
ఎక్కడ చూసినా అత్యాచారాలు, హింస, ఉగ్రవాదం
పౌరులకు అమెరికా కొత్త అడ్వైజరీ
ఒంటరిగా వెళ్లొద్దంటూ మహిళలకు హెచ్చరిక
వాషింగ్టన్: భారత్లో పర్యటించాలనుకునే తమ పౌరులకు అమెరికా కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవలి కాలంలో అత్యాచారాలు, హింస, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయని, భారత్కు వెళ్లాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. ప్రత్యేకించి మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని హెచ్చరిస్తూ అమెరికా విదేశాంగ శాఖ లెవల్ 2 సలహా జారీ చేసింది.
జూన్ 16న జారీ చేసిన ఈ అడ్వైజరీలో ‘‘భారత్లో మరింత జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రాంతాల్లో నేరాలు, ఉగ్రవాదం పెరిగాయి. అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులతో సహా హింసాత్మక నేరాలు జరుగుతాయి. అలాగే పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు/షాపింగ్ మాల్స్లో ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది’’ అని హెచ్చరించింది.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 2 నెలల తర్వాత అమెరికా ఈ కొత్త అడ్వైజరీ విడుదల చేసింది. ‘‘ఉగ్రవాదం, అశాంతి నెలకొన్న కారణంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో ప్రయాణించవద్దు. తూర్పు లద్దాఖ్, రాజ«దాని లేహ్ తప్ప పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాలకు వెళ్లొద్దు. భారత్–పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి హింస సర్వసాధారణం. భారత్–పాక్ మధ్య సాయుధ ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణించవద్దు’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ఒంటరిగా ప్రయాణించవద్దని హెచ్చరించింది. ఇక ‘‘తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్టు తీవ్రవాద గ్రూపులు చురుకుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పౌరులకు అత్యవసర సేవలను అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి లేదు. ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటే మంచిది’’ అని సూచించింది. భారత్కు వెళ్లాలనుకునేవారు శాటిలైట్ ఫోన్ తీసుకెళ్లొద్దని సలహా ఇచ్చింది.
ఖండించిన కాంగ్రెస్..
భారత్ పట్ల అమెరికా వైఖరిని కాంగ్రెస్ ఖండించింది. ఆ దేశ అడ్వైజరీ షాక్ కలిగించడమే కాదు, ఇబ్బందికి గురి చేసిందని ఎక్స్లో పోస్ట్ చేసింది. యూఎస్ ట్రావెల్ అడ్వైజరీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. భారత్లో మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని సూచించడం.. ప్రధాని నరేంద్రమోదీ ‘సురక్షిత భారత్’ పతనమైనట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేసింది.