
ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను
పూర్వం దీపకుడు అనే బ్రహ్మచారి ఉండేవాడు. అతడు పరమ నైష్ఠికుడు. శాస్త్రాలలో చెప్పిన ‘శిశువుకు తల్లిదండ్రులు, శిష్యుడికి గురువును మించిన దైవం లేరు. వారి సేవను మించిన తీర్థ యజ్ఞాదులు లేవు. జన్మను తరింపజేసుకోవడానికి మాతాపితరుల సేవ, గురుసేవను మించిన మార్గం లేదు’ అనే సూక్తిని చదివి, గురువు కోసం అన్వేషణ ప్రారంభించాడు.
ఇంటి నుంచి దీపకుడు కాలినడకన బయలుదేరాడు.
దారిలో కనిపించిన వారిని తగిన గురువు కోసం వాకబు చేయసాగాడు. గోదావరి తీరంలో వేదధర్య మహర్షి వేదవేదాంగ పారంగతుడని, గురుకులం నిర్వహిస్తూ ఎందరికో విద్యాబోధన చేస్తున్నాడని చాలామంది చెప్పారు. వేదధర్యుడి ఆశ్రమం ఎక్కడ ఉన్నదో బాటసారులను కనుక్కొని తన ప్రయాణం కొనసాగించాడు. కొద్దిరోజుల ప్రయాణం తర్వాత ఆశ్రమానికి చేరుకున్నాడు. శిష్యులతో వేదం వల్లె వేయిస్తున్న వేదధర్యుడిని చూసి, నేరుగా ఆయన వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేశాడు.
దీపకుడి వినయశీలతకు వేదధర్యుడు ముచ్చటపడ్డాడు. అతడిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. దీపకుడు గురుసేవ చేసుకుంటూ, విద్యాభ్యాసం కొనసాగించాడు. అనతికాలంలోనే వేద శాస్త్ర పురాణాలన్నింటినీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
శిష్యుడి విద్యాతేజస్సుకు వేదధర్యుడు అబ్బురపడ్డాడు. ఒకనాడు ఆయన దీపకుడిని పిలిచి, ‘కుమారా! నేను గత జన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. రెండు భయంకరమైన పాపాలకు మాత్రం ఫలితాన్ని ఇంకా అనుభవించాల్సి ఉంది. చేసిన కర్మమే చెడని పదార్థం కదా! సాక్షాత్తు విశ్వనాథుని ధామమైన పవిత్ర కాశీక్షేత్రంలో నేను ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోదలచాను.
పుణ్యక్షేత్రంలో ఏ పనికైనా ఫలితం రెండింతలుగా ఉంటుంది. నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తం కోసం ఆవాహన చేయగానే నాకు భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ ఉంటుంది. వికార రూపం వస్తుంది. కొన్నాళ్లకు అంధత్వం వస్తుంది. అలాంటి పరిస్థితిలో కఠినాత్ముడినై, ఇతరుల సేవ కోసం దీనంగా ఎదురుచూస్తుంటాను. నేను ఆ దుస్థితిలో ఉన్నప్పుడు నాకు సేవ చేయగలవా?’ అని అడిగాడు.‘గురువర్యా! నేను మీ పాపాలను ఆవాహన చేసుకుని, వాటి ఫలితాన్ని అనుభవిస్తాను. దయచేసి నాకు అనుమతి ప్రసాదించండి’ అని వేడుకున్నాడు దీపకుడు.‘దీపకా! నువ్వు నీ వంశానికే కులదీపకుడవు.
అయినా, ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను’ చెప్పాడు వేదధర్యుడు.గురువు ఆనతి ప్రకారం దీపకుడు ఆయనను కాశీకి తీసుకువెళ్లాడు.కాశీలోని మణికర్ణికకు ఉత్తరాన ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరుకుని, అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు.గురువు చెప్పినట్లే జరిగింది. కాశీకి చేరుకున్న కొద్దిరోజులకే వేదధర్యుడి కుష్ఠువ్యాధి సోకింది. క్రమక్రమంగా అతడి శరీరం క్షీణించసాగింది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ, వేళ్లు తెగిపోయి, వికృతాకారుడిగా మారాడు. ఇంకొన్నాళ్లకు అంధుడైపోయాడు. గురువు పరిస్థితికి దీపకుడు చాలా దుఃఖించాడు.
గురువును కంటికి రెప్పలా చూసుకుంటూ, నిత్యం ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ, పరిచర్యలు చేసేవాడు. భిక్షకు వెళ్లి, దొరికిన భోజనాన్ని గురువుకు పెట్టేవాడు. ప్రతిరోజూ దీపకుడు తెచ్చిన భిక్షను తానొక్కడే తినేస్తూ, ‘ఇంత కొంచెమే తెచ్చావెందుకు?’ అంటూ దుర్భాషలాడేవాడు. గురువు కోపతాపాలను సహిస్తూనే దీపకుడు ఆయనను అంటిపెట్టుకుని ఉంటూ సేవలు చేసేవాడు.దీపకుడి అచంచల గురుభక్తికి కాశీ విశ్వనాథుడు ముగ్ధుడయ్యాడు. రోజూ మాదిరిగానే ఒకనాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడికి ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ గురుభక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.
‘స్వామీ! నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప మరేదీ తెలియదు. మా గురువు అభీష్టమేదో కనుక్కొని చెబుతాను’ అన్నాడు. ఆశ్రమానికి వెళ్లాక గురువుకు ఈ విషయం చెప్పాడు. ‘గురుదేవా! మీకు స్వస్థత కోరుకుంటాను’ అన్నాడు.‘నాయనా! ఎవరి పాపాలకు ఫలితాన్ని వారు అనుభవిస్తేనే పోతాయి’ అని చెప్పాడు వేదధర్యుడు.మరునాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడు పరమేశ్వరుడిని ఏ వరమూ కోరుకోలేదు.
పరమేశ్వరుడు దీపకుడి సంగతిని పార్వతీదేవికి, ఆ తర్వాత శ్రీమన్నారాయణుడికి, సమస్త దేవతలకు చెప్పి సంబరపడిపోయాడు.శ్రీమన్నారాయణుడు దీపకుడికి ప్రత్యక్షమై, ‘వత్సా! సాక్షాత్తు పరమేశ్వరుడినే మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యం. ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు.‘స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు, చాలు’ అని పలికాడు దీపకుడు.‘తథాస్తు’ అని అనుగ్రహించాడు శ్రీమహావిష్ణువు.
∙సాంఖ్యాయన