
అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.
అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్ 22న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది.
ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు.
(చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!)