పద్మ–పిప్పలాదుల చరిత్ర | Story Of Anaranyudu | Sakshi
Sakshi News home page

పద్మ–పిప్పలాదుల చరిత్ర

Apr 27 2025 7:37 AM | Updated on Apr 27 2025 7:37 AM

 Story Of Anaranyudu

పద్నాలుగో మనువు ఇంద్రసావర్ణి. అతడి వంశంలో జన్మించిన అనరణ్యుడు చక్రవర్తిగా ఎదిగాడు. అతడు సప్తద్వీపాలను పరిపాలిస్తుండేవాడు. గొప్ప శివభక్తుడైన అనరణ్యుడు భృగుమహర్షిని బ్రహ్మగా చేసుకుని, వంద యజ్ఞాలను విజయవంతంగా పూర్తి చేసి, ఇంద్రపదవికి అర్హత పొందాడు. అయినా, స్వార్థరహితుడు కావడంతో ఇంద్రపదవిని తిరస్కరించాడు. అనరణ్యుడికి వందమంది కొడుకులు, పద్మ అనే ఒకే ఒక కూతురు కలిగారు. చక్రవర్తి దంపతులకు కొడుకులపై కంటే కూతురుపైనే ప్రేమ ఎక్కువ. పద్మకు యుక్తవయసు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని సంకల్పించి అనరణ్యుడు రాజులందరికీ స్వయంవరం కోసం ఆహ్వానపత్రాలు పంపాడు. 

ఇదిలా ఉంటే, లోకసంచారం చేస్తున్న పిప్పలాద మహర్షి ఒకనాడు ఒక గంధర్వుడు స్త్రీలతో జలక్రీడలు ఆడుతుండగా చూశాడు. ఆ దృశ్యం చూడటంతో పిప్పలాదుడికి వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది. అప్పటి నుంచి తపస్సు మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. ఒకనాడు యథాప్రకారం పుష్పభద్రా నదిలో స్నానం చేస్తున్న పద్మను చూశాడు. ఆమె అందచందాలకు ఆకర్షితుడై, అక్కడే ఉన్న ఆమె చెలికత్తెలను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె అనరణ్య చక్రవర్తి కుమార్తె అని, త్వరలోనే ఆమెకు స్వయంవరం జరగబోతోందని చెలికత్తెలు చెప్పారు. 

పిప్పలాదుడు నేరుగా అనరణ్యుడి రాజసభకు వెళ్లాడు. అనరణ్యుడు అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ‘రాజా! నీ కుమార్తె పద్మను నేను మోహించాను. నాకు ఆమెనిచ్చి వివాహం జరిపించు. లేకుంటే, నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తాను’ అన్నాడు. పిప్పలాదుడి కోరిక విని రాజసభలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. వారంతా అతడి తేజస్సు చూసి భయభ్రాంతులయ్యారు.వృద్ధుడైన పిప్పలాదుడికి సుకుమారి అయినా రాకుమార్తెను ఇవ్వడం ఇష్టంలేక రాజకుటుంబంలోని స్త్రీలందరూ రోదించడం ప్రారంభించారు. విపత్కరమైన ఈ పరిస్థితిలో ఏంచేయాలో అనరణ్యుడికి ఏమీ తోచలేదు.

 వెంటనే అతడు రాజగురువును, రాజపురోహితుడిని సంప్రదించాడు. ‘ఈ విపత్కర స్థితిలో ఆచరించదగిన ధర్మమేమిటో మీరే చెప్పండి’ అని వారిని అడిగాడు.‘ఒక్కరి కారణంగా సర్వనాశనం జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు, ఆ ఒక్కరినీ త్యాగం చేసి, సర్వాన్నీ కాపాడుకోవాలి. ఇదే వేదధర్మం’ అని వారు చెప్పారు. రాజగురువు, రాజపురోహితుడు ఇచ్చిన సలహాపై అనరణ్యుడు తన కూతురు పద్మను పిప్పలాదుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం తర్వాత పిప్పలాదుడు తనతో పాటే పద్మను అరణ్యంలోని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. ఆమె ఆశ్రమవాసంలో ఉంటూ, భర్తను భక్తిశ్రద్ధలతో సేవించుకోసాగింది. భర్త మనసెరిగి ప్రవర్తించసాగేది. అలా పద్మా పిప్పలాదుల దాంపత్యం అన్యోన్యంగా కొనసాగేది. 

ఒకనాడు పద్మ నదిలో స్నానం చేసి, నీళ్లకడవ నెత్తిన పెట్టుకుని, ఆశ్రమానికి తిరిగి వస్తోంది. ఆమెను పరీక్షించదలచిన ధర్ముడు రాజవేషంలో ఆమెకు దారిలో ఎదురయ్యాడు. నానాలంకార భూషితుడై, నవయవ్వనంతో మెరిసిపోతున్న ధర్ముడు అపరమన్మథుడిలా ఉన్నాడు. ధర్ముడు పద్మను అడ్డగించి, ‘ఓ సుందరీ! నువ్వెవరివి? నీ తల్లిదండ్రులెవరు? నీ సౌందర్యానికి నేను దాసుడిని. నిన్ను పెళ్లాడాలనుకుంటున్నా’ అన్నాడు.పద్మ అతడి ప్రశ్నలకు ముక్తసరిగా బదులిచ్చి, ‘నాకు పెళ్లయింది. నా భర్త పిప్పలాద మహర్షి’ అని చెప్పింది.‘ఓహో! ఆ తలనెరిసి, శరీరం ముడుతలు పడిన వృద్ధుడేనా నీ భర్త! నిండుజాబిలిలాంటి అందగత్తెవు నీవెక్కడ? పండుకోతిలాంటి వృద్ధుడు ఆ పిప్పలాదుడెక్కడ? నీ సౌందర్యం రాజపూజితం. 

నీవంటి సౌందర్యరాశి నాలాంటి రాజులకే తగును గాని, ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే మునిముచ్చులకు కాదు. నువ్వు నాతో రా! స్వర్గసౌఖ్యాలను అనుభవించవచ్చు’ అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు.పద్మకు సహనం నశించింది. ‘ఓరీ పాపాత్ముడా! దూరంగా ఉండు. పరస్త్రీని కామంతో చూసిన నువ్వు తప్పక నశిస్తావు. తపోధనుడైన నా భర్త పిప్పలాడుదెక్కడ? కామాతురుడవై, ఉచితానుచిత జ్ఞానంలేని నువ్వెక్కడ? కాలగతిలో నీకు క్షయం తప్పదు’ అని శపించింది.ఆమె శాపానికి ధర్ముడు గడగడలాడాడు. రాజవేషాన్ని విడిచి, నిజరూపంలో దర్శనమిచ్చాడు. ‘తల్లీ! నేను ధర్మదేవుడిని. గురువులకు గురువును. ఈశ్వర ప్రేరేపితుడనై, ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్తి చేశావు. తల్లీ! నా శాపవిమోచనాన్ని కూడా నువ్వే అనుగ్రహించు’ అని అభ్యర్థించాడు.

పశ్చాత్తాపం చెందిన పద్మ, ‘ధర్ముడా! పతివ్రతా శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ క్షోభిస్తాయి. అందువల్ల నేనొక వ్యవస్థను నిర్ణయిస్తున్నాను. కృతయుగంలో నువ్వు నిండు చంద్రుడిలా పరిపూర్ణంగా ఉంటావు. ఆ తర్వాత త్రేతా, ద్వాపర, కలి యుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షీణిస్తూ ఉంటావు. కలియుగాంతం నాటికి అమావాస్య చంద్రుడిలా పూర్తిగా అదృశ్యమైపోతావు. కలియుగాంతం తర్వాత తిరిగి ఆరోహణ క్రమంలో వచ్చే ద్వాపర, త్రేతా, కృతయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ పరిపూర్ణ స్థితిని పొందుతావు. ఇక నేను నా భర్త దగ్గరకు వెళతాను’ అని పలికింది.అప్పుడు ధర్ముడు ‘ఓ పతివ్రతా శిరోమణీ! నీకు మంగళమగుగాక. నీ భర్త పిప్పలాదుడికి నిత్యయవ్వనం సిద్ధిస్తుంది. అతడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు. నీకు సర్వసౌఖ్యాలు కలుగుతాయి’ అని దీవించి అదృశ్యమయ్యాడు.
∙సాంఖ్యాయన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement