పట్టులా జాలువారే జుట్టు కోసం చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. పార్లర్లలో క్రీములు వాడి, ఆవిరి పట్టించి జుట్టుకు సత్వరమే మెరుపును, మృదుత్వాన్ని అందిస్తారు. అయితే ఆ మెరుపు ఎక్కువ కాలం ఉండదు. ఇక్కడ చెప్పిన చిన్న ట్రిక్తో ఇంట్లో ఉండే వస్తువులతోనే జుట్టును మెరిసేలా, సిల్కీగా మార్చుకోవచ్చు.
ఇందుకోసం బియ్యం కడిగిన నీటిని ఒక గ్లాసులో తీసుకోండి. ఈ నీటిలో మూడు స్పూన్ల కలబంద గుజ్జు కలిపి బాగా గిలకొట్టండి. తల స్నానం చేసిన వెంటనే తల తడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. తర్వాత నీటిలో ముంచిన మెత్తని కాటన్ గుడ్డను తలకు చుట్టుకోవాలి. కాసేపటికి ఫ్యాన్ గాలి తగిలేలా కూర్చోవాలి. పది నిమిషాల తర్వాత తలస్నానం చేసుకుంటే చాలు మెరిసే, పట్టుకుంటే జారిపోయే కురులు మీ సొంతమవుతాయి.


