స్పోకేన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం స్పోకేన్ (Spokane) ప్రాంతాన్ని కార్చిచ్చు వణికిస్తోంది. వందలాది ఇళ్లు బూడిదవగా, వేలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఈ విపత్తు వెనుక మానవ కుట్రే కారణం ఉండొచ్చన్న అనుమానాలకు బలం చేకూరేలా అధికారులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
స్పోకేన్ ప్రాంతంలో చెలరేగిన భారీ కార్చిచ్చులలో ఒకటైన ఓల్డ్ ట్రైల్స్ ఫైర్ను ఉద్దేశపూర్వకంగా పెట్టినట్లు అనుమానిస్తూ పోలీసులు ఆరోన్ ఫరీనాచ్చి (37) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అధికారులు అతనిపై ఫస్ట్-డిగ్రీ ఆర్సన్ (ఉద్దేశపూర్వకంగా నిప్పంటించడం) కేసు నమోదు చేశారు.
ఈ మంటల కారణంగా సుమారు 700కిపైగా భవనాలు తగలబడ్డాయి. 67 వేల మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. వేల ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. వెయ్యికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.
పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అగ్గిపుల్లలు, లైటర్ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే గతంలో అతనిపై మరో నేరానికి సంబంధించిన కేసు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మిగిలిన రెండు కార్చిచ్చుల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. తీవ్ర ఎండలు, కరువు పరిస్థితులు, బలమైన గాలులు మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.


