
సాధారణంగా పోలీసులు ఓ దొంగని పట్టుకుని విచారిస్తే ఏమవుతుంది? అప్పటి వరకు అతడు చేసిన చోరీల చిట్టా బయటకు వస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఆ చోరుడితో పాటు అతడికి తెలిసిన దొంగల జాబితాలు బహిర్గతం అవుతాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం పోయిన సొత్తు, సొమ్ముకు సంబంధించి యజమానులు తమ ఫిర్యాదుల్లో చెప్పిన తప్పుడు లెక్కలు తెలుస్తుంటాయి. 2002లో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోని షాహినాయత్గంజ్ పోలీసులు సాజిద్ అనే ఘరానా దొంగను పట్టుకున్నారు. ఇతడి విచారణలో కుందన్బాగ్ ప్రాంతంలో జరిగిన తల్లీ, ఇద్దరు కూతుళ్ల సామూహిక ఆత్మహత్య విషయం బయటపడింది.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జయప్రదకు హైదరాబాద్కు చెందిన బడా వ్యాపారవేత్తతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కలిగిన తరవాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగా, జయప్రద తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కుందన్బాగ్లోని రెండంతస్తుల సొంత భవనంలో నివసించేది. కొన్నాళ్ల పాటు కుమార్తెలు తమ చదువుల కోసం కాలేజీలకు వెళ్లివెళ్లేవారు. కానీ, హఠాత్తుగా మానేశారు. తల్లితో పాటు ఇంట్లోనే ఉండిపోయారు. బయట నుంచి అందంగా కనిపించే ఆ భవంతి ప్రాంగణం మాత్రం పట్టించుకునే వాడు లేకపోవడంతో పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోయింది. పోర్టికోలో మాత్రం ఎప్పుడూ ఓ కారు ఆగి ఉండేది.
తాను బయటకు వచ్చి పరిచయస్తులతో సంప్రదింపులు జరిపినా, ఇరుగుపొరుగు వారితో మాట్లాడినా తన గతం ప్రస్తావన వస్తుందనే ఉద్దేశంతో జయప్రద బాహ్యప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. అదే భావనతో తన పిల్లల్నీ ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసింది. ఫలితంగా ఈ కుటుంబానికి చుట్టుపక్కల వారితో పరిచయాలు, స్నేహాలు లేకుండా పోయాయి. ఈ ఇంటికి రాకపోకలు సాగించే వారు కూడా ఎవ్వరూ ఉండేవారు కాదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట గడప దాటని ఈ కుటుంబం అప్పుడప్పుడు అర్ధరాత్రి వేళ మాత్రం బయటకు వచ్చి క్యాండిల్ వెలుగులో ఇంటి చుట్టూ సంచరిస్తుండేవారు. అలా వాళ్లు ఎందుకు చేస్తున్నారనే దానిపై స్థానికులు కొన్నాళ్లు ఆరా తీసినా విషయం తెలియలేదు. దీంతో కొందరు వీరి విషయం పట్టించుకోవడం మానేశారు. మరికొందరు భయంతో జయప్రద కుటుంబానికి, ఆ ఇంటికి దూరంగా ఉండిపోయారు.
మిస్టరీగా మెలిగే ఈ కుంటుంబం అన్ని చెల్లింపులు ముందస్తుగానే చేసేది. కరెంట్ బిల్ ఏకంగా రెండుమూడేళ్లకు అడ్వాన్స్ కట్టేసేది. పాలు పోసే వ్యక్తికి, పేపర్ బాయ్కి దాదాపు ఏడాదికి సరిపడ డబ్బు ముందే ఇచ్చేది. ఏడాదికి అవసరమైన సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టుకునేది. ఎవ్వరి కంటా పడకూడదనే ఉద్దేశంతో ఇంటికి సమీపంలో ఉన్న చెత్తడబ్బా దగ్గరకీ తమ కారులో వెళ్లి చెత్తను పడేసి వచ్చేది.
ఎవరికీ పట్టని, ఎవరినీ పట్టించుకోని ఈ కుటుంబంతో సమీపంలో ఉండే ఓ కాలేజీ విద్యార్థులు మాత్రం ఓ సందర్భంలో ఘర్షణపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రపంచానికి దూరంగా జయప్రద కుటుంబం నివసిస్తున్న ఈ ఇంట్లో 2002 జూన్ నెల నుంచి నిశ్శబ్దం నెలకొంది. అయినా ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పట్టించుకుని పోలీసులకు సమాచారం అందించలేదు.
షాహినాయత్ గంజ్ పోలీసులు అదే ఏడాది సెప్టెంబర్ 15న ఇళ్లల్లో దొంగతనాలు చేసే ఘరానా దొంగ మహ్మద్ సాజిద్ను పట్టుకున్నారు. ఇతడి విచారణలో అనేక నేరాలు వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటే లోకం చూడని సామూహిక ఆత్మహత్యల సమాచారమూ వెల్లడైంది. కుందన్బాగ్లోని ఓ బంగ్లాలో తాను చోరీకి వెళ్లానని, ఆ ఇంటి ప్రధాన ద్వారం లోపలి నుంచి తాళం వేసి ఉండగా, పక్క ఉన్న మరో తలుపు తీసి ఉండటంతో లోపలకు ప్రవేశించానని చెప్పాడు.
ఆ ఇంట్లోని బెడ్రూమ్లో మంచంపై ముగ్గురు మహిళల మృతదేహాలు పడి ఉన్నాయని, దీంతో తొలుత కాస్త భయపడినా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పదేపదే ఆ ఇంట్లోకి వెళ్లి వస్తూ అందినకాడికి సొత్తు ఎత్తుకుపోయానని బయటపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న షాహినాయత్గంజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కుందన్బాగ్ ప్రాంతం పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఆ అధికారులకు సమాచారం ఇచ్చి, వారితో కలిసి చోరుడిని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ అతగాడు వరుస చోరీలు చేసిన ఇంటిని చూపించమని కోరారు. సాజిద్ నేరుగా తీసుకువెళ్లి జయప్రద ఇంటిని చూపించాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో, బెడ్రూమ్లో మంచంపై ఉన్న మూడు మృతదేహాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంటి వరండాలో గుట్టగా పడి ఉన్న వార్తాపత్రికలను సేకరించి పరిశీలించారు. అవి ఆ ఏడాది జూన్ 21 తేదీ నుంచి ఆ రోజు వరకు (సెప్టెంబర్ 15) సంబంధించినవిగా తేలడంతో 2002 జూన్ 20 రాత్రి ఈ ఆత్మహత్యలు జరిగినట్లు అంచనా వేశారు.
ఆ గదిలో దొరికిన గుర్తుతెలియని విషం ఫినాయిల్గా తేలింది. మృతదేహాలకు సమీపంలోనే ఫినాయిల్ బాటిల్ సైతం పోలీసులకు లభించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుందన్బాగ్తో పాటు హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సామూహిక ఆత్మహత్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
-శ్రీరంగం కామేష్