యువ కథ: నాన్నతో ఒక రోజు.. | yuva katha magazine stories | Sakshi
Sakshi News home page

యువ కథ: నాన్నతో ఒక రోజు..

Apr 27 2025 7:25 AM | Updated on Apr 27 2025 7:25 AM

yuva katha magazine stories

‘‘నాన్నా ఎలా ఉన్నావు?’’ సుందర్‌ తన బ్యాగుతో గుమ్మంలో అడుగుపెట్టాడు.ఇంట్లో తీరిగ్గా కూర్చుని పేపర్‌ చదువుతున్న సుబ్బారావు ఆ గొంతు విని తలెత్తి చూశాడు. ‘‘అరె సుందరం.. ఇదేనా రావడం?’’ అంటూ పేపర్‌ పక్కన పెట్టి లేచి బ్యాగు అందుకున్నాడు సుబ్బారావు. ‘‘శాంతా.. చూడు సుందరం వచ్చాడు’’ అని లోపలే ఉన్న శాంతకి చెప్పాడు సుబ్బారావు.‘‘నాన్నా సుందరం ఏంటి! సుందర్‌ అని పిలవచ్చు కదా!’’ సుందర్‌ చిన్నగా చిరాకు పడ్డాడు. ‘‘హహ! అలాగేరా.. సుందరం మా నాన్నగారి పేరు. అందుకే పిలిచినప్పుడల్లా నాన్నని పిలుస్తున్నట్టు అనిపిస్తుందిరా..’’ నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు. 

‘‘అలాగేలే.. అలానే పిలువు నాన్నా నాకేం సమస్య లేదు!’’ అన్నాడు సుందర్‌.‘‘వస్తున్నానని కనీసం ఫోన్‌ కూడా చేయలేదు!’’ వంటగదిలోంచి వస్తూ అడిగింది శాంత. ‘‘అదేం లేదమ్మా, పాలకొల్లులో మన సురేష్‌గాడి పెళ్లి నిన్న. వచ్చేదాకా అస్సలు వదల్లేదు. అందుకే హుటాహుటిన రెండు రోజులు సెలవు పెట్టి హైదరాబాద్‌ నుంచి వచ్చేశాను!’’ అని చెబుతూ లోపలికి వెళ్ళి నీరసంగా కూర్చున్నాడు సుందర్‌.‘‘శాంతా వాడు బాగా అలిసిపోయినట్లు ఉన్నాడు. తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. నేనిప్పుడే అలా బయటికి వెళ్లి వస్తాను..’’ అంటూ గొడుగు తీసుకుని వర్షంలో బయలుదేరాడు సుబ్బారావు.సుందర్‌ హైదరాబాద్‌ లోని ‘ఇన్ఫినిటీ’ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పాలకొల్లు వదిలి వెళ్లి ఇప్పటికి ఏడేళ్ళు అయ్యింది. పండగలకో, పబ్బాలకో ఏ సంవత్సరానికో ఒకసారి వచ్చి నాలుగు రోజులు కూడా గడపకుండా హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు.

‘‘ఏం బాబూ ఆ పులస ఎంతకిస్తావ్‌?’’ అంటూ వర్షంలో ఆ ఊరి చెరువు దగ్గర చేపలు పడుతున్న మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి బేరం ఆడుతున్నాడు సుబ్బారావు.‘‘ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళండి.. మీ దగ్గర డబ్బులు ఎటు పోతాయి!’’ అంటూ మంచి పులస చేపని సంచిలో వేసి ఇచ్చాడు వీరయ్య. వీరయ్య అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఇచ్చి పట్టుకొని ఇంటికి వచ్చేశాడు సుబ్బారావు.
వర్షం ఓ మాదిరిగా చిన్నగా కురుస్తోంది. పట్టుకొచ్చిన చేపని శాంతకి ఇచ్చి, ‘‘ఇది వాడికి చాలా ఇష్టం మంచిగా పులుసు చెయ్‌ వాడికి మళ్ళీ అక్కడ దొరకదు’’ అని చెప్పి బయట వరండాలోకి వెళ్లి కూర్చున్నాడు.ఇంటికి వచ్చినా సుందర్‌కి తీరిక లేదు. కంపెనీ నుంచి ఏవేవో ఫోన్‌ కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇంక లాభం లేదని ఫోన్‌ పక్కన పడేసి, గదిలోంచి బయటికి వచ్చాడు సుందర్‌. ‘‘అమ్మా! నాన్నెక్కడ? సాయంత్రం నుంచి కనబడలేదు’’ అని శాంతని అడిగాడు. 

‘‘బయట వరండాలో ఉన్నాడేమో చూడు..’’ అంటూ చేపల పులుసు పెడుతూ చెప్పింది శాంత.వరండాలో తీరిగ్గా పడక్కుర్చీలో కాళ్ళు చాపి పాత పుస్తకమేదో చదువుతూ కూర్చున్నాడు సుబ్బారావు. ఆ పడక్కుర్చీ చూడగానే ఎన్నో జ్ఞాపకాలు, మధురానుభూతులు గుర్తొచ్చాయి సుందర్‌కి. ‘‘నాన్నా’’ అంటూసుబ్బారావు దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. సుబ్బారావు వెంటనే చేతిలో ఉన్న పుస్తకం మూసి కళ్ళజోడు తీస్తూ ‘‘కూర్చోరా’’ అని ప్రేమగా అన్నాడు.ఆ పుస్తకం తీసుకుని ‘‘ఎన్ని రోజులైంది నాన్నా ఈ పుస్తకం చూసి.. చిన్నప్పుడు బాగా చదివేవాణ్ణి. ‘బారిస్టర్‌ పార్వతీశం’ నిజంగానే ఉన్నాడేమో అనేంతలా కలలు కనేవాడిని!’’ అంటూ ఆప్యాయంగా పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చెప్పాడు సుందర్‌.‘‘ఈ కుర్చీకి, నాకు విడదీయలేని సంబంధం ఉంది. 

చిన్నప్పుడు ఇక్కడే రాత్రి అమ్మ అన్నం తినిపించాక, తాతయ్య ఈ కుర్చీలో కూర్చొని ఆ ఆకాశాన్ని, నిండు జాబిలిని చూపిస్తూ మంచి మంచి కథలు, చెప్పేవాడు. నేను, కౌసల్య, శీనుగాడు గాల్లో తేలిపోతున్నట్టుగా వినేవాళ్ళం. అప్పుడే చాలా బావుండేది నాన్నా.. పెరిగే కొద్దీ జీవితం ఇంకా భారంగా, బాధగా ఉంది.’’ అంటూ బాధగా చెప్పాడు సుందర్‌.ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందుకి వచ్చాయి సుబ్బారావుకి. ఇరవై ఏళ్ల ముందు జీవితం చాలా బావుండేది. సుబ్బారావు అదే ఊళ్ళో పోస్ట్‌మన్‌గా చేసేవాడు. అప్పట్లో ఉత్తరాలు, మనీ ఆర్డర్లు బాగానే వచ్చేవి. పని కూడా చాలా ఎక్కువే ఉండేది. కాలం గడిచేకొద్దీ కొద్దిరోజుల్లోనే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సెల్‌ ఫోన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు అన్నీ వచ్చేశాయి. 

ఈ–మెయిల్‌ వంటివి వచ్చాక పరిస్థితి మారిపోయింది. గవర్నమెంట్‌ లెటర్స్‌ తప్ప అసలు ఇంకే ఉత్తరాలు రావడం లేదు. ఒకప్పుడు సంచి నిండా ఉత్తరాలు ఉండేవి. ఊరంతా తన పాత సైకిల్‌పై తిరిగి సాయంత్రంలోగా అన్నీ చేర్చేవాడు. ఉత్తరం తీసుకున్నవారి మొహంలో ఆనందం, ఉల్లాసం మనసుకి ఎంతో తృప్తినిచ్చేది. అలా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు అన్నీ ఆగిపోయాయి. ఉద్యోగం ఉంది గాని, చేయడానికి పనేలేదు. రోజంతా ఆఫీసులోనే ఖాళీగా ఉండేవాడు సుబ్బారావు. జాలేసింది, చాలా బాధేసింది. కొద్దిరోజుల్లోనే పోస్ట్‌మన్‌ ఉద్యోగానికి ఇంకా మూడేళ్లు టైమ్‌ ఉన్న వెంటనే రిటైర్మెంట్‌ తీసుకున్నాడు సుబ్బారావు.‘‘నిజంగా ఆ రోజులే చాలా బావుండేవిరా..’’ అంటూ గోడకు తగిలించిన పాత ఉత్తరాల సంచి వైపు చూసి కంటతడి పెట్టుకున్నాడు సుబ్బారావు. 

‘‘అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఇరవైమందితో ఇల్లు కళకళలాడేది. వాళ్ళు చనిపోగానే ఎవరికి వాళ్ళు గొడవలతో, ఆస్తుల విభజనలో, మనస్పర్థలతో చివరికి ఇప్పుడు మీరిద్దరూ అంతే! ఊర్లో మనదే పాత మండువా ఇల్లు నాన్నా.. ఇది ఇలానే ఉండాలి ఎన్ని సంవత్సరాలైనా..’’ అంటూ బాల్య జ్ఞాపకాల్ని తలచుకున్నాడు సుందర్‌.‘‘అసలు ఇప్పుడు పోస్ట్‌మన్‌ గురించి కనీసం పుస్తకాల్లో అయిన చెబుతున్నారా.. కనీసం మేము అనేవాళ్ళం ఉండేవాళ్ళం అని కూడా తెలియనంతగా అభివృద్ధి చెందింది ప్రపంచం!’’ అంటూ కళ్ళజోడు తీసి కళ్లు తుడుచుకున్నాడు సుబ్బారావు. ‘‘నిజమే నాన్నా! అసలు ఆగకుండా పరుగెడుతూనే ఉంది ప్రపంచం. మన కోసమో, మన ఆనందం కోసమో కూడా ఆగకుండా పరుగులు తీస్తోంది.’’ అన్నాడు సుందర్‌.

వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా పక్కనే ఉండి వింటూ తను కూడా ఆ పాత రోజులను తలచుకొని బాధపడింది శాంత. ‘భోజనానికి లేవండి’ అని పిలిచింది. ఆమె పిలుపుతో జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి తండ్రీ కొడుకులిద్దరూ భోజనానికి కూర్చున్నారు.ఆ రాత్రి టీవీకి, ఫోన్‌లకి దూరంగా ఉండి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ముగ్గురూ భోంచేశారు. ‘అదేంటో ఊరికి వచ్చిన తరువాత మన సొంత ఇంట్లో, సొంత గదిలో పట్టినంత నిద్ర ఆ అద్దెకొంపల్లో, నగరపు వాతావరణంలో అస్సలు పట్టదు. పల్లెటూర్లో పుట్టడం కూడా ఒక అదృష్టమే!’ అనుకుంటూ ఆ రాత్రి ఉన్న బాధలన్నీ మర్చిపోయి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు సుందర్‌.తెల్లవారుజామునే అలారం పెట్టే శబ్దాలతో కాకుండా కోడి కూతతో నిద్రలేచి, సిటీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుందర్‌. అమ్మానాన్నలను మనసారా హత్తుకొని బయటికి నడిచాడు.

తెలీకుండానే సంవత్సరం గడిచిపోయింది. సుందరం ఇంటికి వచ్చి కూడా ఏడాది అయింది. ఒక సాయంత్రం వేళ సుబ్బారావు, శాంత ఇద్దరూ నిశ్శబ్దంగా వరండాలో కూర్చున్నారు. సుబ్బారావు ఆ పాత సైకిల్‌ని చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు.‘‘అదేంటండీ అలా చూస్తున్నారు?’’ శాంత అడిగింది.‘‘ఏం లేదు శాంతా.. ఈ సైకిల్‌తో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఊరంతా తిరుగుతూ ఉత్తరాలు పంచేవాణ్ణి. ఆ రోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు ఎంత గాఢంగా ఉండేవో కదా! ఇప్పుడు అంతా యాంత్రికమైపోయింది’’ సుబ్బారావు నిట్టూర్చాడు.‘‘అవునండీ.. రోజులు మారిపోయాయి. మనుషులూ మారిపోయారు. మన సుందర్‌ కూడా ఎంత మారిపోయాడో!’’ శాంత బాధగా అంది.‘‘అవును శాంతా.. డబ్బు సంపాదించాలనే తపనలో మనుషులు తమ మూలాల్ని, బంధాల్ని
మరచిపోతున్నారు. కాని, సుందర్‌కి తన తప్పు తెలిసొచ్చింది. మళ్ళీ మన దగ్గరకు వస్తాడనే నమ్మకం నాకుంది’’ సుబ్బారావు ఆశగా అన్నాడు.

‘‘మీ నోట బంగారం అండీ’’ శాంత కళ్ళల్లో ఆనందం మెరిసింది.సాయంత్రం ఆరు అయింది. సుబ్బారావు, శాంత ఇద్దరూ వరండాలో కూర్చున్నారు.అప్పుడే సుందర్‌ కారు ఇంటి ముందు ఆగింది. సుబ్బారావు, శాంత ఆశ్చర్యంగా చూస్తుండగానే సుందర్‌ కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు.‘‘నాన్నా.. అమ్మా.. నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇకపై మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను. మీతోనే ఉంటాను’’ సుందర్‌ కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.సుబ్బారావు, శాంత ఆనందంతో సుందర్‌ని హత్తుకున్నారు. ఆ క్షణం వాళ్ళ ముగ్గురి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి వాళ్ళు ముగ్గురూ కలిసి పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు.మర్నాడు ఉదయం సుందర్‌ తన సామాన్లు సర్దుకుని తల్లిదండ్రులతో కలిసి పాలకొల్లులోనే ఉండిపోయాడు. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాడు. ఆ పాత మండువా ఇల్లు మళ్ళీ కళకళలాడింది.         
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement