పుడు తల్లీ, కొడుకు కలుసుకుంటారు.’’‘‘మరి..’’ఆమెకి నోటిదాకా వచ్చి, అది అంత సంస్కారం కాదేమోనని ఆగిపోయింది.‘‘ఉన్నారు. ఆ తరువాత ఒకరిద్దరు స్త్రీలు నా జీవితంలో. ఏ రిలేషన్ పెళ్లి దాక వెళ్ళలేదు. దానికన్నా ముందుగానే వాళ్ళ నిందారోపణలు, పొసెసెసివ్నెస్లు, నా అపరాధ భావనల బరువులు, ఏమి చేయాలో తోచక, అంత ఎమోషనల్ బరువు మోయలేక పారిపోవడాలు... ఇంకో రిలేషనో, పెళ్ళో ఇక వద్దనుకునేలా చేశాయి నన్ను’’ అన్నాడు.ఆమెకేసి అట్లా దిగులుగా చూశాడు.‘‘ఇదిగో నువ్వు ఇట్లా వచ్చావు. ఎందుకు ఇలా వచ్చావో, వున్నావో, వుంటావో లేదో తెలియకుండా’’ అన్నాడు. ఆమె అతన్ని క్షణకాలం తదేకంగా చూసి, ‘‘ఇంతటి నిశ్చింతను, శాంతిని, నేను ఎన్నడూ ఎరుగను. ఇదంతా ఎక్కడి దాకా వెడుతుందో, ఎక్కడ ఆగిపోతుందో కూడా నాకూ తెలీదు. ఈ లోకంలో పరమ కుతూహలమైన సంగతి ఏదైనా వుందీ అంటే, ఇద్దరు మనుషులు, ఉహూ ఇద్దరు ఆడా, మగా మధ్య వున్న సంబంధం ఏవిటో తెలుసుకోవడమే అనుకుంటాను. నువ్వు నాకు కావాలి. కానీ..’’ఆమె తన మాట పూర్తి చేయకుండానే ‘‘కానీ వద్దు కూడా’’ అన్నాడు నవ్వి.అతని రెండు చేతులను తన దగ్గరికి లాక్కుని ఆ చేతులలో తన మొఖాన్ని దాచుకుని, అరచేతుల్ని ముద్దుపెట్టుకుని, ఆమె మెల్లిగా లేచి తన చేతి సంచీ తీసుకుని, వెనక్కి తిరిగి, కంటి నుండి రాలిన కన్నీటి చుక్కను తుడుచుకోకుండానే నడిచి వెళ్లి పోయింది. ఆమె మళ్ళీ రేపు కూడా, నిన్నటి మల్లెమొగ్గ, రేపు ఉదయం విరిసి పూవు అవ్వగానే, తనకు ఆ బొమ్మ పంపుతే బావుండును. ఉహు, రెండు విరిసిన మల్లెపూలు అనుకుంటూ వుంటే, ఎందుకో తనలోంచి తానంతా ఖాళీ అయిపోయినట్లు అనిపించింది అతనికి. -
బొద్దింక పాలు: మీరు ఎప్పుడూ చూడని సూపర్ఫుడ్!
ఒక పూట పాలు లేకపోతే, ఆ రోజు ఎంత కష్టంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉదయాన్నే టీ, కాఫీలు పెట్టుకోవడం దగ్గర నుంచి, రాత్రిపూట మజ్జిగ తాగే వరకు ఇంట్లో ఏదోరకంగా పాల అవసరం కనిపిస్తూనే ఉంటుంది. పెరుగు, వెన్న, నెయ్యి ఇలా ప్రతి పాల ఉత్పత్తితోనూ రోజువారీ అవసరాలు, అలవాట్లు ముడిపడే ఉంటాయి. అందుకే, కుదిరితే పాడినయినా పెంచుకుంటాం, లేదా పాలకేంద్రంలో ఖాతానైనా పెట్టుకుంటాం. ఏదేమైనా రోజుకు లీటరో అరలీటరో పాలు స్టవ్ మీద కాగాల్సిందే! ప్రతి ఇంట్లోనూ పాలకున్న డిమాండ్ అలాంటిది.నిజానికి పాలు ఒక సంపూర్ణ ఆహారం. పాలు మన శరీరానికి కావలసిన కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా పోషకాలనే అందిస్తాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. అలాగే కండరాలు, కణజాలాల నిర్మాణానికి ప్రొటీన్ ఎంతగానో సహాయపడుతుంది. పాలలో విటమిన్–డి, విటమిన్–బి12తో పాటు పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. పాలు తాగటంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాలు ఎముకలను బలపరుస్తాయి, కండరాలను అభివృద్ధి చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని వయసుల వారికి పాలు ఒక ముఖ్యమైన పోషకం. పిల్లలు ఎదగడానికి, పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి పాలు చాలా అవసరమని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.మనిషి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి పాడిని పెంచి, పాలను వినియోగించుకోవడం మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. అంటే దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నుంచే, పశువుల పాలతో ప్రయోజనాలను అందుకుంటున్నాం.ఏ జంతువుల పాలు.. ఏమేమి ఫలితాలు?పాలల్లో ఆవు పాలు శ్రేష్ఠమైనవి. ఇక గేదె పాలు, మేక పాలు, ఒంటె పాలు కూడా అనేక సంస్కృతులలో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ప్రత్యేక రుచి, పోషక విలువలు, ప్రత్యేక లక్షణాల కారణంగా వాటి పాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.బొద్దింక పాలుకీటకమైన ఈ బొద్దింకల నుంచి పాలను తియ్యడం చాలా అసాధారణమైన పని. పసిఫిక్ బీటిల్ బొద్దింకలు ‘బొద్దింక పాలు’ అని పిలవబడే ఒక పోషకసమృద్ధ స్ఫటికాకార పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి బొద్దింకల గర్భధారణ సమయంలో వాటి పిల్లలకు పోషణను అందించడానికి ఉపయోగపడతాయి. ఇవి అధిక ప్రొటీన్ కంటెంట్ను కలిగి ఉంటాయి. వీటిని మనుషులు వినియోగించుకోవడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వాణిజ్యపరంగా బొద్దింకల పాలను ఉత్పత్తి చేయడం లేదు. దీనిని ఒక ‘సూపర్ ఫుడ్’గా మార్కెట్ చేసే ప్రయత్నాలను కొన్ని పరిశోధనా సంస్థలు సాగిస్తున్నాయి. కానీ ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక, ఆర్థిక, సామాజిక అడ్డంకులు చాలా ఉన్నాయి.ఆవు పాలుఇవి ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పాలు. ఇవి కాల్షియం, ప్రొటీన్, విటమిన్–డిలతో నిండి ఉంటాయి. ఈ పాలను నేరుగా తాగడానికి, పెరుగు, వెన్న, చీజ్ వంటి ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.గొర్రె పాలు ఇవి చాలా పోషకమైనవి, వీటిలో కొవ్వు, ప్రొటీన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. గొర్రె పాలను ఎక్కువగా చీజ్ తయారీకి వినియోగిస్తారు. ముఖ్యంగా ఫెటా, రోక్ఫోర్ట్ వంటి చీజ్లు వీటితోనే తయారు చేస్తారు.గేదె పాలుఆవు పాల కంటే ఈ పాలల్లో కొవ్వు, మినరల్స్, ప్రొటీన్లు కొంత ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్, ఇటలీ వంటి దేశాలలో ఎక్కువగా దొరుకుతాయి. పెరుగు, మొజారెల్లా చీజ్, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఈ పాలనే వినియోగిస్తారు. గేదె పాలు చాలా క్రీమీగా ఉంటాయి. ఇందులో లాక్టోస్ కూడా ఎక్కువ.గాడిద పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి, కానీ వాటి పోషక విలువలు చర్మ సంరక్షణకు, ఉబ్బసం నయం చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అందుకే వీటిని చర్మ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. శిశువులకిచ్చే ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా కూడా సూచిస్తారు.మేక పాలు ఆవు పాల కంటే తేలికగా జీర్ణమవుతాయి. కొంత భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, విటమిన్–ఎ అధికంగా ఉంటాయి. మేక పాల నుంచి చీజ్, పెరుగులతో పాటు సబ్బులు కూడా తయారు చేస్తారు. ఈ మేక పాలు ప్రపంచ పాల ఉత్పత్తిలో సుమారు 2% వాటాను కలిగి ఉన్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో గత 20 సంవత్సరాలలో దీని ఉత్పత్తి దాదాపు 60% పెరిగింది. మేకపాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవయవాల పనితీరుకు సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.ఒంటె పాలుపశ్చిమాసియా, ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాలలో ఒంటె పాలు శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన ఆహారం. ఈ పాలలో విటమిన్–సి, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒంటె పాలు తేలికగా జీర్ణమవుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు ఈ పాలు మంచి ఔషధం. ఈ పాలు కొన్ని వైద్యపరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ పాలను ఐస్క్రీమ్, చీజ్ వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.గుర్రపు పాలుఖజక్స్తాన్, మంగోలియా, తూర్పు ఐరోపాలో గుర్రపు పాలను కూమిస్, అయిరాగ్ వంటి సంప్రదాయకంగా పులియబెట్టే పానీయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పానీయాలు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. గుర్రపు పాలు తల్లి పాలను పోలి ఉంటాయి. అమైనో ఆమ్లాలు, కొవ్వు శాతం ఈ పాలలో ఎక్కువగా ఉండటంతో చీజ్ తయారీకి ఇవి చక్కగా పనికొస్తాయి.మూస్ పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని స్వీడన్, రష్యా, కెనడాలో వాణిజ్యపరంగా ఉపయోగిస్తాయి. మూస్ పాలను చీజ్, పెరుగు, ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్లలో మూస్ చీజ్ ఒకటి.రెయిన్ డీర్ పాలుసైబీరియా, ఉత్తర స్కాండినేవియా వంటి చల్లని ప్రాంతాలలో నివసించే ప్రజలు రెయిన్ డీర్ పాలను వినియోగిస్తారు. ఆవు పాల కంటే వీటిలో కొవ్వు, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా శక్తిమంతమైన ఆహారం.జిరాఫీ పాలు జిరాఫీ పాలు అసాధారణమైనవి. మానవ వినియోగానికి సాధారణంగా లభ్యం కావు. వీటి పాలలో కొవ్వు, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జిరాఫీ పిల్లల వేగవంతమైన పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అయితే, జిరాఫీల నుంచి పాలు తీయడం చాలా కష్టం. అది పెద్ద సవాలుతో కూడుకున్న పని.యాక్ పాలుహిమాలయ ప్రాంతంలో ఈ యాక్ పాలు చాలా ప్రత్యేకం. ఇవి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, టిబెటన్లు, ఇతర పర్వత నివాసుల ఆహారంలో ఈ పాలను తప్పనిసరి తీసుకుంటారు. ఈ పాలు చిక్కగా, ఎక్కువ కొవ్వులతో ఉండటంతో వెన్న, చీజ్ తయారీకి అనుకూలంగా ఉంటాయి.అపోహలు నిజాలుపాలు తాగితే బరువు పెరుగుతారు!ఇది నిజం కాదు. పాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు బరువును పెంచుతాయా లేదా అనేది మీరు తీసుకునే పాల రకం (ఫుల్ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్), తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. క్రీమ్ తొలగించిన పాలను తీసుకుంటే క్యాలరీ కంటెంట్ తగ్గుతుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.పాలను ఎక్కువగా కాగబెడితే పోషకాలు తగ్గుతాయి!ఇది పూర్తిగా తప్పు. పాలను కాగబెట్టడంతో అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది, పాలు తాగడానికి సురక్షితంగా మారతాయి. పదేపదే మరిగించడంతో పోషకాలకు ఎటువంటి హాని జరగదు.పాలు ఎముకల నుంచి కాల్షియంను బయటకు తీస్తాయి!ఈ అపోహకు శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి, పాలు కాల్షియంకు అద్భుతమైన వనరు. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.పాలు తాగితే కఫం ఉత్పత్తి అవుతుంది!ఈ వాదన పూర్తిగా సరైనది కాదు. దగ్గు సమయంలో స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడంతో కఫం పెరుగుతుందని కొందరు నమ్ముతారు, కానీ పాలు తాగడానికి, కఫం ఉత్పత్తికి ప్రత్యక్ష సంబంధం లేదు.పాలు మొటిమలు రావడానికి కారణమవుతాయి!పాల వినియోగం, మొటిమల మధ్య ప్రత్యక్ష సంబంధానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జన్యుశాస్త్రం, హార్మోన్లు, మనం తీసుకునే ఆహారం వంటి ఎన్నో అంశాలు చర్మ ఆరోగ్యంలో కీలకంగా మారతాయి.తల్లిపాలు పట్టిస్తున్నప్పుడు తల్లి అనారోగ్యంతో ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదు!అనారోగ్యంతో ఉన్న తల్లి, తన పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదు. తల్లికి అనారోగ్యంగా ఉంటే, ఆమె శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. అవి శిశువులకు రక్షణనిస్తాయి. తల్లి నుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది.ముర్రుపాలు బిడ్డకు పట్టించకూడదు!ప్రసవానంతరం లేత పసుపు రంగులో వచ్చే ముర్రుపాలు బిడ్డకు చాలా ముఖ్యమైనవి. అవి రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, పోషకాలను నిండి ఉంటాయి.పాలు లాభాలుపాలు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అవి పోషకాల మిశ్రమం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు కీలకమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. మన రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదపడతాయి. పాలలో ఉండే ప్రధాన పోషకాలు, అవి మన శరీరానికి చేసే మేలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.విటమిన్–ఎఇది కంటిచూపుకు ఎంతో అవసరం. కణాల పెరుగుదలను ప్రోత్సహించి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.విటమిన్–డిఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. శరీరం క్యాల్షియంను సమర్థంగా గ్రహించేలా చేస్తుంది. దాంతో ఎముకలకు పటుత్వం లభిస్తుంది.విటమిన్–బి3 (నియాసిన్) మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.విటమిన్–బి5 (పాంటోథెనిక్ ఆమ్లం)శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగేందుకు ఈ విటమిన్ తోడ్పడుతుంది.విటమిన్–బి12నాడీవ్యవస్థ పనితీరుకు, డీఎన్ఏ నిర్మాణానికి ఇది అత్యవసరం.విటమిన్–ఈఇవి పాలలో తక్కువ శాతం ఉంటాయి. అయితే పాలిచ్చే జంతువులను బట్టి, అవి తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వ్యత్యాసం ఉంటుంది. మనిషి పాలలో విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది.క్యాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, వాటి దారుఢ్యాన్ని కాపాడటానికి ఇది ప్రధాన పోషకం.ఫాస్ఫరస్క్యాల్షియంతో కలిసి ఎముకలు, దంతాల నిర్మాణానికి ఫాస్ఫరస్ దోహదపడుతుంది.అయోడిన్థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ కీలకమైనది, ఇది శరీర విధులను నియంత్రిస్తుంది.సెలీనియంఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, వాటికి రక్షణ కల్పిస్తుంది.జింక్రోగనిరోధక శక్తిని కాపాడటంలో జింక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గాయాలు త్వరగా మానేలా కూడా చేస్తుంది.ప్రొటీన్కండరాల పెరుగుదలకు ప్రొటీన్ అత్యవసరం. కణజాలం నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం కోలుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.కార్బోహైడ్రేట్స్పాలలోని లాక్టోస్ ఒక కీలకమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.కొవ్వులుకొవ్వులు శరీరానికి శక్తినిస్తాయి. అలాగే విటమిన్లు(ఎ, డి, ఈ వంటివి), శరీరంలో ఇముడ్చుకోవడానికి ఈ కొవ్వులు ఎంతగానో తోడ్పడతాయి.నిజానికి లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలు, పాల పదార్థాలను తీసుకోకూడదు. వాటికి బదులుగా, కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మొక్కల ఆధారిత పాలు (సోయా మిల్క్, బాదం మిల్క్) వంటివి తీసుకోవచ్చు. పాలు అలవాటు ఉన్నవారు, పాలు తాగడంతో ఎలాంటి సమస్య లేనివారు ఏదో ఒక రూపంలో, తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. -
కృషి ఉంటే కావ్య అవుతారు!
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైనా నెలనెలా బంగారు గుడ్డు పెట్టే బాతులానే చూస్తారు. పైగా కావ్యా ధొబాలే–దత్ఖిలే జీతం నెలకు 76 వేలు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక సయాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు తను! చిన్న వయసులోనే అంత పెద్ద ఆసుపత్రి, అంత పెద్ద జీతం అంటే మున్ముందు సర్వీసుతో పాటు పెరిగే జీతం లక్షల్లోనే కదా ఉంటుంది! అయితే కావ్య ఈ లెక్కలేమీ వేసుకోలేదు. ఆసుపత్రి ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యవసాయ క్షేత్రం వైపు మళ్లారు!కావ్య లక్ష్యం ఏమిటి? ఏం లేదు, మనుషుల ఆరోగ్యం కాపాడటం మాత్రమే. సయాన్ ఆసుపత్రిలో ఆ పనే కదా ఆమె చేస్తున్నారు! కానీ అంతకుమించి, అసలు మనుషులకు ఆసుపత్రి అవసరమే కలుగకుండా చేసే పనిని ఆమె ఎంచుకున్నారు. ఎలాగంటే – వర్మి కంపోస్ట్తో పండించే పంటల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలుసుకున్న కావ్య ఏకంగా వర్మి కంపోస్ట్ ఉత్పత్తినే ప్రారంభించారు! అంతేకాదు, రసాయన రహిత పంటల గురించి అవగాహన కల్పించటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 200 మంది ఔత్సాహిక వర్మి కంపోస్ట్ వ్యవస్థాపకులకు శిక్షణ ఇచ్చారు. అంటే – కావ్య తన లాంటి కావ్యల్ని వందలాదిగా తయారు చేశారు. కారణం లేదు.. ప్రేరణ ఉంది ఎవరైనా ఉద్యోగం మానటానికి, ఉద్యోగం మారటానికి ఒక కారణం ఉంటుంది. కానీ కావ్య ఉద్యోగం వదలి వ్యవసాయంలోకి రావటం వెనుక ఒక ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ వెనుక.. ఇతరులకు సహాయం చేయాలని చిన్నప్పట్నుంచీ ఆమెతో పాటు ఎదుగుతూ వస్తున్న తపన ఉంది. ఆ తపనే ఆమెను మొదట నర్సింగ్ కోర్సు వైపు మళ్లించింది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీలో డిప్లొమా చేశాక, ముంబైలోని ‘లోకమాన్య తిలక్ మునిసిపల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్’లో (ఇదే సయాన్ హాస్పిటల్) నర్సుగా చేరారు కావ్య. తర్వాత టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండేళ్లు పని చేశారు. 2017లో నర్సింగ్లో బీఎస్సీ పూర్తి చేశాక ఏడాది పాటు ఒక ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ పాఠాలు చెప్పారు. ఆ తర్వాత తిరిగి సయాన్ ఆసుపత్రిలో ఉద్యోగిగా చేరి స్టాఫ్ నర్స్ అయ్యారు. అలా చేరటమే ఆమె కెరీర్ను వ్యవసాయం వైపు మలుపు తిప్పింది. అన్ని మరణాలను చూశాక..!2019 నుంచి 2022 వరకు సయాన్ లో నర్సుగా ఉన్నారు కావ్య. అది కరోనా వ్యాపించిన పాడు కాలం. నర్సుగా ఆమె కొన్ని నెలల పాటు అనేక మంది తన కళ్ల ముందే కరోనాతో మరణించటాన్ని దగ్గరగా చూశారు. దాంతో ఆమె జీవిత దృక్పథమే మారిపోయింది. ‘‘నేను కూడా అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడ్డాను. దాదాపుగా మరణశయ్యపై ఉన్నాను. కానీ నా రోగ నిరోధక శక్తి నన్ను రక్షించింది. మనం పండిస్తున్న, మనం తింటున్న రసాయనాలతో కూడిన ఆహారం వల్ల మన శరీరాలు బలహీనమౌతున్నాయని నాకు అర్థమైంది. అప్పుడే నేనొక నిర్ణయానికి వచ్చాను. రసాయనాల జాడలు లేని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను’’ అంటారు కావ్య. ఉద్యోగం వదలి వర్మి కంపోస్ట్లోకిఅయితే అందుకోసం ఉద్యోగం మానేయాలన్న కావ్య నిర్ణయాన్ని ఆసుపత్రిలో, ఇంట్లో, బంధువుల్లో ఎవరూ హర్షించలేదు. ఆమె భర్త రాజేశ్ దత్ఖిలే ఒక్కరే ఆమె వైపు నిలబడ్డారు. అలా 2022లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై నుంచి భర్త స్వగ్రామమైన పుణె దగ్గరి జున్నార్కు మారిపోయారు కావ్య. అక్కడే ఆమె వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేయటం మొదలు పెట్టారు. దాని కన్నా ముందు వర్మి కంపోస్ట్ను ఎలా తయారు చేయాలో కొన్ని నెలల పాటు వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకున్నారు. అలా ఆసుపత్రి బెడ్ల మధ్య నుంచి వర్మి కంపోస్ట్ ‘బెడ్’ల మధ్యకు వచ్చారామె.కిలో వానపాములే పెట్టుబడి‘‘నా ప్రారంభ పెట్టుబడి సున్నా. 2022 ఆగస్టులో ఒక రైతు నుంచి కిలో వాన పాములను తీసుకుని చిన్న ‘బెడ్’తో (ఎత్తు మడి) పనిలోకి దిగాను. ఆవు పేడలో వాన పాములను జోడించాను. వాటికి ఆహారంగా ఇతర పశువుల పేడ, రాలిన చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, ఇతర సేంద్రియ పదార్థాలను ఉపయోగించాను. 2022 అక్టోబర్ నాటికి తొలి విడత వర్మి కంపోస్ట్ సిద్ధమైపోయింది’’ అని ఎంతో ఎగ్జయింట్గా చెబుతారు కావ్య. తర్వాత ‘బెడ్’ల సంఖ్య పెరిగింది, వర్మి కంపోస్ట్ ఉత్పత్తీ పెరిగింది. చివరికి అదొక వ్యాపారంగానూ మారింది.ఈ ఆర్థిక సంవత్సరానికి కావ్య టర్నోవర్ ఎంతో తెలుసా? 24 లక్షల రూపాయలు! టర్కీ, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు ‘కృషి కావ్య బ్రాండ్’ పేరుతో కావ్య వర్మి కంపోస్ట్ ఎగుమతి అవుతోంది. కావ్య దగ్గర శిక్షణ తీసుకున్న రెండు వందల మందీ మహారాష్ట్ర వ్యాప్తంగా వర్మి కంపోస్ట్ను తయారు చేస్తూ ఆరోగ్యవంతమైన ప్రకృతి వ్యవసాయానికి తోడ్పతున్నారు. తామూ ఉపాధి పొందుతున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
రంగులు మార్చుకునే ఎడారి..!
సోసుస్వ్లీ– ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది నమీబియా ఎడారిలో ఉన్న మైదానం. దాని చుట్టూ ఎత్తయిన ఎర్రని ఇసుక, బంకమట్టితో కూడిన మట్టితిన్నెలు ఇట్టే ఆకట్టుకుంటాయి. వేళను బట్టి, కాలాన్ని బట్టి ఇవి అద్భుతమైన రంగులను సంతరించుకుంటాయి. రంగురంగుల మట్టితిన్నెలతో కూడిన ఈ ప్రాంతం ఫొటోగ్రాఫర్స్ మెచ్చే ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ డ్యూన్–45 అనే మట్టితిన్నె ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సందర్శకులు దీని పైకెక్కి చుట్టుపక్కల విశాలమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన చోటు ఏంటంటే డెడ్వ్లీ అనే ప్రదేశం. ఇక్కడ వందల సంవత్సరాల నాటి చనిపోయిన కేమెల్ థోర్న్ చెట్లు తెల్లటి బంకమట్టి నేలపై నిటారుగా నిలబడి ఉంటాయి. అవి ఒక అద్భుతమైన దృశ్యాన్నిస్తాయి. (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?
నాకిప్పుడు తొమ్మిదోనెల. ఈ మధ్యన ఇంటర్నెట్లో బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించడం గురించి చదివాను. అది ఎలా ఉపయోగపడుతుంది? – వెన్నెల, కర్నూలు. బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించడం అనేది ఇప్పుడు అన్ని ఆసుపత్రులూ రొటీన్గా ఫాలో అవుతున్నాయి. బొడ్డుతాడు బేబీని, తల్లి ప్లాసెంటాకు జాయిన్ చేస్తుంది. ఈ తాడును డెలివరీ తరువాత కట్ చేస్తాం. ఈ పద్ధతిలో కనీసం ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు ఆగి ఆలస్యంగా కట్ చేస్తే బేబీకి ఉపయోగాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఇందులో అధిక రక్తప్రసరణ జరిగి, బేబీకి మంచి జరుగుతుంది. అందుకే, దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్ చేస్తోంది. అకస్మాత్తుగా బొడ్డుతాడును కత్తిరించినప్పుడు బేబీ బ్లడ్ ప్రెజర్ సడన్గా డ్రాప్ అవుతుంది. ఈ బొడ్డుతాడుతో బేబీకి బ్లడ్ ఐరన్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. మెదడు ఎదుగుదలకు కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ ప్రాసెస్ నార్మల్ డెలివరీ అయిన కేసెస్లో ఫాలో కావాలి. బేబీ పుట్టిన వెంటనే డ్రై చేసి, పొత్తిళ్లలో చుట్టి, పిల్లల డాక్టర్ అసెస్మెంట్ చేస్తారు. బేబీ ఏడుపు బాగుంటే, కనీసం ఒక నిమిషం ఆగి, బొడ్డుతాడును కత్తిరిస్తారు. ప్రీ ట్రర్మ్, సిక్ బేబీస్కి ఇలా ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరించడం ఇంకా మంచిది. అయితే, మరీ, ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరించడం కారణంగా, కొంతమంది బేబీస్కి ఎక్కువ రక్తం వెళ్తుంది. చాలా అరుదుగా జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కంట్రోల్ చెయ్యటానికి బేబీస్కి ఫొటోథెరపీ అవసరం. కానీ, కొంతమందికి కాన్పు కష్టంగా జరిగినప్పుడు, ఆలస్యం చేయకుండా వెంటనే బొడ్డుతాడును కత్తిరిస్తారు. కానీ, తల్లి ఆరోగ్యం నిలకడగా ఉంటే, బేబీ బొడ్డుతాడుని తప్పకుండా ఒక నిమిషం ఆగి, ఆ తర్వాతే కత్తిరిస్తారు. నాకు బిడ్డపుట్టి నెలవుతుంది. డెలివరీ అయినప్పటీ నుంచి నాకు పాలు తక్కువగానే వస్తున్నాయి. పాలు బాగా రావటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, తిరుపతి. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు చాలా ముఖ్యం. బేబీ కనీసం పదిహేను నుంచి నలభై నిమిషాల పాటు రొమ్ములను కంటిన్యూయస్గా సకింగ్ చెయ్యాలి. అప్పుడు ఆ స్టిమ్యులేషన్కి పాలు కూడా బాగా ఉత్పత్తి అవుతాయి. కొంతమంది బేబీ బాగా నిద్ర పోయినప్పుడు పాలు ఇవ్వకుండా ఉంటారు. అలా చేయకూడదు. బేబీ నిద్రపోయినా సరే, మీరు బేబీని రొమ్ముకి పెట్టుకొని నిద్రలేపటానికి ప్రయత్నించాలి. కనీసం రోజులో ఎనిమిదిసార్లు పాలు తాగేటట్టు చేయాలి. కొంత సమయం, ఓపిక, సపోర్ట్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ఫీడ్ చెయ్యలేకపోవటం అనేది ఉండదు. కొంతమంది బేబీస్ అసలు పాలు తాగడానికి కూడా ప్రయత్నం చెయ్యరు. అప్పుడు మీరు హ్యాండ్ ఎక్స్ప్రెస్ చేసి, ఉగ్గు గిన్నెలో నుంచి పట్టడానికి లేదా బ్రెస్ట్ బిల్క్ బాటిల్ నిపుల్ ద్వారా ఇవ్వటానికి ప్రయత్నించండి. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అలవాటు కావటానికి ఎప్పుడూ స్కిన్ టు స్కిన్ దగ్గరగా ఉంచండి. రెండు గంటలకు ఒకసారి పాలు ఇవ్వండి. బేబీ నిపుల్ని నోటితో పట్టుకునేటట్లు ప్రతి గంటన్నరకు ప్రయత్నించండి. చాలా డల్గా ఉంటే బేబీని ఒకసారి పిల్లల డాక్టర్కు చూపించండి. కొన్నిసార్లు షుగర్ డౌన్ అయితే అలా ఉంటారు. అప్పుడు ఫార్ములా ఫీడ్ ఎలా ఇవ్వాలో చెప్తారు. బ్రెస్ట్ పంప్ ఉపయోగించడం చాలా మంచిది. బేబీ నిపుల్ పట్టుకోకపోతే ప్రతి రెండు గంటలకు ఎలక్ట్రానిక్ పంప్ వాడడం వల్ల నిపుల్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. దీనితో ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణంగా డెలివరీ అయిన రెండు వారాల తరువాతే బ్రెస్ట్ మిల్క్ ఫ్లోలాగా చాలామందికి వస్తుంది. అందుకే ముందే మిల్క్ రావట్లేదు అని టెన్షన్ పడి, బ్రెస్ట్ ఫీడింగ్కి దూరం చేసే బాటిల్ ఫీడ్, ఫార్ములా ఫీడ్ ఇవ్వకండి. ట్రై చేస్తూనే ఉంటే ఫీడింగ్ ఇంప్రూవ్ అవుతుంది. పోషకాహారాలు ఎక్కువ ఉండే డైట్, లాక్టేషన్ డైట్ కౌన్సెలర్ని కలసి సలహా తీసుకోండి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఈ చికిత్సతో..పుట్టుమచ్చలను ఈజీగా తొలగించుకోవచ్చు..!) -
ఈ చికిత్సతో..పుట్టుమచ్చలకు చెక్..!
పుట్టుమచ్చ అంటే జీవితాంతం ఉండే మచ్చ అన్నట్లుగా ఫీలవుతుంటాం. కానీ పుట్టుమచ్చ నచ్చకుంటే ‘సర్జికల్ ఎక్సిషన్ ట్రీట్మెంట్’తో తొలగించవచ్చు. నిజానికి ఈ ట్రీట్మెంట్ సాధారణంగా వైద్య ప్రక్రియలో చర్మ క్యాన్సర్లకు వినియోగించే చికిత్స. అయితే దీన్ని సౌందర్య కారణాల కోసం కూడా వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో, మొదట తొలగించాల్సిన పుట్టుమచ్చ దగ్గర మత్తు ఇంజెక్షన్ చేస్తారు. దాంతో ఆ భాగం తిమ్మిరిగా మారి, నొప్పి తెలియకుండా అవుతుంది. తర్వాత, ప్రత్యేకమైన శస్త్రచికిత్స పరికరాన్ని ఉపయోగించి పుట్టుమచ్చను, దాని చుట్టూ ఉన్న కొద్ది చర్మాన్ని తొలగిస్తారు. ఇలా చేయడంతో పుట్టుమచ్చ పూర్తిగా పోతుంది. తిరిగి వచ్చే అవకాశం 99 శాతం తగ్గుతుంది. తొలగించిన చర్మానికి కుట్లు వేస్తారు. చికిత్స జరిగిన ప్రదేశాన్ని బట్టి కొన్ని రోజుల నుంచి వారాల వరకు ఆ కుట్లు ఉంచుతారు. శస్త్రచికిత్స తర్వాత, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచు కోవడం, వైద్యుడు ఇచ్చిన సూచనలను పాటించడం చాలాముఖ్యం. (చదవండి: ఈ డివైజ్తో అవాంఛిత రోమాలు మాయం..!) -
ఈ డివైజ్తో అవాంఛిత రోమాలు మాయం..!
ముఖం, మెడపై అవాంఛిత రోమాలుంటే ఏ మేకప్ వేసుకున్నా వృథానే అనిపిస్తుంది. ఇక కాళ్లు, చేతుల మీద వెంట్రుకలు పెరిగితే నచ్చిన డ్రెస్లు కూడా వేసుకోలేం. అన్నింటికీ ఒకటే పరిష్కారం అవాంఛిత రోమాలను తొలగించడం. అందుకోసం హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడుకోవడం లేదా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు చాలామంది. అలాంటి వారికి చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఈ డివైస్.నిమిషానికి 120 ఫ్లాష్లతో ఈ మెషిన్ పని చేస్తుంది. 12 వారాల పాటు దీనితో ట్రీట్మెంట్ అందుకుంటే తర్వాత మంచి ఫలితాలుంటాయి. దీనికి పవర్ కేబుల్తో పాటు నాలుగు ప్లగ్ అడాప్టర్స్ లభిస్తాయి. మొదటిగా వెంట్రుకలను ట్రిమ్ చేసుకుని, అనంతరం ఈ డివైస్ లైట్ ఫ్లాష్లను తీసుకుంటే ఆ భాగంలో రోమాలు మటుమాయం అవుతాయి.ఈ గాడ్జెట్ వెంట్రుకలను లోతుగా తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీని లైట్ టెక్నాలజీ వెంట్రుకల కుదుళ్లను లక్ష్యంగా చేసుకుని, వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. ఈ ఎపిలేటర్ చర్మానికి ఎటువంటి హాని కలిగించదు. దీనిలో చర్మాన్ని చల్లబరిచే వ్యవస్థ ఉంటుంది. ఈ మెషిన్ సున్నితంగా ఉండేలా సిలికాన్ రక్షక కవచంతో రూపొందింది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ డివైస్ల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే మోడల్లో ఫ్లాష్ ఫ్రీక్వెన్సీని బట్టి, ఎక్స్ట్రా ఆప్షన్స్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు. (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..!) -
చేపల టీచర్..!
అక్వేరియం చేపల పెంపకంలో ఉన్న పార్వతి నెలకు రు.50 వేలకు పైగానే సంపాదిస్తారు. కానీ అంతకు మించిన సంతోషం ఆమెకు వేరే ఉంది! చేపల పెంపకంలో శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే కొల్లమ్లోని ‘కాలేజ్ అండ్ ఫిషరీస్ స్కూలు’ విద్యార్థులు తనను ‘‘టీచర్.. టీచర్..’’ అంటూ సందేహాలు అడుగుతుండటం మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతారామె.పార్వతి సోషియాలజీ గ్రాడ్యుయేట్. 18 ఏళ్ల క్రితం – పెళ్లయే వరకు ఆమెకు అక్వేరియం చేపల పెంపకం అనే ఆలోచనే లేదు. మెట్టినింటి వాళ్లకు చేపల వ్యాపారం ఉంది. ఎనిమిది చేపల చెరువులు ఉన్నాయి. వాటిల్లో వేటికవిగా... తినే చేపల్ని, అక్వేరియం చేపల్ని పెంచుతుంటారు. భర్తతో కలిసి చేపల చెరువులకు వెళ్లొస్తుండటం, వాటిని మార్కెట్ చేయటం వంటివి చూస్తూ క్రమంగా తనూ చేపల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నారు పార్వతి. అయితే పార్వతి కేవలం అక్వేరియం చేపల పెంపకాన్ని మాత్రమే ఎంచుకున్నారు. వీటినే ఆర్నమెంట్ చేపలనీ, రంగు చేపలనీ అంటారు. ఇప్పుడంటే ఆమె తన ‘దేవూస్ ఆక్వా ఫామ్’ నిర్వహణతో పూర్తిగా మెలకువల్ని తెలుసుకోగలిగారు కానీ, మొదట్లో ఆ చేపల్ని పెంచటం చాలా కష్టంగా ఉండేదట! ‘‘కొన్నిసార్లు కుంటలోని అక్వేరియం చేపలు మొత్తం చనిపోయి కనిపించేవి. నష్టం మాట ఎలా ఉన్నా ఆ చిన్ని ప్రాణులు విగతజీవులై నీటి పైన తేలియాడుతూ ఉండటం చూసి మనసుకు ఎంతో బాధ కలిగేది’’ అంటారు పార్వతి. దాచుకున్న డబ్బుతో..!వివిధ సైజులలోని 21 సిమెంటు కుంటలలో అక్వేరియం చేపల్ని పెంచుతున్నారు పార్వతి. ఈ బ్రీడింగ్ ట్యాంకులు పెద్దవిగా ఉంటాయి. బేబీ ఫిష్లను ఆ పెద్దవాటికి దూరంగా ఉంచటం కోసం ప్రత్యేకంగా మరి కొన్ని చిన్న ట్యాంకులు ఉంటాయి. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకం కింద రుణంగా తీసుకున్న డబ్బు కొంత, తన దగ్గరున్న దాచుకున్న డబ్బు కొంత కలిపి రు.15 లక్షల పెట్టుబడితో ఈ అక్వేరియం చేపల (ఆర్నమెంట్ ఫిష్) బిజినెస్ను ప్రారంభించారామె. పార్వతికి కొల్లమ్, అలెప్పి, కొట్టాయం, తిరువనంతపురం, పఠనంతిట్ట, ఇంకా ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాలలో క్లయింట్లు ఉన్నారు. చిన్న దుకాణాల వాళ్లు కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. నెలకు తక్కువలో తక్కువగా రు.15 వేలు, ఎక్కువలో ఎక్కువగా లక్ష వరకు రాబడి ఉంటోంది. ప్రస్తుతం కాయ్ కార్ప్, మార్ఫ్, క్రిబెన్సిస్, జులిడోక్రోమిస్, బ్యూటికాఫ్యూరి, ఫ్రంటోసా, జెబ్రా డేనియోస్, రెయిన్ బో సిక్లిడ్, హెకెల్లి, మూన్ లైట్ గోరమి రకం రంగు చేపల్ని తన ఫామ్లో ఉత్పత్తి చేస్తున్నారు పార్వతి. మొదట్లో అన్ని చోట్లా దొరికే ఏంజెల్, గుప్పి, ఫైటర్, గోల్డ్ఫిష్ రకాల్ని మాత్రమే పెంచేవారు. చేప రకాన్ని బట్టి బ్రీడింగ్ ఉంటుంది. ‘‘మార్ఫ్ వెరైటీలో ఆడ చేపలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లను మగ చేపలు తమ నోటిలో పొదుగుతాయి. అది మాకు తెలుస్తుంది. అప్పుడు ఆ మగ చేపల్ని వేరే కుంటలోకి మారుస్తాం’’ అని ఎంతో ఆసక్తికరంగా వివరిస్తారు పార్వతి. ప్రస్తుతం ఆమె తన బిజినెస్ను మరింతగా విస్తృతపరచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. దాచుకోని విద్యతో...!అక్వేరియం చేపల పెంపకంలోని ఈ అనుభవం అంతా కేవలం నేర్చుకోవటం ద్వారానే పార్వతికి లభించలేదు. పనగఢ్లోని ‘కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్డడీస్’లో రీసెర్చర్గా ఉన్న యానా మెర్సీతో కలిసి కొంతకాలం పని చేశారామె. ‘‘ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. రాబడిలో ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ ముందుకు సాగిపోవాలి. మనకు తెలిసిన విద్యను దాచుకోకుండా, రాబోయే తరాల వారికి పంచాలి.. ’’ అంటారు పార్వతి.కొన్ని విశేషాలుప్రపంచంలో స్టాంప్ కలెక్షన్ తర్వాత అతి పెద్ద హాబీ ఇంట్లో అక్వేరియం ఉంచుకోవటమే!అక్వేరియంలోని రంగురంగుల చేపల్ని చూస్తుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో రూఢి అయింది.రంగు చేపల అమ్మకానికి, పెంపకానికి చెన్నైలోని కొళత్తూరు ప్రసిద్ధి.ఆసియాలోని అతి పెద్ద ‘రంగు చేపల మార్కెట్’గా కొళత్తూరు గుర్తింపు సంపాదించింది.అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి. వాటికి సమపాళ్లలో రెండు పూటలా ఆహారం అందించాలి.అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపల్ని ఉంచితే, వాటి విసర్జితాలు ఎక్కువై నీటిలో అమోనియం అధికమౌతుంది. చేపలకు హానికరంగా మారుతుంది. అక్వేరియంలో నీటిని తరచు మారుస్తుండాలి. పెద్ద తొట్టె అయితే వారానికోసారి, చిన్నదైతే రెండు రోజులకోసారి నీటిని మార్చాలి. అక్వేరియంలో నీటికి మార్చకపోతే బాక్టీరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. చేపలకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ప్రత్యేక మోతాదుల్లో ఇవ్వాలి. ఈ వివరాలను షాపు వాళ్ల నుంచి తెలుసుకోవచ్చు. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: మన ముచ్చట: పుస్తకానికి గుడి) -
వేచవుల మామిడి
వేసవిలో మామిడి సందడి తెలియనిది కాదు. పండ్లలో రారాజైన మామిడి రుచికైనా, ఆరోగ్యానికైనా ముందు వరుసలోనే నిలుస్తుంది. భిన్న ఆకారాలు, విభిన్న పరిమాణాలలో పండుతున్న మామిడి పండ్లలో నాణ్యతను గుర్తించడం ఎలా.? అసలు సిసలు మామిడి రుచులను ఎన్నుకోవడం ఎలా? మ్యాంగో లవర్స్కి ఇది పెద్ద సమస్యే. అయితే, మామిడిలో నిజమైన, అసలైన రుచులను చవిచూడాలంటే జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) పొందిన మామిడి రకాల వివరాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలు తెలుసుకుందామా?లంగ్డా(ఉత్తరప్రదేశ్)వారణాసి ప్రాంతానికి చెందిన ఈ మామిడి పండు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. కొద్దిగా పులుపు, తీపితో చాలామందికి ఇది నచ్చుతుంది. పైగా ఈ కాయ, ముగ్గిన తర్వాత కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది.కుట్టియత్తూర్ (కేరళ)కేరళలోని కన్నూర్ జిల్లాలో పండించే ఈ మామిడి పండు మృదువైన, మచ్చలేని తొక్కతో ఉంటుంది. మెత్తని గుజ్జుతో తీపిగా చాలామందికి నచ్చుతుంది. ఇది సాధారణంగా చాలామంది ఇంటి పెరటిలో భాగమైంది.బంగినపల్లి – బనగానపల్లె (ఆంధ్రప్రదేశ్) ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన ఈ మామిడి పండు తీపి రుచితో పాటు తక్కువ పీచు ఉంటుంది. అంతా గుజ్జే ఉంటుంది. పైగా ఎక్కువ కాలం నిల్వ ఉండటమే దీని ప్రత్యేకత.మలిహాబాది దసేహరి (ఉత్తరప్రదేశ్)ఉత్తరప్రదేశ్లోని మలిహాబాద్ ప్రాంతంలో పండించే ఈ మామిడి రకం తియ్యటి రుచి, చక్కటి సువాసనకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని సారవంతమైన నేల, వాతావరణం దీని ప్రత్యేకమైన రుచికి కారణం అవుతాయి.రతౌల్ (ఉత్తరప్రదేశ్)ఇవి ఉత్తరప్రదేశ్, బాగ్పత్ జిల్లా, రతౌల్ గ్రామంలో పండే ఒక ప్రత్యేకమైన మామిడి రకం. పాకిస్తాన్ లో కూడా ఈ రతౌల్ మామిడి సాగు చేస్తారు. అయితే భారతదేశంలో దీనిని రతౌల్ అని పిలిస్తే, పాకిస్తాన్ లో అన్వర్ రతౌల్ అని పిలుస్తారు.జర్దాలు (బిహార్) బిహార్లోని భగల్పూర్ ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు లేత పసుపు రంగులో ఉంటుంది. దీని సువాసన మరింత ఆకట్టుకుంటుంది. వీటిని ఎక్కువగా బహుమతులుగా ఇస్తుంటారు.హిమసాగర్ (పశ్చిమ బెంగాల్) పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, నాదియా జిల్లాల్లో పండించే ఈ మామిడిపండు పీచు లేని గుజ్జుతో తియ్యగా ఉంటుంది. వీటి పరిమళాన్ని చాలామంది ఇష్టపడతారు.గిర్ కేసర్ (గుజరాత్)గుజరాత్లోని గిర్నార్ కొండల ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు కుంకుమపువ్వు రంగు గుజ్జుతో, తియ్యని రుచికి ప్రసిద్ధి చెందింది. దీనిని ‘మామిడిపండ్ల రాణి’ అని పిలుస్తారు.కరి ఇషాద్ (కర్ణాటక) కర్ణాటక తీర ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు తియ్యటి గుజ్జుతో, ప్రత్యేకమైన రుచితో ప్రసిద్ధి చెందింది. దీనిని సాధారణంగా తొక్క, టెంకతో సహా మొత్తం తింటారు.అల్ఫోన్సో (మహారాష్ట్ర)‘మామిడిపండ్ల రాజు’ అని పిలువబడే అల్ఫోన్సో మ్యాంగో అద్భుతమైన రుచి, మృదువైన ఆకృతి, ఆకర్షణీయమైన సువాసనతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్, రాయ్గఢ్ ప్రాంతాలలో ఇది ప్రత్యేకంగా పండుతుంది.ఫజ్లీ (పశ్చిమ బెంగాల్) ఇది ఆలస్యంగా పరిపక్వం చెందే మామిడి రకం. అంటే ఇతర మామిడి పండ్లతో పోలిస్తే ఇవి సీజన్లో ఆలస్యంగా పండుతాయి. ఇవి బరువు ఎక్కువగా, పెద్ద పరిమాణంలో కాస్తాయి. వీటిని బంగ్లాదేశ్లో కూడా పండిస్తారు. వీటిని జామ్లు, పచ్చళ్ళ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.లక్ష్మణ్ భోగ్ (పశ్చిమ బెంగాల్)ఈ తియ్యటి మామిడిని పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో పండిస్తారు. వీటిని అధికంగా యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.అప్పెమిడి (కర్ణాటక)దీన్ని కర్ణాటకలో మల్నాడు ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది. ఎక్కువగా ఊరగాయలకు వినియోగిస్తారు. ఈ జాతిలో కచప్ప అప్పెమిడి, కర్నాకుండల అప్పెమిడి వంటి అనేక ఉప రకాలు ఉన్నాయి. అవన్నీ ప్రత్యేకమైన రుచిని, సువాసనను కలిగి ఉంటాయి.మరాఠ్వాడా కేసర్ (మహారాష్ట్ర)ఇవి మహారాష్ట్రలోని, మరాఠ్వాడా ప్రాంతంలో సాగు చేసే ఒక రకం మామిడి. ఈ మామిడి కుంకుమపువ్వు రంగుతో గాఢమైన రుచికి, తియ్యదనానికి ప్రసిద్ధి చెందింది. జీఐ ట్యాగ్ ఉన్న మామిడి పండ్లనే ఎన్నుకుని కొనుగోలు చేయడంతో నాణ్యమైన పండ్లు తినొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటినే ఎంచుకుని, కొనుగోలు చేయడంతో ఆయా పంటను పండించే రైతులకు మద్దతు ఇస్తున్నట్లు కూడా అవుతుంది. మరోవైపు ప్రపంచ దేశాల్లో మన దేశీయ వ్యాపారం మెరుగుపడుతుంది. -
పదో తరగతి తర్వాత
పదో తరగతి తర్వాత ఏం చదవాలి? ఏం చేయాలి? ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంట్ ఎదుర్కొనే సాధారణమైన ప్రశ్న. మీ బిడ్డకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే కార్పొరేట్ కాలేజీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే ఆ కాలేజీల మార్కెటింగ్ ఏజెంట్లు వస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఐఐటీ, నీట్, ఎంసెట్ అంటూ ఆశలు చూపిస్తారు. లేదంటే సీఈసీ ప్లస్ సీఏ అంటూ వస్తారు. తమ కాలేజీల్లో చేర్పించుకుంటారు. చాలామంది ఇలాగే స్నేహితులు, పొరుగింటివాళ్లు, బంధువులు, సమాజం ప్రభావం వల్ల ‘అందరూ ఎంచుకునే దారి’లోనే ప్రయాణిస్తుంటారు. ఆ తర్వాత అక్కడ ఒత్తిడి భరించలేక నానా అవస్థలు పడుతుంటారు. అనేకమంది విద్యార్థులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనలాంటి సమస్యలతో కౌన్సెలింగ్ కోసం వస్తుంటారు. కొందరు కోరుకున్నది సాధించలేక తీవ్ర మానసిక సమస్యల్లో పడిపోతుంటారు. ఈ పరిస్థితులు మారాలంటే, మార్చాలంటే కావాల్సింది– కెరీర్ కౌన్సెలింగ్. కెరీర్ కౌన్సెలింగ్ అంటే...పదో తరగతి తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ జీవిత దశ, దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ దశలో కెరీర్ కౌన్సెలింగ్ ఒక గేమ్ చేంజర్గా నిలుస్తుంది. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆసక్తి, సామర్థ్యాలు ఉంటాయి. ఒకరు ఎదిగే దారి మరొకరికి సరిపోదు. కెరీర్ కౌన్సెలింగ్లో ‘ఏది ఫేమస్’ అని కాకుండా, ‘ఏది మీకు బెస్ట్’ అనే ప్రశ్నకు శాస్త్రీయమైన, మానసికమైన సమాధానం దొరుకుతుంది. ఇది గూగుల్ మ్యాప్ లాంటిది. మీ లక్ష్యానికి సులువైన దారి చూపిస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్తే హెచ్చరిస్తుంది.ఉదాహరణకు ఏనుగు, కోతి, చేపకు చెట్టెక్కమనే పరీక్ష పెడితే? ఒక్క కోతి మాత్రమే గెలుస్తుంది. మిగతావన్నీ ఓడిపోతాయి. అలాగని అవన్నీ పనికిరానివి అనగలమా? దేని బలం దానిదే, దేని ప్రత్యేకత దానిదే! అలాగే పదో తరగతి తరువాత ఏం చదవాలనే నిర్ణయం కూడా వ్యక్తిగతంగా ఉండాలి.కెరీర్ కౌన్సెలింగ్ ఎందుకు అవసరమంటే... ∙మనకు తెలియని అంతర్గత శక్తులను బయటకు తేవడానికి ∙మనకున్న ఆసక్తి, వ్యక్తిత్వం, సామర్థ్యానికి సరిపడే కోర్సు ఏదో కనుగొనడానికి ∙‘అందరూ చేస్తున్నది నేనూ చేయాలి’ అనే ఉచ్చులోంచి బయటపడడానికి ∙భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, సవాళ్లు, రిస్క్లు తెలుసుకోవడానికి ∙మన లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు స్పష్టత కోసం.పదో తరగతి తర్వాత విద్యావకాశాలు... పదో తరగతి తర్వాత అందరికీ తెలిసింది ఇంటర్మీడియట్ చదవడం. దానిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఉంటాయి. ఇవి కాకుండా హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా, ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ చదివి ఆ తర్వాత ఇంజినీరింగ్ చేసే అవకాశమూ ఉంది. తక్షణ ఉద్యోగావసరం ఉన్నవాళ్లు ఐటీఐ చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇవి కాకుండా అరుదుగా తెలిసిన, భవిష్యత్తులో హై డిమాండ్ ఉన్న కోర్సులు కూడా ఉన్నాయి. ఇవి ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. కాని, వీటిలో ఆసక్తి, సామర్థ్యం, ప్యాషన్ ఉంటే చాలా గొప్ప కెరీర్ అవకాశాలున్నాయి. ఉదాహరణకు, యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్లో డిప్లొమా, సైబర్ ఫోరెన్సిక్ డిప్లొమా, గేమింగ్ డిప్లొమా, రోబోటిక్స్, ఏఐ డిప్లొమా, ఫైర్ ఇంజినీరింగ్, పారామెడికల్ కోర్సులు. కౌన్సెలింగ్ లేకుండా నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టాలు∙తల్లిదండ్రులు, ఇతరుల మాటలు విని తీసుకున్న కోర్స్ మధ్యలోనే బోర్ కొడుతుంది. ∙మనకు సామర్థ్యం లేని సబ్జెక్టుల వల్ల పరీక్షల్లో తప్పే అవకాశాలు పెరుగుతాయి. ∙‘నాక్కావాల్సింది ఇది కాదు’ అని గుర్తించినప్పుడు మళ్ళీ రీ–స్టార్ట్ చెయ్యాలి. ∙విలువైన సంవత్సరాలు, డబ్బు, మెంటల్ ఎనర్జీ వృథా అవుతాయి. ∙చివరికి వృత్తి, ఉద్యోగం, జీవితంలో అసంతృప్తికి దారితీస్తుంది.కౌన్సెలింగ్ తీసుకుంటే వచ్చే లాభాలు∙మీకు సరిపడే స్ట్రీమ్ లేదా కోర్స్ను గుర్తించగలుగుతారు. ∙స్పష్టత, ఆత్మవిశ్వాసం, నిబద్ధత వస్తాయి. ∙‘అందరూ వెళ్తున్న దారి’ కంటే ‘నాకు సరిపోయే దారి’ఎంచుకునే ధైర్యం వస్తుంది. ∙భవిష్యత్తులో ఉండే కెరీర్ అవకాశాలపై పూర్తి అవగాహన పెరుగుతుంది. ∙ప్రవేశ పరీక్షలు, అందుకు కావాల్సిన నైపుణ్యాల గురించి ముందే తెలుసుకుని సిద్ధంగా ఉంటారు. -
క్రిమినల్... కిడ్నాపర్స్
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు జి.కృష్ణంరాజును 2006 సెప్టెంబర్13న దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయన పెంపుడు శునకాన్ని కూడా వారు ఎత్తుకుపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై మల్లగుల్లాలు పడుతున్న పోలీసు అధికారుల్లో ఒకరికి వచ్చిన ‘విసిగించే కాల్’ విలువైన సమాచారం ఇచ్చింది.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గౌరు సురేష్ బీకాం పూర్తి చేశాడు. ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో 1999లో హైదరాబాద్కు వచ్చి, బద్రుకా కాలేజీలో చేరాడు. అనివార్య కారణాలతో ఆ కోర్సులో డ్రాపౌట్గా మిగిలిన సురేష్.. బతుకుతెరువు కోసం దిల్సుఖ్నగర్లో ‘మార్చ్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాడు. అది నష్టాల్నే మిగల్చడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలబాట పట్టాడు. 17 దోపిడీలు, 11 బందిపోటు దొంగతనాలు చేసి, జైలుకు వెళ్లి వచ్చాడు. 2003 నుంచి కిడ్నాపర్ అవతారం ఎత్తిన సురేష్, పలువురు బడా బాబుల్ని కిడ్నాప్ చేసి, భారీ మొత్తాలు వసూలు చేసుకున్నాడు. ప్రతి నేరానికి ముందూ ఓ ముఠా కట్టే సురేష్ ఒకసారి వినియోగించిన అనుచరుడిని మరోసారి వాడడు. కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని నిర్మానుష్య ప్రాంతాల్లో నిర్భంధించేవాడు. కొందరినైతే వాహనంలోనే ఉంచుకుని, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి డబ్బు వసూలు చేసేవాడు. తిరుపతికి చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాప్ చేయడానికి పథకం వేసిన సురేష్ 2006 ఏప్రిల్లో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చి హైదరాబాద్కు మకాం మార్చాడు. ఘరానా కిడ్నాపర్ గౌరు సురేష్ కన్ను జి.కృష్ణంరాజుపై పడింది. బి.సురేష్ కుమార్, ఎ.పరమేష్, కె.శ్రీనివాస్, కె.వెంకన్న, బి.నాగేశ్వరరావులతో ముఠా కట్టాడు. వీరిలో ఇద్దరు సస్పెన్షన్లో ఉన్న పోలీసులు. 2006 సెప్టెంబర్ 9న యూసుఫ్గూడలోని ఒక లాడ్జిలో గదులు బుక్ చేసుకున్న ఈ గ్యాంగ్ అక్కడే బస చేసింది. మూడు రోజుల పాటు జి.కృష్ణంరాజు కదలికలను నిశితంగా గమనిస్తూ, రెక్కీ చేసింది. ఈ కిడ్నాప్కు ముందు సురేష్ టవేరా వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. కిడ్నాప్ తర్వాత కృష్ణంరాజును దాచి ఉంచడానికి జగద్గిరిగుట్ట సమీపంలో ఉన్న ఎల్లమ్మ బండను ఎంచుకున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అక్కడ ఫామ్హౌస్ ఉండేది. ఆయన వీకెండ్స్లో కుటుంబంతో వెళ్లి అందులో గడిపేవారు. మిగిలిన రోజుల్లో కాపలాదారుడి దగ్గరే ఆ ఫామ్హౌస్ తాళాలు ఉండేవి. ఈ విషయం తెలుసుకున్న సురేష్ రెండు రోజుల కోసం ఫామ్హౌస్ ఇస్తే రూ.లక్ష ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. తన యజమానులు వారాంతాల్లో వస్తుండటం, సురేష్ కోరింది బుధ, గురువారాలు కావడంతో ఆ కాపలాదారు అంగీకరించాడు. 2006 సెప్టెంబర్ 13, బుధవారం లాడ్జి నుంచి బయలుదేరిన సురేష్ గ్యాంగ్, వాకింగ్ కోసం బయటకు వచ్చిన కృష్ణంరాజును ఆయన పమేరియన్తో సహా కిడ్నాప్ చేసింది. టవేరా వాహనంలో వెళ్తూ మాదాపూర్ ప్రాంతంలో ఆ శునకాన్ని కారు నుంచి బయటకు విసిరేసింది. టవేరా వాహనాన్ని సురేష్ నేరుగా ఎల్లమ్మబండకు తీసుకువెళ్లాడు. అయితే ఆ రోజు అనుకోకుండా ఫామ్హౌస్ యజమాని అక్కడకు రావడంతో కాపలాదారు చేతులెత్తేశాడు. దీంతో సురేష్ తనకు షెల్టర్ ఇచ్చే ఇతర వ్యక్తులు ఎవరనేది ఆలోచించాడు. ఇలా అతడికి గుర్తుకు వచ్చిన పేరే ఇక్బాల్ (పేరు మార్చాం). ఘరానా నేరగాడైన ఇక్బాల్తో సురేష్కు చంచల్గూడ జైలులోనే పరిచయం ఏర్పడింది. నగర పోలీసులకు ఉన్న ఇన్ఫార్మర్స్లో ఇక్బాల్ కూడా ఒకడు. అతడు వంద ఫోన్లు చేస్తే అందులో 95 మద్యానికి అవసరమైన డబ్బు కోసమే అయుండేది. దీంతో పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో అతడి ఫోన్లు ఎత్తేవాళ్లు కాదు. ఒకవైపు కృష్ణంరాజు కిడ్నాప్ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు ఈ కేసుపై వరుస సమావేశాల్లో బిజీగా ఉన్నారు. సురేష్ తన వద్ద ఉన్న ఫోన్కు కేవలం అవసరమైనప్పుడు ఆన్ చేస్తుండటంతో దర్యాప్తు మరింత కష్టసాధ్యమైంది. మరోవైపు ఎల్లమ్మబండలో షెల్టర్ దొరక్కపోవడంతో సురేష్– ఇక్బాల్కు అసలు విషయం చెప్పి, రెండు రోజుల కోసం షెల్టర్ కోరాడు. ఈ విషయంపై టాస్క్ఫోర్స్లో తనకు నమ్మకస్తుడైన అధికారికి ఉప్పందించాలని భావించిన ఇక్బాల్, ఆయనకు వరుసపెట్టి ఫోన్లు చేశాడు. అయితే కృష్ణంరాజు కేసు బిజీలో ఉన్న ఆ అధికారి ఫోన్ కాల్ను కట్ చేస్తూ పోయారు.అయినా పట్టువదలని ఇక్బాల్ పదేపదే కాల్స్ చేస్తుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేయడానికి ఫోన్ లిఫ్ట్ చేశారు.‘సాబ్ సిటీ మే కోయీ కిడ్నాప్ హువా క్యా’ అని ఇక్బాల్ అడగడంతో ఆ అధికారి అప్రమత్తమయ్యారు. సురేష్కు ఆశ్రయం ఇస్తానని చెప్పాలని, ఆపై అతడి ముఠాను తమకు పట్టించాలని కోరారు. దీనికి అంగీకరించిన ఇక్బాల్– సురేష్కు ఫోన్ చేసి కూకట్పల్లి వద్దకు రమ్మన్నాడు. అక్కడ ఇక్బాల్ను రోడ్డు పైన ఉంచిన పోలీసులు కాస్త దూరంలో కాపు కాశారు. సురేష్ టవేరాలో ఇక్బాల్ వద్దకు వచ్చి, అతడినీ ఎక్కించుకుని ఉడాయించేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఇక్బాల్ కొద్దిదూరం వెళ్లాక డ్రైవింగ్ సీటులోకి మారాడు. పాతబస్తీలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇల్లు సిద్ధంగా ఉందని చెప్తూ, వాహనాన్ని సిటీలోకి తీసుకువచ్చాడు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు నాంపల్లిలోని ఓ హోటల్ అడ్డాగా ఉండేది. అక్కడ ఏ సమయంలో అయినా కొందరు అధికారులు, సిబ్బంది ఉండేవాళ్లు. వేగులతో సమావేశాలను అక్కడే ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇక్బాల్కు ఈ విషయం తెలుసు. ఆ హోటల్ సెల్లార్ కేవలం ఓ చిన్న కారు పట్టేంత మాత్రమే ఉండేది. దీనిపై అవగాహన ఉన్న ఇక్బాల్, కారును నేరుగా సదరు హోటల్ సెల్లార్లోకి తీసుకువెళ్లిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశాడు. హుటాహుటిన సెల్లార్లోకి దూసుకువచ్చిన అధికారులు సురేష్ ముఠాను పట్టుకోవడంతో పాటు కృష్ణంరాజును రెస్క్యూ చేశారు. ఇక్బాల్ను అభినందించిన పోలీసులు రివార్డు సైతం అందించారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని సురేష్ 2008 జూలై 18న బేగంపేటలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. -
సంతప్తకుడు పంచప్రేతాలు
పూర్వం సంతప్తకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సంసార వ్యామోహం లేనివాడై, తపోవృత్తితో జీవించేవాడు. తపోబలంతో పాపరహితుడై, అరణ్యాలలో సంచరిస్తూ ఉండేవాడు. బాహ్యచిత్తవృత్తులను నిరోధించి, ఇంద్రియాలను జయించాలనే తలపుతో అతడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అటవీమార్గంలో ప్రయాణిస్తుండగా, సంతప్తకుడు దారితప్పిపోయాడు. కాకులు దూరని కారడవిలాంటి కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అడవిలో మహావృక్ష్యాలు, నేలంతా పాకి ఉన్న లతలు, గుబురుగా వ్యాపించి ఉన్న పొదలు నిండి ఉండటంతో అతడికి దారీ తెన్నూ కానరాలేదు. అక్కడక్కడా క్రూర జంతువులు, సాధు జంతువులు, పక్షులు తప్ప ఆ కీకారణ్యంలో ఎక్కడా నరసంచారం లేదు. సంతప్తకుడికి భయం కలగలేదు గాని, దారి తోచలేదు. దైవసంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుందని అనుకుంటూ ముందుకు సాగాడు. ఇంతలో చీకటి పడింది. అసలే కీకారణ్యం, ఆపై చిమ్మచీకటి. కీచురాళ్ల రొద, కర్ణకఠోరంగా గుడ్లగూబల అరుపులు, అక్కడక్కడా క్రూరమృగాల గర్జనలు వినిపించసాగాయి. అయినా సంతప్తకుడు ఆగలేదు. ముందుకు నడవసాగాడు. ఇంతలో అత్యంత జుగుప్సాకరమైన దృశ్యం కనిపించడంతో, నిశ్చేష్టుడై అక్కడే నిలిచిపోయాడు.ఒక మర్రిచెట్టు వద్ద ఐదు ప్రేతాలు ఒక శవాన్ని పీక్కు తింటున్నాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. మనిషి అలికిడి వినిపించడంతో ప్రేతాలు తేరిపార చూశాయి. వాటికి సంతప్తకుడు కనిపించాడు. అతడిని చూసి, ప్రేతాలు ఆనందంగా గంతులు వేశాయి. ‘వీణ్ణి నేను తింటాను’ అంటే ‘నేను తింటాను’ అంటూ అవి అతడి వైపు పరుగుతీశాయి. అతడి కాళ్లను రెండు ప్రేతాలు, చేతులను రెండు ప్రేతాలు పట్టుకోగా, ఐదో ప్రేతం తల పట్టుకుంది. అవన్నీ అతడిని తీసుకుని ఆకాశంలోకి ఎగిరాయి. కిందనున్న శవంలో ఇంకా మాంసం ఉండటంతో, దానిని వదిలేయడం ఇష్టంలేక మళ్లీ కిందకు వచ్చి, దానిని కాళ్ల మధ్య ఇరికించుకుని, మళ్లీ పైకిలేచి ఎగరసాగాయి. ఈ పరిణామానికి సంతప్తకుడు భయభ్రాంతుడై, తనను ఆపద నుంచి గట్టెక్కించమంటూ మహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాడు.సంతప్తకుని ప్రార్థనకు కరిగిన మహావిష్ణువు తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన అక్కడకు చేరుకునే సరికి సంతప్తకుడు ప్రేతాల మూపులపై హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. మహావిష్ణువు సంతప్తకుడిని తీసుకుపోతున్న ప్రేతాలను అనుసరించసాగాడు. తోవలో మణిభద్రుడు అనే యక్షరాజు కనిపించాడు. విష్ణువు అతడికి కనుసైగ చేయడంతో అతడు ప్రేతాలకే భయంగొలిపే భీకరరూపం దాల్చి వాటి ఎదుట నిలిచాడు. మణిభద్రుడి భీకరాకారాన్ని చూసి ఆ ప్రేతాలు కొయ్యబారిపోయాయి. అతడు రెండు ప్రేతాలను చేతుల్లోను, రెండు ప్రేతాలను కాళ్లలోను చిక్కించుకుని, మరో ప్రేతాన్ని నోట కరచుకున్నాడు. వాటి చేతుల నుంచి సంతప్తకుడిని విడిపించాడు. పంచప్రేతాలనూ పిడిగుద్దులతో ఒళ్లు హూనం చేశాడు. ప్రేతాల వద్దనున్న శవం పట్టుకుని, అతడు మాయమైపోయాడు.మణిభద్రుడి శిక్షతో, మహావిష్ణువు దయతో ఆ పంచప్రేతాల పాపాలు నశించాయి. మానవాకృతిలో సంతప్తకుడి ముందు మోకరిల్లి, ‘బ్రాహ్మణోత్తమా! మమ్మల్ని క్షమించు. విష్ణుభక్తుడవైన నిన్ను అపహరించి, ఆరగించాలనుకున్నాం. మా పొరపాటుకు మన్నించు’ అని కోరారు.‘బాబూ! మీరెవరు? ఇదంతా మాయా? లేక నా చిత్తభ్రమా?’ అని ప్రశ్నించాడు సంతప్తకుడు.‘విపోత్తమా! మాయా కాదు, భ్రమా కాదు. మేం ప్రేతాలం. పూర్వజన్మ పాపాల ఫలితంగా ప్రేతాలుగా మారాం’ అని చెప్పారు.‘మీ పేర్లేమిటి? మీకీ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది?’ అడిగాడు సంతప్తకుడు.‘మా పేర్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు’ చెప్పాయి ప్రేతాలు.పూర్వజన్మలో అమాయకుల పట్ల, సాధుజనుల పట్ల చేసిన అపచారాలను, అఘాయిత్యాలను పొల్లు పోకుండా చెప్పుకుని, పశ్చాత్తాపం వ్యక్తం చేశాయి. ప్రేత రూపాల్లో తాము పడుతున్న అగచాట్లను వివరించాయి.సంతప్తకుడు ప్రేతాల బాధలను వింటుండగా, మహావిష్ణువు అతడి ఎదుట సాక్షాత్కరించాడు.మహావిష్ణువును చూడగానే సంతప్తకుడు పులకాంకితుడయ్యాడు. వెంటనే విష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనను రకరకాలుగా స్తుతిస్తూ స్తోత్రపఠనం మొదలుపెట్టాడు. సంతప్తకుడి సన్నిధిలో ఉండటం వల్ల ప్రేతాలు కూడా విష్ణువును ప్రత్యక్షంగా చూడగలిగాయి. మహావిష్ణువు దర్శనమాత్రంతోనే ఆ ప్రేతాల జన్మాంతర పాపాలన్నీ పూర్తిగా నశించాయి.‘ప్రాణులను ఉద్ధరించేది నీవే, పాపాలను పరిహరించేదీ నీవే! పూర్వజన్మ పాపాలకు ఏళ్లతరబడి అగచాట్లు పడుతున్న ఈ ప్రేతాలకు ఉత్తమగతులను ప్రసాదించు స్వామీ’ అని ప్రార్థించాడు సంతప్తకుడు.అతడి ప్రార్థనకు మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు.గంధర్వులు, అప్సరలతో కూడిన ఆరు దివ్యవిమానాలను అక్కడకు రప్పించాడు.సంతప్తకుడిని, అతడితో పాటు పంచప్రేతాలను ఆ విమానాల్లో వైకుంఠానికి తీసుకుపోయాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: పూలమ్మి
ఒక పూల పరిమళం నన్ను ఆవహించిన వేళ– ఒక శూన్యం, నా నుంచి వీడ్కోలు తీసుకునే సమయం నేను ఊహించని సంఘటన– ఘటన. ఒక నటన, నన్ను పూలమ్మికి దగ్గర చేసింది. వేసవి సాయంకాలం, సముద్రం ఒడ్డున సేదతీరే సమయం. అలలు అప్పుడప్పుడు వచ్చి పాదాలను పలకరిస్తూ, వెనక్కి వెళ్తూ, మళ్ళీ అల్లరిగా ముందుకు వస్తూ దోబూచులాడుతున్నాయి.ప్రతిరోజు చీకటి పడగానే బీచ్కు రావడం రామకృష్ణకు ఆనవాయితీ.బీచ్తో రామకృష్ణకు, రామకృష్ణ (ఆర్కే) బీచ్కి అనుబంధం పెరిగిపోవడానికి కారణం పూ..ల...మ్మి..పెళ్లికాని రామకృష్ణకు పెళ్ళైన పూలమ్మితో పరిచయం. రామకృష్ణకి పెళ్లి కాకపోవడానికి కారణం రామకృష్ణే!అతని జీవితంలో పెళ్లి అనే పదాన్ని వివిధ రూపాల్లో చూశాడు. పెళ్లితో ఒక్కటైనా అమ్మానాన్నల గొడవలు మొదలు, స్నేహితుల కష్టాలు, స్వేచ్ఛ కోల్పోవడాలు చూశాడు.‘సరదాగా స్నేహితులతో మందు కొట్టడానికి కూడా స్వేచ్ఛలేని పెళ్లి’ అని తరచూ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు రామకృష్ణ.ఆడవాళ్ళు పెళ్లి కాకముందు, మగవాళ్ళు పెళ్లయ్యాక భర్తలుగా మారాక, అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించి అబద్ధాలు చెప్పడం, నేర్చుకోవడం మొదలు పెడతారని చెబుతాడు. ఇలాంటి చాలా కారణాలకు తోడు అతడిని ఇంప్రెస్ చేసే అమ్మాయి తారసపడలేదు. అందుకే బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని డిసైడయ్యాడు. ఆఫీస్ వదలగానే, ‘ఎక్కడికెళ్లారు? ఎప్పుడొస్తారు? ఏం చేస్తున్నారు? ఎవరితో ఉన్నారు? వాట్సాప్ వీడియో కాల్ చెయ్’..లాంటి సమస్యలు లేవు కాబట్టి, పెళ్ళైన ఫ్రెండ్స్ బుద్ధిగా, భయంగా ఆఫీస్ వదలగానే ఇంటిముఖం పడతారు కాబట్టి, తనకు అలాంటి బాదరబందీలు లేవు కాబట్టి, ఆఫీస్ వదలగానే ‘ఓ రోజు అలా జగదాంబ సెంటర్కు, మరో రోజు గుడికి, ఇంకో రోజు రామకృష్ణ బీచ్కు వెళ్తూ ఉంటాడు.అలా ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది పూలమ్మి. పరిచయం అయ్యింది అనడం కన్నా తారసపడింది అనాలేమో!సాధారణంగా రామకృష్ణకు గుడికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు కాని, ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది. నిండుగా చీర కట్టుకుని, ఒద్దికగా పూలసజ్జతో గుడికి వచ్చే అమ్మాయిలను చూస్తుంటే, ఒక మంచి పెయింటింగ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.పెందరాళే ఇంటికి వెళ్లి ఒరగబెట్టే రాచకార్యాలు లేకపోవడం వల్ల ఇలా చేస్తాడు. తన ఫ్రెండ్ తమ్ముడు శ్రీధర్ దీనికి పెట్టిన పేరు ‘టీపీ టైం’– టైం పాస్ టైం.అలా ఆ రోజు సాయిబాబా గుడికి వచ్చాడు. గుడి బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అతని దృష్టి పూలు అమ్మే అమ్మాయి మీద పడింది.గుడికి వచ్చిన అమ్మాయిల అందమంతా ఆమెలోనే కనిపించింది. వైజాగ్ అమ్మాయిల నవ్వులన్నీ ఆమె పెదవుల్లో కనిపించాయి. కాటన్ చీరలో, చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేంత అందం.అలాంటి అందం పూలమాల కట్టి అమ్ముతుంటే, ఆమె అందమే పువ్వుల్లో చేరి పరిమళాలు వెదజల్లుతుందేమో అనిపించింది.మాట్లాడుతున్న ఫోన్ను మధ్యలో కట్ చేశాడు. చేతిలోని స్మార్ట్ఫోన్ జేబులోకి వెళ్ళింది. అతని కాళ్ళు ఆమె వైపు కదిలాయి.‘రండి సర్, రండి మేడం’ అంటూ వచ్చేవారిని చిరునవ్వుతో పలకరిస్తోంది. పొడవాటి సన్నటి చేతివేళ్ళు పువ్వులను మాలగా కడుతుంటే, ఆ పువ్వులు పులకరించి పోతున్నట్లు వుంది.‘సర్ పూలు కావాలా?’ అడిగింది రామకృష్ణను చూసి.‘వద్ద’ంటూనే పర్స్లో నుంచి డబ్బులు తీశాడు.‘ఎన్ని మూరలు సర్...’ అంటూనే చేత్తో మూరలు కొలుస్తుంటే, తన మనసును కొలుస్తున్నట్టు అనిపించింది.శనివారం వేంకటేశ్వరస్వామి గుడిలో కనిపించింది. శుక్రవారం మరో గుడిలో– ఎప్పుడు కలిసినా పూలు కొంటూనే వున్నాడు.ఇంటికి వెళ్ళాక అతని మంచం పక్కనే ఆ పూలు టీపాయ్ మీద పేరుకు పోతూనే ఉన్నాయి.ఆమె మెడలో మెరిసే పసుపుతాడు, నుదుట సిందూరం, కాలివేళ్లకు మెట్టెలు, ఆమెకు పెళ్లయిందని చెప్పకనే చెబుతున్నాయి. అయినా ఆమెను చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్.ఒకరోజు నవ్వుతూ అన్నాడు. ‘నీ దగ్గర పూలు కొనడానికి రోజుకో గుడి దగ్గరికి రావలసి వస్తోంది’ అని.ఆమె ఏమాత్రం అతడిని నొప్పించకుండా ‘బీచ్లో అయితే రోజూ సాయంత్రం నుంచి చీకటి పడే వరకు ఉంటాను. మేడం కోసం పూలు కొనాలనుకుంటే అక్కడికి రండి’ అంది అదే చిరునవ్వుతో.అలా అతనికి ఆమె ద్వారా, బీచ్తో మరింత అనుబంధం పెరిగింది.సాయంత్రం ఆఫీస్ వదలగానే బీచ్కు వెళ్లడం ఆమెతో కాసేపు మాట్లాడ్డం, పూలు కొనడం.‘రోజూ మేడంకు పూలు తీసుకువెళ్తారు. మేడంను ఒకసారి తీసుకురండి సర్’ అంది కాస్త చనువు పెరిగాక.నవ్వి ఊరుకున్నాడు రామకృష్ణ. పెళ్ళైన అమ్మాయి పట్ల తాను ఏర్పరచుకున్న ఫీలింగ్ ఏమిటో అతనికే అర్థం కాలేదు.ఒకరోజు అడిగాడు, ‘నీ పేరేమిటి?’ అని ధైర్యం చేసి.‘అందరూ పూలమ్మి అంటారు. అదే నా పేరనుకోండి’ అంది ఆమె నవ్వుతూ. ఆ నవ్వు ఆమె అమ్మే పూల కన్నా ఎక్కువ పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపించింది.ఆమె దృష్టిలో అతను వివాహితుడు. అతను అలాగే నటించేశాడు. బీచ్లో జంటలను చూసినప్పుడు ఒకప్పుడు ఏమీ అనిపించేది కాదు. కాని, ఇప్పుడు కొద్దిగా ఏదో ఫీలింగ్. పూలమ్మి పక్కన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆమె జడలోని సన్నజాజులు అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేసున్నాయి.సరిగ్గా అపుడే అతని జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరిగింది.ఆ రోజు పూలమ్మి రాలేదు. ఆ రోజే కాదు మరుసటి రోజు కూడా రాలేదు. మూడవరోజు, నాలుగో రోజు...పూలమ్మితో పరిచయం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు పూలమ్మి పూలు అమ్మని రోజు లేదు. వర్షం వచ్చినా సరే, గొడుగు వేసుకుని మరీ బీచ్కు వచ్చేది.రామకృష్ణ కుదురుగా ఉండలేకపోయాడు. పూలమ్మి పూలు అమ్మే ప్రతి గుడికి వెళ్ళాడు. సాయిబాబా గుడికి, వేంకటేశ్వరస్వామి గుడికి, దుర్గ గుడికి– ఎక్కడా కనిపించలేదు. బీచ్కు రావడం లేదు.పూలమ్మికి ఏమైంది?రామకృష్ణ అన్వేషణ మొదలైంది. గుడిలో పూలు అమ్మే వాళ్ళను, బీచ్లో పూలు అమ్మే వాళ్ళను ఎంక్వయిరీ చేశాడు. ఎట్టకేలకు పూలమ్మి చిరునామా సంపాదించాడు. ఆఫీస్ వదలగానే పూలమ్మిని వెతుక్కుంటూ బయలుదేరాడు.∙∙ పూలమ్మి ఇల్లు ఊరికి చివర వుంది. పూలమ్మి ఇంటిని సమీపిస్తున్న కొద్ది రామకృష్ణలో ఉద్వేగం, పూలమ్మిని చూడబోతున్నానన్న ఉద్వేగం ఓ వైపు, ‘ఎందుకొచ్చారు?’ అని అడిగితే ఏం చెప్పాలి? కాళ్ళు పూలమ్మి ఇంటి ముందు ఆగాయి.చిన్న ఇల్లయినా పర్ణకుటీరంలా వుంది. చుట్టూ చెట్లతోనే ప్రహరీ, చిన్న చెక్క గేటు. దానికి అల్లుకున్న మల్లెతీగ. రెండువైపులా చామంతి, బంతి, గులాబీ మొక్కలు. కనకాంబరాలు ఓ పక్క, మరువం ఇంకో పక్క మల్లెతీగలు ఇంటిని అల్లుకుని...ఒక ఉద్యానవనంలోకి వచ్చినట్టు వుంది.చెక్క గేటు తీసుకుని లోపలి అడుగు పెట్టగానే మంచం మీద పడుకుని ఉన్న నాలుగేళ్ల పాప కళ్ళు తెరిచింది. పూలమ్మిని చూసినట్టే వుంది. తన అడుగుల శబ్దం విని కప్పుకున్న దుప్పటి తొలిగించి లేవబోయింది. కాళ్లు చచ్చుబడి సహకరించడం లేదు.రామకృష్ణ మనసు చివుక్కుమంది. పూలమ్మి కూతురికి ఈ కష్టమా?‘అమ్మ లేదా పాపా?’ అడిగాడు రామకృష్ణ. ఛ పాపకు ఏమైనా కొని తీసుకు రావాల్సింది. అయినా తనకు తెలిస్తే కదా, పూలమ్మికి ఓ పాప ఉందని. తానెప్పుడూ అడగలేదు. పూలమ్మి చెప్పనూ లేదు.‘అమ్మ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చింది అంకుల్’ అంటూ హాలు వైపు చూసింది.రామకృష్ణ లోపలికి అడుగుపెట్టాడు.అప్పుడే పూలమ్మి లైటు వేసింది. లైటు వెలుతురులో పూలమ్మిని అలానే చూస్తూ ఉండిపోయాడు. పూలమ్మి తన మెడలోని మంగళసూత్రం తీసి, ఎదురుగా ఉన్న దేవుని పటం ముందు పెట్టింది. మెట్టెలు తీసేసింది. నుదుట సిందూరం చెరిపేసింది. వెనుతిరిగింది.ఎదురుగా రామకృష్ణ .‘సర్ మీరా? ఇక్కడ.. నా కోసం?’‘నీ అనుమతి లేకుండా నీ ఇంటికి వచ్చాను. సారీ పూలమ్మి’ తలొంచుకుని అన్నాడు రామకృష్ణ.చిన్నగా జీవంలేని నవ్వు నవ్వింది పూలమ్మి.‘మనల్ని సృష్టించిన ఆ దేవుడు మన అనుమతి లేకుండా, మన తలరాతలు తన ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. నా తలరాత చూడటానికి వచ్చారా?’ ఆమె కంట్లో సన్నటి కన్నీటిపొర.‘కాళ్లు చచ్చుబడి పోయిన నా కూతురు, వైధవ్యాన్ని శాపంగా భరిస్తున్న నేను– ఇదీ నా కుటుంబం, తాగుబోతు భర్త, తాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరి చావుకు కారణమై, తనూ చచ్చాడు. ఆ పాపం, ఏ పాపం తెలియని నా బిడ్డను వెంటాడింది. నా బిడ్డ కాళ్ళు చచ్చుబడ్డాయి. ఆపరేషన్ చేస్తే తిరిగి నా కూతురు మామూలుగా అవుతుందని చెప్పారు. నా బిడ్డ కాళ్ళు బాగుపడడం కోసం పూలమ్మిగా కొత్త పాత్రలోకి వచ్చాను. ఒకప్పుడు ఇష్టంగా వ్యాపకంగా పెంచుకున్న చెట్లు, నాకు జీవనాధారం అయ్యాయి. గుడిలో దేవుని పాదాల చెంతకు, బీచ్లో అమ్మాయిల జడల్లో కొలువుతీరే పువ్వులు అమ్మే ఈ పూలమ్మి, నుదుట కుంకుమ లేకుండా, వైధవ్యంతో పూలు అమ్మితే అపశకునం అనుకోవచ్చు. అందుకే సుమంగళిగా నటించాను. మోసం చేయడానికి కాదు. నా బిడ్డను బతికించుకోవడానికి నటించాను. ఇంతకు మించి నా కథలో ఏ మలుపులు లేవు’ కళ్ళు తుడుచుకుని చెప్పింది పూలమ్మి.‘ఇప్పుడు ఆ నటనను నిజం చేయొచ్చుగా! నేను సూటిగా చెబుతున్నాను. నాకు పెళ్లి కాలేదు. నాకు నచ్చిన అమ్మాయి తారసపడలేదు. నిన్ను చూశాక, ఎందుకో ఒక అందమైన భావం, నీకు పెళ్లయిందని తెలిసినా నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు నీ కథ తెలిశాక, జాలితో కాదు, మరింత ఇష్టంతో నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను’ రామకృష్ణ మనసులో మాట చెప్పాడు.‘క్షమించండి. మీ మంచి మనసుకు శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఈ పొగచూరిన మనసును ఇవ్వలేను. నా బిడ్డ కాళ్లు బాగైతే, నా నటనకు స్వస్తి చెప్పి, మరో దారి చూసుకుంటాను. ఈ పూలమ్మిని మర్చిపోండి’ చెప్పింది.‘పోనీ కొన్నాళ్ళు నేను నీకు భర్తగా కాకుండా, నీ బిడ్డకు తండ్రిగా నటిస్తాను. మన బిడ్డకు, సారీ.. నీ కూతురికి కాళ్ళు వచ్చేవరకు. నీకు భర్తగా జీవించే అవకాశం లేనప్పుడు, ఇలా నటించే అవకాశాన్ని కోరడం తప్పు కాదు కదా! ఊహ తెలియకముందే నాన్న విదేశాల్లో ఉన్నాడని నమ్మించి నటించావు. ఆ నాన్నను నేనే అని చెప్పు. ఆ సంతోషంతో త్వరగా నడుస్తుంది. కొన్నాళ్ళైనా నాకు ఇష్టమైన నిన్ను నా జీవితంలోకి నటిగా ఆహ్వానించే అవకాశం ఇవ్వు’ అన్నాడు రామకృష్ణ.అప్పటికే కూతురు వాకింగ్ స్టిక్ సహాయంతో అక్కడికి వచ్చి, ‘ఎవరమ్మా.. నాన్నా.. నాన్నొచ్చాడా? ఆ చిన్నారి కళ్ళలో వెలుగు.కూతురు కళ్ళలో వెలుగు చూసి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేక పోయింది. అప్పటికే రామకృష్ణ ఆ పాపను దగ్గరకు తీసుకున్నాడు.‘భలే కనిపెట్టావ్.. ఎంతైనా నా కూతురువి కదా..’ అన్నాడు పూలమ్మి వైపు చూడకుండా.‘నేనంతే నాన్నా!’ అప్రయత్నంగా అంది. ఆ పిలుపుకు చిన్నప్పటి నుంచి దూరమైన ఆ పాప.‘మరి నీ బట్టలు తెచ్చుకోలేదు. నా కోసం ఏమీ తేలేదు. నువ్వు బోల్డు గిఫ్టులు తీసుకు వస్తావని చెప్పింది అమ్మ’ అంది అమాయకంగా.‘ఆఫీస్ పని మీద వచ్చాను. నీ కాళ్ళు బాగయ్యాక మిమ్మల్ని పెద్ద ఇంట్లోకి తీసుకు వెళతాను’ చెప్పాడు. ఆ పాప ఆ నటన నిజమేనని నమ్మి బయటకు వెళ్లి పూలతో మాట్లాడుతోంది.‘మా నాన్నొచ్చాడ’ని చెబుతూ మురిసిపోతోంది.ఆలా అతని పాత్ర నటన మొదలైంది. కానీ అతను జీవిస్తున్నాడు.అతని దినచర్య మారిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పాప కోసం బొమ్మలు తీసుకురావడం, పాపను బయటకు తీసుకు వెళ్లడం– అనివార్యంగా పూలమ్మి కూడా అతనితో పాటు వెళ్ళక తప్పడం లేదు.ఒకరోజు బీచ్కి వెళ్లారు. మొదటిసారి బీచ్కి వచ్చిన పాప అక్కడ ఉన్న పిల్లలను చూసి కేరింతలు కొట్టింది. ఇద్దరి చేతులు పట్టుకుని ఇద్దరి భుజాల మీద ఆడుకుంది. సినిమాకు తీసుకువెళ్లాడు. అమ్మ ఒడిలో కూర్చుంది. పూలమ్మి భుజం తాకుతుంటే, రామకృష్ణ మనసులో చిన్నపాటి ఉద్వేగం.పాపకు రామకృష్ణకు మధ్య బంధం పెరిగింది. అయినా తన పరిధిని మించి ఎప్పుడూ పూలమ్మి ఇంట్లోకి, ఆమె గదిలోకి అడుగు పెట్టలేదు. పాప ఎన్నోసార్లు ‘ఎందుకు నాన్న లోపలికి రావు’ అంటే ఏదో కారణం చెప్పేవాడు.పూలమ్మి రామకృష్ణ కోసం టిఫిన్ చేయడం మొదలుపెట్టింది.తర్వాత వంట చేసి క్యారేజీ ఇవ్వడం మొదలైంది.ఆ తర్వాత అతనికి కోసం ఎదురు చూడటం అలవాటైంది. ఒకరోజు వర్షంలో తడిసి వస్తే (అ)ప్రయత్నంగా అతని తల తుడిచింది తన చీర కొంగుతో. అతని బట్టలు ఉతికి ఆరేసింది. ఇస్త్రీ చేసింది.తాను పాప కోసం నటిస్తోందా? అతని మీద ప్రేమతో జీవిస్తోందా? అర్థం కాలేదు పూలమ్మికి.పాపకు ఆపరేషన్ అయ్యింది. కాళ్లు బాగుపడ్డాయి. లేచి నడుస్తోంది. పరుగెత్తుతోంది. ఆ రోజు పాప పుట్టినరోజు. పెద్ద కేక్ తెచ్చాడు. కొత్త బట్టలు తెచ్చాడు. పాపతో కేకు కట్ చేయించాడు. పెద్ద సందడి. అతని మనసులో చిన్న అలజడి.హడావుడి ముగిసింది. అర్ధరాత్రి కావస్తోంది. అప్పటి వరకు ఆడుకుని అలిసిపోయిన పాప నిద్రలోకి జారుకుంది. గడప లోపల పూలమ్మి. గడపకు ఇవతల రామకృష్ణ.‘నేను వెళ్తున్నాను’ చెప్పాడు రామకృష్ణ.‘రేపు కొద్దిగా పెందరాళే రావొచ్చుగా! మీకు ఇష్టమైన మినప్పప్పు మిక్సీకి వేశాను. మినప వడలు, సాంబారు, మీకిష్టమైన పల్లీ చట్నీ’ అని, ‘పోనీ ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చుగా...’ ఆశగా అంది పూలమ్మి.‘వెళ్లిపోతానని అంటున్నది ఈ వూరి నుంచి. పాపకు కాళ్లు వచ్చాయి. నా జ్ఞాపకాలకు సరిపడా అనుభూతి దొరికింది. ఇంకా నటించి, ఒక నటుడిగా బతకలేక పోతున్నాను. ఎప్పుడైనా సినిమా పూర్తయితే, పాత్రను, పాత్ర నటనను వదిలి వెళ్ళిపోవలిసిందేగా! అందుకే, ఇప్పుడే ఇక సెలవని...’ రామకృష్ణ గొంతు గాద్గదికం అవుతోంది.‘పాపకు నాన్న ఆఫీస్ పనిమీద మళ్ళీ వెళ్లాడని చెప్పు. నువ్వు జాగ్రత్త పూలమ్మి’ వెనుదిరిగాడు. పూలమ్మి కళ్ళలోకి చూసి అక్కడి నుంచి వెళ్లలేక.పూలమ్మి అలాగే నిలబడి పోయింది.మొదటిసారి రామకృష్ణ తెచ్చిన చీర కట్టుకుంది.మొదటిసారి మనస్ఫూర్తిగా జడలో రామకృష్ణకు ఇష్టమైన పువ్వులు పెట్టుకుంది.మొదటిసారి నటించడం మాని జీవించింది.‘వెళ్ళండి ... ఎంతైనా మగ మహారాజులు కదా! కూతురి పుట్టినరోజు కూడా బలాదూర్ తిరగండి. ఇంట్లో భార్య ఉంది. అది తన కోసం ఎదురుచూస్తుంది అని ఆలోచించకుండా వెళ్ళండి’ పూలమ్మి ఉక్రోషంగా అంది. గొంతులో దుఃఖం తన్నుకు వస్తోంది.ఒక్కసారిగా గిరుక్కున వెనక్కి తిరిగాడు. గుమ్మం ముందు నిలబడి తాను తెచ్చిన చీర కట్టుకుని, తలలో పువ్వులు పెట్టుకుని, తన పూలమ్మి, కళ్ళనుండి నీళ్లు ఒంపుకొని... మనసు నిండా ప్రేమ నింపుకొని... రెండు చేతులు చాచి, గుమ్మానికి అడ్డు తొలగి లోపలి గది లోపలికి, తన మనసు గదిలోకి ఆహ్వానిస్తూ...నుదుట కుంకుమ చెదిరి, తలలో పూలు అలసి, ఒంటిమీద ఉన్న ఆచ్ఛాదనలు చెదిరి, దేహాలు ఒక్కటై, తెల్లవారు ఝామున వినిపించే కువకువల సుప్రభాతం వింటూ... ఒకరినొకరు చుట్టుకుని... నిన్నటి వరకు నటించిన పాత్రలకు జీవం పోసి, నటన వదిలి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.మరోసారి పూలమ్మిని చుట్టేస్తూ ‘అవును నీ పేరేమిటి పూలమ్మీ’ అడిగాడు.‘మీరు ప్రేమతో పిలిచే పేరే. పూలమ్మి...’ అతని గుండెలో ఒదిగిపోతూ చెప్పింది పూలమ్మి. -
మన ముచ్చట: పుస్తకానికి గుడి
దేవుళ్లు, దేవతలకు ఆలయాలు నిర్మించడం అందరికీ తెలిసిందే. అదే మనుషులకైతే ఒకింత ఆశ్చర్యమే మరి! అప్పుడెప్పుడో తమిళనాడులో నటి ఖుష్బూకు అభిమానులు గుడి కట్టించారు. అదే రాష్ట్రంలోని అరియలూర్ జిల్లాలో భార్యపై గల ఇష్టంతో ఓ భర్త ప్రేమ మందిరం నిర్మించాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఓ భార్యామణి మరణించిన భర్త జ్ఞాపకాలను పదిలపరుస్తూ గుడి కట్టారు. ఆమధ్య శ్రీకాకుళంలో ఓ పుత్రుడు తల్లికి, విశాఖపట్నంలో ఇంకో కొడుకు తండ్రికి ఆలయాలు నెలకొల్పి వార్తల్లోకెక్కారు. వీటన్నింటినీ పక్కన పెడితే, కేరళ రాష్ట్రంలో విశేషమైన జ్ఞాన ఆలయం ఒకటుంది. కన్నూర్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో చెరుపుళ పట్టణ సమీపంలోని ప్రపోయిల్ అనే చిన్న గ్రామంలో పుస్తకానికి గుడి కట్టారు. లోపల దేవుళ్లుండరు. పుస్తకమే దేవత. దానికే పూజాదికాలు నిర్వహిస్తారు. నైవేద్యంగా సమర్పించిన పుస్తకాలనే తిరిగి ప్రసాదంగా వితరణ చేస్తారు. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఈ గుడికి వెళ్లి పూజలు చేయవచ్చు. ఇక్కడ పూజారులు ఉండరు, హుండీలు కనిపించవు. ఇది నవపురం మతాతీత ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు.తొలి అడుగు...జ్ఞానం కంటే ఉన్నతమైన మతం మరొకటి ఉండదని భావించిన విద్యావేత్త, చెరుపుళ విన్నర్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.నారాయణ ఈ పుస్తకాలయ రూపశిల్పి. సహజ సిద్ధమైన పెద్ద రాతిపై విగ్రహ రూపంలో పుస్తకం దర్శనమిస్తుంది. దీన్ని కాసర్గోడ్ జిల్లా కంబల్లోర్ గ్రామానికి చెందిన సంతోష్ మానసం అందంగా చెక్కారు. 2021 మార్చి 4న ఆలయ నిర్మాణం ప్రారంభం కాగా, అక్టోబరులో విగ్రహ ప్రతిష్ఠాపన జరిపి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. రెండు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయం చుట్టూ పచ్చదనం పరచుకుని ఉంటుంది. సందర్శకులు ప్రవేశ ద్వారం గుండా లోపలికి అడుగిడగానే నిశ్శబ్దం రాజ్యమేలుతోందా అన్నట్లు ఉంటుంది. ప్రవేశ ద్వారం గోడలు కేరళ రాష్ట్ర సాహితీ సాంస్కృతిక వారసత్వాలను వివరించే శిల్పాలతో నిండి ఉంటాయి. ఒకవైపు బుద్ధుడి చిత్రం, మరో చిహ్నంగా రాతి దీపం కనిపిస్తుంటాయి. ఆలయ ప్రధాన దేవత ఒక భారీ కాంక్రీటు పుస్తకం. 30 అడుగుల ఎత్తులో సహజమైన రాయిపై ఉంది. దాని చుట్టూ అనేక పొత్తాలు చిత్తాన్ని దోచే రీతిలో అందంగా అలంకరించి ఉంటాయి. ఒకవైపు పాత, కొత్త పుస్తకాల వాసన, మరోవైపు చందన పరిమళాలు, ఇవి చాలవన్నట్లు వేసిన ధూపం తాలూకు గుబాళింపు నాసికా రంధ్రాలకు చేరి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.ఆలయానికి రూ.7.6 కోట్లువారసత్వ ఆస్తిగా రెండెకరాల భూమి దక్కించుకున్న నారాయణ స్వయంకృషితో సంపాదించిన ప్రతి రూపాయి ఈ ఆలయం కోసం వెచ్చించారు. తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి ఫర్వాలేదు. గుడి కోసం ఇప్పటి వరకు రూ.7.6 కోట్లకుపైగా ఖర్చుచేశారు. ఇందులో కొద్ది శాతం మాత్రమే విరాళాలుగా స్వీకరించారు. ఈ నాలుగేళ్లలో భక్తులు నైవేద్యంగా సమర్పించిన పుస్తకాల సంఖ్య ఐదు వేలకు చేరుకుంది. ఆలయం ఆవరణలో రచయితలు చక్కగా కూర్చుని రాసుకునేందుకు వీలుగా మూడు షెడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటా రెండు ప్రధాన ఉత్సవాలను నిర్వహిస్తారు. సాహిత్య చర్చలు, నృత్య ప్రదర్శనలు, పుస్తకావిష్కరణలు, సెమినార్లు, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా రచయితలకు అవార్డులు ప్రదానం చేస్తారు. జ్ఞానోదయం దైవత్వానికి నిజమైన మార్గమని ఈ ఆలయం దర్శించుకున్నవారికి అనుభూతి కలుగుతుంది. జ్ఞానం, విద్య, మానవ పురోగతి, ఆధ్యాత్మిక ప్రగతికి ఈ ఆలయం పునాది అనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జ్ఞానారాధన కేంద్రం. ∙ -
టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!
రొయ్యల పాప్కార్న్కావలసినవి: రొయ్యలు– 25 పైనే (మరీ చిన్నవి కాకుండా, నచ్చిన సైజ్ ఎంచుకోవచ్చు. తల, తోక తీసి, శుభ్రం చేసుకోవాలి)అల్లం–వెల్లుల్లి పేస్ట్– 2 టేబుల్ స్పూన్లుకారం– ఒక టీ స్పూన్ గరం మసాలా– ఒక టేబుల్ స్పూన్+ఒక టీ స్పూన్నిమ్మరసం– ఒక చెక్కమైదా, జీలకర్ర పొడి– ఒక టేబుల్ స్పూన్ చొప్పునబ్రెడ్ పౌడర్– పావు కప్పుపైనేగుడ్డు– 2 (2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు కలుపుకుని పక్కనపెట్టుకోవాలి)ఉప్పు– తగినంతనూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా రొయ్యలు ఒక గిన్నెలో తీసుకుని, అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, నిమ్మరసం వేసి, ఆ మిశ్రమం రొయ్యలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక చిన్న బౌల్లో బ్రెడ్ పౌడర్, జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కో రొయ్యను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి, ఆపై బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాంగో కేక్కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పులుబేకింగ్ పౌడర్– ఒక టీ స్పూన్బేకింగ్ సోడా– అర టీ స్పూన్ఉప్పు– చిటికెడు గడ్డ పెరుగు– ఒక కప్పుపంచదార– ముప్పావు కప్పుపాలు, నూనె– అర కప్పు చొప్పునవెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్మామిడి పండ్లు– 2 (బాగా పండి, తియ్యగా ఉండాలి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)నీళ్లు– కొద్దిగానిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్మీగడ– అర కప్పువైట్ చాక్లెట్– 200 గ్రాములు (మార్కెట్లో దొరుకుతుంది)మ్యాంగో ఐస్క్రీమ్– పావు కప్పు పైనేతయారీ: ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని బాగా కలిపి, జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. అనంతరం అందులో నూనె, వెనీలా ఎసెన్స్ వేసి మరోసారి కలపాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు గోధుమ మిశ్రమాన్ని, పెరుగు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి, నెయ్యి పూసిన వెడల్పాటి పాత్రలో వేసుకుని, రెండు అంగుళాల మందంలో, సమానంగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని, చల్లారాక, çముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను మిక్సీలో వేసుకుని, వాటిలో నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసుకుని జ్యూస్లా చేసుకోవాలి. ఆ జ్యూస్ని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీగడను కరిగించి, దానిలో కరిగించిన వైట్ చాక్లెట్ను కలపాలి. దానిలో మామిడిపండు గుజ్జు వేసుకుని, క్రీమ్లా అయ్యే వరకూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ముక్క తీసుకుని, దానిపై పెరుగు మిశ్రమాన్ని అర అంగుళం మందంలో పూసుకుని, దానిపైన కొద్దిగా ఐస్క్రీమ్ పావు అంగుళం మందంలో పరుచుకోవాలి. మరో కేక్ ముక్కను దానిపై పెట్టుకోవాలి. ఇదే మాదిరి అన్ని ముక్కలు పెట్టుకుని.. వాటిపై మరోసారి పెరుగు మిశ్రమం, ఐస్క్రీమ్తో నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.అసోమీయా తిల్ పిఠాకావలసినవి: బియ్యం– ఒక కప్పుబెల్లం తురుము, నల్ల నువ్వులు– అర కప్పు చొప్పుననీళ్లు, నూనె, ఉప్పు– సరిపడాతయారీ: ముందుగా బియ్యాన్ని 3 లేదా 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి, ఒక గంట పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు నల్ల నువ్వులను దోరగా వేయించి, కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ నువ్వుల మిశ్రమాన్ని బెల్లం తురుములో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యప్పిండిలో సరిపడా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా దోసెల పిండిలా కలుపుకోవాలి. ఆపై పాన్ మీద కొద్దికొద్దిగా నూనె వేడి చేసుకుని, చిన్న చిన్న అట్లు వేసుకోవాలి. అట్టు కొద్దిగా ఉడుకుతుండగా, మధ్యలో నువ్వులు–బెల్లం మిశ్రమాన్ని ఉంచి నచ్చిన విధంగా రోల్ చేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. -
ఈ వారం కథ: రీట్వీట్
నువ్వు అలా స్క్రోల్ చేస్తున్నావు. డెడ్ లైన్ల మధ్య ఓ క్షణం. నైట్ లాంప్ వుండీ లేనట్లు వెలుగుతోంది. ప్లాస్టిక్ కంటైనర్లోని గోట్ బిర్యానీ చల్లారిపోయింది. క్యాంపస్ అంతా నిశ్శబ్దంగా వుంది, మంచు తెరలతో మూసుకుపోయినట్లు. ఎక్కడి నుంచో పోలీసు హారన్లు. నువ్వు ఏదో చెప్పాలనో, మాట్లాడాలనో అనుకోవటం లేదు. అది నీ తత్త్వం కాదు. అంత మాత్రాన నీకు హృదయం లేదని కాదు. పేదరికం నీ పెదాల్ని మూసేసింది. కానీ ఆ రోజు, నువ్వొక ఫొటో చూశావు. చిన్న పిల్ల. ఆరేడేళ్ళు వుంటాయేమో. ఆ పసిదాని మొహం సగం బూడిదలో కప్పడిపోయింది. ఆ తల్లి ఏడుపు ఆ ఫొటోలో నుంచి నీ గుండెను తాకింది. శిథిలాల మధ్య చిక్కుకున్న ఆ మృతదేహాన్ని చూడలేక కళ్ళు వాల్చుకున్నావు. ఆ పసిదాని పేరు నీకు తెలీదు. తెలియక్కర లేదు కూడా. దుఃఖానికి వూర్లు, పేర్లు, దేశాలు, భాషలు అక్కరలేదు. ఆ రోజుకి ఇంకేమీ రాయలేకపోయావు. ఎన్ని మరణాలు? ఎన్ని దేహాలు? ఎన్ని యుద్ధాలు? ఎంత విధ్వంసం? "Being human is not a crime''ట్వీట్లో వున్నది ఆ ఒక్క వాక్యమే! ఆ వాక్యం రాసింది నువ్వు కాదు. నువ్వు దాన్ని ఎడిట్ చేయలేదు. రీట్వీట్ జస్ట్ రీట్వీట్ చేశావు. ఒక్క క్లిక్. దాహంతో వున్న వాళ్ళకు ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లు. That's it. అనుకోకుండా ఆ రీట్వీట్ వైరల్ అయింది. కామెంట్లు వరదలాగా ముంచెత్తాయి.కొందరు నిన్ను ప్రశంసిస్తే, మరికొందరు "unamerican' అని విమర్శించారు. ఇమ్మిగ్రెంట్లకు అసలేం పని ఈ దేశంలో అన్నారు. వెళ్లిపొమ్మని కొందరంటే, వెళ్లగొడతామని మరికొందరన్నారు. రాడికల్ అని కొందరంటే, ట్రైటర్ అన్నారు మరికొందరు. నిజం చెప్పద్దు. ఒక్కసారి నీ రీట్వీట్, ఆ స్పందన, ఆ కామెంట్లు ఆ పాపులారిటీ నువ్వు భలే ఆనందించావు. కానీ ఆ ఆనందానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో అప్పుడు నువ్వూహించలేదు. నీ పాలిట అదే ఉరితాడవుతుందని. అదే నీకు వ్యతిరేక సాక్ష్యం అవుతుందని. ఒక్క వాక్యం. Hashtags లేవు. నినాదాలు లేవు. యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనలో అనుకోకుండా నువ్వొక ప్లకార్డు పట్టుకున్నావు. డైలీ పెన్సిల్వేనియన్ పత్రిక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో నువ్వే ప్రముఖంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు మీ యూనివర్సిటీలో భారతి అంటే మరో సుబ్రహ్మణ్య భారతి. ఈ ప్రదర్శనలు, ఈ ట్వీట్లు, ఈ డిబేట్లు వీటన్నింటితో నీలోపలి కవిత్వం మళ్ళీ బయటకొచ్చింది. నీ కవితలు స్టూడెంట్స్ నోటి వెంట పద్యాలయ్యాయి.∙∙ మరోవైపు ఏం జరుగుతోందో నువ్వు ఊహించలేకపోయావు. వీటన్నింటినీ ఓ నిఘా కన్ను చూస్తోంది. నిన్నే, నిన్నే, నిన్నే. జింకలకు తెలియాలి సింహాలు ఎప్పటికైనా వేటాడి తీరతాయని. ఇమ్మిగ్రెంట్లకు తెలియాలి ఎప్పటికైనా తిరిగెళ్లిపోవాలని. నీ ఒంటి రంగు ఎప్పటికీ తెలుపు కాబోదని. నీ నిక్ నేమ్ ఎప్పటికీ ‘బ్రౌనీ’నే అని. నువ్వు హక్కులడిగితే, వాళ్ళు నీ బాధ్యతలు గుర్తుచేస్తారు. లిబర్టీ బెల్ ఉన్న ఊర్లో లిబర్టీ నేతిబీరకాయలో నెయ్యి. తెలుసుకొనవే చెల్లీ, అలా మసలుకొనవే తల్లీ!∙∙ నీకు తెలియదు నీ పేరు అట ingtonలోని ఓ అధికార కార్యాలయపు టేబుల్ మీద ఓ ఫోల్డర్ లోకి చేరుతుందని. నీకు తెలియదు నీ పేరు ‘భారతి రాఘవన్’ ఒక జాబితాలోకి అంత సులువుగా చేరిపోతుందని. నీకు తెలియదు నీ వొంటి రంగు, నీ వీసా స్టేటస్, నీ కోపం, నీ ఆలోచన ఇవి చాలు నువ్వు నేరస్థురాలివని నిర్ధారించడానికని. నీకు తెలియదు ఆ అల్గారితమే ఒక ఆయుధమవుతుందని. ఎందుకంటే, నువ్వొక ఇమ్మిగ్రెంట్వి. నీ ధర్మాగ్రహం ఓ ఎర్రజెండా. ప్రతి జెండా ఓ ప్రమాద హెచ్చరిక! ఎక్కడేం జరుగుతోందో వూహించలేని నువ్వు, చల్లారిన నీ గోట్ బిర్యానీని తినటానికి ఉపక్రమించావు. కానీ నీ కళ్ళు పదే పదే ఆ దృశ్యాన్ని చూపిస్తుంటే, తినలేక, తినకుండా పారేసే ఆర్థిక శక్తి లేక రేపటి కోసం దాచి పెట్టావు. నీ ఇవాళనీ రేపటినీ మార్చేసింది అది. కాన్ఫరెన్స్ పేపర్ అసంపూర్తిగా వదిలేసి రూమ్కి బయలుదేరావు. టైమ్ చూశావు. వచ్చే నెల అక్క పెళ్లి ఆలోచనలతో నీ మొహాన ఓ చిరునవ్వు వెలిగింది.∙∙∙INTERNAL DHS MEMO & CLASSIFIEDసబ్జెక్ట్: భారతి రాఘవన్ డేట్ ఆఫ్ బర్త్: 04/14/1997సిటిజన్షిప్: ఇండియా స్టేటస్: ఎఫ్–1 యూనివర్సిటీ: యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా రెడ్ ఫ్లాగ్: యు.ఎస్. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు. సాక్ష్యం: సోషల్ మీడియా యాక్టివిటీ. రికమెండేషన్: సెక్షన 212(a)(3)(B)కింద వీసా రద్దుకేటగిరీ: సంఘ వ్యతిరేక సంస్థలకు మద్దతు నోట్: జాతీయ భద్రతా ముప్పు యాక్షన్: సాఫ్ట్ డెటెన్షన్ ప్రోటోకాల్. ∙∙ ఓ వారం తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ ద్వారం దగ్గర నీ బ్యాడ్జ్ పని చేయలేదు. కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టి వెళ్లిపోయావు. అక్క పెళ్లి కోసం ఇండియా వెళ్ళే హడావిడిలో. నీ వీసా స్టేటస్ మారిందని నీకు తెలియను కూడా తెలియదు. ఎయిర్పోర్టు రెండో సెక్యూరిటీ గార్డు కూడా నీ వైపు చూడకుండా కంప్యూటర్ వంక చూస్తున్నప్పుడు, నీకేం అర్థం కాలేదు. నీ మొహంలో భయం, ఆందోళన.‘‘మేమ్, ప్లీజ్ కొంచెం ఈ పక్కకు రండి’’ సెక్యూరిటీ గార్డు రిక్వెస్ట్గా అడిగినా, అందులో అధికారమే ధ్వనిస్తోంది. ‘‘ఏమైనా ప్రాబ్లమా సార్?’’ అతి వినయంగా అడిగిన నీ మాటలకు, ‘‘ఇది జస్ట్ రొటీన్’’ చెప్పాడతను. చాలాసార్లు అది నిజమే. కానీ ఈసారి కాదు. ∙∙ ఏజెంట్స్ ఫీల్డ్ నోట్స్: సబ్జెక్ట్ కామ్గా కనిపించింది. ఏ మత సంస్థలతోనూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. మానవహక్కులు, అకడమిక్ ఫ్రీడంలాంటి పదాలు తరచూ ప్రయోగించింది. ఆ పోస్ట్ రీట్వీట్ చేయటంలో కానీ, ఆ ప్రదర్శనలో ప్లకార్డ్ పట్టుకోవడంలో కానీ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. పదే పదే ప్రశ్నించాకా,‘‘ఎవరి పట్లనైనా మానవత్వంతో స్పందించటం నేరమా?’’ అని ఎదురు ప్రశ్నించింది. ∙∙ నీ చేతికి వేసిన సంకెళ్ళు నిన్ను చూసి చులకనగా నవ్వాయి. ఆ నిశ్శబ్దం నిన్ను భూతంలా చుట్టుముట్టి భయపెట్టింది. వాళ్ళంతా చాలా ప్రశాంతంగా ఇది చాలా అలవాటైన పనిలాగా చేసుకుంటూ వెళ్లిపోవటం నిన్ను నిలువునా కూల్చేసింది. నువ్వు మొదట్లో మామూలుగానే అడిగే ప్రయత్నం చేశావు, కానీ నీ గొంతులో కోపం, భయం, ఆందోళన అన్నీ వాళ్ళకు కనిపించాయి. వేటాడే పులికి తన నోటికి చిక్కిన జింక మొహం చూస్తే చాలు. తినక ముందే కడుపు నిండిపోతుంది. వాళ్ళ మొహాలు నీ కంటికి వేటాడే సింహాల్లాగానే కనిపించాయి. ‘‘నా మీద పెట్టిన చార్జ్ ఏమిటి?’’ ‘‘దేశ భద్రతకు ముప్పు.’’ దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్రజెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు.∙∙ ఆ రాత్రి నిన్ను వ్యాన్లో మరో చోటికి తీసుకెళ్లారు. అక్కడ కిటికీల్లేవు.కొందరు గార్డులు నీ వంక సానుభూతిగా చూశారు. కొందరు ఇది మా ఉద్యోగం అన్నట్లు కళ్ళతోనే చెప్పుకున్నారు. కొందరి కళ్ళల్లో బాగా శాస్తి జరిగిందన్న ఆనందం. నీ దవడ బిగుసుకుంది. నీ పళ్ళు గట్టిగా కరుచుకోవటం వల్లనో, మరి దేని వల్లనో నాలుకకి రక్తపు రుచి తెలిసింది. ఫోన్ కాల్ ట్రాన్ స్క్రిప్ట్: ICE మానిటర్డ్ లైన్ ‘‘చిన్నీ’’ ‘‘అమ్మా’’ వొణికిన గొంతులోంచి కన్నీళ్లు లోపలకి ఇంకిపోతున్నాయి. ‘‘మొన్న ఫ్లయిట్ ఎందుకు కాన్సిల్ చేశావ్? అంతా ఓకే కదా? నిజం చెప్పు. ఏమైనా జరిగిందా? ఏదేదో వింటున్నాం ఇక్కడ’’ భారతి సమాధానం ఇవ్వకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది. ‘‘అంతా బాగానే వుంది మీరు వర్రీ కావద్దు. వీసా సమస్యలు. పేపర్లు సబ్మిట్ చేశా. బహుశా అక్క పెళ్ళికి నే రాలేకపోవచ్చు’’‘‘నీ వీసా Extensionకి ఎప్పుడనగానో అప్లై చేశావుగా ’’‘అనుమానాలు ముందు పుట్టి తర్వాత అమ్మలు పుట్టి వుంటారు. అంత తొందరగా దేన్నీ నమ్మరు.’ ‘‘ఇక్కడ పరిస్థితులు కొంచెం టెన్షన్గా వున్నాయి. నేను ఫోన్ చేయకపోతే కంగారు పడొద్దు.’’ తన మాటలు తనకే నిర్జీవంగా వినిపించాయి. ఫోన్ కాల్ టైమ్ అయిపోయింది. ∙∙ Asylum కోసం మిగతా బందీలకు వీలు కుదిరినప్పుడల్లా ఉత్తరాలు రాసి పెడుతున్నావు నువ్వు. చేయటానికి వేరే పని ఏముంది? ఆలోచనల్లో మునిగిపోవటం తప్ప. ప్రపంచానికి పెదరాయుడులాంటి అమెరికానే గెంటేస్తుంటే, ఇంకే దేశానికిAsylum అప్లికేషన్స్ పెట్టుకోగలరు ఎవరైనా? కదా!∙∙ ఆ సెంటర్లో అనేక దేశాల వాళ్ళు, భాషల వాళ్ళు. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళతో పాటు, నేరాలు ఆపాదించబడ్డ వాళ్ళు కూడా. Like Bharati.. స్పీడ్గా కారు నడిపి ఫైన్ కట్టని చిన్న నేరాల నుంచి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు: అందరికీ ఒకటే డిటెన్షన్ సెంటర్. కాపలా కాస్తున్న వారి కళ్ళకు ఎవరేమిటో తెలియదు. తెలియక్కరలేదు కూడా. గార్డులకు, డిటైనీలకు తెలిసింది నల్లటి ఊచలు మాత్రమే!ఊచలు పట్టి వుంచేది వ్యక్తులనే కానీ వ్యక్తిత్వాలను కాదు. ఆవేశాన్నే కానీ ఆలోచనలను కాదు. దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్ర జెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు. కల్పనా రెంటాల(చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
స్మార్ట్ అండ్ బెస్ట్ క్లీనర్..!
అందంగా మెరిసిపోవడానికి నచ్చిన మేకప్ వేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ మేకప్ వేసుకునే బ్రష్లను శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. నిజానికి మురికి మేకప్ బ్రష్లు బ్యాక్టీరియాకు నిలయంగా మారిపోతాయి. అలాంటి బ్రష్లు వాడితే చర్మ సమస్యలు తప్పవు. అంతేకాకుండా మేకప్ వేసుకునేటప్పుడు కూడా మనం ఎంచుకున్న కలర్ కాకుండా మరో కలర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్తో మేకప్ బ్రష్లను సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.ఈ ఆటోమేటిక్ క్లీనర్ మేకప్ బ్రష్లను సమర్థంగా శుభ్రం చేస్తుంది. ఇది ఒక స్పిన్నర్, క్లీనింగ్ మ్యాట్తో వస్తుంది. బ్రష్ను సరైన అడాప్టర్కు కనెక్ట్ చేసి, క్లీనింగ్ బౌల్లో కొద్దిగా నీళ్లు, క్లీనింగ్ లిక్విడ్ వేసుకుని ఆపై, బటన్ను నొక్కితే చాలు. బ్రష్ను నీటిలో తిప్పుతూ అదే క్లీన్ చేస్తుంది. మేకప్ బ్రష్ మీద పేరుకుపోయిన మొండి అవశేషాలను, ధూళిని ఈ డివైస్ ఇట్టే తొలగిస్తుంది.చిత్రంలోని క్లీనర్తో వచ్చే క్లీనింగ్ మ్యాట్ వివిధ రకాల బ్రష్ల కోసం వేర్వేరు టెక్స్చర్లను కలిగి ఉంటుంది, ఇది మరింత లోతుగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్ మహిళలకు, ముఖ్యంగా మేకప్ వేసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక చక్కటి బహుమతి. ఇక ఇది నీళ్లతో బ్రష్ని క్లీన్ చేయగానే, డివైస్ నుంచి నీళ్లు ఉన్న కప్ను వేరు చేసుకుని, ఆ నీటిని పారబొయ్యాలి. ఆ తర్వాత ఆ కప్ను మరోసారి మంచి నీటితో క్లీన్ చేసుకుని మళ్లీ డివైస్కి అటాచ్ చేసి, బ్రష్ను దానిలో ఉంచి, బటన్ ఆన్ చేసుకుని, తడి లేకుండా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు బ్రష్లను క్లీన్ చేసుకునేటట్లయితే మేకప్ బ్రష్లు ఎక్కువ మన్నికతో ఉంటాయి. (చదవండి: 'టీ బ్యాగులు' తింటే ఏమవుతుందో తెలుసా..!) -
జస్ట్ కాఫీతో బయటపడ్డ నేరం..! కానీ పోలీసులే విస్తుపోయేలా..
2000 హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో పదమూడు నెలల వయసున్న సాకీ అనే రాయల్ బెంగాల్ జాతి ఆడపులిని కొందరు దుండగులు చంపేశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ సంఘటన 2000 అక్టోబర్ 5న జరిగింది. ఈ సంఘటనపై బహదూర్పుర పోలీస్స్టేషన్లో నమోదైన కేసు సీఐడీ వరకు వెళ్లింది. తర్వాత సీబీఐ విచారణకు డిమాండ్ వచ్చింది. దీనిపై అనేక రాజకీయ అంశాలు తెరపైకి రావడంతో పోలీసులు సాకీ హంతకుల సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయలు రివార్డుగా ప్రకటించారు. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు కప్పు కాఫీతో యాదృచ్ఛికంగా కొలిక్కి వచ్చింది.మహారాష్ట్రకు చెందిన మహ్మద్ సలావుద్దీన్ హైదరాబాద్కు వలసవచ్చి, రియాసత్నగర్లో స్థిరపడ్డాడు. ఆటోడ్రైవర్గా పనిచేస్తూ, జల్సాలకు అలవాటుపడ్డాడు. డబ్బు కోసం చిన్న చిన్న చోరీలతో నేరజీవితం ప్రారంభించాడు. వీరప్పన్ స్టోరీలు విన్న ఇతడి కన్ను గంధపు చెక్కలపై పడింది. హైదరాబాద్లోని జూ పార్క్లో గంధపు చెట్లు ఉన్నట్లు తెలుసుకుని, వాటిని కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు. వెన్నెల లేని చీకటి రాత్రుల్లో జూ పార్క్ ప్రహరీ గోడ దూకి లోపలకు వెళ్లేవాడు. అక్కడున్న గంధపు చెట్లను నరికి తీసుకువెళ్లి అమ్ముకునేవాడు. ఈ కేసుల్లో అరెస్టు కావడంతో అతడికి ‘హైదరాబాదీ వీరప్పన్’ అనే పేరు వచ్చింది. సలావుద్దీన్ ఇళ్లల్లో చోరీలు, చైన్ స్నాచింగ్స్ కూడా చేసేవాడు. చోరీ సొత్తు పంపిణీ వివాదంలో ఒక సహచరుడిని హత్య చేసిన ఆరోపణలపై కేసు కూడా నమోదైంది. గంధపు చెట్ల కోసం ఎప్పటిలాగే 2000 అక్టోబర్లో జూ పార్క్లోకి వెళ్లాలని భావించిన సలావుద్దీన్తో అతడి స్నేహితుడైన ఇస్మాయిల్ ఓ చాలెంజ్ చేశాడు. ‘జూలో ఉన్న పులిని చంపడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు ఆ పని చేసి చర్మం, గోళ్లు తేగలవా?’ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో సలావుద్దీన్ అదే నెల 4 రాత్రి తన అనుచరులైన అహ్మద్, సమద్లతో కలసి జూపార్క్ వెనుక ఉన్న మీర్ఆలం ట్యాంక్ వైపు నుంచి లోపలకు ప్రవేశించాడు. సఫారీకి సమీపంలోని పులుల ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు. అక్కడ తొమ్మిది బోనుల్లో 14 పులులు ఉండగా, వాటిలో సాకీని ఎంపిక చేసుకున్నాడు. బోనులో ఉన్న దాని మెడకు ఉరి బిగించి చంపేసిన సలావుద్దీన్– తన వెంట తెచ్చుకున్న కత్తితో దాదాపు నాలుగు గంటలు ప్రయత్నించి దాని చర్మం, గోళ్లు ఒలిచేశాడు. ఈ ఘాతుకాన్ని చూసిన మిగిలిన పులులు తీవ్ర షాక్కు గురయ్యాయి. కొన్ని రోజుల పాటు అవి ఆహారం సైతం తీసుకోలేదు. సాకీ హత్యపై బహదూర్పుర పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. జూ పార్క్లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సీఐడీ అధికారులు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసినా, చిన్న క్లూ కూడా లభించలేదు. సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించినా ఫలితం దక్కలేదు. ఈలోగా సాకీ హత్య రాజకీయ రంగు పులుముకుంది. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ నేత క్షుద్ర పూజల కోసం ఇక్కడి కొందరు పెద్దలే సాకీని చంపి, దాని చర్మం, గోళ్లు పంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాకీని చంపిన తర్వాత సలావుద్దీన్ సైతం చోరీ, స్నాచింగ్ తదితర కేసుల్లో మూడుసార్లు పోలీసులకు చిక్కినా నోరు విప్పలేదు. 2005 నాటికి సాకీ కేసు కూడా కొలిక్కి చేరని కేసుల జాబితాలోకి చేరిపోయింది. ఆ రోజుల్లో సలావుద్దీన్ మీద పోలీసుల కళ్లు ఉండేవి. 2005 ఫిబ్రవరిలో సలావుద్దీన్ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అప్పట్లో రాజీవ్ త్రివేది హైదరాబాద్ నేర విభాగానికి అదనపు పోలీసు కమిషనర్గా ఉండేవారు. సాధారణంగా సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ప్రతి ఘరానా దొంగనూ ఆయన ఎదుట హాజరుపరచే వాళ్లు. అధికారులు సలావుద్దీన్ను అలానే హాజరుపరచారు. అతడి నేర చరిత్ర తెలుసుకున్న ఆయన ‘ఇంక మారవా?’ అంటూ కాస్సేపు ముచ్చటించారు. తాను కాఫీ తాగే సమయం కావడంతో సలావుద్దీన్ను కూర్చోబెట్టి, అతడికీ కాఫీ ఇచ్చారు. దీంతో రాజీవ్ త్రివేదీతో సలాదుద్దీన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. కాఫీ తాగడం పూర్తయ్యాక ఇంకేమేం నేరాలు చేశావంటూ రాజీవ్ త్రివేదీ ప్రశ్నించగా, ఐదేళ్ల కిందట జూపార్క్లో సాకీని తానే చంపానని బయటపెట్టాడు. ఆ మాట విన్న వెంటనే షాక్కు లోనైన పోలీసులు సలావుద్దీన్ అరెస్టు ప్రక్రియను వాయిదా వేశారు. అతడు చెప్పే మాటలపై నమ్మకం కుదరకపోవడంతో పదేపదే ప్రశ్నించారు. దీంతో తన మాట మీద నమ్మకం లేకపోతే అనుచరులను పట్టుకుని ప్రశ్నించాలని, మహారాష్ట్రలోని తన బంధువుల ఇంటికి వెళ్లి చూస్తే సాకీ చర్మం, గోళ్లు లభిస్తాయని చెప్పాడు. మహారాష్ట్ర వెళ్లిన బృందం వాటిని రికవరీ చేశాక పోలీసులు సలావుద్దీన్ను, అతడి అనుచరులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసుల సమక్షంలోనే తాను జైలు నుంచి పారిపోతానని, మళ్లీ నేరాలు చేస్తానని సవాల్ చేశాడు. దీనికి స్పందించిన రాజీవ్ త్రివేది ‘నిన్ను చర్లపల్లి జైలులో పెడుతున్నాం. ఎస్కేప్ కాగలిగితే రూ.లక్ష ఇస్తా’ అని అన్నారు. ఈ మాటనూ సలావుద్దీన్ సీరియస్గా తీసుకున్నాడు. 2005 ఫిబ్రవరి నుంచి జైల్లో ఉన్న అతడు పారిపోవడానికి అదను కోసం ఎదురు చూశాడు. చివరకు 2006 నవంబర్ 24న జైలు నుంచి తప్పించుకున్నాడు. దుప్పట్లను తాడుగా చేసుకుని, వాచ్టవర్ పైనుంచి దాని సాయంతో దిగుతూ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి నడుము విరగడంతో ఎక్కువ దూరం వెళ్లలేక సమీపంలోని పొదల్లో దాగుండిపోయాడు. మర్నాడు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న జైలు సిబ్బందికే చిక్కాడు. జైలు అధికారులు సలావుద్దీన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తనను కలసిన మీడియాతో ‘రాజీవ్ త్రివేది సాబ్ చేసిన సవాల్లో నేనే నెగ్గా. గాయం వల్ల ఆగిపోయినా, జైలు నుంచి అయితే ఎస్కేప్ అయ్యా. ఆయనకు ఈ విషయం చెప్పి రూ.లక్ష ఇప్పించండి. వైద్య ఖర్చులకైనా పనికొస్తాయి’ అని చెప్పి అవాక్కయ్యేలా చేశాడు. ఆ తర్వాత తన పాత పంథా కొనసాగిస్తూ చోరీలు, గంధపు చెట్ల నరికివేత చేసిన సలావుద్దీన్ కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉంటున్నాడు. శ్రీరంగం కామేష్ (చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..) -
సీజనల్ సైకాలజీ: వేసవి ప్రభావం దీర్ఘకాలం..
వేసవి కాలంలో పిల్లలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలనే విషయం గురించి మూడు నాలుగు వారాలుగా తెలుసుకుంటున్నాం. అయితే ఈ కాలంలో వచ్చే మార్పులు తాత్కాలికమా? దీర్ఘకాలికమా? వేసవి మనసులో కేవలం తాత్కాలిక మార్పులు కాకుండా, దీర్ఘకాలం ప్రభావితం చేసే సైకోబయలాజికల్ ప్రాసెస్లు కూడా జరుగుతాయని సీజనల్ సైకాలజీ, న్యూరో సైన్సు పరిశోధనలు చెబుతున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.దీర్ఘకాలిక ఆత్మవిశ్వాసంవేసవి వేడితో పెరిగిన సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోకెమికల్స్ తాత్కాలికంగా మూడ్ను పెంచుతాయని, శక్తిని పెంచుతాయని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’పై రోసెంథల్ (1984) చేసిన పరిశోధనను వెల్లడించింది. వేసవిలో ప్రారంభించిన ధ్యానం వంటివి మనల్ని మనం నియంత్రించుకునేందుకు రిజర్వ్లా పనిచేస్తాయని జపాన్లోని కియో యూనివర్సిటీలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనం కూడా తెలిపింది. ఉదాహరణకు నా దగ్గరకు కౌన్సెలింగ్ కోసం వచ్చిన కిరణ్ అనే ఐటీ ఉద్యోగి వేసవిలో ప్రారంభించిన ప్రాణాయామం, ఆపై ఏడాది పాటు కొనసాగించటం వలన అతని ఆందోళన స్థాయి, ఒత్తిడి 45శాతం తగ్గినట్లు తన జర్నలింగ్లో రికార్డ్ చేసుకున్నాడు. వేసవిలో వచ్చే మూడ్ బూస్ట్ను అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాల ఆత్మవిశ్వాసం సిద్ధమవుతుంది.అలవాటుగా మార్చుకోవాలివేసవిలో ఏర్పడిన కొత్త అలవాట్లు మెదడులో బలంగా ‘లాక్’ అవుతాయని స్మిత్, క్లీన్ 2017లో చేసిన అధ్యయనంలో తెలిపారు. ఇది కాగ్నిటివ్ సైకాలజీలోని హెబియన్ లెర్నింగ్తో కలిసి కాలంతో పాటు గాఢమవుతుంది. ఉదాహరణకు గత వేసవిలో నేను నిర్వహించిన వర్క్షాప్లో పొమోడోరో స్టడీ మెథడ్ గురించి చెప్పాను. సునీల్ అనే విద్యార్థి ఆ అలవాటును వేసవి తర్వాత కూడా కొనసాగించాడు. దీంతో ఈ ఏడాది అతని ఏకాగ్రత, మార్కులు గణనీయంగా మెరుగయ్యాయి. ఒక సీజనల్ అలవాటును 21 రోజుల నుంచి 90 రోజుల వరకు కొనసాగిస్తే అది దీర్ఘకాలిక అలవాటుగా మారుతుంది. బలపడే బంధాలువేసవిలో పెళ్లిళ్లు, కుటుంబ కలయికలు ఎక్కువగా జరుగుతాయి. ఇవి ఎమోషనల్ యాంకర్స్గా పనిచేస్తాయి. వేసవిలో ఏర్పడే ఈ సోషల్ బాండ్స్ ఆ తర్వాత ఆరునెలల పాటు ఒంటరితనాన్ని 30శాతం వరకు తగ్గిస్తాయని బార్బీ, గ్రాఫ్మన్ 2010లో జరిపిన అధ్యయనంలో వెల్లడించారు. ఉదాహరణకు నా క్లయింట్ రామకృష్ణ గత వేసవిలో తన బాల్యమిత్రుడిని కలిశాడు. ఆ తర్వాత తరచు అతనితో మాట్లాడుతూ తమ మధ్యనున్న బంధాన్ని బలంగా నిర్మించుకున్నాడు. ఫలితంగా అతని ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడిని నియంత్రించుకోగలిగాడు. పెరిగే సృజనాత్మకతవేసవిలో సృజనాత్మకత తారస్థాయిలో ఉంటుందని కాఫ్మన్ 2016లో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ కాలంలో కాగ్నిటివ్ ఫ్లెగ్జిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చూపించారు. దీన్ని హార్వర్డ్ క్రియేటివ్ లాబ్ 2021లో తిరిగి నిర్ధారించింది. ఉదాహరణకు సుశీల్ వేసవిలో ఆర్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఆ తరువాత అదే ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్ట్లో ప్రదర్శించటానికి అవకాశం దొరికింది.భావోద్వేగ ప్రజ్ఞను బలోపేతం చేసుకోండి వేసవిలో ప్రారంభించిన జర్నలింగ్ సీజన్తో పాటు మారే భావోద్వేగాలను గమనించడానికి అద్భుతమైన సాధనమని కాబట్–జిన్ 2003లో జరిపిన మైండ్ఫుల్నెస్ అధ్యయనంలో వెల్లడైంది. బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ ప్రకారం కూడా భావోద్వేగాల నియంత్రణలో ఇంట్రాస్పెక్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు గత వేసవిలో ఎమోషనల్ డైరీ ప్రారంభించిన అనిత ఆందోళన తగ్గడంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. వేసవి తర్వాత పాటించవలసిన టిప్స్...వేసవిలో మొదలైన ధ్యానం, జర్నలింగ్ను ఒక అలవాటుగా మార్చుకోండి. ప్రతినెల ఒక రోజు ఇంట్రాస్పెక్షన్కు కేటాయించండి. మా బంధాలను కొనసాగించడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక మెసేజ్ పంపించండి. వేసవిలోని నిద్ర అలవాటును ఏడాది పొడవునా కొనసాగించండి. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త పుస్తకం చదవండి.మీ భావోద్వేగాలను ఎలా తట్టుకున్నారనే విషయం జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయండి.ప్రతీ సీజన్లో 30 రోజులు డిజిటల్ డిటాక్స్ చాలెంజ్ చేపట్టండి. ఒక కొత్త స్కిల్ను మీ చదువులో భాగం చేసి, మాస్టర్ చేయండి. క్రియేటివ్ ప్రాజెక్ట్స్కు డెడ్లైన్స్, గోల్స్ పెట్టుకోండి. సీజనల్ రిఫ్లెక్షన్ రిపోర్ట్ రాయడం ద్వారా మీ ఇంట్రాస్పెక్షన్ను శక్తిమంతం చేయండి. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: Summer Holidays: ట్రావెల్ ఎక్స్పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?) -
ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!
‘అద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్ అందరూ మ్యానేజ్ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్ లైఫ్ ఆఫ్ ఏ క్రూజ్’ పేరుతో యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్ క్లీనింగ్ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తినడం, ఎంజాయ్ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు. (చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!) -
మనమంతా ఒక్కటే... శాంతే మార్గం!
పోప్ లియో–14 ఈస్టర్ ఆది వారం రోజు ప్రసంగిస్తూ చెప్పిన ‘మనమంతా ఒక్కటే’ అనే మాటలు ప్రపంచంలో శాంతి నెలకొనడానికి ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలియ చేస్తున్నాయి. మే 8న 267వ అగస్టినియన్ పోప్గా, సెయింట్ పీటర్ వారసుడిగా ఎన్నికైన పోప్ లియో మే 18న ఆ సర్వోన్నత చర్చి పదవిని స్వీకరించనున్నారు. రెండు వేల ఏళ్ల క్యాథలిక్ చర్చి చరిత్రలో ఆయన తొలి అమెరికన్ పోప్ కావడం విశేషం. అంతే కాదు ద్వంద్వ పౌరసత్వాలు (అమెరికన్, పెరువియన్) కలిగిన తొలి పోప్ కూడా ఆయనే. పారిశ్రామిక యుగం తొలి నాళ్లలో సామాజిక న్యాయం కోసం, కార్మికుల హక్కుల కోసం గళమెత్తి నిరసన తెలిపిన పోప్ లియో–13 గౌర వార్థం ఆయనకు ‘లియో–14’ అనే పాపల్ పేరు (పోప్ అయ్యాక పెట్టే పేరు) పెట్టారు. ఆయన అసలు పేరు రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివస్ట్.పోప్ లియోది అమెరికాలోని చికాగో. కానీ జీవితంలో ఎక్కువ భాగం పెరూలోని చిక్లాయోలో గడిపారు. పెరువి యన్ జీవనశైలిలో ఆయన మమేకమై వారితో కలిసి పోయారు. కేవలం ఆ భాష నేర్చుకోవడంతోనే ఆగిపో కుండా వారి జీవితాల్లోని పలు పార్శా్వలను పరిశీలించారు. వారి బాధల్నీ, వేదనల్నీ గమనించారు. అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడుతూ మారుమూల పల్లెల్లో సైతం ఆయన ప్రయాణించారు. ఎల్లవేళలా శాంతి, న్యాయం, మతస్వేచ్ఛ, సమానత్వం, దేశభక్తి, మనిషిని మనిషిగా గౌరవించడం వంటి అంశాల కోసం పని చేశారు. అందుకే పెరువియన్లు ఆయనను తమ కొత్త నాయకుడని పిలుస్తారు. ఇక పోప్ పదవిని ఓ అమెరికన్ స్వీకరిస్తాడన్న నమ్మకం చాలా మందికి చాలా కాలంపాటు లేదు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు పోప్ లియో ఆ పదవిలోకి వచ్చి అమెరికన్ల ఆధ్యాత్మిక అంతస్తును పెంచారు.1982లో ప్రీస్ట్గా మారిన పోప్ లియోకు చర్చి చదు వులో పలు డిగ్రీలు ఉన్నాయి. ఇతరుల మాటలు ఆలకించడంలో, వారి అభిప్రాయాలను గౌరవించడంలో పోప్ లియోది అందె వేసిన చెయ్యి. ఈ గుణమే ఆయనను తోటి వారికి, అంతర్జాతీయ నేతలకు దగ్గర చేశాయి. ఆంగ్లం, స్పానిష్, ఇటాలియన్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలు అనర్గ ళంగా మాట్లాడగలిగిన పోప్ లియో ఈ బహుభాషలను ఆడంబరం కోసం కాక, ప్రపంచంలోని అనేకులతో నేరుగా సంభాషించి, వారితో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఉపయోగిస్తున్నారు. 2004, 2006లలో రెండుసార్లు లియో భారతదేశాన్ని సందర్శించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన ఎటువంటి ప్రత్యేక వసతులూ కోరలేదు. చాలా నిరాడంబరంగా ఉన్నారు. ఆయన పద్ధతి, సామాన్య జీవనశైలి భారతీయులను ఆకట్టుకుంది.పోప్ లియో రాబోయే రోజులలో ఎటువంటి ప్రభావం చూపబోతున్నారో ఆయన వెల్లడి చేస్తున్న భావాల ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రపంచం ప్రయత్ని స్తున్నది. ఈస్టర్ ఆదివారం నాడు ఆయన చేసిన తొలి ప్రసంగంలో ‘మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని దేశాధి నేతలను అభ్యర్థిస్తున్నాను’ అన్నారు. ఇప్పటికే రెండు మహా యుద్ధాలను చూసిన ప్రపంచం మరో భారీ యుద్ధా నికి సిద్ధంగా లేదని వివరించారు. తన ముందు పోప్గా ఉన్న ఫ్రాన్సిస్ సందేశమే తన సందేశమని ఆయన పేర్కొన్నారు. గాజాలో శాంతి నెలకొనాలని పిలుపునిచ్చారు. భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అభి నందించారు. చేతిలో ఆయుధం పెట్టుకొని ఎవరూ ప్రేమను పంచలేరని, యుద్ధాల నిరోధానికి ఐక్యరాజ్య సమితి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పోప్ లియో తన ప్రసంగంలో సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు దాని వెనకే ఉన్న దుష్పరిణామాల గురించి వివరించడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞానం ఎల్లప్పుడూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలనీ, సర్వమానవాళి శ్రేయస్సును కాంక్షించాలనీ అంటున్న ఆయన మాటల్ని బట్టి చూస్తే, ఈ ఏఐ యుగంలో ఆధునిక సాధువులా కనిపిస్తున్నారాయన.ఇటీవల అంతర్జాతీయ మీడియాతో పోప్ లియో మాట్లాడుతూ ‘మీడియాను నియంత్రిస్తే కొంతమేర ప్రజల ఆలోచనా విధానాన్ని నియంత్రించినట్లు అవుతుంది’ అన్నారు. క్రైస్తవులు సార్వజనీన మానవులని పోప్ మాట. అందర్నీ సమానంగా సోదరభావంతో చూడలేనివారు క్రైస్త వులు కారనేది ఆయన మాట.ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలు నడు స్తున్నాయి. దాయాది దేశాల మధ్య సమస్యలు నెల కొన్నాయి. ఇవి ప్రస్తుతం పోప్ ముందున్న సవాళ్లు. తన తొలి ప్రసంగంలోనే శాంతి కోసం ఆయన పడిన తపనను బట్టి తప్పకుండా ఆయన ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారని చాలామంది విశ్వసిస్తున్నారు. దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు వారి మధ్య సయో ధ్యను కుదిర్చి, యుద్ధాన్ని నివారించే పెద్దలు ఈ సమాజా నికి చాలా అవసరం. అటువంటివారే పోప్. ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోప్ ఏర్పరిచే శాంతిబాటలకు ఎంతో ప్రాధాన్యం ఉందని అందరూ భావిస్తున్నారు.జహారా బేగం, - వ్యాసకర్త సామాజిక కార్యకర్త, అమెరికా -
ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
గ్లామర్, గ్రేస్, క్లాస్, క్యూట్... ఇలా అందాన్ని పొగిడే ఎన్ని పదాలున్నా, అన్నింటినీ కలిపి ఒకేసారి వాడినా కూడా నటి రాశీ ఖన్నా ఫ్యాషన్ లుక్స్ని నిర్వచించలేం. ట్రెడిషనల్ నుంచి జెండర్ ఫ్లూయిడ్ ఫ్యాషన్ వరకు ప్రతి స్టయిలింగ్లోనూ తన ఫ్యాషన్ స్టేట్మెంట్ స్కోర్ సెంచరీనే! అలాంటి ఒక ఫస్ట్క్లాస్ లుక్, ఇందుకోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేయండి. చెవి కప్పేస్తే కళ్లకందం దుద్దులు, బుట్టకమ్మలు, జూకాలు– ఇలా ఎన్ని రకాల కర్ణాభరణాలున్నా, వేటి గొప్ప వాటికే ఉంటుంది. అలా ఒకప్పటి గొప్ప ఆభరణం. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కఫ్స్. ఇవి సాధారణ ఇయర్ కఫ్స్లాగా సపరేట్గా ఉండవు. కింద కమ్మలతోపాటే, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్లో ఉంటాయి. వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. సంప్రదాయ దుస్తులకు ఇది సరైన జోడీ. వేడుకల్లో వీటిని ధరిస్తే ప్రత్యేక ఆకర్షణగా మీరే నిలుస్తారు. అయితే, ఇలాంటి ఇయర్ కఫ్స్ వేసుకునేటప్పుడు మెడను బోసిగా ఉంచుకోవాలి. అప్పుడే వీటి లుక్ ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టయిల్ కూడా బన్ లేదా సెంటర్ బన్ వేసుకోవాలి. వేవీ లేదా లూస్ హెయిర్ స్టయిల్ అస్సలు నప్పదు దీనికి. అలాగే మరో చిన్న టిప్ ఏంటంటే, మొత్తం ఎఫర్ట్ చెవులకే కాకుండా, కాస్త చేతులకు కూడా ఇవ్వండి. అంటే చేతికి మీ డ్రెస్కు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుని లుక్ని కాస్త బ్రైట్ చేయండి. అచ్చం నటి రాశీ ఖన్నా లాగా.. "ఫ్యాషన్లో లెస్ ఈజ్ మోర్ అనే ఫిలాసఫీని నమ్ముతా. అలాగని, ఫ్యాషన్లో ప్రయోగాలు చేయడానికి భయపడను. ఎలాంటి దుస్తులనైనా ఆత్మవిశ్వాసంతో ధరిస్తే, అందంగా కనిపిస్తారు." అంటోంది రాశీ ఖన్న. ఇక్కడ రాశీ కన్నా ధరించిన ఇయర్ రింగ్స్ బ్రాండ్: కోహర్ బై కనికాధర రూ. 6,500/-.(చదవండి: 'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..) -
వీరవాహనుడికి వశిష్ఠుడు చెప్పిన కథ
పూర్వం విరాధ నగరాన్ని వీరవాహనుడు పాలించేవాడు. అతడు గొప్ప ధర్మాత్ముడు, దానశీలి, సత్యవాది. ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్లాడు. అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకుని, ఆయనను దర్శించుకుని, ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి, అక్కడకు వెళ్లాడు. ఆశ్రమంలో వశిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు పాదాభివందనం చేశాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనానుడు ‘మహర్షీ! యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను. అయినా నాకు నరక భయం తొలగిపోవడం లేదు. యమధర్మరాజును గాని, నరకాన్ని గాని చూడకుండా, నరకబాధలు లేకుండా మరణానంతర జీవనం గడిపే వీలుందా?’ అని అడిగాడు.‘మహారాజా! మన మునివరేణ్యులు ఎన్నో ధర్మాలను ప్రవచించినా, కర్మ మోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, పితృకార్యం, సన్యాసం– ఇవన్నీ గొప్ప ధర్మాలు. చివరిగా వృషోత్సర్గం– అంటే, ఆబోతును యథావిధిగా విడిచిపెట్టడం గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం. మరణానంతరం అపరకర్మలు జరిపేటప్పుడు పుత్రులు గాని, ఇతరులు గాని వృషోత్సర్గం చేయకపోతే, ఆ మృతజీవుడు ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. అందువల్ల మహారాజా! నువ్వు కూడా ఒక ఆబోతును విడిచిపెట్టు. వృషోత్సర్గ మహిమ నీకు తెలియాలంటే, ఒక కథ చెబుతాను విను’ అని వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు:ఒకప్పుడు విదేహ నగరంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఒకనాడు ఆయన పితృకార్యం కోసం దర్భలను, మోదుగు ఆకులను సేకరించడానికి అడవికి వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఆయన వాటిని సేకరిస్తుండగా, అకస్మాత్తుగా ఆయన ఎదుట నలుగురు దివ్యపురుషులు ప్రత్యక్షమయ్యారు. వారు ఆయనను ఆకాశమార్గాన తీసుకుపోయి, విశాలమైన వనం మధ్యనున్న ఒక నగరంలో వదిలారు. అద్భుతమైన ఆ నగరంలో ధర్మవత్సుడికి రెండు రకాల మనుషులు కనిపించారు. కొందరు మలిన వస్త్రాలు ధరించి, దీనులై, నీరసులై ఉన్నారు. మరికొందరు ధగధగలాడే నగలు, రంగురంగుల వస్త్రాలు ధరించి, ఉల్లాసంగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి, అతడు ‘కలయా, వైష్ణవ మాయా’ అనుకున్నాడు. ఇంతలో అతణ్ణి అక్కడకు తీసుకువచ్చిన నలుగురు దివ్యపురుషులు అతడిని మహారాజు వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక మహారాజు రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ వందిమాగధులు, పరిజనం, ఎదురుగా సభాసదులు కొలువుతీరి ఉన్నారు. అంతటి మహారాజు కూడా ధర్మవత్సుడిని చూడగానే, సింహాసనం మీద నుంచి లేచి వచ్చి, అతడిని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. ‘విప్రవర్యా! మీవంటి విష్ణుభక్తుని దర్శనంతో నేడు నా జన్మ సఫలమైంది, నా వంశం పవిత్రమైంది’ అంటూ నమస్కరించాడు. ఘనంగా కానుకలు సమర్పించి, సత్కరించాడు.ధర్మవత్సుడు కాస్త తేరుకుని, ‘మహారాజా! ఇది ఏ దేశం. ఇక్కడి జనాల్లో కొందరు దీనులై ఉంటే, ఇంకొందరు సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. దేవేంద్ర వైభవంతో నువ్వు విరాజిల్లుతుండటానికి కారణమేంటి? నన్నెందుకు ఇక్కడకు తీసుకువచ్చారు?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! నా చరిత్రను వర్ణించి చెప్పే సామర్థ్యం నాకు లేదు. అందుకు మా మంత్రివర్యులే తగినవారు’ అని పలికాడు మహారాజు. మహారాజు మనసెరిగిన మంత్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు: ‘భూసురోత్తమా! గతజన్మలో మా మహారాజు విధిరా నగరంలో వైశ్యునిగా జన్మించారు. గోబ్రాహ్మణ సేవ చేస్తూ, నిత్యాగ్నిహోత్రుడై, అతిథి పూజ చేస్తూ, ధర్మబద్ధమైన జీవనం సాగించేవారు. ఒకనాడు ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసుకుని, స్వస్థలానికి తిరిగి వస్తుండగా, తోవలో లోమశ మహర్షి దర్శనం లభించింది. వెంటనే ఆయన లోమశ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! నా యాత్రా ఫలం వెంటనే కనిపించింది. మీ దర్శన భాగ్యం లభించింది. నాదో చిన్న కోరిక! అంతర్బాహ్య స్థితులలో ఒకేలా ఉండే శుద్ధతను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞను పొందే సాధనమేదో తెలపండి’ అని కోరారు. అప్పుడు లోమశ మహర్షి, ‘వైశ్యవర్యా! సత్సాంగత్యం, సాధన, భక్తి, సద్విచారం ద్వారా మాత్రమే మనసు అదుపులో ఉంటుంది. మానవ జన్మలోని పాపకర్మల నుంచి విముక్తి పొందాలంటే వృషోత్సర్గం చేయాలి. వృషోత్సర్గం చేయనిదే పురుషార్థాలు నెరవేరవు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి, వృషోత్సర్గం చేయి’ అని ఆదేశించాడు. లోమశుని ఆదేశంతో గతజన్మలో వైశ్యునిగా ఉన్న మా మహారాజు వరాహస్వామి వెలసిన పుష్కరతీర్థానికి వెళ్లి, అక్కడ వృషోత్సర్గం చేశారు. ఆ తర్వాత లోమశుని సమక్షంలో అనేక యజ్ఞాలను ఆచరించారు. ఆ పుణ్యఫలం వల్ల చాలాకాలం దివ్యలోకాలలో సకల భోగాలను అనుభవించారు. తిరిగి భూమ్మీద పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యారు’ అని చెప్పాడు మంత్రి. ‘ఈ విప్రోత్తములను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అక్కడ సురక్షితంగా దిగవిడిచి రండి’ అని మహారాజు తన భటులను ఆదేశించాడు.ధర్మవత్సుడు ఆశ్చర్యపోయి, ‘అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు? మళ్లీ ఎందుకు పంపేస్తున్నారు?’ అని అడిగాడు. ‘విప్రోత్తమా! మీ వంటి విష్ణుభక్తులను నా సన్నిధికి పిలిపించి, సత్కరించడం నాకు అలవాటు. ఇందులో మీకు అసౌకర్యం కలిగించి ఉంటే మన్నించండి’ అని వినయంగా ప్రార్థించాడు మహారాజు. ధర్మవత్సుడు మహారాజును, ఆయన పరివారాన్ని ఆశీర్వదించి, ఆయన భటులతో కలిసి ఇంటికి వెళ్లాడు.∙సాంఖ్యాయన (చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
కళ్లు చెదిరే కాంతుల వేడుక..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాల అందాలను చూడటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఎగబడుతుంటారు. పారమాట నది ఒడ్డునున్న సిడ్నీ అందాలు చూడటానికి సుమనోహరంగా ఉంటాయి. అయితే, సిడ్నీ అందాలను మరింత ప్రత్యేకంగా చూడాలంటే, వివిడ్ సిడ్నీ ఫెస్టివల్కి వెళ్లాల్సిందే! ఈ వేడుకలు మే 23 నుంచి ప్రారంభమై జూన్ 14 వరకు దాదాపు మూడు వారాల పాటు కొనసాగుతాయి. ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం, చీకటిపడితే విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గొలుపుతాయి. సిడ్నీ ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ వంటి ప్రదేశాలు అద్భుతమైన కాంతి ప్రదర్శనలతో కళ్లుచెదిరే కళాఖండాలుగా మారుతాయి. అంతేకాదు, నగరమంతా ఏర్పాటు చేసే విద్యుద్దీపాలంకరణ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ఈ వేడుక కేవలం కాంతులకే పరిమితం కాదు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శనలుంటాయి. వినూత్న ఆలోచనలు పంచుకునే చర్చలు, చవులూరించే ఆహార వేదికలు కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్నిసార్లు ప్రత్యేకంగా నీటిపై విజువల్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. హార్బర్లో ప్రయాణించే పడవలు కూడా లైట్లతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో సిడ్నీకి విచ్చేస్తుంటారు. ఈ వేడుకకు 2023లో రికార్డు స్థాయిలో 32.8 లక్షలమంది హాజరయ్యారు. దాంతో ఈ ఏడాది కూడా అదే స్థాయి అంచనాలున్నాయి. (చదవండి: డ్రాగన్స్ సృష్టించిన అద్భుతం!) -
డ్రాగన్స్ సృష్టించిన అద్భుతం!
వియత్నామ్లోని హాలాంగ్ అఖాతం ప్రకృతి అందాలకు ఆలవాలం అనే చెప్పుకోవాలి. సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యత కలగలిసిన ఈ ప్రదేశం తప్పక చూడాల్సిందే అంటారు పర్యాటక ప్రియులు. ఇది వియత్నామ్కు, దక్షిణ–చైనాకు సముద్ర సరిహద్దు భాగం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ప్రాంతంలో సుమారు రెండువేల సున్నపురాతి దీవులు ఉన్నాయి. ఇవి చూడటానికి వివిధ ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో ఎత్తుగా, పచ్చదనం చుట్టిన పర్వతాల్లా, లోతైన నీళ్ల మధ్యలో కనిపిస్తూ, కనువిందు చేస్తాయి. ఆ పర్వతాలను, గుహలను, నీటిలో తేలియాడే గ్రామాలను చూడటానికి పడవ ప్రయాణాలు చేస్తూ వెళ్లాలి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఈ ప్రాంతం మరింత మనోహరంగా ఉంటుంది. అక్కడి పురాణాల ప్రకారం, ‘ఒకప్పుడు వియత్నామ్ను కాపాడటానికి దేవతలు డ్రాగన్ల కుటుంబాన్ని పంపారు. ఆ డ్రాగన్లు తమ నోటి నుంచి రత్నాలను ఉమ్మివేశాయి. అవి సముద్రంలో పడి దీవులుగా ఏర్పడ్డాయి. అవే దురాక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించాయి’ అని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘డిసెండింగ్ డ్రాగన్’ అని పిలుస్తారు. (చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..) -
అజ్ఞాత ప్రేమికుడు..!
ఆకాశాన్ని మేఘాలు కమ్ముకోసాగాయి. మెల్లమెల్లగా మట్టి వాసనను మోసుకొచ్చి ముక్కుపుటాలను తాకేలా చేసింది చిరుగాలి. మేఘాల నుంచి జారి నేలను ముద్దాడటానికి అన్నట్టుగా ఒక దానితో మరొకటి పోటీ పడసాగాయి వర్షపు చినుకులు. ఆ క్షణం నాకు చాలా అసహనంగా తోచింది. సాధారణంగా ధైర్యంగా ఉండే నాకు ఆ వాతావరణం బెదురుగా అనిపించింది.పూలు అమ్ముకొనే ఒక వృద్ధురాలు అదే బస్టాండ్లోకి వచ్చి ఒక చివరన కూర్చుంది. ఒక మనిషి తోడు ఉండటం మూలంగా నేను కాస్త కుదుటపడ్డాను. ఇంకాసేపటికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను నేరుగా వెళ్లి పూలు అమ్ముకునే వృద్ధురాలి పక్కన కూర్చున్నాడు. వారి సంభాషణను బట్టి, వారిద్దరూ భార్యాభర్తలు అని అర్థమైంది. ఈ వయసులో వారి అన్యోన్యతను చూసి ముచ్చటగా అనిపించి నవ్వుకున్నాను. వెంటనే అతను గుర్తొచ్చాడు. బస్టాండ్ షెల్టర్ నుంచి ఒక్కో వాన చినుకు ఒక దాని తర్వాత ఒకటి నేలను తాకసాగాయి. నా జ్ఞాపకాలు గతంలోకి పరుగులు పెట్టాయి.సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకొనే సమయంలో వాన జల్లులు పడుతున్నాయి. అప్పుడే చూశాను అతన్ని పదునైన చూపులతో కోటేరులాంటి ముక్కుతో, సన్నటి చిరునవ్వుతో ఉన్న అతని అందం నన్ను ఆకర్షించింది. చినుకులుగా రాలిన వానజల్లు జోరువానగా మారింది. ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న నన్ను నా చేయి అందుకొని పక్కనే ఉన్న చెట్టు కిందకి తీసుకుని వెళ్ళాడు అతను. నేను హతాశురాలిని అయ్యి అతన్నే చూస్తూ ఉన్నాను. వెంటనే అతను ‘క్షమించండి వర్షం ఎక్కువ అవుతుంది. మీరు ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతుంటే ఇక్కడికి తీసుకొచ్చాను’ అన్నాడు. ‘పర్వాలేదండి’ అన్నాను నేను. అరక్షణంలోనే తను తన స్నేహితులతో వానలో మాయమైపోయాడు.ఏదోలా ఇంటికి చేరుకున్న నేను అతని చిరునవ్వును గుర్తు చేసుకుంటూ ఆ రోజును ముగించేశాను.తెల్లవారుతుండగా ఇంటి ముందు బండిలో నుండి సామాను దించుతున్న శబ్దాలు వినిపిస్తుంటే, అటుగా వెళ్లి చూశాను. ఎవరో ఎదురింట్లో కొత్తగా వచ్చినట్లున్నారు అనుకొని నా పనిలో నేను మునిగిపోయాను. అలా మూడు రోజులు గడిచాయి..యథావిధిగా ఒక రోజు ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా, ఎదురింట్లోంచి అతను బయటకి వస్తూ ఎదురయ్యాడు. అతనెవరో తెలియనట్లు నా దారిన నేను వెళ్తుంటే అతనే నన్ను గుర్తుపట్టి ‘బాగున్నారా’ అని పలకరించాడు. నేను అతనెవరో తెలియనట్లు ‘ఎవరండీ మీరు?’ అని అడిగాను. దాంతో అతను ఆ రోజు వర్షంలో జరిగిన సంఘటన గుర్తు చేశాడు. ‘గుర్తొచ్చారండి’ అన్నాను నేను. ‘ఇక్కడేం చేస్తున్నారు?’ అని అడిగాను. ‘మూడు రోజుల క్రితమే మీ ఎదురింట్లోకి అద్దెకు వచ్చాను’ అని చెప్పాడు. ‘ఔనా!’ అనేసి వెంటనే తేరుకొని, ‘మా ఎదురింట్లో అంటున్నారు నేను ఇక్కడే ఉంటానని మీకెలా తెలుసు?’ అని అడిగాను. అతను తడబడుతూ, ‘అంటే.. అది.. మీరు ఈ ఇంట్లోకే వెళుతున్నారు కదా! ఇదే మీ ఇల్లు అని అనుకొని అలా చెప్పాను’ అన్నాడు. నాకెందుకో అతని వాలకం అనుమానంగా తోచింది. దాన్ని అంతటితో వదిలేసి ఇంట్లోకి వచ్చేశాను.రోజులు గడుస్తున్నాయి. అతను అప్పుడప్పుడు ఎదురు పడుతూనే ఉన్నాడు. ఒకరోజు నా పుట్టినరోజు సందర్భంగా శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఎవరో ఒకతను ఒకావిడ పేరు మీద అర్చన చేయిస్తూ ఉన్నాడు. అతని ముఖం కన్పించలేదు. అటు వైపు తిరిగి ఉన్నాడు. అర్చన అయిపోయి ప్రసాదం తీసుకొని అతను వెళ్ళిపోయాడు. నేను కూడా దేవునికి దండం పెట్టుకొని వెనుతిరుగుతూ ఉండగా చిరిగిన అర్చన టికెట్ నాకంట పడింది. అందులో ఉన్న పేరు చూసి షాక్ అయ్యాను.అందులో ఉన్నది నా పేరే, ‘మేఘన సుబ్రమణ్యం‘. వెంటనే పంతులుగారిని అడిగాను. అర్చన చేయించింది ఎవరని. ‘అతనెవరో నాకు తెలీదమ్మా! కాని మూడేళ్లుగా ఈ పేరుమీద ఇదేరోజున అర్చన చేయిస్తున్నాడు’ అని పంతులుగారు చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు కొంతసేపటి వరకు. కాని, ఒకటైతే అర్థమైంది. అతనెవరో నన్ను కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నాడని. మరి అతను ఎవరు? నేనెలా అతన్ని కనిపెట్టేది అని తెగ ఆలోచించసాగాను. కాని నా బుర్రకు ఏ ఆలోచనా తట్టలేదు. నా ఆలోచనలు అలా సాగుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం మా ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది నా పేరు మీద. ఏంటా అది అని తెరిచి చూస్తే అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో–‘‘సుందరి! ఇది నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు. ‘ఇదే ఎందుకు పెట్టుకున్నాడు?’ అని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ‘సుందరీ నేనే నువ్వంటా, చూడని నీలో నన్నంటా’. అనే దళపతి సినిమాలో పాట చాలా ఇష్టం. ఆ పాట వింటూ నేను నిన్ను నా సుందరిగా ఊహించుకుంటూ ఉంటాను. ఇంతకు నేనెవరో నీకు తెలియదు కదూ! నేను నీ అజ్ఞాత ప్రేమికుడిని. గత మూడేళ్లుగా నిన్ను చూస్తూ, ఆరాధిస్తూ, ప్రేమిస్తూ రోజులు గడుపుతూ ఉన్నాను. నిన్ను చూసిన మొదటి క్షణం ఒక తండ్రి తనకు కూతురు పుట్టింది అని తెలియగానే పడే ఆనందపు తాలుకా అనుభూతిని నాలో నేను చూశాను. ఆ అనుభూతి ఇంతకు ముందెప్పుడు నాకు కలగలేదు. అప్పుడే ఫిక్స్ అయ్యాను నువ్వే నా సుందరివని, నిన్ను ఎప్పుడు విడువలేనని. కాని, ఇక్కడే పెద్ద సమస్య వచ్చిపడింది. అదేంటంటే, నేను నీ ముందుకు రాలేనని, నేనెవరినో నీకు తెలియకుండా ఉండాలని నా తలరాత నాకు చెప్పింది. అందుకే ఈ దాగుడుమూతలాట. తెలియకుండా ఉండాలని అనుకొని ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు రాశాడని నువ్వు అనుకోవచ్చు. కాని, నాలో అంతా ఇంతా కాదు, బోలెడంత ప్రేమ ఉంది నీ మీద. ఆ ప్రేమ నా మనసులో సరిపోలేక, అందులో దాగక బయటకి వస్తా వస్తా అని మొర పెడుతోంది. అందుకే దాని మొరకు ఈరోజు విముక్తినిచ్చాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా ప్రేమ నీ చెంతకు చేరిందని...’’ఇట్లు అజ్ఞాత ప్రేమికుడు.ఎవరు ఈ అజ్ఞాత ప్రేమికుడు? ఇన్నేళ్లుగా నన్ను ఫాలో అవుతుంటే నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? అంత ప్రేమను నామీద పెంచుకొని ఎందుకు నా దగ్గరకు రాలేకపోతున్నాడు? నన్ను కలవలేకపోతున్నాడు? ఇలా నా మైండ్, నా మనను ఒకదానితో ఒకటి పోటీపడి మరీ పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాయి. ఎంతకూ అర్థంకాలేదు కాని, ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యాను. ఆ అజ్ఞాత ప్రేమికుడిని ఎలాగైనా కలవాలని, తన ప్రేమను కళ్ళారా చూసి, అనుభూతి పొందాలని. అలా ఆలోచనలతోనే ఆ రోజు గడిచిపోయింది.నేను ఆ ఆజ్ఞాత ప్రేమికుడిని వెతికే పనిలో పడ్డాను. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజూ మా ఎదురింటి అబ్బాయి నాకు తారసపడుతూనే ఉన్నాడు ఏదో ఒక సందర్భంలో. అలా మా మధ్య స్నేహం కూడా కుదిరింది. నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తునే ఉన్నాడా అబ్బాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ. అందుకేనేమో, ఇద్దరి బాధలు ఒకటై ఒకరిలో ఒకరం అమ్మనాన్నల ప్రేమను వెతుక్కుంటూ ఉన్నాం. అతని స్నేహం నా అజ్ఞాత ప్రేమికుని వెతుకులాటను మరచిపోయేలా చేసింది. కాని, మధ్య మధ్యలో అతను రాసిన లెటర్ గుర్తొచ్చేది. ఎంత వెతికినా అతను నాకు దొరకలేదు. కాని, ఎందుకో అతను నాదగ్గరే ఉన్నట్లు, నన్ను ప్రతిరోజు గమనిస్తున్నట్లు, నా చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుండేది. ఎందుకో కొన్ని రోజుల నుంచి మా ఎదురింటి అబ్బాయి నాకు కనిపించలేదు. ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడులే అని అనుకున్నాను. అలా రోజులు కాదు, నెలలు కూడా అయ్యాయి. అయినా ఆ అబ్బాయి ఇంకా రాలేదు. ఏమై ఉంటాడు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే సందేహం కలిగింది. కాని, ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళ్ళి ఉంటాడని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అలా ఒక రోజు నేను ఎప్పుడూ వెళ్ళే శివాలయానికి వెళ్ళాను చాలా రోజుల తర్వాత. పూజ పూర్తి చేసుకుని బయలుదేరుదాం అన్న సమయానికి నా పుట్టినరోజున మాట్లాడిన పంతులుగారు ఎదురుపడి, ‘ఆరోజు నువ్వు ఒక అబ్బాయిు గురించి అడిగావు కదా! ఆ అబ్బాయి తన విజిటింగ్ కార్డు గుళ్లో పడేసుకున్నాడు. అది నాకు దొరికిందమ్మా! దాన్ని చూస్తే నువ్వే నాకు జ్ఞాపకం వచ్చావు. అందుకే నీ కోసమే దాన్ని దాచి ఉంచాను’ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి నాకిచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. ఎన్నో రోజుల నుండి వెతికినా, ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో నాకు తెలిసే సమయం ఆసన్నమైందని మనసు పులకరించిపోయింది. దాన్ని తీస్కోని చూశాను. అందులో ‘సూర్య జాగర్లముడి’ అని పేరు ఉంది. ఈ పేరు నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. వెంటనే అడ్రస్ చూశాను. చూడగానే నా మైండ్ ఒక్కసారిగా పని చేయడం ఆగిపోయింది. ఎందుకంటే ఆ అడ్రస్ మా వీధిలో ఉండే ఒక ఇంటి అడ్రస్. నేను నమ్మలేకపోయాను. వెంటనే తేరుకుని పంతులుగారికి థాంక్స్ చెప్పేసి, పరుగుపరుగున ఆ ఇంటికి దారితీశాను. ఆ ఇల్లు ఉన్న అడ్రస్కు చేరుకున్నాను. తాళం వేసి ఉంది ఆ ఇంటికి. ఏం చేయాలో తోచలేదు. సమయానికి మా ఎదురింటి అబ్బాయి కూడా లేడు. నాకే ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఒక రాయి తీసుకొని తాళం పగులగొట్టాను. తలుపులు తీసుకొని గదిలోకి అడుగు పెట్టాను. అంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించలేదు. వెంటనే గోడ మీద స్విచ్బోర్డు వెతికి స్విచ్ వేశాను. అంతే గోడకు ఉన్న ఫోటో చూసి హతశురాలయ్యాను. ఆ ఫోటోలో ఉన్నది మా ఎదురింటి అబ్బాయి కిరణ్. అంటే అతని పూర్తి పేరు ‘సూర్య కిరణా!’నేను నమ్మలేకపోతున్నాను, ఇదంతా ఒక కలలా తోచింది. ఇన్ని రోజులు నా దగ్గరే ఉంటూ, నాతో మాట్లాడుతూ ఎందుకు ఈ దాగుడు మూతలాడటమో నాకు అర్థం కాలేదు. నా స్నేహితుడే నా అజ్ఞాత ప్రేమికుడు అని తెలిసి, నా మనసు అతలాకుతలమైంది.కాని, ఆ సంతోషం నీటి ఆవిరిలా క్షణకాలంలో మాయమైపోబోతోందని ఆ క్షణంలో నాకు తెలియలేదు. అప్పుడే నా కంట పడింది ఒక ఉత్తరం అది తీసి చదవడం మొదలుపెట్టాను. అందులో...‘సుందరి నువ్వు వస్తావని నాకు తెలుసు. కాని, నువ్వు వచ్చే సమయానికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. అవును క్యాన్సర్తో పోరాడుతున్న రోజులవి. అప్పుడే నేను నిన్ను మొదటిసారి చూశాను. చిన్న పిల్లలాంటి నీ మనస్తత్వం నిన్ను ప్రేమించేలా చేసింది. కాని, నీకు నా ప్రేమను చెప్పుకునే పరిస్థితిలో లేను. చెప్పి నిన్ను కూడా నా ప్రేమలో పడేసి, నీకు దూరంగా వెళ్ళిపోయి, తీరని బాధని నీకు మిగల్చకూడదు అనుకున్నాను. అందుకే నీకు దూరంగా ఉంటూ, నిన్ను చూస్తూ, ప్రేమిస్తూ ఉన్న సమయంలో నువ్వే నా దగ్గరకు వచ్చావు. నన్ను చూస్తూ మైమరచిపోయిన ఆ రోజును నేను మరచిపోలేను. వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్న నిన్ను గట్టుకు చేర్చాను. ఆ రోజు అనుకున్నాను నేను ఇంకా నీకు దూరంగా ఉండలేనని. అందుకే మీ ఎదురింటికి వచ్చేశాను. నీతో స్నేహం చేశాను. నిన్ను కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉన్నాను. కాని, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది. అందుకే నీకు చెప్పలేక దూరంగా వెళ్ళిపోయాను. ఎంతో వేదనతో ఈ ఉత్తరం నీకోసం రాశాను– ఎప్పటికైనా నీదగ్గరికి చేరుతుందని నమ్ముతూ...ఉత్తరం నా చేయి జారిపోయింది. ఎడతెరపి లేని వానలా, ఉప్పొంగే వరదలా, ఉగ్రరూపం దాల్చిన సముద్రపు అలల్లా నా మనసు రోదించింది. నా జ్ఞాపకాలు గతం నుంచి బయటకు వచ్చాయి. నా కన్నీరు ఏ కంటికి కానరాకుండా ఇదే వాన నీటిలో కనుమరుగయ్యాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ. (చదవండి: యువ కథ: వసంత కోకిల) -
షుగర్ ఉంటే..ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా?
నాకు ఇప్పుడు మూడోనెల. గతంలో గర్భస్రావం కావడం వలన చాలా డిస్టర్బ్ అయ్యాను. నన్ను ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం సిద్ధంగా లేను. చాలా బాధగా ఉంది. ఈ సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి?– రమ్య, హైదరాబాద్ మీ పరిస్థితిని అర్థం చేసుకోగలం. ప్రెగ్నెన్సీ మానసికంగా చాలా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు. దీంతో బాధ, కోపం, అసహనం, ఆందోళన ఎవరికైనా వస్తాయి. మళ్లీ ప్రెగ్నెన్సీ మీద భయం ఉంటుంది. ఇలాంటప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి. సహాయం తీసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి మీ భావాలను వివరంగా వారితో పంచుకోవాలి. టాకింగ్ థెరపీ ద్వారా మనసులో ఉండే బాధను తొలగించుకోవచ్చు. అలా ఎందుకు అయింది, ఏమి చేస్తే మళ్లీ అలా జరగకుండా ఉంటుంది. ఏ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా అన్ని కోణాల్లో మాట్లాడుతూ మీ మనసులోని అనుమానాలను తొలగించుకోవచ్చు. దీంతో డాక్టర్ అవసరమైన పరీక్షలు చేసి సమస్య తీవ్రతను అంచనా వేస్తారు. అవసరమైతే మానసిక నిపుణుడిని సంప్రదించమని చెప్తారు. ఇది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (పీటీఎస్డీ) కావచ్చు. దీనికి కౌన్సెలింగ్, థెరపీ అవసరం. సాధారణంగా నాలుగు నుంచి ఐదు వారాల్లో ఉపశమనం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండు వారాల్లోనే తేడా కనిపిస్తుంది. ఎలాంటి మందులూ వీళ్లకి అవసరం ఉండదు. అందుకే, భయపడకుండా ఒకసారి డాక్టర్ని కలవండి. కొంతమందికి ఈ సమస్య ఎక్కువగా ఉండచ్చు. వీరికి లాంగ్ టర్మ్ కౌన్సెలింగ్ సెషన్స్తోపాటు కొన్ని మందులు సూచిస్తాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) అనేది ఒక రకమైన టాకింగ్ థెరపీ. దీనిలో మీ మనస్సులోని ఆలోచనలు మేనేజ్ చేసే ఫోకస్డ్ కౌన్సెలింగ్ చేస్తారు. మీకు రొటీన్గా కొన్ని పనులు చెయ్యమని చెప్తారు. రెండు నుంచి మూడు నెలల సీబీటీ చికిత్సతో ఉపశమనం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో సెర్ట్రాలిన్ మాత్రలను తాత్కాలికంగా ఉపయోగిస్తారు. ఇది కొన్ని వారాలు మాత్రమే. ఈ లోపల కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల వలన మానసిక స్థితి మెరుగవుతుంది. నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మధుమేహం ఉంది. మందులు వాడుతున్నాను. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శారద, వరంగల్. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. అప్పుడు వారు కొన్ని పరీక్షలను ముందే చేయించి, దాదాపు అన్నీ కంట్రోల్లో ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తున్నారు. వీటిలో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, మూర్ఛ, ఆస్తమా లాంటివి ఉంటాయి. ముందే డాక్టర్ని సంప్రదించినప్పుడు , మీ సమస్య ఎంతవరకు కంట్రోల్లో ఉందో తెలుసుకోవచ్చు. దీని వలన తల్లికి, బిడ్డకి భవిష్యత్తులో ఏ సమస్యలు ఉండవు. డయాబెటిక్ క్లినిక్స్లో వెంటనే సంప్రదించి, హెచ్బీ1సీ పరీక్ష చేయించుకోండి. ఇందులో చక్కెర స్థాయి 5.5 నుంచి 6. 5 శాతం మధ్యలో ఉండాలి. ఒకవేళ మీ షుగర్ కంట్రోల్లో ఉంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం తగ్గుతుంది. షుగర్ ఎక్కువ ఉంటే కొన్ని నెలలు స్ట్రిక్ట్ డైట్, వ్యాయామం చేయాలి. మందులు అవసరమైతే మార్చాలి. కొన్ని రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు రోజూ తీసుకోవటం ప్రారంభించండి. ఈ సమయానికి డాక్టర్ సూచించిన మందులు మాత్రమే వాడాలి. ఇన్సులిన్ వాడటం సురక్షితమే. ఐ స్క్రీనింగ్, మూత్రపిండాలు, కాలేయం, హార్మోన్ పరీక్షలు కూడా చేయించాలి. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఏ ఇబ్బందులు రాకుండా చూస్తాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..) -
చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!
‘ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్/ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’ అనే సినీగీతం చాలామందికి తెలిసినదే! చాయ్ చమక్కులు చాలానే ఉన్నాయి. చాయ్ చరిత్ర కూడా చాలానే ఉంది. మే 21న ప్రపంచ తేనీటి దినోత్సవం సందర్భంగా కొన్ని చాయ్ చమక్కులు మీ కోసం...చాయ్, టీ అనే పదాలతో పిలుచుకునే తేనీరు చాలామందికి అభిమాన పానీయం. చాయ్, టీ– ఈ రెండు పదాలూ తేయాకుకు పుట్టినిల్లయిన చైనాలోనే పుట్టాయి. ఓడమార్గం వర్తకుల ద్వారా ‘టీ’ అనే మాట పాశ్చాత్య ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. ‘చాయ్’ అనే మాట సిల్క్రూట్ ద్వారా భారత్ సహా పలు ఆసియన్ దేశాలకు వ్యాపించింది. తొలి రోజుల్లో డచ్ వర్తకులు చైనాతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారు ఎక్కువగా చైనా తీర ప్రాంతంలోని ఫుజియన్ మాండలికం మాట్లాడే వర్తకులతో లావాదేవీలు జరిపేవారు. వారు తేయాకుకు, తేనీటికి ‘టీ’ అనే మాటను ఉపయోగించేవారు. వారి ద్వారా ఈ మాట ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషలకు చేరింది. భూమార్గంలో సిల్క్రూట్ గుండా చైనాకు వచ్చే విదేశీ వర్తకులు ఎక్కువగా చైనాలో మాండరిన్ చైనీస్ భాష మాట్లాడే వర్తకులతో లావాదేవీలు సాగించేవారు. వారి ద్వారా ‘చాయ్’ మాట భారత్ సహా పలు ఆసియా దేశాలకు, అరబ్ దేశాలకు వ్యాపించింది. ఎన్నో రకాలు.. ఎన్నో రుచులుప్రపంచవ్యాప్తంగా మూడువేలకు పైగా తేయాకు రకాలు ఉన్నాయి. వీటిలో ఆరు రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఉలాంగ్ టీ, వైట్ టీ, పూఎయిర్ టీ, యెల్లో టీ రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఈ ఆరురకాలు మాత్రమే కాకుండా, రకరకాల తేయాకుల నుంచి రకరకాల రుచులతో తయారు చేసే తేనీటి పానీయాలు కూడా వాడుకలో ఉన్నాయి. ప్రపంచంలో విస్తృత ప్రాచుర్యం పొందిన రకాలు, అరుదైన రకాల తేనీటి పానీయాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం...పూఎయిర్ టీచైనాలో దొరికే అరుదైన తేయాకుతో దీనిని తయారు చేస్తారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నుంచి ఇది వాడుకలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ రకం తేయాకు ఎంత పాతబడితే దీనితో తయారు చేసే టీ అంత రుచిగా ఉంటుందని చైనీయుల నమ్మకం. పూఎయిర్ టీని ‘గోంగ్ఫు చా’ అని కూడా అంటారు. వేడి నీటితో శుభ్రం చేసిన పాత్రలో ముందుగా ఈ రకం తేయాకును వేసి, అందులో మరుగుతున్న నీటిని పోస్తారు. తేయాకు మరుగునీటిలో ఐదు నిమిషాలు నానిన తర్వాత వడగట్టి, కప్పుల్లో పోసుకుని తాగుతారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్లో ఈ రకం తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. యునాన్ ప్రావిన్స్లో ఈ తేనీటిని పులియబెట్టి, తాగే ముందు మరిగించి సేవించే పద్ధతి కూడా ఉంది. ఇది జీర్ణసమస్యలకు విరుగుడుగా పనిచేస్తుందని చైనీయుల నమ్మకం.బటర్ టీఇది టిబెట్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో పొందిన సంప్రదాయ పానీయం. జడలబర్రె వెన్నకు, కొద్దిగా బార్లీ పొడి, ఉప్పు జోడించి, వెన్నను బాగా చిలికి, మరుగుతున్న బ్లాక్ టీలో వేస్తారు. కొందరు ఇందులో పాలు, పంచదార కూడా జోడిస్తారు. పొద్దున్నే ఈ బటర్ టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, ఒంట్లోని శక్తి తరిగిపోకుండా ఉంటుందని చెబుతారు. ఇటీవలి కాలంలో డెయిరీ ఫామ్స్లో దొరికే వెన్నను ఉపయోగించి కూడా బటర్ టీని తయారు చేస్తున్నారు.చా యెన్ఇది థాయ్లాండ్లో ప్రసిద్ధి పొందిన పానీయం. గాఢంగా తయారు చేసిన బ్లాక్టీలో చక్కెర, పాలు కలిపి, అనాసపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలను జోడించి మరిగిస్తారు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మంచుముక్కలు వేసుకుని శీతల పానీయంలా సేవిస్తారు. కొందరు దీనికి పసుపు, నారింజ ఫుడ్కలర్స్ను కూడా జత చేస్తారు.చాయ్ఇది మన భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం. చాయ్ అన్నా, టీ అన్నా మనకు తెలిసిన పద్ధతి ఒకటే! తేయాకు పొడివేసి మరిగించిన నీటిలో పాలు, పంచదార కలిపి తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఈ తేనీటికి బాగా దంచిన అల్లం జోడించి అల్లం టీ తయారు చేస్తారు. ఇంకొన్ని చోట్ల సుగంధ ద్రవ్యాల పొడులు జోడించి, మసాలా చాయ్ తయారు చేస్తారు. చాయ్ ఒకరకంగా మన జాతీయ పానీయం అనే చెప్పుకోవాలి!రూయిబోస్నిజానికి ఇది తేయాకుతో తయారు చేసే టీ కాదు. ‘రూయిబోస్’ అంటే ఎర్రని పొద అని అర్థం. దక్షిణాఫ్రికాలో పెరిగే రూయిబోస్ ఆకులతో దీనిని తయారు చేస్తారు. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి, మరికాసేపు మరిగిన తర్వాత వడగట్టి కప్పుల్లో పోసుకుని వేడి వేడిగా సేవిస్తారు. ఇందులో కెఫీన్ ఉండదు. కెఫీన్ వద్దనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెబుతారు. రూయిబోస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు.వైట్ టీఇది చాలా అరుదైన రకం పానీయం. తేయాకు మొక్కల్లో అత్యంత అరుదైన ‘కేమెలియా సైనెసిస్’ అనే మొక్క నుంచి లేత చిగురుటాకులను, మొగ్గలను సేకరించి, వాటితో వైట్ టీ తయారు చేస్తారు. వైట్ టీ కోసం లేత చిగురుటాకులను, మొగ్గలను వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో సేకరిస్తారు. బ్లాక్ టీ, గ్రీన్ టీల కంటే వైట్ టీ గాఢత చాలా తక్కువగా ఉంటుంది. చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్లో ఈ అరుదైన తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, వాపులను తగ్గించే ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.యెల్లో టీతేయాకు మొక్కల నుంచి సేకరించిన లేత ఆకులను ప్రత్యేకమైన పద్ధతిలో ఆరబెట్టి యెల్లో టీకి తగిన తేయాకును తయారు చేస్తారు. కొరియాలో యెల్లో టీ వినియోగం ఎక్కువ. కొరియన్లు దీనిని ‘హ్వాంగ్ చా’ అని, చైనీయులు దీనిని ‘హువాంగ్ చా’ అని అంటారు. తయారీ పద్ధతిలోని కష్టనష్టాల కారణంగా దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి తేనీటిని తయారు చేస్తారు. ఇది పారదర్శకమైన లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు.∙∙ పురాతన చరిత్రటీ ఆధునిక పానీయమని చాలామంది పొరబడతారు. ఇలా పొరబడటానికి కారణం లేకపోలేదు. మధ్యయుగాల వరకు తేయాకు వినియోగం కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది. డచ్ వర్తకులు, పోర్చుగీసు వర్తకులు క్రీస్తుశకం పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో తేయాకును యూరోప్కు పరిచయం చేశారు. క్రమంగా ఇది ఇంగ్లండ్కు, అక్కడి నుంచి బ్రిటిష్ వలస రాజ్యాలకు చేరింది. అయితే, తేనీటి వినియోగం క్రీస్తుపూర్వం 2732 నాటికే చైనాలో మొదలైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఒక అనుకోని సంఘటన వల్ల ఆనాటి చైనా చక్రవర్తి షెన్ నుంగ్కు తేయాకు మహిమ తెలిసివచ్చిందట! ఒకనాడు ఆయన ఆరుబయట కూర్చుని, నీరు మరిగిస్తున్నప్పుడు ఆ నీటిలో ఒక చెట్టు నుంచి రాలిన ఆకులు పడ్డాయి. ఆ నీటిని ఆయన సేవించాడు. దాని రుచి, పరిమళం ఆయనకు తెగ నచ్చాయి. అంతేకాదు, ఆ పానీయం తన శరీరంలోని అణువణువును శోధిస్తున్న అనుభూతి కూడా కలిగిందట! అందుకే ఆయన ఈ పానీయానికి ‘చా’ అని పేరుపెట్టాడు. చైనీస్ భాషలో ‘చా’ అంటే శోధించడం లేదా తనిఖీ చేయడం అని అర్థం. క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దిలో బౌద్ధ గురువు డెంగ్యో దైషీ తొలిసారిగా జపాన్కు తేయాకును పరిచయం చేశాడు. ఆయన ద్వారా అనతికాలంలోనే తేనీరు జపనీయుల అభిమాన పానీయంగా మారింది. మిగిలిన ప్రపంచానికి ఇది పరిచయం కావడానికి మాత్రం మరికొన్ని శతాబ్దాల కాలం పట్టింది. ఇరవయ్యో శతాబ్ది నాటికి తేనీటి మహిమ ప్రపంచమంతటికీ తెలిసివచ్చింది. తేయాకు మొక్కలు సాధారణంగా పొదలుగా పెరగడమే చూస్తుంటాం. నిజానికి ఇవి మొక్కలు కావు, చెట్లు. ఇవి వంద అడుగుల ఎత్తువరకు పెరగగలవు. వీటి జీవితకాలం యాభైఏళ్లకు పైగానే ఉంటుంది.గ్రీన్ టీ కోసం సాధారణంగా ఆరబెట్టిన తేయాకునే వాడతారు. జపాన్లో అత్యంత అరుదుగా కొందరు తాజా తేయాకును నేరుగా మరిగించి, గ్రీన్ టీ తయారు చేస్తారు. దీనిని ‘టెన్చా’ అంటారు.చైనాలో తడిపి ఆరబెట్టిన తేయాకును ఒత్తిడికి గురిచేసి, కేకుల్లా మార్చి నిల్వచేసేవారు. వీటిని రెండేళ్ల నుంచి యాభయ్యేళ్ల వరకు నిల్వ ఉంచి, తేనీటి తయారీకి వినియోగించేవారు. వీటితో తయారు చేసిన తేనీటిని ‘కొంబూచా’ అంటారు. అలాగే, ఈ తేయాకు కేకులను నగదుగా కూడా ఉపయోగించే వారు.తేయాకు యూరోప్కు పరిచయమైన కొత్తరోజుల్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. ఇంగ్లండ్లో తేనీటి సేవనం రాచవంశీకులకు, సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. పద్దెనిమిదో శతాబ్దిలో తేయాకు తోటల్లో విందులు జరుపుకోవడం సంపన్నుల వేడుకగా ఉండేది.తేయాకు కోసం బ్రిటన్కు, చైనాకు యుద్ధం కూడా జరిగింది. బ్రిటన్లో తేయాకుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దిగుమతి చేసుకోవాలంటే, చైనా మాత్రమే ఆధారం. తేయాకు కోసం వెండి రూపంలోనే చెల్లింపులు జరపాలని చైనా బిగదీసుకుంది. బ్రిటిష్ ఖజానాలోని వెండి నిల్వలన్నీ తేయాకుకే ఖర్చవుతుండటంతో బ్రిటిష్ సైన్యం చైనాతో యుద్ధం చేసింది. ‘మొదటి నల్లమందు యుద్ధం’ పేరుతో 1839–42 వరకు చరిత్రలో నమోదైన ఈ యుద్ధానికి అసలు కారణం తేయాకు గిరాకీనే! (చదవండి: వ్యోమయాత్రకు భారతీయుడు) -
వ్యోమయాత్రకు భారతీయుడు
పన్యాల జగన్నాథదాసు..ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రబిందువుగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) తొలిసారిగా ఒక భారతీయుడు వెళ్లనున్నారు. భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా(Subhanshu Shukla)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. సోవియట్ సోయుజ్ టీ–11 ద్వారా రాకేశ్ శర్మ 1984లో తొలిసారిగా అంతరిక్షయానం చేసి వచ్చారు. ఆయన తర్వాత ఇప్పటి వరకు భారత్ నుంచి వ్యోమగాములు ఎవరూ లేరు. ఇన్నాళ్లకు శుభాంశు శుక్లాకు అంతర్జాతీయ బృందంతో కలసి అంతరిక్షయానం చేసే అవకాశం రావడం విశేషం.మే 29న ఐఎస్ఎస్కు బయలుదేరనున్న వ్యోమగాముల బృందంలో శుక్లాతో పాటు అమెరికన్ జాతీయ అంతరిక్ష సంస్థలో (నాసా) పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలిష్ అంతరిక్ష సంస్థ (పోల్సా) సభ్యుడు స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్ఎస్ఓ) సభ్యుడు టైబర్ కాపు కూడా ఉన్నారు. ‘పోల్సా’, ‘హెచ్ఎస్ఓ’లకు ఈ మిషన్లో యురోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) సహకారం అందిస్తోంది. ఈ బృందం మే 29న ఐఎస్ఎస్కు చేరుకోనుంది. ‘ఏక్సియమ్ మిషన్–4 (ఏఎక్స్–4)’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఈ బృందం అక్కడ ఏడు ప్రయోగాలను చేపట్టనుంది.ఏఎక్స్–4 భారత్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి స్వయంగా చేపట్టనున్న ‘గగన్యాన్’ ప్రయోగానికి బాగా ఉపకరించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శుభాంశు శుక్లా ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళుతుండటం వల్ల ఆయన పొందే ఆచరణాత్మక అనుభవం భారత్ చేపట్టనున్న ‘గగన్యాన్’కు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మైక్రోగ్రావిటీ ప్లాట్ఫామ్స్ గ్రూప్ హెడ్ తుషార్ ఫడ్నిస్ తెలిపారు.ఏఎక్స్–4 మిషన్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకునేందుకు తాజాగా చేపడుతున్న ఏఎక్స్–4 మిషన్ భారత్తో పాటు పోలండ్, హంగరీ దేశాలకు కూడా గొప్ప మైలురాయి కాగలదు. దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతరిక్షయాత్రకు వెళుతుండటమే దీనికి కారణం. ఈ ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేపట్టనున్నారు. ఇక్కడ చేపట్టనున్న దాదాపు అరవైకి పైగా ప్రయోగాల్లో 31 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో పాటు అంతరిక్ష పర్యాటకం వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా, భూమి చుట్టూ రెండువేల కిలోమీటర్ల దూరాన ఉండే భూ నిమ్న కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్–ఎల్ఈఓ) వాణిజ్యపరంగా అంతరిక్ష కేంద్రాలను నిర్మించే వెసులుబాటును ఏఎక్స్–4 మిషన్లో అధ్యయనం చేయనున్నారు.అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఏక్సియమ్ స్పేస్’ మరో ప్రైవేటు సంస్థ ‘స్పేస్ ఎక్స్’తోను, అమెరికా జాతీయ అంతరిక్ష సంస్థ ‘నాసా’తోను కలసి ఈ ఏఎక్స్–4 మిషన్ చేపడుతోంది. ఈ మిషన్కు అమెరికన్ మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ దీనికి కమాండర్గా నాయకత్వం వహిస్తున్నారు. ‘ఇస్రో’ తరఫున భారత వైమానికదళం గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు.మిషన్ స్పెషలిస్టులుగా యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) తరఫున పోలండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్ఎస్ఓ) తరఫున టైబర్ కాపు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మిషన్తో పెగ్గీ విట్సన్ ఐదోసారి అంతరిక్షయాత్రకు వెళుతుంటే, శుభాంశు శుక్లా సహా మిగిలినవారికి ఇదే తొలి అంతరిక్షయాత్ర కావడం విశేషం. స్పేస్ ఎక్స్ పాత్రఏక్సియమ్ మిషన్–4లో ఎలాన్ మస్క్ స్థాపించిన అమెరికన్ అంతరిక్ష సాంకేతిక పరిశోధనల సంస్థ ‘స్పేస్ ఎక్స్’ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఎక్స్–4 మిషన్(AX-4 mission) కోసం స్పేస్ ఎక్స్ ‘ఫాల్కన్ 9 బ్లాక్ 5’ రాకెట్ను, క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఏఎక్స్–4 మిషన్ మే 29న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10.33 గంటలకు అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది.ఇక్కడి నుంచి ఫాల్కన్ 9 బ్లాక్5 రాకెట్ నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను భూ నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. క్రూ డ్రాగన్ సీ213 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకోనున్న వ్యోమగాములు అక్కడ రెండు నుంచి మూడు వారాల పాటు పరిశోధనలు సాగించనున్నారు. ఏఎక్స్–4 మిషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకకు ఇదే మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణం.అ‘ద్వితీయుడు’ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పుట్టి పెరిగారు. భారతీయ వైమానిక దళానికి 2006లో ఎంపికయ్యారు. యుద్ధ విమానాలను నడపడంలో విశేష అనుభవం ఉన్న శుభాంశు శుక్లాను ఏఎక్స్–4 మిషన్ ఏరి కోరి పైలట్గా ఎంపిక చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1984లో రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి, తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డులకెక్కారు. అప్పటి సోవియట్ రష్యా చేపట్టిన ‘సోయుజ్ టీ–11’ మిషన్లో భాగంగా రాకేశ్ శర్మ అంతర్జాతీయ బృందంతో కలసి, సాల్యూట్–7 అంతరిక్ష కేంద్రానికి చేరుకుని, అక్కడ వారం రోజులు గడిపి వచ్చారు. ‘సోయుజ్ టీ–11’ మిషన్కు సోవియట్ వ్యోమగామి యూరీ మాలెషెవ్ పైలట్గా వ్యవహరించారు.అయితే, ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్లో శుభాంశు శుక్లాకు పైలట్గా అవకాశం లభించింది. అంతర్జాతీయ వ్యోమగాముల బృందం జరిపే అంతరిక్ష యాత్రకు ఒక భారతీయుడు పైలట్ కావడం ఇదే తొలిసారి. శుక్లాను ‘ఇస్రో’ 2019లో భారత్ తరఫున వ్యోమగామిగా ఎంపిక చేసింది. అంతరిక్ష యాత్ర చేయడానికి తగిన శిక్షణను పొందడానికి శుక్లా రష్యా వెళ్లారు. మాస్కోలో స్టార్ సిటీలోని యూరీ గాగరిన్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ‘ఇస్రో’, ఇతర భారతీయ సాంకేతిక సంస్థలు రూపకల్పన చేసిన ప్రయోగాలను శుక్లా ఐఎస్ఎస్లో చేపట్టనున్నారు.ఈ ప్రయోగాల్లో భాగంగా ఆయన అంతరిక్షంలో సూక్ష్మజీవుల మనుగడకు గల అవకాశాలు, గురుత్వాకర్షణ లేని అంతరిక్ష పరిస్థితుల్లో ఏర్పడే కండరాల క్షీణత, తెరపై దృశ్యాలను చూడటం వల్ల మెదడుపై ఏర్పడే దుష్ప్రభావాలు తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లో శుక్లా సాగించబోయే ప్రయోగాలు త్వరలోనే భారత్ చేపట్టనున్న ‘గగన్యాన్’ ప్రయోగానికి బాగా ఉపయోగపడగలదని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్లా ప్రస్థానంభారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం వరకు శుభాంశు శుక్లా ప్రస్థానంపై అనేక కథనాలు వచ్చాయి. లక్నోలోని సిటీ మాంటిసోరీ స్కూల్లో సాదా సీదా విద్యార్థిగా ఉన్న శుక్లా ఐఏఎఫ్లో చేరడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. స్కూల్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) దరఖాస్తు తెచ్చివ్వడంతో శుక్లా తన పదహారో ఏట ఎన్డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంగతిని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అనుకోకుండా రాసిన పరీక్షలో నెగ్గి, 2006 జూన్ 17న ఐఏఎఫ్కు ఎంపికయ్యారు.ఎన్డీఏలో సైనిక శిక్షణ పొందుతూనే, ఉన్నత విద్యను కొనసాగించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో ఎంటెక్ పూర్తి చేశారు. ఐఏఎఫ్లో అంచెలంచెలుగా, గ్రూప్ కెప్టెన్ స్థాయికి ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా భారత్ ‘గగన్యాన్’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘గగన్యాన్’ కోసం ‘ఇస్రో’ ఎంపిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు 2019లో శుక్లా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన నలుగురిలో శుక్లా కూడా ఉన్నారు.ఐఏఎం ఎంపిక చేసిన నలుగురినీ ‘ఇస్రో’ పరీక్షించి, చివరిగా శుక్లాను ‘గగన్యాన్’కు ఎంపిక చేసింది. అంతరిక్షయాత్రల్లో శిక్షణ కోసం రష్యాలోని యూరీ గాగరిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్కు పంపింది. రష్యా నుంచి ప్రాథమిక శిక్షణ పొంది 2021లో తిరిగి వచ్చేశాక, ‘ఇస్రో’ ఆయనను బెంగళూరులోని వ్యోమగాముల శిక్షణ కేంద్రానికి పంపింది. అక్కడ కూడా శుక్లా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ‘గగన్యాన్’ ప్రారంభానికి ముందే ‘ఏఎక్స్–4’ మిషన్లో పైలట్గా అవకాశం రావడంతో తొలి అంతరిక్షయాత్రకు వెళుతున్నారు.గగన్యాన్ సన్నాహాలుభారత అంతరిక్ష పరిశోధక సంస్థ ‘ఇస్రో’ ఇప్పటి వరకు అనేక ప్రయోగాలు చేపట్టింది. ‘ఇస్రో’ ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన వ్యోమనౌకలన్నీ మానవరహితమైనవే! మనుషులను అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘గగన్యాన్’ను తలపెట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘గగన్యాన్’ కోసం ‘ఇస్రో’ సన్నాహాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ‘గగన్యాన్’లో అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రకటించారు. వారిలో శుభాంశు శుక్లాతో పాటు ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఉన్నారు. ‘గగన్యాన్’లో చేపట్టడానికి ‘ఇస్రో’ ఇప్పటికే ఐదు ప్రయోగాలను ఎంపిక చేసింది.నిజానికి ‘గగన్యాన్’ ప్రయోగాన్ని గత ఏడాదిలోనే చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టినా, అనివార్య కారణాల వల్ల ఇందులో జాప్యం ఏర్పడింది. ఈ జాప్యానికి ముఖ్య కారణం ‘కోవిడ్–19’ మహమ్మారేనని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాణా పార్లమెంటులో వెల్లడించారు. ‘గగన్యాన్’ సన్నాహాల్లో భాగంగా ‘ఇస్రో’ ఈ ఏడాదిలో ఆరుసార్లు ఆర్బిటల్ క్యాప్సూల్స్ను అంతరిక్షంలోకి పంపుతోంది. ఒకరు లేదా ముగ్గురు వ్యోమగాములతో 2027లో ‘గగన్యాన్’ అంతరిక్షయాత్ర చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, ఈ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.ఇదిలా ఉంటే, ‘గగన్యాన్’ ప్రయోగాన్ని 2027 సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే చేపట్టనున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ కొద్దిరోజుల కిందట జరిపిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఇస్రో’ చైర్మన్ వి.నారాయణన్తో కలసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘గగన్యాన్’ ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో మన సొంత అంతరిక్ష కేంద్రం ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ ఏర్పాటుకు ‘గగన్యాన్’ ప్రయోగం బాటలు వేయగలదని ‘ఇస్రో’ చైర్మన్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత రూ.10 వేల కోట్లుగా అంచనా వేసిన ‘గగన్యాన్’ బడ్జెట్ను ప్రభుత్వం రూ.20.193 కోట్లకు పెంచిందని ఆయన తెలిపారు.అంతరిక్ష ప్రయోగాలతో పాటు సముద్రగర్భంలో కూడా భారత్ ప్రయోగాలు చేపట్టనుందని, ఈ ప్రయోగాల్లో ‘ఇస్రో’కు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎస్సీ, వైమానిక, నావికా దళాలు కీలక సహకారాన్ని అందిస్తున్నాయని వెల్లడించారు. ‘గగన్యాన్’ తొలివిడత ప్రయోగంలో మన వ్యోమగాములు మూడురోజుల పాటు అంతరిక్షంలోని భూనిమ్న కక్ష్యలో గడిపి తిరిగి రానున్నారు. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడంలో భారత్కు గల స్వయంసమృద్ధి, ప్రతిభాపాటవాలు ప్రపంచానికి వెల్లడవుతాయి. అంతరిక్షంలో మరిన్ని అన్వేషణలు, ప్రయోగాలు చేపట్టడానికి ‘గగన్యాన్’ వీలు కల్పిస్తుంది. అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న ఇతర అగ్రరాజ్యాలకు దీటైన శక్తిగా భారత్ ఎదిగేందుకు దోహదపడుతుంది.ఏక్స్–4 బృందంలో మిగిలినవారుపెగ్గీ విట్సన్అమెరికన్ వ్యోమగామి. ఏక్స్–4 మిషన్కు కమాండర్. ‘నాసా’ తరఫున మూడుసార్లు, ‘ఏక్సియమ్’ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది. ఐఎస్ఎస్కు తొలి మహిళా కమాండర్ అయిన ఘనత ఆమెకే దక్కుతుంది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామిగా అరుదైన రికార్డు కూడా ఆమెకు ఉంది. ‘నాసా’ నుంచి 2018లో రిటైరైన తర్వాత పెగ్గీ ‘ఏక్సియమ్’లో చేరారు. ‘ఏక్సియమ్’ చేపట్టిన ఏఎక్స్–2 మిషన్లో కమాండర్గా ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్లో ఐదోసారి అంతరిక్షయాత్రకు నాయకత్వం వహించనున్నారు.స్లావోజ్ ఉజ్నాన్స్కీయూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో (ఈఎస్ఏ) పనిచేస్తున్న పోలిష్ ఇంజినీర్. ఏఎక్స్–4 మిషన్లో తొలిసారిగా అంతరిక్షయాత్రకు వెళ్లనున్నారు. సోవియట్ చేపట్టిన ‘సోయుజ్–30’ మిషన్లో పోలిష్ వ్యోమగామి మిరోస్లా హెర్మాస్జెవ్స్కీ 1978లో అంతరిక్షయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత ఉజ్నాన్స్కీ అంతరిక్షానికి వెళ్లనున్న రెండో పోలిష్ వ్యోమగామి కానున్నారు. పోలిష్ అంతరిక్ష కేంద్రం ‘పోల్సా’, ఈఎస్ఏ చేపడుతున్న ‘ఇగ్నిస్’ అంతరిక్షయాత్రకు ఎంపికైన బృందంలో ఉజ్నాన్స్కీ కూడా ఉన్నారు. ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఉజ్నాన్స్కీ, అక్కడ సాంకేతిక, జీవశాస్త్ర సంబంధిత ప్రయోగాలు చేయనున్నారు.టైబర్ కాపుసోవియట్ రష్యా చరిత్ర ముగిసిన తర్వాత తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లనున్న హంగేరియన్ వ్యోమగామి. మెకానికల్ ఇంజినీర్ అయిన టైబర్ కాపును హంగేరియన్ ప్రభుత్వం 2021లో ‘హనార్’– హంగేరియన్ టు ఆర్బిట్ ప్రయోగం కోసం ఎంపిక చేసింది. సోవియట్ హయాంలో హంగేరియన్ వ్యోమగామి బెర్టాలన్ ఫర్కాస్ ‘సోయుజ్–36’లో తొలిసారిగా 1980లో అంతరిక్షయాత్ర చేశారు. ఆ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న రెండో హంగేరియన్ వ్యోమగామి టైబర్ కాపు కావడం విశేషం. ఏఎక్స్–4 మిషన్లో ఐఎస్ఎస్కు వెళ్లనున్న టైబర్ కాపు, అక్కడ పలు సాంకేతిక ప్రయోగాలు చేయనున్నారు. -
వేసవిలో మారే మనసు..!
వేసవి అనగానే మనకు గుర్తొచ్చేది.. మండే ఎండలు, కారే చెమటలు, పిల్లల అల్లరి. కానీ వేసవి అంటే కేవలం ఈ వాతావరణ మార్పు మాత్రమే కాదు; మన ఆలోచనలను, భావోద్వేగాలను, ప్రవర్తనలను మార్చే ఒక సీజనల్ సైకలాజికల్ స్టిములస్ కూడా. ఈ వేసవి మన మనసుపై, మానసిక స్థితిపై కలిగించే ప్రభావం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు తెలుసుకుందాం.1. సూర్యకాంతి పెంచే సంతోషంవేసవిలో పెరిగిన సూర్యకాంతి మన శరీరంలో విటమిన్–డి స్థాయిని పెంచుతుంది. ఇది మెదడులో సెరటోనిన్ అనే ముఖ్యమైన న్యూరోకెమికల్ స్థాయిని పెంచుతుంది. సెరటోనిన్ ఒక ఫీల్ గుడ్ కెమికల్. ఇది శరీరంలో మూడ్ బ్యాలెన్సింగ్, నిద్ర, ఆకలి, సామాజిక ప్రవర్తనలపై ప్రభావం చూపుతుంది. మానసిక స్థైర్యానికి ఒక పునాదిలా ఉంటుంది. మానసిక శక్తి, ఉత్సాహం, జీవితానికి అర్థాన్ని తీసుకు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వేసవిలో మనకు ‘ఏదో కొత్తగా చేద్దాం’ అనే మైండ్సెట్ కలుగుతుంది. అందుకే ఎక్కువ వెలుతురు వాతావరణంలో జీవించే వ్యక్తులలో డిప్రెషన్ స్థాయులు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.2. మానసిక సంబంధాల పునరుజ్జీవం... వేసవి అనేది సహజ సంబంధాల కాలం. కలుసుకోవడానికి, పంచుకోవడానికి, బయటికి వెళ్లేందుకు ఇదొక మంచి సీజన్. పెళ్లిళ్లు, పండుగలు, పర్యటనలు– ఇవన్నీ సామాజిక బంధాలను బలపరుస్తాయి. ఈ సమయంలో మెదడులో డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మనలో ఆనందాన్ని, బంధాన్ని పెంచుతుంది. అంతేకాదు ఈ వేసవిలో మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది. ‘నేను ఎవరు?’, ‘నాకు ఏం కావాలి?’ అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం ఆలోచించగలిగే అవకాశమే వేసవి. 3. చిన్ననాటి జ్ఞాపకాల చల్లదనం... చిన్నప్పటి వేసవి జ్ఞాపకాలు మనలో భద్రత, ప్రేమ, స్వేచ్ఛ అనే భావాలను తిరిగి మేల్కొలుపుతాయి. ఈ ప్రక్రియను సైకాలజీలో ‘నాస్టాల్జిక్ రిట్రీవల్ ఫర్ ఎమోషనల్ బ్యాలెన్స్’ అంటారు. నాస్టాల్జియా వల్ల మానసిక ఒత్తిడి తక్కువ అవుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. మనిషిగా మన విలువను గుర్తించగలుగుతాం. ఇలాంటి అనుభూతులను డైరీలో రాయడం ద్వారా మానసికంగా మరింత భద్రతా స్థితిలోకి వస్తాం.4. పెరిగే మానసిక అలసట...ఎండ ఎక్కువగా ఉండటం, హ్యూమిడిటీ పెరగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో మార్పులు వస్తాయి. ఇది మన శరీరాన్ని త్వరగా అలిసిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా అడ్రినల్ గ్లాండ్స్పై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సందర్భాల్లో మెదడులో ‘ఓవర్హీట్ అయిన కంప్యూటర్’ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒత్తిడితో నిండిన మైండ్ క్లారిటీ కోల్పోతుంది. అందుకే వేసవిలో మనసు చురుకైనట్టే అనిపించినా, లోపల చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకూ ఎండ పొడ లేకుండా చూసుకోండి. 5. నిద్రలేమి నుండి నిరాశ వరకూ... వేసవిలో పగలు, వెలుతురు ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోని పైనీయల్ గ్రంథి మెలటోనిన్ను తక్కువగా విడుదల చేస్తుంది. మెలటోనిన్ అనేది మెదడులో నిద్ర ప్రారంభానికి అవసరమైన హార్మోన్. ఇది తక్కువగా ఉత్పత్తి అయితే మంచి నిద్ర ఉండదు. ఉదయం అలసట ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి ఉన్న వ్యక్తులలో ఎమోషనల్ రెగ్యులేషన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు చిన్న చిన్న విషయాల్లో కూడా అసహనానికి లోనవుతారు.వేసవిలో చేయాల్సిన పది పనులురోజూ ఉదయం 15 నిమిషాలు సూర్యకాంతిలో గడపండి. దీనివల్ల సెరటోనిన్ స్థాయులు పెరిగి మూడ్ మెరుగవుతుంది.ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవండి. మీ ఛిజీటఛ్చిఛీజ్చీn టజిy్టజిఝ ‘సర్కాడియన్ రిథమ్’ స్థిరపడుతుంది.రోజుకు కనీసం 30 నిమిషాలు మీ ఫోన్కు బ్రేక్ ఇవ్వండి.మీ ఆలోచనలను రాయండి, మీ అంతరంగాన్ని తేలిక చేయండి.తేలికపాటి వ్యాయామాలతో నెగటివ్ బాడీ ఇమేజ్ నుంచి బయట పడండి.వారానికోసారైనా ప్రకృతిలో నడవండి, ప్రయాణించండి.నచ్చిన పుస్తకాలు చదవండి, మనసుకు హాయిగా ఉంటుంది.సంగీతం, నృత్యం, పెయింటింగ్లాంటి కొత్త హాబీని ప్రారంభించండి.మీ బంధాలను రివ్యూ చేసుకుని, వాటిని బలపరచుకోండి.రోజుకు కనీసం పది నిమిషాలు మౌనంగా కూర్చుని మీ మనసు చెప్పే మాటలు వినండి. సైకాలజీ విశేష్(చదవండి: ఏఐ దేవత..! కష్టసుఖాలు వింటుంది, బదులిస్తుంది కూడా..) -
ఈ హెయిర్ గాడ్జెట్తో జుట్టు సమస్యలకు చెక్..!
నిగనిగలాడే పొడవాటి కేశాలతో వచ్చే అందమే వేరు. అయితే ఆధునిక జీవనశైలి, కాలుష్యం కారణంగా జుట్టు నిర్జీవంగా మారి, పలుచబడిపోయి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సెల్రిటర్న్ ఆల్ఫా రే హెయిర్ గాడ్జెట్ కేశ క్లేశాలకు చెక్ పెడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ అత్యాధునిక పరికరం చాలా చక్కగా పని చేస్తుంది. ఇది ఎల్ఈడీ సాంకేతికతతో పనిచేస్తుంది. తలలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది.ఈ గాడ్జెట్లో మొత్తం 720 ఎల్ఈడీ లైట్లు ఉంటాయి, వీటిలో ఎరుపుకాంతితో వెలువడే ఆల్ఫా ఈ కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోయి, వాటికి ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ పరికరాన్ని వైర్లెస్గా వినియోగించుకోవచ్చు. రోజుకు ఇరవై నిమిషాలు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఇది సాఫ్ట్, నార్మల్, పవర్ అనే మూడు వేర్వేరు మోడ్లను కలిగి ఉంటుంది. ఈ పరికరంలో ఒకదానికొకటి అనుసంధానమై టాప్, సెంటర్, ఆల్ఫా ప్యాడ్ అనే మూడు భాగాలు ఉంటాయి. క్లినికల్ అధ్యయనాల ప్రకాశం ఈ సెల్రిటర్న్ ఆల్ఫా రే హెయిర్ గాడ్జెట్ జుట్టు సాంద్రతను, మందాన్ని బాగా మెరుగుపరుస్తుంది. పని పూర్తయ్యాక దీని భాగాలను విడి విడిగా విడదీసుకోవచ్చు. దీనికి మెత్తటి దిండును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేసుకుని చిత్రంలో చూపినట్లుగా సేదతీరితే సరిపోతుంది. ఉత్తమ ఫలితాలు అందుతాయి. -
కోత తక్కువ.. కరిగించే కొవ్వు ఎక్కువ
సన్నగా నాజూకుగా ఉంటేనే అందం, ఆరోగ్యం బాగుంటాయి. కొవ్వు పెరిగి లావెక్కిపోతే, ఒంట్లో అదనంగా చేరిన కొవ్వును కరిగించడానికి చక్కని సౌందర్య చికిత్స ‘లేజర్ లిపోలిసిస్ ట్రీట్మెంట్’. ఈ చికిత్స శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడానికి ఉపయోగపడుతుంది. కొవ్వు ఎక్కువగా ఉన్న చోట చిన్న కోతలు కోసి, వాటి నుంచి ఒక సన్నని ట్యూబ్ను చొప్పిస్తారు. ఈ ట్యూబ్ ద్వారా లేజర్ను పంపి, కొవ్వు కణాలను కరిగిస్తారు. ఇలా కరిగిపోయిన కొవ్వు శరీరం నుంచి సహజంగా బయటకు పోతుంది. మరీ ఎక్కువగా ఉంటే, ఒక పరికరం ద్వారా కొవ్వును పీల్చేసి, తొలగిస్తారు. ఈ పద్ధతి లిపోసక్షన్ కంటే సులభంగా తక్కువ నొప్పితో పూర్తవుతుంది. ఇది చర్మం బిగుతుగా మారడానికి కూడా సహాయపడుతుంది. మెడ, చేతులు, తొడలు, పొట్ట వంటి ప్రాంతాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. అయితే, ఇది బరువు తగ్గించే ప్రక్రియ కాదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి చేస్తేనే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలాంటి చికిత్సలను నిపుణులైన వైద్యుల ద్వారా మాత్రమే చేయించుకోవాలి. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ముక్కు నుంచి రక్తం కారడం ప్రమాదమా..?) -
ప్రెగ్నెన్సీ టైంలో ముక్కు నుంచి రక్తం కారడం ప్రమాదమా..?
నాకు ఇప్పుడు ఏడవ నెల. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, నా ముఖం, చేతులు, కాళ్లల్లో ఒక్కసారిగా వాపులు మొదలయ్యాయి. ఇది సాధారణమా లేక ప్రమాదమా?– లక్ష్మీ, నెల్లూరు. వాపు అనేది శరీర భాగాలలో ద్రవం నిలిచిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఇది గర్భధారణ సమయంలో తరచుగా కనిపించేదే. సాధారణంగా ఎక్కువ సేపు కూర్చోవటం, నుంచోవటం వలన ప్రెగ్నెన్సీలో వస్తుంది. ఎక్కువ ఉప్పు పదార్ధాలు తిన్నా, బరువు ఎక్కువ ఉన్నా, బీపీ మందులు, స్టెరాయిడ్స్, ఇతర మందులు వాడుతున్నా వస్తుంది. చాలా అరుదుగా కాలేయం, గుండె, మూత్రపిండాల సమస్యల వల్ల కూడా ఈ వాపులు రావచ్చు. ప్రెగ్నెన్సీలో వచ్చే సాధారణ వాపు ఎక్కువగా రాత్రి వేళల్లో కనిపిస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది. కానీ, ఒక్కసారిగా వాపు రావడం, బీపీ పెరగడం, తలనొప్పి, చూపు మసకబారడం వంటివి కనిపిస్తే అది ప్రీ ఎక్లాంప్షియా అంటాం. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ వాపులు ప్రెగ్నెన్సీలో నెలలు పెరిగే కొద్దీ, ఆ బరువుకి కాళ్లలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటంతో వస్తుంది. ఇది తగ్గించుకోవడానికి ఎక్కువ సేపు నిలబడకూడదు. అనుకూలమైన సాక్సులు, చెప్పులు వేసుకోవాలి. బాగా వాకింగ్, వ్యాయామం చేయాలి. ఒకసారి మీరు డాక్టరుని కలిస్తే బీపీ, బరువు అన్నీ పరీక్షించి ఇది నార్మల్ ఏనా కాదా అనేది చెప్తారు.నేను మూడునెలల గర్భవతిని. చాలా అలసటగా ఉంటుంది. నిద్ర పట్టడం లేదు. నిద్రలో చెడు కలలు ఎక్కువగా వస్తున్నాయి. ఏం చేయాలో చెప్పండి?– నందిని, సంగారెడ్డి.ప్రెగ్నెన్సీలో హార్మోన్ల మార్పుల వలన మొదటి మూడు నెలల్లో అలసట, బలహీనత, నిస్సహాయత భావం ఎక్కువగా ఉంటుంది. ఇవి మానసికంగా చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే, అన్నింటికీ సమాధానం విశ్రాంతి తీసుకోవటమే. ఈ సమయంలో కాళ్లు రెండు ఎత్తులో పెట్టుకొని కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. నెలలు నిండిన తర్వాత అధిక బరువుతో బలహీనంగా, డల్గా ఉంటారు. పొట్ట పెరిగే కొద్దీ నిద్రపట్టడం కష్టం కావచ్చు. దీని వలన బేబీకి ఏ ప్రమాదం ఉండదు. రిలాక్సినేషన్, బ్రీతింగ్ టెక్నిక్స్ పాటించాలి. మృదువైన దిండు వాడటం, నిద్రకు అనుకూలంగా పడుకోవడం చేయ్యాలి. అంటెర్నల్ క్లాసెస్లలో ఇవీ నేర్పిస్తారు. వ్యాయామం చేయటం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆహారం తిన్న తర్వాత తప్పకుండా వాకింగ్ చెయ్యాలి. కొంతమందికి నిద్రలేమితోపాటు అలసట, చిరాకు, నిస్సహాయత భావం, పనుల మీద ఆసక్తి లేకపోవటం ఉంటాయి. ఇవి ఉంటే డిప్రెషన్ కావచ్చు. ఇలాంటి సమయంలో మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. ఒక వారం నుంచి ముక్కు నుండి రక్తం వస్తోంది. ఐస్ ప్యాక్ పెట్టుకోమన్నారు. ఇది సాధారణమేనా? ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?– మమత, యాదాద్రి.ప్రెగ్నెన్సీలో ముక్కులో ఉండే రక్తనాళాలు విస్తరించి, సున్నితంగా మారుతాయి. అప్పుడు ముక్కు నుంచి రక్తం రావడం సాధారణమే. ఇది హార్మోన్ల మార్పులు, ఎక్కువ రక్త ప్రసరణ వలన జరుగుతుంది. కొంతమందికి కొన్ని సెకన్ల నుంచి నిమిషాలపాటు రక్తం రావచ్చు. నిద్రలో కూడా ఇలా జరగచ్చు. ఇలా అయినప్పుడు వెంటనే నిటారుగా కూర్చొని, ముక్కు పై భాగాన్ని గట్టిగా మూసివేసి కొన్ని సెంకడ్ల పాటు పట్టుకుంటే తగ్గిపోతుంది. నోటితో శ్వాసతీసుకోవటం మంచిది. ఐస్ప్యాక్ పెట్టుకోవచ్చు. అలా చేసినా తగ్గకపోతే డాక్టర్ని కలవాలి. ముక్కుని ఎక్కువ చీదటం, కిందకు వంగటం, వ్యాయామం చేయటం ఒక రెండు రోజులు మానేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల్లో తగ్గకపోతే, వెంటనే డాక్టర్ని కలవాలి. అలసటగా, బలహీనంగా ఉన్నా డాక్టర్ను కలవాలి. ఆసుపత్రిలో సన్నని గాజుగుడ్డతో నోస్ ప్యాకింగ్ చేస్తారు. తగ్గిన తర్వాత యాంటీసెప్టిక్ క్రీమ్స్ ముక్కు లోపల ఉపయోగించమని చెప్తారు. ఈ క్రీమ్స్ వలన క్రస్టింగ్, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. కానీ, కొన్ని కేసెస్లో బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్నా, రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతున్నా, ఈ బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. అందుకే వెంటనే ఆసుపత్రికే వెళ్లాలి. (చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..) -
నోరూరగాయ.. ఆవకాయ..! ఇప్పుడు చాలా కాస్టలీ గురూ..
‘ముద్దపప్పు మిత్రమై వర్థిల్లే ఆవకాయ వేసవిలో పుట్టి చవులూరించే ఆవకాయ‘ వేసవి వచ్చిందంటే చాలు వంటగదిలో హడావుడి మొదలయ్యేది.. ఆ ఏడాది ఆవకాయ పెట్టే కార్యక్రమం గురించి చర్చోపచర్చలు జరిగేవి.. మంచి మామిడి కాయలు తెచ్చుకోవాలి.. కరెక్ట్ సైజులో ముక్కలు కొట్టించాలి.. సరైన మోతాదులో సంబారాలన్నీ కలుపుకోవాలి.. శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఎందుకంటే ఏడాదంతా నిల్వ ఉండాలి కదా.. ఆవకాయ పెట్టే విధానం గురించి కొత్త కోడలికి పాఠాలు.. సరిగ్గా నేర్చుకోవడం లేదని కూతురికి అక్షింతలు.. ఇంటి పెద్ద హడావుడే హడావుడి.. ఇదంతా గతం. ఇప్పుడు ఆవకాయ పెట్టే ఓపిక, తీరిక ఎవరికుంది? ఆవకాయ పెట్టడం ఎందరికి వచ్చు? పెరిగిన ధరలతో అది భారంగా మారిన వేళ అంత శ్రమ ఎవరు తీసుకుంటారు?ఊరగాయ ఒక్కటి చాలు.. ముద్దపప్పులో కలుపుకొని తినొచ్చు.. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఆరగించవచ్చు.. పెరుగన్నంతో నంజుకుంటూ.. ఆహా ఏమి రుచి అని రాగాలు తీయవచ్చు. ఎక్కువ వంటలు చేయడానికి అవకాశం లేకపోతే ఆ పూట గడిపేయడానికి ఊరగాయ ఒక్కటి చాలు.. కానీ ఏం లాభం.. ఈ తరం రుచులే మారిపోయాయి. వారు కొత్త కొత్త వంటకాలు కోరుతారు. బీపీ పెరుగుతుందని తినే వారిని కూడా తిననివ్వరు. ఇదీ నేటి పరిస్థితి. అయితే ఆవకాయ పెట్టడం అంత ఆషామాషీకాదు. తగ్గిన మామిడి దిగుబడి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఆవకాయ వాసనలు అక్కడక్కడ మాత్రమే ముక్కుపుటాలను సోకుతున్నాయి. ధరల దరువు కొన్ని దశాబ్దాలుగా ఆవకాయ పచ్చడితో ఆంధ్రులకు మంచి అనుబంధం ఉంది. ప్రతి ఇంటా కచ్చితంగా తయారు చేసేవారు. కానీ సరకుల ధరలు ఆకాశాన్నంటడంతో రానురాను ఆవకాయ పెట్టేవారు తగ్గిపోతున్నారు. 40 మామిడి కాయలనుపయోగించి ఆవకాయ పెట్టాలంటే సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం మామిడి కాయల దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్లో మామిడి కాయలు ఒక్కొక్కటి రూ.20లకు కొనుగోలు చేసి ఆవకాయ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నాణ్యమైన మామిడి కాయలేవీ? వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. దీనికితోడు తెగుళ్లు కూడా బాగా సోకడంతో నాణ్యమైన మామిడి కాయలు దొరకడం కష్టంగా ఉంటోందని గృహిణులు, పచ్చడి తయారీదార్లు వాపోతున్నారు. ఆవకాయ కోసం ఎక్కువగా కోలంగోవా, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, కలెక్టర్ తదితర రకాల మామిడి కాయలను వినియోగిస్తుంటారు. ఈ ఏడాది కలెక్టర్ మినహా మిగతా రకాల మామిడి కాయల దిగుబడి తగ్గిపోయింది. ఏడాదిపాటు నిల్వ ఉండే ఆవకాయకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన సమయంలో లేతపరువుతో ఉన్న కాయలనే ఆవకాయ కోసం వినియోగిస్తుంటారు. కొత్తపల్లి కొబ్బరి కాయ రకంతోనే ఆవకాయ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నాణ్యమైన మామిడికాయల కొరత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది సొంతంగా ఆవకాయ పెట్టుకునే బదులు సీజనల్ వ్యాపారుల వద్ద సూపర్మార్కెట్లో లభించే ఆవకాయ డబ్బాలను కొనుగోలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్ని వ్యయప్రయాసలు పడి నిల్వ ఉండే పచ్చళ్లు పెట్టే బదులు మార్కెట్లో రెడీమేడ్గా దొరికే పచ్చళ్లు కొనుగోలు చేయడానికే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసిన ఆవకాయకు మరేదీ సాటి రాదన్న ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ఇళ్లల్లోనే తయారు చేసేవారూ ఉన్నారు. ఆవకాయ చాలా కాస్ట్లీ గురూ.. 40 మామిడి కాయలతో ఆవకాయ పెడితే ఖర్చు ఇలా అవుతోంది. మామిడి కాయల ధర రూ.800లు, పొట్టు తీసిన ఆవపొడి 2 కిలోలు రూ.560లు, కారం 2 కిలోలు రూ.1450లు, 2 కిలోల దంపిన ఉప్పు రూ.100లు, వెల్లుల్లి కిలో రూ.200లు, గానుగ నూనె 4 కిలోలు రూ.1600లు, కాయలు ముక్కలుగా కోయించడానికి రూ.240లు.. ఇలా 40 కాయల ఆవకాయకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతోంది. ఒక కాయకు ఖర్చు రూ.124లు అవుతోంది. ఒక మామిడి కాయను 12 ముక్కలుగా కట్ చేస్తారు. ఈ లెక్కన ఒక ఆవకాయ ముక్క ఖరీదు రూ.10లు పడుతోంది.జాగ్రత్తలు తీసుకుంటేనే ఎక్కువ కాలం నిల్వ నిల్వ ఉండే ఊరగాయలు సొంతంగా పెట్టుకుంటేనే మంచిది. ఆవకాయ పెట్టినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. నాణ్యమైన మామిడికాయలు తెచ్చుకోవాలి. నెంబర్ వన్ సరకులు ఉపయోగించాలి. గానుగ నూనె వాడటం మంచిది. మాగాయి, తొక్కుడు పచ్చడి వంటి వాటికి ఉప్పులో ఊరబెట్టి అప్పటికప్పుడు ఉప్పు కారం నూనె వంటివి కలుపుకుని వాడుకోవచ్చు. ఆవకాయ అలా కాదు కదా అన్ని ఒకేసారి కలుపుతాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 50 మామిడి కాయలతో ఊరగాయ పెట్టాలంటే రూ.6 వేలకు పైగానే ఖర్చవుతోంది. తప్పని పరిస్థితుల్లో ఖర్చయినా ఇళ్లల్లో వాడకం కోసం పెట్టక తప్పడం లేదు. తయారు చేసిన ఆవకాయను పింగాణీ జాడీల్లో పెడితే పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచకూడదు. – విశ్వమోహిని, గృహిణి, ఉద్దండపురం(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..) -
సన్నని సైజుకు లావైన డిస్కౌంట్..! ఇది మాములు ఆఫర్ కాదు..
థాయ్ల్యాండ్లోని ఓ రెస్టారెంట్, కస్టమర్స్కి విచిత్రమైన ఆఫర్ ఇస్తోంది. ఇక్కడ భోజనం ఆర్డర్ చేయడానికి ముందు ‘మెటల్ గేట్ చాలెంజ్’ అనే ఫిట్నెస్ టెస్ట్లో పాల్గొనాలి. అంటే ఒక ఐదు రకాల వెడల్పు అయిన మెటల్ బార్స్ మధ్య ఏర్పాటు చేసిన సన్నని సందు నుంచి బయటకు రావాలి. ఎంత సన్నని సందు నుంచి బయటకు వస్తే, అంత పెద్ద డిస్కౌంట్ ఇస్తారు. అలా ఐదు నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ పొందచ్చు. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వివిధ చర్చలకు దారితీసింది. చాలామంది ఫన్నీగా తీసుకున్నా, కొంతమంది మాత్రం దీనిని బాడీషేమింగ్గా పేర్కొంటూ మండిపడుతున్నారు. కాని, హోటల్ యజమానులు మాత్రం ‘ఇది ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి చేసిన వినోదాత్మక ప్రయోగం’ అని అంటున్నారు. View this post on Instagram A post shared by Ameana Finds (@ameana_finds) (చదవండి: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!) -
నటి ప్రియాంక మోహన్ ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..! ఎక్కడికెళ్లినా అది తప్పనిసరి..
ట్రెండ్స్ వెంట పరుగెత్తకుండా, సింపుల్ స్టయిలింగ్తోనే క్లాసీ లుక్ చూపించే నటి ప్రియాంక మోహన్. చీరలైనా, మోడర్న్ డ్రెసుల్లోనైనా తన ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రం సింపుల్ అండ్ ఎలిగెన్స్గానే ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఎలిగెన్స్నూ చూపిస్తోంది ఈ ఫ్యాషన్ బ్రాండ్స్తో..ఫ్యాషన్లో ఎప్పుడూ స్థానాన్ని కోల్పోని క్లాసిక్ ఆభరణమే ఈ మల్టీ లేయర్ చోకర్. మగువ మెడను అంటిపెట్టుకొని ఉంటూ అందాన్ని వెంట తీసుకొని వస్తుంది. అందుకే, చోకర్స్పై మోజూ ఎప్పటికీ తరగనిది. సాధారణ చోకర్స్ మాదిరి కాకుండా రెండు నుంచి ఐదు వరుసల వరకు ముత్యాలు, వివిధ పూసలతో తయారుచేసే వీటికి మధ్యలో ఒక డాలర్ తగిలిస్తే వాటి అందం మరింత ఆకట్టుకునేలా మారుతుంది. కాటన్, సిల్క్, ఆర్గంజా చీరలు, లెహంగాలకు డీప్ నెక్ బ్లౌజులతో ధరిస్తే ఎవ్వరికైనా బాగా నప్పుతుంది. అనార్కలీలకు కూడా అద్భుతంగా మ్యాచ్ అవుతుంది ఈ చోకర్. అయితే, ఈ చోకర్ ధరించినప్పుడు మినిమల్ జ్యూలరీతో స్టయిల్ చేసుకోవడం ఉత్తమం. చెవులకు చిన్న స్టడ్స్, సింపుల్ ఉంగరం ధరించాలి. అలాగే హెయిర్ స్టయిల్స్ కూడా సింపుల్ బన్ లేదా వేవీ హెయిర్ స్టయిల్స్ ట్రై చేసి, చోకర్ అందాన్ని హైలెట్ చేసేయొచ్చు. వివాహాది శుభకార్యాలకు, స్పెషల్ డేస్కు ఈ టిప్స్తో స్టయిలింగ్ చేసి, మినిమలిస్టిక్ గ్రేస్ఫుల్ లుక్ సొంతం చేసుకోండి అచ్చం నటి ప్రియాంక మోహన్లా. "చర్మం ఎంత నేచురల్గా ఉంటే అంత అందంగా కనిపిస్తాం. అందుకే, మినిమల్ మేకప్నే ప్రిఫర్ చేస్తా. ఇక ఎక్కడికెళ్లినా సరే, సన్ స్క్రీన్ తప్పనిసరి. అంటోంది". ప్రియాంక మోహన్. (చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..) -
Istanbul Airport: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!
చేతిలో ఐఫోన్, ముంజేతికి రోలెక్స్ వాచ్ ఉన్న వాడు కాదు రిచ్కిడ్ అంటే, ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో బర్గర్ తిన్నవాడే నిజమైన రిచ్కిడ్. ఎందుకంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాశ్రయాల్లో ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడి తినుబండారాల ధరలు ఏకంగా అంతరిక్షాన్నే దాటేస్తున్నాయి. ఒక లాసాగ్నే (ఇటాలియన్ వంటకం) రూ. 2,180. అదిపెద్ద డిన్నరేం కాదు, ఈ వంటకంలోని చిన్న ముక్క మాత్రమే సర్వ్ చేస్తారంతే! ఇక చిన్న బర్గర్ ధర అయితే రూ. 2,245, నాలుగు చికెన్ వింగ్ ఫ్రైస్ రూ.1,560. బయట దొరికే బీరు బాటిల్ రూ.రెండువందలైతే, ఇక్కడ బీరు ధర రూ. 1,915. అది కూడా పూర్తిగా బాటిల్ ఇవ్వరు, కేవలం వంద మిల్లీలీటర్లే! వీటి ధరలన్నీ తెలిసి తలనొప్పి వస్తుందని ఒక కప్పు కాఫీ అడిగారో మరో రూ. 700 ఖర్చు చేయాలి. అదీ తెలిసి, బీపీ పెరిగిందని కనీసం అరటిపండు కొనాలనుకుంటే రూ.535 ఖర్చు చేయాలి. చివరికి మంచినీళ్లు అయినా తాగి గొంతు తడుపుకుందాం అనుకుంటే లీటరు వాటర్ బాటిల్ రూ. 300. ఏదేమైతేనేం, బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని అయినా, అంత ఖర్చు చేసి, బాగా తిని రిలాక్స్ అయ్యారనుకోండి, మీ బ్యాగ్ జాగ్రత్త! ఎందుకంటే, ప్రపంచంలోనే చోర భయం ఎక్కువగా ఉండే ఎయిర్పోర్టుల్లో ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు నంబర్ వన్ అని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ కంటే ముందే బ్యాగు, పర్సు రెండూ టేకాఫ్ అయిపోతున్నాయని ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు బాధితులు సోషల్ మీడియాలో లబోదిబో మంటున్నారు.(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..) -
చాక్లెట్ కేక్.. దుబాయ్ షేక్
స్వీట్ ప్రియులకు సిటీలో కొదవలేదు. అయితే అలాంటి స్వీట్స్లోనూ చాక్లెట్లదే హవా.. వాటిలోనూ డార్క్/ మిల్క్ చాక్లెట్లకు ప్రత్యేక గుర్తింపు. అందుకే మార్కెట్లో వీటి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదే క్రమంలో ఇటీవల కాలంలో ట్రెండ్గా మారింది దుబాయ్ కునాఫా చాక్లెట్ బార్. ఇప్పుడు నగరంలోని చాక్లెట్/ స్వీట్స్ ప్రియుల నోరూరిస్తూ రుచి చూసి తీరాల్సిన ఐటమ్గా అవతరించింది. మరి అలాంటి కునాఫా చాక్లెట్ ఎక్కడిది? కథా కమామీషు ఏమిటి? లస్తీనా, సిరియా, ఈజిప్్టలలో ఈ కునాఫా/కునాఫె అనేది సంప్రదాయంగా పాపులర్ డెసర్ట్. ఈ సంప్రదాయ తియ్యని రుచితో చాక్లెట్ మేళవింపే ఈ సరికొత్త దుబాయ్ కునాఫా చాక్లెట్ బార్. పిస్తా క్రీమ్తో పాటు తురిమిన కటైఫీ (ఫిల్లో పేస్ట్రీ లాంటిది), తహినితో నింపిన మిల్క్ చాక్లెట్ ఇది. దీనిని ఫిక్స్ డెసర్ట్ చాక్లెటీర్ అనే సంస్థ తొలిసారిగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఫిక్స్ డెసర్ట్ చాక్లెట్ టైర్ పేరిట ఈ చాక్లెట్ బార్లు ప్రస్తుతం దుబాయ్ అబుదాబిలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. వైరల్..హల్చల్.. గత డిసెంబర్ 2023లో వైరల్ అయిన ఓ టిక్టాక్ వీడియో వల్ల ఈ దుబాయ్ కునాఫా చాక్లెట్ బార్ ప్రపంచ సంచలనంగా మారింది. మధ్యప్రాచ్య దేశాలకు చెందిన డెజర్ట్ కునాఫాతో రిచ్ చాక్లెట్ కలయిక ఈ చాక్లెట్ బార్ డిమాండ్ పెరుగుదలకు దారితీసింది. ఏ స్థాయిలో అంటే దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా పిస్తాపప్పు కొరత, వాటి ధరల పెరుగుదల కూడా ఏర్పడింది. సిటీలో ట్రెండ్ సెట్.. దుబాయ్ కునాఫా చాక్లెట్ ట్రెండ్ నగరంలోని బేకర్లు డెజర్ట్ తయారీదారుల్లో సృజనాత్మకతకు ఊతమిచి్చంది. పలు బేకరీలు, కేఫ్స్, స్వీట్ స్టోర్స్, చాక్లెట్ బ్రాండ్లు దీనిని అనుసరిస్తూ తమ సొంత వెర్షన్లను విడుదల చేశాయి. కొన్ని కునాఫా చాక్లెట్ బార్లకు కొత్త రుచులు జత చేస్తున్నాయి. కునాఫా–స్టఫ్డ్ డేట్స్, కునాఫా చీజ్కేక్ల వంటి ఇతర కునాఫా–ప్రేరేపిత ఉత్పత్తులను అందిస్తున్నాయి. కునాఫాతో నింపిన ఖర్జూరాలు కునాఫా చీజ్కేక్ల నుంచి కునాఫా డోనట్స్ వరకు, స్థానిక స్వీట్ తయారీదారులు తమ సిగ్నేచర్ క్రిస్పీ కునాఫా రిచ్ చాక్లెట్ కాంబినేషన్తో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.టేస్టీ..క్రియేటివిటీ.. నగరానికి చెందిన జ్యూసీ చాక్లెట్స్ కునాఫా చాక్లెట్ బార్కు కొత్త వెర్షన్ సృష్టించింది. ‘ఈ ట్రెండ్లో భాగం పంచుకుంటూ పిస్తా కునాఫా ఫ్రెంచ్ టోస్ట్, పిస్తా కునాఫాతో స్ట్రాబెర్రీలను పరిచయం చేశాం. మా ఇఫ్తార్ ప్లేటర్లో పిస్తా కునాఫా కేక్ కూడా తోడయ్యింది అంటున్నారు నగరంలోని ఎట్–సి కేఫ్కు చెందిన అంజు నారంగ్ అగర్వాల్, నగరంలో నుటెల్లా కునాఫా చాక్లెట్ బార్, లోటస్ బిస్కాఫ్ చాక్లెట్ బార్, హాజెల్ నట్ చాక్లెట్ బార్, సాల్టెడ్ కారామెల్ చాక్లెట్ బార్ వంటివి ఈ ట్రెండ్లో భాగంగా పుట్టుకొచి్చనవే. ఈ సందర్భంగా నగరానికి చెందిన ఓ కేఫ్ డైరెక్టర్ అపర్ణ మాట్లాడుతూ ‘వ్యక్తిగతంగా డార్క్ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. కునాఫా చాక్లెట్ బార్ కొత్త రకం తియ్యదనంతో ఉంది. అందుకే అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటోంది’ అన్నారు. దీని గురించి కరాచీ బేకరీ ప్రతినిధులు మాట్లాడుతూ ‘దుబాయ్ కునాఫా చాక్లెట్ ట్రెండ్కు మా ఫ్లేవర్ని మేళవించాం. మెత్తటి చాక్లెట్ గింజల కలయికగా మా స్టైల్లో తయారైన క్రిస్పీ కునాఫా మరింత టేస్టీగా అందరికీ దగ్గరైంది’ అని చెప్పారు.సొంత ఫ్లేవర్తో.. ప్రస్తుతం కునాఫా బేస్డ్గా తయారైన చాక్లెట్, డెసర్ట్స్కు సిటీలో ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో కునాఫా చాక్లెట్ బార్కు సంబంధించిన వెరైటీ వెర్షన్స్ను అందిస్తున్నారు. మేం కూడా డార్క్, మిల్క్ చాక్లెట్స్, ఆయిల్ పిస్తా, క్రీమ్స్తో పాటు మరికొన్ని కలిపి డిఫరెంట్ టేస్ట్తో తయారు చేశాం. అన్నింటి కన్నా ముఖ్యంగా ఈ రుచిని సిటీలో అందరికీ చేరువ చేయాలనే ఆలోచనతో అందుబాటు ధరలో అందిస్తున్నాం. – సయ్యద్ లుక్మాన్, సుభాన్ బేకరీ -
అనగనగా ఓ కేసు!
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిన్ డినైడ్’ అనేది న్యాయశాస్త్ర ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ కొన్ని కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మానవ వనరుల లేమి, మౌలిక వసతుల కొరత సహా అనేక కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో ఉన్న కుషాయిగూడ పోలీసుస్టేషన్లో 2001 ఫిబ్రవరిలో నమోదైన ‘భారీ దొంగతనం’ కేసు విచారణ కోర్టులో 24 ఏళ్లు సాగింది. చివరకు 2025 ఏప్రిల్ 2న వీగిపోయింది. ఈ కేసులో పదిమంది నిందితులు ఉండగా, కోర్టు తీర్పు వెలువడే నాటికి ఐదుగురు చనిపోయారు. అది కుషాయిగూడలోని కమలనగర్ ప్రాంతం. అక్కడి శ్రీ సాయి అపార్ట్మెంట్లో ఎ.కృష్ణమూర్తి అనే వ్యాపారి ‘రూప క్లాత్ ఎంపోరియం’ పేరుతో వస్త్ర దుకాణం ఏర్పాటు చేశారు. విక్రయాల కోసం పనివాళ్లను ఏర్పాటు చేసుకోకుండా, స్వయంగా నిర్వహణ బాధ్యతలు చూసుకునే వారు. నాటి వ్యాపార వేళలు నేటికి భిన్నంగా ఉండేవి. సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటలకే వస్త్ర దుకాణాలు తెరుచుకునేవి. ఎప్పటిలాగే 2001 ఫిబ్రవరి 16 ఉదయం ఆయన తన షాపు తెరిచారు. ఆ వెంటనే తన దైనందిన కార్యకలాపాల్లో ముగినిపోయారు. ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు ఉదయం 11 గంటలకే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు రావడం ప్రారంభమైంది. దీంతో ఆ రోజు తన పంట పండిందని భావిస్తూ కస్టమర్లకు స్వాగతం పలికారు. అలా వచ్చిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఎవరికి వారు తమకు కావాల్సిన వస్త్రాలను చూపించాలని కోరడంతో దుకాణం మొత్తం హడావుడి నెలకొంది. అయితే చివరకు కృష్ణమూర్తి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు.కస్టమర్లు వెళ్లిపోయాక వారికి చూపించడానికి బయటకు తీసిన వస్త్రాలన్నింటినీ కృష్ణమూర్తి సర్దుకోవడం మొదలెట్టారు. అప్పుడు స్టాకులో తేడా రావడాన్ని గమనించి, దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. షాపు తెరిచిన వెంటనే కొనుగోలుదారులుగా వచ్చిన వాళ్లల్లో ఎవరో తస్కరించినట్లు అనుమానించారు. దుకాణం మూసి బయటకు వెళ్లిన కృష్ణమూర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన నేరుగా కుషాయిగూడ పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడంటే ఏదైనా ఓ నేరం జరిగిందని ఫిర్యాదు వచ్చిన వెంటనే సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్, నిందితులు వినియోగించిన సెల్ నెంబర్, ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నెంబర్ల పైనే పోలీసుల దృష్టి పడుతోంది. సీసీ కెమెరాలు లేని, సెల్ఫోన్లు అంతగా వినియోగంలోకి రాని రోజులు కావడంతో సంప్రదాయ దర్యాప్తు విధానాలతోనే ముందుకు వెళ్లారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నగరంలోని పాత నేరగాళ్ల వివరాల ఆరా తీశారు. ఇలాంటి నేరాలు గతంలో చేసిన వాళ్లు ఎవరెవరు? ప్రస్తుతం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తదితర అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు వేగులకూ పని చెప్పారు. నేరం జరిగిన తీరును బట్టి వ్యవస్థీకృత నేరగాళ్ల పనిగా భావించారు. ఇలాంటి వాళ్లు పదేపదే నేరాలు చేసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలోని అన్ని వస్త్రదుకాణాల యజమానులను అప్రమత్తం చేశారు. కుషాయిగూడ పోలీసులు తీసుకున్న ఈ చర్య ఫలితాన్ని ఇచ్చింది. రూప క్లాత్ ఎంపోరియంలో చోరీ జరిగిన వారం రోజులకు మరో వస్త్ర దుకాణాన్ని టార్గెట్ చేసిన ముఠాలోని కొందరు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ షాపులో బేరసారాలు చేయడం మొదలెట్టారు. వీరి వ్యవహారశైలి, వస్త్రధారణ, నేరం చేసే తీరు తదితర అంశాలపై పోలీసులు ప్రచారం చేసి ఉండటంతో ఆ దుకాణం యజమాని గుర్తించాడు. వెంటనే స్థానికుల సహాయంతో పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, పోలీసుస్టేషన్కు తరలించారు. ఆ నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. రూప క్లాత్ ఎంపోరియంలోకి తమతో పాటు వచ్చి, నేరంలో పాలుపంచుకున్న అనుచరుల వివరాలను బయటపెట్టారు. దీంతో కుషాయిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మొత్తం పది మందిని అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని లంబాడికుంట తండాకు చెందిన ఈ పదిమంది వ్యాపారి కృష్ణమూర్తి దృష్టి మరల్చి చోరీ చేసినట్లు తేల్చారు. ఆధారాలు సేకరించిన కుషాయిగూడ పోలీసులు న్యాయస్థానంలో అదే నెల 28న అభియోగపత్రాలు దాఖలు చేశారు. కాలక్రమంలో బెయిల్ పొందిన నిందితులు జైలు నుంచి బయటకు రాగా, కొన్నాళ్లకు కేసు విచారణ ప్రారంభమైంది. అనివార్య కారణాల వల్ల 2025 ఏప్రిల్ 2 వరకు దీని విచారణ కొనసాగింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో సబ్ ఇన్స్పెక్టర్గా (ఎస్సై) ఉన్న అధికారి పదోన్నతుల తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) హోదాలో కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 2001లో నిందితుల కోసం గాలించిన పోలీసులు కొన్నాళ్లకు ఫిర్యాదుదారుడైన కృష్ణమూర్తి, ఇతర సాక్షుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. న్యాయస్థానంలో వీరు చెప్పే సాక్ష్యాలు అత్యంత కీలకం. అయితే కేసు విచారణ కీలక దశకు చేరుకునే సరికి కృష్ణమూర్తి తన వ్యాపారం మానేశారు. శ్రీసాయి అపార్ట్మెంట్స్తో పాటు అప్పట్లో ఆయన నివసించిన ఇంటి వద్దకూ వెళ్లిన పోలీసులు కృష్ణమూర్తి వివరాల కోసం ఆరా తీశారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, కృష్ణమూర్తితో పాటు ఇతర సాక్షుల ఆచూకీ లభించలేదు. ఈ కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడితో (ఏ–1) పాటు మూడు, నాలుగు, ఐదు, పదో నిందితులు చనిపోయారు. మిగిలిన ఐదుగురిపై తుది వరకు విచారణ సాగినా, చివరకు కేసు వీగిపోయింది. ఇన్ని మలుపులు తిరిగిన ఈ కేసులో కృష్ణమూర్తి దుకాణం నుంచి చోరీ అయినవి ఏంటో తెలుసా? ఐదు తానుల కాటన్ వస్త్రం, మూడు లంగాలు, ఒక రవిక ముక్క. కుషాయిగూడ పోలీసు రికార్డుల ప్రకారం అప్పట్లో వీటి విలువ రూ.8 వేలు. -
యువ కథ: వసంత కోకిల
భానుడు భగ భగమంటూ నిప్పులు కురిపిస్తున్న వేసవిలో ఉసురుమంటూ ‘ఏమేవ్! కాసిన్ని మంచినీళ్లు తీస్కునిరావే’ అంటూ వాలుకుర్చీలో కూలబడ్డాడు గురుమూర్తి. పంకజం భర్త కేక విని చెంబుడు నీళ్లతో పరుగున ప్రత్యక్షమైంది. నీళ్ల చెంబు అందుకుంటూ, ‘అబ్బా ఏమి ఎండలో! ఎండిన గడ్డిలాగా అయిపోతున్నాం’ అంటూ దాహం తీర్చుకుని చెంబు చేతికిచ్చాడు. ‘ఇదిగో ఒక పావుగంట అయినాక భోజనం వడ్డించు. తిని బయలుదేరాలి’ అంటూ పడకగది వైపు వెళ్ళాడు. పంకజం భోజనం వడ్డించి, భర్త కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో ‘ఒసేయ్ ఇంటిదానా ఇటు రా!’ బిగ్గరగా అరిచాడు గురుమూర్తి. కంగారుగా పరుగు పెట్టింది పంకజం.‘ఏమిటి ఏమైంది?’ అంటూ ఆత్రంగా అడిగింది. కోపంతో ఊగిపోతూ, ‘ఈ ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది?’ అంటూ శివాలెత్తాడు. ఆ ఫోటో వాళ్ళ కూతురు కోకిలది. ఆ ఫోటో అందుకుంటూ, కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ‘అది బూజు దులిపేటప్పుడు ఇక్కడ పెట్టాను’ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పంకజం.గురుమూర్తి భోజనం చేసి మధ్యాహ్నం బండికి పట్నం బయలుదేరాడు ఆస్తుల రిజిస్ట్రేషన్ కాగితాల కోసం.సాయంత్రం సంధ్యా దీపం పెట్టి, ఆరుబయట వరండాలో మామిడిచెట్టు అరుగుపైన కూర్చుని మల్లెపూలు అల్లుతోంది పంకజం. ఒక్కో పువ్వు తీసుకుంటూ, ఒక్కో జ్ఞాపకం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా, దూరపు చుట్టం కాంతమ్మ వచ్చింది.‘వదినా ఓ వదినా! హమ్మయ్య ఇక్కడున్నావా? ఇల్లంతా వెదికి వస్తున్నా సుమీ!’ అంది. పంకజం తేరుకొని, ‘వదినా బాగున్నావా? అందరూ క్షేమమేనా?’ అంటూ కుశల ప్రశ్నలడిగి, దాహం ఇచ్చింది. ‘అంతా బాగుంది కాని, వదినా నేను విన్నది నిజమేనా?’ అంటూ ఉండగానే, పంకజం మధ్యలో ఆపి, ‘సరే వదినా! మర్చిపోయాను గుడికి వెళ్ళాలి ఏమనుకోకు. తయారవడానికి వెళుతున్నా. తర్వాత మాట్లాడుదాం’ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ‘ఇదేం చోద్యమో’ అనుకుంటూ కాంతమ్మ వీధిలోకి నడిచింది.కాసేపయ్యాక పంకజం ‘మాట దాటేయటానికి గుడి అన్నాను కానీ ఒకసారి గుడికెళ్లి వస్తే కాస్త మనసు కుదుటపడుతుంది’ అనుకుని గుడికి బయల్దేరింది. దర్శనం అయ్యాక, గుళ్లో కూర్చుని ఒక్కసారిగా గతం గుర్తు చేసుకుంది.కట్టుబాట్లు çపరువుప్రతిష్ఠలే ప్రాణప్రదంగా జీవించే మనస్తత్వం గురుమూర్తిది. అందులోనూ ఆడపిల్లకి గురుమూర్తి తనకు తాను కొన్ని కట్టుబాట్లు పెట్టాడు. అందుకేనేమో ఆ దేవుడు ఆయనకి ఒక్కగానొక్క కూతుర్ని ఇచ్చాడు. చూడటానికి రెండు కళ్లూ చాలవన్నంత అందం అమ్మాయిది. పేరు కోకిల.ఈ కాలంలో కూడా చిన్నప్పటి నుండి పరదా వెనుక నుంచే కోకిల చదువు, సంగీతం అన్నీ. కాని, పెద్దచదువు చదివి, మంచి ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే భావాలు ఆమెవి. గురుమూర్తి చాదస్తపు కట్టుబాట్ల వల్ల తన కోరిక ఒక ఎండమావిలా అగుపించేది. ఎలాగోలా ఓపెన్లో ఇంటర్ పరీక్షలు రాసింది. కాని, అసలైన పరీక్ష తన పెళ్లి అని తనకి తెలియదు. గురుమూర్తి కోకిల కోసం పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసి తల్లి దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంది కోకిల. తల్లి పంకజం ఏమీ చేయలేని నిస్సహాయురాలని గ్రహించి, నేరుగా తండ్రితోనే తాను అనుకున్నది చెప్పాలనుకుంది. ఒకరోజు వసారాలో పేపర్ చదువుతున్న గురుమూర్తి దగ్గరికి వెళ్లి, పైచదువులు చదువుకుంటానని చెప్పింది.అతను వినలేదు. కన్నీళ్లు పెట్టుకుని, బాధపడింది. అయినా కట్టుబాట్లతో కఠినంగా మారిన గురుమూర్తి హృదయం కరగలేదు. పెళ్లివారు రానే వచ్చారు అబ్బాయి వయసులో తనకన్నా పన్నెండేళ్లు పెద్దవాడు. గవర్నమెంట్ ఉద్యోగం అని గురుమూర్తి ఒప్పుకున్నాడు. కోకిలకి ఏమాత్రం చెప్పకుండా, కనీసం అబ్బాయి ఫొటో అయినా చూపకుండా పెళ్లి కుదిర్చాడు. కోకిల వేదన అరణ్యరోదనే అయింది. వారం రోజుల్లో పెళ్లి. రెండు రోజులయ్యాక పేపర్లో డిగ్రీలో ప్రవేశం గురించి వార్త చూసింది కోకిల. ఒకవైపు చదుకోవాలనే తపన. ఇంకోవైపు బలవంతపు పెళ్లి. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఆమెది. ఏదేమైనా తన జీవితం తనది అనుకుంది. తల్లి దగ్గరకి వెళ్లి డిగ్రీ చేరుతానని, తన జీవితాన్ని నిలబెట్టమని కాళ్ళపైన పడింది. తల్లి తన పుట్టింటి వారు ఇచ్చిన నగలు కోకిలకిచ్చి, నాలుగు జతల బట్టలు సంచిలో పెట్టి తనకి తెలిసినవారు పట్నంలో ఉన్నారంటూ, వాళ్ళ అడ్రస్ కాగితం ఇచ్చి బయటకి పంపించేసింది. కోకిల ఇంట్లో కనిపించకపోవటం, పెళ్లి ఆగిపోవటంతో పరువు పోయినట్లు భావించిన గురుమూర్తి, పచ్చని పెళ్లిపందిట్లో తలంటు పోసుకుని, తన బిడ్డ చనిపోయిందంటూ కోపంతో ఊగిపోయాడు.గుడిలో గంట ఖంగుమని మోగిన శబ్దంతో ఉలికిపడిన పంకజం జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి, ఇంటికి బయలుదేరింది.ఇదంతా జరిగి ఐదేళ్లు అయింది. ఈ ఐదేళ్లూ్ల కోకిల గురించిన క్షేమ సమాచారం ఏదీ లేదు.రాత్రి పొద్దుపొయే సమయానికి గురుమూర్తి అలసిపోయి వచ్చాడు. కాళ్ళు కడుక్కుని లోనికి వచ్చి, ‘పని అవలేదు. రేపు పట్నం వెళ్ళాలి. తెల్లవారి నాలుగు గంటలకి నిద్రలేపు’ అని చెబుతూ, భోజనం ముగించి నిద్రకి ఉపక్రమించాడు. పట్నం అనగానే పంకజం మనసంతా కోకిల గురించే తపన. త్వరలో తన ఆచూకీ తెలిస్తే బాగుండు అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి దండం పెట్టుకుంది.తెల్లవారి నాలుగు గంటలకి గురుమూర్తిని లేపింది పంకజం. గురుమూర్తి స్నానపానాలు ముగించుకుని, పట్నానికి బయలుదేరాడు. ఉదయం పదిన్నర గంటలకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళాడు. ‘ఇక్కడ పని జరగదు. ఎమ్మార్వో ఆఫీస్కి వెళ్ళాలి’ అని చెప్పారు. సరేనంటూ ఎమ్మార్వో ఆఫీస్కు బయలుదేరాడు.ఎమ్మార్వోగారు ఇంకా రాలేదని పక్కగదిలో వేచి ఉండమని చెప్పాడు బంట్రోతు. పక్కగదిలో కూర్చున్నాడు గురుమూర్తి. పదినిముషాల తర్వాత కాస్త సందడిగా అనిపించింది. బంట్రోతు వచ్చి, ‘ఎమ్మార్వోగారు వచ్చారు. రావాల’ని చెప్పాడు.‘ఎమ్మార్వోగారికి నమస్కారం’ అంటూ గదిలోకి వెళ్లి, తాను తెచ్చిన డాక్యుమెంట్లు చూపించబోతూ, ఎమ్మార్వోని చూసి నిర్ఘాంతపోయాడు గురుమూర్తి.‘నువ్వా?’ అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ ఎమ్మార్వో ఎవరో కాదు, కోకిల!ఏమాత్రం మారని తండ్రిని చూస్తూ మౌనంగా నిలబడింది కోకిల.గురుమూర్తి ఇంటికి చేరుకొని, బావి దగ్గర తలమీద నీళ్లు గుమ్మరించుకుని. ‘దేవుడా క్షమించు! చచ్చినవాళ్ల దగరికి వెళ్లొచ్చాను’ అంటూ దేవునికి దండం పెట్టుకున్నాడు. భర్తను చూస్తూ నిశ్చేష్టురాలై, నిలబడిపోయింది పంకజం.కాసేపయ్యాక నెమ్మదిగా గదిలోకి వెళ్లి, ‘ఏమైందండీ?’ అని భయపడుతూనే అడిగింది.ఒక్కసారిగా భర్త చూసిన చూపుకి భయపడి, గదిలోనించి బయటకు వెళ్ళింది. ఆ రాత్రి ఎలాగో గడిచింది. తెల్లారాక ఇంటి వసారా ఊడ్చి, గుమ్మం ముందు ముగ్గు పెటి,్ట మామిడిచెట్టు అరుగుపైన కూర్చుని, పంకజం ఆలోచించసాగింది ‘భర్త కోపానికి కారణం ఏమై ఉంటుందా?’ అని.‘ఒసేయ్! కాసిన్ని కాఫీ నీళ్లయినా ఇవ్వకుండా, అంతగా ఆలోచిస్తూ బయటే ఉన్నావేంటే’ అంటూ భర్త గొంతు వినేసరికి ఉరుకున లోపలికి వెళ్ళింది.గురుమూర్తి వసారాలో వాలుకుర్చీలో కూర్చుని, ఏదో ఆలోచిస్తున్నాడు.అతని మొహంలో ఏదో వెలితి ఉందని పంకజం గ్రహించలేకపోలేదు. వేడి వేడి కాఫీ భర్తకు అందించి, ఏదో చెప్తాడేమోనని అక్కడే నిలబడింది.ఇంతలో గుమ్మంలో ఏదో కారు ఆగిన శబ్దం వినిపించడంతో ఇద్దరూ అటు చూశారు. కారులోంచి నారింజ రంగు కాటన్ చీర కట్టుకుని, నిండైన రూపంతో దిగి నిలబడింది కోకిల. పంకజం తదేకంగా చూసి తన బిడ్డే అని గ్రహించి, ‘అమ్మా! కోకిలా!’ అంటూ గుమ్మంవైపు పరుగు పెట్టింది. ఇంతలో ‘ఆగు పంకజం’ అని భర్త హూంకరించడంతో అడుగు ముందుకేయలేదు. ‘ఏవండీ మన బిడ్డ ఇన్నేళ్లకు కళ్ల ముందుకు వస్తే, నా తల్లి పేగు ప్రేమని ఎందుకు ఆపుతున్నారు?’ అంటూ భోరున ఏడ్చింది భర్త వైపు తిరిగి. ‘మన బిడ్డ ఎక్కడుందే ఐదేళ్లకు ముందే అది చచ్చింది. దాన్ని అటునుంచే పొమ్మను’ అన్నాడు ఉక్రోషంగా. ఇంతలో ‘క్షమించండి. బతికి ఉన్న నా భార్యను అలా అనటానికి నేను ఒప్పుకోను’ అంటూ కోకిల పక్కగా వచ్చి నిలబడ్డాడు వసంత్. అజానుబహుడి రూపం. ‘చూడ చక్కని జంట, చూసే కనులకు పంట’ అన్నట్లు ఉన్నారు ఇద్దరూ. గురుమూర్తి కోపం ఇంకా ఎక్కువైంది. ‘ఓహో దీన్ని కట్టుకున్న దరిద్రునివా నువ్వు?’ అన్నాడు.వసంత్ లోపలికి వచ్చి, ‘చూడండి మామగారు సంప్రదాయాలు సంస్కృతి ఉండాలి. కట్టుబాట్లు ఉండాలి కాని, అవి జీవితాలను నాశనం చేసేలా ఉండకూడదు. మీ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవలసిన మీరే తనకి జీవితం లేకుండా చేయటం కరెక్ట్ అంటారా? అంతే కాదు మీరు ఎవర్ని అయితే మీ కూతురికి ఇచ్చి చేయాలనుకున్నారో అతను ఇప్పుడు లంచం తీసుకున్నందుకు ఉద్యోగం పోగొట్టుకుని, జైల్లో ఉన్నాడు. ఆనాడు కోకిల బయటకి రాకపోయి ఉంటే ఈనాడు తన జీవితం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి’ అన్నాడు వసంత్. ఆలోచనలో పడ్డ గురుమూర్తి కుర్చీలో కూర్చున్నాడు. కోకిల లోపలికి వచ్చి, ‘నాన్నా! నన్ను క్షమించండి. మీ మాట కాదని ఇంట్లోంచి వెళ్ళటం తప్పే కాని, నా జీవితం కోసం వెళ్లక తప్పలేదు’ అంది. ‘అమ్మా!. ఆ రోజు ఇంటి నుంచి బయటపడ్డాక రైలులో పట్నానికి బయలుదేరాను. తోవలో నిద్రలో ఉండగా, నువ్వు ఇచ్చిన నగలు, డబ్బు, తెలిసినవాళ్ళ అడ్రస్ చీటీ అన్నీ పోయాయి. ఏం చేయాలో దిక్కు తోచక స్టేషన్లో ఏడుస్తూ ఉంటే, ఈయన నన్ను చేరదీసి, వివరాలు తెలుసుకుని, నన్ను ఒక ఆశ్రమంలో చేర్చారు. నా చదువు, నా బాగోగులు చూసుకుంటూ, నా కాళ్ళ మీద నేను నిలబడేట్లు చేసి, ఈ రోజు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చారు. నన్ను పెళ్లి చేసుకుని జీవితానికి భరోసా ఇచ్చారు. ఈయన లేకపోతే నాన్న అన్నట్లు ఏనాడో చనిపోయేదాన్ని’ అంటూ కన్నీళ్ల పర్యంతం అయింది.ఈ మాటలు గురుమూర్తిని కరిగించాయి. తన మూర్ఖత్వంతో ఇన్నాళ్లూ భార్యను, ఒక్కగానొక్క బిడ్డను ఎంత ఇబ్బంది పెట్టాడో తలచుకొని పశ్చాత్తాపపడ్డాడు. తమ బిడ్డకి అమూల్యమైన జీవితాన్ని ఇచ్చిన వసంత్ను కృతజ్ఞతగా చూస్తూ పంకజం, గురుమూర్తి కన్నీళ్లు పెట్టుకున్నారు.కోకిల వసంత్లు వాళ్లను ఓదార్చి, కోకిలకి ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. వారి సంతోషానికి అవధుల్లేవు. ఇంతలో ఒక బంట్రోతు వసంత్ దగ్గరికి వచ్చి, ‘కలెక్టర్గారు! మిమ్మల్ని తీసుకెళ్ళటానికి కారు వచ్చింది’ అని చెప్పాడు. పంకజం, గురుమూర్తి ఆశ్చర్యచకితులై ‘ఏమిటి మా అల్లుడుగారు కలెక్టరే!’ అంటూ మురిసిపోయారు. ఆ రోజు నుండి వారి ఇల్లు ఆనంద నిలయమైంది. ఎన్నడూ లేనిది గురుమూర్తి, ‘పంకజాక్షీ! నన్ను క్షమించు. భర్తనని, మగవాడినని అహంకారంతో నిన్ను ఇన్నేళ్లూ చాలా కష్టపెట్టాను. ప్రేమగా ఉండాల్సింది పోయి, కట్టుబాట్ల పేరుతో ఇబ్బంది పెట్టాను’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.‘మనమధ్య ఈ క్షమాపణలు ఏవిటండీ’ అని కళ్లు తుడుకుంది పంకజం. పెళ్ళైన ఇన్నేళ్లకి భర్త తనను పూర్తి పేరుతో పిలిచినందుకు సిగ్గుపడ్తూ. ఇంతలో ‘ఏమోయ్, పంకజాక్షి! నా కూతురు, అల్లుడే నా మార్పుకి కారణం’ అని మనసారా నవ్వులు పూయించాడు గురుమూర్తి.తన కూతురు ఎడారిలో కోయిలగా మిగిలిపోతుందేమోనని భయపడ్డ పంకజం వసంత కోకిలలా మారిన కూతురిని చూసి మనసు నిండా తృప్తి చెందింది. ∙ -
Mother's Day 2025: అమ్మ మనసు తెలుసా?
‘ఏంటమ్మా నీ గోల? నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసులే?’ అనే పిల్లల ధిక్కారాలు అమ్మకు కొత్తేం కాదు. ‘పదే పదే ఫోన్ చేసి విసిగించకమ్మా.. ఆకలేస్తే నేను తింటా కదా? నువ్వు అడగాలా?’లాంటి పోట్లాటలు, ఆమెకు వింతా కాదు. అయినా మన కోసమే తపిస్తుంది. మనం బాగుండాలని భరిస్తుంది. ‘అయ్యో పాపం అమ్మ తిన్నదో లేదో?’ అని మనమెలాగో కుశలం కనుక్కోము సరికదా, ఆమె కుశలమడిగితే టైమ్ లేదన్న సాకుతోనో, బిజీగా ఉన్నామన్న వంకతోనో, నోటికొచ్చిన సమాధానాలిచ్చి బాధపెడతాం. ఇంతటి జీవితాన్నిచ్చిన అమ్మకు నిజంగానే కాసింత సమయాన్ని కేటాయించలేమా? అసలు అమ్మకు ఏం కావాలి? ఆమె మనసును ఎలా తెలుసుకోవాలి?ప్రయత్నిస్తే అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా అర్థమయ్యేది అమ్మే. నిజానికి అమ్మ మనసు తెలుసుకోవాలన్న మన ఆలోచనతోనే ఆమె ఆనందం మొదలవుతుంది. మన ఈ ప్రయత్నమే ఆమెకు, అసలు సిసలు బహుమానమవుతుంది.అమ్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఆమెను మాట్లాడనిద్దాం. ఆమె ఏం చెప్పాలనుకుంటుందో కాస్త శ్రద్ధగా విందాం. ఆమె మాటల్లోని భావాలను గ్రహించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనకు ఆమె గురించి ఇంకెన్నో విషయాలు తెలుస్తాయి.అమ్మ చేసే పనులను గమనిద్దాం. అప్పుడు ఆమె దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుందో? ఆమెకు ఏది ఇష్టమో? ఏది ఇష్టం లేదో? ఆమె దేని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుందో? ఇలా ఆమె గురించి మరింత అర్థమవుతుంది.అమ్మ మనసుని సరదాగా మధ్యమధ్యలో కదిలిద్దాం. తన జీవితంలో పొందిన ఆనందాలనో, ఆమె తన కన్నవాళ్లతో గడిపిన క్షణాలనో, ఆమె ఎదుర్కొన్న కష్టాలనో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ఆమె మనసు, ఆమె దృక్పథం మనకు మరింత బోధపడతాయి.మనం తీసుకునే కొన్ని నిర్ణయాల్లో అమ్మను సలహా అడుగుదాం. అలాంటప్పుడు ఆమె ఆలోచనా విధానం మనకు ఇంకా బాగా తెలుస్తుంది. పైగా ఆ సలహా మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆమెకు మనం ఇచ్చే విలువేమిటో ఆమెకూ అర్థమవుతుంది.అమ్మకు దూరంగా ఉంటే రోజుకొక్కసారైనా ఫోన్ చేసి ప్రేమతో పలకరిద్దాం. మనస్పూర్తిగా మాట కలుపుదాం. మన మనసులో ఆమె స్థానం పదిలమేనన్న సంగతి తెలియపరుద్దాం. ఆ రోజులో మనం అందుకున్న ప్రశంసల గురించో, మనం చేసిన పనుల గురించో, వెళ్లిన ప్రదేశాల గురించో ఆమెతో పంచుకుందాం. వీలు కుదిరినప్పుడు అమ్మతో కలిసి భోజనం చేద్దాం. టీవీ చూద్దాం. షాపింగ్కో, సినిమాకో తీసుకెళ్దాం. అలా చేస్తే బంధం మరింత బలపడుతుంది. ఆమెకు మన సమయాన్ని కేటాయించడం కూడా, ఆమె ఓ బహుమతిగానే భావిస్తుంది.అమ్మకు చిన్నచిన్న పనుల్లో సాయం చేయడం అలవాటు చేసుకుందాం. అలాగే కోపంలో అరవడం, గొడవ పడటం, అభిప్రాయాలు వేరుకావటం సహజమే. కాని, దానికి ఏదో ఒక సమయంలో క్షమాపణలు చెప్పడం నేర్చుకుందాం. మన తిరస్కారానికి కారణాలను సున్నితంగా వివరిద్దాం.ఏదో ఒక సందర్భంలో అమ్మకు కృతజ్ఞతలు తెలుపుదాం. జీవితంలో ఉన్నతమైన మెట్లు ఎక్కినప్పుడో, అత్యంత ఆనందంగా ఉన్నప్పుడో అమ్మనోసారి ప్రేమగా పలకరిద్దాం. వీలైతే ఆ క్షణంలోనే ఆమెకు ఐలవ్యూ చెబుదాం. దానికంటే ఆమెకు విలువైన బహుమతి మరొకటి ఉండదు.ఏది ఏమైనా జన్మజన్మలకు తీరని రుణపాశమే అమ్మప్రేమ. ప్రాణం పోసుకోకముందే ముడిపడిన ఆ పేగు బంధానికి, ప్రాణాలేం ధారబోయక్కర్లేదు. చూపులో ప్రేమ, పిలుపులో ధీమా కనిపించేలా స్పందిస్తే చాలు, తిరుగులేని ఆమె ఆశీర్వచనాలు.. జీవితాంతం దేవదూతలై కాపాడతాయి. యముడితోనైనా పోరాడతాయి. అంతటి వాత్సల్యాన్ని పంచే అమ్మకు.. బహుమానాలేం అక్కర్లేదు. మనం ఎంత ఎదిగినా, అమ్మ ఒడిలో ఒదిగే పసిమనసుని వదులుకోకపోతే చాలు. అమ్మకు సరైన ప్రతిఫలాన్ని అందించినట్లే అవుతుంది.∙సంహిత నిమ్మన -
ఈ వారం కథ: ఏ నావదే తీరమో...
మనుషులు కలవడానికి మహాసముద్రాలు దాటాలా?మనసులు కలవడానికి మంచుపర్వతం కరగాలా?అనుకోకుండా వచ్చే వానగానో, చెమటతో తడిపే ఎండగానో, కదిలే తేరుగానో, ఎదిగే పైరుగానో, పారే ఏరుగానో, మరిగే నీరుగానో... ఏమో... ఎప్పుడో ... ఎలాగో... ఎందుకో... కలుస్తూనే ఉంటారు!‘‘ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మ వరమో..’’ ఎక్కడి నుంచో గాలిలో గంధకంలా తేలుతూ రింగ్టోన్ నా చెవుల్ని తాకింది.భారంగా కదిలాను. నాతో పాటే చేతికున్న సెలైన్ బాటిల్ కూడా గాలిలో దీపంగా కదలాడింది. తెరలు తెరలుగా వచ్చిన కడుపునొప్పి ఉపశమనం కోసం పెట్టిన సెలైన్ బాటిల్ నా వంక దిగులుగా చూస్తోంది. కారిడార్లో ఎవరో తిరుగుతున్న అలికిడి, నా పైన అదేపనిగా తిరుగుతున్న ఫ్యాను చప్పుడు! గాలికి డోర్ కర్టెన్ పైకి లేచింది. కళ్ళు తెరిచి పాట వినిపించిన వైపు చూశాను.ఎదురుగా ఉన్న గదిలో ఎవరో అమ్మాయి చేతికి సెలైన్ బాటిల్తో కనిపించింది.ఓదారుస్తూ పక్కనే ఆమె స్నేహితురాలు! కొసరి కొసరి అన్నం పెడుతుంటే విలువ తెలియకుండా పెరిగినందుకు మంచి శిక్షే పడింది.వరమో శాపమో హాస్టలు రూపంలో ‘పొమ్మనలేక పొగబెట్టి’నట్లుగా ఎదురయింది. కూర బాగుంటే అన్నంమెతుకులు లావుగా ఉంటాయి. అన్నం సన్నగా ఉంటే కూర ఉప్పూకారంతో ఉడికించినట్లుగా ఉంటుంది. బిందెలు బిందెలు నీళ్ళు కలిపి తాలింపు వేసిన చారు, ఉండీ లేనట్లుగా కనిపించే కందిపప్పుతో పసుపుగా సాంబారు! ఎప్పుడైనా ‘ఔటింగ్’ దొరికితే బజారులో దొరికే అడ్డమైన గడ్డినీ ఆబగా తిన్న కర్మానికి తెరలుతెరలుగా కడుపునొప్పి! దాని ఫలితం... ఆసుపత్రి బెడ్!‘‘ఇప్పుడెలా ఉంది?’’ అడిగింది సిస్టర్.‘పర్లేదు’ అని చెప్పి నీరసంగా ఆమె వంక చూశాను.సెలైన్ బాటిల్లో సూది గుచ్చి అందులోకి ఏదో పసుపురంగు మందు పంపించింది.నాడి పట్టుకుని చూసి ‘‘సాయంత్రానికి పంపుతారు. రెస్ట్ తీసుకో. బజారులో ఏది దొరికితే అది తినకూడదు. నోటికి రుచిగా ఉన్నవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు’’ చెప్పి వెళ్ళిపోయింది. ‘కొన్ని రోజులు హాస్టల్ తిండి తింటే తెలుస్తుంది...’ నోటి చివరిదాకా వచ్చిన మాట నీరసం వల్ల గొంతులోనే ఆగిపోయింది. పైకి అనలేకపోయాను. ఆమె వెళ్ళిన విసురుకు డోర్ కర్టెన్ పక్కకి జరిగింది. నాకు ఎదురుగా దిండు మంచానికి ఎత్తుగా జరిపి టిఫిన్ తింటున్న అమ్మాయి కనబడీ కనబడనట్లుగా కనిపించింది. అసలు తినకుండా ఉంటే ఉండగలం గానీ, సగం తిని ఉండాలంటేనే తాతముత్తాతలు దిగొస్తారు!రూముకు నాలుగు బెడ్లతో, మొత్తం ముప్పై పడకలతో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ హాస్పిటల్ అది. మరీ హడావిడిగా ఉంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు వేరువేరుగా రూములుంటాయి. నాలాగా ఎప్పుడైనాఫుడ్ పాయిజన్ అయినవాళ్ళు వస్తే ఏదో ఒక ఖాళీ రూములో ఉంచి సెలైన్ పెడ్తారు. బహుశా ఆ అమ్మాయికి కూడా నాలాగే అయిందేమో! రమేష్గాడు ఉంటే బాగుండేది. విషయం చెప్తే ఈపాటికి ఆ అమ్మాయి గురించి అన్నీ ‘ఎంక్వైరీ’ చేసి, ‘రిపోర్ట్’ ముందు పెట్టేవాడు. సరైన టైంకి వెళ్ళిపోయాడు.‘‘ఔట్...’’ పెద్దగా అరుపులు, ఆ తర్వాత చప్పట్లు వినిపించాయి. ఆడా, మగా తేడా లేదు. ఒకరి ఓటమికిఆనందిస్తూ ఇంకొకరికి గెలుపును ఆస్వాదించే రోజులు మొదలయ్యాయి. చిన్నప్పటి ఆటలన్నీ అటకెక్కిపోయాయి. చిన్నాపెద్దా అందరికీ పాతిన మూడు కర్రల మధ్య పరుగులే బలమైన వ్యాపకంగా మారిపోయాయి.ఆఖరి చుక్క దగ్గర ఆగిపోయింది సెలైన్. కడుపులోనూ, మనసులోనూ కురుస్తున్న వాన ఆగిన సంతోషం! ∙∙ చేతులు కట్టుకుని, స్లిప్పులు పట్టుకుని, బోనులో ముద్దాయిల్లా కౌంటర్ ముందు నిలబడ్డారు పిల్లలంతా.ఏడు బ్రాంచ్లతో, రెండేళ్లు ఇంటర్మీడియట్ నాలుగేళ్లు ఇంజనీరింగ్ కలిపి ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుతో ఉన్న యూనివర్సిటీలో ఎత్తైన కొండను తొలిచి వలయాకారంగా ఏర్పాటుచేసిన ఫుడ్ కోర్ట్ అది.కొమ్మల మీద పక్షులు వాలినట్లుగా సాయంత్రం క్లాసులు అయిపోగానే స్టూడెంట్స్ అందరూ అక్కడ చేరతారు. ఫుడ్ కోర్ట్ చుట్టూ ఉన్న గోడ మీద కొందరు, మెట్లమీద కొందరు, చెట్లకింద కొందరూ ఉదయం నుంచీ వేడెక్కిన బుర్రల్లోకి కాస్తంత ఉల్లాసాన్ని నింపుకుంటూ ఉంటారు.ఒక కన్ను బయటి నుంచి లోపలికి వస్తున్న వాళ్లమీదా, ఇంకో కన్ను టిఫిన్ ప్లేట్లు పట్టుకుని చెట్లకింద చేరుతున్న వాళ్లవంకా నిలిపి లైనులో నుంచున్నాను నేను.గొడుగులా పరుచుకున్న బాదంచెట్టు నీడకింద ఎదురెదురుగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్న జంటలతో కాలం ఐస్క్రీములాగా కరిగిపోతోంది. గంటల్ని మంటల్లో వేసి తగలబెట్టినట్లుగా విరామం లేని కబుర్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో నాకిప్పటికీ అర్థం కాదు. ఒక చెట్టు పెంచితేనే ఎంతోమందికి నీడనిస్తోంది. ఒక మనిషి సక్రమంగా పెరిగితే ఎంతమందికి ఆశ్రయమిస్తాడో! కాలం కత్తుల మీద కాకుండా కనికరం మీద నడిస్తే తప్ప ఇలాంటివి చూడలేమేమో? చుట్టూ చూశాను. గింజల కోసం ఎక్కడెక్కడి నుంచో ఎగిరొచ్చిన పావురాళ్ల గుంపులా కనిపించారు. ‘‘ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మ వరమో..’’ తుళ్ళిపడి ఆలోచనల్లోనుంచి బయటికి వచ్చి రింగ్టోన్ వినిపించిన వైపు చూశాను. ముదురురంగు నీలం జీన్స్ మీద తెల్లటి టాప్ వేసుకున్న అమ్మాయి లైనులో కనిపించింది... ఆసుపత్రిలో తనకి తోడుగా ఉన్న అమ్మాయితో!నీరసం ఎగిరిపోయింది. నిన్నటి కొద్దిపాటి అనారోగ్యానికి నీరసంతో తేలిపోయినట్లుగా ఉన్న కాళ్లు ఆ అమ్మాయిని చూశాక ఆనందంతో గాలిలో మరింత తేలిపోసాగాయి. నా టిఫిన్ ప్లేట్ తీసుకుని బాదం చెట్టు కిందకి చేరి తింటూ ఆ అమ్మాయినే గమనించసాగాను.టిఫిన్ తీసుకుని ఇద్దరూ ఎదురుగా ఉన్న మరో బాదం చెట్టు నీడలో కూర్చున్నారు. తింటున్న వాడిని పైకి లేచి వాళ్లకు దగ్గరగా వెళ్లి, ‘‘హాయ్... నా పేరు ఏడుకొండలు. నీ పేరు..’’ అన్నాను.‘‘అలివేలు మంగతాయారు’’ చెప్పి పకపకా నవ్వింది ఆ అమ్మాయి.‘‘అయితే కలిసి నడవడానికి ఎక్కువ సమయం లేదు’’అన్నాను నేను కూడా నవ్వుతూ. ‘‘అవునవును... చనువిస్తే చంకనెక్కడం, చావగొడితే మంచమెక్కడం బాగా అలవాటు మీకు’’ అంది అక్కడి నుంచి పైకి లేస్తూ. పక్కనున్న అమ్మాయి కూడా ఆమెను అనుసరించింది.‘‘నీ ఆరోగ్యం బాగుందా ఇప్పుడు?’’ అడిగాను.‘నీకెలా తెలుసు?’ అన్నట్లుగా నుదురు చిట్లించింది. నడకలో వేగం తగ్గి మాటలో ఆశ్చర్యం తొంగిచూసింది.‘‘నీ ఫోన్ రింగైనప్పుడు వచ్చే పాటంటే నాకు చాలా ఇష్టం. నిన్న ఆస్పత్రిలో నీ ఎదురుగా ఉన్న బెడ్ మీద నేను కూడా ఉన్నాను. అప్పుడు విన్నాను. అనుకోకుండా ఇప్పుడిలా వినిపించిన పాట ద్వారా నువ్వేనని గుర్తుపట్టాను.’’ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ, ‘‘తాయారూ.. మళ్ళీ ఎప్పుడు?’’ అన్నాను. పకపకా నవ్వుతూ అక్కడి నుంచి కదిలింది. చెమటను తుడుచుకుంటూ చెట్టు కిందకి చేరాను. ఎండలో నడుస్తున్న వాడికి గొడుగు పడుతున్నట్లుగా ఉన్న చెట్టు వంక కృతజ్ఞతగా చూశాను. ‘‘ఏరా కొండలూ! ఏమంటుందేంటి కల్పన’’ అన్నాడు పక్కన కూర్చుంటూ రమేష్. ‘‘కల్పనా? తనెవరు?’’ అన్నాను.‘‘ఇప్పటిదాకా మాట్లాడావుగా. ఆ అమ్మాయే’’‘‘కాదు కాదు... తను అలివేలు మంగతాయారు’’‘‘భలేవాడివే! తన పేరు కల్పన. ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్. దీని గురించే ఆ చందూగాడికి, పవన్గాడికీ గొడవలు మొదలయ్యాయి. కొట్టుకునేదాకా వెళ్లింది యవ్వారం. ఇంతకుముందు కూడా ఈ విషయం గురించి రూములో కూడా డిస్కషన్ జరిగింది. గుర్తులేదా?’’ అన్నాడు.‘‘విషయం తెలుసుగానీ ఈ అమ్మాయని తెలియదు’’ అన్నాను. ‘‘ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కాలి గాని, ఇంకొకడితో మాట్లాడ్డం చూస్తే మాత్రం వాళ్లిద్దరూ ఒక్కటై వాడ్ని తన్నడానికి వెళ్ళిపోతున్నారు?’’ఆశ్చర్యం నుంచి తేరుకుని ‘‘ఇంతకీ ఆ అమ్మాయి ఇష్టమేంటో’’ అన్నాను నీళ్ళు తాగుతూ. నా వంక అదోలా చూశాడు. ‘‘అమ్మాయి ఇష్టంతో పనేముంది? ముందు చూడాలి, నచ్చాలి, మాటలు కలపాలి. ఆ తర్వాత ప్రపోజ్ చేయాలి. ఇన్స్టంట్ కాఫీలా అప్పటికప్పుడే ఫలితం తెలిసిపోవాలి. లేటయిందంటే నారదీసి ఆరేయడమే’’ అన్నాడు పెద్దగా నవ్వుతూ. నేనేమీ మాట్లాడలేదు. బట్టలిప్పుకుని విచ్చలవిడిగా తిరుగుతున్న లోకాన్ని మూకుడుతో మూయలేను. ప్రభావంలో పడి కొట్టుకుపోతూనో రాజీపడుతూనో కళ్ళు మూసుకుని బతకలేను. ‘‘ఇష్టాలైనా కష్టాలైనా మనిషిని బట్టి మారుతుంటాయిగా. నువ్వంటే నాకిష్టం కాబట్టి నువ్వు కూడా నన్నే ఇష్టపడాలని బలవంతం చేయడం అన్యాయం కదా’’ అన్నాను వాyì వైపు చూస్తూ. ‘‘లాజిక్కులు చెప్పుకోడానికి తప్ప అప్లై చేయడానికి పనికిరావురా. ఇద్దరికీ ఒకే వస్తువు నచ్చడం, దానికోసం కొట్టుకోవడం చూస్తుంటే చిన్నతనం గుర్తొస్తుంది. ‘వాడికున్నదీ నాక్కూడా కావా’లనే ఆరాటం తప్ప అసలు ఆ వస్తువుతో నీకెంత అవసరం ఉందో ఆలోచన లేదు. అరవయ్యో డెబ్భయ్యో నిండితే ఒకప్పుడు మనుషులు చచ్చేవాళ్లు. ఇప్పుడు ‘అరచేతి’లో చావును పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు. మూడు ముళ్ళూ, ఏడడుగులు ఎప్పుడో గంగలో కలిసిపోయాయి. ఇప్పుడు.. ప్రేమలు లేని కాలం నడుస్తోంది. చంపడం చచ్చిపోవడం మాత్రమే తెలిసిన కాలం! వాళ్లిద్దరూ సాయంత్రం నీ రూముక్కూడా రావొచ్చు. ఇన్నేళ్లూ చక్కగా చదువుకున్నావు. వెళ్లేముందు ప్రశాంతతను పాడుచేసుకోకు’’ అన్నాడు పైకి లేస్తూ.వెళ్ళిన వాడివైపు చూస్తుంటే మనసంతా ఒకటే ఆలోచనలు. ‘పుస్తకం చదవకపోతే పాడైపోతావు’ అని చూపించే సినిమా ఒక్కటి లేదు. ‘అమ్మాయిని ప్రేమించకపోతే బతుకు వృథా’ అని చెప్పే సినిమాలు ఎక్కువయ్యాయి. హీరో ఒకమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమ గెలిచేదాకా వాళ్లిద్దర్నీ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎన్నెన్నో త్యాగాలు, మరెన్నో పోరాటాలు, రక్తపాతాలు... చివరికి ‘శుభం’ ముందు అందరూ నవ్వీ చూసినవాళ్లందర్నీ వెర్రివాళ్లని చేస్తారు! మనుషులంతా ఆ భ్రమల్లోనే బతికే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తారు.అక్కడి నుంచి రూమువైపు బయల్దేరాను. ప్రేమ పుట్టడానికి నిమిషమో అరనిమిషమో సరిపోతుంది. కానీ దాన్ని గెలుచుకోవడానికి ఎన్నో బలులు జరగాలి. ఎన్నో జీవితాలు మట్టిలో కలిసిపోవాలి!∙∙ ‘‘నీతో మాట్లాడాలి’’ అన్నానొకసారి.‘‘ఏంటి విషయం? చెప్పు’’ అంది.‘‘ఇక్కడ కాదు. అక్కడ...’’ కొండపై కనిపిస్తున్న ఫుడ్ కోర్ట్ వైపు చేయి చూపించాను.ఎకడమిక్ బ్లాక్స్, లైబ్రరీ దాటి ఫుడ్ కోర్ట్ దగ్గరకి చేరుకుని బాదంచెట్టు కింద కూర్చున్నాక ‘‘చెప్పు’’ అంది. ‘‘ఇంకో నెలలో ఇంజినీరింగ్ పూర్తవుతుంది. ఎక్కడో ఒకచోట ఏదో ఒక జాబ్ వస్తుంది. నువ్వొప్పుకుంటే పెద్దలతో మాట్లాడతాను’’ అన్నాను సూటిగా విషయంలోకి వస్తూ. ‘‘ఒప్పుకోకపోతే...’’నాకంటే సూటిగా వచ్చిందా మాట.వెంటనే సమాధానం చెప్పలేక తడబడ్డానో క్షణం.‘‘చెప్పు.. కలలు కందామా? కలిసుందామా?’’ మళ్ళీ తనే అడిగింది రెట్టిస్తూ. నా నుంచి సమాధానం లేదు.‘‘చూడు... ఇంటర్ నుంచి చందూ, ఇంజనీరింగ్ రెండో సంవత్సరం నుంచి పవన్ వెంటపడుతున్నారు. ఇప్పుడు నువ్వు! నా ఇష్టంతో పనిలేదు. మీకిష్టం అయింది కాబట్టి దాన్నే నా ఇష్టంగా మార్చుకోవాలి. పోనీ నువ్వే చెప్పు... మీ ముగ్గురిలో ఎవర్ని ఇష్టపడాలో’’ అంది.మళ్ళీ నాలో అలజడుల జలపాతాలు మొదలయ్యాయి.‘‘ఈ వయసులో మన కష్టాన్నే ఇష్టంగా మార్చుకోవాలి. మంచి భవిష్యత్తు గురించి కలలు కనాలి. అనుభవాలను ఆలోచనలను ఎదుగుదలకు సోపానాలుగా మలచుకోవాలి. అంతేగానీ అమ్మాయి బాగుందనో, పరిచయమైందనో ప్రేమిస్తున్నానని చెప్తే అది ఇద్దరి భవిష్యత్తుకూ మంచిది కాదు.చదువుకునే వయసులో ప్రేమలు, పెళ్ళిళ్ళు మంచివి కాదు. ప్రేమించుకుని అందరికంటే ముందు కొన్ని అనుభవాలను పొందాలని తహతహలాడతాం. కానీ అవే భవిష్యత్తులో పీడకలలుగా మారి జీవితాంతం వెంటాడతాయి. రోజూ పేపర్లో ఎన్నో దారుణాలు చదువుతున్నాం. ప్రేమించకపోతే చంపేస్తారు, చెప్పినట్టు వినకపోతే చంపేస్తారు, మాట్లాడితే చంపేస్తారు, మాట్లాడకపోతే చంపేస్తారు. కొన్నాళ్ళు కలిసుండడం ఆ తర్వాత చంపేయడం! కలిసుండడానికి ఇష్టపడ్డప్పుడు, విడిపోవడానికి కూడా ఇష్టపడొచ్చు కదా! చంపడమెందుకు? ‘మీరిద్దరూ నాకు స్నేహితులు. ప్రేమించే ఉద్దేశం లేద’ని వాళ్ళతో చెప్పేయొచ్చు. దాని పర్యవసానాలు వేరుగా ఉండేవి. అందుకే.. నా చుట్టూ నేనొక గోడ కట్టుకున్నాను. నా జాగ్రత్తలో నేనుంటున్నాను. నా కారణంగా వాళ్లిద్దరూ గొడవపడుతున్నారని విన్నప్పుడల్లా ఎంతో బాధ కలుగుతుంది. వయసుతో పాటు జ్ఞానమో సంస్కారమో పెరగాలి. ఇవి రెండూ పెరగని వాళ్లని ఏమనాలో నువ్వే ఆలోచించుకో’’ చెప్పి అక్కడి నుంచి లేచింది.కొద్దిదూరం నడిచాక ఆమె ఫోన్ మోగింది.‘‘ఏ నావదే తీరమో, ఏ నేస్త మే జన్మ వరమో..’’ పాట కూడా ఆమెతో పాటే వెళ్ళిపోయింది.మనుషులు విడిపోడానికి సునామీలు చెలరేగాలా?మనసులు దూరమవడానికి అగ్నిపర్వతాలు బద్దలవ్వాలా?గుండె సముద్రమై ఎగసినప్పుడో, పూలు వాడి నేలరాలినప్పుడో, కళ్లల్లో నదులు పొంగినప్పుడో, కలవరంతో గుండె మండినప్పుడో! ఏమో... ఎప్పుడో... ఎలాగో... విడిపోతూనే ఉంటారు! తీరం చేరే నావలు కొన్నే.. కొన్ని అలల ధాటికి చెల్లాచెదురౌతాయి! మరికొన్ని మధ్యలోనే మునిగిపోతాయి! మరికొన్ని నావలు... తీరం ఎటున్నదో తెలియక సాగుతూ...నే ఉంటాయి! -
100 ఏళ్ల చదువుల గుడి ఎయూ శతవార్షికోత్సవాలు
ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ఆవిర్భవించిన మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వ కళాపరిషత్. తెలుగు ప్రజల కోసం ఏర్పడిన భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం ఆంధ్రవిశ్వవిద్యాలయం. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ విశ్వకళాపరిషత్ అనే పేరుతో వ్యవహరించేది మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మాత్రమే! దేశంలో మరో విశ్వవిద్యాలయానికి లేని ప్రత్యేకత ఇది. పేరుకు తగినట్లే లలిత కళలైన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, రంగస్థలం, నటన వంటి కళలకు యూనివర్సిటీలో స్థానం కల్పించారు. స్వతహాగా కళా సాహిత్యాల పట్ల మక్కువ ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్’ పేరును ప్రతిపాదించారు. 1926లో మద్రాసు విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన రెసిడెన్షియల్ టీచింగ్– కమ్– అనుబంధ విశ్వవిద్యాలయంగా ఘనతకెక్కిన ఏయూ శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంటోంది. మొదటగా విజయవాడలో 1926 ఏప్రిల్ 24న ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి పునాదిని మొట్టమొదటి వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి వేయగా, అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ గోచెన్ చాన్సలర్గా వ్యవహరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని 1930 సెప్టెంబరు 5న ఈ యూనివర్సిటీ ప్రాంగణాన్ని విశాఖపట్నానికి తరలించారు. ప్రతి ఏటా సగటున వెయ్యి నుంచి పన్నెండు వందల మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు తీసుకునే ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం 58 విభాగాలు, 18 పరిశోధన కేంద్రాల్లో 20 వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలు...!ఏయూ ఏర్పాటై 2026 నాటికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ఏయూ సిద్ధమయ్యింది. ఏడాదిపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఔట్రీచ్– ఈ మూడు విభాగాల్లో పనిచేయాలని విజన్ డాక్యుమెంట్ను ఏయూ ప్రకటించింది. శతాబ్ది ఉత్సవాల లోగోను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ లోగోను యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోని బీఎఫ్ఏ విద్యార్థి షేక్ రఫీ రూపొందించారు. ఏయూ లోగో ప్రత్యేకత!ఆంధ్రా యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేసి, లోగోలోని ప్రతి చిహ్నానికి అర్థం స్ఫూరించేలా తయారు చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వవిద్యాలయాన్ని, దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతి– ఇద్దరినీ ప్రతిబింబిస్తుంది. సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక ఉంటుంది. అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్త్రాలను సూచిస్తుంది. ఇక సముద్రాన్ని– విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞానకేంద్రం అనే అర్థంలో తయారు చేశారు. ఉపనిషత్తులలోని ‘తేజస్వినావధితమస్తు’ అనే నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. దీని అర్థం ఏమిటంటే ‘దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక‘ అని. ఈ జ్ఞాన చిహ్నం కింద అన్ని మతాలలోనూ ప్రాశస్త్యం కలిగిన నెలవంక ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు తామర రేకుల నుంచి జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి. అంతేకాకుండా, పురాతనకాలం నుంచి ఆంధ్రులలో నాగారాధన సంప్రదాయం ఉంది. ఈ లోగోను కౌతా రామమోహనశాస్త్రి రూపొందించగా, ఏయూ వ్యవస్థాపక వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఆమోదించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో...వాస్తవానికి మొట్టమొదటగా బెజవాడలోని (ఇప్పటి విజయవాడ) తాత్కాలిక భవనాల్లో ఏర్పాటైన ఏయూ 1930లో విశాఖకు తరలివచ్చింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రం ఏయూ ప్రాంగణం అంతా సైనిక స్థావరంగా మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఏప్రిల్ 6న విశాఖ హార్బర్పై జపాన్ బాంబులు వేసింది. ఆ దాడి తర్వాత యూనివర్సిటీ భూమిని, భవనాలను తమ అవసరాలకు ఉపయోగించుకోవాలని అప్పటి బ్రిటిష్ సైన్యం నిర్ణయించుకుంది, యూనివర్సిటీని మార్చమని బలవంతం చేసింది. బాంబు దాడి జరిగిన పది రోజుల తర్వాత– అంటే 1942 ఏప్రిల్ 16న యూనివర్సిటీని తరలించడానికి సన్నాహాలు చేసుకోవడం కోసం మూసివేశారు. కెమిస్ట్రీ మినహా చాలా విభాగాలు గుంటూరుకు మారగా, కెమిస్ట్రీ విభాగం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలకు మారింది. భవనాలన్నింటినీ సైన్యం ఆక్రమించడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం జూన్ 1945 వరకు అంటే మూడేళ్లపాటు విశాఖపట్నం వెలుపలి నుంచే పనిచేసింది.న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్తో...!తెలుగు ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడటంతో తెలుగు ప్రజలు యూనివర్సిటీతో మానసికంగా అనుబంధం పెంచుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ దేశంలోని పురాతన విద్యాసంస్థలలో ఒకటి మాత్రమే కాదు, రెసిడెన్షియల్ మల్టీ–డిసిప్లినరీ యూనివర్సిటీగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలలో మొదటిది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన ఈ యూనివర్సిటీకి కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక వైస్ చాన్సలర్గా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండో వైస్ చాన్సలర్గా, తిరిగి సీఆర్ రెడ్డి, అనంతరం డాక్టర్ వీఎస్ కృష్ణు్ణడు– ఈ ముగ్గురు దార్శనికులు వేసిన పునాదులు ఆ తర్వాతి దశాబ్దాల్లో ఫలవంతమై, ఏకంగా దేశంలోనే న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ పొందిన మొట్టమొదటి ప్రభుత్వ యూనివర్సిటీగా 2024లో చరిత్రకెక్కింది. ఏయూలో 59 దేశాల విద్యార్థులు...దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు విదేశాల్లోని విద్యార్థులనూ ఏయూ ఆకర్షిస్తోంది. ఇక్కడ చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఏకంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారు. ఎక్కువగా ఇంజినీరింగ్ కోర్సుల్లో 472 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. 2019–20 సంవత్సరంలో 190 మంది ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య గత ప్రభుత్వ హాయంలో ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటుతో పాటు ప్రత్యేక మెనూను అమలు చేయడంతో ఈ సంఖ్య 1,130కి చేరుకుంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రధానంగా విశాఖలో జరిగే వివిధ రకాల సినిమా షూటింగుల కోసం అవసరమైన విదేశీయుల కోసం ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దర్శకులు వెదుక్కుంటూ వచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఇస్మార్ట్ శంకర్, శివం వంటి సినిమాల్లో ఇక్కడి విదేశీ విద్యార్థులు నటించారు. ఎందరో మహానుభావులు...ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న అనేక మంది ఎంతో గొప్ప స్థానాలకు చేరుకున్నారు. ఆచార్య సూరి భగవంతం (భౌతికశాస్త్రం), ఆచార్య జ్ఞానానంద (అణుభౌతిక శాస్త్రం), ఆచార్య సి.మహదేవన్ (జియాలజీ), ఆచార్య టీఆర్. శేషాద్రి (రసాయన శాస్త్రం), ఆచార్య బి. రామచంద్రరావు(స్పేస్ ఫిజిక్స్), ఆచార్య సి.ఆర్రావు (స్టాటస్టిక్స్), ఆచార సీవీ రామన్(భౌతికశాస్త్రం), ఆచార్య ఆర్.రంగదామరావు (మీటీయరాలజీ) వంటి అనేక మంది ప్రపంచస్థాయిలో శాస్త్రవేత్తలుగా రాణించినవారే! ఇక భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రస్తుత ఒడిశా గవర్నర్ ఆచార్య కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వ హిందీపరిషత్ అద్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, పెన్స్టేట్ యూనివర్సిటీ (అమెరికా) అద్యక్షురాలు నీలి బెండపూడి, జీఎంఆర్ గ్రూప్ అధినేత డాక్టర్ జి.ఎం.రావు, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తదితర ప్రముఖులు ఏయూ పూర్వవిద్యార్థులలో ఉండటం విశేషం. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు నాయకత్వం వహిస్తున్న 50 మంది వీసీలను, 10 మంది చాన్సలర్లనూ అందించిన ఘనత ఏయూ సొంతం. ఇదిలా ఉంటే, ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల్లో ఎనిమిది మంది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు, ముగ్గురు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, నలుగురు పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో పాటు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒకరు ఉన్నారు. డిసెంబర్లో పూర్వ విద్యార్థుల సమావేశం...ఏయూ పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నవారు ఉన్నారు. దేశంతో పాటు విదేశాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, కెనడా, ఆఫ్రికా, జర్మనీ, ఫ్రా¯Œ ్స, రష్యా, థాయ్లండ్, మలేషియా మొదలైన దేశాల్లో మంచి సంఖ్యలో పూర్వ విద్యార్థులు స్థిరపడి పని చేస్తున్నారు. వీరందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం యూనివర్సిటీ అభివృద్ధిలోనూ ఎంతగానో సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ సంఘం ద్వారా యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్లో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక వీసీ సీవీ రెడ్డి జయంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. ‘నాసా’ పరిశోధనల్లోనూ...ప్రారంభంలో ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్ కళాశాలలు ఉమ్మడిగా ఉండేవి. ఈ ఉమ్మడి విభాగాలకు ప్రిన్సిపల్గా పనిచేసిన ఎం. వెంకటరంగయ్య ‘పద్మవిభూషణ్’ అందుకున్నారు. అయితే, 1931లో ఈ రెండు విభాగాలను వేరు చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల తొలి ప్రిన్సిపాల్గా ఆర్.రామనాథం పనిచేశారు. జయపూర్ మహారాజా విక్రమ్దేవ్ వర్మ ఏయూకు విలువైన భూములను, భారీగా నగదును విరాళంగా ఇచ్చారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులను విద్యార్థులకు అందించడంలో ఆంధ్రా యూనివర్సిటీ అగ్రగామిగా ఉంటోంది. ఏయూ మీటియరాలజీ, ఓషనోగ్రఫీ, జియాలజీ, నూక్లియర్ ఫిజిక్స్ వంటి వైవిధ్యభరితమైన ప్రత్యేక శాస్త్ర విభాగాలను నిర్వహిస్తోంది. దేశంలోనే మొదటిసారిగా న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసిన యూనివర్సిటీగా ఏయూ పేరు సంపాదించింది. ఇక వివిధ రకాల పరిశోధనల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అడ్వాన్స్డ్ అనలిటికల్ లేబొరేటరీ, ఎన్ఎంఆర్ స్పెక్టోస్కోపీలు వర్సిటీ విశిష్టతను చాటుతున్నాయి. ఇక ‘నాసా’ చేపట్టిన లూనార్ ప్రయోగాలకు ఏయూ తన వంతు సహాయాన్ని అందించింది. తూర్పు కనుమలలోని పలు రకాల రాళ్లను సేకరించి, చంద్రమండలంలోని పదార్థాలలో పోలి ఉన్నాయా లేదా అనే ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందుకు అవసరమైన సహకారాన్ని ఏయూ జియాలజీ విభాగం అందించింది. తమకు అందించిన సహకారానికి ‘నాసా’ స్వయంగా ఏయూకు కృతజ్ఞత లేఖ రాసింది. అలాగే ఏయూ ఫ్రాన్స్కు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించింది.మరో ఎత్తుకు వైఎస్ జగన్ హాయంలో....!నూతన పోకడలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీలో కొంగొత్త మార్పులకు గత వైఎస్సార్సీపీ హాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా ఏ–హబ్ను ఏర్పాటు చేయడంతో పాటు పేటెంట్ల కోసం ఏకంగా నూటికిపైగా దరఖాస్తులు చేయడంలో ఏయూ మరో శిఖరానికి చేరుకుంది. పేటెంట్లకు దరఖాస్తు చేసేందుకు ప్రత్యేకంగా ఆంధ్రా యూనివర్సిటీలో మేధాసంపత్తి హక్కులను పొందేందుకుగానూ ప్రత్యేకంగా మేధాసంపత్తి హక్కుల కేంద్రాన్ని (సీఐపీఆర్) గత ప్రభుత్వ హాయంలో అప్పటి వీసీ ప్రసాద్రెడ్డి సెప్టెంబరు 2020లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా నూటికిపైగా దరఖాస్తులను పంపారు. ఇక గత ప్రభుత్వ హాయంలో చేపట్టి, పూరైన 5 ప్రత్యేక భవనాలను సీఎం హోదాలో 2023 ఆగస్టు 1వ తేదీన వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఏయూ ఈ ప్రగతిని సాధించింది. ఆ భవనాలు ఇవే... ఏ–హబ్ (ఆంధ్రా యూనివర్సిటీ స్టార్టప్ – టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్): దీనిని రూ. 21కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల స్థలంలో కొత్తగా నిర్మించారు. ఇందులో 121 స్టార్టప్స్ తమ కార్యాలయాలను ప్రారంభించి సేవలందిస్తున్నాయి. రాష్ట్రంలో స్టార్టప్స్కు అంకురార్పణ కూడా ఇక్కడి నుంచే ఊపందుకుందని చెప్పవచ్చు.ఎలిమెంట్(ఆంధ్రా యూనివర్సిటీ ఫార్మా ఇంక్యుబేషన్ మరియు బయోలాజికల్ మానిటరింగ్ హబ్): ఫార్మా/బయోటెక్/ జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించారు. దీని నిర్మాణానికి రూ. 44 కోట్లు ఖర్చు చేశారు.ఆల్గోరిథమ్(ఆంధ్రా యూనివర్సిటీ డిజిటల్ జోన్ –స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్): దీనిని 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 250 మంది కూర్చునేందుకు వీలు కలిగిన రెండు ఆధునిక సెమినార్ హాళ్లు, 15 స్మార్ట్ క్లాస్ రూమ్లలో 500 కంప్యూటర్లతో విద్యార్థులకు శిక్షణ, ఆన్లైన్ పరీక్షలను నిర్వహించుకునే వీలు కలిగింది. ఇందుకోసం ప్రత్యేక ఫ్లోర్ను నిర్మించారు.ఏయూ–సిబ్ (ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్): ఐఐఎం–విశాఖపట్నంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుని, రూ. 18 కోట్ల వ్యయంతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇందులో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్లో ప్రత్యేకమైన బ్యాచిలర్ మరియు మాస్టర్ ప్రోగ్రామ్లను అందిస్తున్నారు.ఏయూ–అవంతి ఆక్వాకల్చర్ ఇనోవేషన్ మరియు స్కిల్ హబ్మొదటి దశలో రూ. 11 కోట్లతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్లో నైపుణ్య శిక్షణను అందించడానికి దీనిని నిర్మించారు. -
ట్రంప్ సుంకాలకు..బ్రష్ దెబ్బ..!
అమెరికా–చైనా సుంకాల యుద్ధం ఇప్పుడు టాయిలెట్కి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖంతో తయారు చేసిన పసుపు కుచ్చు టాయిలెట్ బ్రష్ చైనాలో వైరల్గా మారింది. ఈ బ్రష్ కుచ్చు అచ్చం ట్రంప్ జుట్టు మాదిరిగానే ఉంటుంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతీకారంగా చైనీయులు ‘యివు కౌంటర్టాక్’ అంటూ ఇలా టాయిలెట్ బ్రష్లతో వ్యంగ్యంగా బదులిస్తున్నారు. వీటిని మార్కెట్లో రూ.160 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు. ట్రంప్ మీద చైనా ప్రజల కోపతాపాలు పెరిగినట్లుగానే, ప్రస్తుతం వీటికి గిరాకీ భారీగా పెరిగింది. చాలా స్టోర్స్లలో వీటికి ‘ఔటాఫ్ స్టాక్’ బోర్డులు పెట్టేస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ ‘బ్రష్ ట్రంప్’ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. మరెంతోమంది ఈ ట్రంప్ బ్రష్లను ఉపయోగించి, వివిధ ఫన్నీ మీమ్స్, కామెంట్లతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఏదీ ఏమైనా, మొత్తానికి చిన్నదైనా ఈ టాయిలెట్ బ్రష్ విసిరిన పొలిటికల్ పంచ్ భారీగానే ఉంది కదూ!(చదవండి: Canadian vlogger: ‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’) -
డిస్పోజబుల్ ప్లాస్టిక్తో ఇంటిని అందంగా మార్చేద్దాం ఇలా..!
యూజ్ అండ్ త్రో లేదా డిస్పోజబుల్ బాటిల్స్ మాత్రమే కాదు ఆహార పదార్థాల డబ్బాలు కూడా మన ఇంట్లో చేరుతుంటాయి. వాటిలోని పదార్థాలు తిన్న తర్వాత, అవి చెత్తలో పడేస్తుంటాం. ఈ రోజుల్లో మన దినచర్యలోకి వచ్చిన ఈ డిస్పోజబుల్ ప్లాస్టిక్ అంతా పర్యావరణాన్ని దెబ్బతీసేదే! డిస్పోజబుల్ ప్లాస్టిక్ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదనే ఆలోచనతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వీటి వాడకం తప్పనిసరి అవుతోంది. ఇలాంటప్పుడు వాటిని చెత్తగా మార్చకుండా, అలంకార వస్తువులుగా వాడుకోవడం కొంత నయం.స్వీట్ కప్స్తో..వాడిన ప్లాస్టిక్ బాక్సులను శుభ్రం చేసి, వాటికి పెయింట్స్ వేసి, అద్దాలను అతికించి వాల్ హ్యాంగింగ్స్ తయారుచేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ను విభిన్న రంగులతో తీర్చి, దానికి జనప దారాలను ఉపయోగించి మినీ ప్లాంటేషన్ వాల్ను క్రియేట్ చేయవచ్చు. బొమ్మల తయారీశుభ్రం చేసిన ప్లాస్టిక్ బాక్స్లు, కొన్ని పూసలు, గ్లూ సాయంతో పిల్లలను ఆకట్టుకునే బొమ్మలను డిజైన్ చేయవచ్చు. పిల్లల చేత వాటిని తయారుచేయించి, వారిలో సృజనాత్మకతను పెంపొందించవచ్చు. క్రియేటివ్ షెల్ఫ్డిస్పోజబుల్లోనూ ఎకో–ఫ్రెండ్లీ ఐటమ్స్ వస్తున్నాయి. వాటిని పెన్నులు, పెన్సిళ్లు వంటి వస్తువులు వేసుకోవడానికి హోల్డర్స్ ఈ రీయూజ్ బాక్స్లతో డిజైన్ చేసుకోవచ్చు. (చదవండి: అక్కడ నేటికి విసుర్రాళ్లతోనే..) -
అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్..! ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్..
ప్రపంచంలోని ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో లుక్లా విమానాశ్రయం ఒకటి. నేపాల్లో ఉన్న దీనిని టెన్జింగ్–హిల్లరీ విమానాశ్రయంగా కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 2,860 మీటర్ల (9,383 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ విమానాశ్రయం చుట్టూ ఎత్తైన పర్వతాలు, లోయలు ఉన్నాయి. లుక్లా విమానాశ్రయం రన్వే కేవలం 527 మీటర్ల (1,729 అడుగులు) పొడవు మాత్రమే ఉంటుంది. అందుకే ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్ అనేవి పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. వాతావరణ పరిస్థితులు కూడా తరచుగా మారుతూ ఉంటాయి. దట్టమైన పొగమంచు, బలమైన గాలులు విమానాల రాకపోకలను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు లేకపోవడం కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితులకు కారణం. సాహసికులు, పర్వతారోహకులకు లుక్లా విమానాశ్రయం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం. లేదంటే అనేక రోజుల పాటు నడవాల్సి ఉంటుంది. చిన్న విమానాలు, హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడ ల్యాండ్ కాగలవు. (చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..) -
ట్రావెల్ మేకప్ బ్యాగ్..! ఎక్కడైన ఈజీగా వేసుకోవచ్చు..
సాధారణంగా మేకప్ ప్రియులకు ప్రయాణాలనగానే దిగులు మొదలైపోతుంది. వెళ్లిన చోట మేకప్ వేసుకోవడానికి వీలుంటుందా? సరైన లైటింగ్ ఉంటుందా? కాస్మెటిక్స్ అన్నీ ఎందులో పెట్టుకోవాలి? ఎలా తీసుకెళ్లాలి? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి వారికి చక్కటి పరిష్కారం ఈ ట్రావెల్ మేకప్ బ్యాగ్.చిత్రంలోని ఈ స్టైలిష్ బ్యాగ్లో ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్ మిర్రర్ ఉంటుంది. దీనిలో మూడు రకాల లైటింగ్ సెట్టింగ్స్ ఉండటంతో మీరు ఎక్కడ ఉన్నా, నచ్చిన వెలుతురులో మేకప్ వేసుకోవచ్చు. ఇకపై ఎక్కడికి వెళ్లినా మేకప్ వేసుకునేటప్పుడు సరిగా కనబడటం లేదని చింతించాల్సిన పని లేదు. అన్ని రకాల సౌందర్య సాధనాలను చక్కగా అమర్చుకోవడానికి ఈ బ్యాగ్లో తగినంత స్థలం ఉంటుంది. బ్రష్లు, లిప్స్టిక్లు, ఫౌండేషన్లు, క్రీములు ఇలా అన్నింటినీ వేర్వేరుగా పెట్టుకోవచ్చు. ఇది రీచార్జబుల్ డివైస్ కాబట్టి, బ్యాటరీ అయిపోతుందనే భయం కూడా అవసరం లేదు. ఇది వెంట ఉంటే, ఎప్పుడంటే అప్పుడు మేకప్ వేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్లో చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా రంగుల్లో దొరుకుతున్నాయి. నిత్యం టూర్స్కో, ఫంక్షన్స్కి వెళ్లే మహిళలకు, దీన్ని బహుమతిగా కూడా ఇవ్వచ్చు. (చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..) -
నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..!
నిన్న మొన్నటి వరకు అతడు పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తుండేవాడు. అనుకోకుండా ఒక రోజు న్యూయార్క్లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వద్ద అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి కంటపడ్డాడు. అంతే, అతడి అదృష్టం మారిపోయింది. ఉన్నపళాన ఫ్యాషన్ మోడల్గా మారిపోయాడు. ఫ్యాషన్ మోడల్గా మారిన ఈ ఇరవైనాలుగేళ్ల పిజ్జా మేకర్ పేరు క్రిస్టియానో వెన్మన్. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే ‘స్కార్స్’ అనే పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తూ ఉండేవాడు. న్యూయార్క్లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విల్లీ షవారియా అసిస్టెంట్లలో ఒకరు ‘స్కార్స్’ పిజ్జా సెంటర్కు వచ్చినప్పుడు క్రిస్టియానో అతడి కంటపడ్డాడు. ఆకట్టుకునే రూపంతో ఉన్న క్రిస్టియానో ఫ్యాషన్ మోడలింగ్కు బాగా పనికొస్తాడని అంచనా వేశాడు. ఇదే విషయాన్ని తన బాస్ విల్లీకి చెప్పాడు. విల్లీ వెంటనే అతణ్ణి పిలిపించి, మోడలింగ్లో అవకాశం ఇచ్చాడు. విల్లీ చలవతో క్రిస్టియానో ఇటీవల ప్యారిస్లో జరిగిన ఫ్యాషన్ వీక్లో ర్యాంప్వాక్ చేసి, ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ దెబ్బతో క్రిస్టియానోకు అవకాశాల వెల్లువ మొదలైంది. అంతేకాదు, ‘హీరో’, డేజ్డ్’ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు క్రిస్టియానో ఫొటోలతో ప్రముఖంగా వ్యాసాలను ప్రచురించడం మరో విశేషం.(చదవండి: Vomiting During Pregnancy: ప్రెగ్నెన్సీలో వాంతులవుతుంటే నార్మల్ డెలివరీ అవ్వదా..?) -
ప్రెగ్నెన్సీలో వాంతులవుతుంటే నార్మల్ డెలివరీ అవ్వదా..?
నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. వర్క్లో బిజీగా ఉండి ఏ జాగ్రత్తా సరిగ్గా తీసుకోలేదు. నార్మల్ డెలివరీ కావాలని ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – నిర్మల, నల్గొండనార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు పెంచుకోవటానికి ప్రెగ్నెన్సీ అంతా కూడా పోషకాహారాలు తీసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చెయ్యాలి. ఈ రోజుల్లో చాలా చోట్ల చైల్డ్ బర్త్ ప్రిపరేషన్ క్లాసెస్ అని అవుతున్నాయి. అవి హాజరైతే మంచిది. మొదటి ప్రెగ్నెన్సీలో ఈ సలహాలు పాటిస్తే సులభంగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఒకవేళ మీరు బిజీగా ఉండి క్లాసెస్ హాజరు కాలేకపోయినా, తొమ్మిదవ నెలలో అయినా పోషకాహార నిపుణుడిని కలసి సమత్యులమైన ఆహారం ఏమి తీసుకోవాలో తెలుసుకోండి. పండ్లు, కూరగాయలు, ఫైబర్, పానీయాలు ఎక్కువ తీసుకోవాలి. ప్రినేటల్ విటమిన్ టాబ్లెట్స్ రోజూ తీసుకోవాలి. ఇప్పుడైనా రెగ్యులర్గా వాకింగ్, స్విమ్మింగ్ లేదా ప్రీనేటల్ యోగా చెయ్యండి. దీనితో సత్తువ పెరుగుతుంది. కెగల్ వ్యాయామాలు అని పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంతెనింగ్ అయేవి మీకు ఆన్లైన్లో కూడా వీడియోస్లో నేర్పిస్తారు. అవి తొమ్మిదవ నెల నుంచి డెలివరీ తరువాత కూడా పాటించండి. పెరినియల్ మసాజ్ కూడా కొంతమందికి సూచిస్తాం. మీ గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు దీని గురించి కనుక్కోండి. సరైనంత నిద్ర కూడా అవసరం. బేబీ కదలికలని జాగ్రత్తగా ట్రాక్ చేసుకోండి. స్క్వాట్స్, బర్తింగ్ బాల్ వ్యాయామాలతో బేబీ తల కిందకి వచ్చే అవకాశాలు, సులభ కాన్పు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. మీరు ఇవి అన్నీ పాటించవచ్చా లేదా అని స్కాన్ రిపోర్ట్ చూసి మీ డాక్టర్ నిర్ణయిస్తారు.నాకు మొదటి ప్రెగ్నెన్సీలో అసలు వాంతులు లేవు. సులభంగా నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీలో చాలా వాంతులు అవుతున్నాయి. ఏమీ తినటం లేదు మందులు సేఫ్ కాదని వేసుకోవాలను కోవటం లేదు. బేబీ గ్రోత్ ఏమయినా ఎఫెక్ట్ అవుతుందా మళ్లీ నార్మల్ డెలివరీ అవుతుందా?– భ్రమర, గుంటూరు. ప్రెగ్నెన్సీలో వికారం, వాంతులు అనేవి చాలా సాధారణం. ప్రెగ్నెంట్ హార్మోన్స్ వలన ఈ మార్పులు అవుతాయి. ఐదవనెలకి హార్మోన్స్ తగ్గడంతో వాంతులు తగ్గుతాయి. వాంతులు ఎక్కువ అవుతున్నప్పుడు దానిని హైపెరెమెసిస్ అంటారు. దీని వలన మీకు డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సరైన ఆహారం లేనందు వలన పోషాకాహార లోపం ఉంటుంది. కానీ, బేబీ శరీరంలోని స్టోర్స్ నుంచి బేబీకి పోషకాలు అందుతాయి. కాబట్టి, బిడ్డ ఎదుగుదలకు ప్రభావం ఉండదు. మీ డెలివరీ ప్రాసెస్ కూడా దీని వలన ఎఫెక్ట్ అవదు. మళ్లీ నార్మల్ డెలివరీకి ఈ వాంతుల వలన ఏమీ సమస్య ఉండదు. మీరు మందులు వాడొద్దు అనుకుంటే డైట్లో ఈ మార్పులు చేసుకోవాలి. డ్రై టోస్ట్ లేదా ప్లేన్ బిస్కెట్స్ ఉదయం తీసుకోవాలి. తక్కువ కొవ్వు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఆహారం భోజనంలో తీసుకోవాలి. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలి. బ్రెడ్, రైస్ తీసుకోవచ్చు. పానీయాలు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల వరకు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. ఎండబెట్టిన అల్లం లేదా ఎండబెట్టిన ఆమ్లా నములుతున్నా వాంతులు తగ్గుతాయి. విశ్రాంతి కూడా ఎక్కువ తీసుకోవాలి. మీకు వాంతి వచ్చే ఆహారం, వాసనలకు దూరం ఉండండి. ఇవన్నీ ప్రయత్నించినా తగ్గకపోతే, మందులు తప్పకుండా తీసుకోవాలి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
Summer Holidays: శిక్షాకాలం కాదు..శిక్షణ కాలం..!
‘వేసవి వచ్చిందంటే మా ఇంట్లో రోజుకో యుద్ధం జరుగుతోంది సార్!’ అని చెప్పారో తండ్రి. ‘మొబైల్ తీసేస్తే మా పాప ఏడుస్తుంది సర్. గట్టిగా అరిచి చెప్పినా పట్టించుకోవడం లేదు. చివరకు కోపంతో ఒక దెబ్బ వేస్తేనే దారికొస్తుంది’ అని చెప్పారో తల్లి. ‘మా అబ్బాయి టెన్త్ క్లాస్కు వెళ్తున్నాడు సర్. చదవమంటే మొహం చిట్లిస్తున్నాడు. సమ్మర్ హాలిడేస్లో కూడా చదవాలా?’ అని గొడవపడుతున్నాడు’ అని మరో తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలున్న ప్రతి ఇంటిలోనూ ఇలాంటి పోరాటమే జరుగుతుంటుంది. పిల్లలను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తల్లిదండ్రులు తలపట్టుకుంటారు. అలాంటివారి కోసమే ఈ ఆర్టికల్. ఈ వేసవిని అవకాశాల మార్గంగా, ఒక టర్నింగ్ పాయింట్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఇదేమీ పనిష్మెంట్ సీజన్ కాదు...స్కూల్, కాలేజీ ఉన్నన్ని రోజులూ రోజూ ఉదయం ఆరు గంటలకే లేచి, సిద్ధమై, బస్సు పట్టుకుని వెళ్లి, పాఠాలు, పుస్తకాలు, పరీక్షలతో కుస్తీ పట్టే పిల్లలకు వేసవి సెలవులు ఒక ఆటవిడుపులా కనిపిస్తాయి. తమకు నచ్చిన టైంలో నిద్ర లేవచ్చని, నచ్చిన ఆటలు ఆడుకోవచ్చని భావిస్తారు. పుస్తకాలు, పరీక్షల గొడవ ఉండదని ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు తల్లిదండ్రులు ఈ వేసవిలో పిల్లలకు ఏదైనా నేర్పించాలని ప్లాన్ చేస్తుంటారు. లేదా నెక్స్ట్ క్లాస్కు రెడీ చేయాలని భావిస్తుంటారు. అందుకు మొబైల్ ఫోన్ అడ్డుగా ఉందని, దాన్ని తీసేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇక్కడే సంఘర్షణ మొదలవుతుంది. ఒక సెలవు రోజు మిమ్మల్ని ఆఫీసుకు రమ్మంటే మీరెలా ఫీలవుతారో గుర్తుచేసుకోండి. మీ పిల్లలు కూడా అలాగే ఫీలవుతుంటారు. ‘ఇవాళ్టి నుండి మొబైల్ తీసేస్తా’, ‘చదవకపోతే తినొద్దు’– ఇలాంటి మాటల వల్ల పిల్లల మెదడులో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. తల్లిదండ్రులపై కోపం, భయం, దూరం పెరుగుతాయి. తల్లిదండ్రులను సంతోషపెట్టేందుకే తాము బతుకుతున్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా వయసు పెరిగినప్పటికీ వారు సెల్ప్ డౌట్లో కొట్టుకుంటుంటారు. నిజానికి పిల్లలు మొబైల్కు అతుక్కుపోయేది మెదడులో విడుదలయ్యే ‘డోపమైన్’ అనే హ్యాపీ కెమికల్ కోసమే. అది మొబైల్ ద్వారా కాకుండా సహజమార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించండి. వేసవిని విలువైన కాలంగా మార్చండి... ఒక వారం రోజులపాటు ఏ శిక్ష లేకుండా మీ బిడ్డ ప్రవర్తనను గమనించండి. పొద్దున్నే లేచే సమయం, స్క్రీన్ టైం, భోజన సమయం, బోర్ అవుతున్న సమయాలు గమనించి నోట్ చేసుకోండి. మొబైల్ తీసేయమంటే వాళ్లు ఎలా ఫీలవుతున్నారో అడిగి తెలుసుకోండి. ‘మొబైల్ కాకుండా నీకు ఆనందం కలిగించే విషయం ఏమిటి?’ అని అడిగి తెలుసుకోండి. వారి ఆసక్తిని ప్యాషన్గా మార్చుకునే మార్గం చూపించండి. ఈ వేసవిని మూడు జోన్లలో డిజైన్ చేయండిలెర్నింగ్ జోన్: ఓ వారం రోజులు మొబైల్ ఫోన్ కాస్త పక్కన పెట్టి,జీవితానికి అవసరమైన వంట, ఫస్ట్ ఎయిడ్, డబ్బు వినియోగం గురించి బేసిక్స్ నేర్చుకునేలా ప్రోత్సహించండి. తమకు నచ్చిన పుస్తకాలు తెప్పించి, చదువుకునే అవకాశం కల్పించండి. మైండ్ గేమ్స్ తెప్పించి ఇవ్వండి. ఆటోమేటిగ్గా మొబైల్కు దూరం అవుతారు. క్రియేటివ్ జోన్: ఈ వేసవిని వారికి నచ్చింది నేర్చుకునే అవకాశంగా మార్చండి. సంగీతం, నృత్యం, పెయింటింగ్, కోడింగ్, బ్లాగింగ్ లాంటిది ఏదైనా కావచ్చు. అలాగే గార్డెనింగ్, సైన్స్ ప్రయోగాలు, బాటిల్ ఆర్ట్ లాంటివి చేయడానికి ప్రోత్సహించండి. యూట్యూబ్లో వీడియోలు చూసి సైన్స్ ప్రయోగాలు చేయమనండి. తాము నేర్చుకున్న దాన్ని మీకు నేర్పమని చాలెంజ్ ఇవ్వండి. కనెక్షన్ జోన్: మామూలు రోజుల్లో పిల్లలు ఉదయం లేచిన దగ్గర్నుంచి నిద్రపోయేవరకు ఉరుకులు పరుగుల్లో ఉంటారు. ఈ వేసవిని వారితో బంధాన్ని బలపరచుకునేందుకు ఉపయోగించండి. మీ చిన్ననాటి సంగతులు పంచుకోండి. అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, బాబాయి, అత్తలతో మీ అనుభవాలు ఎలా ఉండేవో చెప్పండి. అలాగే వారి అనుభవాలను ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా వినండి. ‘వాట్ ఐ లవ్ అబౌట్ అవర్ ఫ్యామిలీ’ స్క్రాప్బుక్ తయారు చేయమని చెప్పండి. (చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
Nagaland: నిజాయితీకి చిరునామా!
నాగాలాండ్ రాజధాని ‘కోహిమా’ కదా... నాగాలాండ్లోనే, ఇండియా–మయన్మార్ సరిహద్దుల్లో కోహిమాకు పశ్చిమాన 20 కి.మీ. దూరంలో ‘ఖొనోమా’ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం ప్రత్యేకత... గ్రామంలో ఎవరూ అబద్ధాలు ఆడకపోవటం! ఎవరూ దొంగతనం చేయకపోవటం! ఎవరూ ఇళ్లకు తాళాలు వేయకపోవటం! దుకాణాల్లో వాటిని నడిపేవారెవరూ ఉండకపోవటం! ఇలాంటివన్నీ కలిపి ఖొనోమా గ్రామంలో మొత్తం 154 ప్రత్యేకతలు ఉన్నాయి. ‘కెన్యూ’ నిబంధనలు అంటారు వాటిని. ఎవరైనా కెన్యూను దాటి ప్రవర్తించారా... ఇక వాళ్ల పని దైవం చూసుకుంటుందని గ్రామస్థుల నమ్మకం. ఖొనోమా గ్రామం దేశంలోనే ‘నిజాయితీ గల గ్రామం’గా ప్రసిద్ధి చెందింది.ఖొనోమా గ్రామంలో ఉండేదంతా ‘అంగామీ’ తెగవారు. నాగాలాండ్కు చెందిన ఒక ప్రధాన సమూహం ఆ తెగ. ‘అంగామీ నాగా’లు అంటారు వారిని. ‘గోల్హో’ వారి ప్రధాన ఆహారం. బియ్యం, హిమాలయాల్లో విస్తృతంగా ఉండే చిమటి కూర కలిపి గోల్హోను తయారు చేస్తారు. అలాగే కూరగాయలు, పందిమాసం, గొడ్డు మాంసం తింటారు. వారిలో దాదాపుగా అందరూ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. 2011 లెక్కల ప్రకారం అక్కడి జనాభా సుమారుగా 2 వేలు. పురుష జనాభా కంటే, స్త్రీ జనాభా పిసరంత ఎక్కువ. గ్రామం ప్రకృతి మధ్యలో ఉంటుంది. ప్రకృతి తన కోసం కట్టుకున్న ఇంటిలా ఆ పచ్చని గ్రామంపై మంచు పరుచుకుని ఉంటుంది. మోసం అనే మాటే ఉండదు!నాగాలాండ్లో చాలావరకు గ్రామాలన్నీ ఖొనోమాలా ఉన్నప్పటికీ, ఖొనోమా ప్రజలు ‘కెన్యూ’ నియమాలకు లోబడి జీవించటం మూలాన దేశంలోనే ఈ గ్రామం నిజాయితీ గల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఖొనోమాకు ‘వారియర్ విలేజ్’ అనే పేరు కూడా ఉంది. బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడిన చరిత్ర వీరిది. ఖొనోమా ప్రజల్లో నిజాయితీ అనేది కేవలం నైతిక ధర్మం మాత్రమే కాదు, అది వారి సామాజిక సంప్రదాయ శక్తి కూడా. నిజాయితీ పట్ల వారి నిబద్ధతే ఆ తెగలో పేద, ధనిక అనే అసమానతలు లేకుండా చేసింది. దొంగతనం అనే మాటే ఆ గ్రామంలో వినిపించదు. దొంగతనం అనేది దేవుడి విషయంలో మనిషి చేసే నేరం అని వారు బలంగా విశ్వసిస్తారు. ఖొనోమాలోని దుకాణాల్లో వినియోగదారులు ఎవరికి కావలింది వారు తీసుకుని, డబ్బులు అక్కడ పెట్టి వెళతారు. ఆ డబ్బుల్ని తీసుకోటానికి, లెక్క చూసుకోటానికి దుకాణంలో పనిగట్టుకుని ఎవరూ ఉండరు. అంత నమ్మకం రాజ్యమేలుతూ ఉంటుంది ఖొనోమా గ్రామంలో! అంతేనా, ఎవరైనా వ్యవసాయదారులు పంటను ఇంటికి మోసుకెళుతున్నప్పుడు అలసిపోతే, వారు ఆ పంటను రోడ్డు పక్కన వదిలి, మరుసటి రోజు వచ్చి తీసుకెళతారు. అప్పటి వరకు ఆ పంట భద్రంగా రహదారి పక్కనే ఉంటుంది. ఎవరైనా తీసుకెళతారన్న భయమే ఉండదు. ‘అనిమిజం’... ఈ గ్రామ మార్గంనిజాయితీ అన్నది వాళ్ల మత విశ్వాసాల్లోనే మిళితమై ఉంది. 19వ శతాబ్దంలో క్రైస్తవ మతం ఇటువైపు వ్యాప్తి చెందటానికి ముందు నుండే ఖొనోమాలోని ఈ అంగామీలు ‘అనిమిజం’ అనే భావనను విశ్వసిస్తూ వస్తున్నారు. నేటికీ ఆ విశ్వాసం కొనసాగుతూ వస్తోంది. అనిమిజం అంటే సృష్టిలోని ప్రతి జీవి, వస్తువు, ప్రదేశం ప్రత్యేక ఆధ్యాత్మిక సారాన్ని కలిగి ఉంటుందన్న నమ్మకం. ఈ నమ్మకం కేవలం మతపరమైనది కాదు. రోజువారీ జీవితంలో అంతర్భాగం అయిన ఆచారాలు, సంప్రదాయాలు, పర్యావరణానికి హితమైన జీవన విధానం అనిమిజానికి ఆయువు పట్టు. వీటిలోంచి అంగామీల పూర్వీకులు ఏర్పరచిన 154 నిబంధనలే కెన్యూలు. కెన్యూ అనే మాటకు నిషిద్ధం అని అర్థం. వికలాంగులను ఆదరించకపోవటం కెన్యూ. పెద్దల్ని గౌరవించకపోవటం కెన్యూ. మోసం చేయటం, అబద్ధాలాడటం, సాటి మనిషిని తృణీకరించటం వంటివన్నీ కెన్యూలే. ఖొనోమా ప్రజల భావోద్వేగాల రక్తకణాల వంటివి ఈ కెన్యూలు. అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం!దొంగిలించిన పిల్లి మాంసం తినడం కూడా ఒక కెన్యూ. అలా చేస్తే పిల్లి శాపం తగులుతుందని ఖొనోమా గ్రామస్థులు నమ్ముతారు. పెంపుడు పిల్లలను ఆహారం కోసం చంపటం వంటి సంఘటనల నుంచి ఈ కెన్యూ ఆవిర్భవించింది. లంచాలు తీసుకోవటం, మన కోసం పని చేసినవారికి సగం జీతాన్నే చెల్లించటం, అత్తమామల్ని కించపరచటం, గుమ్మడి కాయను వేలితో చూపించటం ఇవన్నీ కూడా కెన్యూలే. వీటిలో ఒక్కో రకం తప్పుకు ఒక్కో రకం ప్రతికూల ఫలితం ఉంటుందని ఖొనోమా వాసులు నమ్ముతారు. గుమ్మడి కాయను వేలితో చూపిస్తే అది కుళ్లిపోతుందని, అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం వస్తుందని, మన కోసం పని చేసినవారికి సగం జీతమే ఇస్తే, దేవుడు మనకు ఉద్దేశించిన ఆశీర్వాదాలు వారివి అవుతాయని ఖొనోమా గ్రామంలోని అంగామీలు బలంగా నమ్ముతారు. అందుకే నిజాయితీ, సత్యసంధత వారిలో లోతుగా పాతుకుపోయాయి. భారత ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితమే, 2005లో ఖొనోమాను ‘దేశంలోనే మొట్టమొదటి హరిత గ్రామం’గా ప్రకటించింది. అన్నట్లు, గ్రామంలో సమృద్ధిగా పెరిగే ఖ్వునో అనే చిన్న మొక్క పేరు మీద ఈ గ్రామానికి ఖొనోమా అనే పేరు వచ్చిందంటే ముచ్చటగా అనిపిస్తుంది. ప్రకృతికి కట్టుబడి ఉండటం అంటే ఇదే కదా!– సాక్షి, స్పెషల్ డెస్క్ -
మయూరధ్వజుడు
ధర్మరాజు అశ్వమేధయాగం చేపట్టి, యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే, వారు చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే! మయూరధ్వజుడు అనే రాజు యాగాశ్వాన్ని బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు మయూరధ్వజుడి రాజధానికి వెళ్లారు. యాగాశ్వాన్ని విడిచిపెట్టడమో, యుద్ధానికి సిద్ధం కావడమో తేల్చుకోమన్నారు. మయూరధ్వజుడు యుద్ధానికే సిద్ధపడ్డాడు.యుద్ధం మొదలవడానికి ముందు శ్రీకృష్ణుడు ‘అర్జునా! మయూరధ్వజుడు నా భక్తాగ్రేసరుడు. అతడితో యుద్ధం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు’ అని చెప్పాడు. యుద్ధం మొదలైంది. మయూరధ్వజుడి ధాటికి అర్జునుడు నిలవలేకపోయాడు. కృష్ణుడి సాయం కోరాడు. కృష్ణుడు కూడా యుద్ధంలోకి దిగాడు. తన ఆరాధ్యదైవంతో యుద్ధం చేయడం మయూరధ్వజుడికి ఇష్టంలేదు. అలాగని రణరంగం నుంచి వెనుదిరగడం క్షాత్రధర్మం కాదు. మయూరధ్వజుడు మనసులో కృష్ణనామ జపం కొనసాగిస్తూనే, శరపరంపర కురిపించసాగాడు. అతడి బాణాల దెబ్బకు కృష్ణుడు కూడా చలించాడు. అది గమనించిన అర్జునుడు, ‘బావా! ఎందుకు సంకోచిస్తావు. నీ చక్రాయుధంతో వాడి తల నరుకు’ అన్నాడు.‘అర్జునా! నీ గాండీవమైనా, నా సుదర్శనమైనా ఆ మహాభక్తుడి మీద పనిచేయవు’ అని పలికాడు కృష్ణుడు.‘అంతటి మహాభక్తుడా!’ ఆశ్చర్యంగా అడిగాడు అర్జునుడు. కృష్ణభక్తులలో తానే గొప్పవాడిననే గర్వం అర్జునుడిలో ఉంది. మయూరధ్వజుడి గురించి స్వయంగా కృష్ణుడే అంతలా చెబుతుండటంతో అతడు ఆశ్చర్యపోయాడు. పొద్దువాలడంతో ఆనాటికి యుద్ధం చాలించారు.మయూరధ్వజుడి భక్తి ఎంతటిదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు కృష్ణుడు. మరునాటి వేకువజామునే కృష్ణార్జునులు బ్రాహ్మణవేషాలు ధరించి, మయూరధ్వజుడి రాజప్రాసాదానికి చేరుకున్నారు.మయూరధ్వజుడు వారికి ఎదురేగి, ఆహ్వానం పలికాడు. ‘విప్రులారా! నా ఆతిథ్యం స్వీకరించి, నన్ను ఆశీర్వదించండి’ అని అభ్యర్థించాడు.‘రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకు పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరేంత వరకు మేము మరొక విషయాన్ని గురించి ఆలోచించలేము’ అని చెప్పారు వారు.‘స్వామీ! మీకు వచ్చిన విపత్తేమిటి? అవసరమైతే నా ప్రాణమైనా ధారపోసి మీ విపత్తను తొలగిస్తాను’ అన్నాడు మయూరధ్వజుడు.‘రాజా! మేము అడవి దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పులి నా కుమారుణ్ణి పట్టుకుంది. అది వాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత, ‘మయూరధ్వజ మహారాజు శరీరంలోని సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే, నీ బిడ్డ బతుకుతాడు’ అని అశరీరవాణి పలికింది. అందువల్ల పుత్రభిక్ష కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను’ అన్నాడు విప్రవేషంలోని శ్రీకృష్ణుడు.‘ఆహా! నా జన్మ చరితార్థమైంది. ఒక పసిబాలుడి ప్రాణం కాపాడటానికి నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే నాకేం కావాలి! సంకోచించకుండా నా శరీరంలోని సగభాగాన్ని తీసుకువెళ్లి ఆ పులికి ఆహారంగా ఇవ్వండి’ అని పలికి, తన శరీరాన్ని రెండు సమభాగాలుగా కోయమని తన భార్యాబిడ్డలను ఆదేశించాడు.వారు కంటతడి పెట్టుకుంటూనే మయూరధ్వజుడిని రంపంతో నిలువునా తరగడం మొదలుపెట్టారు. విప్రవేషాల్లో ఉన్న కృష్ణార్జునులు నిశ్చేష్టులై, ఆ దృశ్యాన్ని తిలకించసాగారు. అలా చూస్తుండగా, ఒక వింత కనిపించింది. మయూరధ్వజుడి ఎడమకంటి నుంచి కన్నీరు కారసాగింది.అప్పుడు కృష్ణుడు ‘రాజా! ఏదైనా మనస్పూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. నువ్వలా బాధపడుతూ, కన్నీరు చిందిస్తూ నీ శరీరాన్ని నాకు ఇవ్వనక్కర్లేదు. నీకు ఇష్టంలేని పని చేయవద్దులే!’ అని తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో పలికాడు కృష్ణుడు. వెంటనే అక్కడి నుంచి వెనుదిరగబోయాడు.మయూరధ్వజుడు వెంటనే కృష్ణుడి చేతులు పట్టుకుని, ‘అయ్యా! నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నందుకు నాకు ఎలాంటి బాధలేదు. నాకు నిజంగా బాధ ఉంటే, నా రెండుకళ్లూ కన్నీరు కార్చాలి కదా! నా ఎడమ కంటి నుంచి మాత్రమే కన్నీరు వస్తోంది. నా శరీరంలోని కుడిభాగానికి దక్కిన అదృష్టం తనకు దక్కలేదని, ఒంటరిగా మిగిలిపోయిన తాను ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకుండానే ఖిలమైపోతానని ఎడమభాగం బాధపడుతుండటమే అందుకు కారణం. మీరు నిశ్చింతగా నా శరీరంలోని అర్ధభాగాన్ని తీసుకువెళ్లవచ్చు’ అని పలికాడు.కృష్ణుడు సాభిప్రాయంగా అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. తనకు గర్వభంగం కలిగించడానికే జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణ పరమాత్ముడు ఈ లీలావినోదాన్ని కల్పించాడని గ్రహించి, సిగ్గుపడ్డాడు.వెంటనే, కృష్ణార్జునులు నిజరూపాలతో మయూరధ్వజుడికి దర్శనమిచ్చారు.మయూరధ్వజుడి శరీరానికి తిరిగి పూర్వస్థితి కలిగించాడు కృష్ణుడు.ఆరాధ్యదైవం కళ్లెదుట కనిపించడంతో మయూరధ్వజుడు పారవశ్యంతో సాష్టాంగపడ్డాడు. యాగాశ్వాన్ని అర్జునుడికి అప్పగించాడు.∙సాంఖ్యాయన -
Funday Crime Story: కాఫీ+చాయ్= కొచ్చిన్!
నల్లగొండకు చెందిన సయ్యద్ సలావుద్దీన్ సలార్ ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’ (సిమి)లో చేరి, ఆ సంస్థ అధినేత స్థాయికి ఎదిగాడు. పదేళ్లకు పైగా పరారీలో ఉన్న సలార్, 2011 జూన్లో పోలీసులకు చిక్కాడు. దుబాయ్లో తలదాచుకున్న అతడు, కేరళ మీదుగా హైదరాబాద్ వచ్చే ప్రయత్నంలో ఉండగా, మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు దొరికిపోయాడు. ‘కాఫీ.. చాయ్.. కొచ్చిన్’ అనే కోడ్ వర్డ్ సలార్ను పట్టించింది.సలావుద్దీన్ సలార్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం ముంబై వెళ్లి, అక్కడి ‘సిమి’ క్యాడర్తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 1998 వరకు నార్తర్న్ రీజన్ కమాండర్గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ‘సిమి’ కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. ఆపై ‘సిమి’కి ఆలిండియా చీఫ్గా మారి దాదాపు రెండేళ్ల పాటు దాని వ్యవహారాలను పర్యవేక్షించాడు. సలార్ నార్తర్న్ రీజన్ కమాండర్గా ఉండగా మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలోని మహాకాల్ పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశాడనే ఆరోపణలతో అతడిపై ఆ కేసు నమోదైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం 2001లో ‘సిమి’ని నిషేధించింది. దీంతో సలార్ తన మకాంను దుబాయ్కు మార్చాడు. పదేళ్లకు పైగా దుబాయ్లో ఉంటూ సివిల్ ఇంజినీర్గా పని చేస్తున్న సలార్ను 2009లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ దేశ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో విచారణ పూర్తి చేసి, రెండేళ్ల శిక్ష విధించారు. ఈ శిక్షాకాలం 2011లో పూర్తికావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అక్కడి నిబంధనల ప్రకారం యూఏఈ ప్రభుత్వం సలావుద్దీన్కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (ఈసీ) ఇచ్చింది. ఈ సర్టిఫికెట్ పొందిన వ్యక్తి నిర్ణీత సమయంలోపు ఆ దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అప్రమత్తమైంది. సలార్ భారత్లో అడుగు పెట్టగానే, అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం అనేక మార్గాలు అన్వేషించిన అధికారులు చివరకు ఇండోర్కు చెందిన ఓ ఫోన్పై నిఘా ఉంచారు. ఆ వ్యక్తి గతంలో సలార్కు అనుచరుడిగా ఉండటంతో కచ్చితంగా అతడిని సంప్రదిస్తాడనే ఉద్దేశంతో మానిటరింగ్లో పెట్టింది. దేశంలోని ఏ విమానాశ్రయంతో అతడు ల్యాండ్ అవుతున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పని మొదలు పెట్టారు. సుదీర్ఘకాలం క్రమం తప్పకుండా గంటల తరబడి చేసిన ఈ మానిటరింగ్లో ఓ చిన్న పదం నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఐబీ అనుమానించినట్లే 2011 జూన్లో ఇండోర్కు చెందిన వ్యక్తిని సలార్ సంప్రదించాడు. తన మాజీ అనుచరుడైన ఆ వ్యక్తితో అనేక విషయాలు చర్చించాడు. చివరగా పదే పదే అతడు చెప్పిన మాట ‘కాఫీ, చాయ్ సే తయ్యార్ రహో’ (కాఫీ, టీతో సిద్ధంగా ఉండు) అధికారులను అలెర్ట్ చేసింది. సలావుద్దీన్ లాంటి వ్యక్తి టీ, కాఫీల కోసం కాల్ చేయడని, అందులో ఏదో మర్మం ఉందని భావించి, నిపుణులతో విశ్లేషించారు. కాఫీ, చాయ్లను ఆంగ్ల అక్షరాల్లో రాసుకుని దేశంలోని కొన్ని నగరాలు, పట్టణాల పేర్లతో సహా అనేక పదాలు సృష్టించారు. సలావుద్దీన్ వస్తున్నది దుబాయ్ నుంచి కావడంతో ఆ నగరాలు, పట్టణాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న వాటిని వేరు చేయాలని నిర్ణయించడంతో ఐబీ ప్రయత్నం ఫలించింది. కేరళలోని కొచ్చిన్ పేరు కూడా వాటిలో ఉండటంతో అదే ల్యాండింగ్ స్పాట్గా గుర్తించింది. కాఫీ, చాయ్ పదాల ఉచ్చారణతో ఏర్పడే, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగరం అదేనని తేల్చి, మధ్యప్రదేశ్ ఏటీఎస్ను అప్రమత్తం చేసింది. కొన్ని రోజుల పాటు దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల వివరాలపై అధికారులు కన్నేసి ఉంచారు. చివరకు 2011 జూన్ 26న సలావుద్దీన్ సలార్ దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 530లో తన దూరపు బంధువులు ఇద్దరితో కలిసి విమానం దిగి, కేరళ–మధ్యప్రదేశ్ పోలీసుల సంయుక్త బృందానికి చిక్కాడు. సలావుద్దీన్ సలార్ హైదరాబాద్లోనూ వ్యవహారాలు సాగించాడని విచారణలో తేలింది. అప్పట్లో హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్ వెళ్లిన ప్రత్యేక బృందం సలార్ను విచారించి వచ్చింది. ఈ నేపథ్యంలోనే లష్కరేతొయిబా (ఎల్ఈటీ ) మాడ్యుల్తో ఇతడికి సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. 2002 నవంబర్ 21న దిల్సుఖ్నగర్లోని సాయిబాబా దేవాలయం సమీపంలో పేలిన స్కూటర్ బాంబు ఇద్దరిని బలిగొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆజం, అజీజ్ అప్పట్లో ఎన్కౌంటర్ కాగా, మరో 8 మందిపై పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. అబ్దుల్ బారి అలియాస్ అబు హమ్జా సహా మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ ఘాతుకంలో సలార్ ప్రమేయం ఉందని తేలడంతో రాష్ట్ర పోలీసులు న్యాయస్థానం నుంచి అతడిపై ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ పొందారు. దీని సహాయంతో ఉజ్జయిన్ వెళ్లి, 2011 జూలై 18న సిటీకి తీసుకువచ్చి ఈ కేసులో జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ పొందిన సలార్ నగరంలోని బాబానగర్లో స్థిరపడ్డాడు. 2014 అక్టోబర్ 18న నల్లగొండకు కారులో వెళ్తున్న అతడు చిట్యాల సమీపంలోని పెదకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. -
యువ కథ: అసుర బంధనం
‘పాపా సుధా! పాపా సుధా!’ అంటూ నిద్రకళ్లతోనే పెన్నూ పుస్తకం పట్టుకుని, వంటగదిలోకొచ్చాడు చింటూ. తన తండ్రి పిలిచే పిలుపే తనకీ అలవాటు. చపాతీలు కాలుస్తున్న సుధ.. కొడుకు చింటూని చూసి.. ‘అప్పుడే లేచావా? పో బ్రష్ చేసిరా టిఫిన్స్ పెడతా’ అంది నవ్వుతూ. ‘పాపా! మరేమో మాకు రేపు శ్లోకాలు, పద్యాల పోటీ ఉంది, ఏదైనా ఒకటి రాసిస్తావా? ప్రాక్టీస్ చేస్తా!’ అన్నాడు చింటూ.చటుక్కున స్టవ్ ఆఫ్ చేసి.. ‘అవునా? ఇటురా, నాకు బాగా ఇష్టమైన ఓ శ్లోకముంది, రాసిస్తా’ అంటూ పక్కనే ఉన్న చిన్న పీట లాక్కుని కూర్చుంది సు«ధ. దగ్గరకొచ్చి తల్లిముందు మోకాళ్లపై కూర్చుని పెన్నూ పుస్తకం ఆమె చేతిలో పెట్టాడు చింటూ.దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ‘‘అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‘అంటూ పైకి చదువుతూనే, చింటూ పుస్తకంలో రాస్తోంది సుధ. ‘దీని అర్థం ఏంటమ్మా?’ అన్నాడు చింటూ క్యూట్గా. ‘ఓ అర్జునా! డాంబికం, గర్వం, మితిమీరిన అహం, కోపం, మొరటుతనం, అజ్ఞానంతో వాస్తవాన్ని గ్రహించకపోవడం.. ఇవన్నీ అసుర (రాక్షస) స్వభావంతో పుట్టినవారి లక్షణాలు’ అంది సుధ రాస్తూనే. ఈలోపు చింటూ నాయనమ్మ దుర్గమ్మ బయట నుంచి వంటగదివైపు చూస్తూ ‘రేయ్ చింటూ, మీ పెదనాన్న లేచాడా? చూడు’ అని అరిచింది. వెంటనే చింటూ, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి రుద్రాక్ష గదిలోకి మెల్లగా తొంగి చూశాడు. గుర్గుర్మనే శబ్దాన్ని విని ‘ఇంకా లేవలే’ అన్నట్లుగా చేత్తోనే సైగ చేశాడు.చింటూకి ఇద్దరు అక్కలు. చింటూ తండ్రి అంజి.. రుద్రాక్ష కంటే చాలా చిన్నవాడు. పదేళ్ల క్రితం, హైదరాబాద్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకుని, డిప్రెషన్తో ఇంటికే పరిమితమైపోయాడు. అప్పటికే ఉద్యోగం చేస్తున్న సుధ ఇంటి బాధ్యతంతా తనే తీసుకుంది. అయితే విషయం తెలుసుకున్న రుద్రాక్ష ‘నా తమ్ముడ్ని నువ్వేం ఉద్ధరించక్కర్లేదు. నీకు నీ మొగుడు కావాలంటే ఊరికొచ్చి బుద్ధిగా కాపురం చేసుకో.. నేను మాత్రం మా తమ్ముడ్ని, పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతా’ అని సుధపై రంకెలేశాడు. ఆ రోజు నుంచి చింటూ ఫ్యామిలీ ఊరిలో రుద్రాక్ష ఇంట్లోనే ఉంటోంది. సుధ అప్పట్లోనే జాబ్ చేస్తూ తెలుగు మీద ఇష్టంతో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసింది. కనీసం ఊళ్లోని కాన్వెంట్కి వెళ్లి తెలుగు టీచర్గా చేసుకుంటానన్నా, ఆమె మాట చెల్లలేదు.పదయ్యేసరికి చింటూ చక్కగా తినేసి, శ్లోకం బట్టీపట్టే పనిలో పడ్డాడు. ఇంతలో దుర్గమ్మ మెల్లగా.. రుద్రాక్ష గదికి వెళ్లి ‘రేయ్ రుద్రా లే, పది దాటింది. చెరువుల కాడికి పోవాలేమోగా?’ అంది చిన్నగా. ‘ఊ..’ అన్నాడు రుద్రా గంభీరంగా. ఆదివారం కదా, రుద్రాక్ష బయటికి వెళ్లిపోతే, అతడికి తెలియకుండా, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్లాలనేది ఆమె తాపత్రయం. రుద్రాక్ష శివభక్తుడు. అతడికి చెప్పకుండా కొన్నేళ్ల క్రితమే బాప్టిజం తీసుకుని మేరీగా మారింది దుర్గమ్మ. ఇంటికి సమీపంలో ఆమె పేరునున్న కొంత స్థలాన్ని చర్చి కట్టడానికి దానం చేసిన విషయం బయటపడిన రోజే.. తల్లి మతం మారిన విషయం తెలుసుకున్నాడు. ఆ గొడవ తర్వాత తల్లితో మాట్లాడటం మానేశాడు.రుద్రాక్ష లేచి స్నానం చేసి వచ్చేలోపు.. అతడి భార్య శ్రీలేఖ పూజకు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. పూజ చేసి వచ్చేలోపు సుధ టిఫిన్స్ అందించింది. ఇక ఎప్పటిలానే ఆ ఆదివారం ఇంటి బయట రుద్రాక్ష బుల్లెట్ స్టార్ట్ చేయగానే, ఇంటి వెనుక నుంచి మేరీ 11 గంటల ఆరాధన కోసం అడ్డదారిలో చర్చికి పరుగుతీసింది. రుద్రాక్ష తన స్నేహితుడు రవీంద్ర ఇంటి ముందు బండి స్లోచేసి, హార¯Œ కొట్టాడు. అక్కడ మరో బుల్లెట్ స్టార్ట్ అయ్యింది. అది సేమ్ కలర్, సేమ్ మోడల్. రుద్రాక్ష ప్రతి పనిలోనూ రవీంద్రనే ఫాలో అవుతాడు. ప్రతిపనిలోనూ రవీంద్ర వెంటే నడుస్తాడు. ఇద్దరికీ కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయి. చేపల చెరువులు వేసి ఇంకా ఇంకా గడిస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లైనా, ఇంటి బయట పని వాళ్లైనా వాళ్లు చెప్పిన మాట వినాలి. ఇక వాళ్లు కన్నవాళ్లు, వాళ్లను కన్నవాళ్లు అంతా తమ గీత మీదే నడవాలి. వాళ్లు బయటకి వెళ్తున్నప్పుడు ఇంటి ఆడవాళ్లెవరూ బయట కనిపించకూడదు. వాళ్లు ఇంటికి వచ్చేసరికి పెద్దపెద్దగా మాటలేవీ వినిపించకూడదు. ఈ శాసనాలన్నీ రవీంద్ర చేసినవే. చాలావరకు రుద్రాక్ష ఇంట్లోనూ అమలవుతుంటాయి. కాలం మారుతుందని గుర్తించలేని ఆ పల్లెటూరిలో ఈ హిట్లర్ పాలన మొదలై పాతికేళ్లు దాటింది.పాతికేళ్ల క్రితం రుద్రాక్ష, రవీంద్రలతో పాటు వంశీధర్ అనే మరో స్నేహితుడు వీళ్లతో కలిసి తిరిగేవాడు. వంశీధర్కి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నాయనమ్మ పెంచింది. అతడి పెళ్లి తర్వాత ఆమె కూడా చనిపోయింది. రుద్రాక్ష, వంశీధర్లకు పెళ్లి అయిన మూడేళ్లకు రవీంద్ర పెళ్లి చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి ఆడవాళ్లపై చిన్నచూపున్న రవీంద్ర పెళ్లి తర్వాత భార్యను కట్టుబానిసలా చూసేవాడు. గొడవైన ప్రతిసారీ రుద్రాక్ష, వంశీధర్ల కాపురాలను చూసి నేర్చుకోమని తిట్టేది రవీంద్ర భార్య. దాంతో వీలు చిక్కిన ప్రతిసారీ స్నేహితులకు మందు, విందు ఏర్పాటు చేసి, ‘ఆడదానికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. వాళ్లని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. లేదంటే, అదే చేతకాని తనమవుతుంది. ఎవరిముందైనా మనదే పైచేయి కావాలి’ అంటూ ఇంట్లో తాను చలాయించే నియంతృత్వ ప్రతాపాన్ని స్నేహితుల ముందు గర్వంగా చెప్పుకునేవాడు. కుటుంబానికి కట్టుబడి బతికే ప్రతి వాడ్ని బకరాగా ఉదహరించేవాడు. మెల్లగా స్నేహితులిద్దరూ రవీంద్ర బాటలో నడవడం మొదలుపెట్టారు. కొన్ని నెలలకు వంశీధర్ ఉన్నట్టుండి కనిపించడం మానేశాడు. ఆరాతీస్తే పిల్లలకు బాలేదని, అత్తింటికి వెళ్లాడని అస్పష్టమైన సమాచారమందింది. కొంతకాలానికి ఊరు తిరిగొచ్చిన వంశీధర్– స్నేహితుల్ని మాత్రం కలవలేదు. ఆస్తులమ్మేసుకుని టౌన్ వెళ్లిపోతున్నాడనే వార్త విన్న రుద్రాక్ష, దారికాచి వంశీధర్ని నిలదీశాడు. ‘కొన్నిసార్లు ఎదుటివారి మూర్ఖత్వం కూడా మనలోని మంచితనాన్ని చంపేస్తుంది, అలా చచ్చి బతుకుతున్నవాణ్ణి. కారణాలడగొద్దురా. వాదించి శత్రువుని కావాలనుకోవడంలేదు’ అనేసి వెళ్లిపోయాడు వంశీధర్. ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదు.ఇంకొన్నాళ్లకు రవీంద్ర భార్య గొడవ పడటం మానేసి, అణిగిమణిగి బతకడం నేర్చుకుంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగబిడ్డ కావాల్సిందేనని, డాక్టర్ ప్రమాదమని చెప్పినా మరో కాన్పుకి ఉంచాడు రవీంద్ర. మళ్లీ ఆడపిల్లే పుట్టింది. కానీ భార్య పురిటిలోనే చనిపోవడంతో, ఏడాదిలోపు ఆమె చెల్లెల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మరో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కొడుకు మాత్రం పుట్టలేదు. రుద్రాక్షది ప్రేమ వివాహం. ఒక కొడుకు, ఒక కూతురు. రవీంద్ర ప్రభావంలో రుద్రాక్ష భార్యను తక్కువ చేసి చూడటం మొదలుపెట్టాక.. ఆత్మాభిమానంతో శ్రీలేఖ చాలా ఏళ్లు పోరాడింది. చివరికి రుద్రాక్షలో మార్పు లేకపోవడంతో పనులన్నీ చేసిపెడుతూనే, మాట్లాడటం మానేసింది. రవీంద్ర మొదటి భార్య చనిపోయినప్పుడు.. రుద్రాక్ష చెల్లెలు ప్రియను అతడికిచ్చి చెయ్యాలని తెగ ఉబలాటపడ్డాడు రుద్రాక్ష. అప్పటికి ప్రియ చదువుకుంటోంది. సడ¯Œ గా పెళ్లి అనేసరికి, ‘నేను మా సీనియర్ని ప్రేమిస్తున్నా, అతడ్నే చేసుకుంటా’ అని తెగేసి చెప్పింది. అయినా రుద్రాక్ష వినకపోవడంతో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకుంది. దాంతో ప్రియను ఇంటి గుమ్మం తొక్కనివ్వలేదు. రుద్రాక్షకు తెలియని విషయమేంటంటే, రవీంద్రతో పెళ్లి చేస్తే ప్రియ జీవితం నాశనమయిపోతుందని భావించిన శ్రీలేఖే రహస్యంగా ఆ పెళ్లి చేసింది.‘ఆడపిల్లలకు పదోతరగతే ఎక్కువ’ అనే రవీంద్ర నలుగురు కూతుళ్ల్లకు పెళ్లి చేసి పంపేశాడు. ఆ ఇంట్లో జరిగే ప్రతి పెళ్లికి, రుద్రాక్ష ఇంట్లో రచ్చ జరిగేది. కూతురు స్వప్నను చదువు మానిపించి, పెళ్లి చెయ్యాలని రుద్రాక్ష తీవ్రంగా ప్రయత్నించేవాడు. అతడ్ని ఆపలేక, శ్రీలేఖ విదేశాల్లో ఉండే స్నేహితుల సాయంతో దొంగపెళ్లికొడుకుల్ని ఏర్పాటు చేసి, చివరిక్షణంలో సంబంధాలను చెడగొట్టే పనిలో ఉండేది. ఇక కొడుకు కౌటిల్య కెనడాలో ఉద్యోగం చేసుకుంటూ, అక్కడి పిల్లనే ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకున్న రుద్రాక్ష ‘నేను చూసిన అమ్మాయిని చేసుకుంటేనే ఆస్తి ఇస్తా. ఇంటికి రానిస్తా’ అని బెదిరిస్తూ వచ్చాడు. దాంతో అక్కడే సహజీవనంతో కాలం గడిపేస్తున్నాడు కౌటిల్య.పాతికేళ్లుగా ఈ స్నేహితులు అహంకారంతో విర్రవీగుతుంటే, విధి మరో రాత రాసింది. ఆ ఆదివారం కాంతమ్మ కల్లుదుకాణంలో మందుకొట్టి ఇంటికి వెళ్లిన రవీంద్ర మరుసటిరోజు నుంచి బాగా నీరసించాడు. ఎప్పుడూ వచ్చే పొడి దగ్గు కాస్త ఎక్కువైంది. దాంతో రుద్రాక్ష దగ్గర్లో సిటీకి తీసుకుని వెళ్లి టెస్ట్లు చేయిస్తే, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, మూడు నెలలు కంటే ఎక్కువ బతకడని, హైదరాబాద్ తీసుకెళ్తే ఫలితం ఉండొచ్చని చెప్పారు. దాంతో హైదరాబాద్లో కాపురం ఉంటున్న పెద్దకూతురు ఇంటికి తీసుకెళ్లారు.వారానికి ఒకసారి రుద్రాక్ష బుల్లెట్ మీదే హైదరాబాద్ వెళ్లి, రవీంద్రని చూసి, ఆ రాత్రికి ఉండొచ్చేవాడు. చావుభయంతో రవీంద్ర బలం, పొగరు అన్నీ తగ్గుతూ వచ్చాయి. మధ్యమధ్యలో వెళ్లొస్తున్న రుద్రాక్షకి రవీంద్ర కూతురు, అల్లుళ్లల్లో కొత్త యాంగిల్ కనిపించసాగింది. ‘లక్షలకు లక్షలు ఆయనకే పెడితే, తర్వాతేం పంచుకోవాలి?’ అనే మాటలు కూడా రుద్రాక్ష చెవిన పడ్డాయి. రవీంద్రకు నెలలు గడవకముందే జబ్బు ముదిరింది. రోజులు దగ్గరపడ్డాయని అతడికీ అర్థమైంది. అందుకే కాబోలు రుద్రాక్ష ఇంటికి బయలుదేరుతుంటే, ‘రేయ్ రుద్రా! మళ్లీ నువ్వు వచ్చేటప్పటికి ఉంటానో లేదో ఓ రెండురోజులుండి పోరా’ అన్నాడు దీనంగా. అన్నట్లుగానే రెండు రోజులు గడవకముందే ప్రాణం పోయింది. వెంటనే రవీంద్ర నలుగురు అల్లుళ్లు ఫోన్లలో మాట్లాడుకుని, అన్ని కార్యక్రమాలు హైదరాబాద్లోనే జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రికి బెంగళూరూ, నోయిడా, చెన్నైల్లో ఉంటున్న మిగిలిన అల్లుళ్లు, కూతుర్లు, వాళ్ల పిల్లలు హైదరాబాద్ వచ్చేశారు. బాడీని ఊరికి తీసుకెళ్దామని రుద్రాక్ష అడిగితే ఒప్పుకోలేదు. హైదరాబాద్ అయితే తమ ప్రయాణం ఈజీగా ఉంటుందని, ఊళ్లో అయితే వర్క్, నెట్వర్క్ కష్టమని కారణాలు చెప్పుకొచ్చారు.మరునాడు మధ్యాహ్నానికి రవీంద్ర అంతిమయాత్ర వాహనం ముందు వెళ్తుంటే, రుద్రాక్ష దాన్ని ఫాలో అవుతూ శ్మశానవాటికకు బుల్లెట్పై బయలుదేరాడు. అంతపెద్ద శ్మశానవాటికను చూడటం రుద్రాక్షకు అదే మొదటిసారి. కొన్ని నిమిషాల తేడాలోనే అంతా అక్కడికి చేరారు. తలకొరివి కార్యక్రమం పూర్తికాగానే, కాటికాపరి ‘మీరు వెళ్లొచ్చు. రేపు వస్తే, అస్థికలిస్తా’ అన్నాడు. దాంతో ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. చివరికి రుద్రాక్ష మాత్రమే మిగిలాడు. కాసేపటికి అతడూ లేచి తన బండి దగ్గరకు వెళ్లబోతూ, కాలుతున్న చితివైపు తిరిగి చూశాడు. ఆ క్షణంలో రుద్రాక్షలో ఏదో తెలియని వైరాగ్యం తొణికిసలాడింది. ‘ఏరోజుకైనా నేనూ చితిలో కాలిపోతానని తెలుసు. అయినా ఎందుకో ఏడుపొస్తోంది’ అనుకుంటూనే, ‘రేయ్ రుద్రా! మగాడు ఏడవడం ఏంట్రా?’ అన్న రవీంద్ర మాటలు గుర్తొచ్చి కన్నీళ్లను కళ్లల్లోనే ఆపేసుకున్నాడు. ఇంతలో రుద్రాక్షను దూరం నుంచి చూసిన ఓ వ్యక్తి పరుగున వచ్చి, ‘పాడె కట్టాలా సార్?’ అన్నాడు. ‘నేనింకా బతికే ఉన్నానయ్యా’ అన్నాడు రుద్రాక్ష అప్రయత్నంగా. ‘అయ్యో అదేంటి సార్! మీరు తిరిగి చూసేసరికి మాకోసం వెతుకుతున్నారనుకున్నా సార్’ అన్నాడా వ్యక్తి. ఓ వెర్రినవ్వు నవ్విన రుద్రాక్ష, ‘ఇక్కడ నువ్వేం చేస్తావ్?’ అన్నాడు. ‘నాది కర్రల దుకాణం సార్. అందుకే మీరు కస్టమరేమో అనుకున్నా’ అంటూ అవతలవైపు గుట్టలుగా పేర్చిన కర్రలను చూపించించాడు. ‘నిజమే కదా! శవం కూడా ఓ కస్టమరే’ అనిపించింది రుద్రాక్షకు. ఆ కర్రలన్నీ చూడగానే మనసులో ఎన్నో ఆలోచనలు స్ఫురించాయి. ‘ఇన్ని కర్రలున్నాయేంటీ? రోజుకి ఎన్ని శవాలొస్తాయి ఇక్కడికి?’ అన్నాడు రుద్రాక్ష. ‘ఓ నాలుగైదొస్తాయి సార్’ అన్నాడు ఆ వ్యక్తి. ‘ఈ కర్రలు ఎంతమందికి వస్తాయి?’ అన్నాడు వెంటనే రుద్రాక్ష. ‘ఓ 40 శవాలకు వస్తాయి సార్. ఇది ఇంచుమించు ఓ పదిరోజుల స్టాక్, అంతే!’ అన్నాడు ఆ వ్యక్తి, మరో కస్టమర్ రాగానే అటుగా పరుగుతీస్తూ.‘చావుకంటే ముందే కట్టె ఎదురుచూస్తుందా? రాబోయే పదిరోజుల్లో చనిపోయేవారి కట్టెలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయా? ఈ క్షణం ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఆ జీవులు?’ అని పలికింది రుద్రాక్ష మనసు. ‘అంటే! ఈ పదిరోజుల తర్వాత చనిపోబోయే నలభై మంది కట్టెలు లారీలో ఇక్కడికి వస్తుంటాయి. ఆ తర్వాత పదిరోజుల కట్టెలు ఈపాటికే ఎండలో ఎండుతుంటాయి. ఆ తర్వాత కట్టెలు చెట్ల రూపంలో ఉండి ఉంటాయి. ఇదే కదా విధిరాతంటే! శవంపై పెట్టి కాల్చే ఈ కర్ర, ఏదో ఒకరోజు నీ కోసం కూడా సిద్ధమవుతోంది రుద్రాక్షా! విత్తురూపంలో ఉందో, చెట్టు రూపంలో ఉందో, ఎండుతూ ఉందో, లేదంటే లారీలో వస్తుందో? ఇలాంటి శ్మశానవాటికలు ఎన్నో కదా!’ అనే మాటలు రుద్రాక్ష చెవుల్లో ఎవరో అంటున్నట్లే మార్మోగాయి. అప్రయత్నంగా అడుగులో అడుగు వేసుకుంటూ, బుల్లెట్వైపు నడిచాడు.చీకటిపడేసరికి డైరెక్ట్గా వంశీధర్ ఇంటి ముందు ఆగింది రుద్రాక్ష బుల్లెట్. ఆ దారి వెంట రవీంద్రతో పాటు ఎన్నోసార్లు వెళ్లినా, ఏ రోజూ అక్కడ ఆగలేదు. ‘మనల్ని వదిలేసిన వాడితో మనకు మాటలేంట్రా?’ అనేవాడు రవీంద్ర. ఆ మాట గుర్తురాగానే మళ్లీ బుల్లెట్ స్టార్ట్ చేశాడు రుద్రాక్ష. అప్పటికే ‘ఎవరొచ్చారా?’ అని గుమ్మంలోకొచ్చి పరకాయించిన వంశీధర్, ‘రేయ్ రుద్రా’ అని పెద్దగా అరిచి, ఆపి, లోపలికి తీసుకెళ్లాడు. ఏళ్లనాటి దూరాన్ని మౌనం ఆక్రమిస్తుంటే, రవీంద్ర మరణవార్తను వంశీధర్ చెవిన వేశాడు రుద్రాక్ష. ‘వాడు ఎంత బతుకు బతికాడు! అంతా కలిసి ఆ చావుకు విలువ లేనట్లే చేశారు. ఒకరి కళ్లల్లో కూడా నిజమైన కన్నీళ్లు చూడలేకపోయాను’ అంటూ మనసులోదంతా వెళ్లగక్కాడు రుద్రాక్ష దుఃఖంతో. అప్పుడే అనుకోకుండా రుద్రాక్ష కళ్లు గోడమీదున్న ఓ ఫొటో మీద పడ్డాయి. ఫొటోకి దండ వేలాడుతుంటే, అయోమయంగా పైకి లేచి ‘వ..వాసవీ, పిల్లలూ?’ అని ఆగి వంశీధర్ వైపు చూశాడు. ‘ఎప్పుడో చనిపోయార్రా’ అన్నాడు వంశీధర్ దిగులుగా పైకి లేచి ఫొటోని చూస్తూ. ‘ఎలా?’ అడిగాడు రుద్రాక్ష బొంగురు గొంతుతో. ‘తను పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుందిరా’ అన్నాడు వంశీధర్. ‘ఏమంటున్నావ్రా?’ నిర్ఘాంతపోయినట్లు చూశాడు రుద్రాక్ష. ‘అవునురా! నా ప్రవర్తనే కారణం. అప్పట్లో రవీంద్ర చెప్పినట్లే ఇంట్లో ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టాక మా మధ్య గొడవలు పెరిగాయి. ఒకరోజు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే వాళ్ల అమ్మానాన్న తిరిగి నా దగ్గరకు వెళ్లమని బలవంతం చేసేసరికి పిల్లలతో సహా మేడ మీద నుంచి దూకేసిందటరా. పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. వాసవి ఐదేళ్లపాటు మంచం మీదే ఉంది. ఊరిలో అంతా అమ్ముకుని ఇక్కడికి వచ్చింది తనని బతికించుకోవడానికే. తాను కోలుకుంటుందని ఆశపడ్డా. కానీ పిల్లల్ని చేతులారా చంపుకున్నానన్న పశ్చాత్తాపం తనని బతకనివ్వలేదు. నా కుటుంబాన్ని కోల్పోవడానికి కారణం నువ్వే అంటూ రవీంద్ర కాలర్ పట్టుకోవాలన్నంత కోపం వచ్చింది. కానీ ఒక్కటే ఆలోచనొచ్చింది. ఆరోజు నా వాసవి నేను చూపించే పైత్యాన్ని భరించి ఉండి ఉంటే ఈ రోజు వరకూ నేను అదే అహంతో అదే ఆధిపత్యంతో కాలర్ ఎగరేసుకుని, అదే ఊరిలో తిరిగేవాణ్ణి కదా మీలానే?’ అన్నాడు వంశీధర్. తలదించుకుని, మౌనంగా వింటూనే ఉన్నాడు రుద్రాక్ష. ‘ఈ ఒంటరితనం నాకు నేను విధించుకున్న శిక్ష. మనం చాలాసార్లు కొందరి సావాసంతో వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. నిజానికి మనిషి తన బలాన్ని నిరూపించుకోవడానికి ఎప్పుడూ బలహీనుణ్ణే ఎన్నుకుంటాడు. ఈ ఎంపికలో ఎక్కువగా బలయ్యేది కుటుంబసభ్యులే. ఈ లోకంలో ప్రేమ, ఇష్టం, అభిమానం లోపించిన భయభక్తులన్నీ అబద్దాలే, నాటకాలే! ఎవ్వరైనా సరే, నువ్వు ఆంక్షలు పెట్టకుండా ఆపేక్షగా చూసుకుంటే, ఏపని చేసినా చెప్పి చేస్తారు. లేదంటే చెప్పకుండా, రహస్యంగా చేస్తారు. అంతేకాని ఆగిపోరు. ఆగారనుకునే భ్రమలో, ఆపాననుకున్న పొగరుతో మనం ఆగిపోతామంతే! నువ్వు అన్నావ్గా ఇందాక రవీంద్ర చనిపోతే ఎవరి కళ్లల్లోనూ నిజమైన బాధను చూడలేదని, ఎలా చూడగలవు? వాడు ఏ రోజైనా భార్యబిడ్డల అభీష్టానికి బతికాడా? అతడి చావు ఆ కుటుంబానికి ఓ విమోచనం. పంజరం వీడిన రామచిలుకల్లా వారి నవ్వులే నీకు చాలా సమాధానాలు చెబుతాయి చూస్తూ ఉండు’ అన్నాడు వంశీధర్.ఆ ఊరంతా రుద్రాక్ష నోటి నుంచి గంభీరమైన స్వరం విని చాలా నెలలు గడిచాయి. రవీంద్ర మరణం తర్వాత అతడు పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఒకరోజు రవీంద్ర ఇంటి అరుగుపైన అతడి భార్య, పిల్లలు ఫక్కున నవ్వే సన్నివేశం రుద్రాక్ష కంటపడింది. ఎవరో బలంగా లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు.. కానీ నీలోని ఈ గాంభీర్యం సావాసంతో వచ్చిందని నాకు తెలుసు’ అన్న వంశీధర్ మాటలు గుర్తొచ్చాయి.‘లేఖా! లేఖా’ ఆ పిలుపు రుద్రాక్ష నోట వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. పరుగున వచ్చింది శ్రీలేఖ. ‘మన కౌటిల్య పెళ్లి వాడిష్టపడిన అమ్మాయితోనే జరిపిద్దాం, రమ్మను, పెళ్లికి మా చెల్లి ప్రియ ఫ్యామిలీని పిలుద్దాం. అలాగే సుధని టౌన్లో ఏదో స్కూల్లో తెలుగు టీచర్గా ప్రయత్నించమను’ అన్నాడు. శ్రీలేఖ షాక్లో ఉండగానే, సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ లీనమైపోయిన చింటూని ప్రేమగా ఎత్తుకుని ముద్దాడి, బుల్లెట్ ముందు కూర్చోబెట్టుకుని టౌన్కి బయలుదేరాడు రుద్రాక్ష. అక్కడో జీసస్ ఫొటో దుర్గమ్మ కోసం ప్యాక్ చేయించి, చింటూ చేతికిచ్చి, బండి స్టార్ట్ చేశాడు. అప్పటికే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న చింటూ ధైర్యం చేసి చిన్న స్వరంతో, ‘పె..పెదనాన్నా మ..మరేమో, నువ్వంటే నాకు చాలా భయం. ఇప్పుడు నన్ను కొట్టవు కదా?’ అన్నాడు. నవ్వొచ్చింది రుద్రాక్షకి. ‘ఆ భయం పోవాలంటే నేనేం చెయ్యాలి?’ అన్నాడు రుద్రాక్ష. ‘హూ! భయంపోవాలంటేనా? హా, ఇందాక పెట్టావే ముద్దు.. అలాంటి ముద్దు రోజూ పెట్టాలి, పెడతావా? అప్పుడు బోలెడంత ప్రేమొస్తుంది’ అన్నాడు చింటూ ఎదురుగా వచ్చే గాలికి కళ్లను చిట్లిస్తూ. బండి నడుపుతూనే చింటూ తల మీద ముద్దాడాడు రుద్రాక్ష మురిసిపోతున్న చింటూని బుల్లెట్ బండి అద్దంలో చూస్తూ. -
ఈ వారం కథ: మలిసంధ్యలో..!
డల్లాస్ నగరం. రాత్రి ఏడున్నర. అప్పుడే ల్యాప్టాప్ను మూసి, కళ్ళు మూసి సేద తీరుతున్నట్లుగా వెనక్కి వాలాడు కిరణ్. ‘టిఫిన్ రెడీ’ వంటింట్లోంది సుధ కేక వినిపించింది. ‘తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ ఇవ్వు. తర్వాత టిఫిన్ తింటాను’ ఫోన్ రింగ్ అవుతుండటంతో అటువైపు చూశాడు. రామం బాబాయ్ నుంచి కాల్.‘ఈ ముసలాడికి వేరే పనేం లేదు. అందరిళ్లలో జరిగేవన్నీ కావాలి’ స్వగతంలో చిరాగ్గా అనుకున్నాడు. కాఫీ తెస్తున్న సుధకి ఆ మాటలు వినబడ్డాయి.‘ఎవరు.. ఆయనేనా?’ కాఫీ టీపాయ్ మీద పెడుతూ అడిగింది.‘తనే! ఉదయం నుంచి నాలుగు సార్లు ఫోన్ చేశాడు. నాతో మాట్లాడటానికి నిద్రను కూడా త్యాగం చేసుకుంటున్నాడు’‘మాట్లాడొచ్చు కదా. అర్జెంట్ విషయం ఉందేమో!’‘మీ అమ్మ పద్ధతి బాగోలేదు. మూర్తిగారు రోజూ మీ ఇంటికి వచ్చి వెళ్తున్నారు... వాళ్లిద్దరి గురించి ఊరంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు... ఇలా నా బుర్ర తినడానికే ఈ వరుస ఫోన్లు’ నిరాసక్తంగా కాల్ ఆన్సర్ చేశాడు.‘అబ్బాయ్ ఎలా ఉన్నావ్. కోడలు పిల్ల ఎలా ఉంది. బిజీగా ఉన్నావా?’ అటువైపు నుంచి రామం ప్రశ్నలు సంధిస్తున్నాడు. ‘అమెరికా వాళ్లతో మాట్లాడాలంటే ఇబ్బందే అనుకో. మనకీ అక్కడకీ, రాత్రీ పగలూ అంత తేడా ఉంది.’‘విషయమేంటి బాబాయ్’ అసహనంగా అడిగాడు.‘ఏమీ లేదురా. మీ అమ్మ పద్ధతి అస్సలు బాగాలేదు. నువ్వు ఒకసారి వచ్చి, ఇక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టు’‘ఏమైంది బాబాయ్?’ ఆ గొంతు కసిరినట్లుగానే ఉంది. కిరణ్ కోపం ముసలాయనకి అర్థమైంది. అయినా తన మాటలు కొనసాగించాడు.‘నీకు కొత్తగా చెప్పేదేముందిరా. వదినగారిని ఆ మూర్తి బుట్టలో వేసుకున్నాడు. ఇప్పుడు వ్యవహారం మరింత ముదిరిపోయింది. పరిచయమై మూణ్ణాళ్లు కూడా కాకుండానే, ఇద్దరూ కలిసి రోడ్లమీద తిరుగుతున్నారు. ఈ మధ్య సినిమాలకూ వెళ్తున్నారు. మొన్న రాత్రి అతను మీ ఇంటిలోనే పడుకున్నాడు కూడా.’‘గట్టిగా అడిగితే స్నేహం అంటూ సాకులు చెబుతున్నారు. అతనికి లేకపోతే, మీ అమ్మకైనా ఉండొద్దూ్ద బుద్ధి. ఊరూ, వాడా నవ్వుతున్నారు. నిన్ననే మూర్తిగారి పిల్లలు మీ ఇంటికి వచ్చారు. ఆ టయానికి ఆ పెద్దమనిషి అక్కడే ఉన్నారు. పెద్ద ఆర్గ్యుమెంట్లు, అరుపులు, కేకలు.. సర్ది చెప్పలేక చచ్చాననుకో. ఊర్లో పరువు పోతోంది.’‘నువ్వు సాధ్యమైనంత తొందరగా వచ్చి, మీ అమ్మను తీసుకుని వెళ్లిపో. ఇంటి గురించి ఆలోచించకు. ఓ పదో పరకో ఇచ్చి నేనే తీసుకుంటాను. నువ్వు మాత్రం వెంటనే బయల్దేరు. ఉంటాను మరి’ గబగబా నాలుగు మాటలూ చెప్పేసి, రామం ఫోన్ పెట్టేశాడు.‘అత్తయ్యగారిని అమెరికాకు తెచ్చి, ఇల్లు తనకు ఇచ్చేయమంటున్నారా?’ సుధ నవ్వుతూ అడిగింది. ‘ఆ గోల ఎప్పుడూ ఉండేదే. కానీ అమ్మ సంగతే అర్థం కావడం లేదు. మూర్తిగారి విషయం అడిగితే తన స్నేహితుడు అంటుంది. ఆయన పొద్దస్తమానం మనింట్లోనే ఉంటున్నారు. మొన్న రాత్రి మనింట్లోనే నిద్రపోయారట. వాళ్ళ కుటుంబం గొడవ చేసిందట! మా బాబాయే వాళ్లని రెచ్చగొట్టి ఉంటాడు. వర్క్ టెన్షన్లో కొత్తగా ఇదో తలనొప్పి. ఇక భరించలేను. ఇండియాకి వెళ్లి అమీతుమీ తేల్చుకోవాల్సిందే’ సోఫాలోంచి లేస్తూ అన్నాడు. ∙∙ గేటు తీసిన అలికిడి విని శాంత వీధి వైపు తొంగి చూసింది. కొడుకును చూడగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ, ఎదురెళ్లి చేతిలో బ్యాగ్ని అందుకుంది. ‘ఎలా ఉన్నావమ్మా’ అంటూ తల్లిని ఆప్యాయంగా హత్తుకున్నాడు, ‘బాగున్నావా బాబూ’ అంటూ హాల్లో కూర్చున్న మూర్తి పలకరించాడు. చిరునవ్వుతో తల పంకిస్తూ ‘మీరెలా ఉన్నారం’టూ అడిగాడు, సూట్కేసు కింద పెడుతూ. ‘బాగానే ఉన్నాను బాబూ, పెద్ద వయసు కదా. ఆరోగ్య సమస్యలు తప్పవు. వస్తాను శాంతగారు’ అంటూ ఆయన కుర్చీలోంచి లేచాడు.‘మూర్తిగారు సాయంత్రం ఒకసారి రండి’ఆ మాట విని, ఒక్క క్షణం కిరణ్ వైపు చూసి ‘అలాగే’ అంటూ బయటకు నడిచాడు.‘ఏంటమ్మా విశేషాలు’ భోజనానికి కూర్చుంటూ తల్లి కళ్లల్లోకి చూస్తూ అడిగాడు. ‘ఏం లేవురా,’ ఆమె కిరణ్ వైపు చూడటానికి ఇబ్బంది పడుతోంది.చెప్పా పెట్టకుండా కొడుకు వచ్చాడంటే, ఏదో విషయం ఉందన్నమాట.‘బావున్నావా కిరణూ’ రామం హడావుడిగా ఇంట్లోకి వచ్చాడు.‘ఉదయం నుంచి నీ కోసమే చూస్తున్నాను. ఫ్లైట్ లేటయ్యిందా’శాంతకి విషయం అర్థమైంది. ఈ పెద్దమనిషి నారద పాత్రను పోషించాడన్నమాట.రామం ఆమెకు సొంత మరిది కాదు. పెద్దమామగారి కొడుకు. వ్యసనపరుడై ఆస్తులను కరిగించాడు. తన ఇంటి మీద అతని కన్ను ఉందని కూడా ఆమెకు తెలుసు. అందుకే అతనితో అంటీ ముట్టనట్లు ఉంటుంది. ‘ఎన్నాళ్లుంటావ్?’‘నాకు సెలవుల్లేవు బాబాయ్. ఎల్లుండే తిరుగు ప్రయాణం’‘ఒక రోజులోనే ఇక్కడి వ్యవహారాలన్నీ తేలిపోతాయా?’ వ్యవహారం అనే పదాన్ని నొక్కిపెడుతూ అడిగాడు రామం.కిరణ్ ఓ నవ్వు విసిరేసి ఊరుకున్నాడు. ఆ నవ్వు భావం రామానికి అర్థం కాలేదు. ‘అమ్మని నీతో తీసుకుని వెళ్లిపోతున్నట్లే కదా! ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు రెడీగా లేవు. ఎంతో కొంత ఇస్తాను. ముందు ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకుందాం. తర్వాత నీకు డబ్బులు పంపిస్తాను.’ ఏదోలా ఇల్లు దక్కించుకుంటే చాలు. మిగిలిన డబ్బులు ఎలాగూ ఎగ్గొట్టేయొచ్చు. అదీ అతని ఆలోచన. ఇలాంటి విషయాల్లో రామానికి మా చెడ్డ అనుభవం ఉంది.‘బాబాయ్, సాయంత్రం మూర్తిగారి కుటుంబాన్ని రమ్మని చెప్పగలవా?’ అన్నాడు. శాంత ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. ఏదో చెప్పబోయింది.‘అమ్మా, నాకు అన్నీ తెలుసు. నువ్వేమీ మాట్లాడకు’ చేత్తో వారించాడు.‘అయితే రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేయమంటావా?’ ‘కంగారెందుకు బాబాయ్. అన్ని విషయాలూ తేల్చే వెళ్తాను కదా’ అంటూ చేయి కడుక్కుని బెడ్రూమ్లోకి వెళ్లిపోయాడు.సాయంత్రం ఆరు గంటలకి మూర్తి, ఆయన కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, రామం వచ్చారు. కొడుకు, అల్లుడు బాగానే స్థిరపడ్డారు. కొడుకు దగ్గరే మూర్తి ఉంటున్నాడు. కూతురు సమీపంలో ఉన్న ఓ టౌన్లో ఉంటోంది. అందరూ హాల్లో కూర్చున్నారు. శాంత మాత్రం గదిలోనే ఉండిపోయింది.‘చెప్పండయ్యా, మీ బాధ చెప్పండి. ఇరుగు పొరుగుల సూటిపోటి మాటలు, మీకు ఎదురవుతున్న అవమానాలు అన్నీ కిరణ్కు చెప్పండి.’ రామం మొదలు పెట్టాడు.‘బాబాయ్ మీరు కాసేపు ఏమీ మాట్లాడకండి’ ఆ మాటలో గాంభీర్యాన్ని చూసి రామం కంగుతిన్నాడు.‘అది కాదబ్బాయ్’కిరణ్ సీరియస్గా చూశాడు.ఇక మాట్లాడితే తన మర్యాద దక్కదని ఆయనకి అర్థమైంది.మూర్తి కొడుకు గొంతు సవరించుకున్నాడు.‘సార్, మీ అమ్మగారు, మా నాన్న చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఆయన ఎక్కువసేపు మీ ఇంట్లోనే గడుపుతున్నారు. ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం. మనమే గట్టిగా చెప్పాలి’ అంటూ ఆగాడు.‘ఈ విషయం మీ నాన్నగారితో మాట్లాడారా?’‘ఆయన్ని అడిగాం. తన లైఫ్ తన ఇష్టం అంటున్నారు సార్’ పక్కన కూర్చున్న మూర్తి మౌనంగా వింటున్నాడు.‘అంతే కదా! ఆయన లైఫ్ ఆయన ఇష్టం. మనమెందుకు తలదూర్చడం?’కిరణ్ మాటలు అక్కడున్న వాళ్లకి ఒక్క క్షణం అర్థం కాలేదు.‘ఏమంటున్నారు మీరు?’ అన్నాడు మూర్తి కొడుకు సందిగ్ధంగా. ‘మీ నాన్న, మా అమ్మా వాళ్లకి నచ్చినట్లు ఉంటే మీకూ, నాకూ ఏంటి ప్రాబ్లమ్?’ కిరణ్ గొంతు చాలా కూల్గా ఉంది.‘ఇలా బరి తెగించి తిరిగితే, మన పరువు, ప్రతిష్ఠ ఏమైపోతాయ్’ రామం ఉండబట్టలేక అడిగాడు. ‘వ్యసనాల పాలై ఆస్తులన్నీ అమ్ముకున్నప్పుడు, కుటుంబాన్ని రోడ్డున పడేసినప్పుడు మన పరువు, ప్రతిష్ఠలేమైపోయాయ్.’ ఆ బాణం సూటిగా తనకే తగిలేసరికి రామం ముఖం మాడిపోయింది. ‘పద్దెనిమిదేళ్లు దాటిన వారిని ఈ దేశంలో మేజర్ అంటారు. వారికి నచ్చినట్లు బతికే హక్కు వాళ్లకి ఉంది. అరవయ్యేళ్లు దాటి, జీవితం ఎత్తుపల్లాలన్నీ చవి చూసిన వాళ్లకు ఆంక్షలు అవసరమా?’ మూర్తిగారి పిల్లలవైపు చూస్తూ అడిగాడు. ‘మా నాన్న పెన్షనర్ కదా. అందుకే మీ అమ్మగారికి ఆయన అవసరం ఉందేమో’ కూతురు అక్కసు వెళ్లగక్కింది.‘నేను పదేళ్ల నుంచి అమెరికాలో ఉన్నాను. మా అమ్మ బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. వాటి మీద వచ్చే వడ్డీతో ఆమె పదిమందిని పోషించగలదు.’ ‘సహజీవనం అనే కాన్సెప్ట్ యువతలో ఉంటుందని తెలుసు కాని, కాటికి కాళ్లు జాపుకున్న వాళ్లు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మేమేం చేయగలం? అయినా ఇదేమీ అమెరికా కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగినవాళ్లం, ఇక్కడకు తగ్గట్లుగా బతకాలి’ మూర్తి అల్లుడు తన మామగారి వైపు చూస్తూ అన్నాడు.‘అమెరికా అయినా, ఇండియా అయినా మానసిక, శారీరక అవసరాలు ఒక్కటే. ఆకలేస్తే అక్కడా తింటారు. బాధ వేస్తే ఏడుస్తారు. తోడు కోసం తపిస్తారు. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి మా అమ్మ చాలా కష్టపడింది. నా కడుపు నింపడానికి తను పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. మీ నాన్నగారి గురించి కూడా విన్నాను. చిన్న ఉద్యోగంతో ఆయన జీవితం ప్రారంభమైంది. మీకు మంచి భవిష్యత్తు అందించడంలోనే ఆయన శక్తి హరించుకుపోయింది. పదేళ్ల కిందట మీ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి ఆయన మరింత ఒంటరితనంతో బాధ పడుతున్నారు. రిటైరైనా కనీసం ఆయన ఓ సొంతిల్లు కూడా సంపాదించుకోలేకపోయారు. ఈ ఇద్దరూ తమ బతుకుల్లో నాలుగింట మూడొంతులు మన కోసమే బతికారు. ఇకనైనా వాళ్ల కోసం వాళ్లను బతకనీయండి’‘బతకడంలో తప్పులేదు. కాని, ఇలానా? గట్టిగా అడిగితే స్నేహం అంటున్నారు. రాత్రుళ్లు కూడా మీ ఇంట్లోనే ఉండేంత స్నేహమేంటో’ మూర్తి కోడలు పుల్లవిరుపుగా ఉంది. ‘ఆ స్నేహాన్ని నిర్వచించడం, దాని అర్థ, తాత్పర్యాలు చెప్పడం నా పని కాదు. తమది స్నేహం కాదని, అంతకుమించి అని చెబితే అంగీకరించే గొప్పతనం మీకుందా? ఆ సాన్నిహిత్యం మానసికమా, శారీరకమా అనేది కూడా అనవసరం. వాళ్లకు నచ్చినట్లు వాళ్లుంటారు. వాళ్ల జీవితాల మీద పెత్తనం చలాయించే హక్కు ఎవరికీ లేదు.’ ఇదంతా వింటున్న మూర్తి ముఖంలో ఓ రకమైన ఊరట కనిపిస్తోంది. అపరాధ భావంతో కుంగిపోయిన శాంతకి తన కొడుకు మాటలు సాంత్వననిచ్చాయి. ధైర్యంగా గదిలోంచి వెలుపలికి వచ్చి, కిరణ్ పక్కనే కూర్చుంది. ‘బాబాయ్, అమ్మ కావాలనుకుంటే ఎప్పుడైనా అమెరికా రావచ్చు. అంతవరకూ ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇది ఆవిడ ఆస్తి. నేను కూడా ఈ ఊళ్లోనే సెటిల్ అవుతాను. ఈ ఇంట్లోనే ఉంటాను’తన పప్పులు ఉడకవని రామానికి అర్థమైపోయింది. ముఖం కందగడ్డలా మారిపోయింది.మూర్తిగారి పిల్లలకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ‘మీరంతా చదువుకున్నవాళ్లు. పెద్దవాళ్లు. వ్యక్తి స్వేచ్ఛను మించినదేదీ ఈ ప్రపంచంలో లేదు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, తమకు నచ్చినట్లుగా బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సమాజమే మనుషుల జీవితాలను నిర్దేశిస్తూ ఉంటే స్వాతంత్య్రం అనే మాటకు అర్థం ఉండదు. మీ కోసం, నా కోసం మన పెద్దవాళ్లు తమ సాన్నిహిత్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.’‘రోజూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మేం అతన్ని భరించలేం’ మూర్తి గారి కొడుకు తేల్చి చెప్పాడు.‘అది పెద్ద సమస్య కాదు. మూర్తి గారు.. మీ సామాన్లు పట్టుకుని మా ఇంటికి వచ్చేయండి, మీకెలాంటి అభ్యంతరం లేకపోతేనే..’ అంటూ ఆయన వైపు చూస్తూ అన్నాడు.ఈ మాటకి అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. మూర్తి, శాంత కూడా ఈ మాటలను ఊహించలేదు. కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది, మాట్లాడటానికి ఏమీ లేనట్లుగా అందరూ కుర్చీల్లోంచి లేచారు.‘ఒక్క నిమిషం. మీరు చుట్టపు చూపుగా ఈ ఇంటికి వచ్చి పోతే పర్లేదు. కానీ ఇంటి మీద పడి ఎవరైనా గొడవ చేసినా, మా అమ్మకి ఎలాంటి ఇబ్బంది కలిగించినా చూస్తూ ఊరుకోను. బాబాయ్ నువ్వు మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇకపై నాకు ఫోన్ చేయక్కర్లేదు. నా స్నేహితులు చాలామంది ఉన్నారు. అవసరమైతే వాళ్లే నాతో మాట్లాడతారు’కిరణ్ మాటల్లో దృఢత్వాన్ని చూసిన తర్వాత, ఇక మాట్లాడటానికి ఏమీ లేదని అందరికీ అర్థమైంది. అక్కణ్ణుంచి మౌనంగా నిష్క్రమించారు.‘వస్తాను బాబూ’ అంటూ మూర్తి కూడా లేచారు.‘అంకుల్, ఇక్కడ మీకు మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హాయిగా ఉండొచ్చు’ భరోసా ఇస్తూ అన్నాడు.మూర్తి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు.నీళ్లు నిండిన కళ్లతో కొడుకును చూస్తూ, శాంత ఆప్యాయంగా కిరణ్ నుదుటన చుంబించింది.ఇద్దరికీ గుండెల మీద నుంచి పెద్ద భారం దిగినట్లయింది. గదిలోకి వెళ్లి విషయం భార్యకు చెప్పడానికి ఫోన్ తీశాడు.నాలుగు రోజుల కిందట తనకు, సుధకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.‘ఇండియా వెళ్తున్నారా?’‘అవును. రెండ్రోజుల్లో బయల్దేరుతాను.’‘అక్కడకు వెళ్లి ఏం తేలుస్తారు?’‘అమ్మ అతని సాహచర్యాన్ని ఇష్టపడుతోంది. ఆమె ఎడారిలాంటి జీవితంలో దొరికిన ఒయాసిస్సు మూర్తిగారు. ఆయన గురించి నాకు తెలుసు. చాలా మంచి వ్యక్తి, ఈ వయసులో ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటారు. నువ్వేమంటావ్?’ సుధ వైపు చూస్తూ అన్నాడు. ‘మీరేమంటే నేనూ అదే అంటాను’ తన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు ఆమె ముఖంలో చిరునవ్వు.తన భార్య గురించి కిరణ్కి తెలుసు. ‘అమ్మా వెళ్లొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ బ్యాగ్ అందుకున్నాడు.‘జాగ్రత్త నాయనా. వేసవి సెలవులకు రండి’ సాగనంపుతూ వెంట వస్తోంది. కారు దగ్గరకు వెళ్లి డోర్ తెరిచాడు. ఎదురుగా వస్తున్న ఆటో తన ఇంటి ముందు ఆగడాన్ని చూసి ఓ క్షణం వెయిట్ చేశాడు.ఆటోలోంచి మూర్తి రెండు బ్యాగులతో దిగాడు. ‘వెళ్లొస్తానండీ’ కిరణ్ చిరునవ్వుతో చేయి ఊపాడు. ‘హ్యాపీ జర్నీ బాబూ’ మూర్తి నవ్వుతూ చెప్పాడు.‘సహజీవనం అనే కాన్సెప్ట్ యువతలో ఉంటుందని తెలుసు కాని, కాటికి కాళ్లు జాపుకున్న వాళ్లు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మేమేం చేయగలం? అయినా ఇదేమీ అమెరికా కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగినవాళ్లం, ఇక్కడకు తగ్గట్లుగా బతకాలి’ మూర్తి అల్లుడు తన మామగారి వైపు చూస్తూ అన్నాడు. -
కుబేర వారసులు
ఒకప్పుడు తండ్రి ఒడిలో కూర్చొని ఓనమాలు దిద్దిన వారంతా, ఇప్పుడు వ్యాపార చదరంగంలో ఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు. వ్యాపారరంగంలో ఇప్పటికే ఆరితేరిన తండ్రులు తమ వ్యాపార అనుభవాలను పాఠాలుగా చెబుతుంటే, వాటన్నింటినీ శ్రద్ధగా వింటూ కొత్త తరం కోటీశ్వరులుగా ఎదుగుతున్నారు. తండ్రుల అడుగుజాడల్లో నడుస్తూనే, తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. పాతతరం ఢక్కామొక్కీలు తిని కోటీశ్వరులుగా మారితే, ఇప్పుడు వారి పిల్లలు కేవలం వారసత్వం అనే ఏకైక అర్హతతోనే వ్యాపార సామ్రాజ్యాలకు నవనాయకులుగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. అంబానీ మొదలుకొని దేశంలోని చాలామంది వ్యాపార దిగ్గజాలు ఇప్పుడు తమ వారసులకే పట్టం కడుతున్నారు. అందుకే, ప్రస్తుతం ఉన్న యువ కోటీశ్వరుల్లో ఎక్కువమంది వ్యాపార కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. అయితే, వీరిలో కూడా కొంతమంది ఒట్టి వారసులుగానే మిగిలిపోకుండా, తమ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వేలాదికోట్ల ఆస్తిపాస్తులను, వ్యాపారాలను నిలబెట్టుకుంటూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. వారిలో కొందరే.. వీరు..రి‘లయన్స్’ఆసియాలోనే అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ, అనంత్ అంబానీలు కూడా వారి కుటుంబ వ్యాపారాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈశా అంబానీ పిరామల్ముకేష్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ పిరామల్ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆమె రిలయన్స్ రిటైల్ డైరెక్టర్గా పనిచేస్తోంది. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈశా గత ఏడాది ‘మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్–2024’ అవార్డు పొందింది. టైమ్ మ్యాగజైన్ ‘టైమ్ 100 నెక్ట్స్ రైజింగ్ స్టార్స్’ జాబితాలో పేరు సంపాదించింది. ఆమె వార్షిక వేతనం సుమారు రూ. 4.2 కోట్లు. ఆమె నెట్వర్త్ రూ.800 కోట్లని అంచనా.ఆకాశ్ అంబానీముకేశ్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఆకాశ్ అంబానీ తన చదువు పూర్తి చేసిన వెంటనే, 2014లో రిలయన్స్ జియోలో చేరాడు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ ఓనర్స్లో ఒకరిగా కూడా ఉన్నాడు. అలాగే, రిలయన్స్ లిమిటెడ్ ఉత్పత్తులు, డిజిటల్ సేవల అప్లికేష¯Œ ల అభివృద్ధి, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆకాశ్ వార్షిక వేతనం రూ. 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,32,815 కోట్లు) నెట్వర్త్.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ. 2022లో రిలయన్స్ బోర్డులో చేరాడు. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. జంతుప్రేమికుడిగా ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం ‘వంతారా’అనే సంస్థను స్థాపించాడు. ఈ మధ్యనే ఈ సంస్థకు ప్రతిష్ఠాత్మక ‘ప్రాణిమిత్ర’ జాతీయ అవార్డు లభించింది. అనంత్ వార్షిక వేతనం రూ. 4.2 కోట్లు. నెట్వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,32,482 కోట్లు).నోయల్ టాటా ఉప్పు నుంచి విమానయానం వరకు దాదాపు అన్ని రంగాల్లోనూ టాటా గ్రూప్ వ్యాపార స్రామాజ్యం విస్తరించి ఉంది. అయితే, ఆ సామ్రాజ్యం దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణానంతరం కూడా సజావుగా కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆయన సవతి తల్లి కొడుకు నోయల్ టాటా, టాటా గ్రూప్ చైర్మన్గా నియమితులవడం. ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. ఈయనకు ముగ్గురు పిల్లలు. వీరు కూటా టాటా ట్రస్ట్లో వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.లేహ్ టాటానోయల్ పెద్ద కుమార్తె లేహ్ టాటా ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. తాజ్ హోటల్స్ రిసార్ట్స్– ప్యాలెస్లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా కెరీర్ను ప్రారంభించిన ఆమె– నేడు ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ను నిర్వహిస్తోంది. వీటితో పాటు, గేట్వే హోటల్స్ బ్రాండ్ను నిర్వహిస్తోంది. టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జేఆర్డీ అండ్ థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా ఉన్నారు.మాయా టాటామాయా టాటా.. టాటా క్యాపిటల్లోని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్లలో మొదలై, నేడు టాటా డిజిటల్ రంగంలో ముఖ్యమైన పదవిలో ఉన్నారు. టాటా న్యూ యాప్ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జెఆర్డీ, టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా పనిచేస్తోంది.నెవిల్లే టాటానెవిల్లే టాటా గత సంవత్సరం నుంచి టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాల బాధ్యతలు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ట్రెంట్ హైపర్ మార్కెట్ యూనిట్.. ‘స్టార్ బజార్’, ‘జూడియో’ సంస్థలకు అధిపతి. వీటితో పాటు టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, జేఆర్డీ, టాటా ట్రస్ట్ అండ్ ఆర్డీ, టాటా ట్రస్ట్ బోర్డులలో ఉన్నారు.గోద్రేజ్ప్రఖ్యాత కుటుంబ వ్యాపారాల్లో గోద్రేజ్ ఒకటి. సబ్బులు, గృహాపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీయ సంస్థ గోద్రేజ్. దీనిని 1897లో న్యాయవాది నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన అర్దేశిర్ గోద్రేజ్ ప్రారంభించారు. ప్రస్తుతం గోద్రేజ్ గ్రూపును గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్గా రెండు విభాలుగా విభజించారు. వీటిల్లో గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ను వారి మూడోతరం ఆది, నాదిర్ చూసుకుంటుంటే, మరోదాన్ని జంషీద్, స్మితా గోద్రేజ్ కృష్ణా నిర్వహిస్తున్నారు. వీరితో పాటు, వారి నాలుగోతరం వారసులైన తన్యా దుబాష్.. గోద్రేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైర్టెర్గానూ, నిసబా గోద్రేజ్.. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గానూ వ్యవహరిస్తున్నారు. ఇలా గోద్రేజ్ కుటుంబంలో చీలిక ఏర్పడినప్పటికీ వారి వ్యాపారాన్ని వారసులు విజయవంతంగా కొన సాగిస్తున్నారు. బజాజ్ బజాజ్ గ్రూప్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ తర్వాత, బజాజ్ సంస్థను ఆయన కుమారులు రాజీవ్, సంజీవ్, అతని బంధువులు శేఖర్, నీరజ్, నీరవ్తో కూడిన కుటుంబ కౌన్సిల్ ద్వారా ఏకాభిప్రాయంతో పనిచేస్తోంది. ఇటీవలే మరణించిన మధుర్ బజాజ్ కూడా ఈ ఆరుగురు సభ్యుల కౌన్సిల్లో ఉండేవారు. బజాజ్ ఆటో సంస్థను రాజీవ్ బజాజ్ కుమారుడు రిషభ్నయన్ బజాజ్ చూసుకుంటున్నాడు. గత ఏడాదే, బజాజ్ గ్రూప్ ఆరోగ్య రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. నీరవ్ బజాజ్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాడు. వీరి వారసులు కూడా కంపెనీలో వివిధ పదవుల్లో కొనసాగుతూ విజయం సాధిస్తున్నారు.అనన్యా బిర్లా.. దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఒకటైన ఆదిత్యా బిర్లా పెద్ద కుమార్తె అనన్యా బిర్లా వ్యాపార ప్రపపంచంలో విజయవంతమైన మహిళగా రాణిస్తోంది. ఈమె తన çపదిహేడవ ఏటనే సొంత మైక్రోఫిన్ సంస్థను స్థాపించింది. ఇది దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న మైక్రోఫైనాస్స్ సంస్థల్లో ఇదీ ఒకటి. అలాగే, ఆదిత్యా బిర్లా అనుబంధ హిందాల్కో ఇండస్ట్రీస్లో డైరెక్టర్గా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్గా కొనసాగుతోంది. ప్రణవ్ అదానీభారతీయ కుబేరుల్లో ఒకరైన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తర్వాతి తరం కూడా వేర్వేరు వ్యాపారాల్లో కొనసాగుతూ, ఆయన పేరును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ కుమారుడు ప్రణవ్ అదానీ బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తయిన వెంటనే, అదానీ కమ్యూనికేషన్స్లో ఎంటరై, తన చురుకుతనం చూపించాడు. తర్వాత అదానీ విల్మార్, అదానీ రియాలిటీలకు అధిపతిగా ఉన్నాడు. అలాగే, ఆసియాలో అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్కు ఇతడే నాయకత్వం వహిస్తున్నాడు. కరణ్ అదానీ.. గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ అంచెలంచెలుగా ఎదిగి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్కు డైరెక్టర్గా నియమితులయ్యాడు. ఆయన హయాంలో, కంపెనీ నాలుగు నుంచి ప్రస్తుతం పన్నెండు పోర్టులకు విస్తరించింది. అంతేకాదు, దాని కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 500 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాడు. అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారాన్ని పెంచడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.జీత్ అదానీ...గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్లో పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూప్లో చేరి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మార్కెట్స్ వంటి విభాగాల బాధ్యతలు చూసుకోవడంతో తన కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం అదానీ ఎయిర్పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్కు కూడా నాయకత్వం వహిస్తున్నాడు.సాగర్ అదానీ..అదానీ సోదరుడి కుమారుడు సాగర్ అదానీ. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో పట్టా పొందిన తర్వాత 2015లో అదానీ గ్రూప్లో చేరాడు. ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. విదేశాల నుంచి సౌర విద్యుత్ ప్రాజెక్టులు తెప్పించడంలో సాగర్ కీలక పాత్ర పోషించాడు.ఆర్యమాన్ విక్రమ్ బిర్లాబిర్లా తనయుడు ఆర్యమాన్ బిర్లా వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్. అయినప్పటికే, తండ్రి పేరును నిలబెట్టే ప్రయత్నంతో చిన్న వయసులోనే బిర్లా రియల్ ఎస్టేట్, పెయింట్స్, ఫ్యాషన్ అండ్ రిటైల్ వ్యాపారాల్లో తన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. 2023లో గ్రూప్లోని ఫ్లాగ్షిప్ కంపెనీలైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ బోర్డులో చేరారు. వీటితోపాటు, బిర్లా హాస్పిటాలిటీ, బిర్లా వెంచర్స్ను చూసు కుంటున్నాడు.దేశంలో కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో అంబానీ కుటుంబ వ్యాపారం మొత్తం విలువ రూ.25.75 లక్షల కోట్లు. ఇది భారత జీడీపీలో 10 శాతంతో సమానమని ‘బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా–2024’ నివేదిక పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో బజాజ్, బిర్లా కుటుంబాలు ఉన్నాయి. అయితే, వారసత్వ వ్యాపారం ఇలాగే కొనసాగితే, రాజకీయాల్లోను, సినిమాల్లోను మాదిరిగానే వ్యాపారరంగంలోనూ వారసత్వాలు పెరిగి, కొత్త వ్యాపారులకు చోటు లేకుండా పోతుందనేది నిపుణుల మాట. ఇలా కాకుండా, ఎక్కడైనా సరే, వారసత్వ అర్హతతో పనిలేకుండా, ప్రతిభతో అవకాశాలు దక్కడం, దక్కించుకోవడమే అందరికీ మేలు.వ్యాపార కుటుంబాల్లో భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబాలలో ఇప్పటికే చాలా మార్పు జరుగుతోంది. కొత్త తరానికి నియంత్రణ అప్పగిస్తూ, వారసులను వ్యాపార బరిలోకి దింపుతున్నారు. వీరి రాకతో వారి కుటుంబాల వ్యాపారాల విలువలు కూడా పెరుగుతున్నట్లు తాజాగా బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా 2024 ఇచ్చిన నివేదిక వెల్లడించింది. వీటితో పాటు, అత్యధిక విలువ కలిగిన కుటుంబ వ్యాపారాల నివేదికను రూపొందించింది. అదే ఇది..నివేదిక ప్రకారం.. కుటుంబాల వ్యాపారాల విలువలు దీపిక కొండి -
క్షణాల్లో మేకప్ వేసుకోవచ్చు..!
సాధారణంగా మేకప్ ప్రక్రియ సమయంతో కూడిన పని. తీరా క్రీమ్స్, పౌండేషన్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి అప్లై చేసుకున్నాక, ఆ మేకప్ కాస్త ఎక్కువైనా, తక్కువైనా సరి చేసుకోవడం ఇంకాస్త పెద్ద పని. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది ఈ పరికరం. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ వినూత్న పరికరాలు ఇప్పుడు నిజంగానే వినియోగంలోకి వచ్చేశాయి. కేవలం కొన్ని క్షణాల్లోనే ఈ పరికరాలు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాయి.చిత్రంలోని ‘టెంప్ట్ యూ 2.0’ ఎయిర్ బ్రష్ మేకప్ సిస్టమ్లో ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ బ్రష్ ఉంటాయి. కంప్రెసర్ గాలిని ఉత్పత్తి చేస్తుంది. ఎయిర్ బ్రష్తో మేకప్ లిక్విడ్స్ను సన్నని పొరగా చర్మంపై స్ప్రే చేస్తుంది. ఎయిర్పాడ్లో మేకప్ లిక్విడ్ నింపుకోవాలి. కంప్రెసర్ గాలితో అప్లై చేసుకునే మేకప్, చర్మంపై సమానంగా పడుతుంది.ఈ మెషిన్తో మేకప్ వేసుకుంటే తక్కువ కాస్మెటిక్స్తో ఎక్కువ కవరేజ్ ఉంటుంది. ఇది మేకప్ని వేగంగా వేయడంతో పాటు, ఎక్కువ సమయం చెక్కుచెదరకుండా ఉంచుతుంది. ఇది ఇంట్లోను, సెలూన్స్లోను ఎక్కడైనా వాడుకునేందుకు అనుకూలమైనదే! ఈ ‘టెంప్ట్ యూ’ ఎయిర్బ్రష్ మేకప్ సిస్టమ్, సాంప్రదాయ మేకప్ పద్ధతులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రెప్పల సోయగంఅందమైన మోముకి వాలు కనులు మరింత సొగసునిస్తాయి. అందుకే చాలా మంది ఆర్టిఫిషియల్ ఐలాష్లను అతికించుకుంటూ మురిసిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేదంటోంది బ్యూటీ ప్రపంచం. కనురెప్పల వెంట్రుకలు శాశ్వతంగా పొడవుగా పెరిగేందుకు ‘ఐలాష్ ట్రాన్స్ప్లాంట్’ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది నిపుణులతో మాత్రమే చేయించుకోవలసిన శస్త్రచికిత్స పద్ధతి. ఈ చికిత్సలో తల వెనుక భాగం నుంచి వెంట్రుక కుదుళ్లను తీసి, కనురెప్పల మీద అమర్చుతారు. ఆ తర్వాత ఈ వెంట్రుకలు సహజంగా పెరుగుతాయి, రాలుతాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇతర తాత్కాలిక పద్ధతుల కంటే ఎక్కువ కాలం నిలుస్తుంది. (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..?
నాకిప్పుడు ఐదవనెల. కొత్తగా ఏవైనా వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇస్తున్నారా? ఉంటే చెప్పండి? – జాగృతి, కర్నూలు. గర్భవతులందరూ తప్పనిసరిగా టీటీ ఇంజెక్షన్, ఫ్లూ, కోరింతదగ్గు టీకాలు తీసుకోవాలి. ఇవి అన్ని ఆసుపత్రుల్లోనూ రొటీన్గా నెలలను బట్టి ఇస్తారు. వీటికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ బ్లడ్ గ్రూప్ నెగటివ్ గ్రూప్ అయి, మీ భర్తది పాజిటివ్ గ్రూప్ ఉంటే కనుక, రీసస్ యాంటీ–డీ వ్యాక్సినేషన్ అనేది ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇది డాక్టర్ కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఏడవ నెలలో సూచిస్తారు. ఇప్పుడు ఫ్లూ సీజన్ ఉన్నందున ఇనాక్టి్టవేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఇస్తున్నారు. మీరు డాక్టర్ను సంప్రదించి తీసుకోండి. ఫ్లూ వచ్చిన వారికి ప్రెగ్నెన్సీలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే, టీబీ రోగనిరోధక శక్తి ఆ సమయంలో చాలా బలహీనంగా ఉంటుంది. న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటివి వస్తే తీవ్రమైన ప్రభావాలు తల్లీ బిడ్డలపై ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ సమస్యలు తక్కువ. కోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాక్సిన్లు ఐదవనెల నుంచి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ల వలన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయి పుట్టబోయే బిడ్డకు లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వీటిని ఎనిమిదవ నెలలోపు తీసుకోవాలి.నేను ఏడునెలల గర్భవతిని. ఇంట్లో ఆఫీస్ వర్క్ చెయ్యవద్దని అంటున్నారు. ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏ సమస్యలు వస్తాయి? – మమత, హైదరాబాద్. ఏడవనెల అంటే బేబీ ఎదుగుదల వచ్చే సమయం. కానీ, తల్లికి ఏదైనా ఒత్తిడి, టెన్షన్స్ ఉంటే అవి చెడు ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా డాక్టర్ చెప్పేది పాటిస్తూ, జాబ్ చేస్తూ, ఒత్తిడి తక్కువ ఉంటే ఏ సమస్యలు ఉండవు. కానీ, ముందుగానే కొంచెం టెన్షన్లో ఉన్నవాళ్లు, ఉద్యోగ సంబంధిత టార్గెట్స్ రీచ్ కాలేనప్పుడు టెన్షన్స్ ఎక్కువ పడేవారికి బేబీ ఎదుగుదలపై కొంత ప్రభావం పడుతుంది. బేబీ మెదడు, నరాల ఎదుగుదలలో కొన్ని మార్పులు వస్తాయి అని కొన్ని పరిశోధనల్లో తేలింది. శారీరక ఆరోగ్యంలో బీపీ పెరగటం, ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో ఉండే నీరసం, నిద్రపట్టకపోవడం లేదు అనేవి ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. ఒత్తిడితో ఎక్కువ తినటం లేదా తక్కువ తినడం, రోగనిరోధక శక్తి తక్కువ అవటం, ఇన్ఫెక్షన్స్ వలన నెలలు నిండకుండానే ప్రసవం, ఉమ్మనీరు కారిపోవడం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా మూడ్ స్వింగ్స్, ఆందోళన లాంటివి ఒత్తిడితో ఎక్కువ అవుతాయి. తల్లి ఒత్తిడి వలన బేబీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కావచ్చు. బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. బేబీ ఎదుగుదల తక్కువ ఉండటం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు జరగచ్చు. ఒత్తిడి ఎక్కువ ఉన్న వారిలో హార్మోన్ల మార్పులు ఎక్కువ ఉంటాయి. ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఒకసారి ఒత్తిడి తక్కువ అవడానికి డైట్, వ్యాయామం ఏవి చెయ్యాలి అని తెలుసుకోండి. నాకిప్పడు ఎనిమిదవ నెల. ఈ నెలలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. అవి సాధారణ మార్పులా లేదా ఏదైనా సమస్యా అని ఎలా గుర్తించాలి? – కీర్తి, నల్గొండ. చివరి రెండు నెలల్లో శరీరంలో ప్రెగ్నెన్సీలో హార్మోన్ల వలన చాలా మార్పులు వస్తాయి. నొప్పి, కాళ్లు, ముఖ కండరాల్లో వాపు రావచ్చు. ఆందోళన కూడా పెరుగుతుంది. బేబీ కదలికలు కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడప్పుడు పొట్ట అంతా చాలా గట్టిగా అయి, వదులుగా అవుతుంది. నొప్పి ఉండదు. వీటిని బ్రాక్ట్సన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటాం. రొమ్ముల్లో కూడా నొప్పిగా అనిపిస్తుంది. కొందరికి వాటరీ మిల్క్లాగా వస్తుంది. ఒకవేళ మీకు కాంట్రాక్షన్స్ నొప్పిగా అనిపిస్తున్నా, ఎక్కువసార్లు వస్తున్నా, బ్లీడింగ్ ఉన్నా, అకస్మాత్తుగా బేబీ యాక్టీవిటీ తగ్గినా, సడన్గా బరువు పెరిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బేబీ ఎదుగుదల కూడా ఈ చివరి రెండు నెలల్లోనే బాగుంటుంది. బేబీ ఎముకలు పూర్తిగా ఫామ్ అవుతాయి. బేబీ కళ్లను తెరిచి చూస్తుంది. ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ను నిల్వ చేసుకుంటుంది. మీకు తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు డాక్టర్ ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి, బేబీకి పెల్విస్ సరిపోతుందా అని చెక్ చేసి, నార్మల్ వెజైనల్ డెలివరీకి ప్లాన్ చేస్తారు. ఈ రెండు నెలలు మీరు ప్రీనేటల్ విటమిన్స్ తీసుకోవాలి. పెల్విస్ ఫ్లోర్ లేదా కెగెల్ వ్యాయామం చెయ్యాలి. హై ఫ్రూట్, హై ఫ్లోర్, తక్కువ కొవ్వు ఉండే డైట్ తీసుకోవాలి. రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..!) -
నక్షత్రాలు చూడటానికి బెస్ట్ ప్లేస్ ..!
చీకటివేళ, మిలమిల మెరిసే నక్షత్రాల నింగిని చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ అబ్బురమైన అనుభూతి, మనసుపై చెరగని ముద్ర వేయాలంటే, అమెరికాలోని ఉటా రాష్ట్రం వెళ్లాల్సిందే! అక్కడి సెడార్ బ్రేక్స్ నేషనల్ మాన్యుమెంట్ సమీపంలో రాత్రిపూట సేద తీరాలి. నక్షత్రాలను చూడటానికి అదో అద్భుతమైన ప్రదేశం అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇక్కడ సహజసిద్ధమైన అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవట! ఇక్కడి లోతైన లోయలో సున్నపురాతి గుట్టలు కాలాన్ని బట్టి, నేలలో ఉండే ఖనిజాన్ని బట్టి రంగురంగులుగా మెరుస్తాయి. ఈ సెడార్ బ్రేక్స్ ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాలతో ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మొదట్లో ఒక సరస్సు అని, నీరు ఎండిపోయాక అడుగున పేరుకున్న అవక్షేపాల రూపమే ప్రస్తుతం మనకు కనిపించే శిలలని చెబుతున్నారు. ఇది సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని అంచనా. ఈ ప్రాంతాన్ని 1933లో జాతీయ వారసత్వ చిహ్నంగా గుర్తించిన నాటి నుంచి, ఈ అద్భుతమైన సహజ సౌందర్యాన్ని పరిరక్షిస్తున్నారు. ఇక్కడ హైకింగ్, ఫొటోగ్రఫీ, నక్షత్రాల పరిశీలన వంటి కాలక్షేపాలను ఆస్వాదించవచ్చు. (చదవండి: వేసవి అంటే సెలవులేనా?) -
కుందనపు బొమ్మ నటి మేఘా ఆకాశ్ ఇష్టపడే ఆభరణాలు ఇవే..!
‘బొమ్మోలె ఉందిరా పోరీ..’ అంటూ చీర కట్టినా, జీన్స్ వేసినా అచ్చం కుందనపు బొమ్మలాగే ఉంటుంది నటి మేఘా ఆకాశ్. ఇప్పుడు ఆ రెండింటి కలయికలోనూ అద్భుతంగా ట్రెడిషన్ విత్ కాంటెంపరరీ లుక్ ట్రై చేసింది. ఆ ఫ్యాషన్ వివరాలే ఇక్కడ చూద్దాం.. వెండి వెలుగులుఆభరణాల విలువల పోటీలో బంగారం తర్వాతి స్థానమే వెండిది అయినా, మగువ అందాన్ని పెంచడంలో మాత్రం ఈ ఆభరణాలు తగ్గేదేలే అంటూ పోటీ పడతాయి. ఎందుకంటే, వెండి ఆభరణాలను ధరిస్తే వచ్చే లుక్కే వేరు. తక్కువ ధరలో లభించడంతో వీటికి అభిమానులు కూడా ఎక్కువే. సాధారణంగా వెండిని కాళ్ల పట్టీలు, కంకణాలు, మెట్టెలు వంటి ఆభరణాలకే ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టు వెండిని కూడా మెడలో హారాలు, చెవి పోగులకు, వివిధ ఆభరణాల రూపంలోకి మార్చేస్తున్నారు. అయితే, ధగధగ మెరిసే వెండి వస్తువుల మాదిరి కాకుండా ఈ వెండి ఆభరణాల రంగు కాస్త డల్గా ఉన్నా, ఇవి స్టయిలిష్ అండ్ బ్రైట్ లుక్ను తెప్పిస్తున్నాయి. వీటని మెయింటైనెన్స్ కూడా పెద్ద కష్టమైన పని కాకపోవడంతో ప్రతి ఒక్కరూ కాంట్రాస్ట్ లుక్ కోసం వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి లుక్ కోసమే నటి మేఘా ఆకాశ్ కూడా ఈ సిల్వర్ జ్యూలరీని ఎంచుకున్నారు చూడండి. ఇక్కడ మేఘా జ్యూలరీ.. బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ చౌకర్ ధర: రూ. 5,800నెక్ పీస్ ధర: రూ. 41,612, ఉంగరం ధర: రూ. 3,399. ఇక మేఘాకి లిప్స్టిక్ ఎక్కువ ఇష్టం ఉండదట. అందుకే, తన బ్యాగులో ఎప్పుడూ చాలా రకాల లిప్ బామ్స్ ఉంటాయని చెబుతోంది. (చదవండి: పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..) -
పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..
వేసవిలో పండ్లు, కూరగాయల జ్యూస్ల వాడకం సహజంగానే ఎక్కువ. ఆరోగ్యం గురించే కాదు, వీటిని ఇంటి అలంకరణలోనూ వాడచ్చు. సహజమైన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి కృత్రిమమైన పండ్లు, కూరగాయలు, వనమూలికలతో ఇంటిని అలంకరించవచ్చు. ఇంటి వాతావరణం చల్లగా, సహజత్వానికి దగ్గరగా ఫామ్హౌస్ వాతావరణాన్ని సృష్టించాలనుకున్నా, సమృద్ధిగా పంటల థీమ్ను సృష్టించాలనుకున్నా, వనమూలికల ఉపయోగాలు తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నా, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డెకర్ ఈ సీజన్కి సరైన ఎంపిక అవుతుంది.కిచెన్ డెకర్గిన్నెల్లో, వంటగది కౌంటర్టాప్ లేదా డైనింగ్ టేబుల్పై పండ్లబుట్ట ఉంచి, వాటిలో కృత్రిమ పండ్లు, కూరగాయలను ప్రదర్శించవచ్చు. ఆర్టిఫిషియల్ పండ్లు, కూరగాయలు, మూలికలు, పువ్వులు లేదా పచ్చదనంతో సెంటర్ టేబుల్పైన సెంటర్ పీస్ను క్రియేట్ చేయండి. మరింత అందంగా కనిపించడానికి ఓ వెదురు బుట్ట లేదా జాడీ ఉంచండి. ఫామ్హౌస్ శైలిపట్టణవాసులు ఇటీవల ఫామ్ హౌస్లను బాగా ఇష్టపడుతున్నారు. అందుకని, ఫామ్హౌస్ అలంకరణను మన ఇంట్లోకి తీసుకురావచ్చు. వెదురు లేదా తీగలతో అల్లిన బుట్టలు, జ్యూట్ బ్యాగుల్లో మీకు నచ్చిన చెర్రీ, బెర్రీ, నిమ్మ, ఆరెంజ్, అరటి, మామిడి.. వంటి కృత్రిమ పండ్లు, కూరగాయలు, మూలికలను చేర్చండి. హెర్బల్ గార్డెన్కృత్రిమ మూలికలతో ఇండోర్ హెర్బల్ గార్డెన్ను సృష్టించవచ్చు. తాజా అనుభూతి కోసం వంటగదిలో కుండలు లేదా వేలాడే బుట్టలనూ ఉంచవచ్చు. నిమ్మ, నారింజ చెట్లు వంటి కృత్రిమ పండ్ల చెట్లను పెద్ద కుండలలో ఉంచి ప్రదర్శించవచ్చు. ఎన్.ఆర్(చదవండి: వేసవి అంటే సెలవులేనా?) -
ఆల్ఫ్రీ ఊరు
అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలోకి వెళ్లి ఉంటామంటే చాలు. మీకు కావాల్సిన ఇంటిని, కావాల్సిన రీతిలో ప్రభుత్వమే కట్టి ఇస్తుంది. అది కూడా ఉచితంగా.. అర్జెంటుగా ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కూడా అవసరమైన డబ్బు కూడా ఇస్తుంది. అది కూడా అంతా ఇంతా కాదు, దాదాపు రూ. 94 లక్షలు. నిజం, ఉత్తర ఇటలీలోని ట్రెంటినో ప్రాంత గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి లక్ష యూరోలు (సుమారు రూ. 94 లక్షలు) ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఎందుకంటే, అక్కడి గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతుండటంతో, ప్రస్తుతం అక్కడ అన్నీ పాడుబడిన ఇళ్లే కనిపిస్తున్నాయి తప్ప, జనాలెవరూ లేరు. దీంతో, ఇప్పుడు ఆ గ్రామాలన్నీ జనాభా తగ్గి.. ఆర్థికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలా దాదాపు 33 గ్రామాలు ఉన్నాయి. అందుకే, ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటలీ ప్రభుత్వం ఆ గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ నజరానా ఇస్తోంది. అయితే ఈ డబ్బును వారు కేవలం, అక్కడ ఉండే ఇల్లు కొనుక్కోవడానికి లేదా మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యాపారం, వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు. అయితే, 45 ఏళ్ల లోపు ఉన్న ఇటలీవాసులతోపాటు విదేశాల్లో ఉన్న ఇటాలియన్లకు మాత్రమే దీనికి అర్హులు. -
ఈ వారం కథ: సమయానికి తగు..
‘నేను ఆఫీసుకి వెళుతున్నా. మన పుత్రరత్నం స్టేడియం నుంచి రాగానే, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రవీంద్ర వాళ్ళ ఆఫీస్ ఇంటర్వ్యూ గుర్తు చేసి పంపండి’ ఆఫీస్కు వెళుతూ భర్తతో చెప్పింది భార్గవి. అప్పుడు సమయం ఉదయం ఎనిమిదిన్నర అవుతోంది.‘సర్లే, పంపిస్తాను’ చెప్పాడు భర్త శ్యామలరావు.‘ఈరోజు ఒక్కరోజు ప్రాక్టీస్ లేకపోయినా ఏమీ కాదు అంటున్నా, త్వరగానే వస్తా అంటూ వెళ్ళాడు. ఇది రవీంద్ర రిఫరెన్స్ తో వచ్చిన అవకాశం. పోగొట్టుకుంటే నాకు నామర్దా. మరోసారి ఎవరినీ అడగలేం కూడా’ చెప్పుల్లో కాళ్ళు పెడుతూ అన్నది భార్గవి.‘నువ్వేం టెన్షన్ పడకు. నే పంపిస్తాగా వాడిని. నువ్వు ఎక్కువ అలోచిస్తావు అనవసరంగా’ చదువుతున్న పేపర్ మడిచి అన్నాడు శ్యామలరావు.‘నేనా ఎక్కువ ఆలోచించేది?’ అన్నట్లు భర్త వైపు ఒక చూపు చూసి ఇంటి గేట్ వైపు నడిచింది భార్గవి. చాలాసార్లు ఆమె కళ్లే మాట్లాడతాయి.శ్యామలరావు ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో పనిచేసి సంవత్సరం క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. వచ్చే ఏడాది భార్గవి కూడా తను చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటపడి విశ్రాంత జీవితపు సుఖాన్ని పొందబోతోంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు– మొదటి సంతానం ఆడపిల్ల ధన, ఏడేళ్ల తర్వాత పుట్టిన మగపిల్లాడు సంతోష్! ధన తొంభై దశకం మొదట్లో పుట్టడంతో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నీడ పడక ముందే బిట్స్ పిలానీలో చదువు, మంచి ఉద్యగం, తదుపరి పెళ్లి అన్నీ నల్లేరు మీది నడకగా సాగినాయి. ఇప్పుడు కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది.సంతోష్ చదువు డిగ్రీ కాలేజ్ స్థాయికి రాకుండానే ఆండ్రాయిడ్ ఫోన్ చేతికి రావడం, సోషల్ మీడియా వానమబ్బులా కమ్మేయడం జరిగిపోయాయి. అతని ఆలోచనలు, భావాలు పాతతరం మూసకొట్టుడు విద్యార్థిలాగా కాక, ప్రత్యేక మార్గం వైపు వెళ్లసాగాయి. అందుకే అతను ఇంజనీరింగ్ డిగ్రీ వైపు కాకుండా తన చదువును క్రియేటివ్ ఆర్ట్స్ వైపు సాగించాడు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, యానిమేషన్ రంగాలలో చదువును సాగిస్తూ, వ్యక్తిత్వ వికాస రంగంలోనూ, అదనంగా బ్యాడ్మింటన్ ఆటలోనూ ప్రావీణ్యం పొందసాగాడు. స్నేహితులు, వాళ్ళతోనే ఎక్కువ సమయం గడిపే కొడుకును చూసి భార్గవి, అతని భవిష్యత్తు గురించి చింత పడసాగింది. తనయుడిలోని చురుకుతనం, స్నేహ గుణం, బాధ్యతాయుత ప్రవర్తన చూసిన శ్యామలరావు అతని గురించి దిగులు లేకపోగా గర్వపడతాడు. తనకో సుందర సౌఖ్య ప్రపంచాన్ని సంతోష్ ఏర్పరచుకోగలడని శ్యామలరావు విశ్వాసం.మరో అరగంటకి సంతోష్ ఇంటికి వచ్చాడు. వస్తూనే శ్యామలరావు భార్గవి చెప్పమన్నది అంతా ఆమె చెప్పినట్టే చెప్పాడు. చెప్పి, ‘ఈ ఇంటర్వ్యూ సంగతి ఏమవుతుందో ఏమో కానీ, అమ్మ దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది’ అన్నాడు.‘అటెండ్ అవగానే వచ్చేస్తాయా ఉద్యోగాలు? ఆమె ఇప్పించిన చా¯Œ ్సతో ఉద్యోగం తెచ్చుకోకపోతే నేనొక పనికిమాలిన వాడినని, అసమర్థుడినని ప్రూవ్ అయినట్టా? నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఇది ఏర్పాటు చేసింది. నిజానికి ఆ కంపెనీ మంచిదే. వాళ్ళు తీసుకునేది అకడమిక్ రికార్డ్స్ కూడా చూసి. నేను ఆ కోవలో లేను. నాదంతా ఎక్స్ట్రా వ్యాపకాలే! అమ్మ ఇది తెలుసుకోవడం లేదు’ అన్నాడు సంతోష్. మధ్యలో ధన కల్పించుకొని ‘నువ్వు ముందు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకో, నచ్చకపోతే చెయ్యడం మానెయ్. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు’ చెప్పింది.‘నువ్వు ఎప్పుడైనా నన్ను సపోర్ట్ చేశావటే! నీకూ నాకూ మధ్య ఒక జనరేషన్ తేడా ఉంది తెలుసుకొని మాట్లాడు’ అక్కని దెప్పాడు సంతోష్.‘అది నిజమే కాని, నువ్వు ఒక రోడ్ మ్యాప్ లేకుండా, నాలుగింటిలో వేళ్ళు పెడుతుంటే ఏమనుకోవాలి?’ సంతోష్ను నిలదీసింది ధన.‘ఇప్పుడు ఇంటర్వ్యూకు వెళ్ళేముందు ఈ వాదనలొద్దు’ ఇద్దరికీ అడ్డువచ్చాడు శ్యామలరావు.‘నాన్నా! అమ్మతో ఇబ్బంది ఏంటో తెలుసా? తాను పెర్ఫెక్ట్ పేరెంట్ అనిపించుకోవాలని. కాని, నాకు అన్నీ టైమ్ టేబుల్ గీసుకొని చేస్తుండే పర్ఫెక్ట్ చైల్డ్ అన్పించుకోవాలని మాత్రం లేదు. ఇది అమ్మకి అర్థం కావడం లేదు. మీ ఆలోచనలతో నేను బతకను. నా ఆలోచనలతోనే నేను బతకాలి. కష్టమైనా నష్టమైనా నేనే దానికి బాధ్యుడిని’ చేతిలోని కప్పు బద్దలు కొట్టినట్టు డైనింగ్ బల్లమీద పెడుతూ చెప్పాడు సంతోష్. చెప్పడమే కాకుండా చివాలున లేచి తన రూంలోకి వెళ్ళి తలుపు వేసేశాడు.మరో గంటకి బయటకు వచ్చి ఇంటర్వ్యూకి వెళుతున్నట్టు శ్యామలరావుకి చెప్పి వెళ్ళాడు.∙∙ అది హై టెక్ సిటీ– గచ్చిబౌలిలకు వెళ్ళే మార్గం. ఉదయం ఆఫీసులు మొదలయ్యే వేళల్లో రోడ్లన్నీ ఒకవైపు కిక్కిరిసి పోతాయి. పెరిగిన వాహన రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో భాగంగా కట్టే ఫ్లై–ఓవర్లలో ఒకటి ఆ మార్గంలో కూడా కడుతున్నారు. కట్టేటప్పుడు దారంతా పరుచుకుపోయిన సామాన్లతో ఆ దారిన పోయే వాహనాలకు అటు వెళ్ళడమే నరకప్రాయం. అది తప్పించుకోవడానికి అడ్డదారులు పడుతుంటారు వాహనదారులు. ఆ అడ్డదారుల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉండరు. ఆ దారులు ప్రతివాడి ఇష్టారాజ్యం. ఇంటర్వ్యూకి ఆలస్యం అవకూడదని సంతోష్ అటువంటి అడ్డదారినే ఎంచుకున్నాడు. అది మట్టి రోడ్డు దారి. ఆ దారి మధ్యలో ఒకచోట పైనుండి రైలు వెళ్ళే వంతెన ఒకటి వస్తుంది. ఆ దారంతా, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద రోడ్డును కలిసే వరకూ, చాలా సన్నగా, అడ్డంగా మూడు కార్లు పట్టేంత స్థలం కలిగి ఉంటుంది. ముందురోజు రాత్రి వర్షం పడడంతో అక్కడక్కడా నీటి మడుగులు ఏర్పడ్డాయి. రైలు వంతెన కొద్ది దూరంలో ఉందనగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. వంతెనకు అటూ ఇటూ వాహనాలు నిలిచి ఉన్నాయి. అక్కడకు వచ్చిన సంతోష్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఐదు నిమిషాలలో సర్దుకుంటుందిలే అని తన మోటార్ సైకిల్ ఇంజన్ ఆపాడు. చూస్తుండగానే తన వెనక చాలా బండ్లు వచ్చి చేరినయ్. ఐదు నిముషాలు గడిచినా ఎక్కడి బండ్లు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. అసహనపు మానవులు కొంతమంది హారన్లు మోగిస్తున్నారు అదేపనిగా! తను ఇప్పుడు వెనక్కి కూడా వెళ్ళలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడయ్యాడు.సంతోష్ మొబైల్ తీసి టైమ్ చూశాడు– ఇంకా ఇరవై నిముషాలే ఉంది తన ఇంటర్వ్యూకి. బండ్లు అస్తవ్యస్తంగా ఇరుక్కుండి పోయాయి. ఆ మార్గం ఎంచుకున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు.∙∙ వాహన రద్దీని అంచనా వేయకుండా అదే మార్గం ఎంచుకు వచ్చిన చంద్రకాంత్ కారు వెనక సీటులో అసహనంగా కదులుతున్నాడు ఇరుక్కుపోయిన వాహనాలను తిట్టుకుంటూ. చంద్రకాంత్ ఒక ఐటీ కంపెనీ యజమాని. అతను గచ్చిబౌలిలో ఉన్న ఒక నక్షత్ర హోటల్కి వెళ్లి అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకొని విమానాశ్రయం వెళ్ళాలి. ఆ వ్యక్తులు చంద్రకాంత్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందు జరిపే పరిశీలనలు చెయ్యడానికి వచ్చారు ముంబై నుంచి. వారిని విమానాశ్రయానికి సమయానికి చేర్చలేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా పావుగంటలో తను హోటల్ చేరాలి.ఒక వరుస పాటించకుండా కొన్ని కార్లు పక్క నుంచి ముందుకు వెళ్ళి అడ్డంగా ఆగిపోతూ ట్రాఫిక్ నియంత్రణను మరింత జటిలం చేస్తున్నాయి. కొంచెం సందు దొరికిన వైపు ద్విచక్ర వాహనాలు దూరిపోతున్నాయి. చంద్రకాంత్ డ్రైవర్ని ‘వేరే దారి లేదా’ అని అడిగాడు అనాలోచితంగా. అది తనక్కూడా తెలుసు వేరే దారి లేదని. డ్రైవర్ నుంచి కూడా అదే సమాధానం. చంద్రకాంత్ కారు దిగి చూశాడు. ముందు వైపు కంటే వెనకవైపు భారీగా ఆగినయ్ వాహనాలు. అంటే తను ముందుకే వెళ్ళాలి తప్ప, వెనక్కి తిరిగి అస్సలు వెళ్ళలేడు. చంద్రకాంత్ మనసులో అలజడి మొదలైంది– ఇప్పుడు ఎలా బయటపడడం అన్నదాని గురించి.ఇంతలో తన కారు వెనక నుంచి ఒక యువకుడు నోటిలో వేళ్ళు పెట్టి ఈల వేసుకుంటూ వాహనాల మధ్యగా ముందుకు నడవ సాగాడు. మధ్యలో జనాన్ని ఉద్దేశించి పెద్దగా అంటున్నాడు ‘ప్లీజ్ రండి. ట్రాఫిక్ క్లియర్ చేద్దాం! అందరం అట్లా కూర్చుని ఉంటే ఇవాళంతా ఇక్కడే ఉంటాం. మనలో కొందరు వెహికల్స్ వదిలి రండి’– అలా అంటూ చంద్రకాంత్ను దాటుతూ, అతను ‘సార్! ప్లీజ్ రండి సార్!’ అంటూ పిలిచాడు. చంద్రకాంత్ తన డ్రైవర్ని ఆ యువకుడి సహాయానికి పంపి, తను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. చూస్తుండగానే, తమ స్కూటర్ రోడ్డు పక్కన పార్క్ చేసి ఇద్దరు యువతులు ఆ యువకుడికి సహాయంగా ఉండడానికి వచ్చారు. యువతులను చూసి మరో ముగ్గురు ముందుకొచ్చారు. అతను విజిల్ వేస్తూ వాళ్ళకి సూచనలు ఇవ్వసాగాడు. అతణ్ణి అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు ముందుగా అడ్డదిడ్డంగా ముందుకొచ్చిన ద్విచక్ర వాహనదారులకు చోటు కల్పించసాగారు. ఇంకొకళ్ళు వెళ్లి, వెనకవున్న వాళ్ళు సందు చేసుకొని ముందుకు రాకుండా ఆపసాగారు. ఆ యువకుడు తొందర పడుతున్న వాళ్ళని ఓపిక పట్టమని బతిమిలాడుతున్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రకాంత్ ముచ్చటపడి తన మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించసాగాడు.ద్విచక్ర వాహనాల తర్వాత దారికి అడ్డుపడుతున్న బండ్లను నియంత్రించసాగారు. అందులో భాగంగా ముందుగా గచ్చిబౌలి వైపు వెళ్లే బండ్లను వదలసాగారు. దానికి ఆ యువకుడు చెప్పిన కారణం– ఆఫీసులకు, ఎయిర్పోర్టుకు, హాస్పిటల్లకు వెళ్ళవల్సిన వాళ్లు అటే వెళ్ళాలి గనక. అందుకోసం రెండోవైపు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళని ముందుకు రాకుండా ఆపగలిగాడు అతను. అతని సమయస్ఫూర్తికి చంద్రకాంత్ సంతోషపడ్డాడు, ఎందుకంటే తను వెళ్లాల్సిన హోటల్ కూడా అటే ఉండడంతో.మరికొద్ది సేపటికి చంద్రకాంత్ కారు మెల్లగా ముందుకు సాగడానికి వీలు కలిగింది. చంద్రకాంత్ వంతెన దాటుతూ ఆ యువకుడిని దగ్గరకు పిలిచి అతను చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపి ‘మే ఐ హావ్ యువర్ నంబర్ ప్లీజ్’ అన్నాడు. అతను చంద్రకాంత్ను అడిగి మొబైల్ తీసుకొని ముందుకు సాగుతున్న కారుతో నడుస్తూ తన వివరాలు నింపి ఇచ్చాడు. వంతెన దాటుతూనే డ్రైవర్ రావడంతో చంద్రకాంత్ తిరిగి అతనికి స్టీరింగ్ ఇచ్చి తను వెనక సీటులోకి మారాడు. చంద్రకాంత్ మనసుకు మెల్లగా ప్రశాంతత చేకూరింది. మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా వర్షించసాగింది.వర్షం కూడా తగ్గి వాహనాలు సాఫీగా ముందుకు సాగుతూండడంతో సంతోష్ తన మోటర్ సైకిల్ ఎక్కి టైం చూశాడు. అప్పటికే తను గంట ఆలస్యంగా ఉన్నాడు. అక్కడి నుంచి మరో పదిహేను నిముషాలు ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ చేరడానికి, ఏ సమస్యా లేకపోతే. కానీ అలా జరగలేదు, మార్గమధ్యంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ రెండూ తన సమయాన్ని మరికొంత మింగేయడం వల్ల! ఆఫీసు చేరి కనుక్కుంటే, అప్పటికే గ్రూప్ డిస్కషన్ ప్రక్రియ ముగియడంతో తనకు అవకాశం లేదని చెప్పడంతో వెనుదిరిగాడు.ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడిన చంద్రకాంత్ హోటల్కి వెళ్లి, అక్కడి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులను విమానాశ్రయంలో సకాలంలో దింపేవరకు కుదుటపడలేకపోయాడు. తర్వాత తిరిగి వస్తూ మొబైల్లో ట్రాఫిక్ జామ్ సమయంలో తను తీసిన వీడియో చూడసాగాడు. ఆ యువకుడు సమయానికి ముందుకు వచ్చి రద్దీని సడలించక పోయుంటే? ఆ వ్యక్తులకు ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళలేకపోతే తన గురించి, తన కంపెనీ గురించి ఎంత చెడ్డ అభిప్రాయం కలిగేది? అది ఆలోచిస్తూనే చంద్రకాంత్కి పరంపరగా తప్పిపోయిన ముప్పు తాలూకు సంఘటనలు తారాడినయ్! వెంటనే చంద్రకాంత్ తను తీసిన వీడియోను, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్లలో – ‘సాంఘిక బాధ్యత! ఆపద్బాంధవుడు’ శీర్షికతో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే ఆ యువకుడి నంబర్కి ఫోన్ చేశాడు. ఫోన్ ఒక రింగ్ రాగానే కాల్ కట్ అయ్యింది. మళ్ళీ చేశాడు, ఈసారి రింగ్ వెళ్ళలేదు. బహుశా తీరుబడిగా లేడేమో అనుకుని, ‘వీలయితే తిరిగి కాల్ చెయ్యండి’ అని సందేశం పంపాడు.∙∙ సూర్యుడికి వీడ్కోలు చెప్పి చీకటి దుప్పటి కప్పుకుంటున్న సంధ్యలో, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే కూతురు ధనని అడిగింది భార్గవి ‘సంతోష్ వచ్చాడా? ఉన్నాడా?’‘మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి బయటకెళ్ళాడు. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఇంటర్వ్యూ మిస్ అయ్యానని చెప్పాడు’ చెప్పేటప్పుడు తల్లి ముఖంలో మారుతున్న రంగులు ధన దృష్టిని దాటిపోలేదు. ‘2019లో బ్రేక్ కావాలి అని పీజీ చదవడం పక్కన పెట్టాడు. తర్వాత రెండేళ్ళు కరోనా అన్నింటినీ, అందరినీ పక్కన పడేసింది, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు పక్కన పడేస్తున్నారు వీడిని’ అంటూ భార్గవి తన గదిలోకి విసురుగా వెళ్లి తలుపు వేసుకుంది.మరికాసేపట్లో బయటి నుంచి వచ్చిన శ్యామలరావు భార్గవి ఉన్న తమ గది మూసి ఉండడంతో కూతురు ధన గదిలోకి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నాడు. సంతోష్ ఇంటర్వ్యూ అటెండ్ అవలేకపోయిన సంగతి వాళ్ళ మాటల్లోని ప్రధాన అంశంగా మారింది కాసేపటికి. ‘వీడు మెయిన్ రోడ్లో వెళ్లి ఉన్నా బాగుండేది. షార్ట్ కట్ అంటూ అటుపోయి ట్రాఫిక్ జామ్ వల్ల అసలుకే మోసం తెచ్చుకున్నాడు. నేను వాడిని పల్లెత్తు మాట అననని భార్గవికి ముందే కోపం. ఇవాళ జరిగిన దానికి వాడినెలా సమర్థించగలను?’ నిట్టూర్చాడు శ్యామలరావు.‘మీరెందుకు మధ్యలో మాట్లాడడం? వాడే చెప్పుకుంటాడు అమ్మకు’ ధన తండ్రికి ఉపశమనం కలిగించే సలహా ఇచ్చింది.ఇంట్లో ఏర్పడుతున్న అసౌకర్య సందర్భాలు ఎలా, ఎంత త్వరగా ముగుస్తాయా అని శ్యామలరావు ఆలోచించసాగాడు. మొబైల్లో ఏదో సందేశం వచ్చిన శబ్దం రావడంతో తెరిచి చూశాడు శ్యామలరావు. తమ పరివారం గ్రూప్లో సంతోష్ పెట్టిన సందేశం– ‘నాకు ఉద్యోగం వచ్చిందోచ్! వివరాలు ఇంటికొచ్చాక!’ధన, భార్గవి కూడా ఆ సందేశం చూశారు. భార్గవి గదిలో నుంచి బయటకు వస్తూ,‘వీడు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు, ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ ధన, శ్యామలరావు ఉన్న గదిలోకి వచ్చింది.‘విందాం వాడి నోటి నుండే’ అంది ధన.మరో పావుగంట తర్వాత చేతిలో ఐస్క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్తో ఇంటికి వచ్చిన సంతోష్ దాన్ని భార్గవి చేతికిస్తూ్త, ‘అమ్మా! నీకు ఇష్టమైన ఫ్లేవర్. నీ కోరిక తీరినందుకు’ అన్నాడు.‘ఎక్కడ ఉద్యోగం? ఏ కంపెనీ?’ అడిగింది ధన.‘అమ్మా వాళ్ళ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ కంపెనీలోనే’ సంతోష్ సమాధానం.‘ఇంటర్వ్యూ మిస్ అయ్యావుగా? ఆసక్తిగా ప్రశ్నించాడు శ్యామలరావు. భార్గవి మాత్రం పెదవి విప్పక – నేను వినడానికే ఉన్నాను – అన్నట్లు నిలబడి ఉంది.సంతోష్ చెప్పిన వివరం– నాకు మధ్యాహ్నం ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది. నేను తీయలేదు. తర్వాత నేనే చేశాను. అది మీ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ సీఈవో నంబర్. ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదు అని అడిగారు. ట్రాఫిక్ జామ్ గురించీ, తర్వాత వచ్చిన వర్షం గురించి చెప్పాను. ‘దగ్గర్లో ఉన్న కాఫీ షాప్కి వస్తే అక్కడ ఇంటర్వ్యూ చేస్తాను రాగలరా? ఇది మీకు మరో అవకాశం, మీరు ట్రాఫిక్ జామ్లో ఉండిపోయారు గనక, అందులో మీ తప్పు ఏమీ లేదని నేను నమ్మడం వలన!‘ అన్నాడు ఆయన. ఎగిరి గంతేసి సరే అన్నాను. సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ నిర్ణయించారు. నేను ఐదు నిమిషాల ముందే వెళ్లి ఒక పక్కన వేచి వున్నాను. మరో రెండు నిముషాలకి సూట్ వేసుకున్న ఒకాయన నా దగ్గరకు వచ్చి, చెయ్యి కలిపి నన్ను పేరుపెట్టి పిలుస్తూ రవీంద్ర వాళ్ళ కంపెనీ సీఈవోగా పరిచయం చేసుకున్నాడు. ఎక్కడో చూసినట్లు అంపించినా గుర్తురాక, ‘నా పేరు మీకెలా తెలుసు?’ అన్నాను ఆశ్చర్యంగా.‘మీ అప్లికేషన్లో ఉందిగా’ అంటూ కోటు జేబులోంచి నా అప్లికేషన్ తీసి చూపిస్తూ, ఒక టేబుల్ వైపు నడిచాడు. ఆయన వెనకాలే నేను వెళ్లి కూర్చున్నాను. ఆయన చెప్పాడు, ‘పొద్దున అదే ట్రాఫిక్ జామ్లో నేను కూడా ఇరుక్కుపోయా! చాలా అర్జెంట్ పనిమీద వెళుతున్నాను. ఆ రద్దీలో దేవుడు పంపినట్టు సమయానికి మీరు వచ్చి చొరవ తీసుకొని ట్రాఫిక్ను నియంత్రించి ఉండకపోతే, నా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం నేను చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయి ఉండేవాడిని. మీ సాంఘిక బాధ్యతా ప్రవృత్తి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా పేరు చంద్రకాంత్. మీ నంబర్ నా ఫోన్లో మీరే ఫీడ్ చేశారు. అప్పుడు సూట్లో లేను. అందుకేనేమో ఇప్పుడు గుర్తుపట్టలేక పోయారు. సంతోష్, మిమ్మల్ని మా కంపెనీలో సామాజిక బాధ్యతా విభాగానికి అధిపతిగా నియమిస్తున్నా! మీకు ఇష్టమైతే రేపే జాయిన్ అవ్వచ్చు. ఇంకొక మాట, నేను షూట్ చేసి పోస్ట్ చేసిన మీ ట్రాఫిక్ కంట్రోల్ ఇనీషియేటివ్ వీడియో వైరల్ అయ్యింది. వేలలో లైక్స్ వచ్చాయి. మిమ్మల్ని మా ఉద్యోగిగా చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది’.చెప్పడం ముగించిన సంతోష్ని శ్యామలరావు, భార్గవి, ధన ముగ్గురూ చుట్టేసి ఆ సమయాన్ని ఒక ఫొటోగా ఘనీభవించారు! -
పద్మ–పిప్పలాదుల చరిత్ర
పద్నాలుగో మనువు ఇంద్రసావర్ణి. అతడి వంశంలో జన్మించిన అనరణ్యుడు చక్రవర్తిగా ఎదిగాడు. అతడు సప్తద్వీపాలను పరిపాలిస్తుండేవాడు. గొప్ప శివభక్తుడైన అనరణ్యుడు భృగుమహర్షిని బ్రహ్మగా చేసుకుని, వంద యజ్ఞాలను విజయవంతంగా పూర్తి చేసి, ఇంద్రపదవికి అర్హత పొందాడు. అయినా, స్వార్థరహితుడు కావడంతో ఇంద్రపదవిని తిరస్కరించాడు. అనరణ్యుడికి వందమంది కొడుకులు, పద్మ అనే ఒకే ఒక కూతురు కలిగారు. చక్రవర్తి దంపతులకు కొడుకులపై కంటే కూతురుపైనే ప్రేమ ఎక్కువ. పద్మకు యుక్తవయసు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని సంకల్పించి అనరణ్యుడు రాజులందరికీ స్వయంవరం కోసం ఆహ్వానపత్రాలు పంపాడు. ఇదిలా ఉంటే, లోకసంచారం చేస్తున్న పిప్పలాద మహర్షి ఒకనాడు ఒక గంధర్వుడు స్త్రీలతో జలక్రీడలు ఆడుతుండగా చూశాడు. ఆ దృశ్యం చూడటంతో పిప్పలాదుడికి వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది. అప్పటి నుంచి తపస్సు మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. ఒకనాడు యథాప్రకారం పుష్పభద్రా నదిలో స్నానం చేస్తున్న పద్మను చూశాడు. ఆమె అందచందాలకు ఆకర్షితుడై, అక్కడే ఉన్న ఆమె చెలికత్తెలను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె అనరణ్య చక్రవర్తి కుమార్తె అని, త్వరలోనే ఆమెకు స్వయంవరం జరగబోతోందని చెలికత్తెలు చెప్పారు. పిప్పలాదుడు నేరుగా అనరణ్యుడి రాజసభకు వెళ్లాడు. అనరణ్యుడు అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ‘రాజా! నీ కుమార్తె పద్మను నేను మోహించాను. నాకు ఆమెనిచ్చి వివాహం జరిపించు. లేకుంటే, నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తాను’ అన్నాడు. పిప్పలాదుడి కోరిక విని రాజసభలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. వారంతా అతడి తేజస్సు చూసి భయభ్రాంతులయ్యారు.వృద్ధుడైన పిప్పలాదుడికి సుకుమారి అయినా రాకుమార్తెను ఇవ్వడం ఇష్టంలేక రాజకుటుంబంలోని స్త్రీలందరూ రోదించడం ప్రారంభించారు. విపత్కరమైన ఈ పరిస్థితిలో ఏంచేయాలో అనరణ్యుడికి ఏమీ తోచలేదు. వెంటనే అతడు రాజగురువును, రాజపురోహితుడిని సంప్రదించాడు. ‘ఈ విపత్కర స్థితిలో ఆచరించదగిన ధర్మమేమిటో మీరే చెప్పండి’ అని వారిని అడిగాడు.‘ఒక్కరి కారణంగా సర్వనాశనం జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు, ఆ ఒక్కరినీ త్యాగం చేసి, సర్వాన్నీ కాపాడుకోవాలి. ఇదే వేదధర్మం’ అని వారు చెప్పారు. రాజగురువు, రాజపురోహితుడు ఇచ్చిన సలహాపై అనరణ్యుడు తన కూతురు పద్మను పిప్పలాదుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం తర్వాత పిప్పలాదుడు తనతో పాటే పద్మను అరణ్యంలోని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. ఆమె ఆశ్రమవాసంలో ఉంటూ, భర్తను భక్తిశ్రద్ధలతో సేవించుకోసాగింది. భర్త మనసెరిగి ప్రవర్తించసాగేది. అలా పద్మా పిప్పలాదుల దాంపత్యం అన్యోన్యంగా కొనసాగేది. ఒకనాడు పద్మ నదిలో స్నానం చేసి, నీళ్లకడవ నెత్తిన పెట్టుకుని, ఆశ్రమానికి తిరిగి వస్తోంది. ఆమెను పరీక్షించదలచిన ధర్ముడు రాజవేషంలో ఆమెకు దారిలో ఎదురయ్యాడు. నానాలంకార భూషితుడై, నవయవ్వనంతో మెరిసిపోతున్న ధర్ముడు అపరమన్మథుడిలా ఉన్నాడు. ధర్ముడు పద్మను అడ్డగించి, ‘ఓ సుందరీ! నువ్వెవరివి? నీ తల్లిదండ్రులెవరు? నీ సౌందర్యానికి నేను దాసుడిని. నిన్ను పెళ్లాడాలనుకుంటున్నా’ అన్నాడు.పద్మ అతడి ప్రశ్నలకు ముక్తసరిగా బదులిచ్చి, ‘నాకు పెళ్లయింది. నా భర్త పిప్పలాద మహర్షి’ అని చెప్పింది.‘ఓహో! ఆ తలనెరిసి, శరీరం ముడుతలు పడిన వృద్ధుడేనా నీ భర్త! నిండుజాబిలిలాంటి అందగత్తెవు నీవెక్కడ? పండుకోతిలాంటి వృద్ధుడు ఆ పిప్పలాదుడెక్కడ? నీ సౌందర్యం రాజపూజితం. నీవంటి సౌందర్యరాశి నాలాంటి రాజులకే తగును గాని, ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే మునిముచ్చులకు కాదు. నువ్వు నాతో రా! స్వర్గసౌఖ్యాలను అనుభవించవచ్చు’ అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు.పద్మకు సహనం నశించింది. ‘ఓరీ పాపాత్ముడా! దూరంగా ఉండు. పరస్త్రీని కామంతో చూసిన నువ్వు తప్పక నశిస్తావు. తపోధనుడైన నా భర్త పిప్పలాడుదెక్కడ? కామాతురుడవై, ఉచితానుచిత జ్ఞానంలేని నువ్వెక్కడ? కాలగతిలో నీకు క్షయం తప్పదు’ అని శపించింది.ఆమె శాపానికి ధర్ముడు గడగడలాడాడు. రాజవేషాన్ని విడిచి, నిజరూపంలో దర్శనమిచ్చాడు. ‘తల్లీ! నేను ధర్మదేవుడిని. గురువులకు గురువును. ఈశ్వర ప్రేరేపితుడనై, ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్తి చేశావు. తల్లీ! నా శాపవిమోచనాన్ని కూడా నువ్వే అనుగ్రహించు’ అని అభ్యర్థించాడు.పశ్చాత్తాపం చెందిన పద్మ, ‘ధర్ముడా! పతివ్రతా శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ క్షోభిస్తాయి. అందువల్ల నేనొక వ్యవస్థను నిర్ణయిస్తున్నాను. కృతయుగంలో నువ్వు నిండు చంద్రుడిలా పరిపూర్ణంగా ఉంటావు. ఆ తర్వాత త్రేతా, ద్వాపర, కలి యుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షీణిస్తూ ఉంటావు. కలియుగాంతం నాటికి అమావాస్య చంద్రుడిలా పూర్తిగా అదృశ్యమైపోతావు. కలియుగాంతం తర్వాత తిరిగి ఆరోహణ క్రమంలో వచ్చే ద్వాపర, త్రేతా, కృతయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ పరిపూర్ణ స్థితిని పొందుతావు. ఇక నేను నా భర్త దగ్గరకు వెళతాను’ అని పలికింది.అప్పుడు ధర్ముడు ‘ఓ పతివ్రతా శిరోమణీ! నీకు మంగళమగుగాక. నీ భర్త పిప్పలాదుడికి నిత్యయవ్వనం సిద్ధిస్తుంది. అతడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు. నీకు సర్వసౌఖ్యాలు కలుగుతాయి’ అని దీవించి అదృశ్యమయ్యాడు.∙సాంఖ్యాయన -
తీరంలో తూటా.. సీటీలో బాంబు
కర్ణాటకలోని తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు అనుసరించే పద్ధతే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ల్లో విధ్వంసం సృష్టించడానికి తయారు చేసిన బాంబులకు చేపల వేటే ఆధారమైంది. ఈ కేసుల్లో ఆరుగురిలో ఐదుగురికి ఇటీవల హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే! కర్ణాటక తీరంలో చేపల వేటకు, హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్లకు మధ్య సంబంధం ఏంటి..?దేశంలోని తొమ్మిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారడంతో ఐఎం సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2009లో పాకిస్తాన్ వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఎక్కడ పేలుళ్ల పాల్పడాలన్నా అవసరమైన బాంబుల తయారీకి కావలసిన అమోనియం నైట్రేట్ను అతడే సమీకరించే వాడు. పాకిస్తాన్కు మకాం మార్చాక దీన్ని సమీకరించే బాధ్యతల్ని భత్కల్లోని తన ఇంటి సమీపంలో నివసించే హోమియో డాక్టర్ అఫాఖీకి అప్పగించాడు.అఫాఖీ 2005లో పాకిస్తాన్లోని కరాచీకి చెందిన అర్సాలా అబీర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల అఫాఖీ పాకిస్తాన్కు రాకపోకలు సాగించేవాడు. అక్కడి బంధువులతో తరచు ఫోన్లో మాట్లాడేవాడు. ఈ కారణంగా తాను ఫోనులో మాట్లాడినా, పాకిస్తాన్కు వచ్చినప్పుడు కలిసినా పోలీసులు, నిఘా వర్గాలు అనుమానించరనే ఉద్దేశంతోనే అఫాఖీని రియాజ్ భత్కల్ ఎంచుకున్నాడు. 2009, 2011ల్లో పాకిస్తాన్ వెళ్లిన అఫాఖీ నేరుగా రియాజ్ను కలిసి వచ్చాడు. 2010 నుంచి పేలుడు పదార్థం సరఫరా బృందం నాయకుడిగా మారాడు.రియాజ్ భత్కల్ నుంచి కోడ్వర్డ్స్ రూపంలో ఈ–మెయిల్ ద్వారా అందే ఆదేశాల మేరకు అఫాఖీ పని చేశాడు. బాంబుల తయారీ కోసం పేలుడు పదార్థాల సమీకరణకు అనేక మార్గాలు అన్వేషించాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ (ముద్దలా ఉండే పదార్థం) ప్యాకెట్లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైరు జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెడతారు. ఈ కుండకు తక్కువ బరువు కట్టి వేటాడటానికి వాడుతున్న పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న చేపలన్నీ చనిపోయి పైకి తేలతాయి. ఇలా చేపల వేట వారికి తేలికవుతుంది. కేవలం మత్స్యకారులే కాకుండా సముద్రంలో విహారయాత్రలకు వచ్చే యువకులు కూడా సరదా కోసం మీన్ తూటాలను వాడి చేపలు పడుతుంటారు. దీనిపై నిషేధం ఉన్నా, అప్పట్లో కర్ణాటక అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం అఫాఖీకి కలిసొచ్చింది. ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడటంతో నిర్మాణరంగంలో బ్లాస్టింగ్స్ కోసం వినియోగించే అమోనియం నైట్రేట్ స్లర్రీ విక్రయానికి అక్కడి వారు పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్ తూటా’లు అమ్మేశారు. ఈ లోటుపాట్లను అధ్యయనం చేసిన అఫాఖీ పేలుడు పదార్థం సమీకరణకు మత్స్యకారుల మార్గాన్ని ఎంచుకున్నాడు. మైనార్టీల అభివృద్ధి కోసమంటూ కర్ణాటకలో పని చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థలోనూ అఫాఖీ చురుకుగా వ్యవహరించే వాడు. ఇదే సంస్థలో సభ్యుడిగా ఉన్న స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్పై ఇతడి కన్నుపడింది. చలాకీగా ఉండే సద్దాంకు మాయమాటలతో ఎరవేసిన అఫాఖీ ‘మీన్ తూటా’ల కొనుగోలుకు వినియోగించుకున్నాడు. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాలని చెబుతూ ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అఫాఖీ ఈ మీన్ తూటాలను తనతో ఏడాదికి ఒకటి రెండుసార్లే తెప్పిస్తుండటంతో సద్దాంకు అనుమానం రాలేదు. ఇలా తీసుకువచ్చిన స్లర్రీని కొన్ని రోజులు దాచి ఉంచడానికి కర్ణాటకలోని భత్కల్లో ఉన్న మదీనా కాలనీలో దారుల్ ఖాయర్ పేరుతో ఉన్న ఇంటిని అఫాఖీ వినియోగించాడు. అమోనియం నైట్రేట్ స్లర్రీ దుర్వినియోగం కాకుండా దాని ఉత్పత్తిలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్ఠంగా ఆరు నెలల్లోపు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తరవాత పెద్దగా ప్రభావం చూపదు. అఫాఖీ మాడ్యుల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010 ఏప్రిల్ 17), పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లలో (2012 ఆగస్టు 1) నాటి పేలుళ్లకు సరఫరా చేసిన స్లర్రీ ఎక్స్పైరీ డేట్ దాటేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా పేలుడు తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2015 జనవరి 8న అఫాఖీతో పాటు అతడి అనుచరులను అరెస్టు చేసింది. 2024 డిసెంబర్ 16న బెంగళూరులోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వీరికి దోషులుగా తేల్చింది. ‘మీన్ తూటా’లు పేలింది ఇక్కడే... 2010 ఫిబ్రవరి 13: పుణేలోని జర్మన్ బేకరీలో పేలుడు. ఇక్కడ 17 మంది మృతిచెందగా 60 మంది క్షతగాత్రులయ్యారు. 2010 ఏప్రిల్ 17: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రెండు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనలో 15 మంది క్షతగాత్రులయ్యారు. 2011 జూలై 13: ముంబైలోని దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్ల వద్ద మూడు పేలుళ్ళు. ఇందులో 21 మంది చనిపోగా 131 మంది క్షతగాత్రులయ్యారు. 2012 ఆగస్టు 1: పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లో నాలుగు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 21: హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద జంట పేలుళ్ళు. వీటిలో 18 మంది చనిపోగా, 119 మంది గాయపడ్డారు. -
యువ కథ: నాన్నతో ఒక రోజు..
‘‘నాన్నా ఎలా ఉన్నావు?’’ సుందర్ తన బ్యాగుతో గుమ్మంలో అడుగుపెట్టాడు.ఇంట్లో తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్న సుబ్బారావు ఆ గొంతు విని తలెత్తి చూశాడు. ‘‘అరె సుందరం.. ఇదేనా రావడం?’’ అంటూ పేపర్ పక్కన పెట్టి లేచి బ్యాగు అందుకున్నాడు సుబ్బారావు. ‘‘శాంతా.. చూడు సుందరం వచ్చాడు’’ అని లోపలే ఉన్న శాంతకి చెప్పాడు సుబ్బారావు.‘‘నాన్నా సుందరం ఏంటి! సుందర్ అని పిలవచ్చు కదా!’’ సుందర్ చిన్నగా చిరాకు పడ్డాడు. ‘‘హహ! అలాగేరా.. సుందరం మా నాన్నగారి పేరు. అందుకే పిలిచినప్పుడల్లా నాన్నని పిలుస్తున్నట్టు అనిపిస్తుందిరా..’’ నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు. ‘‘అలాగేలే.. అలానే పిలువు నాన్నా నాకేం సమస్య లేదు!’’ అన్నాడు సుందర్.‘‘వస్తున్నానని కనీసం ఫోన్ కూడా చేయలేదు!’’ వంటగదిలోంచి వస్తూ అడిగింది శాంత. ‘‘అదేం లేదమ్మా, పాలకొల్లులో మన సురేష్గాడి పెళ్లి నిన్న. వచ్చేదాకా అస్సలు వదల్లేదు. అందుకే హుటాహుటిన రెండు రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చేశాను!’’ అని చెబుతూ లోపలికి వెళ్ళి నీరసంగా కూర్చున్నాడు సుందర్.‘‘శాంతా వాడు బాగా అలిసిపోయినట్లు ఉన్నాడు. తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. నేనిప్పుడే అలా బయటికి వెళ్లి వస్తాను..’’ అంటూ గొడుగు తీసుకుని వర్షంలో బయలుదేరాడు సుబ్బారావు.సుందర్ హైదరాబాద్ లోని ‘ఇన్ఫినిటీ’ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పాలకొల్లు వదిలి వెళ్లి ఇప్పటికి ఏడేళ్ళు అయ్యింది. పండగలకో, పబ్బాలకో ఏ సంవత్సరానికో ఒకసారి వచ్చి నాలుగు రోజులు కూడా గడపకుండా హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు.‘‘ఏం బాబూ ఆ పులస ఎంతకిస్తావ్?’’ అంటూ వర్షంలో ఆ ఊరి చెరువు దగ్గర చేపలు పడుతున్న మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి బేరం ఆడుతున్నాడు సుబ్బారావు.‘‘ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళండి.. మీ దగ్గర డబ్బులు ఎటు పోతాయి!’’ అంటూ మంచి పులస చేపని సంచిలో వేసి ఇచ్చాడు వీరయ్య. వీరయ్య అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఇచ్చి పట్టుకొని ఇంటికి వచ్చేశాడు సుబ్బారావు.వర్షం ఓ మాదిరిగా చిన్నగా కురుస్తోంది. పట్టుకొచ్చిన చేపని శాంతకి ఇచ్చి, ‘‘ఇది వాడికి చాలా ఇష్టం మంచిగా పులుసు చెయ్ వాడికి మళ్ళీ అక్కడ దొరకదు’’ అని చెప్పి బయట వరండాలోకి వెళ్లి కూర్చున్నాడు.ఇంటికి వచ్చినా సుందర్కి తీరిక లేదు. కంపెనీ నుంచి ఏవేవో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంక లాభం లేదని ఫోన్ పక్కన పడేసి, గదిలోంచి బయటికి వచ్చాడు సుందర్. ‘‘అమ్మా! నాన్నెక్కడ? సాయంత్రం నుంచి కనబడలేదు’’ అని శాంతని అడిగాడు. ‘‘బయట వరండాలో ఉన్నాడేమో చూడు..’’ అంటూ చేపల పులుసు పెడుతూ చెప్పింది శాంత.వరండాలో తీరిగ్గా పడక్కుర్చీలో కాళ్ళు చాపి పాత పుస్తకమేదో చదువుతూ కూర్చున్నాడు సుబ్బారావు. ఆ పడక్కుర్చీ చూడగానే ఎన్నో జ్ఞాపకాలు, మధురానుభూతులు గుర్తొచ్చాయి సుందర్కి. ‘‘నాన్నా’’ అంటూసుబ్బారావు దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. సుబ్బారావు వెంటనే చేతిలో ఉన్న పుస్తకం మూసి కళ్ళజోడు తీస్తూ ‘‘కూర్చోరా’’ అని ప్రేమగా అన్నాడు.ఆ పుస్తకం తీసుకుని ‘‘ఎన్ని రోజులైంది నాన్నా ఈ పుస్తకం చూసి.. చిన్నప్పుడు బాగా చదివేవాణ్ణి. ‘బారిస్టర్ పార్వతీశం’ నిజంగానే ఉన్నాడేమో అనేంతలా కలలు కనేవాడిని!’’ అంటూ ఆప్యాయంగా పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చెప్పాడు సుందర్.‘‘ఈ కుర్చీకి, నాకు విడదీయలేని సంబంధం ఉంది. చిన్నప్పుడు ఇక్కడే రాత్రి అమ్మ అన్నం తినిపించాక, తాతయ్య ఈ కుర్చీలో కూర్చొని ఆ ఆకాశాన్ని, నిండు జాబిలిని చూపిస్తూ మంచి మంచి కథలు, చెప్పేవాడు. నేను, కౌసల్య, శీనుగాడు గాల్లో తేలిపోతున్నట్టుగా వినేవాళ్ళం. అప్పుడే చాలా బావుండేది నాన్నా.. పెరిగే కొద్దీ జీవితం ఇంకా భారంగా, బాధగా ఉంది.’’ అంటూ బాధగా చెప్పాడు సుందర్.ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందుకి వచ్చాయి సుబ్బారావుకి. ఇరవై ఏళ్ల ముందు జీవితం చాలా బావుండేది. సుబ్బారావు అదే ఊళ్ళో పోస్ట్మన్గా చేసేవాడు. అప్పట్లో ఉత్తరాలు, మనీ ఆర్డర్లు బాగానే వచ్చేవి. పని కూడా చాలా ఎక్కువే ఉండేది. కాలం గడిచేకొద్దీ కొద్దిరోజుల్లోనే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు అన్నీ వచ్చేశాయి. ఈ–మెయిల్ వంటివి వచ్చాక పరిస్థితి మారిపోయింది. గవర్నమెంట్ లెటర్స్ తప్ప అసలు ఇంకే ఉత్తరాలు రావడం లేదు. ఒకప్పుడు సంచి నిండా ఉత్తరాలు ఉండేవి. ఊరంతా తన పాత సైకిల్పై తిరిగి సాయంత్రంలోగా అన్నీ చేర్చేవాడు. ఉత్తరం తీసుకున్నవారి మొహంలో ఆనందం, ఉల్లాసం మనసుకి ఎంతో తృప్తినిచ్చేది. అలా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు అన్నీ ఆగిపోయాయి. ఉద్యోగం ఉంది గాని, చేయడానికి పనేలేదు. రోజంతా ఆఫీసులోనే ఖాళీగా ఉండేవాడు సుబ్బారావు. జాలేసింది, చాలా బాధేసింది. కొద్దిరోజుల్లోనే పోస్ట్మన్ ఉద్యోగానికి ఇంకా మూడేళ్లు టైమ్ ఉన్న వెంటనే రిటైర్మెంట్ తీసుకున్నాడు సుబ్బారావు.‘‘నిజంగా ఆ రోజులే చాలా బావుండేవిరా..’’ అంటూ గోడకు తగిలించిన పాత ఉత్తరాల సంచి వైపు చూసి కంటతడి పెట్టుకున్నాడు సుబ్బారావు. ‘‘అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఇరవైమందితో ఇల్లు కళకళలాడేది. వాళ్ళు చనిపోగానే ఎవరికి వాళ్ళు గొడవలతో, ఆస్తుల విభజనలో, మనస్పర్థలతో చివరికి ఇప్పుడు మీరిద్దరూ అంతే! ఊర్లో మనదే పాత మండువా ఇల్లు నాన్నా.. ఇది ఇలానే ఉండాలి ఎన్ని సంవత్సరాలైనా..’’ అంటూ బాల్య జ్ఞాపకాల్ని తలచుకున్నాడు సుందర్.‘‘అసలు ఇప్పుడు పోస్ట్మన్ గురించి కనీసం పుస్తకాల్లో అయిన చెబుతున్నారా.. కనీసం మేము అనేవాళ్ళం ఉండేవాళ్ళం అని కూడా తెలియనంతగా అభివృద్ధి చెందింది ప్రపంచం!’’ అంటూ కళ్ళజోడు తీసి కళ్లు తుడుచుకున్నాడు సుబ్బారావు. ‘‘నిజమే నాన్నా! అసలు ఆగకుండా పరుగెడుతూనే ఉంది ప్రపంచం. మన కోసమో, మన ఆనందం కోసమో కూడా ఆగకుండా పరుగులు తీస్తోంది.’’ అన్నాడు సుందర్.వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా పక్కనే ఉండి వింటూ తను కూడా ఆ పాత రోజులను తలచుకొని బాధపడింది శాంత. ‘భోజనానికి లేవండి’ అని పిలిచింది. ఆమె పిలుపుతో జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి తండ్రీ కొడుకులిద్దరూ భోజనానికి కూర్చున్నారు.ఆ రాత్రి టీవీకి, ఫోన్లకి దూరంగా ఉండి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ముగ్గురూ భోంచేశారు. ‘అదేంటో ఊరికి వచ్చిన తరువాత మన సొంత ఇంట్లో, సొంత గదిలో పట్టినంత నిద్ర ఆ అద్దెకొంపల్లో, నగరపు వాతావరణంలో అస్సలు పట్టదు. పల్లెటూర్లో పుట్టడం కూడా ఒక అదృష్టమే!’ అనుకుంటూ ఆ రాత్రి ఉన్న బాధలన్నీ మర్చిపోయి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు సుందర్.తెల్లవారుజామునే అలారం పెట్టే శబ్దాలతో కాకుండా కోడి కూతతో నిద్రలేచి, సిటీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుందర్. అమ్మానాన్నలను మనసారా హత్తుకొని బయటికి నడిచాడు.తెలీకుండానే సంవత్సరం గడిచిపోయింది. సుందరం ఇంటికి వచ్చి కూడా ఏడాది అయింది. ఒక సాయంత్రం వేళ సుబ్బారావు, శాంత ఇద్దరూ నిశ్శబ్దంగా వరండాలో కూర్చున్నారు. సుబ్బారావు ఆ పాత సైకిల్ని చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు.‘‘అదేంటండీ అలా చూస్తున్నారు?’’ శాంత అడిగింది.‘‘ఏం లేదు శాంతా.. ఈ సైకిల్తో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఊరంతా తిరుగుతూ ఉత్తరాలు పంచేవాణ్ణి. ఆ రోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు ఎంత గాఢంగా ఉండేవో కదా! ఇప్పుడు అంతా యాంత్రికమైపోయింది’’ సుబ్బారావు నిట్టూర్చాడు.‘‘అవునండీ.. రోజులు మారిపోయాయి. మనుషులూ మారిపోయారు. మన సుందర్ కూడా ఎంత మారిపోయాడో!’’ శాంత బాధగా అంది.‘‘అవును శాంతా.. డబ్బు సంపాదించాలనే తపనలో మనుషులు తమ మూలాల్ని, బంధాల్నిమరచిపోతున్నారు. కాని, సుందర్కి తన తప్పు తెలిసొచ్చింది. మళ్ళీ మన దగ్గరకు వస్తాడనే నమ్మకం నాకుంది’’ సుబ్బారావు ఆశగా అన్నాడు.‘‘మీ నోట బంగారం అండీ’’ శాంత కళ్ళల్లో ఆనందం మెరిసింది.సాయంత్రం ఆరు అయింది. సుబ్బారావు, శాంత ఇద్దరూ వరండాలో కూర్చున్నారు.అప్పుడే సుందర్ కారు ఇంటి ముందు ఆగింది. సుబ్బారావు, శాంత ఆశ్చర్యంగా చూస్తుండగానే సుందర్ కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు.‘‘నాన్నా.. అమ్మా.. నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇకపై మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను. మీతోనే ఉంటాను’’ సుందర్ కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.సుబ్బారావు, శాంత ఆనందంతో సుందర్ని హత్తుకున్నారు. ఆ క్షణం వాళ్ళ ముగ్గురి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి వాళ్ళు ముగ్గురూ కలిసి పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు.మర్నాడు ఉదయం సుందర్ తన సామాన్లు సర్దుకుని తల్లిదండ్రులతో కలిసి పాలకొల్లులోనే ఉండిపోయాడు. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాడు. ఆ పాత మండువా ఇల్లు మళ్ళీ కళకళలాడింది. -
నాట్యవేదం జీవననాదం
సర్వ శాస్త్ర సంపన్నంసర్వ శిల్ప ప్రవర్తకంనాట్యాఖ్యం పంచమం వేదంసేతిహాసం కరోమ్యహమ్పంచమవేదంగా పరిగణించదగిన సమస్త శిల్ప శాస్త్రేతిహాసాల సమాహారమైన నాట్యశాస్త్రాన్ని భరతముని మనకు అందించాడు. ఆరు లలితకళలలో నాట్యం ఒకటైనా, నాట్యకళకు మిగిలిన కళలు లేకుండా నాట్యం పరిపూర్ణం కాదు. మిగిలిన కళలన్నీ నాట్యానికి హంగులు సమకూర్చేవే! నాట్యం సమాహార కళ. సహస్రాబ్దాల కిందటే నాట్యానికి శాస్త్రబద్ధత ఏర్పడినా, నాట్యం పండిత పామర జనరంజకమైన కళ. ఆబాల గోపాలాన్నీ అలరించే అద్భుతమైన కళ.ఏప్రిల్ 29 అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.సంగీతం మాదిరిగానే నాట్యం కూడా విశ్వజనీనమైన కళ. వివిధ నాగరికతలలో ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రూపుదిద్దుకున్న నాట్యకళ కాలానుగుణంగా అనేక మార్పులకు లోనైంది. నాట్యకళ పుట్టు పూర్వోత్తరాల గురించి ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కాదు గాని, నాట్యం తొలిసారిగా శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నది మాత్రం మన భారతదేశంలోనే! దాదాపు రెండువేల ఏళ్ల కిందటే భరతముని సంస్కృతంలో ‘నాట్యశాస్త్రం’ రచించాడు. నాట్యకళకు సంబంధించి ప్రపంచంలో ఇదే తొలి శాస్త్రీయ గ్రంథం. రెండువేల ఏళ్ల కిందటే నాట్యం శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నదంటే, నాట్యం ఉనికి అంతకు చాలా ముందు నుంచే ఉండవచ్చని ఊహించవచ్చు. మన పురాణాలలో నాట్య ప్రస్తావన కనిపిస్తుంది. పరమశివుడిని నాట్యానికి ఆదిదేవుడిగా పరిగణిస్తారు. శివుడిని నటరాజ రూపంలో కూడా ఆరాధిస్తారు. శివతాండవంతో పాటు కాళీయమర్దనం చేసిన తాండవకృష్ణుడి లీలావినోదం మన పురాణాల్లో ఉంది. అజ్ఞాతవాస కాలంలో బృహన్నలగా మారిన అర్జునుడు నాట్యాచార్యుడిగా విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం నేర్పించిన ఉదంతం మహాభారతంలో ఉంది. మన పురాణాల ప్రకారం స్వర్గలోకంలోని అప్సరసలందరూ నర్తకీమణులే! నాట్యకళ ప్రాచీనతకు మన పురాణేతిహాసాలే సాక్ష్యాలు. కాలగతిలో జరిగిన అనేక పరిణామాలకు భారతదేశంలోని శాస్త్రీయనృత్యం రకరకాలుగా రూపాంతరాలు చెందింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విలక్షణమైన శాస్త్రీయనృత్యంగా పరిణామం చెందింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ మన దేశంలోని ఎనిమిది రకాల నాట్యశైలులను శాస్త్రీయ నృత్యాలుగా గుర్తించింది. ఈ ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యాలలో అనేక మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికీ ఎందరో యువతరం కళాకారులు ఈ శాస్త్రీయ నృత్యాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు చేస్తూ, నాట్యకళలో భారతదేశ ఖ్యాతిని చాటి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యరీతులు, వాటి కథా కమామిషు తెలుసుకుందాం..భరతనాట్యంభరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందించిన ప్రాచీన నాట్యశైలి భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టింది. కణ్ణగి విషాదగాథపై రచించిన తమిళ పౌరాణిక గ్రంథాలు ‘సిలప్పటిగారం’లోను, ‘మణిమేగలై’లోను భరతనాట్య ప్రస్తావన కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుశకం రెండోశతాబ్ది నాటిది. ఆ తర్వాతి కాలంలో దక్షిణాదిలో వెలసిన వివిధ దేవాలయాల గోడలు, స్తంభాలపై ఉన్న నాట్యభంగిమలు భరతనాట్య నృత్యభంగిమలకు నిదర్శనంగా నిలుస్తాయి. నటరాజ రూపంలోని శివుడి 108 భంగిమలనే భరతనాట్యంలో ‘కారణ’భంగిమలుగా పరిగణిస్తారు. రాచరికాలు కొనసాగిన కాలంలో వివిధ రాజ్యాలలో భరతనాట్యానికి రాజాదరణ ఉండేది. ఆనాటి కాలంలో దేవాలయ సంప్రదాయాలలో భాగంగా దేవదాసీలు భరతనాట్య పరంపరను కొనసాగించారు. బ్రిటిష్ పరిపాలన మొదలయ్యాక మన దేశంలోని శాస్త్రీయ నృత్యరీతులకు గడ్డుకాలం మొదలైంది. ఒక దశలో బ్రిటిష్ ప్రభుత్వం దేవాలయాల్లో దేవదాసీల నాట్య ప్రదర్శనలను నిషేధించింది. ఆదరణ కరవై, దారుణమైన గడ్డు పరిస్థితులు తలెత్తినా, ఎందరో నాట్య కళాకారులు ఈ పరంపర అంతరించిపోకుండా కాపాడగలిగారు. వారి కృషి ఫలితంగానే, ఈనాడు భారతీయ శాస్త్రీయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందగలుగుతున్నాయి. దేవాలయాల్లో నాట్య ప్రదర్శనల నిషేధం తర్వాత ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లోనే నాట్య కళాకారులు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది. అప్పట్లో రుక్మిణీదేవి అరండేల్, తంజావూరు బాలసరస్వతి వంటి కళాకారిణులు భరతనాట్యంలో అగ్రగాములుగా రాణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన శాస్త్రీయ నృత్యరీతులకు పునరుజ్జీవం మొదలైంది. ఆరితేరిన గురువుల ఆధ్వర్యంలో నాట్య శిక్షణ కేంద్రాలు ప్రారంభయ్యాయి. క్రమంగా దేశ విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా భారతీయ శాస్త్రీయ నృత్యానికి చోటు దక్కింది. చైనాకు చెందిన ఝాంగ్ జున్ 1950లలోనే భరతనాట్యాన్ని చైనాకు పరిచయం చేశారు. చైనాలో ఆమె చేసిన ప్రదర్శన అక్కడివారిని అబ్బురపరచింది. యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలమేల్ వల్లి వంటి కళాకారులు భరతనాట్యం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. నర్తకీమణులైన వైజయంతిమాల, హేమమాలిని వంటి సినీతారల వల్ల భరతనాట్యానికి జనాదరణ మరింతగా పెరిగింది. పలువురు విదేశీ విద్యార్థులు కూడా భరతనాట్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారిలో కొందరు ప్రదర్శనల్లోనూ రాణిస్తున్నారు.కూచిపూడిమన తెలుగునేల మీద పుట్టిన శాస్త్రీయ నృత్యరీతి కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఈ నృత్యశైలి రూపుదిద్దుకోవడంతో దీనికి ఆ పేరు వచ్చింది. క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికే కూచిపూడి నృత్యం ఉన్నట్లు రాగిరేకుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వైత సన్యాసి నరహరి తీర్థుల శిష్యులలో ఒకరైన సిద్ధేంద్ర యోగి పదిహేడో శతాబ్దిలో ఆధునిక కూచిపూడి నృత్యశైలికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేశారు. వైష్ణవ సంప్రదాయ ప్రభావం వల్ల కూచిపూడి నృత్యంలో కృష్ణుడి లీలావిలాసాలే ప్రధానాంశాలు. కృష్ణలీలల నృత్యాభినయం తంజావూరు ప్రాంతంలో ‘భాగవత మేళా’గా పేరుపొందింది. కూచిపూడి నృత్య కళాకారులు తెలుగునేల మీద భాగవతులుగా, తమిళనాడులో భాగవతార్లుగా పేరుపొందారు. నారాయణ తీర్థులు రచించిన కృష్ణలీలా తరంగిణిని కూచిపూడి భాగవతులు విరివిగా ప్రదర్శించేవారు. అప్పట్లో కళింగరాజ్యం మొదలుకొని తంజావూరు రాజ్యం వరకు వీరికి గొప్ప ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలో మిగిలిన నృత్యరీతుల మాదిరిగానే కూచిపూడి కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయినా, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి వెంకటనారాయణ శాస్త్రి, వెంపటి చిన వెంకటరామయ్య శాస్త్రి వంటి వారు కూచిపూడి సంప్రదాయం కొడిగట్టిపోకుండా కాపాడారు. స్వాతంత్య్రానంతరం ఇంద్రాణి రహమాన్, యామినీ కృష్ణమూర్తి, శోభా నాయుడు వంటివారు విదేశాల్లో ప్రదర్శనలు చేసి, కూచిపూడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. వారి ప్రభావంతో పలువురు విదేశీ విద్యార్థులు కూడా కూచిపూడి నృత్యం పట్ల ఆకర్షితులై నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.ఒడిస్సీఒడిశాలో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి ఒడిస్సీ. కళింగ రాజ్యంలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి తొమ్మిదో శతాబ్ది మధ్య కాలంలో ఒడిస్సీ నృత్యశైలి ప్రత్యేకమైన శాస్త్రీయ నృత్యంగా రూపుదిద్దుకుంది. ఒడిస్సీ నృత్య ప్రస్తావన ఆనాటి జైన, బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. పూరీ, కోణార్క తదితర దేవాలయాల రాతి గోడలు, స్తంభాలపై కనిపించే నాట్య భంగిమలు ఒడిస్సీ నృత్యశైలి ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తాయి. పదిహేడో శతాబ్ది వరకు ఒడిస్సీ నృత్యానికి రాజాదరణ బాగా ఉండేది. పద్నాలుగో శతాబ్దిలో ఖుర్దా రాజు ఒడిస్సీ నృత్యంలో ‘గొటిపువొ’ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించారు. గురుకులంలో పరంపరాగతంగా నృత్యశిక్షణ పొందే బాలురను ‘గొటిపువొ’ అంటారు. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఎందరో కవులు, పండితులు, నర్తకులు ఒడిస్సీ నృత్య సంప్రదాయం కనుమరుగు కాకుండా కాపాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘కవిచంద్ర’ కాళీచరణ్ పట్నాయక్ వంటి కవి పండితులు, కేలూచరణ్ మహాపాత్రో, పంకజ్చరణ్ దాస్, సంజుక్తా పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్ తదితరులు ఒడిస్సీ నృత్యానికి పునరుజ్జీవం కల్పించి, అంతర్జాతీయ గుర్తింపు దక్కేందుకు దోహదపడ్డారు. కథాకళికేరళకు చెందిన శాస్త్రీయ నృత్యశైలి కథాకళి. ‘అట్టకథ’ సాహిత్య రూపంలోని నృత్యరూపకాలను కథాకళి కళాకారులు ప్రదర్శిస్తారు. ఇతర శాస్త్రీయ నృత్యరీతులతో పోల్చుకుంటే కథాకళి నర్తకుల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. ‘కుటియాట్టం’, ‘కృష్ణన్ అట్టం’ అనే ప్రాచీన సంస్కృత నాటక ప్రదర్శన ప్రక్రియల నుంచి పదహారో శతాబ్ది నాటికి కథాకళి ప్రత్యేక నృత్యశైలిగా రూపు దిద్దుకుంది. రసాభినయానికి అన్ని శాస్త్రీయ నృత్యరీతుల్లోనూ ప్రాధాన్యం ఉన్నా, ముద్రలు, భంగిమలు వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. కథాకళిలో మాత్రం నవరసాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కేరళ ప్రాంతంలోని ట్రావెన్కోర్, పాలక్కాడ్ సంస్థానాలు కథాకళి నృత్యాన్ని బాగా ఆదరించాయి. కథాకళి నృత్యంలో గురుకుల పరంపరలో శిష్యులను తయారు చేసే పద్ధతి పంతొమ్మిదో శతాబ్ది వరకు సాగింది. స్వాతంత్య్రానంతరం కథాకళి కళాకారులు ఒకవైపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కాలమండలం గోపి, కోట్టక్కల్ శివరామన్ వంటి కళాకారులు కథాకళి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు.మణిపురిఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి మణిపురి. దీనినే ‘మణిపురి రాసలీల’ అని, ‘జాగోయి రాస్’ అని కూడా అంటారు. మణిపురి నృత్యానికి మూలాలు ప్రాచీన మైతేయి నాగరికతలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మైతేయి రాజు చింగ్ థాంగ్ ఖోంబా ప్రస్తుతం ఉన్న మణిపురి నృత్యశైలికి నియమ నిబంధనలను రూపొందించారు. మణిపూర్ రాజ్యాన్ని పరిపాలించిన ఆయన ‘రాజర్షి భాగ్యచంద్ర’గా పేరుపొందారు. మణిపురి నృత్యంలో ఎక్కువగా కృష్ణ లీలలను, భాగవత గాథలను ప్రదర్శిస్తారు. జానపద మూలాల నుంచి రూపొందిన అరుదైన శాస్త్రీయ నృత్యశైలిగా మణిపురి నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం 1891లో మణిపూర్ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాక మణిపురి నృత్యానికి వైభవం సన్నగిల్లింది. అప్పట్లో ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగోర్ మణిపురి నృత్యానికి పునరుజ్జీవం కల్పించేందుకు ఎనలేని కృషి చేశారు. రాజ్కుమార్ సింఘజిత్ సింగ్, దర్శనా ఝావేరీ, కళావతీ దేవి, బింబావతి దేవి, నిర్మలా మెహతా వంటి నర్తకులు మణిపురి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తీసుకొచ్చారు.సాత్త్రియాఈశాన్య భారతదేశానికి చెందిన మరో శాస్త్రీయ నృత్యశైలి సాత్త్రియా. అసోంలోని సంప్రదాయ ‘అంకియా నాట’ అనే ఏకాంకిల ప్రదర్శనలో భాగంగా ‘భావన’ పేరుతో నృత్యాలను ప్రదర్శించేవారు. ‘అంకియా నాట’ ప్రక్రియను పదిహేనో శతాబ్దికి చెందిన కవి పండితుడు, సంగీతకారుడు, నర్తకుడు అయిన శంకరదేవ్ రూపొందించారు. కాలక్రమేణా ‘సత్త్ర’ అనే వైష్ణవ మఠాలలో ‘అంకియా నాట’ ఏకాంకిలను పూర్తిగాను, ఒక్కోసారి ‘భావన’ నృత్యాన్ని విడిగాను ప్రదర్శించేవారు. కొంతకాలానికి ఈ ప్రక్రియ నుంచి నృత్యం విడివడి ప్రత్యేక శైలిగా రూపొందింది. ‘సత్త్ర’లలో ప్రదర్శించడం వల్ల ఈ నృత్యశైలికి ‘సాత్త్రియా’ అనే పేరు వచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2000 సంవత్సరంలో ‘సాత్త్రియా’ను శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది. అప్పటి నుంచి సాత్త్రియా నృత్యానికి ప్రాచుర్యం మొదలైంది. శరోది సైకియా, ఇందిరా బోరా, అనితా శర్మ, అన్వేషా మహంతా తదితరులు సాత్త్రియా నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకొచ్చారు.మోహినీయాట్టంకేరళలో పుట్టిన మరో శాస్త్రీయ నృత్యశైలి మోహినీయాట్టం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పంచిపెట్టడానికి శ్రీమహావిష్ణువు దాల్చిన మోహినీ అవతారం నుంచి మోహినీయాట్టం నృత్యానికి ఆ పేరువచ్చింది. కేరళలోనే రూపొందించిన కథాకళి అభినయ ప్రధానమైన నృత్యశైలి అయితే, మోహినీయాట్టం లాస్య ప్రధానమైనది. ఇదివరకు ఎక్కువగా మహిళలే మోహినీయాట్టం నృత్యాన్ని ప్రదర్శించేవారు. ఇటీవలి కాలంలో పురుషులు కూడా దీనిని నేర్చుకుని, ప్రదర్శిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయంలోని పురాణగాథలకు సంబంధించిన గీతాలకు అనుగుణంగా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నుంచి పద్దెనిమిదో శతాబ్ది వరకు అనేక పరిణామాలకు లోనై ఈ నృత్యం ప్రత్యేక శైలిగా ఆవిర్భవించింది. పద్దెనిమిదో శతాబ్ది నాటి నృత్యశాస్త్ర గ్రంథం ‘బలరామ భారతం’ ఈ నృత్యాన్ని ‘మోహినీ నటనం’గా అభివర్ణించింది. స్వాతంత్య్రానికి ముందు ట్రావెన్కోర్ సంస్థానాధీశులు కథాకళితో పాటు మోహినీయాట్టం నృత్యాన్ని కూడా సమాదరించారు. స్వాతంత్య్రానంతరం మోహినీయాట్టం అంతర్జాతీయ వేదికలపైకి కూడా చేరుకుంది. సునందా నాయర్, కళామండలం కల్యాణకుట్టి అమ్మ, గోపికా వర్మ, జయప్రభా మేనన్, పల్లవి కృష్ణన్ వంటి నర్తకులు మోహినీయాట్టం నృత్యానికి దేశ దేశాల్లో ప్రాచుర్యం కల్పించారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ, జానపద నృత్యరీతులు ఉన్నాయి. కాలానుగుణంగా మరెన్నో అధునాతన నృత్యశైలులు పుట్టుకొస్తున్నాయి. సంగీతంలాగానే నృత్యం కూడా సహజ భావోద్వేగాలతో ముడిపడిన కళ. వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు ఆస్వాదించే కళ. నాట్యవేదం ఆబాల గోపాలానికీ జీవననాదం.కథక్ఉత్తరాదిలో ప్రజాదరణ పొందిన శాస్త్రీయనృత్య శైలి కథక్. కథక్ సహా వేర్వేరు శాస్త్రీయ నృత్యరీతులన్నిటికీ భరతుడి నాట్యశాస్త్రమే ప్రామాణిక గ్రంథం. ఉత్తరాదిలో భక్తి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో– సుమారు క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్ది కాలంలో వారణాసిలో కథక్ ప్రత్యేక నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. భక్తి ఉద్యమ ప్రభావం కారణంగా కథక్ నృత్యంలో రాధాకృష్ణుల లీలా వినోదాలు, భాగవత గాథలు ప్రధాన ప్రదర్శనాంశాలుగా కనిపిస్తాయి. తొలినాళ్లలో ఆలయాలకు పరిమితమైన కథక్ నృత్యానికి మొఘల్ కాలంలో రాజాదరణ లభించింది. కథక్ నర్తకులకు రాజ దర్బారులో నాట్య ప్రదర్శనలు చేసే అవకాశం లభించింది. భారతీయ సంప్రదాయ పద్ధతికి తోడుగా పర్షియన్ శైలిని కలుపుకొని కథక్ ఒక విలక్షణ శాస్త్రీయ నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా, స్వాతంత్య్రానంతరం పునరుజ్జీవం పొందింది. బ్రిటిష్ కాలంలో నిరాదరణకు గురైన సంప్రదాయ కళలను ప్రోత్సహించే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం 1956తో ఖైరాగఢ్లో ఇందిరా కళా సంగీత విశ్వ విద్యాలయం ప్రారంభిం చింది. ఇందులో కథక్ నృత్యానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కథక్ డిగ్రీ కోర్సుకు సిలబస్ను ప్రఖ్యాత నర్తకుడు పురు దధీచ్ రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎందరో కళాకారులు కథక్ నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. బిర్జూ మహారాజ్, సితారా దేవి, గోపీకృష్ణ వంటి ఎందరో నర్తకుల కృషి ఫలితంగా కథక్ నృత్యం దేశ విదేశాలకు పాకింది. -
నా అందానికి కారణం ఆ అలవాటే : రుహానీ శర్మ బ్యూటీ సీక్రెట్
అనుష్కా శర్మ చెల్లెలు, విరాట్ కోహ్లీ మరదలు అయిన రుహానీ శర్మ చేసినవే తక్కువ సినిమాలు అయితే, అందులో హిట్ అయిన వి రెండు మాత్రమే! కాని, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. ఫ్యాషన్లో తను చూపే చూజీనెస్ మిగతా వారికంటే తనని భిన్నంగా చూపిస్తోంది. అలా తను ఎంచుకున్న బ్రాండ్స్లో ఇవీ ఉన్నాయి. రోజూ ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు నా సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం మర్చిపోను. ఇప్పుడు ఆ అలవాటే నన్ను ఎల్లప్పుడూ అందంగా కనిపించేలా చేస్తోంది.– రుహానీ శర్మచేతి గాజులు ఘల్లుమన్నవే..ఒకప్పటిలాగా నిత్యం చేతికి గాజులు వేసుకోకపోవచ్చు. కాని, స్పెషల్ అకేషన్ ఏదైనా మట్టిగాజులపైనా మనసు పారేసుకుంటున్నారు నేటి మగువలందరూ చేతికి నిండుగా మట్టి గాజులు వేసుకుంటే వచ్చే అందమే వేరు. పైగా గాజుల్ని శుభసూచకంగా, సౌభాగ్యానికి గుర్తుగా భావిస్తారు. వీటిని ధరించడం వలన అందంతో పాటు, ఆరోగ్యమూ చేకూరుతుందనే నమ్మకమూ ఉంది. బంగారు గాజులు ఎన్ని వేసినా వాటి మధ్యలో ఓ నాలుగు మట్టిగాజులు చేరితేనే అందం. కిందటి రోజుల్లో మట్టిగాజులు అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో సాదాగా దొరికేవి. కాని, ఇప్పుడు పేస్టల్ కలర్స్తో పాటు దాదాపు అన్నీ రంగుల్లోనూ, వివిధ రకాల డిజైన్స్లోనూ లభిస్తున్నాయి. వీటిని అటు అరడజను, ఇటు అరడజనులా కాకుండా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ తగ్గట్టు, కేవలం ఒక్క చేతికే నిండుగా ధరించి కూడా స్టయిలింగ్ చేసుకోవచ్చు నటి రుహానీ శర్మలా. -దీపిక కొండి -
వేలంలో కోట్ల రూపాయలు పలికిన టాప్ పెయింటింగ్స్
ఆర్ట్ ఒక జీవితావసరం. ఎవరికి?! అద్దం అవసరం ఎవరికైతే ఉంటుందో, వారందరికీ. జీవితానికి అద్దం పట్టే ఆర్ట్ జీవితంలానే ఉంటుంది తప్ప.. ప్రతిబింబంలానో, అనుసృజనలానో ఉండదు. నడిచిపోయిన కాలానికి నిలకడైన రూపం ఆర్ట్. అందుకే ఆర్టిస్టులకు అంత గౌరవం, ఆర్ట్ అంత అమూల్యం. ప్రపంచ ప్రసిద్ధ చెందిన ‘ఆక్షన్’ సంస్థలు ఏడాది పొడవునా ఈ చిత్ర పటాలను వేలానికి ఉంచుతూనే ఉంటారు. అలా ఇప్పటి వరకు అంతర్జాతీయ వేలం పాటల్లో అత్యధిక ధరను దక్కించుకున్న తొలి ఐదు భారతీయ తైలవర్ణ చిత్రాల విశేషాలు మీ కోసం.తయ్యబ్ మెహతా, ఎం.ఎఫ్. హుస్సేన్ ఇంచుమించుగా ఒక ఈడు వాళ్లు. హుస్సేన్ తర్వాత పదేళ్లకు జన్మించిన తయ్యబ్... హుస్సేన్ కన్నా రెండేళ్లు ముందుగా ‘సెలవు’ తీసుకున్నారు. కానీ, మానవాళికి తమ కుంచె వేళ్లకు ఆనవాళ్లుగా వాళ్లు వదిలివెళ్లిన తైలవర్ణ చిత్రాలు కాలాలకు అతీతమైనవి! తయ్యబ్ దాదాపు 70 ఏళ్ల క్రితం గీసిన ‘ట్రస్డ్ బుల్’ పెయింటింగ్ తాజా వేలంలో రూ.61.8 కోట్ల ధర పలికింది. ఏప్రిల్ మొదటి వారంలో ముంబైలోని ‘శాఫ్రాన్ఆర్ట్’ గ్లోబల్ సంస్థ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆన్లైన్ వేలంలో ‘ట్రస్డ్ బుల్’ రెండవ అత్యంత ఖరీదైన భారతీయ పెయిటింగ్గా చరిత్రలో నిలిచింది. మొదటిది ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ ‘గ్రామ్ యాత్ర’. న్యూయార్క్లో ఈ ఏడాది మార్చి మూడవ వారంలో జరిగిన ‘క్రిస్టీస్’ వేలంలో హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ రూ.118 కోట్లు పలికింది. అమృతతో తయ్యబ్ సమస్థానంహుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ తర్వాత తయ్యబ్ ‘ట్రస్డ్ బుల్’ చిత్రం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఏడాదిన్నర క్రితమే 2003 సెప్టెంబరులో అదే ‘శాఫ్రాన్ఆర్ట్’ సంస్థ నిర్వహించిన వేలంలో అదే మొత్తానికి (రు.61.8 కోట్లు) అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ విక్రయం అయింది కనుక తయ్యబ్ది అమృతాతో సమస్థానం అని చెప్పటం కూడా గౌరవంగానే ఉంటుంది. అమృత ఎం.ఎఫ్. హుస్సేన్ కంటే కూడా వయసులో రెండేళ్లు, తయ్యబ్ కంటే పన్నెండేళ్లు పెద్దవారు. హుస్సేన్ 95 ఏళ్లు, తయ్యబ్ 83 ఏళ్లు జీవిస్తే, అమృతా 28 ఏళ్లకే కన్నుమూశారు!ఎందుకింత ‘అమూల్యం’?!పైకి వర్ణాలే. వెలుగు నీడలే. లోపల అవి ఉద్వేగాలు. లోలోతుల్లో హృదయ తరంగాలు. ఎం.ఎఫ్. హుస్సేన్ తన ‘గ్రామ్ యాత్ర’లో గ్రామీణ భారత వైవిధ్య చిత్రాలను లిఖించారు. అది లేఖనం కాదు. ఊపిరి పోయటమే! వంట చెయ్యటం, పిల్లల్ని చూసుకోవటం, గూడుబండిలో ప్రయాణం చెయ్యటం వంటి రోజువారీ గ్రామీణ దృశ్యాలో స్త్రీలను చిత్రించటానికి హుస్సేన్ శక్తిమంతమైన మట్టి రంగులను ఉపయోగించారు. తయ్యబ్ మెహ్తా ‘ట్రస్డ్ బుల్’ (కట్టిపడేసిన ఎద్దు) విభజనానంతర కాలంలో ప్రత్యక్షంగా ఆయన చూసిన ఒక భయానక సంఘటనకు ప్రతీకాత్మక చిత్రీకరణ. ‘‘ఆ సమయంలో నేను మొహమ్మద్ అలీ రోడ్డులో (బొంబాయి) నివసిస్తున్నాను. నిరుపేద ముస్లింలు ఉండే ప్రదేశం అది. నేనుండే పైగది కిటికీలోంచి వీధిలో ఒక యువకుడి వధించటం నేను కళ్లారా చూశాను. జన సమూహం అతడిని కొట్టి చంపింది. అతని తలను రాళ్లతో పగలగొట్టింది. బొంబాయిలోని ఒక వధ్యశాలకు ఎద్దులను తీసుకెళే దృశ్యం అప్పుడు నా మదిలో కదలాడింది. వాళ్లు ఆ జంతువును వధించే ముందు తాళ్లతో కాళ్లు కట్టేస్తారు. కొద్దిగానైనా కదలకుండా చేసేస్తారు. ఆ స్థితిలో ఉన్న ఎద్దును నేను ఆనాటి దేశకాల స్థితిని ప్రతిఫలించేలా ట్రస్డ్ బుల్గా చిత్రించాను..’’ అని ఆ తర్వాతి కాలంలో అనేక సందర్భాల్లో చెప్పారు తయ్యబ్ మెహ్తా. హుస్సేన్, అమృతా, తయ్యబ్ల చిత్రాల తర్వాత ఇప్పటి వరకు ప్రపంచ వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ తైలవర్ణ చిత్రాలుగా నిలిచినవి ఎస్.హెచ్.రజా ‘జెస్టేషన్’, వి.ఎస్. గైతోండే ‘అన్టైటిల్డ్’. 2023 సెప్టెంబరులో ముంబైలోని పండోల్ సంస్థ వేలంలో రజా ‘జెస్టేషన్’ రూ.51.7 కోట్లకు, అదే ఏడాది ఏప్రిల్లో జరిగిన శాఫ్రాన్ఆర్ట్ వేలంలో గైతోండే ‘అన్టైటిల్డ్’ రూ. 47.5 కోట్లకు అమ్ముడయ్యాయి. రజా 94 ఏళ్ల వయసులో, గైతోండే 77 ఏళ్ల వయసులో తమ అమూల్యమైన చిత్రాలను మానవాళికి కానుకగా ఇచ్చి వెళ్లిపోయారు. అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ థీమ్ కూడా హుస్సేన్ వేసిన ‘గ్రామ్ యాత్ర’ వంటిదే. అయితే ఆ చిత్రాన్ని ఆమె హుస్సేన్ కంటే ముందే వేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ను గీస్తే, దేశానికి స్వాతంత్య్రం రావటానికి పదేళ్ల ముందే అమృతా ‘ది స్టోరీ టెల్లర్’ను గీశారు. రోజువారీ పనులలో నిమగ్నమై ఉన్న గ్రామీణ మహిళల సమూహాన్ని అందులో చిత్రీకరించారు అమృత. ఈస్ట్ అండ్ వెస్ట్ సంస్కృతుల కలయిక ఆమె రంగుల వాడుక. ఎస్.హెచ్. రజా ‘జెస్టేషన్’ వృత్తం కేంద్రబిందువుగా త్రిభుజాలు, చతురస్రాలు, వికర్ణ రేఖలతో కూడి ఉంటుంది. ఐదు దశాబ్దాలు ఫ్రాన్స్లో జీవించిన తర్వాత ఆయన తన మాతృభూమికి తిరిగి రావటాన్ని ఆ చిత్రం సూచిస్తుంది. సూక్ష్మార్థంలో – మనిషి తన చరమాంకంలో తిరిగి బిడ్డగా మారి తల్లి కడుపులోకి నిక్షిప్తం కావాలని కాంక్షించటం అందులో కనిపిస్తుంది. ఇక వి.ఎస్. గైతోండే తన ‘అన్టైటిల్డ్’ పెయింటింగ్తో కళాత్మక తాత్వికునిగా ప్రసిద్ధి చెందారు. ‘అన్టైటిల్డ్’ శూన్యానికి ఏకవర్ణ ఆకృతిని ఇవ్వటం అంటారు ఆర్ట్ గురించి తెలిసినవాళ్లు. వీక్షకులు ఈ చిత్రంలోని అదృశ్యాన్ని అనుభూతి చెందుతారని కూడా అంటారు. ఎందుకీ చిత్రాలు ఇంత అమూల్యమైనవి అనుకున్నాం కదా. అది చిత్రం విలువ మాత్రమే కాదు, అంతకుమించి, చిత్రానికి రసాస్వాదకులు ఇచ్చే మర్యాద కూడా! ఆ రెండూ కలసి చిత్రం ఖరీదును తరతరాలకూ పెంచుకుంటూ పోతూనే ఉంటాయి.∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
గాడిద పాల వైద్యం
అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం నుంచి ఒక గాడిద అడవిలోకి వచ్చింది. బూడిద రంగులో బలిష్ఠంగా ఉన్న గాడిదను చూసిన నక్కకు నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా గాడిద మాంసం తినాలనుకుంది. వెనుక నుంచి నెమ్మదిగా గాడిద దగ్గరికి వెళ్లి దానిపై దాడి చేయబోయింది. కాని, అది గమనించిన గాడిద తన వెనుక కాళ్లు లేపి నక్క దవడ మీద బలంగా ఎగిరి తన్నింది. నక్క కింద పడింది. గాడిద తన గట్టి పళ్లతో నక్క చెవులు కొరికింది. దాంతో నక్క ‘కుయ్యో.. మొర్రో’ అంటూ మృగరాజు దగ్గరికి పరుగు తీసింది. మృగరాజుకు గాడిదపై ఫిర్యాదు చేసింది. ‘ప్రభూ! పక్క గ్రామం నుంచి అడవిలోకి చొరబడిన గాడిద నాపై దాడి చేసింది. ఇప్పుడు మీతో పోరాడి అడవికి రాజు కావాలనుకుంటోంది’ ఆయాసంతో రొప్పుతూ చెప్పింది నక్క.మృగరాజు అప్పటి వరకు గ్రామాల్లో ఉండే గాడిద గురించి వినటమే గాని, చూడనేలేదు. మృగరాజు వెంటనే తన ఆంతరంగికుడైన ఏనుగును పంపి గాడిదను తన గుహకు తీసుకు రమ్మని చెప్పాడు. ఏనుగు పరుగునవెళ్లి గాడిదను తీసుకువచ్చింది, గాడిద భయం భయంగా గుహ బయట నిలుచుంది. గుహ లోపల మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతున్న శబ్దం విన్నది గాడిద. మృగరాజు సింహం గుహలోంచి బయటికి వచ్చాడు.గాడిద తన ముందు రెండు కాళ్ళను గాలిలోకి లేపి నమస్కరించింది. ‘ఎవరు నువ్వు!’ ప్రశ్నించాడు మృగరాజు. ‘ప్రభూ! నేను ఈ అడవికి పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను. మా యజమాని నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. నేను బరువులు మోస్తూ, అతనికి సహాయం చేసే దాన్ని. పొలంలో మొలిచే కలుపు మొక్కలను తిని పంటను కాపాడేదాన్ని. నా జ్ఞాపకశక్తి, తెలివితేటలకు నా యజమాని పొంగిపోయేవాడు.అతను ఒక అనాథ. నన్ను తన సొంత బిడ్డలా చూసుకున్నాడు. గత వారం అతను పట్నం వెళ్లి, ప్రమాదవశాత్తూ మరణించాడు. యజమాని మరణించాక నేను గ్రామంలో ఉన్నంతసేపు నాకు నా యజమానే గుర్తుకు వచ్చేవాడు. అందుకే నేను అక్కడ ఉండలేక అడవి బాట పట్టాను!’ చెప్పింది గాడిద. మృగరాజుకు గాడిద మనసు అర్థమైంది. అంతే కాదు శాకాహారి అయిన గాడిద తన ఆత్మరక్షణ కోసమే నక్కను గాయపరచిందని తెలుసుకుంది. నక్క గుణం తెలిసిన మృగరాజు దాన్ని మందలించాడు.ఇంతలో గుహ నుంచి మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతూ బయటకువచ్చింది.‘మిత్రమా! ఎన్ని పసరు మందులు వాడినా దగ్గు, ఆయాసం, జలుబు గత నెల రోజులుగా నా బిడ్డను వదలటమే లేదు’ విచారంగా అన్నాడు మృగరాజు.గాడిద చిట్టికూనను పరిశీలనగా చూసి, మృగరాజుతో, ‘ప్రభూ! ఎలాంటి దగ్గు, జలుబు, ఆయాసాన్నయినా పూర్తిగా నయం చేసే ఔషధ గుణం మా పాలలో ఉంది. మా పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.మీరు అనుమతి ఇస్తే నేను మీ బిడ్డకు వైద్యం చేస్తాను’ అంది గాడిద. మృగరాజు సంతోషంగా అంగీకరించాడు. చిట్టికూనకు గాడిద తన పాలు తాగించింది.పాలు తాగిన చిట్టి కూన నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంది. మృగరాజు గాడిదను తనతోనే ఇక్కడే ఉండిపొమ్మన్నాడు. తన యజమాని చూపిన ప్రేమను, గౌరవాన్ని మృగరాజు దగ్గర తిరిగి పొందింది గాడిద. మనం కీడు తలపెట్టినా, మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని తెలుసుకుంది నక్క. -
ఈ వారం కథ: చిద్విలాసుడు
అతను చాలాకాలం తర్వాత బస్స్టాండ్ లో కనిపించాడు. నేను చూడనట్టు నటించాను. ఎక్కడ నుంచి చూశాడో నన్ను, పరుగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకున్నాడు. ‘‘ఎంతకాలం అయ్యిందో శ్రీను! నిన్ను చూసి’’ అంటుంటే మొహంలో ఆనందం. ‘‘సంయుక్త బాగుందా? పిల్లాడు ఎలా ఉన్నాడు?’’ అంటూ నా గురించి అడుగుతున్నాడు. అదే హుషారు, అదే నవ్వు. జీవితాన్ని ఈజీగా తీసుకునే అతన్ని చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. మామూలుగా అయితే అది అసూయ! తప్పదురా దేవుడా! అనుకుంటూ ముఖం మీద నవ్వు పులుముకుని, ‘‘మీరు ఎలా వున్నారు?’’.. అడిగాను.ఎప్పటిలాగానే జేబులోంచి సిగరెట్టు తీసి వెలిగించి గుండెల్లోకి గట్టిగా పీల్చి గాలిలోకి పొగ వదులుతూ, ‘‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ అన్నాడు. పదిహేను ఏళ్ల క్రితం ఎలా అనేవాడో అదే మాడ్యులేష తో అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అతని వ్యవహారంలో మార్పు ఏమీ లేదు. మనిషిలో కూడా పెద్దగా వచ్చిన మార్పులేదు. శరీరం మీద కాలం మిగిల్చిన ఆనవాళ్ళు తప్ప. ‘‘మీ పిల్లలు ఎలా ఉన్నారు’’.. అని అడిగే లోపున, ‘‘నీ ఫోన్ నెంబర్ ఇయ్యి శ్రీను’’ అంటూ మొబైల్లో టిక్ టిక్మని అనిపించి దాన్ని జేబులో పడేసుకుని, ‘‘నేను ఎక్కవలసిన బస్ వచ్చేసింది, ఫోన్ చేస్తాను’’ అంటూ హడావుడిగా, కదులుతున్న బస్ ఎక్కి, వెళ్ళిపోయాడు. భలే మనిషి సన్యాసి! పేరుకు తగ్గ మనిషి. బాదరబందీలు ఉన్నా పట్టనట్టు తిరిగే సర్వసంగ పరిత్యాగి. సన్యాసి అనే పేరే విచిత్రంగా అనిపించి ఒకసారి అడిగితే, ‘‘మా అమ్మకి చాలాకాలంగా పిల్లలు పుట్టలేదుట. ఒక రోజు ఒక సన్యాసి మా అరుగు మీద కూర్చున్నాడుట. అతణ్ణి చూసి జాలిపడి మా అమ్మ అన్నం పెట్టిందిట. తృప్తిగా తిని, త్వరలో నీ కడుపు పండుతుంది. ఒక పిల్లాడు పుడతాడు అని చెప్పి వెళ్లిపోయాడట. తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు సన్యాసి అని పెట్టుకుంది’’ అని చెప్తూ చిద్విలాసంగా నవ్వాడు. ప్రపంచంలో నా అంత ఆనందంగా ఉండేవాడు మరొకడు లేడు అనేలా నవ్విన ఆ నవ్వు నా మస్తిష్కంలోంచి చెరిగిపోలేదు. అంతలా నా మనస్సులో ముద్ర వేశాడు. పదిహేనేళ్ల క్రితం మొదలైన మా పరిచయం, ట్రాన్స్ఫర్ మీద ఈ వూరు వచ్చే వరకు సాగింది. బలవంతాన నా ఆలోచనల్లో చొరబడ్డ ఆ పెద్దమనిషి నన్ను గతంలోకి లాక్కెళ్లాడు.ఆ రోజు శనివారం ఆఫీసు హాఫ్ డే సెలవు. నేను వచ్చేసరికి, సంయుక్త గోడ అవతల ఉన్న ఒక కొత్త ఆమెతో మాట్లాడుతోంది. నేరుగా బాత్ రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి, కారుణ్యను ఎదురుగాకూర్చోబెట్టుకుని లెక్కలు చెప్పడం మొదలుపెట్టాను. సంయుక్త లోపలికి వస్తూ, ‘‘కాఫీ తాగారా’’ అని అడిగింది. తల ఊపాను.‘‘పక్క ఇంటికి కొత్తగా వచ్చారండి. ఆయన జిల్లా కోర్టులో పనిచేస్తారుట. ఆవిడే వచ్చి పరిచయం చేసుకుంది, ఆయన పేరు సన్యాసి, ఆమె పేరు పార్వతి. చాలా మంచామెలా ఉంది, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు అట. ఈ రోజుల్లో నలుగురంటే కష్టమే పాపం. పెద్ద అమ్మాయి వాళ్ళ పిన్ని దగ్గర ఉండి, చదువుకుంటోందట. పార్వతిగారికి పిండి వంటలు బాగా వచ్చట. మనకి ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు’’.. సంయుక్త కళ్ళల్లో ఆనందం. ఇంతలో గట్టిగా పెద్దపెద్ద అరుపులు, తిట్లు వినబడ్డాయి.ఇద్దరం బయటకు పరుగెత్తి శబ్దాలు వచ్చిన వైపు చూశాము. పక్క ఇంటి ఆవరణలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జుట్టు జుట్టు పట్టుకుని రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు. ఆడపిల్ల కూడా ఎక్కడా తగ్గడం లేదు.ఆ పిల్లాడితో సమానంగా పోరాడుతోంది. ఇద్దరికీ పది పన్నెండేళ్లు ఉండొచ్చు. పక్కింటావిడ వాళ్ళను విడదీయలేక, ‘‘ఒసేయ్ కమలా! ఒరేయ్ రాము ఆగండ్రా! కొట్టుకోకండి! ఏవయ్యో! వీళ్ళను ఆపలేకపోతున్నాను, వచ్చి ఆపవయ్యా’’ అంటూ అరుస్తోంది. మేము చూస్తున్నామని ఆమె గమనించినట్టుంది. సిగ్గుపడుతూ మొహం కిందకు దింపేసుకుని మొగుడు కోసం లోపలికి వెళ్ళింది. ఆ పిల్లలిద్దరూ మట్టిలో దొర్లుతున్నారు. కాసేపు అయ్యాక, అలిసిపోయి, ఆయాసపడుతూ అక్కడే మట్టిలో వెల్లకిలా పడుకుని ఆకాశం కేసి చూస్తున్నారు. ఇంతలో నడుము మీద వేలాడుతున్న లుంగీతో, పై భాగంలో ఏ ఆచ్ఛాదనా లేకుండా, నోటిలో కాలుతున్న సిగరెట్టుతో, నలభైఐదు, ఏభై ఏళ్ల మధ్యవయస్కుడు తాయితీయిగా నడుచుకుంటూ వచ్చి, ‘‘ఏరానాన్నా! ఏమ్మా అమ్ములూ! దెబ్బలు తగిలాయా! ఎందుకు నాన్నా అల్లరి’’ అంటూ వాళ్లను ప్రేమగా మందలించి లేవదీసుకుని లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.‘‘ఛీ ఛీ ఎలా కొట్టుకున్నారో అనాగరికంగా? ఇలాంటి సంత తెచ్చి పెట్టాడు మన పక్క ఓనర్’’ అన్నాను సంయుక్తతో.నా మాట పట్టించుకోకుండా, ‘‘ఆ కూలిపోయేలా ఉన్న ఇంట్లో ఎలా ఉంటారో పాపం. పెంకులు మార్చి పదేళ్లు అవుతోంది. వానాకాలంలో ఎలాగో వీళ్ళకు?’’ అంటూ జాలి పడింది. నేను తన మాటలు పట్టించుకోకుండా.. నా కొడుకు చేసిన లెక్కలు చూస్తూ, వాడు తప్పు చేసినప్పుడల్లా, వాడిని మందలిస్తూ, శ్రద్ధగా చదవక పోతే ముందు ముందు ఎంత కష్టపడివలసి వస్తోందో మధ్య మధ్యలో వాడికి ఉపదేశిస్తున్నాను.‘‘ఎందుకండీ వాడిని మాటి మాటికి అలా భయపెడతారు?’’ అంటూ నా మాటలకు అడ్డు తగులుతోంది.‘‘నువ్వు మాటాడకు. నీకు తెలియదు. శ్రద్ధగా చదువుకోకపోతే చాలా కష్టం, చూస్తున్నావుగా బయట ఎంత కాంపిటీషనో?’’ అంటూ తనను మాట్లాడనివ్వలేదు. బాగా చదువుకుని, సరిగ్గా సెటిల్ అవ్వకపోతే, పిల్లాడి జీవితం ఏమైపోతుందోననే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎన్నో కుటుంబాలలో పిల్లలు సరిగా స్థిరపడక పోవడం వలన, పెద్దలు మనఃశాంతి కోల్పోవడం చూశాను. అందుకే తెలియని భయం, బెంగ, టెన్షన్. ఎంత ప్రయత్నం చేసినా ఆ భయాన్ని వీడలేకపోతుంటాను. అందుకే, జీవితంలో చాలా క్రమబద్ధంగా, జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు కూడా క్రమశిక్షణలో ఉండాలనే నా తాపత్రయం. ఎవరైనా అందుకు విరుద్ధంగా ఉంటే నాకు నచ్చరు. అందుకనే మా పక్క ఇంటి పిల్లలు హోరాహోరీ కొట్టుకోవడం చూసి నాకు వెగటు వచ్చింది. వాళ్ళను కనీసం తిట్టకుండా, గారంగా మాట్లాడి, ఆ ఇంటిపెద్ద తీసుకువెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు. కారుణ్యను వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళకుండా ఆపమని సంయుక్తకు చెప్పాలి. లేకపోతే క్రమశిక్షణ లేకుండా వీడు కూడా వాళ్ళలా తయారవుతాడు అనే మరో అదనపు భయం నాకొచ్చి చేరింది.మర్నాడు స్కూటర్ మీద ఆఫీసుకు బయలుదేరే సమయంలో, ‘‘శ్రీనివాస్ గారూ! ఆగండడాగండి! అంటూ చేతికి గుడ్డసంచి తగిలించుకుని, జేబులో చిల్లర ఎక్కడ పడిపోతుందోనని, దాని మీద చెయ్యి నొక్కిపెట్టుకుని పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు సన్యాసి. వంటిమీద మాసిపోయిన చొక్కా, మడమలపైకి పోయిన ప్యాంటు చూసిన నాకు చిరాకు వేసింది. ‘‘శ్రీనివాస్ గారు! మేము మీ పక్క ఇంట్లో కొత్తగా దిగాం. మా ఆవిడా, మీ మిస్సెస్గారు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు. అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు’’ అంటూ అవసరం లేకపోయినా గట్టిగా నవ్వుతూ, చేతులు పైకీ క్రిందకూ ఊపుతూ, వీధిలో అందరికీ వినబడేలా గట్టిగా మాట్లాడుతూ.. తన పేరు, ఉద్యోగం, కుటుంబ విషయాలు ఏకరువు పెడుతున్నాడు. ఆఫీసుకు టైము అవుతోందని రెండుసార్లు వాచీ చూసుకున్నాను. అయినా ఆ జీవి, గమనించలేదు. తన ధోరణి తనదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా ఇబ్బందిని అరుగుమీద నిలబడ్డ పార్వతి గమనించినట్టుంది.‘‘అయ్యో! ఆయనకి ఆఫీసుకు టైము అవుతున్నట్టుందండీ’’ అని మొగుడుకి హింట్ ఇచ్చింది. అప్పుడు ఆయనగారు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. ‘‘అయ్యో మీకు టైము అవుతుందనుకుంటా, మీ ఆఫీసు కూడా మా ఆఫీసు దగ్గరే! వెడుతూ మాట్లాడుకుందాం’’ అంటూ మొహమాటం లేకుండా, నా స్కూటర్ వెనకాల ఎక్కేశాడు. ఇదేం మనిషో? అనుమతి తీసుకుని ఎక్కాలన్న కనీస కర్టసీ లేదు అని మనసులో విసుక్కుంటూ వాహనం ముందుకు పోనిచ్చాను. వెనకాల కూర్చుని, ఆఫీసు వచ్చే వరకు మాట్లాడుతునే వున్నాడు. నేను వూ కొడుతూనే ఉన్నాను. అలా మొదలయింది నా మొదటి పరిచయం సన్యాసితో... తర్వాత.. మా మధ్యలో మాటలు కాస్త పెరిగాయి అనడం కన్నా, నేను అతణ్ణి వదిలించుకోలేక పోయాను అనే చెప్పాలి. ఆసక్తి లేకపోయినా, అతని వ్యవహారశైలి గమనించడం మొదలుపెట్టాను. దరిమిలా సన్యాసికి జీవితం పట్ల ఏ మాత్రం పట్టింపు లేదని అర్థం అయ్యింది. ఖాళీగా తన ఇంటి అరుగు మీద కూర్చుని, సిగరెట్టు కాలుస్తూ, నాలుగైదు సార్లు కాఫీలు తాగుతూ వీధిలో వెడుతున్నవాళ్లను పలకరిస్తూ ఉండడం చాలాసార్లు చూశాను. ఆదివారం వస్తే చాలు. ఇంటిల్లిపాదిని తీసుకుని సినిమాకి పోయేవాడు.సమాజంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలు, తగ్గిపోతున్న డబ్బు విలువ, అతనికి పట్టవా అనిపించేది.ఆర్థిక ఇబ్బందులు నాకు పెద్దగా లేనప్పటికీ,. ఎప్పుడు డబ్బు అవసరం వస్తుందో అని టెన్షన్ పడుతూనే ఉంటాను. ఆచితూచి అడుగులు వేస్తూ పొదుపుగాను, క్రమశిక్షణతో ఉండడం నా నైజం. జీవితం పట్ల బాధ్యత, భవిష్యత్తు పట్ల భయం నన్ను అలా చేసినట్టుంది. అలాంటి నాకు సన్యాసి ఒక ప్రశ్నార్థకం.పార్వతి మాటలని బట్టి, అతనికి జీతం డబ్బులు తప్ప, వేరే ఏం ఆదాయం లేదని తెలిసింది. అయినా ఈ జీవి డబ్బులు కోసం ఏనాడూ ఇబ్బంది పడుతున్నట్టు కనబడేవాడు కాదు. నన్ను ఎక్కడ అప్పు అడుగుతాడో అని భయపడుతూ ఉండేవాడిని. అందుకే అతని ఆర్థిక పరిస్థితుల గురించి అస్సలు అడిగేవాడిని కాదు.ఎప్పుడూ సంతోషంగా ఉండే అతణ్ణి చూస్తూ ఉంటే, నాలో ఎన్నో సందేహాలు రేగేవి. ఒకసారి పిచ్చి ప్రశ్న వేశానని, నాలో నేను అనుకుంటూనే, ‘‘మీ పిల్లలు ఎలా చదువుతారు సన్యాసిగారు’’ అని అడిగాను.అంతలా అల్లరి చేస్తూ, క్రమశిక్షణ లేని పిల్లలకు చదువు రాదనే నా నిశ్చితాభిప్రాయం. అతను చెప్పే లోపునే, మరో ప్రశ్న సంధించాను. ‘‘ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి! ఈ రోజుల్లో నలుగురు పిల్లలంటే మాటలా? ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? చిన్న చిన్న కుటుంబాలమైన మేమే సంసారాన్ని కష్టంగా లాగుతున్నాం. మీరు నలుగురిని ఎలా పోషిస్తున్నారా అని?’’ సందేహంగా అడిగాను. వెంటనే గట్టిగా ఒక నవ్వు నవ్వి, జేబులోంచి చార్మినార్ సిగరెట్టు తీసి నోట్లో పెట్టుకుని, అగ్గిపుల్లను పెట్టి మీద పెట్టి సర్ మని గీత గీసి చాలా స్టైల్గా సిగరెట్టు ముట్టించి, గుప్పున ఒక దమ్ము లాగి, ‘‘చూడు శ్రీను!’’ అంటూ, ఏకవచన సంబోధనలోకి దిగాడు అని నేను గమనించే లోపులోనే, ‘‘నువ్వు నా కన్నా చిన్నవాడివని చనువుగా అనేశానులే ఏమీ అనుకోకు’’ అని చెప్పడం మొదలుపెట్టాడు.‘‘మొదటి సంతానం ఆడపిల్ల పుట్టగానే, మా అమ్మ మగపిల్లాడు కావాలని గోల పెట్టింది. రెండవ వాడు సూరిగాడు పుట్టాడు..’’‘‘మరింకేం!’’ అన్నాను. ఎందుకు ఆపలేదు అనే ఉద్దేశంతో.‘‘ఆపరేషన్ నువ్వు చేయించుకో అంటే నువ్వు చేయించుకో అని పార్వతీ నేనూ దెబ్బలాడుకున్నాం.ఈలోగా ఒక శుభ ముహూర్తాన కవలలు పుట్టేశారు. ఏం చేస్తాం అంతా ఆ పరమాత్ముడి లీల’’ అని భళ్ళున నవ్వి గాలిలోకి చూశాడు. ఒళ్ళు మండిపోయింది అతని ధైర్యానికి.నాకు ఆ కుటుంబం అంటే పెద్ద ఇష్టం లేకపోయినా, సంయుక్తకు పార్వతి ఎంతో ఆసరాగా ఉండేది. నేను ఆ వూళ్ళో ఉండగానే, పెద్ద కూతురుకు సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు సన్యాసి. వీళ్ళ ఆర్థిక స్తోమతకు, పిల్ల పెళ్లి ఎలా చేస్తారో అనుకుంటూ ఉండేవాడిని. మిస్టరీగా ఆ ఆమ్మాయి పెళ్లి జరిగితే అది హిస్టరీగా మిగిలిపోతుంది.. నవ్వుకునే వాడిని. ‘‘కనీసం ఒక పూట భోజనం కూడా సరిగా పెట్టలేని వాళ్ళు, అల్లుడు వస్తే ఎలా చూస్తారో కదా’’ అని సంయుక్తతో అంటే. ‘‘వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు. ఏ సాయం చేయకపోగా, అలా వెటకారంగా మాట్లాడడం తప్పండీ పాపం’’ అని నన్ను మందలించేది. కారుణ్యని ఐఐటీ ఫౌండేష¯Œ కి కోచింగ్ ఇప్పించాలని, ఈ వూరికి ట్రాన్స్ఫర్ అప్లై చేశాను.వెంటనే వచ్చింది. మేము వూరు విడిచి వెళ్లిపోతున్న రోజున చాలా బాధ పడిపోయారు సన్యాసి దంపతులు. సన్యాసి అయితే, ‘‘శ్రీను! నువ్వు వెళ్లిపోతుంటే నా బలం తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తోందయ్యా’’ అంటూ బేలగా మాట్లాడాడు. నేను పెద్దగా స్పందించలేదు. సిటీ స్కూళ్లలో పిల్లల చదువులకు ఢోకా ఉండదని, భవిష్యత్తు బావుంటుందనే ఆనందంలో నేనున్నాను. సంయుక్త మటుకు చాలా బాధగానే, ఊరు వదిలి వచ్చింది. ఇక్కడకు వచ్చాక, నేను సన్యాసిని దాదాపు మర్చిపోయాను. సంయుక్త మటుకు చాలా కాలం పార్వతితో గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకునేది. కాలక్రమేణా కారుణ్య చదువులు పూర్తి అయ్యాయి, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి, రెండేళ్లకి వస్తూ ఉంటాడు.సన్యాసి కనిపించాడు అని సంయుక్తకు చెప్పలేదు. ‘‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’’ అనే సన్యాసి మాటలు నా గుండెలను కోసేస్తున్నాయి. చెవులలో ఆ మాటలే రింగుమంటున్నాయి. నలుగురు పిల్లలను కనడం అనే ఊహకే భయపడే ఈ రోజుల్లో, వాళ్ళను కని, చాలీ చాలని జీతం డబ్బులతో, అంతంత మాత్రంగా చదువుతున్న పిల్లలతో, గడుపుకు వస్తున్న సన్యాసి ఈ రోజుకీ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు? ‘మర్చిపోయాను’ అనుకున్న సన్యాసి, హఠాత్తుగా కనబడి, నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. నాకు సమాధానం దొరక్క చివరికి సంయుక్తను ఆశ్రయించాను.‘‘బాబయ్యగారు కనిపించారా? నాకు చెప్పనేలేదు. మీకు వాళ్ళంటే చిన్నచూపు ఇంకా పోలేదన్నమాట?’’ రుసరుసలాడింది.‘‘నాకు తెలియక అడుగుతాను. నెత్తి మీద అన్ని బాధ్యతలు పెట్టుకున్న మీ బాబాయి గారు, పిల్లలు పెద్ద అయినా ఇప్పటికీ ‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’ అని మాట్లాడుతున్నాడు. ఆదేమైనా గొప్పకు మాట్లాడతాడా? లేదా పిచ్చా ?’’ అన్నాను తనతో. నాకేసి చూసి ఒక నవ్వు నవ్వి, ‘‘వాళ్ళకేం బ్రహ్మాండంగానే ఉన్నారండీ’’ అంది. నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఆ రోజుల్లో వాళ్ళ బతుకేదో వాళ్ళు బతికారు పాపం. నేను కూడా పెద్ద సాయం చేసేదాన్ని కాదు. పిల్లలు అల్లరి చేస్తూ కొట్టుకుంటున్నా, వాళ్ళను ఏమీ అనకుండా, దగ్గరకు తీసుకుని, మంచి మాటలు చెప్పేవారుట బాబయ్యగారు. వాళ్ళు ఏమి అడిగినా, అప్పోసొప్పో చేసి, కొనిపెట్టేవారుట. వాళ్ళు కూడా కొంతకాలానికి బాధ్యత తెలుసుకుని, ప్రవర్తించడం మొదలు పెట్టారుట.పార్వతి పిన్నిగారు మన వీధిలో అందరికీ సాయంగా ఉండేదిగా. ఆ మంచితనం వలనే, పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుని, ముందుకు వచ్చి, పెద్ద కూతుర్ని కోడలుగా చేసుకున్నారుట’’ చెప్పింది. నేను ఆ రోజున వాళ్ళను చిన్నచూపు చూస్తూ సంధించిన మాటల శరాలు నాకే తిరిగి గుచ్చుకున్నట్టుగా అనిపించి గిల గిలలాడాను. ‘‘పెద్ద కొడుకు సూరి , కిరాణా హోల్సేల్ బిజెనెస్ పెట్టి, బాగా సంపాదిస్తున్నాడుట. వాడే కమల పెళ్లి చేశాడుట. మీరు ఎప్పుడూ ఎందుకు పనికిరాడు అని తిట్టి, ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కదా! ఆ చిన్న కొడుకు రాముని,.. మనిషిగా పుట్టినా ఈ జన్మభూమికి నేను చేసింది ఏమీ లేదు! నువ్వైనా డిఫెన్సులో చేరి, దేశానికి సేవ చేయమని ప్రోత్సహించారుట బాబాయిగారు. మనం ఏం తిన్నామో, ఎలా బతికామో ఎవ్వరికీ తెలియకూడదు. మనల్ని చూసి ఎవరూ జాలి పడకూడదు. అవతలివాళ్ళ దగ్గర నుండి జాలి ఆశించకూడదు. అలా ఉంటే, దేహీ అని అందర్నీ ఆడగాలనిపించి, దానికి అలవాటు పడిపోతాం. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చి మీద పడ్డా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి’’ అని మా అమ్మ చెప్పేది అని అంటూ ఉండేవారుట. ఆయన అలా నవ్వుతూ కనబడే మనిషే కానీ, లోతైన మనిషి అండీ’’ అంది తాపీగా.‘‘నీకు వాళ్ళ విషయాలన్నీ ఎలా తెలిశాయి?’’ సందేహం ఆపుకోలేకపోయాను. ‘‘మొన్నామధ్య సోషల్ మీడియాలో రాముని చూశాను. పార్వతి పిన్నిగారి నంబర్ తీసుకున్నాను, మీకు వాళ్ళంటే ఇష్టం ఉండదు కదా! అందుకే చెప్పలేదు’’ అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ గొణుక్కున్నాను. అనుకరించడానికి ప్రయత్నించే అబద్ధంతో నన్ను నేనే ఆత్మవంచన చేసుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. సన్యాసి నాకు రాజర్షిలా అంతర్దర్శనం ఇచ్చాడు. ∙చాగంటి ప్రసాద్ -
యువ కథ: ముసుగు మనుషులు
మెలకువ వచ్చింది. వెంటనే మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. నా చేయి ఫోన్ కోసం వెతకడం మొదలెట్టింది. రాత్రి దిండు కింద పెట్టుకుని పడుకున్నట్టు గుర్తు. నా ప్రతిరోజూ ప్రారంభమయ్యేది, ముగిసేది ఫోన్తోనే! వెతుకుతున్న చేతికి ఫోన్ తగలగానే, ఏదో స్విచ్ వేసినట్టు నా కళ్ళు వెంటనే తెరుచుకున్నాయి.చూస్తే టైమ్ ఉదయం తొమ్మిది కావస్తోంది. ఆలస్యం అయిపోయింది. దానికి కారణం రాత్రంతా నిద్రలేదు. ఒకటే కలలు, ఏవేవో ఆలోచనలు. కాని ఒకటి మాత్రం బాగా గుర్తుంది. దేవుడు కనిపించాడు. ‘లోకంలో ఆడా మగ, పేదా ధనిక, కుల మత వర్ణ అసమానతలన్నీ తుడిచేయి దేవుడా. సమసమాజాన్ని సృష్టించు భగవాన్’ అని నేనడిగితే, ‘తథాస్తు’ అన్నాడు. అంత వరకే గుర్తుంది. అలా ఎందుకు అడిగానో తెలీదు.ఆడవాళ్ళు అవ్వడం వల్ల ఇంట్లో నా భార్య, ఆఫీసులో నా జూనియర్ శ్రీలేఖ, డబ్బున్న కుటుంబంలో పుట్టడం వల్ల నా కొలీగ్స్, పెద్ద కులంలో పుట్టడం వల్ల నా స్నేహితుడు రాజు నా కన్నా ఎక్కువ సుఖపడుతున్నారని ఈ మధ్య తెగ ఆలోచిస్తున్నాను. ఈ అసమానతలన్నింటినీ సృష్టించింది ఆ దేవుడేనని, ఆయన మీద కోపాన్ని పెంచుకున్నాను. మనస్సులో అప్పుడప్పుడు దైవ దూషణ కూడా చేశాను. ఈ కల దాని వల్లేనేమో అనిపించింది.నిద్రమత్తుని అతికష్టం మీద వదిలించుకుని, మంచం దిగి వాష్రూమ్లోకెళ్ళి, ఫ్రెష్ అయ్యి వచ్చే సరికి ముప్పావు గంట పట్టింది. ఎప్పటిలా నేను వాష్ రూమ్లో ఉండగా నా భార్య ‘లేచావా’ అంటూ తలుపు కొట్టలేదు. వంట గది నుంచి ఎలాంటి కుక్కర్ శబ్దాలూ రావట్లేదు. టీవీలో భక్తి స్తోత్రాలు వినిపించట్లేదు. పూజగదిలోనూ కనిపించలేదు తను. అప్పుడే జురాసిక్ పార్క్లో ఉండే జంతువులన్నీ కడుపులో పరుగెత్తడం మొదలెట్టాయి. వంటగదిలోకెళ్ళాను. ఓ గిన్నెలో పోహా కనిపించింది. నాకు భలే ఇష్టం. తనకు ఇష్టం లేకున్నా, నా కోసం చేసిపెడుతుంది నా భార్య. మొత్తం లాగించేశాక, మళ్ళీ నా భార్య గుర్తొచ్చింది.‘ఎక్కడికెళ్ళింది అసలు’ అనుకుంటూనే, తన ఫోన్కి డయల్ చేశాను. రింగ్ అయ్యింది కాని, లిఫ్ట్ చేయలేదు. ఆ చిరాకుతోనే బైక్ తాళాలు తీసుకుని ఆఫీసుకి బయల్దేరాను.‘బ్రేక్ఫాస్ట్ అయ్యిందా సార్’ అన్న గొంతు వినబడింది. బైక్ స్టార్ట్ చేస్తూనే ‘హా అయింది’ అంటూ ముభావంగానే తలెత్తాను. ఎదురుగా ఓ వ్యక్తి. అతని కళ్ళు, నోరు, చేతులు, కాళ్లు తప్ప ఏమీ కనిపించట్లేదు. షాక్ కొట్టినట్టయింది. కాని ఎలాంటి భయమూ కలగలేదు. నాకే ఆశ్చర్యమేసింది.తేరుకున్న నేను, రెండు విషయాల ద్వారా నేను చూస్తున్నది మా ఇంటి ఓనర్ని అని గుర్తుపట్టగలిగాను. మొదటిది ఆయన గొంతు. రెండవది తను చూపే మర్యాద. నేను చూíసీ చూడనట్టు ఉన్నా, దగ్గరకొచ్చి మరీ పలకరిస్తాడు. నా ఆశ్చర్యాన్ని పసిగట్టిన అతను ‘అరే! మీరూ నాలాగే అయిపోయారు’ అన్నాడు.‘మీలాగా’ అంటూ నా మొహాన్ని, చేతులనూ తడుముకున్నాను. ఏమీ ఉన్నట్టు అనిపించలేదు.బైక్ మిర్రర్లో చూసుకున్నాను. ఏదో చీకటి ఒళ్ళంతా కప్పేసినట్టు నా కళ్లు, నోరు, చేతులు, కాళ్లుతప్ప ఏమీ కనిపించట్లేదు. భయమేసింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు.నా ఆలోచనలకు సమాధానంగా, మళ్ళీ తనే ‘ఈ రోజు ఉదయం నుంచి అందరి కళ్లు, నోరు, చేతులు, కాళ్లు తప్ప మిగతావేవీ కనిపించట్లేదు. మనం ఇంట్లో, హాస్పిటల్లో ఉంటే మాత్రమే ఇంతకు ముందులా ఒకరికొకరం కనిపిస్తున్నాం. బయటకొచ్చామా, అంతే సంగతులు! ముసుగు మనుషుల్లా అయిపోయాం అందరం. అందరూ దేవుడు ఏదో శపించాడని అనుకుంటున్నారు’ అంటూ పిచ్చివాడిలా తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.ఎక్కువ ఆలోచించే టైం లేకపోయింది. బైక్ తీసి వెంటనే ఆఫీసుకి బయల్దేరాను. మధ్యలో బైక్ మీద వస్తున్న ఓ మనిషి ఎదురయ్యాడు. బైక్కి వేలాడుతున్న పాల డబ్బాలను చూస్తే పక్కింట్లో పాలు పోసేవాడని అర్థమైంది. పక్కింటి నుంచి ఓ నల్లని శరీరం బయటకొచ్చింది. తను పక్కింటి గీత ఆంటీ అని కళ్ళను బట్టి గుర్తుపట్టగలిగాను. పట్టుకుంటే వదలదు. అందుకే తను నన్ను గుర్తుపట్టి పలకరించేలోపే బైక్ని పరుగెత్తించాను.ఎక్కడ చూసినా మనుషుల శరీరాలు కనిపించట్లేదు. అంతా మాయగా అనిపించింది. ఓసారి బైక్ ఆపి నన్ను నేను గిల్లుకున్నాను. నొప్పేసింది. అయినా జరుగుతున్నదంతా నమ్మబుద్ధి కాలేదు. నాకున్న ఒకే ఒక్క స్నేహితుడు రాజుకి ఫోన్ చేశాను. వాడూ లిఫ్ట్ చేయలేదు. ఇక చేసేదేం లేక బైక్ని ముందుకు పోనిచ్చాను.కలెక్టర్ చౌరస్తా వచ్చింది. జనాలు ఓ మూలన గుమిగూడి ఉన్నారు. ఏమై ఉంటుందా అని దగ్గరికెళ్ళాను. ఎవరో రక్తపు మడుగులో పడున్నారు. కాళ్ళకు మెట్టెలు కనిపించాయి. ఓ మహిళ అని అర్థమయింది. ఎవరూ సెల్ఫీలు తీసుకోవట్లేదు, వీడియో రికార్డింగు చేయట్లేదు. పాపం అని కొందరు బాధపడుతున్నారు. అంబులెన్స్కి ఫోన్ చేయండి అని ఇంకొందరు కేకలేస్తున్నారు. మొహాలు కనిపించుంటే మాత్రం జనాలు చనిపోతున్నా పట్టించుకోకుండా, ఒక్కొక్కరు పదులకొద్ది సెల్ఫీలు తీసుకునేవారు. అనాథలా రక్తపు మడుగులో పడున్నావిడ వీడియోలు రక రకాల కోణాలలో చిత్రించేవాళ్ళు. అంతేగాని రక్షించే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ హఠాత్ మార్పుకు కారణం అర్థంకాలేదు. అక్కడున్న ఒక్కాయన్ని అడిగితే ‘అక్కడ రక్తపు మడుగులో పడున్నది ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరి అక్క, అమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ ఎవరైనా అయ్యుండచ్చు. గుర్తుపడదామంటే శరీరం కనిపించట్లేదు. విడిచిపెట్టి పోతే అదో రిస్కు. అందుకే వాళ్ళందరూ తాపత్రయ పడేది’ అన్నాడు.దేవుడు భలే చేశాడనిపించింది. ఎప్పుడూ ‘మన వాళ్ళు.. నా వాళ్ళు’ అంటూ ఉండే మనుషుల జీవితాల్లోంచి స్వార్థాన్ని తీసేశాడు.ఇంతకుముందు నేనెవరినైనా అలా చూస్తే, చలించిపోయే వాణ్ణి. ఇప్పుడు ఇంతమంది మానవత్వం చూపిస్తుండడంతో నా అవసరం లేదనిపించి ముందుకు కదిలాను.ఆఫీసుకెళ్ళి కూర్చున్నాను. నన్ను మా బాస్ రమ్మంటున్నాడని అటెండర్ కబురంపాడు. దాంతో వెళ్ళి ఆయన ముందు కూర్చున్నాను.‘అసలు ఇలా ఎలా అయింది? మనుషుల పాపాలు ఎక్కువైపోయాయి’ అని సొల్లు మొదలెట్టాడు.ఇంతకుముందు పని చెప్పడానికే నన్ను పిలిచేవాడు. మాటలతో టైమ్పాస్ చేయడానికైతే నా జూనియర్ శ్రీలేఖని పిలిచేవాడు. ఈ వయసులో ఏం చేద్దామని తహతహో అర్థంకాదు. ఇప్పుడు ఆమె కోతి మొహం కనిపించట్లేదు. అందుకే నేను గుర్తొచ్చానేమో అనిపించింది. సమాజంలో స్త్రీ పురుష భేదాలు కూడా తొలగిపోయాయని అర్థమైంది. దేవుడి మీద ఇంకాస్త గౌరవం పెరిగింది. ఇంతలో నా ఫోన్ మోగింది. ఏదో కొత్త నంబరు. లిఫ్ట్ చేసి మాట్లాడగానే, అవతలివైపు వ్యక్తి చెప్పిన వార్త విని, అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు నిండాయి, కాళ్ళు వణకడం మొదలెట్టాయి. ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్టనిపించింది.హాస్పిటల్ బెడ్ మీద నా భార్య. ఒళ్ళంతా కట్లు కట్టినట్టున్నారు. ఆమె మొహం తప్ప మరేమీ కనిపించట్లేదు. తనలో కదలిక లేదు. కళ్ళు మూసే ఉన్నాయి. పక్కకు చూశాను. మా అత్తా అమ్మా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. నేనూ ఏడవాలా? తెలీలేదు. నా బుర్ర పనిచేయట్లేదు. ‘ఏడిస్తే తను తిరిగొస్తుందా?’ అన్న ప్రశ్న అడుగుతోంది నా బుర్ర. ఆ ప్రశ్న కరక్టే కదా!ఏమో ఏం తెలియట్లేదు. సోఫాలో కూలబడిపోయాను. తెలీకుండానే కళ్ళు మూతలుపడ్డాయి.ఏదో శరీరం నన్ను తాకుతున్నట్టు అనిపించింది. ‘ఊ..ఊ’ అన్న గొంతు వినబడడం మొదలెట్టింది.బరువుగా కళ్ళు తెరిచాను. ఎదురుగా నా సంవత్సరం వయసున్న కొడుకు. నా చెల్లి చేతుల్లోంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వాణ్ణి చేతిలోకి తీసుకుని కౌగిలించుకున్నాను. ధైర్యంగా అనిపించింది. నాకంటూ మిగిలింది వాడొక్కడే ఇప్పుడు. నా కౌగిలిని విడిపించుకుని, వాడి అమ్మ వైపు ఒక్క వేలితో చూపిస్తూ ‘ఊ ..ఊ’ అంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ఈసారి నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ధారలుగా నా చెంపలను తడిపేశాయి. అది చూసి వాడు నా కన్నీటికి ఒక వేలిని తాకించి, తడి తాకగానే, ‘ఊయ్’ అన్నాడు, ‘ఏమైంది నాన్నా’ అన్నట్టు. వాడికేం చెప్పాలి? చెప్పినా ఏం అర్థమవుతుంది?.అప్పుడే వచ్చిన నా స్నేహితుడు రాజు, పక్కన కూర్చొని, ‘మనుషులు మారలేదురా. మారరు కూడా. రోడ్డు మీద శరీరం కనిపించక పోయేసరికి, వాళ్ళ వాళ్ళయ్యుంటారేమో అని హాస్పిటల్కి జాగ్రత్తగా తీసుకొచ్చారు.హాస్పిటల్ లోనికి రాగానే శరీరం మొత్తం కనిపించింది. దాంతో వాళ్ళ కులం కాదని ఒకడు, మతం కాదని ఒకడు, ఆడ అని ఇంకొకడు, నా వాళ్ళు కాదని మిగతా వాళ్ళు వదిలేసిపోయారు. డాక్టరు కూడా తెలిసిన వాళ్ళు కాదని, ప్రాణం పోతుందని తెలిసినా, డబ్బు కడితేనే ట్రీట్మెంట్ అన్నాడట! చివరికి అందరూ ఉన్నా మన దీపూ అనాథలా ప్రాణాలు విడిచింది. లేదు సమాజం చంపేసింది’ ఆవేశంగా మాట్లాడుతున్నాడు రాజు. ఇంతకు ముందు ఎప్పుడూ వాణ్ణి అలా చూడలేదు.మళ్ళీ వాడే ‘ఇంతకూ ప్రమాదం జరిగింది ఎక్కడో తెలుసా? కలెక్టర్ చౌరస్తా దగ్గర. నువ్వు అటు నుంచే పోయుంటావు. నువ్వు చూసుంటే, నువ్వే తీసుకొచ్చేవాడివి. దురదృష్టం. ఇంతకీ తను ఎక్కడికెళ్తుందో తెలుసా? ఉద్యోగానికి. కుటుంబ భారమంతా నువ్వొక్కడివే మోస్తూ బాధపడుతున్నావని, తను నీకు చెప్పకుండా ఏదో ఇంటర్వ్యూకి బయల్దేరింది. ఇంతలోనే ఇదంతా అయింది’ అన్నాడు.నా ఆలోచనలు ఆగిపోయాయి. చావు బ్రతుకుల్లో ఉన్న నా భార్యను నేనే వదిలేశానా అన్న బాధ నా గుండెను కకావికలం చేసింది. కళ్ళు మూతలు పడ్డాయి. ఎదురుగా ఓ వెలుగు కనిపించింది. ‘మానవా!’ అంది ఆ వెలుగు. నేను స్వర్గంలో ఉన్నానో, నరకంలో ఉన్నానో అర్థం కాలేదు.అప్రయత్నంగా చేతులెత్తి, ‘స్వామీ’ అన్నాను.‘చూశావుగా! నీ కోరిక ప్రకారం అన్ని వివక్షలూ పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం చేశాను. కాని, ఫలితం లేదు. మీలాగే పశు పక్ష్యాదులను కూడా పుట్టిస్తున్నాను. వాటిలో ఈ వివక్షలు లేవే! కేవలం మీలో మాత్రమే ఇవి ఉన్నాయి. అందుకే మారాల్సింది మీరూ మీ ఆలోచనలూ. నేనెన్ని చేసినా ఫలితం ఉండదు. ఇకనైనా దైవదూషణ మానేయి నాయనా! కులం, మతం, పేద, ధనిక, ఆడ, మగలాంటి అడ్డుగోడలు మీరు నిర్మించుకున్నవే! వాటికి దేవుడ్ని నిందించడమేల?’ అంటూ ఆ వెలుగు మాయమైపోయింది.ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను. ఎదురుగా నా కొడుకుని ఎత్తుకుని నిలుచుంది నా భార్య.నా కొడుకు ‘ఉయ్’ అన్నాడు. ‘నాన్న అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు’ అన్నట్టు. ‘మళ్ళీ పీడకలా?’ అంది నా భార్య.అవునన్నట్టు తలదించుకున్నాన్నేను.‘చూడు విజయ్! నేనేమీ సుఖ పడట్లేదు. నీకు ఆఫీసు పని ఎలాగో, నాకు ఇంటి పని అలాగ. చెప్పాలంటే నీకన్నా ఎక్కువే కష్టపడుతున్నాను. ఇక సమాజంలో ఉన్న వివక్షల గురించి అంటావా? మనుషులందరూ రకరకాల ముసుగులేసుకుని బతుకుతున్నారు. అవి పోయే దాకా ఈ వివక్షలు ఇలానే ఉంటాయి. అది మన చేతుల్లో లేదు. మనం మంచి పాటిస్తే అదే మిగతా వారికి ఆదర్శప్రాయం అవ్వచ్చు. అలా కొందరైనా మనల్ని చూసి మారొచ్చు. అది మాత్రమే మనం చేయగలిగింది. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? పిల్లాడిలా ప్రవరిస్తున్నావ్’ అంది నా భార్య. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.ఆ క్షణంలో నా భార్య, నాకు జ్ఞానోదయం కలిగించడానికి ప్రత్యక్షమైన దేవతలా కనిపించింది. -
పోఖరా టు మోతిహారీ
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్లలో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబుపేలుళ్ల కేసులో దోషులైన ఆరుగురిలో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారైంది. ఈ మేరకు ఎన్ఐఏ ఫాస్ట్ట్రాక్ కోర్టు 2016 డిసెంబర్19న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ ఏప్రిల్ 8న హైకోర్టు తీర్పునిచ్చింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లతో పాటు ఆరు నగరాల్లో జరిగిన విధ్వంసాలకు సూత్రధారి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది రియాజ్ భత్కల్. అతడి సోదరుడు యాసీన్ భత్కల్ ఇందులో ప్రధాన పాత్రధారి. రియాజ్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. యాసీన్ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు 2013 ఆగస్టులో పట్టుకున్నారు.కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ మగ్దూం కాలనీకి చెందిన యాసీన్ భత్కల్ అసలు పేరు మహమ్మద్ అహ్మద్ జరార్ సిద్ధిబప్ప. ఇంజినీరింగ్ చేయడానికి పుణే వెళ్లిన ఇతడు అక్కడే యునానీ వైద్యుడిగా ఉన్న తన సోదరుడు ఇక్బాల్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ప్రారంభించి, ఇండియన్ ముజాహిదీన్లో కీలకంగా మారాడు. ఉగ్రవాదంలో 2007 నుంచి క్రియాశీలంగా ఉంటూ, 2008 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండేళ్లకు కుటుంబంతో కూడా పూర్తిగా సంబంధాలను తెంచుకున్నాడు.ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడిగా యాసీన్ భత్కల్ అనేక విధ్వంసాలకు పథకరచన చేశాడు. టిఫిన్బాక్స్, ప్రెషర్ కుక్కర్ బాంబుల తయారీ పద్ధతిని తన అనుచరులకు నేర్పాడు. అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో ఇతడి పేరు వినిపించినా, 2010 ఫిబ్రవరి 13న పుణేలోని జర్మన్ బేకరీ పేలుడుతో ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలోకి చేరాడు. అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, ఢిల్లీ, పుణే, ముంబై తదితర నగరాల్లో 2008–13 మధ్య జరిగిన విధ్వంసాలలో ఇతడి ప్రమేయం ఉండటంతో భద్రతా సంస్థలు ఇతడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.సాంకేతిక నిఘాకు చిక్కకుండా తప్పించుకుంటున్న యాసీన్ను పట్టుకోవడానికి అతడి ఫొటో కీలకంగా మారింది. అందుబాటులో ఉన్న కొన్నేళ్ల కిందటి ఫొటోతో కొన్నాళ్ల పాటు, 2010లో పాస్పోర్ట్ కోసం రాంచీ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడంతో ఆ ఫొటోతో ఇంకొన్నాళ్లు గాలించారు. ఇతగాడు 2008–2011 మధ్య చిక్మగళూరు, మంగుళూరు, కోల్కతా, చెన్నైలలో ఐదుసార్లు తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. యాసీన్ భత్కల్ను పట్టుకోవడానికి ఢిల్లీ స్పెషల్సెల్ అధికారులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. తమ మనిషికి ఉగ్రవాదిగా మార్చి, అతడిని యాసీన్కు దగ్గర చేయడం ద్వారా పట్టుకోవడానికి నఖీ అహ్మద్ను రంగంలోకి దింపారు. 2012 జనవరిలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు నఖీ ఉగ్రవాది అనే ఆరోపణలపై అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు యాసీన్ను పట్టుకునే మరో దారినీ కోల్పోయారు. ఈ ఉదంతం పెను దుమారం రేపడంతో కేంద్ర హోమ్శాఖ కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇంతలో చీకట్లో చిరుదీపంలా మాస్టర్జీ చిక్కాడు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీకి చెందిన బషర్ హసన్ అలియాస్ తల్హా అలియాస్ మాస్టర్జీని ఢిల్లీ పోలీసులు 2013లో పట్టుకున్నారు. 2007లో రియాజ్, ఇక్బాల్, యాసీన్లతో సన్నిహితంగా మెలిగిన మాస్టర్జీని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆ ముగ్గురూ కొరియర్గా వాడుకుంటున్నారని బయటపడింది. రియాజ్, ఇక్బాల్ పాకిస్తాన్కు మకాం మార్చాక యాసీన్ మాత్రమే ఇతడితో టచ్లో ఉన్నాడు. తనపై నిఘా పెరిగిపోవడంతో సెల్ఫోన్ సహా సాంకేతిక అంశాలకు దూరంగా ఉంటున్న యాసీన్ అనేక సందర్భాల్లో మాస్టర్జీని కొరియర్గా వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంలో మాస్టర్జీ చెప్పిన మాటే నేపాల్లోని పోఖరా. అత్యవసర పరిస్థితుల్లో తనను కలుసుకోవాలంటే అక్కడకు రమ్మని యాసీన్ చెప్పినట్లు మాస్టర్జీ బయటపెట్టాడు. దీంతో కేంద్ర నిఘా వర్గాలు బిహార్ సరిహద్దులోని పోఖరాపై దృష్టి పెట్టాయి. 2013 జూలై 7న బుద్ధగయలో వరుస పేలుళ్లు జరిగాయి. దీంతో భత్కల్, అతడి అనుచరులు ఈ విధ్వంసానికి పాల్పడి, సరిహద్దులు దాటి ఉంటారని అంచనా వేసిన ఐబీ ఇద్దరు బిహార్ అధికారులను రహస్యంగా పోఖరా పంపింది. అక్కడ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న ఇద్దరు నిఘా అధికారులూ ముఖ్యంగా యునానీ వైద్యులు, అత్తరు వ్యాపారులపై దృష్టి పెట్టారు. కేవలం ఓ వర్గానికి చెందిన వారే ఉన్నా ఎవరూ అనుమానించనివి ఈ రెండు వృత్తులే కావడమే దానికి కారణం. ఓ యునానీ వైద్యశాలలో ఉన్న వైద్యుడు వీరి దృష్టిని ఆకర్షించడంతో అతడిపై నిఘా ఉంచారు. కొన్ని రోజులకు మరో వ్యక్తి వచ్చి యునానీ వైద్యుడితో కలిసి ఉండటంతో అప్రమత్తమయ్యారు. తమ వద్ద ఉన్న పాత ఫొటోల ఆధారంగా నిశితంగా పరిశీలించి, సదరు యునానీ వైద్యుడే తమకు కావాల్సిన యాసీన్ భత్కల్ అని, పక్కనున్నది అసదుల్లా అక్తర్ అని గుర్తించారు. ఇద్దరూ కరడుగట్టిన ఉగ్రవాదులు కావడంతో వారిని పట్టుకోవడానికి నేపాల్ పోలీసుల సహకారం కోరారు. వారు స్పందించలేదు.చివరకు నేపాల్ పోలీసులకు రూ.50 వేలు లంచం ఇచ్చి, వారి సహకారంతో యాసీన్, అసదుల్లాల్ని అదుపులోకి తీసుకున్నారు. తొలుత తాను యునానీ వైద్యుడినే అంటూ నమ్మించేందుకు ప్రయత్నించిన యాసీన్ ఎట్టకేలకు నిజం బయటపెట్టాడు. దీంతో ఆపరేషన్ యాసీన్ ముగిసిందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఇద్దరు అధికారులు నేపాల్, బిహార్ పోలీసుల సాయంతో వారిని సరిహద్దులు దాటించి 2013 ఆగస్టు 29న జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ)కు అప్పగించగా, బిహార్లోని మోతిహారీ కోర్టులో హాజరుపరచారు. ఆ తర్వాత హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాలకు తరలించి విచారించారు. -
తారకాసుర జననం
కశ్యపుడి పెద్ద భార్య దితి కొడుకులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను విష్ణువు సంహరించాడు. కొడుకుల మరణంతో దితి దుఃఖితురాలై, భర్త శరణు పొందింది. ఆమె అనుగ్రహంతో దితి మళ్లీ గర్భం దాల్చింది. దితికి పుట్టబోయే బిడ్డ వల్ల తనకు ముప్పు వాటిల్లగలదని తలచాడు ఇంద్రుడు. దితి వల్ల జరిగిన అనాచార దోషాన్ని కనిపెట్టిన ఇంద్రుడు, దితి గర్భంలోకి ప్రవేశించి, తన వజ్రాయుధంతో పిండాన్ని ఛేదించాడు. అయితే, దితి వ్రత మహిమ కారణంగా ఆ పిండం నశించలేదు. నలభైతొమ్మిది ముక్కలైన ఆ పిండం ద్వారా దితికి నలభైతొమ్మిది మంది కొడుకులు పుట్టారు. వారు మరుత్తులు అనే దేవతలై, ఇంద్రుడి స్నేహాన్ని పొందారు. దితి తన దోషాన్ని గుర్తెరిగి, మళ్లీ భర్తను సేవించి, గర్భం దాల్చింది. ఈసారి ఆమెకు వజ్రాంగుడు అనే కొడుకు పుట్టాడు. పేరుకు తగినట్లే అతడు వజ్రసదృశ శరీరుడు. అమిత బలవంతుడు. వజ్రాంగుడు అమిత శివభక్తుడు. నిత్య శివారాధన నియమం తప్పక చేసేవాడు. పెరిగి పెద్దయ్యాక అతడు ఇంద్రుడి మీదకు దండెత్తాడు. ఇంద్రుడిని, అతడి దేవ సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు. ఇంద్రుడిని, కొందరు దేవతలను చెరపట్టి, తల్లికి సంతోషం కలిగించాడు. వజ్రాంగుడి వల్ల దేవతలు కర్మఫలాన్ని అనుభవించారు. ఇంద్రుడు సహా ఎందరో దేవతలు వజ్రాంగుడి చెరలో చిక్కుకోవడంతో స్వర్గం కళ తప్పింది. దేవతలను వజ్రాంగుడి చెర నుంచి విడిపించాలంటూ బృందారకులు బ్రహ్మదేవుడిని కోరారు. వారి కోరికతో బ్రహ్మదేవుడు వజ్రాంగుడి వద్దకు వెళ్లాడు. సామగానంతో వజ్రాంగుడిని సంతోషపెట్టి, ఇంద్రాది దేవతలందరినీ అతడి చెర నుంచి విడిపించాడు.వజ్రాంగుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ! ‘ఓ బ్రహ్మదేవా! నాకు ఎవరి మీదా రాగద్వేషాలు లేవు. నా తల్లి ఆజ్ఞ మేరకు దేవతలను చెరపట్టాను. నాకు రాజ్యకాంక్ష లేదు. అందువల్ల స్వర్గాన్ని ఆక్రమించుకోవాలన్న ఆలోచన నాకు అసలే లేదు. నాకు చరమమైన, నిత్యసుఖదాయకమైన ఆత్మజ్ఞానాన్ని బోధించు’ అన్నాడు.అతడి మాటలకు బ్రహ్మదేవుడు సంతోషభరితుడయ్యాడు. ‘వజ్రాంగా! ఒక్క మాటలో చెబుతున్నాను, విను. జ్ఞాన వైరాగ్యాది సాత్త్విక భావనలే తత్త్వసారం’ అని బోధించాడు. అప్పటికప్పుడు వరాంగి అనే కన్యను సృష్టించి, వజ్రాంగుడికిచ్చి వివాహం జరిపించాడు. తర్వాత తన సత్యలోకానికి వెళ్లిపోయాడు. జరిగిన దానికి కశ్యపుడు కూడా సంతోషించాడు.వజ్రాంగుడు పరమ సాత్త్వికుడై వరాంగితో సంసార యాత్ర సాగించసాగాడు. వరాంగి మాత్రం మనసులో ఎలాంటి సాత్త్విక భావాలు లేనిదై, అలవిమాలిన కోరికలతో భర్తను సేవిస్తూ ఉండేది. ఆమె సేవలకు సంతుష్టుడైన వజ్రాంగుడు, ‘నీ మనోభీష్టాన్ని నెరవేరుస్తాను. ఏం కావాలో కోరుకో’ అని అడిగాడు.దానికామె, ‘ముల్లోకాలనూ జయించగలిగేవాడు, ఇంద్రుడిని సైతం క్షోభపెట్టగలిగేవాడు అయిన మహా పరాక్రమవంతుడైన కొడుకు కావాలి’ అని అడిగింది.వరాంగి కోరికకు వజ్రాంగుడు విచలితుడయ్యాడు. తన భార్య అసమంజసమైన కోరిక కోరిందే అని కలత చెందాడు. అయినా మాట ఇచ్చాను కదా, ఏం చేయాలనే ఆలోచనతో మీమాంసలో పడ్డాడు. ఆడిన మాట తప్పరాదనే ధర్మానికి కట్టుబడి, తనకు ఇష్టం లేకపోయినా, చివరకు భార్య కోరికను నెరవేర్చాలనే నిశ్చయించుకున్నాడు. ముల్లోకాలను జయించగలవాడు బ్రహ్మ వాక్కుతో తప్ప జన్మించడం సాధ్యం కాదని తలచి, వజ్రాంగుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ద్వారా వరం పొంది ఇంటికి తిరిగి వచ్చాడు.కొన్నాళ్లకు వరాంగి గర్భం దాల్చింది. నెలలు నిండగానే, మహాకాయుడు అయిన బాలుడు పుట్టాడు. అతడు పుట్టగానే చేసిన రోదనకు ముల్లోకాలలో అనేక ఉత్పాతాలు సంభవించాయి. దుశ్శకునాలు ఎదురయ్యాయి. భూమిపై ఉల్కలు వర్షించాయి. చెవులు చిల్లులు పడేంత మోతతో పిడుగులు పడ్డాయి. అడవుల్లోని జంతువులు ఆందోళన చెంది, దిక్కుతోచక పరుగులు తీశాయి. నక్కలు ఊళలు పెట్టాయి. కుక్కలు నేలను తవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ, కర్ణకఠోరంగా రోదించాయి. భూమి కంపించింది. సముద్రాలు ఉద్ధృతంగా ఉప్పొంగాయి. ప్రళయ ప్రభంజనంలా పెనుగాలులు వీచాయి. పెనుగాలుల తాకిడికి మహావృక్షాలు నేలకొరిగాయి. మేఘాలు చీము నెత్తురులను వర్షించాయి. పక్షులు గూళ్లు విడిచి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. వాటిలో చాలా పక్షులు చచ్చి నేల రాలాయి. స్వర్గంలో ఇంద్రుడి సింహాసనం తూలింది. అది చూసి దేవతలంతా భయకంపితులయ్యారు. ఈ ఉత్పాతాలు సమసిపోవడానికి కొన్ని నెలలు పట్టింది.వజ్రాంగుడికి, వరాంగికి పుట్టిన బాలుడికి కశ్యప ప్రజాపతి తారకుడు అని నామకరణం చేశాడు. పెరిగి పెద్దవాడైన తారకుడు తాను బ్రహ్మ గురించి తపస్సు చేస్తానని, తపస్సుకు అనుమతించమని తల్లిని కోరాడు. ఆమె అనుమతించడంతో మధువనానికి చేరుకుని, బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కొన్ని వందల సంవత్సరాలు అతడు కఠోరమైన తపస్సు సాగించాడు. తపస్సు చేస్తుండగా, అతడి తల నుంచి వెలువడిన తేజస్సు ముల్లోకాలలో మహోపద్రవాన్ని కలిగించింది. దేవతలు భయభ్రాంతులై, ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కించాలంటూ బ్రహ్మదేవుడి వద్ద మొరపెట్టుకున్నారు.చివరకు బ్రహ్మదేవుడు తారకుడికి ప్రత్యక్షమయ్యాడు. ‘నాయనా! నీ తపస్సుకు ముల్లోకాలూ కల్లోలంగా మారాయి. నీ మనోభీష్టమేదో కోరుకో, తప్పక వరమిస్తాను’ అన్నాడు బ్రహ్మదేవుడు.‘బ్రహ్మదేవా! ముల్లోకాలలోనూ నన్ను మించిన బలవంతుడు ఎవరూ ఉండకూడదు. శివునికి పుట్టిన కొడుకు ఏనాడు సేనాధిపత్యం వహించి, నాపై ఆయుధ ప్రయోగం చేస్తాడో ఆనాడు మాత్రమే నేను మరణించేలా అనుగ్రహించు’ అని కోరాడు.బ్రహ్మదేవుడు ‘తథాస్తు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.∙సాంఖ్యాయన -
దేవుని రాజ్యం కన్నీళ్లు లేని రాజ్యం
నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను భక్తిపారవశ్యంతో జరుపుకొంటున్నారు. సమాధిని గెలిచిన క్రీస్తు ప్రభుని అపార శక్తిని తలచుకొంటూ ఆయన దివ్యనామాన్ని కీర్తిస్తున్నారు. యేసును మదిలో నిలుపుకుంటే ఇక కొరతేమీ లేదు అంటూ ఆనందిస్తున్నారు. ‘మరణమున్ జయించి లేచెన్ మన ప్రభువు నేడు. మహిమ దేహమున్ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవవరములియ్య వసుధపైని’ అంటూ పునరుత్థానుడైన క్రీస్తును కీర్తించే పాటలను పాడుతూ తరిస్తున్నారు.‘యాత్రికుని ప్రయాణము’ జాన్ బన్యన్ రచించిన ప్రసిద్ధ క్రైస్తవ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తరువాత అనేక భాషల్లోనికి అనువదితమైన పుస్తకం ఇది. ఇంగ్లండులోని బెడ్ఫోర్డ్షైర్లో జాన్ బన్యన్ నివసించేవాడు. ఆ కాలంలోని అధికారులు, మతపెద్దలు జాన్ బన్యన్ను సుమారుగా పన్నెండేళ్లు కారాగారంలో ఉంచారు. ఆ ప్రతికూల వాతావరణంలో దేవుడు అనుగ్రహించిన దర్శనం నుంచి పుట్టిన గొప్ప రచన ‘యాత్రికుని ప్రయాణము’. ఈ రచనలో ఒక వ్యక్తి తన పాపభారం నుంచి విముక్తి పొందడానికి పరమపురి వైపు చేసే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చిత్రీకరించారు. నాశనపురం నుంచి పారిపోతున్న క్రైస్తవుణ్ణి ఒప్పించి వెనుకకు తేవడానికి పాషాణం, నవనీతం అనే ఇద్దరు మిత్రులు వెంటబడతారు. వారు చెప్పిన దానికి ఒప్పుకోవడం పోయి క్రైస్తవుడు వారినే తనతో వచ్చేయమని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. పాపభారం నుంచి విడుదల వెతుక్కుంటూ ఉన్న ఊరును కుటుంబాన్ని విడిచిపెట్టి ఏం సాధించాలని వెళ్ళిపోతున్నావని పాషాణం ప్రశ్నిస్తాడు. దానికి క్రైస్తవుడు ఇచ్చిన సమాధానం ఇది. ‘నేను అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం సంపాదించుకొనేందుకు వెళ్తున్నాను. శ్రద్ధతో వెదికేవారికి ఆ వారసత్వం దొరుకుతుందని ఈ పుస్తకంలో రాసి ఉంది.’ప్రపంచంలో కుల మత జాతి వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా మానవులు వెతుకుతున్నవి రెండు: ఈ భూమ్మీద జీవించినంత కాలం మనశ్శాంతి, చనిపోయిన తరువాత మోక్షం. ఈ విచిత్రమైన విశ్వంలో మానవునికి సాటిౖయెన సృష్టియేదియు లేదు. దేవుడు మానవునికి అత్యంత విలువైన స్థానాన్ని ఇచ్చి ఘనపరచాడు. అయితే, మానవుడు ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి, తనను సృజించిన దేవుని మీదే తిరుగుబాటు చేయగా తట్టుకో లేకపోయాడు. ప్రేమాస్వరూపి కావడంతో క్రోధంతో కాక కనికరంతో మరలా మనిషికి దగ్గరవ్వాలనే కరుణామయునిగా ఈ లోకానికి వచ్చాడు. ద్వేషించిన మానవుణ్ణి అపరిమితంగా ప్రేమించి, ప్రాణ త్యాగాన్ని చేసి రక్షించాలన్నది పరమదేవుని కోరిక.దేవుని ప్రేమను రుచిచూసిన యోహాను అనే భక్తుడు రాసిన సువార్తలో ఓ అద్భుతమైన వాక్యం ఉంది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన్ను విశ్వసించువారు నశింపక నిత్యజీవం పొందుతారు.’ దేవుని ప్రేమను అర్థం చేసుకున్న ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాశుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా? నా జీవితం అంకితం నీకే.’ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో పురాతత్త్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఈ ప్రదేశం మొదట ఫోనీషియన్ కాలనీగా, వాణిజ్య ప్రాంతంగా స్థిరపడింది. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో హస్నోనియన్ పాలనలో బాగా విస్తరించబడింది. ఆ తదుపరి రోమన్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని దానిని స్వయం ప్రతిపత్తిగల నగరంగా ప్రకటించారు. వారి ద్వారా నియమించబడిన హేరోదు రాజు ఈ ప్రాంతాన్ని గణనీయంగా విస్తరించాడు. అతడు అక్కడ ఒక నౌకాశ్రయాన్ని నిర్మించి, ఆ పట్టణాన్ని, ఓడరేవును కైసరు అగస్టస్కు ౖకైసరియగా అంకితం చేశాడు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు అని బైబిల్లో అతని గూర్చి రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన్ను విశ్వసించువారు నశింపక నిత్యజీవం పొందుతారు.పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్ష నుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళులేని రాజ్యం.పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానమును అనుభవిస్తారు. దైవిక సమాధానం సమస్త జ్ఞానమునకు మించినది. సువార్తలలో పిలాతు గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. చరిత్ర కూడా ఆ విషయాలను ధ్రువీకరిస్తుంది. పిలాతు ప్రతిభ కలిగిన నాయకుడు, పాలకుడు. అతడు యూదయ ప్రాంతానికి గవర్నరుగా రోమన్ల ద్వారా నియమించబడ్డాడు. సమర్థంగా పరిపాలించడంలోను తన అధికారంతో అందరినీ అదుపులో ఉంచడంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అతడు న్యాయదృష్టి గలవాడని, ప్రజాక్షేమం ఎరిగినవాడని అంటారు. రోమన్ల టోపీల మీద ఉండే కైసరు ప్రతిమ విషయంలో యూదులకు, పిలాతుకు ఒకసారి వాదం వచ్చింది. ఎలాంటి ప్రతిమ పరిశుద్ధ పట్టణంలో కనబడకూడదని యూదులు వాదించారు. చివరకు కైసరుకు ఆ విషయాన్ని నేరుగా విన్నవించుకొని యెరూషలేములో ఉన్నంత వరకు రోమా సైనికులు వాటిని ధరించకూడదన్న తీర్పును పొందారు. మరొక సందర్భంలో యెరూషలేములో నీటి కొరతను నివారించడానికి ఓ మంచి కాలువ నిర్మిద్దామని పథకం వేశాడు. అంత పెద్ద పనికి ధనం ఎలా సమకూర్చాలి? దేవాలయం నుండి తీసుకోవాలనుకున్నాడు. యూదులు నిరాకరించారు. నీటి సరఫరా మెరుగుపడితే వాళ్ళకు కూడా ప్రయోజనం ఉన్నప్పటికీ యూదు నాయకులు ఒప్పుకోలేదు. వీధులలో ప్రదర్శనలు జరిగాయి. తిరుగుబాటు జరిగింది. అప్పుడు పిలాతు సైనికులను మారువేషాల్లో జనంలో కలిసిపోయేలా చేసి, అంతా ఆదమరచి ఉన్న సమయంలో దేవాలయ ప్రాంతంలోనే హఠాత్తుగా ఊచకోత కోయించాడు. యెరూషలేము వీధుల్లో రక్తం ఏరులై పారింది. యేసుక్రీస్తు ప్రభువుకు తీర్పు తీర్చుటకు పిలాతు వద్దకు తీసుకెళ్ళారు. ఆ దినాల్లో యూదుల పెద్దలకు ఎవ్వరికీ మరణ శిక్ష విధించే అధికారం లేదు. యేసుకు మరణశిక్ష విధించబడాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా పిలాతు ముందుకు తీసుకొచ్చారు. తనకెదురైన బాధ్యత నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. మొదటిసారి ‘మీరతనిని తీసుకొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడి’ అన్నాడు. రెండవసారి హేరోదు దగ్గరికి పంపివేయాలని చూశాడు. యేసును శిక్షించి ఆ దీన స్వరూపాన్ని యూదులకు చూపించి వాళ్ళ జాలిని సానుభూతిని రేకెత్తించి తప్పించుకోవాలనుకున్నాడు. బరబ్బను తీసుకొని వచ్చి వీరిద్దరిలో ఒకరిని ఎన్నుకోమనడం ద్వారా తప్పించుకోవాలని చూశాడు. చివరికి నీళ్ళు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ‘ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి’ అని చెప్పాడు. యేసుక్రీస్తునకు అన్యాయపు తీర్పు తీర్చబడినది. సిలువను భుజమున మోపి యెరూషలేము వీధుల్లో ఆయన్ను నడిపించి, చివరకు కల్వరి అనే ప్రాంతానికి తీసుకొని వచ్చి, ఆయనకు సిలువ మరణాన్ని విధించారు. ప్రస్తుత దినాల్లో యెరూషలేము సందర్శించే ప్రతి ఒక్కరూ వయా డొలోరొసా అని పిలువబడే సిలువ మార్గంలో నడుస్తారు. అందులో 14 విశిష్ట ప్రాంతాలుంటాయి. మొట్టమొదటిగా చంద్రుని మీద కాలుమోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ యెరూషలేమును దర్శించినప్పుడు క్రీస్తు సిలువబాటలో నడిచాడు. ఒకచోట కూర్చొని బిగ్గరగా ఏడ్చి ఉద్వేగానికి లోనయ్యాడు. ఎందుకు అంతగా చలించిపోయారని ఎవరో అడిగితే నీల్ ఇలా సమాధానమిచ్చాడు. ‘నేను లక్షల మైళ్ళు ప్రయాణం చేసి చంద్రునిపై కాలు మోపినప్పుడు కూడా ఇంతటి ఉద్వేగానికి లోనవలేదు గాని క్రీస్తు ప్రభువు సంచరించిన ప్రాంతాలను నా పాదాలు తాకినప్పుడు కృతజ్ఞతతో నా హృదయం నిండిపోయింది.’ఆ పరమాత్ముడైన ప్రభువు అంతటి ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా సిలువపై పలికిన సుమధుర స్వరాలు మానవాళి యెడల ఆయనకున్న ప్రేమ, శ్రద్ధ, బాధ్యతను తెలియజేస్తున్నాయి. ఒక వ్యక్తి తన జీవిత చివరి క్షణంలో పలికే మాటలు చాల ముఖ్యమైనవి. యేసుక్రీస్తు తన చివరి క్షణాలలో కూడా మానవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.యేసు ‘‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. గనుక వీరిని క్షమించుము’’ అని చెప్పెను (లూకా 23:34).యేసు సిలువలో పలికిన మాట క్షమాపణ గొప్పతనాన్ని తెలియచేస్తుంది. వాస్తవానికి క్రీస్తును హింసిస్తున్న వారంతా క్షమార్హతను కోల్పోయినప్పటికీ, వారిని మనసారా క్షమించడానికి ఇష్టపడ్డారు. పిల్లలను క్షమించలేని తల్లిదండ్రులు, పెద్దలను క్షమించలేని బిడ్డలు ఉన్న ఈ ప్రపంచంలో క్షమాపణ ఔన్నత్యాన్ని క్రీస్తు తెలియచేశారు. పగలను ప్రతీకారేచ్ఛలను మనసులో ఉంచుకున్నంత కాలం మనిషి సంతోషంగా ఉండలేడని వైద్యులు చెబుతున్న సత్యం. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచించే ఈ రోజుల్లో తెలిసి తెలిసి ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వేస్తున్నారని తెలిసిన గొప్ప క్షమాగుణం ఆయనది. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు (లూకా 23:43)’యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలోనే మరో ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. వారు నేరస్థులు. ఒకతని పేరు గెట్సస్, మరొక వ్యక్తి పేరు డిస్మస్. వారి పాపం పండిన రోజు రానే వచ్చింది. ఆ సమయంలో మొదటివాడు తన తప్పుకు తాను పశ్చాత్తాప పడకుండా ఆయనను దూషిస్తూ ‘నీవు క్రీస్తువు గదా! నిన్ను నీవు రక్షించుకొని, నన్ను కూడా రక్షించు’మని హేళనగా మాట్లాడాడు. నేరానికి తగిన శిక్షను అనుభవిస్తున్నా పశ్చాత్తాపం అతనిలో లేదు. రెండోవాడు మాత్రం అతనిని వారించి, యేసువైపు చూచి ‘నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’మని హృదయపూర్వకంగా ప్రభువు శరణు కోరినపుడు ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు’ అని దివ్య వాగ్దానం చేశారు. పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్ష నుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళులేని రాజ్యం. ‘యేసుక్రీస్తు తన తల్లిని ఇదిగో నీ కుమారుడు అనియు, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని పలికెను’ – (యోహాను 19:26,27). యేసుక్రీస్తు తనను నమ్ముకున్న వారిని ఏనాడూ ఒంటరిగా విడువడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అంతవరకు తల్లి ఆలనా పాలనా కుమారునిగా చూసుకున్న ప్రభువు తన తర్వాత తన బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. అంతటి మరణ వేదనలో సైతం తన తల్లి గురించి ఆలోచించిన గొప్ప మనసు ఆయనది. ‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను’– (మత్తయి 27:45).ఈ మాట అరమేయిక్ భాషలో ప్రభువు మాట్లాడెను. ఆనాటి దినాలలో యూదులు హెబ్రీ భాషతో పాటుగా అరమేయిక్ భాషను వ్యవహారిక భాషగా మాట్లాడేవారు. ప్రభువు పలికిన ఈ మాటకు ‘నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి’ అని అర్థం. మానవుని పాపములను తొలగించుటకు, శిక్షను భరించుటకు ఇల వచ్చిన ప్రభువు చేతిని తండ్రి వదిలివేసే పరిస్థితి ఎందుకొచ్చింది? పరిశుద్ధుడైన దేవుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు. అయినా ఎందుకు తండ్రి నుండి ఎడబాటు పొందాల్సి వచ్చింది? ఆయన మన పాపములను ఆయన మీద మోసుకుంటూ పాపముగా మారినందుకే కదా! పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. ‘దప్పిగొనుచున్నాను’ (యోహాను 19:28)యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవునిగా అందరికీ ఉండే అనుభవాలను అనుభవించాడు. దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుత కార్యాలను చేశాడు. సంపూర్ణ దేవుడుగా ఉన్న ఆయన సంపూర్ణ మానవునిగా మారి దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలని ఇష్టపడ్డాడు. జీవజలమును కానుకగా ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు దాహంలో అంత మండుటెండలో దప్పిక గొనడం ఎంత బాధాకరం! ఆ దప్పిక శారీరకమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. మానవుల రక్షణ విమోచన ఆ దప్పిక. నీవు రక్షణ పొందిన రోజు మాత్రమే ఆయన దప్పిక తీరుతుంది. ‘సమాప్తమైనది’ (యోహాను 19:28).ఇది విజయానందంతో వేసే జయకేక. ఒక వ్యక్తి తాను తలపెట్టిన కార్యమునంతా ముగించి, సాధించాక వేసే కేక. మరింతకు ఆయన ఏమి సాధించారు? అంత బిగ్గరగా విజయానంద కేక వేసేంత ఏమి జరిగింది? యేసుక్రీస్తు ఈ లోకానికి అనుకోకుండానో, ఏ కారణం లేకుండానో ఆకస్మికంగా రాలేదు. ఒక పరమార్థం కలిగి తండ్రి పని నెరవేర్చుటకు ఆయన వచ్చెను. అంతవరకు ధర్మశాస్త్రమనే కాడి కింద మగ్గిపోతున్న వారిని విడిపించుటకు, దానిని నెరవేర్చుటకు వచ్చెను. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కాని, దానిని నెరవేర్చి మనుషులకున్న తెరను తొలగించాడు. ఆయనకు అప్పగించబడిన దైవచిత్తమును సిలువ మరణం ద్వారా నెరవేర్చి సంతోష కేక వేసారు. ‘తండ్రీ, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంటున్నాను’– (లూకా 23:46).ఆయన సిలువలో ఎంతో తీవ్రమైన వేదనను అనుభవిస్తూ, మానసికంగాను, శారీరకంగాను బాధను భరిస్తూ సిలువలో సర్వజనులను ఉద్దేశించి పలికిన చివరి మాట ‘అప్పగించుకొంటున్నాను’ మనలో ఉన్న ఆత్మ మనం చనిపోయాక దేవునికి అప్పగించుకోవాలి. ఈ లోకంలో ఎలా బతికినా, చనిపోయాక దేవుడు అంగీకరించే యోగ్యమైన రీతిలో మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనిషి అంటే కేవలం పైకి కనబడే దేహం మాత్రమేకాదు, లోపల ఆత్మ కూడా ఉంది అని గ్రహించాలి. చనిపోయాక మట్టి నుండి తీయబడిన దేహం తిరిగి మట్టిలో కలుస్తుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. మనలో ఉన్న ఆత్మ దేవుడు అనుగ్రహించిన దానము. గనుక తిరిగి ఆయనకు అప్పగించాలి.యేసు సిలువలో చనిపోయిన తరువాత అరిమతయి యోసేపు అనే ధనికుడు యూదుల న్యాయసభ సభ్యుడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహమును ఇమ్మని అడుగుతాడు. పిలాతు అంగీకారాన్ని తెలిపిన పిమ్మట యేసు దేహాన్ని సిద్ధపరచి తన సమాధిలో ఉంచాడు. ఆ సమయంలో ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము కూడా సహకరిస్తాడు. దుఃఖ వదనాలతో బహుశా ప్రతి ఒక్కరూ ఆ సాయంత్రం తమ గృహాలకు వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయంలో యేసును అపరిమితంగా ద్వేషించిన యూదా పెద్దలకు ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తాను మరణాన్ని జయించి తిరిగి లేస్తానని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని పిలాతు దగ్గరకు వెళ్ళి సమాధిని కాపలా కాయుటకు కావలివారు కావాలని అడిగారు. వారు రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు. ఆదివారం ఉదయం కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చేసరికే యేసుక్రీస్తు మరణాన్ని జయించి సమాధి నుండి బయటకు వచ్చేశారు. మరణపు ముల్లు విరిచివేయబడింది. మరణపు మెడలు వంచబడ్డాయి. తరతరాలుగా మనిషిని బంధించి యుంచిన మరణం నిర్వీర్యమై పోయింది. ఆ తెరువబడిన సమాధి నుండి వారికి దూత ద్వారా వచ్చిన సందేశం ఇది. ‘మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.’ ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలోని యేసుక్రీస్తు ఖాళీ సమాధికి వెళ్తే ఇవే మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. క్రీస్తు పునరుత్థానం ప్రవక్తల ద్వారా ముందే ప్రవచించబడింది. తాను మరణించక మునుపు అనేకసార్లు తన పునరుత్థానం గురించి క్రీస్తు తెలియచేశాడు. పునరుత్థానుడైన క్రీస్తు తన దర్శన భాగ్యాన్ని అనేకులకు ఇచ్చాడు. ఐదువందల మందికి పైగా సజీవుడైన క్రీస్తును కన్నులారా చూశారు. ఆయన మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. ఏళ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకాలతో ఆనందించే అవకాశం కలిగింది. రోగం మీద, వ్యాధి బాధల మీద సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కలిగించింది. ఇంతవరకు మానవాళి మీద çపంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది.సమాధికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని, ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. నిరాశా నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశాకిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడైపోయింది. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇవి మానవ హృదయాలకు సంబంధించినది తప్ప భౌతికానుభవాలకు చెందినవి కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ ఇట్టే అవగతమవుతుంది. లోక వినాశానానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది.యేసుక్రీస్తు పునరుత్థానం వలన మానవులకు చేకూరిన ప్రయోజనాలు ఇవి. సమాధానం: యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి గదిలో ఉన్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమై ప్రభువు పలికిన వాగ్దాన వచనం ‘సమాధానం కలుగును గాక!’ పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానమును అనుభవిస్తారు. దైవిక సమాధానం సమస్త జ్ఞానమునకు మించినది. భయపడకుడి: పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా పొందుకునే మరొక వాగ్దానం ‘భయపడకుడి’. లోకమంతా ఎన్నో భయాలతో నిండినది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. దేవుని మీద విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయం తప్పక స్వంతం అవుతుంది.నిరీక్షణ: యేసుక్రీస్తు మొదటగా లోక పాపములను మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగి లేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్ర జీవితాన్ని, ఆయన యందలి విశ్వాసమును కొనసాగించువారికి నిత్యజీవమును అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై యుండని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశపడతారు కాని, ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు నిరీక్షణ ఎన్నడు అవమానమునకు, సిగ్గుకు కారణము కాదు. జర్మనీలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని, సగటు మనిషి బానిసగానే ఉన్నాడని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వల్ల రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురుతిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే!ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశా నిస్పృహలతో తన ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టమనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలువబడిరది. జర్మనీలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే నిరాశలో ఉన్నాను. దుఃఖంలో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిట’ని ప్రశ్నించాడు. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. ‘నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా!’ లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏ విషయానికీ బెదిరిపోడు. తుది శ్వాస వరకు నా భర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే, లూథర్లో ఉన్న భయం పటాపంచలయ్యింది. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికి పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశాకిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడైపోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినా, మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. -
పెట్స్కు ఫోన్ చేయండి.. కుక్కల భాష తెలుసుకోండి!
పెంపుడు జంతువులపై ప్రేమతో వాటికి కావాల్సిన వస్తువులు, దుస్తులు, బొమ్మలు ఇలా చాలానే కొంటుంటారు. కాని, ఇప్పుడు ఆ జంతువులకు, వాటి యజమానులకు ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక గాడ్జెట్స్ మీ కోసం..పెట్ ఫోన్పెంపుడు జంతువులకు కూడా ఫోన్ చేసి మాట్లాడే వీలు కల్పిస్తుంది ఈ ‘పెట్ ఫోన్’. దీని ద్వారా మీ పెట్స్ ఎక్కడున్నా, ఎప్పుడైనా సరే వాటికి ఫోన్ చేసి టచ్లో ఉండొచ్చు. క్లౌడ్ సిమ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ టూ వే కమ్యూనికేషన్ ఫీచర్తో పనిచేస్తుంది. ఇందులోని జీపీఎస్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ సాయంతో సిగ్నల్ తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ వాటి లొకేషన్ను గుర్తించి సమాచారం ఇస్తుంది. ధర రూ. 32,411 మాత్రమే!పెంపుడుజీవాల ఆరోగ్యానికి రక్షణపెంపుడు జంతువుల అనారోగ్యం గుర్తించడంలో ఆలస్యం అయితే, వాటి ప్రాణాలకే ప్రమాదం. వాటి ఆరోగ్యం విషయంలో ఎంతగానో జాగ్రత్త తీసుకోవాలి. పెంపుడు జంతువుల హెల్త్ చెకప్ కోసం తయారు చేసినదే ఈ ‘విజ్డమ్ ప్యానెల్ ప్రీమియం’. ఇది డీఎన్ఏ పరీక్ష కిట్తో పాటు, వివిధ పరీక్షల ప్యాకేజింగ్తో వస్తుంది. ఈ పరీక్షలతో దాదాపు 211 జన్యు, ఇతర ఆరోగ్య పరిస్థితుల ఫలితాలు, వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ధర వివిధ ప్యాకేజీలను బట్టి ఉంటుంది.శునక భాషను అనువదిస్తుంది..శునకాలు మూగజీవులైనప్పటికీ వాటికీ ఓ భాష ఉంటుంది. అవి కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాయి. మనకే అర్థం కావు. తాజాగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కుక్కల భాషను అర్థం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన ‘పెట్ ట్రాన్స్లేటర్’ను అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేకమైన పరికరం కుక్కలు మొరిగే తీరు, అవి చేసే వివిధ శబ్దాల ఆధారంగా అవి చెప్పాలనకున్న విషయాన్ని మనకు తెలిసిన భాషలో వివరిస్తుంది. ధర 220 డాలర్లు. (రూ. 18,817) మాత్రమే!పాటీ క్లీనర్ ప్రేమగా పెంచుకున్నప్పటికీ పెంపుడు జంతువుల విసర్జనను శుభ్రం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. అయితే, ‘ఐ రోబో రోంబా జే7’ వాక్యూమ్ ఈ పనిని చాలా చక్కగా చేస్తుంది. సాధారణ రోబో వ్యాక్యూమ్స్ పాటీలను గుర్తించలేవు. కాబట్టి, వాటిని సరిగ్గా శుభ్రం చేయలేవు. కాని, ఈ రోంబా జే7 పెట్ పాటీలను గుర్తించి ప్రత్యేకంగా వాటిని శుభ్రం చేస్తుంది. ధర 799 డాలర్లు (రూ. 68,322). ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. -
చాట్ జీపీటీ సాయంతో కేసు గెలిచాడు..!
సినిమాల్లో మాదిరి పంచ్ డైలాగ్స్తోనూ, నవ్వులు కురిపించే వాదనలతో కాదు. కేవలం, పదే పది నిమిషాల్లో సూటిగా సుత్తిలేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా, అసలు లానే చదవకుండా వాదించాడు ఈ లాయర్. ఆ లాయర్ పేరే ‘చాట్ జీపీటీ’. తాజాగా ఓ కుర్రాడు ఈ టెక్నాలజీ సాయంతోనే కోర్టులో తన కేసు గెలిచాడు. కేసు వాదనలు పట్టుమని పది నిమిషాల్లోనే పూర్తయిపోయాయి. వాయిదాల లాయర్ల మాదిరిగా కాకుండా, చాట్ జీపీటీ ఫటాఫట్ కేసు ముగించేసింది. కజక్స్తాన్లోని అల్మాటీ నగరానికి చెందిన కెంజెబెక్ ఇస్మాయిలోవ్ తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో, బేస్లైన్ క్రాస్ చేసి, ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించాడు. ఈ అపరాధానికి ప్రభుత్వం అతనికి పదకొండు డాలర్లు (అంటే రూ.940) జరిమానా విధించింది. పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడూ కోర్టుకు వెళ్లని ఇస్మాయిలోవ్కి కోర్టు పద్ధతులు తెలియవు. తన కేసును వాదించడానికి లాయర్ల సాయం తీసుకోకుండా, చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. అది అతనికి కోర్టులో సవాలు చేయమని సలహా ఇవ్వడమే కాదు, కేసు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసింది. పది నిమిషాల విచారణలో, జడ్జి అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ స్పీచ్ సింథసిస్ ఫీచర్ ద్వారా అతను సమాధానాలు ఇచ్చాడు. చాట్ జీపీటీ వాదన ఎంతో సమర్థంగా ఉండటంతో జడ్జి జరిమానాను రద్దు చేశారు. (చదవండి: -
హనుమద్వ్రత మహిమ
కౌరవులతో జరిగిన మాయద్యూతంలో ఓడిపోయి పాండవులు అడవుల పాలయ్యారు. ద్రౌపదీ సమేతంగా పాండు నందనులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అడవులలో సంచరిస్తూ నానా ఇక్కట్లు పడసాగారు. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు శిష్యసమేతంగా పాండవులనే అనుసరిస్తూ అరణ్యమార్గం పట్టాడు. అరణ్యవాస కాలంలో ధౌమ్యుడు పాండునందనులకు అనేక ధర్మశాస్త్రములు, పురాణాలను చెబుతూ ఉండేవాడు. వారి చేత సమయానుకూలంగా పూజ పురస్కారాదులు చేయిస్తూ ఉండేవాడు.కొన్నాళ్లకు పాండవులు ద్వైతవనానికి చేరుకుని, అక్కడ మకాం వేశారు. పాండవులను చూడటానికి ఒకనాడు వ్యాస మహర్షి ద్వైత వనానికి చేరుకున్నాడు. ధర్మరాజు, ఆయన నలుగురు సోదరులు, ధౌమ్యుడు, ఆయన శిష్యులు ఎదురేగి వ్యాస మహర్షిని సగౌరవంగా స్వాగతించారు. ధర్మరాజు ఆయనకు అర్ఘ్య పాద్యాలను సమర్పించి, అతిథి సత్కారాలు చేశాడు. పాండవుల యోగక్షేమాలను వ్యాసుడు పేరు పేరునా అడిగి తెలుసుకున్నాడు. ద్రౌపది పాతివ్రత్యాన్ని ప్రశంసించాడు.‘మహర్షీ! ఎన్నడూ ధర్మం తప్పని మాకు ఈ అరణ్యవాస క్లేశమెందుకు సంభవించింది? తెలిసి గాని, తెలియక గాని మా వల్ల జరిగిన అపరాధం ఏదైనా ఉందా? తెలిసీ తెలియక అపరాధం చేసిన ఫలితంగానే ఈ ఇడుములు సంభవించినట్లయితే, దానికి పరిహారమేదైనా ఉందా?’ అని ధర్మరాజు సవినయంగా వ్యాసుడిని అడిగాడు.‘నాయనా, యుధిష్ఠిరా! నీ సోదరుడు అర్జునుడు తెలిసీ తెలియనితనంతో ఒకసారి హనుమంతుడి పట్ల అపచారం చేశాడు. దాని ఫలితంగానే మీకు ఈ ఇక్కట్లన్నీ వచ్చి పడ్డాయి. రాజసూయం విజయవంతంగా చేసిన ఆనందంలో మీరంతా ఇంద్రప్రస్థంలో తులతూగుతూ ఉన్న కాలంలో ద్రౌపది హనుమద్వ్రతాన్ని చేయాలని సంకల్పించుకుంది. సంకల్పానికి చిహ్నంగా పవిత్ర తోరాన్ని ధరించింది. అర్జునుడు ఆమె చేతికి ఉన్న తోరాన్ని గమనించాడు. అదేమిటని అడిగాడు. హనుమద్వ్రతం చేసే సంకల్పంతో కట్టుకున్న పవిత్ర తోరమని ద్రౌపది చెప్పింది. ఈ వ్రతం చేయమని తనకు శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పింది. తన రథం మీదనున్న జెండాపై ఉండేవాడు ఒకరు, తన రథాన్ని తోలేవాడు ఇంకొకరు. వీరిద్దరూ తనకంటే అధికులా అనే అహంకారంతో అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న ఆ తోరాన్ని తీసేయించాడు. పూజలు వ్రతాలు దేవతలకు చేయాలి గాని, ఒక వానరానికి చేయడమా అని ఈసడించాడు. ద్రౌపది విలపిస్తూ తోరాన్ని తీసేసింది. ఫలితంగా తాను సంకల్పించిన వ్రతాన్ని ఆమె చేయలేకపోయింది. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు చేయవలసిన పవిత్ర వ్రతం అది. ద్రౌపదికి వ్రతభంగం జరిగిన కారణంగానే మీకు ఇక్కట్లు మొదలయ్యాయి. పదమూడేళ్లు మీకు ఈ కష్టాలు తప్పవు. ఆ తర్వాతనైనా సకల శుభాలు జరగాలంటే, ఈ వనవాసకాలంలోనే హనుమద్వ్రతం చేయడం మంచిది’ అని చెప్పాడు వ్యాసుడు.అక్కడే ఉన్న ద్రౌపది తనకు వ్రతభంగం కలిగిన మాట నిజమేనని చెప్పింది. అర్జునుడు తానే ఆమె చేతికి ఉన్న తోరాన్ని తీసివేయించానని పశ్చాత్తాపంతో చెప్పాడు.‘సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన వ్రతాన్ని ఇప్పటికైనా ఆచరించడమే మీకు శ్రేయస్కరం’ హితవు చెప్పాడు వ్యాసుడు.‘వ్రత విధానం ఏమిటో సెలవివ్వండి మహర్షీ!’ అని ప్రార్థించాడు ధర్మరాజు.‘మార్గశిర శుక్ల త్రయోదశి రోజున హనుమంతుడి విగ్రహాన్ని గాని, చిత్రపటాన్ని గాని ప్రతిష్ఠించి పూజించాలి. హనుమంతుడి శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపా కలశంలోకి ఆవాహన చేసి, కలశ స్థాపన చేయాలి. వ్రతానికి ఉపక్రమించే ముందు, వ్రత సంకల్పాన్ని చెప్పుకుని, వ్రతాన్ని ఆచరించేవారు పవిత్ర తోరాన్ని ధరించాలి. పుష్పాక్షతలతో వ్రతపూజ చేయాలి. హనుమంతుడికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. వ్రతపూజ తర్వాత హనుమత్ కథల శ్రవణం చేయాలి. ఆ తర్వాత హనుమత్ ప్రసాదాన్ని ఆరగించాలి. భక్తిశ్రద్ధలతో ఈ విధంగా పదమూడు సంవత్సరాలు హనుమంతుడిని ఆరాధిస్తే, సంపూర్ణంగా హనుమంతుడి అనుగ్రహం లభించి, ఆపదలు, గ్రహబాధలు, రోగపీడలు, శత్రుబాధలు తొలగుతాయి. సకల సంపదలు, సుఖశాంతులు దక్కుతాయి’ అని వివరించాడు వ్యాసుడు. అంతేకాకుండా, హనుమంతుడి మహిమను తెలిపే కథలను ఆయన పాండవులకు చెప్పాడు. వనవాస కాలంలో సాక్షాత్తూ శ్రీరాముడు సుగ్రీవాదులతో కలసి పంపాతీరాన హనుమత్ వ్రతాన్ని ఆచరించాడని, ఆ తర్వాత లంకపై వానర సేనతో కలసి దండెత్తి, రావణ సంహారం చేయగలిగాడని చెప్పాడు.ద్వైతవనంలో పాండవులతో కొన్నాళ్లు గడిపి వ్యాసుడు తన దారిన తాను వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు మార్గశిర మాసం వచ్చింది. వ్యాసుడు చెప్పినట్లుగానే ద్రౌపదీ సమేతంగా పాండవులు ధౌమ్యుడి ఆధ్వర్యంలో హనుమత్ వ్రతాన్ని ఆచరించారు. నియమం తప్పకుండా పదమూడేళ్లూ పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి సకల శుభాలు కలిగాయి. అర్జునుడి జెండాపై పరివేష్ఠితుడైన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కించాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తుదముట్టడంతో పాండవులకు రాజ్యం దక్కింది. ∙సాంఖ్యాయన -
యువ కథ: సింహాసనం
‘లైట్స్.. కెమెరా.. యాక్షన్!’ అన్నాడు డైరెక్టర్ బాలరాజ్ వర్మ. ట్రైన్ సెట్లో హీరోయిన్ సనుష దాస్ను చుట్టుముట్టిన రౌడీల బారి నుంచి హీరో నితీష్ కాపాడే సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ఒకే షాట్లో తీయాల్సిన కీలకమైన సన్నివేశం కావటంతో సినిమా యూనిట్ మొత్తం చాలా ఏకాగ్రతతో ఎవరి పని వారు చేస్తున్నారు. ఇంతలో గేదెల అరుపులకు షాట్ ఫెయిల్ అయింది. ఆ షాట్ బాగా రావటం కోసం చాలా ప్రాక్టీస్ చేసిన నితీష్కు పట్టరాని కోపం వచ్చింది. అ కోపంలో నితీష్ ‘ఎవడ్రా! ఆ గేదెలను ఇక్కడికి తీసుకువచ్చింది?’ అంటూ గట్టిగా అరిచాడు.‘గేదెల దొడ్లో గేదెలు కాక గాడిదలు ఉంటాయా? అడ్డ గాడిద!’ అని అరుస్తూ కుడితి నీళ్ళు నితీష్ మొఖం మీద కొట్టి నిద్రలేపాడు నూకరాజు.‘మంచి కల పాడు చేశావ్ కదా నాన్నా! నా జీవితంలో నిద్రలో వచ్చే కలలు కూడా పూర్తి అవ్వవు. ఛీ!’ అంటూ లేచాడు నితీష్,‘ఏడిసావులే గాని గేదెలను తోలుకుపోయి, అందరికీ పాలు పోసి రా! లేట్ అయిందని నాకు మాట వస్తే నిన్ను బిందెట్టుకు కొడతా’ అన్నాడు నూకరాజు.బద్ధకంగా లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు నితీష్.సైకిల్ స్టాండ్ తీసి, ప్రతి రోజులాగానే గేదెలను తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి పాలు పోశాక మేనమామ సుంకరరాజు ఇంటికి వచ్చాడు. ‘ఏరా! ఈ మధ్య కనపడటం లేదు. బొత్తిగా ఇంటికి రావటం మానేశావ్?’ అన్నాడు సుంకరరాజు. ‘అదేంలేదు.. కొత్త ఇల్లు కడుతున్నాము కదా! అక్కడే దగ్గర ఉండి చూసుకుంటున్నా మావయ్య!’ అన్నాడు నితీష్. ‘దానితో పాటు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదరా! యాక్టర్, ట్రాక్టర్ అంటూ ఖాళీగా ఎన్నాళ్లు ఉంటావ్?’ అన్నాడు సుంకరరాజు. ఆ ఉచిత సలహా విన్న నితీష్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ‘అన్నట్టు చెప్పటం మర్చిపోయా. నిన్ననే స్నేహకి ఒక సంబంధం కుదిరింది. అబ్బాయి వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. హైదరాబాద్లో ఉంటారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకి లక్షన్నర జీతం. రెండు నెలలలో పెళ్లి అనుకుంటున్నాము. నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి’ అన్నాడు సుంకరరాజు. ఇంతలో నితీష్ మరదలు స్నేహ ఇంటి డాబాపై నుంచుని సిగ్గు పడుతూ, సెల్ ఫోన్లో మాట్లాడటం చూశాడు నితీష్. ఆమె ఎవరితో మాట్లాడుతోందో అర్ధం చేసుకున్న నితీష్, ‘సరే మావయ్య! ఉంటాను’ అని వెనుదిరిగాడు.పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన నితీష్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. నెమ్మదిగా అద్దం ముందుకు వచ్చి నిలబడి తనని తాను ఒక నిమిషం పాటు చూసుకుంటూ ఉండిపోయాడు. నితీష్ కళ్ళు ఎర్రబడ్డాయి. కుడి చేతి పిడికిలి బిగుసుకుంది. తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది ఆ ఒక్క నిమిషం. తనలో పీకల వరకు నిండిపోయిన బాధని, కోపాన్ని, నిస్సహాయతను దిగమింగుకున్నాడు. రోజూలాగే తనకు ఇష్టమైన నటులు ఎన్టీఆర్, విక్రమ్ నటించిన సినిమాలు అన్నీ అదే పనిగా చూసి, వాటినే తనదైన శైలిలో సాధన చేయటంతో ఎప్పటిలాగే సమయం తెలియకుండానే గడిచిపోయింది.సాయంత్రం సుమారు ఐదు గంటలకి స్నేహితుడు జాన్బాబుతో కలిసి వీధి చివర టీ షాపుకి వచ్చి కూర్చున్నాడు. నితీష్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చోడం గమనించిన జాన్బాబు మళ్ళీ ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. ‘ఇదిగోరా టీ..’ అని టీ గ్లాసు చేతికి అందించాడు. ఇంతలో గట్టునాని, అతని స్నేహితులు వచ్చి ఎదురు బెంచీ మీద కూర్చున్నారు. నానికి, నితీష్కు స్కూల్లో చదువుకునే రోజుల నుంచి వైరం ఉంది. అది తెలిసిన జాన్ అక్కడి నుంచి త్వరగా టీ తాగి నితీష్ను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు.కానీ నివురుగప్పిన నిప్పులా లోపల రగిలిపోతూ బయటకి ప్రశాంతంగా కనిపిస్తున్న నితీష్తో ‘ఏరా! ఆ సర్పంచ్ బావమరిది సినిమాలో వేషం ఇస్తా అని రెండు లక్షలు దొబ్బేశాడంటగా?’ అన్నాడు నాని. చేతిలోని టీ గ్లాసుని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు నితీష్. ‘అయినా నీ మొఖానికి సినిమాలు ఎందుకురా? మా ఫెర్టిలైజర్స్ కంపెనీ యాడ్కి కూడా పనికిరావు’ అన్నాడు నాని వెటకారంగా. చుట్టూ ఉన్న అందరూ నవ్వడం చూసి జాన్, నితీష్ భుజం మీద చేయి వేసి ‘పద వెళ్దాం’ అన్నాడు. నితీష్ ఇంకా ఆ టీ గ్లాస్నే చూస్తూ అలా ఉండిపోయాడు.‘అవును స్నేహ నిన్ను వదిలేసిందంటగా! మంచిపని చేసిందిరా బాబు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే అడుక్కు తినాలి’ అన్నాడు నాని. నితీష్ చేయి బిగుసుకుంది. చేతిలో ఉన్న టీ నాని మొఖం మీద కొట్టి, రెప్పపాటులో నాని చేయి వెనక్కి వంచి పక్కనే ఉన్న నారింజ మిఠాయి సీసాతో తల పగలగొట్టాడు. వెంటనే నాని స్నేహితులు నితీష్, జాన్ మీద పడి, పిడిగుద్దులు కురిపించారు. నితీష్ దొరికినవాడినిదొరికినట్టు కొడుతూ పక్కనే ఉన్న పంట కాలువలోకి తోసి జాన్తో కలిసి ఆరోజుకి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.రాత్రికి ఇంటికి చేరుకున్న నితీష్, కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. పక్కనే కూర్చున్న నూకరాజు, నితీష్ చేతి మీద మొఖం మీద గాయాలు చూశాడు. ‘మళ్ళీ దెబ్బలు తిన్నావా?’ అన్నాడు నూకరాజు అనుమానంగా చూస్తూ.‘లేదు ..ఈసారి వాడి బుర్ర పగలగొట్టా’ నసిగాడు నితీష్ కోపంగా.‘అబ్బో! చాలా గొప్ప పని చేశావ్. థూ.. ఏం బతుకురా నీది? ముడ్డి కిందకి పాతికేళ్లు వచ్చినా, వయసు మళ్లిన నాన్న గురించి గాని, మంచం పట్టిన అమ్మ గురించి గాని ఏరోజైనా ఆలోచించావా? అదిగో బయట దొడ్డిలో గేదెల దగ్గర పడుకుంటావు కదా! అవి కనీసం పెట్టిన తిండికి తిరిగి పాలైనా ఇస్తాయి. నీ కన్నా అవే నయం. ‘అమ్మకి ఏమయింది?’ అని చిన్నప్పటి నుంచి అడుగుతున్నావు కదరా. ఇప్పుడు విను.. నీ చిన్నప్పుడు నువ్వు బావిలో పడబోతుండగా నిన్ను కాపాడి తలకి దెబ్బ తగిలించుకుని మంచం పట్టింది. ఆరోజు నిన్ను కాపాడకపోయినా బాగుండు’ అని కోపంగా తింటున్న కంచంలో చేయి కడుక్కుని లేచి వెళ్లిపోయాడు నూకరాజు.మరుసటి రోజు ఉదయం నూకరాజు లేచి చూసేసరికి, నితీష్ ఇంట్లో ఎక్కడా కనపడలేదు. ఊరంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరికి జాన్ ఫోన్కి నితీష్ నుంచి మెసేజ్ వచ్చింది. ‘నేను హైదరాబాద్ వెళుతున్నాను. నన్ను వెతుక్కుంటూ ఎవరూ రాకండి. సినిమా హీరో అయ్యాకనే మళ్ళీ అనకాపల్లిలో అడుగు పెడతా. లేకపోతే నా శవం కూడా ఎవరికీ దొరకదని నాన్నకి చెప్పు’ అని ఉంది.నితీష్ తన సైకిల్ అమ్మేయగా వచ్చిన మూడువేల రూపాయిలు, రెండే జతల బట్టలతో మర్నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. ఫిల్మ్ నగర్ దగ్గరలో జూనియర్ ఆర్టిస్టులు ఉండే ఒక అతి చవక హాస్టల్లో దిగాడు. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. నితీష్ హాజరు కాని స్టూడియో లేదు. ముట్టుకోని డైరెక్టర్ ఇంటి గేట్ లేదు. ఎంత నిరాశ ఎదురు వచ్చినా అది నితీష్ ముఖంలో కనపడలేదు. ఆరోజు అర్జున స్టూడియోస్లో డైరెక్టర్ రాజకుమార్ పూర్తిగా కొత్త నటీ నటులతో ఒక సినిమా కోసం ఆడిషన్ చేయబోతున్నాడని తెలిసింది నితీష్కి. తన వివరాలు, నటించిన వీడియోలు, ఫొటోలు పంపించాడు. ఈసారి నిరాశ ఎదురవలేదు.‘వచ్చే ఆదివారం మీరు తప్పక హాజరు కాగలరు’ అని సమాధానం వచ్చింది. ఈ అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు.చివరికి ఆడిషన్కు హాజరయ్యి రంగస్థలం మీద అడుగు పెట్టాడు. అందరూ అనుకుంటున్నట్టు డైరెక్టర్ ఆ క్యారెక్టర్కి రాసిన డైలాగులు చూసి తనదైన శైలిలో చెప్పమని అడగలేదు. ‘ఇప్పటిదాకా నీ జీవితాన్ని, కొన్ని మరచిపోలేని సంగతులని నీ శైలిలో చెప్పు’ అన్నాడు డైరెక్టర్. అలా చేయటం నితీష్కి కొత్త అయినప్పటికీ రెండు నిమిషాలు ఆగి గట్టిగా శ్వాస తీసుకుని నోరు విప్పాడు.‘నాకు ఊహ తెలిసినప్పటి నుండి నన్ను కన్న తల్లి ఎందుకు మంచం పట్టిందో నిన్నటి వరకు తెలుసుకోలేని మూర్ఖుడిని. వయసు మళ్లిన, అనారోగ్యంతో ఉన్న తండ్రిని ఆనందంగా చూసుకోకపోగా, నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుని నా వయసు ఉన్న మిగతా అబ్బాయిల్లాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, నా తరఫు నుంచి ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా, పందికొక్కులా మొత్తం గుల్ల చేస్తున్న నీచమైన కొడుకుని నేను. ప్రాణంగా ప్రేమించి తనతో ఒక జీవితాన్ని ఊహించుకున్న అమ్మాయి, డబ్బు పరపతి లేకపోతే ముఖం కూడా చూడదని గ్రహించలేకపోయిన మూర్ఖపు ప్రేమికుడిని. కాని, ఒక్కటి మాత్రం బలంగా చెప్పగలను. ఎదురుదెబ్బ ఎటువైపు నుంచి అయినా రానీ, ఎలాగైనా రానీ వాటిని వంచి ఈ సినిమా అనే సింహాసనం మీద ఎక్కి కూర్చుంటా!’ అన్నాడు నితీష్ ఉద్వేగంగా.నితీష్ ప్రదర్శన చూసి డైరెక్టర్తో సహా మిగతా సభ్యులు కూడా చలించిపోయారు. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారు. మరుసటి రోజు ఉదయం అసిస్టెంట్ డైరెక్టర్ బాబీ నుంచి కాల్ కోసం చూస్తూ కూర్చున్నాడు.ఏకంగా డైరెక్టర్ రాజకుమార్ నుంచే కాల్ రావటంతో నితీష్ రెట్టించిన ఉత్సాహంతో ‘హలో! సర్!’ అన్నాడు. ‘గుడ్ మార్నింగ్ నితీష్! మనం ఈ సినిమా చేస్తున్నాం.. ప్రొడ్యూసర్కి నీ బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చింది. నీ ఆటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, మేము అనుకుంటున్న విలియమ్ పాత్రకి వంద శాతం కుదురుతుంది’ అన్నాడు డైరెక్టర్ రాజకుమార్.‘కానీ సర్! నేను ఆడిషన్ ఇచ్చింది హీరో క్యారెక్టర్కి కదా సర్?’ అన్నాడు నితీష్.‘హహ.. నువ్వు స్క్రిప్ట్ చదివాక విలియమ్ క్యారెక్టరే చేస్తాను అని అడుగుతావ్’ అన్నాడు రాజకుమార్.‘సరే సర్!’ అన్నాడు నితీష్ ‘నీకు ఆకామడేషన్, కారు ప్రొడ్యూసర్గారు అరేంజ్ చేశారు. ఈవెనింగ్ షిఫ్ట్ అయిపో. నెక్స్›్టవీక్ నుంచి షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు’ అన్నాడు రాజకుమార్.‘సరే సర్! థాంక్ యు సో మచ్’ అన్నాడు నితీష్ ఆనందంగా. అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. వెంటనే నితీష్ వాళ్ళ నాన్న నూకరాజుకు ఫోన్ చేసి ‘అమ్మని తీసుకు వచ్చేయమని జాన్కి చెప్పు‘ అన్నాడు. ‘పెద్ద నటుడిని అయినప్పుడే వస్తా అని మాట ఇచ్చి వెళ్లిపోయావుగా? అది పూర్తిచేసి తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళు’ అని కాల్ కట్ చేశాడు నూకరాజు. రెండు నిమిషాలు బాధ పడినా నితీష్ మళ్ళీ తన యాక్టింగ్ సాధన కొనసాగించాడు. ఆరోజు ఏప్రిల్ 2, అర్జున స్టూడియోస్లో రెగ్యులర్ షూట్ డే1. అదే రోజు స్నేహకి మరొకరితో అనకాపల్లిలో పెళ్లి కూడా. నితీష్ తన కారు నుంచి బయటకి రాగానే డ్రైవరు గొడుగు పట్టుకున్నాడు. మరో పక్క స్నేహని పెళ్లికి ముస్తాబు చేసి బాజా భజంత్రీలతో కళ్యాణమండపం వైపు తీసుకువెళుతున్నారు.. యాక్షన్ సీన్ చిత్రీకరణలో ఉంది. నితీష్ తన వైపు తరుముతూ వస్తున్న వ్యక్తిని తన చేతిలో ఉన్న చైన్తో మెడకు కట్టి ఐదో అంతస్తు నుంచి తోసి ఉరివేసి వేలాడతీసే సీన్. మరో పక్క స్నేహ పెళ్లి పీటల మీద తల వంచి తాళి కట్టించుకుంటోంది. నితీష్ ఆ రోజు షూటింగ్లో ఎంతగా నిమగ్నం అయ్యాడంటే స్నేహ పెళ్లి రోజు కూడా మర్చిపోయేంత. సంవత్సరం గడిచింది సినిమా విడుదలై రెండు రోజులు అయింది, ఏ టీవీ చానల్ చూసినా, సోషల్ మీడియా చానల్ చూసినా నితీష్ గురించి, నితీష్ నటన గురించే చర్చ. ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా ఐదు సినిమాలలో హీరోగా నటించేందుకు సంతకం చేశాడు. స్నేహ సీమంతం జరుగుతోంది. నితీష్ తండ్రి హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంటికి వచ్చే జనాల తాకిడి ఎక్కువ అయింది. ‘బహుశా అల్లుడుగారు ఎక్కువ మందిని పిలిచి ఉంటారు’ అనుకున్నాడు సుంకరరాజు. ‘ఎవరయ్యా రెండు సింహాసనాలు తెచ్చింది? ఇది సీమంతం. పెళ్లి కాదు. ఒకటి సరిపోతుంది .రెండోది తీసుకుపొండి’ అన్నాడు. సుంకరరాజు. చూస్తూ ఉండగానే సుంకరరాజు ఇల్లు ఉండే ప్రాంతం అంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో జనసంద్రం అయిపోయింది. అప్పటికి గాని అర్థంకాలేదు వాళ్ళు అందరూ సుంకర రాజు మేనల్లుడు హీరో నితీష్ని చూడటానికి వచ్చిన జనం అని.ఇంతలో ఒక వోల్వో కారు సుంకరరాజు ఇంటి ముందు ఆగింది. సూట్ వేసుకుని కారు దిగుతున్న నితీష్ని చూసి నూకరాజు, సుంకరరాజుల నోటి వెంట మాట రాలేదు. మేనల్లుడికి ఎదురెళ్లి దగ్గర ఉండి లోపలకి తీసుకు వస్తూ ‘నువ్వు వస్తావ్ అనుకోలేదు రా! చెప్పి ఉండాల్సింది కదరా!’ అన్నాడు.‘ఇలా వస్తా అని నేనూ అనుకోలేదు మావయ్య!’ అని నవ్వుతూ వెటకారంగా అన్నాడు నితీష్. ఆ మాటలకి ఎలా స్పందించాలో తెలియని సుంకరరాజు ఒక అర నవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. జనంలో నుండి ఇంటి లోపలికి వచ్చిన నితీష్ స్నేహకి ఎదురుగా రెండో సింహాసనంలో కూర్చున్నాడు. అక్షింతలు వేస్తూ రెండు లక్షల రూపాయల చెక్ అందిస్తూ ‘పుట్టబోయే బిడ్డ అవసరాలకి ఉపయోగపడతాయి’ అన్నాడు నితీష్. అక్కడ నుండి నితీష్తో కలిసి వెళ్లిపోతున్న జాన్ గేట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి ‘అల్లుడుగారికి నెలకి లక్షన్నర అంటగా జీతం. మా వాడికి నెలకి కార్ పెట్రోల్కే రెండు లక్షలైపోతోంది. పెట్రోల్ రేట్ బాగా పెరిగిపోయింది’ అని చురక అంటించాడు.‘ఆడు నా మేనల్లుడు. ఆడెప్పుడూ నాకు అల్లుడే రా! ఆడంత గొప్పోడవుతాడని, ఏదోరోజు సింహాసనం మీద కూచుంటాడని నాకు ముందే తెలుసురా జాన్ బాబు! మా స్థాయి సరిపోదనే పిల్లని ఆడికివ్వలేదు’ అన్నాడు సుంకరరాజు తెలివిగా! తన తెలివికి తనే మురిసిపోతూ. -
ఈ వారం కథ:: సుందరరామయ్య@ 70
‘తాతగారూ!’ఆ పిలుపు విన్న సుందరరామయ్యకు వొళ్లు మండి వెనక్కి తిరిగి చూశాడు!సందేహం లేదు. పిలిచింది తననే. పిల్చిన శాల్తీ చిన్న పిల్లేంకాదు, సుమారు నలభై యేళ్ల ఆవిడే. ఆ పిలుపుకు మనసు కలుక్కుమన్న సుందరరామయ్య ఆమెకేసి గుర్రుగా చూశాడు. ఆమెకి తను తాతగారా? ఆవిడగారి వయసు తన కూతురు కంటే ఎక్కువే ఉంటుంది. తీరా తిరగబడి ఆవిడ వయసడిగి దులిపేద్దామనుకునేలోగా తిరిగి ఆమే నోరువిప్పింది. ‘తాతగారూ, ఒరిజనల్స్ తీసుకోవడం మర్చిపోయారు’ అంటూ! తాటాకు మంటలాంటి సుందరరామయ్య కోపం చటుక్కున చల్లారిపోయింది. జెరాక్స్ కాపీలు మాత్రం తీసుకొని ఒరిజనల్సే మర్చిపోయి, నెట్సెంటర్ నుంచి బయటకొస్తున్న సుందర రామయ్య నాలుక కరచుకొని వెనక్కువెళ్లి ఆవిడకు‘థాంక్స్’ చెప్పి మరీ అవి తీసుకున్నాడు.తనకిష్టం లేని పదం ‘తాతగారు’. తానంత ముసిలోడిలా కనిపిస్తున్నాడా? ఆంగ్లంలో అందరికీ అన్వయించే ‘అంకుల్’ అనే పదముందిగా? తనను అంకుల్ అనో, మాస్టారూ అనో, పోనీ తెలుగులోనే పిలవాలనుకుంటే ‘బాబాయి’అనో పిలవకుండా ఈ దిక్కుమాలిన పదాన్నే ఉపయోగించాలా? మనసు కించిత్ గాయపడగా షాపు మెట్టుదిగి తను పార్క్ చేసిన స్కూటర్ దగ్గరకొచ్చాడు.çస్కూటర్ ‘సెల్ఫ్స్టార్ట్’ కాక అవస్థలు పడుతూ నిట్టూరుస్తుండగా, నెట్సెంటర్కి వెళ్తున్న ఓ బట్టతల ఆసామీ ఆగి ‘మాష్టారూ, మెయిన్ స్టాండ్ వేసి ‘కిక్’ కొట్టండి అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ స్టాండ్ వెయ్యడానికి శక్తి చాలని సుందరరామయ్య ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడి ‘అలవాటు లేదు’ అంటూ సాయం చేయ్యమన్నట్టు చూశాడు. విషయం అర్థమైన ఆ మనిషి అవలీలగా మెయిన్ స్టాండ్ వేసి, స్కూటర్ స్టార్ట్ చేసి ఇచ్చాడు. ‘«థాంక్సండి’ అంటున్న సుందరరామయ్యను ‘అండి’ అనకండి గురువుగారూ, నేను మీ స్టూడెంట్నే, గుర్తుపట్టలేదా?’ అన్నాడు నవ్వుతూ. అంతటితో ఊరుకోకుండా! ‘మాష్టారూ, మీరు కింగ్లా వుండేవారు, ఇప్పుడు బాగా లొంగిపోయారు!’ అని కామెంట్ చేసి వెళ్ళడంతో అసలే నెట్ సెంటర్ నిర్వాహకురాలి పిలుపుతో కుంగిపోతున్న సుందరరామయ్యకు పుండుమీద కారం చల్లినట్టయింది. ‘తమ వయసు లోపాలు కప్పిపుచ్చుకోడానికి కొందరు ఇలాగే విమర్శలు, ఎదురుదాడి చేస్తుంటారు. తన శిష్యుణ్ణని చెప్పుకున్న ఆ మనిషికి నెత్తిమీద నాలుగు పుంజీలు వెంట్రుకలు కూడా లేవు. తను రంగేసున్నా నిక్షేపంలాంటి జుట్టు వుంది. అది చూసి అసూయపడి తన శరీర పటుత్వం గురించి వాగి వుండొచ్చు’ అని సరిపెట్టుకొని సుందరరామయ్య స్కూటరెక్కాడు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఇల్లు చేరిన సుందరరామయ్య మనసును ఎవరికీ చెప్పుకోలేని అశాంతి, అలజడి మెలిపెడుతున్నాయి. తనకిష్టం లేని వయసు ప్రసక్తి తెచ్చిన నెట్సెంటర్ నిర్వాహకురాలి మీద, తన శిష్యుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇటీవల ఇలాంటి ‘షాకు’లు రాళ్లలా ఒకదాని వెంట ఒకటి తగులుతుంటే మనసు చితికిపోతోంది. ఒక్కొక్కటిగా ఎదురవుతున్న చేదు అనుభవాలు గుర్తొచ్చి మనసు తట్టుకోలేకపోతోంది. ఆ మధ్య పూర్వవిద్యార్థులు తారసపడితే ‘మాష్టారూ మీలో మార్పులేదు. అప్పుడెలా వుండేవారో ఇప్పుడూ అలాగే వున్నారు’ అని పొగుడుతుంటే చొక్కా బిగువయ్యేది. అలాంటిది డెబ్బైయవ ఏటలో అడుగుపెట్టిన తర్వాత వయసును దాచుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎదురయిన వాళ్లు పలకరించి మరీ మనసును కష్టపెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయాలు అడక్కుండానే– ‘íపిడుగులా వుండేవారు మాష్టారు, బాగా పాడయిపోయారు. నడకలో తేడా వచ్చింది. చేతులు వణుకుతున్నాయి. మీరు రిటైరయి ఎన్నేళ్లయింది? ఏ సంవత్సరంలో రిటైరయ్యారు? అని వివరాల్లోకి వెళుతుంటే వాళ్ల దాడి నుంచి తప్పించుకోడానికి తల ప్రాణం తోకకొస్తోంది!వారం క్రితం గుమ్మం దగ్గర నిల్చుని వుండగా ఆ దారిన వెళ్తున్న ఓ అమ్మాయి ఆగి ‘‘తాతగారూ, అబద్ధాల సత్యవతిగారి ఇల్లెక్కడ?’’ అని అడిగింది. అంతే ఆ అమ్మాయి మీద ఒంటి కాలి మీద లేచి, ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’’ అని హెచ్చరించాడు. ఆ అమ్మాయి కంగారుపడుతూ, ‘‘అబద్ధాలనేది ఆవిణ్ణి కించపరిచేది కాదండి, ఇంటిపేరు’’ అని సమర్థించుకునేలోగా, ‘‘నువ్వింకా చిన్నకూచిననుకుంటున్నావా? పెళ్లయితే ఇద్దరు పిల్లలకు తల్లయేదానివి. నీకు నేను తాతలా కనిపిస్తున్నానా?’’ అని చిర్రుబుర్రులాడుతూ గొంతు పెంచాడు. దాంతో బిత్తరపోయిన ఆ అమ్మాయి, నలుగురూ చేరి గొడవయ్యేలోగా వెటకారంగా ‘సారీ తాతగారూ’ అంటూల్లగా అక్కణ్నుంచి జారుకుంది. అక్కడ మూగిన జనం తన వింత కోపానికి ముక్కున వేలే సుకున్నారు!పై సంఘటన జరిగిన రెండ్రోజులకే మార్కెట్ నుంచి వస్తుండగా టైరు రాయి మీదకెక్కి స్కూటర్ ‘స్కిడ్’ అయి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వున్న షాపుల వాళ్లు పరుగెత్తుకొని వచ్చి స్కూటర్నీ, తనను లేవదీశారు. స్కూటర్ తగిలించిన సంచిలోని కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోతే వాటిని జాగ్రత్తగా పోగుచేసి ఎత్తారు. తను సిగ్గుపడుతూ లేచి, బట్టలకు పట్టిన దుమ్ము దులుపుకొని బండి స్టార్ట్ చెయ్యబోతే వాళ్లు వారించి మంచినీళ్లు తాగించి కూర్చోబెట్టారు. ఆ తరువాత తను వెళ్లడానికి తొందరపడుతుంటే– ‘‘పెద్దవయసు కదా మాష్టారూ, ఇక మీరు స్కూటర్ మానెయ్యాలి, మీరు వెనక కూర్చుంటే మీ యింటి దగ్గర మా వాడు దింపి వస్తాడు’’ అని వాళ్లు తన పెద్దరికాన్ని గుర్తుచేస్తూ, సానుభూతిలో సహాయం చేస్తామంటే, తనకు మాత్రం వాళ్లు తన వయసును వెక్కిరిస్తున్నట్టనిపించి ‘‘సింగినాదం! వయసుదేముంది? బండిరాయి మీదకెక్కితే ఏ వయసు వాళ్లైనా పడకతప్పదు! అని పడ్డం తన వయసువల్ల కాదని వాళ్లను మారుమాట్లాడకుండా చేసి మొండిగా బండెక్కాడు. ఇంటికెళ్లిన తరువాత తన ఘనకార్యం విని– ‘పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందనడం మీలాంటి వాళ్లను చూసే..’ అని యిల్లాలు నెత్తి వాచేలా చీవాట్లు పెట్టింది!ఆ సాయంత్రం ఒంటరిగా కూర్చొని టీవీలో వస్తున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ తన అభిమాన క్రికెటర్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఫోర్లు, సిక్స్లూ దంచేస్తుంటే ఆనంద పారవశ్యంతో చప్పట్లు కొడుతున్నాడు. ఆ మైకానికి అంతరాయం కలిగిస్తూ అయిదారుగురు వాకర్స్ క్లబ్ సభ్యులు కలిసికట్టుగా ఇంటికొచ్చారు. వస్తూనే ‘‘మీ ఆనందానికి విఘ్నం కలిగిస్తున్నాం’’ అంటూ నొచ్చుకుంటూనే కుర్చీల్లో సెటిలయ్యారు. కుశల ప్రశ్నల అనంతరం వాళ్లు వచ్చిన పని చెప్పారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగే క్లబ్ మీటింగ్లో ఒక ‘సీనియర్ సిటిజన్’ను సన్మానించాలని నిర్ణయించుకున్నామని, ఆ సన్మానానికి అర్హునిగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మీ పేరు ప్రతిపాదించారనీ, మీ అనుమతి, బయోడేటాల కోసం వచ్చామనీ విన్నవించారు. వాళ్ల ప్రతిపాదన విన్న తరువాత తనకు కోపం ముంచుకొచ్చింది. అయినా బయటపడకుండా తన కోపాన్ని అదిమిపెట్టి చిరునవ్వుతో వాళ్లకు క్లాస్ తీసుకున్నాడు. ‘‘నేను మీకంత వృద్ధుడిలా కనిపిస్తున్నానా? నేను చాలామందిలా నా వయసును తగ్గించుకోవడంలేదు. కానీ డెబ్బయ్యేళ్ల వయసు కూడా ఓ వయసేనా? నా వయసున్న సినిమా హీరోలు, రాజకీయ నాయకులు ఎంతమంది లేరు? ఆ మాటకొస్తే డెబ్బయ్యేళ్ల హీరోలు మనవరాళ్ల వయసున్న కుర్ర హీరోయిన్లతో కలిసి డాన్సులు చేస్తుంటే మనమంతా చూడ్డం లేదూ? అందుచేత వయసు కొలబద్దగా అందరినీ ఒకే గాటన కట్టెయ్యకూడదు. పరీక్షల్లో అరవయ్యేళ్ల వృద్ధుడు అని రాస్తుంటారు. అది అందరికీ అన్వయిస్తుందా? నా మట్టుకు నేను కృష్ణశాస్త్రి కవితలోలా వార్ధక్యాన్ని అంగీకరించను. ‘శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు’ అని నిత్యయవ్వనాన్నే కోరుకుంటాను. ‘‘మీరు వచ్చేసరికి నేను చూస్తున్న 20–20 క్రికెట్ పడుచుతనంలాంటిది. వన్డే క్రికెట్ మధ్యవయసులాంటిది. ఇక టెస్ట్మ్యాచ్ వార్ధక్యం లాంటిది. వీటిని బట్టి నేనేమిటో మీకర్థమైంది కదా! నేను నడకలో కాని, ఆటల్లో కాని, మీకెవరికీ తీసిపోను. నా సత్తా చూడాలంటే మీరు నడక పందెం పెట్టండి. అంతేగాని, సీనియర్ సిటిజన్గా నన్ను సన్మానిస్తామనడం నా ఫిట్నెస్ను అవమానించడమే! దయచేసి మీరు చెయ్యదలచుకున్న సన్మానానికి ఇంకెవరినైనా ఎంచుకోండి. కావాలంటే మీలో ఒకడిగా నేను కూడా ఒక దండ తీసుకొనివస్తాను’’.తన వాగ్ధాటికి, ఆత్మవిశ్వాసానికి ఎదురాడలేని క్లబ్ సభ్యులు ‘«థాంక్స్’ చెప్పి వెళ్లిపోయారు. ఆ క్లబ్ సభ్యులలో ఒకరైన డా.ధన్వంతరి దగ్గరకు వారం తిరక్కుండా తను వెళ్లవలసి వచ్చి ఆయనకు అడ్డంగా దొరికి పోయాడు.‘‘రండి, రండి, దయచేయండి ఓల్డ్ యంగ్మెన్ గారూ, ఊరక రారు మహాత్ములు’’ అంటూ కుర్చీ చూపిస్తూ ఆహ్వానించాడు డాక్టర్. ఆయన నవ్వుతూ ఆహ్వానించినా దాని మాటున ఎత్తి పొడుపు ధ్వనించింది.‘‘నేను పక్కింటాయనతో పందెం కాసి వంద కొబ్బరి కాయలు వొల్చాను. ఆ శ్రమకి ఒళ్లంతా పులిసిపోయింది. ఆపైన జ్వరం కూడా. ఎందుకైనా మంచిదని మీకు చూపించుకుందామని.’‘‘మాష్టారూ, మీరెంతటి ఐర¯Œ మ్యాన్ అయినా ఈ వయసులో ఇలాంటి సాహసాలు చెయ్యకూడదు’’ అంటూ చెయ్యి, బీపీ చూశాడు. ‘‘అంతా నార్మల్గానే వుంది, ఒంటి నొప్పులు తగ్గడానికి బిళ్లలు రాసిస్తాను, అవి వాడి రెస్ట్ తీసుకోండి. ఇరవైలోలా ఇప్పుడు దూకుడు పనులు చేస్తే మాత్రం వయసు వూరుకోదు’’ అంటూ మెత్తగా చురకవేసి పంపించాడు డాక్టర్. ఆ హెచ్చరిక చెవికి శూలంలా గుచ్చుకొని ఇక డాక్టరు ముఖం చూడకూడదు అనుకున్నాడు తను!‘‘ఇలా ఎంత తప్పించుకుందామనుకున్నా, తన కిష్టంలేని వయసును గుర్తుచేసే హెచ్చరికలు అడుగడుగునా ఎదురై బాధపెడుతూనే వున్నాయి. కథల్లోనూ, సినిమాల్లోనూ తాతలకూ, తండ్రులకూ పెట్టే ‘అయ్యా’తో అంతమయ్యే పేరు కూడా తన నందరూ పెద్దవాళ్లతో జమకట్టడానికి ఒక కారణమేమో! చిన్నప్పుడే తన పేరును మార్చుకుంటానంటే అది తాతగారి పేరని, మార్చడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. తన ఏకైక కుమార్తెకు పెళ్లి చేస్తే అరవయ్యేళ్లకే తాతా అని పిలిపించుకోవలసి వస్తుందని ఆ పిల్ల పెళ్లిని వీలయినంత ఆలస్యం చేశాడు. చివరకు బంధువర్గం పోరు పడలేక అమెరికా సంబంధం చేసి, వాళ్లు తరచుగా రారు, అలా తాత అనే పిలుపుకు దూరంగా వుండొచ్చు అనుకున్నాడు. ఆఖరికి స్థూలకాయం, ఎగుబట్ట వంటి తలతో ఆనందంగా ‘బామ్మగారూ’ అని పిలిపించుకొనే అర్ధాంగి సుబ్బమ్మను కూడా వెంటపెట్టుకొని తిరిగితే తన వయసు బయటపడుతుందని ఆమెను ఎక్కడకూ తీసుకెళ్లడం లేదు.ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా, అడ్డమైన వాళ్లు తన వయసు గురించి వాగి మూడ్ను పాడు చేస్తున్నారు. ఇంకా తలనెరిసిన ఇద్దరు, ముగ్గురు తను ‘యాక్టివ్’గా వుండడం చూసి ఓర్వలేక ఏడిపించడానికి తన వయసుకు అయిదారేళ్లు కలిపి ‘అలా కనిపిస్తున్నావు మరి’ అంటున్నారు. ఇలాంటి వాళ్లందరి తెగులు కుదర్చాలంటే తను గ్లామరు పెంచుకోవాలి. మరింత స్మార్ట్గా తయారయి ‘మాష్టారూ, మీకు డెబ్బయ్యేళ్లంటే ఎవరూ నమ్మరు. యాబైలలోనో, అరవైలలోనో వున్నట్లు కనిపిస్తున్నారు’ అనిపించుకోవాలి. అందుకు ముందుగా డ్రెస్ మార్చాలి అనుకొని హుటాహుటిన క్లాత్షాపుకు వెళ్లాడు. ఇటీవల చాలామంది పెద్దవాళ్లు వయసు దాచుకోడానికి టీషర్ట్లు వేసుకుంటున్నారు గనుక తాను కూడా ఆ మార్గం అనుసరించాలని ఒకేసారి అరడజను టీషర్ట్లు తీసుకున్నాడు. అక్కడ ‘జీన్స్’ చూసి వాటిమీద కూడా మోజుపడ్డాడు. కానీ మోకాళ్ల దగ్గర చిరుగులు వగైరాలున్న అవి మీకు బావుండవని ‘సేల్స్ బాయ్స్’ నిరుత్సాహపరిస్తే వాటి జోలికి వెళ్లలేదు. ఆనాటి నుంచి నిగనిగలాడే నల్లజుట్టు, డైలీ షేవ్, మోడరన్ డ్రెస్లు వగైరా మార్పులతో కనీసం పదేళ్ల వయసు తగ్గినట్టు కనిపిస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నాడు. మార్పు మహిమ వల్ల ఇంకెవరూ తన వయసు గురించి కామెంట్స్ చేయ్యకపోవడంతో బెంగ తప్పింది. కొస మెరుపు: ‘‘నన్ను కొట్టినా, తిట్టినా పడతాను కాని వయసు గురించి వంకరగా మాట్లాడితే మాత్రం సహించను’ అని తెగేసి చెప్పే సుందరరామయ్య డెబ్బై దాటి ఏడాది గడవకుండానే వాకర్ సహాయంతో నడుస్తూ ఎదురు పడిన వాళ్లు సానుభూతి చూపిస్తుంటే–‘ ఎంత రాయిలాంటి వాడయినా వయసును, వార్ధక్యాన్ని ఒప్పుకోకతప్పదు. నాకూ డెబ్బయ్యేళ్లు నిండాయి మరి!’’అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూమ్లో జారిపడితే అతనికి కాలు విరిగింది. -
ఆ పని చేయడం బాగా అలవాటైపోయింది: మమితా బైజు
ఒకే ఒక్క డబ్బింగ్ సినిమా ‘ప్రేమలు’తో తెలుగు ఆడియన్స్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న మమితా బైజు (Mamitha Baiju) గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తండ్రి బైజు కృష్ణన్– డాక్టర్. తల్లి హోమ్ మేకర్. మిథున్ అనే అన్నయ్య ఉన్నాడు. తన పదహారవ ఏట– ‘సర్వోపకారి పాలక్కారన్’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సైకాలజీ చదువుతూ, మధ్యలో ఆపేయడం వల్ల ఏమో.. కనబడ్డ ప్రతి ఒక్కరి సైకాలజీ స్టడీ చేయడం అలవాటైపోయింది తనకు.మలయాళంలోనే..తెలుగులో మమితా డైరెక్ట్ సినిమా ఎప్పుడు చేస్తుందని ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రవితేజ సరసస నటిస్తుందని వార్తలు వచ్చాయి కాని, అవన్నీ వట్టి రూమర్లే అని తేలిపోయింది. ‘ప్రేమలు’ సినిమాతో ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. కాని, మలయాళంలో తప్ప మిగిలిన భాషల్లో చేయడానికి ఇష్టపడటం లేదు మమితా. శ్రీలీల పాత్రలో..తమిళంలో విజయ్ చిట్టచివరి సినిమా ‘జన నాయగన్’లో మమితా బైజు ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే కూతురిలాంటి పాత్ర. ఈ సినిమా ‘భగవంత్ కేసరి’ రీమేక్ అంటున్నారు. తెలుగులో శ్రీలీల చేసిన పాత్ర తమిళంలో మమితా బైజు చేస్తోంది. మొదటి రోజు షూటింగ్లో విజయ్ని చూడగానే చాలా థ్రిల్ ఫీలయ్యానంటుంది మమితా. విజయ్ డైరెక్ట్గా తన దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని, ‘ఏమ్మా ఎలా ఉన్నావు’ అని పలకరించినప్పుడు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది అని చెప్పింది. ప్రేమలు పారితోషికం ఎంతంటే?తన బ్యాగ్లో ఎప్పుడూ రంగు రంగుల మట్టి గాజులు , ఓ జత స్పేర్ డ్రెస్, చాక్లెట్లు ఉంటాయని చెప్పింది. రోజూ జిమ్ చేయడం అలవాటు. ‘హెలెన్’, ‘కప్పెలా’ మలయాళ సినిమాలతో పాపులర్ అయిన అన్నా బెన్ జిమ్ మేట్. ఇద్దరూ కలిసి వర్కవుట్స్ చేయడం ఫన్నీగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాను అని చెప్పింది. ‘ప్రేమలు’ సినిమాకి రూ. 30 లక్షలు ఇచ్చారు. సినిమా సూపర్ హిట్ కావడంతో తన పారితోషికం రూ. 50 లక్షలకు పెంచింది. వేరే లాంగ్వేజెస్కి వెళ్తే, ఇంకా పెరుగుతుంది కాని, మలయాళంలో కంఫర్ట్ లెవెల్ ఎక్కువ అంది. ఆ హీరోనే ఫేవరెట్యూత్కి ఫేవరెట్ క్రష్ అయిన మమితాకి మాత్రం హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ అంటే పిచ్చి. తమిళ డైరెక్టర్ బాలతో ఓ సినిమా కమిట్ అయింది మమితా. కాని మధ్యలోనే సినిమా నుంచి బయటికి వచ్చింది. షూటింగ్లో బాల మమితాని బూతులు తిట్టి కొట్టాడని, అందుకే మానేసిందని వార్తలు వచ్చాయి. మమితా మాత్రం తన పర్సనల్ రీజన్స్ వలన ఆ సినిమా మానేసిందని చెప్పింది. తనని బాల కొట్టలేదని, అది మీడియా క్రియేషన్ అని కామెంట్ చేసింది. బాల మాత్రం మమితా తన కూతురులాంటిదని, తన డ్రెస్ సెన్స్ నచ్చక తీసేశానని చెప్పాడు.చదవండి: సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్. అంటోన్న ఖుష్బూ కూతురు -
చిటికెలో జుట్టుని నచ్చిన హెయిర్ స్టైల్లో మార్చుకోవచ్చు ఇలా..!
జుట్టును మృదువుగా, అందంగా సరిచేసుకోవాలంటే చేతిలో స్ట్రెయిటెనర్ ఉండాల్సిందే అంటారు చాలామంది ఆడవారు. అయితే సమయం ఉన్నా లేకున్నా, వీలున్నా లేకున్నా– పవర్ ప్లగ్ సమీపంలోనే చాలా స్ట్రెయిటెనర్లతో కేశాలంకరణ సాధ్యమవుతుంది. కానీ ఈ లేటెస్ట్ వైర్లెస్ గాడ్జెట్తో సులభంగా ఎక్కడైనా, ఎప్పుడైనా జుట్టును నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఈ గాడ్జెట్ భలేగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది రీచార్జబుల్ స్ట్రెయిటెనర్. దీన్ని వైర్లెస్ గాడ్జెట్లా వాడుకునే వీలుంటుంది. ఇది చూడటానికి, ఉపయోగించడానికి అచ్చం దువ్వెనలా ఉండటంతో జుట్టు దువ్వుకున్నట్లే దువ్వుకుని, ఈజీగా స్ట్రెయిటెనింగ్ చేసుకోవచ్చు. దీనిలో 120 డిగ్రీస్ నుంచి 200 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మొత్తం మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఆరోగ్యమైన జుట్టుకు, బలహీనపడిన జుట్టుకు ఉష్ణోగ్రతను ఎంపిక చేసుకోవడంలో వ్యత్యాసం పాటించాలి. దీనితో పొడిబారి చిట్లిన జుట్టును సరి చేసుకోవచ్చు. వంకీల జుట్టును సులభంగా నిటారుగా మార్చుకోవచ్చు. ఉంగరాల జుట్టును మృదువుగా చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్కు అటాచ్ చేసుకునేందుకు అనువుగా చార్జింగ్ బేస్ కూడా లభిస్తుంది. ఈ కూంబ్ మెషిన్ ముందువైపు పవర్ బటన్ పైన ఆప్షన్స్ టెంపరేచర్ డీటైల్స్తో పాటు చార్జింగ్ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. దీన్ని కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని, వినియోగదారుల రివ్యూలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం.జుట్టు రాలు సమస్యకు చెక్..ఈరోజుల్లో చాలామందికి జుట్టు రాలడమే ప్రధాన సమస్యగా మారింది. అందుకు పరిష్కారంగా ‘హెయిర్ మెసోథెరపీ’ అనే విధానాన్ని సూచిస్తున్నారు ప్రొఫెషనల్ బ్యూటీషియన్స్. మెసోథెరపీలో చాలా సన్నని సూదులను ఉపయోగించి.. విటమిన్లు, ఎంజైమ్లు, హార్మోన్లు వంటివి జుట్టు కుదుళ్లలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ జుట్టు రాలడాన్ని తగ్గించి, బలమైన జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ థెరపీ మాడులో రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తుంది. ఈ చికిత్స సాధారణంగా కొన్ని వారాల వ్యవధిలో అనేక సెషన్లలో జరుగుతుంది. ఒక్కో సెషన్ సుమారు 30 నిమిషాలు పడుతుంది. హెయిర్ మెసోథెరపీని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. చికిత్సకు ముందు, తరువాత వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలి. (చదవండి: Biodegradable Plastics: ప్లాస్టిక్ని వదిలించుకోవాలంటే.. చేతికి మట్టి అంటాల్సిందే..!) -
ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల కూతురు ఉంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. ఇంకో బేబీకి ప్లాన్ చెయ్యాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – రాధ, ధర్మవరంవయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు తల్లికి, బిడ్డకి ఎక్కువ ఉంటాయి. మొదటి డెలివరీ, ప్రెగ్నెన్సీలో ఏదైనా సమస్యలు ఉంటే అవి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే ఇప్పుడు ఆ సమస్యలు ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏం చేసి వాటిని నార్మల్కి తీసుకురావాలి అని ముందే గైనకాలజిస్ట్ని కలవాలి. మధుమేహం సమస్య ఇప్పుడు ఎక్కువ అయితే, హెచ్బి ఏ1సీ లెవెల్స్ డైట్ చెక్ చెయ్యండి. లెవెల్స్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యకు మందుల ద్వారా ముందే కరెక్ట్ చెయ్యాలి. థైరాయిడ్ లెవెల్స్ చాలామందికి ముందే తెలియటం లేదు. అది బేబీ మెదడు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే, ముందు టీఎస్హెచ్ లెవెల్స్ చెక్ చెయ్యండి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో శిశువు ఎదుగుదల సమస్యలు వచ్చినట్టయితే ఈసారి రాకుండా కొన్ని మందులు, డైట్ ముందే మార్చి ఇస్తాం. రక్తం గడ్డకట్టడం అవుతుందా అనే రక్తపరీక్షలు ముందే చేయించుకొని, దానికి తగిన మందులు వాడాలి. రక్తహీనత వలన రెండో ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపంతో ఇబ్బంది రావచ్చు. అందుకే సీబీపీ, విటమిన్ బీ–12, విటమిన్–డీ3 లెవెల్స్ ముందే చెక్ చేసుకోవాలి. భర్త వీర్య విశ్లేషణ కూడా ఒకసారి చేయించు కోవాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఇద్దరూ పాటించాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు ప్లానింగ్కి మూడు నెలల ముందు నుంచి తీసుకోవాలి. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఏవైనా చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉంటే అవి ఇప్పుడు రాకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. వాక్సినేషన్స్ కూడా చాలా ముఖ్యం. ఫ్లూ వాక్సిన్, ఎమ్ఎమ్ఆర్ వాక్సిన్, ఆటలమ్మ, రుబెల్లా వాక్సిన్స్ ముందు తీసుకోకపోతే ఇప్పుడు తీసుకొని, ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. మీ బరువు ఉండవలసిన బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) కన్నా ఎక్కువ ఉంటే, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే కొంత బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. సమతుల్యమైన, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వ్యాయామం ప్రారంభించాలి. మీరు ఏదైనా సమస్యలకు మందులు వాడుతుంటే అవి ప్రెగ్నెన్సీలో మంచివి కాకపోతే, సంబంధిత డాక్టర్ని కలసి మందులను మార్పించుకోవాలి. చాలామందికి ఆందోళన తగ్గించే మందులు, మూర్చవ్యాధికి మందులు మారుస్తాము. ఉద్యోగం ఒత్తిడి ఎక్కువ ఉంటే ఆ ప్రభావం శిశువు ఎదుగుదలపై పడుతుంది. అందుకే సరైన వర్క్ ప్లేస్ సెలక్ట్ చేసుకోండి. ధ్యానం, యోగా చేయటం మంచిది. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరిగితే సమస్యలు వస్తాయా..? -
అభినవ శ్రవణుడి ఆధ్యాత్మిక యాత్ర..!
తల్లితో కలసి సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర చేశాడు ఆ తనయుడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బజాజ్ చేతక్ స్కూటర్పై సుదీర్ఘ యాత్ర సాగించారు ఆ తల్లీ తనయులు. భారత్తో పాటు నేపాల్, భూటాన్, మయాన్మార్ దేశాలను కూడా వారు సందర్శించారు. మైసూర్కు చెందిన ఆ తనయుడు కృష్ణకుమార్ (45), అతడి తల్లి చూడా రత్నమ్మ (75). వారి ఆధ్యాత్మికయాత్ర ఎలా సాగిందంటే..కృష్ణకుమార్ తనకు 21 ఏళ్ల కిందట తన తండ్రి కొనిచ్చిన బజాజ్ చేతక్ స్కూటర్పై తల్లిని కూర్చోబెట్టుకుని ఈ యాత్ర ప్రారంభించారు. తండ్రి భౌతికంగా లేకపోయినా, ఈ వాహనం రూపంలో ఆయన తమతో పాటు ఈ యాత్రలు చేస్తున్నారనే భావిస్తున్నారు. ఇప్పటి వరకు వీరు 92,822 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఏడుపదులు దాటిన వయసులోనూ రత్నమ్మ ఓపికగా స్కూటర్పై కూర్చుని యాత్రలు సాగిస్తుండటం విశేషం. ఇటీవల వారు విశాఖ చేరుకున్న సందర్భంగా, వారు తమ యాత్రా అనుభవాలను వివరించారు.మాతృసేవా సంకల్పయాత్ర...కృష్ణకుమార్ తల్లి చూడా రత్నమ్మ కుటుంబ బాధ్యతల్లో పడి ఇల్లు దాటి ఎక్కడకూ వెళ్లలేక పోయింది. ఒకసారి మాటల మధ్యలో ఇదే విషయాన్ని కొడుకుతో చెప్పి బాధపడింది. తల్లి మాటలకు కృష్ణకుమార్ ఆవేదన చెందాడు. ఎలాగైనా, తల్లిని ఆధ్యాత్మిక యాత్రకు తీసుకువెళ్లాలని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలను అన్నింటినీ చూపించాలని నిశ్చయించుకున్నాడు. కొద్దిరోజుల్లోనే తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చాక తల్లితో కలసి స్కూటర్పై ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించాడు. వారం రోజుల్లో 2,673 కిలోమీటర్ల ప్రయాణంకోవిడ్ సమయంలో వీరు భూటాన్ సరిహద్దులో 52 రోజులు చిక్కుకున్నారు. అక్కడి నుంచి అతి కష్టం మీద అనుమతులు తెచ్చుకుని, తన తల్లిని తీసుకుని కేవలం వారం రోజుల్లో 2,673 కిలోమీటర్లు ప్రయాణం చేసి మైసూర్కు చేరుకున్నాడు. కేవలం రెండు రోజుల్లో 891 కిలోమీటర్లు ప్రయాణించిన సందర్భాన్ని మరచిపోలేమని కృష్ణకుమార్ చెబుతాడు. బదరీనాథ్, కేదార్నాథ్, కాశ్మీర్, వైష్ణోదేవి, పరశురామ్ కుండ్, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, భారత్–చైనా సరిహద్దుల్లోని అతి ఎత్తైన ప్రాంతం తవాంగ్, మేచుక వంటి ప్రదేశాలను సైతం వీరు సందర్శించారు. ఈ యాత్రలో కృష్ణకుమార్ తన తల్లికి లెక్కలేనన్ని ఆలయాలను స్వయంగా చూపించాడు. ఈ తల్లీ తనయులు కేవలం పట్టణాలనే కాకుండా చిన్నచిన్న గ్రామాలు, అక్కడ ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. తన 68వ ఏట ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన చూడా రత్నమ్మ నేటికీ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా తన ప్రయాణాన్ని కుమారుడి చేయి పట్టుకుని సాగిస్తున్నారు. తాజాగా వీరు పంచారామాల యాత్ర ముగించుకుని విశాఖకు చేరుకున్నారు. కోవిడ్ సమయంలో తీర ప్రాంతంలోని ఆలయాలను వీరు సందర్శించలేకపోయారు. దీంతో మైసూర్ నుంచి వీరు తిరిగి ఈ యాత్రను ప్రారంభించారు. రోజూ దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ, ముందుకు సాగుతున్నారు.చిన్న అనారోగ్యం కూడా లేదు...తన కోసం అన్నీ చేసిన అమ్మ కోసం తాను ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకున్నాడు కృష్ణ కుమార్. తన వద్దనున్న డబ్బులతోనే ఈ యాత్రలను పూర్తిచేస్తున్నారు. వీలయినంత వరకు ఆలయాలు, మఠాలు, క్షేత్రాలలో బస చేస్తారు. బయటి ఆహారం తినకుండా ఆరోగ్యాన్ని జాగ్రతగా చూసుకుంటారు. ఇప్పటి వరకు చేసిన యాత్రల్లో తమకు కనీసం జ్వరం, జలుబు వంటివి కూడా రాలేదని, తన కంటే తన తల్లి పదిరెట్లు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఈ యాత్రల్లో పాల్గొంటున్నట్లు కృష్ణకుమార్ చెప్పారు.మాట ఇచ్చాను... నెరవేరుస్తున్నానుఅమ్మకు ఇచ్చిన మాట కోసం ఈ యాత్రలు చేస్తున్నా. మాట ఇస్తే దానిని నెరవేర్చడం ముఖ్యం. బయటి ప్రపంచాన్ని చూడని మా అమ్మకు నేను దేశం అంతా చూపించాను. ఎంతో క్లిష్టమైన ప్రాంతాలకు సైతం స్కూటర్పై చేరుకున్నాం. అమ్మకు సేవ చేయడం, ఆమ్మతో ఉండటం చాలా సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తోంది.– కృష్ణకుమార్ ఫొటో: పి.ఎల్.మోహనరావు(చదవండి: అలాంటి స్పందన ఊహించలేదు..! ఎయిర్పోర్ట్లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన..) -
పాలరాతి శిల్పంలా ఉండే నేహా శెట్టి ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే..!
‘లైఫ్లో గోలా ఉండాలి, గోలూ ఉండాలి..’ అన్నట్లు కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా, సరదాగా గడపటం, అందంగా కనిపించడం ముఖ్యం. అందుకే, నటి నేహా శెట్టి ఇంట్లో ఉన్నా, స్టేజ్ మీద ఉన్నా, స్క్రీన్ మీదనైనా ఎప్పుడూ అందంగా కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం ఆమె ఎంచుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ మీ కోసం.. ఫ్యాషన్లో ప్రయోగాలు చేయటం ఇష్టం. వాటివల్లే చాలా నేర్చుకున్నా. సడన్గా ఏదైనా ఈవెంట్కు వెళ్లాల్సి వచ్చినా కూడా, త్వరగా స్టయిలింగ్ చేసుకొని, అందంగా కనిపిస్తా. నా దగ్గర ఎప్పుడూ వివిధ రకాల ఉంగరాలు, ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉంటాయని అంటోంది నేహా శెట్టి.మహిళ అందాన్ని పెంచడంలో ముందు ఉండే ఆభరణమే ముక్కెర. ఇది ఒకప్పటి ఓల్ట్ ఫ్యాషన్. కాని, ఇప్పుడు ఓల్ట్ ఈజ్ గోల్డ్ అనే రేంజ్లో స్టయిలింగ్లో దూసుకొచ్చి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసులనూ దోచేస్తోంది. ట్రెండింగ్ ఆభరణం కావడంతో మార్కెట్లో ఇవి రకరకాల డిజైన్స్, మెటల్స్లో లభిస్తున్నాయి. అయితే, వీటిని కొనేటప్పుడు ముక్కుపుడకలో ఉన్న రాళ్లు, వజ్రాలను బాగా పరిశీలించి, ఊడిపోకుండా ఉండే రాళ్ల ముక్కు పుడకలను కొనుక్కోవాలి. ఆ స్టోన్స్ పోతే చూడ్డానికి అస్సలు బాగోదు. కొంతమందికి చిన్న ముక్కు, కొందరికి పెద్ద ముక్కు ఉంటుంది. ముక్కుకు తగ్గ సైజు ముక్కు పుడకను ఎంచుకోవాలి. ఒకసారి ముక్కుకి పెట్టుకొని అది మీకు నప్పుతుందా లేదా అని చూసుకొని తీసుకోవటం మంచిది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రెస్డ్ నోస్ రింగ్స్దే. ఇది ముక్కు కుట్టించుకోని వారు కూడా ధరించి మురిసిపోతున్నారు. పైన చూపించిన నటి నేహా శెట్టిలా. ఇక ఇక్కడ నేహా ధరించిన జ్యూలరీ.. ఇయర్ రింగ్స్ బ్రాండ్: సంస్కృతి సిల్వర్ ధర: రూ. 8,600, ఉంగరం బ్రాండ్: తంత్ర బ్రాస్ జ్యూలరీ ధర: రూ. 450, కాగా, చీర బ్రాండ్: సురుమయే ధర: రూ. 22,000/- (చదవండి: నీలిరంగు డ్రెస్లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!) -
న్యూ కెరీర్ ఎక్స్ప్రెస్.. సూపర్ బోగీలెన్నో..!
రొటీన్స్ కోర్సులు.. రొడ్డకొట్టుడు చదువులు..వీటితోనే భవిష్యత్తుకు భరోసా అనేది ఓ అపోహ! ఇంజినీరింగ్, మెడిసిన్స్, మేనేజ్మెంట్ కోర్సులతోనే..కెరీర్ అద్భుతంగా ఉంటుందనేది ఓ భ్రమ! మరి అవికాక, ఈ పోటీ ప్రపంచంలో బతకనేర్పే విద్యలేవీ లేవా? ఆసక్తికి, ఆదరణకు తులతూగే కోర్సులే లేవా? అంటే..కొత్తకొత్త కోర్సులు చాలానే కనిపిస్తున్నాయి. విద్యార్థులను తమవైన రంగాల్నిఎంచుకోమంటూ ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, అకాడమీలు, ప్రైవేట్ సంస్థలు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాయి. దేశ విదేశాల్లో చక్కని ఉపాధి అవకాశాలనూ అందిస్తున్నాయి. అలాంటి కొన్ని అరుదైన కోర్సుల గురించే ఈ ప్రత్యేక కథనం.. ఎథికల్ హ్యాకింగ్సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎథికల్ హ్యాకింగ్కు డిమాండ్ పెరుగుతోంది. ఎథికల్ హ్యాకింగ్ కోర్సులకు నిర్దిష్టమైన అర్హతలు లేనప్పటికీ, కంప్యూటర్ నెట్వర్కింగ్పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్పై అవగాహన ఉండాలి. కొన్ని కోర్సులకు 12వ తరగతి ఉత్తీర్ణత లేదా డిగ్రీ అవసరం కావచ్చు. సైబర్ సెక్యూరిటీలో ఆసక్తి, నేర్చుకోవాలనే తపన రెండూ ముఖ్యమే. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ఇన్ఫర్మేషన్స్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ కన్సల్టెంట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. కోర్సును ఎంచుకునే ముందు సంస్థ గుర్తింపు, కోర్సు సిలబస్, ఫీజుల వివరాలు సరిచూసుకోవడం ఉత్తమం. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు లభిస్తాయి. యాక్టే టెక్నాలజీస్ అనే ఐటీ శిక్షణ సంస్థ ఎథికల్ హ్యాకింగ్పై మాతృభాషలోనే కోర్సులను అందిస్తోంది.పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ ఇది మానవ సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, సంఘర్షణలను తగ్గించడానికి, పరిష్కరించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, అవగాహనను అందించే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్ మొదలైన అంతర్జాతీయ సంస్థలలో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి ప్రభుత్వ సంస్థలలో పని చేయొచ్చు. ఈ కోర్సులో జాయిన్ కావడానికి ఇంగ్లిష్పై పట్టుతో పాటు సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యం ఇస్తుంటాయి.హోరాలజీఇది కాలగమనానికీ, గడియారాల తయారీకి సంబంధించిన శాస్త్రం. ఈ కోర్సులను అందించే సంస్థలను బట్టి అర్హతలు మారతాయి. సాధారణంగా 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది. కొన్ని సంస్థలు సైన్స్ స్ట్రీమ్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మరికొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహించి, కోర్సులో జాయిన్ చేసుకుంటాయి. పలు సాంకేతిక విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలు దీనికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. ఈ రంగంలో ప్రత్యేకమైన డిగ్రీ కోర్సులు లేవు. అయితే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు హోరాలజీలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.ఎథ్నోబోటనీమానవులు, మొక్కల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. ఇది బోటనీ, ఆంత్రొపాలజీల సమ్మేళనం. ఇందులో ఔషధ విలువలు, ఆహార విలువలు, సాంకేతిక ఉపయోగాలు మొదలైన అంశాలను విశ్లేషిస్తారు. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, బోటనీ, ఫార్మసీ, ఆయుర్వేదం, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు సోషల్ సైన్సెస్, ఆంత్రొపాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తున్నాయి.ఏనిమల్ బిహేవియర్ అండ్ సైకాలజీజంతువుల మనస్తత్వానికి, వాటి భావోద్వేగాలకు చెందిన శాస్త్రం ఇది. దీనిలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, జువాలజీ, సైకాలజీ లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు వెటర్నరీ సైన్స్ ్స, బయాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తున్నాయి.ఫైర్ ఇంజినీరింగ్ఇది అగ్ని ప్రమాదాలను నివారించడం, వాటిని ఎదుర్కోవడం, ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించే కోర్సు. దీనిలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బి.ఈ/బీటెక్), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్.ఈ/ఎమ్టెక్) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అనుమతిస్తాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.డెయిరీ హెర్డ్ మేనేజ్మెంట్ఇది పాడి పశువుల నిర్వహణకు సంబంధించిన కోర్సు. ఇందులో పాడి పశువుల పెంపకం, పోషణ, ఆరోగ్యం, పాల ఉత్పత్తి, మార్కెటింగ్, నిర్వహణ వంటి అంశాలను నేర్పిస్తారు. డెయిరీ హెర్డ్ మేనేజ్మెంట్లో సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు వెటర్నరీ సైన్స్ ్స, యానిమల్ సైన్స్ ్స లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.ప్రాప్ మేకింగ్ ఇది సినిమా, థియేటర్, టెలివిజన్, ఈవెంట్స్, ప్రకటనలు మొదలైన వాటి కోసం ప్రత్యేకమైన వస్తువులను (ప్రాప్స్) తయారు చేయడానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కోర్సు. సినిమాల్లోను నటీనటులు రకరకాల వస్తువులను ఉపయోగిస్తుంటారు. సన్నివేశాల్లోనూ రకరకాల వస్తువులు అలంకరణలు ఉంటాయి. వీటిని సినీ పరిభాషలో సెట్ ప్రాపర్టీస్ అంటారు. వీటి తయారీ గురించిన అధ్యయనం. ప్రాప్ మేకింగ్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫైన్స్ ఆర్ట్స్, డిజైన్, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.డెత్ స్టడీస్ ఇది మరణం, మరణ ప్రక్రియ, దుఃఖం, మరణానంతర జీవితం వంటి అంశాలను అధ్యయనం చేసే ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇది మరణం గురించి శాస్త్రీయ, మానసిక, సామాజిక, తాత్త్విక కోణాలను పరిశీలిస్తుంది. ఇది సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఏ/ ఎం.ఎస్.సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, రెలిజియస్ స్టడీస్ లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు మెడికల్, నర్సింగ్, సోషల్ వర్క్ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తాయి.ట్రీ క్లైంబింగ్ఇది చెట్లు ఎక్కడం, వాటిని నిర్వహించడం, రక్షించడం వంటి నైపుణ్యాలను నేర్పించే ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇది అటవీ నిర్వహణ, అర్బోరికల్చర్, వన్యప్రాణుల పరిశోధన వంటి రంగాలలో ఉపయోగపడుతుంది. ట్రీ క్లైంబింగ్ కోర్సులలో సాధారణంగా సర్టిఫికెట్, డిప్లొమా స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. కొన్ని కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత, మరికొన్ని కోర్సులకు 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని సంస్థలు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతాయి. కొన్ని ప్రైవేట్ అడ్వెంచర్ స్కూల్స్, సంస్థలు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.పోలార్ లాఈ కోర్స్లో ధ్రువప్రాంతాల చట్టాల గురించిన అధ్యయనం చేయవచ్చు. పోలార్ లా అనేది ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు, ఒప్పందాలు, నిబంధనలను అధ్యయనం చేసే ఒక ప్రత్యేకమైన న్యాయ విభాగం. ఇది అంతర్జాతీయ చట్టం, పర్యావరణ చట్టం, సముద్ర చట్టం, మానవ హక్కుల చట్టం వంటి వివిధ రంగాలను కలుపుతుంది. పోలార్ లాలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎల్ఎల్ఎమ్), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, లా (ఎల్ఎల్బీ) లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. పీహెచ్డీ చేయడానికి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు సంబంధిత పని అనుభవం ఉన్న విద్యార్థులను కూడా అనుమతిస్తాయి.పారాసైకాలజీపారాసైకాలజీ అనేది మానసిక శక్తులు, అతీంద్రియ అనుభవాలు వంటి వాటిని అధ్యయనం చేసే కోర్సు. ఇందులో టెలిపతీ, క్లేర్వోయన్స్ ్స, ప్రీకాగ్నిషన్, సైకోకైనెసిస్, పునర్జన్మ వంటి అంశాలను విశ్లేషిస్తారు. పారాసైకాలజీలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఏ/ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సైకాలజీ, ఫిలాసఫీ, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్, బయాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తాయి. పీహెచ్డీ చేయడానికి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.జెరంటాలజీ ఇది వృద్ధాప్య ప్రక్రియను, వృద్ధులను అధ్యయనం చేసే శాస్త్రం. దీనికి జీవశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి వివిధ రంగాలతో సంబంధం ఉంటుంది. వృద్ధుల జీవితాలను ఎలా మెరుగుపరచవచ్చో అధ్యయనం చేస్తుంది. కోర్సు స్థాయిని బట్టి, అర్హతలు మారుతుంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీకి దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు సాధారణంగా డిప్లొమా లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు జీవశాస్త్రం, మనస్తత్త్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.స్టాండప్ కామెడీస్టాండప్ కామెడీ అనేది ఒక ప్రత్యేకమైన కళ, దీనికి అధికారిక విద్యార్హతలు అవసరం లేదు. ఇది ఎక్కువగా ప్రాక్టీస్, అనుభవంతో నేర్చుకునే కళ. అయినప్పటికీ, కొన్ని సంస్థలు స్టాండప్ కామెడీకి సంబంధించిన కోర్సులు, వర్క్షాప్లు అందిస్తున్నాయి. స్టాండప్ కామెడీ కోర్సులకు సాధారణంగా అధికారిక విద్యార్హతలు అవసరం లేదు. కొన్ని సంస్థలు, వర్క్షాప్లు 18 సంవత్సరాలు నిండిన వారిని అనుమతిస్తాయి. మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, హాస్య చతురత, స్టేజ్ ఫియర్ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే ఈ కోర్సుకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఆన్స్ లైన్స్ వేదికలు కూడా స్టాండప్ కామెడీ కోర్సులు అందిస్తున్నాయి.పప్పెట్ ఆర్ట్ ఇది ఒక ప్రత్యేకమైన కళ, దీనికి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. ఈ కోర్స్ తోలుబొమ్మల కళపై అధ్యయనం. పప్పెట్ ఆర్ట్లో సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎఫ్ఏ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎఫ్ఏ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫైన్స్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.విటికల్చర్ ఇది ద్రాక్ష సాగు శాస్త్రం. ఇందులో ద్రాక్ష రకాలు, నేల, వాతావరణం, సాగు పద్ధతులు, తెగుళ్ళు, వ్యాధుల నిర్వహణ వంటి అంశాలు ఉంటాయి. విటికల్చరిస్టులు నాణ్యమైన ద్రాక్షను ఉత్పత్తి చేయడానికి ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేస్తారు. ఈనాలజీ–ఇది వైన్ తయారీ శాస్త్రం. ఇందులో ద్రాక్ష రసాలను వైన్స్ గా మార్చే ప్రక్రియ, కిణ్వన ప్రక్రియ, వైన్ నాణ్యతను అంచనా వేయడం వంటి అంశాలు ఉంటాయి. ఈనాలజిస్టులు వివిధ రకాల వైన్లను తయారు చేయడానికి, వాటి నాణ్యతను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని సంస్థలు సైన్స్ ్స స్ట్రీమ్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. కొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాయి. కొన్ని సర్టిఫికెట్ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. బ్రూవింగ్ అండ్ డిస్టిలింగ్ఆల్కహాల్ ఉత్పత్తి ప్రక్రియలు, నిర్వహణ గురించి ఈ కోర్సులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తాయి. బీర్, వైన్, స్పిరిట్స్, ఇతర ఆల్కహాలిక్ పానీయాల తయారీలో ఉపయోగించే సాంకేతికతలు, పదార్థాలు గురించి అవగాహన కల్పిస్తాయి. ఈ కోర్సులో చేరడానికి సైన్స్ ్స స్ట్రీమ్లో 10+2 విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని సంస్థలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కూడా ప్రవేశం ఉంటుంది. కొన్ని ప్రత్యేక కోర్సులకు రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ వంటి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ ఉండాలి. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కొన్ని కళాశాలల్లో సీటు లభిస్తుంది.బేకింగ్ సైన్స్ ్స అండ్ టెక్నాలజీఇది ఆహార శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం కలయికతో కూడిన ఒక ప్రత్యేకమైన కోర్సు. పాకకళలో బేకింగ్ చాలా పురాతన ప్రక్రియ. ఓవెన్లలో రొట్టెలు, బిస్కట్లు, కేకులు వంటివి తయారు చేసే పద్ధతులు, ఈ ప్రక్రియలో నవీన సాంకేతికల గురించిన అధ్యయనం ఇది. ఇందులో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని వర్సిటీలు హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ వంటి అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి. ఇంటర్నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాంపస్లలో ఈ కోర్సులు లభిస్తాయి.ఇవే కాదు, మాంటిస్సోరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్, లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ వంటి పలు కోర్స్లు ఆసక్తిగల విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజెస్, ఎన్విరాన్మెంట్ సైన్స్లో కూడా కొత్త ధోరణులు మొదలయ్యాయి. ఏది ఏమైనా ప్రేరణ, ప్రక్షాళన లేనిదే ఏ ప్రయాణం విజయవంతం కాదు. భవిష్యత్తు నిర్దేశానికి అవే అసలైన వారధులు. నిజానికి ఇలాంటి ఎన్నో రంగాలు విద్యావ్యవస్థల్లో పట్టభద్రులను చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆసక్తిని బట్టి అడుగులు వేయడమే ఆలస్యం. -
ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?
ఊసరవెల్లుల్లా రంగులు మార్చే ఈ చెట్లు ‘ఉప్ప’చెట్లు. ఈ చెట్లు ఏడాదికి రెండుసార్లు రంగులు మార్చుకుంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో అరకులోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలం దుర్గం గ్రామ పంచాయతీ బంగారం గరువు సమీపంలోని ఉప్ప గ్రామంలో ఈ చెట్లను చూడవచ్చు. దాదాపు పదహారువేల ఎకరాల విస్తీర్ణంలోని వనంలో ఈ చెట్లు ఉన్నాయి. ఇవి దాదాపు ఇరవై మీటర్ల ఎత్తులో గుండ్రంగా పెరుగుతాయి. వీటి ఆకులు దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. ‘సపోటసీ’ కుటుంబానికి చెందిన ఈ వృక్షాన్ని ‘ఇండియన్ బటర్ ట్రీ’ అని పిలుస్తారు. ఉప్ప చెట్ల వనంలో నెమళ్లు సహా రకరకాల పక్షులు, కోతులు కనిపిస్తాయి. ఇక్కడ దోమలు, గబ్బిలాలు మాత్రం కనిపించవు.ఏడాదికి రెండుసార్లు రంగుల మార్పుఈ చెట్ల ఆకులు ఏడాదికి రెండుసార్లు రంగులు మారుతాయి. సాధారణం ఇవి మిగిలిన ఆకుల్లా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరోసారి రంగులు మారుతుంటాయి. తొలుత తెలుపుగా, తర్వాత లేతగులాబిగా మారి, చివరకు ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ చెట్ల పువ్వులు నాగమల్లి పూలలా తెల్లగా, అందంగా ఉంటాయి. వీటి పరిమళాలు చాలా దూరం వరకు గుబాళిస్తుంటాయి.పిక్కలకు ఓ లెక్కుంది!ఉప్ప కాయలను పగలగొడితే లోపల పిక్కలుంటాయి. సాదాగా ఉంటే మగ పిక్కలని, త్రికోణాకారంలో ఉంటే ఆడ పిక్కలని గిరిజనులు నమ్ముతారు. విద్యుత్తు సౌకర్యం లేని రోజుల్లో– కిరోసిన్ కూడా అందుబాటులో లేనప్పుడు పిక్కకు రంధ్రం చేసి ఒత్తి గుచ్చి వెలిగించేవారు. లేదంటే సన్నని ఇనుప తీగతో పిక్కలను దండలా గుచ్చి వెలిగించేవారు. ఈ పిక్కలను మెత్తగా దంచి నూనె తీస్తారు. ఈ నూనెను తలకు రాసుకోవడానికి, దీపం పెట్టడానికి, శరీరంపై దద్దుర్లు వస్తే పైపూతగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడతారు. బీజం ఎక్కడ పడింది!ఉప్ప చెట్లు శ్రీలంకలో ఎక్కువగా ఉంటాయి. ఇది వారి జాతీయ వృక్షం. మన దేశంలో హిమాలయాల చుట్టుపక్కల, బిహార్లో అక్కడక్కడా కనిపిస్తాయి. దక్షిణాదిన అల్లూరి జిల్లాలోనే తారసపడతాయి. ఈ చెట్ల పుట్టుక గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 17వ శతాబ్దంలో ఒక సాధువు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఇంటికి వెళ్లి అన్నం పెట్టాలని అడిగాడట! వారు తిరస్కరించగా, కొంత దూరం ప్రయాణించి మరో ఇంటికి వెళ్లి వేడుకున్నాడు. ఆ ఇంట్లో భోజనం పెట్టగా, తిని సంతృప్తి చెంది, ఆ ప్రాంతంలో బంగారం పండుతుందని ఆశీర్వదించి, అన్నం పెట్టని చోట ఉప్ప చెట్లు పెరుగుతాయని శాపం పెట్టినట్లు గిరిజనం చెబుతున్నారు. అవే బంగారం గరువు, ఉప్ప గ్రామాలు అయ్యాయని ప్రతీతి. జయపురం రాజా విక్రమ్దేవ్వర్మ ఈ ప్రాంతంలో ఉప్ప విత్తులు జల్లించారన్నది మరో కథనం. గిరిజనులు ఈ చెట్లను అతి పవిత్రంగా చూసుకుంటారు. ఈ తోటలో ఎవరైనా మలమూత్రాదులు విసర్జిస్తే శిక్షిస్తారు. ఈ మేరకు హెచ్చరిక బోర్డులు పెట్టారు. చెట్లను కొడితే కఠిన శిక్షలు అమలుచేస్తారు. ఈ వనాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మార్చారు. ఈ చెట్ల రక్షణ బాధ్యత గ్రామ దేవత గుణాలమ్మ తల్లి చూసుకుంటుందని నమ్ముతారు. అరవై ఏళ్ల కిందట గ్రామదేవతకు గుడి నిర్మించారు. ఏటా ఇక్కడ ఘనంగా జాతర జరుపుతారు.ఎలా చేరుకోవాలంటే...పాడేరుకు 30 కిలోమీటర్లు, అరకు నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉప్ప గ్రామం ఉంది. విశాఖపట్నం నుంచి 130 కిలోమీటర్ల దూరాన ఉంది. సబ్బవరం మీదుగా పాడేరు–అరకు మార్గంలో ఉప్ప గ్రామానికి చేరుకోవచ్చు. కార్లు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లవచ్చు. ఈ మార్గంలో వచ్చేవారు వాహనాల్లో ఇంధనం నింపుకోవాలంటే డుంబ్రిగుడలో మాత్రమే పెట్రోల్ బంకు ఉంది. ఉప్ప తోటల్లో పర్యాటకులు సెల్ఫీలు తీసుకుని సంబరపడుతుంటారు. ఇటీవలి కాలంలో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు విరివిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సత్యదేవ్ నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ -
ఈ జెల్ సాక్స్తో పాదాలు ఇట్టే కోమలంగా మారతాయ్..!
సాధారణంగా మనం వాడే చెప్పులను బట్టి, వాతావరణాన్ని బట్టి, జాగ్రత్త లేకపోవడాన్ని బట్టి పాదాలు పొడిబారినట్లు తయారవుతుంటాయి. కాళ్లు తెల్లగా పొట్టురేగినట్లు ఉన్నా, మడమలు పగిలిపోయినా అసలు అందంగా కనిపించవు. అలాంటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిందే. కానీ సమయం లేని వారు ఇలాంటి జెల్ సాక్స్ కొనుక్కుంటే సరిపోతుంది. రాత్రి ఈ సాక్స్ వేసుకుని పడుకుంటే తెల్లారేసరికి పాదాలు మృదువుగా, అందంగా మారతాయి.పొడి పాదాలు, పగిలిన మడమలు ఉన్నవారికి, పాదాల చర్మాన్ని మృదువుగా, నునుపుగా ఉంచుకోవాలనుకునే వారికి, రాత్రిపూట సౌకర్యవంతమైన ఫుట్ కేర్ ట్రీట్మెంట్ కోరుకునేవారికి ఈ సిలికాన్ జెల్ సాక్స్ ఒక అద్భుతమైన పరిష్కారం. ఇవి పాదాలకు అవసరమైన తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.డీప్ హైడ్రేషన్ కారణంగా పాదాలు పగిలినట్లు మారినా, దుమ్ము, ధూళిలో తిరిగినా, కాళ్లు చూడటానికి అసహ్యంగా మారినా ఈ సిలికాన్ సాక్స్లో ఆయిల్స్ లేదా మాయిశ్చరైజర్ క్రీమ్స్ లేదా ఫుట్ సీరమ్లను కొద్దిగా వేసుకుని, సాక్స్ లోపల మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని, పాదాలకు తొడుక్కోవాలి.అయితే ముందుగా కాళ్లను శుభ్రంగా క్లీన్ చేసుకుని, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అనంతరం మాయిశ్చరైజర్ ఉన్న సాక్స్ని తొడుక్కుని ఉదయాన్నే తీసెయొచ్చు. ఈ సాక్స్ని గోరువెచ్చని నీటిల్లో క్లీన్ చేసుకుని, ఆరబెట్టుకోవాలి. ఇవి క్వాలిటీని బట్టి రూ. 199 నుంచి ఐదారొందల వరకూ ఆన్లైన్లో అమ్ముడుపోతున్నాయి. సైజులను గమనించుకుని, రివ్యూలు చూసి కొనుగోలు చేయడం ఉత్తమం.(చదవండి: -
భలే బతుకు చక్రాలు..! చూస్తే మతిపోవాల్సిందే..
సాధారణంగా ఇల్లస్థలాలు చతురస్రంగానో దీర్ఘచతురస్రంగానో చూస్తుంటాం. కానీ డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ నగర శివారు ప్రాంతానికి వెళ్తే, పచ్చదనంతో నిండిన పెద్దపెద్ద చక్రాలు కనువిందు చేస్తాయి. ఒక్కో చక్రంలో 16 ఇళ్లు సకల సౌకర్యాలతో, ఆవాసయోగ్యంగా అగుపిస్తాయి. ‘బ్రాండ్బై గార్డెన్ సిటీ’ అనే ఈ ప్రత్యేకమైన కమ్యూనిటీ.. ప్రకృతి జీవనానికీ దగ్గరగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అందరి మనసుల్ని దోచేస్తుంటాయి. 1964లో ఎరిక్ మైగిండ్ అనే భవన నిర్మాణకర్త ఆలోచనల్లోంచి ఈ లేఔట్ పుట్టిందట. ఇలాంటి పచ్చని చక్రాలు ఈ ప్రదేశంలో చాలానే ఉంటాయి. ప్రతి సర్కిల్ మధ్యలో పార్కింగ్ స్థలం ఉంటుంది. సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి నిర్మాణాలు మరింత మేలు చేస్తాయని స్థానికుల నమ్ముతారు. చక్రంలోనే ప్లాట్ చూడటానికి కట్ చేసిన కేకుముక్కలా ఉంటుంది. అయితే ఈ అందమైన ఇళ్ల నిర్మాణాలను డ్రోన్ వ్యూలో చూసిన వారు ఎవరైనా ‘అబ్బా భలే ఉంది, ఇలాంటి చోట ప్రశాంతంగా బతకొచ్చు’అంటుంటారు. అయితే కొందరు ‘చూడటానికి బాగున్నా, నివాసానికి అసౌకర్యంగా ఉంటుంది, అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు తప్పించుకోవడం కష్టమవుతుంది’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అతిచిన్న అంతర్జాతీయ వారధి..!) -
అతిచిన్న అంతర్జాతీయ వారధి..!
ఇది ప్రపంచంలోనే అతి చిన్న అంతర్జాతీయ వారధి. కేవలం కొన్ని అడుగులు వేసి, ఈ వంతెనను ఇట్టే దాటేయవచ్చు. దీని మీదుగా స్పెయిన్ నుంచి పోర్చుగల్ దేశానికి వెళ్లొచ్చు. దీనిని ‘మార్కో ఇంటర్నేషనల్ బ్రిడ్జ్’ అని పిలుస్తారు. కేవలం 6 మీటర్ల పొడవు, 1.45 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను 2008లో నిర్మించారు. స్పెయిన్లోని ఎల్ మార్కో గ్రామం నుంచి పోర్చుగల్ గ్రామమైన వర్జియా గ్రాండ్ల మధ్య ఉండే చిన్న వాగును దాటేందుకు, వెదురు బొంగులతో దీనిని నిర్మించారు. ఈ వంతెన రెండు వేర్వేరు టైమ్జోన్ల పరిధిలో ఉంది. స్పెయిన్ వైపు సెంట్రల్ యూరోపియన్ టైమ్ (సీఈటీ) జోన్లోను, పోర్చుగీస్ వైపు గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) జోన్లోను ఉండటం విశేషం. దీని మీదుగా ప్రయాణిస్తే, టైమ్ ట్రావెల్ చేసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. దీని మీదుగా కేవలం పాదచారులు, ద్విచక్ర వాహనాలు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. పర్యాటకులకు ఇదొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోజూ వందలాది మంది ఈ వంతెనను దాటుతూ టైమ్ ట్రావెలింగ్ చేసిన అనుభూతిని పొందుతున్నారు. (చదవండి: krithi shetty: నీలిరంగు డ్రెస్లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!) -
నీలిరంగు డ్రెస్లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!
కృతి మూడోతరగతి చదువుతున్నప్పుడు ఒక బుక్ ఫెయిర్లో పుస్తకం కొనడానికి అమ్మను డబ్బు అడిగితే, వాళ్లమ్మ చాలా సంతోషించింది. కాని, కృతి ‘హౌ టు బి గార్జియస్’ అనే బ్యూటీ బుక్తో ఇంటికి వెళ్లింది. చిన్నప్పటి నుంచి అందంపై ఎంతో శ్రద్ధ చూపే తను, ఫ్యాషన్లోనూ అంతే ఆసక్తిని కనబరుస్తున్న విషయం ఆమె ఫ్యాషన్ స్టయిలే చెప్తుంది. ఆ విషయాలే మీ కోసం.. సౌందర్యం, చర్మ రక్షణ కోసం చాలా తెలుసుకొని, ఎన్నో వీడియోలు, నిపుణుల సలహాలు తీసుకున్నాకే నాపై ప్రయత్నిస్తా. చక్కెరకు దూరంగా ఉండటం వలన వచ్చిన అందం, ఇప్పటివరకు ఏ బ్యూటీ ప్రాడక్ట్ నాకు ఇవ్వలేదు. జ్యూలరీలో లాంగ్ ఇయర్ రింగ్స్ ఇష్టం. అవి నా ముఖానికి బాగా నప్పుతాయని అంటోంది కృతి శెట్టి.ఆభరణాలన్నీ అలంకరించుకోవటం ఓ స్టయిల్ అయితే, కేవలం ఒకే ఒక్క ఆభరణంతో స్టయిలింగ్ చేసుకోవటం ప్రస్తుతం ఉన్న ట్రెండ్. ముఖ్యంగా చెవులకు ధరించే దుద్దులు, జూకాలను సాధారణం కంటే కాస్త పెద్ద సైజులో ధరిస్తే మెడను బోసిగా ఉంచుకున్నా, ఇతర ఆభరణాలు ధరించకపోయినా అందంగానే కనిపించొచ్చు. కాని, ఎప్పుడూ ఒకే రకం ఇయర్ రింగ్స్ బోర్ కొడతాయి. అయితే, ఈ ఇయర్ రింగ్స్ బ్యాక్ ఫ్రేమ్ ఒక్కదానితో వివిధ రకాల స్టడ్స్ను మార్చుకుంటూ చాలా రకాలుగా స్టయిలింగ్ చేసుకోవచ్చు. (చదవండి: కేన్సర్తో పోరాడటంలో బీట్రూట్ హెల్ప్ అవుతుందా..?)మొదట్లో కేవలం బంగారు ఆభరణాలకే లభించే ఈ డిటాచబుల్ ఫ్రేమ్స్, ప్రస్తుతం ఖర్చుకు ఖర్చు ఆదా చేయడానికి, స్టయిల్కు స్టయిలిష్ లుక్ అందించడానికి మార్కెట్లో వివిధ మెటల్స్లోనూ లభిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలాంటి ఫ్రేమ్స్తో డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేసేయండి పైన చూపించిన నటి కృతి శెట్టిలా. డ్రెస్ డిజైనర్ ప్రియల్ ప్రకాశ్ ధర: రూ. 27,500 జ్యూలరీ బ్రాండ్ మయరా ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.(చదవండి: సమ్మర్ ఫ్యాషన్: ప్లస్ సైజ్..ప్లస్ స్టైల్) -
హీరోయిన్గా అవకాశాలు రాక ఐటం సాంగ్? కేతిక ఏమందంటే?
‘అది దా సర్ ప్రైజ్’ అనే పాటలోని హుక్ స్టెప్తో ఎంతోమందికి నచ్చిన కేతికా శర్మ (Ketika Sharma), అంతే ఎక్కువగా ట్రోలింగ్ను కూడా ఎదుర్కొంది. ఎన్ని తిట్టినా, ఎంత పొగిడినా తన పని తాను చూసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న కేతికా చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మూవ్మెంట్స్ చెప్పినప్పుడు లోతుగా ఆలోచించను. వాళ్ళు చెప్పినవి చెప్పినట్టుగా సమయానికి ఎలా చేయగలను అనే దాని మీదే నా దృష్టి ఉంటుంది. హీరోయిన్గా అవకాశాలు రాక ఐటమ్ సాంగ్ చేయలేదు. ఈ మధ్య కాలంలో ఒక్క ఐటమ్ సాంగ్ దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చిపెడుతోంది.లక్నోలో స్కూలింగ్ చేసి, ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ వరకు చదివాను. పదహారేళ్ల వయసులోనే మోడలింగ్లోకి వచ్చాను. ‘థగ్స్’ అనే మ్యూజిక్ ఆల్బమ్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.అమ్మనాన్న ఇద్దరూ డాక్టర్లు. మోడలింగ్కి అభ్యంతరం చెప్పలేదు. కానీ, హీరోయిన్ అవుతానంటే మాత్రం ఒకటికి వందసార్లు ఆలోచించారు. ఏడాది టైమ్ ఇచ్చారు. అదృష్టం కొద్దీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో వాళ్లు మరో మాట మాట్లాడలేదు.సోషల్ మీడియాలో ఎన్ని డబ్ స్మాష్ వీడియోలు చేశానో లెక్కే లేదు. ఆ వీడియోలు చూసే దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘రొమాంటిక్’ సినిమాలో హీరోయిన్గా నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతానని అనుకోలేదు. కాని, సినిమా ఫ్లాప్ అవుతుందని ఊహించలేదు. కొన్ని రోజులు మూడౌట్ అయ్యాను.జీవితంలో మరిచిపోలేని సందర్భం అంటే, ‘రొమాంటిక్’ సినిమా లాస్ట్ డే షూటింగ్. అదే రోజు నాగశౌర్య హీరోగా ‘లక్ష్య’ సినిమా ఆఫర్ వచ్చింది. మొదటి సినిమా విడుదల కాకుండానే, రెండో సినిమా అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది.ఇద్దరు స్టార్ బ్రదర్స్తో కలిసి నటించడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్. ‘బ్రో’లో సాయి ధరమ్ తేజతో, ‘రంగ రంగ వైభవంగా’లో అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్తో కలిసి నటించినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, థ్రిల్గానూ ఫీలయ్యాను.చదవండి: అభినయ, సన్నీల పెళ్లి ఎప్పుడంటే..?