అక్షర భ్రమణం | writer rashmi rekha lifestyle | Sakshi
Sakshi News home page

అక్షర భ్రమణం

Jun 15 2025 8:58 AM | Updated on Jun 15 2025 8:58 AM

writer rashmi rekha lifestyle

రశ్మిరేఖ రచయిత్రి. ఇప్పటికి వరకు నాలుగు నవలు రాశారు. మొదటిది 2013లో. నాల్గవది 2023లో. అస్సామీ భాషలో ఉండే ఆ పుస్తకాలలో ఏముందో, ఆ పుస్తకాల టైటిల్స్‌కు అర్థం ఏమిటో అస్సామీని చదవటం రాని వారికి తెలియకపోవచ్చు. కానీ, రశ్మిరేఖ జీవితం గురించి తెలుసుకుంటే మాత్రం ఆ పుస్తకాల్లో ఆమె ఏం రాసి ఉంటారో కొంతైనా ఊహించవచ్చు.

రశ్మి వయసు 39. రోజంతా వీల్‌ చెయిరే ఆమెను తిప్పుతూ ఉంటుంది. ఉత్తర అస్సాంలోని సూటీ ప్రాంతంలో తను పాఠాలు చెబుతుండే ఖానగురి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు తిప్పుతుంటుంది, అస్సాంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట జరుగుతుండే సాహితీ సభలూ సమావేశాలకూ తిప్పుతుంటుంది. 

చిన్నప్పుడే చెప్పేశారు!
రశ్మి ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ’ (ఎస్‌.ఎం.ఎ.) పేషెంట్‌. అందుకే వీల్‌ చెయిర్‌ ఆమె శరీరంలో ఒక భాగం అయిపోయింది. చిన్నప్పుడే ఆమె గురించి వైద్యులు ఆమె తల్లిదండ్రులకు చెప్పేశారు... మీ అమ్మాయికి పెద్దయ్యాక ఎస్‌.ఎం.ఎ. వస్తుందని, అందుకు ఆమెను మానసికంగా సిద్ధం చేయమనీ! ఆ ఎరుకతో రశ్మి తన జీవితంలో పూర్తి ‘పాజిటివిటీ’ని అలవాటు చేసుకుంది. ‘అంతా మన మంచికే’ అనే ధోరణి అది. 

టీచర్లు ప్రోత్సహించారు
ఖానగురికి కాస్త దగ్గర్లో ఉండే రశ్మి ఇల్లు, ఇంటి పరిసరాలు ఆమె చిన్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉండేవి. 
అందమైన భావాలు రశ్మిలో అక్కడ పూతలు వేసేవి. ఆమె ఆలోచనల్లోని మార్దవాన్ని, సృజనశీలతను ఆమె తల్లిదండ్రులతో పాటు, టీచర్లూ గమనించి ఆమెను రచన వైపు ప్రోత్సహించారు. ఆ తర్వాత నెమ్మదిగా అస్సామీ దినపత్రికల్లో, వార పత్రికల్లో, మేగజీన్స్‌ లలో ఆమె వ్యాసాలు రావటం మొదలైంది. చివరికి అవి ఆమెను నవలా రచనకు ప్రేరేపించాయి. ఆమె రాసిన ‘మేఘే ధోక అకక్సార్‌ జూన్స్‌ ’, ‘జీబన్స్‌  మీనార్‌ సుర్‌’, ‘గిగోలో’, ‘మటి ఈశ్వర్‌’ అనే నవలలు అస్సాంలో ఆమెను ప్రముఖ రచయిత్రిని చేశాయి. 

పుస్తకాలు స్ఫూర్తినిచ్చాయి
ఇంటి వాతావరణంతో పాటు, 750 వరకు పుస్తకాలు రాసిన 72 ఏళ్ల అస్సామీ రచయిత రంజూ హజారికా కూడా రశ్మికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన పుస్తకాలను, 88వ యేట 2021లో కన్నుమూసిన అస్సామీ రచయిత హోమెన్స్‌  బోర్గోహెయిన్స్‌  రచనల్ని కూడా రశ్మి ఇష్టంగా చదివేవారు. హోమెన్స్‌ ను ఆమె పెదనాన్న అని పిలిచేవారు. ఆమెను ఆత్మకథ రాయమని ప్రోత్సహించింది ఆయనే. ‘‘మమోని బైద్యు (ఇందిరా గోస్వామి) పుస్తకాలు కూడా నాలో రాసే ధైర్యాన్ని నింపాయి’’ అంటారు రశ్మి. హోమెన్, బైద్యు 2011లో చనిపోయినప్పుడు ఆ విషాదం నుంచి త్వరగా తేరుకోలేకపోయారు రశ్మి. 

రాష్ట్రం మొత్తం మీద నలుగురే!
రశ్మి గువాహటి యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ ్సలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్స్‌  చేశారు. ఆ సమయంలోనే బైద్యు, హోమెన్, రంజూ హజారికా పుస్తకాలను ఎక్కువగా చదివారు. తర్వాత టీచర్‌గా ఉద్యోగం. ఆ తర్వాత 2020లో రశ్మి పెళ్లి. ఇప్పుడు ఎనిమిది నెలల కూతురు. ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ’ ఉండి, తల్లి అయిన తొలి అస్సామీ మహిళ రశ్మి. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ‘డిఫరెంట్లీ ఏబుల్డ్‌’ వ్యక్తులు నలుగురు మాత్రమే ఉన్నారు. తక్కిన ముగ్గురిలో ఒకరు రశ్మి చెల్లెలు ఛాయానిక. ఇంత పెద్ద కష్టంలోనూ మామూలు జీవితాన్ని గడుపుతున్నారు ఈ అక్కచెల్లెళ్లు. 

‘‘ఆ మాటే నాకు నచ్చదు’’
అయితే ఈ మాటే అనొద్దంటారు రశ్మి! ‘‘మామూలు జీవితం అంటే ఏంటి? వీల్‌ చెయిర్‌లో ఉంటే మాత్రం మామూలు జీవితం కాకుండా పోతుందా? ‘డిఫరెంట్‌లీ ఏబుల్డ్‌’ అనే మాటైతే నాకు అస్సలు నచ్చదు. వికలాంగుల్ని వికలాంగులు అనకుండా ఆ సొగసైన భాష ఏమిటి.. కృత్రిమంగా!’’ అంటారు రశ్మిరేఖ. ‘‘ఎవరైనా సరే సానుభూతి చూపకూడదు. సానుభూతి కోరుకోకూడదు’’ అన్నది ఆమె భావన. ఆమె అభ్యర్థన. 
∙సాక్షి, స్పెషల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement