కాన్బెర్రా: హిందూ మహాసముద్రంలో గుండెను మెలిపెట్టే దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. తన ఐదో కాన్పులో కూడా పుట్టిన బిడ్డ దక్కకపోవడంతో ‘ఫ్రాగిల్’ (Fraggle) అనే తల్లి డాల్ఫిన్ గుండెలవిసేలా రోదించింది. పిల్ల డాల్ఫిన్ భౌతిక కాయాన్ని వదిలివేయడం ఇష్టం లేక.. ప్రాణం కోల్పోయిన పిల్ల డాల్ఫిన్ నీటిలో మునిగిపోకుండా ఆరు రోజుల పాటు తన వీపు మోసుకుని ప్రయాణించింది.
పశ్చిమ ఆస్ట్రేలియా తీరం వెంబడి డాల్ఫిన్ జనాభాను పర్యవేక్షించే ఆస్ట్రేలియన్ పరిరక్షణ,పరిశోధన సంస్థ జియోగ్రాఫ్ మెరైన్ రీసెర్చ్ హృదయ విదారక దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
జియోగ్రాఫ్ మెరైన్ రీసెర్చ్ ప్రకారం.. తల్లి డాల్ఫిన్ ఫ్రాగిల్ దురదృష్టవశాత్తూ తన ఐదో కాన్పులో కూడా బిడ్డను దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వార్తల్లో వైరల్ అవుతున్న వీడియోలో చనిపోయిన ఆ రెండు వారాల పిల్ల డాల్ఫిన్ ఫ్రాగిల్కు పుట్టిన ఐదో సంతానం. ఈ కాన్పుకు ముందు ఫ్రాగిల్ వరుసగా నాలుగు పిల్లలను కోల్పోయింది. 2026 జూలై చివరి వారంలో జరిగిన ఈ ఐదో కాన్పులోనైనా బిడ్డ బతుకుతుందని ఆశించినా శీతాకాలం వాతావరణం వల్ల అది కూడా శ్వాసకోస సమస్యలతో చనిపోయింది.
తన ఐదో బిడ్డ కూడా చనిపోవడంతో ఆ తల్లి డాల్ఫిన్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆ శవాన్ని సముద్రంలో మునిగిపోనివ్వకుండా తన ముక్కుతో పైకి నెడుతూ దాదాపు ఆరు రోజుల పాటు సముద్ర ఉపరితలంపైనే మోస్తూ తిరిగింది. ఫ్రాగిల్ పడుతున్న బాధను చూసి ఆమె గ్రూప్లోని మిగతా 14 డాల్ఫిన్లు కూడా ఆమెకు తోడుగా నిలిచాయి. అవన్నీ ఫ్రాగిల్ చుట్టూ తిరుగుతూ, ఆమెతో పాటే ప్రయాణిస్తూ ఓదార్పునిచ్చాయి.
డాల్ఫిన్లు చాలా తెలివైనవి, భావోద్వేగాలు ఉన్న జీవులని, అవి కూడా మనుషులలాగే తమ పిల్లల మరణాన్ని తట్టుకోలేక చింతిస్తాయని ఘటన మరోసారి నిరూపించిందని ఆస్ట్రేలియాలోని బన్బరీ నగరానికి ఉత్తరంగా ఉన్న సముద్రంలో డ్రోన్ల ద్వారా హృదయ విదారకర దృశ్యాల్ని రికార్డ్ చేసిన జియోగ్రాఫ్ మెరైన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తెలిపారు.


