ఇసుకను చూసి ఉప్పందిస్తారు! | Storie Of Sherlock Holmes in Gujarati | Sakshi
Sakshi News home page

ఇసుకను చూసి ఉప్పందిస్తారు!

Jun 22 2025 7:57 AM | Updated on Jun 22 2025 7:57 AM

Storie Of Sherlock Holmes in Gujarati

డిటెక్టివ్‌ ‘షెర్లాక్‌ హోమ్స్‌’ పేరు మీరు వినే ఉంటారు.  బ్రిటిష్‌ రచయిత సర్‌ ఆర్థర్‌ కానన్‌ డోయల్‌ సృష్టించిన పాత్ర అతడు. నేర పరిశోధనలో అతడిది డేగ దృష్టి! రాలిన వెంట్రుకలు, నేలపై పడి ఉన్న సిగరెట్‌ పీకలు, ఆఖరికి ఆ... నుసి నుంచి కూడా అతడు నేరస్థుడి జాడల్ని, నీడల్ని కనిపెట్టగలడు. ఆ డిటెక్టివ్‌ హెర్లాక్‌ హోమ్స్‌ని మించిన వారే... ‘పాగీ’లు! గుజరాత్‌లో, మూడు ఎడారి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తుండే ఈ పాగీలు... ఇసుకలో పాదముద్రలను బట్టి చొరబాటు దారుల వివరాలను చెప్పటంలో సిద్ధహస్తులు. మొన్నటి ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో కూడా పాగీలు భారత సైన్యానికి సహాయపడ్డారు.

అలా చెప్పేస్తారంతే! 
సరిహద్దుల్లో శత్రువు కదలికల్ని పసిగట్టేందుకు భారత్‌ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. హైటెక్‌ గాడ్జెట్స్‌ ఉన్నాయి. సైనికులు నిరంతరం మూడంచెలుగా గస్తీ కాస్తుంటారు. చీమ చిటుక్కున్నా మన తుపాకులు మేల్కొనే శాటిలైట్‌ వ్యవస్థ ఉంది. ఇవేమీ అవసరం లేకుండానే ‘పాగీ’లు తమ సహజ పరిశీలనా శక్తితో ఎడారిలో ఇసుక ముద్రల్ని డీకోడ్‌ చేసి సైన్యానికి ఉప్పందించగలరు. పాగీల దగ్గర వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వస్తున్న ప్రాచీన అపరాధ పరిశోధనా నైపుణ్యం తప్ప, సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. అయినా, ఇసుకపై ముద్రల్ని బట్టి అటువైపు ఎవరు నడిచారు, ఎంతమంది నడిచారు అన్నది విశ్లేషించి చెప్పేయగలరు. కాలం చెల్లినట్లుగా కనిపించే ఈ పాగీలు ఒక విధంగా ఇంటెలిజెన్స్‌ సిబ్బందికి దీటైనవారు.

పేగుల్ని లెక్కపెట్టే వేగులు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చి చూస్తే పాగీలు ఆదిమానవుల కింద లెక్క. కానీ ఈ మానవ ‘ట్రాకింగ్‌ వ్యవస్థలు’ ఎడారి చొరబాట్ల వివరాల విశ్లేషణల్లో అత్యంత విశ్వసనీయమైనవి. ఉదాహరణకు : సరిహద్దును ఎవరు దాటారు అన్నదొక్కటే కాకుండా, ఎంత మంది దాటారు? వారు ఏమి మోసుకెళ్లారు? వారి లక్ష్యం ఏమిటి? అన్నవి కూడా పాగీలు అంచనా వేయగలరు. మాదకద్రవ్యాల స్మగ్లర్ల కదలికలను కనిపెట్టటం దగ్గర్నుండి, పూర్తిస్థాయి యుద్ధాల సమయంలో సైనికులకు అత్యవసర సమాచారం అందించటం వరకు ఈ సరిహద్దు సంరక్షకులు దేశం ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. 1965, 1971లో పాకిస్తా¯Œ తో జరిగిన యుద్ధాలలో భారత సైన్యం శత్రు భూభాగాలలో చొచ్చుకు వెళ్లటానికి, శత్రువుల కదలికలను గుర్తించడానికి పాగీల నుండి కీలకమైన సహాయం తీసుకుంది. తరచు యుద్ధాల గమనాన్ని నిర్ణయించటంలో కూడా పాగీల భాగస్వామ్యం ఉంటుంది. 

మెడలిస్టులు కూడా ఉన్నారు
బనస్కాంత, కచ్, పటాన్‌ జిల్లాల్లో ఉండే పాగీలు ఇటీవలి భారత్‌–పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి మళ్లీ కీలకం అయ్యారు. పారంపర్య జ్ఞానమే తప్ప, ఎలాంటి శిక్షణా ఉండని పాగీలు సాధారణ నేత్రాలకు కనిపించని ప్రమాద సూచనలను గుర్తించటంలో అత్యద్భుతమైన ప్రావీణ్యం గలవారు. బనస్కాంత జిల్లాలోని సుయిగామ్‌ తాలూకా, జలోయా గ్రామానికి చెందిన రేవాజీ రాథోడ్‌ ఇందుకొక నిదర్శనం. 1927లో జన్మించిన ఆయన 1962 ఆగస్టు 4న పాగీగా పోలీసు దళంలో చేరారు. సుయిగామ్, వావ్, ధనేరా సరిహద్దు ప్రాంతాల వెంబడి 28 ఏళ్లపాటు, రెండు యుద్ధాల సమయంలో భారత దళాలకు భూభాగాలపై మార్గ నిర్దేశం చేశారు. ఆ నైపుణ్యాలు ఆయనకు ‘సంగ్రామ్‌ మెడల్‌’ ‘వెస్ట్రన్‌ స్టార్‌’ పురస్కారాలతో సహా కీర్తి ప్రతిష్ఠల్ని, గుర్తింపును సంపాదించి పెట్టాయి.  

రంగంలోకి దూకేందుకు సిద్ధం
గుజరాత్‌ సరిహద్దులో కొన్ని చోట్ల కంచె లేకపోయినప్పటికీ ఆ ప్రాంతాలు సురక్షితంగా ఉండటానికి ఒక కారణం.. పాగీల నిరంతర నిఘా. వారు కేవలం పాదముద్రలను గుర్తించడమే కాదు, వాటిని అర్థం చేసుకుంటారు కూడా. శత్రువు ఎలాంటి బూట్లు వేసుకున్నాడు, ఏ మార్కెట్లలో ఆ బూట్లు అమ్ముడవుతాయి, అలాగే – ఎంత బరువుతో వారి నడక సాగింది, ఆ వెళ్లినవారు స్త్రీలా, పురుషులా అనేది కూడా పాగీలు కనిపెడతారు. అవసరం అయిన వెంటనే భద్రతా దళాలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న 5–10 మంది శిక్షణ పొందిన పాగీలు, వారికి సహాయంగా ఉండే 20 మంది యువకుల బృందం ప్రస్తుతం సైన్యానికి అందుబాటులో ఉంది. 

ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు
కొంతమంది పాగీలను అధికారికంగా సైన్యంలోకి తీసుకున్నప్పటికీ, వారి సంఖ్య తక్కువగానే ఉంది. ‘‘వారు ట్రాకర్‌లు మాత్రమే కాదు, అపరాధ పరిశోధకులు కూడా..’’ అని గుజరాత్‌ పోలీసు సరిహద్దు పరిధి ఐజీపీ చిరాగ్‌ కొరాడియా అంటారు. ‘‘పాదముద్రలను బట్టి వారు ఒక వ్యక్తిని గుర్తించగలరు. వారిలో ఎవరైనా బరువులు మోస్తున్నారా, వారి వద్ద జంతువులు ఉన్నాయా అని కూడా తెలుసుకోగలరు. ఇంకా అనేక ఇతర వివరాలను అందించగలరు. 2013 హోమ్‌ శాఖ మార్గదర్శకాలను అనుసరించి 2014లో క్లాస్‌ 4 పే గ్రేడ్‌లో 25 మంది పాగీలను శాశ్వతంగా నియమించుకున్నాం’’ అని కొరాడియా తెలిపారు. 

యూనిఫాం ఉండని సైనికులు
పాగీలు కేవలం చారిత్రక యోధులు కారు. వారి అవసరం నేటికీ కొనసాగుతోంది. కచ్‌కు చెందిన 70 ఏళ్ల పాగీ తేజ్‌మల్‌జీ సోధా 2001 – 2017 మధ్య సైన్యానికి సహాయంగా పనిచేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణానే కాక, అనేకానేక చొరబాట్లను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు. ‘‘వారు ఎంత దూరం వెళ్లినా, నేను కచ్చితంగా ట్రాక్‌ చేయగలను..’’ అని ఆయన అంటారు. పాగీలు ఇప్పుడు తమకు గుర్తింపును, తగిన పరిహారాన్ని, తర్వాతి తరానికి శాశ్వతకాల ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘మేము యూనిఫాం ధరించం. అయినప్పటికీ మాతృభూమిని కాపాడతాం’’ అని అంటున్నారు.  
∙సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఫీల్డ్‌ మార్షల్‌ జనరల్‌ శామ్‌ మానెక్‌షా
పాగీలలో అత్యంత పురాతన వ్యక్తులలో దివంగత రణ్‌ ఛోడ్‌ పాగి ఒకరు. ఆయన అసలు పేరు రణ్‌ ఛోడ్‌ రబారి. తన 100వ యేట వరకు ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. యుద్ధాల సమయంలో భారత దళాలకు సహాయంగా ఉన్నారు. జనరల్‌ శామ్‌ మా¯ð క్‌షా స్వయంగా రణ్‌ ఛోడ్‌ సేవల్ని గుర్తించి 1971లో రూ. 300 వ్యక్తిగత నగదు బహుమతిని కూడా అందజేశారు. రణ్‌ ఛోడ్‌ పాగి 2013లో తన 112 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత బి.ఎస్‌.ఎఫ్‌. ఆయన గౌరవార్థం బనస్కాంత ఔట్‌పోస్టులలో ఒకదానికి ఆయన పేరు పెట్టింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement