హైదరాబాద్: దొంగిలించిన సొత్తుతో ఓ వ్యక్తి హోటల్లో బస చేయగా అక్కడికి వచ్చిన ఓ యువతి అందులో నుంచి రూ. లక్ష ఎత్తుకెళ్లింది. జల్సాల కోసం చోరీ చేసిన సొత్తులో కొంత మరో దొంగ కొట్టేయడంతో ఓ నిందితుడు లబోదిబోమంటూ పోలీసుల ముందు తనగొడు వెల్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని జైన్ కన్స్ట్రక్షన్స్లో గుంటూరు జిల్లా గుడిపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ ఫణీంద్ర(29) గత మూడేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పని చేస్తున్నాడు.
నమ్మకంగా పని చేస్తున్నట్లు యజమాన్యాన్ని నమ్మించి గత నెల 26వ తేదీన యజమాని కళ్లుగప్పి కార్యాలయంలో రూ.12.33 లక్షల నగదు ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లాడు. బస్సులో ఒంగోలుకు వెళ్లి చోరీ చేసిన సొత్తుతో ఒక కేటీఎం బైక్ కొనుగోలు చేశాడు. అక్కడే ఒక ఐఫోన్ కూడా కొన్నాడు. బైక్పై నెల్లూరు వెళ్లి ఓ హోటల్లో బస చేసి ఆ రాత్రికి ఓ యువతిని రప్పించుకున్నాడు. తెల్లవారి ఫణీంద్ర కళ్లుగప్పిన ఆ యువతి బ్యాగులో ఉన్న రూ.లక్ష సొత్తుతో ఉడాయించింది. నిందితుడు అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగిలించిన సొత్తును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాడు.
అప్పటికే పోలీసులు ఫణీంద్ర కదలికలపై నిఘా పెట్టారు. ఫోన్ నెంబర్ ఆధారంగా బెంగళూరుకు 130 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సులో వెళ్తున్న నిందితుడిని బంజారాహిల్స్ క్రైమ్ ఎస్ఐ యాసిన్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న ఫణీంద్ర మధ్య తరగతి జీవితంతో విసుగు చెంది సంపన్నులు మాదిరిగా ఉండాలని ఇప్పుడున్న జీతం సరిపోకపోవడంతో దొంగగా మారాడు. చోరీ చేసిన సొత్తుతో కేటీఎం బైక్తో పాటు ఐఫోన్ కొనుగోలు చేసి అంతకుముందు చేసిన అప్పులు తీర్చి స్టార్ హోటళ్లలో బస చేస్తూ జల్సాలు చేస్తూ అయిదు రోజుల పాటు బెంగళూరులోనే తిరిగాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కొంత సొత్తును రికవరీ చేశారు.


